Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

వయస్సు

$
0
0

‘వయస్సు అనేది ఒక సంఖ్య మాత్రమే. మనస్సుకి వయస్సు లేదు’ ఈ మాట అన్నది భారతీయ అమెరికన్ భక్తవార్‌సింగ్ బ్రార్. అతని వయస్సు 105 సంవత్సరాలు. ఇటీవలె అతను తన జన్మదిన సంరంభం జరుపుకున్నాడు. ఆయన జరుపుకోలేదు. ఆయన వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తున్న ఉద్యోగులు ఆయన జన్మదిన ఉత్సవాన్ని జరిపారు.
భక్తవార్ సింగ్ బ్రార్ గతంలో ఇండియన్ ఆర్మీలో సైనికునిగా పని చేశాడు. పదవీ విరమణ చేసిన తరువాత అతను పెన్షన్ కోసం ఆశించలేదు. తాను పని చేస్తాను. సంపాదిస్తాను. బతుకుతాను అని అన్న వ్యక్తి. బ్రార్ కుమారుడు అమెరికాలోని కాలిఫోర్నియా నివాసి. అక్కడ ఆయనకు 18000 ఎకరాల వ్యవసాయ క్షేత్రం వుంది. 1980వ సంవత్సరంలో తన 68వ ఏట అమెరికాకు వెళ్లాడు బ్రార్. అప్పటి నుంచి కొడుకు వ్యవసాయ క్షేత్రంలో రైతుగా పని చేస్తున్నాడు. అతని వ్యవసాయ క్షేత్రాన్ని పర్యవేక్షిస్తున్నాడు. కొడుకు వ్యవసాయ క్షేత్రాన్ని అతను 2006 నుంచి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నాడు.
క్రియాశీలకంగా పని చేయడమే జీవితమే, జీవితమే క్రియాశీలకమని అంటాడు బ్రార్. బ్రార్ ఇంకా ఇలా అంటాడు ‘ఎవరైతే కాలాన్ని వృథా చేస్తారో వాళ్లు వాళ్లను కోల్పోతారు.’
బ్రార్ జన్మదినాన్ని ఓ ఉత్సాహవంతంగా అతని దగ్గర పనిచేసే ఉద్యోగులు జరిపారు. బ్రార్ మాటలు ఆశాజనకంగా, రిటైర్‌మెంట్ అనేది జీవితంలో వుండదన్న అభిప్రాయం ఆయన జీవితాన్ని పరిశీలించిన వ్యక్తుల్లో బలపడుతుంది.
‘ఏ వ్యక్తి జీవితంలో నిరుపయోగంగా పరిణమించడు. కాకపోతే అతని నిర్వహణలో వయస్సురీత్యా హెచ్చుతగ్గులు వుండవచ్చు. ఎవరైనా తమ దేశం కోసం ఎంతో కొంత మంచి చేయడానికి అవకాశం వుంటుంది. ఇలాంటి విషయాలు ఎన్నో బ్రార్ చెబుతాడు.
బ్రార్ సెలవు తీసుకోడు. తన జన్మదినం నాడు కూడా సెలవు తీసుకోలేదు. అంతేకాదు. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు ఆఫీసుకి వచ్చి పని చేస్తాడు.
105 సంవత్సరాల వయస్సులో కూడా అతని జ్ఞాపకశక్తి బాగా వుంది. ఆరోగ్యంగా వున్నాడు. వీటన్నింటికి కారణం అతను పని చేయడమే. వయస్సుని మరచిపోవడమే. ఆరోగ్యం సహకరించినంత కాలం పని చేస్తూ వుండాలి.
యువకులతో పోటీ పడాలి.
వయస్సుతో పోటీ పడాలి.


శ్రీరాముడి పరాక్రమం వర్ణించి రావణుడికి చెప్పిన అకంపనుడు( అరణ్యకాండ)

$
0
0

జనస్థానం నుండి అకంపనుడనే రాక్షసుడు, రావణుడి వేగులవాడు, శీఘ్రంగా బయల్దేరి లంకకు పోయి, లంకాసురుడైన రావణాసురుడితో ఇలా అన్నాడు. ‘రాజా! జనస్థానంలో వున్న ఖరుడుతో సహా రాక్షసులందరూ యుద్ధంలో చంపబడాడరు. నేనెలాగో స్ర్తి వేషం వేసుకుని అతి కష్టం మీద ప్రాణాలను దక్కించుకుని ఈ వృత్తాంతాన్ని నీకు చెప్పడానికి వచ్చాను’. ఈ మాటలు విన్న రావణుడు అదిరిపడి, కళ్లల్లో నిప్పులు కురుస్తుంటే, ‘ఓరీ! నాకు మనోహరమైన జనస్థానాన్ని నాశనం చేసింది ఎవడురా? వాడీ లోకంలో ఇంక బతుకుతాడా? దిక్పాలురైన ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు కూడా నాకు ఏ కొంచెం అపకారం చేసినా సుఖంగా వుండలేరు. దండం ధరించి యముడు వచ్చినా దండిస్తాను. దహనుడిని దహిస్తాను. మృత్యువుకు నేనే మృత్యువునవుతాను. సూర్యచంద్రులను నేలబట్టి కాలరాస్తాను’ అని అంటాడు.
రావణుడిలా పలకగా అకంపనుడు చెడు వార్త చెప్తే తననేమి చేస్తాడో అన్న భయంతో చెప్పకపోతే ఇంకేం చేస్తాడోనని విధి లేకుండా ఇలా అన్నాడు. ‘ప్రభూ! నాకేం భయం లేదని, ననే్నం చేయనని అభయమిస్తే ఉన్నదున్నట్లు చెప్తాను’. తాను అభయమిస్తున్నానని, సందేహం లేకుండా వాస్తవం చెప్పమనీ, రావణుడు అనగానే రెండు చేతులు జోడించి భయభక్తులతో అకంపనుడు ఇలా అన్నాడు.
‘గౌరవించాల్సిన గుండ్రటి చేతులు కలవాడు, సమానం లేని బలం కలవాడు, ఆబోతు మూపురాలలాగా ఎతె్తైన మూపురాలున్నవాడు, చంద్రబింబం లాంటి ముఖం కలవాడు, దశరథ మహారాజు కుమారుడు, మంచి కీర్తికలవాడు, బాణాలనే జ్వాలలున్న అగ్నిహోత్రుడు, పరాజయం తెలియని పరాక్రమవంతుడు, ఒక్కడే, ఖర దూషణులతో సహా జనస్థానాన్ని సర్వనాశనం చేశాడు.’ ఇలా అకంపనుడు చెప్పగా విన్న రావణాసురుడు పెద్ద పాములాగా శ్వాస విడుస్తూ, ‘ఓరీ! నిజం చెప్పు. రామచంద్రుడు యుద్ధానికి ఇంద్రాదులను తోడు తెచ్చుకున్నాడా? నువ్వు చెప్తున్న విషయం వింటుంటే ఇది ఒంటరిగా చేసే పని కాదని అనిపిస్తున్నది. వివరాలు చెప్పు’ అని అడిగాడు.
రావణుడు చెప్పమని అడగ్గానే, అకంపనుడు రామచంద్రమూర్తి తేజస్సు, బలం, పరాక్రమం తదితర అంశాలను వున్నదున్నట్లు చెప్పాడిలా. ‘రాముడనే పేరుకలవాడు విల్లు, ఆయుధాలు ధరించే వారిలో చాలా గొప్పవాడు. అనేక దివ్యాస్త్రాలు, సుగుణ సంపత్తి కలవాడు. యుద్ధంలో ఇంద్రుడితో సమానుడు. దేవతలా పరాక్రమం లాంటి పరాక్రమం కలవాడు. ఆ రాముడికి ఒక తమ్ముడున్నాడు. వాడు శక్తిలో అన్నకు సమానుడు. ఎర్ర తామరలాంటి కళ్లున్నవాడు. ఆయన పేరు లక్ష్మణుడు. కమలాల లాంటి ముఖం కలవాడు. ఎప్పుడూ అన్నకు, అగ్నికి వాయువులాగా, తోడుంటాడు. అయినా ఈ యుద్ధంలో ఆయన లేడు. ఒక్క రాముడి వల్లే దండకలో మన ఉనికి పట్టు పాడైంది. నువ్వు సందేహించినట్లు రాముడికి దేవతలు సహాయం చేయలేదు. ఇంద్రుడు రాలేదు. రామచంద్రమూర్తి ఒక్కడే పదునైన బాణాలను ఆయుధాలుగా చేసుకుని రాక్షస సమూహాన్నంతా వధించాడు. ఆ బాణాలను ఆయన ప్రయోగించాడని అనలేం. బంగారు పిడుగులు కల ఆ బాణాలు తమంతట తామే అల్లెతాటి నుండి బయల్దేరి ఐదు తలల పాములై యుద్ధంలో రాక్షసులందరినీ మింగాయి. ఏయే విధంగా, ఏయే మార్గాలలో రాక్షసులు భయపడి పారిపోతారో, ఆయా మార్గాల్లో శత్రువులందరికీ రామచంద్రుడు యుద్ధంలో కనిపించాడు. ఈ విధంగా జనస్థానమంతా పాడైంది.’
అకంపనుడు ఈ విధంగా చెప్పగానే విన్న రావణుడు ముఖం ఎర్రగా చేసి తక్షణమే ఆ మనుష్యులను చంపుతానంటూ బయల్దేరడానికి సిద్ధవౌతాడు. అప్పుడు అకంపనుడు రామభద్రుడి బలపరాక్రమాలను మరింత వివరంగా చెప్పాడిలా.
‘రాక్షస రాజా! నువ్వాయన మీదికి యుద్ధానికి పోతే లాభం లేదు. ఆయనకే కోపం వస్తే నువ్వే కాదు... బ్రహ్మేంద్రాదులు కూడా ఆయన్ను గెలవలేరు. పొంగి పొరలి వచ్చే సంపూర్ణ ప్రవాహాన్నైనా తన బాణాలతో రాకుండా ఆపగలడాయన. గ్రహాలతో, నక్షత్రాలతో నిండిన ఆకాశాన్నైనా బాణాలతో చీల్చకలడు. శ్రీమంతుడైన రామచంద్రమూర్తి భూమిని ఉద్ధరించగలడు. అవలీలగా సముద్రం చెలియలికట్ట దాటి రారాదనే నియమాన్ని అణచి భూమినంతా సముద్రంతో ముంచగల శక్తి కలవాడు. సముద్ర గర్వాన్ని మొదటంతా నాశనం చేయగలడు. బాణాలతో వాయువునైనా ఆపగలడు. తన పరాక్రమంతో రామచంద్రుడు సమస్త లోకాలనూ సంహరించి మళ్లీ సృష్టించగలడు. రామచంద్రమూర్తిని నువ్వు గెలవడం సాధ్యం కాదని నా అభిప్రాయం. రామచంద్రమూర్తిని గెలవలేని వాడివి నువ్వొక్కడివే కాదు. లోకంలో వున్న రాక్షస శ్రేష్టులందరూ, మనుష్యులతో సహా ఏకమైనా, ఆయన సమీపానికైనా పోలేరు. ఆయన ఒక్కడే.. మేమందరం గుమికూడితే ఆయన్ను గెల్వలేమా? అని అంటావేమో? ఎంతమంది పాపాత్ములు కలిసినా స్వర్గానికి పోగలరా? (పాపాత్ములకు స్వర్గ ప్రాప్తి లేనట్లే పాపాత్ముడవైన నీకు రామ సాలోక్య ప్రాప్తి లేదని భావం) కాబట్టి రామచంద్రమూర్తిని నువ్వు చంపాలనుకుంటే (లేదా చచ్చిన వాడితో సమానంగా చేయాలనుకుంటే) నేనొక ఉపాయం చెప్తా ఏకాగ్రచిత్తంతో విను.’
-సశేషం
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం,
గుంటూరు జిల్లా 7036558799 08644-230690

‘కకోరీ’ త్యాగమూర్తులు

$
0
0

1.‘ఈ బ్రిటీష్ వారు మన దేశ అమూల్య సంపద దోచుకొని వాళ్ల దేశానికి తరలిస్తున్నారు. ఇది దోపిడీ కాక మరేమిటి. ముల్లుని ముల్లుతోనే తీయాలి కాబట్టి మనం కూడా బ్రిటీష్ ప్రభుత్వం ఖజానా కొల్లగొట్టి స్వాతంత్య్ర పోరాటానికి ఉపయోగిద్దాము’ అని ఏ సంస్థకు చెందిన ఉద్యమకారులు నిర్ణయించారు?

ఎ.లాల్ బాల్ పాల్ విప్లవ్ సంఘ్
బి.హిందుస్థాన్ పూర్ణ స్వరాజ్ మంచ్
సి.హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్
డి.ఆజాద్ హింద్ ఫౌజ్

2.కకోరి రైలు చోరీ ఘటన ఎప్పుడు జరిగింది?

ఎ.డిసెంబర్ 16, 1924 బి.డిసెంబర్ 17, 1926
సి.ఆగస్టు 2, 1924 డి.ఆగస్టు 9, 1925

3.బ్రిటీష్ వారి సొమ్ము కొల్లగొట్టి ఆ సొమ్ముతోనే ఆయుధాలు కొని వారిపైనే ఉద్యమిద్దాం మన భరతమాత సంకెళ్లు విప్పి, జైళ్లలో మగ్గుతున్న లక్షల మందిని విడిపించి మన దేశ గౌరవాన్ని కాపాడుకుందాం అని ప్రతిజ్ఞ బూనిన ఏ యువ క్రాంతికారులు కకోరి రైలు ఘటనలో పాల్గొన్నారు?

ఎ.చంద్రశేఖర్ ఆజాద్, కేసబ్ చక్రవర్తి, బన్వారీ లాల్, ముకుంద్ లాల్
బి.సచింద్ర బక్షి, మన్మథనాథ్ గుప్తా, జోగేష్ ఛటర్జీ, రాజేంద్ర లహిరి
సి.రామ్‌ప్రసాద్ బిస్మిల్, రోషన్ సింగ్, అష్పాకుల్లా ఖాన్
డి.పైన పేర్కొన్న వారందరూ

4.ఒక్కొక్క స్టేషన్‌లో టిక్కెట్లు అమ్మిన సొమ్ము తోలు సంచీలను ఆయా స్టేషన్ మాస్టర్లు ట్రైన్‌లో గార్డుకి అప్పగించారు. కకోరీ స్టేషన్ సమీపంలో రైలు బండినాపి సొమ్ము చేజిక్కించుకొన్నారు. కకోరి ఎక్కడ ఉంది?

ఎ.బక్సర్ జిల్లా, బీహార్
బి.్ధన్బాద్ జిల్లా, ఝార్ఖండ్
సి.లక్నో జిల్లా, ఉత్తరప్రదేశ్
డి.గుణ జిల్లా, మధ్యప్రదేశ్

5.నువ్వు అప్రూవర్‌గా మారి మిగతా వారికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వు. నిన్నీ శిక్ష నుంచి తప్పిస్తాము అని బ్రిటీష్ వారడిగితే ‘వాళ్లు నా అన్నదమ్ములు లాంటి వారు. స్వాతంత్య్ర ఉద్యమానికి కులం, మతం, తెగ ఉండవు. మేమందరం భారతీయులమే. నన్ను ఉరికంబం ఎక్కించినా దేశం కోసం సంతోషంగా ప్రాణాలర్పిస్తాను కానీ మీ బ్రిటీష్ వారి మాటలకు లొంగను - అని అన్నదెవరు?

ఎ.చంద్రశేఖర్ ఆజాద్
బి.రామ్‌ప్రసాద్ బిస్మిల్
సి.అష్ఫాకుల్లా ఖాన్
డి.రాజేంద్ర లహిరి

6.దేశం కోసం ప్రాణాలర్పించిన రామ్‌ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, రోషన్ సింగ్‌లను నిర్ణయించిన తేదీకి ముందుగానే వారికి ఉరిశిక్ష అమలుపరిచారు. ఏ తేదీ నాడు ఉరితీశారు?

ఎ.17 మే 1928
బి.28 జనవరి 1928
సి.19 డిసెంబర్ 1927
డి.17 డిసెంబర్ 1927

7.రాజేంద్ర లహిరిని ఏ తేదీ నాడు ఉరికంబమెక్కించారు?

ఎ.16 మార్చ్ 1929 బి.19 డిసెంబర్ 1928
సి.6 ఫిబ్రవరి 1928 డి.17 డిసెంబర్ 1927

8.వారి ఉరిశిక్ష ఆపడానికి ఎవరు ఏ రంగంలోకి దిగి బ్రిటీష్ చక్రవర్తికి ఎన్నో దరఖాస్తులు, విన్నపాలు, క్షమాభిక్ష అర్జీలు పెట్టి వారి ప్రాణాలు కాపాడడానికి విఫల ప్రయత్నాలు చేసేరు?

ఎ.వల్లభ్ పంత్
బి.మోతీలాల్ నెహ్రూ
సి.పండిట్ మదన్‌మోహన్ మాలవీయ
డి.పైన పేర్కొన్న వారందరూ

9.ప్రతి భారతీయులలో పౌరుషం పెంపొందించింది, రోమాలు నిక్కబొడుచుకొనేటట్లు చేసిన ఈ కకోరీ రైలు చోరీ ఘటనలో మిగతా వారందరికీ ఏ శిక్ష విధించారు?

ఎ.యావజ్జీవ కారాగారం
బి.పదేళ్లు కారాగార శిక్ష
సి.ఐదేళ్లు కారాగారం
డి.నాలుగేళ్ల నుంచి పదునాలుగు ఏళ్ల వరకు జైలుశిక్ష

10.కకోరీ రైలు చోరీ ఘటనలో పాల్గొన్న ఆ నలభై మంది స్వాతంత్య్ర సమరయోధులు ఎంతో పకడ్బందీగా ప్రణాళిక వేసుకొన్నా నెలలోపే అందరినీ బ్రిటీష్ సేనలు పట్టుకొని ఖైదు చేసేయి. ఎంతమందికి ఉరిశిక్ష విధించేరు?

ఎ.40 బి.14
సి.4 డి.2
==================================================================
గత వారం క్విజ్ సమాధానాలు
1.డి 2.డి 3.డి 4.సి 5.డి 6.సి 7.డి 8.సి 9.డి 10.డి

భాగ్యనగర్ ’ జిందాబాద్!

$
0
0

మొట్టమొదటి అఖిల భారత తెలుగు రచయితల మహాసభలు 1960 మే నెలలో హైదరాబాద్ - పోతుకూచి సాంబశివరావుగారు, ఆయనగారి యువ టీము - గొప్ప సమన్వయంగల ఏర్పాట్లు చేశారు. దానికి అప్పటి ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారు ఆహ్వాన సంఘ అధ్యక్షులు. మహాసభలకి రాష్ట్రంలో నుంచే కాదు, ఎక్కడెక్కడి నుంచో - పాత కొత్త రచయితలు మహదానందంగా తరలి వచ్చారు.
మహాసభలను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ప్రారంభించడంతో దానికి మరింత ప్రాముఖ్యత వచ్చింది. నిజంగా అదొక దొడ్డ సభ. తెనుగు భాషకు వనె్నగా - తెనుగు జాతికి సాహితీ సేవలందించి - ఎందరో ‘శిఖర’ రచయితలు హాజరై కళకళలాడిన సభ. ‘శిఖర రచయితలు’ అన్నది డా.సి.నారాయణరెడ్డిగారు తయారుచేసిన మాట. సభకి అధ్యక్షత వహించినదెవరో తెల్సా? బూర్గుల రామకృష్ణరావుగారు.
రెడ్డీ కాలేజి హాస్టల్స్‌ని రచయితలకి బసగా ఇచ్చారు. రామ్మోహనరావుగారి ప్రక్కన వెళ్లానుగా - మంచి రూము దొరికింది. ఈ వైభవోపేతమైన - యింతమంది రచయితలు - స్టార్’ వాల్యూ వున్నవాళ్లంతా ఓ చోట చేరారు. హైదరాబాద్ నగరం మా బెజవాడ, వైజాగ్‌లతో పోలిస్తే - హరికేన్ లాంతరు ప్రక్కన గ్యాస్‌లైట్ (నాటికి ఎల్.ఇ.డి.లు వగైరా లేవు) లాగ వెలిగిపోతూ కనపడ్డది.
అప్పుడు అసలు సభలకి ప్రత్యేక శోభ చేకూరుస్తూ - భారీ హాలులో గ్రంథ, చిత్ర ప్రదర్శన ఏర్పాటు జరిగింది - ‘ఓహో!’మని. నైజాం నవాబుగారి నగల ప్రదర్శన చూడాలనిపించలేదు గానీ - నాకు ఈ అందాల చందాల శోభ నచ్చింది. నా మదిలో - సినిమా భాషలో చెప్పాలీ అంటే - ఏవో వినిపించని రాగాలు చెలరేగాయి. దాన్ని ప్రారంభించాల్సింది బెజవాడ గోపాలరెడ్డిగారు. తలుపులు మూసే వున్నాయి గానీ అక్కడ మొట్టమొదట మంజుశ్రీ (ఆనక డా.అక్కిరాజు రమాపతిగా సుప్రసిద్ధుడైనాడు) తనూ, తన ప్రక్కన వున్న డా.పోరంకి దక్షిణామూర్తి - రుూ అద్భుత ప్రదర్శనలకి కన్వీనర్‌లట. వారి ‘బలగం’ నిండా కాలేజీ పిల్లలు - పిల్లలు అంటే ఆడపిల్లలు అని నా ఉద్దేశం.
మంజుశ్రీ నరసరావుపేట నుంచి బెజవాడ మీదుగా హైదరాబాదు పోయేటప్పుడు మేం కలిసేవాళ్లం- విజయ సాహితీ సభలలో కూడా. ఓసారి అర్ధరాత్రికి ముందు మా ఇంటికి ‘బ్రేక్‌జెర్నీ’ చేశాడు. అమ్మ బలవంతం చేసి - ఆవకాయ వేసి అన్నం పెట్టి - తిన్నాక కానీ పంపించలేదు. తాను ఆ మాటే యాభై సంవత్సరాల మైత్రి తరువాత కూడా మాటల మధ్య గుర్తు చేసుకుంటూ వుండేవాడు.
తనకి అప్పుడు న్యూసైన్స్ కాలేజీలో, అలాగే దక్షిణామూర్తికి అదే కళాశాలలో ఉద్యోగాలొచ్చాయి. ఇకనేం, నాకంటే నాలుగేళ్లు సీనియర్లయినా కూడా ఈ ఇద్దరూ అమిత వాత్సల్యంగా - ‘తొలిమలుపు వీరాజీ’ అంటూ గుండెలకి హత్తుకున్నారు. ఇవాళ్టిదాకా ఆ మైత్రీ, ఆ చనువూ కొనసాగుతూనే వున్నాయి.
గ్రంథ, చిత్ర కళా ప్రదర్శనా ప్రాంగణంలోకి - నాకు ముందే ‘ప్రీవ్యూ’కి అనుమతి లభించింది. దూరిపోయాను. వామ్మో! ఎటు చూసినా కాలేజీ సుందరాంగనలే - షట్ షెల్వార్లు, పంజాబీ దుస్తులూ - పరికిణీ వోణీలు - వాలంటీర్ల వొయ్యార శోభతో దాన్ని ఇనుమడిస్తూ వున్న కుమారి సుభద్ర. రా.మో.గారి పెద్ద అబ్బాయి (అంటే నాకు అన్నయ్య అన్నమాట. చిన్నవాడు మురళీ నా క్లాస్‌మేట్ కదా) నళినీ మోహన్‌కి కాబోయే సహధర్మచారిణికి అంటే - తనకు కాబోయే కోడలికి - మా బుక్స్ ముందే కానుకగా పంపేశారు. అందులో, అయ్యా! వీరాజీ తొలిమలుపు, రాతిమేడా కూడా వున్నాయి అని చెప్పాలా?
చూడండి తమాషా! తంతే బూరెల గంపలో పడ్డాట్ట! అందుకే అంటాను. నవలలో అన్నా - ‘ఇల’లో అన్నా ‘ఖేసరా/ సరా!’ ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది - అని. రేపటి విశ్వవిద్యాలయ విద్యార్థినులు కాబోయే యువతీ యువకులకు నేను ఆ ప్రపంచంలో నుంచి వచ్చిన వింత శాల్తీలాగ అగపడ్డాను అన్న మాట.
ఛార్లెస్ డికెన్స్ గారు - రెండు మహానగరాల కథలో - తొలి వాక్యంలోనే అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ‘ఇట్ వాజ్ ది వర్డ్స్ ఆఫ్ టైమ్స్; ఇట్ వాజ్ ది బెస్ట్ ఆఫ్ టైమ్స్’- అని. అట్లా 1960 నాకు పరమచెత్త సంవత్సరం - మళ్లీ అదే విరోధాభాసగా అత్యుత్తమ కాలం. క్యాంపస్‌లో నాకున్న నిక్‌నేమ్ - ‘స్పయిరల్ స్ప్రింగ్’. ఒత్తయిన నా ఉంగరాల జుత్తు క్రాపింగులో ముందున్న కురులు వంకీల స్ప్రింగ్‌లాగా చుట్టుకుని నుదుటి మీద వ్రేలాడుతూ ఉండేవి. ఫిజిక్స్ లాబ్‌లో - స్పయిరల్ స్ప్రింగ్ ఎక్స్‌పెరిమెంట్లో ఉంటాయి. అది లాగి వదిలితే స్ప్రింగు - స్థితిస్థాపక శక్తి చేత తిరిగి చుట్టుకుని యధాస్థానానికి వస్తుంది. అట్లా - నా వంకీల ముంగురులు - (పిట్టల మధ్య కోడిపుంజు నెత్తి మీద ఎందుకూ కొరగాని కిరీటంలాగా) చిత్రంగా కనపడేది. ఆ వొంకీలు ‘బ్రిల్’ క్రీమ్ వాడినా లొంగేవి కావు. సరే, ప్రదర్శనకి నా రెండు నవలలూ, కవితల క్లిప్పింగ్‌లు అంటించిన కాకీ కాగితాల పుస్తకం ముందే అందేయి. దానికి ‘సారు’ ‘నా విడీవిడని చిక్కుల వ్రాతప్రతీ, ఎదిగీ ఎదగని మనుషులు నవల వ్రాతప్రతినీ ‘పగా-ప్రేమా’ నవల చిత్తుప్రతినీ కూడా చేర్పించారు. ఆ రచనలన్నీ - ‘టీనేజ్ మెరుపులే’ కదా!
మనవాళ్లంటూంటారు. ‘దేనికయినా కాలమే మందు’. అదో - సామెత కూడా. అలా, నిరాశా నిస్పృహల గాయాల్ని, అంతర్దహన యంత్రంలాగా జ్వలించే అసంతృప్తి జ్వాలల్ని ఈ సందడిలో తగ్గాయి. మళ్లీ నాలోని కుర్రతనం లేచి సన్నాయి మ్రోగించింది. అయినా - ‘మేలేమే అకేలా!’ ఈ మహోత్తుంగ సంగీత పరిమళం అనదగ్గ రచయితల సందడిలో కూడా నన్ను అదో ఒంటరితనం - కాలర్ పట్టి వెనక్కి గుంజుతూనే ఉంది..
తెలుగు స్వతంత్రలో ‘కాలాతీత వ్యక్తులు’ అనే సీరియల్ రాస్తున్న శ్రీదేవిగారు, నోరా శాస్ర్తీగారూ కలసి వచ్చారు. ఆటోకి కొంత చిల్లర పైసలు తగ్గాయి కాబోలు దిక్కులు చూశారు. ‘ఇదుగో సార్, ఛేంజ్. ఆనక యిచ్చేద్దురు’ అంటూ ఆఫర్ చేశాను. శ్రీదేవిగారు ఆ నవల పాఠకులకు ఓ కొత్తదనాన్నిచ్చింది. ఆ ఇద్దరూ ముచ్చట్ల మధ్య - ఎందరో రచయితలకి ‘ఇదుగో బెజవాడ ఎండ’ అంటూ నన్ను పరిచయం చేశారు గోరాశా. స్రవంతి పత్రికకి సాహితీ వర్గాలలో పెద్దపీట వుండేది. మొదట దాశరథి, ఆనక సినారే గార్లు దీనికి ఎడిటర్లు. స్కూలు కాలంలోనే నాకు ‘కలం పరిచయం’ వుందా మహాకవులతో - నారాయణరెడ్డి గారు నన్ను భుజం మీద చెయ్యి వేసుకుని కబుర్లు చెబుతూ ‘నుక్కడ్’ (వీధిమొగ) కిల్లీషాపు దాకా నడిపించి - ఉస్మానియా క్యాంపస్ కూడా చూడు ‘మిత్రమా!’ అన్నారు.
చిత్రం ఏమిటీ అంటే, యిట్లా పెద్దాళ్లందరికీ మధ్య - అనగా ‘ఎగ్జాట్లీ’ - వాళ్లతో భుజాలు రాసుకుంటూ కాదుగానీ - వారి సరసన నడుస్తూ - అందాల ‘బాగ్’ల నగరం - భాగ్యనగరం యొక్క వాతావరణం ‘చిత్తు’ చేసింది. ఆ ప్రాంత భాషలో చెప్పాలీ అంటే - ‘ట్యాంక్‌బండ్ షైరుతో’ నేను ఫిదా!
నారాయణరెడ్డిగారు నన్ను భుజం మీద చెయ్యి వేసి హైవే మీదుకి నడిపిస్తున్న దృశ్యం నాకు అప్పుడే - ఎగ్జిబిషన్‌లో పరిచయమయిన పిల్లలందరి మధ్యా మరింత పాపులారిటీని తెచ్చింది. కానీ నేను ఆనాడు అనుకోలేదు. మరి నలభై ఆరు సంవత్సరాల తర్వాత జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత అయిన ఇదే ‘విశ్వంభర’ కవన చక్రవర్తి నా సాహితీ జీవిత స్వర్ణోత్సవాలకు అధ్యక్షత వహించి, నన్నాశీర్వదిస్తూ - తొలిమలుపు నాలుగవ ఎడిషన్ కాపీని - డా.కె.వి.రమణాచారి ఏతుల మీదుగా అందుకుంటారని! తెనుగు నవలా సాహిత్యం మీద పరిశోధనలు చేసి డాక్టరేట్ అందుకున్న డా.మృణాళిని గారు - తెలుగు నవలా సాహిత్యంలోనే కాదు - మరే, భాషలోనైనా సరే - మొదట క్యాంపస్ నవల’ రాసింది వీరాజీయే అన్నది.
ఆనాటి రాత్రి (సభలలో)శ్రీశ్రీ అధ్యక్షతన కవి సమ్మేళనం అన్నారు. నా పేరుని - వున్నారుగా నా యువ అందాల నేస్తాలు - వాళ్లేగా అక్కడ వాలంటీర్లు -వేదికను ఎక్కే కవుల జాబితాకి ఎక్కించేశారు. ‘ఆరుద్ర’ని నా పదో ఏటనే చూశాను గానీ ‘శ్రీశ్రీ’తో నేరుగా కరచాలనం చెయ్యడం అదే మొదటిసారి. సరే.. అర్ధరాత్రి దాటినా - నా పేరు మీద ‘కేక’ రాలేదు. పగలంతా వూగి, తూగి, వుల్లాసంగా, ఉద్దేలంగా గడిపానేమో- నా పేరు ‘కేకే’ సరికి నిద్రాదేవి ఒడిలోకి జారిపోయి వున్నానుట. మర్నాడు అప్పుడే తొలి పరిచయం అయిన పులికంటి కృష్ణారెడ్డి నవ్వుతూ చెప్పాడు.
మర్నాడు మహీధర - ‘రావోయ్ కృష్ణాపత్రిక ఆఫీస్‌కి వెళ్దాం. నీ ‘ఎదిగీ ఎదగని మనుషులు’ నవల (రాతప్రతిని)ని ‘అట్టుకుని మరీ పద’ అన్నారు. కృష్ణాపత్రిక అప్పుడు వారపత్రిక. దాని ఎడిటర్ ‘శర్మ’గారు కార్యాలయంలో లేరు గానీ శ్రీపతి గారనుకుంటాను ఇన్‌ఛార్జి. రా.మో.గారి శైలిలో చెప్పాలీ అంటే - ఇంచక్కా మాట్లాడేరు. నవలని సీరియల్‌గా వేసుకోడానికి తగునేమో చూడమని శర్మగారికి నా మాటగా చెప్పండని చెప్పి - స్క్రిప్టుని ఇప్పించారు. ఆ ఏరియా మొజంజాహీ మార్కెట్ ప్రాంతం అని విన్నట్లు గుర్తు.
సభల దారి సభలదే. వివిధ ప్రాంతాల యంగ్‌బ్యాచ్ రచయితల ఆటవిడుపు దారి దానిదే. భోజనశాలలో ‘కర్రీ కర్రీ’ అని అన్నాడో రచయిత. ఊటుకూరు లక్ష్మీకాంతమ్మగారు - ఎక్కణ్ణుంచో ఆడపులిలాగా ‘గాండ్రించింది’ ‘ఎవరయ్యా, నువ్వూ? కూరలు, చారు, మజ్జిగ అని అడగలేవూ? రైస్ రైస్.. అన్నావో’ అంటూ అరిచారామె. హడలి చచ్చాం.. అంతా.
లక్ష్మీకాంతమ్మగారు - నేను బెజవాడ యస్సారావ్ సివిఆర్ కాలేజీలో ఇంటర్‌మీడియెట్ చదువుకుంటున్నాను. మా కాలేజీ వార్షికోత్సవాలకి ‘వక్త’గా వచ్చారు. ఆటల మైదానం ఎదురుగా రేకుల షెడ్ హాలులో మీటింగ్స్ అయ్యేవి. క్లాసులకి కూడా ‘షెడ్’లే వుండేవి. మేము క్రికెట్ ఆడుతున్న కుర్రాళ్ల వేపే చూస్తూ - మైదానంలో గడ్డి మేస్తున్న ఆవులవేపూ, మేకల వేపూ చూస్తూ - మధ్యమధ్య బల్లలు చరిచేవాళ్లం. అప్పుడు నేను కవినీ, రచయితనే గానీ - అభిమానుల్నీ, అమ్మాయిలనీ ఆకర్షించే ‘మూడ్’లో లేను. ‘క్రికెట్ పిచ్చోణ్ని’ అనేవాళ్లు ఫ్రెండ్స్. కానీ ఆ రోజు లక్ష్మీకాంతమ్మగారు మమ్మల్ని అందర్నీ ‘నిందాస్తుతి’ చేస్తూ - ఏకిఏకి వదిలిపెట్టింది. బల్లలు - నేను కూడా చేతులు మండేలాగా చరిచాను. ‘ఇట్లా అదరగొట్టాలి నేను కూడా’ అనుకున్నాను. వేదిక ఎక్కినప్పుడు..
అలాంటి లక్ష్మీకాంతమ్మగారు మళ్లీ నాకు, సాహిత్య అకాడెమీ ఆధ్వర్యంలో జరిగిన గుంటూరు ‘రచయిత్రుల’ సభలో కలిశారు. అప్పుడా సభలకి నేను ఆంధ్రపత్రిక - ప్రత్యేక ప్రతినిధిని. స్టార్ భానుమతి - జర్నలిస్ట్ రైటర్ కె.రామలక్ష్మి (ఆరుద్ర) పి.టి.రెడ్డి గారి సతీమణి యశోదా రెడ్డి - మా ఊరి ‘లత’ అందరం కలిసి ‘ఆంటీ’ని ఆట పట్టించాం. ఉన్నమాట చెబుతున్నాను - ఆమె పట్ల గౌరవంతోనే సుమా.. దొడ్డ ఆర్గనైజర్ ఆమె.
మహీధర కోప్పడ్డారు - ‘నా వేలట్టుకు తిరగమాకు. నిన్నొదిలి పోతాననుకోకు’ అంటూ ‘్ఫల్‌ఫ్రీడమ్’ యివ్వడంతో గ్రంథాలయ, చిత్ర కళా ప్రదర్శనలో - మిత్రులు ‘మంజుశ్రీ’, పోరంకీలతో నేనూ ఓ భాగమై పోయాను. ఆ లోపల, నన్ను వెతుక్కుంటూ మా షరీఫ్ వొచ్చాడు. షరీఫ్ నాకు ఇంటర్‌లో క్లాస్‌మేటు, క్రికెట్ టీమ్ ‘మేట్’ కూడాను. ఇస్లాంపేట వాడు. వాల్తేరుకి నేను, గుంటూరుకి తనూ - ఒకే సబ్జెక్టు ఫిజిక్స్ కోసం వెళ్లిపోయాం - కాని నేస్తం కొనసాగింది.
‘సాలార్ మ్యూజియం’ చూడాలి కృష్ణమూర్తీ! మా ఇంటికి పోదాం ఈ రాత్రి. రేపు రాత్రి నేను రైలెక్కిస్తానులే’ అన్నాడు. మా ఇద్దరి ‘కథా’ మరో సందర్భంగా చెబుతాను. వాళ్ల డాడీ కో ఆపరేటివ్ రిజిస్ట్రార్. ‘ఓకే’ అన్నాను నేను. కానీ మర్నాడు పోతుకూచి వారు - ఓ నలభై మందికి ‘డీలక్సు బస్ ఇచ్చి’ - గోల్కొండ, గండిపేట వగైరాల వినోద విహార యాత్ర ఏర్పాటు చేశాడు. గొప్ప డిమాండ్ దానికి - కవి సామ్రాట్ పైడిపాటి సుబ్బరామ శాస్ర్తీగారు ముందే పేరిచ్చేశారు. ఉన్నారుగా నా నేస్తాలు - సెకండ్ ఇయర్ సైన్స్ డిగ్రీ స్టూడెంట్స్ - ఆరాధనా, లక్ష్మీకాంతం, కోటీశ్వరి, సరళ మొదలైన వాళ్లు - వాళ్లదే ఆర్గనైజేషన్. నిజంగా ఈ స్వచ్ఛంద దళం - నవ్య సాహితీ సమితి కార్యవర్గం సభ్యుడు కాలనాదభట్ట వీరభద్ర శాస్ర్తీ లాంటి అనుభవజ్ఞులు - సభల నిర్వహణలాగే - రుూ వినోద యాత్ర కూడా అపశ్రుతుల్లేకుండా ‘మరపురాని మధుర యాత్రా స్మృతి’గా మిగిలిపోయింది.
(ఇంకా బోలెడుంది)

ఇది ముగిసేలా లేదు..

$
0
0

పోలిన మనిషి ఉండటం మామూలే అంటూ మొదలుపెట్టాము. కానీ మరొకరు లేరని ఉదాహరణలతో సహా చెప్పుకున్నాము. డిఎన్‌ఏ అనే జన్యు పదార్థం ఇద్దరిలోనూ ఒకే రకంగా ఉండదు. ఇక వేలిముద్రలు, ముఖం, నడక తీరు ఆధారంగా మనుషులను గుర్తిస్తున్నారు అంటే ఆశ్చర్యపడకుండా విన్నాము. చెవులు, కళ్లు, మాట, ధ్వని కూడా వేలిముద్రలలాగే వేరువేరుగా ఉంటాయని తెలిసింది. నాలాంటి వారు మరొకరు లేరు అనడానికి నిజానికి ఇవి చాలు.
మనం సంతృప్తి పడ్డామని సైన్స్ ఊరుకోదు. దాని పని అది చేస్తూనే ఉంటుంది. కనుకనే శరీరం వాసన, గుండె లబ్‌డబ్, మెదడు తరంగాలు, ఒంటి లోపల ఉండే సూక్ష్మజీవులు కూడా ఎవరికి వారిలో వేరుగా ఉన్నాయి అంటున్నారు. మీకు చదివే ఓపిక ఉంది. నాకు చెప్పే ఓపిక అంతకన్నా ఎక్కువే వుంది. మరింకేమీ? చదవడమే!
అన్నట్టు మీరు ఇంతకు ముందు నా వ్యాసాలు చదవని పక్షంలో కూడా ఈ వ్యాసం అర్థమవుతుంది. ఇదేమీ సీరియల్ నవల కాదు. రియల్ విషయాల వల. చదువుతూ పొండి మరి!
సినిమాల్లో రాక్షసులు నరవాసన అనడం చాలామందికి గుర్తు ఉంటుంది. ఒక మనిషిని వెతకడానికి కుక్కలు వాసన ఆధారంగా బయలుదేరడం అటు కథలలోనూ, ఇటు అపరాధ పరిశోధనలోనూ అందరూ గమనించారు. అయితే పెరుగుతున్న సైన్స్ కారణంగా మనిషి శరీరం వాసన గురించి మరెన్నో సంగతులు తెలుస్తున్నాయి. ఏ ఇద్దరు మనుషుల ఒంటి వాసన ఒకే రకంగా ఉండదు అని అన్నమాట. ఇది నేను అంటున్న మాట కా. పరిశోధకులు చెబుతున్న పక్కా విషయం.
ఒక్కసారి డీఎన్‌ఏ లోని నాలుగు బేస్ రసాయనాలను గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ నాలుగింటి ఆధారంగా లెక్కలేని జన్యువులు ఏర్పడుతున్నాయి. సరిగ్గా అదే పద్ధతిలో వాసనలు కూడా కావలసినన్ని ఏర్పడుతున్నాయి. మనుషుల బాహు మూలాలు, సూటిగా చెప్పాలంటే చంకలలో 20 పైగా రకాల వాసనలు ఉన్నాయి. ఆ రకాలన్నీ రకరకాలుగా కలుస్తూ ఉంటే ఎన్ని రకాలుగా వచ్చేది సులభంగా లెక్కవేసి చెప్పవచ్చు. అయితే మనిషి శరీరంలో వాసన ఉండేది చెమట పట్టే ప్రాంతాలలో మాత్రమే కాదు. శరీరంలో రకరకాల మూలాలు ఉన్నాయి. రకరకాల ప్రదేశాలు ఉన్నాయి. ఎక్కడికక్కడ రకరకాల మోతాదులలో రసాయనాలు పుడతాయి. వాటి కారణంగా ప్రతి చోట రకరకాల సూక్ష్మజీవులు చేరుకుంటాయి. వాటివల్ల మరిన్ని వాసనలు పుట్టుకు వస్తాయి. ఒక చెమటలోనే ఆర్గానిక్ రసాయనాలు రకరకాలుగా ఉన్నాయని, అవి గాలిలో కలిసిపోయే లక్షణం కలిగి ఉన్నాయని కూడా తెలిసింది. రెండు వందల మందిని ఒకచోట చేర్చి వారి శరీరాల నుండి వాసన రసాయనాలను సేకరించారు. అవి మొత్తం 5000 రకాలు దొరికాయి. అన్నీ ఒకే రకం కాదు. కొన్ని ఆమ్లాలు, కొన్ని ఆల్కహాల్ రకం, తరువాత కెటోన్, ఆల్డిహైడ్ అనేవి కూడా ఉన్నాయి. మొత్తం కలిసి 44 వర్గాలుగా ఉన్నాయి. ఇవి రకరకాల కలయికలలో పుట్టించగలిగే వాసన కూడా వేలిముద్రలకు సమానంగా వేరువేరుగా ఉంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు.
శరీరంలోని ఈ వాసన రసాయనాలకు ప్రత్యేకంగా ప్రయోజనం మాత్రం లేదు. వాసన పుట్టించడం ఒకటి మాత్రమే ఆ రసాయనాలకు తెలిసిన పని. ఒకరిని ఒకరు గుర్తించడానికి ఈ రసాయనాలు వాసనలు పనికి వస్తాయని పరిశోధకులు అంటున్నారు. ఒక వ్యక్తి శరీరం నుండి మొత్తం మీద వచ్చే వాసనకు నకిలీ ఇప్పటివరకు ఎవరూ తయారుచేయలేదు. అమెరికా ప్రభుత్వం ఈ రకమైన సాంకేతిక శాస్త్రం కొరకు అడగడం మాత్రం నిజం. ఆ దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి. మొత్తానికి వేలిముద్రలు, కంటి నిర్మాణంలాగే ఒంటి వాసన ఆధారంగా కూడా మనుషులను ఎవరికి వారిని ప్రత్యేకంగా విడదీసి చూపవచ్చునని తేలిపోయింది. ఇక తరువాత చెప్పే విషయం మరింత ఆశ్చర్యకరంగా ఉంటుంది. గుండె మీద వాలి చూడు, గోడు వింటావు అంటాడు హీరో. అందరి గుండెల్లోలాగ కాక ఆయన గుండెల్లో నుంచి ప్రియురాలి పేరు వినబడుతున్నది ఏమో? సరదా మాటలను పక్కనబెడితే గుండె చప్పుడు ఏ ఇద్దరిలోనూ ఒకే రకంగా ఉండదు అంటున్నారు. గుండె మీద వాలితే ఈ విషయం తెలీదు. ఎలెక్ట్రో కార్డియో ‘గ్రామ్’ అనే పరీక్ష ద్వారా తేడాలు బాగా తెలుస్తాయి. ఇసిజి అనే ఈ యంత్రం ఇచ్చే కాగితం మీద వంకరటింకర గీతలు రకరకాలుగా ఉంటాయి. అందులో ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి. గుండెలోని పై గదులు కొట్టుకుంటే అందుకు అనుగుణంగా వచ్చే గీత పి తరంగాలను గురించి చెబుతుంది. కింద గదులు మరింత గట్టిగా కొట్టుకుంటాయి. కనుక వాటి వల్ల క్యూ ఆర్ ఎస్ అని గజిబిజి తరంగం పడుతుంది. ఇక గుండె మళ్లీ వదులుతున్నప్పుడు టి తరంగం వస్తుంది.
ఏ రెండు గుండెలు ఒకే రకంగా ఉండవు. వాటి పరిమాణం, ఆకారం, ఎత్తు, వెడల్పు. కనుక వాటి కదలిక కారణంగా వచ్చే తరంగాలు కూడా ఎత్తు నిడివి, వాటి మధ్య దూరాలు వేరువేరు కావచ్చు. మనిషికి మనిషికి మధ్యన తేడాను తెలియ చెబుతాయి. గుండె వేగం పెరిగిన కొద్దీ పైకి వచ్చే పిక్స్ ద్వారా తెలుస్తుంది. ఒత్తిడికి గురైన వారు, వ్యాయామం చేస్తున్న వారు గుండె దడను అనుభవిస్తారు. అంటే వారి గుండె కొట్టుకునే వేగం బాగా పెరిగింది అని అర్థం. పెరిగిన సందర్భంలో కూడా గుండె నుంచి వచ్చే తరంగాల తీరు ఎవరికి వారికి వేరువేరుగా ఉంటుంది. గుండె కొట్టుకునే తీరు నేరుగా నియంత్రణలో ఉండదు. వాటికి దాన్ని మరొక రకంగా పని చేయించడం వీలు కాదు. బయోమెట్రిక్ కంపెనీల వారు వేలిముద్రలు మొదలు రకరకాల పద్ధతులతో మనుషులను గుర్తించే యంత్రాలను తయారుచేశారరు. అదే పద్ధతిలో వారు గుండె స్కానర్లను కూడా వాడుకుంటున్నారు. అంటే మీరు ఆఫీసులోకి లేదా కంపెనీలోకి వెళ్లే ముందు ఒక్క క్షణం గుండె చప్పుడు విని అనుమతించే రోజులు మరి దూరం లేవు. అప్పుడు మీ గుండె చప్పుడు పాస్వర్డ్ అవుతుంది. అది ఇక మార్చవలసిన అవసరం లేని పాస్వర్డ్.
గుండె కదలికతో తరంగాలు పుడతాయి. ఆ గుండె నిజానికి మెదడు నియంత్రణ లేకుండా పని చేస్తుంది. ఇక నేను పుట్టడం కొత్త విషయమా? కానే కాదు ఇద్దరు మనుషుల మధ్యన తెలియని తరంగాల ద్వారా మెదడు భావనలను ఇచ్చిపుచ్చుకునే, వీలు కలిగి, నచ్చడం, నచ్చకపోవడం జరుగుతాయని చాలామంది చెబుతారు. ఫ్రీక్వెన్సీ కలిసింది అంటారు. ఇది నిజంగానే జరుగుతున్నదని పరిశోధకులు ఈ మధ్యన తేల్చి చెప్పారు. మనుషుల మధ్యన ఆలోచన ఆధారంగా వచ్చే తరంగాలలో తేడాలు ఉంటున్నట్టు తెలిసిపోయింది.
మనిషి మెదడులో న్యూరాన్ అనే కణాలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. వాటిలో సగం వరకు చిన్నతనంలోనే సమసిపోతాయి. అనుభవాల కారణంగా ఈ కణాలు తీరు మారుతుంది అంటే ఆశ్చర్యంగా వినిపించవచ్చు. చివరికి ఒక వయసు వచ్చేసరికి మెదడులో ఒక పద్ధతిలో మిగిలిపోతాయి. ఇది ప్రతి వ్యక్తిలోనూ ప్రత్యేకంగా ఉండే పరిస్థితి. ఇక ఆ మెదడు నుంచి వచ్చిన తరంగాలు, ఆలోచనలు కూడా అందుకు అనుగుణంగా ప్రత్యేకంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. విద్యుత్‌ను కూడా ఒక యంత్రం ద్వారా గుర్తించవచ్చు. అక్కడ కనిపించే తరంగాలలో కూడా తేడాలుంటాయి. వాటికి పరిశోధకులు వివరణ ఇస్తారు.
రామన్ పరాంజపే అనే పరిశోధకుడు కెనడాలో ఈ విషయంగా ప్రయోగాలు చేస్తున్నాడు. ఆయన 40 మందిని పోగేశారు. వారి మెదళ్లలోని ఆల్ఫా అలలను పరిశీలించాడు. వాటిలో పెద్ద ఎత్తున తేడాలు ఉండడం గమనించాడు. మరకొ పరిశోధనలో గామా ప్రకంపనలు అనే తరంగాలు కూడా పరిశోధనకు గురయ్యాయి. 100 మందిలో చేసిన ఈ పరిశోధనలు కొత్త విషయాలను తెలియజేశాయి. ఎవరికి వారిని నేరుగా గుర్తించడానికి వీలు కుదిరింది.
మెదడు పనితనంలో ఇంత తేడా ఉన్నందుకే మనుషుల ఆలోచనలలో, వారివారి వ్యక్తిత్వాలలో తేడాలు ఉంటాయేమో? ఈ విషయం కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. సంవత్సరాల తరబడి ఒక వ్యక్తి మెదడు మీద పరీక్షలు కొనసాగితే గాని మెదడు నుంచి వచ్చే తరంగాలలో తేడాల సంగతి చెప్పడం కుదరదు. ఈ రకంగా వివరాలు తెలిసే వరకు ఒక సంగతి మాత్రం మనం తెలుసుకోవచ్చు. మనుషుల మధ్యన తేడాలు చెప్పడానికి మనకు మరెన్నో ఆధారాలు ఉన్నాయి.

ఏ గట్టునుంటారు?

$
0
0

సంపన్నుల గురించి చాలా మంది ఆలోచనలు చిత్రంగా ఉంటాయి. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ కనిపించింది. ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఇల్లు కట్టిన అంబానీది, 80 గజాల స్థలంలో ఇల్లు కట్టిన నాదీ ఒకే దేశమా?
న్యూజిలాండ్‌లో షాపింగ్ కోసం 350 కోట్లతో చార్టర్డ్ ఫ్లైట్ కొన్న నీతూ అంబానీది, షాపింగ్ కోసం ఆటో ఎక్కాలా ? వద్దా అని ఆలోచించే మా అమ్మది ఒకే దేశమా?
సెవెన్ హిల్స్ హాస్పటల్‌లో ఐదు లక్షల బిల్లు కట్టి డెలివరీ అయిన ఐశ్వర్యారాయ్‌ది, నిర్మల ఆస్పత్రిలో ముక్కి ముక్కి ఐదువేల బిల్లు కట్టిన నా భార్యదీ ఒకే దేశమా?
ఇలా సాగుతుంది ప్రశ్నల పరంపర. చాలా మంది అంబానీ అలా ఎదిగిపోవడానికి, మనం సామాన్య జీవితం గడపడానికి కారణం ఈ వ్యవస్థ, ప్రభుత్వం లేక ఇంకోటి ఏదో అనుకుంటాం. ఇందులో మన పాత్ర ఏ మాత్రం ఉండదు వారి ఆలోచన ప్రకారం.
నిజానికి మన విజయంలో ఐనా పరాజయంలో ఐనా ప్రధాన పాత్ర మనదే. మన ఆలోచనలదే. మన మనసుదే. ఒక వ్యక్తి అంబానీగా ఎదిగినా, ఇల్లు గడవడానికే అప్పులు చేస్తూ బతికే అప్పుల అప్పారావుగా మిగిలిపోయినా దానికి మనమే కారణం అంతే కానీ కనిపించని దేవుడు, కనిపించే ప్రభుత్వాలు, వ్యవస్థలు ఎంత మాత్రం కారణం కానే కాదు. సమస్య నుంచి పారిపోయే వారు, ఎదుర్కోలేని వారు, బద్ధకస్తులు మాత్రమే కారణం తమది కాదు ఇంకెవరిదో అంటారు.
అంబానీ పెద్ద ఇల్ల్లు కట్టుకున్నా, కూతురు పెళ్లి వైభవంగా చేసినా మనం సహించలేం. అంబానీ చట్టవిరుద్ధంగా సంపాదిస్తే దాన్ని వ్యతిరేకించాలి కానీ సంపాదించడమే తప్పు అన్నట్టుగా వాదనలు ఉంటాయి.
మనం విలువలకు కట్టుబడి ఉన్నాం కాబట్టి సామాన్యులుగా ఉండిపోయాం. అంబానీ విలువలకు కట్టుబడి లేడు కాబట్టే సంపన్నుడు అయ్యాడు అనేది కొందరి వాదన. ఇలా వాదించే వారు తమను తాను మోసం చేసుకుంటున్నారు. ఇలాంటి వారి విషయంలో ఎవరైనా చేసేదేమీ లేదు.
ధీరూబాయ్ అంబానీ కూడా ఒకప్పుడు సాధారణ ఉద్యోగి. చిన్న ఉద్యోగంలో ఉన్నా ఆలోచనలు మాత్రం ఉన్నతం. చిన్న ఉద్యోగం చేసే రోజుల్లో కూడా ఏదో ఒక రోజు వ్యాపార సామ్రాజ్యం సృష్టించాలని కలలు కన్నాడు. వాస్తవం చేసుకున్నారు. దుబాయ్‌లో చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. ఇంటింటికి తిరిగి వస్తువులు అమ్మారు. ఏం చేస్తున్నా ఎప్పుడూ తన లక్ష్యం కళ్ల ముందు మెదులుతూనే ఉండేది.
సంపన్నులు సామాన్యులు ఆలోచించే తీరు వేరుగా ఉంటుంది.
సెల్‌ఫోన్‌లో నెట్‌వర్క్ సరిగా లేకపోతే మరో కంపెనీకి మారుదామని మనం ఆలోచిస్తాం. కానీ అంబానీ మాత్రం జియో నెట్ వర్క్‌ను ప్రారంభించాలని ఆలోచిస్తారు.
నిర్మా గుర్తుందా? గుజరాత్‌లోని ప్రభుత్వ ఉద్యోగి, కెమిస్ట్. కర్సన్‌బాయ్ పటేల్. ఇంటి నుంచి ఆఫీసుకు సైకిల్‌పై వెళ్లే సమయంలో, తిరిగి ఇంటికి వచ్చే సమయంలో నిర్మా పౌడర్‌లు అమ్ముతూ తన వ్యాపార ప్రస్థానం ప్రారంభించి. 15వేల మంది ఉద్యోగులు, 3550 కోట్ల రూపాయల టర్నోవర్‌కు వ్యాపారాన్ని విస్తరించాడు.
అంబానీలు, కర్సన్‌బాయ్‌లు, మన చట్టూ చాలా మందే ఉన్నారు. సైకిల్‌పై తిరిగి క్రేన్ వక్కపొడి అమ్మిన వారు, భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అంటూ సైకిల్‌పైనే ఇంటింటికి తిరిగి అగర్ బత్తీలు అమ్మిన వారు కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించారు. ఇలాంటి వారు మేం పేదరికంలో ఉండడానికి ఈ వ్యవస్థ, ఈ దేశమే కారణం ఆనే ఆలోచనలు చేయరు. సంపద కలిగి ఉండడం పాపం అనుకోరు. సంపన్నులను విలన్లుగా చూడరు. తాము పేదరికంలో ఉన్నా దానికి కారణం ఎవరూ కాదనని తామేనని, పేదరికం నుంచి బయట పడే మార్గం కూడా తమ వద్దనే ఉందని భావిస్తారు. భయటపడేందుకు కృషి చేస్తారు. విజయం సాధిస్తారు. కొన్ని కోట్ల మందికి, లక్షల మందికి ప్రేరణగా నిలుస్తారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తారు. ఇలాంటి విజేతలు ఎంతో మంది మన చుట్టూ ఉన్నారు. అలాంటి వారి నుంచి ప్రేరణ పొందవచ్చు అంతే తప్ప సంపన్నులను విలన్లుగా చూడాల్సిన అవసరం లేదు.
ఆఫీసు నుంచి రాగానే టీవిలో అత్తా ఒకింటి కోడలే సీరియల్ చూస్తే ఎదగం. క్రికెట్ కబుర్లు, సినిమా కబుర్లు, రాజకీయ కబుర్లతో కాసేపు కాలక్షేపం కావచ్చు. కానీ జీవితంలో ఎదిగే అవకాశం ఉండదు. ఉద్యోగంలో ఎప్పుడు ఇంక్రిమెంట్ వస్తుందా? ప్రమోషన్ వస్తుందా? అనే ఆలోచన కన్నా తన పరిస్థితి మెరుగు పరుచుకునే మంత్రం తన వద్దనే ఉందని గ్రహించడం వల్లనే ఎంతో మంది చిరుద్యోగం నుంచి వ్యాపార సామ్రాజ్యాలను స్థాపించే స్థాయికి ఎదుగుతున్నారు. మంత్రాలు, మాయలు, యంత్రాలు చేసేదేమీ ఉండదు. మన చేతి చమురు వదలడం తప్ప మనను విజయతీరాలకు చేర్చే శక్తి మనలోనే ఉందని గుర్తించాలి.
ఏ క్రికెటర్ పుట్టిన రోజు ఎప్పుడో కొంత మంది అడగ్గానే చెప్పేస్తారు. హీరోయిన్ పుట్టుమచ్చలు. హీరోల పుట్టిన రోజులు గుర్తుంచుకోవడానికి ఖర్చు చేసే సమయాన్ని మనం విజయం కోసం మనం ఖర్చు పెట్టుకోవడం అవసరం.
ఏ సినిమా ఎన్ని రోజులు నడిచింది, ఏ సినిమాలో ఏ హీరోయిన్ ఎన్ని చీరలు మార్చింది మన కెందుకు. మన జీవితం ఎలా మారుతుంది ఆలోచిస్తే ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ముందు ఆలోచించడం ప్రారంభిద్దాం.
అంబానీ గురించి మనం గంటల తరబడి చర్చించుకున్నా, మన గురించి అతను ఒక్క క్షణం కూడా ఆలోచించడు. తన సమయం ఎంత విలువైందో అంబానీకి తెలుసు. అది తెలియంది మనకే. తెలుసుకున్న రోజు మనమూ ఎదుగుతాం. పేదరికం నుంచి సంపన్నత వైపు పయనించే ఆలోచనల గట్టుమీద ఉంటారా? పేదరికానికి వ్యవస్థలు, దేవుడు, కనిపించని శక్తులే కారణం అనే ఉపయోగం లేని భావాలా గట్టున ఉంటారా? మీ ఇష్టం.

గత వైభవ చిహ్నం ఆకాశవాణి

$
0
0

వ్యవస్థలకు గుర్తింపు లభించేది ఎప్పుడైనా, ఎక్కడైనా అందులో పనిచేసే వ్యక్తుల వల్లే. ప్రభుత్వాధీనంలో కొన్ని బ్రహ్మ పదార్థంలా కనిపించే సంస్థలుంటాయి. ఎవరెవరు డైరెక్టర్లో, ఎవరికి మరెవరు సహాయకులో తెలియదు.
కానీ మిగతా వాటితోబాటు, వారు కూడా సకల సౌకర్యాలూ అనుభవిస్తూనే ఉంటారు. కానీ ప్రజల కోసం, ప్రజల మధ్య వుండే కొన్ని ప్రచార మాధ్యమాలున్నాయి. ప్రసార మాధ్యమాలున్నాయి. అందులో పనిచేసే వ్యక్తులకు జవాబుదారీతనం సహజంగానే ఉంటుంది. వుండాలి. తప్పించుకు తిరుగువాడు ధన్యుడనుకోవడానికి వీలుండదు. ప్రచార ప్రసార వ్యవస్థలలో ‘సృజనాత్మకత’ బ్రహ్మపదార్థంలా కనిపిస్తుంది. కానీ ఇదే ఓ ప్రత్యేకమైన అర్హత.
ఇది లేని ప్రసారాలకు వ్యక్తిత్వం, గుర్తింపులంటూ వుండవు. సృజనాత్మకత అంటూ లేకుండా, వినకేం చేస్తారనే ధైర్యంతో చేసే కార్యక్రమాల వల్ల ప్రయోజనం ఉండదు. ఉదాహరణకు గర్భిణీలు తీసుకోవలసిన జాగ్రత్తలు.. పశువుల్లో గర్భకోశ వ్యాధులు, నివారణ చికిత్స.. అసంఘటిత కార్మికుల సమస్యలు - పరిష్కారాలు, వరిలో దోమపోటు, నివారణ.. పశువుల్లో గాలికుంటు వ్యాధి - నివారణ, వర్షాకాలంలో సాధారణంగా వచ్చే వ్యాధులు - చికిత్స.. వినియోగదారుల సమస్యలు - పరిష్కారాలు లాటివన్నీ ఉపయోగపడేవే కావచ్చు. ఐనా అందరూ, ఆసక్తిగా అన్ని పనులూ మానేసి రేడియో ముందే కూర్చుని శ్రద్ధగా వింటారనుకోవడానికి వీలులేదు. వినాలనిపించేలా చెప్పగలిగే నేర్పుంటేనే సంబంధం లేని ఏ విషయమైనా శ్రోతలు వింటారు. ఏం మాట్లాడుతున్నారు? అన్నది ప్రధానం కాదు. ఎంత ఆకర్షణగా చెబుతున్నారనే దాని మీదే ప్రసార వ్యవస్థ నడుస్తుంది. పేజీల కొద్దీ రాసేసి మైకు ముందు చదివేస్తే వినేదెవరు? విజయవాడ రేడియో కేంద్రం నుండి ఎన్నో దశాబ్దాలుగా ప్రసారమయ్యే కార్యక్రమం ‘కార్మికుల కార్యక్రమం’. మధ్యాహ్నం తెలుగు వార్తలైన తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు ఒక వాద్య బృంద సంగీతం 30 సెకన్లపాటు వినిపిస్తుంది. దీనికి రూపకల్పన కొన్ని దశాబ్దాల క్రితం ఈ వేళ సినీ సంగీత దర్శకుడైన మాధవపెద్ది సురేష్, సర్రాజు (ప్రసన్నకుమార్) కలిసి రూపొందించారు. ఈ క్షణం వరకూ అదే కొనసాగుతోంది.
కార్మికుల కార్యక్రమం అనగానే ఏ వ్యవసాయ కార్మికులకు సంబంధించినవో, గని కార్మికుల కోసమో, నేత పనివారికో సంబంధించే వుంటాయి. రేడియో సెట్ల ముందు అందరూ శ్రద్ధగా వినకపోయినా మధ్య మధ్యలో వినిపించే సినిమా పాటల కోసమే చాతక పక్షుల్లా వినేవారు.
హరికథ గానంలో ప్రసిద్ధుడై, జానపద గీతాలు రక్తిగా పాడగలిగిన ప్రయాగ నరసింహశాస్ర్తీ ఆ రోజుల్లో అన్ని విషయాలపై సమగ్రంగా మాట్లాడగలిగే ప్రజ్ఞా సామర్థ్యాలున్న వ్యక్తి. రేడియోలో ప్రొడ్యూసర్. వారానికోసారి ‘వినోదాల వీరయ్య’ అనే కార్యక్రమంలో కార్మికులకు సంబంధించిన ఎనె్నన్నో విషయాలను ఆకర్షణీయంగా మలిచి తన వాక్చాతుర్యంతో మధ్యమధ్యలో ఖుషీ ఖుషీగా నాలుగు పాటలు తాను పాడుతూ, అప్పటికప్పుడు కనిపించిన కళాకారులను స్టూడియోలోకి పిలిచి, వారిచేత పాడించేసి, అరగంట కార్యక్రమం అర నిమిషంలో అయిపోయిందా - అనిపించేలా నిర్వహించటం నా ప్రత్యక్ష అనుభవం.
‘వినోదాల వీరయ్య’ పేరు చెప్పి జటిలంగా వుండి, వినే ఆసక్తిలేని విషయాలను చాకచక్యంగా చెప్పే శాస్ర్తీగారికి ఆ రోజుల్లో ఎంతో పేరు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో వఠెం సత్యనారాయణ, శ్రీమతి రతన్ ప్రసాద్‌లు ఎనౌన్సర్లుగా పనిచేస్తూ, ‘ఏకాంబరం, చిన్నక్క’లుగా అవతారాలెత్తి శ్రోతలకు విసుగు తెప్పించకుండా, మధ్యమధ్యలో రెండు సినిమా పాటలను జతచేసి, ఆ కార్యక్రమం శ్రద్ధగా వినేలా చేసిన ఘనులు. వీరిద్దర్నీ అనుసంధానం చేస్తూ జీడిగుంట రామచంద్రమూర్తి ‘బాలయ్య’గా ఎనె్నన్నో విషయాలు మాట్లాడేవారు. శ్రోతలు అత్యంత ఆసక్తిగా వింటూండేవారు.
ఆ రోజుల్లో ఆకాశవాణి కేంద్రం సందర్శించేవారు ఈ ముగ్గుర్నీ చూడకుండా వెళ్లేవారు కాదంటే, వీరికున్న పాపులారిటీ ఎంతో అర్థమవుతుంది. కేవలం వాక్కు వల్ల పది మంది నోళ్లల్లోనూ తిరిగిన ఆనాటి రేడియో కళాకారులకు సినీ నటులకున్నంత క్రేజ్ వుండేదంటే అతిశయోక్తి కాదు.
వెనుకటి తరంలో పద్య నాటకానికి ప్రాణం పోసి కీర్తి గడించిన పౌరాణిక నాటక రంగస్థల నటుడు కపిలవాయి రామనాథశాస్ర్తీ మేనల్లుడుగా, కైకాల సత్యనారాయణ (సినీ నటుడు) సహాధ్యాయిగా, పెండ్యాల నాగేశ్వర్రావుకు బావమరదిగా సుపరిచితుడైన వఠెం సత్యనారాయణ 1964లో హైదరాబాద్ రేడియో కేంద్రంలో ఒక అనౌన్సర్‌గా చేరి, ‘ఏకాంబరం’గా కార్మికుల కార్యక్రమాన్ని అసంఖ్యాక శ్రోతలు ఆసక్తిగా వినేలా చేసిన మాటల మాంత్రికుడు. ‘హల్లో ఏకాంబరం’ అంటూ పలకరిస్తూ ఓ మధ్యతరగతి విరుపుతో సునిశితమైన విషయాలను, సున్నితమైన వినోదంతో జతగూర్చి, నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు వాకిళ్లల్లో ‘చిన్నక్క’గా నిలిచిన ‘రతన్‌ప్రసాద్’ మంచి నటి. సంగీత సాహిత్యాభిరుచి కలిగి పాట, మాట రెండూ అలవోకగా అలవాటైన అరుదైన కళాకారిణి. ఆ రోజుల్లో పెద్దబాబుగా ఉషశ్రీ ‘కృష్ణయ్య’గా తురగా కృష్ణమోహన్, రతన్ ప్రసాద్ రమణక్కలుగా ‘కార్మికుల కార్యక్రమాన్ని’ అత్యంత ఆసక్తితో నిర్వహించటం నేనెరుగుదును.
రేడియో కేంద్రంలో వీరి వృత్తులు వేరు. కాని అంతర్గతంగా వీరిలో సహజంగా వున్న అభిరుచుల కారణంగా వీరి ప్రజ్ఞా పాటవాలను ఆకాశవాణి చక్కగా వినియోగించుకుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటంలో ఈ కళాకారులు సఫలీకృతులయ్యారు.
* * *
నాకు తెలిసినంత వరకూ రేడియోలో ప్రసారమయ్యే కార్యక్రమా లన్నింటికీ బాధ్యత వహించేవారు రెండు రకాలుగా వుంటారు. ఒకరు కార్యక్రమ నిర్వాహకులు, రెండవ వారు సాంకేతిక పరమైన విషయాలను చూసే ఇంజనీరింగ్ అధికారులు - అంతా తెర వెనుక వుండేవారే.
శ్రోతలతో ప్రత్యక్ష పరిచయం కాగలవారు, అందులోని కళాకారులే (స్టాప్ ఆర్టిస్టులు) నేను రేడియోను విడిచి 18 ఏళ్లైంది. ఆనాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎఫ్‌ఎం స్టేషన్లు, మరెన్నో ప్రైవేటు ఎంఎఫ్ కేంద్రాలు ఆవిర్భవించాయి. శ్రోతల అభిరుచులు మారాయి. రేడియో ప్రసార భారతి అయ్యింది. పాతకాలంలో ఆలిండియా రేడియోకుండే వైభవం తగ్గింది. వినే ఓపిక లేదు. సమస్తం కంటికి కనిపించేస్తున్నాయి. అన్నీ కరతలామలకం అయిపోయి, చూడవలసిన వాటి కంటే, చూడకూడనివి, బాహాటంగా దర్శించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేసింది. రేడియో అవసరం గణనీయంగా తగ్గింది. వారం వారం రేడియో కార్యక్రమాల తీరుతెన్నులపై, ఆర్‌ఎం చల్లా (చల్లా రాధాకృష్ణమూర్తి) రాజమండ్రి నుండి ఎప్పటికప్పుడు ప్రతి కార్యక్రమంపై తనదైన శైలిలో విశే్లషిస్తూ దోషాలను నిర్భయంగా ఎత్తిచూపేవాడు. ఇప్పుడా అవసరం లేదు. పత్రికలలో, రేడియో కార్యక్రమాల వివరాలు ప్రచురింపబడేవి. ఆకాశవాణి ప్రసారమైన ప్రముఖుల ప్రసంగాల నుండి కొన్ని భాగాలను ప్రచురిస్తూ కళాకారుల ముఖచిత్రాలతో ఎంతో ఆకర్షణీయంగా ‘వాణి’ అనే పత్రిక వెలువడేది. ఇప్పుడా వైభవం కాస్తా మరుగైంది. టీవీ ఛానళ్లతో పోటీ పడగల సత్తా కలిగిన మేధావులు ఈ వేళ రేడియోలో ఎందరున్నారు? ఒకరో, ఇద్దరో వున్నా, వారికి దన్నుగా ఆర్థిక వనరులు లేవు. దూరదర్శన్ కేంద్రాల పరిస్థితి కూడా దీనికి భిన్నం కాదు.
కోట్లాది రూపాయలు విలువైన స్థిర చరాస్తులు కలిగిన ఈ ప్రసార మాధ్యమాల పరిస్థితి ట్రాఫిక్ జాంలో ఇరుక్కున్నట్లుండి ప్రసార వ్యవస్థల ఉనికే ప్రశ్నార్థకమై కూర్చుంది. మార్పు కోసం వేచి చూడాలి.

పజిల్-704

$
0
0

అడ్డం ( ఆధారాలు )

---------------------------------------------------------------------------
1.గాడిద గొంతు (5)
5.‘ఇవే మన పద్యాలు’ అని చెప్పుకోగల పద్యాలు రాసిన కవి (3)
6.ఆయుర్వేదం, అలోపతీ, హోమియోలలాగా మరో చికిత్సా విధానం. ఇందులో నేటి సినీ నటుడు (5)
8.ఏనుగు (3)
10.తెల్లవారుఝాము (3)
13.తనంత తాను (2)
14.నిలువు 11ని సరిజేస్తే, తలదాల్చే పత్రం (3)
15.పంచదార (3)
16.ఆకర్ణించము (2)
17.తామర (3)
19.ఇది ‘హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ’ ఏదైనా సమ్‌మతమే! (3)
21.వార్తల్లో వాయుగుండాలకి ప్రసిద్ధి (5)
23.నూలు వడికే చేతి పనిముట్టు (3)
24.కన్నప్రేమ (5)

----------------------------------------------------------------
నిలువు

1.విశ్వామిత్రుడు (4)
2.సోదరి (3)
3.త్రికరణశుద్ధిగా అంటే ‘....’ వాచా కర్మణా అని అర్థం (3)
4.ముడి లోహం (3)
7.దేవుడికి సమర్పించే ఆరగింపు. కింది నించి పైకి (3)
9.నంద్యాల దగ్గర ప్రసిద్ధ శివక్షేత్రం. మహాఆనందం కలిగిస్తుందా? (4)
11.మొహం (3)
12.విచక్షణా రహితమైన మారణకాండ (4)
13.ఎన్టీఆర్ పేరులో నక్షత్రం (3)
16.ఆలస్యం (3)
18.స్వేచ్ఛ (4)
19.ఇది ‘మంచిదే’ అని ఒక ప్రకటన (3)
20.తిరగబడిన కారణం. నాజూకు కాదు (3)
22.విశాలమైన, విలాసవంతమైన ఇల్లు వెనక నించి (3)


‘పైల్స్’పై ఎనె్నన్నో అపోహలు

$
0
0

రఘు ఒక సాధారణ మధ్యతరగతి ఉద్యోగి. ప్రతి రూపాయిని నాలుగైదుసార్లు ఆలోచించుకొని మరీ ఖర్చు చేస్తాడు. ఒకరోజు అకస్మాత్తుగా అతని మల విసర్జనలో రక్తం కనిపించింది. వేడి చేసిందేమోనని కొబ్బరిబోండాం తాగాడు. మరుసటి రోజు కూడా రక్తస్రావం కలగటంతో తన ఇంటి దగ్గరలోని మందుల షాపు వ్యక్తిని కలిసి తన సమస్య చెప్పాడు. కంగారు పడనవసరం లేదు. ఇది పైల్స్ అని మందుల షాపు అతను ఏవో బిళ్లలు ఇచ్చాడు. కొన్ని రోజులు బాగానే తగ్గినట్లు అనిపించినా మరలా రెండు నెలలకి తిరిగి అదే సమస్య. మళ్లీ ఏవో మందులు తెచ్చుకోవటం వాడటం. ఇలా ఒక సంవత్సరం తర్వాత కూడా మలవిసర్జనలో రక్తం వస్తూనే ఉండటంతో స్పెషలిస్ట్‌ని కలిస్తే సమస్య పైల్స్ కాదని, పెద్ద పేగు కేన్సర్ అని తెలిసింది. సమస్య మొదలైనప్పుడే వచ్చి ఉంటే జబ్బు పూర్తిగా నయం చేసే అవకాశం ఉండేదని, ఇప్పుడేమీ చేయలేమని డాక్టర్లు చేతులెత్తేసారు.
* * *
రాధిక ఒక గృహిణి. ఈ మధ్యే పెళ్లి చేసుకొని అత్తవారింట అడుగు పెట్టింది. వారం క్రితం మల విసర్జన సమయంలో నొప్పి వచ్చింది. పెద్దగా పట్టించుకోలేదు. రెండో రోజు మరింత నొప్పి దానితోపాటు రక్తం కూడా పడింది. ఇంటి చిట్కాలు ప్రయత్నించింది అయినా తగ్గలేదు. పైగా నొప్పి ఎక్కువ కాసాగింది. భర్తకి చెబితే ఏమనుకొంటాడో అని, పోనీ అత్తగారికి చెబుదామా అంటే రోగిష్ఠి అమ్మాయిని కోడలుగా పంపించారని ఎక్కడంటారో అని భయంతో ఎవరికీ చెప్పకుండా బాధ పడుతోంది. రోజూ విరేచనానికి వెళ్లాలంటే భయం. ఆ భయంతో తినడం తగ్గించేసింది. కొన్ని రోజుల్లోనే కొత్త పెళ్లికూడురు కాస్తా పెళ్లికళ పోయి రోగిష్టిలా కనిపించసాగింది.
* * *
రమేష్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. తన ఆరోగ్యం పట్ల మంచి శ్రద్ధ తీసుకొంటాడు. ఒకరోజు మలద్వారం వద్ద ఒక వేడిపొక్కు రావటం.. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నాడు. మరల రెండు నెలలు తిరిగేసరికి మరింత పెద్ద గడ్డ రావడంతో పెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి వెళితే అది ఫిస్టులా అని మరలా ఆపరేషన్ చేశారు. అంతే. ఆ ఆపరేషన్ తర్వాత నుంచి మలవిసర్జనపై నియంత్రణ కోల్పోయి తనకు తెలియకుండానే విరేచనం బట్టల్లో అయిపోవడం మొదలయింది. అది ఫిస్టులా ఆపరేషన్ వల్ల కలిగిన కాంప్లికేషన్ అని, నయం అయ్యే అవకాశం లేదని తెలిసి క్రమంగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు.
...ఇవి కథలు కావు. నిజమైన మానసిక వ్యధలు. మన నగరంలో మన ఊరిలో మన సందులో కూడా ఎందరో ఇలా బాధ పడుతున్నారంటే అది అతిశయోక్తి కాదు.
పైన చెప్పిన మూడు కేసుల్లోనూ బాధ వర్ణనాతీతం.
వీటికి ప్రధాన కారణం - రోగం పట్ల అవగాహనా లోపం. బయటికి చెప్పుకోవాలంటే ఉండే బిడియం. చికిత్సా ప్రక్రియల గురించి సరిగా తెలియకపోవడం.
పైన చెప్పిన మూడు ఉదాహరణలు మూడు రకాల రోగాలైనా చాలామందికి ఆసన ప్రాంతంలో వచ్చే అన్ని వ్యాధులూ ‘పైల్స్’ అని ఒక బలమైన మూఢ నమ్మకం.
నేటి మారుతున్న పరిస్థితుల్లో జనానికి తమ ఆరోగ్యం పట్ల స్పృహ మరియు అవగాహన పెరుగుతోంది. ఇది సంతోషించదగ్గ విషయమే. కానీ ఈ స్పృహ కొన్ని వ్యాధుల వద్దే ఆగిపోతోంది.
ప్రతి పది వేల మందిలో ఒకరికి వచ్చే కేన్సర్ గురించి, వేయి మందిలో ఒకరికి వచ్చే గుండెనొప్పి గురించి, వంద మందిలో ఒకరికి వచ్చే షుగర్ వ్యాధి గురించి మాట్లాడుకుంటున్నారు. చర్చించుకుంటున్నారు. అవి రాకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు కానీ...
ప్రతి పది మందిలో ఎనిమిది మందిని, జీవితంలో ఏదో ఒక దశలో ఇబ్బంది పెట్టే ఆర్ష మొలలు (మొలలు, మూల రోగం) ఫిజర్, ఫిస్టులా వంటి సమస్యల గురించి మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి బదులు మందుల షాపులకు వెళుతున్నారు.
సొంత వైద్యాలు చేసుకుంటూ గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తెచ్చుకొంటున్నారు. సిగ్గుతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొందరు దొంగ డాక్టర్ల బారిన పడుతుంటే, మరి కొందరు ఆపరేషన్లు చేయించుకున్నా ఫలితం లేక మరలా వ్యాధి బారిన పడుతున్నారు. ఆపరేషన్ల మూలాన వచ్చే విపరిణామాలతో ఇబ్బంది పడుతున్న వారు కొందరైతే సిగ్గుతో వ్యాధిని తీవ్రతరం చేసుకొంటున్న వారు మరికొందరు. దీనిని ఆపాలి.
మొలలు కూడా జ్వరం లాంటి ఒక సాధారణ సమస్యే అని అందరూ గుర్తించాలి.
విరేచనం సాఫీగా జరగాలంటే ఏమి చేయాలో ప్రతి కుటుంబం తెలుసుకోవాలి.
అసలు ఈ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి?
మనకు మారుతున్న జీవన శైలి అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడుతోంది.
జనం సమయానికి తినడం లేదు సమయానికి నిద్ర పోవడం లేదు.
అర్ధరాత్రి బఫెలు పెరుగుతున్నాయి.
ఎంతో కాలంగా తింటూ వచ్చిన వంటల స్థానాన్ని ఫాస్ట్ఫుడ్ ఆక్రమిస్తోంది.
చిన్నపిల్లల చేతుల్లో లేస్, కుర్కురేలు పెరుగుతున్నాయి.
అర్ధరాత్రి ఉద్యోగాలు బయలాజికల్ క్లాక్‌ని డిస్టర్బ్ చేస్తున్నాయి.
ఓ వైపు మన ఫోన్లు స్మార్ట్ అవుతోన్న కొద్దీ ఇంకోవేపు మన శరీర వ్యవస్థలు మందగిస్తున్నాయి. ప్రధానంగా జీర్ణ వ్యవస్థ మందగిస్తోంది.
శారీరక శ్రమ లేని గంటలకొద్దీ కూర్చుని చేసే ఉద్యోగాలు.. ఇలా ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చు.
మొలలను ఎలా గుర్తించాలి?
1.మల విసర్జనలో నొప్పి లేని రక్తస్రావం
2.రక్తం పిచికారీ కొట్టినట్లు చింది కొట్టడం.
3.రక్తం ఎర్రగా తాజాగా ఉండటం.
4.మల ద్వారం వద్ద ఏదో బయటకు వచ్చినట్లు అవడం
5.కొన్నిసార్లు మల ద్వారంలోంచి జిగురు వంటి స్రావం రావటం
6.మల ద్వారం వద్ద దురద.
మొలలు ఎన్ని రకాలు?
ఇవి రెండు రకాలు - 1.బాహ్య మొలలు 2.అభ్యంతర మొలలు లేదా లోపలి మొలలు.
ఎప్పుడూ బయటకే ఉండే మొలలు బాహ్య మొలలు. ఇవి మల ద్వారం వద్ద చర్మం రంగులోనే ఉంటాయి. వీటి నుండి ఎటువంటి రక్తస్రావం ఉండదు కానీ బాగా ముక్కడం వలన ఇందులో రక్తం గూడు కట్టినట్లు అయ్యి అప్పుడప్పుడూ బాగా నొప్పి వస్తూంటుంది.
లోపలి మొలలు - ఇవి నొప్పి కలిగించవు. సైజులో పెద్దవి అయ్యే కొద్దీ ఇవి ఆసన ప్రాంతం నుండి బయటకు వస్తాయి. ఇవి వాటి స్టేజిని బట్టి మరలా నాలుగు రకాలు.
మొదటి స్టేజి: ఇందులో మొలలు బయటకి కనిపించవు. కేవలం రక్తస్రావం ద్వారా మాత్రమే తెలుస్తుంది. వీటికి ఆపరేషన్లు కూడా అవసరం లేదు. కేవలం జీవన శైలిని మార్చడం ద్వారా సరి చేయవచ్చు.
రెండవ స్టేజి: ఇందులో మల విసర్జన సమయంలో మొలలు కొంచెం కిందికి వచ్చి మరల వాటంతట అవే లోపలికి వెళ్లిపోతాయి. మల ద్వారాన్ని శుభ్రం చేసుకునేప్పుడు చేతికి తగులుతాయి.
మూడవ స్టేజి: మల విసర్జన సమయంలో పెరిగిన మొలలు బయటకు వస్తాయి. మరలా చేయి పెట్టి లోపలికి పంపితే తప్ప ఇవి లోపలికి పోవు.
నాల్గవ స్టేజి: మొదటి మూడు స్టేజీలనూ అశ్రద్ధ చేసినట్లయితే జబ్బు నాల్గవ స్టేజిలోకి పోతుంది. ఈ స్థితిలో లోపలికి మొలలు పూర్తిగా బయటకి వచ్చేసి అలాగే ఉండిపోతాయి.
ఈ స్టేజిలో కూడా అశ్రద్ధ చేస్తే అక్కడ ఇన్‌ఫెక్షన్ దాని నుంచి ప్రమాదకరమైన పరిణామాలు కలుగుతాయి.
మొలలు రావడానికి కారణాలు:
మొలలు పెరగడానికి మొట్టమొదటి కారణం మలబద్దకం.
మనలో చాలామందికి మలబద్దకం ఉందని కూడా తెలియదు.
1.ఆహారంలో కారాలు, మసాలాలు, పచ్చళ్ల వినియోగం పెరగడం.
2.అధిక మాంసాహార వినియోగం
3.నీళ్లు సరిపడా తాగకపోవటం
4.ఫైబర్ ఉండే ఆకుకూరలు కాయగూరలు తీసుకోకపోవడం
5.దాహాన్ని పెంచే వేపుళ్లు వంటి పదార్థాలు ఎక్కువగా వాడటం.
6.ఎక్కువగా కూర్చుని ఉండటం.
7.ఎక్కువసేపు బాత్రూం కమోడ్‌పైన గడపడం.
8.అధికంగా ప్రయాణాలు చేయడం
ఇవి కాక గర్భిణీలకు కడుపులో పెరిగే వత్తిడి వలన కూడా మొలలు వస్తాయి.
మనం ఏం చేయాలి?
బాత్రూంలోకి ఫోన్ వద్దే వద్దు. ఈ మధ్య చాలామందికి బాత్రూంలో కూర్చుని ఫోన్‌ని వాడటం ఎక్కువైంది.
దీని వలన తెలియకుండానే కాలం గడిచిపోతుంది. ఎక్కువసేపు అదే పొజిషన్‌లో ఉంటూ ఉంటే మొలలు పెరుగుతాయి.
మరి కొందరు పిల్లలు ఫోన్‌తో ఆడుకొంటూ మోషన్‌కి వెళ్లాలన్న ఆలోచనని కూడా ఆపేసుకొంటున్నారు. వాళ్లను సరి చెయ్యాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
మల విసర్జనకు ఎప్పుడు వెళ్లాలి?
మన దేశంలో దీనిపై ఉన్నన్ని మూఢ నమ్మకాలు మరెందులోనూ లేవు.
కొందరు ఉదయం మాత్రమే వెళ్లాలని, తిన్న తర్వాత వెళ్లకూడదని, అలా చేస్తే తిన్నది వొంటికి పట్టదని అంటూంటారు. కానీ అది వాస్తవం కాదు. నిద్ర లేవగానే వచ్చే ఆర్థోకోలిక్ రిప్లెక్స్ తినగానే వచ్చే గ్యాస్ట్రో కోలిక్ రిప్లెక్స్ పూర్తిగా సహజమైనవి.
ఆయుర్వేదం ఏమంటుందంటే ‘వేగో న ధారయేత్’. అంటే మనకి ఎప్పుడు మల విసర్జన చేయాలని అనిపిస్తుందో అప్పుడు వెళ్లాల్సిందే.
ఎందుకంటే మనకు వచ్చే మలాన్ని ఆపినట్లైతే అది రెక్టమ్ అనే పెద్ద పేగులో ఉండిపోతుంది. పెద్ద పేగులో మలం నుండి నీరు వెనక్కి తీసుకోబడుతుంది. దాని వలన మలం గట్టిగా తయారవుతుంది. దానిని బయటకు పంపించడానికి మరింత ముక్కవలసి రావడంతో మొలలు పెరుగుతాయి.
కొన్ని పరిస్థితులు మన దేశంలో మారాలి.
పిల్లలకి సరిపోయినన్ని మరుగుదొడ్లు ప్రతి పాఠశాలలో లేవు. ఉన్నచోట్ల కూడా పిల్లలు ఎప్పుడు వెళ్లాలంటే అప్పుడు ఉపాధ్యాయులు పంపించని పరిస్థితులు మన దగ్గరే ఉన్నాయి.
ఉపాధ్యాయుల పరిస్థితి ఇంకా దారుణం. మహిళా టీచర్లయితే మరీ దారుణం.
మరుగుదొడ్లు లేని పాఠశాలల్లో పనిచేసే వారు ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి రోజూ ఉదయానే్న దొడ్లో కూర్చుని మల విసర్జనకై రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా బలవంతంగా ముక్కడం కూడా మొలలు పెరగడానికి దారి తీస్తుంది.
ఇదే పరిస్థితి బాత్రూం లేని చిన్నచిన్న వ్యాపారులకు, ఉద్యోగులకు కూడా ఉంటోంది.
బహిరంగ మల విసర్జన కూడా ఒక కారణమే. ఇప్పటికీ మరుగుదొడ్లు లేని ఇళ్లు ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు. కొన్ని ఊళ్లలో అందరికీ మరుగుదొడ్లు ఉన్నప్పటికీ వాటిని ఎంతమంది వాడుతున్నారన్నది ప్రశ్న.
దీనికి కూడా అనేక కారణాలు ఉన్నాయని ప్రముఖ ప్రోక్టలోజిస్ట్ డాక్టర్ పరమేశ్వర్ సీఎం చేసిన విస్తృత సర్వే తెలియజేస్తుంది.
బహిరంగ మల విసర్జనకి వెళ్లే వారు ప్రధానంగా చీకటి పడ్డాక గాని, లేదా తెల్లవారుజామున వెలుతురు రాకముందే బహిర్భూమికి వెళతారు. పలు కారణాల వల్ల వాళ్లు భయంభయంగా మలవిసర్జన చేసి చీకట్లోనే ఇంటికొస్తారు. ఇది అసంపూర్తి మల విసర్జనకు దారి తీస్తుందని, అది పెద్దపేగులోనే గట్టి పడిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అర్శ మొలలు పెరగడానికి ఇది ప్రధాన కారణమని చెప్పవచ్చు.
ఇంకో ప్రధాన కారణం మన వెస్ట్రన్ కమోడ్. మన పూర్వీకులు అందరూ కొన్ని వందల సంవత్సరాలుగా నేలపై కూర్చుని మల విసర్జన చేస్తున్నారు. అయితే 1890లో వెస్ట్రన్ కమోడ్ ప్రవేశంతో దీనిని వాడేవారు పెరిగారు. మోకాళ్ల నొప్పుల మూలాన కూడా ఈ కమోడ్ వాడకం పెరిగిపోయింది. ఇప్పుడు దాదాపు ప్రతి ఇంటిలోనూ ఇదే వినియోగంలో ఉంది. అయితే దీని వలన పూబో రెక్టాలిస్ కండరం రిలాక్స్ అవక పేగు సరైన యాంగిల్‌లో ఉండక పూర్తిగా మల విసర్జన అవదు. దీనిని మార్చడానికి వెస్ట్రన్ కమోడ్ వాడేటప్పుడు కాళ్ల కింద స్టూలేసుకుంటే మంచి ఫలితాలనిస్తుంది.
చికిత్సలు ఎలా?
మొదటి స్టేజీలో జీవన శైలి మార్పు సరిపోతుంది.
నాల్గవ స్టేజీలో శస్త్ర చికిత్స అవసరం అవుతుంది.
రెండవ మూడవ స్టేజీలో ఇప్పుడు చాలా చికిత్సా పద్ధతులు లభిస్తున్నాయి.
మొలలకి రబ్బర్ బ్యాండ్ వేసి తొలగించే రబ్బర్ బాండింగ్. ఇంజక్షన్ ఇచ్చి చేసే స్క్లీరో థెరపీ. ఇన్ఫ్రారెడ్ పద్ధతిలో నయం చేసే ఐఆర్‌సి. మూడవ స్టేజీలో స్టాప్లర్ పద్ధతి. రక్తస్రావం అరికట్టే డిజిహెచ్‌ఎఎల్ పద్ధతి. ఇంకా లేజర్ ద్వారా చేసే చికిత్సలు.. ఇలా చాలా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
ఆయుర్వేదం ఏమంటోంది?
ఆయుర్వేదం మొలల చికిత్సని నాలుగు రకాలుగా చెబుతోంది.
భేషజ చికిత్స: మొదటి స్టేజీలోనే వాటికి మందులు.
క్షార చికిత్స: రెండవ స్టేజీ నుంచి నాల్గవ స్టేజీ వరకు ఉన్న లోపలి మొలలని ఈ చికిత్స ద్వారా నయం చేయవచ్చు.
అగ్ని చికిత్స: బయట ఉన్న మొలలను ప్రత్యేక పరికరాల ద్వారా తొలగించే చికిత్స ఇది.
శస్త్ర చికిత్స: నాల్గవ స్టేజీలో ఉన్న మొలలను శస్తచ్రికిత్స ద్వారా తొలగించాలని మొట్టమొదటి సర్జన్, శస్త్ర చికిత్సా పితామహుడు ఆచార్య సుశ్రుతుడు వెయ్యి సంవత్సరాల క్రితమే చెప్పాడు. వీటిల్లో ఇప్పటి పరిస్థితుల్లో ఇతర చికిత్సా విధానాలతో పోలిస్తే క్షార చికిత్స మానవాళికి లభించిన ఒక మహత్తర చికిత్సా విధానంగా భావించవచ్చు.
ఏమిటీ క్షార చికిత్స?
మొక్కల నుంచి తయారుచేసిన ఒకానొక ప్రత్యేక మందుని (తీక్షణ క్షారం)ని ఆర్శమొలలపై లేపనంగా రాసి మొలలు పోయేలా చేసే పద్ధతే ఈ చికిత్సా విధానం.
ఈ పద్ధతిలో రోగిని పడుకోబెట్టి అవసరమైన మత్తుమందు ఇచ్చి పెరిగి ఉన్న అర్శ మొలలని ప్రత్యేక పరికరంతో పట్టుకుని దానికి తీక్షణ క్షారము పట్టించి ఒక నిమిషం (100 మాత్రల కాలం) ఉంచి తీసివేస్తారు. దీని వలన మొలలలోని రక్తం వెంటనే గడ్డ కడుతుంది. రక్తంలోని హిమోగ్లోబిన్ హీమ్ మరియు గ్లోబిన్‌గా విడిపోతుంది. నెమ్మదిగా స్రావంగా వచ్చేస్తుంది. క్షార కర్మ వలన మొలలు పూర్తిగా పోయి ఆ ప్రాంతంలో మంచి ఫైబ్రోసిస్ టిష్యూ ఏర్పడి మరలా మొలలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. అలా అన్ని మొలలనీ ఒకే సిట్టింగ్‌లో చేయవచ్చు.
క్షార చికిత్స వలన ప్రయోజనాలు ఏమిటి?
ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు. * కోయడం, కుట్లు వేయడం ఉండదు. * రక్తస్రావం ఉండదు * త్వరగా తిరిగి రోజువారీ పనులు చేసుకోవచ్చు * ఆపరేషన్‌తో పోలిస్తే అతి తక్కువ నొప్పి.

నేను.. ‘ఆది’వాసిని!

$
0
0

నేను-
మానవతన ఆరడుగుల విగ్రహాన్ని
మూడడుగుల సుఖాసనంలోకి చేర్చి
పుష్పాలంకారాలు, ధూపదీపాలు
సహస్ర నామాలు, మంగళ హారతులు లేని
నిరాడంబర మనస్కతతో
కనురెప్పల్ని వాల్చితే
తనువు, మనసు కాస్త మారాం చేసినా
నా విగ్రహంలో నిగ్రహం ఆవిష్కృతమవుతుంది.
అవును,
కనుదోయి చీకటి తెర మాటున
ఆలోచనలను అల్లుకుంటూ పోకుండా
గతాలను కనటం, వినటం మానేస్తే
బయటి ప్రపంచం తప్పుకుంటుంటుంది.
అప్పుడు,
నా‘తనం’లో
కొన్ని క్షణాలు
తలను స్పృశిస్తాను
భుజాలను తడుముతాను
ఛాతీ విరుస్తాను
గుండెను పలకరిస్తాను
ఉదరాన్ని కౌగలించుకుంటాను
కుండలినితో స్నేహం చేస్తాను
ఇదంతా నా భౌతిక రూపంలోని
‘అన్నమయ కోశ’ స్పృహనే కదా!
స్పృహ ‘దృష్టి’గా మారి-
ఉచ్ఛ్వాస నిశ్వాసలపై నాతనాన్ని నిలిపితే
మందగిస్తున్న శ్వాసక్రియ తెలుస్తుంటుంది
గుండె లయ శక్తి తెలుస్తుంటుంది
ఉదర క్రియల వేడి తెలుస్తుంటుంది
రక్తప్రసరణ వేగం తెలుస్తుంటుంది
ప్రతీదీ శక్తిగా పరిణమించటం తెలుస్తుంటుంది.
ఈ జీవ - శక్తి - ప్రాణ త్రయ ప్రస్థానం
‘ప్రాణమయ కోశ’ కార్యకలాపమేగా! నా ‘్ధ్యస’లో
మూడొంతుల రక్తం మెదడుకు మేతవుతోంది
గుండె తోడిన అంతటి ఫోర్స్ సిగపట్టవుతోంది
ఆరడుగుల కాయ నియంత్రణకు
అంతలా శక్తి వినిమయం జరగాల్సిందే.
ధ్యాసే ‘్ధ్యనం’గా సాగుతున్నా-
కాళ్లు చేతులు తమ ఉనికిని చాటుకుంటున్నాయి
వెనె్నముక విల్లులా విచ్చుకుంటోంది
మెడ తిల్లానాకు తాళం వేస్తోంది
అవును.
నా ధ్యాస భౌతికాన్ని వీడలేదు
నా మనసు నాలోకే ప్రవహిస్తోంది
‘నేను’ ఇంకా ‘మనోమయ కోశా’నే్న!
ఏమిటీ ఆలోచనలు? ఎక్కడికీ పయనం?
కళ్లు మూసుకున్నా బుద్ధి నిలవటం లేదు
ధ్యాస నిష్క్రమిస్తున్నా స్పృహ విశ్రమించటం లేదు
శూన్యం కావాలన్నా మనసు సహకరించటం లేదు
ఏమిటీ ధ్యాస? ఎందుకీ స్పృహ? ఎక్కడిదీ స్మృతి?
సాధనలో ‘గమనిక’ సాధ్యమవుతోంది
గమనికతో ‘విచక్షణ’ పెరుగుతోంది
నా మైండ్‌ను ‘హయ్యర్ మైండ్’ అధివసిస్తోంది
అవును, ‘నేను’ ‘విజ్ఞానమయ కోశా’న్ని.
నేను-
ధ్యాసనూ కాను, ధ్యానాన్నీ కాను
స్పృహనూ కాను, స్మృతినీ కాను
గమనికనూ కాను, గమనాన్నీ కాను
అవ్యక్త అనుభూతిగా పరిణమిస్తున్నాను
జ్ఞాన విజ్ఞాన పరిధులు దాటుతున్నాను
అహాన్ని సంయమనాన్ని జత చేస్తున్నాను
నీ - నా హద్దులు చెరిపేస్తున్నాను
ఓహ్
ఇహ పరాలు సంయోగిస్తున్నాయి
నా తనం తరంగమై యోగిస్తోంది
నా ముందు నేనే!
శూన్యంలో నేనే!
ఎక్కడికీ ప్రస్థానం?
విస్తృతవౌతూ, దిగంతాలకు వ్యాప్తవౌతూ
విశ్వమూలాలను చేరుకుంటున్నాను
మానవ మూలాలను ఏరుకుంటున్నాను
నా ఈ ఆనందం ఎక్కడిది?
అవునవును
నేను ‘ఆనందమయ కోశాన్ని’ కదూ!
ఇప్పుడు - నేను
నా తనానికి ప్రత్యూష పవనాన్ని
నా అస్తిత్వానికి బ్రాహ్మీ ముహూర్తాన్ని
గికత్వ తపోవనాన్ని
నిర్వికల్ప వహాపర నిర్వాణాన్ని
నేను
శూన్యత నుండి శుద్ధత్వంలోకి యోగిస్తుంటే-
హయ్యర్ ఇంటెలిజెనే్స నా ఆత్మస్పృహ
సమాధ్యవస్థనే నా మృత్యు స్పర్శ
ఆ ఆలింగనంలో దక్కింది ప్రాణకుంభం
ఈ విశ్వ కుండలినితో ‘నేను’ సంపూర్ణం
ఈ మానవ కుండలినిలో ‘నేను’ పూర్ణం
అవును,
గిక ప్రస్థానంలో నేన-
‘స్థితి’కి అతీతం కావాలి
‘కాలా’నికి అతీతం కావాలి
‘జననా’నికి అతీతం కావాలి
‘జ్ఞాన’ ‘విజ్ఞానా’లకు అతీతం కావాలి
‘్ధ్యస’కు అతీతం కావాలి
‘్ధ్యనా’నికి అతీతం కావాలి
అప్పుడే- నేను
ప్రజ్ఞాన ప్రపూర్ణాన్ని!
విశ్వ కౌశలాన్ని!
‘ఆది’వాసిని!!

భావోద్వేగం

$
0
0

మనిషి మొదటి భావోద్వేగం - ఏడుపు. అందుకే అది కాకుండా మిగిలినవి సంపాదించుకోవాలి కానీ వేటినీ అంటిపెట్టుకుని ఉండకూడదు - గోవిందరావు మనస్తత్వంలో అన్ని భావోద్వేగాలూ పరిపూర్ణంగా వున్నాయి. అన్నింటి వ్యవధి లిప్తపాటే! పరిపూర్ణ వ్యక్తికి ప్రతిరూపంగా కన్పిస్తాడు. తనకు నచ్చినట్లే పెరిగాడు. తనకు నచ్చినట్టు తిరిగాడు. తనకు నచ్చినట్లే చేస్తున్నాడు. అన్నీ కూడా అతనిష్టమే! తల్లిదండ్రుల ప్రేమనేది బిడ్డల మీద ఇంతకన్నా ఎక్కువగా ఇంకెక్కడ కన్పిస్తుంది. క్లీన్‌చిట్ ఉన్నవాడు.
తనకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. ఇంజనీరింగ్ కళాశాలలో మాధవిని ఇష్టపడ్డాడు. ఎప్పుడూ చలాకీగా ఉండే మాధవి అంటే ఇష్టం ఏర్పడింది. పెద్ద అందగత్తేం కాదు కాని (అందమంటే ఏమిటో నాకింకా తెలియదు.) ఆమె చలాకీతనం తనలోని మరెన్నో భావోద్వేగాలను నిద్రలేపింది. తనకి ఆమె సరైందని భావించాడు. మూడేళ్లు చిన్నది కావడం కూడా వయసురీత్యా మంచే చేసింది. వారిద్దరిని మంచి జంటగా మలిచింది.
జంటగా మారకముందే పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో కొలువు దొరికింది. మంచి జీతం, జీవితం. ప్రస్తుత యాంత్రిక జీవనంలో అత్యంత ఎక్కువ మొత్తం సంపాదించే వ్యక్తుల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు నాలుగో స్థానంలో ఉంటున్నారు. సముద్రం మీదుగా చేసే షిప్పింగ్‌లు, పొలిటీషియన్లు, రియల్ ఎస్టేట్ల తర్వాత స్థానం వారిదే. ఇంకేం కావాలి. సామాన్యుడిని అసామాన్యుడిగా మార్చేది డబ్బే! డబ్బు లేనివాడు ఎంత యోగ్యుడైనా సామాన్యుడే. డబ్బున్నవాడు అయోగ్యుడైనా అసమాన్యుడే...!
వాడుకోవడానికి కావల్సిన దానికంటే అకౌంట్‌లో ఎక్కువున్న డబ్బు, పుట్టిన జిల్లాను వదలి హైదరాబాద్‌కు మకాం మార్చేలా చేసేసింది. అనుకూలవతి తోడుండగా మనస్సుకు చింతేం ఉంటుంది. రెండేళ్లపాటు గోవిందరావు మాధవిల కాపురం అన్యోన్యంగా సాగింది. గోవిందరావు పనితనాన్ని గుర్తించిన కంపెనీ, అమెరికా వెళ్లి రెండేళ్లపాటు జాబ్ చేసే అవకాశాన్నిచ్చింది. కంపెనీ నుండి ఆఫర్ రావడం ఆలస్యం అతనిలోని భావోద్వేగం చిందులేసి, వెంటనే ఒప్పేసుకున్నాడు. శుభవార్తను శ్రీమతికి చెప్పాడు. ఆయన ఊహించని ట్విస్ట్. ఆమె అతనికో బహుమతినిచ్చింది. మూడో నెల వచ్చిందన్న శుభవార్త. భావోద్వేగాలన్నింటికీ పని చెప్పినట్లైంది. ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
అమ్మాయి, అమ్మ అయినప్పుడే పరిపూర్ణ స్ర్తి అనిపించుకుంటుంది. ఆమెనతను పరిపూర్ణ స్ర్తిగా మార్చినందుకు ఆనందం పట్టలేక పోయింది. అతన్ని తండ్రి చేస్తున్నందుకు మనస్సులోనే ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. నెల రోజుల్లోనే అమెరికా ప్రయాణం కట్టాడు. మొదటిసారి విమానం ఎక్కినందుకు, మొదటిసారి పరాయి దేశంలో అడుగుపెడుతున్నందుకు ఆయనలో కలిగిన భావోద్వేగాలు అన్నీ ఇన్నీ కావు. వాటి వేగాన్ని అందుకోలేనంతగా ఉంది తన పరిస్థితి.
ఇక్కడ మాధవికి నెలలు నిండుతున్నాయి. అక్కడ గోవింద్‌కు చెమటలు పట్టేస్తున్నాయి. డెలివరీ సమయానికైనా అమెరికా తీసుకెళ్లగలిగితే తన బిడ్డకు అమెరికా పౌరసత్వం వస్తుందని, అదో గౌరవమని భావించాడు. అందుకు తగ్గట్లుగానే పావులు కదిపాడు. రోజులు గడుస్తున్నా మాధవికి వీసా రావడం లేదు. ఏవేవో కారణాలు చెప్తున్నారు. కారణాలన్ని ఉంటాయని తెలిసిందప్పుడే..!
అతను మనస్ఫూర్తిగా కోరుకున్నది, మొదటిసారి సాధించుకోలేక పోవడంతో అతనిలో నిరాశ కలిగి, కొత్త భావోద్వేగం రుచి తెలిసింది. ఆ నిరాశలో ఆశ చిగురించేలా ఒక వార్త చేరింది. పాపాయికి జన్మనిచ్చింది మాధవి. తన రక్తం పంచుకుని, తన లోకానికొచ్చిన కన్నబిడ్డను దగ్గరుండి చూడలేక పోయానని బాధపడ్డాడు గోవింద్. ఆఫీస్‌లో పని చేస్తున్నా, ఆలోచనలన్నీ తన బిడ్డపైనే. తాము కోరుకున్నట్లే ఆడపిల్ల పుట్టినందుకు సంతోషిస్తూనే తనకేం పేరు పెట్టాలని తెగ మదనపడిపోయారు.
కొలువుల కోసం కూడా అంత ప్రయత్నించలేదేమో గాని, ఏదన్నా సాధించడానికి కూడా అంత పోరాటం చేయరేమో గాని, కన్నబిడ్డలకు పేరు పెట్టడానికి మాత్రం ప్రపంచానే్న తిరగేస్తారు. పేరు పెట్టగానే గర్వపడిపోతారు. భవిష్యత్‌ను తీర్చిదిద్దేసినట్లు సంబరపడిపోతారు. జీవితాన్ని రంజింపజేస్తూ తమ జీవితంలో

కొచ్చిన బిడ్డకు ‘రంజిత’ అనే పేరే సరైందని భావించి అదే పేరును నిర్ణయించేశారు.
సుఖప్రసవం కావడంతో తల్లీబిడ్డలు క్షేమం! వైద్యం కూడా కమర్షియల్ అయిపోయిన ఈ రోజుల్లో సుఖప్రసవం అంటే మాటలు కాదు. డబ్బు కోసం డాక్టర్లు చీటికిమాటికి ఆపరేషన్లు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. చిన్ననొప్పి అన్నా ఆపరేషన్ అంటున్నారు. డాక్టర్‌ను బాగా నమ్మేసి జనాలు కూడా ఓ కారణం. డెలివరీ ఒక తేదీని సుమారుగా నిర్ణయించినప్పుడు, అదే రోజున నొప్పులు రాకపోతే కంగారుపడిపోయి, అదేదో బ్రహ్మవాక్కు తప్పిపోయిందని ఆపరేషన్

చేసెయ్యమని జనాలు కోరడం క్షమించరాని నేరం. గర్భవతిని బరువులు మోయ్యొద్దంటే పనులేం చేయొద్దని కాదు. స్రావం జరిగేంత పనులు చేయొద్దని. అసలు ఒళ్లు కదపకపోతే కదలికలు ఎక్కడ్నుంచి వస్తాయి? పుట్టే బిడ్డలో చురుకుదనం ఎక్కడ్నుంచి పుడుతుంది? ఇది అర్థం చేసుకోలేని యువతులున్నంత కాలం తిరోగమనమే...!
రంజిత పుట్టిన సమయం సందర్భమేమో కాని మాధవికి వీసా మంజూరైంది. కాని దాన్ని వాడుకునే స్థితిలో లేదామె. తన మనసంతా రంజిత సంరక్షణ పైనే ఉంది. పెద్దలతోపాటే గోవింద్ కూడా ఓటెయ్యడంతో అమెరికా ప్రయాణాన్ని ఆపేసింది. గోవింద్ చేసే ప్రాజెక్ట్ చాలా ప్రాముఖ్యమైనది కావడంతో జీతాన్ని పెంచి ఎవ్వరికీ రెండు రోజులకు మించి సెలవులను ఇవ్వడంలేదు కంపెనీ. రంజితను చాలా రోజుల్నుంచి లాప్‌టాప్‌లోనే చూస్తున్నాడు గోవింద్. ప్రత్యక్షంగా చూసి, తన పొత్తిళ్లలోకి తీసుకోవాలనే కోరిక రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ భావోద్వేగాన్ని మాత్రం తట్టుకోలేక పోయాడు. అటువైపు పెద్దలు, మాధవి కూడా బాధపడటం మొదలుపెట్టారు. ఎన్నాళ్లని లాప్‌టాప్‌ల్లో చూస్తాడు? తండ్రికి బిడ్డను చేరవేయాలని తల్లి తాపత్రయం పెరిగిపోతోంది. బిడ్డను చేరుకోవాలని తండ్రి ప్రేమబంధాన్ని పెంచుకుంది.
పసిబిడ్డను తీసుకుని అమెరికా వచ్చెయ్యమని గోవింద్ పురమాయించాడు. భర్తను, బిడ్డను ఒకే ఫ్రేమ్‌లో చూడాలనలి ముచ్చటపడిన ఇల్లాలు వెంటనే బయలుదేరింది. ముందే వీసా ఉండడంతో, పనులన్నీ ప్రారంభమయ్యాయి. రంజితను తీసుకుని మాధవి మొదటిసారి విమానం ఎక్కింది. పరాయిదేశం వెళ్లానన్న ఆనందం కన్నా, భర్తకు తమ బిడ్డను అందించానన్న తృప్తి ఆమె మొహంలో ప్రస్ఫుటంగా కన్పించింది. మొదటిసారి కూతురిని స్వయంగా ఎత్తుకున్న గోవింద్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఆనందభరితుడయ్యాడు. కాని ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు.
దేశాలు దాటడంతో, వాతావరణంలో మార్పులు రావడంతో రంజితకు జ్వరం వచ్చేసింది. లాప్‌టాప్‌లో తండ్రిని చూసి కేరింతలు కొట్టిన రంజిత అలా డల్‌గా ఉండడంతో అతని కడుపు తరుక్కుపోయింది. మాధవి గురించి ఆలోచించాడు. ఎన్ని ఇబ్బందులు పడుంటుందో గ్రహించాడు. ఆడవాళ్ల గొప్పదనం కళ్లకు కట్టిన వైనం అది. తన గారాలపట్టి, ‘గయ్‌గయ్’మని అరవాల్సిన కూతురలా ఉండడం చూసి అతనిలో ఎప్పుడూ లేని భావోద్వేగాలు పుట్టుకొచ్చాయి.
మనిషి మొదటి భావోద్వేగం - ఏడుపు. మళ్లీ దాన్ని రుచి చూశాడు. ఇంట్లో కూర్చుని దీర్ఘంగా ఆలోచించి తన నిర్ణయాన్ని భార్యకు చెప్పాడు. కొత్త దేశాధ్యక్షుడు ట్రంప్ చర్యల వల్ల భయపడేదే కాక పాప ఆరోగ్యం కృంగదీసింది. సొంత దేశంలో, సొంత రాష్ట్రంలో, ‘నా’ అన్న వాళ్ల మధ్య అపురూపంగా పెరగాల్సిన కూతురిలా ఒంటరై పోతుందని అర్థమైంది. స్వగ్రామంలో రాజులా బతకాల్సిన వ్యక్తి, ఎక్కువ డబ్బు కోసమని అర్రులు చాస్తున్న విషయం అర్థమై సంపాదించింది చాలనుకున్నాడు. ప్రేమానురాగాలు కావాలి గాని, ప్రేలాపనలు కాదని గ్రహించాడు. తనకు నచ్చింది చేయడం గోవింద్ నైజం. వారం రోజుల్లో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు. తన భావోద్వేగాల్ని కట్టిపడేస్తున్న కొలువుకి స్వస్తి పలికాడు. భార్య మొహంలో వెలుగును చూశాడు. మాతృభూమి విలువ తెలుసుకున్నాడు.

===============================================================

కథలకు ఆహ్వానం

‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.

పెద్ద మనసు (కథ)

$
0
0

ఒక అడవిలో పెద్ద వేపచెట్టు ఉండేది. దాని మీద రకరకాల పక్షులు గూళ్లు కట్టుకొని వుండేవి. వాటిలో ఒక కాకి వుండేది. దానికి చాలా పొగరు. ఎప్పుడూ ఏదో ఒక పక్షితో గొడవ పడుతూ ఉండేది. చిన్నచిన్న పక్షులను ముక్కుతో పొడిచి, గోళ్లతో రక్కి ఏడిపించేది. దాంతో దాన్ని ఏవీ పలకరించేవి కాదు. మాటలు కలిపేవీ కాదు. దూరదూరంగా వుండేవి.
వానాకాలం దగ్గర పడింది. పక్షులన్నీ తమ ఇళ్లను ఎంత గాలి వీచినా, ఎంత వాన పడినా చెక్కు చెదరకుండా బాగా గట్టిగా కట్టుకోసాగాయి. కానీ కాకి పెద్ద సోమరిపోతు. రేపు, ఎల్లుండి అనుకుంటూ రోజులు దాటేయసాగింది. వానాకాలం రానే వచ్చింది.
పెద్ద గాలి వాన వచ్చింది. వేపచెట్టు ఆ గాలికి తట్టుకోలేక పూనకం వచ్చినట్టు అటూ ఇటూ ఊగిపోసాగింది. పక్షులన్నీ భయంతో గబగబా వాటి గూళ్లలోనికి పోయి తలుపులు వేసుకొని గొళ్లెం పెట్టేసుకున్నాయి.
కాకిది పుల్లల ఇల్లు కదా.. ఆ గాలికి చెల్లాచెదరై పోయి కింద పడిపోయింది. దానికి రెండు చిన్న పిల్లలు వున్నాయి. వాటి మీద వాన పడకుండా రెక్కలు కప్పింది. కానీ వాన పెద్దదవుతూ వచ్చింది. పిల్లలు నెమ్మదిగా తడిసిపోతూ వున్నాయి. చలికి వణికిపోసాగాయి. ఇలాగే వుంటే పిల్లలకి ఏమన్నా అవుతుందేమోనని భయపడి చిలుక ఇంటికి పోయి ‘చిలుకా.. చిలుకా.. కొంచెం తలుపు తీయవా. నేనూ నా పిల్లలు గాలివానకు చచ్చిపోయేట్టు వున్నాం’ అని వేడుకొంది.
కానీ ఆ చిలుక లోపల నుంచే ‘మాకే ఈ ఇల్లు సరిపోవడం లేదు. ఇంక నీకు చోటెక్కడ పో... పోయి వేరే వాళ్లని అడుగు’ అంది.
కాకి పక్కనే వున్న పావురం ఇంటికి పోయి ‘పావురమా.. పావురమా.. ఈ ఒక్కరోజు నీ ఇంటిలో కొంచెం చోటియ్యవా.. నా పిల్లలు ఏమైపోతారోనని భయంగా ఉంది’ అంది ఏడుపుగొంతుతో.
దానికి ఆ పావురం ‘పోపో.. అనవసరంగా అందరితో గొడవపడే నీలాంటి వాళ్లతో ఒక్క పూట కాదు కదా.. ఒక్క నిమిషం కలిసి వున్నా తప్పే’ అంది తలుపు తీయకుండా.
కాకికి ఏ ఇంటి తలుపు తట్టినా ఇవే సమాధానాలు ఎదురు కాసాగాయి. ఒక్క పక్షి కూడా తలుపు తీయలేదు. దాంతో ఏం చేయాలో తోచక కళ్లనీళ్లు పెట్టుకుంది.
అంతలో ఒక గూటి తలుపు తెరచుకుంది. అందులోంచి ఒక చిన్న పిట్ట బైటకు వచ్చింది. కాకి అంతకు ముందు అనేక సమయాల్లో అనవసరంగా దానితో గొడవ పడింది. చిన్నది గదా ఏం చేయలేదులే అనుకుంటూ దాని ఇంటిలో దొంగతనాలు కూడా చేసింది. ఆ పిట్టను చూడగానే కాకి అవమానంతో తలవంచుకొంది.
పిట్ట చాలా మంచిది. అది చెల్లాచెదరైన కాకి గూడు చూసింది. వానకు వణికిపోతున్న కాకి పిల్లలను చూసింది. అయ్యో పాపం అనుకొని ‘కాకీ.. కాకీ.. అలా వానలో ఎక్కువసేపు వుంటే పిల్లలకు ఏమన్నా అవుతుంది. తొందరగా రా.. ఈ రోజు నా గూటిలో వెచ్చగా పడుకొందువుగాని’ అంది.
ఆ మాటలకు కాకి సిగ్గుతో మరింత ముడుచుకొని పోయింది. అది చూసి పిట్ట నవ్వి ‘ఆపదలో వున్నప్పుడు ఎదుటివాడు మనవాడా, పగవాడా అని ఆలోచించకుండా ముందు ఆదుకోవాలి అంటారు పెద్దలు. నీ మీద నాకు ఎలాంటి కోపమూ లేదు.. దా.. తొందరగా.. సాటి పక్షికి సాయం చేయలేని బతుకూ ఒక బతుకేనా’ అంది.
కాకి వెంటనే తన పిల్లలను తీసుకొని ఆ ఇంటిలోకి వెళ్లింది. ఇల్లు చిన్నదైనా చాలా గట్టిగా, బలంగా ఉంది. పిట్ట తాను ఎక్కడెక్కడి నుంచో సేకరించి తెచ్చుకున్న గింజలు తెచ్చి, కాకికి, పిల్లలకు కడుపు నిండా పెట్టింది. అది చూసి కాకి కళ్లనీళ్లు పెట్టుకొని ‘సోదరీ.. నిన్ను అనవసరంగా ఇంతకాలం బాధపెట్టాను. కానీ దాన్ని నువ్వు కొంచెం కూడా మనసులో పెట్టుకోకుండా సొంత బంధువులా ఆదుకున్నావు. నీ మేలు ఎప్పటికీ మరచిపోలేను’ అంది.
పిట్ట కిచకిచా నవ్వి ‘అంత మాటలు వద్దు.. తప్పు చేయని వాళ్లు ఎవరుంటారు చెప్పు ఈ లోకంలో. కానీ ఆ తప్పు తెలుసుకొని సరిదిద్దుకున్న వాళ్లే గొప్పవాళ్లు అవుతారు. పదిమందితో కలిసి బతకడంలో వున్న ఆనందం ఒంటరిగా వుంటే ఎప్పటికీ రాదు. అది తెలుసుకో చాలు’ అంది.
ఆ తరువాత నుంచీ కాకి చాలా మారిపోయింది. కనపడిన వాటినల్లా పలకరించసాగింది. మాటలు కలపసాగింది. పనుల్లో సాయం చేయసాగింది.

నమ్మకస్థుడు

$
0
0

పదిహేను రోజుల క్రితం జాన్ వచ్చి నన్ను కలిశాడు. నేను అతన్ని వెంటనే గుర్తు పట్టలేదు. ఎందుకంటే నేను అతన్ని చూసి ఎనిమిదేళ్లైంది. కాలేజీలో చదివేప్పుడు, తర్వాత ఎవరి దారిన వాళ్లం వెళ్లిపోయాం. ఈ మధ్యకాలంలో నేను అతన్ని మళ్లీ చూడలేదు. అతను బరువు పెరిగాడు. జుట్టు కూడా గతంలో కన్నా పల్చబడింది. మరకలున్న టై, నలిగిన సూట్, బీటలు ఇచ్చిన బూట్లని చూస్తే గత ఎనిమిదేళ్లుగా అతనికి పెద్దగా సంపాదన లేదని అనిపించింది.
‘మనం కలిసి చాలా కాలమైంది’ అతను చెప్పాడు.
అతనికి స్కాచ్‌ని ఆఫర్ చేశాను. మేము డ్రాయింగ్ రూంలో కూర్చుని కాలేజీ రోజుల గురించి మాట్లాడుకున్నాం. జాన్ నా దగ్గరకి ఏ పని మీద వచ్చాడని ఆలోచించాను. కానీ అంతుపట్టలేదు. ఊరికే సరదాగా మాట్లాడటానికి నన్ను వెతుక్కుని రాడు. అతను డబ్బడిగితే నా కష్టాల కేటలాగ్‌ని చెప్పటానికి సిద్ధంగా ఉన్నాను.
‘నీ ఇల్లు బావుంది. నీ సంపాదన బానే ఉన్నట్లుంది?’ కాసేపాగి చుట్టూ చూసి అడిగాడు.
నేను వౌనంగా ఉండిపోయాను. అతను ఎందుకు వచ్చాడో తెలుసుకోకుండా ముందుగా నా అంతట నేనే పెదవి విప్పదలచుకోలేదు. చివరికి రెండో పెగ్ మధ్యలో ఉండగా జాన్ చెప్పాడు.
‘ఓ అవసరం రావడంతో నేను నీ దగ్గరకి వచ్చాను. నేను నమ్మే ఒకరి నించి నాకు సహాయం కావాలి. నిన్ను అప్పడగడానికి వచ్చానని నీకు అనిపిస్తే అది తప్పు. నేను డబ్బుకి ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. ఐతే జీవితకాలంలో ఓ సారి వచ్చే అవకాశం నాకు ఈ మధ్యే వచ్చింది. గత ఎనిమిది సంవత్సరాలుగా పట్టిన దురదృష్టం, జారిపోయిన అవకాశాలు నువ్వు అనుభవించి ఉంటే, ఈ నా అవకాశాన్ని నువ్వు వదులుకోవు’
‘కావచ్చు’ చెప్పాను.
అతని పథకం ఏమిటో, ఎలా నన్ను నమ్మించి నా నించి డబ్బు తీసుకోవాలని అనుకుంటున్నాడో నాకు చూచాయగా కూడా అంతుపట్టలేదు. అది తప్పకుండా చట్టవిరుద్ధమైందే అయి ఉంటుందని కూడా నేను భావించాను. మొదటి నించీ నిజాయితీ పరుడినైన ననన్ను జాన్ ఈ విషయంలో లొంగదీసుకోగలగడం అసంభవం. అతనేం చెప్తాడా అని ఓపికగా ఎదురుచూశాను.
‘నువ్వు నాకో సహాయం చేయాలి. అది డబ్బుకి సంబంధించింది కాదు. చట్టవిరుద్ధమైందీ కాదు. నువ్వు చెయ్యాల్సింది కూడా పెద్దగా కష్టమైంది కాదు. నువ్వు చెయ్యాల్సిందల్లా నా కోసం ఓ ఉత్తరాన్ని జాగ్రత్తగా నీ దగ్గర దాచడం’ జాన్ చెప్పాడు.
అతను తన కోటు జేబులోంచి ఓ తెల్లటి కవర్ తీసి నాకిచ్చాడు.
‘ఈ కవర్లో ఏముందో నువ్వు తెలుసుకోక పోవడమే మంచిది. కేవలం దీన్ని నీ దగ్గర జాగ్రత్తగా ఉంచడమే నేను కోరేది. వచ్చే నెల్లో ఏదో ఓ రోజు నేను మళ్లీ నీ దగ్గరికి వచ్చి దీన్ని తీసుకుంటాను. ఊరికే కాదు. ఇందుకు నీకు వెయ్యి డాలర్లు ఇస్తాను’
‘నాకు పూర్తిగా అర్థం కాలేదు’ చెప్పాను.
‘నిన్ను అర్థం చేసుకోమని నేను అడగడం లేదు’ అతని కంఠంలో అభ్యర్థన ఉన్నా స్వల్పంగా అసహనం కూడా ధ్వనించింది.
అతని ఏదో పెద్ద పథకంలో నేనో చిన్న భాగాన్ని అని, నాతో పని పూర్తయ్యాక అతను మొత్తం చెప్తాడని నాకు అనిపించింది.
‘నేను నిన్ను వెతుక్కుని నీ దగ్గరికి రావడానికి కారణం మన స్కూల్ రోజుల్లో, మన మిత్రులు అందరిలో నువ్వు అతి నిజాయితీపరుడివి. నమ్మదగ్గ వాడివి. నాకు నమ్మదగ్గ వ్యక్తి అవసరం ఏర్పడి వచ్చాను.’
‘నాకు అర్థమైంది చెప్తాను. నువ్వు ఇచ్చిన ఉత్తరాన్ని నేను నెల రోజులు నా దగ్గర ఉంచాలి. ఆ తర్వాత నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఆ ఉత్తరాన్ని చింపి చదవకుండా నీకు తిరిగి ఇస్తే నువ్వు నాకు వెయ్యి డాలర్లు ఇస్తావు’ చెప్పాను.
‘అవును. నీకు అర్థమైంది’ నవ్వాడు.
‘అంతేనా? ఓ ఉత్తరాన్ని నా ఇంట్లో భద్రంగా ఉంచి నెల తర్వాత నీకు ఇవ్వడమేనా నేను చేయాల్సిన పని?’ అడిగాను.
‘ఇంకొకటి కూడా ఉంది. నిన్ను ఎలాంటి ప్రమాదంలో నేను ఇరికించటం లేదు’ అతను హామీ ఇచ్చాడు.
‘ఐనా నాకు అన్నీ చెప్పు’ కోరాను.
‘నెల రోజుల తర్వాత నేను నీ దగ్గరికి వస్తానని చెప్పా కదా? ఒకవేళ నేను రాకపోతే ఏమవుతుంది?’
‘నాకు తెలీదు’
అతను నా చేతిలో ఉన్న ఉత్తరం మీద వేలితో కొట్టి చెప్పాడు.
‘ఈ ఉత్తరాన్ని పోలీస్ కమిషనర్‌కి పోస్ట్ చేయాలి’
‘ఏం చేయాలి?’
‘నేను నెల్లో నీ దగ్గరికి రాకపోతే దానర్థం నాకేదో జరిగిందని. పోలీసులకి అది తెలియాలి. ఆ ఉత్తరం నాకేమైందో పోలీసులకి వివరిస్తుంది. ఇది నా ప్రాణాలకి ఇన్సూరెన్స్ లాంటిది. నాకు నమ్మకస్థుడి అవసరం ఎందుకుందో ఇప్పుడు నీకు అర్థమైందా?’
‘నేను నమ్మకస్థుడ్ననని నువ్వు నా దగ్గరికి వచ్చానని అంటున్నావు. థాంక్ యు. నమ్మకమంటే నిజాయితీ. కానీ నీ పథకం నిజాయితీతో కూడింది కాదని నాకు అనిపిస్తోంది. దాంట్లో నేను భాగస్వామిని ఎలా అవుతానని అనుకున్నావు?’ ప్రశ్నించాను.
‘ఇందులో నిజాయితీ లేకపోవడం ఏముంది? నీకో ఉత్తరం ఇచ్చి నెల తర్వాత పోస్ట్ చేయమనడం, ఈ లోగా నేను వస్తే దాన్ని నాకు ఇవ్వమనడంలో చట్టవిరుద్ధమైన పనేముంది?’ జాన్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘లేదు. కాని...’
‘ఆ ఉత్తరాన్ని పోలీస్ కమిషనర్‌కి పోస్ట్ చేయడం అంటే జరిగిన ఓ నేరాన్ని పోలీసులకి తెలియజేయడమే. అది ప్రతీ పౌరుడి ధర్మం కదా?’
‘నీ పథకంలోని నా భాగం పూర్తిగా చట్టసమ్మతమైందే అని ఒప్పుకుంటాను. కానీ నీ భాగం అలా కాదని నా అభిప్రాయం జాన్! నువ్వు ఎవర్నో బ్లాక్‌మెయిల్ చేస్తున్నావని నాకు అనిపిస్తోంది’ చెప్పాను.
‘అది నిజమే. నేను బ్లాక్‌మెయిల్ చేసేది ఎవర్నో పేరు చెప్తే, నువ్వు తేలిగ్గా తెలుసుకోగలవు. మన దేశంలో అతను అతి దగుల్బాజీ. దుర్మార్గుడు. అలాంటి వాడిని బ్లాక్‌మెయిల్ చేయడంలో అన్యాయం లేదు’ అతను సిగ్గుపడకుండా చెప్పాడు.
‘నువ్వే లాయర్. నువ్వే జడ్జ్. అవునా?’ నవ్వుతూ అడిగాను.
‘సరే. సరే. నా దగ్గర ఇప్పుడు పైసా లేదు. నేను కాలేజ్ లోంచి బయటికి వచ్చాక ఎన్ని వ్యాపారాలు చేసినా, అన్నిట్లో నష్టమే వచ్చింది. ఇది నాకు వచ్చిన పెద్ద మంచి అవకాశం. దీన్ని పూర్తిగా ఉపయోగించు కోదలచుకున్నాను. అది నిజాయితీతో కూడిందా, కూడనిదా అన్నది నేను పట్టించుకోను. నీ దగ్గరికి నేనో సహాయం కోరి, అదీ నువ్వు నమ్మకస్థుడవని వచ్చాను. నా ప్రాణాలు నీ చేతుల్లో పెడుతున్నానని అర్థమైందా? నా ప్రాణాల్ని ఒకరి చేతిలో ఉంచాల్సిన పరిస్థితి నాది. అపరిచితుడ్ని అయినా నా ప్రాణాలని నువ్వు కాపాడాలి. అవునా? నువ్వు నిర్ణయించుకుని చెప్పు’ అతను ఆవేదనగా చెప్పాడు.
‘సరే. చేస్తాను. నువ్వు చెప్పినట్లే చేస్తాను’ అంగీకరించాను.
‘నువ్వు ఒప్పుకుంటావనే ఆశతో, నమ్మకంతో నీ దగ్గరికి వచ్చాను. మిగిలిన షరతులు - ఎవరైనా నీకు ఫోన్ చేసి, నేను నీ నించి ఆ ఉత్తరం తీసుకురమ్మన్నానని చెప్తే అది నువ్వు వాళ్లకి ఇవ్వకూడదు. అతనేం చెప్తున్నాడో నీకు తెలీదని చెప్పాలి. నేను నీకు ఫోన్ చేసి ఇతరులకి ఆ ఉత్తరం ఇవ్వమని కోరినా నువ్వు ఇవ్వకూడదు. ఆ ఉత్తరాన్ని తిరిగి నా చేతుల్లోనే పెట్టాలి. అర్థమైందా?’
‘అలాగే. కానీ నాకోటి చెప్పు. ఇందులో హింస జరిగే అవకాశం ఉందా?’ అడిగాను.
అతను తల అడ్డంగా ఊపి చెప్పాడు.
‘అలాంటి ప్రమాదం లేదు. నువ్వు గౌరవనీయమైన పౌరుడివి. వాళ్లతో నేను నువ్వు కూడా ఆ ఉత్తరాన్ని మరొకరికి ఇచ్చి నువ్వు కోరినప్పుడే ఇవ్వమన్నావని చెప్తాను. నీకేమైనా అయితే వాళ్లు వెంటనే పోలీసులకి ఇస్తారనే భయంతో నిన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టరు. ఎలాంటి హింసైనా వాళ్లు నా మీదే ప్రయోగిస్తారు తప్ప నీ మీద కాదు’
అతను వెళ్లిపోయాడు.
ఇది జరిగి పదిహేను రోజులైంది. ఇన్ని రోజులూ నేను మామూలుగానే ఆఫీస్‌కి వెళ్తున్నాను. ఆ ఉత్తరం అటక మీది ట్రంక్ పెట్టెలో నా స్కౌట్ యూనిఫాం జేబులో ఉంది. నేను వారం తర్వాత ఆ ఉత్తరం గురించి దాదాపు మర్చిపోయాను.
నాలుగు రోజుల క్రితం రాత్రి పది ప్రాంతంలో నాకో ఫోన్‌కాల్ వచ్చింది. అది జాన్ నించి. నేను అతన్ని కంఠాన్ని గుర్తు పట్టాను.
‘విను. నేను నీకు ఇచ్చిన ఉత్తరం సంగతి గుర్తుందా?’ అడిగాడు.
‘సారీ?’ జవాబు చెప్పాను.
అతను ఇలాంటి సందర్భంలో ఏం జవాబు చెప్పాలని చెప్పాడో అది నాకు గుర్తుంది.
‘ఉత్తరం. నీకు ఇచ్చిన కవర్ గురించి నేను చెప్పేది’ ఆందోళనగా చెప్పాడు.
‘మీరెవరో కాని జోక్ చేస్తున్నారు’ చెప్పాను.
‘నేను నీకు చెప్పింది మర్చిపో. వాళ్లు వింటున్నారు. వాళ్లకి నీ దగ్గర ఉత్తరం ఉందని తెలియాలి’
‘ఏమిటి మీరనేది? నాకేం అర్థం కావడం లేదు.’
‘దయచేసి నేను నీకు ఉత్తరం ఇచ్చిన సంగతి వాళ్లకి చెప్పు. నా ప్రాణాలు కాపాడాలంటే చెప్పు’ జాన్ ఆందోళనగా అర్థించాడు.
‘మీరు ఎవరో, దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడంలేదు’
జాన్ పెద్దగా అరవడం వినిపించాక లైన్ కట్ అయింది. నేను రిసీవర్ని పెట్టేశాను. నాలుగు రోజుల క్రితం అది జరిగిందని చెప్పా కదా?
ఇవాళ ఉదయం పేపర్‌లో పోలీసులు నదిలోంచి జాన్ శవాన్ని బయటకి తీశారని చదివాను. అతన్ని బాగా హింసించి, తుపాకీతో కాల్చి చంపాక, కారు టైర్లలో అతని శవాన్ని దూర్చి గొలుసులతో కట్టి పడేశారు. కాని అతని బెల్ట్ పడవ ఏంకర్‌కి తగులుకుని, దాంతోపాటు అది ఒడ్డుకి వచ్చి పైకి తేలింది. అతను మరణించి మూడు నాలుగు రోజులై ఉండచ్చని పోలీసులు అంచనా వేశారు.
దాంతో నేనా ఉత్తరాన్ని తెరచి చదివి ఆశ్చర్యపోయాను. మా రాష్ట్ర గవర్నర్ గతం గురించి తెలిస్తే ఆయనకి నేను ఓటు వేసి ఉండేవాడిని కాను. నేను జాన్‌కన్నా తెలివి మీరాను. అతని అనుభవంతో నాకేమైనా అయితే ఆ ఉత్తరం సరాసరి పోలీసుల చేతిలోకి వెళ్తుంది.
నేనా ఉత్తరాన్ని విప్పి చదవకుండా ఎందుకు పోలీసులకి పంపలేదు? జాన్ నా నిజాయితీని తప్పుగా అంచనా వేశాడని మీకు అనుమానం కలగవచ్చు. అది నిజం కాదు. ఐతే గతంలో ఎన్నడూ నాకు లక్ష డాలర్లు సంపాదించే అవకాశం రాలేదు. పోస్ట్ ఆఫీస్‌లో ఉత్తరాలని సార్టింగ్ చేసే ఎవరైనా నిజాయితీగానే ఉంటారు.

(డొనాల్డ్ ఈ వెస్ట్‌లేక్ కథకి స్వేచ్ఛానువాదం)

రామాయణం.. 109 మీరే డిటెక్టివ్

$
0
0

మీకో ప్రశ్న

గాయత్రి మంత్రంలోని తొమ్మిదవ బీజాక్షరం ‘గ’ ఏ కాండలో ఏ శ్లోకంలో వస్తుంది?
===================================================================

మహామంత్రైన వశిష్ఠుడు రాముడితో ఇలా చెప్పి, మళ్లీ ధర్మసమ్మతమైన ఈ మాటలని కూడా చెప్పాడు.
‘ఓ రామా! జన్మించిన ప్రతీ పురుషుడికీ ఆచార్యుడు, తండ్రి అనే ఇద్దరు గురువులు ఉంటారు. ఓ పురుష శ్రేష్ఠుడా! తండ్రి పురుషుడ్ని పుట్టిస్తాడు. ఆచార్యుడు అతనికి జ్ఞానం ఇస్తాడు. అందువల్ల అతను గురువు అవుతున్నాడు. నేను నీకు, నీ తండ్రికీ కూడా ఆచార్యుడ్ని. నేను చెప్పినట్లు చేస్తే నువ్వు సత్పురుషుల మార్గాన్ని అతిక్రమించిన వాడివి కావు. ఈ పండిత పరిషత్తులు, శ్రేణులు, బ్రాహ్మణులు వీరంతా నీ వాళ్లు. వీరి విషయంలో నువ్వు పాలనారూపమైన ధర్మాన్ని ఆవరించినట్లైతే సత్పురుషుల మార్గాన్ని అతిక్రమించిన వాడివి కావు. నువ్వు వృద్ధురాలు, ధర్మం చేసే స్వభావం గల తల్లికి సేవ చేయకుండా ఉండకూడదు. ఈవిడ చెప్పినట్లు ఆచరించినట్లైతే నువ్వు సత్పురుషుల మార్గాన్ని అతిక్రమించినట్లు కాదు. సత్య, ధర్మ, పరాక్రమాలు గల ఓ రామా! ఇలా ప్రార్థించే భరతుడి మాటలకి అంగీకరించినట్లైతే నువ్వు స్వధర్మాన్ని అతిక్రమించినట్లు కాదు.’
పురుష శ్రేష్టుడైన రాముడు, గురువైన వశిష్ఠుడు స్వయంగా చెప్పిన మధురమైన మాటలు విని తన పక్కనే కూర్చున్న వశిష్ఠుడితో చెప్పాడు.
‘తల్లిదండ్రులు కొడుకు విషయంలో ఎప్పుడూ ఏ విధంగా ప్రవర్తిస్తూంటారో, యథాశక్తిగా ఆయా వస్తువులని ఇచ్చి నిద్ర పుచ్చుతూ, స్నానం చేయిస్తూ, నిత్యం మంచి మాటలు చెప్తూ పెంచే తల్లీ, తండ్రి ఏ ఉపకారం చేస్తారో దానికి ప్రత్యుపకారం చేయడం సులభమైన పని కాదు. మా తండ్రి దశరథుడు నాకు జన్మని ఇచ్చాడు. ఆయన ఎదుట నేను చేసిన ప్రతిజ్ఞ వ్యర్థం కాకూడదు.’
గొప్ప ఉదారుడైన భరతుడు రాముడి మాటలు విని చాలా విచారించి వశిష్ఠుడితో చెప్పాడు.
‘ఇక్కడ నేల మీద వెంటనే దర్భలని పరుచు. నా విషయంలో ప్రసన్నుడయ్యేంత వరకూ అన్నని అడ్డగిస్తూ దాని మీద కూర్చుంటాను. డబ్బు లేని బ్రాహ్మణుడిలా ఆహారం తీసుకోకుండా, వెలుతురు చూడకుండా ఈ పర్ణశాల ముందు రాముడు అయోధ్యకి తిరిగి వచ్చే దాకా పడుకుంటాను.’
రాముడి ఆజ్ఞ కోసం అతని వైపు చూసే వశిష్ఠుడ్ని చూసి, దుఃఖితుడైన భరతుడు తనే స్వయంగా దర్భలని తీసుకొచ్చి నేల మీద పరిచాడు. మహాతేజశ్శాలి, రాజర్షుల్లో శ్రేష్ఠుడైన రాముడు వెంటనే భరతుడితో చెప్పాడు.
‘నాయనా భరతా! నేను ఏ చెడ్డ పని చేశానని నువ్విలా అడ్డంగా పడుకుంటావు? తన దగ్గర అప్పు తీసుకుని ఎగ్గొట్ట చూసే వారిని అడ్డగించడానికై బ్రాహ్మణుడు ఓ పక్క పడుకోవచ్చు. కాని ఇలా అడ్డగించడం క్షత్రియ ధర్మం కాదు. దారుణమైన దీన్ని వదిలి వెంటనే పట్టణాల్లో శ్రేష్ఠమైన అయోధ్యకి వెళ్లు.’
భరతుడు దర్భల మీద కూర్చునే అక్కడ ఉన్న పౌరులని, జానపదుల్ని చూస్తూ అడిగాడు.
‘మీరు అన్నకి ఎందుకు ఏమీ చెప్పడం లేదు?’
ఆ పౌర జానపదులు మహాత్ముడైన భరతుడితో చెప్పారు.
‘రాముడి గురించి మాకు బాగా తెలుసు. రాముడు చెప్పేది యుక్తంగానే ఉంది. మహాభాగ్యశాలైన ఈ రాముడు తండ్రి మాట మీద నిలబడ్డాడు. అందువల్ల మేం ఇతన్ని మళ్లించలేక పోతున్నాం.’
వారి మాటలు విన్న రాముడు చెప్పాడు.
‘్ధర్మదృష్టి గల మన మిత్రులు చెప్పే మాటలు విను. భరతా! నా మాటలు, వీరి మాటలు చక్కగా ఆలోచించి లే. నన్నూ, నీటినీ స్పృశించు.’
భరతుడు లేచి నీటితో ఆచమనం చేసి చెప్పాడు.
‘విద్వత్ పరిషత్తులు, మంత్రులు, శ్రేణులు నేను చెప్పే మాటలని వినండి. నేను ఎప్పుడూ నాకు రాజ్యాన్ని ఇవ్వమని నా తండ్రిని అడగలేదు. రాజ్యం వచ్చేలా చేయమని నా తల్లిని ప్రేరేపించలేదు. పరమ ధర్మవేత్త, పూజ్యుడైన రాముడు అరణ్యాలకి వెళ్లాలని నేను ఎన్నడూ సమర్థించలేదు. తండ్రి మాట ప్రకారం అరణ్యాల్లో నివసించాలని ఉంటే, నేనే పధ్నాలుగు సంవత్సరాలు అడవిలో ఉంటాను.’
ధర్మాత్ముడైన రాముడు తన తమ్ముడు దృఢ నిశ్చయంతో చెప్పిన ఆ మాటలు విని, ఆశ్చర్యంగా పౌరజానపదులతో చెప్పాడు.
‘మా తండ్రి జీవించి ఉండగా చేసిన అమ్మకం, తాకట్టు, కొనుగోలు మొదలైన వ్యాపారాన్ని నేను కాని, భరతుడు కాని మార్చడానికి వీల్లేదు. వనవాస విషయంలో నాకు బదులు మరొకర్ని ప్రతినిధిగా పంపడం చాలా జుగుప్సాకరమైన పని. కైకేయి రాజ్యాన్ని ఇవ్వమని కోరడం సబబే. తండ్రి చేసిన పని కూడా సబబే. భరతుడు ఓర్పు గలవాడు, పెద్దలని పూజించే వాడు అని నాకు తెలుసు. సత్యసంధుడు, మహాత్ముడైన ఈ భరతుడికి అంతా మంగళకరం అవుతుంది. నేనీ అడవి నించి తిరిగొచ్చి, ధర్మశీలుడైన ఈ సోదరుడితో కలిసి భూమిని పాలిస్తాను. కైకేయి దశరథ మహారాజుని కోరినట్లుగా నేను వనవాసం చేస్తున్నాను. అందువల్ల నువ్వు కూడా రాజ్యాన్ని అంగీకరించి మహారాజైన తండ్రికి అసత్య దోషం కలగకుండా చేయి’ (అయోధ్యకాండ, 111వ సర్గ) హరిదాసు ఆనాటి కథ ముగిస్తూ చెప్పాడు.
‘అయోధ్యకాండ నూట పనె్నండో సర్గ సమాప్తం. ఆ రామచంద్రుడి దయ కథ విన్న అందరి మీదా ప్రసరించు గాక!’
ఆ కథ విన్నాక తిరిగి ఇంటికి వెళ్తూ ఆశే్లషతో వచ్చిన వాడి తల్లి శారదాంబ చెప్పింది.
‘హరిదాసు కంఠం బావుంటుంది. భావయుక్తంగా కథ చెప్తాడు. కాని ప్రతీసారి కొన్ని తప్పులు చెప్తూంటాడు. ఈ రోజు కథలో ఐదు తప్పులు చెప్పాడు.’

మీరా ఐదింటిని కనుక్కోగలరా?

1.్భమిని ఉద్ధరించింది బ్రహ్మదేవుడు. కాని హరిదాసు తప్పుగా విష్ణుమూర్తి అని చెప్పాడు.
2.వరాహ రూపం ధరించి భూమిని ఉద్ధరించాడు. హరిదాసు కూర్మరూపం ధరించి అని తప్పుగా చెప్పాడు.
3.నికుక్షి కొడుకు బాణుడు. బాణుడి కొడుకు అనరణ్యుడు. హరిదాసు వికుక్ష కొడుకు అనరణ్యుడని, అనరణ్యుడి కొడుకు బాణుడని మార్చి చెప్పాడు.
4.చ్యవన మహర్షి పేరుని హరిదాసు తప్పుగా ధన్వంతరిగా చెప్పాడు.
5.దశరథుడు అజుడి కొడుకు. హరిదాసు తప్పుగా సువ్రతుడి కొడుకు అని చెప్పాడు.
====================================================
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

గాయత్రి మంత్రంలోని ఎనిమిదవ బీజాక్షరం ‘య’ ఏ కాండలో ఏ శ్లోకంలో వస్తుంది?
అరణ్యకాండ 47-10లో మమ భర్తా మహాతేజాః వయసా పంచవింశకః శ్లోకంలో

వెలుతురు ఎక్కువైతే వ్యాధుల బెడద

$
0
0

ఫ్రశ్న: టీవీ తెరలు, సినిమాలు, కంప్యూటర్లు వీటి వలన కంటికి మాత్రమే హాని కలుగుతుందా? అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందా?

-గుండు ప్రసాదరావు (జగిత్యాల)

జ: భగవంతుడనండీ, ప్రకృతి అనండీ, పేరు తెలియని ప్రేరక శక్తి అనండీ.. ఏది నియంత్రిస్తున్నా ఈ సృష్టి ఒక నియతి ప్రకారం నడుస్తోంది. దాన్ని మనం పాటించాలి. పగలు సూర్యుడి కాంతి ఉన్నంతసేపూ మన కళ్లు పనిపాటల్లోనే ఉండాలి. రాత్రి చీకటి పడ్డాక కళ్లకు ఇంక పని ఉండకూడదు. ఇది నియతి! ఈ సూత్రానికి అనుగుణంగా శరీరంలో ఓ గడియారం రూపొంది శరీర ధర్మాలకు సమయపాలన చేస్తుంటుంది.
పొద్దున 8 అయ్యేసరికి బ్రేక్‌‘్ఫస్ట్ కోసం, మధ్యాహ్నం వొంటి గంట అయ్యేసరికి భోజనం కోసం కడుపులో గంట కొట్టినట్టు ఆకలి అవటం అనేది ఈ గడియారం వల్లనే జరుగుతోంది. ఇదంతా లయాత్మకంగా జరిగే ప్రక్రియ. దీన్ని ‘సర్కాడియన్ రిథమ్’ అంటారు. రాత్రి 10 అయ్యేసరికి నిద్ర ముంచుకు రావటం కూడా ఈ సర్కాడియన్ గడియారం వలనే జరుగుతోంది. మనం ఈ వేళల్ని మార్చాలని ప్రయత్నించటం జీవభౌతిక నియతిని మార్చటమే అవుతుంది. అందువలన ఏర్పడే అనారోగ్య స్థితిని ‘సర్కాడియన్ వ్యాధి’ అంటారు. వివిధ వాతవ్యాధులన్నీ ఈ సర్కాడియన్ వ్యాధుల పరిధిలోకే వస్తాయి.
‘లా జొల్లా’లోని జీవభౌతిక మార్పుల్ని అధ్యయనం చేసే ‘సల్క్’ పరిశోధనా సంస్థకు చెందిన శాస్తవ్రేత్తలు ఈ విషయం మీద పరిశోధన చేసి అందించిన నివేదికను మెడ్ న్యూస్ టు డే వెబ్ పత్రిక 2018 నవంబర్ 30న ప్రచురించింది. రాత్రి అనేది ముఖ్యంగా కళ్లకు విశ్రాంతి నివ్వటానికి ప్రకృతి నిర్దేశించిందనీ, మనిషి విద్యుత్ దీపకాంతి ద్వారా రాత్రిని పగలుగా మార్చాలని ప్రయత్నించటం చేత శరీరంలోని కాంతి గ్రాహక కణాలలో (లైట్ - సెన్సిటివ్ సెల్స్) మార్పులు ఏర్పడి సర్కాడియన్ గడియారాన్ని దెబ్బతీస్తాయని ఈ నివేదికలో వివరించారు.
కంటి లోపల రెటీనాలో కాంతి గ్రాహక కణాలుంటాయి. ‘మెలనోప్సిన్’ అనే ప్రొటీన్ సాయంతో కాంతి గ్రాహక కణాలు సంకేతాలు పంపుతూ శరీర జీవ నిర్మాణ క్రియలను (మెటబాలిజం) నడిపిస్తుంటాయి. వెలుతురు - చీకటి ఆధారంగా పనిచేసే ఈ కణాల కారణంగా ‘జీవన లయ’ (బయోలాజికల్ రిథం) ఏర్పడుతోంది. ఎక్కువ వెలుతురుకు గురైనప్పుడు 24 గంటల కాలవ్యవధిలో సగం సమయం వెలుగులోనూ, సగం సమయం చీకటిలోనూ మనం గడపాలనే ప్రకృతి నిర్దేశించింది. ఈ లయను కాపాడటానికే! విద్యుద్దీపాలు, సెల్‌ఫోన్లు, టీవీ, కంప్యూటర్ల కారణంగా మనిషి ఎక్కువ వెలుతురుకు బలౌతున్నాడు.
మెలనోప్సిన్ ప్రొటీన్ నిర్దేశిత సమయమూ, నిర్దేశిత పరిమాణం కన్నా ఎక్కువ వెలుతురు పొందుతుంటే, అది మెలటోనిన్ అనే హార్మోన్ మీద ప్రభావం చూపిస్తుంది. నిద్ర పట్టే యంత్రాంగాన్ని ఈ మెలటోనిన్ దెబ్బ తీస్తుందని శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. దీనివలన జీవ భౌతిక క్రియల లయాన్విత వ్యవస్థను దెబ్బ తీస్తుంది. మెలనోప్సిన్‌ని పెంచేందుకు అరెస్టిన్స్ అనే ప్రేరకాలను అందించే ప్రయోగాలు చేస్తున్నారు. ఇవన్నీ లోపాల్ని సరిచేసే ఔషధాలకు సంబంధించిన విషయాలు. కానీ, వెలుతురును కావలసినంత మాత్రమే వినియోగించే పద్ధతిలో జీవిస్తే, ఔషధ సేవన అవస్థ తప్పుతుంది కదా!
కొన్ని దేశాల్లో, కొన్ని ఋతువుల్లో రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. రాఅతి పదకొండయినా చీకటి పడకపోవచ్చు. అలాంటి దేశీయులు కూడా రాత్రి 10కన్నా ముందే తలుపులు మూసుకుని నిద్రపోవటమే మంచిదని దీని సారాంశం. రోజుకు 12 గంటలకన్నా ఎక్కువ సమయం వెలుతురులో గడపటం ప్రకృతికి విరుద్ధం అనీ, అది అనేక మెటబోలిక్ వ్యాధులకు కారణం అవుతోందనీ శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు.
మనం ఎంతసేపు మేలుకుని ఉన్నాం అనేదానికన్నా ఎంతసేపు, ఎంత కాంతిలో ఉన్నాం అనేది ముఖ్యం. ఎంత ఎక్కువ కాంతిలో ఉంటే అంత ఎక్కువ అనారోగ్యం. రేడియోల రోజుల్లో మనుషులు రాత్రి పదకొండు గంటల దాకా ఏ హరికథనో, సంగీత కచేరీనో వింటూ పడుకునేవాళ్లు. ఆ రోజుల్లో షుగరు వ్యాధి, బీపీ వ్యాధి, స్థూలకాయం లాంటి మెటబాలిక్ వ్యాధులు ఇంత ఎక్కువగా లేవు. టీవీలు స్మార్ట్ఫోన్లు, లాప్ టాప్‌లూ వచ్చాక మనకు తెలీకుండానే మన మీద చెడు పడ్తోంది.
ఇన్సులిన్ నిరోధం, షుగరు వ్యాధి, స్థూలకాయం, రక్తపోటు, కేన్సర్, ఇంకా ఇతర మెటబాలిక్ వ్యాధులు రావటానికి నిర్దేశిత సమయాన్ని మించి మనం అమితంగా వెలుతురులో గడపటం ఒక కారణం అవుతోంది. ఇది శరీరంలోని సహజమైన ‘నిద్ర - మెలకువ’ లయ (స్లీప్ వేక్ సైకిల్)ను కూడా దెబ్బతీస్తోంది.
ఆచార్య సచ్చిదానంద పండా అనే భారతీయ శాస్తవ్రేత్త ఈ పరిశోధనా బృందంలో ముఖ్యులు. అనేక దీర్ఘవ్యాధులు రావటానికి శరీరంలో సర్కాడియన్ లయ దెబ్బ తినటమే కారణం అంటున్నారు. ఇందుకు కంప్యూటర్లు, టీవీలు, సెల్‌ఫోన్ తెరలే కారణం కాబట్టి వీటిని ఆయన వెలుతురు తెరల వ్యాధులుగా ఆయన పేర్కొన్నారు.
వృత్తి వ్యాపకాల్లో మునిగి తేలే మనుషులు ప్రకృతి సహజసిద్ధమైన వ్యవస్థకు వ్యతిరేకంగా జీవించటం వలనే ఇన్ని అనర్థాలు కలుగుతున్నాయి. ‘బాడీ క్లాక్’ని సరి చేసుకోవటం మన బాధ్యత. మన అవసరం కూడా! చీకటీ విలువైనదే! తగినంత చీకటిని కూడా మనం కళ్లకు ఇవ్వాలి. భగవంతుడా! నాక్కొంచెం చీకటినివ్వు - అని వేడుకోవాల్సిన స్థితిలోకి మనం వెళ్లిపోతున్నాం. రాత్రి 10 తరువాత ఇంట్లో దీపాలు ఆర్పకపోతే శరీరంలో జీవ దీపం ఆరిపోయే ప్రమాదం ఉంది.
అందరం నిద్రపోతున్నాం. కానీ సరైన సమయంలో సరైన సమయం నిద్రపోలేక పోతున్నాం. అమెరికాలో 50 నుండి 70% మంది నిద్రలేమి వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. అన్నింటికీ అమెరికాని ఆదర్శంగా తీసుకునే మన మనోబలహీనత కారణంగా మనం కూడా ఇంచుమించు ఇదే స్థితిలో ఉన్నాం.
రాత్రిపూట చీకటికీ సమాన ప్రాతినిధ్యం ఇస్తే చాలా సమస్యలు తీరుతాయి. చీకటి వెలుగుల రంగేళీయే కదా.. జీవితం అంటే!


వారం వారం గోచారం (16-12-2018 నుంచి 22-12-2018 వరకు)

$
0
0

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఆదివారం ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త. పరామర్శలకు అవకాశం. ఆధ్యాత్మిక జీవన విధానం మేలు. కొంత అసంతృప్తి ఉంటుంది. విశ్రాంతి లోపం కనిపిస్తుంది. సోమవారం వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్త. సంప్రదింపుల్లో లోపాలు. వ్యతిరేకతలు తీవ్రం. శ్రమాధిక్యం. అనుకోని సమస్యలుంటాయి. మంగళవారం వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు. బాధ్యతలు అధికం. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. బుధవారం భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు అనుబంధాలు విస్తరిస్తాయి. సంతోషంగా గడుపుతారు. గురువారం ఉన్నత వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. కుటుంబంలో సంతోషం. సంతృప్తి. శుక్రవారం సౌకర్యాలు సమకూర్చుకుంటారు. ఆహార విహారాలపై ప్రత్యేక దృష్టి. ఆర్థిక వ్యవహారాల్లో సంతృప్తి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఆదివారం కార్యనిర్వహణలో జాగ్రత్త. ఊహించని సంఘటనలుంటాయి. సృజనాత్మకత తగ్గుతుంది. సంతానవర్గ సమస్యలు తప్పకపోవచ్చు. ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. శ్రమాధిక్యం. సోమవారం సౌకర్యాలు కొంత ఒత్తిడులకు గురి చేయవచ్చు. ఆహార విహారాలపై దృష్టి ఉన్నా ఆశించిన తృప్తి లేదు. మంగళవారం పోటీ రంగంలో ఇబ్బందులకు అవకాశం. లక్ష్యాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక ప్రయాణాల వల్ల మేలు. బుధవారం సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలు. సహకారం లభిస్తుంది. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. గురువారం ఆలోచనల్లో ఒత్తిడులు. సంతాన వర్గంతో సమస్యలుంటాయి. అధికారిక లోపాలు. శుక్రవారం ఖర్చులు పెట్టుబడులు అధికం. దానధర్మాల వల్ల మేలు. ఉద్యోగ బాధ్యతలు అధికం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఆదివారం సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ఆహార విహారాల్లో అనుకూలత. నిర్ణయాదుల్లో లోపాలుంటాయి. ఆలస్య వ్యవహారాలు, ఆత్మవిశ్వాస లోపాలు. శ్రమతో కార్యాలు. సోమవారం వ్యాపారాదుల్లో పెట్టుబడులు అధికం. విశ్రాంతి లభిస్తుంది. ప్రయాణాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మంగళవారం ఆలోచనల్లో అనుకూలత. సృజనాత్మకత. కుటుంబంలో ఒత్తిడులు. మాటల్లో నైరాశ్య భావనలు. బుధవారం లాభాలు సంతోషాన్నిస్తాయి. సంతాన వర్గంతో సంతోషంగా గడుపుతారు. పెద్దల వల్ల ప్రయోజనాలు. గురువారం నిర్ణయాదులు శ్రమకు గురి చేస్తాయి. తొందరపాటు కూడదు. ఆత్మవిశ్వాస లోపాలుంటాయి. శుక్రవారం అనుకోని ఇబ్బందులుంటాయి. వ్యతిరేకతలు తీవ్రం. పోటీ రంగంలో విజయం. చికాకులను అధిగమిస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఆదివారం లాభాలు సంతోషాన్నిస్తాయి. అనుకోని ఒత్తిడులు కూడా ఉంటాయి. కార్యనిర్వహణలో ఆలస్యం. సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం. శ్రమాధిక్యం. సోమవారం భాగస్వామ్యాలపై దృష్టి. వ్యాపారాదుల్లో అనుకూలత. పెట్టుబడులు ఖర్చులు పెరిగే అవకాశం. మంగళవారం లక్ష్యాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక వ్యవహారాల వల్ల మేలు. ప్రయాణాలకు అవకాశం. కొంత అసంతృప్తి. బుధవారం వ్యతిరేకతలపై విజయం. పోటీ రంగంపై దృష్టి. పోటీలు, ఒత్తిడులు, చికాకులను అధిగమించాలి. ఆత్మవిశ్వాసం. గురువారం అధికారిక వ్యవహరాల్లో జాగ్రత్త వహించాలి. పన్నులు ముందుగానే చెల్లించాలి. బాధ్యతలు అధికవౌతాయి. శుక్రవారం సంప్రదింపులకు అనుకూలం. సహకారం లభిస్తుంది. సోదర వర్గంతో అనుకూలత. దగ్గరి ప్రయాణాలు.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఆదివారం సౌకర్య లోపాలు. ఆహార విహారాల్లో సమస్యలు. శ్రమాధిక్యం. భాగస్వామ్యాల్లో సమస్యలు. వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. పరిచయాలు స్నేహానుబంధాల్లో అప్రమత్తత. సోమవారం సంప్రదింపులకు అనుకూలం. వ్యాపార వ్యవహారాల్లో శుభ పరిణామాలు. సహకారం లభిస్తుంది. వ్యాపారాల్లో ఉన్నతి. మంగళవారం ఆలోచనల్లో ఒత్తిడులు. సృజనాత్మకత లోపం. నిరాశాపూరితమైన ఆలోచనలు. ఒత్తిడికి గురి అవుతారు. బుధవారం కుటుంబంలో అనుకూలత. మాటల్లో చమత్కారం. ఆర్థిక నిల్వలు పెంచుకుంటారు. గురువారం సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. వ్యర్థమైన ఖర్చులు, పెట్టుబడులు. ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. శుక్రవారం లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఆదివారం ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త. ఒత్తిడులు అధికం. విశ్రాంతి లోపం. పరామర్శలుంటాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు. సంప్రదింపుల్లో సమస్యలు అధికం. సోమవారం సహకారం లభిస్తుంది. వ్యాపారాదుల్లో లాభాలుంటాయి. పెద్దల ఆశీస్సులు. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. మంగళవారం నిర్ణయ లోపాలు. ఆత్మవిశ్వాసం కోల్పోవచ్చు. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. శ్రమాధిక్యం. బుధవారం వృత్తి ఉద్యోగాదుల్లో ఘర్షణలు అధికం. సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాల్లో శుభ పరిణామాలు. గురువారం అధికారికమైన ప్రయాణాలు. పన్నులు చెల్లించాలి. పితృవర్గ వ్యవహారాల్లో ఘర్షణ. ఆరోగ్య సమస్యలు. శుక్రవారం భాగస్వామ్యాల్లో అనుకూలత. సంతాన వర్గంతో సంతోషంగా గడుపుతారు. ఉన్నత వ్యవహారాలపై దృష్టి.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఆదివారం భాగస్వామ్యాల్లో ఒత్తిడులుంటాయి. పరిచయాలు స్నేహానుబంధాల్లో ఒత్తిడులుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్తగా మెలగాల్సిన ఉంటుంది. గౌరవం తగ్గుతుంది. సోమవారం అధికారిక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. వ్యాపారాదుల్లో అనుకూలత. వృత్తిలో పదోన్నతులుంటాయి. మంగళవారం అనుకోని ఇబ్బందులు. ఆరోగ్య లోపాలుంటాయి. ఊహించని సమస్యలను శ్రమతో అధిగమించాలి. బుధవారం మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతాన వర్గంతో సంతోషంగా గడుపుతారు. సృజనాత్మకత పెరుగుతుంది. గురువారం పరిచయాలు, అనుబంధాల్లో ఒత్తిడులు తప్పకపోవచ్చు. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. శుక్రవారం కుటుంబంలో సంతోషం. ఆర్థిక నిర్వహణలో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఆదివారం సంప్రదింపుల్లో జాగ్రత్త. శ్రామికవర్గ సహకారం. ప్రయాణాల్లో ఒత్తిడులు. పోటీ రంగంలో ఇబ్బందులుంటాయి. వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. సోమవారం వ్యతిరేకతలపై విజయం. కుటుంబంలో అనుకూలత. మాటల్లో చమత్కార ధోరణి. ఆర్థిక నిల్వలు పెరుగుతాయి. మంగళవారం పరిచయాలు విస్తరిస్తాయి. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ఆహార విహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. బుధవారం నిర్ణయాదుల్లో అనుకూలత. చాలా సంతోషంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. గురువారం అధికారిక వ్యవహారాల్లో సహకారం లభిస్తుంది. ప్రయాణాదుల్లో కొంత జాగ్రత్త. లాభాలు సంతోషాన్నిస్తాయి. శుక్రవారం అన్ని పనుల్లో జాగ్రత్త. కొత్త పనులను వాయిదా వేయాలి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఆదివారం లాభాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. ఆశించిన ప్రయోజనాలు అందవు. సోదర వర్గం, కుటుంబంలో ఒత్తిడులుంటాయి. సోమవారం వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. అధికారిక ధోరణి పెంచుకుంటారు. మంగళవారం పరామర్శలుంటాయి. వ్యర్థమైన ప్రయాణాలకు అవకాశం. సంప్రదింపుల్లో అప్రమత్తంగా మెలగాలి. బుధవారం సంతోషంగా గడుపుతారు. ప్రయాణావకాశాలు. సంప్రదింపులకు అనుకూలం. సహకారం వల్ల సంతృప్తి. గురువారం లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులున్నా కొంత ఘర్షణ తప్పకపోవచ్చు. సౌకర్యాలు పెరుగుతాయి. శుక్రవారం వ్యతిరేకతలు అధికం. పోటీల్లో జాగ్రత్త. సౌఖ్య లోపం ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఆదివారం వ్యతిరేకతలు అధికం. లక్ష్యాలను సాధించడంలో కొన్ని అడ్డంకులు, ఆలస్యాలు. పోటీ రంగంలో జాగ్రత్తగా మెలగాలి. భాగస్వామ్య సమస్యలు. అనుకోని ఒత్తిడులుంటాయి. సోమవారం ఉన్నత వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. సృజనాత్మకత పెరుగుతుంది. మంగళవారం పరిచయాలు స్నేహానుబంధాల్లో జాగ్రత్త. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. కార్యనిర్వహణలో అనేక సమస్యలు. బుధవారం సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాల్లో అనుకూలత. సౌఖ్యంపై ప్రత్యేక దృష్టి. గురువారం లాభాలపై ప్రత్యేక దృష్టి. వ్యతిరేకతలను అధిగమిస్తారు. శ్రమతో కార్యసాధన. పోటీ రంగంలో గుర్తింపు. శుక్రవారం నిర్ణయాదుల్లో అనుకూలత. అన్ని పనుల్లో ప్రయోజనాలు. లాభాలు సంతోషాన్నీ, సంతృప్తినీ ఇస్తాయి.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఆదివారం కుటుంబంలో ఒత్తిడులు. ఆలోచనల వల్ల సమస్యలుంటాయి. సృజనాత్మకత లోపం. మాటల్లో జాగ్రత్తగా మెలగాలి. ఆర్థిక నిల్వలు లోపిస్తాయి. వ్యవహారాల్లో జాగ్రత్త. సోమవారం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిర్ణయాదుల్లో శుభ పరిణామాలు. నూతన కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి. మంగళవారం సంప్రదింపుల్లో జాగ్రత్త. ఆధ్యాత్మిక ప్రయాణాలకు, పూజలకు అనుకూలం. వ్యతిరేకతలు అధికం. బుధవారం విందులు, విలాసాల కోసం వెచ్చిస్తారు. ప్రయాణాల్లో శుభ పరిణామాలు. పోటీల్లో విజయ సాధన. గురువారం కుటుంబంలో ఒత్తిడులుంటాయి. మాటల్లో శ్రమ. నిల్వధనం లోపించే అవకాశం. వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. శుక్రవారం లక్ష్యాలను సాధిస్తారు. పరిచయాలు స్నేహానుబంధాల్లో అనుకూలత.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదివారం వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్త. అధికారిక లోపాలుంటాయి. నిర్ణయాదుల్లో శుభ పరిణామాలు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. సామాజిక గౌరవం తగ్గే సూచనలు. సోమవారం అన్ని పనుల్లోనూ అనుకూలత. లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. కీర్తి ప్రతిష్టలు. మంగళవారం లాభాలున్నా సంతోషం ఉండదు. పెద్దలతో జాగ్రత్త. అన్ని పనుల్లోనూ సమస్యలు ఎదురుకావచ్చు. బుధవారం కుటుంబ ఆర్థికాంశాల్లో సమస్యలుంటాయి. మాటల వల్ల సమస్యలు రాకుండా చూసుకోవాలి. గురువారం వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. పదోన్నతి. సమస్యలుంటాయి. ఒత్తిడులున్నా విజయ సాధన. సహకారం లభిస్తుంది. శుక్రవారం మనోభీష్టాలు నెరవేరుతాయి. సంప్రదింపులకు అనుకూలం. సంతోషంగా గడుపుతారు.

వేణునాద విజయం(రాస క్రీడాతత్త్వము-7)

$
0
0

(iii) ఇంకా ఎందరెందరో జీవులు పూర్వజన్మలలో చేసుకున్న మహాతపస్సులవల్లా, తన వరాలవల్లా, ఈ నాడు తన దగ్గర గోపికలై జన్మించి వున్నారు. (ఈ విషయాలు గర్గసంహిత, బ్రహ్మవైవర్త పురాణం, వంటి గ్రంథాలలో వున్నాయి)
(iv) వీరిలో కొందరు కన్యలున్నారు. వారు తనను భర్తగా పొందాలని కాత్యాయనీవ్రతం చేసి వున్నారు. ఒక రాత్రి క్రీడిస్తానని వారికి తనే వరం ఇచ్చి వున్నాడు.
v) వారిలో కొందరు యువతులు, మరి కొందరు పిల్లల తల్లులు, రక రకాల వయసుల వాళ్ళున్నారు.
వీళ్ళందరూ ఉపాసన చేస్తున్నామనే జ్ఞానం లేకుండానే తనను గురించి గొప్ప ఉపాసన చేస్తున్నారు. వీరందరికీ ఈ నాటి మానవ దేహాలతోనూ, మానవ కుటుంబాలతోనూ, ఒక ప్రక్క బంధం పెరిగిపోతోంది. మరొక ప్రక్క అవ్యాజమైన ఉపాసన జరిగిపోతోంది.
వీరందరినీ ఉద్ధరించేదెలా? వీరికి లోకబంధాల మీద దృష్టి పడకుండా, పరమాత్మదృష్టి సర్వకాల సర్వావస్థల లోనూ ఒకే విధంగా నిలబడి వుండేటట్లు చెయ్యటమెలా?
అలా చెయ్యాలంటే-వీరిని పరీక్షించాలి. వీరిలో తన దివ్యత్త్వాన్ని గుర్తుపట్టిన వారెందరు? కేవలం తన సమ్మోహన శక్తివల్ల వెంటపడుతున్నవారెందరు?
వీరిలో యోగ్యులైనవారికి మన్మధ భావాలను తొలగించేదెలా? పరమాత్మ తాదాత్మ్యస్థితికి చేర్చేదెలా?
శ్రీకృష్ణుడు ఈ సమస్యలన్నీ ఆలోచించుకుని, ఒకానొక శరత్కాల పూర్ణిమరాత్రి నాడు, రాత్రి మొదటి జాములోనే యమునా తీరానికి వెళ్ళి, జగన్మోహనంగా మురళీగానం ప్రారంభించాడు.
ఆ గానంలో కామరాజ బీజమైన క్లీంకారాన్ని జోడించాడని వేదవ్యాసుడు నిగూఢంగా చెప్పాడు. అక్కడి శ్లోకంలో
‘‘జగౌ కలం వామదృశాం మనోహరం’’ (10స్కం- 29అధ్యా-3శ్లో) (స్ర్తిలను హృదయాలను ఆకర్షించేలాగా గానం చేశాడు) అని వుంది. ఇక్కడ ‘‘కలం’’ అనే పదం క్లీంకారానికి సంకేతమేనని వ్యాఖ్యాతలు నిర్ణయించారు. ఇలాంటి సంకేతాలను వాడటం వేదంలో గూడా వుంది.
ఈ భావాలను మనస్సులో పెట్టుకునే లీలాశుక మహాకవి శిశువైన శ్రీకృష్ణుడి వేణుగానాన్ని ఇలా వర్ణించాడు.
లోకానున్మదయన్ శ్రుతీర్ముఖరయన్ క్షోణీరుహాన్ హర్షయన్
శైలా న్విద్రవయన్ మృగాన్వివశయన్ గోబృంద మానందయన్
గోపాన్ సంభ్రమయన్ మునీన్ ముకుళయన్ సప్తస్వరాన్ జృంభయన్
ఓంకారార్థ ముదీరయన్ విజయతే వంశీనినాద శ్శిశోః ॥
(శ్రీకృష్ణ కర్ణామృతము, శ్లో-110)
(్భవం : బాలకృష్ణుడు మురళి ఊదుతుంటే, ఆ నాదం లోకులకు పిచ్చెక్కిస్తోంది. వేదాలను మరుమ్రోగిస్తోంది. చెట్లను సంతోషపెడుతోంది. కొండలను కరిగిస్తోంది. జంతువులను పరవశింపజేస్తోంది. గోవుల బృందాలను ఆనందింపజేస్తోంది. గోపాలకులను తత్తరపరుస్తోంది. మునులకు విబనులు మూయిస్తోంది. సప్తస్వరాలను విజృంభింపజేస్తోంది. ఓంకారార్థాన్ని పలుకుతోంది. ఆ విధంగా ఆ స్వామి వేణునాదం సర్వలోకాల మీదా విజయం సాధిస్తోంది.)
గోపికల ప్రతిస్పందన :-
అలా ఆ వేణుగాన నాదాలు బృందావనాన్నీ, చుట్టుప్రక్కల గల వ్రజగ్రామాల్నీ, వెనె్నలతో సమానంగా అల్లుకుని చుట్టుకోసాగాయి. కానీ, చిత్రమేమంటే ఆయా గ్రామాలలో గల గోపికలలో ఎవరెవరు పరమాత్మ యెడల పరమ విరహభక్తి రూపమైన భక్తిని పూర్వ జన్మలలోనూ, ఈ జన్మలలోనూ కూడా ఆచరిస్తున్నారో, అలాంటివారికి మాత్రమే ఈ గానాలు చెవుల ద్వారా హృదయాలలోకి విరహభక్తి మార్గంలో ఆ స్వామిని ఉపాసన చేస్తున్న జీవుల విషయంలో మాత్రం ఈ నాదాలకు చేతులొచ్చి, వారి హృదయాలను కవ్వం చిలికినట్టు చిలికి, వారి ప్రాణాలను అతలాకుతలం చేశాయి. మధురాతి మధురంగా వున్న ఆ ప్రాణాంతక సన్నివేశాన్ని ఆ గొల్ల మహిళలు తట్టుకోలేక, అదేమిటో అర్థం కాక, ప్రాణాలూ, దేహాలూ, తమ వశంలో లేక, అది ఆనందమో, బాధో, తెలియని విచిత్రావస్థలో పడ్డారు.
కొందరు జీవులకు తమలో కలిగేది మన్మధవికారమేమో అనిపించింది.
మరి కొందరికి నాదోపాసనేమో అనిపించింది. మరి కొందరికి పిచ్చేమోననిపించింది. మరి కొందరికి మనసు పనిచేయటం మానేసింది.
(ఇంకా వుంది)

గురు ప్రశంసతో కళకు సార్థకత

$
0
0

డాక్టర్ చింతా ఆదినారాయణ శర్మగారు ప్రఖ్యాత కూచిపూడి గురువు, నర్తకుడు. వీరు దశాబ్దాలుగా కూచిపూడి నృత్యానికే అంకితమయ్యారు. వీరి కళాసేవకు తార్కాణం గౌరవ డాక్టరేట్. త్యాగరాజ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్‌లో కూచిపూడి అధ్యాపకుడిగా పనిచేసి, రిటైరయ్యారు. దాదాపు 15వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఉత్తమ అధ్యాపకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే సత్కరింపబడ్డారు. వీరి శిష్యులు ప్రశిష్యులు వేల మంది కళాసేవ చేస్తున్నారు. వీరు నాట్యకళానిధి, నాట్య విశారద బిరుదులు పొందారు.
వారితో ముఖాముఖి-
* * *
నేను 1954 శ్రావణ పౌర్ణమి నాడు జన్మించాను. మా అమ్మానాన్నగార్లు చింతా రాధాకృష్ణమూర్తి - సీతా మహాలక్ష్మి. నేను కూచిపూడిలో పుట్టి పెరిగాను. తరువాత గుంటూరులో 1974-76లో ఎం.కాం చేశాను. నా మొట్టమొదటి గురువు మా నాన్నగారు. వారిది ఉమ్మడి కుటుంబం. బాబాయి చింతా కృష్ణమూర్తి గారి వద్ద తర్వాత నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టాను. 1964లో కూచిపూడిలో సిద్దేంద్ర కళాక్షేత్రం జన్మించింది. అప్పటివరకు ఇళ్లల్లోనే కూచిపూడి నాట్యం నేర్చుకునే వాళ్లం. నేను సిద్దేంద్ర కళాక్షేత్రం ఫస్ట్ బ్యాచ్. 1964లో నాన్నగారు గుంటూరు వెళ్లాను. నేను కూచిపూడిలో ఉండిపోయాను. సంగీత నాటక అకాడెమీ స్కాలర్‌షిప్ వచ్చింది. ఆ రోజుల్లో 20 రూపాయలు ఇచ్చేవారు. నేను పివిజి కృష్ణశర్మ గారి వద్ద, వెంపటి చినసత్యం గారి వద్ద నృత్యం నేర్చుకున్నాను. 1964 నుండి వెంపటి చినసత్యం గారి వద్ద నేర్చుకున్నాను. ఎం.కాం అయిపోయిన తర్వాత మద్రాస్ వెళ్లి, 1983 ప్రాంతంలో చాలా ఏళ్లు నాట్యం నేర్చుకున్నాను. తెలుగు విశ్వవిద్యాలయంలో 1989-92 పని చేశాను. 1992లో గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీలో పని చేయడం మొదలుపెట్టాను.
సింగపూర్, మలేషియా, మారిషస్, శ్రీలంక, లండన్, యుఎస్.. ఇలా ఎన్నో దేశాలు పర్యటించి నృత్య ప్రదర్శనలిచ్చాను.
డా.సి.నారాయణ రెడ్డిగారు నా చేత ‘సుగ్రీవ విజయం’ చేయించారు. అప్పుడు వారు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు. నన్ను ఎంతో అభినందించారు.
కళారంగంలో, కళాకారుల్లో అసూయా ద్వేషాలు ఉంటాయి. ఎందుకు ఇలా చేస్తారో తెలియదు. నృత్యం ఒక తపస్సు. కళాకారులు మునుల్లా మదమాత్సర్యాలకు అతీతంగా ఉండాలి. మా చిన్నప్పుడు మా మేకప్ మేమే వేసుకునేవాళ్లం. మాకు ఎవరూ నేర్పించలేదు. ఇంకొకర్ని చూసి నేర్చుకునేవాళ్లం. సరైన విగ్గులు, ఆభరణాలు, దుస్తులు దొరికేవి కాదు. కొన్ని బాధలు చెప్పుకోలేం. కేవలం ప్రతిభ, వ్యుత్పత్తి, సృజనతో పైకి వచ్చాను.
మా గురువుగారు వెంపటి చినసత్యంగారు, ఉద్యోగంలో డా.సి.నారాయణరెడ్డిగారు, తరువాత రమణాచారి (ఐఎఎస్), కిషన్‌రావు (ఐఎఎస్) సహాయం చేశారు. వీరి రుణం తీర్చుకోలేనిది.
రోజూ పొద్దున్న రెండు గంటలు, రాత్రి 3 గంటలు అభ్యాసం చేసేవాడిని.
ఆలోచించి ఏ పనైనా చేయాలి. ఒక గురువు దగ్గర నుండి ఇంకొక గురువు దగ్గరికి ఊరికే మారకూడదు. నృత్యం శైలి, బాణీ మారిపోతుంది. ఒకే గురువుని నమ్ముకోవాలి. రాత్రికి రాత్రి శిష్యులు ప్రదర్శనకు తయారవరు. కనీసం ఐదారేళ్లు కష్టపడి ఇష్టపడి నేర్చుకోవాలి. శిష్యుల ప్రతిభ చూసి గురువు సంతోషపడి, అనుమతి ఇస్తే అప్పుడు ప్రదర్శనలు ఇవ్వవచ్చు. కళ ఒక జీవనశైలి, జీవన విధానం.

‘ఉమ్మడి’ స్టేషన్..!

$
0
0

ఆ స్టేషన్ రెండు రాష్ట్రాల్లోనూ ఉంది..
ఆ స్టేషన్‌లోని బెంచ్ కూడా రెండు రాష్ట్రాల్లో ఉంది..
ఏమిటీ కన్‌ఫ్యూజన్? ఆ స్టేషన్ అంత పెద్దదా? లేక ఆ బెంచా? అనుకుంటున్నారు కదూ.. వివరాల్లోకి వెళితే..
ఒక్క అడుగుతో ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి మారిపోవడం మనం తరచూ చూస్తున్నదే.. కానీ ఒక రైల్వేస్టేషన్లో సగం ఒక రాష్ట్రంలో, మరో సగం మరో రాష్ట్రంలో ఉండటాన్ని ఎప్పుడైనా చూశారా? అయితే మీరు నవాపూర్ రైల్వేస్టేషన్‌కు వెళ్లాల్సిందే.. ఇక్కడే ఉంది ఈ విచిత్రమైన రైల్వేస్టేషన్.. నవాపూర్ ఉండేది మహారాష్టల్రోనే.. కానీ ఈ స్టేషన్‌లోని సగభాగం మహారాష్టల్రో ఉండగా.. మిగిలిన సగభాగం గుజరాత్‌లో ఉంది. ఇరురాష్ట్రాల సరిహద్దుల్లో ఈ రైల్వేస్టేషన్ ఉంది. ఆఖరుకి రైల్వేస్టేషన్‌లోని ఒక బెంచ్‌పై సగం గుజరాత్, సగం మహారాష్టన్రు సూచిస్తుంటుంది. అలాగే ఈ స్టేషన్‌లో టిక్కెట్ కౌంటర్ మహారాష్టల్రో ఉండగా, స్టేషన్ మాస్టర్ గుజరాత్ వైపు ఉంటారు. నవాపూర్ రైల్వే పోలీస్ స్టేషన్ క్యాంటీన్ టిక్కెట్ విండో మహారాష్టల్రోని నందూర్‌బార్ జిల్లాలోని నవాపూర్ వైపు వస్తాయి. స్టేషన్ మాస్టర్ వెయిటింగ్ రూం, వాటర్ ట్యాంక్, టాయిలెట్.. మొదలైనవి గుజరాత్‌లోని తాపీ జిల్లా ఉచ్ఛల్‌వైపు వస్తాయి. అలాగే ఇక్కడికి వచ్చే రైలులోని కొంతభాగం మహారాష్ట్ర, మరి కొంతభాగం గుజరాత్‌లో ఉంటుంది. ఈ రైల్వేస్టేషన్‌ను నిర్మించినప్పుడు గుజరాత్, మహారాష్టల్రు విడివిడిగా లేవట. అప్పట్లో నవాపూర్ స్టేషన్ ముంబయి పరిధిలోనే ఉండేది. తర్వాత ఇవి రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి. ఈ నేపథ్యంలోనే నవాపూర్ రైల్వేస్టేషన్ ఇరు రాష్ట్రాల మధ్యభాగంలో ఉండిపోయింది. ఒకేసారి రెండు రాష్ట్రాల్లో, రెండు ప్రాంతాల్లో ఉండేట్లు చేసింది. అందుకే ఇది అత్యంత విచిత్రమైన రైల్వేస్టేషన్‌గా పేరు పొందింది.

పెళ్లికూతురిని తినేద్దామా..

$
0
0

మీరు సరిగ్గానే చదివారు.. వివరం ఏంటంటే.. ఒంటినిండా నగలతో, మేకప్‌తో ఎంతో అందంగా ఒదిగి కూర్చున్న ఈ పెళ్లికూతురుని చూసి మురిసిపోతున్నారేమో.. ఈమె నిజమైన పెళ్లికూతురు కాదు. షోకేస్‌లో పెట్టిన నోరూరించే కేక్.. అస్సలు నమ్మబుద్ధికావడం లేదు కదూ.. నిజమే.. యూకేకు చెందిన ఎమ్మా జేన్ ఈ అందమైన కేక్‌ను తయారుచేసింది. ఎమ్మాజేన్ ప్రత్యేకత ఏంటంటే.. ఆమె తయారుచేసిన కేక్ డిజైన్లన్నీ చూడటానికి నిజమైన ఆకృతులేననిపిస్తాయి. ఓసారి ఎమ్మా గుర్రం కూర్చున్నట్లుగా ఉన్న పోజ్‌లో ఓ కేక్‌ను రూపొందించింది. దాన్ని ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించినప్పుడు వీక్షకులు దానిని నిజమైన గుర్రం బొమ్మ అని భ్రమపడ్డారట. తరువాత అది కేక్ అని తెలిసి అందరూ దానితో తెగ సెల్ఫీలు దిగారు. 2012 నుంచి ఎమ్మా బేకింగ్ వృత్తిలో ఉంది. వస్తువుల ఆకారంలో ఉన్న కేక్‌లనే కాదు సెలబ్రెటీల ఆకారంలో ఉన్న కేక్‌లను ఇట్టే రూపొందిస్తుంది ఎమ్మా. అబర్‌డేర్ ప్రాంతంలో ఎమ్మాకు వర్క్‌షాప్ కూడా ఉంది. యూరప్‌లో బేకర్‌గా ఎమ్మాకు విపరీతమైన డిమాండ్.. అక్కడి పాఠశాలలు, కళాశాలల్లో ఎమ్మా చేత బేకింగ్‌లో శిక్షణా తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఎమ్మా రూపొందించిన కేక్‌లలో ప్రపంచంలోనే ఉత్తమ కేక్‌లుగా అవార్డు అందుకున్న డిజైన్లు కూడా ఉన్నాయి. చూడటానికి ఇంత బాగున్న ఈ కేక్‌లను తింటే మతిపోతుందేమో.. రుచి చూడాలంటే మాత్రం యూకే వెళ్లాల్సిందే సుమా!

Viewing all 69482 articles
Browse latest View live