సబ్బవరం, డిసెంబర్ 20 : మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారనే అభియోగంపై స్థానిక పోలీసులు గురువారం నమోదు చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నిందితులు నలుగురికి జరిమానా విధిస్తూ అనకాపల్లి సెకండ్ ఎంఎం కోర్టున్యాయమూర్తి గుప్తా తీర్పు వెలువరించారని స్థానిక ఎస్ఐ వై.నరసింహమూర్తి తెలిపారు. స్థానిక విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపిన నెక్కళ్ల సన్యాసినాయుడు (30)కు 800 రూపాయల జరిమానా విధించగా నంబారు వినయ్కుమార్ (22)కు -600, రొంగలి బంగారయ్య (45) - 800, అంగుళూరి చిన్న (45)కు- 6 వందల రూపాయల వంతున జరిమానా విధించారని పేర్గొన్నారు.
టీడీపీ నుంచి వైసీపీలో చేరిన అమ్ములపాలెం నేతలు
సబ్బవరం, డిసెంబర్ 20 : మండలంలోని అమ్ముల పాలెంలో గురువారం నిర్వహించిన అదీప్రాజ్ ప్రజాభరోసాయాత్రలో ఆ గ్రామానికి చెందిన ఐదుగురు టీడీపీ నేతలు ఆ పార్టీని వీడి వైసీపిలో చేరారు. ఈమేరకు వారికి పార్టీకండువాలు కప్పి అదీప్రాజ్ వైసీపీలోకి ఆహ్వానించారు. టీడీపీని వీడీ వైసీపీలో చేరిన వారిలో సూరిశెట్టిరామకృష్ణ, గండ్రెడ్డి అప్పారావు, బలిరెడ్డిపైడిబాబు, ఆకుల అప్పారావు, కనే్నపల్లి పైడిరాజు, కరణం నుకరాజులు ఉన్నట్లు ఆదీప్రాజు పంపించిన ప్రకటనలో వెల్లడించారు.
ఘనంగా సామూహిక హనుమాన్ వ్రతాలు
బుచ్చెయ్యపేట, డిసెంబర్ 20: మండలంలోని వడ్డాది శారదా నది ఒడ్డున ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని హనుమాన్ ఆలయంలో గురువారం సామూహిక హనుమాన్ వ్రతాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. గడచిన 15ఏళ్లుగా ప్రతి ఏటా ఈ ఆలయంలో ధనుర్మాసంలో ఈ సామూహిక వ్రతాలను వేద పండితులతో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నిర్వహించిన సామూహిక వ్రతాల్లో వడ్డాది పరిసరా గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు కృష్ణశర్మ భక్తులతో ఈ వ్రతాలను చేయించారు.
కేబుల్ ఆపరేటర్ల ధర్నా, రాస్తారోకో
బుచ్చెయ్యపేట, డిసెంబర్ 20: మండలంలోని కేబుల్ ఆపరేటర్లు గురువారం వడ్డాది జంక్షన్లో రాస్తారోకో నిర్వహించి, ధర్నా చేశారు. ట్రాయ్ పే చానళ్ల రుసుమును పెంచుతూ తీసుకున్న నిర్ణయం, కేబుల్ ఆపరేటర్లపై జిఎస్టిని విధించటాన్ని నిరసిస్తూ గురువారం మండలంలోని కేబుల్ ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. కార్పొరేట్ సంస్ధలకు మేలు చేసేలా కేంద్ర ప్రభుత్వం ట్రాయ్ ద్వారా పే ఛానళ్ల రేట్లను పెంచటం వలన నేడు గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు 100నుండి 150 లకు అందుతున్న టివి ప్రసారాలు 300నుండి 700రూపాయలకు పెరుగుతుందని కేబుల్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే స్వయం ఉపాధి కోసం కేబుల్ ఆఫరేటర్లుగా పనిచేస్తున్న తమకు ఉపాధి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 5రూపాయల ఉన్న పేఛానల్ రేటును 19రూపాయల వరకు పెంచుకోవచ్చని ట్రాయ్ ఉత్తర్వులు జారీచేయటంతో, అన్ని ఛానళ్లు 19రూపాయలకు పెంచేశాయని, వెంటనే పెంచిన ఈ రేట్ల తగ్గించాలని, కేబుల్ ప్రసారాలపై వసూలు చేస్తున్న 18శాతం జిఎస్టిని రద్దు చేయాలని, కేబుల్ ఆపరేటర్లకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు. ఎంఎస్ఒ సంఘం జిల్లా కార్యదర్శి దొండా రమేష్ అధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో బేతి వెంకటరావు, ఎనుముల వాసు, బత్తుల వరాహమూర్తి, రాజు తదితర ఆపరేటర్లు పాల్గొన్నారు. ఆందోళన అనంతరం బుచ్చెయ్యపేట తహశీల్దార్ పి లక్ష్మీదేవిని కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేశారు.