Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

గ్రామాల్లో మరో పార్టీకి అవకాశం ఇవ్వకండి: మంత్రి అచ్చెన్న

$
0
0

కోటబొమ్మాళి, జనవరి 9: 2014 ముందు, తర్వాత ఈ నాలుగున్నర ఏళ్లులో గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకొని ఇంకా ఎవరైనా చేసానని అనుకుంటే వారికి అవకాశం ఇవ్వకుండా తనకే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని అక్కయ్యవలసలో నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించి, అనంతరం బుధవారం గ్రామంలో జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాకలివారికి కూడ 50 ఏళ్లుకు వృద్దాప్య పింఛన్ ఇచ్చేందుకు సీ ఎం దృష్టికి తీసుకువెళ్తానని, ఇంతకు ముందు మత్స్యకార, ఎస్సీ, ఎస్టీలకు ఈ తరహాలో పింఛన్ మంజూరు చేసామని, వారికి కూడ అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. గత మ్యానిఫెస్టోలోని శతశాతం అంశాలను పూర్తి చేసామన్నారు. ఇకపై డీజిల్, పెట్రోల్ అవకాశం లేకుండా సోలార్ విధానం ద్వారా అన్ని వాహనాలతోపాటు కరెంటుతో నడిపే ద్విచక్రవాహనాలు, నాలుగుచక్రాల వాహనాలను నడిపిస్తామన్నారు. ఇందుకు కరెంటుతో నడిచే బస్సులను తిరుపతి నుండి ప్రారంభిస్తామన్నారు. సోలార్, కరెంటుల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి అయితే కాలుష్య నివారణ జరుగుతుందన్నారు. పెట్రోల్, డీజిల్ కష్టాలు ఉండవన్నారు. కర్నూలులో సోలార్ పార్కును నిర్మించిన సందర్భంగా సీ ఎం చంద్రబాబునాయుడు కరెంటు చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో బోయిన గోవిందరాజులు మాట్లాడారు. ఎంపీపీ రామకృష్ణ, జడ్‌పీటీసీ పద్మశ్రీనివాస్, మండల నోడల్ బృందం, తహసీల్థార్ శివబ్రహ్మనంద్, అధికారులతోపాటు టీడీపీ నాయకులు రమేష్, నాగయ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జన్మభూమి వేదికపై నష్టపరిహారం రగడ
సారవకోట, జనవరి 9: మండలంలో బుధవారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో తిత్లీ తుఫాన్ నష్టపరిహారం చెల్లింపులపై ప్రజలు నిరసన గళం విప్పారు. గొర్రెబంద గ్రామంలో తహశీల్దార్ ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో జరిగిన గ్రామ సభలో పంచాయతీ పరిధిలోని జగన్నాధపురం, బురుజువాడ గిరిజన మహిళలు తిత్లీ తుపాన్ నష్టపరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిసేపు ఈ విషయమై కొంత సేపు రగడ జరిగింది. పోలీసులు ప్రజలను సమదాయించి వేదికవైపు దూసుకొని రాకుండా అడ్డుకొన్నారు. ఉద్యానవనశాఖకు సంబంధించిన అధికారులెవ్వరూ గ్రామసభకు హాజరు కాకపోవడంతో సమాధానమిచ్చే నాధుడు కరువయ్యాడు. అనంతరం తహశీల్దార్ ఈశ్వరమ్మ మాట్లాడుతూ రేషన్‌కార్డ్ కోసం అధికంగా దరఖాస్తులు వస్తున్నాయని, అయితే దరఖాస్తు దారులు గతంలో నమోదైయున్న రేషన్‌కార్డులో తన పేరును తొలగించుకోవాలని, ఆ తదుపరి 1100 నెంబరుకు ఫోన్‌చేసి రేషన్‌కార్డు కొత్తగా కావాలని వివరాలను తెలియజేయాలన్నారు. పంచాయతీ విస్తరణాధికారి ఈశ్వరరావు పంచాయతీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలియజేశారు. ఎంపిడీవో జగదీశ్వరరావు ఆధ్వర్యంలో వాండ్రాయి, చిన్నగుజ్జివాడ గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమాలు నిర్వహించగా ప్రత్యేకాధికారి కోటీశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
23 మంది గర్భిణులకు ప్రత్యేక వైద్యపరీక్షలు
సారవకోట, జనవరి 9: ప్రధాన మంత్రి మాతృత్వ సురక్ష యోచన పథకం కింద స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం గర్భిణులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. గర్భిణులకు రక్తహీనత లేకుండా అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. పౌష్టికాహార విలువలను వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ వీరికి వివరించారు. గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవల్సిన బాధ్యత గర్భిణీపై ఉందన్నారు. ఆసుపత్రి ప్రసావాలకు ప్రధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను, రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. బుడితి సామాజిక ఆసుపత్రిలో గైనకాలిజిస్ట్ డాక్టర్ శృజనాకుమారి గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. హైరిస్క్‌లో ఉన్న గర్భిణీలకు స్కానింగ్ నిర్వహించి మందులను సరఫరా చేశారు.
ఎయిడ్స్ అవగాహనపై ర్యాలీ
జలుమూరు,జనవరి 9: మండలం కుశాలపురం పంచాయతీ కన్నయ్యపేట గ్రామంలో వంశధార డిగ్రీ కళాశాల ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు బుధవారం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ అంటువ్యాధి కాదని, అంటించుకునే వ్యాధి అని దీనిపై ఎవరూ భయపడాల్సిన పనిలేదని విద్యార్థులు ర్యాలీలో పలు నినాదాలు చేశారు. ఆ విద్యార్థులచే ర్యాలీ అనంతరం ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి దుర్గా ప్రసాద్, పలువురు లెక్చరర్‌లు ఎయిడ్స్‌పై ప్రజలకు అర్ధమయ్యే రీతిలో తెలియజేశారు. అనంతరం ఇంటింటా ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. ఈ వ్యాధిపై అనుమానం ఉన్న ఎడల తక్షణమే అందుబాటులో ఉన్న వైద్యశాలకు వెళ్లి తనిఖీలు చేయించుకోవాలని సూచించారు.


గౌతు కుటుంబానికి గిరిజనం ఆదరణ

$
0
0

మందస, జనవరి 9: రాష్ట్రంలోని సీ ఎం చంద్రబాబునాయుడు పాలనను, పలాస నియోజకవర్గంలో పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందరశివాజీ అభివృద్ధి, సంక్షేమానికి గిరిజన ప్రజలు ఆదరణ చూపుతున్నారని, అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీషా అన్నారు. బుధవారం బొగాబంద, కొంకడాపుట్టి, హంసరాళి గ్రామ పంచాయతీలు వద్ద 6వ విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమాలను నిర్వహించారు. ప్రజలు నుంచి వినతులు స్వీకరించారు. చంద్రన్న కానుకలు, పింఛన్లును పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన గ్రామాల అభివృద్ధికి టీడీపీ పెద్దపీట వేసి, ఐటీడీ ఎ ద్వారా అన్ని గ్రామాల్లో వౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. ప్రణాళికలు రూపొందించి గిరిజన గ్రామాల సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయలక్ష్మి, జడ్‌పీటీసీ సవర కుమారి, ఎంపీడీవో బి.రాజేశ్వరరావు, తహసీల్థార్ శ్యామసుందరరావు, ఏ ఇలు శ్రీనివాస్, రాజేష్, ప్రసాద్, టీడీపీ నాయకులు తాతారావు, లింగరాజు, దుర్వాసులు తదితరులు పాల్గొన్నారు.
స్ర్తి నిధి ద్వారా రూ.65 వేల కోట్ల రుణలక్ష్యం
మందస, జనవరి 9: ఈ ఏడాది 16250 మంది సభ్యులకు 65 వేల కోట్ల రుణ లక్ష్యంగా అందించడం జరుగుతుందని జిల్లా వెలుగు ప్రాజెక్టు మేనేజరు సిహెచ్ రామ్మోహన్‌నాయుడు అన్నారు. బుధవారం మందస వెలుగు కార్యాలయంలో సీసీలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12500 మందికి 58 కోట్ల రూపాయలు అందించాల్సి వుందన్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన జీవనోపాధిని పెంపొందించేందుకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. పట్టుపరిశ్రమ, హార్టికల్చర్ రుణాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈయనతోపాటు ఉమామహేశ్వరరావు, కల్యాణచక్రవర్తి, నాగరాజు, రాములున్నారు.

ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు
పలాస, జనవరి 9: ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని పలాస ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గాలి కృష్ణారావు అన్నారు. బుధవారం ఆసుపత్రి ఆవరణలో ప్రధానమంత్రి మాతృత్వ శిశు సురక్ష యోజన కార్యక్రమంలో భాగంగా బాలింతలకు ఎన్‌టి ఆర్ సురక్ష కిట్‌ను అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు చేసుకుంటే 1000 రూపాయలతోపాటు తల్లి,బిడ్డలను సురక్షితంగా ప్రభుత్వ వాహనంలో తరలిస్తామన్నారు. పలాస ప్రభుత్వాసుపత్రిలో ఆధునిక వైద్యపరీక్షలు అందుబాటులోకి వచ్చాయని, నైపుణ్యమైన వైద్యులచే మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రకాశ్‌వర్మ, వైద్యులు రాజ్యలక్ష్మి, హేమచందర్, సిబ్బంది శివప్రసాద్ పాల్గొన్నారు.

సిటు ఆధ్వర్యంలో రాస్తారోకో, పలువురు అరెస్టు
సోంపేట, జనవరి 9: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోంపేట డివిజన్ సిటు ఆధ్వర్యంలో బుధవారం పాలవలస హైవే వద్ద నిర్వహించిన రాస్తారోకోలో ఐదుగురు సిటు నేతలను బారువ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో జరిగిన రాస్తారోకో గంట పాటు జరగడంతో పాలవలస, కొర్లాంల మధ్య సుమారుగా 45 నిముషాల పాటు అటుగా, ఇటుగా వాహనాలు నిలిచిపోయాయి. బారువ ఎస్ ఐ సందీప్‌కుమార్ ఉద్యమకారులను నచ్చజెప్పి ఈ రాస్తారోకోను విరమింపజేసారు. లక్ష్మినారాయణ, భాస్కర్, పాపారావు, ముఖలింగం, సింహాచలంలను బారువ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సమస్యల పరిష్కారానికి గ్రామసభలు
సోంపేట, జనవరి 9: ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కారించేందుకు జన్మభూమి-గ్రామసభలను నిర్వహిస్తున్నామని సోంపేట జడ్‌పీటీసీ చంద్రమోహన్, ఎంపీపీ శ్రీనివాసరావులు అన్నారు. బుధవారం గొల్లగండి, రామయ్యపట్నంల్లో నిర్వహించిన జన్మభూమి-గ్రామసభల్లో పాల్గొన్న వారు సీ ఎం చంద్రబాబునాయుడు వయస్సును లెక్కచేయకుండా అహర్నిశలు పాటుపడుతున్నారని, చంద్రబాబునాయుడును మళ్లీ ఆశీర్వాదించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్థార్ గోపాలరత్నం, ఎంపీడీవో ఈశ్వరమ్మ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
సంతబొమ్మాళి, జనవరి 9: ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వినియోగించుకోవాలని రాష్ట్ర అటవీశాఖ డైరెక్టర్ ఎల్ ఎల్ నాయుడు అన్నారు. బుధవారం చెట్లతాండ్ర, అరికివలస గ్రామాల్లో జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో వున్న ప్రజల సంక్షేమం కోసం రుణమాఫీ, పింఛన్లు వంటి పథకాలు నిరంతరం అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కె.కృష్ణవేణి, జడ్‌పీటీసీ లక్ష్మిదేవి, జన్మభూమి కమిటీ అధ్యక్షుడు విష్ణుమూర్తి, ఎంపీడీవో సత్యానారాయణ, మండల ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి, తహసీల్థార్ బి.రామారావులతోపాటు వివిధ శాఖాధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
మధ్యాహ్నాభోజన పథకం పరిశీలన
సంతబొమ్మాళి, జనవరి 9: మండలంలో అరికివలస, చెట్లతాండ్ర, నర్శపురం గ్రామాల్లో జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమాల్లో భాగంగా ఆయా పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్నాభోజన పథకాన్ని తహసీల్థార్ బి.రామారావు పరిశీలించారు. మధ్యాహ్నాభోజన పథకానికి ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఇస్తున్నారని, ఈ పథకం అమలులో అత్యంత శ్రద్ద వహించాలన్నారు. తహసీల్థార్‌తోపాటు ఎం ఇవో చిన్నవాడు, ఉపాధ్యాయులున్నారు.

ప్రజలకు సేవ చేస్తేనే పల్లకి ఎక్కిస్తారు

$
0
0

పోలాకి, జనవరి 9: మండలంలో గల గొల్లలవలస గ్రామంలో బుధవారం జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్మే బగ్గు రమణమూర్తి, డిసిసిబి చైర్మన్ డోల జగన్మోహన్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా డోల జగన్ మాట్లాడుతూ గడిచిన నాలుగన్నరేళ్లలో ప్రభుత్వం ప్రజలకు వౌళిక సదుపాయాలు అందించడంలో ఎక్కడా రాజీపడలేదని ఆయన అన్నారు. ఇంటి యజమాని సమర్ధువంతుడైతే ఆ ఇళ్లు బాగుపడుతుందని అన్నారు. రాష్ట్రం బాగుండాలంటే మనందరిని పాలించే నాయకుడు మంచివాడై ఉండాలన్నారు. అటువంటి నాయకుడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు అని అన్నారు. ఆయన ఆలోచన విధానం ఎప్పుడు బడుగు, బలహీన వర్గాల వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రజారోగ్య విషయంలో ఎన్నో మంచి మంచి పథకాలు రూపొందించారని, వైద్య,విద్య, విద్యార్థులు ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ద్వారా ఆరోగ్య జాగ్రత్తలు, మంచి భోజనం సదుపాయాలతో బాటు స్కాలర్‌షిప్‌లు, నాణ్యమైన విద్యకు సుమారు రూ.15లక్షల వరకు ప్రభుత్వం సమాయం చేస్తుందని ఆయన అన్నారు. ఇవన్నీ చేయడానికి ముఖ్యకారణం ఆయన రాజకీయ అనుభవమే అని ఆయన అన్నారు. రాజకీయం చేయాలంటే ఆవేశపడకూడదని వాటివల్ల గ్రామాల్లో, ప్రజల్లో విబేధాలు చోటుచేసుకుంటాయని ఆయన హితవు పలికారు. మాన్నా డోల సీతారాములు అడుగుజాడల్లో నేను నడవడం వలన నాకు జాతీయ పార్టీలోస్థానం కల్గి శ్రీకాకుళంలో డిసిసిబి చైర్మన్‌గా అర్హతలు పొందే అవకాశం వచ్చిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అలివేలుమంగమ్మ, ఏవో వెంకటరావు, ఏపి ఎమ్ శ్రీనివాస్‌బాబా, ఏపివో సీతారాం, ఆర్‌ఐలు ఢీల్లీశ్వరరావు, త్రినాధ్‌లు, నాయకులు, జెడ్పీటీసీ గొండు రామన్న, ఎంపిపి లక్ష్మీభూషణరావు, ఏ ఎంసి చైర్మన్ బైరి భాస్కరరావు, వెంకటప్పలనాయుడు, రాంబాబు, నారాయణదాస్, ఎంపిటీసి సభ్యులు రామకృష్ణ, తెలుగు నాగేశ్వరరావు, నాయకులు, తదితర అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం
పోలాకి, జనవరి 9: మండలంలోగల ఈదులవలస మోడల్ స్కూల్‌లో ఆరవ తరగతిలో ప్రవేశానికి అంతర్జాలంలో నమోదు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కింజరాపు శ్రీనివాసరావు తెలిపారు. వీటికి గడువు జనవరి 10 నుండి ఫిబ్రవరి 9వ తేదీ వరక ఆన్‌లైన్‌లు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఓసి, బిసి కులాల వారు రూ. 100 పరీక్ష రుసుము చెల్లించాల్సి వుంటుందని, ఎస్సీ, ఎస్టీ కులాల వారు రూ. 30లు చెల్లించాల్సివస్తుందని ఆయన అన్నారు. వీరందరికి ఈదులవలస ఆదర్శ పాఠశాలలో పరీక్షలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. వీటికి సంబంధించి ఎవరైనా తెలుసుకోవాలంటే స్కూల్ యాజమాన్యానికి సంప్రదించాలని ఆయన కోరారు.
ఎన్నికల సమయంలో లోక్ సత్తా నిర్మాణాత్మక పాత్ర
* లోక్ సత్తా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంబాబు
శ్రీకాకుళం (రూరల్), జనవరి 9: ప్రజల జీవితాలతో సంబంధం లేకుండా ఎన్నికలు, రాజకీయ ప్రక్రియ జరుగుతున్న సందర్భంలో జనజీవితాలకు, యువత భవిష్యత్‌కు రాజకీయాన్ని కేంద్ర బిందువు చేయడం కోసం లోక్‌సత్తాపార్టీ ఎన్నికల వలే నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పంచాది రాంబాబు అన్నారు. పార్టీ కార్యాలయలో బుధవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా లోక్‌సత్తాపార్టీ శ్రేణులు, అభిమానులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏక పక్షంగా జరిగిన రాష్ట్ర విభజన తర్వాత విభజన హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్య ఘర్షణ వాతావరణం తప్ప సామరస్యం కొరవడంతో రాష్ట్ర ప్రజల భవిష్యత్ ప్రమాదంలో పడిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాదనలో ఏది నిజమో, ఏది అబద్దమో తెలియక ప్రజల గందరగోళంలో పడ్డారన్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకు లోక్‌సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ సారధ్యంలో వాస్తవాలు అధ్యయనానికి పరిష్కారాలను అందించేందుకు దేశంలో అత్యంత నిష్ణాతులైన 15 మంది సభ్యులు కల్గిన స్వతంత్య్ర నిపుణులు బృందం ఇచ్చిన నివేదికలపై రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరగాలని కోరారు. అందుకోసం జిల్లాలో ఈనెల 13వ తేదీన ఎన్జీహోహోంలో చర్చావేదికను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం రాంబాబును జిల్లా పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు కె.పోలినాయుడు, ఎమ్.సత్యన్నారాయణ, ఉపాధ్యక్షులు ఎ.నాగేశ్వరరావు, నియోజకవర్గ అధ్యక్షులు వి.అప్పలరాజు, బి.జానకిరాం, పి.ఏ నాయుడు, బి.శివకేశవ, పి. ఆనంద్ తదితరులు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు.

పేదరికంలో ఉండి చదువుకునే వారికి ప్రోత్సాహం

$
0
0

శ్రీకాకుళం (రూరల్),జనవరి 9: పేదరికంలో ఉండి చదువుకున్నవారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తూ ప్రత్యేక పాఠశాలను ఏర్పాటుచేస్తుందని రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని పెదపాడు పంచాయతీ చెట్టువానిపేట సమీపంలో రూ. 13.90 కోట్లతో నిర్మించిన మహాత్మా జ్మోతిభాఫూలే ఏపి బిసి గురుకులాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పది గురుకులాలు, రెండు జూనియర్ కళాశాలలు మంజూరు చేసినట్లు తెలియజేశారు. బిసి సంక్షేమ శాఖామంత్రిగా తాను పదవి చేపట్టిన అనంతరం 65 కొత్త గురుకులాలను బిసిలకు రాష్ట్రంలో ఏర్పాటు చేయగా అందులో శ్రీకాకుళం జిల్లాకు కేటాయించామన్నారు. 65 గురుకులాలకు 2,500 ఉపాధ్యాయుల పోస్ట్‌లు మంజూరు చేసి త్వరలో జరిగే క్యాబినెట్‌లో ఆమోదం పొందేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు. బిసి పాఠశాలలో ఖాళీగా ఉన్న 350 పోస్ట్‌లను డి ఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలియజేశారు. కొత్తగా నిర్మించనున్న బిసి సంక్షేమ పాఠశాలలకు ఒక్కొక్క దాని నిర్మాణానికి రూ. 34కోట్లు మంజూరు చేసినట్లు తెలియజేశారు. మంచి విద్య, ఆహారం అందించే లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదేనని అన్నారు. మత్స్యకారుల కోసం రెండు పాఠశాలలు కేటాయించగా అందులో వజ్రపుకొత్తూరులో ఒకటి ప్రారంభించినట్లు తెలియజేశారు. బిసి విద్యార్థులకు మంచి చదువు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రైవేట్ కళాశాలలో ఏ విధమైన కరికులం వినియోగిస్తున్నారో అదే విధానాన్ని బిసి పాఠశాలలో కూడా వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ పాఠశాలకు మంచి భవిష్యత్ ఉందని తెలియజేశారు. ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్ ఉందని, దీనిని అధిగమించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి, బిసి రెసిడెన్షియల్ స్యూల్ సెక్రటరీ క్రిష్ణమోహన్, ఎంపిపి గొండు జగన్నాధరావు, కలగ శివ, టీడీపీ పూర్వపు జిల్లా అధ్యక్షలు చౌదరి నారాయణమూర్తి, తహశీల్దార్ ఎస్.సుధాసాగర్, ఇంజనీరింగ్ అధికారులు, పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బిసిల కృషి ఫలితం గానే జ్యోతిరావుఫూలే విగ్రహం ఏర్పాటు
శ్రీకాకుళం (రూరల్), జనవరి 9: మహాత్మా జ్యోతిరావుఫూలే విగ్రహం పట్టణ కూడలిలో ఏర్పాటుచేయాలని బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కోరగా దాని కృషి ఫలితం గానే పొన్నాడ బ్రిడ్జి సమీపంలో స్థలం కేటాయించి విగ్రహం నెలకొల్పడం జరిగిందని బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పిట్టా చంద్రపతిరావు అన్నారు. బుధవారం స్థానిక ఎన్జీవోహోంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సంఘం నుండి విడిపోయి కొంతమంది విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి కృషి ఫలితంగానే రూ. 20లక్షలు ఖర్చుపెట్టి విగ్రహాన్ని నెలకొల్పామన్నారు. అధికార పూర్వకంగా విగ్రహా ఆవిష్కరణ చేపట్టాల్సి వుందని జిల్లా మంత్రులకు, శాసనసభ్యులకు మరోసారి జిల్లా బిసి సంక్షేమ సంఘం తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు. బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో దీనిని సాధించినట్లు తెలియజేశారు. తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఖండించారు. ఈ కార్యక్రమంలో బాడాన దేవభూషణరావు, మూల నారాయణరావు, వాన కృష్ణచంద్, అమీరుల్లా బేగ్, తంగి సూర్యారావు, రఘపాత్రుని చిరంజీవి, అల్లంశెట్టి హరిబాబు, మైలపిల్లి లక్ష్ముడు, సాధు శ్రీనివాసరావు, బైరి నీలమప్పడు తదితరులు పాల్గొన్నారు.

ఉజ్వల యోజన ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్‌లు
* బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాలం
శ్రీకాకుళం (రూరల్), జనవరి 9: ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా తెలుపు రేషన్‌కార్డ్ కల్గి ఇంతవరకు గ్యాస్ కనెక్షన్‌లు లేని లబ్ధిదారులందరికి ఉచితంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్‌లను అందజేస్తుందని బిజేపీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం అన్నారు. అరసవిల్లిరోడ్‌లోని వేదమాత గ్యాస్ ఏజెన్సీలో బుధవారం గ్యాస్ కనెక్షన్‌లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం రూరల్, గార, ఎచ్చెర్ల మండలాలకు చెందిన లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్‌లును ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేణుగోపాలం మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతుందన్నారు. 129 సంక్షేమ పథాకాలను రూపొందించి ప్రజలకు అందించడం జరుగుతుందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను పేరుమార్చి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పూడి తిరుపతిరావు, కొమర గురుమూర్తి, కలగ అప్పారావు, సంపతిరావు నాగేశ్వరరావు, గ్యాస్ ఏజెన్సీ డీలర్ దుప్పల రవీంద్రబాబు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికే జన్మభూమి
* ఎంపిపి జగన్నాధరావు
శ్రీకాకుళం (రూరల్), జనవరి 9: సమస్యలు పరిష్కారానికే జన్మభూమి- మా ఊరు కార్యక్రమం ఉపయోగపడుతుందని ఎంపిపి గొండు జగన్నాధరావు అన్నారు. బుధవారం మండలంలోని కరజాడ, పెదపాడు గ్రామాల్లో జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు నిర్వహించారు. పెదపాడులో నిర్వహించిన గ్రామ సభకు ఎంపిపి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయినాటికి అప్పుల్లో ఉన్నప్పటికి దానిని అధిగమించి అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించడం జరిగిందని తెలియజేశారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడకు ప్రతీ ఒక్కరు రుణపడి ఉంటారని అన్నారు. ప్రతీ ఇంటికి కూడా ఏదో ఒక సంక్షేమ పథకం అందుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. రేషన్‌కార్డులు, ఇల్లు, పింఛన్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం పార్టీలకతీతంగా అర్హులైన లబ్ధిదారులందరికి అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తేవాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా చంద్రన్న సంక్రాంతి కానుకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి గోపాలకృష్ణ, ఎంపిడీవో బొడ్డేపల్లి శైలజ, తహశీల్దార్ ఎస్.సుధాసాగర్, ఏవో పద్మావతి, కలగ శివ, చిన్నారావు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శి సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.
రెండు కోట్ల రూపాయలతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన
పోలాకి, జనవరి 9: మండలంలోగల తోటాడ మెయిన్ రోడ్ నుండి గొల్లలవలస మీదుగా డోల రోడ్ వరకు రెండు కోట్లరూపాయలతో బీటీ రోడ్‌కు శంకుస్థాపన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులతో మాట్లాడుతూ గ్రామాలకు వెళ్లే మెయిన్‌రోడ్ నుండి వెళ్లే లింక్ రోడ్లు నిర్మాణాలు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చోట్ల భారీగా నిర్మాణాలు జరిగాయని ఆయన అన్నారు. గడిచిన 2014 ముందు 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి పార్టీల నాయకులు గ్రామాల ప్రజలు ఈ రోడ్డుగుండా వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికి వారి బాధలను అర్ధం చేసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. టీడీపీ ప్రభుత్వ హాయంలో ప్రతీ గ్రామానికి సిసి రోడ్లు నిర్మాణాలు, తాగునీరు, సాగునీరు, విద్యుత్, సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందించామని ఆయన తెలిపారు. రాజకీయాలు నాయకుల వరకే పరిమితం కావాలని, గ్రామాల్లో ప్రజలు పార్టీల పరంగా ఇబ్బందులు పడవద్దని ఆయన కోరారు. టీడీపీ ప్రభుత్వంలో అర్హత ఉంటే చాలు,పార్టీలతో పనిలేదని అందరికి అన్ని పథకాల్లోను భాగస్వామ్యం కల్పించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గొండు రామన్న, మండల ప్రత్యేక సలహాదారు తమ్మినేని భూషణరావు, ఏ ఎంసి చైర్మన్ బైరి భాస్కరరావు, వంశధార ప్రాజెక్ట్ కమిటీ ఉపాధ్యక్షులు వెంకటప్పలనాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు కిల్లి వేణుగోపాలస్వామి, సూరపు రామ్‌దాస్, లుకలాపు రాంబాబు, సింహాచలంలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సమష్టిగా ఆలోచించు.. సాహసంతో సాధించు..

$
0
0

‘ప్రపంచ హిందూ కాంగ్రెస్’ మూడవ సమ్మేళనం 2022లో థాయిలాండ్ రాజధాని బ్యాంకాంగ్‌లో జరగనుంది. ఈ సంస్థ తొలి సదస్సు నాలుగేళ్ల క్రితం ఢిల్లీలో జరిగింది. ఆ తర్వాత రెండవ ప్రపంచ హిందూ కాంగ్రెస్ సదస్సు అమెరికాలోని చికాగో నగరంలో 2018 సెప్టెంబర్ 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా జరిగాయి. ‘సమష్టిగా ఆలోచించు, సాహసోపేతంగా లక్ష్యాన్ని సాధించు’ అనే ఆశయంతో ఈ సదస్సు జరిగింది. స్వాతంత్య్రం రాక ముందు, ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో హిందూ సదస్సులు లేదా సమ్మేళనాలు జరిగిన దాఖలాలు లేవు.ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల్లో హిందువులు ఉన్నారు. కాని హిందువులకు మాతృస్థానం అఖండ భారత్, నేపాల్ దేశాలే.
1947లో దేశ విభజన తర్వాత హిందువులు 85 శాతం పైగా ఉన్న దేశం భారత్ ఒక్కటే. నేపాల్ హిందూదేశమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిందువులు తమ జీవన విధానంలో, సామాజిక వ్యవస్థలో ఉన్న అసమానతలను గుర్తించి, వాటిని సరిచేసుకుని ఇప్పుడిప్పుడే సంఘటితమయ్యేందుకు రకరకాల వేదికలు పనిచేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా హిందువులకు ‘ప్రపంచ హిందూ కాంగ్రెస్’ అనే వేదిక ఏర్పాటైంది. ఈ సదస్సును చికాగోలో నిర్వహించేందుకు చారిత్రక కారణముంది. ఈ నగరంలో 125 సంవత్సరాల క్రితం జరిగిన ప్రపంచ మత మహాసభల్లో స్వామి వివేకానంద పాల్గొని తొలిసారిగా హిందూ ధార్మిక జీవన విధానం, విశిష్టతను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. ఈ ప్రసంగం స్ఫూర్తిగా గత ఏడాది సెప్టెంబర్‌లో హిందూ కాంగ్రెస్ సభలను లాంబార్డ్ యార్క్ టౌన్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ సదస్సుకు 60 దేశాల నుంచి మూడువేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. 220 మంది వక్తలు ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, విద్య, రాజకీయాలు, సామాజిక రంగం, మీడియా, మతం, ఆధ్యాత్మికత, హిందువులను సంఘటితం చేయ డం అనే పలు అంశాలపై చర్చ జరిగింది.
హిందువుల ప్రాచీన చరిత్ర, నాగరికత, జీవన విధానం, అప్పటి పాలన తీరు, శాసనాలు, చరిత్ర గురించి ప్రపంచానికి తెలిసింది తక్కువ. అపోహలు ఎక్కువ. ప్రాచీన హిందూ నాగరికత నుంచి నేటి వరకు చరిత్రను డాక్యుమెంటేషన్ చేసే ప్రక్రియపై ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మిగతా మతాల మాదిరిగా హైందవ జాతిని సంఘటితం చేసే లక్ష్యంతో ఈ సదస్సునుప్రారంభిస్తున్నట్లు వరల్డ్ హిందూ కాంగ్రెస్ పేర్కొంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అధిపతి మోహన్ భగవత్ మాట్లాడుతూ- ‘సింహం ఒంటరిగా సంచరిస్తే అడవి కుక్కలు దాడి చేసి చంపేస్తాయి. అందుకే సంఘటితంగా హైందవ జాతి కదలాలి. గత తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. ప్రపంచంలో ఆధిపత్యం, యుద్ధకాంక్ష, పొరుగుదేశాలను ఆక్రమించుకోవాలన్న దుర్బుద్ధి లేని హైందవజాతి ఆర్థికంగా సమగ్రాభివృద్ధికి పాటుపడే లక్ష్యంతో ముందుకు నడవాలి..’ అన్నారు. హిందూ ధర్మం ప్రాచీనమైనది, ఆధునికత తర్వాత మంచి దశ కలిగి ఉన్నదన్నారు. వ్యక్తులు, వర్గంలా కాకుండా, యావత్తు హిందూ సమాజం ఒక్కటే అనే భావనతో పనిచేస్తే హిందువులు రాణించడం తథ్యమన్నారు. కలిసి పనిచేయాలన్న చైతన్యం, సంకల్పం ఉండాలన్నారు. హిందువులు ఎప్పుడూ సంఘటితంగా కదలరు. వీరందరూ ఏకతాటిపైకి తీసుకురావడం పెద్ద సవాలు అని ఆయన అన్నారు.
ప్రపంచ హిందూ కాంగ్రెస్ చైర్మన్ ఎస్‌పీ కొఠారీ మాట్లాడుతూ చైతన్యం, ప్రగతి, సంస్కరణ అనే నినాదంతో ‘ప్రపంచ హిందూ కాంగ్రెస్’ ప్రజలను సంఘటితం చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు చెప్పారు. హిందువుల్లో సంస్కరణలు రావాలని, సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించాలని, అప్పుడే హిందూ ధర్మం వైభవోవేతంగా వర్థిల్లుతుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సమావేశానికి హాజరు కాకపోయినా, మంచి ఉత్తేజ భరితమైన సందేశం ఇచ్చారు. ఆలోచనాపరులు, పండితులు, మేధావులు, వివిధ రంగాల్లో సుప్రసిద్ధులు ఒక వేదికపైకి రావడాన్ని స్వాగతించారు. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనది హిందూమతం. మానవాళి సముద్ధరణకు పాటుపడిన మతం. అనేక సమస్యల పరిష్కారానికి హైందవ ధార్మిక, ఆధ్యాత్మిక జీవన విధానం తోవ చూపిస్తుందన్నారు.
ఆగ్నేయాసియా దేశాలకు ముఖ ద్వారమైన థాయిలాండ్‌లో మూడవ ప్రపంచ హిందూ కాంగ్రెస్ సభలు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయానికి బలమైన కారణముంది. మయన్మార్, కంబోడియా, థాయిలాండ్,కొరియా తదితరదేశాల్లో ఒకప్పుడు హిందూ ప్రాచీన చరిత్ర, నాగరికత విశిష్టత ఉన్నాయి. భారతదేశంతో ఉమ్మడి చరిత్ర, సంస్కృతిని ఈదేశాలు పంచుకుంటున్నాయి. హిందువులపైన ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో జరుగుతున్న దాడులు, ఆకృత్యాలను ఎండగట్టాలని, సామాజిక మీడియాను వేదికగా తీసుకుని ప్రజల్లో చైతన్యం పెంచాలని సదస్సులో తీర్మానించారు. హిందూ యువతలో ఐక్యతను పెంచేందుకు, అందుకు ఉన్న అవరోధాలను తొలగించేందుకు, ‘నేను హిందువును’ అనే భావనను బలంగా చాటేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను ఖరారు చేయాలని ప్రపంచ హిందూ కాంగ్రెస్ రాజకీయ సదస్సు తీర్మానంలో పేర్కొన్నారు. ప్రభుత్వం చేతిలో బందీలైన దేవాలయాలకు విముక్తి కల్పించాలని తీర్మానించారు.
‘హిందువుల్లో క్రియాశీలతను పెంచి, దేవాలయాల యాజమాన్యాన్ని హిందువులకే అప్పగించే విధంగా వత్తిడి తేవాలి. అన్ని దేశాల్లో విస్తరించి ఉన్న హిందువులకు ధార్మిక జీవన విధానం విశిష్టతను తెలియచేసేందుకు కృషి చేయాలి. పారిశ్రామిక రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలి. మతపరమైన విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించాలి. హిందూ పండితుల మధ్య అంతర్జాతీయ స్థాయిలో అనుసంధానం కల్పించాలి..’అని తీర్మానించారు.సంస్కృత భాష వ్యాకరణంలో నాలుగు వేల రూల్స్ ఉన్నాయి. వీటిని సంస్కృత పండితుడు పాణిని రూపొందించారు. ఇవి కంప్యూటర్ సైన్స్‌కు ఉపయొగపడుతున్నాయ. కాని ఇంత ఘన చరిత్ర ఉన్నా, హిందువులు తమగురించి తాము గొప్పగా చెప్పుకోలేని స్థితిలో ఉండేందుకు దారితీసిన కారణాలపై ఆత్మావలోకనం చేసుకోవాలని వక్తలు ప్రొఫెసర్ సుభాష్ కాక్ చెప్పారు. ఆయన హిందువుల గత వైభవం, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, మంచి భవిష్యత్తు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 3.6 ట్రిలియన్ డాలర్లు ఉంది. 2030 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మణిపాల్ గ్లోబల్ బోర్డు చైర్‌పర్సన్ పాయ్ చెప్పారు. చైనా, అమెరికా తర్వాత మూడవ స్థానంలో ఉన్న భారత్ ముఖ్యంగా ఆహారం, అందరికీ వసతి, విద్యుత్, మంచినీరు, ఆరోగ్యం వంటి రంగాల్లో వౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టిని సారించాలన్నారు. ప్రాచీన స్మృతిని ఎలా అర్థం చేసుకోవాలనే అంశం, ప్రచారంలో ఉన్న అపార్థాలపై తమిళనాడుకు చెందిన చరిత్రాకారుడు, పురావస్తుశాస్తవ్రేత్త నాగస్వామి విశదీకరించారు.
ప్రపంచ హిందూ కాంగ్రెస్ సభలను చూస్తుంటే మినీ కుంభమేళాను దర్శించినట్లుగా ఉందని మీడియా సంస్థ లు పేర్కొన్నాయి. భారత ఉప రాష్టప్రతి ఎం.వెంకయ్య నాయుడు ప్రసంగం హైలెట్‌గా నిలిచింది. హిందూ ధర్మంలో మహిళలకు ఇచ్చిన గౌరవ ప్రదమైన స్థానాన్ని ఆయన వివరించారు. దేశంలో నదుల పేర్లన్నీ స్ర్తిల పేర్లని, భారతీయులు తమదేశాన్ని మాతృభూమిగా ప్రేమతో పిలుచుకుంటారన్నారు. భారతీయ నాగరికత, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుపై భావోద్వేగంతో వెంకయ్య ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. అమెరికాలోని ఇల్లినాయిస్ గవర్నర్ బ్రూస్ రావర్ హాజై సెప్టెంబర్ 11వ తేదీని స్వామి వివేకానంద స్మృతి దినంగా పరిగణిస్తామని సదస్సులో ప్రకటించడం విశేషం. దివంగత మాజీ ప్రధాని వాజపేయి, నోబెల్ బహుమతి గ్రహీత వీఎస్ నైపాల్ మృతికి సంతాపసూచకంగా సదస్సులో నివాళులు అర్పించారు.
ఇతర మతాలకు సంబంధించి ప్రపంచ స్థాయి సదస్సులు ఎప్పుడూ ఏదో ఒకదేశంలో మత ప్రచారంలో భాగంగానే నిర్వహిస్తుంటారు. హిందూ ధర్మంపై అంతర్జాతీయ స్థాయిలో సదస్సులను నిర్వహించడం ఆషామాషీ కాదు. వరల్డ్ హిందూ కాంగ్రెస్ హైందవ సమాజాన్ని వెంటాడుతున్న దురాచారాలను పారద్రోలి, సనాతన, ఆధునిక వాదాల్లో మంచిని స్వీకరించి అన్ని వర్గాలను కలుపుకుని పోయే విధంగా ముందడుగు వేయాలి. ఇతర మతాల్లో హైందవ ధర్మాన్ని అభిమానించే వారిని కూడా దగ్గరకు తీసుకోవాలి. హైందవ ధర్మం విశిష్టమైనది. కానీ, హైందవ జాతిలో అంతర్లీనంగా ఇతర వర్గాలను అణచివేత, సాచివేత లాంటి ఆలోచన విధానాలను రూపుమాపేందుకు వరల్డ్ హిందూ కాంగ్రెస్ నడుం బిగించాలి. అంతర్జాతీయ స్థాయి సదస్సుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అన్ని వర్గాల్లోని హైందవ ధార్మికతను ప్రచారం చేసే వ్యక్తులను భాగస్వాములను చేయాలి. హైందవ జాతికి కుల దురభిమాన వ్యవస్థ శాపంగా పరిణమించింది. ఈ కుళ్లును కడిగేందుకు హిందూ కాంగ్రెస్ సంస్కరణలపై చర్చించాలి. ‘మన తాతాలు నేతలు తాగారు, మా మూతులు వాసన చూడండి’ అనే తరహాలో ప్రాచీన నాగరికత, చరిత్ర, సంస్కృతిని పదే పదే తలుచుకుని మురిసిపోకుండా,చరిత్రలో దొర్లిన తప్పిదాలు పునరావృతం కాకుండా సమగ్రమైన ప్రణాళికతో, దార్శనికతతో అడుగులు వేయాలి. పరమత సహనం, ఆధ్యాత్మిక సంపద, సర్వే జనాసుఖినో భవంతు అనే భావనను ప్రచారం చేయాలి.
దిశ, దశ లేకుండా ఎటు గాలి వస్తే అటు కొట్టుకుపోతూ నిర్వీర్యమవుతున్న హైందవ జాతిని పట్టిపీడిస్తున్న సామాజిక దురాచారాలపై యుద్ధం ప్రకటిస్తూనే, సాంస్కృతిక వైభవం సాధించేందుకు ప్రపంచ హిందూ కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు హర్షణీయం. కానీ, ఈ చర్చలు, తీర్మానాలు కేవలం కాగితాలకు, వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేసేందుకు పరిమితమైతే ఉపయోగం లేదు. ఇదే జరిగితే ‘కార్తీకమాసంలో కులసంఘాల వన సమారాధాన’ల తరహాలో వరల్డ్ హిందూ కాంగ్రెస్ తయారవుతుంది. స్వామి వివేకానంద చెప్పినట్లు- ‘లెమ్ము, మేలుకో, చైతన్యంతో సాగిపో.. దార్శనికతతో కదులు, దురాచారాలను సమాధి చేయి, దురహంకారాన్ని వదిలేయ్..’ అనే మంచిమాటలను ఆచరించినప్పుడే హైందవ జాతి, హిందూ ధర్మం మహోత్క్రృష్ట దశకు చేరుకుంటుంది.

బీసీ సంఘాల అర్ధనగ్న ప్రదర్శన

$
0
0

హైదరాబాద్, జనవరి 9: అగ్ర కులాల్లో వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంక్షేమ సంఘాల నాయకులు, కార్యకర్తలు అర్థనగ్న ప్రదర్శన చేశారు. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రశేశపెట్టడాన్ని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్వర్యంలో బుధవారం బషీర్‌బాగ్ చౌరస్తాలో వందలాది మంది కార్యకర్తలు అర్థ నగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా గుజ్జ కృష్ణ ప్రసంగిస్తూ స్వాతంత్య్రం లభించి 71 సంవత్సరాలైనా కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన పార్టీలన్నీ బీసీలను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఈబీసీలు 9 శాతం ఉన్నా, 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని ఆయన తెలిపారు. 52 శాతం ఉన్న బీసీలకు మాత్రం 25 శాతమే ఇస్తారట అని ఆయన అన్నారు. దేశ సంపద, పరిశ్రమలు, డబ్బు, వ్యాపార, వాణిజ్య, కాంట్రాక్టులు, అధికారం వంటివి 15 శాతం జనాభా ఉన్న అగ్ర కులాల చేతుల్లో 90 శాతం వరకు ఉన్నాయని, అటువంటప్పుడు వీటిని కూడా కులాల జనాభా ప్రకారం రిజర్వ్ చేస్తారా? అని గుజ్జ కృష్ణ ప్రశ్నించారు.
అగ్రకులాలు అడగకుండానే..
అగ్ర కులాలు తమకు రిజర్వేషన్లు కావాలని ఉద్యమాలు చేయకపోయినా కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించడం విస్మయం కలిగిస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని 26 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని బుధవారం కృష్ణయ్య అధ్యక్షతన సమావేశమైన బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనీపై రాజకీయ పార్టీలు మాట్లాడకపోవడం దురదృష్టకరమని కృష్ణయ్య అన్నారు.

సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం

$
0
0

చిత్రం..సీఎం కేసీఆర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేస్తున్న పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీనివాసరెడ్డి

సార్వత్రిక సమ్మె సక్సెస్

$
0
0

హైదరాబాద్, జనవరి 9: దేశవ్యాప్తంగా ఒకవైపు రెండురోజల సార్వత్రిక సమ్మెలో కార్మికులు ఉవ్వెత్తున పాల్గొంటుంటే మరోవైపు పార్లమెంట్‌లో కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకురావడానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రయత్నించడం సిగ్గుచేటని సీపీఐ తీవ్రంగా ధ్వజమెత్తింది. సార్వత్రిక సమ్మెను విఫలం చేయడానకి కేంద్రం ఎన్ని ఎత్తులు వేసినా దేశావ్యాప్తంగా సమ్మె సక్సెస్ అయ్యిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ముఖ్ధూం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం వెనక్కుతీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం కార్మికుల జీవితాలతో ఆడుకోవాలని చూస్తే ఖబడ్డార్ అంటూ ఆయన హెచ్చరించారు.
సార్వత్రిక సమ్మెకు ఊహించని స్పందన వచ్చిందని ఆయన చెప్పారు. సమ్మెలో దాదాపు 20 కోట్ల కార్మికులు పాల్గొన్నారని, బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగ, కార్మికులు 12 లక్షల మంది పాల్గొనడం విశేషం అన్నారు. దేశంలో భారీ వ్యాపార కేంద్రంగా పేరున్న ముంబయ్‌లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని ఆయన తెలిపారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులు భారీ ఎత్తున సమ్మెలో పాల్గొనడం జరిగిందన్నారు. సంఘటిత, అసంఘటిత కార్మికులు సమ్మెకు బాసటగా నిలబడడం జరిగిందన్నారు. అగ్రవర్ణాల్లో పేదోళ్ళకు 10 శాతం రిజర్వేషన్లు తీసుకురావడం పట్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. సామాజిక అంశాలపై రిజర్వేషన్ల తీసుకున్నప్పుడు జాతీయస్థాయిలో చర్చలు జరగాలన్నారు. ఎలాంటి ముందస్తు చర్చలూ లేకుండా ఈబీసీని పార్లమెంట్ ముందుకు తీసుకురావడాన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. కేవలం వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ చేసిన ప్రయత్నంగా ఆయన అభివర్ణంచారు. ఉత్తరాదిలో గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లో ఓటమి కారణంగా దిక్కుతోచక ఈబీసీ బల్లును తీసుకువచ్చినట్లుగా ఉందన్నారు. సుప్రీం కోర్టు రిజర్వేషన్లను 50 శాతం దాటవద్దని సూచించినప్పుడు ఈబీసీ 10 శాతంతో 60 శాతానికి పెరగడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించడం చూస్తే బీజేపీ ఇక ముస్లిం వ్యతిరేక శక్తిగా రుజువైందన్నారు. పౌరసత్వంకు వ్యతిరేకంగా అస్సాం, జమ్మూకాశ్మీర్‌లో అల్లర్లు జరిగే ప్రమాదం ఉందని ఆయన గుర్తు చేశారు. సీబీఐ ఉన్నతాధికాని అలోక్‌వర్మను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు సూచించడం ప్రధానికి చెంపపెట్టుగా ఆయన అభివర్ణించారు. అలోక్‌వర్మ ఈనెలాఖరుకి పదవీ విరమణ చేయనున్నందున ఆయన్ని మరికొంత కాలం సీబీఐ చీఫ్‌గా కొనసాగించడం మంచిదని ఆయన సూచించారు. అలోక్‌వర్మ సెలవులో ఉన్న రోజులను తిరిగి కొనసాగించాలని చెప్పారు. అసెంబ్లీ ప్రొటెం స్పీకరుగా ఎంఐఎం ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి సూచిండాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యతిరేకించడాన్ని ఆయన తప్పుపట్టారు.
ఇలాంటి సంసృతికి బీజేపీ వంతపాడడాన్న సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఐఎం మధ్య ఉన్న బంధం ఏమిటో బయటకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను తగ్గించడం పట్ల చాడ వెంకటరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సురవరం సుధాకర్ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి


సంక్రాంతికి 20 ప్రత్యేక రైళ్ళు

$
0
0

హైదరాబాద్, జనవరి 9: గత వారం నుంచి రైల్వే శాఖ సంక్రాంతి పండుగ కోసం ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేస్తుంటే క్షణాల్లో టికెట్లు బుక్ అవుతున్నాయి. దీంతో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్ళ సంఖ్యను పెంచుతోంది. ప్రయాణికుల రద్దీ క్రమంగా పెరుగుతున్నందున వెయిటింగ్ లిస్టు చాంతాడులాగే పెరుగుతోందని, అందుకు అనుగుణంగా ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేయక తప్పలేదని రైల్వే అధికారులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో సుదూర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేశామంటున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈనెల 11 నుంచి 19వ తేదీ వరకు అదనపు రైళ్ళను నడపడానికి అధికారులు సిద్ధం అయ్యారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి - తిరుపతి- కాకినాడ, విజయవాడ- విజయనగరం మధ్య ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేస్తున్నారు. సికింద్రాబాద్- తిరుపతి మధ్య 07188 రైలు, తిరుపతి- సికింద్రాబాద్ మధ్య 07189 రైలు, తిరుపతి- కాకినాడ మధ్య 07190 రైలు, కాకినాడ- తిరుపతి మధ్య 07191 రైలు, విజయవాడ- విజయనగరం మధ్య 07184 రైలు, విజయనగరం -విజయవాడ మధ్య 07185, 86,87 రైళ్ళ ఆయా తేదీల్లో నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో సీహెచ్ రాకేష్ తెలిపారు.

విదేశీ వైద్య విద్యపై పెరిగిన ఆసక్తి

$
0
0

హైదరాబాద్, జనవరి 9: భారత్ నుండి విదేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసించే వారి సంఖ్య రోజురోజుకూ బాగా పెరుగుతోంది. భారత్‌లో జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష పోటీని తట్టుకోలేకపోవడం, కాలేజీలు, సీట్లు తక్కువగా ఉండటం, యాజమాన్య కోటా సీట్లకు ఫీజు భారీగా ఉండటం, ఆర్ధిక భారాన్ని మోయలేని మధ్యతరగతి, దిగువ తరగతి విద్యార్థులతో పాటు ప్రవేశపరీక్ష పోటీని తట్టుకోలేపోతున్న విద్యార్థులు అంతా విదేశీ వైద్య విద్యవైపు దృష్టిసారించారు. ఫిలిప్పీన్స్, రష్యా, కజికిస్థాన్, యూఎస్, యూకే, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, హాంకాంగ్, సింగపూర్, న్యూజిలాండ్, ఐర్లాండ్ తదితర దేశాలకు పెద్ద ఎత్తున భారతీయ విద్యార్థులు వైద్య విద్యాభ్యాసానికి వెళ్తున్నారు.
గత ఏడాది భారత్ నుండి 17.504 మంది వివిధ యూనివర్శిటీల్లో వైద్య విద్యకు చేరారు. ఆర్‌టీఐ డాటా ప్రకారం చూస్తే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2015-16లో 3386 మందికి అర్హత పత్రాలను అందజేసింది. 2018లో మొత్తం 17,504 మందికి అర్హత పత్రాలను అందజేసింది. 2017-18వో 14,118 అర్హత పత్రాలను అందజేసింది. 2016-17 విద్యాసంవత్సరంలో 8737 మందికి అర్హత పత్రాలను అందజేసింది. ఈసారి నీట్ పరీక్షకు రెండు లక్షలకు పైగా అదనంగా రాస్తారని అంచనా వేస్తున్నారు. అంటే గత ఏడాది కంటే నీట్ అభ్యర్థుల సంఖ్య 14.4 శాతం పెరగనుంది. గత ఏడాది 15.19 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఫలితంగా ఒక్కమార్కుతో వందలాది ర్యాంకులు మారిపోయే పరిస్థితి ఏర్పడింది. పోటీపడుతున్న అభ్యర్ధుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా సీట్ల సంఖ్య మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుంది. అభ్యర్ధులకు అనుగుణంగా సీట్లు పెరగకపోవడంతో ప్రత్యామ్నాయాలను వెదుక్కుంటున్నారు. విదేశాల్లో వైద్య విద్య తక్కువ వ్యయంతో పూర్తి చేసే పరిస్థితి ఉండటం, భారీగా భారతీయ విద్యార్థులు చేరుతున్నందున సహ విద్యార్థులకు నమ్మకం, విశ్వాసం పెరగడం, సంస్థలు సైతం సకల సౌకర్యాలు కల్పించి విద్యార్ధులకు భారతీయ ఆహారం లభించేలా ఫుడ్ సెంటర్లు ఏర్పాటు చేయడం, రవాణా సదుపాయాలు కల్పించడం, విదేశాల్లో వారిని రిసీవ్ చేసుకుని గమ్యానికి చేర్చేలా సహచరులను ఏర్పాటు చేయడం వంటి చర్యలతో విదేశాల్లో విద్య తేలికగా మారింది. విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు వెళ్లే విద్యార్థులకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అర్హత పత్రాన్ని కూడా జారీ చేయాల్సి ఉంటుంది.

సామాజిక న్యాయానికి అవరోధాలా?

$
0
0

సోలాపూర్: సామాజిక న్యాయం సాధనలో భాగంగా జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిందని, అందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ప్రతిసంక్షేమాన్ని, అన్ని వర్గాలకు మేలు చేసే ప్రభుత్వ లక్ష్యాలను నీరుకార్చడమే ధ్యేయంగా పనిపెట్టుకుని దుష్ప్రచారం చేయడం కాంగ్రెస్‌కు అలవాటైందన్నారు. రాఫెల్ ఫైటర్ జెట్స్‌పై కాంగ్రెస్ కేంద్రంపై అపనిందలను ప్రచారం చేస్తోందన్నారు. కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. దేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే విధానాలపై అభూతకల్పనలను సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటైందన్నారు. బుధవారం ఇక్కడ జరిగిన బ్రహ్మాండమైన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ దుర్నీతిని ఎండగడుతూ లోక్‌సభ సరైన సమాధానాన్ని ఇచ్చిందన్నారు. ప్రభుత్వం తెచ్చిన ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్ల వల్ల బీసీలు, దళితులు, గిరిజనుల ప్రయోజనాలకు ఎటువంటి విఘాతం కలగదని ఆయన చెప్పారు. లోక్‌సభలో పౌరసత్వ చట్టంకు సవరణలు తెచ్చే బిల్లుకు ఆమోదం లభించిందన్నారు. దీని వల్ల ఈశాన్య రాష్ట్రాలతో దేశంలో స్థిరపడిన ముస్లింయేతరులకు న్యాయం జరుగుతుందన్నారు. వీరంతా ఇరుగుపొరుగు దేశాల్లో హక్కులను కోల్పోయి శరణార్థులుగా భారత్‌కు వచ్చారన్నారు. అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజల హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లదన్నారు.
ఆగస్టావెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ కేసులో నిందితుడు మిచిల్ రాఫెల్ తయారీదారులను వ్యతిరేకించే వర్గాలను కూడా సంప్రదించడానికి కారణమేంటని, దీని వెనక ఎవరున్నారని ఆయన ప్రశ్నించారు. మన దేశంలో యూపీఏ హయాంలో దళారుల వ్యవస్థ ఆడిందే ఆటగా సాగిందన్నారు. మిచిల్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అనేక దిగ్భ్రాంతి కలిగించే అంశాలను వెల్లడించారన్నారు. అన్ని రకాల రక్షణ రంగ ఉత్పత్తుల కొనుగోళ్లలో గత ప్రభుత్వ హయాంలో మిచిల్ దళారీగా పనిచేశారన్నారు. దేశంలో అవినీతి నిర్మూలనకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ‘ మోదీని ఎవరు భయపెట్టలేరు. ఖర్చుపెట్టిన ప్రతి ప్రభుత్వ పైసాకు లెక్కచెప్పగలం. ఈ చౌకీదార్ నిద్రపోరు. తప్పులు చేసిన వారిని ప్రజా కోర్టులో ఎండగడుతాం. నన్ను నిరంతరం ద్వేషిస్తూ దుష్ప్రచారం చేస్తారు. కని నేను ఎవరికీ లొంగను. అవినీతిని పారద్రోలేదాకా విశ్రమించను’ అని మోదీ అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ పుట్టినిల్లన్నారు. ఈ రాజకీయాల ద్వారా దేశ సమగ్రతకు దెబ్బ అన్నారు. గత నాలుగున్నరేళ్లలో ఎన్డీఏ సర్కార్ చేపట్టిన అనేక ప్రాజెక్టులను ఆయన వివరించారు. జాతీయ రహదారులు, విద్యుత్ ప్రాజెక్టుల గురించి ఆయన పేర్కొన్నారు. అందరికీ ఇల్లు నినాదాన్ని అమలు చేసి చూపిస్తున్నామన్నారు.
చిత్రం..సోలాపూర్‌లో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీకి జ్ఞాపికను అందచేస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. సోలాపూర్-తుల్జాపూర్-ఉస్మానాబాద్ సెక్షన్ వరకు కొత్తగా నిర్మించిన జాతీయ రహదారి (ఎన్‌హెచ్) 52ను ఈ కార్యక్రమంలో జాతికి అంకితం చేశారు.

రోడ్డు ప్రమాదంలో యువతీ యువకుల దుర్మరణం

$
0
0

ధవళేశ్వరం, జనవరి 9: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరం గ్రామంలో బుధవారం కంటైనర్ లారీ స్కూటర్‌ను ఢీకొన్న ప్రమాదంలో యువతీ యువకులు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం ప్రకారం కడియం మండలం పొట్టిలంక గ్రామానికి చెందిన ఆనం స్వరూప (17) రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు కళాశాలలో బిఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం కళాశాలకు వచ్చిన ఆమె మధ్యాహ్నం సమయంలో తన సమీప బంధువు నక్కిన మల్లికార్జునరావు (18)తో కలిసి స్కూటర్‌పై స్వగ్రామం వెళ్తుండగా వెనుక నుండి కంటైనర్ లారీ ఢీకొంది.
ఈ ప్రమాదంలో స్వరూప, మల్లికార్జునరావు అక్కడికక్కడే మృతిచెందారు. కాగా కళాశాలకు ఆలస్యంగా వచ్చిందని స్వరూపను డైరెక్టర్ లోనికి అనుమతించకపోవడంవల్లే ఈదుర్ఘటన జరిగిందని ఆరోపిస్తూ కళాశాల విద్యార్థులు రాస్తారోకో చేశారు. ఆలస్యంగా వచ్చిందని కళాశాల బయట నిల్చోపెట్టడంవల్ల అవమానానికి గురై, చేసేది లేక ఇంటికి తిరిగివెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు ఆరోపించారు.
స్వరూపను కళాశాలలోకి అనుతించివుంటే ఈ ప్రమాదం జరిగివుండేది కాదని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు.

రాష్ట్రానికి ఎన్‌టిఆర్, వైఎస్‌ఆర్ వంటి నేతల పాలన రావాలని దేవుని ప్రార్థించా

$
0
0

తిరుపతి, జనవరి 9: ప్రజల కష్టసుఖాలు చూసి, వాళ్ల బాగోగులు చూసుకునే ఎన్‌టిఆర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వంటి మంచి నాయకుల పాలన రావాలని స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించానని దివంగత ఎన్‌టిఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చెప్పారు. ఆదర్శవంతమైన పరిపాలన ప్రజలకు అందాలని కోరుకున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయం ఆమె విఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ కొత్త సంవత్సరం తెలుగు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, మంచి ప్రభుత్వం రావాలని స్వామిని ప్రార్థించినట్లు వెల్లడించారు. అలాగే తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నట్లు వివరించారు. జగన్ పాదయాత్ర చివరి రోజు సభ విజయవంతం అయ్యిందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజాశీస్సులతో ఆయన అఖండ విజయం సాధించాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. ఎవరైతే ప్రజలకు అన్యాయం చేస్తున్నారో, అవినీతికి పాల్పడుతున్నారో, ఎవరు ద్రోహం చేస్తున్నారో అలాంటివారు ప్రజా వ్యవస్థ నుంచి తొలగిపోవాలన్నారు. ఇక ఎన్‌టిఆర్ బయోపిక్ చిత్రంలో మొదటి పాట ద్రోహం, వెన్నుపోటు అనే పాట విన్నానని, అయితే రెండవ పాటలో తనపై విమర్శలు చేసినట్లు ఆ పాట ఉందని, అది తనకు ఎంతో బాధ కలిగించిందని అన్నారు. తనపై చేస్తున్న దుష్ప్రచారాలను గత 20 సంవత్సరాలుగా వింటున్నానని, ఈ అవమానాలన్నింటిని గుండెలో మోస్తున్నానని అన్నారు. అయితే రామ్‌గోపాల్ వర్మ ఎన్‌టిఆర్‌కు జరిగిన అన్యాయాలను బయటపెడతానని తనతో ఇదివరకే తిరుపతిలో హామీ ఇచ్చారని లక్ష్మీపార్వతి వెల్లడించారు. ఎన్‌టిఆర్ గొప్ప నటుడని, 35 సంవత్సరాల క్రాంగెస్‌ను తుడిచిపెట్టి 9 నెలల్లో సీఎం అయ్యారన్నారు. ఆయన చివరి దశలో అనారోగ్యం కారణంగా తనను వివాహం చేసుకున్నారని తెలిపారు. ఈరోజుకు తాను ఎన్‌టిఆర్ అనే మూడు అక్షరాలను నమ్ముకునే ఉన్నానన్నారు. తన భర్త ఎన్‌టిఆర్ కాంగ్రెస్‌ను వ్యతిరేకించారని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ తాను కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వైకాపాలో చేరానని ఆమె స్పష్టం చేశారు. ఒక తల్లి బిడ్డలా వైకాపా ఉందని, పదవుల కోసం తాను ఆ పార్టీలోకి వెళ్లలేదన్నారు. బాలకృష్ణ తన తండ్రి ఎన్‌టిఆర్ గురించి ఎన్ని భాగాలుగా సినిమాలు తీసినా అది ఆయన జీవితంలో సగమే అవుతుందే తప్ప పూర్తిగా తీయలేరని ఆమె స్పష్టం చేశారు.

పట్ట్భద్రులు నిత్య విద్యార్థులుగా ఉండాలి

$
0
0

విశాఖపట్నం, జనవరి 9: పట్ట్భద్రులుగా విశ్వవిద్యాలయాల నుంచి బయటకు వస్తున్న యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా మరికొంతమందికి ఉపాధి కల్పించేలా ఎదగాలని ఢిల్లీ ఐఐటీ సంచాలకులు ప్రొఫెసర్ వీ రామ్ గోపాలరావు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం 85,86 స్నాతకోత్సవం విశాఖ ఏయూ కాన్వొకేషన్ హాల్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన్ను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించారు. అనంతరం జరిగిన స్నాతకోత్సవ సభలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చదవడం నుంచి నేర్చుకునే దిశగా విద్యార్ధులు పయనం సాగించాలన్నారు. జీవితాతం నేర్చుకోవడం, నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడం ప్రధానమన్నారు. అభ్యాసం జీవితాంతం సాగించాలని, అభ్యసించడం ద్వారా నూతన అవకాశాలను పరిచయం చేస్తుందన్నారు. విద్యార్థులు నైతిక విలువలు కలిగి ఉండాలని, వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరమని సూచించారు. ప్రభుత్వ పరంగా ఉదారంగా విద్యాభ్యాసం సాగిస్తున్న విద్యార్థులు, ఉన్నత స్థానాన్ని చేరుకున్న అనంతరం ఎంతోకొంత సమాజానికి తిరిగి ఇవ్వాలన్న ధృక్పథం కలిగి ఉండాలన్నారు. విద్యా విధానంలో ఆశించిన స్థాయిలో మార్పులు తీసుకురాలేకపోతున్నామని, దశాబ్ధాలు గడచినా అదే మూస విధానంలో విద్యాబోధన కొనసాగుతోందన్నారు. మానవ జీవనాన్ని మరింత మెరుగుపరిచేలా శాస్ర్తియ ఆవిష్కరణలు ఉండాలన్నారు. స్నాతకోత్సవ పట్టాలు స్వీకరించిన తరువాత మీరు చేపట్టే పనిలో, వృత్తిలో అభిరుచులతో పూర్తి స్థాయిలో పనిచేయాలన్నారు.
విద్యార్ధులు ఉద్యోగాల కోసం ఎదురు చూసే స్థాయి నుంచి ఉపాధిని సృష్టించే స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రపంచంలో సాంకేతికత ఊహించనంత విధంగా వెల్లువెత్తుతోందని, ప్రపంచీకరణను అందిపుచ్చుకుని, విదేశీ విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయాలన్నారు. ముంబై ఐఐటీలో చేరినప్పటి నుంచి తన జీవితం పూర్తిగా మారిపోయిందన్నారు. అప్పటి వరకూ తెలుగు మాద్యమంలో విద్యభ్యాసం చేసిన తారు తొలి సారిగా ఆంగ్ల మాద్యమంలో చదువుకునేందుకు ఎంతో శ్రమించానన్నారు. అత్యుత్తమ ఆచార్యులు, మార్గదర్శకులు, అంతకంటే ప్రధానంగా తనకు సవాళ్లు విసిరిన సమాజమే దీనికి కారణంగా పేర్కొన్నారు. విద్యాతోనే తాను మంచి ఉద్యోగం, మెరుగైన జీవితాన్ని పొందగలిగానన్నారు. ఇదే సందర్భంలో విశ్వవిద్యాలయాలు, ఐఐటీల్లో బోధన పరమైన ఇబ్బందులను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. విశ్వవిద్యాలయాల్లో బోధన ఫ్యాకల్టీలు వందల సంఖ్యలో ఖాళీగా ఉంటున్నాయని, దీనివల్ల బోధన పరంగా సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. ఐదుగురు జపనీస్ కంటే ఒక ఇండియన్ ఎంతో తెలివైన వాడని, అయితే పదిమంది ఇండియన్ చేసే పనిని ఒక జపనీ పూర్తి చేయడం పరిశీలిస్తే లోపం ఎక్కడుందో తెలుస్తుందన్నారు. ప్రస్తుతం సమాజం సాంకేతికత చేతిలో బందీగా ఉండిపోతోందన్నారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు సాధించగలమని, దానికి బానిసైతే మాత్రం దుష్ఫలితాలు తప్పవన్నారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, మానవ వనరులు శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఏయూ వీసీ ప్రొఫెసర్ జీ నాగేశ్వర రావు ప్రసంగించారు.
చిత్రం..ఢిల్లీ ఐఐటీ సంచాలకుడు ప్రొఫెసర్ రామ్ గోపాలరావుకు గౌరవ డాక్టరేట్ అందజేస్తున్న గవర్నర్ నరసింహన్

ఫిన్‌టెక్ రంగానికి సీఐఐ సహకారం

$
0
0

విజయవాడ: రాష్ట్రంలో ఫిన్‌టెక్ రంగానికి సీఐఐ సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి లోకేష్ సమక్షంలో సీఐఐ, ఏపీ ఫిన్‌టెక్ వ్యాలీ మధ్య బుధవారం ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా ఆర్బీఐ, దేశంలోని వివిధ ఫైనాన్స్ వ్యవస్థలు, ఫైనాన్స్ కంపెనీలతో సమన్వయ వేదికను సీఐఐ ఏర్పాటు చేయనుంది. మానిటరీ ఆథారిటీ ఆఫ్ సింగపూర్, సిటీ ఆఫ్ లండన్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఫిన్‌టెక్ రంగం అభివృద్ధికి సీఐఐ సహకరించనుంది. బజాజ్ ఫిన్‌సెర్వ్ ఎండీ, సీఐఐ నేషనల్ కమిటీ ఆన్ ఇన్సూరెన్సు అండ్ పెన్షన్స్ చైర్మన్ సంజీవ్ బజాజ్‌తో మంత్రి, ఐటీ శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో ఫిన్‌టెక్ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి మంత్రి వివరించారు. ఇప్పటికే 25 ఫిన్‌టెక్ కంపెనీలు తమ కార్యకలాపాలను విశాఖలో ప్రారంభించాయన్నారు. విశాఖ ఫిన్‌టెక్ హబ్‌గా మారుతోందని వివరించారు. మరిన్ని ఫిన్‌టెక్ కంపెనీలు ఏపీకి వచ్చేలా యూజ్‌కేస్ రిపాజిటరీ ఏర్పాటు చేశామన్నారు. ల్యాండ్ రికార్డ్సు డిజిటలైజ్ చేయడంతో పాటు బ్లాక్ చైన్ టెక్నాలజీతో రక్షణ కల్పిస్తున్నామన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని, 24 వేల కోట్ల రూపాయలతో ఆంధ్రా పేపర్ ఎక్స్‌లెన్సు, కియా మోటార్స్ వచ్చాయని గుర్తు చేశారు. ఆనంతరం వారు ఆర్టీజీ సెంటర్‌ను సందర్శించారు. వివిధ టెక్నాలజీల అనుసంధానంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో రియల్ టైమ్ గవర్నెన్సు అమలు చేస్తున్నామన్నారు. అర్హులైన లబ్ధిదారునికి సంక్షేమ కార్యక్రమాలు సులభంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలవరం సహా కీలక ప్రాజెక్టులను ఆర్టీజీఎస్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. కాగిత రహిత పాలన అమలు లక్ష్యంగా పని చేస్తున్నామని వివరించారు. టెక్నాలజీ వినియోగంతో ఒక రాష్ట్రం ఇన్ని కార్యక్రమాలను అమలు చేయడం తాను మొదటి సారి చూస్తున్నానని సంజీవ్ బజాజ్ తెలిపారు. ఆర్టీజీఎస్ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఏపీలో ఫిన్‌టెక్ రంగం అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.

చిత్రం..మంత్రి లోకేష్ సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకుంటున్న
సీఐఐ, ఏపీ ఫిన్‌టెక్‌వ్యాలీ ప్రతినిధులు


2021కి రామాయపట్నం ఓడరేవు పూర్తి

$
0
0

ఒంగోలు, జనవరి 9: నాడు నేడు చేసిన పాదయాత్ర పవిత్రమైనదని, వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పాదయాత్రలో చిత్తశుద్ధి లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. తాను రోజుకు 8 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశానని, అనారోగ్యానికి గురైనా విరామం ఇవ్వలేదని వివరించారు. అయితే జగన్ చేపట్టిన పాదయాత్రలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, తరచు విరామం ఇస్తూ పాదయాత్ర కొనసాగించారని విమర్శించారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రామాయపట్నంలో 4,500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రామాయపట్నం ఓడరేవుకు, 24,500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆసియా పల్ప్ అండ్ భారీ కాగితం పరిశ్రమకు చంద్రబాబునాయుడు బుధవారం లాంఛనంగా శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆసియా పల్ప్ అండ్ భారీ కాగితం పరిశ్రమకు చెందిన ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయు చేసుకుంది. ముందుగా రామాయపట్నం వద్ద జరిగిన ఆరో విడత జన్మభూమి-మావూరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దిగిపోతేనే రాష్ట్రానికి అన్నివిధాల వెసులుబాటు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. జగన్ కోడి కత్తి కేసును దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వం ఎఐఏకి అప్పగించడాన్ని తప్పుబట్టారు. ఈవిధమైన నిర్ణయాల వల్ల కేంద్రం రాష్ట్ర హక్కులను హరించటమే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని అన్ని వ్యవస్థలను మోదీ భ్రష్టు పట్టించారన్నారు. కనీసం సీబీఐ సంస్థలను కూడా భ్రష్టు పట్టించిన విషయాన్ని ప్రజలు గమనించారన్నారు. తాము కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని, వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చాలని కేంద్రానికి పంపించినా పట్టించుకోలేదని, తమ పార్టీ ఎంపిలను సస్పెండ్ చేసి అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించటం కేవలం బీజేపీ రాజకీయ లబ్ధి కోసమేనని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. అయినప్పటికీ ఆ రిజర్వేషన్లను స్వాగతిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
రాష్ట్రంలో ఆరు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, అమరావతిలో కూడా అవినీతి జరుగుతోందని ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టి రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్ల రూపాయలని అలాంటప్పుడు ఆరు లక్షల కోట్ల రూపాయలు ఏవిధంగా అవినీతి జరుగుతుందని ఆయన ప్రతిపక్షాలను నిలదీశారు. ఈనెల 11వ తేదీన నెల్లూరు జిల్లాలోని దగదర్తిలో ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈనెల 29వ తేదీన అనంతపురం జిల్లాలో కియో మోటారు మొట్టమొదటి కారును రోడ్డుపైకి తీసుకువచ్చేందుకు తాను ప్రారంభోత్సవం చేయనున్నట్లు ఆయన సగర్వంగా చెప్పుకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వం నిర్మించిన విశాఖపట్నం పోర్టు కంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కృష్ణపట్నం పోర్టు చాలా అద్భుతంగా ఉందన్నారు. కాకినాడ, మచిలీపట్నంల్లో నూతనంగా పోర్టును ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. భావనపాడు పోర్టు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందన్నారు. రామాయపట్నంలో పోర్టు నిర్మాణానికి కృష్ణపట్నం పోర్టు నిబంధనల వల్ల అడ్డంకులు వచ్చాయని అయినప్పటికీ కృష్ణపట్నం నవయుగ అధినేత విశే్వశ్వరరావుతో మాట్లాడి సమస్యను పరిష్కరించి ఒప్పించామన్నారు.
రామాయపట్నం 20 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో నిర్మించే ఓడరేవును రాబోయే రోజుల్లో 40 మిలియన్ టన్నుల సామర్ధ్యానికి పెంచుతామన్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం వల్ల రవాణా సౌకర్యాలు పెరుగుతాయని, పెట్టుబడిదారులు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తారన్నారు. ప్రకాశం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న జామాయిల్, సుబాబుల్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆసియా పేపర్ అండ్ పల్ప్ కంపెనీ ప్రతినిధులు రామాయపట్నంలో 25వేల కోట్ల రూపాయలతో పేపరు మిల్లును ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు. రామాయపట్నంలో పేపరుమిల్లు ఏర్పాటుచేయటం వల్ల జిల్లాలోని 50వేల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈపరిశ్రమ వల్ల 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. జిల్లాలో ఒకే ప్రాంతంలో పోర్టు, పేపరుమిల్లు ఉండటం వల్ల సుమారు 50 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తరువాత 22 మిలియన్ల విద్యుత్ కొరత ఉందన్నారు. విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు 36,632 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేశామన్నారు.
రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలను పెంచమని చెప్పిన ప్రభుత్వం తమదేనన్నారు. రాష్ట్రంలో 15 లక్షల సోలార్ పంపుసెట్లు ఉన్నాయని, వాటన్నింటికి సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్రంలో 18 లక్షల మంది ఎస్‌సి, ఎస్‌టిలకు వంద యూనిట్లు వాడే లబ్ధిదారుల గృహాలకు ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో గోదావరి నదిని పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి అనుసంధానం చేశామన్నారు. కృష్ణానదిని పెన్నానదికి అనుసంధానం చేసేందుకు నకిరేకల్ వద్ద శంకుస్థాపన చేశామన్నారు. రాష్ట్రంలో వంశధార, నాగావళి, గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేస్తామన్నారు.
రాబోయే రోజుల్లో ప్రతిఒక్కరికి స్మార్ట్ఫోన్లు ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు జన్మభూమి-మావూరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 51 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజల ఆడపిల్లలకు చంద్రన్న పెళ్లికానుకలను అందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
రికార్డు స్థాయిలో కాంక్రీటు పనులు ముమ్మరంగా చేపట్టి గిన్నీస్‌బుక్ రికార్డు సాధించామన్నారు. జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
ఈసందర్బంగా ప్రభుత్వ శాఖలు ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు. ముందుగా జన్మభూమి-మావూరు సందర్బంగా ముఖ్యమంత్రి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు, రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి పి నారాయణ, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్, శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, కరణం బలరాం, పోతుల సునీత, అద్దంకి, కొండెపి, చీరాల, గిద్దలూరు, కనిగిరి, కందుకూరు, శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి, ఆమంచి కృష్ణమోహన్, ముత్తుమల అశోక్‌రెడ్డి, కదిరి బాబురావు, పోతుల రామారావు, జిల్లాకలెక్టర్ వి వినయ్‌చంద్, ఆసియా పల్ప్ పేపరు సంస్థ ప్రతినిధులు సురేష్ కెల్లం, టిజి విజయ్ పాల్గొన్నారు.

చిత్రం..జన్మభూమి-మావూరు గ్రామసభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

లెక్కలు చెప్పకపోతే చిక్కులే

$
0
0

ధర్మపురి, జనవరి 9: ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికలలో చేసే ఖర్చు, అందుకు సంబంధించిన వివరాల సమర్పణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీరియస్‌గా వ్యవహరిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో గత స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసి, ఖర్చులను సమర్పించక పోయిన అభ్యర్థులపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తొందొలుతగా ఇప్పటికే వేటు వేసింది. 2013 జూలైలో నిర్వహించబడిన స్థానిక ఎన్నికలలో పోటీ చేసి, ఖర్చులను సమర్పించని అభ్యర్థులకు పలు మార్లు నోటీసులు అందజేసినా స్పందించక, మిన్నకుండిన కారణంగా విజేతలు, పరాజితులెవరైనా వదలక, పలువురిపై కొరడా ఝళిపించి, ప్రొసీడింగ్స్ నెం.316/టిఎస్‌ఇసి-పిఆర్-జెజిఎల్/2017-1377 తేది 27.11.2017 ద్వారా కొందరిని పదవీచ్యుతులను చేయడమే కాకుండా, సదరు అభ్యర్థులను మూడేళ్ళపాటు సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసేందుకు అనర్హత వేటు వేసింది. గత పంచాయతీ ఎన్నికలలో లెక్కలు సమర్పించలేదని 2593మంది వార్డులకు, 358మంది సర్పంచు పదవులకు పోటీ చేసిన అభ్యర్థులను రాష్ట్ర ఎన్నికల సంఘం అనర్హులుగా ప్రకటించింది. 2017 సెప్టెంబర్/అక్టోబర్ మాసాలలో ఖర్చుల వివరాల సమర్పణకు అవకాశం కల్పించీ, స్పందించని, స్పందించినా ఆలస్యానికి సరియైన కారణాలు వివరించని అభ్యర్థులపై కఠినంగా వ్యవహరించింది. ప్రస్తుత ఎన్నికలలో సైతం ఖర్చుల విషయంలో కఠిన వైఖరి అవలంబించనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సర్క్యులర్ నెం.178/ తె.రా.ఎ.సం- ఎల్/2018...తేది 21.05.2018 ప్రకారం పోటీ చేసే ప్రతి అభ్యర్థి తను నామినేషన్ సమర్పించిన నాటి నుండి ఎన్నికల ఫలితాల ప్రకటన వరకూ (రెండు రోజులతో కలిపి), ఎన్నికలలో చేసిన ఖర్చులన్నింటి లెక్కల వివరాలను తాను స్వయంగా, లేక ఎన్నికల ఏజెంట్ ద్వారా గాని యదార్థంగా నిర్వహించాలని చట్టంలోని 237 సెక్షన్ సూచిస్తున్నది. ప్రతి అభ్యర్థి తన ఎన్నికల ఖర్చుల వివరాలను అట్టి ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45రోజుల లోపల నిర్దిష్ట నమూనాలో సంబంధిత ఎంపీడీఓలకు అసలు ప్రతులతో సమర్పించాలి.
గడువులోగా ఎన్నికల ఖర్చు వివరాలు కోరిన విధంగా సమర్పించని అభ్యర్థిని 3 సంవత్సరాల వరకు ఎన్నికలలో పోటీ చేయకుండా అనర్హునిగా ప్రకటించుటకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 23 ఎన్నికల సంఘానికి అధికారం ఇస్తున్నది. నామినేషన్ సమర్పిత తేదీ నుండి ఎన్నికలు ముగిసేవరకు సంబంధిత ఖర్చులను సమర్పిత బ్యాంకు ఖాతా ద్వారానే చెల్లింపులు జరగాలని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచార సమయంలో రోజువారి ఖర్చుల వివరాల నిజ ప్రతులను ఫ్రొఫార్మా- 3లో ఎంపీడీఓలకు సమర్పించాలి. ఎంపీడీఓ సంబంధిత ఎన్నికల ఖర్చు వివరాల సమర్పిత సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలి. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ నెం.179/ టి.ఎస్.ఇ.సి. /ఎల్/2019 తేది 18.05.18లో పేర్కొన్న నిర్దిష్ట ఫార్మాట్ మరియు ప్రొఫార్మలో చెప్పిన విధంగా ఉన్న ఎన్నికల ఖర్చుల వివరాలను మాత్రమే సరైనదిగా మరియు 2018 పం.రా.చట్టం ప్రకారం ఉన్నట్లుగా పరిగణించ బడునని, ఈ నిర్దిష్ట ప్రొఫార్మాను అతిక్రమించినట్లయతే సరైన ఎన్నికల వివరాలను సమర్పించ లేదని భావించి, సంబంధితులపై తగిన చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేసింది. డిజిగ్నేటెడ్ అధికారులు అట్టి ప్రతులను ఇతర పోటీచేయు అభ్యర్థులు, ప్రజలు లేదా ప్రభుత్వేతర సంస్థలు కోరిన మీదట జిరాక్సింగ్ ఛార్జీలు చెల్లించిన మీదట వారికి భారతీయ శిక్షా చట్టం, 1872 యొక్క సెక్షన్ 76ను అనుసరించి సర్టిఫైడ్ కాపీలను అందజేయాలని మీడియాకు ఉచితంగా అందజేయాలని పేర్కొంది.

లాటరీ పేరుతో టోకరా

$
0
0

వరంగల్, జనవరి 9: కోకాకోలా లాటరీ వచ్చిందంటూ యువకులకు టోకరా వేస్తున్న నైజీరియన్ సైబర్ మోసగాడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతనితో పాటు నాగాలాండ్‌కు చెందిన ఓ యువతిని కూడా బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ పోలీసుల సహకారంతో శాయంపేట పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ఇద్దరి నిందితుల నుండి 2లక్షల 3వేల రూపాయలు నగదుతో పాటు రెండు ల్యాప్‌టాప్‌లు, 23 సెల్‌ఫోన్లు, విదేశీ పాస్‌పోర్ట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు వివిధ బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ అయి ఉన్న 28 లక్షల రూపాయలకు సంబంధించిన లావాదేవీలను నిలిపివేసారు. ఈ అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ మీడియాకు వెల్లడించారు. శాయంపేట పోలీస్ పరిధిలోని మైలారం గ్రామానికి చెందిన సిరిపురం మహేందర్‌కు 2017 ఏప్రిల్‌లో తన సెల్‌ఫోన్‌కు కోకాకోలా ఆన్ లైన్ లాటరీ వచ్చిందనీ, దాని విలువ 5లక్షల గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ ( ఇండియన్ కరెన్సీ ప్రకారం 4కోట్ల 45లక్షలు) ఉంటుందని, దీనికి సంబంధించి బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ-మెయిల్‌కు సమాచారం పంపాలని ఒక ఎస్‌ఎంఎస్ వచ్చిందని తెలిపారు. సదరు బాధితుడు వెంటనే తన పూర్తి వివరాలతో మెయిల్ చేశాడు. ముందుగా రిజిస్ట్రేషన్ చార్జీల కింద 200 పౌండ్లను (లక్షా 80వేలు) చెల్లించాల్సి ఉంటుందని, లాటరీ డబ్బు త్వరలోనే వస్తుందని మహేందర్‌ను నమ్మించారు. వారు అడిగినట్లుగానే వారి బ్యాంక్ ఖాతాలో మహేందర్ డబ్బు జమచేసాడు. అనంతరం పలు దఫాలుగా నిందితులకు సంబంధించిన 12 ఎస్‌బీఐకి బ్యాంక్ ఖాతాల్లో 10 లక్షల రూపాయలను డిపాజిట్ చేశాడు. పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ చేసినా లాటరీ మొత్తం రాకపోవడంతో మహేందర్‌కు అనుమానం వచ్చి శాయంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇదే తరహాలో జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన కరికే భరత్‌కుమార్ అనే యువకుడు నిందితులకు సంబంధించి వివిధ బ్యాంకులకు చెందిన 24 బ్యాంక్ ఖాతాల్లో 71 లక్షలు డిపాజిట్ చేసి మోసపోయిన సంఘటనతో బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు. ఈ రెండు సంఘటనలపై అప్రమత్తం అయిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైం పోలీసులు ఈ కోకాకోలా లాటరీ మోసాలు ఢిల్లీ నుండి జరిగినట్లుగా నిర్ధారించారు. నిందితులు గుర్తించి పట్టుకోనేందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పరకాల ఏసీపీ వైవిఎస్ సుధీంద్ర పర్యవేక్షణలో శాయంపేట ఇన్‌స్పెక్టర్ సాదుల్లాబాబా నేతృత్వంలో రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలు మందుగా సైబర్ సహకారంతో నిందితులు వినియోగించిన సెల్‌ఫోన్ నంబర్లు ఈ- మెయిల్ బ్యాంక్ ఖాతాలను ఆధారం చేసుకుని గత కొన్ని రోజులుగా దర్యాప్తు నిందితుల కోసం ఈ బృందాలు ఢిల్లీకి తరలివెళ్లారు. ఈ బృందాలు ముందుగా నిందితులు వినియోగించిన ఇంటర్‌నెట్ వివరాలను వినియోగించుకున్న ప్రదేశాన్ని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్ధానిక ఢిల్లీ కోర్టు అనుమతితో దర్యాప్తు బృందాలు నిందితులను వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు తరలించారు. అరెస్ట్ చేసిన నింధితులను పోలీసులు విచారించగా నిందితులలో ఒకడైనా నైజీరియా దేశస్థుడు సైబర్ చీటర్ డిమ్యూయేషన్ ఉచైన్ 2015లో భారత్‌కు వచ్చాడు. ఇదే సమయంలో చిరు వ్యాపారం నిర్వహించుకోనేందుకు ఢిల్లీకి వచ్చిన మరో నిందితురాలు హీనియాకు డిమ్యూయేషన్ ఉచైన్‌తో పరిచయం కావడంతో వీరిద్దరూ కలిసి సైబర్ నేరాలకు ప్రణాళికను రూపొందించుకున్నారు. నిందితులు ఇప్పటి వరకు సుమారు ఆరు కేసుల్లో సుమారు కోటి రూపాయల వరకు తమ ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నారు. ఇందులో వరంగల్ పోలీస్ కమిషనరేట్ శాయంపేట, బచ్చన్నపేటతో పాటు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో మోసాలకు పాల్పడినట్లుగా నిందితులు పోలీసుల ఎదుట అంగీకరించారు.
చిత్రం..నిందితుల వివరాలను వెల్లడిస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్

సిద్దిపేట నుంచి ప్లాస్టిక్‌ను తరిమికొడదాం

$
0
0

సిద్దిపేట, జనవరి 9: ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన ఒక వ్యక్తికి ఉంటే సరిపోదని, అందుకు తగ్గట్లుగా ఆలోచన చేయాల్సి ఉంటుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో మున్సిపల్ అధికారులతో జరిగిన సమీక్షలో హరీష్‌రావు మాట్లాడుతూ సిద్దిపేటను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ఉద్యమిద్దామని ఇందుకు అందరు సహకరించాలని కోరారు. పట్టణంలో ఇంటింటికీ జూట్ బ్యాగుల పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 10వేల బ్యాగ్‌లు సిద్ధంగా ఉన్నాయని, మరో 25వేల వరకు జూట్ బ్యాగులు తెప్పించేలా నిర్ణయించినుట్ల తెలిపారు. పట్టణ వాసులు బజారుకు వెళ్లినా.. ఎక్కడికెళ్లినా.. ప్లాస్టిక్ కవర్లు తీసుకెళ్లవద్దని ప్రతి సభ, సమావేశాల్లో ప్రజలను చైతన్యవంతుల్ని చేసి మరోమారు సిద్దిపేటను ఆదర్శంగా చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. విద్య, వైద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన, తదితర అంశాలతో పాటు, ఆనందం, ఆహ్లాదం, ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. అందరు సమిష్టిగా కృషిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. సిద్దిపేట నియోజక వర్గంలో ఆక్సిజన్ పార్కు, కోమటిచెరువు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్య, వైద్యం, టూరిజం, భద్రత, పరిశ్రమలు, ఉపాధి కల్పనకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో రామకృష్ణ మఠం ఏర్పాటుకు సంబంధించి విషయాన్ని ఆరాతీసి ఆ దిశగా ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు మందకోడిగా సాగటం పట్ల ఆ సంతృప్తి వ్యక్తం చేశారు. యూజీడీ కోసం పగుల కొట్టిన పనులను సత్వరమే ఎందుకు పూర్తి చేయటం లేదని పబ్లిక్ హెల్త్ డీఈ గోపాల్‌ను ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండ పనులు చేయాలని ఆదేశించారు. 15రోజుల్లో మొదటి విడత పనులు పూర్తి చేసి, సివరేజ్ ప్లాంట్‌ను వారం రోజుల్లో అనుసందానంకు లింక్ చేస్తానన్నారు. కరీంనగర్ రోడ్డులో ఉన్న వెలకమ్ బోర్డు తరహాలో హైదరాబాద్ రోడ్డులో వెలకమ్ బోర్డు ఏర్పాటు చేయాలని టూరిజం ఎండీ మనోహర్‌ను కలసి సుందరంగా ఏర్పాటు చేయాలని కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. వేములవాడ కమాన్ నుండి ఇమాంబాద్ వెళ్లె దారిలో పెద్దమ్మ ఆలయం వరకు బ్రిడ్జి,డివైడర్, వీధీ దీపాలు ఉండేలా ప్రణాళికను సిద్ధం చేయాలని ఆర్‌అండ్‌బి అధికారులను ఆదేశించారు. త్వరలోనే సిద్దిపేటను సీసీ కెమెరాల నిఘా నీడలో ఉండేలా పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్‌తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలో ప్రధాన సర్కిళ్లు, జంక్షన్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి ఆ దిశగా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. అవసరమైన నిజమాబాద్, కరీంనగర్, వరంగల్, సిరిసిల్లా పట్టణాలను మున్సిపల్ కమిషనర్, ఇంజనీర్లు, చైర్మన్, కౌన్సిలర్లు వెళ్లి సందర్శించాలని కోరారు.
చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు

సాయికృష్ణ కుటుంబానికి ఆర్థిక సహాయం

$
0
0

మహబూబాబాద్, జనవరి 9: అమెరికాలో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న మహబూబాబాద్ నివాసి పూస సాయికృష్ణ తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 10లక్షల ఆర్థికసాయం బుధవారం అందింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదలైన చెక్కును సాయికృష్ణ తల్లిదండ్రులు ఎల్లయ్య, శైలజలు విలేఖరులకు చూపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ కుమారునిపై జరిగిన కాల్పల ఘటనను దురదృష్టకరంగా భావించి మాజీ మంత్రి కేటీఆర్ మానవత్వంతో స్పందించారన్నారు. అన్నలా ఆదుకుంటానని మంగళవారం ఆయనను కలసిన సందర్భంలో మాట ఇచ్చాడని బుధవారం రూ. 10లక్షల ఆర్ధికసాయం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి అందేలా చేశారని అన్నారు. తాము తమ కుమారుని వద్దకు వెళ్లడానికి కావాల్సిన పత్రాలను ఏర్పాటుచేసే అంశంలోనూ కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని అన్నారు. మంగళవారం మాట ఇవ్వడం, బుధవారం ఆర్థికసాయం అందజేయడంతో మహబూబాబాద్ జిల్లాలోనూ మంత్రి కేటీఆర్ పనితీరు పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

చిత్రం..రూ.10లక్షల చెక్కును చూపిస్తున్న
సాయికృష్ణ తల్లిదండ్రులు ఎల్లయ్య, శైలజ

Viewing all 69482 articles
Browse latest View live