నెల్లూరు, డిసెంబర్ 18: ఎప్పుడూ మన మొబైల్కు రాని కొత్త నెంబరు నుండి ఫోన్ వస్తుంది. ఎవరా అని ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోగానే.. ‘నమస్కారం, నేను మీ చంద్రబాబునాయుడును మాట్లాడుతున్నాను’.. అంటూ ముఖ్యమంత్రి వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ‘మీ ప్రాంత ఎమ్మెల్యేపై మీ అభిప్రాయం’.. ఇలా సాగుతుంది రికార్డెడ్ సంభాషణ. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికకు కార్యకర్తల అభిప్రాయం కోసం ముఖ్యమంత్రి ఎంచుకున్న పలుమార్గాల్లో ఇదొకటి.
ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కాకుండా పార్టీపైనే ఎక్కువ దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. అందులో భాగంగానే ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో సానుకూల స్పందన ఉందని, స్థానిక ఎమ్మెల్యే పనితీరుపై ప్రజల్లో ఎంతమేర సానుకూల, ప్రతికూల అభిప్రాయం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది మాత్రమే కొలమానం కాదనే విషయాన్ని పార్టీశ్రేణుల్లో వ్యక్తమవుతోంది. దీంతోపాటు సంక్రాంతి నెలలో జిల్లాలోని పార్టీ నేతలందరితోనూ ముఖ్యమంత్రి సమావేశం కాబోతున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో తాను చేయించిన సర్వేలో వచ్చిన ఫలితాలను జోడించి నేతలతో సమాలోచనలు చేయనున్నారు. ఎమ్మెల్యేలతో పాటు అతను కాని పక్షంలో మరో ఇద్దరు అభ్యర్థులను సిద్ధం చేసి వారిలో ఎవరు మెరుగైనవారో కూడా ఇదే రికార్డెడ్ వాయిస్ ద్వారా సేకరిస్తున్నారు. తొలుత కార్యకర్తల అభిప్రాయం, తదుపరి ప్రజల అభిప్రాయం కోరుతున్నారు. కార్యకర్తల్లో నెలకొన్న అసంతృప్తిని తెలుసుకొని ప్రత్యామ్నాయ అంశాలపై దృష్టి పెట్టడం కూడా ఇందులో ఒక భాగమని జిల్లాకు చెందిన టీడీపీ నేత ఒకరు తెలిపారు. తొలిసారిగా ముఖ్యమంత్రి గొంతుతో కార్యకర్తలు, ప్రజల స్పందన తెలుసుకునే ప్రయత్నం చేస్తుండడాన్ని జిల్లాలోని టీడీపీ కార్యకర్తలు స్వాగతిస్తున్నారు. అయితే ఈ సర్వేలో ఫలితాలు ఎలా వచ్చినా చివరకు తాను అనుకున్న వారికో, తప్పనిసరి పరిస్థితుల్లో సామాజిక సమీకరణాల పేరుతో అభ్యర్థులను మార్చే అవకాశాలు ఉండవచ్చని కార్యకర్తలు భావిస్తున్నారు. జిల్లాకు సంబంధించి పది నియోజకవర్గాల్లో ఒకటి రెండు నియోజకవర్గాలు మినహాయించి మిగతాచోట్ల టీడీపీ తరపున ఎవరు పోటీ చేయబోతున్నారనే విషయంలో స్పష్టత లేదు. పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోనూ కచ్చితంగా వారికే టిక్కెట్ వస్తుందని చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా నెల్లూరురూరల్, ఆత్మకూరు, గూడూరు, సూళ్లూరుపేట, కోవూరు, ఉదయగిరిల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటికీ అస్పష్టత నెలకొని ఉందని ఆయా ప్రాంత టీడీపీ కార్యకర్తలే చెబుతున్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను ఎంపిక చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని, జనవరి నెలలో దాదాపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందనే ధీమాను తెలుగు తమ్ముళ్లు వ్యక్తపరుస్తున్నారు. అభ్యర్థుల విషయంలో తుదికంటూ సస్పెన్స్ కొనసాగించడంలో ముందుండే చంద్రబాబునాయుడు రాబోయే ఎన్నికల్లో జిల్లాలో సత్ఫలితాలు పొందాలనుకుంటే ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేయడం అందులో ఒకటని రాజకీయ విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆలయాల అభివృద్ధికి పెద్దపీట
* మంత్రి నారాయణ
నెల్లూరు, డిసెంబర్ 18: రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను అనుసంధానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా రూరల్ మండలంలోని శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి, నెల్లూరు తల్పగిరి రంగనాథస్వామి ఆలయాలను మంత్రి సందర్శించి విశేష పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చారిత్రకమైన నరసింహకొండలోని లక్ష్మీనరసింహస్వామి, నగరంలోని తల్పగిరి రంగనాథస్వామి ఆలయాలను దర్శించుకోవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఏటా ముక్కోటి రోజున కుటుంబ సభ్యులతో కలిసి తాను నరసింహకొండకు వెళ్లి