కరీంనగర్, డిసెంబర్ 27: కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు చేసేందుకు 57 సంవత్సరాలు నిండిన అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి అందరు జిల్లా కలెక్టర్లతో ఆసరా పెన్షన్ల మంజూరు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పంచాయతీ ఎన్నికలు, జూనియర్ పంచాయతీ సెక్రెటరీల నియామకం, జాతీయ రహదారులు, రైల్వే లైన్ల భూసేకరణ, అటవీ భూముల సర్వేపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుండి కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి నవంబర్ 19న ప్రచురించిన ఓటరు జాబితాల నుండి గ్రామాల వారిగా 57 నుండి 64 సంవత్సరాల వయస్సు గల వారి వివరాలను పంపించాలని సూచించారు. ఆసరా పెన్షన్ల మంజూరుకు 57 సంవత్సరాలు నిండిన అర్హులైన డ్రాఫ్ట్ జాబితాను గ్రామ సభలలో పెట్టి ఫిర్యాదులు స్వీకరించాలని అన్నారు. జిల్లాకు ఎంత మంది ఆసరా పెన్షన్లకు అర్హులవుతారో తెలుపాలని సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల కోసం జిల్లాలకు మంజూరు చేసిన నిధుల నుండి మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసిన లబ్ధిదారులకు వెంటనే నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. ప్రపంచ బ్యాంక్కు సంబంధించిన స్వచ్ఛ సర్వేక్షన్ టీమును జిల్లాలలో పర్యటించనున్నారని, గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు వచ్చే అవకాశముందన్నారు. గ్రామాలలో అంగన్వాడీ, పాఠశాల, టాయిలెట్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి ఆన్లైన్లో అప్డేట్ చేయాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్లు, వార్డు సభ్యుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని సూచించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి ఎక్స్ సర్వీస్మెన్, క్రీడల కోటాలకు సంబంధించి సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా పరిశీలించాలన్నారు. ఎంపికైన ప్రతీ అభ్యర్థి మార్కులు, ర్యాంక్ కేటగిరీలను నోటీస్ బోర్డులపై ప్రకటించాలన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం, రైల్వే లైన్ల నిర్మాణానికి జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి గడువులోగా భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అటవీ భూముల సర్వేకు సంబంధించి జిల్లాకు సర్వేలతో కూడిన ప్రత్యేక టాస్క్ఫోర్స్ టీములను పంపుతున్నామని తెలిపారు. అటవీ భూముల సర్వేకు సంబంధించి రెవెన్యూ శాఖ ద్వారా ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశామన్నారు. 212 మంది నూతన సర్వేయర్లు శిక్షణలో ఉన్నారని, వీరందరు జనవరి మొదటి వారంలోగా అందుబాటులోకి వస్తారని తెలిపారు. ఇప్పటికే పనిచేస్తున్న సర్వేయర్లతో పాటు నూతన సర్వేయర్లతో కూడిన టీములను ప్రత్యేక టీములుగా ఏర్పాటు చేసి జిల్లాలకు పంపుతామన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్లాల్, అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షిషా, డిఆర్డిఓ వెంకటేశ్వర్ రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వెంకటమాధవ రావు, ఇంచార్జి జిల్లా పంచాయతీ అధికారి మనోజ్ కుమార్, కరీంనగర్, హుజూరాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారులు ఆనంద్ కుమార్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
పాస్ బుక్కుల కోసం
బైఠాయించిన రైతులు
ముస్తాబాద్, డిసెంబర్ 27: ముస్తాబాద్ తహశీల్ ఆఫీస్ ఎదుట గురువారం రైతులు బైఠాయించారు. భూమి రికార్డుల్ని సవరించి న్యాయం చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. నెలల తరబడి అధికారులకు మొర పెట్టుకొంటున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రెవన్యూ యంత్రాంగం స్పందించి భూ రికార్డుల్ని సవరించి పట్టేదారు పాసు బుక్కులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. బాధితరైతులు కుంభాల యాదగిరిరెడ్డి, వైస్ఎంపీపీ చిట్నేని శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు.
ఓటు.. ప్రజాస్వామ్య హక్కు
- ఎమ్మెల్యే సుంకె రవి శంకర్
చొప్పదండి, డిసెంబర్ 27: ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల ఏర్పాటుకు ఓటు హక్కు ఎంతో ప్రాధాన్యమైందని, అలాంటి ఓటు హక్కును ప్రతీ ఓక్కరు నమోదు చేసుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం చొప్పదండి తహశీల్దార్ కార్యాలయంలో పలువురు కొత్త ఓటర్లు ఓటు హక్కు నమోదు చేసుకోవడాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు కొత్త ఓటర్లు ఎమ్మెల్యే సమక్షంలో ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం పలువురు ఓటర్లు వారి ఓట్లను కోల్పోవటం జరిగిందని, వారు ఈ సారి తప్పకుండా తిరిగి నమోదు చేసుకొని ఓటరు లిస్టులో తమ పేరు వచ్చిందా? లేదా? చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. కొత్త ఓటర్లకు జనవరి 1, 2019 లోపు పుట్టిన వారికి కూడా అవకాశం ఉన్నందున అప్పటి వరకు 18 సంవత్సరాలు నిండేవారు కూడా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాస్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపిపి గుర్రం భూమారెడ్డి, నాయకులు బందారపు అజయ్ కుమార్, గొల్లపల్లి శ్రవణ్ కుమార్, ఎం.డి.జహీర్, కొత్త గంగారెడ్డి, గాండ్ల లక్ష్మణ్, మంద నర్సయ్య, రాపెల్లి ఐలయ్య, సీపెల్లి గంగయ్య, దండె కృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు.
