Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

మహిళా మేలుకో!

$
0
0

పాట్న, డిసెంబర్ 18: సమాజంలో నిత్యం మహిళలు అనేక ఇబ్బందులు, వేధింపులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వారు ఎదుర్కొనే లైంగిక వేధింపుల గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఎవరికి చెబితే ఏ సమస్య వస్తుందో అర్థం కాక అలాగే వాటిని భరిస్తూ ఉంటున్నారు. అలాంటి వారు తమ కష్టనష్టాలను తమకు తెలియజేయడానికి తమ మొబైల్ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు బంధన్ టాడ్ 2.0 యాప్ నిర్వాహకులు. ఇప్పటికే ఈ యాప్ ద్వారా బాల్య వివాహాలు, గృహహింస వంటి సమస్యలను బాధితుల నుంచి తెల్సుకుని వాటికి పరిష్కారాలను చూపుతున్నారు. ఇప్పుడు అప్‌గ్రేడ్ చేసిన ఈ యాప్ వెర్షన్ ద్వారా ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని నిర్వాహకులు నిర్ణయించారు. అంతర్జాతీయ సామాజికవేత్త పౌల దనోవన్, ఎయిడ్స్ రహిత సమాజం కోసం కృషి చేస్తున్న ప్రముఖ లాయర్ ఇందిరా జైసింగ్, పట్నా కేంద్రంగా పనిచేస్తున్న జెండర్ అలియన్స్ సభ్యులు తదితరులు పాల్గొన్న కార్యక్రమంలో బుధవారం ఈ యాప్‌ను ప్రారంభించారు. ‘మీ టూ’ ఉద్యమం ద్వారా తాము సమాజంలో ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి గళమెత్తారు. అయితే ట్విటర్, ఫేస్‌బుక్ గురించి అవగాహన లేని గ్రామీణ బాలికలు, మహిళలకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు అంటున్నారు.


ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపుల కుంభకోణం

$
0
0

ఆదిలాబాద్, డిసెంబర్ 18: ఆదిలాబాద్ జిల్లా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపుల కుంభకోణం గుట్టురట్టయింది. గత నాలుగేళ్ళుగా స్టాంప్స్ రిజిస్ట్రేషన్ విభాగంలో బాండ్ పేపర్లు, స్టాంపుల విక్రయాలకు సంబంధించి రూ.78 లక్షలు దిగమింగిన ఇద్దరు ఇంటి దొంగలపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. అవినీతి అక్రమాలకు నిలయంగా ముద్రపడ్డ ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నకిలీ చలాన్లతో భూముల రిజిస్ట్రేషన్ కుంభకోణం అలజడి రేపగా తాజాగా స్టాంపులు, బాండ్ దస్త్రాల విక్రయాల్లో రూ.78లక్షలు స్వాహా చేసిన వ్యవహారం రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కుదిపేస్తోంది. 2014 నుంచి ఆదిలాబాద్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో క్యాషియర్‌గా పనిచేస్తున్న ఇంతియాజ్, జూనియర్ అసిస్టెంట్ కపిల్ కుమార్ స్టాంపుల విక్రయాల కౌంటర్‌లో విధులు నిర్వర్తిస్తూ విక్రయించిన సొమ్మును ప్రభుత్వ ఖాతాలో జమచేయకుండా కాజేసినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. ఈ వ్యవహారంపై గతంలో రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారుల బృందం విచారణజరిపి ఇద్దరు ఉద్యోగులకు షోకాజు నోటీసులు జారీ చేయగా రికవరీ కింద ప్రభుత్వానికి రూ.3లక్షలు మాత్రమే జమచేసి చేతులు దులుపుకున్నారు. నకిలీ చలానాలు, పాత బాండ్లను గుట్టుచప్పుడు కాకుండా రియల్టర్లకు విక్రయించి భారీ ఎత్తున సొమ్ము చేసుకోవడం, స్టాంపులతో పాటు రిజిస్ట్రేషన్ స్టాంపు దస్త్రాలను విక్రయించి లక్షల్లో డబ్బును కాజేసినట్లు ఇటీవల జరిపిన విచారణలో వెల్లడైంది. కరీంనగర్‌కు చెందిన స్టాంప్స్ రిజిస్ట్రేషన్ విభాగం డీఐజీ ట్వింకిల్‌జాన్ ఆదేశాల మేరకు విచారణ బృందం ఇటీవల ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి, రికార్డులను స్వాదీనం చేసుకొని కూపీ లాగగా రూ.78లక్షల విలువైన స్టాంపులను విక్రయించి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడమేకాక పలు అక్రమాలకు పాల్పడ్డట్లు బట్టబయలైంది. క్యాషియర్ ఇంతియాజ్‌తో పాటు జూనియర్ అసిస్టెంట్ కపిల్ కుమార్‌లపై సస్పెన్షన్ వేటు విధించగా జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి జయవంత్‌రావు ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ టూటౌన్ సీఐ నాగరాజు క్రిమినల్ కేసులు నమోదు చేసి మంగళవారం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఒకే చోట నాలుగేళ్లకు పైగా పనిచేస్తూ సర్కారు సొమ్మును స్వాహా చేసిన వీరిద్దరిపై వేటు పడడమే గాక ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు ఉద్యోగులు, ప్రైవేట్ ఏజెంట్లపై పోలీసులు కూపీ లాగుతున్నారు. గతంలో ఏసీబీ దాడుల్లో భారీ ఎత్తున అక్రమాలు బయటపడగా భూముల క్రయ విక్రయాల్లోనూ, అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం బయటపడ్డాయి. తాజాగా రూ.78లక్షల స్టాంపుల కుంభకోణం జిల్లాలో కలకలం రేపుతోంది.

