మైలవరం, డిసెంబర్ 19: రైతు సహకార సంఘాల సభ్యులు విజ్ఞాన యాత్రను సద్వినియోగపరుచుకోవాలని దాల్మియా సిమెంట్ పరిశ్రమ టెక్నికల్ హెడ్ కరుణాకర రావు తెలిపారు. మండలపరిధిలోని చిన్నకొమ్మెర్ల వద్ద ఉన్న దాల్మియా సిమెంట్ పరిశ్రమ పరిధిలోని గ్రామల రైతులతో ఏర్పాటుచేసిన రైతు సహకార సంఘాల సభ్యులకు విజ్ఞానయాత్రను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి బయలుదేరిన సంఘసభ్యుల బస్సును కరుణాకర రావు జెండాఊపి యాత్రను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సమగ్ర అభివృద్ధికి దాల్మియా పరిశ్రమ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈక్రమంలోనే నాబార్డు సహకారంతో ఏర్పాటుచేసిన రైతు సహకార సంఘాలను ఏర్పాటుచేయడంతో పాటు వాటికి అందుబాటులోని అవకాశాలను తెలియజేసేందుకు విజ్ఞాన యాత్రల ద్వారా తెలియపరుస్తున్నామన్నారు. వాటిని సద్వినియోగ పరుచుకుని అవకాశాలను అందిపుచ్చుకుని రైతులు అన్నిరకాలుగా అభివృద్ది చెందాలని కోరారు. అనంతరం సీయస్ఆర్ విభాగాధిపతి రాజశేఖర రాజు మాట్లాడుతూ మైలవరం మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన దాదాపు 40 మంది రైతులను విజ్ఞాన యాత్రకు తీసుకెళ్తున్నామన్నారు. వారికి ముల్కనూరు రైతు సహకార సంఘం వద్దకు తీసుకెళ్లి సంఘాలు బలోపేతం అయ్యేవిధానాన్ని, అభివృద్దికి దృష్టిసారించాల్సిన అంశాలను వివరిస్తామన్నారు. ప్రస్తుతం దాల్మియా సిమెంట్ పరిశ్రమ ఆధ్వర్యంలో నాబార్డు సహకారంతో పాలు, శనగలు, పత్తి ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ఏర్పాటుచేయడం జరిగిందని రాజశేఖర రాజు తెలిపారు. కార్యక్రమంలో సీయస్ఆర్ సిబ్బంది శ్రీనివాసులు, శివకోటేశ్వరరావు, సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దుచేయాలి
రాజుపాళెం, డిసెంబర్ 19: బీజేపీ పార్టీ, ప్రధాని మోదీపై అసత్య ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ ఎంపి సభ్యత్వాన్ని రద్దుచేయాలని బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్మెంబర్ పుత్తా లక్ష్మిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో రాహుల్ గాంధీ ఎంపి సభ్యత్వాన్ని రద్దుచేయాలని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ వినతి పత్రాన్ని రాష్టప్రతికి పంపాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001లో దివంగత ప్రధాని వాజ్పేయ్ ప్రభుత్వం హయంలో రాఫెల్ యుద్ద విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. వాటి కొనుగోలుకు టెండర్లు పిలవడంతో 6 కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. అందులో డాటెట్ల కంపెనీ ఈ టెండర్ను దక్కించుకుందన్నారు. ఆ తర్వాత యూపియే1, యూపియే 2 ప్రభుత్వం హయంలో రాహుల్ గాంధీ బావ రాబర్ట్వాద్ర స్నేహితుడు రాఫెల్ ఒప్పందాలని తిరిగి తెరపైకి తీసుకువచ్చారన్నారు. ఆ తర్వాత 2015లో ఈ ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. అయితే ఈ యుద్ద విమానాల కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదని సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చినాకూడా రాహుల్గాంధీ ప్రధాని మోదీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే అని సుప్రీం కోర్టు తీర్పును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇలాంటి ప్రకటనలు రాహుల్ గాంధీ మానుకోవాలని రాహుల్ గాంధీ ఎంపి సభ్యత్వాన్ని రాష్టప్రతి రద్దుచేయాలని కోరారు.