జనవరి 8, 9న
రవాణా రంగం బంద్
కరీంనగర్ టౌన్, డిసెంబర్ 27: జనవరి 8,9 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. ఈ సమ్మె రవాణారంగ పరిరక్షణ అసంఘటిత రవాణా కార్మికులకు సామాజిక సంక్షేమచట్టంకై జరుగుతుందని, రవాణారంగ కార్మికులు ఇప్పటి నుంచే అన్ని పనులు పూర్తి చేసి, రెండు రోజులు బంద్ పాటించాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్, కార్ డ్రైవర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పున్నం రవి,తదితరులు కోరారు. ఈసందర్భంగా ఎడ్ల రమేశ్ మాట్లాడుతూ, మోటార్ వెహికిల్ చట్ట సవరణ బిల్లుతోవాహన డ్రైవర్లు దిక్కులేని వారు కాబోతున్నారని, దీనిని ఓడించేందుకు రెండు రోజుల పాటు రోడ్లపై నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ బిల్లు అమోదం పొందితే డ్రైవర్లకు ఉరి, కార్పోరేట్ కంపనీలకు సిరి ఉంటుందని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం తీసుకోకుండా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకుని జీవనం గడిపే రవాణారంగ కార్మికులపై విపరీతంగా పన్నులు పెంచటం శోచనీయమన్నారు. ప్రమాద నివారణ చర్యలు తీసుకోకుండా ఈ బిల్లును ప్రవేశపెట్టడం పూర్తిగా కార్పోరేట్ వర్గాల కోసం తప్ప వేరే ఆలోచన లేదని స్పష్టమవుతోందన్నారు. దీనిని గమనించి డ్రైవర్లంతా సమ్మెలో పాల్గొనాలని కోరారు. ఈసందర్భంగా కరపత్రాలు విడుదల చేయగా, కార్యక్రమంలో యూనియన్ నాయకులు రవి, జనార్ధన్, సంజీవ్, హరి, రాజు, మధు,సంపత్తో పాటు పలువురు పాల్గొన్నారు.
బీసీలను దెబ్బతీస్తున్న తెరాస ప్రభుత్వం
- సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి
కరీంనగర్ టౌన్, డిసెంబర్ 27: సమాజంలో మెజారిటీ స్థానంలో ఉన్న వెనుకబడిన వర్గాలను అణిచివేసే క్రమంలోనే ప్రభుత్వం రిజర్వేషన్లు తగ్గించిందని, యధాతధంగా కొనసాగించి వారిని రాజకీయంగా ఎదిగేలా ప్రోత్సహించాలని సీపీ ఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సు ఉపసంహరించుకోవాలంటూ, గురువారం కలెక్టరేట్ ఎదుట సీపీ ఎం జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో టీ ఆర్ ఎస్ బీసీలను నమ్మించి, గొంతు కోసిందని ఆరోపించారు. గ్రామపంచాయితీ ఎన్నికల్లో అధికార పార్టీ బలపర్చే అభ్యర్థులను చిత్తుగా ఓడించి, గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో బీసీల ఓట్లు అవసరమైన ఆపార్టీకి బీసీల రిజర్వేషన్లు తగ్గించటం శోచనీయమన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. గత 20 ఏళ్ళుగా స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్ల అమలవుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల సాకుతోకోత విధించటం దారుణమన్నారు.
కుల వృత్తుల అభివృద్ధి కోసం..
చేయూత
- జిల్లా అభివృద్ధి అధికారి రంగారెడ్డి
కరీంనగర్, డిసెంబర్ 27: కుల వృత్తుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఆర్థికంగా అందిస్తున్న చేయూత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జె.రంగారెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కుమ్మరుల కులవృత్తి శిక్షణను జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో డిఆర్ఓ భిక్షునాయక్, బి.వినోద్ కుమార్, డిడి, డిఆర్ఓ తదితర శాఖల అధికారులు కుల వృత్తులకు ప్రభుత్వం ద్వారా ఇస్తున్న శిక్షణను వినియోగించుకొని శాలివాహనులు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ఇస్తున్న శిక్షణ ద్వారా శాలివాహనులు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందాలని సూచించారు. వేలి వృత్తులెన్ని ఉన్నా కుల వృత్తులకు సాటి రావని విషయాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం శాలివాహనుల ఆర్థికాభివృద్ధి కోసం బాటలు వేసేందుకే కుమ్మరులకు కుండల తయారీపై శిక్షణను అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకుంటూ ఆర్థికంగా అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలన్నారు. ప్రత్యేకంగా కుమ్మరి కుల వృత్తుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించి ఆర్థికంగా కావాల్సినంత సహకారాన్ని అందిస్తూ శాలివాహనులు ఆర్థికాభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తుందని వెల్లడించారు.