ఎప్పటికీ ప్రజల మధ్యే ఉంటాం

$
0
0

వరంగల్, డిసెంబర్ 18: ప్రజా తీర్పును గౌరవిస్తామని ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మంగళవారం మొదటి సారిగా వరంగల్‌లోని వారి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరకాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే తాము మాత్రం ఎప్పటికీ ప్రజల వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఇలాంటి ఎన్నికలను తమ జీవితాల్లో చూడలేదన్నారు. డబ్బు, మద్యం, విచ్చలవిడిగా వెదజల్లడంతోపాటు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థ అంతా ఏకపక్షంగా పనిచేసినందునే టీఆర్‌ఎస్‌కు ఆ ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. అయితే ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కూడా అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఎన్నికల ఫలితాల సందర్భంగా ఏ పోలింగ్ బూత్‌లో చూసినా అధికార పార్టీకి ప్రతిపక్షా పార్టీకి ఓట్ల తేడా పెద్ద మొత్తంలో ఉందన్నారు. ఎమ్మెల్సీగా తనను అనర్హుడిగా ప్రకటించాలని టీఆర్‌ఎస్ చేస్తున్న కుట్రను కొండా మురళి తీవ్రంగా ఖండించారు. మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డికి ఇది వర్తించా అని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాము కదా అని మమ్ముల్ని, మా కార్యకర్తలను వేదిస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ఎమ్మెల్సీ విషయంలో అనర్హత వేటు వేయాలని చూస్తే న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి రావాడానికి అనేక పార్టీలు సహకరిచాయని అన్నారు. తనపై ఉన్న గౌరవంతో ఏ పార్టీ కూడా పోటీకి దిగనందునే తనకు ఎమ్మెల్సీ పదవి దక్కిందన్నారు. ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరగడం వల్లే మహాకూటమి నాయకులు ఓడిపోయారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వయంగా సీఎం కేసీఆర్ చింతమడ్కలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు హెలిక్యాప్టర్‌లో వస్తే ఆయనను ప్రజలు చుట్టుముట్టి ఘెరావ్ చేశారని, అంతేకాకుండా అనేక గ్రామాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను రానివ్వని పరిస్థితుల నుంచి వేల మెజార్టీ రావడంలో మతలబు ఏమిటని వారు ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నప్పటికీ కేవలం వారిని ఈవీఎంలే గెలిపించాయని ఆరోపించారు. గతంలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల అవినీతిపై ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నందునే అసెంబ్లీని రద్దు చేశానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్‌పై వస్తున్న ఆరోపణలు పరిగణలోకి తీసుకుని మళ్లీ అసెంబ్లీని రద్దు చేస్తారా అని కొండా దంపుతలు ప్రశ్నించారు. వీవీ ప్యాట్‌లను ఓపెన్‌చేసి తిరిగి లెక్కిస్తారా? అని వారు నిలదీశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి బుద్ధి చెపుతారని అన్నారు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఎక్కడా తమడబ్బు పట్టుబడలేదని, కేవలం అది పోలీసుల సృష్టేనని అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ కొందరి వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఓడించే కుట్ర అమలు జరిగిందన్నారు. ప్రశ్నించే గొంతుక ఉండద్దనే ఉద్దేశంతో కేసీఆర్ నా..నీ అనే తేడా లేకుండా టార్గెట్ చేసి ఓడించారని అన్నారు.
చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కొండా మురళీ దంపతులు

