Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

ఏకమవుదాం

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 24: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుస్పష్టం చేశారు. ఈ దిశగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ప్రాంతీయ పార్టీలతో చర్చలు ప్రారంభమయ్యాయన్నారు. ఒడిశా పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం కోల్‌కతా చేరుకున్న కేసీఆర్, అక్కడి సచివాలయంలో తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. భేటీ ముగిసాక మమతా బెనర్జీతో కలిసి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, జాతీయ రాజకీయాలపై తాము చర్చించామన్నారు. ఫ్రంట్ ఏర్పాటుపై త్వరలో పటిష్టమైన ప్రణాళికతో ముందుకొస్తామన్నారు. తమ మధ్య మున్ముందు కూడా చర్చలు కొనసాగుతాయన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటంటే అదేదో ఆదర బాదరగా చేసే పని కాదని, ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునేంత చిన్న విషయం కూడా కాదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘దీదీతో (మమత) చర్చలు ఎప్పుడూ సానుకూలంగానే జరుగుతాయి, మున్ముందు విస్తృత చర్చల అనంతరం పూర్తిస్థాయి ఫలితాలు వస్తాయి’ అన్నారు. దేశ వ్యాప్తంగా పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం ఇదన్నారు. ఇప్పటికే తాను ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చించానన్నారు. త్వరలోనే కార్యాచరణ మొదలవుతుంది, మీకు శుభవార్త కూడా అందిస్తామన్నారు. ఇద్దరు నేతలు కలిసినప్పుడు సాధారణంగా పరస్పర ప్రయోజనాలు, జాతీయ రాజకీయాలు, ఇతర అంశాలు ప్రస్తావనకు వస్తాయన్నారు. కాంగ్రెస్, బీజేయేతర కూటమి కడుతున్నారా? అని మీడియా ప్రశ్నించగా, తన మిషన్ అదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందు కోసం నా ప్రయత్నాలు కొనసాగిస్తానని, ఫెడరల్ ఫ్రంట్ బలోపేతానికి కృషి చేస్తానని కేసీఆర్ తెలిపారు. మమతా బెనర్జీతో కేసీఆర్ సమావేశం ముగిశాక కోల్‌కతాలోని కాళీమాత ఆలయాన్ని కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాక ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మంగళవారం నుంచి రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలోనే కేసీఆర్ ఉంటారు. ఈ నెల 26 లేదా 27 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసుకుంటారు. టీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చాక ప్రధానిని మర్యాద పూర్వకంగానే కలుస్తారని సమాచారం. అలాగే బిఎస్‌పి అధ్యక్షురాలు, మాజీ సీఎం మాయావతి, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌తో కూడా కేసీఆర్ సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించనున్నారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై సంబంధిత కేంద్ర మంత్రులను కూడా కేసీఆర్ కలువనున్నారు. ఇలా ఉండగా సోమవారం ఉదయం భువనేశ్వర్ నుంచి బయలుదేరిన కేసీఆర్ పూరీలో జగన్నాథ ఆలయాన్ని, కోణార్క్‌లో సూర్యదేవాలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించిన అనంతరం కోల్‌కతాకు చేరుకున్నారు.

చిత్రం..మమతా బెనర్జీతో భేటీ అనంతరం విలేఖరులతో మాట్లాడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్


ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి

$
0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా మూడోరోజు సోమవారం వాయుకాలుష్యం జడలు విప్పింది. వాతావరణంలో వచ్చిన మార్పులు, వివిధ కారణాల వల్ల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. నగర పౌరులు పర్వదినాలను ప్రశాంత వాతావరణంలో చేసుకునే పరిస్థితులు లేవు. దీపావళి రోజు అత్యధిక స్థాయిలో కాలుష్యం విజృంభించింది. వాయు కాలుష్యం రికార్డు స్థాయిలో నమోదైంది. ఇపుడు క్రిస్మస్ పండుగకు కూడా వాయు కాలుష్యం బాధ తప్పలేదు. ఈ రెండ్రోజలు పౌరులు మరీ అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ప్రజారవాణాను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) గణాంకాల ప్రకారం వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిలో 448గా నమోదైంది. సోమవారం ఢిల్లీలోని 30 ప్రాంతాల్లో ప్రమాద స్థాయిలో వాయు కాలుష్యం నమోదైంది. మరో ఐదు ప్రాంతాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సీపీసీబీ అందించిన వివరాల ప్రకారం నొయిడాలో కాలుష్యం పరమ అధ్యన్నంగా ఉంది. అక్కడ 464గా నమోదైంది. ఫిజియాబాద్, ఘజియాబాద్‌లోనూ ప్రమాదకర స్థాయిలో ఉంది. గుర్గావ్‌లో మరీ తీవ్రంగా ఉన్నట్టు సీపీసీబీ వెల్లడించింది. ఢిల్లీని శనివారమే కాలుష్య భూతం కప్పేసింది. సోమవారం వరకూ అదే కొనసాగింది. మంగళవారం కూడా అదే పరిస్థితి ఉంటుందని సాయంత్రానికి కాస్త తగ్గే సూచనలను ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఢిల్లీ సరిహద్దుల్లోని పంజాబ్, హర్యానాలో పొగమంచు భారీ స్థాయిలో ఉంది. వాహనదారులకు దారి కనిపించక అనేక చోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కనీసం 7 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. వాహనాలు బారులు తీరి ఉంటున్నాయి.

సునామీ మృతులు 281

$
0
0

చిత్రం..ఇండోనేషియాలో పెను సునామీకి నేల కూలిన ఇళ్లనుంచి తమ వస్తువుల కోసం వెదుకుతున్న గ్రామస్థులు

పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు

$
0
0

హైదరాబాద్: తెలంగాణలో గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం అధికారికంగా వివరాలు జారీ చేసింది. రిజర్వేషన్ల కోసం దాదాపు 12 రోజుల నుంచి పంచాయతీరాజ్ శాఖ అధికారులు కసరత్తు చేశారు. సర్పంచ్‌ల స్థానాలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారుకావడంతో ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అవకాశం లభించింది. అయితే ఇప్పటకిప్పుడే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలు లేవు. ఇందుకు కారణం ఏయే గ్రామాలు, ఏయే వార్డులు రిజర్వ్ అయ్యాయో తేలాల్సి ఉంటుంది. సర్పంచ్‌ల స్థానాలు ఖరారైనప్పటికీ, వార్డు సభ్యుల స్థానాలు ఖరారు కావలసి ఉంది. సర్పంచ్‌ల స్థానాల సంఖ్యను రాష్టస్థ్రాయిలో ఖరారు చేశారు. అయితే ఏయే గ్రామాల సర్పంచ్‌స్థానాలు రిజర్వ్ చేయాలో కలెక్టర్లు, డీపీలు కలిసి నిర్ణయించాల్సి ఉంటుంది. వార్డు సభ్యుల స్థానాలను జిల్లాస్థాయిలో రిజర్వ్ చేస్తారు. ఏయే వార్డులు రిజర్వ్ చేయాలో పేర్లతో సహా ఆర్‌డీలు నిర్ణయించాల్సి ఉంటుంది. పేర్లు ఖరారు చేయడానికి మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రభుత్వం జారీ చేసిన అధికారిక వివరాల ప్రకారం ఎస్‌టీలకు 3146 సర్పంచ్ స్థానాలు రిజర్వ్ అయ్యాయి. ఎస్‌సీలకు 2113 సర్పంచ్ స్థానాలు, బీసీలకు 2345 సర్పంచ్‌స్థానాలు రిజర్వ్ కాగా, 5147 సర్పంచ్ స్థానాలు అన్‌రిజర్వ్‌డ్ (జనరల్) గా ఉంటాయని వెల్లడించారు. ఎస్‌టీలకు మూడు రకాలుగా
రిజర్వేషన్లు లభిస్తున్నాయి. షెడ్యూల్డ్ ఏరియాల్లో ఉన్న 1281 గ్రామ సర్పంచ్‌ల స్థానాలు ఎస్‌టీలకే లభిస్తున్నాయి. అలాగే నూటికి నూరు శాతం ఎస్‌టీలే ఉన్న మరో 1177 గ్రామాల సర్పంచ్ స్థానాలు కూడా ఎస్‌టీలకే రిజర్వ్ అయ్యాయి. నాన్-షెడ్యూల్డ్ ఏరియాల్లో ఎస్‌టీలకు 688 సర్పంచ్ స్థానాలు రిజర్వ్ అయ్యాయి. అంటే రాష్ట్రం మొత్తంలో ఎస్‌టీలకు 3146 సర్పంచ్ స్థానాలు రిజర్వ్ అయినట్టయింది. ఎస్‌టీలకు రిజర్వ్ అయిన స్థానాలు ఎక్కువగా ఆదిలాబాద్, భద్రాద్రి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమరంభీం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి.

చెరకుకు తీపి కబురెన్నడో?

$
0
0

సంగారెడ్డి, డిసెంబర్ 24: ఎన్నికల అనంతరం రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతామని, ఇందులో భాగంగా వ్యవసాయంపై మంచిపట్టున్న మాజీ మంత్రి చెరకు ముత్యంరెడ్డికి ఆ బాధ్యతలు అప్పగిస్తానని సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుతుందా? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. మలివిడత తెలంగాణ ఉద్యమం ప్రారంభానికి ముందు సిద్దిపేట ఎమ్మెల్యేగా కేసీఆర్, దుబ్బాక ఎమ్మెల్యేగా ముత్యంరెడ్డిలు టీడీపీకి తిరుగులేదని నిరూపించారు. ఇరువురి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు కూడా కలిగివున్నారు. ముత్యంరెడ్డి అనారోగ్యానికి గురైనప్పుడు మెరుగైన వైద్య సేవలు అందించడంలో సీఎం కేసీఆర్ తనవంతు సహకారం అందించి అభిమానాన్ని చాటుకున్నారు. ఇరువురి మధ్య ఉన్న అనుబంధమే నేడు ముత్యంరెడ్డికి రాష్ట్ర స్థాయిలో ప్రధాన భూమికను అప్పగించడానికి దోహదపడుతుందని సిద్దిపేట ప్రాంతవాసులు చర్చించుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం బహిరంగ సభలో గులాబీ దళపతి చెరకు ముత్యంరెడ్డిని రాష్ట్ర రైతు సమన్వయ సమితి కన్వీనర్‌గా నియమిస్తామని హామీ ఇచ్చారు. మేలు రకమైన పంటల సాగును ఎంపిక చేసుకోవడం, రైతులు పండించిన పంటలను రైతు కమిటీల ద్వారానే కొనుగోలు చేయడం, ఇందుకుగాను ఐకేపీ సంఘాలను బలోపేతం చేయడానికి ఐకేపీ ఉద్యోగులను పర్మనెంటు చేస్తామని హామీ ఇచ్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మాజీ మంత్రి చెరకు ముత్యంరెడ్డి మంత్రిగా ఉన్నా కూడా తన పొలాల్లోని పంటలను పలు సందర్భాల్లో పరిశీలిస్తూ రైతుగా అపారమైన అనుభవం కలిగివున్నారు. వ్యవసాయంలో ముత్యంరెడ్డికి ఉన్న అనుభవాన్ని స్వయంగా సీఎం కేసీఆర్ రైతులకు వివరించారు. ప్రస్తుతం చెరకు ముత్యంరెడ్డిని రైతు సమన్వయ కమిటీకి ఎప్పుడు నియమిస్తారోనన్న ఆదుర్దా నెలకొంది. మంత్రి వర్గాన్ని విస్తరించిన వెనువెంటనే మొట్టమొదటి నామినేటెడ్ పదవిని ముత్యంరెడ్డికి కట్టబెట్టవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఐకేపీ ఉద్యోగులు సైతం సీఎం నోటి నుండి తీపి కబురు ఎప్పుడు వెలువడుతుందోనని ఉద్యోగులు వేచిచూస్తూనే తమకు మంచి భవిషత్తు రాబోతుందన్న సంతోషం కూడా వ్యక్తమవుతోంది.

చిత్రం.. మాజీ మంత్రి చెరకు ముత్యంరెడ్డి

మోదీ ప్రయోజనానికే.. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్

$
0
0

వరంగల్, డిసెంబర్ 24: సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ కోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ఆరాటపడుతున్నాడని ఏ ఐసీసీ అధికార ప్రతినిధి రాజీవ్ గౌడ్ అన్నారు. సోమవారం వరంగల్ డీసీసీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీ ఆర్ ఒడిస్సా ముఖ్యమంత్రి నవన్ పట్నాయక్‌తో కలిసి చేసే చర్యలు ప్రతిపక్ష ఓట్లు చీల్చి ఎన్డీయే ప్రభాత్వానికి లబ్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి మోదీ సర్కార్‌తో లోపాయికారి ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం అయ్యిందన్నారు. అకస్మత్తుగా పెద్ద నోట్ల రద్దుతో ప్రధాని మోదీ సాధించిన ప్రగతి శూన్యం అన్నారు. రోజుకు రోజుకు ద్రవ్యోల్భనం పెరిగిపోతుందని ఆయన అన్నారు. దేశంలో జరిగిన రాఫెల్ ఇష్యూ ఒక మెగా స్కాం అని అన్నారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు విచారణ ఎదుర్కొవాలని ఆయన డిమాండ్ చేశారు. రాఫెల్ కుంభ కోణంలో పార్లమెంట్‌ను, సుప్రీం కోర్టును కేంద్రం తప్పుదారి పట్టిస్తూ మోసం చేస్తుందన్నారు. నోట్ల రద్దు తర్వాత కేంద్రం ఇద్దరు ఆర్బీ ఐ గవర్నర్ల చేత రాజీనామ చేయించాన్నారు. ఇప్పటికే దేశ ఆర్ధిక వ్యవస్ధ కుంటుపడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై లోతుగా విచారణ చేస్తున్నామని, ఎన్నికల్లో ఎక్కడ తేడా జరిగిందో పరిశీలిస్తున్నామని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికోట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఛతీస్‌ఘడ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని, ఇది కేంద్రంలో రేపు ఏర్పాటు కాబోయే ప్రభుత్వానికి సంకేతమేనని అన్నారు. మోదీ పరిపాలనపై ప్రజలు విసుగు చెందారని, కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, ఈవీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఏఐసీసీ అధికార ప్రతినిధి రాజీవ్‌గౌడ

తెలంగాణ కథా సాహిత్యానికి బంగారు భవిత

$
0
0

సిద్దిపేట, డిసెంబర్ 24: తెలంగాణలో కథా సాహిత్యానికి అద్భుతమైన భవిష్యత్ ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, తెలంగాణ సాహిత్య కళాపీఠం అధ్యక్షురాలు దాసరి శాంతకుమారి అన్నారు. సోమవారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ సాహిత్య అకాడమీ, సాహిత్య కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన కథా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడారు. కథలు నిత్యజీవితం నుంచి పుట్టుకొచ్చినవని, వస్తువు, భాష, శిల్పాలు కథల్లో ఉన్నట్లయితే అ కథలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఔత్సాహికులైన యువకులు కథా సదస్సులో పాల్గొనటం శుభ పరిణామం అన్నారు. కథ రచన చేసేవారు, అధ్యయన శీలత పెరిగి భాషపై పట్టు సాధించేందుకు కృషిచేయాలన్నారు. ప్రజల జీవన స్థితిగతులను పరిశీలించి రచనలు చేయాలన్నారు. తెలంగాణ మాండలిక భాషలో కృషిచేయాలన్నారు. ప్రజల భాషను వాడుకలోకి తెస్తే జీవం ఉట్టిపడుతుందన్నారు. విస్తృతమైన భాష కోసం రచనలు చదివి మననం చేసుకోవాలన్నారు. కథలో వస్తువు ముఖ్యమైందని, తెలంగాణలో వస్తువులకు కొదవ లేదన్నారు. భాష, శిల్పంతో కూడిన కథలను పాత్రలకు అనుగుణంగా, భావోద్వేగంతో పలికించగలిగినవి చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. గత సదస్సుల నిర్వహణ వల్ల, రచయితల మెళకువలు, ఇతివృత్తం, సన్నివేశం, సంఘటనలు తెలుసుకుంటారని, అందువల్ల కథా శిక్షణ సదస్సులు అవసరమన్నారు. కథలు పిల్లల్లో సహజంగా ఉండే ఊహాశక్తికి రెక్కలు తొడుగుతాయన్నారు. సృజనాత్మక శక్తికి పదును పెడితేనే సొంతంగా ఆలోచిస్తారన్నారు. కథలు వినటంవల్ల పిల్లల్లో జ్ఞాపక శక్డి, ఏకాగ్రత పెరుగుతాయని, విచక్షణ జ్ఞానం అలవరుతుందన్నారు. మనం వారికి నేర్పాలనుకున్న మంచి లక్షణాలను నేరుగా కాకుండా కథల ద్వారా చెపితే ఎక్కువ ఫలితం ఉంటుందన్నారు. నేటి ఆధునిక కాలంలో కొత్త వస్తువులు, కొంగొత్త దృక్పథం, బలమైన, విస్తృతమైన రచనలతో సమాజంలో జరగుతున్న అన్యాయాన్ని గురించి ఆలోచానాత్మకమైన ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టాలన్నారు. జీవితం నగ్న సత్యాలను, విభిన్న కోణాల్లో ఎండగడుతున్నారన్నారు. తెలంగాణ కథ సాహిత్యానికి అద్భుతమైన భవిష్యత్ ఉందన్నారు. తెలంగాణ సమాజాన్ని తన కథల్లో మాడపాటి హనుమంతరావు నుంచి పెద్దింటి అశోక్ కుమర్ వరకు చూపించారన్నారు. నేటి యువత ఔత్సహిక కథ, సాహిత్యాభిమానులకులకు తగిన మెళకువలు తెలియచేయాలనే చిరుప్రయత్నం తెలంగాణ సాహిత్య అకాడమీ చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ సభ్యుడు అంజయ్య మాట్లాడుతూ కథలు రాసిన తర్వాత పూర్వాపరాలను పరిశీలించి సరిచూసుకోవాలన్నారు. ప్రజాజీవితం ఉట్టిపడేలా కథలు ఉండాలన్నారు.
ఈకార్యక్రమంలో ప్రముఖ కవులు, రచయితలు ఎనె్నవెల్లి రాజవౌళి, పెద్దింటి అశోక్, బివి స్వామి, శ్రీనివాస్, సిద్దెంకి యాదగిరి, అనురాధ, శ్యామల, త్రివేణి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. కవి పెద్దింటి అశోక్‌కుమార్‌కు సత్కారం

చంద్రన్న క్రిస్మస్ కానుకల పంపిణీ

$
0
0

భీమునిపట్నం, డిసెంబర్ 24: భీమిలి పరిధిలోని పలు రేషన్ డిపోల్లో చంద్రన్న క్రిస్మస్ కానుకలను సోమవారం పంపిణీ చేశారు. డివిజన్ పరిధిలోని 8,9,11, 13, 14 డిపోల్లో భీమిలి రూరల్ అధ్యక్షుడు కొప్పల రమేష్ చేతులమీదగా పంపిణీ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వరలక్ష్మి, రవ్వ వెంకటరావు, తమ్మిన సూరిబాబు, కొప్పల కృష్ణ, మాదాబత్తుల త్రినాధ్, దండి వెంకటేష్, ఇప్పక గురునాధ్, నక్కాన రాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

దోభీఖాన నిర్మాణం చేపట్టాలి
మధురవాడ, డిసెంబర్ 24: రజక వృత్తిదారులకు మంజూరు చేసిన ఉడాకాలనీలో గల దోభీ ఘాట్‌ను వెంటనే నిర్మాణం చేయాలని కోరుతూ ఎపి రజకవృత్తి దారుల సంఘం కెవిపిఎస్, సిటు, ఐద్వా ఆధ్వర్యంలో శివపార్వతి రజకుల సంక్షేమ సేవా సంఘం వారు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ప్ల కార్డులు ప్రదర్శించి పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ ధర్నాలో సిఐటియు నగర కార్యదర్శి డి.అప్పలరాజు మాట్లాడుతూ మధురవాడ ప్రాంతం నివశిస్తున్న రజకులు సుమారు 75 కుటుంబాల వారు కులవృత్తిపై ఆదారపడి జీవిస్తున్నారని అన్నారు. 8 సంవత్సరాల కాలంనుండి దోభీఘాట్ నిర్మాణ చేయాలని అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చి అధికారులు, రాజకీయ నాయకులు చుట్టూ తిరిగామన్నారు. వీరి పోరాటానికి ఫలితంగా ప్రభుత్వం జివిఎంసి 5వ వార్డు పరిధిలోని ఉడాకాలనీలో స్థలం కేటాయించి నిర్మాణానికి రూ.15లక్షలు మంజూరు చేసిందన్నారు. ఇది జరిగి 3ఏళ్లు గుడుస్తున్నా నిర్మాణం చేపట్టలేదని ఆవేదన వ్యక్తంచేశారు. రజకులమనే భావనతో వివక్షత చూపిస్తున్నారని అన్నారు. వెంటనే అధికారులు చొరవ తీసుకుని దోబీఘాట్‌ను పూర్తిచేయాలని వారు డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జోన్ 1 కమీషనర్‌ను కలసి ఆయన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రజక సంగం అధ్యక్ష, కార్యదర్శిలు కె.చంద్రరావు, కె.ఎర్రిబాబు, సిటు జోన్ అద్యక్షులు పి.రాజుకుమార్, ఐద్వా కార్యదర్శి బి.భారతి తదితరులు పాల్గొన్నారు.
ఆయుష్‌కు వైధ్యాధికారిని నియమించాలి
మధురవాడ, డిసెంబర్ 24: మధురవాడ ప్రాధమిక ఆరోగ్యకేంధ్రంలో నిర్వహిస్తున్న ఆయుష్ విభాగపు వైధ్యాధికారిని నియమించాలని కోరుతూ స్థానిక పౌర సంక్షేమ సంఘం అధ్వర్యంలో ఆ సంఘ గౌరవాధ్యక్షులు ఎం.జగధీశ్వరరావు సోమవారం జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. మధురవాడ ఆరోగ్యకేంద్రంలో ఆయుష్ విభాగం 2013సంవత్సరంలో ప్రారంభించినప్పటి నుండి 2017 సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఆ విభాగం భాగానే నడిచిందని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఐతే సెప్టెంబర్ 2017లో అప్పటి వైధ్యురాలు డాక్టర్ శ్రీమతి దీపా స్వర్గస్తులైనప్పటి నుండి ఆయుష్‌కు గుర్తింపులేకుండా పోయిందని అన్నారు. ఈ విషయమై పలుమార్లు పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా వైధ్యాధికారులకు, ఆయుష్ సంబందించిన ప్రాంతీయ సంచాలకుల దృష్టికి తీసుకువెళ్లినా పూర్తిస్థాయిలో మెడికల్ ఆఫీసర్‌ను నియమించలేదని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. విశాఖలో మధురవాడ ప్రాంతం శరవేగంతో అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా ఒక పూర్తిస్థాయి ఆయుష్ డిపార్ట్‌మెంట్‌కు మెడికల్ ఆపీసర్‌ను అపాయింట్ చేసినయెడలా మధురవాడ మరియు చుట్టు ప్రక్కల ప్రాంతం ప్రాంతాల ప్రజలకు ఆయుర్వేద వైద్యము లభించునన్నారు. అలాగే ప్రజలకు ఉపయోగపడుతుందని, సదరు ఆయుష్ డిపార్ట్‌మంట్ మెడికల్ ఆఫీసర్ లేని కారంణగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని కావున వెంటనే దీనిపై తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఇచ్చిన వినతి పత్రంలో ఆయన పేర్కొన్నారు.
ప్రసాంతంగా ప్రారంభమైన డిఎస్సీ పరీక్షలు
మధురవాడ, డిసెంబర్ 24: డిఎస్సీ-2018 సంబందించి తొలి విడత పరీక్షలు సోమవారం ప్రసాంతంగా ప్రారంభమయ్యాయి. మధురవాడ ప్రాంతంలోని చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలోను, సాంకేతికా ఇంజనీరింగ్ కళాశాలలోను ఈ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. అభ్యర్ధులు ఉదయం 8గంటలకే పరీక్షా కేంధ్రాల వద్దకు చేరుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజెస్) పీజిటి, టిజిటి, ప్రిన్సిపాల్, మ్యూజిక్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్, క్రాఫ్ట్, పండిట్, పిఇటి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు జనవరి 4వరకు జరగనున్నాయి. రెండు సెషన్లలో జరిగే ఈ పరీయలు ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయింత్రం 5గంటల వరకు జరిగాయి. మధురవాడ చైతన్య కళాశాలలో 150మందికి 131మంది, సాంకేతిక కళాశాలలో 130మందికి 118మంది అభ్యర్ధులు పరీక్షలకు హాజరయ్యారు.


విద్య,వైద్యానికే అధిక ప్రాధాన్యత

$
0
0

సింహాచలం, డిసెంబర్ 24: తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి ప్రయోజనం కలిగే పనులు చేయడానికే పార్లమెంటు సభ్యులు తమకు కేటాయించిన నిధులను వినియోగించాలని విశాఖ పార్లమెంటు సభ్యుడు కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు. అడివివరంలోని మహాత్మాజ్యోతిభాపూలే ఆంధ్రప్రదశ్ వెనుకబడిన తరగుతుల సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన సోలార్ హీటర్స్, మరుగుదొడ్లు, బోరుబావులను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడడంతో పాటు పార్లమెంటు సభ్యుల నిధుల వినియోగం పై స్పూర్తిదాయకమైన ప్రసంగం చేసారు. తన పదవీ కాలంలో కేటాయించిన నిధుల వివరాలను ఆయన వెల్లడించారు. ఏడాదికి 5 కోట్ల చొప్పున ప్రభుత్వం కేటాయించిన అత్యధిక నిధులను విద్య, వైద్యానికి కేటాయించడం జరగిందని ఆయన స్పష్టం చేసారు. నిధుల వినియోగానికి సంబంధించి ఒక కమిటీని వేయడం జరిగిందని హరిబాబు చెప్పారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కూర్చోవడానికి సుమారు 7 వేల 500 బల్లలను అందించడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ బల్లల పై సుమారు 20 వేల మంది విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చుంటున్నారని ఆయన వెల్లడించారు. సౌకర్యాలు పెరిగినప్పుడే విద్యార్థులు బాగా చదువుకోగలుగుతారని, అరుకులోని ఒక పాఠశాలలో సౌకర్యాలు అందిన ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగిన విషయాన్ని గమనించామని ఎంపీ సంతృప్తి వక్తం చేసారు. పాఠశాలలో ఏర్పాటు చేసే డిజిటల్ తరగతి గదులకు కూడా నిధులను కేటాయించామని ఆయన అన్నారు. అనేక చోట్ల సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. విద్య, వైద్యానికి తాము అందించే సహకారంలో అనేక సంస్థలు భాగసామ్యమయ్యాయని హరిబాబు ధన్యవాదాలు తెలియజేసారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలకు స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలకు నిధులను కేటాయించామని ఆయన చెప్పారు. కార్పోరేషన్ పరిధిలోని 144 పాఠశాలలో కమిషనర్ సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయడం జరిగిందని అందులో 25 శాతం నిధులు తాను కేటాయించానని ఎంపీ తెలియజేసారు. తన 5 ఏళ్ల పదవీ కాలంలో ప్రభుత్వం అందించే నిధులకు సంబంధించి సుమారు 29 కోట్ల రూపాయలతో ప్రణాళికలు ముందుగానే రూపొందించుకొని ఖర్చు చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేసారు. తన అభిప్రాయాన్ని తోటి ఎంపీలకు కూడా తెలియజేసానని, వారు కూడా ఆయా నియోజక వర్గాల్లో ఇదే తరహాలో నిధులు కేటాయించారని హరిబాబు చెప్పారు.
* ఎంపీకి సత్కారం: పాఠశాలకి అందించిన సహకారానికి కృతజ్ఞతగా గురుకుల ప్రిన్సిపాల్ కేబీబీ,రావు పరివారం ఎంపీ హరిబాబును ఘనంగా సత్కరించారు. పాఠశాల పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పూర్వ విద్యార్థుల సమాచారాన్ని సేకరించాలని, ఉన్నత స్థానంలో ఉన్న వారి సేవలను కూడా ఉపయోగించుకోవాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. ముందుగా ఆయన పాఠశాలలో సుమారు 25 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు, బోరుబావులు,సోలార్ హీటర్ ద్వారా వచ్చే నీటిని పరిశీలించారు. పాఠశాలలో సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా దేశానికి సేవలందించాలని ఆయన పిలుపునిచ్చారు.

కరువుమండలాలుగా ప్రకటించాలని కలెక్టర్‌కు వినతి
భీమునిపట్నం, డిసెంబర్ 24: భీమిలి నియోజకవర్గంలోని భీమిలి రూరల్, ఆనందపురం, పద్మనాభం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని వైసిపి నాయకులు సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు తైనాల విజయ్‌కుమార్, భీమిలి నియోజకవర్గ కన్వీనర్ అక్కరమాని విజయ నిర్మల ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు వినితిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మూడు మండలాల అధ్యక్షులు కంటుభుక్త రాంబాబు, బంక సత్యం, చెళ్లురి పైడప్పడు, నాయకులు బోని బంగారు నాయుడు, జీరు సుజాత తదితరులు పాల్గొన్నారు.

గొల్లవీధిలో తెదేపా క్రియాశీల సభ్యత్వాలు
భీమునిపట్నం, డిసెంబర్ 24: భీమిలి డివిజన్ 18వ వార్డు గొల్లవీధిలో తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వాలను భీమిలి డివిజన్ అధ్యక్షుడు గంటా నూకరాజు సోమవారం ప్రారంభించారు. మొదటి సభ్యత్వాన్ని ఆయన పార్టీ సీనియర్ నాయకుడు మారోజు సత్యవరప్రసాద్‌కు డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు ప్రధాన కార్యదర్శి గొలగాని నరేంధ్రకుమార్‌లు అందజేశారు. ఈ సందర్భంగా గంటా నూకరాజు మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నో పధకాలు పేదలకోసం ప్రవేశపెట్టారని అందులో చంద్రన్న భీమా, చంద్రన్న పెళ్లికానుక, 50ఏళ్లకే మత్యకారులకు పించన్లు, డప్పుకార్మికులకు, ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు పించన్లతో పాటు వివాహిత, వృద్ధాప్య, దివ్యాంగుల పించన్లును ఐదు రెట్లు పెంచడం జరిగిందన్నారు. కార్యక్రమంలో 18వ వార్డు జన్మభూమి కమిట ఇ సభ్యులు మారోజు సంజీవ్‌కుమార్, డింగి సత్యన్నారాయణ, గండిబోయిన పోలిరాజు, పార్టీ నాయకులు నెక్కిళ్ల వెంకటరావు, చురకల రమణ, గిడుతూరి శ్రీనివాసరావు, డెక్కతి సూర్యనారాయణ, గూడుపు రాజు, గండి రాజు, పూతి శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం !

$
0
0

సింహాచలం, డిసెంబర్ 24: శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయం హుండీల ద్వారా రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. 24 రోజులకు ఒక కోటి 10 లక్షల 6 వేల 123 రూపాయల ఆదాయంతో పాటు 107 గ్రాముల బంగారం, 8 కిలోల 470 గ్రాముల వెండి భక్తులు కానుకల రూపంలో సమర్పించారు. 24 రోజుల్లో ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం ఇదే తొలిసారి. అమెరికా, సింగపూర్, కువైట్, యూఏఈ, సౌదీ అరేబియా, మలేషియా దేశాలకు చెందిన కరెన్సీ హుండీల ఆదాయంలో ఉన్నాయి. ఈవో కే.రామచంద్రమోహన్ పర్యవేక్షణలో దేవస్థానం ఉద్యోగులు, శ్రీహరి సేవా ప్రతినిధులు సోమవారం ఆదాయం లెక్కింపులో పాల్గొన్నారు. ప్రతి నెల హుండీల ద్వారా సగటున రోజుకి నాలుగు లక్షల రూపాయలు వస్తాయని అధికారులు అంచనా వేస్తారు. అధికారుల అంచనాకి తగ్గట్టుగానే ఆదాయం వస్తోంది. ఈ సారి కూడా అధికరాలు అదే తరహాలో అంచనా వేయగా అంచనాలకు మించి ఆదాయం రావడం గమనార్హం. లెక్కించిన ఆదాయాన్ని భారతీయ స్టేట్ బ్యాంకులోని దేవస్థానం ఖాతాలో జమచేసారు. ఎస్‌బీఐ సింహాచలం బ్రాంచ్ మేనేజర్ కే.సౌమిత్ర తన సిబ్బందితో వచ్చి దేవస్థానం హుండీల ఆదాయాన్ని స్వీకరించారు.
సింహాచలేశుని దర్శించుకున్న ప్రముఖులు
సింహాచలం, డిసెంబర్ 24: చెన్నై హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఎం.సుబ్రహ్మణ్యన్, కేంద్ర ఎస్సీ కమిషన్ చైర్మెన్ రాములు, విశాఖ జిల్లా అటవీశాఖ అధికారి సెల్వన్ , జూ క్యూరేటర్ యశోదాబాయ్ సోమవారం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. దేవాలయ అధికారులు వీరికి స్వాగతం పలికారు. కప్పస్తంభం అలింగనం చేసుకున్న ప్రముఖులు స్వామివారిని ప్రార్థించుకున్నారు. అంతరాలయంలో ప్రముఖుల పేరున అర్చకులు సంప్రదాయ పూజలు చేసి ఆశీర్వదించారు. అధికారులు వీరికి ప్రసాదాలు అందించారు.
త్రివిక్రమావతారంలో సింహాచలేశుడు
సింహాచలం, డిసెంబర్ 24: సింహాచలం దేవాలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలలో భాగంగా రాపత్తు వేడుకలు సంప్రదాయంగా జరుగుతున్నాయి. అరవ రోజు స్వామివారు త్రివిక్రమావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.సాయంత్రం స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి సింహగిరి పురవీధుల్లో ఊరేగారు.్భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

విశాఖ ఉత్సవ్ ఏర్పాట్లుపై సమీక్ష

$
0
0

విశాఖపట్నం, డిసెంబర్ 24: విశాఖ ఉత్సవ్ పండగ నేపథ్యంలో పర్యాటకులకు, నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహాణ విషయంలో శ్రద్ద చూపాలని జీవీ ఎంసీ కమిషనర్ హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. విశాఖ ఉత్సవ్ ఏర్పాట్లుపై సోమవారం తన ఛాంబర్‌లో విభాగాలధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవీ ఎంసీ చేపట్టే అన్ని కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని, ఆర్కేబీచ్ రోడ్,బీచ్‌లో చెత్త లేకుండా ఎప్పటికప్పుడు నిరంతరం తరలించే విధంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలని ప్రజారోగ్యాధికారులను ఆదేశించారు. జీవీ ఎంసీ తరుపున శకటం,లైటింగ్, డేకరేటివ్‌లైటింగ్ ఏర్పాటు చేసి ఉత్సవానికి శోభను తేవాలన్నారు. విశాఖ ఉత్సవ్ సందర్భంగా తాగునీటి ప్యాకేట్లు అమ్మకం, సరఫరా లేకుండా వెండర్స్‌ను సూచించాలని, అదే విధంగా శానిటేషన్‌తో పాటు ఇంజనీరింగ్ అధికారులు స్వీపింగ్ మిషన్లును వినియోగించేలా చర్యలు తీసుకొవాలన్నారు.బీచ్‌రోడ్డులోని విగ్రహాలను పరిశుభ్ర పర్చాలని, ఉత్సవ్ వేదికల వద్ద ఇబ్బంది లేకుండా మొబైల్ టాయిలెట్లును ఏర్పాటు,సెంట్రల్ పార్కు వద్ద అన్ని షాపుల్లో డస్ట్‌బిన్లు అమర్చాలన్నారు. హెర్డింగ్స్ అమరికలో ప్రైవేట్ సంస్థలు ఏర్పాటుకు అవకాశం కల్పించాలని సూచించారు. విశాఖ ఉత్సవ్‌లో స్వచ్చత ప్రతిబింబించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ మూర్తి, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వై.మంగపతిరావు, డిసీ ఆర్ సోమన్నారాయణ,ప్రధాన వైద్యాధికారి డాక్టర్ హేమంత్, ఎస్ ఈ వేణుగోపాల్, ఈ ఈ వెంకటి, రత్నాలరాజు, మహేష్, జోనల్ కమిషనర్ నల్లనయ్య, చిట్టిబాబు పాల్గొన్నారు.
బీజేపీకి ప్రతికూల పరిస్థితులు ఉన్న మాట వాస్తవం
* ఎన్నికల నాటికి సానుకూలంగా మారుస్తాం * విశాఖ ఎంపీ కంభపాటి హరిబాబు
సింహాచలం, డిసెంబర్ 24: భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్న మాట వాస్తవమేనని రానున్న సార్వత్రిక ఎన్నికల్లోగా ప్రజలను మెప్పించి సానుకూలతను సాధించే దిశగా ప్రయత్నం చేస్తామని విశాఖ పార్లమెంటు సభ్యుడు కంభపాటి హరిబాబు స్పష్టం చేసారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికల్లో ఎదురైన పరాభవం పై విలేఖరులడిగిన ప్రశ్న పై ఆయన పై విధంగా స్పందిస్తూ వాస్తవ పరిస్థితులను అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ ఒక్క జాతీయ సంస్థను కూడా ఏర్పాటు చేసిన పాపాన పోలేదని ఆయన అన్నారు. మోడి ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్లలోనే 11 జాతీయ సంస్థలను ఆంధ్రప్రదేశ్‌కి తీసుకురావడాన్ని అందరూ అంగీకరించితీరాలని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన నాలుగు అంశాలు మాత్రమే పెండింగులో ఉన్నాయని హరిబాబు స్పష్టం చేసారు.విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్‌ప్లాంట్, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, దుగ్గరాజపట్నం పోర్టు పనులు జరగాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రస్తుత రాజకీయ పస్థితుల నేపథ్యంలో ఈ పనులు ఆలస్యమయ్యాయని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న రాజకీయ వైఖరి కూడా ఒక కారణమని హరిబాబు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీజేపీ పై చేస్తున్న దుష్ప్రచార ప్రభావం ఉంటుందని, ప్రజలకు వాస్తవాలను వెల్లడించి సమర్థవంతంగా ముందుకు వెళ్లాల్సిందేనని హరిబాబు ఒక ప్రశ్నకి సమాధానంగా అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అంచనా వేయడం కష్టమని, ఎన్నికల సమయం వస్తే తప్ప చెప్పలేమని ఆయన స్పష్టం చేసారు. తెలంగాణాలో మహా కూటమి ప్రయోగం విఫలమైన నేపథ్యంలో దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా మహా కూటమిగా ఏర్పాడానికి జరుగుతున్న ప్రయత్నాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు.
చంద్రన్న క్రిస్మస్ కానుక అందజేత
సింహాచలం, డిసెంబర్ 24: జీవీఎంసీ 72వ వార్డు పరిధిలోని అడివివరంలో చంద్రన్న క్రిస్మస్ కానుకలు సోమవారం అందజేసారు. జన్మభూమి కమిటీ ప్రతినిధులు లబ్దిదారులకు కానుకలు అందించారు. కేజీ గోధుమలు, అరకిలో కందిపప్పు, అరలీటర్ పామోలిన్ ఆయిల్, అరకిలో శెనగపప్పు, అరకిలో బెల్లం, 100 గ్రాముల నెయ్యితో కూడిన సరుకుల బ్యాగ్‌ని లబ్దిదారులకు అందించడం జరిగింది. 72వ వార్డు టీడీపీ అధ్యక్షుడు జన్మభూమి కలిటీ సభ్యుడు పిసిని వరహా నరసింహం, లండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యశాఖలో అటకెక్కిన బయోమెట్రిక్

