కామారెడ్డి, డిసెంబర్ 17: చేతి వృత్తుల వారికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో కుమ్మరి శాలివాహన సభ్యులకు మట్టి వాటర్ బాటిల్ తయారీపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆగస్టు 25వ తేదీన జిల్లా నుంచి 5 మంది శాలివాహనులకు రామానంద తీర్థ ట్రైనింగ్ సెంటర్ (్భదన్ పోచంపల్లి)లో శిక్షణ ఇచ్చిన్నట్లు తెలిపారు. ప్రసుత్తం జిల్లా కేంద్రంలో 30 మంది శాలివాహనులకు 3 రోజుల పాటు మట్టి వాటర్ బాటిల్పై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నేటి సమాజంలో ప్లాస్టిక్ బాటిల్ వినియోగం ఎక్కువగా ఉందని, దీంతో విపరీతంగా కాలుష్యం పెరుగుతుందన్నారు. మట్టి వాటర్ బాటిల్లు కుండలు, మట్టి పాత్రలు తయారు చేసి కాలుష్యాన్ని నివారించవచ్చని తెలిపారు. శాలివాహనులు తయారు చేసిన ఉత్పత్తులకు విస్తృతంగా మార్కెంటింగ్ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. మూడు రోజులు శిక్షణ తీసుకున్న శాలివాహనులు గ్రామాల్లోని మిగతా సభ్యులకు శిక్షణ ఇచ్చిమట్టి పాత్రలు ఎక్కువగా తయారుచేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. మట్టికుండలు, పాత్రలతో కాలుష్యాన్ని అదుపు చేయవచ్చని తెలిపారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఝాన్సీరాణి మాట్లాడుతూ, శాలివాహనులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శాలివాహనులు ఆర్థికంగా ఎదగడానికి శిక్షణ కార్యక్రమం ప్రయోజనాత్మకంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ద్ధిఅధికారి జాన్సీరాణి, శాలివాహన జిల్లా అధ్యక్షుడు రమేశ్, ఉపాధ్యక్షుడు విఠల్, సెక్రటరీ మధు, ప్రవీణ్, చంద్రం, సంతోష్ పాల్గొన్నారు.
ప్రజావాణికి 17 ఫిర్యాదులు
అశోక్నగర్(కామారెడ్డి), డిసెంబర్ 17: కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జనహిత సమావేశం మందిరంలో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 17 ఫిర్యాదులు వచ్చిన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఫిర్యాదుల్లో రెవెన్యూ శాఖకు 7, గృహశాఖకు 3, డీఎంహెచ్వోకు 3, డీఈవో 1, డీపీవో 2, ఎస్సీ కార్పోరేషన్ 1 ఫిర్యాదు చొప్పున మొత్తం 17 ఫిర్యాదులు వచ్చిన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీవో శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కేటీఆర్కు మాజీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు
ఎల్లారెడ్డి, డిసెంబర్ 17: తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, కల్వకుంట్ల తారక రామారావును నియమించడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి ఆయన సతీమణి ఏనుగు మంజులారెడ్డిలు హైద్రాబాద్లో కేటీఆర్ను మర్యాద పూర్వకంగా కలుసుకుని, పుష్పగుచ్ఛాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకోసం సీఎం కేసీఆర్ సరియైన నిర్ణయం తీసుకున్నారన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ నేతృత్వంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అన్ని మండలల్లో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేస్తామని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసి లబ్దిపొందేలా కృషిచేస్తామన్నారు.
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి
- జేసీ వెంకటేశ్వర్లు
కంఠేశ్వర్, డిసెంబర్ 17: ఉద్యోగ రీత్యా పదవీ విరమణ చేసి పింఛన్లు పొందుతున్న పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం నగరంలోని రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని నిర్వహించగా, జే.సీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగి కొలువు చేసే సమయంలో సన్మానాలు చేసుకునేందుకు తీరిక ఉండదని, ఎందుకంటే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు అందించేందుకు బిజీగా ఉంటారని అన్నారు. పదవీ విరమణ చేశాక సన్మానం చేసుకునే వీలు కలుగుతుందన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని, పెన్షనర్లకు ప్రభుత్వం పలు సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. పెన్షనర్లు తమ ఆరోగ్య సమస్యలను పరీక్షించుకునేందుకు వెల్నెస్ సెంటర్ కావాలని కోరుతున్నందున, ఈ అంశాన్ని సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామని అన్నారు. అంతకుముందు పెన్షన్స్ కోసం పోరాడిన డీఎస్ నగార చిత్రపటానికి జే.సీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్రెడ్డి, తాలూకా స్థాయి అధ్యక్షుడు జగత్రెడ్డి, పెన్షన్లు రాజారాం, భూంరెడ్డి, పోతన్కర్ లక్ష్మీనారాయణ, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
డయల్ యువర్ సీపీకి ఐదు ఫిర్యాదులు
వినాయక్నగర్, డిసెంబర్ 17: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10:30నుండి 11:30గంటల వరకు నిర్వహించిన డయల్ యువర్ పోలీస్ కమిషనర్ కార్యక్రమానికి ఎనిమిది ఫిర్యాదులు వచ్చాయి. కమిషనర్ కార్తికేయ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఆదేశాల మేరకు అదనపు డీసీపీ శ్రీ్ధర్రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్ల పరిధి నుండి వివిధ సమస్యలపై బాధితులు ఫోన్ల ద్వారా ఫిర్యాదులు చేశారని ఆయన వెల్లడించారు. ఈ ఫిర్యాదులను నమోదు చేసుకుని వాటి పట్ల సానుకూలంగా స్పందిస్తూ సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించామని అన్నారు. కాగా, గత వారం నమోదైన ఫిర్యాదులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో అధికారులు ఏమేరకు చర్యలు చేపట్టారనే వివరాల గురించి బాధితులకు ఫోన్లు చేసి ఆరా తీశారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ డివిజన్ల అధికారులను ఆదేశించారు. డయల్ యువర్ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.