* మరో పది రోజులు ఇదే పరిస్థితి
విశాఖపట్నం, జూలై 17: జిల్లాలో కూరగాయలు సాగు గణనీయంగా తగ్గిపోయింది. గడచిన పది రోజులుగా జిల్లాలో కూరగాయలు దిగుబడి లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి వీటిని దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులే నగరంలోని హోల్సేల్ మార్కెట్ నుంచి కూరగాయలను కొనుగోలు చేసి రైతు బజార్లలో విక్రయిస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో అన్ని కూరగాయల రేట్లు గణనీయంగా పెరిగిపోయాయి. కూరగాయలను సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఓపక్క నిత్యావసర వస్తువుల ధరలు తారా స్థాయిని అంటుతుంటే, కూరగాయలు కూడా అందకుండా పోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విరివిగా అమ్ముడయ్యే టమోటా 48 నుంచి 50 రూపాయలు పలుకుతోంది. ఉల్లిపాయలు రైతు బజార్లలో 27 రూపాయలు ఉంటే, బహిరంగ మార్కెట్లో 35 రూపాయలు పలుకుతోంది. వీటన్నింటికీ మించి పర్చిమిర్చి రైతు బజార్లలో కిలో 40 రూపాయలుంటే, బహిరంగ మార్కెట్లో 60 రూపాయలకు విక్రయిస్తున్నారు. అల్లం రైతు బజార్లో 115 రూపాయలు పలుకుతోంది. కాకరకాయ కిలో 36 రూపాయలు ఉందంటే ఇక కూరగాయల ధరలు ఏవిధంగా మండిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో కూరగాయల సాగు చాలా వరకూ తగ్గిపోయింది. గతంలో ఒక్కో రైతు రైతు బజారుకు రోజుకు ఐదు బస్తాల వంకాలు తీసుకువచ్చే వారు. ఇప్పుడు ఒకటి, రెండుకు మించి ఉండడం లేదని ఉద్యానవన శాఖ అధికారులు చెపుతున్నారు. దీంతో హోల్సేల్ మార్కెట్పైనే ఆధారపడాల్సి వస్తోందని అంటున్నారు. హోల్సేల్ మార్కెట్లో కొన్న కూరగాయలపై కిలోకు రెండు రూపాయలు అదనంగా వేసి విక్రయిస్తున్నట్టు అధికారులు తెలియచేస్తున్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉండడం వలన దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ ధరలు మరో పది రోజులపాటు ఉంటాయని అధికారులు తెలియచేశారు. ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతు బజార్లలో గురువారం నాడు వివిధ కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి.
---------------------------------------
కూరగాయలు ధర
---------------------------------------
టమోటా 48
ఉల్లి 27
పచ్చిమిర్చి (తెలుపు) 40
పచ్చిమిర్చి (నలుపు) 52
పొటల్స్ 24
క్యాప్సికం 42
బీన్స్ 46
వంకాయలు 10
క్యాబేజి 18
చిలగడదుంప 20
బీరకాయలు 28
బెండ 24
దొండ 16
కాకర 36
క్యారెట్ 25
భీముడు చిక్కుడు 50
కొత్తమీర (చిన్నకట్ట) 10
బంగాళ దుంప 17
అల్లం 115
బరబాటి 28
దోస 14
అదుపు తప్పిన శాంతి భద్రతలు
* మూడు నెలలుగా సిపి పోస్ట్ ఖాళీ
* 13 రోజుల్లో నాలుగు హత్యలు
* తొలిసారిగా రాజకీయ హత్య
విశాఖపట్నం, జూలై 17: ప్రశాంత విశాఖ నగరంలో అశాంతి నెలకొంది. అరుదుగా జరిగే ఘోరాలు ఇప్పుడు రెగ్యులరైపోయాయి. గడచిన వారం రోజుల్లో నాలుగు హత్యలు జరిగాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖ నగరంలో తొలిసారిగా రాజకీయ హత్య కూడా జరిగిందంటే శాంతి భద్రతలు ఎంత లోప భూయిష్టంగా ఉన్నాయో చెప్పకనే చెప్పచ్చు. నగర పోలీస్ కమిషనర్గా పనిచేసిన శివథర్రెడ్డి ఇక్కడి నుంచి బదిలీ అయి వెళ్లిన తరువాత పూర్తి స్థాయి సిపిని నియమించలేదు. కోస్తా జిల్లాల ఐజి అతుల్ సింగ్కు నగర పోలీస్ కమిషనర్గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఆయన పెద్దగా నగరంలో ఉండకపోవడంతో నగర పోలీసులపై ఉన్నతాధికారుల పట్టు లేకుండా పోయింది. అనేక నేరాలకు పాల్పడి, జైలుకు వెళ్లి, శిక్షా కాలం పూర్తయిన తరువాత తిరిగి బయటకు వచ్చిన వారు నగరంలో అనేక నేరాలకు పాల్పడుతున్నారు. చివరకు ఇది హత్యలకు కూడా దారితీస్తోంది. ఈనెల ఐదవ తేదీ నుంచి ఇప్పటి వరకూ అంటే 13 రోజుల్లో నాలుగు హత్యలు జరిగాయి. ఈనెల ఐదవ తేదీన అక్కయ్యపాలెంలో హర్డ్వేర్ వ్యాపారం చేసుకుంటున్న గొర్లె ముత్యాల నాయుడు భీమిలిలోని ఒక ఫాం హౌస్లో హత్య చేశారు. ముత్యాలనాయుడు కొంతమందితో కలిసి భీమిలికి వెళ్లి, హత్యకు గురికావడం ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఈ హత్యకు కారకులను పోలీసులు ఇప్పటి వరకూ పట్టుకోలేకపోయారు. ఈనెల 11న ఆరిలోవలో నివసిస్తున్న నూకాలమ్మ అనే వృద్ధురాలిని కొంతమంది అగంతుకులు హతమార్చి, ఆమె వద్ద ఉన్న బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ హత్య పట్టపగలే జరిగినా, పోలీసులు నేరస్తులను పట్టుకోలేకపోయారు. ఆ మరునాడే అంటే 12వ తేదీనే టిడిపి 34వ వార్డు అధ్యక్షుడు కిలపర్తి అప్పలనాయుడుని అతి దారుణంగా హతమార్చారు. విశాఖ నగరంలో తొలిసారిగా జరిగిన రాజకీయ హత్యగా ఈ ఘటనను చెప్పుకోవచ్చు. ఈ కేసును ఇప్పటికీ నగర పోలీసులు చేధిస్తునే ఉన్నారు. అయితే రాజకీయ నాయకుడి హత్య కాబట్టి, అనుమానితులను, పాత నేరస్థులను రప్పించి ప్రశ్నిస్తూ, హంతకుల కోసం కూపీ లాగుతున్నారు. ఈ కేసు ఇంకా పూర్తిగా కొలిక్కి రాలేదు. ఇంతలోనే గురువారం పెదగంట్యాడలోని బొట్టా మహలక్ష్మి అనే వృద్ధురాలిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. ఇల్లు అద్దెకు కావాలని మహలక్ష్మి దగ్గరకు వచ్చి, ఇల్లు చూపిస్తుండగా ఆమెను గదిలోనే హతమార్చి, మెడలో ఉన్న కాసింత బంగారాన్ని లాక్కెళ్లారు. ఇలా కేవలం 13 రోజుల్లో నాలుగు హత్యలు నగరంలో చోటు చేసుకున్నాయి. ఇంతటి దారుణ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు.
హంతకులు ఎందుకు చిక్కడం లేదు?
నగరంలో సంచలనం సృష్టిస్తున్న హంతకులను పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు. ఈనెలలో జరిగిన మూడు హత్యలకు సంబంధించి నేరస్తులను పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇంతలో మరో హత్య.. పెద్ద పెద్ద హత్య కేసులను అవలీలగా చేధించగల పోలీస్ అధికారులు నగరంలో లేకపోలేదు. వీరికి ఆ బాధ్యతలను ఎందుకు అప్పగించడం లేదు? ముఖ్యంగా హత్య జరిగిన ప్రదేశం నుంచి క్లూస్ టీం ఆధారాలు సేకరించలేకపోతోందా? ఆనవాళ్లు దొరక్కుండా హంతకులు జాగ్రత్తపడుతున్నారా? ఇటువంటి అనేక ప్రశ్నిలకు సమాధానాలు దొరకాల్సి ఉంది.
ఇవి రౌడీ షీటర్ల ఆగడాలా?
నగరంలో రౌడీషీటర్ల సంఖ్య గణనీయంగానే ఉంది. వివిధ కేసులలో జైలుకు వెళ్లి తిరిగి వచ్చిన వారితో, ఈ రౌడీషీటర్లు చేతులు కలిపి, హత్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. పాత నేరస్థులతోపాటు, ఇతర ప్రాంతాలకు చెందిన రౌడీషీటర్లు, నేరగాళ్ళు కూడా నగరంలో సంచరిస్తూ, ఈ నేరాలకు పాల్పడుతున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా టిడిపి నాయకుడు అప్పలనాయుడు హత్యకు కిరాయి హంతకులను వినియోగించారన్న ప్రచారం కూడా జరుగుతోంది. రౌడీ షీటర్లపై పోలీస్ నిఘా తగ్గిందన్న ఆరోపణలు ఉన్నాయి. రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు కనే్నసి ఉంటే, శాంతి భద్రతలు అదుపులో ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేదని వరుస సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
పూర్తి స్థాయి సిపి లేకుండానే...
పోలీస్ కమిషనరేట్ పరిధిలో 12 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటన్నింటిని నిరంతరం పర్యవేక్షించాల్సిన పోలీస్ కమిషనర్ పోస్ట్ ఖాళీ అయి రెండు నెలలైంది. మే 22న శివథర్రెడ్డి ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లారు. ఆ తరువాత కోస్తా జిల్లాల ఐజి అతుల్ సింగ్ను ఇన్చార్జ్ సిపిగా నియమించారు. ఆయన అప్పుడప్పుడు నగరానికి వచ్చి వెళుతున్నారే తప్ప, పూర్తి స్థాయిలో ఇక్కడి వ్యవహారాలను పట్టించుకోలేకపోతున్నారు. వెంటనే పూర్తి స్థాయి సిపిని నియమిస్తేకానీ శాంతి భధ్రతల పరిస్థితి అధుపులోకి వచ్చేట్టు కనిపించడం లేదు.
కొత్త సిపిగా సునీల్ కుమార్?
విశాఖపట్నం, జూలై 17: నగరానికి కొత్త పోలీస్ కమిషనర్గా సునీల్ కుమార్ వస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం గుంటూరు రేంజ్ ఐజిగా పనిచేస్తున్న సునీల్ కుమార్ త్వరలోనే విశాఖ సిపిగా వస్తారని పోలీసు వర్గాలు చెపుతున్నాయి. రాష్ట్రంలో ఐపిఎస్ల కేటాయింపు వ్యవహారం మరో రెండు, మూడు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వెనువెంటనే పోస్టింగ్లు ఇవ్వచ్చని భోగట్టా.
భవిష్యత్ పోరాటాలకు సన్నద్ధం కావాలి
* ఉపాధి, భూముల సమస్యలపైనే ప్రధాన చర్చ
* వ్యవసాయ కార్మిక సంఘ జాతీయ కార్యదర్శి
విశాఖపట్నం, జూలై 17: దేశంలో ప్రధానంగా వ్యవసాయ కార్మికులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి సునీత్చోప్రా ఆందోళన వ్యక్తంచేశారు. విశాఖ నగరం జగదాంబ జంక్షన్ సమీపానున్న సిపిఎం పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. వరంగల్లో ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించే మహాసభల్లో ఉపాధి హామీ పథకం, భూమి అనే అంశాలపైనే ప్రధాన చర్చ ఉంటుందన్నారు. వీటిపై భవిష్యత్ పోరాటాలకు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయడం ఏమాత్రం సరైందికాదన్నారు. ఎస్ఇజెడ్ల పేరుతో భూములను తీసుకుంటున్నారన్నారు. వ్యవసాయ కార్మికులు రోడ్డునపడుతున్నారన్నారు. భూ స్వాముల వద్ద నుంచి భూములు స్వాధీనం చేసుకుని పేదలకు అందజేయాలన్నారు. అలాగే ఎస్ఇజెడ్ల పేరుతో సేకరించిన భూములు ఎందుకు పనికిరాకుండా పడి వున్నాయని వీటిని స్వాధీనపర్చుకోవాలన్నారు. దేశంలో అతిపెద్ద వ్యవసాయ కార్మిక సంఘం మరెక్కడా లేదన్నారు. 1998లో వ్యవసాయ కార్మికులకు 123 రోజులు పని ఉండేదని, అటువంటిది ఇపుడు 53 రోజులకే పరిమితమవుతోందన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఉపాధి హామీ పథకం సరిగా అమలు జరగడంలేదన్నారు. ప్రతి ఏడాది 33 లక్షల ఎకరాల భూములు అమ్మేస్తున్నారని ఆరోపించారు. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం మంది జనాభా జీవిస్తుండగా, శ్రామికుల్లో 50 నుంచి 60 శాతం మంది వ్యవసాయ వృత్తులపై ఆధారపడే వారే ఉన్నారన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో వ్యవసాయ కార్మికులు, కౌలుదారులు, చిన్నసన్నకారు రైనతులు కీలక భూమిక పోషిస్తున్నారన్నరు. కష్టాలకు వ్యతిరేకంగా వ్యవసా కూలీలంతా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. పేదలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను కాపాడుకోవాలన్నారు. ప్రతి దళిత, గిరిజన, బిసి కుటుంబానికి మూడేకరాల సాగుభూమి ఇవ్వాలని, పేద కుటుంబానికి ఇళ్ళ స్థలం, నివాసం ఉంటున్న వారికి పట్టాలివ్వాలన్నారు. ఉపాధి హామీ బకాయిలు వెంటనే చెల్లించాలని, 70 శాతం నిధులు వేతనాలకు ఖర్చు చేయడం, మెట్ల పారితోషకం ఐదు రూపాయలకే పెంచాలన్నారు. సంఘం ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి క్రాంతి మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య పేరుతో వేదిక స్థాపించాలన్నారు. రాష్ట్రం బౌగోళికంగా విడిపోయినా ప్రజాసమస్యలపై ఐక్యంగా ఉంటారని, ఐక్యతను చాటే విధంగా బహిరంగసభలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ కార్మికుల సమస్యలను ప్రతిబింబించే విధంగా ఈ సభలుంటాయని, వీటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి.శేషారత్నం, ఎం.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
హెల్త్ బడ్జెట్పై చర్చ
* నాలుగు మాసాల్లో విమ్స్ సేవలు
* పలు విభాగాల అధిపతులతో సమీక్ష
* కెజిహెచ్ సేవలు మెరుగుపడాలి
* అవినీతికి పాల్పడే వారిపట్ల కఠిన చర్యలు
* వైద్యా,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీసుబ్రహ్మాణ్యం
విశాఖపట్నం, జూలై 17: హెల్త్ బడ్జెట్పై గురువారం కెజిహెచ్లో కీలక సమీక్ష జరిగింది. హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ ఎల్వి సుబ్రహ్మాణ్యం పలు కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిపారు. ప్రధానంగా విశాఖ నగరంలో కొనే్నళ్ళ కిందట చేపట్టిన విమ్స్ నిర్మాణ పనుల గురించి ఆయన సమీక్షించారు. టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ పనులు చురుగ్గా నిర్వహించడం, ఈ ఏడాది నవంబర్ నాటికి విమ్స్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధితాధికారులకు ఆదేశించినట్టు తెలిసింది. అనేకసార్లు వాయిదాలు పడుతూ వస్తోన్న విమ్స్ నిర్మాణం, ఆసుపత్రిలో వౌలిక వసతులు, దీని నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టడం వంటి అంశాలు చర్చించారు. ఏ స్థాయిలో ఇది పెండింగ్లో ఉంది? దీనికి గల కారణాలేమిటి? టెండర్లను పిలవడం, రూ. 60 కోట్ల నిధుల మంజూరు, తదితర అంశాల గురించి ఈ సందర్భంగా సుబ్రహ్మాణ్యం విభాగాధిపతులతో చర్చించినట్టు తెలియవచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ విశాఖ నగరంలో రాదని స్పష్టంకావడంతో విమ్స్పైనే పూర్తిస్థాయిలో దృష్టిపెడుతున్నట్టు తెలిసింది. దీనిలోభాగంగానే విమ్స్ను అందుబాటులోకి తీసుకురావడం, కెజిహెచ్లో వైద్య సేవలు మెరుపర్చడం, ఇందులో సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని వేగవంతం చేయడం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే 150 నుంచి 200 సీట్లకు మెడికల్ సీట్లు పెరగగా, భవిష్యత్ వీటిని ఇంకా పెంచాల్సిన పరిస్థితులపైన చర్చించారు. ఆంధ్రామెడికల్ కాలేజీ (ఏఎంసి)లో తరగతి గదులు, వసతులు నిబంధనల ప్రకారం అమలవుతున్న పరిస్థితులను ఈ సందర్భంగా ఆయన సమీక్షించినట్టు తెలిసింది. కెజిహెచ్లో ఇటీవల నెలకొన్న వరుస సంఘటనలపై ఆయన ఆరా తీసినట్టు తెలిసింది. ప్రసూతివార్డులో బిడ్డ అపహరణ, రోడ్డు ప్రమాద సంఘటనలో బాధితుని నుంచి లంచం డిమాండ్ చేసిన వైద్యునిపై అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) దాడులు వంటి విషయాల గురించి ఆయన వైద్యాధికారుల నుంచి అడిగి తెలుసుకున్నట్టు తెలిసింది. నిబంధనల ఉల్లంఘన, రోగుల నుంచి మాముళ్ళు వసూళ్ళు, ప్రైవేటు ఆసుపత్రులకు వైద్య చికిత్స కోసం ప్రోత్సహించడం తదితర మరొకొన్ని అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలిసింది. రోగులకు మెరుగైన, నాణ్యతతో కూడిన సేవలందించడంలో లోపాలున్నా, అవినీతికి పాల్పడినా ఉపేక్షించేదిలేదని, అటువంటి వారిపట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించినట్టు తెలిసింది. అలాగే సూపర్స్పెషాలిటీ, విమ్స్ ఆసుప్రతుల్లో అత్యంత అధునాతన వైద్య పరికరాలను సమకూర్చడం, ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల మంజూరు వాటిపైన భవిష్యత్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కొద్ది నెలల కిందట ఇక్కడకు వచ్చిన ఆయన కెజిహెచ్లో అన్ని విభాగాలు కలియతిరిగి విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, ఆదేశాలు తు.చ అమలు జరుగుతున్నాయా? లేదా? అంటూ వైద్యాధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది.
కెజిహెచ్కు అవినీతి రోగం
* ఏసిబి దాడులతో వెలుగులోకి
విశాఖపట్నం, జూలై 17: ఉత్తరాంధ్రకు ఆరోగ్య ప్రదాయినిగా పేరున్న కెజిహెచ్ ఆసుపత్రి ఇపుడు అనేక రకాలైన అపవాదులను ఎదుర్కొంటోంది. క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు వేనూళ్ళుకున్న అవినీటి, అక్రమ సంఘటనలు ఆసుపత్రిని కుదేపేస్తున్నాయి. వరుసగా సంఘటనలను దృష్టిలోపెట్టుకున్న అవినీతి నిరోధిక శాఖ (ఏసిబి) అధికారులు రోజుల తరబడి నిర్వహించిన దాడులు ఆసుపత్రి వర్గాలకు కనుకు లేకుండా చేస్తున్నాయి. క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బంది గుండెల్లో సైతం రైళ్ళు పరుగెడుతున్నాయి. ఏ క్షణంలో ఎవరిపైన చర్యలుంటాయో అన్న భయం పట్టుకొంది.
అత్యవసర వైద్యం సైతం ఇక్కడ వ్యాపారంగా మారింది. సాక్షాత్తూ ఓ వైద్యుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన బాధితునికి అందించే అత్యవసర చికిత్సకు ఖచ్చితంగా డబ్బు చెల్లించాల్సిందేనంటూ పట్టుబట్టడం, చేసిదిలేక రూ.20వేలు బాధిత కుటుంబం రూ.20వేలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్న సంఘటన కాస్త ఏసిబికి చేరింది. దీంతో ఇపుడు ఆ వైద్యునిపై చర్యలకు రంగం సిద్ధమైంది. అయితే ఈ వైద్యునిపై బాధిత కుటుంబం చేసిన పిర్యాదుతో మరికొంతమంది బాదితులు పలు సంఘటనల్లో డబ్బు డిమాండ్ చేసిన ఒకరిద్దరు వైద్యులపై ఏసిబికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. గతంలో జరిగిన అవినీతి సంఘటనలపై ఏసిబి అధికారులు ఇప్పటికే ఆరా తీస్తుండగా, ఏ ఏ సంఘటనల్లో రోగుల నుంచి ఎంతెంత డిమాండ్ చేశారనే దానిపై చాపకిందనీరులా దర్యాప్తు జరుగుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా ఆసుపత్రిలో ఏసిబి దాడులు సంబంధిత వర్గాల్లో దడ పుట్టిస్తుండగా మరోపక్క నాల్గవ తరగతి సిబ్బంది చేతివాటం రోగులపాలిట శాపంగా పరిణమిస్తోంది. అందువల్ల క్షేత్రస్థాయి నుంచి కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందేనంటూ పలు వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల ప్రసూతివార్డులో పసిబిడ్డ అపహరణ సంఘటనలోనూ స్విపర్ హస్తం ఉన్నట్టు తేలింది. దీంతో ఆమెను సస్పెండ్ చేశారు. కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ తదితర ముఖ్యమైన విభాగాల్లో శస్తచ్రికిత్సల కోసం వేలాది రూపాయలు గుంజుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తోన్న నేపధ్యంలో వీటిపై ఏసిబి నిఘా పెట్టింది. ఆసుపత్రి అధికారులు ఎన్ని పిర్యాదులు చేసినా, పోలీసుల దృష్టికి తీసుకువెళ్తున్నా ఏమాత్రం ప్రయోజనం లేదని చెబుతోన్న రోగులు, వీరి బంధువులు ఇపుడు ఏసిబి అధికారులను ఆశ్రయిస్తున్నట్టు తెలిసింది. ఆసుపత్రికి ఎటువంటి సంబంధం లేని దళారులు కొందరు ముఖ్యమైన యూనిట్ల వైద్యులను సైతం శాసిస్తున్నారు. శస్తచ్రికిత్సలకు సంబంధించి మెరుగైన వైద్య కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు సిఫారసు చేస్తోన్న దళారులు పలు యూనిట్లలో దర్జాగా విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోన్న దళారుల వ్యవహారంపై పిర్యాదులు అందతున్నా వైద్యాధికారులు మెతకవైఖరినే అవలంబిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తోంది.
మూడేళ్లయినా 50 శాతం మందికే ఆధార్
* తప్పనిసరి అంటున్న అధికారులు
* తెలుపురంగు రేషన్కార్డుకు లింక్
* సక్రమంగా నడవని కేంద్రాలు
* దరఖాస్తుదారులకు మళ్ళీ సమస్యలు
విశాఖపట్నం, జూలై 17: ఆధార్ కార్డులు తప్పనసరిగా మారునున్నాయి. గత యుపిఏ సర్కార్ పాలనలో గ్యాస్ కనెక్షన్కు ఆధార్ కార్డును అనుసంధానం చేసింది. దీంతో సర్వాత్రా నిరసన వ్యక్తమైంది. తదుపరి కొన్నాళ్ళు వెసలుబాటు కల్పించి ఆ తరువాత ఎన్నికల ముందు ఈ విధానాన్ని తొలిగించింది. దీంతో ఊపీరిపీల్చుకున్న వినియోగదారులకు మళ్ళీ నెత్తిమీద పిడుగు పడినట్టు అయ్యింది. ఆధార్కార్డు లేకపోతే ఇబ్బందులే. ఎందుకంటే ఈసారి కొత్త ప్రభుత్వం తెలుపురంగు రేషన్కార్డుకు అధార్కార్డును అనుసందానం చేసింది. దీనివల్ల ఇక నుంచి తెలుపురంగు రేషన్కార్డు కలిగి ఉన్న ప్రతిఒక్కరూ ఆధార్ను పొందాల్సిందే. ఇంతవరకు భారత పౌరునిగా, లేదంటే పలు అవసరాల నిమిత్తం ఆధార్కార్డు ఉంటే ఉంచిదనుకునే వారంతా ఇపుడు తప్పనిసరిగా వీటిని తీసుకోవాల్సిందే. అందువలనే మళ్ళీ ఆధార్ కార్డుకు సంబంధించి ధరఖాస్తులు, ఐరిస్ తీసుకోవడం వంటి వాటి కోసం కేంద్రాలను వెదుకుంటున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం, ఆ తరువాత సార్వత్రిక ఎన్నికలు వంటి వాటితో కొన్నాళ్ళపాటు కేంద్రాల నిర్వహణ సవ్యంగా జరగలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా నత్తనడకను సాగుతూ వస్తోన్న ఈ కేంద్రాలకు మళ్ళీ ఇపుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పని పడినట్టు అయ్యింది. ఆయా ప్రాంతాల్లో కేంద్రాలున్నా వీటిలో కొన్నిచోట్ల సర్వయర్ పనిచేయక, మరికొన్నిచోట్ల సిబ్బంది కొరత, అత్యధిక జనాభా కలిగి ఉన్న ప్రాంతాల్లో కేంద్రాలే అందుబాటులో లేక దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు.
మూడేళ్ళుగా 50 శాతం మందికే
మూడేళ్ళు కిందట కేంద్రం దీనిని ప్రారంభించింది. ఏడాదికాలంగా మాత్రమే దీనిని వేగవంతం చేశారు. ఆధార్కార్డు జారీలో భాగంగా కేంద్రాలను పెంచగలిగారు. అందువలనే మూడేళ్ళుగా విశాఖ జిల్లావ్యాప్తంగా కేవలం 50 శాతం మంది మాత్రమే కార్డులు పొందగలిగారు. పౌరసరఫరాల విభాగం అధికారులు మాత్రమే 58 శాతం వరకు ఇది పూర్తయ్యిందని, ఇంకా 42 శాతం మేర పూర్తికావాల్సి ఉందని అంటున్నారు. తెలుపురంగు రేషన్కార్డు, ఆధార్కార్డు రెండు కలిగి ఉంటే సరిపోతుంది. అయితే తెలుపురంగు రేషన్కార్డు కలిగి ఉన్న ప్రతిఒక్క కుటుంబానికి ఆధార్కార్డులేవు. అందువల్ల ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, సంబంధిత కేంద్రానికి వెళ్ళి దరఖాస్తు చేసుకుని ఐరిస్ తీయించుకుంటే సరిపోతుందని సంబంధితాధికారులు అంటున్నారు. ఈ విధంగా చేసేందుకు ఎటువంటి ఇబ్బందులుండవని, కేంద్రాలు అందుబాటలోనే ఉంటున్నాయని, కనీసం ఆధార్ పొందేందుకు ఇచ్చే నెంబర్ ఉన్నా సరిపోతుందని చెబుతున్నారు.
వచ్చేనెలా పామాయిల్ డౌటే
* నాలుగు మాసాలుగా ఇదే పరిస్థితి
* కాగుతున్న నూనెల ధరలు
విశాఖపట్నం, జూలై 17: నూనె ధరలు మండిపోతున్నాయి. సాదారణంగా కొనుగోలు చేసే పామాయిల్ ప్యాకెట్లు సైతం ఇపుడు మరింత ప్రియం అయ్యాయి. చౌకధర దుకాణాల ద్వారా తెలుపురంగు రేషన్కార్డుదారులకు ప్రతినెల కిలో పామాయిల్ ప్యాకెట్లు ఇస్తున్నారు. అయితే గత నాలుగు మాసాలుగా ఈ ప్యాకెట్ల పంపిణీ నిలిచిపోయింది. ఆయిల్ నిల్వలు నౌకల ద్వారా దిగుమతి చేయడం, కాకినాడ పోర్టు నుంచి జిల్లా పౌరసరఫరాల కేంద్రాలకు తరలించడం, ఈ లోపు ప్రైవేటు ఏజేన్సీల ద్వారా ఆయిల్ ప్యాకింగ్లు నిర్వహించడం వంటివి నిలిచిపోయాయి. కేంద్రం సకాలంలో చొరవ తీసుకోపోవడం, బాగ్ధాద్లో యుద్ధవాతావరణం వంటివి పామాయిల్ సరఫరాకు బ్రేక్ వేసాయి. ఈ పరిస్థితులను గమనించిన ఆయిల్ మర్చెంట్స్ ఏకంగా అక్రమ నిల్వలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా చమురు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కిలో పామాయిల్ కావాలంటే చౌకధర దుకాణం ద్వారా రూ.40లుండగా, ఇదే తరహాలో నూనె బహిరంగ మార్కెట్లో ఏకంగా రూ.70లు పలుకుతోంది. అదే నెంబర్ వన్ నూనె కోసం వంద రూపాయలకు పైబడి చెల్లించాల్సిందే. గత మూడు మాసాలుగా ఇదే పరిస్థితి ఉన్నా నూనె ధరలను అదుపులోకి తీసుకువచ్చేందుకు సంబంధితాధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడంలేదు.
బ్యాంకర్లతో సమీక్ష
* 2240 మందికి ఉపాధి
విశాఖపట్నం, జూలై 17: ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పథకం, ప్రయోజనాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించుకోవడానికి కావాల్సిన వివరాలు గురువారం జరిగిన బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు. హోటల్ దసపల్లా పంక్షన్హాల్లో నిర్వహించిన బ్యాంకర్ల సమీక్షా సమావేశానికి అదనపు జాయింట్ కలెక్టర్ వై.నరసింహరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్, డివిజన్ కార్యాలయం, సంచాలకులు, ఎల్డిఎం, ఎస్బిఐ నుంచి అధికారులు హాజరయ్యారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, బ్యాంకు ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్లు, ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి అసిస్టెంట్ డైరెక్టర్లు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పనాపథకం, పంచవర్ష ప్రణాళిక (2012-13 నుంచి 2016-17) వరకు రూ.8060 కోట్ల రూపాయల మార్జిన్మనీ మిడిల్ అండెడ్ సబ్సిడీగా ఖాదీ, గ్రామీణ పరిశ్రమకు మంజూరు చేశారు. ఈ పథకం 2016-17 వరకు కొనసాగిస్తారు. ఈ సదస్సు ద్వారా 2014-15 సంవత్సరానికిగాను 2240 మందికి ఉపాధి కల్పించడానికి, 386 లక్షల సబ్సిడిగా (మార్జిన్మనీ) ఐదు జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు,పశ్చిమగోదావరి జిల్లాలకు కేంద్రం ఈ పథకం కింద లబ్ధి చేకూర్చాలని నిర్ణయించినట్టు అధికారులు పేర్కొన్నారు.
