Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

పెళ్లా.. నిజంగానా?

$
0
0

టాప్ హీరోయిన్ శృతిహాసన్ సినిమాలు తగ్గించిన సంగతి తెలిసిందే. కొందరేమో శృతికి ఆఫర్లు తగ్గిపోయాయంటారు. ఇంకొందరు మాత్రం తనే సినిమాలను తగ్గించేసిందని, కారణం బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సలే అంటారు. ఏదేమైనా శృతి స్క్రీన్‌కు కొంత దూరంగా ఉంటున్న మాట వాస్తవం. ఇదిలా ఉంటే ఈమధ్య లండన్‌లో తన ప్రేమికుడు మైఖేల్‌తో గడిపిన తీపి గుర్తులైన ఫొటోలను అదే పనిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో -శృతి మైఖేల్‌ను పెళ్లి చేసుకోబోతోందని నెటిజనులు అనుకున్నారు. ఇక ఒక తెలుగు వెబ్‌సైట్ అయతే కాస్త ఆవేశపడి 2019లో శృతి పెళ్ళిచేసుకోబోతోందని ఆర్టికల్ రాసేసింది. ఆ ఆర్టికల్ లింక్‌ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా కోట్ చేస్తూ... ‘నిజంగానా... అయితే ఇది నాకు న్యూసే’ అంటూ ఒక సెటైర్ వేసింది శృతి. ఈ లెక్కన పెళ్లి సంగతి ఇంకా కన్ఫర్మ్ కానట్టేనా. శృతి పెళ్లి సంగతి పక్కనబెడితే ఈమధ్యే ఒక బాలీవుడ్‌లో ఓ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట శృతి. వరుస ప్రాజెక్టుల మీద ఫోకస్ పెడుతుందేమో చూడాలి.


మహాభారతంలో ఉపాఖ్యానాలు -94

$
0
0

నేను మాట తప్పను. నీవు నీ మాట పాటించు. అసత్యమాడకు. నేను ఇస్తానన్నాను కనుక నీవు స్వీకరించవలసిందే. నీవు అడిగిన మాట మీద స్థిరంగా ఉండు. ఎందుకంటే అసత్యవాదులకు ఇహపరాలు రెండూ ఉండవు. అతడు పితరులను, భవిష్యతరాలను కూడా తరింపచేయలేడు. ఎన్ని తపస్సులు ఎంత చేసినా అవి సత్యాన్ని మించిపోలేవు. సత్యమే అక్షర బ్రహ్మ. సత్యమే నశించని తపస్సు. సత్యమే అక్షర యజ్ఞం. సత్యమే అక్షర వేదం. సత్యం యొక్క ఫలమే సర్వ శ్రేష్ఠమైన ఫలం. ఈ జగత్తు అంతా సత్యం మీద ఆధారపడి ఉన్నది. సత్యమే వేదం. సత్యమే వేదాంగాలు. సత్యమే సర్వవిద్యలు.
సత్యమే విధి
సత్యమే ఓం కారం
సత్యం వల్లనే గాలి వీస్తున్నది
సత్యం వల్లనే సూర్యుడు ఉదయస్తున్నాడు, అగ్ని దహిస్తున్నది
స్వర్గం సత్యమందే నిలిచి ఉంటుంది.
వేదాలు, యజ్ఞాలు, తపస్సు, మంత్రాలు, సరస్వతి - ఇవన్నీ సత్య స్వరూపాలే. ధర్మం సదా సత్యం వైపే ఉంటుంది.
కనుక రాజా! అసత్యమైన కర్మని చేయకు. యాచన ఇష్టం లేని వాడివి ‘దేహి’ అని నా తప్ఫఃలం యాచించావెందుకు? నేను ఇచ్చినది స్వీకరించకపోతే ధర్మభ్రష్ఠుడవై తిరుగుతూ ఉంటావు. మాట ఇచ్చి దానం చేయనివాడూ దానం అడిగి స్వీకరించనివాడు - ఇద్దరూ అసత్యవాదులే అవుతారు. కనుక ఈ విషయాన్ని అసత్యం చేయకు’’.
రాజు ఇలా అన్నాడు - ‘‘ప్రజారక్షణము, యుద్ధము- ఈ రెండూ క్షత్రియ ధర్మాలే కదా! మరి నీవు ఇచ్చే దానాన్ని ఎలా స్వీకరించను?’’
బ్రాహ్మణుడు - ‘‘దానం స్వీకరించమని నేను నీ దగ్గరకు వచ్చి ప్రాధేయ పడలేదు. నీవే నా జప ఫలాన్ని దానంగా ఇమ్మని అడిగావు. మరెందుకు స్వీకరించవు?’’
అప్పుడు ధర్ముడు వారి మధ్యకు వచ్చి ఇలా అన్నాడు -
‘‘మీ ఇద్దరూ వాదించుకోవద్దు. సాక్షాత్తు ధర్ముడను మీ ముందు ఉన్నాను. రాజు తపః ఫలాన్ని స్వీకరించవచ్చు.’’
అప్పుడు సశరీరంగా స్వర్గమే వచ్చి వారి ముందు నిలిచి ఇలా అంది - ‘‘మీరిద్దరూ ఆ ఫలితాన్ని సమానంగా పొందండి’’
అప్పుడు రాజు ఇలా అన్నాడు - ‘‘నాకు స్వర్గంతో పనిలేదు. విప్రుడు వెళ్ళదలిస్తే నేను సంపాదించిన పుణ్యాన్ని కూడా స్వీకరించవచ్చు’’.
దానికి బ్రాహ్మణుడు ఇలా అన్నాడు - ‘‘నేను చిన్నతనంలో తెలియక చేయ జాపి ఉండవచ్చు. కాని ప్రస్తుతం నేను గాయత్రీ మంత్రం జపిస్తూ నివృత్తి మార్గంలో ఉన్నాను. కనుక నన్ను ప్రలోభపెట్టవద్దు. నా పని నేను సాధించుకోగలను. నీ ఫలితం నాకు అవసరం లేదు. నేను తపస్సు నందు, స్వాధ్యాయమందు లగ్నమైనవాడిని. ప్రతి గ్రహాన్ని విడిచి పెట్టినవాడిని.’’
అప్పుడు రాజ ఇలా అన్నాడు - ‘‘నీవు నీ జప ఫలాన్ని పరిత్యజిస్తే ఇలా చేద్దాం. మనం ఇద్దరం సాధించిన పుణ్యఫలాన్ని సమానంగా అనుభవిద్దాం. క్షత్రియులు దానం చేయగలిగినవారు, బ్రాహ్మణులు దానం గ్రహించేవారు. కనుక ఫలితాన్ని సమానంగా అనుభవిద్దాము. నీ కిష్టం లేకపోతే అలా చేయవలసిన పని లేదు. నా పుణ్యఫలాన్ని స్వీకరించు’’.
ఆ సమయంలో వికృత రూపులైన ఇద్దరు పురుషులు అక్కడికి వచ్చారు. వారు మలిన వస్త్రాలు ధరించి ఒకరి నొకరు కౌగిలించు కొన్నారు. నీవు నాకు బాకీ లేదు అని ఒకడు, కాదు బాకీ ఉన్నాను అని రెండవ వాడు వాదించు కుంటున్నారు. వారిద్దరూ రాజు దగ్గరకు వచ్చి తమకు సరియైన తీర్పు ఇవ్వమని కోరారు. అందులో ఒకడు విరూపుడు, రెండవ వాడు వికృతుడు.
విరూపుడు ఇలా అన్నాడు ‘‘రాజా! నేను వికృతుడికి ఒక గోదాన ఫలం బాకీ ఉన్నాను. నేను బాకీ తీరుస్తాను అంటే అతను స్వీకరించడం లేదు.’’
అప్పుడు వికృతుడిలా అన్నాడు - ‘‘నాకు అసలు విరూపుడు బాకీయే లేడు. నేనెలా స్వీకరిస్తాను?’’
రాజు విరూపుడు వికృతునికి ఏమి బాకీ ఉన్నాడో చెప్పుమనగా అతను ఇలా చెప్పాడు - ‘‘రాజా! బాకీ గురించి చెప్తాను విను. వికృతుడు తపస్స్వాధ్యాయ సంపన్నుడైన బ్రాహ్మణునికి ఒక గోవును దానం చేశాడు. నేను వికృతుని ఇంటికి పోయ ఆ గోదాన ఫలాన్ని యాచించాను. అతను నాకు ఆ ఫలితాన్ని నాకు దానం చేశాడు. తర్వాత నేను ఒక బీద బ్రాహ్మణునికి రెండు కపిల గోవులు దానం చేశాను. ఆ గోదాన ఫలితాన్ని వికృతునికి ఇవ్వదలిచాను. నేను స్వీకరించిన దానికి రెట్టింపు ఫలాన్ని ఇస్తున్నాను. ఇందులో దోషి ఎవరో మీరే నిర్ణయంచాలి. మాకు న్యాయం చేయాలి. అతను దానమిచ్చినట్లే నేను కూడా దానమిస్తున్నాను. మరి అతను ఎందుకు స్వీకరించడం లేదు?’’
రాజు వికృతుని అడిగాడు - ‘‘వికృతా! నీవు అతని దానాన్ని ఎందుకు స్వీకరించడం లేదు? నీది అతను తీసుకున్నట్లే అతను ఇచ్చింది నీవు తీసుకో!’’
వికృతుడు ఇలా అన్నాడు - ‘‘విరూపుడు నాకు బాకీ ఉన్నానని అంటున్నాడు. కాని నేను దానమిచ్చాను కనుక బాకీ ప్రసక్తి లేదు. కనుక నాకు ఏమీ ఇవ్వనక్కర్లేదు’’.
రాజు - ‘‘అతను ఇస్తానంటే నీవు వద్దంటున్నావు అది తప్పు. నిన్ను శిక్షించవలసి వస్తుంది.’’
వికృతుడన్నాడు - ‘‘రాజర్షీ! నేను అతనికి దానం చేసిన దానిని తిరిగి ఎలా తీసుకుంటాను, ఇచ్చిన దానిని మళ్ళీ తీసుకోలేను. కనుక నన్ను శిక్షించండి.’’
విరూపుడు - ‘‘నేను ఇచ్చిన దాన్ని నీవు స్వీకరించకపోతే రాజు నిన్ను శిక్షిస్తాడు’’.
వికృతుడు - ‘‘నేను నీకు ధనాన్ని అప్పుగా ఇవ్వలేదు. దానంగా ఇచ్చాను. కనుక నువ్వు నాకు ఏమీ బాకీ లేవు. నీవు వెళ్ళవచ్చు.’’
వారి వాదన విన్న బ్రాహ్మణుడు రాజుతో ఇలా అన్నాడు - ‘‘రాజా! వీరిద్దరి మాటలు విన్నావు కదా! ఇప్పుడు నిస్సంకోచంగా నా దానాన్ని స్వీకరించు’’.
ఇంకావుంది...

స్వాధ్యాయ సందోహం-189

$
0
0

ఓ ప్రభూ! నీవు సమస్త జీవులకు పోషకుడవని చెబుతారు. అలా ఎందుకు చెబుతున్నారు? నేనాకలితో చచ్చిపోతున్నా. నీ వెవరిని రక్షిస్తూ ఉన్నావు? అందరిని కదా. మరి ననే్నల రక్షింపవు? ఆకలి మరణానికి నన్ను నీవు వదిలివేసావు. నాపై నీ కేల దయరాదు? ఓ సంరక్షకా! ‘శిశయం త్వా శ్రుణోమి’ ‘‘నీవు వెంటనే సంరక్షించేవాడవని విన్నాను’’ నేను అలసుడను. ఆపద వచ్చినపుడు చింతింపవచ్చునులేనని సోమరిగా ఉండే దీర్ఘసూత్రుడను. నీవో! కనురెప్పపాటులో ప్రళయాన్ని సృష్టింపగల సమర్థుడవు. నాకు యుగాలు గడిచిపోయాయి. నీ పరంధామంనుండి నేనీ లోకంలోనికి వచ్చి ఎన్ని యుగాలు గడచిపోయాయో! ఎన్ని కల్పాలు గతించిపోయాయో! కాని నీ పరంధామానికి తిరిగి చేరుకోలేకపోయాను. చివరకు నేనా మార్గంలో నడుస్తున్నానో లేదో కూడ నాకు తెలియదు. ఓ జగత్పిత! ‘శిశీహి మా’ ‘‘నాకు శక్తినిమ్ము’’ నీవు నాకు మంచి బుద్ధిని కూడ ఇచ్చావు. దానిని వినియోగించి ఏమీ పొందలేకపోయాను. కాబట్టి ‘అప్నస్వతీ మమ ధీరస్తు శక్ర’ ‘‘ఓ శక్తిశాలీ! భగవాన్! నా బుద్ధిని సత్కర్మకు సుముఖంగా వెంటనే చేయి’’ నీకు కర్మమార్గం ఇష్టమని విన్నాను. నన్నా కర్మమార్గంలో పెట్టు. కాని ఏది సుకర్మయో ఏది దుష్కర్మయో నీవే ప్రబోధించు. దానివలన దుష్కర్మనాచరించి నీ ఆగ్రహానికి గురికాకుండా ఉంటాను.
ఓ అష్వైశ్వర్య సంపన్నుడా! నా జీవిత సౌఖ్యానికి ధనమెంతో అవసరం. కాని నీవు ‘్ధనం న స్పంద్రం బహుళమ్’ ‘‘్ధనం అత్యంత చంచలం’’అన్న భ్రాంతిని కలిగించి భయపెట్టావు. కాని ధనకాంక్షనుమాత్రం పోగొట్టలేదు. అందువలన ఓ మహాదేవా! ‘వసువిదం భగమింద్రా భరా నః’ ‘‘్ధనాన్నిపొందే సౌభాగ్యాన్ని మాకిమ్ము’’ నా కొక్కడికే కాదు. అందరకూ ఇమ్ము. ఓ ప్రభూ! నీవు భక్తుల పాలిట కల్పవృక్షమవు. ‘కృధీ ధియం జరిత్రే వాజరత్నామ్’ ‘‘్భక్తులకు నీవే జ్ఞాన ధనమైయున్నావు’ కాబట్టి జ్ఞానధనాన్ని భక్తులకు నీవే అనుగ్రహించు. మా అందరకు ఆ జ్ఞాన ధనమే కావాలి. ఓ జ్ఞాననిధీ! భక్తులకు నీవు జ్ఞాన ధనాన్ని ప్రదానంచేసినా అది ఎన్నటికి తరగదు. నిండుగానే ఉంటుంది.
**
పరమాత్మకు ప్రేమ పాత్రులు
న తం జినంతి బహవో న దభ్రా ఉర్వస్మా అదితి. శర్మ యంసత్‌
ప్రియః సుకృత్ప్రియ ఇంద్రే మనాయుఃప్రియః సుప్రావీః ప్రియో అస్య సోమ॥
భావం:- సత్కర్మాచరణుడు, నిరంతర దైవధ్యాన తత్పరుడు, సర్వజీవ సంరక్షకుడు, శాంతశీలుడు అయినవాడే భగవంతునకు ప్రియమైనవాడు. అట్టివానికి జగన్మాత భూలోకంలో చిరకాల సుఖజీవన సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఎంతమంది కూడినా అట్టివానికి కించిత్తు అపకారాన్ని చేయజాలరు.
వివరణ:- లోకంలో అందరు భగవంతుడు తన ఎడల సంప్రీతుడై అనుగ్రహించాలని కోరుకొంటారు. కాని ఆయనావిధంగా తన ఎడల ప్రీతి జనించే సద్గుణాలేమైనా తనలో ఉన్నాయా? అని ఆత్మవిమర్శ చేసుకోరు. ప్రస్తుత మంత్రం తన ఎడల దైవానికి సంప్రీతి కలగాలంటే ముఖ్యంగా ఉండవలసిన సద్గుణాలేమిటో వివరిస్తూంది. అవి 1.సుకృత్ 2. మనాయు. 3. సుప్రావీ. 4. సోమీ.
సుకృత్:- సత్కర్మల నాచరించేవాడు సుకృత్తు. దైవమే స్వయంగా సత్కర్మాచరణశీలి. ‘సమానశీల వ్యసనేషు సఖ్యమ్’ ‘‘ఒకే శీలంగలవారి మధ్యగాని ఒకే ఆపద నెదుర్కొనేవారి మధ్యగాని మిత్రత్వమేర్పడుతుంది’’ అన్న వచనానుసారం సత్కర్మాచరణశీలి (స్వపాః) అయిన సర్వేశ్వరుడితో సుకృత్తు అయినవానికిగాక దుష్కృతుడికి మిత్రత్వం గాని, ప్రీతిగాని ఎలా ఏర్పడుతుంది? ఋతగామి అయినవానితోనే పరమాత్మకు సఖ్యం లేదా ప్రతి ఉంటుందని-
ఋతస్య పంథాం న తరంతి దుష్కృతః
‘‘ఋతమార్గాన్ని (సృష్టినియమాలు, శాసనాలు, ధర్మాలు) దుష్కర్ములు అనుసరించరు’’అన్న ఋగ్వేద వచనానుసారం సుకర్ములతో గాక దుష్కర్మలతో పరమాత్మకు సఖ్యంగా ప్రీతిగాని కలుగదు. కాబట్టి సుకృత్తు= సత్కర్మశీలుని ఎడల మాత్రమే భగవత్ప్రీతి జనిస్తుంది.
మనాయుః:- సదా భగవత్ స్మరణచేయువాడే మనాయువు. అతడియందు కలిగే ప్రీతి కలలోనైన దైవచింతన చేయని మూఢమతి ఎడల భగవంతుని కేవిధంగా జనిస్తుంది? భగవచ్చింతన ఎవరికైనా భగవత్క్థాశ్రవణం తరువాతనే కలుగుతుంది. శ్రవణమే చేయనివాడు ఎవరిని గురించి చింతన చేస్తాడు? దైవకథాశ్రవణం దైవచింతనకు ప్రేరణ కలిగిస్తుంది. అట్టి దైవచింతనుని ఎడల పరమాత్మకు సంప్రీతి జనిస్తుంది. అది ఆ జీవుని ఆత్మోద్ధరణకు దోహదపడుతుంది.
సుప్రావీః:- సర్వజీవులు భగవత్ప్రతిరూపాలన్న ఉదారాశయంతో వారికి సేవ చేసేవాడు సుప్రావి. ఎవరైనా సుప్రావియై భగవత్ప్రీతిపాత్రుడు కావాలని వాంఛించేవాడు భగవత్ప్రతి రూపమైన సర్వజీవుల ఎడల ప్రేమ భావమూ, ఆపత్సమయాలలో వారి రక్షణభారమూ వహించే సుశీలి కావాలి. ఈ సౌశీల్యాన్ని మనిషి ప్రయత్నపూర్వకంగా ఆచరించాలి.
ఇంకావుంది...

పరమహంస బోధామృతము

$
0
0

తత్త్వజ్ఞానము, బ్రహ్మానంద ప్రాప్తి మొదలగునవి మనకు సాధ్యమగుట మాయవలననే. అటులు కానియెడల వీనినన్నిటిని ఎవ్వరు కలనైనను తెలపగలరు? ద్వైతభావమును ఈ దృశ్య ప్రపంచమును మాయనుండియే పుట్టుచున్నవి. మాయకవ్వల భోక్త, భోగ్యము అనునవి లేనే లేవు.
65.పిల్లి తన కూనలను పండ్లతో కరచి పట్టుకొనునపుడు ఆ కూనలకే అపాయము నుండదు. కాని ఆ పిల్లి ఎలుకనట్లు పట్టుకొనునేని అది చచ్చును. అటులనే మాయ యితరులను నాశనము చేయును కాని భక్తులనెన్నడును నశింపజేయదు.
మూడవ ప్రకరణము
మాయ: కామినీకాంచనములు
కామమే బంధకారము -కామము: ఆత్మ వికాసము - కామమును జయించుటెట్లు? కాంచన మోహమును జయించుటెట్లు?
కామమే బంధకారణము
66.మాయ యనగా నేమి? పారమార్థిక సాధనకు - ఆత్మ వికాసమునకు- అడువచ్చుచుండు కామమే మాయ.
67.సర్వము ధ్వంసము చేయుదానిని మాయ యనవలయునా, మదనాగ్ని యనవలయునా?
68.కామినీ కాంచనములందరి మోహముచే సంసార బద్ధులగు నరులు వానిమూలమున వేనవేలు అవమానములను పొందుచున్నను వాని బంధమును విదళించుకొని మనస్సును భగవంతునివైపు త్రిప్పజాలకున్నారు.
69.సంసారులారా! కామినులను నమ్మకుడు, అతిక పటముగా వారు మిమ్ము లోబరచుకొందరు!
70. నీవెంత నాగరూకతతో మెలగువాడవైనను పొగచూరి మసిపాఱియున్న గదిలో వాసము చేయుచున్న పక్షమున కొంచెమో గొప్పయో మసిడాగులు పడకుండ తప్పించుకోలేవు. ఎంత నిగ్రహ సంపన్నుడైనను, ఎంత బుద్ధిమంతుడైనను నరుడు కాంతాజనము నడుమ నివసించునెడల ఏ కొలదిగనైనను కామచింతలు వాని మనసున పొడసూపక మానవు.
71.సన్నిపాత జ్వరముచే బాధపడుచు సంధించియున్న వానిచెంతను బిందెల కొలది చల్లని మంచినీరును జాడీలకొలది రుచికరములగు నూరుగాయలను బెట్టియుంచినయెల వాని నారగింపవలయునను ఉద్రేకమును ఆపుకొనగలడా? అటులనే కామజ్వరముతో కొట్టుకొనుచు, ఇంద్రియ సుఖములకై ఉబలాటపడువానికి ఒకవైపున కామినులటక్కులను మరొక వైపున ధనాకర్షణులును సిద్ధమైనచో వాని నాతడు నిగ్రహించుకోజాలడు; భక్తిమార్గభ్రష్టుడై పెడచోవ త్రొక్కుట నిశ్చయము.
72.ఒక మార్వాడీ శ్రీరామకృష్ణుని సందర్శించి యిట్లు ప్రశ్నించెను. ‘‘నేనన్నిటిని త్యజించినాను, ఐనను నాకు భగవత్సాక్షాత్కారము కలుగకుండుటకు హేతువేమి?’’
శ్రీ గురుదేవుడ్లి సమాధాన మొసగెను: ‘‘నూనె పోసి యుంచుకొను తోలుతిత్తులను జూచియుదురు కదా? అట్టితిత్తినుండి నూనెనంతయు కార్చివేసి చూడుడు. దాని యడుగునను ప్రక్కలను ఏ కొంచెమో నూనె అంటి పట్టుకొనియే యుండును. కావున నూనె వాసన దానిని విడిచిపోనేపోదు. అదేవిధమున కొంత సంసార వాసన మీయందింకను మిగిలియున్నది’’.
73.కామినియు కాంచనమును నరులను నారాయణుని యెడ విముఖులనుజేసి సంసారమున ముంచివలేయునని జ్ఞప్తినుంచుకొనుడు. తనభార్య మంచిదైనను చెడ్డదైనను మరియెట్టిదైనను నరుడామెను పొగడుచునే యుండుట కడు విచిత్రము!
74.కోతి వేట కాని కాళ్లకడ పడి ప్రాణములు విడుచు రీతిని పురుషుడు సుందరాంగి చరణములకడ బలియగుచున్నాడు.
కామము:ఆత్మవికాసము
75.్భక్తిసాధనలను సాగించి భగవంతుని బొందగోరు వారు కామినీ కాంచనముల యొక్క వలలో బడకుండ కడు జాగరూకులై మెలగవలయును. లేనియెడల యెన్నటికిని సిద్ధిపొందజాలరు.
76.శ్రీ చైతన్యుని నిత్యానందుడిట్లడిగెను: ‘‘నేను చేయు భక్తి బోధనలన్నియు నరుల మానసమూలం దెట్టి ప్రత్యక్షమగు మార్పును గలిగింపజాలకుండుటకు హేతువేమి?’’ అందులకు శ్రీ చైతన్యుడిట్లనియెను: ‘‘స్ర్తిలతోడి సాంగత్యమువలన వారు ఎట్టి తత్త్వబోధనలను మనసులో నిలుపుకొనజాలకున్నారు. తమ్ముడా! నిత్యానందా! వినుము, సంసారమోహితులకు ముక్తిలేదు.’’

శ్రీ రామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి

సుందరకాండ

$
0
0

హంసలచే మోయబడుతోంది.
ఈ శ్లోకంలో ‘సువర్ణ’ శబ్దానికి పదహారు అచ్చులని అర్థం.
అలాగే ‘మహత్’అంటే ఆకాశం. అందువల ఈ శ్లోకం ‘విశుద్ధి’స్థానంలో ఉన్న స్వామిని చూపెడుతున్నది.
అలాగే-
యధా నగాగ్రం బహుధాతు చిత్రం
యధా నభశ్చ గ్రహ చన్ద్ర చిత్రం
దదర్శ యుక్తీకృత మేఘ చిత్రం
విమాన రత్నం బహురత్న చిత్రమ్
రకరకాల ధాతువుల (ఖనిజ లవణాలు)తో అందంగా ఉన్న పర్వతాగ్రాలు నానా గ్రహతారక చన్ద్రాదులతో కూడిన ఆకాశం అంతలో మేఘాలు క్రమ్ముకొన్న విచిత్రం- ఇలా నక్షత్ర శాలలోనికి అడుగుపెట్టిన స్థితి. అలాగే
మహీకృతా పర్వత రాజిపూర్ణాః
శైలా కృతావృక్ష వితాన పూర్ణాః
వృక్షాః కృతా పుష్ప వితాన పూర్ణాః
పుష్పం కృతం కేసర పత్రపూర్ణాః
పర్వత సమూహాలతోకూడిన భూమి- ఇంతలో అడుగు ముందుకువేస్తే
వృక్ష పూర్ణాలయిన పర్వతాలు- మరొక అడుగు ముందుకువేస్తే పుష్ఫ పరిపూర్ణాలయిన వృక్షాలు- మరొక్క అడుగువేస్తే
కేసర పత్ర పూర్ణాలుగా - పుష్పాలు కనబడతాయట.
మనోహర శిల్పమయంగా ఉంది. అద్భుత స్వరూపంగా ఉంది.
సాక్షాత్తు బ్రహ్మ నిర్మితంగానే ఉంది. ఆ రాక్షస రాజుయొక్క ఆత్మబల రూపంగా ఉంది. అంత మనోహరమైన విమానాన్ని చూస్తూనే ఉన్నాడు. అయినా- తానూ చూస్తూన్నదంతా సీత కోసమే.
ఆ విషయంలో స్వామి-
కృతాత్ముడు (నిశిత బుద్ధి) స్థూల సూక్ష్మ దర్శనం చేయగల సుచక్షువు.
సదాచార రూపమైన సువర్త్శనుడు- కాని
అపశ్యతో భవదతి దుఃఖితం మనః
అయినా తత్పరత ఉన్నవాడు కనుక దీక్షనుండి విరమించలేదు.
అనే్వషణ కొనసాగిస్తొనే ఉన్నాడు.
అర్థయోజన విస్తీర్ణము యోజనం వెడల్పు ఉన్న ఉత్తమ రాక్షసావాసమైన రావణ భవనంలో ప్రవేశించేడు.
అది సాక్షాత్తు రావణ భవనం కనుక పరమ మనోహరంగా ఉంది. ఐహిక భోగ సౌందర్యాలు మూర్త్భీవించి ఉన్నాయి. పాన ద్రవ్యాలనుండి భక్ష్యాన్నాల నుండి వచ్చేది దివ్యగంధాలతో
సగం ధస్తం మహాసత్త్వం బంధుర్భంధుమివోత్తమం
ఇత ఏహీత్యువాచేన యత్ర తత్ర సరావణః- ఆ గంధాలు
వీధిలో ఇంటికొరకు వెదకికొంటూన్న బంధువును బంధువు పిలుస్తూన్నట్లు
ఇలారా! ఇలారా! అని స్వామిని పిలుస్తున్నాయట
మణి సోపానాలతో బంగారు అలంకరణలతో స్ఫటిక నేలలతో
అక్కడక్కడ అలంకరింపబడిన దంతపు బొమ్మలతో
రావణ మనఃకాంతలా ఉంది.
మహత్యా కుథయాస్తీర్ణం పృథివీలక్షణాంకయా
పృధివీ మివ విస్తీర్ణాం సరాష్ట్ర గృహమాలినీమ్
ఈ విధంగా కుథ (కార్పెట్) ఆ భవనంలో పరచబడి ఉంది. దాని మీద పర్వత అరణ్య నదీ పముద్ర పర్వంతమైన ప్రపంచం చిత్రింపబడి ఉంది. దేశ విభజనతో గృహ సముదాయాలతో చిత్రంగా ఉంది. రావణుడు దానిమీద నుండి నడుచుకొంటూ శయన మందిరంలోకి వెడుతాడన్నమాట. ఇదే రాక్షస ప్రవృత్తి.
తన నిలకడకు స్థాన భూతమైన దానియందు కూడా గౌరవభావం లేకపోవటం.
సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే
విష్ణుపత్ని సమస్త్భ్యుం పాదాహతిం క్షమస్వ మే- అంటూ
ఉదయం లేవగానే భూమి మీద కాలు మోపకుండగానే భూదేవిని శరణు వేడుకొనే సంస్కారం మనది. పటంలో ఇది గంగ పుటిటన చోటు అని చూపెట్టగానే కృతజ్ఞతా భావంతో చేతుల్ని జోడించే జాతి మనది. తమ మనుగడకు కారణమైన మట్టిని భోగ వస్తువుగా భావించే తామస ప్రకృతే రాక్షసం. అటువంటి వాళ్ళు తమ జన్మ భూమిని తాకట్టు పెట్టగలరు. అమ్మివేయనూ గలరు. వాని ముందు దేశభక్తి వెఱ్ఱివాని ఆలోచనగా ఉంటుంది.
ఈ భవనం పుష్పక విమానంలో భాగంగా అటువంటి రావణ భవనం. ఇహిక తృప్తికి పరాకాష్టగా ఉంది.
ఇంకావుంది...

శ్రీకాళహస్తీశ్వరా!

$
0
0

కొడుకుల్ పుట్టరటంచు నేడు రవివేకుల్ జీవనభ్రాంతులై!
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్, వారిచే నేగతుల్
వడసెన్? పుత్రులు లేని యా శకునకున్ వాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!

భావం:ఈశ్వరా! లోకంలోని జనులు ఎంత అవివేకులు! కొడుకులు పుట్టలేదని, తమకు ఉత్తమగతులు లేవని అజ్ఞానంతో ఏడుస్తున్నారు. కౌరవ చక్రవర్తి ధృతరాష్ట్రునకు వందమంది కొడుకులు పుట్టారు కదా! వారి వల్ల అతడు ఎంత ఉత్తమగతిని పొందాడు. బ్రహ్మచారిగా ఉండి అపుత్రకుడైన శుక మహర్షికి ఏ దుర్గతులు కలిగెను. ఇదంతా భ్రాంతి తప్ప మరొకటి కాదు. అపుత్రకుడైనవానికి మోక్షమార్గము మూసుకొని పోవునా? వట్టిది. ‘జ్ఞానేనహి నృణాం మోక్షః’.

గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కల్యాణనామంబు ప్ర
త్యహమున్ బేర్కొను నుత్తమోత్తముల బాధంబెట్టగా నోపునే?
దహనుం గప్పగఁ జాలునే శలభ సంతానంబు? నీ సేవఁచే
సి హతక్లేశులుగారుగాక మనుజుల్ ఓ శ్రీకాళహస్తీశ్వరా!

భావం:ఈశ్వరా!విషమ స్థానంలో నుండి గ్రహములు కలిగించు బాధలుగానీ, అపశకునములుగానీ, రోజూ నీ నామస్మరణం చేయు పుణ్యపుషులను కష్టపెట్టగలవా? ఏమిటో ఈ ప్రజలు అజ్ఞానంలో పడి నిన్ను సేవించక దుఃఖములను అనుభవిస్తున్నారు గానీ, మిడుతుల దండు అగ్నిని ఆవరింపలేదని గ్రహించపలేకున్నారేమి? ఇదెంత చిత్రమైన విషయము?

అడుగం బో నిక నన్యమార్గరతులం ప్రాణావనోత్సాహినై,
యడుగంబోయినఁ బోదుఁ నీదు పద పద్మారాధక శ్రేణీయు
నె్నడకున్, నిన్నుభజింపగాఁ గనియు నాకేలా పరాపేక్ష కో
రెడి దింకేమి? భవత్ప్రసాదమె తగున్ శ్రీ కాళహస్తీశ్వరా!

భావం:ఈశ్వరా! నా జీవనయాత్ర సాగుటకై శైవులు గాక ఇతర మార్గానుసారులను యాచించను. ఒకవేళ యాచించినా, నీ చరణదాసులైన భక్తులనే యాచిస్తాను. అయినా, నిన్ను సేవించు పద్ధతులు తెలుసుకొన్న నాకు ఇతరులను యాచించు అవసరమేమి ఉన్నది? నీ అనుగ్రహము కలిగినచో ఈ అల్పములైన ప్రాపంచిన సుఖములు ఎందుకు కోరతాను? అసలు కోరుటకు వీనిలో సారం ఏమున్నది.

హితవాక్యం

సహసా విదధీత న క్రియాం అవివేకః పరమాపదాం పదం
వృణతే హి విమృశ్య కారిణం గుణలుబ్ధాః స్వయమేవ సంపదః

భవ్య కవితాభాస్కరుడైన ‘్భరవి’ మహాకవి వెలయించిన పదమాలిక యిది. ‘కిరతార్జునీయం’లోని సన్నివేశం.
పాండవులు కానల్లో కోనల్లో కటిక చీకట్లలో బాధలు పడుతూ బరువుగా కాలాన్ని గడుపుతున్నారు. రాజనీతిని అనుసరించి ధర్మరాజు ఒక వనేచరుణ్ణి హస్తినాపురం పంపాడు. రాజ్యంలోని పరిపాలనా విశేషాల్ని రహస్యంగా తెలుసుకొని రమ్మన్నాడు. కొంతకాలం తర్వాత వనేచరుడు ద్వైతవనంలో వున్న ధర్మరాజును కలుసుకున్నాడు. చాలా సమర్థవంతంగా సుయోధనుడు పరిపాలిస్తున్నాడని చెప్పి విశేషాల్ని వివరించి వెళ్లిపోయాడు. అంతా విన్న ద్రౌపది ధర్మరాజును ఎత్తిపొడుపు మాటల్తో ఉద్రేకింపజేయాలని ప్రయత్నించింది. ‘‘నువ్వు వేసిన తప్పటడుగువల్లనే మేమింత దురవస్థను అనుభవిస్తున్నాం’’ అన్నది. తర్వాత భీమసేనుడందుకొని ‘‘ప్రతీకారం తీర్చటమే పురుష లక్షణం’’ అంటూ కనె్నర్రజేశాడు. యుద్ధానికి సన్నద్ధులు కావటమే కర్తవ్యమని గర్జించాడు. ఆ మాటలన్నీ ప్రశాంతంగా విని ధర్మరాజు ప్రసన్న దృక్కులతో పాంచాలి వైపు తిరిగి యిలా అన్నాడు.
‘‘అనుకున్న వెంటనే చేయరాదు. ఆలోచన ఆచరణలోకి రావటానికి ముందు మంచి చెడుల వివేచన కావాలి. అది లేకపోవటం అవివేకం. అది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. గుణవంతుల్ని వరించే శీలంగల సంపదలు వివేకశీలుణ్ణి స్వయంగా వచ్చి వరిస్తాయి. కాబట్టి ఏ పని చెయ్యాలన్నా ముందుగా దానివల్ల కలిగే లాననష్టాల్ని గురించి వివేచించాలి. అదే మన విజయానికి ఉత్తమమైన మార్గం’’.

అనంతం-30

$
0
0

‘‘జన సంచారం ఎక్కువగా వున్న ప్రాంతాల్లో కలివికోడి ఉండదు. దానికి మనుషుల పొడే గిట్టదు. నల్లకొండ దగ్గర మానవ సంచారం తక్కువగా వుంటుంది కనుక అవ్వి రుూ ప్రాంతాల్లో ఉండే అవకాశం వుంది!
ఇకపోతే, కొండ గుహల్లో నివాసముండే అవకాశం ఇక్కడుంది కనుక అవ్వి రుూ ప్రాంతానికి చేరవచ్చు.
నీటి కొలనులో దాహం తీర్చుకొంటూ, నల్లకొండ గుహల్లో నివాసముంటూ రుూ చుట్టుప్రక్కల సంచరిస్తుండాలి.
నెమలి గుట్ట దగ్గర పురుగులు, క్రిమికీటకాలు అసంఖ్యాకంగా వుండి వుండాలి.... లేకపోతే అన్ని నెమళ్ళు అక్కడ వుండవు. కలివికోళ్ళ ఆహారం కూడా పురుగులు కీటకాలే కనుక వాటికోసం కలివికోళ్ళు ఇక్కడికి దాపులో వుండాలి.
ప్రమాదం లేని అనువైన నివాసం, ఆహారం, నీళ్ళు అందుబాట్లోవున్న ప్రాంతాల్లోనే జీవరాసులు కుదురుకుంటాయి! కనుక, నల్లకొండ గుహల్లో నివాసం వుంటూ, నెమలిగుట్ట దగ్గర ఆహారం తింటూ, కొలనునీళ్ళు తాగుతూ అవీ ప్రాంతంలోనే దాగి ఉంటాయి’’ అని చెప్పాడు గరుడాచలం.
రాగ్యా ఆశ్చర్యంగా అతని వైపే చూస్తున్నాడు!
అడవిలో పుట్టి అడవిలో పెరిగిన తనకే ఇన్ని విషయాలు తెలియవు. పట్నం వాడు, గరుడాచలానికెలా తెలుసు?
పట్నంవాళ్ళు తెలివిగల వాళ్ళన్నది అందుకేనేమో!
‘‘మనఁవ్ అడివంతా యతకాల్నా?’’ అని రాగ్యా అడిగాడు.
‘‘కోళ్ళు కనిపించేదాకా వెదికే అవసరం లేదు. వాటి జాడలు కనిపిస్తే చాలు’’
‘‘ఎట్టా కనిపిత్తయ్యి.’’
‘‘అవ్వి నడిచేప్పుడు నేలమీద పాదముద్రలు పడొచ్చు. ఈకలు రాలొచ్చు. కూతలు వినిపించొచ్చు.’’
‘‘అంతా అయ్యేపాలికి ఎన్ని దినాలు పట్టుద్దో.’’
‘‘ఎన్ని రోజులు పట్టినా తప్పదు’’ అన్నాడు గరుడాచలం.
‘‘ఎప్పుడు బోవాలి మనఁవ్ అడివికి’’ రాగ్యా అడిగాడు.
‘‘ఎప్పుడోనా? ఇప్పుడు బయల్దేరాలి. దేవర జాతరలోగా అన్ని పనులూ సవ్యంగా పూర్తయితేనే చాంద్‌నీ నీకు దక్కేది.’’
రాగ్యా కళ్ళుమెరిసాయి!
చాందినీ పేరువినగానే వొళ్ళు జలదరించింది! నరాలు లాగాయి.
‘‘యల్దాఁవా సారూ’’ అని అడిగాడు రాగ్యా.
గరుడాచలం, రాగ్యా అడవికి బయల్దేరారు!
సాయుధ పోలీసులు రక్షణగా బయల్దేరితే వాళ్ళను అప్పుడు వారించలేదు గరుడాచలం.
ఎప్పుడు సెక్యూరిటీ అవసరమో, ఎప్పుడు అనవసరమో.
ఎలాంటి పరిస్థితుల్లో ఎవరికి సెక్యూరిటీ ఇవ్వాలో గ్రహించాలి!
మూర్ఖంగా ప్రవర్తిస్తే చేతులుకాలాక ఆకులు పట్టుకోవాలి!
రాగ్యాకోసం అడవి పుత్రులు వేటాడుతున్నారు. కనిపిస్తే బంధించి తీసుకొని వెళ్తారు. పంచాయితీ పెట్టి కఠినంగా శిక్షిస్తారు.
అదీ కాకుండా వాళ్ళకు తన మీద కూడా కోపం వుండి వుంటుంది!
చాంద్‌నీ అన్ని విషయాలూ వాళ్ళకి చెప్పే వుంటుంది.
బయల్దేరారు.
గుడారాలు దాటారు.
అడవి అంచులు దాటి కారడివిలో అదృశ్యమయ్యారు.
కీ.శే.పెద్దిరెడ్డి కొడుకు ఎమ్మెల్లే పెంటారెడ్డి, వాళ్ళు అడవిలోకి వెళ్ళేదాకా గుడారం ముందు నిలబడి చూస్తూనే ఉన్నాడు!
దుర్గమారణ్యం!
లోపలికి పోను పోను అడుగు తీసి అడుగు వెయ్యటమే కష్టంగా వుంది. గుబురు ముళ్ళ పొదలు చెట్ల కొమ్మలు దారికి అడ్డొస్తున్నాయి!
రాగ్యా అందరికన్నా ముందు నడుస్తున్నాడు.
అతనిచేతిలో పదునైన వేట కొడవలి వుంది.
ముళ్ళ కంపలూ, అడవి ఈగలు, చెట్టుకొమ్మలూ కొడవలితో నరికి దూరంగా పారేస్తూ- దారి చేస్తున్నాడు రాగ్యా.
గురుడాచలం, నలుగురు సాయుధ పోలీసులు రాగ్యా చూపించిన దారిలో నడుస్తూ సాగిపోతున్నారు.
లోపలికి వెళ్తున్నకొద్దీ క్రమంగా వెల్తురు పల్చబడి, చీకట్లు ముసురుకొంటున్నాయి.
పొడవుగా సాగిన గుబురు కొమ్మలు గాలికి కదుల్తూ ఆకాశంలో కసువూడుస్తున్నట్టుంది!
కదిలే ఆకుల సందుల్లోనుంచి దొంగచాటుగా అడవిలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తూ- సూర్య కిరణాలు విఫలవౌతోన్నాయి.
వాళ్ళు అలాగే ముందుకు సాగిపోతున్నారు.
పాదాల క్రింద నలిగిన ఎండుటాకుల చప్పుళ్ళకు ఉడుతలు, కుందేళ్ళూ ఛెంగున దూకి పొదల్లోకి పారిపోతున్నాయి.
గూటి పక్షుల వౌన ధ్యానం భగ్నమై గడగడలాడుతున్నాయి.
ఒకచోట ఆగాడు!
ఒకటే దుర్వాసన!
జంతువు వేటాడి చంపినమనిషో.. మనిషి వేటాడి చంపిన జంతువో- కుళ్ళి కళేబరం నుంచి వస్తున్నదా వాసన.
ముక్కులు మూసుకొని గబగబా నడుస్తూ ముందుకు సాగిపోయాడు..కొంతదూరం నడిచాడు..
కొద్దిపాటి మైదానం వచ్చింది!
చెట్లు అడ్డు లేకపోవటంతో గాలి ధారాళంగా వీస్తూ హాయనిపించింది.. తృప్తిగా గాలి పీల్చున్నారు.
ముందుకు కదిలారు. మైదానం దాటి వెళ్తున్నారు!
ఒక చోట ఎందుకో రాగ్యా ‘అక్కడే ఆగండి’ అన్నట్టు చేత్తో సైగ చేసాడు.
(ఇంకా ఉంది)

భారతీయ సంస్కృతీ మూల సూత్రాలు

$
0
0

భారతీయ అనే మాటకు ’ భా ’ అనే ధాతువు ఆధారం. భ యంటే ప్రకాశించు అని అర్థం. సమ్యక్ కృత అంటే బాగుగా చేయబడిన అని తాత్పర్యం. మానవుడు ప్రకృతిసిద్ధంగా సాగిపోతుంటాడు. అందుకు భిన్నంగా జీవిస్తే వికృతి. ప్రాకృతిక జీవనం సానపట్టినట్లయితే సంస్కృతి భారతీయ సంస్కృతిని శ్రేయస్సు అభ్యుదయము అనే రెండు మూలసూత్రాలపై ఆధారపడింది. సుఖము శాంతి రెండింటినీ లక్ష్యంగా చేసుకున్నది. సుఖము శరీర ధర్మము- శాంతి మనోధర్మము- శరీరము- మనస్సు- బుద్ధి- ఆత్మ నాల్గింటి సంతులనాన్ని భారతీయ సంస్కృతి సాధిస్తున్నది. ఇందుకు మూల సూత్రాలు వేదములలో ఉపనిషత్తులలో చెప్పబడ్డాయి. ఈ గ్రంథాలు భారతదేశంలోనే పుట్టినా వాటి ప్రయోజనం విశ్వమానవాళిని ఉద్దేశించినవే.
‘‘సర్వేజనాఃసుఖినోభవంతు
సర్వేః సంతునిరామయాః
సర్వేభద్రాణి మశ్వంతు
మాకశ్చిత్ యఃఖ భాన్ భవేత్’’
ఈ మూల సూత్రంతో భారతీయ ధర్మం నిలబడింది. దేశంలో ఒక మనిషి కాదు, కుక్క పస్తుపడుకున్నా స్వాతంత్య్రం వచ్చినట్లు కాదు అన్నాడు స్వామి వివేకానంద. శ్రుతులు శాశ్వతము స్మృతులు దేశకాలముల కనుగుణంగా మారుతాయి. ధర్మార్ధకామమోక్ష చతుర్విధ పురుషార్ధ సాధన మానవ జీవన లక్ష్యంగా మనవారు నిర్వచించారు.
‘ఒక జాతి అనేక కాలములలో ఫురోగమించిన సంవిధానమునందు సముద్భవించిన సౌమసేన విశేషమే సంస్కృతి.’’
ఈ వాక్యానికి అర్ధం ఏమిటంటే ఒక జాతి తన జీవన ప్రవాహంలో అనేక ఘట్టములను దాటి ముందుకు సాగిపోతున్నప్పుడు కాలక్రమంలో గుబాళించిన మానవీయ మూల్యములు మూలములు పాలపై మీగడ తరగలవలె మిగిలినవి. సంస్కృతిగా నిర్వచింపబడుతాయి. ఇట్టి సంస్కృతి ప్రతి జాతికీ ఆయా జాతుల జీవనక్రమాన్నిబట్టి రూపొందింపబడుతుంది. ప్రతి జాతిలోను కొందరు మహాపురుషులు జన్మిస్తారు. వారి త్యాగములు జీవనశైలి తర్వాతి తరముల వారికి పాధేయముగా ఉపాదేయముగా మిగిలిపోతుంది. ఈ మార్గదర్శక మూల సూత్రములనే సంస్కృతి అంటున్నాము. ఈ జీవ భావగతమైన ప్రేరణ క్లిష్ట పరిస్థితులలో ఆయా ఋషులు ఎలా ఆవిష్కరించారో దానిని ధర్మము అని నిర్వచిస్తున్నాము. ధర్మము వ్యక్తిగతమైనది కావచ్చు. జాతిగతమైనది కావచ్చు. ప్రాచీన కాలంలో ధర్మము అనే పదం ఎక్కువ ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది. నేడు సంస్కృతి అనే మాట ఆ స్థానాన్ని ఆక్రమించింది. ధర్మశబ్దం తెలుగులోవాడే అర్ధం వేరు. హిందీలో అర్ధం వేరు. హిందీలో ‘్ధర్మం’ అంటే మతం అనే అర్ధంలో ప్రయోగిస్తున్నారు (రెలిజియన్). ఈ సంస్కార సారాంశమే సంస్కృతి. సంస్కృతి లేనివాడు సంస్కారహీనుడు. అట్టి వాడు నేడు భారత జాతిలో ఉన్నాడు. అమెరికా గడ్డపై నిలిచినప్పుడు ఆ జాతిలోని పుణ్యపురుషులైన లింకన్ ప్రభృతులను గౌరవించటం సంస్కృతి. మరి భారతదేశంలో ఉన్నప్పుడు ఈ జాతిని నిర్మించిన ప్రాచీన మహాకవులు వ్యాస భాస వాల్మీకులును ఈ జాతి దేవతలుగా భావించిన రామకృష్ణ పరమహంసను గౌరవించవలసిన బాధ్యత ఈ జాతీయుల మీద ఉంది. అందుకు భిన్నంగా ప్రవర్తిస్తే సంస్కారహీనులు అనిపించుకుంటారు.
ఇలియడ్ రచించిన ట్రామ్ కథ గమనించాలి. అందలి కథానాయిక హెలెన్ వారి సంస్కృతికి చిహ్నము. భారతీయుల రామాయణం చూడండి. మన రామాయణంలోని సీత భారతీయుల సంస్కృతికి సంకేతము. ఎడ్వర్డు చక్రవర్తి ప్రేమకోసం సింహాసనం త్యజించాడు. రాముడు ధర్మంకోసం భార్యను త్యజించాడు. ‘ఆరాధనాయ లోకస్య’అనే రాముని ధర్మం ఇది భారతీయ ఆదర్శం.
అహింసా పరమోధర్మః అని భారతీయ వేదాంత ఆదర్శము ఐతే రాముడు కేవలం ఒక్క స్ర్తికోసం అంతటి లంకానగరిని ధ్వంసంచేయటం తగునా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతములో స్వాతంత్య్ర సముపార్జన చేశారు కదా- అని ఉదాహరణ చూపిస్తున్నారు. మహాత్ముడు నౌకాళీ దురాగతాలు జరిగిన తర్వాత అక్కడికివెళ్లి చూచాడు. ఎందరో స్ర్తిలు చెరచబడ్డారు. ఎందరి ఆస్తులో ధ్వంసమైనాయి. ఎందరినో పాకిస్తానీయులు పొట్టనబెట్టుకున్నారు. ‘ఏమయ్యా’ మీకింత అన్యాయం జరుగుతుంటే ఎట్లా సహించి ఊరుకున్నారు? అని ప్రశ్నిస్తే మీరేకదా స్వామీ! అహింసా బోధ చేశారు. అని వారు ఎదురుప్రశ్న వేశారు. ‘అయ్యో నేను జీవించి ఉండగానే నా అహింసామార్గం ఇంతటి వక్ర భాష్యానికి గురిఅయిందే’ అని గాంధీగారు విలపించారు కాబట్టి భారతీయులలో హింస, శక్తిహీన సంస్కృతి కాదని తాత్పర్యం.
భారతీయ సంస్కృతికి స్ర్తి గోవు, వేదము మానబిందువులు. వాటికి అవమానము జరిగినప్పుడు చేసెడి హింస అహింసయేనని ధర్మసూక్ష్మము.
వ్యక్తిశీలము గొప్పది. సమాజశీలము ఇంకా గొప్పది. ఇదొక ధర్మసూక్ష్మము. శరణాగతి భారతీయ సంస్కృతి. ఐతే గోరీ మహమ్మద్‌ను పృథ్విరాజ్ క్షమించి వదిలిపెట్టటం శరణాగతి కిందికి రాదు. ఇదొక ధార్మిక అపార్థము. స్వతంత్ర వీర సావర్కార్ భాషలో ‘‘సజ్జన వికృతి.’’, విగ్రహారాధన మన సంస్కృతిలో భాగము. ఐతే నాస్తికులు దీనిని పరిహసిస్తారు. విగ్రహంముందు నిల్చొని భక్తుడు ‘సహస్ర శీర్షం దేవం’అని మంత్రము చదువుతాడు. అంటే జనతా జనార్హన భావము ఇందులో దీని ప్రబోధము. ఇదే ఆలయ సంస్కృతీ సందేశము. ఐతే అదికూడా అఖండ భారత సంస్కృతిలో అంతర్భాగమే. సంస్కృతి ఆ జాతి సంగీతంలో సాహిత్యంలో జీవన విధానంలో కూడా ప్రతిబింబిస్తుంది. ఒక యుగంలోని ఒక దేశంలోని సాహిత్యాన్నిబట్టి ఆ యుగపు దేశపు సంస్కృతీ స్థాయిని మనం నిర్ధారింపవచ్చు.
ఆధునిక యుగంలో మనపై సాంస్కృతిక మతపరమైన దాడులు ఉధృతమైనాయి. ఇట్టి దశలో మహాకవులు తమ కలాలను గళాలను విప్పారు.
‘‘అతి మనోబుధ్య హంకృతులౌపనిషదు
వాత్తగండూషికత్రము లౌర్వవహ్ని
గర్ఛితాంతః తపస్కులు ఘనులు ఋషుల
కెవ్వరు విరోధి, తద్వధ కెత్తినయది’’అని విశ్వనాథ సత్యనారాయణగారు తన లేఖిని చూపించారు.
సంస్కృతి ఒక జాతియొక్క సర్వభావ సమాహారదృ వ్యక్తి- సమష్టి- సృష్టి- పరమేష్టి ఈ నాల్గింటి సమన్వయాన్ని భారతీయ సంస్కృతి సాధిస్తుంది. మానవునికి శరీరం ఉన్నట్లే ఒక దేశానికి భూభాగం (టెర్రిటరీ) ఉంటుంది. అందుకే రెండువేల సంవత్సరాల తర్వాత కూడా వారు కలియ గలిగారు. సంస్కృతి శిల్పంలో చిత్రలేఖనంలో సాహిత్య సంగీత రూపకాలల్లో ప్రతిబింబిస్తుంది. మన సమకాలీన సాహిత్య సంగీతాలనుబట్టి మన సంస్కృతిని అంచనా వేయవచ్చు.


ప్రజల మనిషి -వట్టికోట ఆళ్వారుస్వామి

$
0
0

సాంప్రదాయక విద్యలకు దూరమైనప్పటికీ లోకానుభవం చేత, విజ్ఞతచేత తాను గ్రహించిన విజ్ఞానాన్ని ఆ వూరి ప్రజల అభ్యున్నతికి వినియోగించటానికి ఆయన సమకడతాడు. ముఖ్యంగా ఇందులో గమనించవలసిన విషయం తెలంగాణ ఉద్యమానికి ఆలంబనమైనటువంటి గ్రంథాలయోద్యమం మనకు అనుశ్రుతంగా కనిపిస్తుంది. నిజామాబాద్‌లో జరపదలచిన గ్రంథాలయ మహాసభలకు నిజాం ప్రభువు అనుమతి నిరాకరించటం దగ్గర నుంచి తన వూళ్లో గ్రంథాలయం అక్కడి పీడిత ప్రజలకు తమ జీవన సమస్యల చర్చలకు కేంద్రం కావటం నుండి చివరికి విజయపతాక కూడా అక్కడే ఎగరవేయటం గ్రంథాలయ ప్రాశస్త్యాన్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా తెలుగు ప్రజలో సాంస్కృతిక అణచివేతకు తార్కాణమైనటువంటి ఆ నిజాం పాలనకు వ్యతిరేకంగా వట్టికోట ఆళ్వారుస్వామిగారు తెలుగు ప్రజల సమైక్య సాంస్కృతిక ఉద్దీపనానికి ఈనవల ఒక సాధానంగా వాడారు.
సాహిత్యం సమాజహితాన్ని కోరితే ప్రజల మనిషి ప్రజల సమభ్యున్నతిలో సాహిత్య సాంస్కృతిక పార్శ్వంతోపాటు భూస్వామ్య దోపిడీ నుంచి ప్రజలు విముక్తం కావలసిన అంశాన్ని మరింత స్పష్టం చేసింది. ఇందులో చాలా చాలా ఉపఘట్టాలుగా చెప్పవలసినవి చాలా ఉన్నాయి. ఒకటి పేదవారి యొక్క వారి నిరాశ్రయుతను ఆధారం చేసుకుని వారికి భూమి, పుట్ర, చదువు, ఉద్యోగం ప్రలోభం చూపి వారిని తమ మతంలోనికి మార్చుకోవటానికి ఇత్సే ముస్లిమీన్ అంటే రజాకార్లు చేసిన ప్రయత్నాల్ని చాలా అద్భుతంగా వారు చిత్రించారు. అలాగే క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి ఈ మతాంతరీకరణ చర్యలపట్ల కూడా ఒక రకమైనటువంటి ఆక్షేపణను వారు పొందుపరచారు. ఆనాటి నిజాం పాలనలో అన్నివర్గాలవారు కూడా ఎట్లాంటి మినహాయింపు లేకుండా వెట్టి చాకిరీకి లోనైనటువంటి విషయాన్ని వేదాల రఘునాథాచారి గారి భార్య ఆండాళమ్మ దొరవారి ఇంట్లో పెళ్లికి విస్తరాకులు కుట్టడం దగ్గరనుంచి కింది స్థాయి వరకు అందరు ఎలా ప్రతిఫలం లేకుండా పనిచేయవలసి చూపారు.
-సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

శ్రీనరసింహ శతకము

$
0
0

సీ తల్లిదండ్రులు భార్య - తనయులాప్తులు బావ
మఱఁదులన్నలు మేనమామనగారు,
ఘనముగా బంధువుల్ -గల్గినప్పటికైన
దాను దర్లగ వెంటఁ దగిలిరారు
యముని దూతలు ప్రాణమపహరించుకపోవ
మమతతోఁబోరాడి మాన్పలేరు
బలగ మందఱు దుఃఖపడుట మాత్రమె కాని
యించుక నాయుష్య మియ్యలేరు
తే చుట్టములమీది భ్రమదీసి చూరఁబెట్టి
సంతతము మిమ్ము నమ్ముట సార్థకంబు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
భావం: ఓ నరసింహస్వామీ! తల్లీ, తండ్రీ, ఇల్లాలు, పిల్లలూ అన్నదమ్ములూ.. మొదలైన మొదలైనవారు ఎందురున్నా చనిపోయేటప్పుడు వెంటవచ్చే వారెవ్వరులేరు. ప్రాణాల్ని హరించుకుని పోయే యమదూతల్ని అడ్డగించి నిలపే వారొక్కరు లేరు. వీరందరూ ఏడ్చేవారే గాని ఆయుస్సు నిచ్చేవారు గారు. కాబట్టి ఈ బంధువులపై మమకారం విడిచి ముక్తి ప్రదాతవైన నిన్ను నమ్ముకోవటమే మంచిది.

maatata

$
0
0
Cross Image: 
Date: 
Tuesday, January 8, 2019

యువతీయువకులకు వివేకానందుడే స్ఫూర్తి

$
0
0

బొబ్బిలి, జనవరి 7: స్వామి వివేకానంద ఆశయాలను స్ఫూర్తిగా చేసుకుని విద్యార్థులంతా చైతన్యవంతం కావాలని బీసీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వంశీయాదవ్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థానం ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానంద 156వ జయంతిని పురస్కరించుకుని జనజాగరణ సమితి ఆధ్వర్యంలో సోమవారం ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి యువతరానికి వివేకానందుడు మార్గదర్శకమేనన్నారు. ఈ మేరకు శివశక్తి జిల్లా అధ్యక్షులు చెలికాని కేశవ, బిజెపీ రాష్టక్రార్యవర్గ సభ్యులు పుల్లెల శ్రీనివాసరావులు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ వివేకానందుని జీవితాన్ని స్పష్టం తెలుసుకుని ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలన్నారు. పట్టుదల, కార్యదీక్ష ఉంటే ఎటువంటి ఇబ్బందులైన ఎదుర్కోవచ్చునని నిరూపించిన వ్యక్తి స్వామి వివేకానంద ఒక్కరేనన్నారు. జనజాగరణ సమితి విజయకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు జన్మభూమి
గరుగుబిల్లి, జనవరి 7: ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకే జన్మభూమి- మా ఊరు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎంపీడీఓ ఉషారాణి తెలిపారు. సోమవారం గంగాడ, నూకలవాడ గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైనవారందరికీ సంక్షేమపథకాలు అందుతున్నది లేనిది గుర్తించి వారికి అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం పశువైద్యశిబిరాన్ని ప్రారంభించి డాక్టర్ గణేష్ ఆధ్వర్యంలో 100 పశువులకు చికిత్సలు, 600 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను వేయించారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి విద్యార్థులకు సక్రమంగా పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు విధిగా హాజరై విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రామకృష్ణ, ఇఓపీఆర్‌డీ దేవకుమార్, సహాయ పశువైద్యాధికారి అజారుద్దీన్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

పనిచేసే ప్రభుత్వానికే పట్టం కట్టాలి: గనులశాఖామంత్రి సుజయ్‌కృష్ణరంగారావు
మక్కువ, జనవరి 7: పనిచేసే ప్రభుత్వానికే పట్టం కట్టాలని భూగర్భగనులశాఖామంత్రి సుజయ్‌కృష్ణరంగారావు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం టీడీపీ మండల అధ్యక్షులు పెంట తిరుపతిరావు అధ్యక్షతన జన్మభూమి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పనిచేసే ప్రభుత్వానికే ప్రతీ ఒక్కరూ పట్టం కట్టాలని, క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించేందుకు సభ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతీ గ్రామానికి ప్రణాళికలు రూపొందించుకుని వాటిని అమలుచేసుకోవాలన్నారు. అదేవిధంగా విభజన చట్టంలో హామీలను అమలుచేయకుండా ఉన్న కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు నేరుగా అందించాలన్నారు. గత జన్మభూమిలో అందించిన వినతులపై తీసుకున్న చర్యలను ఏటీఆర్ రూపంలో చదివి వినిపించి అభ్యంతరాలను స్వీకరించారు. రాష్ట్రం లోటుబడ్జెట్‌లో ఉన్నప్పటికీ 24వేల కోట్ల రూపాయల రుణమాఫీతోపాటు పట్టిసీమ, ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్టు పనులు 70శాతం పూర్తిచేశారని, రాజధాని నిర్మాణం వంటి బృహత్తర కార్యక్రమాలు చేపడుతుందన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న 14 అంశాలలో ఒక్కదానిని కూడా కేంద్ర ప్రభుత్వం అమలుచేయలేదన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే భంజుదేవ్‌లు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం 150 సంక్షేమపథకాలను అందించిందన్నారు.

సమస్యలను పరిష్కరించని సమావేశాలెందుకు?

$
0
0

సీతానగరం, జనవరి 7: ఏళ్లతరబడి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించని ప్రభుత్వ కార్యక్రమాలు ఎందుకని జానుముళ్లవలస గ్రామానికి చెందిన యువత ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు జానుముళ్లవలస గ్రామంలో సోమవారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో గ్రామానికి చెందిన యువత, జనసేన కార్యకర్తలు సమస్యలపై అధికారులను నిలదీశారు. ఈసందర్భంగా మాజీ సైనికుడు వెంకటినాయుడు, జనసేన కార్యకర్తలు వెంకటేష్, తిరుపతి, ధనుంజయ్, శరత్‌లు మాట్లాడుతూ గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని పలు సమావేశాల్లో ఫిర్యాదుచేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదన్నారు. పంట పొలాలకు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. పలు పర్యాయాలు సమస్యలపై ఫిర్యాదుచేసిన వాటి పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారన్నారు. ఈమేరకు సమస్యల పరిష్కారానికే జన్మభూమి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు. అదేవిధంగా గాదెలవలస, అంటిపేట, చినబోగిలి గ్రామాల్లో అధికారులు పాల్గొన్నారు.
రైతు జట్టుసేవలు అభినందనీయం
బాడంగి, జనవరి 7: సేంద్రీయ ఎరువుల వినియోగంతో మేలురకమైన కూరగాయలు, బెల్లం ఉత్పత్తులను తయారుచేస్తున్న రైతు జట్టు ఉత్పత్తి సంఘం సేవలు అభినందనీయమని నాబార్డు సీజీఎం సురేష్‌కుమార్ అన్నారు. మండలం ఎత్తుఖానా సమీపంలో ఉన్న దీక్షామహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు జట్టు ఉత్పత్తుల సంఘం సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న వ్యవసాయ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తు సేంద్రీయ ఎరువులను వినియోగించి సాగుచేస్తున్న కూరగాయలను పండించడం అభినందనీయమన్నారు. అదేవిధంగా సేంద్రీయ ఎరువులతో బెల్లం ఉత్పత్తులను సాగుచేస్తున్నారన్నారు. రసాయని ఎరువుల వినియోగించి తగ్గించేలా రైతులను చైతన్యవంతులను చేయాల్సిన ఆవస్యకత వ్యవసాయ సిబ్బందిపై ఉందన్నారు. దీక్షావెల్ఫేర్ సొసైటీ ముందుకు వచ్చి ఈప్రక్రియలో ముందుకు సాగిందన్నారు. అనంతరం వివిధ పరిమాణాల్లో తయారుచేసిన బెల్లం ఉత్పత్తులు, కూరగాయలను పరిశీలించారు. ఈయన వెంట ఏజీఎం హరీష్, శాస్తవ్రేత్తలు మదులత, శ్రీదేవి, జయశ్రీ, సొసైటీ అధ్యక్షురాలు శాంతికుమారి, ఈశ్వరరావు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పోయింది: శంబంగి
బొబ్బిలి, జనవరి 7: రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పోయిందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బూటకపు ప్రకటనలకు విసుగుచెంది తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ నియోజకవర్గం సమన్వయకర్త శంబంగి వెంకటచినప్పలనాయుడు అన్నారు. జగన్‌పాదయాత్రకు మద్ధతుగా సోమవారం సంఘీభావ పాదయాత్రను నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలోప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు. నిరుద్యోగులు, యువతీయువకులు, సామాన్య ప్రజలను మభ్యపెట్టి పదవిలోకి వచ్చిన బాబు పాలన పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు. జగన్ వస్తేనే రాష్ట్రం అన్నివిధాలా మెరుగవుతుందన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చారని, అందుకు జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారని స్పష్టం చేశారు. ఈయనతోపాటు వైకాపా నాయకులు రాంసుధీర్, ఇంటి గోపాలరావు, సావు కృష్ణమూర్తినాయుడు, విస్సు, అప్పలనాయుడు, సత్యనారాయణ, శంబంగి వేణుగోపాలరావు, తదితరులు పాల్గొన్నారు.

కార్పోరేటీకరణ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి
బొబ్బిలి, జనవరి 7: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో కార్పోరేటీకరణకు చేస్తున్న సంస్కరణలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలన్నీ సార్వత్రిక సమ్మెలో పాల్గొని సత్తా నిరూపించాలని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెసి రాజు పిలుపునిచ్చారు. ఏపీటీఎఫ్ కార్యాలయంలో 6మండలాల నాయకులు, కార్యకర్తల సమావేశం సోమవారం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వలన దేశ ఆర్థిక పరిస్థితితోపాటు వివిధ వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయన్నారు. అలాగే సీపీఎస్‌ను రద్దుచేయాలని, ఒప్పందం, పొరుగు సేవల విధానంలో ఉద్యోగులు పొందే విధానాన్ని రద్దుచేయాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళ, బుధవారాలలో నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెకు ప్రతీ ఒక్కరూ చేయూతనందించి విజయవంతం చేయాలన్నారు. ఈసమావేశంలో ఆ కమిటీ సభ్యులు బలరాంనాయుడు, వెంకటరమణ, ధనుంజయనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

జన్మభూమి అధికారులకు నిరసనల సెగ

$
0
0

గార్లదినె్న, జనవరి 7: చెరువుకు నీరివ్వాలంటూ జన్మభూమి అధికారులను ముకుందాపురం గ్రామస్తులు అడ్డుకున్నారు. అధికారులు గ్రామంలోకి రాకుండా రోడ్డుపై ముళ్లకంప వేసి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా గార్లదినె్న మండలం ముకుందాపురంలో సోమవారం జన్మభూమి కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు రాగా శివారులోనే ప్రజలు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ముళ్లకంప వేసి బైఠాయించారు. చెరువుకు నీరిస్తామని హామీ ఇస్తేనే ఊళ్లోకి రానిస్తామని భీష్మించారు. దీంతో ఎట్టకేలకు హెచ్చెల్సీ డిఇ కుమారస్వామి అక్కడికి చేరుకుని ఈనెల 10 నుంచి నీరు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు ఆందోళన విరమించారు.

హైదరాబాద్‌లో శ్రీనివాస కల్యాణం రద్దు

$
0
0

తిరుపతి, జనవరి 7: టీటీడీ శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 17న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించతలపెట్టిన శ్రీనివాస కల్యాణాన్ని రద్దు చేస్టున్నట్లు టీటీడీ పిఆర్వో డాక్టర్ రవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టీటీడీ 2018, అక్టోబర్ 28న ఆర్గనైజర్ కేటగిరి కింద శ్రీ దత్తగిరి మహరాజ్ ఛారిటుబల్ ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం నిర్వహించాలని నిర్ణయించింది. ఆ తరువాత స్వామివారి కల్యాణం ఫిబ్రవరి 17వ తేదీకి వాయిదాపడింది. ఈ క్రమంలో భక్తుల నుండి విరాళాలను ఆహ్వానిస్తూ శ్రీ శ్రీనివాస కల్యాణం ట్రస్టు కార్యదర్శి బి.కృష్ణంరాజు పేరుతో కరపత్రాలు, లేఖలను ముద్రించడం టీటీడీ దృష్టికి వచ్చింది. విరాళాలందించిన వారికి తిరుమలలో ఎల్ 1 దర్శనం కల్పించడంతోపాటు ప్రసాదాలు, శేషవస్త్రం, అమ్మవారి వస్త్రం, పట్టుపంచ అందిస్తామని కరపత్రాల్లో పేర్కొన్నారు. దాతలందరినీ కల్యాణం జరిగే వేదికపై కూర్చోబెడతామని తెలిపారు. శ్రీనివాస కల్యాణం నిబంధనలను సదరు ఆర్గనైజర్ అతిక్రమించడంతో ఫిబ్రవరి 17న కల్యాణాన్ని టీటీడీ రద్దు చేసినట్లు తెలిపారు. శ్రీనివాస కల్యాణాల సందర్భంగా భక్తుల నుంచి ఎలాంటి విరాళాలు స్వీకరించడం లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. శ్రీనివాస కల్యాణం ట్రస్టుకు భక్తులు అందించే విరాళాలతో టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని తెలియజేశారు.


ధవళేశ్వరంలో డ్రగ్ మాఫియా హల్‌చల్

$
0
0

ధవళేశ్వరం, జనవరి 7: ధవళేశ్వరంలో గంజాయి మత్తులో యువకులు కత్తులతో దాడి చేసుకుని హత్యాయత్నం వరకూ దారితీసే పరిస్థితి చోటు చేసుకుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరం గ్రామంలో ఈ మధ్య కాలంలో బయట నుంచి గంజాయి సరఫరా ఎక్కువ కావటంతో యువత అటువైపు ఆకర్షితులవుతున్నారు. గతంలో ఒకటీ రెండు సార్లు గంజాయికి సంబంధించి కేసులు పోలీసు స్టేషన్ వరకూ వచ్చినా పోలీసులు వాటిపై పూర్తిగా దృష్టి సారించకుండా మామూళ్ల ముసుగులో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇది అలుసుగా తీసుకుని ఏకంగా హత్యాయత్నం వరకూ దాడులు హెచ్చుమీరుతున్నాయంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో చెప్పకనే స్పష్టమవుతోంది. సోమవారం మధ్యాహ్నం స్థానిక ఇందిరా కాలనీ వద్ద కొంత మంది యువత గంజాయి మత్తులో బైకులపై హల్‌చల్ చేస్తుండగా స్థానికంగా ఉన్న యువకులు, మహిళలు వారిని నివారించే ప్రయత్నం చేయగా అడ్డగించిన వారిపై యువకులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గంపల రవికుమార్, అతని మేనత్త సత్యవేణిలను ప్రభుత్వాసుపత్రికి తరలించగా, గంజాయి మత్తులో హల్‌చల్ చేసిన చిన్న కేతా, పెద్ద కేతా, కిళ్లి, బింటులను కూడా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన పోలీసుల సమక్షంలో జరగటం గమనార్హం. స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులు ఘటనపై పోలీసు స్టేషన్ ఎదుట రాస్తారోకో నిర్వహించగా, ఇన్‌ఛార్జి డీఎస్పీ భరత్ మాతాజీ సంఘటనా స్థలానికి చేరుకుని దోషులను కఠినంగా శిక్షిస్తామని, కేసు పూర్వాపరాలు పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళనను విరమించారు. ధవళేశ్వరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పహరా కాస్తున్నారు.

ఫిబ్రవరి 12 నరసన్న కళ్యానోత్సవాలు
మలికిపుం,జనవరి 7: దక్షిణా కాశీ గా పేరొందిన శ్రీలక్ష్మీనరసింహా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఫిబ్రవరి 12 నుండి 20 తేదీ వరకూ జరుగుతాయని రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుతెలిపారు. సోమవారం అంతర్వేది ఆలయం వద్ద కళ్యాణోత్సవాల కరప్రతాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కెకిరణ్ ఏసీ ఎం లక్ష్మీనారాయణ, ఎం రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

కిర్రాబు ఆనకట్ట నిర్మించేంత వరకు జన్మభూమి జరగనివ్వం

$
0
0

రాజవొమ్మంగి, జనవరి 7: మడేరువాగుపై కిర్రాబు గ్రామం వద్ద ఆనకట్ట నిర్మించేంత వరకు జన్మభూమి కార్యక్రమాన్ని జరగనివ్వమని గిరిజనులు భీష్మించారు. మండలంలో లబ్బర్తి గ్రామంలో స్పెషలాఫీసరు గౌతమి, నోడల్ అధికారి రవితేజ ఆధ్వర్యంలో వెళ్లిన అధికారుల బృందాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. తాము గత పదేళ్లుగా పోరాటం చేస్తున్న ఈ సమస్యను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోడంలేదని గిరిజన సంఘం నాయకులు వంతుబాలకృష్ణ, పెద్దిరాజులు ఆగ్రహం వ్యక్తం చేసారు. వేలాది ఎకరాలకు పంటనీరు అందక ఎండలు ఎండిపోతున్నాయని, పంటలకు పెట్టిన పెట్టుబడులు రాక రైతులు అప్పులు పాలైపోతున్నారన్నారు. అనకట్ట నిర్మిస్తే సుమారు 20 గ్రామాలకు చెందిన వేలాది మంది రైతులు లబ్ధిపొందుతారన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగానినాదాలు చేశారు. ఈ నిర్మాణం చేపట్టేంత వరకు జన్మభూమిని ఈ గ్రామాల్లో జరగనివ్వమని హెచ్చరించారు. పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న జన్మభూమి కార్యక్రమానికి గ్రామస్థుల్ని వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆందోళనకారులు వెళ్లిపోయిన తరువాత కొంతమందికి చంద్రన్న కానుకలు అందజేసి జన్మభూమి అయ్యిందనిపించారు. స్థానిక సీఐ వెంకట త్రినాధ్ ఆధ్వర్యంలో పోలీసులను మోహరించారు. కాగా రెండో నోడల్ బృందం తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చికిలింతలో జన్మభూమి నిర్వహించారు. గిరిజన సంఘం నేతలు సమస్యల్ని జన్మభూమిలో ఏకరువుపెట్టారు. గర్రంగి- చికిలింత, కరుదేవుపాలెం-జడ్డంగి బిటి రహదారులు నిర్మించాలని, రక్షిత మంచినీటి పథకాలు ఏర్పాటు చేయాలని, రోళ్లగడ్డ చెరువు అభివృద్ధి చేయాలని, పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని గిరిజనులు కోరారు. ఈ మేరకు వినతి పత్రాలను గిరిజనులు అధికారులకు అందజేశారు. 70 శాతం సబ్సీడీపై గిరిజనులకు రెండు ట్రాక్టర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కె నూకరత్నం, సొసైటీ అధ్యక్షులు జి తాతారావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రూ.8కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్: కలెక్టర్ మిశ్రా
కాకినాడ సిటీ, జనవరి 7: జిల్లా కలెక్టరేట్ ఆవరణలో 8కోట్ల రూపాయల వ్యయంతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తున్నామని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. కమాండ్ కంట్రోల్ భవనానికి సంబంధించి సివిల్ వర్క్స్, ఫైర్‌సేఫ్టీ పనులను ఆయన సోమవారం స్వయంగా పరిశీలించారు. భవన నిర్మాణ పనులను ఈనెలాఖరుకు పూర్తిచేయాలని కలెక్టర్ మిశ్రా కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెంట జాయింట్ కలెక్టర్ మల్లికార్జున ఉన్నారు.

ప్రధాని నిర్ణయానికి స్వాగతం
*బీజేపి జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య
కాకినాడ సిటీ, జనవరి 7: అగ్రకులాల్లో ఉన్న పేదవారికి ప్రధానమంత్రి నరేంద్రమోడి పదిశాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షలు యెనిమిరెడ్డి మాలకొండయ్య తెలియజేశారు. ప్రధానికి హర్షం వ్యక్తం చేస్తున్నామని, అగ్రకులాల్లో ఉన్న పేదలకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికే జన్మభూమి

$
0
0

కాకినాడ సిటీ, జనవరి 7: ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం జన్మభూమి - మాఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ కోర్టుహాలు నుండి ఆయన జిల్లా శాఖాధికారులు, జన్మభూమి ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఆరవ విడత జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, ప్రజలు హాజరై తమ సమస్యలను అధికారులకు తెలియజేయాలని కోరారు. ఇప్పటి వరకు జిల్లాలో 9,660 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి తక్షణ పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సామర్లకోట, కొత్తపేట, ఏలేశ్వరం, ముమ్మిడివరం, కిర్లంపూడి, కోరుకొండ, కపిలేశ్వరపురం, కె గంగవరం, కాట్రేనికోన మండలాల్లో ప్రజలు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ మిశ్రా ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో జేసి ఎ మల్లికార్జున, జేసి-2 సిహెచ్ సత్తిబాబు, కాకినాడ ఆర్డీవో బి రాజకుమారి, డీపీవో జి ఆనంద్, జెడ్పీ సీఈవో విద్యాసాగర్, హౌసింగ్ పిడి వీరేశ్వరప్రసాద్, సీపీవో రత్నంబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జ్వరంతో గిరిజన బాలుడు మృతి
విఆర్‌పురం, జనవరి 7: ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతూ కాకినాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పోందుతూ, గిరిజన బాలుడు మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మండల పరిధి వలస గిరిజన గ్రామమైన సున్నం మట్కా గ్రామానికి చెందిన మడకం కోసయ్య కొడుకు మడకం భూమన్ (9) రాయిగూడెం ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. ఈ విద్యార్థికి గురువారం జ్వరం రావటంతో హాస్టల్ సిబ్బంది స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం వరకూ వైద్యం అందిచారు. అనంతరం శనివారం కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకు వెళ్లగా సాయంత్రానికి మళ్లీ జ్వరం రావటంతో, రేఖపల్లి పీహెచ్‌సీకి తీసుకువెళ్లగా విద్యార్థిని పరీక్షించిన వైద్యులు, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ తరలించారు. కాకినాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స నిర్వహిస్తుండగా సోమవారం భూమన్ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

అభివృద్ధికి సహకరించాలి

$
0
0

రామచంద్రపురం, జనవరి 7: రాష్ట్రంలో పశు సంపదను అభివృద్ధి చేసే కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని, అందుకు అనుగుణంగా అధికారులు కృషిచేయాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు. కోటిపల్లి గ్రామంలో సోమవారం వివిధ శాఖలు వైద్యసేవలందిస్తున్న సందర్భంగా పశువైద్య శిబిరం వద్ద మంత్రి యనమల, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆగి పశు సంవర్ధకశాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకురాలు డాక్టర్ ఎల్ అనిత నేతృత్వంలో పుంగనూరు ఆవు, ఒంగోలు ఆవు, ముర్రా గేదె, గొర్రె, మేకపిల్లల ప్రదర్శన నిర్వహించినట్టు ఆమె తెలిపారు. శాఖాపరంగా ప్రతి పంచాయితీకి రెండువేల రూపాయలు విలువ చేసే మందులను తమ శాఖ అందిస్తోందని, ఆ సొమ్ముతో ఆయా గ్రామాల్లోని రైతులకు సేవలందిస్తున్నట్టు చెప్పారు. వైద్య శిబిరాల నిర్వహణ ద్వారా పశువులకు వైద్యం చేస్తున్నట్టు చెప్పారు. దాణాకు బదులుగా అజొల్లా పంపినట్టు చేస్తున్నట్టు ఆమె వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఒక మేకపిల్లను ఎత్తుకుని కాసేపు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారులు డాక్టర్ కృష్ణార్జున, డాక్టర్ జాన్‌పాల్, డాక్టర్ నిఖిల్‌వర్మ, డాక్టర్ సురేష్‌బాబు తదితరులు సేవలందించారు.
భోగిమంట వెలిగించిన యనమల
కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో సోమవారం ఆరో విడత జన్మభూమి సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో పాల్గొనేందుకు వచ్చిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సంప్రదాయ సిద్ధమైన భోగిమంటను వెలిగించారు. హరిదాసు వేషంలో ఒక విద్యార్థి ఉండగా భోగి మంటల సంబరాన్ని యనమల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, సొసైటీ అధ్యక్షుడు అడపా నారాయణస్వామి, జడ్పీటీసీ మేడిశెట్టి రవికుమార్, డీఎస్పీ జయంతి వాసవీ సంతోష్, ఆర్డీవో ఎన్ రాజశేఖర్, కోటిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ పప్పుల మసేను వెంకన్న (రేవు శ్రీను), బీజేపీ నాయకులు కర్రి చిట్టిబాబు పాల్గొన్నారు.
తృటిలో తప్పిన పెనుప్రమాదం
- అదుపు తప్పి చేలల్లోకి దూసుకెళ్లిన కళాశాల బస్సు
రంగంపేట, జనవరి 7: అధిక వేగంతో వస్తూ అదుపుతప్పిన ప్రైవేటు విద్యా సంస్థకు చెందిన యాజమాన్యం బస్సు. తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులెవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం ఉదయం మండలంలోని వడిశలేరు సమీపాన్న కార్గిల్ వద్ద సూరంపాలెంకు చెందిన ఓ ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఉదయం, సాయంత్రం స్కూల్ బస్సులు అతివేగంతో నడపడంతో ఏడీబీ రోడ్డుపై ప్రయాణించడానికి తాము భయభ్రాంతులకు గురవుతున్నామని ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కళాశాల యాజమాన్యాలు, పోలీసు శాఖ తగు శ్రద్ధ వహించి బస్సుల మితిమీరిన వేగాన్ని కంట్రోలు చేయించి తమ పిల్లల ప్రాణాలను కాపాడాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఎన్నికల కమిషన్ మాన్యువల్ ప్రకారమే ఈవీఎంల పరిశీలన

$
0
0

కాకినాడ సిటీ, జనవరి 7: ఎన్నికల కమిషన్ నిర్ధేశించిన స్టాండర్డ్ మాన్యువల్ ప్రకారం ఓటింగ్ యంత్రాల మొదటి దశ పరిశీలనా ప్రక్రియను నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్‌వి సిసోడియా అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక అంబేద్కర్ భవన్ ఆడిటోరియంలో నిర్వహించిన ఓటింగ్ యంత్రాల ‘్ఫస్ట్ లెవెల్ చెకింగ్’ కార్యక్రమాన్ని కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్ గున్నితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ నిర్వహణకు చేపట్టిన చర్యలను ప్రధాన ఎన్నికల అధికారి సిసోడియాకు వివరిస్తూ జిల్లాలో మొత్తం 4,580 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు బఫర్‌తో కలిపి 11,450 కంట్రోల్ యూనిట్లు, 14,656 బాలెటింగ్ యూనిట్లు, 12,366 వివిపాట్ యంత్రాలు జిల్లాకు కేటాయించినట్టు తెలిపారు. ఈ యంత్రాలకు 20మంది బీహెచ్‌ఈఎల్ ఇంజినీర్ల సహకారంతో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎఫ్‌ఎల్‌సీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎఫ్‌ఎల్‌సీ కేంద్రం లోపల, బయట పటిష్టమైన భద్రతకు చేపట్టిన చర్యలను, సిబ్బంది మొహరింపును జిల్లా ఎస్పీ విశాల్ గున్ని ఆయనకు వివరించారు. అంబేద్కర్ భవన్‌లో చేపట్టిన పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల పట్ల సీఈవో ఆర్‌పి సిసోడియా సంతృప్తి వ్యక్తం చేశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో యంత్రాల తనిఖీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, మొత్తం ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయాలని సూచించారు. సీఈవో, ఎలక్షన్ కమిషన్‌ల పరిశీలనకు వెబ్‌కాస్ట్ చేయాలని, ఎఫ్‌ఎల్‌సీ ప్రక్రియలో పాల్గొన్న ప్రతి వ్యక్తి గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. హాల్ లోనికి ప్రవేసించే సమయంలో, తిరిగి వెళ్లే సమయంలో తప్పనిసరిగా వారిని తనిఖీచేసి పంపాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఓటింగ్ యంత్రాలపైన, వాటి బాక్స్‌లపై గతంలో వినియోగించిన సమయంలో అతికించిన స్టిక్కర్లు, సీళ్ల ఆనవాల్లు లేకుండా పూర్తిగా శుభ్రం చేయాలని సిసోడియా తెలియజేశారు. ప్రతి బటన్ నొక్కి మాక్ పోల్‌తో యంత్రాల పనితీరును తనిఖీ చేసి, వాటిలో రికార్డయిన పూర్వ సమాచారాన్ని పూర్తిగా తొలగించాలన్నారు. ఎన్నికల కమిషన్ నిర్ధేశించిన ప్రామాణిక చర్యలను ఖచ్చితంగా ఎఫ్‌ఎల్‌సీ మొత్తం ప్రక్రియ పారదర్శంగా, ఎవరికీ ఎటువంటి అపోహలు లేని రీతిలో స్వచ్ఛ వాతావరణంలో నిర్వహించాలని ప్రధాన ఎన్నికల అధికారి సిసోడియా తెలియజేశారు. ఈ కార్యక్రమం అనంతరం కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదామును ఆయన సందర్శించి జిల్లాకు కేటాయించిన వివిపాట్ యంత్రాల భద్రతకు చేపట్టిన చర్యలను పరిశీలించారు. భద్రతను మరింత దృఢం చేసేందుకు గోదాము చుట్టూ రక్షణ వలయాన్ని మరింత పటిష్ట పరచాలని ఆయన అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టరేట్‌ను సందర్శించి నూతనంగా ఆధునికీకరించిన ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాలును సిసోడియా ప్రారంభించారు. అదే విధంగా ఆధునికీకరించిన కలెక్టర్ ఛాంబర్, కోర్టు హాలు, నూతనంగా నిర్మించిన వివేకానంద ప్రజాదర్బారు హాలు, నిర్మాణంలో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్‌లను పరిశీలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎ మల్లికార్జున, డీఆర్‌వో ఎస్‌విఎస్ సుబ్బలక్ష్మి, ఆర్డీవో బి రాజకుమారి, ఎఫ్‌ఎల్‌సీ కేంద్రం ఇన్‌ఛార్జి డేవిడ్‌రాజు, బెల్ సంస్థ ఇంజినీర్లు, రాజకీయ నాయకులు ఆర్ వెంకటేశ్వరరావు, బి వెంకటేష్ నాయుడు, డిఎన్‌వి భద్రరావు, జి సింహాచలం, కె గంగరాజు, ఎలక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Viewing all 69482 articles
Browse latest View live