30 రోజుల్లో కేటీపీపీ పునరుద్ధరణ

$
0
0

భూపాలపల్లి/గణపురం, డిసెంబర్ 18 : కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ) రెండో దశ 600 మెగావాట్ల ప్లాంట్‌లో స్టేటార్‌లో సాంకేతిక సమస్య ఏర్పడిన విషయం వాస్తవమేనని జెన్-కో సీ ఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ సమీపంలో ఉన్న కేటీపీపీని ఆయన సందర్శించారు. మొదట రెండో దశలో ఏర్పడిన సాంకేతిక లోపాలపై ప్లాంట్‌ను సందర్శించి అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా థర్మల్ ప్లాంట్‌లు కేవలం 56 శాతం పీఎల్‌ఎఫ్‌తో ఉన్నాయని, కేవలం తెలంగాణలో ఉన్న కేటీపీపీ రెండో దశ 89 శాతం, మొదటి దశ 87 శాతం పీఎల్‌ఎఫ్‌తో మంచి స్థానంలో ఉన్నాయన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే జైపూర్ విద్యుత్ ప్లాంట్‌తో పాటు ఎన్‌టీపీసీలో కూడా రెండో దశలో వచ్చిన సాంకేతిక సమస్యలే వచ్చాయన్నారు. వాటిని బీహెచ్‌ఈఎల్ ఇంజనీర్లు తప్ప ఎవరూ గుర్తించలేరన్నారు.
బీహెచ్‌ఈఎల్‌కు సంబంధించిన ఇంజనీర్లు హరిద్వార్, రామచంద్రాపూర్ నుండి కేటీపీపీకి వస్తున్నారని, వారు రూటార్, స్టేటార్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తే సమస్య తెలుస్తుందన్నారు. అప్పటి వరకు మనం చేసేదేమి లేదన్నారు. ఆ ఖాళీ సమయాన్ని భర్తీ చేసుకునేందుకు వార్షిక మరమ్మతులను 30 రోజుల్లో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కేటీపీపీ ఇంజనీర్లు సమర్థవంతంగా పనిచేస్తున్నారని, సాంకేతిక సమస్యలు ఎవరి తప్పిదం కాదన్నారు. రోటార్‌కు సంబంధించిన సామాగ్రి జిందాల్ వారి వద్ద ఉందని, వారిని కూడా సంప్రదిస్తున్నామన్నారు. ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ కూడా రాష్ట్రంలో తగ్గిందని, ఈ సమయంలోనే వార్షిక మరమ్మతులు చేయడం సరైందనే ఉద్దేశంతోనే ఉన్నామన్నారు. మొదటి దశలో సాంకేతిక సమస్యలకు బొగ్గే కారణమా? అని సీఎండీని అడగగా ఆయన స్పందిస్తూ 75 రోజుల పాటు నిరంతరాయంగా నడిచిందని, మనకు నాణ్యమైన బొగ్గు అందుబాటులో లేదని, ఉన్న బొగ్గుతోనే ప్లాంట్‌ను కొనసాగిస్తున్నామని, బాయిలర్ ట్యూబ్‌లు పగలడం సహజమేనని, గతంలో కన్నా సాంకేతిక సమస్యలు కేటీపీపీలో తగ్గాయని సీఎండీ తెలిపారు. ఆయన వెంట డైరెక్టర్ థర్మల్ లక్ష్మయ్య, సీఈ సిద్ధయ్య, సెక్యూరిటీ అధికారి శ్రీనివాసరావు ఉన్నారు.

చిత్రం..కేటీపీపీలో విలేఖరులతో మాట్లాడుతున్న సీఎండీ ప్రభాకర్ రావు

ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తాం

$
0
0

ఖమ్మం(మామిళ్ళగూడెం), డిసెంబర్ 18: జిల్లా అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తూ అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తామని టిపిసిసి ప్రచార కార్యదర్శి, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఉమ్మడి జిల్లాలో గెలుపొందిన ఎమ్మెల్యేలతో కలసి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాకూటమి అభ్యర్థులుగా ఐదుగురు కాంగ్రెస్, ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలుగా గెలిపించిన జిల్లా ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. ప్రజల ఔన్నత్యాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామన్నారు. ప్రజల తీర్పు ఆశీర్వాచనాలను జిల్లా అభివృద్ధి కోసం నిబద్దతతో పూర్తిస్థాయిలో కృషి చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో ఎటువంటి అభివృద్ధి సాధించినా అది కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వ హయాంలోనే సాధ్యమైందన్నారు. టిఆర్‌ఎస్ పాలనలో ఒక ప్రాజెక్ట్, ఒక పరిశ్రమ స్థాపించిన దాఖాలాలు లేవన్నారు. కెటిపిఎస్, ఫవర్‌ప్రాజెక్ట్, సాగునీటి ప్రాజెక్ట్‌లు కినె్నరసాని, బిపిఎల్, హెవి వాటర్ ప్రాజెక్ట్‌లతో పాటు అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌నన్నారు. జిల్లాలో ఎ సంపద సృష్టించిన దానివెనుక కాంగ్రెస్ శ్రమశక్తి, దూరదృష్టి ఉందన్నారు. భవిష్యత్‌లో కూడా ఉమ్మడి జిల్లా అభివృద్ధకి అదే అనావాయితీ కొనసాగిస్తామన్నారు. ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అధికార దాహంతో ధనాన్ని విచ్చలవిడిగా వెచ్చించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డప్పటికీ ప్రజలు ఏమాత్రం చలించకుండ ప్రజాకూటమికి పట్టంగట్టారన్నారు. ఇదే స్పూర్తితో రానున్న గ్రాప పంచాయతీ, పార్లమెంట్, సహకార సంఘాల ఎన్నికల్లో కూడా ప్రజాకూటమికి అండగా నిలవాలన్నారు. ఎన్నికలకు కార్యకర్తలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తనును ఓడించేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక ఎత్తులు వేసినప్పటికీ కొత్తగూడెం ప్రజలు తనను ఆదరించి గెలిపించారన్నారు. కొత్తగూడెం అభివృద్ధితోనే వారి రుణం తీర్చుకుంటామన్నారు. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నారని దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానన్నారు. పాలేరు ప్రజలు ఇచ్చిన విలక్షణమైన తీర్పుకు తాను కట్టుబడి వారి రుణం తీర్చుకుంటానన్నారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధితో పాటు తాను ప్రజలను నిత్యం అంటిపెట్టుకొని ఉండటం వల్లనే తనను ఆదరించి గెలిపించారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మమేకమై వారికి అండగా ఉంటానన్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ నూతనంగా పోటీ చేసిన తనను ప్రజలు ఆదరించారని, ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు వడ్డెబోయిన నర్సింహరావు, బాలగంగాధర్ తిలక్, పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, తాజుధ్దీన్ తదితరులు పాల్గొన్నారు.

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

$
0
0

కొత్తగూడెం, డిసెంబర్ 18: పెథాయ్ తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకొని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. సుజాతనగర్, చుంచుపల్లి మండల పరిధిలో వర్షానికి దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. సుజాతనగర్ మండల పరిధిలోన వ్యవసాయ సహకారం సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దని ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సరైన న్యాయం చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. అధికారులు తక్షణమే పంట నష్టం సర్వే నిర్వహించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యానికి మద్దతు ధర పలికేలా చర్యలు తీసుకోవాలన్నారు. అకాల వర్షం కారణంగా రైతులు ఆర్ధికంగా నష్టపోయారని, బాధిత రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింతలపూడి రాజశేఖర్, బత్తుల వీరయ్య, అన్వర్‌పాషా, గరికె సాంబయ్య, హరిదాస్, పాషా, రాము, పార్ధసారధి, నాగార్జున, శ్యాంరెడ్డి, భాస్కర్‌రావు, బాలు, భద్రు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

$
0
0

వైరా, డిసెంబర్ 18: పెథాయ్ తుఫాన్‌తో వరిపంట, ధాన్యం తడిసిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. మంగళవారం స్థానిక వైరా మార్కెట్ యార్డులో తడిసిన వరిధాన్యాన్ని ఆయన వ్యవసాయశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పెనుతుఫాన్ కారణంగా రైతులు నియోజకవర్గంలో నష్టపోయిన ప్రతిపంటపై అధికారులు నివేదిక అందిన వెంటనే వ్యవసాయశాఖ అధికారులతో పంటనష్టం లెక్కలు వేయించి తగిన విధంగా రైతులను ఆదుకునేలా కృషి చేస్తానని అన్నారు. అనంతరం కొణిజర్ల, వైరా మండలాలకు చెందిన రైతుల ఎమ్మెల్యేతో తమ గోడు వేళ్ళబోసుకున్నారు. రైతులతో తమసమస్యలను వినతిపత్రంతో సమర్పించారు. ఆరుగాలం కష్టించిపండించిన పంట తుదకు ఇలా తడిసిముద్దఅయిందని కన్నీరు పెట్టారు. దీంతో చలించిన ఎమ్మెల్యే తప్పక రైతులందరికీ న్యాయం జరిగేలా జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట వ్యవసాయశాఖ అధికారులతోపాటు నాయకులు బొర్రా రాజశేఖర్, గుమ్మా రోశయ్య, సూతకాని జైపాల్, ముళ్ళపాటి సీతారాములు, దార్నశేఖర్, పసుపులేటి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ముంచిన పెథాయ్

$
0
0

ఖమ్మం, డిసెంబర్ 18: పెథాయ్ తుఫాన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాను గజగజలాడించింది. అనేక నష్టాలను తీసుకువచ్చిన పెథాయ్‌తో ఉష్ణోగ్రతలు కూడా అత్యల్పానికి పడిపోవడంతో చలితో ప్రజలు వణికిపోయారు. గత రెండురోజులుగా పెథాయ్ కారణంగా జల్లులు కురుస్తుండటం, వాతావరణం పూర్తిగా చల్లబడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వరి, మిరప, మినుము రైతులు ఈ తుఫాన్ ధాటికి విలవిలలాడిపోయారు. వరి కల్లాల్లోకి నీరొచ్చి చేరడంతో ధాన్యం తడిచిపోయింది. దీంతో ధాన్యంలో తేమశాతం పెరుగుతుండటంతో దానిని కొనేవారు ఉండరేమోనని, ఉన్నా తక్కువ ధరకు కొంటారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా సుమారు 15వేల హెక్టార్లలో పంటనష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. దుమ్ముగూడెం, చర్ల, కల్లూరు, బూర్గంపాడు, టేకులపల్లి, వేంసూరు, చింతకాని, మధిర, ఎర్రుపాలెం, వైరా, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, జూలూరుపాడు, ఏన్కూరు, చండ్రుగొండ, పెనుబల్లి, దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో పంటనష్టం అధికంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మిర్చి కల్లాల్లోకి నీరొచ్చి కొన్నిచోట్ల మిరపకాయి తడిచిపోగా మరికొన్ని చోట్ల మిరప తోటలోకి భారీగా నీరు చేరడంతో రోగాలు వస్తాయని రైతులు భావిస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో మినుము పూర్తిగా తడిచిపోవడంతో రైతులకు నష్టం వాటిల్లింది.
ఇదిలా ఉండగా తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనల బాట పట్టారు. ముదిగొండ మండలం గోకినేపల్లి రైతులు తడిచిన ధాన్యాన్ని ఐకెపి కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు. ఏన్కూరు మండలంలో తడిచిన ధాన్యాన్ని సొసైటీ ద్వారా కొనుగోలు చేయాలని ఆందోళన చేశారు. ఇదే విధమైన డిమాండ్ జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి వస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులు రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. మరోవైపు చలిగాలుల తీవ్రతకు అశ్వారావుపేట మండలంలో యాభై పశువులు మృతిచెందాయి. అనేక చోట్ల పశువులకు రోగాలు రావడంతో రైతులు ఆసుపత్రుల బాట పడుతున్నారు. మరోవైపు వృద్ధులు, వివిధ రకాల రోగాలతో ఇబ్బందులు పడుతున్న వారు తుఫాన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది ఉబ్బసం వ్యాధితో ఇప్పటికే ఆసుపత్రులకు చేరుకోగా మరికొంత మంది అస్వస్థతకు లోనయ్యారు. మరో రెండురోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కలెక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అధికారులు దీనిని ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని ఆయన ఆదేశించారు. దీంతో మండలాల వారీగా ఉన్నతాధికారులు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. నష్టపోయిన వారందరిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో నష్టాన్ని అంచనా వేసేందుకు బృందాలను కూడా గ్రామాలకు పంపిస్తున్నారు.

మాజీ ఎంపీ జలగం మృతి

ఖమ్మం, డిసెంబర్ 18: ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు జలగం కొండల్‌రావు మంగళవారం మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్‌లో మరణించారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకు సోదరుడైన కొండల్‌రావు 1957లో వేంసూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తరువాత 1977,1980లలో ఖమ్మం ఎంపిగా పోటీ చేసి విజయం సాధించారు. రాష్టస్థ్రాయిలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత సీనియర్ నేతగా పేరున్న ఆయన దాదాపు మూడు దశాబ్దాల పాటు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారు. సోదరుడు వెంగళరావు కంటే ముందుగానే ఆయన శాసన సభ్యునిగా ఎన్నిక కావడం విశేషం. 1960వ దశకంలోనే జీపులో అన్ని ప్రాంతాలను ఆయన తిరిగేవారు. ఆ సమయంలో ఆయనకు మాత్రమే ఆ వాహనం ఉండటం విశేషం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి, మర్రి చెన్నారెడ్డి తదితరులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కాగా కొండల్‌రావు మృతిపట్ల ఖమ్మం జిల్లాలోని జలగం అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఆయన మృతి తమను కలచివేసిందని కొందరు సీనియరర్ నాయకులు వెల్లడించగా అనేక మంది సంతాపం వెల్లబుచ్చారు.


జమలాపురం ఆలయంలో వైభవంగా ఉత్తర ద్వార దర్శనం

$
0
0

ఎర్రుపాలెం, డిసెంబర్ 18: జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసారు. ఈ ఉత్తర ద్వార దర్శనంనకు భక్తులు తెల్లవారు జాముననే అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకున్నారు. మంగళవారం వేకువ జాముననే స్వామి వారికి పంచామృతాలతో సర్వాంగాభిషేకం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తుల ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేసి స్వామివారి ఆలయ వెనుక భాగంలోప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం వద్ద భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించారు. ముందుగా స్వామివారి మాలలు వేసుకొని 41 రోజులు దీక్ష పూర్తిచేసి, ఇరుముడులు కట్టుకొని వచ్చిన గోవింద స్వాములకు ఉత్తరద్వార దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం ఇరుముడులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమంలో వేసి మొక్కులు తీర్చుకున్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండ ఎర్రుపాలెం యసై వి సురేష్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

భక్తరామదాసు జన్మస్థలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు

$
0
0

నేలకొండపల్లి, డిసెంబర్ 18: ముక్కోటి ఏకాదశి పర్వదినంను పురస్కరించుకొని దేవాలయాలలో దేవతామూర్తులు ఉత్తరద్వారం ద్వార భక్తులకు దర్శనం ఇచ్చారు. మంగళవారం ఏకాదశి సందర్బంగా ఉదయం నుండే దేవాయాలకు భక్తులు బారులు తీరారు. నేలకొండపల్లిలోని శ్రీ భక్తరామదాసు మందరంలో భక్తులకు ఉత్తరద్వారం ద్వార శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనం ఇచ్చారు. అలాగే శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, శ్రీ ప్రసన్నఆంజనేయస్వామి దేవాలయం, శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం, శ్రీ ఉత్తరేశ్వరస్వామి దేవాలయం, శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయం, శ్రీ భీమేశ్వరస్వామి దేవాలయం, శ్రీ రామాలయం దేవాలయాలలో దేవత మూర్తులు ఉత్తరద్వారం ద్వార భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్బంగా దేవాలయాలను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. ఉత్తరద్వార దర్శనం కోసం భక్తులు ఉదయం నుండే దేవాలయాల ముందు బారులు తీరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వంగవేటి నాగేశ్వరరావు, గెల్లా కృష్ణారావు, షరాబు శ్రీను, దేవరశెట్టి లక్ష్మణ్‌రావు, రాయపూడి ప్రసాద్, తోట వెంకటేశ్వర్లు, పావులూరి వెంకటేశ్వరావు, గరిణే రామకృష్ణ, గెల్లా జనార్దన్, దోసపాటి శేఖర్, రామయ్య, వంగవేటి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

శోభాయమానం.. ఉత్తరద్వార దర్శనం

$
0
0

భద్రాచలం టౌన్, డిసెంబర్ 18: గుబాళించే సాంబ్రాణి పొగలు.. గజ గజ వణికించే చలిగాలులు.. ఘల్లు ఘల్లు మంటూ గుడిగంటల జోరు.. వేద పండితుల మంత్రోచ్ఛారణలు.. మిన్నంటిన సన్నాయి మేళాలు ప్రతిధ్వనిస్తుండగా వైకుంఠ ద్వారంలో కోదండపాణి కొలువుదీరారు. వేల కళ్లు ఆర్తిగా, ఆతృతగా ఎదురుచూసిన శుభ సమయాన.. దివ్య తేజస్సులో తెల్లవారుజామున చీకట్లను చీల్చుకుంటూ.. ధూపదీప, నైవేద్యాల నడుమ.. జై శ్రీరామా.. జగదభిరామా.. నామస్మరణలు మారుమోగుతుండగా ఉత్తరద్వార దర్శనం గుండా శ్రీరామచంద్ర ప్రభు సాక్షాత్కరించారు. శేష పాన్పుపై మహా విష్ణువు అవతారంలో కొలువుదీరిన రామయ్యను భక్తులు కనులారా వీక్షించారు. ఆ దివ్యక్షణం.. ఆమోఘం.. అనిర్వచనీయైన అనుభూతితో భక్తజనం ధన్యులం ప్రభూ అంటూ పులకించారు. పవిత్ర ముక్కోటి శుభవేళ ఉత్తరద్వారాన స్వామిని దర్శించుకొని తరించారు. గరుడ వాహనంపై నీలిమేఘశ్యాముడు.. గజవాహనంపై సీతమ్మ.. హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి వేంచేయగా.. నేత్రపర్వమే నెలకొంది. దక్షిణ అయోధ్య క్షేత్రం భద్రాచలంలో వేలాది మంది భక్తులు భూలోక వైకుంఠ పుణ్యస్థలిని కీర్తించి.. జయ జయ ధ్వానాలతో తన్మయత్వం చెంది తిరుగు పయనమయ్యారు.
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున ఉత్తరద్వారంలో గరుడ వాహనరూడుడైన శ్రీరామచంద్రుడు భక్తులకు శ్రీమహావిష్ణువు అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామికి విశేష ఆరాధన నిర్వహించారు. శ్రీరామ షడక్షరీ మంత్ర సంపుటిత అష్టోత్తర శతనామార్చన జరిపారు. చతుర్వేదాలు, ద్రవిడ ప్రబంధాలు, ఇతిహాసాలు, శరతాగతి గద్య, గరుడ దండకం, భక్తరామదాసు రచించిర దశరథి శతకం పఠించారు. వైకుంఠ రాముడికి అష్టోత్తర శతహారతి(108 వత్తుల హారతి)తో మంగళాశాసనం, సకల వాయిద్య సమేతంగా సమర్పించారు. ఉత్తరద్వార దర్శనాన్ని పురస్కరించుకొని ముందుగా మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు భద్రాచలం తహసిల్దార్ రెవెన్యూశాఖ తరుపున ధృవమూర్తులకు తొలి పంచామృత అభిషేకం నిర్వహించారు. భక్తరామదాసు తహసిల్దార్‌గా ఉన్న కాలం నాటి నుంచి సంప్రదాయం కొనసాగుతోంది. ఈ సమయంలో స్వామివారికి తిరుప్పావై గోష్టి, బాలభోగం, తీర్థప్రసాద వినియోగం చేశారు. అనంతరం స్వామివారిని ఉత్తరద్వారం వద్దకు చేర్చి గరుడ వాహనంపై అధిష్టింపజేశారు. ఉదయం 5 గంటలకు జేగంటలు మార్మోగుతుండగా వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఉత్తరద్వారం తెరుచుకుంది. వైకుంఠాన్ని తలపించేలా అలంకరించిన వేదిక వద్ద ధూపదీపాలు, గుగ్గిలం పొగల మధ్య గరుడ వాహనంపై వేంచేసిన శ్రీరామచంద్రుడు దర్శనం ఇవ్వడంతో భక్తులు తన్మయులయ్యారు. ఈ సందర్భంగా ఉత్తరద్వారంలో గంకసేపు స్వామికి పూజలు జరిగాయి. శ్రీరామా తారకనామ అష్టోత్తర పూజలు నిర్వహించారు. మంత్రపుష్పం సమర్పించారు. రుగ్వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, ఆధ్వరణ వేదాలను పఠించారు.
స్వామిని దర్శిస్తే మోక్షం..
వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరద్వారంలో స్వామివారిని వీక్షిస్తే ముక్కోటి దేవతలను దర్శించుకున్న పుణ్యఫలం దక్కుతుందని దేవస్థానం అర్చకులు ఈ సందర్భంగా వివరించారు. ఉత్తరద్వారం తెరుచుకునే ముందు వైకుంఠ ఏకాదశిని భక్తులకు వివరిస్తూ కీర్తనలు ఆలపించారు. ఏడాదిలో వచ్చే ఏకాదశుల్లో ముక్కోటి అత్యంత పవిత్రమైందని అర్చకులు పేర్కొన్నారు. స్వామిని ఉత్తరద్వారంలో దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందన్నారు. 21 రోజుల పాటు సాగే అధ్యయనోత్సవాల్లో అత్యంత కీలకఘట్టం వైకుంఠ ఏకాదశి నాడు ఉంటుందన్నారు. కాగా ఆద్యంతం ఈ వేడుక కడు రమణీయంగా సాగింది. గజగజ వణికే చలిని లెక్కచేయకుండా భక్తులు భారీగా ఉత్తరద్వారంలో స్వామిదర్శనం కోసం బారులు తీరారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే భక్తులు ఉత్తరద్వారం వద్ద ఎదురు చూడ సాగారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఉత్తరద్వార దర్శనం వీక్షించేందుకు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో భద్రగిరి రామనామస్మరణతో మారుమోగింది. ఉత్తరద్వార దర్శనం అనంతరం భక్తులు రామయ్య ప్రసాదాల కోసం బారులు తీరారు. ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. ఈ సందర్భంగా పోలీసులు ఆలయ ప్రాంగణం చుట్టూ వలయాకారంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా పగల్‌పత్తు ఉత్సవాలు ముగియడంతో నిత్యకల్యాణాలను బుధవారం నుంచి పునరుద్ధరించనున్నారు.
వైభవోపేతంగా తిరువీధి సేవ
ఉత్తరద్వారంలో భక్తులకు దర్శనమిచ్చిన వైకుంఠరాముడు అనంతరం తిరువీధి సేవకు తరలివెళ్లారు. చలువ చప్పర వాహనంపై పెరియాళ్వార్, నమ్మాళ్వార్, మరో వాహనంపై అండాళ్ళమ్మవారు, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి, గజ వాహనంపై సీతమ్మవారు, గరుడ వాహనంపై శ్రీరామచంద్రమూర్తిల తిరువీధి సేవ సాగింది. మేళతాళాలు, భాజాభజంత్రీలు, కోలాటాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య తిరువీధి సేవ శోభాయమానంగా కొనసాగింది. ఈ సమయంలో గిరి ప్రదక్షిణగా అంబాసత్రం మీదుగా రాముడి కోవెలకు స్వామివారు చేరుకున్నారు. ఉత్తరద్వార దర్శన వేడుకలో హైకోర్టు జడ్జి జస్టిస్ శివశంకర్, ఎంపీ ఆజ్మీరా సీతారాంనాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, హరిప్రియ, రాములునాయక్, మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ, ఎస్పీ సునీల్‌దత్, జాయింట్ కలెక్టర్ కె.వెంకటేశ్వరరావు, సబ్‌కల్టెర్ భవేశ్‌మిశ్రా, ట్రైనీ కలెక్టర్ ఐలా త్రిపాఠి, ఏఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

జయలలిత ఆసుపత్రి ఖర్చుల నివేదిక లీక్!

$
0
0

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చివరి క్షణాల్లో అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఈ మేరకు ఆ ఆసుపత్రికి చెల్లించిన ఖర్చుల వివరాల నివేదిక లీక్ అయింది. ఆమె దాదాపు 75 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో ఉన్నారు. ఆ సమయంలో ఆసుపత్రిలో ఆమె చికిత్స కోసం రూ.6.89 కోట్లు ఖర్చయింది. ఈ ఖర్చుల వివరాలు బయటకు వచ్చాయి. ఇందులో ఆహార ఖర్చులే 1.17 కోట్లు ఉన్నట్లు వెల్లడైంది. అన్నాడీఎంకే ఆరు కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ వివరాల నివేదికను తాము విచారణ కమిటీకి అందజేశామని, అవి ఎలా బయటకు వచ్చాయో తమకు తెలియదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

మీడియాకు భయపడలేదు:మన్మోహన్ సింగ్

$
0
0

న్యూఢిల్లీ: మీడియా మిత్రులను చూసి తానెప్పుడు భయపడలేదని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. ఆయన తాను రాసిన ఛేంజింగ్ ఇండియా పుస్తకావిష్కరణలో మాట్లాడుతూ తాను వౌన మునినని అంటుంటారని, కాని తానెప్పుడు మీడియాను చూసి భయపడలేదని అన్నారు. ప్రభుత్వానికి, ఆర్బీఐకి సత్సంబంధాలు ఉండాలని అన్నారు. అనుకోకుండా ప్రధాని పదవినే కాదు ఆర్థిక మంత్రి పదవిని కూడా చేపట్టానని అన్నారు.

ఆగ్రాలో యువతిపై సామూహిక అత్యాచారం

$
0
0

న్యూఢిల్లీ: ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. ట్యూషన్‌కు వెళ్లి స్కూటీపై వస్తున్న ఓ యువతిని ఇద్దరు యువకులు అపహరించుకుపోయారు. వారు ఆ యువతిని కొండల్లోకి తీసుకువెళ్లారు. అక్కడ మరో ఇద్దరు ఉన్నారు. వీరు ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తలకు గాయాలపాలైన యువతిని ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాంగ్రెస్‌వి కుంటి సాకులు:ఎంపీ కవిత

$
0
0

న్యూఢిల్లీ: తెలంగాణ ఓటమిపై కాంగ్రెస్ పార్టీ కుంటి సాకులు చెబుతుందని ఎంపీ కవిత అన్నారు. ఆమె ఎంపీల మీడియా సమావేశంలో మాట్లాడుతూ తొలుత ఈవీఎంల ట్యాపరింగ్ అన్నారని, ఇపుడు చంద్రబాబు వల్ల ఓడిపోయామని చెబుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకున్నారని అన్నారు.


తెలంగాణ హక్కుల కోసం కేంద్రంపై పోరాటం

$
0
0

న్యూఢిల్లీ: తెలంగాణ హక్కుల కోసం అవసరమైతే కేంద్రంపై పోరాటం చేస్తామని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారంనాడు తెలంగాణభవన్‌లో తెలంగాణ ఎంపీల మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రమంత్రి గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశామని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీలను అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు.

వరంగల్‌లో వ్యక్తి దారుణ హత్య

$
0
0

వరంగల్: వరంగల్ అర్భన్ జిల్లా కమలాపూర్ చెరువుకట్టపై రాజనర్స అనే వ్యక్తిని దారణంగా హత్య చేశారు. ఈరోజు తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు తలపై మోది హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాంగ్రెస్‌ను తిరస్కరించారు:బండ్ల గణేశ్

$
0
0

తిరుమల: ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్ వైపు ఉన్నారని, కాంగ్రెస్‌ను తిరస్కరించారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సినీ నిర్మాత బండ్ల గణేశ్ అన్నారు. ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎన్నో అంటామని, అవన్నీ జరుగుతాయా, కార్యకర్తలో ఆత్మవిశ్వాసం నింపేందుకు అలా మాట్లాడనని చెప్పుకొచ్చారు.

అన్నాడీఎంకే, టీడీపీ ఎంపీల నిర‌స‌న‌

$
0
0

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవ‌ర‌ణ‌లో టీడీపీ, అన్నాడీఎంకే ఎంపీలు నిర‌స‌న వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహం ముందు ప్లకార్డుల‌ను ప్రద‌ర్శించారు. కావేరీ న‌దిపై అక్రమంగా డ్యామ్‌ను క‌ట్టరాదు అంటూ అన్నాడీఎంకే ఎంపీలు నిర‌స‌న వ్యక్తం చేశారు. ఆంధ్రప్ర‌దేశ్‌కు చెందిన టీడీపీ ఎంపీలు కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆందోళ‌న చేప‌ట్టారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై సంయుక్త పార్ల‌మెంట‌రీ సంఘాన్ని వేయాల‌ని కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే డిమాండ్ చేశారు.

చెడ్డీ గ్యాంగ్ అరెస్టు

$
0
0

విశాఖపట్నం: ఆంధ్ర పోలీసులకు చుక్కలు చూపించిన చెడ్డీ గ్యాంగ్ సభ్యులను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు విశాఖ పోలీసులు మీడియాతో మాట్లాడుతూ ఈ గ్యాంగ్‌లోని ఐదుగురు సభ్యులను అరెస్టు చేయాల్సింది ఉందని అన్నారు. చెడ్డీ-బనియన్ ధరించి చోరీలకు పాల్పడే ఈ ముఠా గుజరాత్‌కు చెందినది. ఏపీలోని నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నంతో పాటు తమిళనాడు, తెలంగాణలలో చోరీలకు పాల్పడ్డారు. నిఘా పెట్టిన పోలీసులు గుజరాత్ వెళ్లి ముగ్గురుని అరెస్టు చేశారు. వీరి నుంచి బంగారు నగలు, వెండి, కారు, బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Viewing all 69482 articles
Browse latest View live