నర్సీపట్నం(రూరల్), డిసెంబర్ 28: సీలింగ్ భూమిని ఆక్రమించిన స్థానికేతరుడైన వ్యాపారి నుండి తమను రక్షించి తమ భూములను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ దళిత గిరిజనులు శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేసారు. సీపీ ఎం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రావికమతం మండలం బాదంపాడు రెవెన్యూ పరిధిలో సీలింగ్ భూమికి గతంలో 24 మందికి పట్టాలు ఇచ్చారన్నారు. ఈ భూమిని ఇటీవల కాలంలో చోడవరంకు చెందిన ఎరువుల వ్యాపారి వసుమర్తి కామేశ్వరరావు గిరిజనులను తొలగించి భూమిని ఆక్రమించాడన్నారు. దీనిపై రావికమతం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టామన్నారు. ఎరువుల వ్యాపారి చోడవరం నుండి కొందరు వ్యక్తులను తీసుకువచ్చి తమపై దాడులకు పూనుకుంటున్నాడని గిరిజనులు ఆరోపించారు. తక్షణం ఎరువుల వ్యాపారి కామేశ్వరరావు నుండి తమకు రక్షణ కల్పించాలని తమ భూములను తమకు అప్పగించాలని గిరిజనులు డిమాండ్ చేసారు. ఈకార్యక్రమంలో సీపీ ఎం నాయకుడు కె.గోవిందరావు, సీ ఐటీయు నాయకుడు సత్తిబాబు, సీపీ ఎం నాయకులు దుర్గమ్మ, నల్లమట్టి సత్తిబాబు, కెవీపీ ఎస్ నాయకుడు వై కళ్యాణం, అర్ల ఎంపీటీసీ కె.పోతురాజు, మహిళా సంఘం నాయకులు నూకరత్నం, సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో 10 వేల కోట్లతో అభివృద్ధి పనులు
* పంచాయతీరాజ్ ఛీప్ సెక్రటరీ వెంకటేశ్వరావు
నర్సీపట్నం(రూరల్), డిసెంబర్ 28: రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో 10 వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని పంచాయతీరాజ్ రాష్ట్ర ఛీప్ ఇంజనీర్ ఆర్. వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన నర్సీపట్నంలోని ఉత్తరవాహిని వద్ద నిర్మిస్తున్న కళ్యాణ మండపాన్ని , ఉత్తర వాహినిలో నిర్మించిన స్నాన ఘాట్లను ఆయన జిల్లా పంచాయతీరాజ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ 10 వేల కోట్లతో చేపట్టే పనుల్లో ఇప్పటికే 95 శాతం పనులకు టెండర్లు పిలిచామన్నారు. మిగతా ఐదు శాతం పనులకు జనవరిలో టెండర్లు పిలిచి పనులు చేపడతామన్నారు. ఈసందర్భంగా విలేకరులు ఇంత పెద్ద ఎత్తున చేపట్టే పనులకు రానున్న ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల కోడ్ వస్తే పనులు నిలిచిపోయే అవకాశం ఉందా అని ప్రశ్నించగా అటువంటి పరిస్థితి లేదని టెండర్లు పిలిచిన తరువాత ఎన్నికల కోడ్ వర్తించదని ఆయన తెలిపారు. పదివేల కోట్లలో నాలుగువేల కోట్లు ఎస్సీ , ఎస్టీ సబ్ ఫ్లాన్ కింద రోడ్లు, డ్రైనేజీల అభివృద్దికి ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఆయన నర్సీపట్నం డివిజన్లో జరిగే అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈకార్యక్రమంలో జిల్లా పంచాయతీరాజ్ అధికారులు ,డివిజన్ పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.
అగ్ని ప్రమాదంలో ఐదు షాపులు దగ్ధం
మాకవరపాలెం, డిసెంబర్ 28: ప్రమాదవశాత్తు నిప్పంటుకున్న సంఘటనలో మూడు బార్బర్ షాపులు, రెండు దుకాణాలు దగ్ధమయ్యాయి. మండలంలోని జి. వెంకటాపురం గ్రామానికి చెందిన కోడూరు అప్పారావు, రాజుబాబు, దొంగబాబులకు చెందిన బార్బర్ షాపులు, జోగా నాగన్న టిఫిన్ సెంటర్, సబ్బవరపు నూకరాజు కొబ్బరికాయల దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఇవి గురువారం అర్థరాత్రి ఆకస్మాత్తుగా నిప్పంటుకుని పూర్తి కాలిబూడిదయ్యాయి. దీంతో ఈ షాపుల్లో ఉన్న సామగ్రి కాలిబూడిదైంది. ఉదయం వచి వారు చూసుకునే సరికి షాపులు అగ్నికి ఆహుతి కావడంతో వారంతా బోరున విలపించారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియడం లేదని బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వంను తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఈవిషయం తెలుసుకున్న వైసీపీ నాయకుడు రుత్తల యర్రాపాత్రుడు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఓదార్చారు. వీరికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేసి ఆదుకోవాలని వారు కోరారు.
బాల్యవివాహాలపై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి
మాకవరపాలెం, డిసెంబర్ 28: బాల్యవివాహాలను అరికట్టేందుకు సమాజంలో ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అవంతి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ సి.మోహన్రావు అన్నారు. కళాశాలలో ఐసీడీ ఎస్ ఆధ్వర్యంలో కిశోర వికాసంపై విద్యార్థులకు రెండు రోజుల పాటు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడుతూ బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు . సమాజంలో బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, బాల్యవివాహాలు, లైంగిక వేధింపులను అరికట్టాలని అయన కోరారు. ఎంపీపీ రుత్తల చిన్నయ్యమ్మ మాట్లాడుతూ బాల్యవివాహాలు వలన కలిగే అనర్థాలను ప్రతీ ఒక్క తల్లిదండ్రులు అవగాహన చేసుకోవాలన్నారు. పిల్లల భవిష్యత్ను నాశనం చేసే పెళ్ళిళ్ళులకు స్వస్తి పలకాలన్నారు. కోటవుటర్ల అసిస్టెంట్ సీడీపీ ఓ శాంతి ప్రియ మాట్లాడుతూ కిశోర వికాసం పథకంలో బాలికల రక్షణకు అవసరమైన పథకాలను వివరించారు. ఈకార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్ రవితేజ, కళాశాల ఎ ఓ డానియేల్ రాజు పాల్గొన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో అబివృద్థి
* ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ రాజు
రోలుగుంట, డిసెంబర్ 28: తెలుగుదేశం పార్టీ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ది జరుగుతుందని చోడవరం ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ రాజు పేర్కొన్నారు. తాము చేసిన అభివృద్దిని చూసి ప్రజలంతా ఓటు వేయాలంటూ ఆయన విజ్ఞప్తి చేసారు. మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రచార ర్యాలీని నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ గత 50 ఏళ్ళలో జరగని అభివృద్ది ప్రస్తుత దేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిందన్నారు.సీసీ రోడ్లు, ప్రభుత్వ భవనాలు , తారు రోడ్డు తదితర సౌకర్యాలను కల్పించామన్నారు. రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలను , డ్వాక్రా గ్రూప్లకు రుణాలు అందజేసామని ఆమె పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు , ఎన్టీ ఆర్ గృహ కల్ప పథకం కింద పక్కా గృహాలను నిర్మించామని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఆమె వివరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలన్నింటినీ శతశాతం పూర్తి చేసామని ఆయన వివరించారు. నిరుపేదలకు , శ్రామికులకు కోట్లాది రూపాయల వ్యయంతో చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేస్తుందని, అలాగే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు రైతులను రుణ విముక్తులను చేస్తోందని ఆయన వివరించారు. త్వరలో పూర్తి కానున్న ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా మండలంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని, తద్వారా ఈప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు. మండలంలోని జేపీ అగ్రహారం, కుసర్లపూడి, జానకిరాంపురం, ఎల్.కొత్తూరు, కొండపాలెం, రోలుగుంట, నిండుగొండ, కొవ్వూరు, కె.నాయుడు, బుచ్చింపేట, బుర్రంపేట గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసి బహిరంగ సభలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుములూరు చంద్రవౌళి, పార్టీ సీనియర్ నేత గండి సింహాద్రి, పరుశం లోవరాజు, కోరుపల్లి ఈశ్వరరావు, బంటు చిరంజీవి, దాలినాయుడు, సుర్ల రామకృష్ణ, ఉలబాల పోతురాజునాయుడు తదితరులు పాల్గొన్నారు.
గరిష్ట స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు
* విస్తారంగా కురుస్తున్న మంచు
సీలేరు, డిసెంబర్ 28: జీకేవీధి మండలం సీలేరు మేజర్ పంచాయతీ పరిధిలో మంచు విస్తారంగా కురియడంతో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటల వరకు మంచు తెరలు గ్రామాన్ని కమ్ముకుని చల్లటి గాలులు వీస్తుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి నుంచి వచ్చిన పలువురు ఇంజనీరింగ్ విద్యార్థులు, పర్యాటకులు మంచు అందాలను తిలకించేందుకు ఉదయం ఆరు గంటల నుంచే స్థానిక రిజర్వాయర్ , జల విద్యుత్ కేంద్రం వద్ద సందడి చేసారు. ప్రకృతి ప్రేమికులు మంచు అందాలను ఆస్వాదించారు. 10 గంటల వరకు సూర్యకిరణాలు గ్రామాన్ని చేరకపోవడంతో రోజువారీ పనులు వెళ్ళేవారు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మానవాళికి రక్షకుడు ఏసుక్రీస్తు
పాయకరావుపేట, డిసెంబర్ 28: ఏసుక్రీస్తు ప్రపంచ మానవళికి రక్షకుడిగా నిలిచారని ఐ ఓపెనర్స్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్కే కుమార్ అన్నారు. క్రిస్మస్ సందర్భంగా పట్టణంలో ఐ ఓపెనర్స్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్కే కుమార్ క్రిస్మస్ కేక్ కట్ చేసి దైవ సందేశాన్ని వివరించారు. క్రీస్తు బోధించిన ప్రేమ, దయ, క్షమాగుణాలను అలవర్చుకుని సన్మార్గంలో నడవాలన్నారు. క్రీస్తును ఆరాధించడంతో పాటు నిత్యం క్రీస్తును హృదయంలో నిలిపి ఉంచుకుంటే ఆయన రక్షణ ఉంటుందన్నారు. అనంతరం చిన్నారులు చెప్పిన దైవ్యవాఖ్యాలు, గీతాలు , సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈకార్యక్రమం అనంతరం పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చారు. ఈకార్యక్రమంలో ఫాస్టర్ జాన్ డేవిడ్, చిన్ని, కె.సుధాకర్రాజు, నిర్మల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అయ్యన్న లీగ్ ఫైనల్లో నాతవరం జట్టు
నాతవరం, డిసెంబర్ 28: అయ్యన్న టీ 15 లీగ్ ఫైనల్స్లో నాతవరం ( ఓల్డ్మంక్) జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. శుక్రవారం అయ్యన్నయువసేన అధ్యక్షుడు చింతకాయల విజయ్ జిల్లెడిపూడి, నాతవరం మధ్య జరిగే క్రికెట్ పోటీలను తిలకించి విజేతలకు బహుమతులు అందించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మండలంలోని 24 క్రికెట్ టీమ్లు పాల్గొన్నాయన్నారు. 20 రోజుల నుంచి జరుగుతున్న ఈ అయ్యన్న టీ 15 పోటీల్లో చివరికి జిల్లెడిపూడి, నాతవరం జట్లు మధ్య హోరాహోరీ పోటీ జరిగిందన్నారు. గెలుపొందిన నాతవరం టీమ్ నర్సీపట్నంలో జరిగే డై అండ్ నైట్ మ్యాచ్లో పాల్గొంటారన్నారు. ఈపోటీలకు ఎంపైర్స్గా హైదరాబాద్ నుంచి ప్రత్యేక కోచ్లు హాజరవుతారన్నారు. ఇక్కడ విజయవంతంగా జరిగినట్లే నర్సీపట్నంలో అందరి సహకారం కావాలన్నారు. ఈకార్యక్రమంలో మండల దేశం పార్టీ అధ్యక్షుడు రమణ, చైర్మెన్ కొండబాబు, మాజీ మార్కెట్ చైర్మెన్ అబ్బారావు, మండల సోషల్ మీడియా ప్రతినిది గోపీ, క్రికెట్ ఆర్గనైజర్ లోవ, రాజులు పాల్గొన్నారు.
సబ్ స్టేషన్లకు ఫోన్ నెంబర్లు కేటాయింపు
నాతవరం, డిసెంబర్ 28: మండలంలో మూడు సబ్ స్టేషన్లకు ప్రభుత్వం ఫోన్ నెంబర్లు కేటాయించినట్లు ఎ ఇ దాసరి చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాతవరం సబ్ స్టేషన్కు 949061422, గన్నవరం సబ్ స్టేషన్కు 9493178524, చిన్నగొలుగొండపేటకు 9493178485 నెంబర్లకు వినియోగదారులు తమ సమస్యలపై సంప్రదించాలని ఎ ఇ తెలిపారు.