$
0
0

విశాఖపట్నం,డిసెంబర్ 25: ప్రభుత్వ కార్యాలయాలల్లో పారదర్శకమైన సేవలందించాలిని, ప్రజలే ముందు అనే నినాదంతో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన వారికి సకాలంలో సేవలు అందే విధంగా ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరవుతారనే ఉద్దేశ్యంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. దీనిలో భాగంగానే వైద్య ఆరోగ్య శాఖలో కూడా రోగులకు సకాలంలో వైద్యసేవలు అందడం లేదనే విమర్శల నేపధ్యంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఇష్టానుసార విధులకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రత్యేక ప్రసూతి ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ విధానాన్ని ఏడాదిన్నర క్రితం ప్రవేశ పెట్టింది. అయితే అన్ని ఆసుపత్రులకు బయోమెట్రిక్ పరికరాలను అందజేశారే తప్ప వాటికి అవసరమైన ఇంటెర్నెట్ తదితర వాటిని పూర్తి స్థాయిలో అందించడం మరిచిపోయారు. రూరల్ ప్రాంతాలల్లో ఇంటర్నెట్ సేవలు సక్రమంగా అందడం లేదనే సాకుతో కొందరు, ఇష్టానుసార విధులకు అడ్డంకిగా మరిందని మరి కొందరూ ఆయా బయోమెట్రిక్ పరికరాలను పాడు చేసి అటకెక్కించిన సందర్భలు లేకపోలేదు. బయోమెట్రిక్‌లో ఆధార్ అనుసంధానం కూడా చేసి ఖచ్చితంగా అమలు చేయాలని, సమయపాలన ప్రకారం బయోమెట్రిక్ ద్వారా హాజరుకాకపోతే జీతంలో కోత విధిస్తామని అధికారలు హెచ్చరించారు. అదే విధంగా సమయపాలన పాటించకపోతే శాఖ పరమైన చర్యలు తప్పవని ఇటీవల జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆరోగ్య శాఖ అధికారులను హెచ్చరించినా వారిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఈ హెచ్చరికలు జరిగి దాదాపుగా నెల రోజులు అవుతున్నా వైద్యుల తీరు, సిబ్బంది సమయపాలనలో ఏటువంటి మార్పులేదు. కనీసం జిల్లా స్థాయి అధికారులు ఇప్పటీవరకూ ఏ ఒక్కరి జీతంలోనూ కోత విధించిన దాఖలాలు లేవు. దీంతో పాటు జిల్లాలో సగానికి పైగా పిహెచ్‌లకు ఇంటెర్నట్ ( ఆన్‌లైన్) సమస్య తోడువడంతో సిబ్బందికి వరంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 90 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఏజెన్సీ 11 మండాలలను మినహియిస్తే మిగిలిన వాటిలో వీటిని వినియెగించే వారు 50 శాతం మంది కూడా లేరంటే పరిస్థితి ఏ విదంగా వుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా జిల్లా ఆరోగ్య శాఖ కార్యలయంలో కూడా ఈ బయోమెట్రిక్ పరికరం పనిచేయకపోవడం గమనర్హం. కేవలం ఈ బయోమెట్రిక్ పరికరాల నిర్వహణ, తదితర వాటిని పర్యవేక్షించాల్సిన జిల్లా ప్రోగామ్ ఆఫీసర్లు ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ విధంగా జరుగుతుందనే విమర్శలు లేక పోలేదు. వాస్తవానికి ప్రతి నెలా ఠంచన్‌గా జీతం తీసకుంటున్న ఉద్యోగులంతా బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు వేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పని చేస్తున్న ఏ ఉన్నతాధికారులు ఈ బయోమెట్రిక్ విధానం ద్వారా ఒక్క రోజు కూడా హాజరు వేసిన ధాఖాలాలు కనిపించడం లేదు. ముఖ్యంగా జిల్లా కార్యాలయంలో డిప్యూటీషన్‌పై పని చేసే వారికి ఇది ఒక వరంగా మారింది. ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానం ద్వారా ఎందుకు హాజరు వేయటం లేదని కలెక్టర్‌తో పాటు జీతాలు మంజూరు చేసే ట్రెజరీ అధికారులు కూడా ప్రశ్నించినా ఎదో ఒక కుంటి సాకు చెప్పి తప్పించకుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలగు గంటల వరకూ పని చేయాలి. కానీ ఈ నిబంధనలు ఏక్కాడా అమలు జరగడం లేదు. మధ్యాహ్నం 12 అయినా వైద్యులు, సిబ్బంది వచ్చే పరిస్థితి లేదు. వైద్యులు సమయపాలన పాటించడం లేదని ప్రతి నెల నిర్వహించే వైద్యాదికారుల సమీక్షా సమావేశంలో కలెక్టర్ హెచ్చరిస్తున్నా కనీసం పట్టించుకోకుండా ఆదేశాలను బుట్టదాఖలు చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అంతేకాకుండా ప్రతి నెల జిల్లా రిపోర్ట్‌లను విజయవాడ ఉన్నాతాధికారలుకు పంపే సమయంలో తప్పుడు రిపోర్ట్‌లనే పంపుతున్నారనే విమర్శలు లేకపోలేదు. కేవలం శీతల గదుల్లో కూర్చోని కాకి లెక్కలతో కాలం గడుపుతున్నా ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనర్హం. ఈ విషయంపై జిల్లా వైద్య, ఆరోగ్య శాకాధికారి డాక్టర్ తిరుపతిరావును వివరణ కోరగా జిల్లాలో ఏజెన్సీ మండలాల మినహా మిగిలిన ప్రాంతాలల్లో బయెమెట్రిక్ పరికరాల నిర్వహాణకు ఇంటెర్నట్ లేకపోవడం ఇబ్బంది మారుతోంది. ఇప్పటీకే స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించి బయోమెట్రిక్ విధానాన్ని వినియెగించాలి లేకుంటే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ఎగబాకిన ధరలు

$
0
0

విశాఖపట్నం,డిసెంబర్ 24: మానవ శరీరానికి పోషకాహారాన్ని అందివ్వడంలో కోడిగుడ్డు అత్యంత కీలకమైనది. రోజుకి ఒక్క గుడ్డు తింటే మనిషి ఆరోగ్యంగా వుంటారని వైద్యులు చెబుతున్నారు. అరోగ్యానికి మేలు చేసే కోడిగుడ్లు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. దీంతో దాని కోనాలంటేనే జంకాల్సిన పరిస్థితి . ప్రస్తుతం ఒక్కో కోడిగుడ్డు ధర రూ.5.50 నుంచి ఆరు రూపాయాల వరకూ పలుకుతోంది. దీంతో రోజుకోసారో, రెండురోజులకోసారో గుడ్డు తినే వారు ఇక నుంచి వారానికి ఒక్క సారితోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మాడు వారాల నుంచి ధర ఆమాంతంగా పెరుగుతూ వస్తోంది. అక్టోబర్ నెలలో గుడ్ల విక్రయ ధరల్లో వంద కోడిగుడ్లు రూ.400 నుంచి 450 దోరికేవి. వాస్తవానికి కార్తీక మాసంలో వీటి ధరలు తగ్గుతూ ఉంటాయి. ఈ ఏడాది కార్తీక మాసంలో కూడా ఐదు రూపాయాలకు ధర పలికింది. ఈనెలలోనే ధరలు బాగా పెరిగాయి. పట్టణంలోనూ చిన్న దుకాణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో గుడ్డు ధర రూ. ఏడు వరకూ అమ్ముతున్నారు. డజను ధర రూ.84 పలకడంతో వీటిని కోనుగోలు చేసేందుకు వచ్చిన వారు గుడ్లు తేలస్తున్నారు. అలాగే కోడి మాంసం ధరలు కూడా అధికంగా ఉన్నాయి. మాంసం ధరలతోపాటు గుడ్డు ధర రోజురోజుకి పెరగడంతో జనం విస్తుపోతున్నారు. ఒక్క పక్క కూరగాయలు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హాటళ్ల నిర్వాహాకులు, బేకరీల యాజమానులు పెరిగిన ధరల వల్ల భారం పడుతోందని పేర్కోంటున్నారు.
వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా వామనరావు
విశాఖపట్నం,డిసెంబర్ 24: వైసీపీ ట్రేడ్ యూనియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా శ్రమశక్తి అవార్డుగ్రహీత, జీవీ ఎంసీ స్ట్ఫా అండ్ వర్కర్స్ యూనియన్ సెకట్రరీ జనరల్ వివి వామనరావుని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇటీవలే వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన వామనరావుజీవీ ఎంసీలో స్వత్రంత్య యూనియన్‌గా కొనసాగుతున్న వి ఎంసీ స్ట్ఫా అండ్ వర్కర్స్ యూనియన్‌ను వైసీపీ ట్రేడ్ యూనియన్‌లో విలీనం చేశారు. నగరంలోని అన్ని ట్రేడ్ యూనియన్లు కంటే ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వామనరావు నేతృత్వంలో ఎన్నో కార్మిక విజయాలు సాధించినందుకుగాను రాష్టవ్రైసీపీ ట్రేడ్ యూనియన్‌లో కీలక పదవిని కట్టబెడుతూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తన సేవలను గుర్తించిన రాష్ట్ర నాయకత్వంలో పదవిని అందించిన వైసీపీ అధినేత జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, పార్లమెంట్ అధ్యక్షుడు తైనాల విజయ్‌కుమార్, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాసులకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జీవీ ఎంసీకి చెందిన కార్మిక సంఘాల నాయకులతో పాటు, ఇతర ట్రేడ్ యూనియన్ సంఘాల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. యూనియన్ పనులతో పాటు, పార్టీ బలోపేతానికి కూడా తన శాయుశక్తుల పాటుపడతానన్నారు. వామనరావుకు కీలకమైన పదవీ లభించడంతో జీవీ ఎంసీ యూనియన్ నాయకులు సీతారామ్, జీవీ కుమార్, ఇతర కార్మికులు,సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

మార్కెట్‌కు పండగ శోభ

$
0
0

విశాఖపట్నం, డిసెంబర్ 24: మహా విశాఖ నగరానికి పండగ కళ వచ్చేసింది. నగరంలోని ప్రముఖ షాపింగ్‌మాల్స్‌తో పాటు, చిన్న,మధ్య తరగతి వస్తద్రుకాణాలన్ని కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయిర్, సంక్రాంతి పండగల పేరిట మహిళలు, చిన్నారులు, పురుషులకు ఇలా ఎవ్వరికి నచ్చిన విధంగా వారు కొనుగోలు చేసేందుకు విభాగాల వారిగా భారీగా ఆఫర్లు ప్రకటించడంతో దుకాణాల వద్ద సందడి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా నగరంలోని డాబాగార్డెన్స్, ఆశీలుమెట్ట,జగదాంబ, పుర్ణామార్కెట్, మద్దిలపాలెం, ద్వారాకనగర్ ప్రాంతాల్లోని వస్త్ర,బంగారు దుకాణాలు అధికంగా ఉండడంతో పాటు, అధిక సంఖ్యలో కొనుగోలుదారుల తాకిడి కూడా అదే స్థాయిలో ఉండటంతో ఆయా ప్రాంతాలన్ని రద్దీ వాతావారణం నెలకొంది. అసలే వరుస సెలవులు, ఆపై క్రిస్మస్ పండగతో స్వీట్, బేకరీ దుకాణాలు కూడా రద్దీగానే ఉన్నాయి. వాస్తవానికి చెప్పాలంటే ప్రతీ ఏటా డిసెంబర్ 20 నుంచి జనవరి 20 వరకూ నెల రోజుల పాటు పెద్ద పండగ సందర్భంగా వస్త్ర దుకాణాల్లో విక్రయాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా వస్త్ర వ్యాపారానికి సంబంధించి పోటీ మార్కెట్ ఉండటంతో ఆశించిన స్థాయి కంటే కొనుగోలుదారులకు విపరీతమైన బంపర్ ఆఫర్లు ప్రకటించడంతో వాటిని వినియోగించుకొవడానికి దుకాణాలకు తరలివెళుతున్నారు. అయితే క్రిస్మస్ పండగతో ప్రారంభమైన ఈ సీజన్ జనవరి ఐదో తేది నుంచి మరింత కొనుగొళ్లు పెరుగుతాయని వ్యాపారులు పేర్కోంటున్నారు. అయితే నగరంలో షాపింగ్‌మాల్స్, వస్తద్రుకాణాల సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతూ వస్తోంది. దీంతో తమ వ్యాపారాలను పెంచుకునేందుకు ఎవ్వరికి వాళ్లు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. దీంతో నచ్చిన రకాల మంచి వస్త్రాలను ఎంపిక చేసుకొని వాటిని తక్కువ ధరలకే విక్రయాలు చేపడుతున్నారు.
* ఆకట్టుకుంటున్న ఆఫర్లు
గతేడాది కంటే ఈ ఏడాది నగరంలోని పలు షాపింగ్‌మాల్స్‌లో ఆఫర్లు ఆశజానకంగా ఉండటంతో ఆన్‌లైన్ షాపింగ్‌లకు కూడా అధికంగా ఆసక్తి చూపుతున్నారు. వాస్తవానికి చెప్పాలంటే నగరంలో సుమూరు 80వరకూ షాపింగ్ మాల్స్ ఉండగా, చిన్నచిన్న వస్తద్రుకాణాలన్ని కలపి మరో వెయ్యి వరకూ ఉండనున్నాయి. ఈ మొత్తం షాపుల నుంచి సాధారణ రోజుల్లో నాలుగు నుంచి ఐదు కోట్లు వ్యాపారం జరిగే అవకాశాలుంటాయి, అయితే పండగ సీజన్ కావడంతోపాటు, ఆఫర్లుకు ఆకర్షితులైన ప్రజలు అధిక సంఖ్యలో కొనుగోలు చేయడంతో రోజుకు పదికోట్లు వరకూ వ్యాపారాలు సాగే అవకాశం లేకపోలేదు. వచ్చే వారం నుంచి ఈ విక్రయాల శాతం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కోంటున్నాయి.

బోధనాసుపత్రిలల్లో నర్సింగ్ నియమకాలు జరిగేనా?
* కార్యారూపం దాల్చని ఉన్నతాధికారుల హామీ * తక్షణమే నియామకాలు చేపట్టాలి: ఏపీ నర్సింగ్ అసోసియేషన్
విశాఖపట్నం, డిసెంబర్ 24: వైద్యవృతిలో కీలకమైన నర్సింగ్ వ్యవస్థలో పూర్తి స్థాయిలో సిబ్బింది లేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి, ఆరోగ్యశాఖ ముఖ్య ఉన్నాతాధికారులకు ఎన్నిసార్లు యానియన్ నాయకులు, ఆయా ఆసుపత్రి ఉన్నతాధికారుల ఫిర్యాదులు, వినతిప్రతాలు అందజేసిన ఏ మాత్రం ఫలితం లేకుండావున్న నేపధ్యంలో నర్సింగ్ స్ట్ఫాంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. గత ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కారానికి ఆరోగ్యశాఖ ఉన్నాతాధికారలతో ఓ కమీటి సమావేశం కూ డా నిర్వహించారు. ఆ కమీటి సమావేశంలో తక్షణమే భోధనాస్పత్రిలల్లో వెయ్యి నర్సింగ్ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఏడాదికి పైగా గడుస్తున్నా నేటికీ ఏ మాత్రం ఫలితం లేక పోవడంతో నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటీకే అరకొర సిబ్బందితో రోగులకు సేవలందిస్తున్న సిబ్బందికి ఉన్నవారిలో కూడా అధిక సంఖ్యలో పదవీ విరమణ చెందుతున్న నేపధ్యంలో మరిన్ని ఇబ్బందులు తప్పడం లేదని ఏపీ నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధి ఎం. ఇందిర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బోధనాసుపత్రిలల్లో తగిన స్థాయిలో నర్సులు లేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నామన్నారు. అత్యవసర విభాగాలల్లో సైతం పూర్తి స్థాయిలో అన్ని క్యాడర్‌లల్లో సిబ్బంది లేరన్నారు. ఇటీవల అధిక సంఖ్యలో హెడ్‌నర్సు,స్ట్ఫానర్సులు పదవీవిరమణ చేసిన నేపధ్యంలో భారీగా ఖాళీల కోరత ఏర్పడిందన్నారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం ఐదుగురి రోగులకు ఒక్క నర్సు తప్పనిసరిగా వుండాలి. వీటితో పాటు ఆయా ఆసుపత్రిలల్లో వున్న వివిధ విభాగాలకు మూడు షిప్ట్‌లలో తగిన సిబ్బింది నియమించబడటంతోపాటు మరో ఐదుగురి సిబ్బిందిని ఎక్కువగా నియమకాలు జరపాలి.కానీ వాస్తవ పరిస్థితిలకు భిన్నంగా కనీసం పది మంది రోగులకు ఒక్క నర్సింగ్ స్ట్ఫా కూడా లేని పరిస్థితి వుందన్నారు. సూపర్ సెపాల్సిటి సేవల పేరుతోరోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేవదుకు వార్డులు సంఖ్య పెరుగుతున్నా..సేవ చేసే నర్సుల సంఖ్య మాత్రము పెరగడం లేదన్నారు. కనీసం సెలవులు సైతం దొరక్క ఇబ్బందులు పడుతూన్నామన్నారు. ఈ నేపధ్యంలో చాలా మంది పని ఒత్తిడి కారణంగా మెడికల్ సెలవులల్లో వుండిపోతున్నారన్నారు. అంతేకాకుండా పదవీ విరమణ సమయం వస్తున్న పదోన్నతిలు రాకపోవడంతో నిరాశ చెందుతున్నామన్నారు. ముఖ్యంగా కెజిహెచ్, విజిహెచ్, టీబి,మెంటల్‌కేర్ , ఆర్‌సిడి ఆసుపత్రిలల్లో పూర్తి స్థాయిలో నర్సులు లేక ఇబ్బందులు ఏదురుకోంటున్నామని తక్షణమే ప్రభుత్వం స్పందించి నర్సింగ్ నియమకాలు చేపట్టాలన్నారు. ఒక్క విశాఖ జిల్లాలోనే దాదాపుగా 500 నుంచి 700 వరకూ అన్ని క్యేడర్‌లల్లో నర్సింగ్ స్ట్ఫా అవసరమన్నారు. దీనిపై ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య అధికారులు స్పందించి నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఏర్పడుతోందన్నారు.

మెదడును రీసెట్ చేసే పుట్టగొడుగులు

$
0
0

వైద్యానికి కూడా లొంగని మానసిక కుంగుబాటును దూరం చేసే అద్భుత లక్షణాలు పుట్టగొడుగుల్లో ఉన్నాయని తేలింది. వీటిలో మెదడును ‘రీసెట్’ చేసే ఉత్ప్రేరకాలు ఉన్నట్లు తాజా పరిశీలనలు చెబుతున్నాయి. డిప్రెషన్‌ను తగ్గించే గుణం పుట్టగొడుగుల్లో ఉందా? అనే కోణంలో కొన్ని సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు. పుట్టగొడుగుల నుంచి తీసిన ‘సైలోసైబిన్’ అనే పదార్థాన్ని మానసిక కుంగుబాటుతో బాధపడుతున్న పంతొమ్మిది మందికి ఇచ్చారు. దీన్ని తీసుకున్న తరువాత వారి మెదడులో చాలా మంచి మార్పులు వచ్చాయని సగం మంది చెప్పారుట. సైలోసైబిన్ ఇవ్వక ముందు, ఇచ్చిన ఒకరోజు తర్వాత రోగుల మెదడును స్కాన్ చేశారు. మెదడులోని రెండు కీలక మార్పులను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. మెదడులోని ‘అమిగ్దల’ అనే భాగం కోపం, వ్యాకులత వంటి భావోద్వేగాలను నియంత్రిస్తుంది. పుట్టగొడుగులు తినడం వల్ల ఈ భాగంలో చురుకుదనం తగ్గింది. అమిగ్దలలో చురుకుదనం ఎంత తగ్గితే, మానసిక ప్రశాంతత అంత మెరుగవుతుంది.


రంగవల్లి

$
0
0

లక్ష్మీప్రసన్న హైదరాబాద్

18చుక్కలు
2 వరుసలు అటు ఇటు వదిలి 2 వరకు(సరిచుక్కలు)
==================================================================
ముగ్గులకు ఆహ్వానం

నింగిలోని హరివిల్లులను నేలపైన పేర్చి.. కనులకింపైన రంగుల్ని అందంగా అద్దితే అది రంగుల మాలికవుతుంది. ముంగిట్లో రంగవల్లిక అవుతుంది. ధనుర్మాసం సందర్భంగా తెలుగు ముంగిళ్లలో రంగవల్లులను తీర్చిదిద్దడం ఆనవాయితీ.. ఆ సందర్భంగా ముగ్గులకు ఆహ్వానం పలుకుతోంది మాతృభూమి. ఆసక్తి కలవారు కింది చిరునామాకు ముగ్గులను పంపగలరు.
సూచనలు
* ముగ్గులను పంపేవారు ఎ4 సైజు తెల్లకాగితంపై వేయాలి.
* ముందుగా నల్లని ఇంక్‌తో ఔట్ లైన్ గీసిన తరువాత అందులో రంగుల్ని నింపాలి.
* ఎన్ని చుక్కలను పెట్టి ముగ్గులు వేశారో.. అంటే సరిచుక్కలా, బేసి చుక్కలా, సందు చుక్కలా.. అనే విషయం స్పష్టంగా రాయాలి.
* ముగ్గుతో పాటు, మీ పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫొటోని, చిరునామాని జతచేయాలి.
* డౌన్‌లోడ్ చేసిన ముగ్గులు కాక, స్వయంగా చేతితో వేసిన ముగ్గులనే పంపాలి. అదీ చుక్కల ముగ్గులకే ఆహ్వానం.

ముగ్గులు పంపాల్సిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్- 500 003.

ఉబ్బసం రాకుండా జాగ్రత్తలు

$
0
0

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 23.5 కోట్లమంది ఆస్తమాతో బాధపడుతున్నారు. వారిలో ఒక్క భారతదేశంలో 1.5 నుంచి రెండు కోట్ల మంది ఉన్నట్లు అంచనా.. బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉబ్బసంతో ఒక్క 2015లోనే 3, 83, 000 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో పదకొండు ఏళ్లలోపు చిన్నారుల్లో నూటికి ఐదు నుంచి పదిహేను మంది ఉబ్బసం బారిన పడుతున్నారు. మరి ప్రపంచాన్ని ఇంతగా కలవరపెడుతున్న ఆస్తమా అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? అని ఆలోచిస్తే..
దీర్ఘకాలిక శ్వాససంబంధ రుగ్మతల్లో ఉబ్బసం ఒకటి. మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి వాయునాళాలు ఉంటాయి. వివిధ కారణాల వల్ల కండరాలు వాచిపోవడం వల్ల నాళాలు సన్నబడతాయి. దాంతో గాలి ప్రవాహానికి ఆటంకంగా మారుతుంది. గాలి వేగంగా పీల్చడం, వదలడం ఇబ్బందికరంగా మారుతుంది. కాసేపు నడిచినా, ఏదైనా పనిచేసినా కూడా ఆయాసం వచ్చేస్తుంది. గొంతులో ఈల వేసినట్టుగా శబ్దం వస్తుంది. ఛాతిలో బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది. ఈ రుగ్మత ఏ వయసువారికైనా వస్తుంది. అయితే, చిన్న పిల్లలు, యుక్తవయసు వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. భారతదేశంలో ఐదు నుంచి పదకొండు ఏళ్ల వయసు పిల్లల్లో ఐదు శాతం నుంచి పదిహేను శాతం మంది ఉబ్బసంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కెరోలిన్ దీవుల్లో యాభై శాతం మందికి పైగా చిన్నారులు ఆస్తమా బాధితులే.. బ్రెజిల్, కోస్టారికా, పనామా, పెరూ, ఉరుగ్వే దేశాల్లో ఇరవై శాతం నుంచి ముప్ఫై శాతం , కెన్యాలో ఇరవై శాతం మంది చిన్నారులు బాధితులే.. ఆస్ట్రేలియాలో పదహారు ఏళ్లలోపు ప్రతి ఆరుగురు పిల్లల్లో ఒకరు ఆస్తమా బారిన పడుతున్నారు.
వాయుగొట్టాలు ఉబ్బడం వల్ల ఆస్తమా వ్యాధి వస్తుంది. అయితే ఆ గొట్టాల్లో వాపు రావడానికి కారణమేంటన్న విషయం మాత్రం శాస్తవ్రేత్తలకు కూడా స్పష్టంగా తెలియదు. కానీ ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితులతో పాటు వంశపారంపర్యమైన విషయాలు కూడా ఆస్తమా రావడానికి కారణమని భావిస్తున్నారు. చర్మవ్యాధులు ఉన్న చిన్నారులకు ఉబ్బసం వచ్చే అవకాశాలు ఎక్కువ. తల్లిదండ్రులు ఆస్తమా బాధితులు అయితే పిల్లలకు కూడా అది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ధూమపానం, మద్యపానం, వాయుకాలుష్యం, రసాయనాల వాసన పీల్చడం వల్ల కూడా ఉబ్బసం వస్తుంది. తల్లికి పొగతాగే అలవాటు ఉన్నా దాని ప్రభావం కడుపులో బిడ్డపై పడి, అది ఆస్తమాకు దారితీసే అవకాశముంది. దుమ్ము, ధూళి, జంతువుల వెంట్రుకలు, బొద్దింకలు, పువ్వుల్లోని పుప్పొడి రేణువులు, గడ్డిపోచలు, బూజు వంటివి అలర్జీకి కారణమవుతాయి. ఇది ఆస్తమాకు దారితీస్తుంది. జలుబు వంటి వైరల్ ఇనె్ఫక్షన్లు వల్ల కూడా రావచ్చు.
జర్మనీలో నలభై లక్షల మంది, జపాన్‌లో ముప్ఫై లక్షల మంది దాకా ఈ రుగ్మతతో బాధపడుతున్నారు. వారంలో మూడుసార్లు ఫాస్ట్ ఫుడ్ తినే చిన్నారులకు ఆస్తమాతో పాటు చర్మవ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశముందని ఓ అధ్యయనంలో తేలింది. అరవై దేశాలకు చెందిన ఐదు లక్షలమందికి పైగా చిన్నారులపై ఆ అధ్యయనం నిర్వహించారు. తీసుకునే ఆహారం వల్లనే ఎక్కువ మంది పిల్లలు ఆస్తమా లాంటి రుగ్మతల బారిన పడుతున్నారని తేలింది. బర్గర్ల వంటి ఫాస్ట్ఫుడ్ పదార్థాలు తీవ్రమైన ఆస్తమా, చర్మవ్యాధులకు కారణమవుతున్నాయని పరిశోధకులు తెలిపారు.
నివారణ
* విటమిన్ ‘డి’ ఉండే పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆస్తమా తీవ్రతను తగ్గించుకోవచ్చు.
* ఆస్తమా లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు తక్షణం ఉపశమనం పొందేందుకు రిలీవర్ మందులు వాడాలి. ఇవి వాయునాళం కండరాలను వదులు అయ్యేలా చేస్తాయి. ఈ మందులను వేసుకునేందుకు ఇన్‌హేలర్ పరికరాన్ని వెంటే ఉంచుకోవాలి.
* ప్రివెంటర్లు వాయునాళాల కండరాల వాపును తగ్గించి, శ్వాసకు ఇబ్బంది లేకుండా చేస్తాయి.
* ఆస్తమా లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యుని సలహా మేరకు కొన్నిసార్లు స్టెరాయిడ్లు కూడా వాడాల్స రావచ్చు.

వివక్షతోనే విద్య దూరం

$
0
0

రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులైన విద్య, ఆరోగ్యం ప్రతి ఒక్కరికీ అందాలి. కానీ ఆడపిల్లల విద్య విషయానికి వచ్చేసరికి వివక్ష వచ్చేస్తుంది. ఆడపిల్లలు చదువుకోవడానికి వీల్లేదు. వారికి త్వరత్వరగా ఇంట్లో పనులను నేర్పించేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంట్లోంచి పంపించేయాలని చూస్తారు తల్లిదండ్రులు. అమ్మ స్వతహాగా ఒక మహిళ అయి కూడా, తమ బిడ్డ స్వతంత్రంగా పెరగాలని, ఆత్మవిశ్వాసంతో ఎదగాలని కోరుకోదు. ఇంట్లో పనులను నేర్చుకుని త్వరగా మెట్టినింటికి వెళ్లాలని కోరుకుంటుంది. అందుకనే చాలామంది ఆడపిల్లలు చదువుకోవడానికి ముందుకు రాలేకపోతున్నారు. తల్లిదండ్రులకు భయపడి పుస్తకం వైపు కూడా చూడటం లేదు.
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో గత పదేళ్లలో ఆడపిల్లల చదువు విషయంలో ఎటువంటి మార్పూ లేదని, లక్షల మంది బాలికలు ఇప్పటికీ పాఠశాల మొహం కూడా చూడలేకపోతున్నారని ఐక్యరాజ్యసమితి నివేదికలు చెబుతున్నాయి. అరవై కోట్లమంది విద్యార్థులు స్కూలుకు వెళ్తున్నా, వాళ్లక్కడ ఏమీ నేర్చుకోవడం లేదని, అనేక దేశాల్లో విద్యా ప్రమాణాలు మరీ తీసికట్టుగా మారాయనీ ఐక్యరాజ్యసమితి స్పష్టం చేస్తోంది. ఒక పక్కన అభివృద్ధి చెందిన దేశాల్లో ఆడపిల్లలు చదువుల్లో దూసుకెళ్తున్నారు. మరో పక్క పేద దేశాల్లో బాలికలు పాఠశాల మెట్లెక్కడమే అదృష్టంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆడపిల్లల చదువుకి ఏమాత్రం అనుకూలంగా లేని టాప్ టెన్ దేశాల జాబితాను ‘వన్ క్యాంపైన్’ అనే సంస్థ రూపొందించింది.
జాబితాలో ఉన్న దేశాల్లో ఎక్కువ శాతం పేదరికం, పౌష్టికాహారలోపం, అనారోగ్య పరిస్థితులూ, అంతర్గత యుద్ధాల వంటి సమస్యలతో సతమతమవుతున్నవే.. ఈ పరిణామాలన్నీ కలిసి ఆ దేశాల్లో ఆడపిల్లలను చదువుకు పూర్తిగా దూరం చేస్తున్నాయి. అక్కడ బాలికలను పాఠశాలకంటే పనులకు పంపించడానికే తల్లిదండ్రులు ప్రాధాన్యమిస్తున్నారు. ఇంకొందరైతే చిన్న వయసులోనే వారికి పెళ్లిళ్లు చేసి చదువుకోవాలన్న వారి కోరికపై నీళ్లు జల్లుతున్నారు. ప్రాథమిక విద్య, హైస్కూల్, కాలేజీల చదువు పూర్తిచేసిన అమ్మాయిలు, ఆడవాళ్ల అక్షరాస్యత శాతం, టీచర్లూ విద్యార్థుల నిష్పత్తి, విద్యారంగంలో పెట్టుబడులు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆడపిల్లల చదువుకు అనుకూలంగా లేని దేశాల జాబితాను సిద్ధం చేసింది ఆ సంస్థ. సిరియా వంటి కొన్ని దేశాలకూ ఆ జాబితాలో చేరే అవకాశం ఉన్నా, సరిపడా గణాంకాలు లేని కారణంగా వాటిని చేర్చలేదు.
ఆ దేశాలు ఇవే..
సౌత్ సూడాన్
ఆరేళ్ల క్రితం స్వాతంత్య్రాన్ని సాధించిన ఈ చిన్న దేశం అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. యుద్ధం, హింస కారణంగా ఇక్కడ ఎన్నో స్కూళ్లు నేలమట్టమయ్యాయి. ఇక్కడ మూడొంతుల మంది ఆడపిల్లలు కనీసం ప్రైమరీ స్కూల్లో కూడా అడుగుపెట్టలేదు.
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
ఈ దేశంలో ప్రతి ఎనభై మంది విద్యార్థులకు ఒక టీచరే ఉన్నారు. అక్కడ చదువు చెప్పని కారణంగా చాలామంది విద్యార్థులు బడి వైపే చూడటం లేదు.
నైగర్
ఈ దేశంలో పదిహేను, ఇరవై నాలుగు మధ్య వయసున్న యువతుల్లో పదిహేడు శాతం మందే చదువుకున్నారు. మిగిలిన ఆడపిల్లలు ఇంటి పనులకు పరిమితమవ్వడమో, పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్లడమో జరుగుతోంది.
ఆఫ్గనిస్థాన్
ఇక్కడ లింగ వివక్ష ఎక్కువ. ఫలితంగా తండ్రులు ఆడపిల్లలను చదువువైపు దృష్టి సారించనివ్వడం లేదు.
చాద్
ఇక్కడ సామాజిక, ఆర్థిక పరిమితుల కారణంగా ఆడపిల్ల చదువుకోవడం చాలా కష్టం. ఆడపిల్లను బడికంటే పనులకే ఎక్కువ పంపుతారు.
మాలి
ఈ దేశంలో కేవలం 38 శాతం అమ్మాయిలే ప్రాథమిక విద్యను పూర్తి చేస్తున్నారు.
గినియా
ఇక్కడ పాతిక సంవత్సరాలు దాటిన మహిళలు సగటున ఏడాది పాటు కూడా చదువుకోలేదు.
బర్కినా ఫాసో
ఇక్కడ కేవలం ఒక్క శాతం బాలికలు మాత్రమే హైస్కూలు విద్యను పూర్తిచేస్తున్నారు. ప్రాథమిక విద్యలోనే చాలామంది చదువును మానేసి ఇంటి పనుల్లో నిమగ్నమవుతున్నారు.
లైబీరియా
ఈ ప్రాంతంలో దాదాపు మూడులో రెండొంతుల మంది బాలికలు ప్రాథమిక విద్యకు కూడా దూరమయ్యారు. సరిగ్గా అక్షరాలు కూడా నేర్చుకోలేదు ఇక్కడి ఆడపిల్లలు.
ఇథియోపియా
ఇక్కడ ప్రతి ఐదుగురిలో ఇద్దరికి పద్దెనిమిదేళ్లలోపే పెళ్లి చేస్తున్నారు. దాదాపు అన్ని దేశాల్లోనూ సరిపడా టీచర్లు లేకపోవడం ప్రధాన సమస్య. ఆడపిల్లలు చదువుకి దూరమయ్యే కొద్దీ ప్రపంచం పేదరికానికి దగ్గరవుతూనే ఉంటుందన్నది ‘వన్ క్యాంపైన్’ సంస్థ అభిప్రాయం. ఇప్పటికీ 13 కోట్ల మంది ఆడపిల్లలు స్కూళ్లకు దూరంగానే ఉన్నారు. అంటే.. వీరిలో ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారులు, టీచర్లు, రాజకీయ నేతలు వంటి ఎంతోమంది సేవల్ని ప్రపంచం కోల్పోనుంది.

స్వాధ్యాయ సందోహం-178

$
0
0

దుర్బల ప్రార్థనకు దైవం కరుణించదు
అని రేణ వచసా ఫల్గ్వేన ప్రతీత్యేన కృధునాతృపాసః
అధా తే అగ్నే కిమిహా వదంత్యనాయుధాస ఆసతా సచంతామ్‌॥ ఋ.4-5-14.
భావం:- ఓ ప్రభూ! దుర్బలమైన, నిర్సారమైన, అనిశ్చతమైన, హీనమైన, అల్పమైన మాట చేత, ప్రార్థన చేత తమకుతాము సంతృప్తులు కానివారు ఈ జన్మలో ఏమి చేయగలరు? ఏమి చెప్పగలరు? ఎప్పుడైనా లోకంలో నిరాయుధులకు రక్షణ ఉండదు గదా!
వివరణ:- లోకంలో ఎవరికైనా ఏదేని పని చేసేందుకు ఎవరినుండయినా లభించిన ప్రేరణ ఏ కారణం చేతనయినా విఫలమయితే అది నిస్సారమూ- శక్తిహీనమూ అయినదిగా చెప్పబడుతుంది. తమ మాటను ఇతరులు శిరసావహించి వినేందుకు తగిన బలం తమ మాటలో ఉండేందుకు సాధారణంగా అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. నిజంగా వారి మాటలలో శక్తి ఉండి ఇతరుల మీద ప్రభావం చూపితే వారి ప్రవర్తన దానికనుగుణంగానే ఉంటుంది. కొన్ని సందర్భాలలో ప్రజాసమూహాన్నంతా ప్రభావితం చేయవలసిన అవసరం వస్తుంది. అప్పుడు ప్రతిభావంతులైన వక్తల నాహ్వానించి వారిచేత ఉపన్యాసాల నిప్పిస్తారు.
ఇదే విధంగా కోరుకొన్న ఫలసిద్ధికోసం లేదా తమ దోషాలను పరిహరించుకొనేందుకు తమ ఎడల భగవంతునిలో సానుకూలమైన కరుణార్ర్ధ్భావం కలిగే రీతిగా ప్రేరణ కలిగించేందుకు పలికే మాటయే ప్రార్థన అవుతుంది. ఆ ప్రార్థనలో నిజంగా ఆర్ద్రమైన బలముంటే తన ఎడల సానుకూలమైన ప్రేరణ దైవంతో జనిస్తుంది. ప్రార్థన దుర్బలమై మనవంటి సామాన్యులను సహితం కరిగించలేకపోతే ఇక దృఢాత్ముడైన భగవంతుని ద్రవింపచేయగలదా? కాబట్టి ప్రార్థన తేజోవంతంగా ఉండాలి.
సారవంతమైయుండాలి. ఆ విధంగా ప్రార్థన బహిరంగంగా కనబడితే నిష్ప్రయోజనం. ఎందుకంటే అట్టి ప్రార్థన వలన ప్రార్థన చేసేవాని మనసుకే శాంతిని తృప్తిని కలిగించదు. ఇక దైవానికి ప్రీతిని ఎలా కలిగించగలదు? అట్టివారి ప్రార్థన విఫలమే అవుతుంది.
మంత్రంలో రెండవపాదం మరొక ముఖ్యాంశాన్ని వివరిస్తూంది. యుద్ధానికి వెళ్లేవారు అస్త్ర శస్త్రాలను, మారణాయుధాలను విధిగా వెంట తీసుకొని వెళ్లాలి. అలా వెళ్లనివారిని ఏ ఫలితం కలగాలో అదే కల్గుతుంది. ఈ విషయం చాలా సామాన్య విషయమే అయినా ‘అనాయుధాస ఆసతా సచంతామ్’ ‘‘మారణాయుధాలు చేతలేని వానికి యుద్ధంలో రక్షణ ఉండదు’’ అని వేదం నిష్ప్రయోజనంగా చెప్పలేదు. వేదం పేర్కొన్నది కేవలం లౌకికమైన యుద్ధం కాదు. అది ముక్తి సాధనారూపమైన ఆధ్యాత్మిక యుద్ధం. ఆ యుద్ధంలో విజయాన్ని చేకూర్చే ఆయుధం భగవత్ప్రార్థన. మీమాంసాదిగ్రంథాలు ప్రార్థనను ఒక శస్త్రంగా పేర్కొన్నాయి. వాడికాని ఆయుధం వలన విజయం చేకూరదు. అట్లే ముముక్షుత్వరూపమైన ఆర్తితో పదునులేని ప్రార్థనాయుధంతో ముక్తి విజయం సిద్ధించదు.
**
దైవమే నింగి- నేల మధ్య ఆహారభాండాగారముంచింది
ద్యామింద్రో హరిధాయసం పృథివీం హరివర్పసమ్‌
ఆధారయద్ధరితోర్భూరి భోజనం యయోరంతర్హరిశ్చరత్ ॥ ఋ.3-44-3॥
భావం:- పరమాత్ముడు కాంతులీనే ద్యావాపృథువులను పచ్చని- బంగారు వనె్నగల గోళాలుగా నిర్మించాడు. వాని మధ్య జీవులకవసరమైన ఆహారాన్ని సమృద్ధిగా ఉంచాడు. ఆ ద్యావాపృథువుల మధ్యనే సూర్యుడు సంచరిస్తూ ఉన్నాడు.
వివరణ:- వేదం రమణీయమైన ఉపమానాలకు- ఉత్ప్రేక్షలకు గని. ఈ మంత్రం దీనికి నిదర్శనం. దివిలో అసంఖ్యాకమయిన సూర్య, గ్రహ, నక్షత్ర, జ్యోతిర్మండలాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఉదయించే సూర్యుడు కరిగింపబడిన బంగారువనె్నతో ప్రకాశిస్తూ ఉంటారు. సంధ్యాసమయంలో గీటురాయి మీద గీయబడిన సువర్ణరేఖలా విదియనాడు చంద్రుడు దర్శనమిస్తాడు.
ఇంకావుంది...

సుందరకాండ

$
0
0

...నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
ఈ మొదలుగా దేవతలు ఆ తల్లి గుణ కీర్తనను చేస్తూ ఉంటారు.
బుద్ధిః కీర్తి ర్ధృతిర్లక్ష్మీః శక్తి శ్శ్రద్ధామతి స్సృతిః
సర్వేషాం ప్రాణినాం సాంబ ప్రత్యక్షం తన్నిదర్శనం
అని చెప్పినట్లు ఆ స్వరూపాన్ని మనం భావన చేస్తూ ఉంటాం. అందుకే ఆంజనేయస్వామి కూడా- సురసను చూసి ఆమె ఆశీర్వరచనాన్ని పొంది ‘దాక్షాయణి నమోస్తుతే’ అంటాడు.
ఈ నామాన్ని వ్యాఖ్యానిస్తూ పరదేవతాయః కృత్య విశేష నామకమిదం అని అంటారు భాష్యకర్తలు.
దాక్షాయణి అంటే అమ్మవారే కదా! ఈ విధంగా స్వామికి సీతానుగ్రహం మార్గమధ్యంలోనే కలిగింది. దాన్ని ఆయన కాపాడుకొనాలి.
భగవదనుగ్రహం కలగటం వేరు, దాన్ని కాపాడుకొనటం వేరు. స్వాతంత్య్రం రావటం వేరు, దాన్ని నిలుపుకోగలగటం వేరు. కొంతమంది సాధించిన స్వాతంత్య్రాన్ని కొన్ని వందల సంవత్సరాలపాటు ఆ తరువాత తరాలు అనుభవించినట్లే, ఒక సాధకుడు సంపాదించిన భగవదనుగ్రహాన్ని ఆ వంశంలో కొన్ని తరాలు అనుభవిస్తాయి. ఆంజనేయస్వామి పొందిన పరదేవతారూప సీతానుగ్రహం సర్వవానరులను పునరుజ్జీవితులను చేసింది.
ఈ విధంగా అనుగ్రహీతుడైన స్వామి లంకా తీరాన్ని చేరుతున్నాడు. వనాల్ని చూస్తున్నాడు. ఆ తరువాత విభక్తములవుతున్న మలయాది వృక్షాల్ని చూస్తున్నాడు. ఆ తరువాత వృక్షాల మొదళ్ళనుండి ముందుకు వస్తూన్న ‘సాగరస్య చపత్నీనాం ముఖాన్యపి విలోకయన్- సాగర పత్నులయిన నదీ ముఖాల్ని చూస్తున్నాడు. త్రికూటాద్రిమీద అడుగుపెట్టేడు.
ఇదీ కవిత్వమంటే- ఉపమాసౌందర్యమంటే-
స్వామి సాగర పత్నుల ముఖాల్ని చూస్తున్నాడు.
సాగరసంగమం చేసే నదీ స్వరూపాన్ని ‘నదీ ముఖం’ అని పిలుస్తాం. స్వామి ఆ ముఖాల్ని చూస్తున్నాడు. ఈ ముఖాల్నే కాదు లంకలో ప్రవేశించిన తరువాత తనకు కనబడే స్ర్తిల ముఖాల్నే చూస్తాడు. తనకు సీతా ముఖ దర్శనం కలగాలి. తక్కిన శరీర స్థితి తనకు కానిది.
ఆమె ముఖ శోభను తాను విన్నాడు. లీలగా చూసేడు. ఆమె ఆభరణాలు తనకు తెలుసు. తెలిసినవాటి కోసమే చూస్తాడు. ఇలా సీతను చూసేవరకూ ఆ అలంకారం ప్రవహిస్తూనే వుంటుంది. ఋషుల మాట ఇలా ఉంటుంది. సరే- స్వామి త్రికూటంమీద చేరేడు. మళ్లీ తన మామూలు ప్రకృతికి వచ్చేసేడు.
సహస్రారాన్ని పొందిన సాధకుడు కూడా ఉపాధి ధర్మం చేత అక్కడ స్థిరంగా ఉండలేడు. మళ్లీ మూలాధారానికి వస్తూ ఉంటాడు. అలాగ-సరే అక్కడినుండి-
దదర్శ లంకాం అమరావతీమివ
త్రికూటంమీద కూర్చుని లంకా నగరాన్ని చూస్తూ అందులో అమరావతిని చూస్తున్నాడు. ఏమిటి అమరావతి విశేషం. అది దేవేంద్రుని నగరం. అందులో ఆయన పట్టమహిషి శచీదేవి ఉంటుంది. ఆమె పరాశక్తిని సేవించుకొంటూ ఉంటుంది. ఆమె పరాశక్తి అనుగ్రహాన్ని పొందిన సాధకురాలు.
ఇంకావుంది...

Viewing all 69482 articles
Browse latest View live