పూజలు నిర్వహించడం తనకు ఆనవాయితీ వస్తోందన్నారు. క్రీశ 11వ శతాబ్దం నాటి రంగనాథస్వామి ఆలయం దర్శించుకునేందుకు మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తుంటారని, ఇక్కడ భక్తుల కోసం స్నానఘట్టాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. జనవరి నెలాఖరుకల్లా ఈ నిర్మాణాన్ని పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నరసింహకొండపై గాలి గోపురానికి మరమ్మతులు రూ.6లక్షల వ్యయంతో పూర్తిచేశామన్నారు. రానున్న బ్రహ్మోత్సవాలకు గిరిప్రదక్షిణ కోసం సిమెంటు రోడ్డు నిర్మాణం పూర్తయిందన్నారు. ఇంకా దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పేదప్రజలు ఏడు దేవాలయాలు దర్శించుకునేందుకు దివ్యరథం పేరుతో దేవాలయ సందర్శనకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి నారాయణ కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి, విజయా డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వేదగిరి దేవస్థాన చైర్మన్ వెంకటేశ్వర్లునాయుడు, స్థానిక టీడీపీ నేతలు వేమిరెడ్డి అశోక్రెడ్డి, కార్పొరేటర్ నూనె మల్లికార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
వౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత
* మంత్రి నారాయణ స్పష్టం
నెల్లూరు, డిసెంబర్ 18: ప్రజలకు అవసరమైన వౌలిక వసతులను కల్పించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని, కానీ తమ ప్రభుత్వ హయాంలో ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు తొలి ప్రాధాన్యతనిచ్చిందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. మంగళవారం నారాయణ మెడికల్ కళాశాల క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్, మున్సిపల్, పబ్లిక్ హెల్త్, స్వచ్ఛ సర్వేక్షణ్ అధికారులు, ఎల్ అండ్ టి, మేఘ సంస్థల ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి నెలాఖరుకల్లా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలోని 450 కిమీ మేర రోడ్లు తవ్వేశారని, అందులో ఇప్పటికే 110 కిమీ మాత్రమే పునరుద్ధరించగలిగారని అన్నారు. మిగిలిన రోడ్లన్నీ మార్చి 31కల్లా పూర్తిచేయాలని, ఇందుకు సంబంధించి రోజూ 8 నుండి 10 కిమీ మేర రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. రోడ్డు పనులు పూర్తికావాలంటే రోజుకు 2వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాలన్నారు. ఈనెల 20 నుండి పనులు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. నెల్లూరు నెక్లెస్ రోడ్డు, స్వర్ణాలచెరువు నుండి ఇరుకళల పరమేశ్వరీ దేవస్థానం వరకూ 2 కిమీ మేర నిర్మించనున్నామని, అక్కడ పొట్టిశ్రీరాములు వంటి మహనీయుల విగ్రహాలు నెలకొల్పబోతున్నట్లు చెప్పారు. అమ్మవారి దేవస్థానం వద్ద 200 మీటర్ల ఘాట్ నిర్మిస్తామన్నారు. రంగనాథస్వామి దేవస్థానం వెనుక పెన్నానదిలో 100 మీటర్ల ఘాట్ నిర్మాణం కోసం రూ.9 కోట్లతో టెండర్లు పిలవడం జరిగిందన్నారు. 2 రూపాయలకే 20 లీటర్ల మంచినీరు సరఫరాకు సంబంధించిన పనులు టెండర్లు పూర్తయ్యాయని, వాటిని త్వరితగతిన పూర్తిచేసేందుకు తగిన ప్రణాళికతో అధికారులు ముందుకు సాగాలని సూచించారు. అక్కచెరువుపాడు వద్ద నిర్మించిన గృహాలకు వెళ్లే రహదారి బాగాలేనందున పొదలకూరు రోడ్డు నుండి గృహాల వరకూ రోడ్డు వేసేందుకు అటవీ అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుండి కూడా అటవీ శాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. నగరంలోని రద్దీ ఉన్న రహదారులు, మినీబైపాస్, ట్రంక్రోడ్డు వంటి మార్గాల్లో ఫుట్పాత్ల నిర్మాణానికి కూడా రూ.9.8 కోట్ల అంచనాలతో టెండర్లు పూర్తయినట్లు చెప్పారు. మూలాపేటలో కోనేరు నిర్మాణం కోసం రూ.3 కోట్లు మంజూరైనట్లు, వారంలోగా పనులు కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. సంబంధిత అధికారులు ఈ పనులన్నింటినీ మార్చి 31లోగా పూర్తిచేయాలని మంత్రి కోరారు. ఈ సమావేశంలో స్వచ్ఛ మిషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు, మున్సిపల్ కమిషనర్ అలీంబాషా, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనూరాధ తదితరులు పాల్గొన్నారు.
జీఎస్ఎల్వీ-ఎఫ్ 11 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం
* షార్ నుంచి 69వ ప్రయోగం
సూళ్లూరుపేట, డిసెంబర్ 18: జీఎస్ఎల్వీ-ఎఫ్ 11 రాకెట్ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఈ ప్రయోగంతో షార్లో సందడి వాతావరణం నెలకొంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి ఇస్రో మరో సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. ఈ ప్రయోగం దృష్ట్యా షార్లో భద్రతను కుట్టదిట్టం చేశారు. శ్రీహరికోట-సూళ్లూరుపేట మార్గమధ్యంలో సీఐఎస్ఎఫ్, పోలీస్ అవుట్ చెక్పోస్టు ఏర్పాటుచేసి అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపుతున్నారు. ఇటు ఇస్రో శాస్తవ్రేత్తలతో పాటు అన్ని సెంటర్ల డైరెక్టర్లు షార్కు చేరుకొని ప్రయోగ ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు. షార్ను సీఐఎస్ఎఫ్ బలగలాలు భద్రత గుప్పిట్లోకి తీసుకున్నాయి. శ్రీహరికోట చుట్టుపక్కల ఉన్న అడవులను సైతం జల్లెడ పట్టి గాలిస్తున్నారు. తీరప్రాంత గ్రామాలు, సముద్ర జల మార్గాల్లో మెరైన్ సిబ్బంది నిఘా పెట్టారు. షార్ నుండి ఇప్పటివరకు 68 ప్రయోగాలు చేపట్టారు. ఇది 69వ ప్రయోగం కాగా జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో 13వ ప్రయోగం కావడం విశేషం. బుధవారం సాయంత్రం 4:10 గంటలకు షార్ నుంచి జీశాట్-7 ఏ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-ఎఫ్ 11 రాకెట్ మోసుకెళ్లనుంది. ప్రయోగానికి సంబంధించిన కౌంట్డౌన్ మంగళవారం మధ్యాహ్నం 2:10 గంటలకు ప్రారంభమై సజావుగా సాగుతోంది. 26 గంటలు కౌంట్డౌన్ నిర్విఘ్నంగా జరిగినంతరం రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లన్నింటిని శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఇస్రో చైర్మన్తో పాటు అన్ని సెంటర్ల డైరెక్టర్లు షార్కు చేరుకొని ప్రయోగ ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. 20 రోజుల వ్యవధిలోనే ఇస్రో మూడో ప్రయోగానికి సిద్ధం కావడం విశేషం. నవంబర్ 14న షార్ నుంచి జీఎస్ఎల్వీ మార్క్3-డీ 2, 29న పీఎల్ఎల్వీ-సీ 43 ప్రయోగాలు విజయవంతంగా ప్రయోగించారు. మళ్లీ డిసెంబర్ 5న ఫ్రెంచి గయాన నుంచి జీశాట్-11 ప్రయోగం కూడా విజయవంతమయ్యింది. వరుస ప్రయోగాల విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో ఇదే ఉత్సాహంతో జీశాట్-7 ఏ ఉపగ్రహాన్ని చేపట్టేందుకు సన్నద్ధం కావడం విశేషం.
చెంగాళమ్మ సేవలో ఇస్రో చైర్మన్
షార్ నుంచి ప్రయోగించే జీఎస్ఎల్వీ-ఎఫ్ 11 ప్రయోగ విజయాన్ని ఆక్షాంక్షిస్తూ ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ మంగళవారం చెంగాళమ్మ ఆలయానికి విచ్చేసి అమ్మవారి చెంత రాకెట్ నమూనాను పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. చైర్మన్కు ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలనంతరం వేదపండితుల ఆశీర్వాదం ప్రత్యేక శాలువలతో సన్మానించి అమ్మవారి తీర్ధప్రసాదాలు అందజేశారు. చైర్మన్ శివన్తో పాటు శాస్తస్రాంకేతిక కార్యదర్శి (సైంట్ఫిక్ సెక్రటరీ) ఉమామహేశ్వరావు ఉన్నారు. ఈ కార్యక్రమంలో చెంగాళమ్మ మాజీ ట్రస్టుబోర్డు సభ్యులు చిట్టేటి పెరుమాల్, ఆకుతోట రమేష్ పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి - నడికుడి రైల్వే లైన్ భూసేకరణ పరిశీలన
వెంకటగిరి, డిసెంబర్ 18: శ్రీకాళహస్తి-నడికుడి రైల్వేలైన్కు సంబంధించి భూసేకరణను గూడూరు సబ్ కలెక్టర్ ఆనంద్ మంగళవారం పరిశీలించారు. మండలంలోని జంగాలపల్లి, పారవోలు, బాలసముద్రం గ్రామాల మీదుగా నడికుడి రైల్వే లైన్ వెళుతుండడంతో ఆ గ్రామాల్లోని భూములను పరిశీలించారు. అనంతరం వెంకటగిరిలో ఎస్టీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడానికి భవనాన్ని సబ్ కలెక్టర్ పరిశీలించారు. రైల్వేస్టేషన్ పక్కనే ఉన్న పాత కేంద్రీయ విద్యాలయ భవనాన్ని పరిశీలించారు. తాత్కాలికంగా ఎస్టీ గురుకుల పాఠశాలను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట స్థానిక తహశీల్దార్ రాజ్కుమార్, సర్వేయర్ సుబ్రహ్మణ్యం, ఆర్ఐ రాజేష్ ఉన్నారు.
హిందూ ధర్మ పరిరక్షణకు నడుం బిగించండి
*స్వామీజీల ఉద్బోధ
కొండాపురం, డిసెంబర్ 18 : ప్రతిఒక్కరూ హిందూ ధర్మ పరిరక్షణకు నడుం బిగించాలని పలువురు స్వామీజీలు ఉద్బోధించారు. సమసరసతా సేవా ఫౌండేషన్, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రమైన కొండాపురంలో ఆత్మీయ భజన బృందాల ధార్మిక సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ యోగాశ్రమానికి చెందిన రామానుజయోగి, ఆర్ఎస్ఎస్ విజయవాడ ప్రాంత సేవా ప్రముఖ్ కేశవయ్య, అనంతస్వామి, నెల్లూరు జిల్లా ఎస్ఎస్ఎఫ్ మహిళా కన్వీనర్ గిరిజాకుమారి ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రజలకు అందించారు. దేశంలో ధర్మానికి విఘాతం వాటిల్లుతోందని ఇందువల్ల మానవాళి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. ముఖ్యంగా హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతిఒక్కరూ నడుం కట్టాలన్నారు. భగవంతుడి దృష్టిలో అందరూ సమానులేనని కుల, మతాలు అనేవి మానవ సృష్టేనని అన్నారు. భగవంతుని ఆరాధించడానికి ఎన్నో మార్గాలున్నాయని ఇందులో ముఖ్యంగా భజన అనేది ఎంతో ప్రధానమైనదన్నారు. ప్రతి గ్రామంలో ఆలయం తప్పనిసరిగా వుండాలని, అందులో నిత్యం నైవేద్యాలు నిర్వహించే విధంగా చూడాలన్నారు. ఆలయంలో భజనలు చేయడం ద్వారా భగవంతుని నామాన్ని స్మరించవచ్చని తద్వారా మోక్షమార్గాన్ని పొందవచ్చన్నారు. ముందుగా బస్టాండ్ సెంటర్ నుండి ఆదర్శ పాఠశాల మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భజనలు, కోలాటం చేస్తూ సుమారు రెండు గంటలపాటు ర్యాలీ నిర్వహించారు. స్వామీజీల ప్రసంగం అనంతరం మండలంలోని వివిధ గ్రామాల నుండి భజన బృందాల వారు భజనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన గురువులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సమరసతా సేవా ఫౌండేషన్ ధర్మప్రచారక్ మధు, సమరసతా ఫౌండేషన్ కొండాపురం మండల కన్వీనర్ గురవారెడ్డి, మహిళా కన్వీనర్ దార్ల మల్లీశ్వరి, బీజేపీ మండల అధ్యక్షుడు మల్లికార్జున, మెంటా సుధాకర్, బత్తల రామచంద్రయ్య, దాసరి వెంకటేశ్వర్లు, నర్రా చెంచునాయుడుతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భజన బృందాలు పాల్గొన్నాయి.