* ఆలస్యంగా వెలుగుచూసిన వైనం
* పోలీసుల అదుపులో నిందితుడు
పుంగనూరు , జూలై 14: ఓ మహిళను దారుణంగా హత్య చేసి.. తానే హత్య చేశానని నిందితుడు ఒప్పుకున్న సంఘటన పుంగనూరు మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్ఐ రాజశేఖర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మే 25వ తేదీన పుంగనూరు మండలంలోని వనమలదినె్న గ్రామానికి చెందిన రామానాయుడు భార్య సరస్వతమ్మ(55) మే నెల 25వ తేదీన వడదెబ్బతో పొలం వద్ద మృతి చెందిందని కుంటుంబ సభ్యులు దహన క్రియలు నిర్వహించారు. అయితే గత మూడు రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన గురుమూర్తి మద్యం మత్తులో వనమలదినె్న గ్రామంలో సరస్వతమ్మను తానే హత్య చేశానని ప్రజలను బెదిరిస్తుండగా గ్రామస్థులు నిందితుడిని పట్టుకుని విద్యుత్ స్తంభానికి కట్టివేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని గత మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారించడంతో తానే మహిళను హత్య చేశానని తెలిపాడు. ఈమేరకు సోమవారం సరస్వతమ్మ సమాధి వద్దకు ఎస్ఐ, తహశీల్దార్ మునిరాజు, డాక్టర్ వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించినట్లు పేర్కొన్నారు. మృతురాలి భర్త రామానాయుడు ఫిర్యాదు మేరకు నిందితునిపై కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా గత ఆదివారం నిందితుడు గురుమూర్తి పోలీసులకు కళ్లుగప్పి పరారయ్యేందుకు యత్నించాడు. అప్రమత్తమైన గ్రామస్థులు నిందితున్ని పట్టుకుని తిరిగి పోలీసులకు అప్పగించారు.
గురుమూర్తి ఒక సైకో
పుంగనూరు మండలంలోని వనమలదినె్న గ్రామానికి చెందిన గురుమూర్తి గత కొంత కాలంగా సైకో మాదిరిగా ప్రవర్తిస్తున్నాడని గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురుమూర్తి తమ గ్రామంలో కత్తి పట్టుకుని తిరుగుతుంటాడని, కనిపించిన కోళ్లను కత్తితో గొంతుకోసి కాల్చి అక్కడికక్కడే తినేవాడని, కుక్కలు కనపడితే వాటి తోకలు కత్తిరించేవాడని, అతనికి ఎవరైనా ఎదురు సమాధానం చెబితే చంపేస్తానని బెదిరించేవాడని తెలిపారు. అతని భార్యను సైతం హింసించేవాడని, అడ్డుకునేందుకు స్థానికులు వెళ్తే అక్రమ సంబంధం అంటగట్టేవాడని, అతనికి ఉరిశిక్ష వేయించాలని గ్రామస్థులు పోలీసులను కోరారు.
రుణమాఫీపై నేడు రాష్టవ్య్రాప్త ఆందోళన
సిపిఐ రాష్టక్రార్యదర్శి రామకృష్ణ
తిరుపతి, జూలై 14: ఎన్నికల ప్రణాళికలో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీమేరకు రైతులకు రుణమాఫీ చేయాలని, కొత్త రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్టవ్య్రాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, బ్యాంకుల ఎదుట ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. తిరుపతిలోని పార్టీ కార్యాలయంలోసోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అరుణ్ జైట్లీ బడ్జెట్ యుపి ఎ ప్రభుత్వ ఆర్థిక విధానాల కొనసాగింపేనని ఎద్దేవా చేశారు. విదేశీ పెట్టుబడులను యుపి ఏ 26శాతానికి పెట్టడానికి ప్రయత్నిస్తే, ఎన్ డి ఏ ఏకంగా 49శాతం పెంచడానికి నిర్ణయం తీసుకుందన్నారు. దీనిని తాము తీవ్రంగా నిరసిస్తున్నట్లు చెప్పారు. రక్షణ, భీమా,విమానయానాలతోపాటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎఫ్ డి ఐ పెట్టుబడులకు బడ్జెట్లో ద్వారాలు తెరవడం దారుణమన్నారు. గత బడ్జెట్తో పోలిస్తే ప్రాధాన్యతా రంగాలన్నింటిలో కోత విధించారని వివరించారు. వ్యవసాయ రంగానికి 2013-14 బడ్జెట్లో 18,781 కోట్లు కేటాయిస్తే, 2014-15 బడ్జెట్లో 11,531కోట్ల రూపాయలు కేటాయించారని వివరించారు. అలాగే సంక్షేమ కార్యక్రమాలకు గత బడ్జెట్లో 1,93,443 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈసారి 1,13,633 కోట్లు కేటాయించారని తెలిపారు. చేనేత రంగానికి గతంలో 594కోట్లు కేటాయించగా ఈసారి 321కోట్లే కేటాయించారని రామకృష్ణ వివరించారు. ఇలా అన్ని రంగాల్లోకోత విధించారని,అధిక జనాభా ఆధారపడివున్న ఆయా రంగాల కేటాయింపుల్లో కోతవిధించడం జరిగిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా, పన్నుల మినహాయింపు, పరిశ్రమలస్థాన, ఉత్తరాంధ్రలో వెనుకబడిన మూడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు,నూతన రాష్ట్ర రాజధాని నిర్మాణంపైన బడ్జెట్లో ప్రసక్తే లేదన్నారు. పేద,సామాన్య,కార్మిక,రైతు వ్యతిరేక బడ్జెట్గా, కార్పొరేట్ రంగాన్ని సంతోషపెట్టే బడ్జెట్గా ఉందని ఆయన వివరించారు.రుణమాఫీ విషయంలోరీ-షెడ్యూల్ అంటు కొత్త పల్లవిని చంద్రబాబు అందుకున్నారని వివర్శించారు. ఎవరికి రుణమాఫీ చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఏయే రుణాలు మాఫీ చేస్తారన్నది ఇంతవరకు స్పష్టం చేయలేదన్నారు.చండ్రరాజేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఆగస్ట్ 9,10తేదీల్లో హైదరాబాదులో అంతర్జాతీయ స్థాయి సెమినార్లు నిర్వహించనున్నట్టు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తెలిపారు.11వతేదీన సుమారు 10వేలమందితో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాలనున్నట్లు,ప్రజలు,పార్టీ నాయకులు,కార్యకర్తలు ఈకార్యక్రమాల్లో పెద్దఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈవిలేఖరుల సమావేశంలో సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎ.రామానాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్.వెంకయ్య,చిన్నం పెంచలయ్య, మురళి,హరికృష్ణ, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
రూటు మార్చిన స్మగ్లర్లు
* పొలాలు, అటవీశాఖ గోడౌన్ల ఎర్రచందనంపై కన్ను
* జిడి నెల్లూరులో కాపలాదారులను కట్టేసి
ఎర్రచందనం చెట్లు నరుక్కెళ్లిన వైనం
