అమరావతి, డిసెంబర్ 30: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై చేసిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఉండవల్లి ప్రజావేదికలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని, అది కోల్పోయి అసభ్యంగా ప్రవర్తిస్తే నాగరిక సమాజం క్షమించదని హితవు పలికారు. ‘ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు.. నోరు పారేసుకోవద్దు’ అని కేసీఆర్ను హెచ్చరించారు. రాజకీయాల్లో విలువలు ఉంటాయని, అధికారంలో ఉన్న వ్యక్తులకు హద్దులుంటాయన్నారు. ప్రత్యర్థి పార్టీల విధానాలను విమర్శించటంలో తప్పులేదని, అయితే ఇష్టానుసారం వ్యక్తిగత ఆరోపణలు చేయటం మంచిపద్ధతి కాదన్నారు. ‘ప్రధాని మోదీని గాడు అన్నా, సన్నాసి అన్నా కౌగిలించుకుంటారు. నాజోలికి మాత్రం రావద్దు. నేను దేనికీ భయపడను. బెదిరింపులు, బ్లాక్మెయిల్ రాజకీయాలకు లొంగే ప్రసక్తే లేదు’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. కేసీఆర్ దారుణంగా మాట్లాడుతుంటే వైసీపీ నాయకులు వారికి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. బానిసత్వానికి, ఊడిగానికీ హద్దులు ఉంటాయన్నారు. ‘నా రాజకీయ జీవితం అంతా విలువలతో కూడినది. ఎవరు చులకనగా మాట్లాడినా హుందాగా సంయమనం పాటించా. సహనం కోల్పోలేదు, సమస్యలపై ఎక్కడా రాజీపడలేదు’ అని చెప్పారు. ‘నువ్వెక్కడి నుంచి ఊడిపడ్డావు? నీకు రాజకీయ జీవితం ప్రసాదించింది తెలుగుదేశం పార్టీ కాదా?’ అని కేసీఆర్ను నిలదీశారు. ‘ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో 2004లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తే ప్రజలు తిరస్కరించారు. 2009లో నా దగ్గరకే వచ్చి ఎన్ని సీట్లిచ్చినా సర్దుకుంటామని చెప్పావు. 40 సీట్లిస్తే 10 సీట్లలో మాత్రమే గెలిచావు గుర్తులేదా?’ అని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానని ఢిల్లీలో ప్రకటించి ఆపై ఎన్నికల్లో
ఆ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయటం, ఇప్పుడు మోదీని మోయటం అవకాశవాద రాజకీయం కాదా? అని విమర్శించారు. ‘ఏపీలో వైసీపీ తరపున ప్రచారం చేస్తానంటున్నావు. మోదీ, నువ్వు, వైసీపీ కలిసి ప్రచారం చేసుకోండి. మాకేం అభ్యంతరం లేదు’ అని తేల్చిచెప్పారు. ఇక ముసుగు తొలగిస్తే మంచిదని సలహా ఇచ్చారు.
* మోదీని నమ్మితే మోసగించారు
కాంగ్రెస్ పార్టీ అశాస్ర్తియ విభజన చేసిందని తాము వ్యతిరేకించామని, మోదీని నమ్మితే మోసగించారన్నారు. కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకుని ఏపీకి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలుస్తున్నామని, ఇందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ తీరు వల్ల కేంద్రంలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టాయని, ప్రజాస్వామ్య మనుగడకు ముప్పొచ్చిన నేపథ్యంలో బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే తహతహతో ఒడిశా వెళ్లి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ మానసిక ఆందోళనలో ఉన్నారని విమర్శించారు. విభజన తరువాత కేంద్రం ఏమిచ్చిందో తెలుసా? అని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ సహా 11 ఈశాన్య రాష్ట్రాలకు ఎక్కువ నిధులిచ్చి రాజధాని కూడాలేని ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత లేదా? అన్నారు. సచివాలయాన్ని డయాగ్రిడ్ టెక్నాలజీతో మేం నిర్మిస్తుంటే దానిపై విమర్శలు చేయటం ఏమిటని నిలదీశారు. ‘మీ సొంతింటికి మాత్రం 300 కోట్లు కావాలి. మా రాజధాని నిధుల్లో లెక్కలా? మోదీని మీరు మోస్తే మోయండి. మేం చివరివరకు రాజీపడబోం’ అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినకుండా ప్రపంచ స్థాయిలో రాజధాని నిర్మాణాన్ని చేపట్టటం తప్పెలా అవుతుందన్నారు. తనపై ఉంచిన విశ్వాసంతో స్వచ్ఛందంగా 35వేల ఎకరాల భూమిని ప్రజలు అందించారని, కేసీఆర్ సొంత నియోజకవర్గంలో ఓ రిజర్వాయర్ నిర్మాణానికి ఎకరం భూమి సేకరించలేకపోయారన్నారు. కేంద్రం, తెలంగాణ సహకరించకపోయినా మేం పోలవరంతో సహా ప్రాజెక్ట్లు పూర్తి చేస్తున్నామన్నారు. నువ్వు లక్ష కోట్లు పెట్టి ఏ ప్రాజెక్ట్ పూర్తిచేశావో వివరించాలని డిమాండ్ చేశారు. ఐటీని ప్రోత్సహించింది రాజీవ్ గాంధీ అని, అయితే హైదరాబాద్లో ఈ రంగానికి పునాది వేసింది మాత్రం తెలుగుదేశం హయాంలోనే అని చెప్పారు. అప్పుడు కేసీఆర్ తనవెంటే ఉన్నారని గుర్తుచేశారు. అయితే ఫౌండేషన్ వేసింది జనార్దనరెడ్డి కాదన్నారు. శే్వతపత్రాలు ఇప్పుడు కొత్తేమీ కాదని, 1995లోనే విడుదల చేశామన్నారు. అప్పుడు కూడా కేసీఆర్ తమ ప్రభుత్వంలోనే ఉన్నాడని, జన్మభూమి కమిటీలపై పొగడ్తలు చేశారని వ్యాఖ్యానించారు. తెలుగువారి కోసం సంపద సృష్టించి నాడు హైదరాబాద్, నేడు అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని, మోదీ 12ఏళ్లలో గుజరాత్కు ఏంచేశారో అక్కడి ప్రజలకు తెలుసన్నారు. తిడుతున్నందుకే కేసీఆర్ను పరిణతి చెందిన వ్యక్తిగా మోదీ అభినందించి ఉంటారని ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధి చెందితే ఉనికికే ప్రమాదం వస్తుందని మోదీ, కేసీఆర్, జగన్ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. నందమూరి హరికృష్ణ మృతిచెందిన సమయంలో ప్రభుత్వపరంగా సహకరించాలని కేసీఆర్ను కోరామని, అదే సందర్భంలో కలిసుంటే తెలుగు రాష్ట్రాలు మరింత అభివృద్ధి సాధిస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తే దానికీ వక్రభాష్యం చెపుతున్నారని ఆక్షేపించారు.
ప్రత్యేక హోదా వద్దనలేదు
ప్రత్యేక హోదా వద్దని తాను అనలేదని, అందుకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పి అదికూడా ఇవ్వకుండా కేంద్రం వంచించిందని చంద్రబాబు గుర్తుచేశారు. అసలు హక్కుపరంగా రావాల్సిన వాటిని కూడా మంజూరు చేయటం లేదని, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకే ఎన్డీఏ నుంచి వైదొలగామని పునరుద్ఘాటించారు. ‘విశాఖలో ఎయిర్షోను చివరి క్షణంలో రద్దు చేయటం అవమానం కాదా? మాది ఏమైనా శత్రుదేశమా? మేం పన్నులు కట్టటం లేదా? కుట్రలు, కుతంత్రాలకు భయపడేది లేదు’ అని స్పష్టం చేశారు. అదేమంటే ఓటుకు నోటు కేసు తెరపైకి తెస్తున్నారని, మీరు ఒక కేసు పెడితే.. మేం నాలుగు కేసులు పెడతామని హెచ్చరించారు. ఎలుగబంటి సూర్యనారాయణ కేసు నుంచి తప్పించుకునేందుకు కేసీఆర్, అక్రమాస్తుల కేసు నుంచి గట్టెక్కేందుకు జగన్ మోదీకి మొక్కుతున్నారని ఆరోపించారు. మోదీ కోసం కేసీఆర్, జగన్ కలిసి పని చేస్తున్నారని విమర్శించారు. బంగారు గుడ్డుపెట్టే తెలంగాణను తాము వదిలి వచ్చినా ఎందుకంత అక్కసని ప్రశ్నించారు. ఎన్నికలు పూర్తయినా కేబినెట్ ఏర్పాటు చేసుకోలేని కేసీఆర్ తనని విమర్శించటం చేతకానితనమన్నారు. తెలంగాణ అభివృద్ధిపై దృష్టి పెట్టని కేసీఆర్, దేశాభివృద్ధి పట్టని మోదీ ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాజధాని శంకుస్థాపన సమయంలో మట్టి, నీరు విదిల్చి మోసగించిన మోదీని వైసీపీ ఎందుకు ప్రశ్నించదని నిలదీశారు. రిటర్న్ గిఫ్ట్ ఎంత బలంగా ఉంటే అంతే స్థాయిలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వివాదాలు ఎందుకని వౌనంగా ఉంటే అలుసుగా తీసుకుంటున్నారని, కేసులు చూపించి బెదిరించటం అలవాటుగా మారిందన్నారు. ఇకపై ఇలాంటి వ్యవహారాలకు స్వస్తి పలుకుతామన్నారు. మోదీతో పాటు మిడిల్ మోదీగా కేసీఆర్, జూనియర్ మోదీగా జగన్ ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
చిత్రం..ఉండవల్లి ప్రజావేదికలో విలేఖరుల సమావేశంలో
మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు