Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

పరమహంస బోధామృతము

$
0
0

అహంకారం చాలా చెడ్డది. అది నిర్మూలము కానిదే ముక్తి లేదు. ఆ లేగదూడను జూడుడు, అహంకారముచే దానికెన్ని యిక్కట్లు వాటిల్లుచున్నవో కనుడు. అది పుట్టిన తోడనే ‘‘హంహై’’ నేనున్నాను’’ అనియరచును. ఫలితమేమి? అది పెద్దదై (ఎద్దై)న యెడల దానిని నాగలికి గట్టుదురు. లేదా బరువులతో నిండినబండ్లకు గట్టుదురు. అవైన యెడల గుంజకు కట్టివేయుదురు. ఒక్కొక్కప్పుడు చంపియు తిందురు.
కాని ఎన్నిదండనల పాలైనను ఆ పశువు అహంకారమును విడువదు. దాని చర్మముతో డోలు చేసినను గూడా ‘హంహం’ నేను, నేను అనియే శబ్దించును. దూదేకులవాడు దాని ప్రేవులను దన వింటినారిగా జేసికొనినప్పుడు గాని అది వినయము నవలంభింపదు. అపుడు ‘తుహై’- ‘నీవున్నావు’ అని గానము చేయును. ‘నేను, నేను’ అను భావము పోయి (పరమేశ్వరా! అంతయు) ‘నీవే’ అను భావము కలుగవలయును. జ్ఞానోదయమైననే కాని ఈ స్థితి ప్రాప్తము కాజాలదు.
107. అహంకారము తొలగి పరతత్త్వమున లయించినప్పుడు ముక్తి లభించును.
108.ప్రశ్న: మానవునకెప్పుడు ముక్తి లభించును?
ఉ. అహంకారము నశించినప్పుడే.
109. ప్రశ్న: నేనెప్పుడు ముక్తుడనగుదును?
ఉ. ఆ ‘నేను’ అనుభావము నీ నుండి తొలగినప్పుడు, ‘నేను, నాది’ అనుకొనుటయే అజ్ఞానము. ‘నీవు, నీది’ అనుకొనుటయే జ్ఞానము. నిజమైన భక్తుడిట్లు భావించును: ‘‘దేవా! నీవే కర్తవు. సకలము నీవే చేయుచున్నావు. నేను నీ చేతిలోని ఉపకరణ మాత్రమును. నీవు ననే్నమి చేయించిన నేను అది చేయుదును. ఈ సర్వము నీ విభూతియే. ఈ యిల్లు, ఈ సంసారము అన్నియు నీవే, నావి కావు; నీ యాజ్ఞానుసారము సేవ చేయుటకు మాత్రమే నాకధికారము కలదు’’.
అహంకారమును జయించుట దుర్లభము
110. అందరి అహంకారములను క్రమముగా తొలగిపోగలవు గాని మహాత్మునకు తన మాహాత్మ్యమును గూర్చిన అహంకారము తొలగిపోవుట దుర్లభము.
111. వెల్లుల్లి రసము పోసియుంచిన గినె్నను వేయిసార్లు కడిగినను ఆ వాసన పోదు అజ్ఞానముచే గలుగుచున్న అహంకారము అంతటి మొండిది. దానిని తొలగించుకొనుటకెంతటి విశ్వప్రయత్నము చేసినను అది పూర్తిగా తొలగిపోదు.
112. అజీర్ణరోగి పులుపు వస్తువులు తనకు హానికరములని బాగుగా ఎరుగును. కాని అవి వాని కండ్లకగుపడిన చాలును, నోరూరును. చేరిక యొక్క ప్రభావము అట్టిది. అటులనే ‘నేను, నాది’ అను భావము నెంతగా అణచివేయ బ్రయత్నించినను కర్మరంగంలోనికి దిగినంతనే అపక్వపుటహంకారము తలఎత్తుచునే యుండును.
113. అహంకారమును నిర్మూలించి సమాధి స్థితిని సాధింపగల్గువారు అరుదుగా నుందురు. సాధారణముగా అది పోనే పోదు. విధి విరామములనునవి లేక నీవెంత విచారము చేసినను ఈ అహంత మరల మరల తల ఎత్తుచునే ఉండును. రావి చెట్టును ఈనాడు మీరు నరికివేసిమితి గదా అనుకొనిన, మరునాడే చిగుర్చుచున్నది.
ఇంకావుంది...


సుందరకాండ

$
0
0

లేళ్ళ మాంసం అడవి పందుల మాంసాలు అక్కడుంచబడ్డాయి. నెమళ్ళు కోళ్ళు వీటి మాంసాలు ఆ వెండి గినె్నల్లో సగం సగం తినగా మిగిలినవి. అలాగే అడవి పంది మాంసాన్ని, వార్ర్ధాణసక మాంసాన్ని రుచికమనే లవణంలో కలిపి పెరుగుతో వండుతారట. అదిగో ఆ వంటలు- అలాగే మృగమయూరాల్ని తినేసేరు. ఎంతవరకు శల్యావశిష్టంగా. అవిగో-వాటి స్వరూపాల్ని - ఇలా స్వామి చూస్తూ నడుస్తున్నాడు.
లేహ్యానుచ్చావచాన్ పేయాన్ భోజ్యాని వివిధానిచ
తథా‚మ్ల లవణోత్తం సై ర్వివిధై రాగ షాడబైః
అనేక రకాల లేహ్యములు భక్ష్యములు పానీయాలు భోజ్యాలు.
ఆమ్ల లవణ సంయుక్తాలయిన రాగ షాడబాలు.
తెల్లకల్లు, ద్రాక్ష, దాడిమ మొదలైన రసాలతో తెల్ల ఆవాల వంటి ఇతర సామగ్రులతో కలిపి చేసిన రసాయనం.
ఇది చిక్కగా ఉంటే షాడబం (క్రీమ్) పల్చగా ఉంటే రాగం. (జూస్) త్రాగుడుచే ఒడలు తెలియక వెదజల్లిన పండ్లు. పూలు, వాటి సౌరభాలు ఈ పాన భూమిలో దీపాలు లేవు. మరెలా కనిపిస్తుంది. తినే వాళ్ళెలా- తిన్నారు. స్వామెలా చూస్తున్నాడు.
తత్ర తత్ర చ విన్య సె్తై స్సుశ్లిష్టైశ్శయనాసనైః
పాన భూవిర్వినా వహ్నిం ప్రదీప్తే నోపలక్ష్యతే.
ఆ ఆసనాల ప్రకాశ ఉంది. ఎవరి ఆసనం వారికెదురుగా ఉన్న భక్ష్యవేదికను చూపిస్తుంది. అంతే. అంత మాత్రంచేతనే దీపం లేకుండానే దీపిస్తున్నాయి. ఇక కేవల పానవేదికల రంగం. అందులో ఉంచబడిన సుర, కృతుసర మాధ్వీకం శర్కరాసవం పుష్పాసవం ఫలాసవం వంటి రకరకాల ఆసవాలు. వాటితో నిండిన వెండి-బంగారు- స్ఫటిక పాత్రలు. ఆ పాత్రలలో
క్వచిదర్ధావ శేషాణి క్వచిత్పీతాని సర్వశః
క్వచిన్నైవ ప్రపీతాని పాపాని సదదర్శహ.
క్వచిద్భక్ష్యాంశ్చ వివిధాన్ క్వచిత్సానాని భాగశః
క్వచిదన్నావ శేషాణి పశ్యన్వై విచాచార హ.
కొన్నిచోట్ల సగం త్రాగిన పాత్రలు. కొన్నిచోట్ల ఖాళీగాఉన్న పాత్రలు కొన్నిచోట్ల నిండుగా ఉండిపోయిన పాత్రలు. అలాగే భక్ష్యాలు. ఇలా స్వామి చూసికొంటు వెడుతున్నాడు. ఇక్కడ మహర్షి ‘హ’ అన్నారు.
ఇదొక చిత్రం.
వీటినెందుకు చూడాలి. తాను చూడవలసినది సీతను కదా!
ఆ సీతకోసం స్ర్తిముఖాల్ని చూస్తూవస్తూన్న స్వామి ఆడది లేనిచోట ముందుకు వెళ్ళాలిగాని ఈ పరీక్ష ఎందుకు?
రావణ పాన భూమి- కేవలం అన్న మయకోశం. కేవల అన్నమయ కోశాన్ని నమ్ముకొన్నవాడు తామసుడు. అది సాత్వికుణ్ణి కూడా మోహింపచేస్తుంది. సామాన్యుడు రోజూ సారాదుకాణాన్ని చూసి ఏదో ఒకరోజున దానికి లొంగిపోయినట్లు. దీన్ని దాటాలి. స్వామి బుద్ధిమంతుడు. వీటన్నింటిని తిరస్కరించినవాడు అందుకనే ఆ భూమిలో ఆగిపోలేదు. చూస్తూ వెడుతున్నాడట.
ఈ చూడటం మనవంటి సామాన్యుల మనోవికారాల్ని చెప్పటంకోసం ఆ వెళ్ళటం జితేంద్రియుల లక్షణాన్ని తెలియజేయటంకోసం. సరే అలా తిని తాగి ఒళ్ళు తెలియక
కాచిచ్ఛ వస్త్ర మన్యస్యా స్వపంత్యాః పరిధాయచ
ఆహృత్యచా‚బలా స్సుప్తా నిద్రాబల పరాజితాః
అంటారు మహర్షి. చెప్పటంలో సంప్రదాయాన్ని సంస్కృతిని ఎలా తెలియజేస్తారో చూడండి.
ఇంకావుంది...

ఐక్యతా భావానికి చిహ్నం

$
0
0

అన్ని పండుగలలో ‘సంక్రాంతి’ అతి ముఖ్యమైనది. దీనిని ‘పెద్ద పండుగ’, ‘పెద్దల పండుగ’ అని అంటారు. పెద్దలను స్మరించుకొని, వారికి తర్పణములు, పిండ ప్రదానములు జరిపే రోజు సంక్రాంతి. సం, క్రాంతి- అను రెండు సంస్కృత పదముల కలయికతో ఏర్పడేది సంక్రాంతి. ‘సం’ అంటే మంచి, ‘క్రాంతి’ అంటే పరివర్తనము. మనిషిలో మంచి పరివర్తనము కలిగించడమే ‘సంక్రాంతి’ పరమార్థము.
జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు మకరరాశిలోనికి పరివర్తనం చెందే రోజు సంక్రాంతి. మకర సంక్రమణం అని కూడా అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలంతో ప్రారంభమయ్యే సంక్రాంతికి ఎంతో ప్రాధాన్యత కలదు. సంక్రాంతి రావడానికి ముందు - నెల రోజులు ‘‘నెలగంటు’’తో ప్రారంభమవుతాయి. అప్పటినుండి పండుగ పనులు ప్రారంభమవుతాయి. ప్రతి యింటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ముగ్గులు పెట్టడంలో ఎంతో శాస్ర్తియత దాగి ఉంది. ఖగోళంలో ఆ రోజు నక్షత్రాలు, గ్రహాలు ఏవిధంగా ఉంటాయో, ఆ విధంగా గీయడం ముగ్గులోని అంతరార్ధం. పిండితో పెట్టే చుక్కలు, ఆకాశంలో కనిపించే చుక్కలకు ప్రతీకలు. ఖగోళ శాస్త్ర రహస్యాన్ని ఎనిమిదేళ్ళ ఆడపిల్లకి మొదలు అర్ధమయ్యేలా తెలిసేలా మన ప్రాచీనులు రంగవల్లి విధానంలో యిమిడ్చారు. అంతేకాదు స్ర్తీల్లో చిన్నప్పటి నుంచే సహనం, ఓర్పు అలవడేలా చేయడానికి ఈ ముగ్గులు సహకరిస్తాయ అని అంటారు. ఆ రంగవల్లుల మధ్యలో ఆవుపేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను పెడ తారు. గొబ్బెమ్మలను గౌరీదేవీగా సంభా విస్తారు. గుమ్మడి, తంగేడులతో అలం కరిస్తారు. పసుపుకుంకుమలు పెట్టి తమఇల్లు పాడిపంటలతో అలరారేలా చేయ మని గౌరీదేవిని వేడుకుంటారు. ధనుసంక్రమణతో ధనుర్మాసం మొదలవుతుంది.
ప్రతి దేవాలయంలోను తిరుప్పావై పాశురాలను అను సంధానిస్తూ గోదాదేవిని శ్రీమన్నారాయణుని పూజిస్తారు. శ్రీరంగనాథుని పూజిస్తారు. అలనాడు గోదాదేవిని చేపట్టిన శ్రీరంగనాథుని స్మరిస్తూ గోదాకల్యాణాలను భోగి పండుగ రోజున చేస్తారు. మరుసటి రోజే సంక్రాంతి కనుక కొత్తకాంతులు తమ ఇండ్లలో వెల్లివిరియాలని దేవుని మొక్కుకుంటారు.
ఈకాలంలోనే రైతన్నలకు పంటలు చేతికి వస్తాయ. ఆ ఆనందంలో తనకు తోడ్పడిన ఇతరులందరినీ పిలిచి కొత్తబట్టలు పెట్టి వారికి పండిన పంటలో కొంతభాగాన్నిచ్చి గౌర విస్తారు. జానపదులు ప్రదర్శించే జానపదుల కళలను ఆవిష్కరించే కళాకారులనుకూడా సంక్రాంతిరోజే గౌరవిస్తారు. చక్కని బొమ్మల కొలువువను కూడా తీరుస్తారు. సాయం సంధ్య వేళలలో ముతె్తైదు వులను చిన్న పిల్లలను పిలిచి వారికి పండు తాంబూలాలు, పిండివంటలను, నువ్వులుం డలను దానం ఇస్తారు. ఇలా బొమ్మల కొలువు పేర్చడంలో ఓ పరమార్థం దాగి ఉంది. మనమందరం భగవంతుని చేత చేయబడిన బొమ్మలలాంటివారం. భగవంతుని భారం అంతా భగవంతునిపై వేసి, నిరహంకారంగా, జీవితం గడపాలనేది దీని అంతరార్ధం. తాంబూలాలు ఇవ్వడం, పిండివంటలను నలుగురూ కలసి పంచుకోవడం వెనుక దానగుణం చిన్ననాటి నుంచి పెంచుకోవాలన్న సందేశం ఇస్తుంది. చెప్పులు, గొడుగు, వస్త్రాలు నువ్వులు, పెరుగు, గుమ్మడికాయ ఇలాంటివన్నీ దానం చేస్తారు. ఇవి అన్నీ రాబోయే వేసవికాలంలో జాగ్రత్తపడడానికి ముందుచూపును కలుగ చేస్తాయ. మూడవనాడు కనుమ. ‘కనుమ’ అంటే ‘పశువు’ అని అర్ధం. ఏ యెద్దు మన పొలాన్ని దున్ని పంటని యింటికి తేవడంలో సహకరించిందో, ఏ ఆవు మనకు పాడిని యిస్తూ, మన పిల్లల యొక్క, మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటుందో, అట్టి పశువులను కడిగి, కొమ్ములకు పసుపు కుంకుమలు పెట్టి చక్కగా అపూపములను పెట్టి, నీరు త్రాగించి, ఒళ్ళు నిమిరి, వాటిని ఆనందింపజేసి, వాటియెడ తమ కృతజ్ఞతను ప్రకటించే రోజు ఇది. ఈరోజున పొంగళ్లు వండి పశువులచేత తినిపించి పంటపొల్లాల్లోను, ఇంటిపైన చల్లుకుంటారు. వరి, జొన్నకం కులను ఇంటి చూరుకు (పైభాగంలో) కట్టి పిచ్చుకలు, పావురాళ్లలాంటి పక్షిజాతులకు కూడా విందులు చేస్తారు. ఇలా ఈ సంక్రాంతి సమైక్యంగా, సృష్టిలోని చరాచరజీవజాల మంతా పరస్పరా సహకారం తో జీవించాలనే సందేశాన్నిస్తుంది. ఐక్యత, సోదరభావం, కృతజ్ఞతలను కలిగి ఉండాలనే ఈ సంక్రాంతి అందరి మనస్సుల్లో నవ్యకాంతులను వెద జల్లాలని కోరుతూ సంక్రాంతి శుభాభి నందనలు

ట్రైలర్‌లో అదృశ్యం

$
0
0

వైష్ణవి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రవిప్రకాష్ కృష్ణంశెట్టి నిర్మించిన చిత్రం ‘అదశ్యం’. హారర్, థ్రిల్లర్, కామెడి ప్రధానాంశంగా రూపొందిన చిత్రం సెన్సార్ పూర్తిచేసుకుని ఫిబ్రవరిలో విడుదలకానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను ఫిల్మ్ ఛాంబర్‌లో హీరో జాన్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో మ్యూజిక్ డైరెక్టర్ ఆల్‌డ్రిన్ మాట్లాడుతూ తెలుగులో ఇది మొదటి చిత్రమని, తెలుగువాడిన అయనా చెన్నైలో సెటిలయ్యానన్నారు. టాలీవుడ్‌లో తనను తప్పక ఆదరిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. హీరో జాన్ మాట్లాడుతూ అదే నువ్వు అదేనేను, బంటీ ద బ్యాడ్ బోయ్ తర్వాత చేస్తున్న మూడో చిత్రమే అదృశ్యమన్నారు. అవకాశమిచ్చిన డైరెక్టర్ రవికి కృతజ్ఞతలు తెలిపారు. అతి పెద్దదైన తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలనన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. దర్శకుడు రవిప్రకాష్ మాట్లాడుతూ దిగ్గజ దర్శకులు కె.విశ్వనాథ్, సింగీతం శ్రీనివాస్ ఎన్నో చిత్రాలకు పని చేసిన అనుభవంతో ఈ చిత్రం చేశానన్నారు. బంటీ ద బ్యాడ్ బాయ్‌కి చేసిన జాన్‌నే ఈ చిత్రానికీ హీరోగా తీసుకున్నట్టు చెప్పారు. ఇదొక థ్రిల్లర్ కంటెంట్ అని, ఇంట్రెస్టింగ్‌గా సాగే కథనం ఆడియన్స్‌కి బాగా కనెక్టవుతుందన్న నమ్మకంతో ఉన్నామన్నారు.

అసలేంజరిగింది?

$
0
0

ఎక్సోడస్ మీడియా నిర్మిస్తున్న అసలేం జరిగింది? చిత్రం పోస్టర్‌ను ఎంపీ సంతోష్‌కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీలిమ ప్రొడ్యూసర్‌గా శ్రీరాం హీరోగా రూపొందుతున్న చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తెలంగాణలో ఇంతవరకూ ఎవరూ తీయని కొత్త ప్రాంతాల్లో షూటింగ్ జరపాలనుకోవడం అభినందనీయమన్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్ ఆరు నెలలపాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలను సందర్శించడం గొప్ప విషయమన్నారు. చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్న కెమెరామన్ ఎన్‌వీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాం హీరోగా రూపొందుతున్న చిత్రానికి మ్యూజిక్‌ను మహావీర్ అందిస్తున్నారు. రామ్‌గోపాల్‌వర్మ నిర్మించిన భైరవగీత విలన్ విజయ్‌రామ్ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. చిత్రానికి కథ నెర్లపల్లి వాసు అందించారు. ఫిబ్రవరి 11నుంచి సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని, రెండు షెడ్యూళ్లలో చిత్రీకరణ పూర్తి చేస్తామని నిర్మాత కె నీలిమ తెలిపారు.

యమ్ 6కు యు/ఏ

$
0
0

విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ బ్యానర్లపై విశ్వనాథ్ తన్నీరు నిర్మించిన చిత్రం ‘యమ్ 6’. సెన్సార్ పూరె్తైన చిత్రానికి యు/ఎ సర్ట్ఫికెట్ లభించింది. ఈ సందర్భంగా నిర్మాత విశ్వనాథ్ తన్నీరు మాట్లాడుతూ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా క్వాలిటీగా నిర్మించామన్నారు. ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే అద్భుతమైన కథని దర్శకుడు జైరాం అంతే అద్భుతంగా తెరకెక్కించారన్నారు. ఫిబ్రవరి మొదటివారంలో ఈ సినిమాను విడుదల చేస్తామన్నారు. దర్శకుడు జైరామ్‌వర్మ మాట్లాడుతూ నిర్మాత విశ్వనాథ్ సినిమాను మంచి క్వాలిటీతో నిర్మించారని, నేచురల్‌గా తెరకెక్కించామన్నారు. ప్రత్యేకంగా పోరాట దృశ్యాలు కళ్లముందే జరుగుతున్న భావన కలుగుతుందన్నారు. సినిమాని ఒక ప్రయోగంలా తెరకెక్కించామని, ఆడియన్స్ థ్రిల్ ఫీలవుతూనే లవ్, కామెడీ ట్రాక్స్‌ని ఎంజాయ్ చేస్తారన్నారు. హీరో ధ్రువ మాట్లాడుతూ మంచి చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమవ్వడం హ్యాపీగా ఉందన్నారు. టాలెంట్‌ను గుర్తించి అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

మజిలి సెకెండ్ లుక్‌

$
0
0

పెళ్లి తర్వాత అక్కినేని నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న మజిలి సెకెండ్ లుక్‌ను సంక్రాంతి సందర్భంగా విడుదుల చేశారు. చిత్రంలో సెకెండ్ హీరోయిన్‌గా నటిస్తున్న దివ్యాంశ కౌశిక్ నాగచైతన్యతో కనిపించటంతో సెకెండ్ లుక్ ఆసక్తి పెంచుతోంది.

తెలుగులో మహాచంద్ర

$
0
0

నైనా ఫిలిమ్స్ పతాకంపై యశ్, ప్రేమ్‌కుమార్, శ్రీయ ప్రధాన పాత్రలుగా రూపఅయ్యర్ దర్శకత్వంలో షాన్వాజ్ నిర్మించిన చిత్రం ‘మహాచంద్ర’. ప్రస్తుతం డబ్బింగ్ దశ పూర్తవుతున్న నేపథ్యంలో నిర్మాత షాన్వాజ్ మాట్లాడుతూ కన్నడలో హిట్టయిన చంద్ర చిత్రాన్ని మహాచంద్ర పేరిట తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నామన్నారు. యశ్ ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించాడని, శ్రీయ తన అద్భుత నటనతో ఆకట్టుకుందన్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరి రెండోవారంలో ప్రేక్షకుల ముందుకు తేనున్నట్టు చెప్పారు. దామోదర వనాచార్య సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రానికి సంగీత సహకారం గౌతమ్ శ్రీవాస్తవ, కెమెరా సహకారం దాస్ అందించారు.


భయపెడతారట

$
0
0

ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని పలు భాషల్లో నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నాయి. తెలుగు, తమిళం, హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులతో నిర్మితమవుతున్న తొలి క్రాస్ ఓవర్ చిత్రమిది. ‘హారర్ థ్రిల్లర్’గా రూపొందుతున్న చిత్రంలో మాధవన్, అనుష్కశెట్టి, అంజలి, షాలిని పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి కోట వెంకట్, గోపీసుందర్, షనీల్‌డియో, గోపీమోహన్, నీరజ కోనలు సాంకేతిక నిపుణులు. ఇతర తారాగణం, మిగతా సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తారట. మార్చిలో షూటింగ్ అమెరికాలో మొదలవుతుందని, 2019 ద్వితీయార్థంలో చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెబుతున్నారు.

ఆసనం.. వర్కౌటైంది!

$
0
0

వెంకటేష్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్ కౌర్ హీరోహీరోయిన్లుగా దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఎఫ్ 2... ఫన్ అండ్ ఫ్రస్టేషన్’. ఈ నెల 12న సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సందర్భంగా దర్శకుడు అనిల్‌రావిపూడి మీడియాతో ముచ్చటించాడు.
మనం రకరకాల ఆసనాలు వేస్తుంటాం. అలాంటిది మనలో ఉన్న ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఒక ఆసనం ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచననుండి ఈ వెంకీ ఆసనం పుట్టుకొచ్చింది. అలాగే వెంకటేష్‌కి ఓ మెనరిజమ్ పెట్టి దాన్ని కథకు లింక్ చేస్తే బావుంటుందనిపించి వెంకీ ఆసనం డిజైన్ చేశాను. ఆడియెన్స్ దాన్ని బాగా ఓన్ చేసుకున్నారు. చాలామంది థియేటర్‌లో ఆ ఆసనాన్ని వేస్తున్నంతగా పాపులరైంది. ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి, జంధ్యాల సినిమాలను చూస్తే అన్ని వర్గాల ప్రేక్షకులు నవ్వుతూనే ఉండేవారు. అది ఈ సినిమాతో తీరింది. అందరూ పగలబడి నవ్వుతున్నారు. సోషల్ మీడియాలో ఈవివి, జంధ్యాలతో పోలుస్తూ కొందరు కామెంట్స్ చేస్తుండటం హ్యాపీ అనిపిస్తోంది. అయితే వారి స్థాయికి నేనింకా ఎదగలేదు. కాకపోతే, ఎక్కడో ఒకచోట వాళ్ల ప్రభావం నాపై ఉంటుందనే మాట వాస్తవం. సినిమాలో వెంకీ అదరగొట్టాడని అంటున్నారు. అలాగే వరుణ్ చక్కగా చేశాడు. వరుణ్ కూడా ఇప్పటివరకు కామెడీ జోనర్‌లో సినిమా చేయలేదు. తను వెంకటేష్‌తో ఎలా కామెడీ టైమింగ్‌లో చేస్తాడోనని కాస్త ఆలోచించాను. తెలంగాణ యాస మాట్లాడుతూ వరుణ్ యాదవ్ అనే కుర్రాడి పాత్రలో కామెడీ జోనర్‌లో తొలిసారి చాలా చక్కగా నటించాడు. ‘పటాస్’ నుండి ‘రాజాది గ్రేట్’ వరకు కమర్షియల్ సినిమాలు చేశాను. అయితే రాజా ది గ్రేట్ సినిమా చేసేటప్పుడు అసలు ఫైట్ లేకుండా కమర్షియల్ సినిమా చేద్దామనే ఆలోచన వచ్చింది. పెళ్ళాం చెబితే వినాలి, క్షేమంగావెళ్లి లాభంగా రండి జోనర్‌లో ఈమధ్య సినిమాలు రాలేదనిపించి ఈ కథను రాసుకున్నాను. సాధారణంగా సినిమాను పూర్తిచేయడానికి ఏడాది సమయం పడుతుంది. కాబట్టి నా టీం సాయి, ప్రవీణ్, నారాయణలతో కథపై నాలుగైదు నెలలు వర్క్‌చేశాం. హిందీలో గోల్‌మాల్, హౌస్‌ఫుల్ సినిమాల సిరీస్ ఉంది. మన తెలుగులో ఇలాంటి జోనర్‌లో సినిమాలు చేయాలని ఉంది. కచ్చితంగా ఎఫ్2కు సీక్వెల్‌గా ఎఫ్ 3 చేస్తాను. వెంకటేష్‌గారికి, వరుణ్‌కి చెప్పేశాను. వాళ్లు ఎప్పుడైనా రెడీ అన్నారు. చర్చల్లో ఉంది. నెక్స్ట్ సినిమా అంటే.. వెంకటేష్‌గారికి ఓ లైన్ చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. కథాచర్చలు జరుగుతున్నాయి. నెక్స్ట్ సినిమా విషయంలో ఇంకా ఏమీ అనుకోలేదు. పండుగకు ఊరెళ్లి ఎంజాయ్ చేసి... మూడువారాలు రిలాక్స్‌అయ్యి... ఓ కొత్త జోనర్‌లో చేయాలనేది ఆలోచించుకుని చేస్తాను. బాలకృష్ణగారికి కూడా ఓ ఐడియా చెప్పాను.

జ్యూక్ బాక్స్‌లో మిస్టర్ మజ్ను

$
0
0

అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న తాజా చిత్రం మిస్టర్ మజ్ను. నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సారథ్యంలో వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జనవరి 25న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పాటలకు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘ఏమైనదో... ఏమైనదో’, మిస్టర్ మజ్ను టైటిల్ సాంగ్, ‘హార్ట్ బ్రేక్’ పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. సంక్రాంతి పండువ సందర్భంగా చిత్రం జ్యూక్ బాక్స్‌ను విడుడుల చేశారు.

మెహ్రీన్‌కు కలిసొచ్చేనా

$
0
0

అందం ప్రతిభ ఉన్న హీరోయిన్స్ లక్ కలిసి రాకపోవడంతో చిన్నచిన్న తప్పులు చేయడంవల్ల కొన్నాళ్లకే కనుమరుగయ్యారు. అందమైన రూపం ఉన్న మెహ్రీన్ ఇప్పటివరకు కెరీర్‌లో పడుతూలేస్తూ వస్తోంది. ఒక్క సక్సెస్ దక్కితే రెండుమూడు ప్లాప్స్ పడుతున్నాయి. తాజాగా ఈ అమ్మడు ‘ఎఫ్ 2’ చిత్రంతో మంచి సక్సెస్‌ను దక్కించుకుంది. ఈ చిత్రంలో హనీ పాత్రలో నటించి ఆకట్టుకుంది. దీంతో మరోసారి మెహ్రీన్ జోరు పెరిగే అవకాశముందంటున్నారు. అంతకుముందు సక్సెస్ లేక కెరీర్ ఎలా సాగుతుందో నమ్మకం లేక ఉన్న మెహ్రీన్‌కు ‘రాజా ది గ్రేట్’ చిత్రంతో బూస్ట్‌ఇచ్చాడు. ఆ సక్సెస్‌తో మెహ్రీన్ వరుసగా ఆఫర్లు దక్కించుకుంది. కాని ఏ ఒక్కటీ ఆమెకు క్రేజ్‌ను తెచ్చి పెట్టలేకపోయాయి. మళ్లీ మునుపటి లాగే కెరీర్ ప్రమాదం పడినట్టయ్యంది. అలాంటి సమయంలో మెహ్రీన్‌కు ‘ఎఫ్ 2’తో దర్శకుడు అనీల్ రావిపూడి సక్సెస్‌ను తెచ్చిపెట్టాడు. సినీ ఇండస్ట్రీలో సక్సెస్ దక్కిన సమయంలో ఆ సక్సెస్‌ను సరిగా సద్వినియోగం చేసుకుని సినిమాలను ఎంపిక చేసుకుంటేనే ఆ సక్సెస్ కొనసాగుతుంది.

అర్జున్‌లిద్దరూ కలిస్తే..

$
0
0

విజయ్ దేవరకొండను అర్జున్‌రెడ్డితో ఒక్కసారిగా స్టార్ హీరోను చేసిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ ప్రస్తుతం అదే అర్జున్‌రెడ్డిని బాలీవుడ్‌లో షాహిద్‌కపూర్‌తో కబీర్‌సింగ్‌గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని దక్కించుకోవడం ఖాయం అంటున్నారు. ఇక అర్జున్‌రెడ్డి సినిమా తర్వాత సందీప్‌రెడ్డి వంగ దర్శకత్వంలో నటించేందుకు స్టార్ హీరోలు కూడా ఆసక్తిగా ఉన్నారు. సందీప్‌రెడ్డి వంగ దర్శకత్వంలో నటించేందుకు ఇప్పటికే మహేష్‌బాబు ఓకే చెప్పాడు. మహేష్‌కోసం పలు కథలు తయారుచేసి సందీప్ వినిపించాడు. ఎట్టకేలకు సందీప్‌రెడ్డి చెప్పిన కథకు మహేష్‌బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మహేష్‌బాబుకోసం పోలీస్ స్టోరీని తయారుచేసినట్లుగా టాక్. ప్రస్తుతం మహేష్‌బాబు తన 25వ సినిమా మహర్షిని పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ ఏడాదిలో సుకుమార్ మూవీని పూర్తిచేసి ఆ తర్వాత సందీప్‌రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా చేస్తాడని టాక్.

రంగవల్లి

$
0
0

25 చుక్కలు, 13 వరకు
సందు చుక్కలు
*

జూలూరు భాగ్యలక్ష్మి
చీమలపాడు,
కృష్ణా జిల్లా

ముద్దబంతి

$
0
0

పల్లవి:
సంక్రాంతిని ముద్దాడే ముద్దబంతివా నువ్వు
జగమంతా పులకరింప ఏదీ ఓసారి నవ్వు
పచ్చదనపు పందిట్లో విరిసిన పూవా
అచ్చమైన తెలుగువారి ఆడపడుచు నీవా

చరణం:
వౌనముద్రలో ఉన్నా.. ఉబికే పరువం నీదే
మనసును ఊరేగించే పసుపు పల్లకీ నీదే
తోటలోని పూలన్నీ నీ వేపే చూశాయి
మాటరాని సొబగులెన్నో నీ లోపల కులికాయి
ఏడాదికి ఒకమారే నీ ఆగమనం
ఎన్ని కళలు నీ వెనుక? ఏమా కథనం.. సంక్రాంతి

గొబ్బెమ్మల మధ్య నీవు గుండెలకే పండుగ
కులికే జడలోన కలికితనం నీదె నిండుగా
కలిసి ఉన్న నీ రేకులలో సమైక్య స్వాగతం
కల్మషమే లేని నీవు నేటి స్వచ్ఛ్భారతం
ముద్దబంతి పువ్వా! నీ తలపే మోహనరాగం
ముద్దుగుమ్మా! నీవెపుడూ మాలో ఒక భాగం పల్లవి.. సంక్రాంతి


లోహ్రి సంబరాలు

$
0
0

భారతదేశం పండుగల నేల. భారతదేశంలో సంవత్సరంలో ఏదైనా నెలలోగానీ లేక ఏదైనా రుతువులోగానీ పండుగ జరగకుండా సమయం గడిచింది అని ఊహించుకోవడమే కష్టతరమైన విషయం. అంతా భారతీయులను పండుగలు పలకరిస్తుంటాయి. ఈ పండుగలను చేసుకునే తీవ్రత, విధానాలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. కానీ పండుగలో ఉన్న సారాంశం, పరస్పర సామరస్యం మాత్రం చెక్కు చెదరకుండా అన్ని పండుగల్లో, అన్ని ప్రదేశాల్లో అలాగే ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయానికి మూల స్తంభాలుగా ఉండే రాష్ట్రాలు లేదా దేశం ఏదైనా పంట కోత సందర్భంగా పండుగలు చేసుకోకపోతే అది నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే.. ఎందుకంటే వ్యవసాయం చేసేవారు పంటకోత సమయంలో వారికి వచ్చే దిగుబడి, రాబడికిగానూ ఎంతో కృతజ్ఞతతో వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పండుగ చేసుకుంటారు. ఉత్సాహపూరితమైన రాష్ట్రాల్లో ముందుండే పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాలు ‘లోహ్రి’ అనే వ్యవసాయానికి సంబంధించిన పండుగను జరుపుకుంటాయి. ఈ పండుగ విశిష్టతల గురించి తెలుసుకుందాం.
లోహ్రి అంటే..
లోహ్రి అనే పదం ఉద్భవించడం వెనుక ఎన్నో కథలు ఉన్నాయి. ఈ పదం ‘లోహ్’ అనే పదంతో ఉద్భవించిందని ఓ కథ ప్రచారంలో ఉంది. ‘లోహ్’ అంటే ఇనుము అని అర్థం. మందమైన ఇనుము బాండీలను పండుగ సందర్భంగా రకరకాల మసాలాలు తయారుచేయడంలో భాగంగా ఉపయోగిస్తుంటారు. ఇక్కడి నుండే ఈ పండుగకు ఈ పేరు వచ్చిందని చెబుతారు. జానపద కథలు చెప్పేవారు మాత్రం పూర్వం ఇద్దరు తోబుట్టువులు ఉండేవారని, వారి పేర్లు హోళికా, లోహ్రి.. హోళికా హోళీ సందర్భంగా వేసిన మంటల్లో చిక్కుకుని చనిపోయిందట. లోహ్రి బతికిపోయాడట. అలా లోహ్రి బతికిపోవడంతో ఆ ఆనందాన్ని ఇలా పండుగ రూపంలో జరుపుకుంటున్నారని చెబుతారు.
వ్యవసాయం
భారతదేశం వ్యవసాయంపై ఆధారపడిన దేశం. ఇది పంజాబ్, హర్యానా వంటి భూసారవంతమైన నేలలు కలిగిన రాష్ట్రాల్లో ఈ మాట మరింత నిజం. ఇలాంటి ప్రదేశాల్లో తాము పడిన కష్టానికి, పెట్టిన పెట్టుబడికిగాను చివరిగా వచ్చే పంట దిగుబడి, పంటకోత సమయంలో వచ్చే రాబడి, ఇక్కడివారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇలాంటి సందర్భంలో జరుపుకునే పండుగనే లోహ్రి అంటారు. అందుచేతనే పంజాబీ ప్రజల గుండెల్లో ఈ పండుగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. లోహ్రి పండుగలో ముఖ్యమైన భాగం ఏంటంటే.. ఈ పండుగ సందర్భంగా పిల్లలు ఇంటింటికి వెళ్లి జానపద పాటలు పాడుతారు. వీరు ఇలా పాడుతున్నందుకుగానూ, ఆ ఇంటివాళ్ళు బెల్లం, గింజలు, డబ్బు, చాకోలెట్స్‌ని వారికి బహుమతిగా ఇస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు ప్రోత్సాహకం లభిస్తుండటంతో వీరు మరింత ఉత్సాహంగా పాల్గొంటారు. అంతేకాదు ఇలా చేయడం వల్ల పిల్లలు సంస్కృతి, విలువల గురించి నేర్చుకోవడంతో పాటు, వీరి వ్యక్తిత్వం కూడా ఎంతగానో అభివృద్ధి చెందుతుందని పెద్దలు నమ్ముతారు. అందుకే పంజాబీ కుటుంబాలన్నీ ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యతని ఇస్తారు.
లోహ్రి పండుగ సమయంలో సూర్యుడు మకరరాశి నుండి తప్పుకుని ఉత్తరం వైపు జరుగుతాడు. ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ సందర్భానే్న ఉత్తరాయన్ అని కూడా పిలుస్తుంటారు. ఈ సమయంలో విపరీతమైన చలి కూడా ఉంటుంది. ఈ అతి చల్లని శీతాకాలం కారణంగానే భోగిమంట కేంద్రంగా లోహ్రి పండుగను జరుపుకోవడం జరుగుతుందట. లోహ్రి పండుగ సందర్భంగా కుటుంబంలోని స్ర్తి, పురుషులందరూ ఇంటి నుంచి బయటకు వచ్చి పంజాబీ జానపద నృత్యాలు చేస్తారు. భోగిమంటను మధ్యలో ఉంచి చుట్టూ వీరు నృత్యాలు చేయడం ఆనవాయితీ. సాధారణంగా స్ర్తిలు గిద్ద అనే నృత్యం చేయగా, పురుషులు బాంగ్రా అనే నృత్యం చేస్తారు. సిక్కులు భోగి మంట చుట్టూ చేరి గురు గ్రంథ్ సాహిబ్ నామస్మరణ చేస్తారట. మరికొందరు భోగి మంట ముందు ధ్యానం కూడా చేస్తారట. ఈ భోగిమంటలు చాలాసేపు మండుతూ ఉండటం కోసం పల్లీపట్టీని, పాప్‌కార్న్, వేరుశెనగకాయలు, ఇంకా మరికొన్ని వాటిని భోగి మంటల్లో వేస్తారు.
*

భోగి పండుగ విశిష్టత

$
0
0

తెలుగుప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి మూడు రోజుల పండుగ. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగిమంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు.. ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ పండుగ తొలిరోజును ‘్భగి’గా, రెండో రోజు ‘మకర సంక్రాంతి’గా, మూడో రోజు ‘కనుమ’గా, నాలుగో రోజు ‘ముక్కనుమ’గా పిలుస్తారు. ఇందులో తొలిరోజును భోగిపండుగగా జరుపుకుంటారు. ‘్భగ’ అనే పదం నుండి భోగి అనే మాట వచ్చింది. ‘్భగ’ అంటే వేడి లేదా మంట అని అర్థం. దక్షిణాయనానికి ఆఖరి రోజు భోగి. దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు, బాధలను బోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ప్రసాదించమంటూ ప్రజలు ప్రార్థిస్తారు. భోగి పండుగ మనలోని ఆశావహ దృక్పథానికి సంకేతం.
భోగి మంట
భోగిరోజున తెల్లవారక ముందే లేచి భోగిమంటలు వేస్తారు. ఆవు పేడ పిడకలు, మామిడి, రావి, మేడి వంటి చెట్ల అవశేషాలు, తాటాకులు, అప్పటికే కోసిన పంటల ఎండు అవశేషాలు వేసి రాజేసి ఈ మంటల్లో ఇంట్లోని పాత వస్తువులను ఈ మంటల్లోకి విసిరేస్తారు. ఎవరు ఎక్కువ వస్తువులు తెచ్చి మంటల్లో వేస్తే వారు గొప్పగా చెప్పుకుంటారు. తెల్లవారుజామున వణికించే ఆ చలిలో చిన్నా పెద్దా అంతా చేరి చలిమంటలు కాచుకుంటారు. పనికిరాని చెడు, పాత ఆలోచనలను వదిలించుకుని కాలంతో పాటు వచ్చే మార్పులను ఆహ్వానించేందుకు మనసును సిద్ధం చేయడమే భోగి మంట వెనకున్న పరమార్థం. అయితే ప్రస్తుతకాలంలో పాత సామానుకు బదులు పాత టైర్లు, కిరోసిన్, ప్లాస్టిక్ వస్తువులను వేస్తున్నారు. ఫలితంగా పర్యావరణంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో హానికరం.
నలుగు
భోగిమంటలు పూర్తికాగానే తలకి, ఒంటికి నువ్వుల నూనెను పట్టించి మర్దన చేసుకుని కుంకుడు రసంతో తలస్నానం చేయాలి. ఇది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయాలి. దీనివల్ల చలి వాతావరణం కారణంగా ఒంట్లో చేరిన కఫ దోషాలు తొలగిపోయి శరీరం నూతన ఉత్తేజాన్ని పొందుతుంది. అంతేకాదు.. ఇలా చేసే స్నానం పీడను, దరిద్రాన్ని తొలగిస్తుందని పెద్దల నమ్మకం.
పులగం
భోగినాడు కొత్త బియ్యంతో చేసిన పులగం తినడం సంప్రదాయం. కొత్త బియ్యం, పెసరపప్పు, నెయ్యి, మిరియాలు జోడించి చేసే ఈ వంటకం రుచికేగాక పోషకాల పరంగానూ ఎంతో మేలైనది. చలికాలంలో జీర్ణశక్తిని పెంచే ఈ పులగాన్ని భోగినాడు తప్పక తినాలని పెద్దలు చెబుతారు.
భోగి పులక
కొన్ని ప్రాంతాలలో భోగి రోజున రైతులు తమ సాగుభూమికి ఆనవాయితీగా కొంతమేర నీరు పారించి తడి చేస్తారు, ఒక పంట పూర్తయిన తదుపరి మళ్లీ పంటకోసం సాగుభూమిలో నీరు పారించడానికి పులకేయడం అంటారు. ఆనవాయితీగా భోగిరోజున పులకేయడాన్ని భోగి పులక అంటారు.
బొమ్మల కొలువు
భోగినాటి సాయంత్రం చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. బొమ్మల కొలువులో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను క్రమ పద్ధతిలో ప్రదర్శనగా ఉంచి పూజిస్తారు. ఈ సందర్భంగా ఆయా దేవీ దేవతల పాటలు పాడి వారి ఆశీస్సులు కోరుకుంటారు.
భోగి పండ్లు
భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగు పళ్లు పోస్తారు. భోగిపండ్లు కోసం రేగుపళ్లు, చెరుకు గడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలను కలుపుతారు. కొంతమంది శనగలు కూడా కలుపుతారు. రేగు పళ్లను పిల్లల తలపై పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని పెద్దలు భావిస్తారు. భోగిపండ్లు పోయడం వల్ల పిల్లలపై ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగిపండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. రేగి పళ్లను బదరీఫలాలు అని కూడా పిలుస్తారు. శివుడ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలలపై బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలోకి అడుగుపెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ.. కాబట్టి సూర్యుణ్ని పోలిన గుండ్రటం రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి ఆర్క్ఫలం అనే పేరు కూడా వచ్చింది. సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా భోగిపండ్లను పోస్తారు. కౌమార్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే.. 12 సంవత్సరాల లోపు చిన్నారుల తలపై భోగిపండ్లను పోస్తారు. *

సంక్రాంతి ముచ్చట్లు

$
0
0

తెలుగువారు సంస్కృతీ ప్రియులు. సంప్రదాయబద్ధులు. ఆచార వ్యవహార పరాయణులు. తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలలో పండుగలు ఒక భాగం. తెలుగువారికి ముక్కోటి దేవతలు ఉన్నట్లే, అందుకు తగినట్లుగానే పండుగలు కూడా ఉన్నాయి. చైత్ర వైశాఖాది ద్వాదశ మాస పర్యంతం, పాడ్యమి మొదలగు ముప్పది తిథులకు సంవత్సరం మొత్తంమీద ఏదో ఒక పండుగ ఉంటూనే ఉంటుంది. ఎన్ని పండగులు వచ్చినా శ్రమను లెక్కచేయకుండా, ఖర్చుకు వెనుకాడకుండా తెలుగువారు ప్రతీ పండుగను ఇనుమడించిన ఉత్సాహంతో జరుపుకుంటారు. ఇల్లు అలికి ముగ్గులు పెట్టి ఇంటిని, పూజామందిరాలను ఆయా పండుగలకు పూజలకు అనుగుణంగా అలంకరించి ఆయా పూజలను, పండుగలను భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.
అయితే, పండుగలను జరుపుకోవడమనే సంప్రదాయం తరతరాలుగా, యుగయుగాలుగా నాటి నుండి నేటివరకు అప్రతిహతంగా, అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్నప్పటికీ ఇటీవలి కాలంలో మారుతున్న కాల మాన పరిస్థితుల దృష్ట్యా క్రమేపీ ఆ సంప్రదాయం సన్నగిల్లుతూ వస్తోన్నట్లుగా కనిపిస్తోంది.
ఉదాహరణకు తెలుగువారు పెద్ద పండుగగా పిలుచుకునే ‘సంక్రాంతి’ పండుగనే తీసికొంటే- గతంలో సంక్రాంతి పండుగకు నెల రోజుల ముందే హడావుడిమొదలయ్యేది. ధనుర్మాసం ప్రారంభమైన నాటినుండి అంటే నెల పట్టిన నాటినుండి తెలుగువారి లోగిళ్ళలో ఇంతులు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిముందు కలాపి జల్లి రంగు రంగుల రంగవల్లికలు తీర్చిదిద్దటం మొదలుపెట్టేవారు. మరోవైపు కాళ్ళకు గజ్జెలు, ఒక చేత చిఱతలు, మరొకచేత వీణ, కంఠహారాలు, నుదుట తిరునామం, తలపై భిక్షాపాత్రతో సంప్రదాయ పంచెకట్టుతో ‘హరిలో రంగ హరీ’, ‘శ్రీమద్రామాయణ గోవిందో హరి’ అంటూ హరి కీర్తనలు పాడుతూ అపర నారదునిలా హరిదాసు గ్రామంలో వీధి వీధికీ తిరుగుతూ గడప గడపన భిక్ష స్వీకరిస్తూ ప్రతీ గ్రామాన్ని వైకుంఠథామంగా మార్చేసేవాడు. దారికిరువైపులా బంతి, చామంతి పూలు స్వాగత కుసుమాంజలి సమర్పిస్తున్నట్లు తలలూపుతుంటే, తెలిమంచుతెరలను చీల్చుకుంటూ వస్తోన్న హరిదాసు రూపం కానవచ్చేది. ఆపై హరిదాసు గొంతు శ్రావ్యసుభగమై, కావ్య తరంగమై గుడి గోపురాన చిరుగంటలు గణ గణధ్వనులతో గోమాత దరిజేరే లేగదూడ మెడలోని చిరుమువ్వుల సవ్వడితో సమ్మిళితమై చిరుగాలి అలలపై తేలుతూ వచ్చి నిద్దుర మంచుతెరలను చీల్చుకుంటూ కర్ణ్భేరి ప్రహరీ దాటి గుండె గదులలో దూరి మానస తంత్రులను మీటి మేలుకొలుపు పాడేది.
సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందే గ్రీటింగ్‌కార్డుల కోసం యువతీ యువకుల ఆరాటం మొదలయ్యేది. తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా బాపు గీతలు, రమణ రాతలతో కూడిన అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు గ్రీటింగ్ కార్డుల ఎంపిక హడావుడి మొదలయ్యేది. ఒకవైపు నూనూగు మీసాల న్నూ యవ్వనుల ఆటల పోటీలు, మరోవైపు రంగు రంగుల సీతాకోక చిలుకల్లాంటి కనె్నపడతుల గొబ్బెమ్మల ముచ్చట్లు, పంట వసూళ్ళ హడావులో అటు రైతులు, అరిసెలు, పోకుండలు, సున్నుండలు, జంతికలు, చక్కిలాల వంటి సంక్రాంతి పిండి వంటల తయారీలో ఇటు గృహిణులు తలమునకలై ఉండేవారు. ఆపై బాల బాలికలకు భోగిపళ్ళు పోయడం, పెద్ద పండగ -అనగా సంక్రాంతి రోజున పెద్దలను స్మరించుకోవడం, బొమ్మల కొలువుల ఏర్పాటు, విందు భోజనాలు, కొత్త అల్లుళ్ళ అలకలు- పెద్ద పండగ పేరు సార్థమయ్యేంత హడావుడి. పండగ చివరి రెండు రోజులు -కనుమ, ముక్కనుమ రోజులలో పాడి పంటలలో తమకు చేదోడువాదోడుగా వున్న పశు సంతతి పట్ల కృతజ్ఞతగా రైతులు పశువులను, కొట్టాలను, ముఖ్యంగా ఎడ్లబండ్లను అందంగా అలంకరించేవారు. ఈమధ్యలో ‘డూడూ బసవన్న’, ‘అయ్యగారికీ దండం పెట్టు’ అంటూ గంగిరెడ్ల వాళ్ళు, ‘అంబ పలుకు జగదాంబ పలుకు’ అంటూ బుడబుక్కలవాళ్ళు, జంగమదేవరలు, పిట్టలదొదూర వంటి పగటివేషగాళ్ళు ఊరంతా సందడి చేసేవారు. సంక్రాంతి ప్రత్యేక వ్యాసాలతో కవితలు, కథనాలు, చిత్రాలతో పత్రికల ప్రత్యేక సంచికలు కళకళలాడిపోయేవి.
ఇక సంక్రాంతి సంబరాలలో చివరగా చెప్పుకుంటున్నప్పటికీ అత్యంత ముఖ్యమైనది కోడిపందేలు. అలనాటి పలనాటి వీర చరిత్రకు తార్కాణంగా బ్రహ్మనాయుడు, నాగమ్మల పౌరుషానికి ప్రతిరూపాలుగా కోడిపందేలు జరుగుతాయి.
సంక్రాంతి నెల రోజుల సందడి అంతా సంక్రాంతి పండుగ చివరి రోజున ఇంటి ముంగిట రథం ముగ్గు వేసి సంక్రాంతి లక్ష్మికి వీడ్కోలు పలకడంతోను, అలాగే ‘‘అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబు దాపల’ దాగిన వారిని సైతం తన హరినామ సంకీర్తనామృతంలో ఓలలాడించిన హరిదాసును దక్షిణ తాంబూలాదులతో సత్కరించి సాగనంపడంతోను పరిసమాప్తమయ్యేది.
అయితే ఈ సంక్రాంతి వైభవమంతా ఈనాటి టెలివిజన్, స్మార్ట్ఫోన్‌ల పుణ్యమా అని కనుమరుగైపోతోంది. తెల్లవారు జామున నిద్రలేచి ముగ్గులు వేసేవారు లేక ఇంటివాకిళ్లు వెలవెలపోతున్నాయి. నేడు సంక్రాంతి ముగ్గులు ఇంటి వాకిళ్ళల్లో కాకుండా ‘ముగ్గుల పోటీ’ ప్రాంగణాల్లో మాత్రమే దర్శనమిస్తున్నాయి. ఇంటి ముంగిట భోగిమంటలు నాలుగు రోడ్ల కూడలిలోకి చేరిపోయి కట్టెల పొయ్యిల్లా మారిపోయాయి. హరిదాసు, గంగిరెద్దుల వాళ్ళు, బుడబుక్కల వాళ్ళు వంటి కళాకారులు సరైన ఆదరణ లేక బక్కచిక్కిపోయారు. ట్విట్టర్ శుభాకాంక్షలు, ఫేస్‌బుక్ పోస్టింగులు, వాట్సప్ మెస్సేజ్‌ల ఉరవడిలో గ్రీటింగ్ కార్డుల ప్రాభవం కోల్పోయాయి.
శారీరక శ్రమకు వెరసి ఇంటిలో అరిసెలు, పోకుండలు వంటి సంక్రాంతి పిండివంటల తయారీ కొండెక్కి అంగట్లో కొనితెచ్చుకోవడం లేకుంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ బుక్ చెయ్యడం వ్యవహారమైపోయింది. ఆవుపేడ, భోగి పిడకలు సైతం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారంటే ఈనాటి సంక్రాంతి పండుగ పరిస్థితి ఏమిటో అర్థం చేసికోవచ్చు.
పత్రికలు సైతం ఏవో ఒకటి రెండు కవితలో, వ్యాసాలో ప్రచురించి మమ అనిపించేస్తున్నాయి. టెలివిజన్ ఛానల్స్‌వారు ఆదిలో సంక్రాంతి సంబరాలు పతిబింబించే కార్యక్రమాలు ప్రసారం చేసినప్పటికీ, ప్రజలు టెలివిజన్‌కు అడిక్ట్ అయిపోయారని, టిఆర్‌పి రేటింగ్‌లు పెరిగాయని గమనించి రాను రాను కార్యక్రమాల తీరుతెన్నులు మార్చేసి సంక్రాంతి సినిమాల తాజా విశేషాలతోను, సినిమా తారల ఇంటర్వ్యూలతోను కార్యక్రమాలను నింపేస్తున్నారు.
సంక్రాంతి పండుగ సంబరాల ఆనవాళ్ళు, ఆచారాలు ఒకటొకటిగా కనుమరుగవుతున్నప్పటికీ, నాటికి నేటికి నిలిచివున్న ఆచారం మాత్రం ఒకటి ఉంది. అదే కోడిపందేలు. ఈ కోడిపందాలు సంక్రాంతి ప్రాభవాన్ని దశదిశలా వ్యాపింపజేసి సంక్రాంతికి పేరుప్రఖ్యాతులు తెచ్చాయి. ఎంతగా అంటే సంక్రాంతి అంటే కోడిపందేలు, కోడిపందేలు అంటే సంక్రాంతి అన్నంతగా! నిజం చెప్పాలంటే నేడు తెలుగునాట క్రికెట్ పోటీలకంటే కోడిపందేలకే ఎక్కువ ఆదరణ వున్నదనటంలో అతిశయోక్తిలేదు.
సంక్రాంతి యొక్క గత వైభవాన్ని, ప్రాభవాన్ని ఏళ్ళ తరబడి ప్రత్యక్షంగా చూసినవారికి కళావిహీనమైన నేటి సంక్రాంతిని చూస్తుంటే ‘ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు?’ అని బరువెక్కిన గుండెలు, బోసిపోయిన లోగిళ్ళు ప్రశ్నిస్తున్నట్లుంటాయి.
ఈమధ్య నోస్టాల్జియా ఒక ఫ్యాషనైపోయిందని కొందరు విమర్శిస్తే విమర్శించవచ్చుగాక, వాస్తవ చిత్రమైతే ఇలాగే ఉంది. ‘‘సంప్రదాయం నిలిచే వుంటుంది హమేషా అదే తమాషా’’ అన్న కవివాక్కుకు అపప్రథ తెచ్చేలా!

అంబరమంత సంబరం

$
0
0

సంక్రాంతి పర్వదినం శుద్ధ అష్టమి భద్రాష్టమి నవమినాడు ధ్వజ నవమి నాడు వస్తాయి. ఉత్కళ దేశంలో శుద్ధ దశమిని శాంబరీ దశమిగా పాటిస్తారు. ద్వారాలకు, గడపలకు పూజలు నిర్వహిస్తారు. ఏకాదశినాడు పుత్రదైకాదశి వస్తుంది. శుద్ధ చతుర్దినాడు విరూపాక్షుడయిన శివుణ్ణి పూజిస్తారు. దానే్న వినూపాక్ష వ్రతం అని అంటారు. పుష్యమీ నక్షత్రం రోజులుండే పూర్ణిమ వచ్చిన మాసానే్న పుష్యమాసం అంటారు. శ్రావణపూర్ణిమనాడు వేదపఠనం మొదలెడతారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం జిల్లాలో వడ్డాదిలో తీర్థాలు నిర్వహిస్తారు. తమిళనాడులో ప్రతీ దేవాలయంలో చాలా గొప్పగా ఉత్సవాలు జరుపుతారు. తమిళనాడులో ‘తైపూసమ్ ’ అంటారు.
పుష్యకృష్ణపక్షం
కృష్ణపాడ్యమినాడు విద్యావ్యాప్తి వ్రతం, అష్టమిరోజున కాలాష్టమి, నవమి రోజున అన్వాష్టకాశ్రాద్ధం, ఏకాదశి రోజున షట్‌తిలైకాదశి, ద్వాదశి రోజున సంప్రాప్తి ద్వాదశి, చతుర్దశినాడు యమతర్పణ పూజాదులు నిర్వహించడం సంప్రదాయం. అదే గోదావరి తీరవాసులు దానినే 3చొల్లంగి అమావాస్య2గా పాటిస్తారు. తూర్పుగోదావరి జిల్లా ఏడుపాయలలో ఒక్కటైన తుల్యభాగ సాగరంలో కలవటంవలన ఈ రోజు స్నానం ఇందులో చేస్తే సర్వశుభాలు కలుగుతాయి.
ఉత్తరాయణం రోజు సూర్యుడు మకరరాశిలో ప్రవేశించి ఉత్తరగతుడవుతుండంవల్ల ఈ రోజును 3మకర సంక్రాంతి2 అంటారు. ఈరోజున తెలుగు ప్రజలు ఇళ్లన్నీ గొబ్బెమ్మలతో అలంకరించి, ముగ్గులు వేసి ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతారు. కొత్త ధాన్యం ఇంటికి రావడంతోనే దేవునికి నైవేద్యాలు సమర్పిస్తారు. ఇక చివరి రోజైన కనుమ రైతులకు సంబంధించినది. దీనినే అధర్వణవేదంలో ‘ అనడుత్సవం’ అంటారు. ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత వుండటంవలన ఈ పుష్యమాసమంతా చాలా శుభప్రదమైనది.
సంక్రాంతి అంబరాన్నంటే సంబరాల పండగ. పుడమి పులకించిపోతుంది రంగు రంగుల ఇండ్ల ముంగిళ్ళలో వేసే ముగ్గులతో. క్రొత్త ధాన్యంతో గ్రామీణ ప్రాంతాల్లోని గాదెలన్నీ కూడా కళకళలాడు సందర్భం. భోగి పండగ రోజున భోగిమంటల్లో ఇంట్లో వున్నటువంటి పనికిరాని కట్టె వస్తువులను ఆ భోగిమంటల్లో వేస్తారు. భోగిమంటల కార్యక్రమం అయిపోగానే భోగిపళ్ల స్నానాల కార్యక్రమం వుంటుంది. సంక్రాంతి పండగ రోజున ఇళ్ళ ముంగిళ్ళన్నీ రంగు రంగుల ముగ్గులతో, హరివిల్లులతో, రంగవళ్లికలతో ప్రతీ ఇంటి ముంగిలి కళకళలాడుతుంటాయి. అలా వేసిన ముగ్గుల్లో గొబ్బెమ్మలు ఉంచి అందులో గరికపోచలు రేగుపళ్ళు, పూలు ఉంచుతారు. గొబ్బెమ్మకు సంబంధించిన పాటలు కూడా బాగానే వాడుకలో వున్నాయి. గొబ్బెమ్మను గౌరీదేవి ప్రతిరూపంగా చూస్తారు. ఈ సంక్రాంతి పండుగకు హరిదాసులు కాషాయ వస్త్రాలు ధరించి, మెడలో పూలమాలలు, రుద్రాక్ష దండలు వేసుకొని నామలు పెట్టుకొని తలపై అక్షయపాత్ర పెట్టుకొని, ఒక చేత్తో చిడతలు, భుజం మీద తుంబుర పెట్టుకొని, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని పద్యాలు, నృత్యాలు చేసుకుంటూ ఊరంతా కలియతిరుగుతారు. అదేవిధంగా బసవన్నలయితే గంగిరెద్దులను పట్టుకొని వాటిపై రంగు రంగుల వస్త్రాలతో అలంకరించి, కొమ్ములకు వస్త్రాలు కట్టి, గజ్జెలతో అలంకరించి సన్నాయి మేళాలతో విన్యాసాలు చేసుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో కన్పిస్తారు. ఈ పండగకు బొమ్మలకొలువులను కూడా మన ఇండ్లల్లో ఏర్పాటుచేసుకుంటాం. పేరంటాండ్రకు ఆకులు, వక్కలు, పండ్లు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారు.
ఇక అసలు ఘట్టం సంక్రాంతి వచ్చిందంటే చాలు, ప్రతీ ఇంట్లో కట్టెల పొయ్యి వెలిగించి పిండి వంటల కార్యక్రమాన్ని చేపడతారు. ఇలాంటి పండుగలే మానవుల్లో కలివిడితనాన్ని, ఉమ్మడి కుటుంబాల్లోని వ్యక్తులమీద ప్రేమాభిమనాలు తగ్గిపోకుండా చూస్తున్నాయి. ఇక కనుమ రోజున అంటే సంకాంతి పండగ మరుసటి రోజు పశువులకు ప్రధానమైనది. ఇలా సంక్రాంతి పండుగను మూడు రోజులు-్భగి, సంక్రాంతి, కనుమలుగా ఎంతో సంబరాలతో ఆడంబరంగా జరుపుకుంటాము.

జూదరులు అరెస్టు

$
0
0

అగళి, జనవరి 14: మండల పరిధిలోని కదిరేపల్లిలో జూదం ఆడుతున్న ముగ్గురిని సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. జూదం ఆడుతున్నట్లు అందిన సమాచారంతో ఆకస్మిక దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకొని వారి నుండి రూ.8,900 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు.
జూదరులు అరెస్టు
గోరంట్ల, జనవరి 14: మండల పరిధిలోని ఎగువ గంగంపల్లి సమీపంలో తొమ్మిది మంది జూదరులను అరెస్టు చేసినట్లు సీఐ ధరణికిషోర్ తెలిపారు. గ్రామం వద్ద పొలాల్లో జూదం ఆడుతున్నట్లు సమాచారం రావడంతో ఆకస్మిక దాడులు జరిపి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని రూ.33,300 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఇద్దరు కోడిపందెంరాయుళ్లు అరెస్ట్
నల్లచెరువు, జనవరి 14: మండల పరిధిలోని పల్లెవాండ్లపల్లిలో కోడిపందెం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో సోమవారం ఎస్సై రమేష్‌బాబు ఆధ్వర్యంలో పోలీసులు కోడిపందెం స్థావరంపై దాడులు నిర్వహించి ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి రూ.2వేలు నగదు, 4 పందెం పుంజులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. దాడులలో పోలీసులు నరసింహమూర్తి, ప్రవీణ్, రాజేంద్ర, ప్రసాద్‌నాయక్, లోకేశ్వర్‌రెడ్డిలు పాల్గొన్నారు.

పాన్ షాపులపై పోలీసుల ఆకస్మిక దాడులు
హిందూపురం టౌన్, జనవరి 14: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం పట్టణంలోని పలు పాన్ షాపులపై స్థానిక సీఐల ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పోలీసులు ఎనిమిది బృందాలుగా విడిపోయి పట్టణంలోని పాన్ షాపులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆయా షాపుల్లో నిషేధిత గుట్కా విక్రయాలు సాగుతున్నాయా లేదా అన్న విషయాలను పరిశీలించారు. పలు దుకాణాల్లో అనుమానిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వన్‌టౌన్ సీఐ చిన్న గోవిందు మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాన్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
గార్లదినె్న, జనవరి 14: మండల పరిధిలోని ఇల్లూరు గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్‌లను పట్టుకున్నట్లు ఎస్సై ఆంజనేయులు పేర్కొన్నారు. వాటిని ఆర్డీఓకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.

మృతదేహం గుర్తింపు
గోరంట్ల, జనవరి 14: మండల పరిధిలోని పప్పనపల్లితండా వద్ద గత శుక్రవారం లభ్యమైన మృతదేహం ఆచూకీ తెలిసినట్లు సీఐ ధరణికిషోర్ తెలిపారు. కర్నాటక చేళూరుకు చెందిన చంద్రకళగా గుర్తించామన్నారు. పత్రికల్లో వచ్చిన ఫొటోను గుర్తించి బంధువులు స్టేషన్‌కు వచ్చి వివరాలు చెప్పారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Viewing all 69482 articles
Browse latest View live