ట్రామాకేర్ సిబ్బంది నిరసన
* కొనసాగుతున్న సమ్మె
విశాఖపట్నం , జూలై 17: తొమ్మిది మాసాలు జీతాలు చెల్లించాలని కోరుతూ కెజిహెచ్ ట్రామాకేర్ సిబ్బంది చేపట్టిన సమ్మె ఇంకా కొనసాగుతోంది. గత వారం రోజులుగా సమ్మె నిర్వహిస్తోన్న సిబ్బంది గురువారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేశారు. కేంద్రం తక్షణమే చొరవ తీసుకుని బకాయి పడిన జీతాలను చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. లేదంటే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గురువారం ఇక్కడకు వచ్చిన వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎల్వి సుబ్రహ్మాణ్యం దృష్టికి ట్రామాకేర్ సిబ్బంది సమస్యను తీసుకువెళ్ళారు.
వేధిస్తున్న పిఇటిల కొరత
* కానరాని వౌలిక వసతులు
* కనిపించని క్రీడా పరికరాలు
విశాఖపట్నం , జూలై 17: అందరికీ క్రీడలు అవసరమనే నినాదంతో వ్యాయామ విద్యను పాఠశాల విద్యలో తప్పనిసరి చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం జారీ చేసిన జిఓ 210 అమలుకు నోచుకోవడం లేదు. ప్రతి విద్యార్థి ప్రతిరోజూ సాయంత్రం చివరి పిరియడ్లో క్రీడా మైదానంలో గడపాలని జిఓలో సూచించారు. అయితే జిల్లాలోని పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు కొరత ఉండటంతో పిల్లలు ఆడుకునేందుకు వీలు కావడం లేదు. ఉదయం పాఠశాల ప్రారంభం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక తరగతులతోనే సరిపోతోంది. జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నతపాఠశాలలు కలిపి సుమారు 3500 పైన ఉన్నాయి. వీటిలో ఆరు నుంచి పదవ తరగతి వరకు బాలురు, బాలికలు కలిపి సుమారు 4.5 లక్షల మంది విద్యను అభ్యసిస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ప్రతి 250 మంది విద్యార్థులకు ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు ఉండాలి. దీని ప్రకారం చూస్తే జిల్లాలో 1000కి మించి విద్యార్థులున్న పాఠశాలల్లో ఒక పిడి, మూడు పిఇటి పోస్టులు అవసరం. కాని జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో 30 నుంచి 40 వరకు పిఇటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే హైస్కూల్లో ఫిజికల్ డైరెక్టర్ (పిడి)లు విధులు నిర్వహించాల్సి ఉండగా చాలా పాఠశాలల్లో పిఇటిలతోనే కొనసాగిస్తున్నారు. అయితే ప్రతి ఏటా రాష్ట్రీయ మాథ్యమిక శిక్షా అభియాన్ (ఆర్ఎంఎస్ఎ) నిధుల నుంచి ప్రతి పాఠశాలకు రూ .30 వేల నుండి రూ.50 వేలు సమకూర్చారు. అందులో ఆర్ట్స్, క్రాఫ్ట్, డ్రాయింగ్, వ్యాయామ విభాగాలకు రూ.10వేలు ఖర్చు చేయాలని నిబంధన ఉన్నా కొంత మంది ప్రధానోపాధ్యాయులు సంవత్సరానికి రూ.5 వేలు మాత్రమే అందించారు. ఆ తరువాత ఆ నిధులను అందించిన దాఖలాలు లేవు.
క్రీడా పరికరాల కొరత
పాఠశాలల్లో వ్యాయామ పరికరాలు అందుబాటులో లేకపోవడంతో మొక్కుబడిగా వ్యాయామ పిరియడ్లను నిర్వహించే పరిస్థితి నెలకొంది. నిబంధనల ప్రకారం వారానికి మూడు పిరియడ్లను మాత్రమే వ్యాయామ విద్య, మాస్డ్రిల్ నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. అయితే వారానికి మూడు పిరియడ్లు సరిపోవు అనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ఖాళీగా ఉన్న పిఇటిల పోస్టులను భర్తీ చేసి, క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తే వారానికి ఆరు పిరియడ్లు నిర్వహణ సాధ్యమవుతుందని వ్యాయామ ఉపాధ్యాయులు చెబుతున్నారు. నూతన జిఓ 55 ప్రకారం 280-820 మంది విద్యార్థులకు ఒక పిఇటి ఉండాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నిబంధనలపై వ్యాయామ ఉపాధ్యాయ సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 800 మంది విద్యార్థులను ఒక పిఇటి ఎలా పర్యవేక్షించగలడని అభ్యంతరం చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 40 నుంచి 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అలాగే జిల్లాలో 2500 మంది శిక్షణ పొందిన నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులున్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో అవసరమైన పిఇటిలను నియమించి వ్యాయామ విద్య అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు సిఫార్సులు కోరుతున్నారు.
వౌలిక వసతులు అభివృద్ధి చేయాలి
లలిత్కుమార్ పిఇటి సంఘం జిల్లా అధ్యక్షుడు
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక వసతులు అభివృద్ధి చేయాలి. పిఇటి పోస్టులు పెంచితేనేగాని వ్యాయామ విద్యను పిల్లలందరికీ అందించలేం. అలాగే జిఓ 55ను వ్యతిరేకిస్తున్నాం. 820 విద్యార్థులకు ఒక పిఇటి అన్నది అన్యాయం. గతంలో 250 మందికి ఒక పిఇటి ఉండాలనే నిబంధన ఉండేది. దానిని తిరిగి అమలు చేయాలి. అలాగే జిల్లాలోని పిఇటిలకు పదోన్నతి కల్పించి పిడిలుగా గుర్తిస్తే మరో వంద పోస్టులు పెరుగుతాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదువేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయాలని కోరుతున్నారు.
యుజిసి నుండి పరిశోధనలకు రూ.39 లక్షల గ్రాంట్
విశాఖపట్నం (జగదాంబ), జూలై 17: ఆంధ్ర విశ్వవిద్యాలయం సార్క్ అధ్యయన కేంద్రానికి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) ఏరియా స్టడీస్ ప్రొగ్రాంలో భాగంగా రాన్ను ఐదు సంవత్సరాలలో విభిన్న అంశాలలో పరిశోధనలు నిర్వహించడానికి వీలుగా 39 లక్షల రూపాయల ప్రత్యేక నిధులను మంజూరు చేసిందని వర్శిటీ విసి ఆచార్య జిఎస్ఎన్.రాజు తలిపారు. గురువారం ఉదయం ఎయు అకడమిక్ సెనేట్ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ఇప్పటికే ఐదు దశలను పూర్తి చేసి ఆరవ దశకు చేరిందని అన్నారు. యుజిసి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించిన విధంగా ఆర్థిక, రాజకీయ, రక్షణ, సహకారం తదితర అంవాలపై సార్క్ దేశాలలోని పరిస్థితులను ఈ కేంద్రం ద్వారా అధ్యయనం చేసి తగిన నివేదికలను ప్రభుత్వానికి అందించడం జరుగుతుందని అన్నారు. సార్క్ సభ్య దేశాలలో బలమైన సహకారాన్ని పెంపొందించే దిశగా పరిశోధనలు సాగుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా సార్క అధ్యయన కేంద్రం జరుపుతున్న అభివృద్ధి, పరిశోధనలను విసి అభినందించారు. యుజిసి, కేంద్రం ప్రభుత్వాలకు ఉపకరించే విధంగా సార్క్ కేంద్రం తనకు నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తూ పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర సంచాలకుడు ఆచార్య ఎం.ప్రసాదరావు మాట్లాడుతూ సార్క్ దేశాలమైన బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, ఆప్ఘనిస్తాన్ దేశాలపై మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ను తమ కేంద్రం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటివరకు ఇంత భారీ మొత్తంలో యుజిసి నిధులను అందించలేదని అన్నారు. ఇప్పటి వరకూ తమ సంస్థ ద్వారా 14 పుస్తకాలు, 14 పరిశోధనా నివేదికలు, 60 పరిశోధనా పత్రాలు, వివిధ జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో ప్రచురించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా సంస్థ ద్వారా ప్రచురించబడుతున్న జర్నల్ను విసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వర్శిటీ రెక్టార్ ఆచార్య ఇఎ.నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య కె.రామ్మోహన్రావు, కేంద్రం ఆచార్యులు శ్రీమన్నారాయణమూర్తి, ఆచార్య టి.నిర్మలాదేవి తదితరులు పాల్గొన్నారు.
‘మనగుడి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
* దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ మూర్తి
విశాఖపట్నం , జూలై 17: టిటిడి దేవాదాయ ధర్మాదాయశాఖ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆగస్టు19న నిర్వహించనున్న ఐదవ విడత మనగుడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్విఎస్.మూర్తి అన్నారు. గురువారం మధ్యాహ్నం టర్నర్ సత్రం ఆవరణలో ఉన్న ఉపకమిషనర్ కార్యాలయంలో దేవాదాయశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాలలో ఉన్న అన్ని దేవాలయాలలో మనగుడి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించాలని, దీనికి సంబంధించి గ్రామసంఘాలతో, భజన సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రచార రథాలను గ్రామాలలో తిరగేలా చూడాలని అన్నారు. నగర, గ్రామ సంకీర్తన, ఆలయంలో అభిషేకం, పూజాధికాలతో పాటు భక్తులందరికీ కంకణధారణ, ప్రసాద వితరణ జరిగేటట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. దేవాదాయశాఖకు సంబంధించి పరిపాలనా విషయాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ సహాయ కమిషనర్ ఎన్.సుజాత, డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాస్, పర్యవేక్షకులు డివివి.ప్రసాదరావు, దేవాలయ కార్యనిర్వహణాధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో విస్తృత కూంబింగ్
సీలేరు, జూలై 17 : ఆంధ్రా - ఒడిస్సా సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టు వారోత్సవాలను ఈనెల 28వతేదీన మావోయిస్టులు జరపడానికి పలు సన్నహాలు చేస్తున్న నేపధ్యంలో మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయకుండా అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రా - ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లో గల గిరిజన గ్రామాలను వారి ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపడుతున్నారు.