హైదరాబాద్, డిసెంబర్ 24: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుస్పష్టం చేశారు. ఈ దిశగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ప్రాంతీయ పార్టీలతో చర్చలు ప్రారంభమయ్యాయన్నారు. ఒడిశా పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం కోల్కతా చేరుకున్న కేసీఆర్, అక్కడి సచివాలయంలో తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. భేటీ ముగిసాక మమతా బెనర్జీతో కలిసి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, జాతీయ రాజకీయాలపై తాము చర్చించామన్నారు. ఫ్రంట్ ఏర్పాటుపై త్వరలో పటిష్టమైన ప్రణాళికతో ముందుకొస్తామన్నారు. తమ మధ్య మున్ముందు కూడా చర్చలు కొనసాగుతాయన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటంటే అదేదో ఆదర బాదరగా చేసే పని కాదని, ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునేంత చిన్న విషయం కూడా కాదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘దీదీతో (మమత) చర్చలు ఎప్పుడూ సానుకూలంగానే జరుగుతాయి, మున్ముందు విస్తృత చర్చల అనంతరం పూర్తిస్థాయి ఫలితాలు వస్తాయి’ అన్నారు. దేశ వ్యాప్తంగా పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం ఇదన్నారు. ఇప్పటికే తాను ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో చర్చించానన్నారు. త్వరలోనే కార్యాచరణ మొదలవుతుంది, మీకు శుభవార్త కూడా అందిస్తామన్నారు. ఇద్దరు నేతలు కలిసినప్పుడు సాధారణంగా పరస్పర ప్రయోజనాలు, జాతీయ రాజకీయాలు, ఇతర అంశాలు ప్రస్తావనకు వస్తాయన్నారు. కాంగ్రెస్, బీజేయేతర కూటమి కడుతున్నారా? అని మీడియా ప్రశ్నించగా, తన మిషన్ అదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందు కోసం నా ప్రయత్నాలు కొనసాగిస్తానని, ఫెడరల్ ఫ్రంట్ బలోపేతానికి కృషి చేస్తానని కేసీఆర్ తెలిపారు. మమతా బెనర్జీతో కేసీఆర్ సమావేశం ముగిశాక కోల్కతాలోని కాళీమాత ఆలయాన్ని కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాక ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మంగళవారం నుంచి రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలోనే కేసీఆర్ ఉంటారు. ఈ నెల 26 లేదా 27 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసుకుంటారు. టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చాక ప్రధానిని మర్యాద పూర్వకంగానే కలుస్తారని సమాచారం. అలాగే బిఎస్పి అధ్యక్షురాలు, మాజీ సీఎం మాయావతి, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్తో కూడా కేసీఆర్ సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించనున్నారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రంలో పెండింగ్లో ఉన్న సమస్యలపై సంబంధిత కేంద్ర మంత్రులను కూడా కేసీఆర్ కలువనున్నారు. ఇలా ఉండగా సోమవారం ఉదయం భువనేశ్వర్ నుంచి బయలుదేరిన కేసీఆర్ పూరీలో జగన్నాథ ఆలయాన్ని, కోణార్క్లో సూర్యదేవాలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించిన అనంతరం కోల్కతాకు చేరుకున్నారు.
చిత్రం..మమతా బెనర్జీతో భేటీ అనంతరం విలేఖరులతో మాట్లాడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్