చిత్తూరు, జూలై 14: పోలీసుల ఎత్తుగడలను స్మగ్లర్లు తిప్పికొడుతూ స్మగ్లింగ్ రూటు మార్చుతున్నారు. అడవుల్లో పోలీసుల కూంబింగ్లు ఎక్కువ కావడంతో వ్యవసాయ పొలాల్లో రైతులు పెంచుకుంటున్న ఎర్రచందనం చెట్లపై, అటవీశాఖ గోడౌన్లలోని దుంగలపై కనే్నస్తున్నారు. ఇటీవల తిరుపతి వైల్డ్ లైఫ్ కార్యాలయంలోని అటవీశాఖ గోడౌన్పై, మొలకల చెరువు, చిన్నగొట్టిగల్లు అటవీశాఖ గోడౌన్లలోని ఎర్రచందనం దుంగలను తరలించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలా స్మగ్లర్లు తమ రూటు మార్చి తమ వ్యాపార కార్యకలాపాలను మాత్రం యథాతథంగా కొనసాగిస్తున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పి పిహెచ్డి రామకృష్ణ ఎర్రచందనం స్మగ్లర్ల ఏరివేత కార్యక్రమాన్ని ఒకవైపు ముమ్మరం చేస్తుండగా, మరోవైపు పోలీసులకే సవాల్ విసురుతూ పొలాల్లో, అటవీశాఖ గోడౌన్లలోని ఎర్రచందనంను స్మగ్లర్లు దోచుకువెళుతున్నారు. ఇప్పటికే 800 స్మగ్లర్ల జాబితాలను ఎస్పి రామకృష్ణ తయారుచేసి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన విషయం విదితమే. ఇందులో ఇప్పటికే పదుల సంఖ్యలో బడా స్మగ్లర్లతో పాటు 175 మంది స్మగ్లర్లను అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. పోలీసులు స్మగ్లర్లను పట్టుకునే పనిలో ఉండగా బడా స్మగ్లర్లు కొందరు అజ్ఞాతంలో ఉంటూ తమ అనుచరులు, కూలీలతో వ్యాపారాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈనేపథ్యంలో జిడి నెల్లూరు మండలం చిత్తూరు -పుత్తూరు ప్రధాన రహదారిలో ఉన్న జయచంద్రనాయుడు మామిడి తోపులో సుమారు వంద ఏళ్లుగా ఉన్న ఎర్రచందనం చెట్లపై స్మగ్లర్ల కన్నుపడింది. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సుమారు 20 మంది స్మగ్లర్లు తోపులో ప్రవేశించి అక్కడ కాపలాగా ఉన్న సాంబశివరావు, రాజేశ్వరి దంపతులను చెట్టుకు కట్టేసి బ్యాటరీ మిషన్తో నాలుగు టన్నుల బరువు కల్గిన నాలుగు భారీ ఎర్రచందనం వృక్షాలను నరుక్కుని వెళ్లారు. పోలీసులు ఎక్కువగా నిఘా పెంచిన ప్రతి పర్యాయం ఈ మార్గంలోని ఫామ్ హౌస్లు, మామిడి తోపుల్లో రైతులు పెంచుకునే ఎర్రచందనం చెట్లపై స్మగ్లర్లు కనే్నస్తున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జిడి నెల్లూరు మార్గంలో సిఎం రమేష్ ఫామ్ హౌస్లో ఉన్న ఎర్రచందనం చెట్లను స్మగ్లర్లు నరుక్కుని వెళ్లారు. అటవీశాఖ గోడౌన్లపైనే కాదు ఏకంగా అటవీశాఖ అధికారుల కార్యాలయాల్లో ఉన్న చెట్లను నరక్కువెళ్లిన సంఘటనలపై విచారణ జరుగుతున్నాయి. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ ఆవరణలోని ఎర్రచందనం చెట్లను సైతం నరుక్కుని వెళ్లిన సంఘటనలపై పెద్ద దుమారమే చెలరేగింది. ఇలా పోలీసులను సవాల్ చేస్తూ స్మగ్లర్లు ఎర్రచందనం స్మగ్లింగ్ను రూటు మార్చి కొనసాగిస్తున్న సంఘటనలు ప్రతిరోజు జరుగుతున్నాయి. ఏదిఏమైనా జిల్లాలో ఎక్కడపడితే అక్కడ విస్తారంగా ఉన్న ఎర్రచందనం చెట్లను స్మగ్లర్లు తమ చేతివాటం ప్రదర్శిస్తూ పోలీసులు, అటవీశాఖ అధికారుల కళ్లుగప్పి కొత్త కొత్త రూట్లలో జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లను ఒకవైపు ఏరివేస్తుండగా, మరో వైపు కొత్త స్మగ్లర్లు పుట్టుకొస్తున్నట్లు జరుగుతున్న సంఘటనలను బట్టి స్పష్టం అవుతోంది. చోటా మోటా స్మగ్లర్లను సైతం పోలీసులు అరెస్టులు చేస్తుండటంతో కూలీలుగా ఉన్నవారు నేడు స్మగ్లర్ల అవతారం ఎత్తుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా రూటు మార్చుతున్న స్మగ్లర్లు పోలీసులకు సవాల్గా మారారని చెప్పక తప్పదు .
మదనపల్లె మున్సిపల్ చైర్మన్గా
కొడవలి శివప్రసాద్ బాధ్యతల స్వీకరణ
* 34 బోర్లు మంజూరుకు తొలి సంతకం
* నూతన పాలకవర్గాన్ని అభినందించిన టిడిపి నేతలు
మదనపల్లె టౌన్, జూలై 14: మదనపల్లె మున్సిపల్ చైర్మన్గా సోమవారం కొడవలి శివప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. తొలుత మున్సిపల్ ఛైర్మన్ ఛాంబర్లో పూజలు నిర్వహించిన అనంతరం పట్టణంలో 34 చేతిబోర్లు వేసేందుకు అనుమతి మంజూరు చేస్తూ తొలి సంతకం పెట్టారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కౌన్సిల్ సమావేశ మందిరంలో నూతన పాలక వర్గాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. మున్సిపల్ ఛైర్మన్ కొడవలి శివప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్గా తాను ఎన్నిక కావడం తనకు గర్వంగా వుందన్నారు. ఈ విజయం పార్టీ నాయకులు, కార్యకర్తలకే దక్కుతుందన్నారు. పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా వున్న విషయాన్ని దృష్టిలో వుంచుకుని సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో 34 చేతిబోర్లను వేయనున్నట్లు చెప్పారు. ఇటీవల కాలంలో ట్యాంకర్ల ద్వారా కూడా తాగునీటి సరఫరా గణనీయంగా మెరుగుపడినట్లు తెలిపారు. అధికారులు మరింత నిబద్ధతతో పనిచేసి నీటి కొరత లేకుండా చూడాలన్నారు. పారిశుధ్ధ్యం నిర్వహణపై కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుండాలన్నారు. వర్షాకాలం రానుండడంతో దోమలు ప్రబలకుండా ప్రతి రోజూ ఫాగింగ్ చేసేందుకు సిద్ధంగా వుండాలన్నారు. అలాగే మురికినీటి కాలువలను ప్రతి రోజూ శుభ్రం చేయాలన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యంపై ఫిర్యాదు చేసేందుకు ప్రజలు మున్సిపల్ కార్యాలయానికి వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శివారు ప్రాంతాల్లో వీధిలైట్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులు అటువంటి ప్రాంతాలను గుర్తించి సాధ్యమైనంత త్వరగా వీధిలైట్లు ఏర్పాటు చేయాలన్నారు. త్వరలో తాను వార్డు పర్యటనలు చేపడతానని, ఆ సమయంలో లైట్లు ఏర్పాటు చేయలేదనిప్రజల నుంచి తనకు ఎటువంటి ఫిర్యాదులు రాకూడదన్నారు. సిమెంట్ రోడ్డు తదితర అభివృద్ధి కార్యక్రమాలు విడతలవారీగా చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ భవానీప్రసాద్, తెలుగుదేశం పార్టీకి చెందిన కౌన్సిలర్లు, టిడిపి నాయకులు గంగారపు రామ్దాస్చౌదరి, రాటకొండ బాబురెడ్డి, రాటకొండ మధుబాబు, డిఇ కరీముల్లా, నీలకంఠనాయుడు, టిపిఓ తులసీరామ్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో
వైభవంగా పుష్పయాగం
తిరుపతి, జూలై 14: అప్పలాయగుంటోని శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఇటీవల ముగిసిన బ్రహోత్సవాల సందర్భంగా తెలిసి తెలియకుండా ఏవైనా పొరబాట్లు జరిగివుంటే వాటికి ప్రాయశ్చితంగా టిటిడి నిర్వహించే పుష్పయాగం సోమవారం అత్యంత వైభవంగా సాగింది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 2.30 నుంచి 5గంటల వరకు అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య పుష్పయాగం అంగరంగ వైభవంగా జరిగింది. మూడు టన్నుల బరువుకలిగిన 16 రకాల సుగంధ పుష్పాలను ఈ పుష్పయాగానికి వినియోగించారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ, 7గంటలకు వీధి ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్దఎత్తున పాల్గొని తన్మయత్వం చెందారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.
కోరం లేక కెవిబిపురం ఎంపిపి ఎన్నిక వాయిదా
కెవిబిపురం, జూలై 14: కెవిబిపురం ఎంపిపి ఎన్నిక కోరం లేక మళ్లీ నిలిపివేసినట్లు ఎన్నికల అధికారి రాజు, ఎంపిడివో మోహన్ రావు తెలిపారు. సోమవారం జరిగిన ఎంపిపి ఎన్నిక ప్రక్రియ పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. మండలంలోని 12 సెగ్మెంట్లలో జరిగిన ఎంపిటిసి ఎన్నికల్లో 10 స్థానాల్లో టిడిపి, 2 స్థానాల్లో వైఎస్ఆర్సిపి గెలుపొందింది. మండలానికి ఎంపిపి పదవి ఎస్టీ మహిళకు రిజర్వేషన్ చేయడంతో 12 సెగ్మెంట్లలో ఒక కళత్తూరు సెగ్మెంట్కే ఎస్టీ మహిళ రిజర్వేషన్ ఖరారైంది. దీంతో ఆ సెగ్మెంట్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థి సులోచన గెలుపొందింది. కానీ ఈనెల 4వ తేదీ, 5వ తేదీ జరిగిన ఎంపిపి ఎన్నికల్లోనూ, అదేవిధంగా 13, 14 తేదీ జరిగిన ఎంపిపి ఎన్నికల్లోనూ సరిపడు కోరం లేకపోవడంతో అధికారులు ఎంపిపిని ఎన్నిక చేయలేదు. దీంతో రిజర్వేషన్ స్థానంలో గెలిచిన ఎంపిపి అభ్యర్థి కోరం లేక ఎంపిపి కాలేకపోతోంది. అధికారులు మాత్రం మా చేతుల్లో ఏమీ లేదని నాలుగు సార్లు ఎన్నికల కోరం లేకుండా వాయిదా పడటం వలన సంబంధిత జిల్లా అధికారులకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు నివేదికలు పంపించామన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం రాజకీయ ఎత్తుగడలో భాగంగా కోట మంగాపురం సెగ్మెంట్లో గెలిచిన ఎ. విశ్వనాథ్ చేత రాజీనామా చేయించి ఆ నివేదికను కూడా అధికారుల ద్వారా జిల్లా అధికారులకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు పంపించారు. ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్సిపి ఏమాత్రం టిడిపి నాయకులకు లొంగకపోవడం వలన జిల్లాలోనే కాకండా రాష్ట్రంలో కూడా కెవిబిపురం ఎంపిపి ఎన్నిక రసవత్తరంగా మారింది.
మున్సిపల్ కార్యాలయం వద్ద టిడిపి దిమ్మె కూల్చివేత
* వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లపై కేసు నమోదు
మదనపల్లెటౌన్, జూలై 14: మదనపల్లె మున్సిపల్ ఛైర్మన్గా కొడవలి శివప్రసాద్ సోమవారం బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు ఆదివారం రాత్రి మున్సిపల్ కార్యాలయం ఎదుట పార్టీ దిమ్మెను ఏర్పాటుచేసి ఛైర్మన్తో ప్రారంభించేందుకు పనులు చేపట్టారు. అయితే ఈ విషయం తెలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు అక్కడికి చేరుకుని దిమ్మె ఎలా కడతారంటూ కార్మికులపై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు చెప్పడం వల్లే తాము దిమ్మె నిర్మిస్తున్నామని నిర్మాణ కార్మికులు వైకాపాకు చెందిన కౌన్సిలర్లకు చెప్పడంతో ఆగ్రహించిన వారు దిమ్మెను కూల్చివేశారు. ఈ విషయం తెలియడంతో పలువురు టిడిపి నాయకులు అక్కడి చేరుకున్నారు. అనంతరం కార్మికులపై దౌర్జన్యంచేసి దిమ్మెను కూల్చివేసిన వైకాపా కౌన్సిలర్లపై వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘బెదిరింపు రాజకీయాలు మానుకోవాలి’
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, నాయకులు బెదిరింపు రాజకీయాలను మానుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ కొడవలి శివప్రసాద్, టిడిపి సీనియర్ నాయకులు గంగారపు రామ్దాస్చౌదరి, రాటకొండ బాబురెడ్డి హితవు పలికారు. 40 ఏళ్ల మున్సిపల్ చరిత్రను తిరగరాసి తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని దక్కించుకోవడంతో ఓర్వలేని వైకాపా నాయకులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం మంచిది కాదన్నారు. భవిష్యత్తులో మళ్లీ ఇటువంటి చర్యలకు పాల్పడితే ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు.