Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

చాలా కాలం తరువాత తెలుగువాడికి సిఎండి పదవి

$
0
0

విశాఖపట్నం, జూన్ 13: ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు పేరుతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చైర్మన్ కం మేనేజింగ్ డైరక్టర్లుగా ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులే వస్తున్నారు. ఇప్పటి వరకూ పనిచేసిన సిఎండిల్లో శివ సాగరరావు ఒక్కరే తెలుగువారు. ఆయన 2007లో పదవీ విరమణ చేశారు. ఆ తరువాత మళ్లీ తెలుగువారు ఈ పదవిని చేపట్టలేకపోయారు. చాలా కాలం తరువాత తెలుగువారైన మధుసూదన్‌కు సిఎండి పదవి లభించింది. ఈ పదవిని చేపట్టిన రెండో తెలుగువారు మధుసూదన్. గుంటూరు జిల్లా ఆరేపల్లిలో 1958 మే తొమ్మిదో తేదీన జన్మించిన మధుసూదన్ ఆంధ్రా యూనివర్శిటీలో 1975-78 సంవత్సరాల మధ్య బికాం డిగ్రీ పూర్తి చేశారు. ఆయన యూనివర్శిటీలో 10 ర్యాంక్ సాధించారు. మధుసూదన్ 1982లో చార్టర్డ్ అక్కౌంట్ పూర్తి చేశారు. అఖిల భారత స్థాయిలో 42వ ర్యాంక్ సాధించారు. 1984లో ఐసిడబ్ల్యుఎ పూర్తి చేశారు. 1986లో కంపెనీ సెక్రటరీగా మధుసూదన్ నియమితులయ్యారు. బిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో జూనియర్ మేనేజర్ (ఫైనాన్స్)గా 1986 జూన్ 30వ తేదీన ప్రారంభించారు. మధసూదన్ 24 సంవత్సరాల పాటు బిలాయ్ స్టీల్ ప్లాంట్‌లోనే వివిధ హోదాల్లో పనిచేశారు. బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఆర్థికాభివృద్ధికి ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మధుసూదన్‌కు క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్, చిత్రలేఖనం, శాస్ర్తియ సంగీతం అంటే ఇష్టం.

కో-ఆర్డినేటర్లకు విలువేదీ?
* అక్కరకు రాని అనుబంధ సంఘాలు
* వైకాపాలో ముదురుతున్న విభేదాలు
విశాఖపట్నం, జూన్ 13: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నియోజకవర్గానికి కో-ఆర్డినేటర్లుగా నియమించిన వారికి విలువ లేకుండా పోతోంది. ఆయా నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలకు వారిని ఆహ్వానించడం లేదు. మరికొన్ని నియోజకవర్గాల్లో వారు ఇతరులను కార్యక్రమాలకు పిలవడం లేదు. జిల్లా అనుబంధ కమిటీలో ఉన్న వారి పరిస్థితి, అలాగే అధికార ప్రతినిధుల పాత్ర ఏంటో తెలియని విధంగా ఉంది. జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్వీనర్లను పార్టీ అధ్యక్షుడు జగన్ స్వయంగా ప్రకటించారు. అర్బన్ జిల్లాకు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్‌ను, రూరల్ జిల్లాకు గొల్ల బాబూరావును కన్వీనర్‌లుగా ప్రకటించారు. అర్బన్ జిల్లాలో అడపదడప పార్టీ నిర్దేశిత కార్యక్రమాలు జరుగుతునే ఉన్నాయి. ఇక్కడే మరో గట్టి వర్గం పనిచేస్తోంది. అనకాపల్లి ఎంపి సబ్బం హరి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ, వైకాపాలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. ఇప్పటికే విశాఖ నగరంలోని ఒక నియోజకవర్గంలో తన అనుచరుడికే కీలక బాధ్యతలు కట్టబెట్టేలా పావులు కదిపారు. ఇక రూరల్ జిల్లాకు వచ్చేప్పటికి కొణతాల రామకృష్ణ ఇప్పటి వరకూ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించే వారు. ఇదిలా ఉండగానే, దాడి వీరభద్రరావును పార్టీలోకి తీసుకువచ్చింది అధిష్ఠానం. అప్పటి నుంచి రూరల్ జిల్లాలో వైకాపా పరిస్థితి దారుణంగా తయారైంది. బలమైన ప్రత్యర్థుల మధ్య పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఇప్పటి వరకూ దాడి వీరభద్రరావు పార్టీ పరంగా ఎటువంటి కార్యాచరణ ప్రారంభించకపోయినా, దీర్ఘకాలిక వ్యూహంతో ఆయన ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో కొణతాల రామకృష్ణ వైఖరేమిటో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికలకు మరెంతో వ్యవధి లేదు. రూరల్ జిల్లాలో సంస్థాగతంగా పార్టీ ఇంకా బలపడలేదు. దీనికి కావల్సిన చర్యలు తీసుకోవడమూ లేదు. విభేదాలతో సతమతమవుతున్న పార్టీనీ గట్టెక్కించేందుకు ఎవరు నడుం కడతారన్నది చర్చనీయాంశమైంది.
ఇక అర్బన్ జిల్లాకి కమిటీని వేశారు. వీరి బాధ్యతలు ఏంటో ఎవ్వరికీ తెలియదు. అధికార ప్రతినిధులను కూడా నియమించారు. వారు ఎప్పుడూ పెదవి విప్పే పరిస్థితి కూడా లేదు. వీరంతా ఒక ఎతె్తైతే, పార్టీ ఆవిర్భావం సమయంలోనే జగన్‌కు తోడుగా నిలిచి, వివిధ నియోజకవర్గాల నుంచి టిక్కెట్‌లను ఆశించిన వారి పరిస్థితి మరింత అగమ్యగోచరంగా ఉంది. వీరి భవితవ్యం ఏంటో వీరికే అర్థం కావడం లేదు. ఇవన్నీ చక్కబడాలంటే, జిల్లాలోని అగ్రనేతల మధ్య వైషమ్యాలను తొలగించాల్సిన బాధ్యత అధిష్ఠానంపై ఉంది. ఉత్తరాంధ్ర పరిశీలకునిగా ఉన్న సుజయకృష్ణ రంగారావు శుక్రవారం విశాఖ నగరానికి వస్తున్నారు. జిల్లాలోని పార్టీని చక్కదిద్దడానికి ఆయన ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తారో వేచి చూడాలి.

ధర్మారావు కుటుంబాన్ని పరామర్శించిన అధికారులు
విశాఖపట్నం, జూన్ 13: జమ్మూలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐఎఎస్ అధికారి కుటుంబాన్ని పలువురు అధికారులు పరామర్శించారు. ధర్మారావు మధ్య ప్రదేశ్‌లో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఆ సమాచారాన్ని ఇక్కడికి అధికారులకు చేరవేసింది. మధ్య ప్రదేశ్ క్యాడర్ ఐఎఎస్ అధికారిగా ఉన్న ప్రస్తుత జిసిసి ఎండి రమేష్ ఈ విషయం తెలుసుకుని, జిల్లా కలెక్టర్ శేషాద్రిని సంప్రదించారు. ఆయన వెంటనే స్పందించి డిఆర్‌ఓ వెంకటేశ్వరరావు, ఆర్డీఓ రంగయ్యను రమేష్ వెంట పంపించారు. వీరంతా సీతమ్మధార అంబేద్కర్ నగర్‌లో నివాసం ఉంటున్న ధర్మారావు సోదరుడు రాజారావు ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. కాగా, ధర్మారావు దంపతుల మృతదేహాలు శుక్రవారం ఇక్కడికి చేరుకుంటున్నాయి. వీరి అంత్యక్రియలు శనివారం జరుగుతాయి. అంత్యక్రియలకు మధ్య ప్రదేశ్‌కు చెందిన పలువురు ఐఎఎస్ అధికారులు, మంత్రులు హాజరుకానున్నారు.
పాఠశాలలు ప్రారంభం
* ఫిట్‌నెస్ లేని బస్సులపై అధికారుల దాడులు
విశాఖపట్నం, జూన్ 13: ఫిట్‌నెస్ లేని బస్సులపై రవాణాశాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ దాడులను విస్తృతంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీనిలోభాగంగా రెండు రోజుల్లో 11 స్కూల్ బస్సులపై దాడులు జరిపి ఫిట్‌నెస్ లేనివిగా అధికారులు గుర్తించారు. విశాఖ నగరంలో ఫిట్‌నెస్ లేని తొమ్మిది బస్సులను, అనకాపల్లిలో మరో రెండు బస్సులపై కేసులు నమోదు చేశారు. ఇవి కాకుండా అనకాపల్లి, నర్సీపట్నం తదితర పట్టణ ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు జరిపి ఫిట్‌నెస్ లేని బస్సులను గుర్తించి చర్యలు తీసుకుంటామని మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఖాన్ తెలిపారు. ఇదే తరహాలో శనివారం నర్సీపట్నంలో స్కూల్ బస్సులపై దాడులు జరుపనున్నట్టు చెప్పారు. వేర్వేరు బృందాలకు శ్రీనివాస్, శివరామకృష్ణ, మురళీకృష్ణ తదితర అధికారులు నాయకత్వం వహిస్తున్నారన్నారు.

పనిచేయడం ఇష్టం లేకపోతే ఇళ్ళకు పోండి
* తహశీల్దార్లకుజెసి ప్రవీణ్‌కుమార్ హెచ్చరిక
నర్సీపట్నం, జూన్ 13: పనిచేయడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తహశీల్దార్లను హెచ్చరించారు. గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో డివిజన్ పరిధిలోని తహశీల్దార్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వంద రోజుల ప్రణాళికలో వచ్చిన ఆర్జీలను పరిష్కరించడం లేదని ఆయన తహశీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 15వతేదీ నాటికి రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని చెప్పినా తహశీల్దార్లు పట్టించుకోవడం లేదన్నారు. ఆరు నెలలుగా గొంతు చించుకుని అరుస్తున్నా తహశీల్దార్లలో ఎటువంటి మార్పు రావడం లేదన్నారు. ప్రధానంగా అస్సైన్డ్ భూములు, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ, ఆరవ విడత భూ పంపిణీలో పంపిణీ చేసిన భూములను నేటికీ లబ్ధిదారులకు అప్పగించకపోవడంపై జె.సి. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసుపుస్తకాల కోసం ఎవరెవరు రైతులను ఇబ్బందులు పెడుతున్నారో వారి జాబితా తనవద్ద ఉందన్నారు. పనులను వారం రోజుల్లో పూర్తి చేస్తామని ఒక తహశీల్దార్, రెండు వారాల్లో పూర్తి చేస్తామని మరో తహశీల్దార్ సమాధానాలు చెప్పడంతో జె.సి. మండిపడ్డారు. నెలరోజుల్లో పూర్తి చేయలేని పనిని వారంరోజుల్లో ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. కాకమ్మకథలు వినడానికి తీరిక లేదని, ఇలా ఎన్ని రోజులు పొడిగిస్తారని ఆయన నిలదీశారు. తహశీల్దార్లకు ప్లాన్ లేదని, అవగాహన లోపంతో ఉన్నారని అర్ధమవుతోందన్నారు. రోలుగుంట తహశీల్దార్ చిరంజీవి పడాల్ జె.సి. అడిగిన వాటికి సమాధానం సక్రమంగా చెప్పకపోవడంతో ఆయన తీవ్రంగా మందలించారు. పనిచేయడం ఇష్టం లేకపోతే ఇళ్ళకు వెళ్ళిపోవాలన్నారు. ఆరవ విడత భూ పంపిణీలో పంపిణీ చేసిన భూములను లబ్ధిదారులకు ఇప్పటికీ అప్పగించకపోతే ఏడవ విడత భూ పంపిణీకి ఎలా వెళ్తామని తహశీల్దార్లను నిలదీశారు. ప్రభుత్వం ఎప్పుడు ఆదేశించినా ఏడవ విడత భూ పంపిణీకి తహశీల్దార్లు సిద్ధంగా ఉండాలన్నారు. పట్టాదారు పాసుపుస్తకాల విషయంలో రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయసారధి, ల్యాండ్ సర్వే జిల్లా అధికారి సిహెచ్.బి ఎస్.కుమార్, ఆర్డీవో ఎస్.ఎస్.వి.బి.వసంతరాయుడు, ఆరు మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య సామాగ్రి కొనుగోలుకు జడ్‌సిలకు అధికారాలు
* జివిఎంసి కమిషనర్ ఎంవి.సత్యనారాయణ
సాగర్‌నగర్, జూన్ 13: పారిశుద్ధ్య పనుల నిర్వహణకు అవసరమైన సామాగ్రి కొనుగోలుకు జోనల్ కమిషనర్లకు అధికారాలు బదలాయిస్తున్నట్లు కమిషనర్ ఎంవి.సత్యనారాయణ తెలిపారు. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పారిశుద్ధ్య పనుల నిర్వహణకు అవసరమైన సామాగ్రిని వెంటనే కొనుగోలు చేసి సిబ్బందికి పంపిణీ చేయాలని ఆయన ఆదేశించారు. గురువారం తన ఛాంబర్‌లో జోనల్ కమిషనర్లు, ప్రధాన వైద్యాధికారులు, సహాయ వైద్యాధికారులతో ఆయన సమావేశమై పారిశుద్ధ్య మెరుగునకు తీసుకున్న చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రధాన వైద్యాధికారి అధీనంలో పారిశుద్ధ్య సామాగ్రి ఏ మేరకు నిల్వ ఉందో అడిగి తెలుసుకున్నారు. 31 బ్యాగుల లైమ్‌స్టోన్, 21వేల కిలోల బ్లీచింగ్ పౌడర్, 370 లీటర్ల ఫినాయిల్, 750 కిలోల కొబ్బరి చీపుర్లు, 125 ప్లాస్టిక్ బకెట్‌లు నిల్వ ఉన్నట్లు తెలుసుకున్న ఆయన వెంటనే అవసరం మేరకు జోనల్ కార్యాలయాలకు సరఫరా చేయాలని ప్రధాన వైద్యాధికారిని ఆదేశించారు. గత ఏడాది అనుమతించిన రేట్ల ప్రకారం రెండు, మూడు నెలలకు అవసరమైన పారిశుద్ధ్య సామాగ్రిని వెంటనే కొనుగోలు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్లను ఆయన ఆదేశించారు. రాబోవు ఏడాదికి అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేసేందుకు టెండర్లు ఖరారు చేసే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. పారిశుద్ధ్య పనులు ప్రతినిత్యం సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతో ఉందని ఏ మాత్రం అలక్ష్యం వహించిన అనారోగ్య పరిస్థితులు నెలకొంటాయని ఆయన హెచ్చరించారు. ప్రతి వార్డులోను పిన్‌పాయింట్ ప్రొగ్రాం ప్రకారం పారిశుద్ధ్య పనులు సక్రమంగా అమలయ్యేలా జోనల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ (ఫైనాన్స్) పి.పూర్ణచంద్రరావు, ప్రధాన వైద్యాధికారి పివి.రమణమూర్తి, జోనల్ కమిషనర్లు వై.సాయిశ్రీకాంత్, శ్రీరామమూర్తి, జె.విజయలక్ష్మి, సహాయ వైద్యాధికారులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

డిసెంబర్ నాటికి రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తిచేయాలి
విశాఖపట్నం , జూన్ 13: జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ప్రాజెక్టు కింద 32 విలీన గ్రామాలలో చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని కమిషనర్ ఎం.సత్యనారాయణ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం తన ఛాంబర్‌లో నీటిసరఫరా, ప్రాజెక్టు, ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమావేశమై రిజర్వాయర్లు, నీటిశుద్ధి ప్లాంట్లు, సెంట్రల్, ఓల్డ్‌సిటీ వాటర్ సప్లయ్ ప్రాజెక్టు పనుల ప్రగతిని ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32 విలీన గ్రామాలలో చేపట్టబడిన 46 రిజర్వాయర్ల నిర్మాణ పనులలో 38 పూర్తి కాగా మిగిలిన 8 రిజర్వాయర్ నిర్మాణ పనులు వివిధ దశలలో ఉన్నాయని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎంవి.వినయ్‌కుమార్ కమిషనర్‌కు వివరించారు. పద్మనాభపురం, పోతినమల్లయ్యపాలెం. పురుషోత్తమపురం, పెద్దపాలెం, పాలవలస, అప్పికొండ, యల్లపువానిపాలెం, సూదికొండ దగ్గరలో నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్ పనుల ప్రగతిని కమిషనర్ సమీక్షించారు. వీటిలో మూడు రిజర్వాయర్ పనులను జూలై నెలాఖరు నాటికి, రెండు రిజర్వాయర్ల పనులను ఆగస్టు నెలాఖరుకు, మిగిలినవి డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అన్నారు. అదే విధంగా సెంట్రల్ సిటీ, ఓల్డ్ సిటీలకు తాగునీటి పంపిణీకి ఉద్దేశించబడిన ప్రాజెక్టుల ప్రగతిని ఆయన సమీక్షిస్తూ పైపులైను నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సెంట్రల్ సిటీ, ఓల్డ్ సిటీలలో చేపట్టబడిన 14 బిఎల్‌ఎస్‌ఆర్, ఇఎల్‌ఎస్‌ఆర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నరవ, అగనంపూడిలలో నిర్మాణంలో ఉన్న రెండు శుద్ధి ప్లాంట్‌ల ప్రగతిని ఆయన సమీక్షిస్తూ నరవ ప్లాంట్‌ను జూలై నెలాఖరు నాటికి, అగనంపూడి ప్లాంట్‌ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సూచించారు. ఇదే తరహాలో ప్రతి వారం పనుల ప్రగతిని సమీక్షిస్తూ, భౌతిక, ఆర్థికపరమైన లక్ష్యాలను ఏ మేరకు సాధించడం జరుగుతుందో పరిశీలిస్తానన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ బి.నాగేంద్రకుమార్, ప్రధాన ఇంజనీరు బి.జయరామిరెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉమామహేశ్వరరావు, డిఇఇ వెంకటేశ్వరరావు, ఇఇలు వినయ్‌కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
దేవీపురంలో చెట్టును ఢీకొన్న వ్యాన్
* ఇద్దరు వ్యక్తుల మృతి
* మరో ఇద్దరికి తీవ్రగాయాలు
సబ్బవరం, జూన్ 13: మండలంలోని దేవీపురం వద్ద సబ్బవరం- అనకాపల్లి రోడ్డుపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో యాండ్రపు పెద్దిరాజు(46), బొక్కావీర వెంకట సత్యనారాయణమూర్తి(45) అక్కడికక్కడే మృతి చెందగా, బొలెరా వ్యాన్ నడుపుతున్న పరిదేశి(చౌడవా డ),సూరంపూడి రామకృష్ణలకు తీవ్రగాయాలు తగిలాయి. గాయపడిన వారిని పోలీసులు 108 అంబులెన్స్‌లో విశాఖ కింగ్‌జార్జి ఆసుపత్రికి తరలించారు. ఈసంఘటనపై ఎస్‌ఐ జి.గోవిందరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా లక్కవరపు కోటలో రియల్ వ్యాపారి గుత్తుల శ్రీనివాసరావు లే-అవుట్‌లో పనిచేస్తున్న వీరు గురువారం రాత్రి బొలెరా ట్రక్ వ్యానులో అమలాపురం నుంచి బయలుదేరారు. మృతులు పెద్దిరాజు, సత్యనారాయణమూర్తి ఇంజిన్ వెనుక ఉన్న బాడీ పైభాగంలో సింటెక్స్ ఖాళీ ఫైబర్ ట్యాం క్‌ను కట్టి లోపల నిద్రిస్తున్నారు. వ్యాన్ డ్రైవర్ పరదేశి వాహ నం నడుపుతుండగా, సూరంపూడి రామకృష్ణ పక్కనున్నాడు. వీరు ప్రయాణిస్తున్న వాహనం గురువారం తెల్లవారుజామున దేవీపురం వద్దకు వచ్చేసరకి అదుపుతప్పి రోడ్డుకు కుడివైపున ఉన్న మర్రి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ ట్రక్కులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, స్టీరింగ్‌లో ఇరుకున్న డ్రైవరు పరిదేశి రక్షించండంటూ కేకలు వేయటంతో పోలీసులు తాడుకట్టి బయటికి లాగారు. కేబిన్‌లోని రామకృష్ణకు మోకాలి చిప్పలు తెగిపోయాయి. పోలీసులు క్షతగాత్రులను విశాఖ తరలించారు. మృతి చెందిన ఇద్దరు తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపూడికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఎస్‌ఐ గోవిందరావు తెలిపారు.

పంచాయతీల రిజర్వేషన్లపై ఉత్కంఠకు నేటితో తెర
మేజర్ పంచాయతీలపై ప్రధాన పార్టీల నేతల గురి
అనకాపల్లి, జూన్ 13: ఆశావహులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే సమయం ఎట్టకేలకు ఆసన్నమైంది. జిల్లాల వారీగా ఏ రిజర్వేషన్లు ఏయే పంచాయతీలకు వర్తించాయో సంఖ్యను నిర్ధారిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఏ పంచాయతీ సర్పంచ్ పదవి ఏవర్గానికి రిజర్వ్ అయిందనే విషయం శుక్రవారం ఖరారు కానుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రామ పంచాయతీల వారీగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ అధికారికంగా వెలువడనుంది. పంచాయతీ రిజర్వేషన్లపై ప్రధాన రాజకీయ పార్టీల నేతల్లోను, ఆశావహుల్లోను గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠతకు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ద్వారా తెరపడనుంది. రిజర్వేషన్లు తమ పార్టీకి సానుకూలంగా ఉంటుందా? లేదా అనే విషయంపై నేతల్లో, ఆశావహుల్లోను తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ప్రధానంగా మేజర్ పంచాయతీల్లోను, చైతన్య రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండే కొన్ని గ్రామాల్లోనూ రిజర్వేషన్ ప్రక్రియపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. జిల్లాలో 930 పంచాయతీలుఉండగా, ఎస్టీకి 19 పంచాయతీలు రిజర్వ్ చేయబడ్డాయి. ఎస్సీలకు 58, బిసిలకు 202 పంచాయతీలు రిజర్వ్ కాబడ్డాయి. మిగిలిన 408 పంచాయతీలను ఓసిలకు రిజర్వ్ చేశారు. జిల్లాలోని పలు మేజర్ పంచాయతీల రిజర్వేషన్లపై ఆయా ప్రాంత నేతలు, ఆశావహులు ఖరారయ్యే రిజర్వేషన్లు తమకు సానుకూలంగా ఉంటుందా? లేదా అనే ఉత్కంఠతతో గడుపుతున్నారు. ఒసి సామాజిక వర్గానికి చెంది వారి ఆధిపత్యంలో ఉన్న పంచాయతీల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. బిసిలు ఆధిపత్యం వహించే గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ భయం పట్టుకుంది. చైతన్య రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచే సబ్బవరం, పరవాడ, నక్కపల్లి, మునగపాక, కశింకోట, మాకవరపాలెం, కోటవురట్ల, పాయకరావుపేట, తుమ్మపాల, కొత్తూరు, మాడుగుల, విజయరామరాజుపేట, వడ్డాది మేజర్ పంచాయతీల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా వివిధ హోదాల్లో ఉన్నత పదవులు నిర్వహించిన వారంతా గ్రామ సర్పంచ్ నుండి రాజకీయ ఆరంగ్రేటం చేసిన వారే. భవిష్యత్‌లో రాజకీయంగా గట్టి పునాది వేసుకోవడానికి గ్రామసర్పంచ్ పదవి ప్రాథమికంగా ఎంతో ఉపయోగపడటమే ఇందుకు కారణంగా పేర్కొనవచ్చు. కొత్తూరు, తుమ్మపాల, కోటవురట్ల, నక్కపల్లి, పాయకరావుపేట, పరవాడ తదితర పంచాయతీల్లో ఒసి, బిసి సామాజిక వర్గాల వారి మధ్య రాజకీయంగా గట్టి ఆధిపత్యం ఉంది. ఆయా స్థానాలు ఓసిలకు రిజర్వ్ అయితే ఇరువర్గాల వారు పోటీకి దిగవచ్చు. అలాకాకుండా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ అయితే పరిస్థితి పూర్తిగా తారుమారవుతుంది.
మునగపాక, నాగులాపల్లి, చోడవరం, తాళ్లపాలెం, నర్సింగబిల్లి ఇతర పంచాయతీల్లో బిసి సామాజిక వర్గం వారి ఆధిపత్యం ఎక్కువగా ఉంది. ఎస్సీలకు రిజర్వ్ అయితే ఇప్పటికే సర్పంచ్ పదవులపై కొండంత ఆశలు పెట్టుకున్న ప్రధాన రాజకీయ పార్టీల్లోని నేతలు వారి అనుచరవర్గ నేతల ఆశలు తారుమారయ్యే పరిస్థితి ఉంది. పంచాయతీల రిజర్వేషన్లు ఖరారుతో రాజకీయ సమీకరణలే పూర్తిగా మారిపోయే పరిస్థితులు నెలకొనడమే ఇందుకు కారణంగా పేర్కొనవచ్చు. రిజర్వేషన్ ప్రతికూలంగా వస్తే గ్రామాల్లో వ్యక్తిగతంగా ప్రజాబలం ఉన్న నేతలు ఎన్నికల్లో పోటీకి దిగే అవకాశం కోల్పోయి మరికొంతకాలం పాటు రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయే పరిస్థితి ఉంది. ఊహించని విధంగా రిజర్వేషన్ కలిసి వస్తే సర్పంచ్ పదవులపై ఆశలు లేని వారిని ప్రధాన పార్టీల నేతలు బ్రతిమాలి పోటీకి దింపే పరిస్థితులు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ అయ్యే పంచాయతీల్లోనే ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.

బాధ్యతారాహిత్యంపై పిఒ ఆగ్రహం
ఇద్దరు హెచ్‌ఎంలు, ముగ్గురు ఉపాధ్యాయులకు షోకాజ్‌లు
డుంబ్రిగుడ, జూన్ 13: పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఇన్‌చార్జి ప్రొజెక్టు అధికారి వై.నరసింహారావు గురువారం మండలంలో తొలిసారిగా పర్యటించారు. ఏజెన్సీలో విద్యావ్యవస్థ తీరుపై మండిపడుతూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న కించుమండ, డుంబ్రిగుడ పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై కొరఢా ఝుళిపించారు. ఏజెన్సీలో విద్యాభివృద్ధికి ఉపాధ్యాయ బృందం ఏవిధంగా కృషి చేస్తుందన్న దారిపై ప్రత్యేక దృష్టి సారించారు. కించుమండ కేంద్రీకృత ఆశ్రమోన్నత పాఠశాల, డుంబ్రిగుడ పాఠశాలలను సందర్శించిన పి.ఒ పనితీరు అధ్వాన్నంగా ఉండడంతో ఆగ్రహావేశాలకు గురై పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సత్యమోహన్, కొండమ్మకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కించుమండ పాఠశాలలో 14 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించాల్సి ఉండగా, అందులో తొమ్మిది మంది పాఠశాలకు హాజరుకాగా, మిగిలిన ముగ్గురు గైర్హాజర్ కావడంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12వతేదీ నుండి తరగతులు ప్రారంభమైనా విద్యార్థులు పూర్తిస్థాయిలో పాఠశాలలకు హాజరు కాకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థులు ప్రారంభం రోజు నుండే పాఠశాలలకు హాజరైనా పాఠశాల సిబ్బంది శ్రద్ధ చూపకపోవడంపై ఆయన ఆగ్రహించారు. 400 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా పాఠశాల తరగతులు ప్రారంభమై మూడు రోజులు గడిచినా ఒక్క విద్యార్థి కూడా హాజరుకాక పోవడాన్ని గుర్తించిన ఐటిడిఎ పిఒ సిబ్బందిపై తీవ్రంగా మండిపడ్డారు. ఏజెన్సీ డిఇఒ తీరు సక్రమంగా లేకపోవడం వలనే విద్యావ్యవస్థ అటకెక్కుతోందని పి.ఒ. అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ సంఘం నాయకులు తమ హక్కుల కోసం పోరాటాలు సాగించేముందు వారి బాధ్యతలపై దృష్టిసారించాలన్నారు. పి.ఒ. పర్యటనలో గృహనిర్మాణ శాఖ, కాఫీ అధికారులు మినహా మిగిలిన శాఖల అధికారులు సమయపాలన పాటించక పోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

పిసిపిఐఆర్‌లో రవాణా వ్యవస్థపై వుడా వీసి సమీక్ష
విశాఖపట్నం, జూన్ 13: విశాఖ-కాకినాడ మధ్య అభివృద్ధి చేయనున్న పెట్రోలియం, కెమికల్, పెట్రో కెమికల్ ఇనె్వస్ట్‌మెంట్ రీజియన్ (పిసిపిఐఆర్) పరిధిలో రవాణా వ్యవస్థ ప్రతిపాదనలపై పిసిపిఐఆర్ స్పెషల్ డెవలెప్‌మెంట్ అథారిటీ ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న వుడా వీసి డాక్టర్ ఎన్.యువరాజ్ సమీక్ష నిర్వహించారు. గురువారం వుడా కార్యాలయంలో జరిగిన సమావేశంలో పిసిపిఐఆర్ పరిధిలోకి వచ్చే విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు, జీఎంఆర్ సంస్థల ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖాధికారులతో రవాణా వ్యవస్థ ఏర్పాటు ప్రతిపాదనలపై సమీక్షించారు. పిసిపిఐఆర్ పరిధిలో మెరుగైన రవాణా వ్యవస్థను తీర్చిదిద్దేందుకు వీలుగా బృహత్ప్రణాళికలో పొందుపరిచిన సూచిత మార్గాలు, అవసరమైన చోట్ల ప్రస్తుతం ఉన్న ప్రధాన రహదారులతో అనుసంధానం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. విశాఖ నుండి కాకినాడ వరకు సుమారు 150 కిలోమీటర్ల పొడవున ప్రతిపాదించిన ఎక్స్‌ప్రెస్ వే ఏర్పాటు విశాఖపట్నం స్టీలుప్లాంటు, కాకినాడ సమీపంలో జీఎంఆర్ భూముల మీదుగా ప్రతిపాదించడంతో ఆ సంస్థల ప్రతినిధుల నుండి అభిప్రాయాలను తీసుకున్నారు. రహదారి ఏర్పాటుకు అటవీ భూములు, కొండలు వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నచోట ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా సమావేశంలో చర్చించారు. త్వరితగతిన ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఖరారు చేసిన పిసిపిఐఆర్ బృహత్తర ప్రణాళిక ముసాయిదా పొందుపర్చాల్సిందిగా వీసి డాక్టర్ యువరాజ్ అధికారులను ఆదేశించారు. రోడ్లు, భవనాలశాఖ ఆధ్వర్యంలో ఉన్న రహదారుల వివరాలు, ప్రతిపాదించిన రహదారుల అభివృద్ధి వివరాలను కూడా సమావేశంలో చర్చించారు. పిసిపిఐఆర్ పరిధిలో గ్రీన్‌బెల్టు అభివృద్ధి నియమావళిపై కాలుష్య నియంత్రణ మండలి, ఏపిఐఐసి అధికారులు, వుడా చీఫ్ అర్బన్ ప్లానర్ ఆర్‌జె విద్యల్లతతో సమీక్షించిన వీసి నిబంధనలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలను ఖరారు చేయాలని సూచించారు. అలాగే పిసిపిఐఆర్ పరిదిలో ప్రాంతాల్లో పర్యావరణ ప్రభావం, సిఆర్‌జెడ్ అమలు నిబంధనవళిపై ఈపిటీఆర్‌ఐ, ఎన్‌ఐఓ సంస్థలు చేపట్టిన పరిశోధనలు అధ్యయనాల వివరాలను సంబంధిత సంస్థల ప్రతినిధులతో సమీక్షించారు. పిసిపిఐఆర్ బృహత్ప్రణాళిక ముసాయిదాను ప్రకటించేందుకు వీలుగా పొందుపర్చాల్సిన సాంకేతిక వివరాలన్నింటినీ పది రోజుల్లోపు ఖరారు చేసి అందజేయాలని వీసి యువరాజ్ సంబంధిత శాఖల ప్రతినిధులకు సూచించారు. పిసిపిఐఆర్ వుడా చీఫ్ అర్బన్ ప్లానర్ ఆర్‌జె విద్యుల్లత, డిప్యూటీ డైరెక్టర్ వి.రామ్‌కుమార్, స్టీల్‌ప్లాంటు డైరెక్టర్ పర్సనల్ వైఆర్ రెడ్డి, జనరల్ మేనేజర్లు బి.మాథ్యూ, ఆర్‌ఆర్ శ్రీవాత్సవ, డీజిఎం బిఎన్ కనియన్, ఏపిఐఐసి చీఫ్ ఇంజనీర్ సిహెచ్‌వివిఎస్ ప్రసాద్, జోనల్ మేనేజర్ యతిరాజు, జిఎంఆర్ ప్రతినిధులు కెబి అరుణాచలం, అరిపు చెల్వన్, డాక్టర్ ఎవివి చౌదరి, అబ్రహాం వర్కీ, మత్స్యశాఖ సహాయ సంచాలకులు వైజె ప్రభుదాస్, ఎపిట్కో కన్సల్టెంట్లు లక్ష్మీనారాయణ, ఆర్.రాజశేఖర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ చీఫ్ సైంటిస్ట్ మోహనరావు పాల్గొన్నారు.

‘మహిళలు బ్యాంకు రుణాలతో ఆదాయం పెంచుకోవచ్చు
విశాఖపట్నం , జూన్ 13: పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు లింకేజి రుణాలతో ఆదాయ వనరుల పెంపొందించే కార్యక్రమాలు చేపట్టేలా వారిని చైతన్యపర్చాలని కమిషనర్ ఎంవి.సత్యనారాయణ యుసిడి అధికారులను ఆదేశించారు. బ్యాంకు లింకేజి రుణాలు కేవలం అప్పులు తీర్చుకోవడానికి, కుటుంబ అవసరాలకు వినియోగిస్తే ఉపయోగం లేదని ఆ సొమ్మును సద్వినియోగం చేసుకొని ఆర్థిక పరిపుష్టిని సాధించే దిశగా మహిళలు అడుగులు వేయాలని ఆయన సూచించారు. గురువారం తన ఛాంబర్‌లో అధికారులతో ఆయన సమావేశమై నగరంలో యుసిడి కార్యక్రమాలు అమలుతీరును ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో కొబ్బరితోట ప్రాంతంలో పర్యటించినప్పుడు పొదుపుసంఘాల మహిళలు బ్యాంకు లింకేజి రుణాలను కేవలం సొంత అవసరాలకు మాత్రమే వినియోగించుకున్నట్లు తన దృష్టికి వచ్చిందని అన్నారు. ఇటువంటి విధానాలను పొదుపు సంఘాల మహిళలు అవలంబించకుండా వారిని చైతన్యపర్చాలని అధికారులకు సూచించారు. జనశ్రీ బీమా యోజన పథకంలో పెద్దఎత్తున లబ్ధిదారుల నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించిన 53 వేలను రెండు రోజులలో సాధించాలని ఆయన క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా స్ర్తి శక్తి భవనాలను నిర్మించేందుకు నిర్ణీత ప్రాంతాలను గుర్తించి సంబంధిత ప్రతిపాదనలను తమకు వెంటనే సమర్పించాలన్నారు. ఎస్‌జెఎస్‌ఆర్‌వై పథకం కింద కూడా లబ్ధిదారులను గుర్తించే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించిన 800 మందికి రుణాలు మంజూరు చేసే కార్యక్రమాన్ని సత్వరమే చేపట్టాలని ఆయన ఆదేశించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు అమలుపరుస్తున్న రాజీవ్ యువకిరణాల కార్యక్రమాన్ని విస్తృతస్థాయిలో అమలుపర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కెజిహెచ్, రైల్వేస్టేషన్, బస్టాండ్ల వద్ద నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని దీనికి తగినట్టుగా చర్యలు చేపట్టాలన్నారు. సామాజిక భద్రత కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు మంజూరు చేసేందుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. పరదేశిపాలెం, మదినాబాగ్, మంత్రిపాలెం తదితర ప్రాంతాలలో నిర్మించిన జిఎన్‌ఎన్‌యుఆర్‌ఎం గృహ సముదాయాలలో కేటాయించిన ప్లాట్లలలో చాలా మంది నివాసం ఉండట్లేనట్లు గుర్తించడమైనదని, ఆయా లబ్ధిదారుల జాబితాను రూపొందించి వెంటనే తమకు సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) బి.నాగేంద్రకుమార్, యుసిడి పిడి పాత్రుడు, అన్ని జోన్ల ఎపిడిలు తదితరులు పాల్గొన్నారు.
నగరంలో 15 కల్యాణ మండపాలు సీజ్

విశాఖపట్నం (జగదాంబ), జూన్ 13: నగర పరిధిలో అగ్నిమాపక ప్రమాణాలు పాటించని 15 కళ్యాణమండపాలను సీజ్ చేసినట్లు కమిషనర్ ఎంవి.సత్యనారాయణ తెలిపారు. ఇప్పటివరకూ ఆదేశాలు మాత్రమే ఇచ్చిన జివిఎంసి అధికారులు ప్రస్తుతం ఒక్కసారిగా గురువారం దాడులు చేయడంతో అసలైన వాస్తవాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండవ జోన్‌లో మూడు, నాల్గవ జోన్‌లో ఐదు, అయిదవ జోన్‌లో మూడు, ఆరవ జోన్‌లో నాల్గింటిని సీజ్ చేయడమైందన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నగర పరిధిలో మొత్తం 94 కల్యాణ మండపాలను ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నట్లు గుర్తించగా అందులో 91 కల్యాణ మండపాలలో అగ్నిమాపక ప్రమాణాలు పాటించనట్లు గుర్తించడమైనదని అన్నారు. ఆయా కల్యాణమండపాల యజమానులకు గత ఏడాది డిసెంబర్ నెలలో షోకాజ్ నోటీసు జారీ చేయడమైందని, ఈ ఏడాది జనవరి నెలలో రెండుసార్లు వారందరితో సమావేశం నిర్వహించి అగ్నిమాపక ప్రమాణాలు, పార్కింగ్ ప్రాధాన్యతను వివరించడమైందని అన్నారు. అయినప్పటికీ చాలా కల్యాణమండపాల నిర్వాహకులు ఏ మాత్రం స్పందించకపోవడం గుర్తించడమైందని అన్నారు. అలాగే హెచ్‌ఎంసి యాక్ట్ సెక్షన్ 461 ఎ ప్రకారం కల్యాణమండపాలు సీజ్ చేస్తామని హెచ్చరిస్తూ ఫిబ్రవరిలో కూడా నోటీసులు జారీ చేయడమైందని అన్నారు. అనంతరం నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు అగ్నిమాపక సామాగ్రిని ఏర్పర్చుకునేందుకు మే నెలాఖరు వరకూ గడువు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ఇలా అనేకసార్లు అవకాశాలు ఇచ్చినప్పటికీ కల్యాణమండపాలు నిర్వాహకులు సద్వినియోగం పర్చుకోనందున ఇప్పటివరకూ 15 కళ్యాణ మండపాలను సీజ్ చేసామని, త్వరలోనే మిగిలిన వాటిపై కూడా చర్యలు చేపడతామని అన్నారు.

వ్యక్తుల కన్నా వ్యవస్థ ముఖ్యం
* రాజకీయాల్లో ప్రక్షాళన అవసరం
* శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు
సింహాచలం, జూన్ 13: ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తుల ప్రాధాన్యత కన్నా వ్యవస్థ పటిష్టతే ప్రధానమని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల అన్నారు. అన్నిరంగాలలో విలువలు పడిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లోకంలో దౌర్జన్యాలు, దోపిడీ, అరాచకాలు పెచ్చుమీరినప్పుడు భగవంతుడు సాక్షాత్కరిస్తాడని నమ్మే సమాజంలో మనం ఉన్నామంటూ రామకృష్ణుడు వేదాంత ధోరణిలో మాట్లాడారు. గురువారం ఆయన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రజలు తమ బాగుకోసం నేతలను ఎన్నుకుంటారనే వాస్తవాన్ని రాజకీయ నాయకులు గ్రహించాలని ఆయన సూచించారు. వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపారే తప్ప పార్టీలనుగాని, వ్యక్తులను గాని ఆయన ప్రత్యక్షంగా విమర్శించలేదు. వ్యవస్థను సరిచేయాల్సిన ప్రభుత్వాలే విలువలు పడిపోయేలా ప్రవర్తించడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల్లో విలువలు దిగజారినప్పుడు ప్రజలే ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యత తీసుకోవాలని యనమల పిలుపునిచ్చారు. కాగా సింహాచలం దేవస్థానం భూసమస్య అంశాన్ని స్థానిక టిడిపి నేత పాశర్ల ప్రసాద్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. శాసనమండలి సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేస్తానని సాధ్యం కాకపోతే ప్రభుత్వంతో పోరాటం చేద్దామని చెప్పారు. కొంతమంది రైతులు ఆయనను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.
ప్రత్యేక పూజలు
శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు సింహాచలేశుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. దేవస్థానం ఇఓ కె.రామచంద్రమోహన్ యనమలకు స్వాగతం పలికారు. కప్పస్తంభం వద్ద యనమల స్వామి వారిని ప్రార్థించారు. అంతరాలయంలో యనమల పేరున అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు భరణికోన రామారావు, బమ్మి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు పేరుతో సాధించుకున్న విశాఖ
english title: 
cmd

పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు

$
0
0

విజయనగరం, జూన్ 13: జిల్లాలో పంచాయతి ఎన్నికల సంగ్రామానికి తెరలేచింది. ఇందులో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. దీంతో కేటగిరీల వారీగా పంచాయతీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ సంఖ్య ఆధారంగా ఏ మండలానికి ఎన్ని పంచాయతీలు రిజర్వు చేయాలన్నదీ జిల్లా స్థాయిలో కసరత్తు జరగనుంది. 2011 జనాభా ఆధారంగా కసరత్తు చేయనున్నారు. 17లోగా రిజర్వేషన్లు ఖరారు చేసి గెజిట్‌లో ప్రచురిస్తారు. కాగా, ఏయే కేటగిరీలకు ఎనె్నన్ని స్థానాలు కేటాయించాలనేది ప్రభుత్వం స్పష్టం చేయడంతో జిల్లాలో పంచాయతీ ఎన్నికల అలజడి మొదలైంది. ఓటర్ల జాబితా, బ్యాలెట్ పత్రాల ముద్రణ ఇప్పటికే పూర్తి చేసి పంచాయతీల వారీగా జాబితాలను సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన కూడా ప్రాథమికంగా జరిపారు. మరో పక్క రాజకీయ పార్టీలు తమ బలాన్ని, బలగాన్ని పెంచుకోడానికి సమాయత్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం సార్వత్రిక ఎన్నికల మీద ఉంటుందన్న ఆలోచనతో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల విజయానికి ముందస్తు వ్యూహంతో ముందుకెళ్తున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా నిర్వహిస్తున్నప్పటికీ వీటిలో కూడా తమదే పైచేయి సాధించేందుకు అడుగులు వేస్తోన్నారు.
జిల్లాలో మొత్తం 921 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గతంలో 928 పంచాయతీలు ఉండగా.. నెల్లిమర్ల, జర్జాపుపేట, కణపాక, కె.ఎల్.పురం, గాజులరేగ, ధర్మపురి పంచాయతీలు మున్సిపాల్టీలో విలీనమయ్యాయి. దీంతో గ్రామ పంచాయతీల సంఖ్య తగ్గింది. కాగా, జిల్లాలో 2006 జరిగిన ఎన్నికల్లో 8750 పంచాయతి వార్డులకు ఎన్నికలు నిర్వహించగా, ఈ దఫా 8764 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 921 పంచాయతీలకుగాను సగం స్థానాలు మహిళలకు కేటాయించారు. ఆ ప్రకారం 461 స్థానాలు మహిళలకు రిజర్వు చేయబడ్డాయి. ఇవిగాకుండా పురుషులకు కేటాయించే స్థానాల నుంచి మహిళలు పోటీ చేసే అవకాశం ఉంది. జిల్లా జనాభా ఆధారంగా మొత్తం 921 స్థానాలకుగాను 123 స్థానాలు ఎస్టీలకు అంటే 13.3 శాతం స్థానాలు ఎస్టీలకు దక్కాయి. వీటిలో 77 స్థానాలు షెడ్యూల్డ్ పంచాయితీలు ఉన్నాయి. షెడ్యూల్డ్ పంచాయతీలలో నూరు శాతం స్థానాలను ఎస్టీలకు కేటాయించారు. ఇక ఎస్సీలకు 71 స్థానాలు కేటాయించారు. అంటే 7.7 శాతం స్థానాలు వీరికి దక్కాయి. బీసీలకు 342 స్థానాలు, జనరల్ కేటగిరీకి 385 స్థానాలు కేటాయించారు. మొత్తం పంచాయతీల్లో 37.13 శాతం స్థానాలు బీసీలకు కేటాయించారు. కాగా, అన్ని పంచాయతీలకు కేటగిరీల వారీగా రొటేషన్ విధానంలో రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. దీంతో గ్రామాల్లో వాడీవేడిగా రాజకీయాలు ఊపందుకున్నాయి.

‘మూడేళ్ల పాలన సంతృప్తినిచ్చింది’
విజయనగరం, జూన్ 13: జిల్లా కలెక్టర్‌గా మూడేళ్ల కాలం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య అన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా నియమితులైన ఆయన మరో రెండు రోజుల్లో రిలీవ్ కానున్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన 3ఆంధ్రభూమి2తో మాట్లాడుతూ జిల్లాలో విద్య, వైద్య, సాంఘీక రంగాల్లో అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు. ఆ క్రమంలోనే వలసలను అరికట్టి పెద్ద ఎత్తున కూలీలకు ఉపాధి పనులు కల్పించామన్నారు. గత మూడేళ్లలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఉపాధి పనులు చేపట్టామన్నారు. ఆరు లక్షల మంది కూలీలకు ఉపాధి కల్పించగలిగామని చెప్పారు. ఆ సందర్భంలోనే జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం గర్వంగా ఉందన్నారు. దీనికిగాను ప్రధాని మన్మోహన్‌సింగ్ చేతుల మీదుగా అవార్డు లభించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే నిరక్షరాస్యత నిర్మూలనలో కూడా గత ఏడాది ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ చేతుల మీదుగా అవార్డు లభించిందని వివరించారు. తన పాలనలో తనకు సహకరించిన ప్రజాప్రతినిధులకు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కలెక్టర్‌కు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు అవార్డు
పార్వతీపురం, జూన్ 13: జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్యకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు అవార్డు కూడా లభించడం పట్ల అయనకు పలువురు అధికారులు అభినందించారు. సాక్షర భారతి కార్యక్రమం ద్వారా అక్షరాస్యత సాధనకు ఆయన చేసిన విశేష కృషిని గుర్తిస్తూ ఎస్ ఆర్ సి డైరక్టర్ నుండి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు అవార్డుకు కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య ఎంపికయినట్టు సమాచారం రావడంతో పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి ఆర్ అంబేద్కర్, జడ్పీ సిఇఒ మోహనరావు, పార్వతీపురం ఆర్డీవో జె.వెంకటరావుతదితర అధికారులు కలెక్టర్‌ను అభినందించారు.
వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ
డెంకాడ, జూన్ 13 : రుతుపవనాల కదలికతో రైతులు వ్యవసాయ పనుల్లో బిచె అయ్యారు. అడపాదడపా కురుస్తున్న వర్షపు జల్లులకు గ్రామాల్లో రైతులు ప్రస్తుతం వేరుశెనగ సాగుకు సంబంధించిన విత్తనాలు నాటుతున్నారు. మరో 15 రోజుల్లో వరి విత్తనాలు కూడా నాటేందుకు అవకాశం ఉందని రైతులు అంటున్నారు. మండలంలోని అక్కివరం, గొలగాం, గంట్లాం, డి.తాళవలస, ఆకులపేట,జొన్నాడు, రఘుమండ, చింతలవలస, మోపాడ, అమకాం, బెల్లాం తదితర గ్రామాల్లో రైతులు ఎక్కువగా వేరుశెనగ సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు అనువైన వర్షాలు లేకపోవడంతో విత్తనాలు నాటేందుకు రైతులు కొంత భయపడుతున్నారు.
‘గ్రంథాలయాలకు పక్కా భవనాలు’
వేపాడ, జూన్ 13 : మండల కేంద్రమైన వేపాడలోని శాఖా గ్రంథాలయానికి పక్కా భవనం నిర్మిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇందుకూరి రఘురాజు వెల్లడించారు. వేపాడ మండలం వెనుక బడిన ప్రాంతమైనప్పటికీగ్రంథాలయాల అభివృద్దిలో వేపాడలో ప్రథమ స్థానాల్లో ఒకటిగా నిలిచి ఉందన్నారు. అటువంటి గ్రంథాలయానికి ఇంత వరకూ సొంత భవనం లేకపోవడం శోచనీయమన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 6 మండలాలకు 71.97 లక్షల రూపాయల నిధులు మంజూరైందన్నారు. వీటిలో కొమరాడ, జియ్యమ్మవలస, కురుపాం, మక్కువ,సాలూరు, పాచిపెంట గిరిజన మండలాలు ఉన్నాయన్నారు. దీంతోపాటు మరో 8 మండలాలకు ఒక్కొక్కదారి 10 లక్షలు చెప్పున 80 లక్షలతో ప్రతిపాదనలు చేసామన్నారు. జిల్లాలో 40 శాఖా గ్రంథాలయాలు ఉన్నాయని వీటిలో తొమ్మిదిగ్రంథాలయాలకు సొంత భవనాలు ఉండగా 13 అద్ద్దె భవనాల్లోను మిగిలిన 18 భవనాలు దాతలు సమకూర్చినవి ఉన్నాయని అన్నారు. అలాగే జిల్లా గ్రంధాలయాన్ని అభివృద్ది చేసేందుకు కోటి 50 లక్షలతో ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు.ఎస్.కోటలోని భవనం శిధిలావస్థకు చేరుకున్నందున కొత్త్భవనం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గత ఏడాది నాలుగు మున్సిపాలిటీలు కలిపి కోటి 10 లక్షలు, పంచాయతీల నుంచి 17 లక్షల రూపాయలు వసూలైందన్నారు. జిల్లాలో 111 బుక్ డిపోలు మంజూరు కాగా 105 ఇచ్చామని మిగిలిన 6 పెద్ద పంచాయతీలను ఇచ్చేందుకు ఆలోచనలు చేసామని అన్నారు. స్థానికులు మహేష్, ఎస్.అప్పారావు, సత్యంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
మొక్కల పెంపకాన్ని వేగవంతం చేయండి
దత్తిరాజేరు, జూన్ 13 : గ్రామాల్లో పంపిణీ చేసిన మొక్కల పెంపకం కార్యక్రమం వేగవంతం చేయాలని ఎపిఓ బాణు సన్యాసినాయుడు క్షేత్ర సహాయకులకు సూచించారు. ముందుగా గుర్తించిన రైతుల పొలాల్లో గుంతలు తీయించి మామిడి మొక్కల పెంపకాన్ని వేగవంతం చేయాలన్నారు. తప్పని సరిగా వర్క్ డిమాండ్, పని కేటాయింపు సమాచారాన్ని సక్రమంగా నిర్వహించకపోతే వేతనాల చెల్లింపు జరగడం కష్టమవుతుందన్నారు. అలాగే గునపాలు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. పనులు ప్రారంభించి గంటలోపే ఈ మస్టరు విధానాన్ని పాటించాలన్నారు. వారం వారం కూలీలకు వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కూలీలకు వీలైనంత ఎక్కువ కూలి లభించేలా చూడాలని అన్నారు. పనుల గుర్తింపు, చెల్లింపుల్లో పారదర్శకత ఉంటేలా చూడాలని పిలుపునిచ్చారు. పనులలో అక్రమాలు జరిగితే సహించేది లేదని, కఠిన చర్యలు ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇసి శివప్రసాద్‌యాదవ్, టెక్నికల్ అసిస్టెంట్, నాయుడు, శ్రీదేవి, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.

‘విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలి’
విజయనగరం, జూన్ 13: ఎపి రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని ఎ.పి.సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. గురువారం ఆయన వివిధ జిల్లాల ప్రిన్సిపాళ్లతో వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరగతి గదుల వాతావరణం ఆహ్లాదాన్నిచ్చే విధంగా ఉండాలన్నారు. విద్యార్థుల్లో మేధాశక్తిని పెంపొందించేందుకు వినూత్నమైన కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. విద్యార్థుల్లో ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యం సాధించేవిధంగా తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావాన్ని తొలగించేందుకు వారికి మార్కులకు బదులు గ్రేడ్‌లను కేటాయించాలన్నారు. ప్రతి విద్యార్థికి గ్రేడుల వారీగా పాయింట్లను కేటాయించాలన్నారు. 4, 5, 8, 9 తరగతులకు పుస్తకాలు మారినందున కొత్త సిలబస్ ప్రకారం ప్రాజెక్టు వర్కులను తయారు చేయాలన్నారు. విద్యార్థుల్లో నిరంతర సమగ్ర పర్యవేక్షణ (సిసిఇ) ఉండాలన్నారు. విద్యార్థులతో ప్రాజెక్టు వర్కులను చేయించాలన్నారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాళ్లు వెంకటేశ్వరరావు, చంద్రశేఖరరావులతోపాటు పలువురు ప్రిన్సిపాళ్లు, పిజిటిలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నిధులు ఖర్చు చేయకపోవడంపై
నాఫెడ్ డైరెక్టర్ ఆగ్రహం
గుర్ల, జూన్ 13 : అపారిశుధ్య నిర్మూలనకు మంజూరైన నిధులు నేటి వరకు ఎందుకు ఖర్చు చేయలేదని, ఆసుపత్రికి ఖర్చు పెట్టిన నిధులపై పూర్తి రికార్డు ఎందుకు తయారు చేయలేదని గుర్ల, ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఎఎన్‌ఎంలపై నాఫెడ్ డైరెక్టర్ కెవి సూర్యనారాయణరాజు మండి పడ్డారు. గురువారం గురల ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆసుపత్రి సలహా సంఘం సమావేశానికి నెల్లిమర్ల ఎస్‌పిహెచ్‌ఓ డాక్టర్ కామేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కొత్తగా నిర్మించిన డయేరియా షెడ్‌ను నాఫెడ్ డైరెక్టర్ ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆసుపత్రికి ఖర్చు పెట్టిన నిధులపై సమాచారం తెలపమని కోరగా పూర్తి నివేదిక సిబ్బంది ఇవ్వలేక పోయారు. మాజీ ఎమ్మెల్యే పొట్నూరి సూర్యనారాయణ మాట్లాడుతూ నివేదికను పీటర్స్ ద్వారా తెలియపరచలేదని ప్రశ్నించారు 10 నిమిషాల్లో నివేదిక తయారు చేసి ఇస్తామని డా.ఎస్‌వి రమణ తెలిపారు. 13 సబ్ సెంటర్లకు మంజూరైన సబ్ సెంటర్ నిధులపై గుర్ల ఆరోగ్య కేంద్రం ఎఎన్‌ఎంలు నివేదిక కోరారు. నిధులు రావడం ఆలస్యంగా వచ్చాయని నిధులు ఖర్చులో సెక్రటరీలు సహకరించ లేదని దీనిపై పలు మార్లు ఎంపిడిఓకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎంపిడిఓ మాట్లాడుతూ జమ్ము నుండి మామ్రే ఫిర్యాదు అందినట్లు తెలిపారు.

‘శూన్యవడ్డీ వల్ల రైతులకు ఊరట’
విజయనగరం (్ఫర్టు), జూన్ 13: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన శూన్యవడ్డీ వల్ల రైతులకు ఊరట కలుగుతుందని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి వంగపండు శివశంకర ప్రసాద్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 52,176 మందిరైతులకు శూన్యవడ్డీ కింద 5,07,40,792 రూపాయలను ఆయా సహకార సంఘాల ఖాతాల్లో జమచేస్తామన్నారు. గురువారం సాయంత్రం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం నాలుగుశాతం వాటా కింద విడుదల చేసిన 2,89,94,567 రూపాయలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జమచేశామన్నారు. అయితే కేంద్రప్రభుత్వం మూడుశాతం వాటా 2,17,45,925 రూపాయలను విడుదల చేయాల్సి ఉందన్నారు. ఈ మొత్తం విడుదలైతే ఆయా సంఘాల్లో జమ చేస్తామన్నారు. గత రబీసీజన్‌లో పంటరుణాలు తీసుకున్న రైతులు ఈనెఖలారులోగా బకాయిలను చెల్లిస్తే శూన్యవడ్డీ వర్తిస్తుందన్నారు. గత రబీసీజన్‌లో 135 కోట్ల రూపాయల పంటరుణాలను రైతులకు అందించామన్నారు. బకాయిలు చెల్లించిన 52,176 మంది రైతులకు వడ్డీశూన్యవడ్డీ వర్తింపు జరిగిందన్నారు. ఈనెలాఖరునాటికి 90శాతం రుణబకాయిలు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు.

‘బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్చాలి’
విజయనగరం, జూన్ 13: బడిఈడు గల పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలని రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు అధికారి కె.వి.రమణ అన్నారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా విద్యా సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బడిఈడు గల పిల్లలను గుర్తించారు. జిల్లాలో 37610 మంది పిల్లలు ఉన్నట్టు గుర్తించారు. వీరిలో పదివేల మంది అంగన్‌వాడీ కేంద్రాల వారు కాగా, మిగిలిన వారు 25వేల మంది ఉన్నారు. కాగా, వారిలో ఇప్పటి వరకు 22వేల మందిని బడిలో చేర్పించారని ఆయన పేర్కొన్నారు. పాఠశాలకు వెళ్లే బడిఈడు పిల్లలందరినీ తప్పనిసరిగా బడిలో చేర్పించాలని ఆయన తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటారని ఫలితాలు మెరుగ్గా వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య, పిఒ కెవి రమణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా బోధన ఉంటుందన్నారు. ఎన్నో ఉచిత సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు. బడిఈడు పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. తల్లితండ్రులు సహకరించి తమ పిల్లలను బడిలో చేర్చాలని పిలుపునిచ్చారు.

ధియేటర్‌లో తూనికల శాఖ అధికారుల తనిఖీ
గజపతినగరం, జూన్ 13 : విజయనగరం డివిజన్ పరిధిలో గత ఏడాదిలో 18 మండలాల్లో దాడులు నిర్వహించి 824 కేసులు నమోదు చేసి 10.5 లక్షల రూపాయలు అపరాధ రుసుం విధించినట్లు లీగల్ మెట్రాలజీ ఇన్స్ పెక్టర్ సిహెచ్ వరప్రసాద్ అన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక సూర్యమహాల్ ధియేటర్‌ను తహశీల్దార్, రెవెన్యూ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, ఎరువులు, విత్తనాలు విక్రయించే దుకాణాలు, పండ్లషాపులలో విక్రయించే వస్తువుల పరిమాణం, ధరలు, వివరాలు తెలిపే బోర్డులు తప్పని సరిగా ఏర్పాటు చేయాలన్నారు. లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ కాటాలను ఏడాదికి ఒక సారి తూనికలు కొలతలు అధికారులు వద్ద సీలు వేయించుకోవాలన్నారు. రాష్ట్ర లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ధియేటర్‌లో మంచినీటి ట్యాంకుపై సరైన మూత లేకపోవడంతో తహశీల్దార్ శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు, మంచినీటి ట్యాంక్‌ను ఎప్పటి కప్పుడు శుభ్రపరుచుకోవాలని సూచించారు. డిప్యూటీ తహశీల్దార్ జయరామ్, మండల రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ కె.సత్యన్నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

విత్తనాల కోసం అన్నదాతల అగచాట్లు
గజపతినగరం, జూన్ 13 : వరివిత్తనాల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. రెండు రోజుల క్రిందట వర్షం పడటంతోపాటు బుధవారం రాత్రి జల్లులు పడటంతో రైతులు వరివిత్తనాల కోసం ఎగబడుతున్నారు. ఇంత వరకు గత రెండు నెలలుగా చినుకు కూడా పడకపోవడంతో విత్తనాల కోసం రైతులు ఆలోచించ లేదు. వర్షం పడటంతో రైతుల్లో ఆశలు రేగి విత్తనాలకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. గురువారం పెద్ద సంఖ్యలో స్థానిక ఎఎంసి గిడ్డంగి వద్ద వ్యవసాయ శాఖ అధికారులు విక్రయిస్తున్న కేంద్రం వద్దకు రైతులు చేరుకున్నారు. గత నాలుగు రోజులుగా ఇక్కడ 1001, స్వర్ణ, సాంబమసూరి రకం విత్తనాలు విక్రయిస్తున్నారు. అధికారులు రైతులు విత్తనాలు కావాల్సి వస్తే మీనమేషాలు లెక్కిస్తుండగా అధికార పార్టీ నాయకులకు మాత్రం లారీల్లో విత్తనాలు తరలిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క వరివిత్తనాల బస్తాపై ఐదు రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని, కళాసీ చార్జి కింద 2 రూపాయలు రైతులే చెల్లించుకోవాల్సి వస్తుందని బస్తాకు ఏడు రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తున్నట్లు రైతులు అంటున్నారు. అదనపు వసూళ్లపై మండల వ్యవసాయ అధికారి సంగీతను వివరణ కావాలని ప్రయత్నించగా సమాధానం ఇవ్వడానికి వెనుకంజ వేశారు. గత నాలుగు రోజులుగా రోజుకు వెయ్యి రూపాయల చొప్పున వరివిత్తనాల బస్తాలను అధికారులు విక్రయించగా రోజుకు 5 వేల చెప్పున అదనంగా రైతుల నుండి వసూళ్లు చేసి ఉంటారని రైతులు అంటున్నారు. ఎడిఎను వివరణ కోరగా ఇలా అదనంగా వసూళ్లు చేయకూడదని విషయం తెలుసుకుని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మున్సిపల్ కాంట్రాక్టర్లపై ఎమ్మెల్సీ ఆగ్రహం
విజయనగరం , జూన్ 13: ‘చేతకాకపోతే తప్పుకొండి. ప్రజలను మాత్రం ఇబ్బందులకు గురిచేయకండి. నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయకపోతే బ్లాక్‌లిస్టులో పెడతాం...అవసరమైతే మీపై పోలీసు కేసులు కూడా పెడతాం’ అంటూ మున్సిపల్ కాంట్రాక్టర్లను ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి హెచ్చరించారు. బాధ్యతాయుతంగా పనిచేయకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని మున్సిపల్ ఇంజనీర్లపై మండిపడ్డారు. పట్టణంలో నెలరోజులపాటు శంకుస్థాపన చేసిన పలు అభివృద్ధిపనులకు సంబంధించి గురువారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ 17,18శాతానికి టెండర్లను దక్కించుకుని పనులు ప్రారంభించకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరైన పద్ధతి కాదన్నారు. ‘మీకు బిల్లుల చెల్లింపులు ఆగిపోతే చెప్పండి. వెంటనే బిల్లులు చేస్తాం. కానీ పనులు చేయకుండా జాప్యం చేస్తే సహించే ప్రసక్తి లేదు’ అని హెచ్చరించారు. మున్సిపాలిటీలో నిధులు పుష్కలంగా ఉన్నాయని, అభివృద్ధిపనులు చేసేందుకు ఎందుకు చొరవ చూపడంలేదని ఆయన ప్రశ్నించారు. నిధులు లేకుండా పనులు ఏలా ప్రారంభిస్తారని ప్రతిపక్షపార్టీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, మున్సిపాలిటీలో నిధులు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేస్తూ అభివృద్ధిపనులను వేగవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి, మున్సిపల్ అసిస్టెంట్‌కమిషనర్ ఎన్‌విడి మణిరామ్, పట్టణ ప్రణాళిక అధికారి ఎ.లక్ష్మణరావు, మున్సిపల్ ఇంజనీర్ బాబు, డిప్యూటీ ఇంజనీర్లు శ్రీనివాసరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో పంచాయతి ఎన్నికల సంగ్రామానికి తెరలేచింది
english title: 
panchayat quota

లక్కవరం చిట్ ఫండ్స్ టోకరాపై విచారణ

$
0
0

జంగారెడ్డిగూడెం, జూన్ 13: మండలంలోని లక్కవరంలో చిట్ ఫండ్స్ పేరుతో పలువురిని వెంకట సుబ్బాయమ్మ అనే ఎస్తేరమ్మ మోసగించి, పరారైన వ్యవహారంపై స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి.మురళీరామకృష్ణ గురువారం విచారణ చేపట్టారు. బాధితుల ఆందోళన పత్రికల్లో చూసి స్పందించిన జిల్లా ఎస్పీ ఎం.రమేష్ ఆదేశాల మేరకు సి.ఐ ఈ విచారణ చేపట్టారు. గత కొంత కాలంగా లక్కవరంలో చిట్ ఫండ్స్ నిర్వహిస్తున్న కుటుంబం మంగళవారం నుండి కనిపించకుండా పోవడంతో వారి వద్ద డబ్బు మదుపు చేసిన వ్యక్తులు, చిట్ ఫండ్స్ పాడుకున్న వ్యక్తులు ఆందోళనకు గురయ్యారు. వీరు టోకరా వేసింది సుమారు 50 లక్షల రూపాయల పైమాటేనని బాధితుల ఫిర్యాదులతో తేలింది. గురువారం ఒక్కరోజే 67 మంది పోలీసులకు ఫిర్యాదు చేసారు. లక్కవరం బి.సి కాలనిలో నివసిస్తున్న తాపీమేస్ర్తి, అతని భార్య ఎస్తేరమ్మ లక్ష రూపాయల చిట్స్, 50 వేల రూపాయల చిట్స్ నిర్వహిస్తున్నారని పలువురు సభ్యులు పోలీసులకు చెప్పారు. ఎస్తేరమ్మ వద్ద చిన్న మొత్తాలలో డబ్బు దాచుకున్న అనేక మంది సి.ఐ ఎదుట హాజరై ఆందోళన వ్యక్తం చేసారు. అధిక వడ్డీ ఇస్తామనడంతో ఈమెకు డబ్బు అప్పు ఇచ్చామని చెప్పారు. ఇటీవల చిట్ పాడుకున్నవారికి నగదు చెల్లించలేదని, తీసుకున్న అప్పులు కూడా చెల్లించడం లేదని చెప్పారు. మంగళవారం ఇంటికి తాళం వేసి, ఇంటిలోని సామాన్లతో సహా ఉడాయిండంతో మోసం వెలుగు చూసిందని చెప్పారు. గురువారం సి.ఐ రావడంతో ధైర్యం వచ్చిన పలువురు లక్కవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. బాధితుల ఫిర్యాదుల మేరకు విచారణ చేస్తున్నట్టు సి.ఐ మురళీరామకృష్ణ తెలిపారు.

అంత వీజీ కాదు
*డిసిసి కార్యవర్గంపై మల్లగుల్లాలు*నియోజకవర్గాల్లో నేతలు గల్లంతు*అధికార పార్టీలో విచిత్ర ధోరణి
ఏలూరు, జూన్ 13 : దాదాపుగా రెండు పదవీ కాలాలు పూర్తవుతున్నాయి. అయినా నేతల కోసం అనే్వషణే... నిలబడే నేత ఎవరా? అని సర్వత్రా చర్చే... చివరకు పార్టీ పరంగా కూడా విచిత్రమైన పరిస్థితే. గతంలో ఏనాడూ అధికారంలో వున్న పార్టీకి ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదనే చెప్పుకోవాలి. ఇక పార్టీ పరంగానూ జోష్ ఉందా అంటే అదీ కనపడదు. ఇక వరుసగా సంవత్సరాలు తరబడి అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ సరికొత్తగా జిల్లాలో సంపాదించుకున్న వర్గమేమిటో నేతలెవరో అర్ధం కాదు. చివరకు జిల్లా పార్టీని పరిశీలించినా అదే నిస్తేజం కనిపిస్తోంది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జిల్లాలో అధ్యక్షులను ప్రకటించిన తరువాత కార్యవర్గాలు ఏర్పడకుండా ఎన్నడూ లేదు. ఈ రికార్డును కూడా బద్దలు చేశారనే చెప్పుకోవాలి. వరుసగా ఇద్దరు జిల్లా అధ్యక్షులు బాధ్యతలు స్వీకరించినా వారిలో ఏ ఒక్కరూ కూడా సొంత కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయారు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న సందర్భంలో ఒక్కసారిగా జిల్లా పార్టీ కార్యవర్గాల విషయం తెరపైకి చేరింది. తక్షణం కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని, జిల్లాలకు ఆదేశాలు అందడంతోపాటు పిసిసి కూడా సుదీర్ఘకాలం తరువాత కార్యవర్గాన్ని ఏర్పాటు చేయగలిగారు. ఏ రకంగా చూసినా ఇవన్నీ గతంలో ఎన్నడూ జరగనివే. ఇక జిల్లాకు వస్తే కార్యవర్గం ఏర్పాటుపై నేతలు మల్లగుల్లాలు పడుతూనే వున్నారు. అయితే అన్ని నియోజకవర్గాల్లోనూ ఉపయోగపడే రీతిలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం ఇప్పుడు అంత వీజీ కాదనే నేతలు కూడా భావిస్తున్నారు. జిల్లాలో అధికార పార్టీ బలాన్ని చూస్తే ప్రస్తుతం ఏడు స్థానాలకు పరిమితమైంది. గతంలో తొమ్మిది స్థానాలు ఉండగా రకరకాల పరిణామాల అనంతరం ఆ సంఖ్య ఏడుకు తగ్గిపోయింది. అలాగే కొన్ని నియోజకవర్గాల పరిధిలో పార్టీ క్రియాశీలకంగా వుందా? అన్న అనుమానాలు కూడా తలెత్తే పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం ఆ పార్టీ యంత్రాంగానికి తలకుమించిన భారంగా మారిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా వాస్తవాలను చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వున్న చోట్ల పరిస్థితిని మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో దాదాపుగా ఆ పార్టీ ఉనికి చాటుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటోంది. మరో విధంగా చూస్తే జిల్లాలో మెజార్టీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొని వుందనే చెప్పుకోవాలి. మరికొన్ని చోట్ల రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్ధులను కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఏలూరు, చింతలపూడి, పోలవరం, గోపాలపురం, దెందులూరు వంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిస్తేజంగా మారిపోయిందని చెప్పుకోవాలి. ఇలాంటి నియోజకవర్గాల్లో పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు కమిటీలని, ఇన్‌ఛార్జిలని ఇలా రకరకాల పేర్లు పెట్టి ప్రత్యేక కసరత్తు జరుగుతుందని ప్రకటించినా ఆ విధమైన పరిస్థితి ఇంత వరకు అమలు కాలేదు. దీంతో ఈ నియోజకవర్గాల పరిధిలో దాదాపుగా ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా చతికిలపడిందనే చెప్పుకోవాలి. ఇక డిసిసి కార్యవర్గం విషయానికి వస్తే నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితుల నేపధ్యంలో వాటికి కూడా ప్రాతినిధ్యం కల్పించే రీతిలో నేతలను ఎంపిక చేయడం ఇప్పుడు ఆ పార్టీ జిల్లా యంత్రాంగానికి కష్టతరంగా మారిపోయిందని చెబుతున్నారు. యధాప్రకారం ఎమ్మెల్యేలు వున్న ప్రాంతాల్లో వారి ఆశీస్సులు, సిఫార్సుల మేరకు కొంతమందిని ఎంపిక చేసినా మిగిలిన చోట్ల మాత్రం నాయకుల అనే్వషణ భారీగానే సాగుతున్నట్లు తెలుస్తోంది. స్థూలంగా చూస్తే సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీకి ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం మాత్రం విచిత్రమనే చెప్పుకోవాలి.

పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలకు
నీరు విడుదల
చాగల్లు , జూన్ 13: నిడదవోలు మండలం విజ్జేశ్వరం వద్ద గోదావరి జలాలను ధవళేశ్వరం ఇరిగేషన్ హెడ్ వర్క్స్ ఇఇ తిరుపతిరావు పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలోనికి విడుదల చేశారు. గురువారం ఉదయం 7.20గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, నీటిని విడుదలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సకాలంలో నీటి సరఫరాకు చర్యలు చేపట్టామని, రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇరిగేషన్ ఎస్‌ఇ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 200 క్యూసెక్కుల నీటిని కాలువలోకి 55 రోజుల తర్వాత విడిచిపెట్టినట్లు తెలిపారు. రైతుకు సకాలంలో నీటిని అందించి పంటల అభివృద్ధికి, అధిక దిగుబడిని పొంది సార్వాలో రైతులు లాభాల బాటలో పయనించటానికి ఉపకరిస్తుందన్నారు. కార్యక్రమంలో శెట్టిపేట ఇఇ, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మున్సిపల్ ఉద్యోగి దారుణ హత్య
ఏలూరు, జూన్ 13 : ఏలూరు కార్పొరేషన్‌లో వాటర్ సప్లై విభాగంలో టుటౌన్ పరిధిలో ఫిట్టర్‌గా పనిచేస్తున్న నిట్టా జాన్ ఆల్‌ఫ్రెడ్ (49) దారుణ హత్యకు గురయ్యారు. నగర సి ఐ ఎన్ మురళీకృష్ణ కధనం ప్రకారం... స్థానిక మస్తాన్‌మన్యం కాలనీకి చెందిన నిట్టా జాన్ ఆల్‌ఫ్రెడ్ ఏలూరు కార్పొరేషన్‌లో వాటర్ సప్లై విభాగంలో ఫిట్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. బుధవారం సాయంత్రం ఆల్‌ఫ్రెడ్ ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి వెళ్లలేదు. స్థానిక శాంతినగర్‌లోని రిజర్వాయర్ ఆవరణలో ఉన్న పాత భవనంలో గురువారం ఆల్‌ఫ్రెడ్ హత్యకు గురైన విషయాన్ని సిబ్బంది సహకారంతో పోలీసులు గుర్తించారు. శాంతినగర్ రిజర్వాయర్ వద్ద ట్యాంక్ వాచర్లుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కె రమేష్, సింహాచలం, శ్రీరామమూర్తిలు పనిచేస్తున్నారు. బుధవారం సాయంత్రం హత్యకు గురైన ఆల్‌ఫ్రెడ్ మోటారు సైకిల్‌ను ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రమేష్ తీసుకువెళ్లిపోయాడు. గురువారం కూడా అతను విధులకు హాజరుకాలేదు. హత్యకు గురైన ఆల్‌ఫ్రెడ్‌తో కలిసి రిజర్వాయర్ ఆవరణలో బుధవారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రమేష్‌తోపాటు మరికొందరు మద్యం సేవించినట్లు తెలుస్తోంది. జాబ్ ఛార్టు ప్రకారం గురువారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రమేష్ రిజర్వాయర్ విధులకు హాజరుకావాల్సి ఉంది. అతను రాకపోవడంతో మిగిలిన ఉద్యోగులు ఈ విధులను నిర్వర్తించారు. కాగా రిజర్వాయర్ ఆవరణలో గల పాత భవనంలో గురువారం ఏదో పడిన శబ్ధం వినపడటంతో వీరు అక్కడకు వెళ్లి పరిశీలించగా ఆల్‌ఫ్రెడ్ మృతదేహాన్ని గుర్తించి మున్సిపల్ ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఏలూరు డి ఎస్‌పి ఎం రజనీ, నగర సి ఐ ఎన్ మురళీకృష్ణ, క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్స్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. మృతుని తలపై రక్తగాయాలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కె రమేష్‌పై పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆల్‌ఫ్రెడ్ మృతిని హత్య కేసుగా నమోదు చేసినట్లు నగర సి ఐ ఎన్ మురళీకృష్ణ చెప్పారు. విచారణలో పూర్తి ఆధారాలు వెలుగుచూస్తాయని ఆయన చెప్పారు. ఏలూరు డి ఎస్‌పి ఎం రజనీ ఆధ్వర్యంలో నగర సి ఐ ఎన్ మురళీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మున్సిపల్ ఉద్యోగి ఆల్‌ఫ్రెడ్ హత్యకు గురయ్యారన్న విషయం తెలుసుకున్న వెంటనే మున్సిపల్ ఎస్ ఇ యోహాను, కార్పొరేషన్ కార్యాలయంలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది శాంతినగర్ రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు.

పోలవరం నిర్వాసితుల పునరావాస పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే
క్రమశిక్షణాచర్యలు:కలెక్టర్
ఏలూరు, జూన్ 13 : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందించే సహాయ, పునరావాస కార్యక్రమాల పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై క్రమశిక్షణా చర్యలకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరు కార్యాలయంలో గురువారం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావా కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు చేపడుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలు నత్తనడకన నడవడంపై అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులలో మొదటి విడతగా ఏడు గ్రామాల ప్రజలకు అమలు చేయాల్సిన సహాయ పునరావాస కార్యక్రమాలను వారి మనోభావాలకు అనుగుణంగా యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినప్పటికీ పనులలో పురోగతి లేదన్నారు. పునరావాస కాలనీ నిర్మాణం, కాలనీలో వౌలిక సదుపాయాల కల్పన, నిర్వాసితుల సమస్యల పరిష్కారం, భూసేకరణ, నిర్వాసితులకు భూమికి భూమి అందించడం, తదితర పనులకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులే నిర్ధేశించిన పనిని నిర్ధేశించిన సమయంలోగా పూర్తి చేయాలన్నారు. నిర్ధేశించిన సమయంలో పనులు పూర్తి చేయని అధికారులపై తీసుకునే క్రమశిక్షణా చర్యలకు వారే బాధ్యత వహించవలసి వస్తుందని, అధఙకారుల పనితీరుపై ఎప్పటికప్పుడు సంబంధిత శాఖాధఙకారులకు తెలియజేయడం జరుగుతుందని, విధి నిర్వహణలో అలసత్వం వహించే అధఙకారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేస్తామని కలెక్టర్ చెప్పారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకు సంబంధించిన గ్రామాల ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలని, ప్రత్యేక చర్యలు తీసుకోవలసిన సమస్యలేమైనా ఉంటే జిల్లాస్థాయి అధికారుల దృష్టికి గాని, లేదా పెద్ద సమస్యలైతే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. నిర్వాసితులకు అందించే నష్టపరిహారం విషయంపై ప్రతీ నిర్వాసితుడికి అవగాహన కల్పించి ప్రజలందరూ ఆయా గ్రామాలను వదిలి కొత్తగా నిర్మించే పునరావాస కాలనీలకు వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్వాసితుల సహాయ, పునరావాస కార్యక్రమాలకు అవసరమైన సిబ్బందికి డివిజన్, ఐటిడి ఎలలో అందుబాటులో ఉన్న సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని, అదే విధంగా వాహనాలను కూడా వారి పరిధిలో ఉన్న వాహనాలను వినియోగించుకోవాలన్నారు. భూ సేకరణకు సంబంధించి సర్వేయర్ల కొరత ఉంటే సర్వే శాఖ ద్వారా సర్వేయర్లను డిప్యుటేషన్‌పై సేవలు వినియోగించుకోవాలన్నారు. నిర్వాసిత గ్రామాల ప్రజల సామాజిక సమస్యలైన రేషన్ కార్డులు, స్వయం ఉపాధి పధకాలు, మొదలైన వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు, పోలవరం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ సుదర్శనం, ఐటి డి ఎ పివో సూర్యనారాయణ, జంగారెడ్డిగూడెం ఆర్డీవో నాన్‌రాజు, డిపివో నాగరాజువర్మ, గృహ నిర్మాణ సంస్థ పిడి సత్యనారాయణ, పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ ఎస్ ఇ విజయభాస్కరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు యల్లారమ్మ, నాగలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే మద్దాల ప్రకటన రాజ్యాంగ విరుద్ధం
జిల్లా టిడిపి అధ్యక్షురాల తోట
ఏలూరు, జూన్ 13 : వై ఎస్ జగన్‌ను విమర్శించే వారిపై భౌతిక దాడులు చేయాలంటూ వై ఎస్ ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు వై ఎస్ విజయమ్మ తనను ఆదేశించారని చింతలపూడి మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కార్యకర్తల సమావేశంలో చెప్పడం ద్వారా ప్రజాస్వామ్యంలో దాడులను ప్రోత్సహిస్తూ జగన్ కుటుంబం రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారనడానికి నిదర్శనమని టిడిపి జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)లు తెలిపారు. వై ఎస్ విజయమ్మ అసలు స్వరూపాన్ని ఆ పార్టీ నాయకుడే బయటపెట్టారని వారు విమర్శించారు. నేరాలు, హత్యలు, దోపిడీలకు అసత్య ప్రచారాలకు వై ఎస్ కుటుంబం చిరునామాగా మారిందని, దీన్ని బట్టి మరోసారి రుజువవుతోందని వారు తెలిపారు. వై ఎస్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని పారిశ్రామిక వేత్తలు, అధికారులను బెదిరించి లక్ష కోట్లు దోపిడీకి పాల్పడిన జగన్ జైలు పాలు అయితే ఆ అవినీతిని ప్రశ్నించిన వారిపై దాడులు చేయాలని పేర్కొనడం ఆ పార్టీ కర్కశత్వాన్ని, రాక్షసత్వాన్ని, దుర్మార్గాన్ని తెలియజేస్తోందని వారు తెలిపారు. ఈ విధంగా చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో వై ఎస్ విజయమ్మ తమ పార్టీ అభ్యర్ధులకు బి ఫారమ్‌లతోపాటు కర్రలు, కత్తులు, తుపాకులు, బాంబులు ఇచ్చి ఎన్నికలకు పంపేలా వున్నారని తెలిపారు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ దాడులను ప్రోత్సహించే నేరప్రవృత్తి కలిగిన వ్యక్తులను ప్రజలు బహిష్కరించి వారికి గుణపాఠం చెప్పాలని టిడిపి నాయకులు కోరారు.
చేపల చెరువుల తవ్వకాలపై సమగ్ర నివేదిక సమర్పించాలి:కలెక్టర్
ఏలూరు, జూన్ 13 : కొల్లేరు ప్రాంతంలో అక్రమ చేపల చెరువుల తవ్వకాలపై సమగ్ర నివేదికను సమర్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ తహశీల్దార్లను ఆదేశించారు. స్థానిక కలెక్టరు ఛాంబరులో గురువారం కొల్లేరు అక్రమ చేపల చెరువుల తవ్వకాలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో కొల్లేరు ప్రాంతంలో అక్రమ చేపల చెరువుల తవ్వకాలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించిన దృష్ట్యా తక్షణం నివేదికను సమర్పించాలని కొల్లేరులో ఎక్కడైనా అక్రమ చేపల చెరువులు తవ్వకాలు జరిగితే సంబంధిత తహశీల్దార్లను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. నిడమర్రు మండలం వెంకటాపురం, నిడమర్రు ప్రాంతాలలో 132 ఎకరాలు విస్తీర్ణంలో అనధికారికంగా తవ్విన 132 ఎకరాల చేపల చెరువులను తక్షణమే ధ్వంసం చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ చేపల చెరువులు అక్రమంగా తవ్విన వారిపై కేసులు కూడా నమోదు చేసి వివరాలు తెలపాలని కలెక్టర్ ఆదేశించారు. కొల్లేరు ప్రాంతంలో కనీసం పది వేల ఎకరాలకు పైగా అక్రమ చేపల చెరువులు ఉండే అవకాశాలున్నాయని, వాటి సమగ్ర వివరాలను వెంటనే సమర్పిస్తే తగు చర్యలకు ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ చెప్పారు. కొల్లేరు ప్రాంతంలో వన్యప్రాణి సంరక్షణ కోర్టు పరిధిలో జిరాయితీ భూముల్లో అక్రమ చేపల చెరువుల తవ్వకాలకు సంబంధించిన 36 కేసులు సత్వరమే పరిష్కరించి కొల్లేరులో ఎక్కడా కూడా అక్రమ చేపల చెరువులు లేకుండా చూడాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. కొల్లేరు పరిధిలో సంప్రదాయ పద్దతిలో చేపల పెంపకం సాగాలే తప్ప ఎక్కడికక్కడే అక్రమంగా చేపల చెరువులు తవ్వితే పర్యావరణానికి హాని జరుగుతుందని అటువంటి వారిపై చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వర్షాకాలంలో మురుగునీరు త్వరితగతిన సముద్రంలోకి వెళ్లే పరిస్థితి ఉండాలని ఎక్కడైనా ఇందుకు ఆటంకం కలిగించే అక్రమ చేపల చెరువులను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డి ఆర్‌వో ఎం మోహనరాజు, ఆర్‌డివో కె నాగేశ్వరరావు, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ కృష్ణమూర్తి, తహశీల్దార్లు ఎజి చిన్నికృష్ణ, పోసిన వెంకన్నబాబు, ఎం మురళీధర్, సోమశేఖర్, నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు.

గురుకుల పాఠశాలల్లో విద్యా బోధనకు సమగ్ర ప్రణాళిక
వీడియో కాన్ఫరెన్స్‌లో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆదేశం
ఏలూరు, జూన్ 13 : ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో కొత్త విధానంలో పాఠాలు బోధించేందుకు సమగ్ర ప్రణాళిక అమలు చేయాలని గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్‌ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్‌తో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రవీణ్‌కుమార్‌తో జిల్లా గురుకుల పాఠశాలల కన్వీనర్ ఎన్ సంజీవరావు మాట్లాడారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుండే విద్యార్ధి సమగ్ర అభివృద్ధికి ప్రణాలిక లమలు చేయడం వల్ల విద్యా ప్రమాణాలు మెరుగుపడి మంచి ఫలితాలు లభిస్తాయని ప్రవీణ్‌కుమార్ చెప్పారు. గురుకుల పాఠశాలల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించడంతోపాటు విద్యార్ధినీ విద్యార్ధులకు అవసరమైన వౌలిక వసతులను కూడా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టవంతం చేయాలని అప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యపడతాయని ప్రవీణ్‌కుమార్ చెప్పారు. విద్యార్ధినీ విద్యార్ధుల రోజువారీ ప్రగతి తీరును కూడా పరిశీలన చేయాలని, ఏ ఏ సబ్జెక్టులలో వెనుకబడి వున్నారో అటువంటి విద్యార్ధినీ విద్యార్ధులను ముందుగానే గుర్తించి ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా బోధనా విధానంలో కొత్త పోకడలను అనుసరించాలని తద్వారా ఆ విద్యార్ధులు ఆయా సబ్జెక్టులలో కూడా రాణించగలుగుతారని ఆయన చెప్పారు. జిల్లాలోని తొమ్మిది సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఇప్పటి నుండే ప్రణాళిక సిద్దం చేస్తున్నామని రెసిడెన్షియల్ కళాశాలల కన్వీనర్ సంజీవరావు చెప్పారు. కార్యక్రమంలో వివిధ గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్స్ రత్నకుమారి, దేవకి, రాణి, సిహెచ్ పద్మిని, వర్మాచార్యులు, పి ఆర్‌కె మూర్తి, పి సోమయాజులు తదితరులు పాల్గొన్నారు.

చోరీ కేసులో నిందితుడు అరెస్టు
11 కాసుల బంగారం,
కిలో వెండి వస్తువులు
స్వాధీనం

చింతలపూడి, జూన్ 13: చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో ఈ నెల 2న మూడు గృహాలలో వరుస దొంగతనాలకు పాల్పడిన రాణిమేకల వీరయ్యను అరెస్టు చేసినట్లు సిఐ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ధర్మాజీగూడెంకు చెందిన నిందితుడు వీరయ్య చెడు వ్యవసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. ప్రగడవరం గ్రామంలో అట్ల నాగేశ్వరరావు, జయవరపు సూర్యనారాయణ, జె నాగిరెడ్డి గృహాలలో ఒకే రాత్రి చోరీ చేసిన 11 కాసుల బంగారు వస్తువులు, 1 కేజి వెండి వస్తువులు, 32 వేల నగదు, ఒక సెల్‌ఫోన్ నిందితుడి నుంచి రికవరీ చేసినట్లు సిఐ వివరించారు. నిందితుడు రాణిమేకల వీరయ్య పాత నేరస్థుడని, జైలు శిక్ష అనుభవించి రెండు నెలల క్రితమే విడుదలైనట్లు సిఐ చెప్పారు. సమావేశంలో చింతలపూడి ఎస్‌ఐ బి కృష్ణ కుమార్, హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు, కానిస్టేబుల్ రవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలి
మాజీ ఎమ్మెల్యే పాతపాటి
ఉండి, జూన్ 13: ఉండి నియోజకవర్గంలో గతంలో మంజూరైన ఇరిగేషన్ పనులు పూర్తి చేయకపోవటం వలన రైతాంగానికి నష్టం వాటిల్లుతోందని, వాటిని వెంటనే పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఉండిలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఉండి కాలువ శివారు ప్రాంతానికి సక్రమంగా నీరు అందించటానికి ఉపయోగపడుతుందని, ఉండి నుండి 3 కిలోమీటర్ల మేర సిమెంట్ లైనింగ్‌కు, ఉండి అక్విడెక్ట్ పునర్నిర్మాణానికి , వెంకయ్య వయ్యేరు బెడ్ కాంక్రీట్‌కు డ్రెయిన్ల ఆధునీకరణకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో చెప్పి నిధులు మంజూరు చేయించినట్లు వెల్లడించారు. అయితే వాటిలో ఒక్క పని కూడా గత నాలుగేళ్ళ కాలంలో పూర్తి చేయకపోవటంతో, రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు వెంటనే వాటిని చేపట్టి పనులు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పనులు చేయని పాలకులను నిలదీయాల్సిన ప్రతిపక్షం అధికార పార్టీని నిలదీయటంలో విఫలమైనందున, రైతాంగానికి నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెదకాపవరం నుండి ఏలూరుపాడు లాకు వరకు వెంకయ్య వయ్యేరులో కర్రనాచు పట్టి నీరు కిందకు లాగని పరిస్థితి ఉందన్నారు. అధికారులు వెంటనే కర్రనాచు తొలగించాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ రైతాంగానికి ప్రభుత్వం వెంటనే సబ్సిడీ విత్తనాలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు ఏడిద వెంకటేశ్వరరావు, గులిపిల్లి అచ్చారావు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

చాటపర్రులో రైస్‌మిల్లులపై
విజిలెన్స్ దాడులు
ఏలూరు, జూన్ 13 : ఏలూరు మండలం వెంకటాపురం పంచాయితీ చాటపర్రు రోడ్డులో వున్న రైస్‌మిల్లులపై విజిలెన్స్ అధికారులు బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుఝాము వరకు దాడులు చేశారు. ఈ దాడుల్లో కోటీ 85 లక్షల రూపాయల విలువైన అక్రమ ధాన్యం, బియ్యం నిల్వలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారుల కధనం ప్రకారం వెంకటాపురం పంచాయితీ చాటపర్రు రోడ్డులో వున్న దుర్గాప్రసాద్ రైస్ ట్రేడర్స్‌లో అక్రమ ధాన్యం, బియ్యం నిల్వలు వున్నాయంటూ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. విజిలెన్స్ ఎస్‌పి ఎం నారాయణ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు దుర్గాప్రసాద్ రైస్ ట్రేడర్స్ మిల్లుపై దాడి చేశారు. మిల్లు యజమాని మద్దుల వెంకటేశ్వరరావును అక్రమ నిల్వలకు సంబంధించి ప్రశ్నించారు. వీటికి సమాధానం లేకపోవడం, రికార్డుల్లో కూడా నిల్వలను గూర్చి లెక్కలు లేకపోవడంతో 13 వేల క్వింటాళ్ల ధాన్యం, 600 క్వింటాళ్ల బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. అలాగే ఈ మిల్లు ఎదురుగా వున్న లక్ష్మీనారాయణ రైస్‌మిల్లుపై కూడా దాడులు చేశారు. ఈ మిల్లులో సూపర్‌ఫైన్ రకం బియ్యం 400 క్వింటాళ్ల వివరాలను రికార్డుల్లో పేర్కొనకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఈ అంశంపై విచారణ నిర్వహించి శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు చెప్పారు. మిల్లు యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సి ఐ వెంకటేశ్వరరావు, తహశీల్దార్ రామ్మూర్తి, డిడి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

67 మంది ఫిర్యాదు
english title: 
cheat fund

అడుగడుగునా జల్లెడ

$
0
0

ఆత్మకూరు, జూన్ 13: చట్టాన్ని ఎవరు అతిక్రమించిన చర్యలు తప్పవని ఆత్మకూరు సిఐ కిషోర్‌కుమార్ అన్నారు. ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ జెఎసి తలపెట్టిన చలో అసెంబ్లీ ముట్టడికి ప్రభుత్వ అనుమతి లేనందున గ్రామాలలోని విద్యార్థులు, యువకులు, టిఆర్‌ఎస్, బిజెపి, టి-జెఎసి, విద్యార్థి జెఎసి నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌కు తరలివెళ్లరాదని అన్నారు. ఇందుకోసం వాహనాలు సమకుర్చినా, తరలివెళ్లినా నేరంగా పరిగణించి కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందులో భాగంగా బైండోవర్లు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువకులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామని, దీంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపారు. ఇది గమనించి ప్రతిఒక్కరు పోలీసులకు సహకరించాలని కోరారు. మండలంలోని పులుకుర్తి, కొగిలివాయి, ముస్త్యాలపల్లి, ఓగ్లాపూర్, దామెర గ్రామాలకు చెందిన టిఆర్‌ఎస్ నాయకులు దామెరుప్పుల శంకర్, దాడి మల్లయ్య, పలుకల విజేందర్‌రెడ్డిలతోపాటు 36మందిని తహశీల్దార్ కారం యాదగిరి ముందు హాజరుపరచి బైండోవర్ చేసినట్లు తెలిపారు. అనంతరం ఎస్సై క్రాంతికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా పెద్దసంఖ్యలో అసెంబ్లీ ముట్టడికి తరలివెళ్లాలని చూస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సంగెం మండలంలో...
సంగెం: చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని సంగెం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన టిఆర్‌ఎస్ పార్టీ నాయకులను 31మందిని సంగెం పోలీసులు అరెస్టు చేశారు. టిఆర్‌ఎస్ పార్టీ మండల నాయకుడు రౌతు లక్ష్మయ్యతోపాటు మరో 30మందిని అరెస్టుచేసి తహశీల్దార్ బిక్షం ముందు బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.
మంగపేటలో...
మంగపేట: మండల కేంద్రంలోని తెలంగాణ సెంటర్ వద్ద గురువారం సమావేశమైన టిఆర్‌ఎస్ నాయకులను మంగపేట ఎస్సై విజ్ఞాన్‌రావు అరెస్టుచేసి స్థానిక తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. ఎస్సై వివరాల ప్రకారం.. టిఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కొమరగిరి కేశవరావు ఆధ్వర్యంలో 32 మంది టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, జెఎసి నాయకులు సమావేశమై ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి తరలివెళ్లేందుకు సన్నద్ధం అవుతుండగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వీరిని అరెస్టుచేసి తహశీల్దార్ కనకరాజు ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై వివరించారు.
జఫర్‌గఢ్ మండలంలో...
జఫర్‌గడ్: రాజకీయ జెఎసి తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లకుండా జఫర్‌గడ్ మండలంలో రెండవరోజు అరెస్టుల పరంపర కొనసాగుతోంది. గురువారం మండలంలోని ఓగ్లాపూర్, తీగారం, తమ్మెడపెల్లి (జి), హిమ్మత్‌నగర్ గ్రామాలకు చెందిన 34మంది టిఆర్‌ఎస్ నాయకులను కార్యకర్తలను తెల్లవారుజామునే అరెస్టుచేసి తహశీల్దార్ ముందు బైండోవర్ చేశారు.
నర్సంపేటలో...
నర్సంపేట: చలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో నర్సంపేట పట్టణంలో ఏడుగురు జెఎసి నాయకులను పోలీసులు తహశీల్దార్ రజనీరెడ్డి ఎదుట గురువారం బైండోవర్ చేశారు. బైండోవర్ అయిన వారిలో జెఎసి పట్టణ అధ్యక్షుడు తౌటిరెడ్డి క్రిష్ణారెడ్డి, కోకన్వీనర్లు నూకాల క్రిష్ణమూర్తి, పాక చక్రపాణి, కుసుమ ప్రభాకర్, నూకాల పద్మ, గాదె శైలజారెడ్డి, రామగోని వెంకటేశ్వర్లులు ఉన్నారు.
ఏటూరునాగారం మండలంలో...
ఏటూరునాగారం: మండలంలోని వివిధ విప్లవ గ్రూపులకు చెందిన మాజీ నక్సలైట్లను గురువారం బైండోవర్ చేసినట్లు ఎస్సై సంజీవరావు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మాజీలను ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి వెళ్లకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. భద్రతాచర్యల్లో భాగంగా ముందస్తుగా వారిని బైండోవర్ చేశామని అన్నారు.
మహబూబాబాద్‌లో...
మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయాలనే డిమాండ్‌తో టి-జెఎసి ఇచ్చిన పిలుపుమేరకు చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి తెలంగాణ వాదులు వెళ్లకుండా పోలీసులు తమ నిఘాను గురువారం కూడా కొనసాగించారు. మహబూబాబాద్ రైల్వే మార్గం ద్వారా వెళ్లే వారిని అడ్డుకునేందుకు రైల్వే స్టేషన్‌లోనే ప్రత్యేక పోలీసు పికెట్ ఏర్పాటు చేసి, రైళ్లల్లో వెళ్లే అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, హైదరాబాద్ ఆందోళనను విజయవంతం చేయడానికి వాహనంలో తరలివెళ్తున్న మహబూబాబాద్ సిపిఐ పట్టణ కార్యదర్శి బి. అజయ్ సారధి, మరి కొందరు నాయకులను పోలీసులు నిర్బంధించి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ చలో అసెంబ్లీకి తరలివెళ్తున్న నాయకులను అక్రమంగా నిర్భందించి అరెస్టు చేయడం అప్రజాస్వామికం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించేంత వరకు సిపిఐ రాజీలేని పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి పెరుగుకుమార్, నాయకులు జన్నిభద్రం, ఎఐవైఎఫ్ నాయకుడు వీరవెల్లిరవి ఉన్నారు.
కురవిలో...
కురవి: తెలంగాణ ఉద్యమం ఆరు దశాబ్దాలుగా జరుగుతుందని, బైండోవర్‌లతో తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేరని తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు నూకల నరేష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర రాజకీయ ఐకాస పిలుపు మేరకు ఈనెల 14న నిర్వహించే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని స్పష్టం చేశారు. గురువారం కురవి మండల కేంద్రంలోని స్థానిక తహశీల్దార్ కార్యలయంలో డిప్యూటి తహశీల్దార్ ఎదుట నూకల నరేష్‌రెడ్డితో పాటు 32మంది మరిపెడ మండల తెలంగాణ వాదులు బైండోవర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా చేయతలపెట్టిన చలో అసెంబ్లీకి ప్రభుత్వం అనుమతిని ఇచ్చేదిపోయి హింసాత్మకంగా మార్చే ఆలోచనలో ఉందని ధ్వజమెత్తారు. కిరణ్ కుమార్‌రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని, కేవలం అధిష్ఠానం సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజలు కాంగ్రెస్, టిడిపి, వైఎస్సార్ సిపి పార్టీలకు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

‘చలో అసెంబ్లీ’ ముట్టడికి తరలివెళ్తున్న ఉద్యమకారుల ముందస్తు అరెస్టు * బైండోవర్లు
english title: 
jalleda

పోలీస్ చక్రబంధంలో ఓరుగల్లు

$
0
0

వరంగల్, జూన్ 13: అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో.. తెలంగాణ ఉద్యమ ఖిల్లా వరంగల్ పోలీసుల చక్రబంధంలో చిక్కింది.. రాజధానికి వెళ్లే తెలంగాణవాదులను అడుగడుగునా పోలీసులు నిలిపివేయడంతోపాటు.. మరోవైపు ముందస్తుగా చేసిన వేలాది అరెస్టులు, బైండోవర్లతో జిల్లానుంచి తెలంగాణవాదులు చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా ఇవేవీ లెక్కచేయకుండా పోలీసుల కన్నుగప్పి వందలాదిమంది తెలంగాణవాదులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. శుక్రవారం అసెంబ్లీని ముట్టడించేందుకు తెలంగాణ రాజకీయ ఐకాస ఇచ్చిన పిలుపుమేరకు జిల్లానుండి స్పందన పెద్దఎత్తున వచ్చింది. తెలంగాణ రాష్టస్రమితి, భారతీయ జనతాపార్టీ, సిపిఐ, న్యూడెమొక్రసీ కార్యకర్తలతోపాటు విద్యార్థి జెఎసి ప్రతినిధులు రాజధాని బాట పట్టేందుకు సిద్ధంకాగా..జిల్లావ్యాప్తంగా 40చెక్‌పోస్టులను ఏర్పాటుచేసిన పోలీసులు మూడు రోజులుగా వారిని అడ్డుకుంటున్నారు. మరికొన్ని గంటల్లో కార్యక్రమం ఉండగా..గురువారం తెల్లవారుజాము నుండే తెలంగాణవాదులు హైదరాబాద్‌కు వివిధ మార్గాల ద్వారా తరలి సాయంత్రానికి చేరుకున్నారు. చలో అసెంబ్లీ నేపథ్యంలో జిల్లా పోలీసులు జిల్లాలోని అన్ని రైల్వేస్టేషన్లలో నిఘా ముమ్మరం చేశారు. డిఎస్పీల ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలను దింపి రైళ్లలో తెలంగాణవాదులు హైదరాబాద్ వెళ్లకుండా చూస్తున్నారు. ఆయా రైల్వేస్టేషన్లకు వచ్చే ప్రయాణికులతోపాటు రైళ్లలోను తనిఖీలు జరిపి అనుమానితులను కిందకు దింపేస్తున్నారు. రైల్వేస్టేషన్లు పోలీసులతో కిక్కిరిసిపోయాయి. చలో అసెంబ్లీ నేపథ్యంలో తెలంగాణవాదులు హైదరాబాద్‌కు తరలివెళ్తున్నారనే అనుమానంతో శుక్రవారం ఉదయం వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్యాసింజర్ రైలును రైల్వే అధికారులు రద్దుచేశారు. పోలీసుల హెచ్చరికల మేరకు అవసరమైతే మరికొన్ని ప్యాసింజర్ రైళ్లను కూడా చివరి నిమిషంలో రద్దుచేయవచ్చని తెలుస్తోంది. రైల్వేమార్గంలో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బస్‌లలో వెళ్లేందుకు కొందరు యత్నించగా.. అక్కడ కూడా అడ్డంకులు ఎదురయ్యాయి. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్‌స్టేషన్‌తోపాటు వివిధ ప్రాంతాల్లోని బస్‌స్టేషన్లలో పోలీసులు తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. పార్టీలతో ప్రమేయం లేకుండా యువకులెవరూ హైదరాబాద్ వెళ్లకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. శుక్రవారం పరిమిత సంఖ్యలో పోలీసుల పర్యవేక్షణలో బస్సులను నడపాలని ఆర్టీసి అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. జిల్లాలోని మహబూబాబాద్, నర్సంపేట, జనగామ, పరకాల తదితర రూట్లలోనూ పోలీసులు తనిఖీలు జరిపారు. కాగా బైండోవర్లు, అరెస్టులతో జిల్లా దద్దరిల్లిపోయింది. జిల్లావ్యాప్తంగా దాదాపు రెండువేల మంది తెలంగాణణవాదులను పోలీసులు రెవిన్యూ అధికారుల వద్ద బైండోవర్ చేశారు. వరంగల్ ఆర్డీవో కార్యాలయం తెలంగాణవాదుల బైండోవర్‌తో కిటకిటలాడింది. ఇళ్లల్లో, పార్టీ కార్యాలయాల్లో.. హైదరాబాద్‌కు వెళ్లె మార్గంలో తెలంగాణ అనుకూలపార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆర్డీవో ఎదుట బైండోవర్ చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా.. తెలంగాణ నినాదాలతో ఆర్డీఒ కార్యాలయం ప్రతిధ్వనించింది. ఒక దశలో ఆగ్రహించిన తెలంగాణవాదులు ఆర్డీవో కార్యాలయానికి తాళాలు వేసేందుకు యత్నించగా.. అధికారులతోపాటు పోలీసులు రంగప్రవేశం చేసి వారికి నచ్చచెప్పి ఆ చర్యను విరమింపచేశారు. మరోవైపు బిజెపి కార్యాలయంలో నాయకులు పత్రికా సమావేశం ఏర్పాటుచేసిన సమయంలోనే పోలీసులు అక్కడకు చేరుకుని నాయకులను బయటకు వెళ్లకుండా అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల చర్యతో బైఠాయించిన బిజెపి నాయకులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చివరకు పోలీసులు వారిని బయటకు వెళ్లేందుకు అనుమతించారు. కాగా చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ బయలుదేరిన మాజీ మంత్రి, టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరిని జనగామ వద్ద జిల్లా సరిహద్దులో పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించారు. ఇదిలా ఉంటే, పోలీసుల కన్నుగప్పి అనేకమంది తెలంగాణవాదులు వివిధ మార్గాల్లో రాష్ట్ర రాజధానికి చేరుకున్నట్లు సమాచారం. చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ఎలాగైనా హాజరు కావాలనే లక్ష్యంతో ముందుగానే.. పోలీసులకు చిక్కకుండా హైదరాబాద్ వెళ్లారని తెలిసింది. మరోపక్క చలో అసెంబ్లీ కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్‌లో ప్రత్యేక బందోబస్తు కోసం జిల్లా నుంచి ఎంపిక చేసిన కొంతమంది సిఐలు, ఎస్సైలు, పోలీసు బృందాలను అధికారులు హైదరాబాద్‌కు పంపించారు. జిల్లా నుంచి వచ్చిన నాయకులను, తెలంగాణవాదులను గుర్తించి ఎక్కడికక్కడే నిలిపివేసే బాధ్యతలను వీరికి అప్పగించారు.

ఎన్ని అడ్డంకులు సృష్టించినా అసెంబ్లీని ముట్టడిస్తాం
* బిజెపి రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ మార్తినేని
హన్మకొండ, జూన్ 13: సీమాంధ్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా అసెంబ్లీని ముట్టడించి తీరుతామని బిజెపి రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ మార్తినేని ధర్మారావు హెచ్చరించారు. గురువారం నగరంలోని బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ జెఎసి ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత పద్ధతిలో నిర్వహించ తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసే కుట్రలో భాగమేనని విమర్శించారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని జెఎసి, బిజెపి, టిఆర్‌ఎస్, న్యూడెమోక్రసీ, సిపిఐ తదితర పార్టీల ప్రతినిధులు కోరినప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అనుమతి ఇవ్వకుండా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును సిఎం కాలరాస్తున్నాడని ఆరోపించారు. సిఎం అదేశాలతో డిజిపి దినేష్‌రెడ్డి పోలీసులతో తెలంగాణ ప్రాంతంలో భయాందోళనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి మూడురోజుల ముందునుండే తెలంగాణలో నిర్భంధం కొనసాగుతున్నదని అన్నారు. తెలంగాణ ప్రాంత పల్లెలు, పట్టణాలను పోలీసుల గుప్పిట్లోకి తెచ్చుకుని దిగ్భంధనం చేశారని అన్నారు. ఉద్యోగులు, న్యాయవాదులు, విద్యార్థులు, తెలంగాణవాదులను ఎక్కడికక్కడే అరెస్టుచేసి నిర్భందిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో నిజాం పాలన కొనసాగుతున్నదని, రజాకార్ల పరిపాలనలో కూడా ఇంత నిర్బంధాన్ని చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌వైపు వెళ్లే రహదారులు, బస్‌స్టాండ్లు, రైల్వేస్టేషన్లలో పోలీసులు మకాంవేసి తెలంగాణవాదులను అరెస్టు చేస్తున్నారని అన్నారు. అరెస్టులు, బైండోవర్ల పేరుతో వరంగల్ జిల్లాలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్‌ను బొందపెట్టడం ఖాయం
సిఎం కిరణ్ కాంగ్రెస్‌కు మరణశాసనం రాస్తున్నాడు * టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం
జనగామ, జూన్ 13: తెలంగాణ ప్రజల ఆకాంక్షపై, ఉద్యమంపై ఉక్కుపాదాన్ని మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు త్వరలోనే బొందపెట్టడానికి సిద్ధమవుతున్నారని టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి అన్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఒకరోజు ముందే జిల్లా నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆయనను గురువారం జనగామలోని ఏకశిల బిఇడి కళాశాల వద్ద జనగామ ఎఎస్పీ జోయల్ డేవీస్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. కడియం వ్యక్తిగత పూచీ తీసుకొని తిరిగి వరంగల్‌కు పంపించారు. ఈ సందర్భంగా కడియం విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణ ఉద్యమంపై అప్రకటిత నిర్బంధాన్ని అమలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి మరణశాసనం రాస్తున్నాడని, కాంగ్రెస్‌కు ఆయనే చివరి ముఖ్యమంత్రి కాబోతున్నాడని జోస్యం చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉందని, దాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉప్పెనలా లేస్తుందని, దీన్ని అడ్డుకోవడం ఎవరితరం కాదన్నారు. శాంతియుతంగా నిర్వహించే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని హింసాత్మకంగా మార్చేందుకు సీమాంధ్ర పాలకులు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రాంత మంత్రులు సీమాంధ్ర పాలకుల వద్ద శవాల్లా పడి ఉండి తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతులు తెచ్చే దమ్ము, ధైర్యం లేని తెలంగాణ మంత్రులు ఆ పార్టీలో ఎందుకు కొనసాగుతున్నారని ఆయన ప్రశ్నించారు. వారికి సిగ్గు, శరం ఉంటే వెంటనే రాజీనామాలు చేసి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని, లేనట్లైతే వారు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా తెలంగాణలోని మంత్రులే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు ఎదురైనా వాటిని అధిగమించి తెలంగాణవాదులు చలో అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో తెలంగాణ మంత్రులను గ్రామాల్లోకి రానివ్వవద్దని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండ యాదగిరి రెడ్డి, పసుల ఏబేలు, రాంరెడ్డి, మేకల కళింగరాజు తదితరులు పాల్గొన్నారు.

మానసిక వికలాంగురాలిపై అత్యాచారం
‘నిర్భయ’ చట్టం అమలుకు స్థానికుల డిమాండ్
రాయపర్తి, జూన్ 13: కామంతో కళ్లు మూసుకుపోయి మానసిక వికలాంగురాలిపై ఒక వ్యక్తి అత్యాచారం చేసిన సంఘటన మండలంలోని మొరిపిరాల గ్రామంలో జరిగింది. ఎస్సై, బంధువుల కథనం ప్రకారం.. మొరిపిరాలకు చెందిన మానసిక వికలాంగురాలిపై (25) అదే గ్రామానికి చెందిన కాగితోజు రాములు (45) అనే వ్యక్తి ఈనెల 11వ తేదీన అత్యాచారం జరిపాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి మానసిక వికలాంగురాలు బలైపోయింది. ప్రస్తుతం మానసిక వికలాంగురాలి పరిస్థితి దయనీయంగా మారింది. మానసిక వికలాంగురాలి తల్లి అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. వర్ధన్నపేటలో అంగన్‌వాడీ కార్యకర్తల సమావేశానికి వెళ్లిన క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలో తండ్రి ట్రాక్టర్ నడిపేందుకు వెళ్లాడు. అంగన్‌వాడీ కార్యకర్తల సమావేశానికి వెళ్లివచ్చిన తల్లి కూతురికి స్నానం చేయిస్తుండగా ఆమె శరీరంపై గాయాలు ఉండటంతో ఇదేమిటని ప్రశ్నించింది. దీంతో జరిగిన విషయాన్ని వికలాంగురాలు తల్లికి సైగలతో విషయాన్ని వివరించింది. దీంతో ఆమె భర్తతో కలసి గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అభం.. శుభం తెలియని మానసిక వికలాంగురాలిని అత్యాచారం చేయడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్భయ చట్టం కింద అత్యాచారం జరిపిన రాములుపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మామునూరు డిఎస్పీ సురేష్‌కుమార్, వర్ధన్నపేట సిఐ మల్లయ్య సంఘటన ప్రదేశానికి చేరుకుని సంఘటన వివరాలను తెలుసుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వాయిదా తీర్మానంపై కడియం విమర్శలు అర్థరహితం
టిడిపి జిల్లా అధ్యక్షుడు బస్వారెడ్డి
హన్మకొండ, జూన్ 13: శాసనసభ సమావేశాలలో తెలంగాణపై తెలుగుదేశం పార్టీ వాయిదా తీర్మానం పెట్టలేదని మాజీమంత్రి కడియం శ్రీహరి చేస్తున్న విమర్శలు అర్థరహితమని టిడిపి జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి అన్నారు. గురువారం నగరంలోని టిడిపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణపై స్పష్టమైన వైఖరి కలిగిన టిడిపిపై కడియం శ్రీహరి పదేపదే ఆరోపణలు చేయడం మానుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వాయిదా తీర్మానం పెట్టామని, తెలంగాణపై స్పష్టతతో ముందుకు సాగుతున్న టిడిపి వాయిదా తీర్మానం పెట్టకుంటే దానిని రాద్ధాంతం చేయడం కడియంకు తగదని అన్నారు. తెలంగాణపై స్పష్టత ఇవ్వని కాంగ్రెస్ పార్టీని వదిలేసి స్పష్టత కలిగిన టిడిపిపై విమర్శలు చేయడం మానుకోవాలని చెప్పారు. అంతేకాకుండా టిడిపిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డిలే ఉన్నట్లు చీటికిమాటికి వారిపై కడియం నోరు పారేసుకుంటున్నారని, ఇంకోసారి విమర్శలు చేస్తే ప్రతి విమర్శ తప్పదని హెచ్చరించారు. ఉద్యమంలో పాల్గొనకుంటే పాల్గొనడం లేదని, పాల్గొంటామంటే స్వాగతించని టిఆర్‌ఎస్ పార్టీకి ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందని అన్నారు. జెఎసి చైర్మన్ కోదండరాం టిఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు సూచనల మేరకే టిడిపిని ఉద్యమంలోకి రానివ్వడం లేదని విమర్శించారు. తెలంగాణకోసం తాము కూడా చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటామని అన్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలివెళ్లే టిడిపి నాయకులు, కార్యకర్తలను అరెస్టుచేస్తే నిరసన కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచి వేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టులకు పాల్పడుతోందని విమర్శించారు. అరెస్టులతో చలో అసెంబ్లీ ముట్టడిని పోలీసులు ఆపలేరని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, టిడిపి వరంగల్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ దొమ్మాటి సాంబయ్య, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ గండ్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

* అడుగడుగునా తెలంగాణవాదుల నిలిపివేత * మూడోరోజు కొనసాగిన వేలాది అరెస్టులు * కన్నుగప్పి హైదరాబాద్ చేరిన పార్టీల శ్రేణులు
english title: 
chakrabandham

నాగబాబు ‘పోలీస్ డైరీ’

$
0
0

మనిషి అన్నిరంగాల్లోనూ దూసుకెళుతున్నప్పటికీ పెరిగిపోతున్న నేరాలను అరికట్టడంలో మాత్రం ఎప్పటి కప్పుడు విఫలమవుతూనే వున్నాడు. రాత్రీపగలూ తేడా లేకుండా, వయసు తారతమ్యాలను సైతం చూడకుండా, ఆడామగా విచక్షణలేకుండా అఘాయిత్యాలకు బలి అవుతూనే వున్నారు. నేరాల విషయంలో ప్రజలను చైతన్యవంతుల్ని చేయవలసిన అత్యవసర సమయం ఆసన్నమైందనే అభిప్రాయంతో నటుడు, నిర్మాత కె.నాగబాబు వ్యాఖ్యాతగా ‘పోలీస్‌డైరీ’ అనే కార్యక్రమాన్ని జీ-తెలుగు వీక్షకుల ముందుకు తీసుకువచ్చింది. నేటి నుంచి (జూన్ 16) ఆదివారం రాత్రి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం శని, ఆదివారాల్లో రా.9.30గం.లకు ప్రసారం కానున్నది. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ- ‘‘జీ తెలుగు ఆధ్వర్యంలో రూపొందిన ఈ కార్యక్రమం ప్రతీ ఒక్కరినీ కదిలిస్తుంది. ఇందులో అందరూ భాగస్వాములు కావాలి. సమాజంలో జరుగుతున్న నేరాల గురించి చర్చిస్తూనే, అమూల్యమైన సలహాలు సూచనలు కూడా పంపొచ్చు. ప్రజల్ని చైతన్య వంతుల్ని చేసే ప్రయత్నంలో భాగంగా ‘పోలీస్‌డైరీ’ కార్యక్రమాన్ని ప్రసారం చేయబోతున్న జీతెలుగు, పలు కళాశాలల్లో చర్చా కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేయనుంది’’అని పేర్కొన్నారు.

మనిషి అన్నిరంగాల్లోనూ దూసుకెళుతున్నప్పటికీ
english title: 
police diary

‘డేగ’ పాటలు వచ్చేశాయ్

$
0
0

సుజిత్, ప్రగ్య జైస్వాల్, ఎరికా ఫెర్నాండెజ్ ముఖ్య తారలుగా సుజిత్ ఆర్ట్ కమర్షియల్స్ పతాకంపై సి.కళ్యాణ్ సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘డేగ’. ఈ చిత్రానికి కుమార్ రావిళ్ళ దర్శక, నిర్మాత. ధరన్‌కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలు విడుదలయ్యాయి. దర్శకుడు వి.వి.వినాయక్ ఆడియో సీడీని ఆవిష్కరించి హీరో శ్రీకాంత్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సమర్పకులు సి.కళ్యాణ్ మాట్లాడుతూ- ‘‘ తమిళంలో కోటిన్నర పెట్టి తీస్తున్న సినిమాలు 5కోట్లు వసూలు చేస్తున్నాయి. ఈ వరవడి మన తెలుగులో కూడా రావాలి. గత రెండేళ్లుగా డబ్బింగ్ చిత్రాల పేరుతో దాదాపు 10 నుంచి 12 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాను. మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలనే ఉద్దేశ్యంతో ఇకపై చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ఏడాదికి మూడు సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఇటీవలే ‘ప్రేమకథా చిత్రమ్’తో విజయాన్ని అందుకున్న జె.ప్రభాకర్‌రెడ్డితో మరో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను. పూర్వం సినిమాలు పరాజయం పాలైనా దర్శకులకు, నిర్మాతలు అండగా నిలిచేవారు. దర్శకులు కూడా గౌరవంతో ఉండేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమా పరాజయం పాలైతే దర్శకులను పట్టించుకోవడంలేదు. ఈ ధోరణి మారాలి. అప్పుడే చిత్రసీమకు మంచి రోజులు వస్తాయి’’అని చెప్పారు. సంగీత దర్శకుడు ధరన్‌కుమార్ మాట్లాడుతూ-‘‘ సంగీత దర్శకుడిగా నాకు ఇది తొలి చిత్రం. ఇందులో మూడు పాటలున్నాయి. ప్రమోషనల్ సాంగ్ అనేది బాలీవుడ్‌లో ఎక్కువగా చేస్తారు. ఇందులో అలాంటి ప్రయోగమే చేశాం. పాటల్లో సాహిత్యం అందర్నీ ఆకట్టుకుంటుంది’’అని తెలిపారు. దర్శక, నిర్మాత కుమార్ రావిళ్ల మాట్లాడుతూ- ‘‘ఇది చక్కటి వినోదాత్మక చిత్రం. రొమాంటిక్ థ్రిల్లర్. ఇందులో కామెడీ, యాక్షన్ హైలైట్‌గా నిలుస్తాయి. పాటలన్నీ బాగా కుదిరాయి’’అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అశోక్‌కుమార్, ఎస్వీరెడ్డి, జె.ప్రభాకర్‌రెడ్డి, ఎమ్.ఎల్.కుమార్‌చౌదరి, నరేష్ అయ్యర్ తదితరులతో పాటు చిత్రం యూనిట్ పాల్గొన్నారు.

సుజిత్, ప్రగ్య జైస్వాల్, ఎరికా ఫెర్నాండెజ్ ముఖ్య తారలుగా
english title: 
dega

నటుడు, దర్శకుడు మణివన్నన్ మృతి

$
0
0

ప్రముఖ నటుడు, దర్శకుడు మణివన్నన్ (59) కన్నుమూశారు. శనివారం చెన్నయ్‌లోని తన స్వగృహంలో గుండెపోటుకు గురైన ఆయన తుది శ్వాసవిడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. జూలై 31, 1954న జన్మించిన ఆయన తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 50 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో పలు చిత్రాల్లో ఆయన హాస్య నటుడుగా నటించారు. ప్రేమలేఖ, ఒకే ఒక్కడు, శివాజీ, రిథమ్, నరసింహా, భామనే సత్య భామనే తదితర చిత్రాల్లో ఆయన నటనను మరిచిపోలేం. ఓ పక్క తన నటనతో కడుపుబ్బ నవ్విస్తూనే మరో పక్క తనలోని విభిన్న కోణాలను ఆవిష్కరించేవారు. మణివన్నన్ మృతికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో సత్యరాజ్ హీరోగా ‘నాగరాజ చోళన్ ఎం.ఎల్.ఏ’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా మధ్యలోనే వుండగానే ఆయన మృతి చెందడం ఆ చిత్రానికి తీరనిలోటే.

ప్రముఖ నటుడు, దర్శకుడు మణివన్నన్
english title: 
manivannan

మనసా తుళ్ళిపడకే...

$
0
0

అనురాగ్, కాజల్ యాదవ్ జంటగా విరించి అకాడమీ పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి ‘మనసా తుళ్ళిపడకే..’ అన్న పేరును ఖరారు చేశారు. ఎం.సుజి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకురాలు సుజి మాట్లాడుతూ గత మార్చిలో చిత్రాన్ని ప్రారంభించి సింగిల్ షెడ్యూల్‌లో పాలకొల్లు, తుని, యానాం, హైదరాబాద్‌లలో పూర్తిచేశామని, పట్నంలో పెరిగిన అబ్బాయి పల్లెటూరి అమ్మాయిని ప్రేమిస్తే ఎదురయ్యే పరిణామాలను ఈ చిత్రంలో సరికొత్తగా చూపుతున్నామని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ నెల చివరివారంలో ఆడియో విడుదల చేసి జూలైలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. నళిని, చలపతిరావు, అన్నపూర్ణమ్మ, చిన్నా, కాదంబరి కిరణ్‌కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:టి.పరంధామం, ఎడిటింగ్:వి.నాగిరెడ్డి, కథ, సంగీతం:పి.నరేష్, నిర్మాత, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఎం.సుజి.

అనురాగ్, కాజల్ యాదవ్ జంటగా
english title: 
manasaaa

రాజేంద్రప్రసాద్ హీరోగా ‘టాప్ ర్యాంకర్స్’

$
0
0

రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా విశ్వవిజన్ ఫిలిమ్స్ పతాకంపై గోళ్లపాటి నాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘టాప్ ర్యాంకర్స్’ (జర్నీ బిట్వీన్ ఎల్‌కెజి టు ఎమ్‌సెట్). పసుపులేటి బ్రహ్మం నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ 75శాతం పూర్తయింది. నిర్మాత పసుపులేటి బ్రహ్మం మాట్లాడుతూ క్లైమాక్స్ రెండు పాటల చిత్రీకరణ మినహా షూటింగ్ అంతా పూర్తయిందని, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుతున్నామని తెలిపారు. ఈనెలాఖరుకు షూటింగ్ పూర్తిచేసి, జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన వివరించారు. దర్శకుడు గోళ్లపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ నేటి విద్యావ్యవస్థలోని లోపాలను ప్రక్షాళన చేసి, పవర్‌ఫుల్ పాత్రలో ప్రిన్సిపాల్‌గా రాజేంద్రప్రసాద్ నటిస్తున్నారని, కథాకథనం ఆసక్తికరంగా ఉంటాయని తెలిపారు. విద్యార్థులంటే ర్యాంకులు సాధించే యంత్రాలు కాదు, వాళ్ల అభిరుచులు, ఇష్టాఇష్టాలను గ్రహించి ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది, ఉపాధ్యాయులది అని ఈ చిత్రం ద్వారా తాము చెబుతున్నామని, మార్కుల కంటే మనోవికాసం, వ్యక్తిత్వ వికాసం ముఖ్యమని ఈ చిత్రంలో ప్రధాన సందేశంగా ఉంటుందని ఆయన వివరించారు. శివాజీరాజా, గిరిబాబు, అశోక్‌కుమార్, కనుమూరి కృష్ణంరాజు, సోనీచరిష్ట, అశ్విని, జ్యోతిశ్రీ, పావని ఇంకా సెయింట్ మెరీస్ విద్యార్థులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: జయసూర్య, సంగీతం: సునీల్‌కాశ్యప్, కెమెరా: శంకర్ కంతేటి, ఎడిటింగ్: నాగిరెడ్డి వి, రచన, సహకారం: రాజేంద్రభరద్వాజ్, నిర్మాత: పసుపులేటి బ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: గోళ్లపాటి నాగేశ్వరరావు.

రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా విశ్వవిజన్ ఫిలిమ్స్
english title: 
top rankers

రొమాంటిక్ ప్రేమకథ!

$
0
0

తమిళంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని చంద్రశేఖరా మూవీస్ బ్యానర్‌పై ఏనుగుల కిషోర్‌బాబు సమర్పణలో నరేన్ దర్శకత్వంలో కె.వెంకటరెడ్డి నిర్మాతగా తెలుగులో ‘మమతా డార్లింగ్’ పేరు తో అనువదిస్తున్నారు. ట్రయాంగిల్ రొ మాంటిక్ ప్రేమకథతో రూపొందిన ఈ చిత్రాన్ని జులై మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కె.వెంకటరెడ్డి మాట్లాడుతూ- ‘‘సందీప్, పూజా, రూపా హీరో హీరోయిన్లుగా నరేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం. జులై మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. యువతకు కావలసిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఇందులో వున్నాయి. అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి డేటింగ్ మోజులో పడిన అబ్బాయి జల్సాలు చేస్తూ, తన ఊరులో వున్న మరో అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ వారిద్దరి జీవితాలతో ఆడుకుని చివరికి ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అనే ఇతి వృత్తంతో నిర్మించిన సినిమా ఇది. గతంలో చంద్రశేఖరా మూవీస్ బ్యానర్‌లో వచ్చిన చిత్రాలను ఆదరించినట్లుగానే ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకముంది’’అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: అరుల్‌దాస్, సంగీతం: కార్తీక్‌రాజా, ఎడిటర్: ఆఫడి ఎం.పి.రవి, సమర్పణ: ఏనుగుల కిషోర్‌బాబు, నిర్మాత: కె.వెంకటరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నరేన్.

తమిళంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని చంద్రశేఖరా మూవీస్
english title: 
romantic

ఇక గ్లామర్‌గా...!

$
0
0

ప్రస్తుత రోజుల్లో నటి కెరీర్‌కు గ్లామర్ చాలా అవసరమన్న విషయాన్ని నటి సంధ్య (ప్రేమిస్తే ఫేం) కాస్త ఆలస్యంగానైనా తెలుసుకున్నట్టుంది. అందుకే ప్రస్తుతం చేస్తున్న తమిళ, మలయాళ చిత్రాల్లో హద్దుమీరే గ్లామర్‌ని ప్రదర్శించటానికి సిద్ధమయింది. ‘కాదల్’ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ మలయాళీ భామ తొలి చిత్రంతోనే మంచి పేరుని తెచ్చుకుంది. ఆ చిత్రం కాసుల వర్షాన్ని కురిపించింది. దాంతో సంధ్యకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ తరువాత వచ్చిన చిత్రాలేవీ ఆమె కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. దాంతో మార్కెట్ డౌన్ అయింది. కొత్తగా అవకాశాలు రాలేదు. ఇక లాభం లేదనుకున్న ఈ అమ్మడు మాతృభాషపై దృష్టి సారించింది. అక్కడ నటించిన చిత్రాలు ప్రజాదరణ పొందడంతో మంచి పేరు లభించింది. చేతినిండా చిత్రాలున్నాయి. ప్రస్తుతం నాలుగు మలయాళ చిత్రాల్లో నటిస్తున్న సంధ్య ఆయా చిత్రాల్లో తన గ్లామర్‌తో ప్రేక్షకులను కవ్వించనుందట.

ప్రస్తుత రోజుల్లో నటి కెరీర్‌కు గ్లామర్ చాలా అవసరమన్న
english title: 
glamour

వినోదం అంటే ఇదేనా?

$
0
0

‘గత కాలం మేలు వచ్చు కాలం కంటెన్...’ అనే మాట సినిమా పరిశ్రమకు కూడా అన్వయించుకోవలసిన అవసరం నేడు ఎంతైనా ఉంది. ఒకప్పుడు సినిమాకి వెళ్లాలి అంటే సంతోషంగా వెళ్ళేవారు. ఇప్పుడు సినిమా అంటే రెండు గంటలపాటు ఏ పనీ లేకపోతే అలా వెళ్లి కూర్చుందాం అన్న ఆలోచనతో వెళ్తున్నారు. సినిమా చూస్తే అలనాటి సినిమాల్లో కొంత విజ్ఞానం దొరికేది. నేడు ఏ సినిమా చూసినా మనకున్న జ్ఞానం మొత్తం తుడిచిపెట్టుకుపోయి సినిమాలో వాడిన బూతుపదాలు, ఊతపదాలు మాట్లాడే పరిస్థితికి చేరుకున్నారు ప్రేక్షకులు. ‘నీ యెంకమ్మ’ అనే మాటతో మొదలైన పదాలు ‘దొబ్బింది’ అనే మాటతో తారాస్థాయికి వెళ్ళాయి ఈ అశ్లీల పదాలు. సినిమాలలో తప్పులు మాటలవరకే అని సరిపెట్టుకుంటే చెల్లుబాటయ్యే కాలం కాదిది. మాటలతోపాటు చేతలు, చేతబడులు ప్రస్తుత సినిమాలలో ఎక్కువైపోయాయి. సినిమాలు అంటేనే భయపడే ప్రేక్షకులు కూడా తయారయ్యారు ఇప్పుడు. దానికితోడు టిక్కెట్ ధరలు కూడా ఆకాశాన్ని అంటేశాయి. అందరూ కలిసి ఓ రకంగా సినిమాను చంపేస్తున్నారేమో... అన్న అనుమానమూ కలుగుతోంది. ఇప్పటి దర్శక, నిర్మాతలకు ఎంతో చెప్పాలి. నేటి సమాజంలో ఓ బలమైన మాధ్యమం సినిమా. ప్రజల జీవితాల్లో సినిమా ఓ భాగమైంది. సామాన్య మానవుడికి తక్కువ ఖర్చుతో దొరికే ఆనందం ఇదని ఎంతో సంతోషపడుతున్నారు. అదీ ఎండమావైంది. ఈ రోజుల్లో సినిమా అంటే ఏమిటీ అని ప్రశ్నిస్తే మనిషికి మనిషికి ఉండాల్సిన స్నేహ సంబంధాలను సమాధి చేస్తూ, సినిమా ప్రారంభ దృశ్యంలోనే నరుక్కోవడంతో ప్రారంభమవుతున్నాయి. సినిమావారు హింసను ఎందుకిలా ప్రేరేపిస్తున్నారో ప్రేక్షకులకు అర్థంకావడంలేదు. సమాజంలో వారు అంత హింస చూసారా? ఎందుకంటే ఈ సమాజంలో రాక్షసులు లేరు. మరి రాక్షస హింస ఎక్కడినుంచి వచ్చింది. ఈ ప్రభావంతో మనుషులు కూడా హింసాత్మకంగా మారుతున్నారు. ఓ మనిషి ప్రాణానికి సాటిమనిషి విలువ ఇవ్వడంలేదు. ఒకప్పుడు ఒకరిపై ఒకరికి కోపం వస్తే తిట్టుకునేవారు. శ్రుతిమించితే కొట్టుకునేవారు. ఈ రోజు కోపం వస్తే సినిమా ప్రభావంతో ఎదుటి మనిషిని నరికెయ్యడమే పరిష్కారంగా ఎంచుకుంటున్నారు. అసలు మనిషి పుట్టి, మానవజన్మ ఎత్తి సాటిమనిషిని చంపడం ఏమిటి? ఓ మనిషిని చంపడం అంటే ఆ మనిషి కుటుంబం అంతా నాశనం చేసినట్లేకదా! ముఖ్యంగా మనిషిని వెంటాడి చంపడం, వేటాడి చంపడం- ఇవన్నీ సినిమావారి దృష్టిలో ఎంటర్‌టైన్‌మెంట్ కిందకి వస్తాయా? ఇంత బాధ్యతాయుతమైన మాధ్యమాన్ని చేతిలోపెట్టుకుని సమాజంలో చెడును, రాక్షసత్వాన్ని వెదజల్లటానికి వారికి అధికారం ఏవరిచ్చారు? హింస హింస, హింస అంటూ ఎందుకు ప్రేక్షకులపై పగ తీర్చుకుంటున్నారు. ఆంధ్రదేశంలో ఓ భాగమైన రాయలసీమ ఫ్యాక్షనిజానికి బలాన్నిచ్చే అంశంగా సినిమావారు మలుచుకున్నారు. రాయలసీమ అంటే రక్తపుగడ్డేనా? అక్కడుంటున్నవాళ్ళు జీవితాంతం ఒకరినొకరు నరుక్కుంటూనే ఉంటారా? అందుకోసమేనా వాళ్ళు పుట్టింది? వాళ్ళ పగలు వారు మర్చిపోయినా అడ్డమైన చెత్త సినిమాలు తీస్తే, అవి వారు చూసి ‘ఓహో.. మేమిలా నరుక్కోవాలి కాబోలు’ అనే భావన వారిలో కలిగిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా సీమవాసుల్లో కదలిక రావాలని సామాన్య ప్రేక్షకులు కోరుకుంటున్నారు. తమది రక్తపుగడ్డ కాదని వారు నిరూపించుకోవాల్సిన అవసరం ఈ రోజు వచ్చింది.
ఆ తరువాత మరో అంశం అభ్యంతకరమైన సెక్స్. సినిమాల్లో ఏదీ ఎంత ఉండాలో అంత ఉంటేనే అందంగా ఉంటుంది. అలా కాకుండా అర్ధనగ్నంగా హీరోయిన్లు దుస్తులు ధరించి హీరో భుజాలమీద ఎక్కి కూర్చునే ఓ వనిత వుంటుంది. అటుపక్కా ఇటుపక్కా మరో ఇద్దరు నిలబడతారు. ఇలా పరమ దరిద్రమైన పోస్టర్లను ప్రతి కూడలిలో పెట్టించి ప్రేక్షకులను నీచ సంస్కృతితో థియేటర్లకు ఆహ్వానిస్తున్నారు. వచ్చీరాని వయసులో ఉన్న పిల్లలపై ఈ పోస్టర్లు ఎంత ప్రభావాన్ని చూపిస్తాయి? ప్రస్తుతం అనె్నం పునె్నం ఎరుగని ఆడపిల్లలమీద ఎన్నో అత్యాచారాలు, అమానుషాలు జరుగుతున్నాయంటే వీటన్నింటికి కారణం సినిమా కాదా? మీకు కంటిపాపల్లాంటి పిల్లలుంటారు కదా! వాళ్ళపై కూడా ఇలాంటి అత్యాచారాలు జరిగితే మీరు పడే వేదనే మిగతావారు పడరా? మీ రక్తం పంచుకుని పుట్టిన కూతురే నలుగురు కామాంధులచేతిలో చిక్కి నరకయాతన అనుభవిస్తూ అత్యాచారానికి గురైతే ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మీ స్వార్థం కోసం మీ రాబడి పెంచుకోవడానికి చెత్త సినిమాలు తీసి సమాజంమీద వదలటం కాదు- మీరు, మీ పిల్లలు సమాజంలో భాగమని గుర్తుంచుకోండి. నేడు జరుగుతున్న అన్యాయాలకు వందశాతం బాధ్యత మీదేనని గుర్తుపెట్టుకోండి. మీవల్ల దేశానికి ఉపకారం జరగకపోయినా ఫర్వాలేదు. కానీ సమాజాన్ని పనిగట్టుకుని ఇలా చెత్త సినిమాలు తీసి భ్రష్టుపట్టించకండి. ఆ సినిమాలు తీసి సంపాదించిన డబ్బుతో మీరు సుఖంగా ఉంటారని కలలో కూడా అనుకోవద్దు. హద్దులేని హింస, విచ్చలవిడి శృంగారాన్ని పచ్చిగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న పాపం మిమ్మల్ని వెంటాడక తప్పదు.
ఈ మాధ్యమం ద్వారా ఏదైనా మంచి చేయాలనుకుంటే చాలా చేయవచ్చు. యువతీ యువకులకు భవిష్యత్‌పై మంచి అశలు కలిగిస్తూ వారికి మార్గాన్ని చూపవచ్చు. మన భారతీయ సంస్కృతిలో భాగమైన కుటుంబ వ్యవస్థను తిరిగి పునర్ నిర్మించవచ్చు. అవన్నీ వదిలి హేయమైన డబ్బు సంపాదనా మార్గాలను ఎంచుకుంటున్నారు సినిమా వారు. సంపాదనే ధ్యేయంగా విలువలకు వలువలు వొలుస్తున్నారు. అత్యంత పవిత్రమైన గురువు పాత్రని అపహాస్యం చేస్తున్నారు. హైందవ ధర్మ విధానాలను, పద్ధతులను చులకనగా చేసి కామెడీ చేస్తున్నారు. సంస్కృతిని దెబ్బతీసే సన్నివేశాలను సినిమాలలో చిత్రించవద్దు. ఈ పవిత్రమైన భూమిపై మీరు జన్మించినందుకు కొంతైనా ఈ ధరిత్రి పట్ల కృతజ్ఞతాభావంతో బతకండి.
ఒక్కసారి ఆలోచించండి: సినిమా విజయవంతం కావాలంటే హద్దులేని హింస, విచ్చలవిడి శృంగారం అవసరం లేదు. అవి లేకుండా సినిమాలు తీసి విజయం సాధించినవారు ఎందరో ఉన్నారు. మనిషి ఎదగడానికి సమాజమే చేయూతనిస్తుంది. తెలివిగలవారు ఈ సమాజంలో బతుకుతూ మంచిని ప్రబోధిస్తూ ముక్తిని పొందుతారు. ఈ పద్ధతిలో సినిమావారు ఆలోచిస్తే చెడు సినిమాలు రానేరావు.

‘గత కాలం మేలు వచ్చు కాలం కంటెన్...’ అనే మాట సినిమా పరిశ్రమకు కూడా
english title: 
entertainment
author: 
-శివల పద్మ

రిచా గంగోపాధ్యాయ్

$
0
0

రిచా గంగోపాధ్యాయ్

రిచా గంగోపాధ్యాయ్
english title: 
richa gangopadhyay

తనదాకావస్తే..! (కథ )

$
0
0

పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ మొదలయింది.
క్యాంపు కార్యాలయం సందడిగా వుంది. అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ చేతబట్టుకొని ఆనందంగా వస్తున్న ఉపాధ్యాయులు కొందరైతే, ఈ వేసవి ఎండల్లో ఇదొక తప్పనిసరి గొడవరా బాబూ!.. అనుకుంటూ నిరుత్సాహంతో, నీరస మొహాలతో వస్తున్న వాళ్ళు మరికొందరు. దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. ఓపిక వుండగానే నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి.. అనుకొని స్పాట్ అపాయింట్‌మెంట్ కోసం చెట్ల కింద పడిగాపులు పడేవాళ్ళు ఇంకొందరు. ఇలా చిన్న తిరుణాళ్ళలా వుంది అక్కడి వాతావరణం.
అక్కడున్న వారిలో విశ్వనాథం ఒకడు. విశ్వనాథానికి స్పాట్ వాల్యుయేషన్ కొత్తేమీ కాదు. అతను ఇరవై సంవత్సరాల నుండి స్పాట్‌కు వస్తున్నాడు. అతనికి స్పాట్ ఒక ఆటవిడుపు. రోజూ బడికి వెళ్ళి చెప్పిన పాఠాలే చెప్పి విసుగుపుట్టిన మనస్సుకు స్పాట్ కాస్త ఉపశమనం కలిగిస్తుందని అతని అభిప్రాయం. అంతేకాదు, పాత మిత్రులందరినీ కలుసుకోవచ్చు. వచ్చే రెమ్యునరేషన్‌తో ఏదైనా వస్తువు కొనుక్కోవచ్చన్నది అతని భావన. ఇదంతా తనకు సుపరిచితమైన వాతావరణమేననుకుంటూ అందరి మనోభావాలనూ పసిగడుతూ, తన అనుభవాన్ని మేళవించుకుంటూ హిందీ విభాగానికి వెళ్ళి అక్కడి అసిస్టెంట్ క్యాంపు ఆఫీసరు గారికి తన ఆర్డరు కాపీ, రిలీవింగ్ సర్ట్ఫికెట్ ఇచ్చి జాయిన్ అయినట్లు సంతకం చేసి క్యాంటీన్ వైపు నడిచాడు విశ్వనాథం. క్యాంటీన్ వద్ద కోలాహలంగా ఉంది.
తను గతంలో పనిచేసిన పాఠశాలల్లోని ఉపాధ్యాయ మిత్రులు కొందరు కనబడితే వారితో ట్రాన్స్‌ఫర్ల గురించి, ప్రమోషన్ల గురించి, రాబోయే పిఆర్‌సి గురించి కొంతసేపు బాతాఖానీ కొట్టాడు కాఫీ తాగుతూ.. తొలిరోజు ఇరవై పేపర్లే ఇచ్చారు. తనకున్న అనుభవంతో గంటలోపే వాటిని వాల్యూ చేశాడు. తరువాతి రోజు నుండి నలభై పేపర్ల చొప్పున ఇచ్చారు. అలా ఎన్ని పేపర్లు ఇచ్చినా ఒక గంటలో వాల్యుయేషన్ పూర్తిచేయటం విశ్వనాథం ప్రత్యేకత. ఏ పేపరునూ పూర్తిగా చదివి దిద్దే అలవాటే లేదు. చేతివాటంకొద్దీ మార్కులు వేసుకుంటూ వెళ్తాడు. ప్రతి అక్షరం చదివి దిద్దితే ఈ జన్మకు వాల్యుయేషన్ పూర్తికాదన్నది అతని విశ్వాసం.
‘విశ్వనాథం గారూ..! ఏమిటీ వాల్యుయేషన్ కొంచెం జాగ్రత్తగా చేయండి’ అని ఆఫీసరు గారు ఒకటికి రెండుమార్లు హెచ్చరించినా తన ధోరణి మార్చుకోలేదు విశ్వనాథం. ఇవన్నీ మామూలే కదా అని మనస్సులో నవ్వుకున్నాడు.
మధ్యాహ్నం క్యాంటీన్ దగ్గర ‘టీ’ తాగుతుంటే విశ్వనాథానికి నరహరి కనిపించాడు. విశ్వనాథం పనిచేసే స్కూలులోనే నరహరి కూడా పనిచేస్తున్నాడు.
‘సార్! ఎక్కడిదాకా వచ్చారు’ అడిగాడు నరహరి.
‘ఈరోజుకు వాల్యుయేషన్ అయిపోయిందోయ్!’ అన్నాడు హుందాగా కళ్ళజోడు సవరించుకుంటూ. ‘ఎలా అయినా మీరు సీనియర్ కదా’! అంటూ వ్యంగాస్త్రాన్ని సంధించి ‘నావింకా సగం పేపర్లు మిగిలివున్నాయి, వస్తాను’ అని చెప్పి తాను పేపర్లు దిద్దే గదివైపు నడిచాడు నరహరి.
‘కొత్తగదా! పిల్లకాకి’ అనుకున్నాడు విశ్వనాథం.
స్పాట్ వాల్యుయేషన్ పదిరోజులు జరిగింది. ఈ పదిరోజులూ సరదాగా గడిచిపోయాయి విశ్వనాథానికి.
***
సుజాత తెలివైన పిల్ల. చురుకైనది. బాగా చదువుతుంది. పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులందరిలోనూ సుజాత ముందుంటుంది. పాఠశాలలో నిర్వహించిన అన్ని పరీక్షలలోనూ మంచి మార్కులు తెచ్చుకొని ‘టాపర్’గా నిలిచింది. ‘పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో మంచి గ్రేడ్ తెచ్చుకొని ‘టౌన్ టాపర్’గా రావాలని ఉపాధ్యాయులందరూ సుజాతను ప్రోత్సహించేవారు. సుజాతకు బాగా చదువుకొని డాక్టరై పేదవాళ్ళకు ఉచితంగా వైద్యం చేయాలని వుంది.
ఆరోజు ఫలితాలు వెలువడేరోజు. ఇంటర్నెట్‌లో ఫలితాలు చూసుకునేందుకు సుజాత తన స్నేహితురాళ్ళతో కలిసి ఇంట్లో కంప్యూటర్ గదిలో కబుర్లు చెబుతూ కూర్చుంది. ఎట్టకేలకు ఒక గంట గడిచాక మంత్రిగారు ఫలితాలను విడుదల చేశారనే వార్త టీవీలో చూసి నెట్ ఓపెన్ చేసింది. రిజల్ట్ చూసుకున్న సుజాత ముఖం వివర్ణమైంది. అప్పటివరకు వున్న ఉత్సాహం ఆవిరైపోయింది. అన్ని సబ్జెక్టులలోనూ మంచి గ్రేడు సంపాదించిన సుజాతకు హిందీలో మంచి గ్రేడు రాలేదు. సుజాత దుఃఖానికి అంతులేదు. వెక్కివెక్కి ఏడవటం మొదలుపెట్టింది. కూతురు ఏడుస్తుంటే విశ్వనాథం మనస్సు కరిగిపోయింది.
‘బాగా రాశాను నాన్నా! నాకు మార్కులు తగ్గటానికి వీల్లేదు. హిందీ పేపరు దిద్దిన వాళ్ళెవరో చదవకుండా మార్కులు వేసేశారు!’ అంది కళ్ళు తుడుచుకుంటూ. ఆ మాటలు విశ్వనాథాన్ని ఇబ్బందిపెట్టాయి. బాణాళ్లా ఎక్కడో గుచ్చుకున్నాయి. చెంప చెళ్లుమనిపించినట్లు తగిలాయి. తను ఏదో తప్పుచేసినట్లు అంతరాత్మ హెచ్చరించింది. అనేక ఆలోచనలు కందిరీగల్లా చుట్టుముట్టాయి. స్పాట్ వాల్యుయేషన్‌లో తాను త్వరత్వరగా పేపర్లు దిద్దుతూ తోటివాళ్ళని పిచ్చివాళ్లలా చూసిన సంఘటనలు కళ్ళముందు కదిలాయి. తను ఇరవై సంవత్సరాల నుండి నిర్లక్ష్యంగా పేపర్లు దిద్ది ఎందరి పిల్లల ఉసురుపోసుకున్నానోననే పశ్చాత్తాపం పొడచూపింది.విశ్వనాథం ఆత్మపరిశీలనలో పడ్డాడు!!

సంగాపు వెంకట కోటేశ్వరరావు, ఆంగ్లోపాధ్యాయుడు,
మంగళగిరి. సెల్: 9493501172

కార్డుముక్క కత..

పెద్దదిక్కు!
‘నగరంలో ఇళ్ళ అద్దెలు విపరీతంగా పెరిగేయి. మన దొడ్లో గదిలోని పాత సామాను తీసివేసి అద్దెకిస్తే నెలకి వెయ్యి రూపాయలు వస్తాయి. ఇంటి పన్నుకి, కరెంటు బిల్లుకి ... ఏడాదికి పనె్నండు వేలు ఆదాయం...’ శ్రీమతి చెప్పిన మాట నచ్చి గది బాగుచేసి గేటుకి ‘టు లెట్’ బోర్డ్ తగిలించి వెనుదిరిగేసరికి ఆమె..! స్వాతికిరణంలో రాధికలా.. ప్రశాంతమైన ముఖం.. చిరునవ్వు.. తలమీద నాలుగు వెండి తీగలు! ఇల్లు చూపించాను.. నచ్చింది.. వెయ్యి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి రేపు వస్తానని చెప్పి వెళ్ళింది.
పది రోజుల్లో మాలో ఒకరిగా కలిసిపోయిందామె.
మా ఇంటి ఎదురుగా భక్తవత్సలం నాయుడి బిల్డింగ్. మేమా పెంకుటిల్లు కొనుక్కుని ఇరవై సంవత్సరాలైనా ఆయనతో నాకు పెద్ద పరిచయం లేదు. వీధిలో అందరికీ ఆయనంటే అదో ఇది. ఆయన తల్లి ఆత్మహత్య చేసుకుందని.. తండ్రి ఆవేదనతో మరణించాడని అంటారు కొందరు. లేదు వీటిన్నిటికీ కారణం వాళ్ళ ఔట్‌హౌస్‌లో ఉండే ‘వింధ్యవాసిని’ అనే బ్రాహ్మణ స్ర్తి అని, ఆమె చాలా మంచిదని, తల్లి చనిపోతే నాయుడు ఆమెను ఇంటి నుంచి పంపేశాడని, అందుకే కొడుకు చేసిన పనికి బాధపడి ఆయన చనిపోయాడని, ఆమె చాలామంచిది కాబట్టి ఆమెను ఇంటి నుంచి పంపిన పాపానికే నాయుడికి పిల్లలు పుట్టలేదని... ఇలా ఏవేవో కథలు చెపుతుంటారు.
‘నాయుడుగారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు’ అని వాళ్ళ పనిమనిషి చెపితే వెళ్లేను. ‘మీ ఇంట్లో అద్దెకున్న ఆమెను మా ఇంటికి పంపాలి మీరు’ అన్నాడాయన. ‘ఎందుకలాగ?’ ఆశ్చర్యంగా అడిగేను.
ఆమె ఒకప్పుడు ఈ ఇంటి మనిషే. కొన్ని కారణాల వల్ల నేనే ఆమెను బయటకు పంపేను. అందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు గదా. అమ్మా, నాన్న పోయారు. ఇప్పుడీ ఇంటికి పెద్దదిక్కు లేదు. అప్పట్లో ఆమె కోసం చాలాకాలం వెతికించాను. ఇప్పటికి మీ ఇంట్లో కనిపించారు. నాన్నగారి స్నేహితురాలు. నామాటగా చెప్పి ఆమెను ఈ ఇంటికి పంపితే కృతజ్ఞడినై వుంటాను’ అన్నారాయిన.
తండ్రి ఫ్రెండ్‌ని ఇంటికి పెద్దదిక్కుగా ఆహ్వానిస్తున్న ఆయన్ని అభినందించి మా ఇంటికి వచ్చాను.
ఉదయం సూర్యనమస్కారాలు చేస్తూ ఎదురింటి వైపు చూశాను. బాల్కనీలో వింధ్యవాసిని! చిరునవ్వుతో పలకరింపులు! పెద్దదిక్కు కదా అందుకే పైన..!!

- విఎస్ రామలక్ష్మి, విజయవాడ

ఆనాటి కథలు.. ఆణిముత్యాలు - 11

తొలితరం తెలంగాణ కథానికా రచయిత్రుల్లో ప్రముఖ విదుషీమణి - నందగిరి ఇందిరాదేవి గారు. ఆమె 1919 సెప్టెంబర్‌లో హన్మకొండలో జన్మించారు. నారాయణగూడ బాలికల పాఠశాలలో, తర్వాత మహారాష్టల్రోని థాకర్‌సే మహిళా విశ్వవిద్యాలయంలోనూ ఆమె చదువుకున్నారు. బిఏ పట్టా పొందారు. పధ్నాలుగో ఏట పాఠశాల తరపున సాహిత్య సంచికల్ని వెలువరించారు. ఎన్నడో 1940లోనే ఆమె అధ్యక్షతన హైదరాబాద్ అఖిలాంధ్ర కథకుల సమ్మేళనాన్ని నిర్వహించారు. 1995లో ‘మసకమాటున మంచి ముత్యాలు’ పేరున అరవై ఏళ్ల రేడియో ప్రసంగాల్ని ఎంపిక చేసి ప్రచురించారు. ఇందిరాదేవి గారు సాంఘిక సంస్కరణోద్యమ సారథిగా ఎన్నో పోరాటాలు చేశారు. వాటిలో ముఖ్యమైనది బాల్య వివాహాల పట్ల నిరసన. అందువల్లనే తాను స్వయంగా మేజర్ అయిన తర్వాతనే ఆమె వివాహం చేసుకున్నారు. ఆమె భర్త నందగిరి వెంకట్రావు గారు ఆంగ్ల, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రసిద్ధ కథా రచయిత. ఇందిరాదేవి గారి కథలు భారతి, గృహలక్ష్మి, ఆంధ్రజ్యోతి, చిత్రగుప్త, ఆంధ్ర కేసరి, శోభ, ప్రజామిత్ర, వనితాజ్యోతి వంటి ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కుటుంబ వ్యవస్థ, స్ర్తి పురుష సంబంధాల్లోని వైరుధ్యాలు, సామాజిక సమస్యలు, మనిషి మనస్తత్వ వైచిత్రి వంటి అనేక అంశాల్ని ఇతివృత్తాలుగా చేసుకొని ఆమె ‘వాయిద్యం సరదా’, ప్రథమ పరిచయం’, ‘ప్రాప్తం’, ‘ఏకాకి’ వంటి చాలా కథలు రాసినా - సుమారు పాతిక మాత్రమే లభ్యమైనాయి. వాటిల్లో మనుషుల్లోని సున్నితమైన మానసిక విశే్లషణని ఆవిష్కరిస్తూ రాసిన చాలా మంచి కథ ‘పందెం’ ఈ వారం ఆణిముత్యం!

‘ఉరి’పై చర్చలో కొత్తకోణం.. ‘పందెం’!

సేట్ రాజారాం ఇంట్లో విందు, మందు. స్నేహితులంతా కబుర్లు చెప్పుకుంటున్నారు. చర్చలు సాగుతున్నై. సీసాలు ఖాళీ అవుతున్నై. చర్చ ఉరిశిక్ష మీదికి మళ్లింది. ‘మీరు ఏమన్నా అనండి. యావజ్జీవం ఖైదు శిక్ష అనుభవించటం చాలా ఘోరం. అంతకంటె రెండు నిమిషాల్లో ప్రాణం పోయేటట్లు ఉరి తీయటం మంచిది’ అన్నాడు రాంలాల్ పట్టుదలగా. నరోత్తం దాసు - బతికుంటే బలుసాకు తినొచ్చు, యావజ్జీవమే మేలన్నాడు. సేటు మాత్రం ఉరిననుభవించటమే తేలిక అనే అభిప్రాయాన్నిచ్చాడు. వాదప్రతివాదాలు రేగినై. వాదన ముదిరింది. నరోత్తం దాసుకీ, సేటుకీ మద్యం పందెం ఖాయమైంది. సేటు రాజారాం తోటలో పదేళ్లపాటు నరోత్తం దాసు ఏకాంతవాసం చేయాలి. పదేళ్లకు రెండు నిమిషాలు తక్కువయినా - పందెం నిలవదు. అలా పదేళ్లు గడిపితే సేటు రెండు లక్షలు నరోత్తం దాసుకు కుమ్మరించాలి! షరతులు, ఒప్పందం తయారయ్యాయి. ఖైదీకి బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. పుస్తకాలు, భోజనం, వస్తువులు సమకూరుస్తారు. కావాలంటే ఉత్తరాలూ రాసుకోవచ్చు.
మొదటి సంవత్సరం చాలా విసుగ్గా, విచారంగా గడిపాడు ఖైదీ. ఏడ్చేవాడు. ఆ తర్వాత - పగలూ రాత్రీ చదువే చదువు. కోకొల్లలుగా పుస్తకాలు తెప్పించుకుంటున్నాడు. ఒకనాడు సేటుకు పది భాషల్లో ఒక ఉత్తరం రాశాడు ఖైదీ! సేటుకి ధీమా. దాసు పదేళ్లు ఇలా ఒంటరిగా గడపబోయాడా? అని. నాలుగేళ్లు గడిచినై. దాసుకు బాధేం లేదని తెలిసింది.
పదేళ్ళు నిండే సమయం వచ్చింది - రేపు ఉదయమే. కాలంలో మార్పు పరిస్థితుల్లోనూ ఎన్నో మార్పుల్ని తెచ్చింది. సేటు ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. రేపు రెండు లక్షలిస్తే తాను బిచ్చమెత్తుకోవలసిందే! దిగులు పుట్టింది. ఆలోచించాడు. రాత్రి గడుస్తోంది. తుంపర మొదలైంది. చిన్న కత్తి, తాళంచెవుల గుత్తీ, టార్చిలైట్ తీసుకుని బయల్దేరాడు. అడుగడుగునా ఉత్కంఠ! తలుపు తీసి చివరికి లోపలికి వెళ్లాడు. చిక్కిశల్యమైంది ఖైదీ శరీరం. కుర్చీలో వాలి టేబుల్ మీద పడిపోయి వున్నాడు. ఇప్పుడు పొడిచేయటం తేలిక అనుకున్నాడు సేటు. ఇంతలో టేబుల్ మీద ఉత్తరం చూశాడు సేటు. చదివాడు. ‘ప్రపంచం అంతా మిథ్య. జీవితం బుద్బుదప్రాయం’. ‘ఇన్ని పుస్తకాల జ్ఞాన సారం వ్యర్థం. ఎంతటివాడికయినా చావు తప్పదు. ప్రపంచం అబద్ధాన్ని నిజం అంటుంది’. ‘నాకు ప్రపంచం మీద విసుగుపుట్టింది. ఇవేవీ నన్నాకర్షించవు’. ‘నాకీనాడు డబ్బు అవసరం లేదు’. ‘కనుక నేను నిర్ణీత సమయం కంటే ముందుగా వెళ్లిపోయి మన ఒప్పందం విచ్ఛేదం చేస్తున్నాను’... ఇలా సాగింది ఉత్తరం.
‘సేటు ఇదంతా చదివి కాగితం అక్కడే పడేసి ‘నూరేళ్లు జీవించునాయనా’ - అని నెమ్మదిగా వెళ్లిపోయాడు. తెల్లవారి చౌకీదారు ఖైదీ పారిపోయాడని బిక్కమొహం వేసుకొని చెప్పాడు. రాజారాం సేటు తన బల్ల మీద వున్న రెండు లక్షల ఒప్పందం రాసిన పత్రం వంక ఒక్కమాటు చూసి డ్రాయరులో పడేశాడు’ అని కథ ముగిసింది!
మనుషుల స్వభావాల్లోని వైరుధ్యమేకాక, వైపరీత్యాన్ని చిత్రించింది ‘పందెం’ కథ. పందెంలో ఓడిపోతాననే భయంతో స్వార్థంతో విద్రోహానికే తెగించాడు సేటు. గెలుపు ఓటములు రెండూ ఒకటే అన్న వేదాంతంలోపడి జీవనలాలసకీ, ధనాశకీ మధ్యన వున్న విభజన రేఖని అర్థం చేసుకున్నాడు నరోత్తం దాసు. స్థితప్రజ్ఞుడిగా, భ్రష్టయోగిగా వెళ్లిపోయాడు. చిన్న కథలో ఎంతో విలువైన జీవన వేదాంతాన్నీ, శాశ్వతమైన విలువల్నీ ప్రతిపాదించి, కథాత్మక శిల్పంతో కథకే ఔన్నత్యం చేకూర్చారు ఇందిరాదేవి గారు. ఎన్నడో 1941 జనవరి ‘గృహలక్ష్మి’లో ప్రచురితమైనదీ కథ. ఆ తర్వాత ఉరి అంశంగా ఎంత సాహిత్యం వచ్చిందో పాఠకులకు తెలుసు! ఇందిరాదేవి గారు ఆవిధంగా స్రష్ట మాత్రమేకాదు ద్రష్ట కూడా!!

- విహారి, సెల్: 9848025600

మనోగీతికలు

నిన్న.. నేడు.. రేపు.. ఆమె!

నిన్న..
ఆమె అభిసారిక
అందం అప్సరసల వారసత్వం
నడక రాజహంసల రాజసత్వం
పిలుపులు
మమతల కోకిల గానాలు
ముచ్చట్లు
అందంగా సాగిపోయే
సన్నజాజి తీగలు
నవ్వులు
వర్షించే తొలకరి చిరుజల్లులు
ఆకారం అందమయిన
ఒంపుసొంపుల నయాగరం
నేడు..
ఆమె కామరాక్షస
డేగల సమ ఆహారం
అరుపులు ఆర్తనాద కాకుల గోలలు
నవ్వులు గుచ్చుకునే
మనోవేదనా ముళ్ల రోదనలు
ఆకారం హోరుగాలి
హోరెత్తించిన నిస్సత్తువ వృక్షం
రేపు..
ఆమె రోహిణీ సూర్యుని
విలయ తాండవం
చూపులు
అరుణకాంతులు వెదజల్లే
ఎర్రని జ్యోతులు
మాటలు
గర్జించే సింహగర్జనలు
పాటలు
విప్లవాగ్ని జ్వాలలు
ఆకారం
ఆవేశం, ఆగ్రహం
సమాహారాల
మరో
శక్తిస్వరూపం!

- మర్రి ప్రభాకర్ (అసాజీ), పెనుగంచిప్రోలు. సెల్: 9490357936

గుణపాఠాలు
పచ్చని చెట్టుకు
లేని స్వార్థం
మేధోజీవినన్న
మనిషికే వుంది
విశాలమనుకున్న
మనిషి మనస్సు ప్రాంగణం
అహంకార పొరలతో
గర్వాలంకారంతో
కుంచించుకుపోతోంది
మనిషీ.. ఏవీ నీ జపతపాలు
నీ ఆప్యాయతల
మాటల పలకరింపులు
నీ ఆరాధనోత్సవాలు
నీవేదో ఆ ధర్మాచరణాల్లో
ఆమడదూరం
మనుషుల డబ్బు
దసఖత్, ఖాన్‌దాన్
అన్నీ కాలగర్భంలో
ఒకనాటికి కనుమరుగు
అపార్ట్‌మెంట్లు, నీ మహల్‌లు
శాశ్వత సౌధాలుగా నిలుస్తాయా?
అన్నీ అలంకరించుకున్న
నిర్మాణ సమూహాలు
కృత్రిమ అందాలు
అసహజ పరిసరాలు
ప్రచారాల ప్రభావాలు
ప్రపంచం నడుస్తున్న తీరును
గ్రహించే సూక్ష్మదృష్టిపై
సాగిపోతున్న ఘనత
నేడు స్వయంకితాబుల
మతలబుల గ్రహణశక్తి
అయ్యాడు మనిషి
ఏదిఏమైనా...
మమతల నగలే
మానవతా
నవ్యకాంతులు
నిత్య నడవడిలో నేర్చుకునే
గుణపాఠాలు!!

- ఆంజనేయులు, ఖమ్మం. సెల్: 7702537453

ఇదేం పోకడ!
అస్తవ్యస్త వ్యవస్థకు
ఒక క్రమమార్గం చూపేందుకు
నాటి పాలకులకు
అండగా నిలిచిన మతం
మనిషి ఎలా జీవించాలో
నేర్పాల్సిన మతం
మనిషి జీవితానే్న
అంతం చేస్తోంది!
మనిషి కోసమే మతం అన్నది మరచి
మతం కోసం
మనిషి అనే చందంగా మారాడు
మానవత్వాన్ని నింపాల్సిన మతం
మానవుడన్న సంగతే మరిపిస్తోంది
మోక్షాన్ని చూపిస్తుందనుకున్న మతం
నిర్దాక్షిణ్యంగా
నరకంలోకి తోసేస్తోంది
మతాల కుమ్ములాటలతో
మతం చెప్పే కరుణ, జాలి, దయ
మచ్చుకు కూడా కానరాని
మతవ్ఢ్యౌం
దేవుణ్ని చూపిస్తుందనుకున్న మతం
తనతో ఉన్న మనిషిని కానడం లేదు
నిరాశా నిస్పృహలను
తొలగించాల్సిన మతం
మనిషికి శాంతిని మృగ్యం చేస్తోంది
మానవసేవే మాధవసేవ అన్నది
తారుమారై విరాజిల్లుతోంది
నిజంగా
మతం మనిషి కోసమా..
మనిషే మతం కోసమా?
ఓ మనిషీ తెలుసుకో
జ్ఞానివై మసలుకో!!

అద్దంకి సుధాకర్
జగ్గయ్యపేట
సెల్: 89850 61346

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ మొదలయింది.
english title: 
t
author: 
సంగాపు వెంకట కోటేశ్వరరావు

రాశిఫలం 17-06-2013

$
0
0
Date: 
Monday, June 17, 2013 (All day)
author: 
- గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి
వృశ్చికం: 
స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండుటకు ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.
మేషం: 
వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలెక్కువచేస్తారు. కుటుంబ విషయాలందు అనాసక్తితో వుంటారు. స్ర్తిలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.
వృషభం: 
ఆర్థిక ఇబ్బందుల నెదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశముంటుంది. మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు.
మిథునం: 
వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తపడుట మంచిది.
కర్కాటకం: 
మానసికానందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటివరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈ రోజు పూర్తిచేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.
సింహం: 
కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నుంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నలు సులభంగా నెరవేర్చుకుంటారు.
కన్య: 
ఆకస్మిక ధనలాభయోగముంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. అంతటా అనుకూల వాతావరణమేర్పడుతుంది. స్ర్తిలు సౌభాగ్యాన్ని పొందుతారు.
తుల: 
విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా వుంటుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. మెలకువగా నుండుట అవసరం. స్థానచలనమేర్పడే అవకాశాలుంటాయి. ఋణలాభం పొందుతారు.
ధనుస్సు: 
తలచిన కార్యాలన్నియు విజయవంతంగా పూర్తిచేసుకోగలుగుతారు. మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలుండవు. సహ ఉద్యోగులకు సహకరించేవీలు లభిస్తుంది.
కుంభం: 
మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులుండవు.
మీనం: 
అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది.
దుర్ముహూర్తం: 
మ.12.24 నుండి 01.12 వరకు తిరిగి మ.02.48 నుండి 03.36 వరకు
రాహు కాలం: 
..
వర్జ్యం: 
సా.05.59 నుండి 07.35 వరకు
నక్షత్రం: 
ఉత్తర ఫల్గుని ఉ.09.37
తిథి: 
శుద్ధ నవమి రా.తె.04.50
మకరం: 
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించుట అన్ని విధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. అనవసర ధనవ్యయంతో ఋణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది.

17-06-2013

$
0
0
crossimage: 
Date: 
Monday, June 17, 2013

‘పోటుగాడు’ ట్రైలర్ విడుదల

$
0
0

రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై పవన్ వడయార్ దర్శకత్వంలో లగడపాటి శ్రీ్ధర్, శిరీష నిర్మించిన చిత్రం ‘పోటుగాడు’. మంచు మనోజ్ ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లతో జత కట్టడం విశేషం. చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నా రు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తమిళ దర్శకుడు లింగుస్వామి ‘పోటుగాడు’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో లగడపాటి శ్రీ్ధర్ మాట్లాడుతూ- కన్నడంలో విజయవంతమైన చిత్రాన్ని తెలుగులో అదే దర్శకుడితో నిర్మిస్తున్నామని, యూనిట్ అంతా కలిసి ఈ చిత్రా న్ని తమ చిత్రంగా భావించి పనిచేశారని, ముఖ్యం గా కథానాయకుడు మనోజ్ ఈ చిత్రంలో సరికొత్తగా కనిపిస్తాడని, మరో వారం రోజుల్లో ఆడియో విడుదల కార్యక్రమం జరుపుతామని తెలిపారు. కన్నడంలో హిట్ అయిన ఈ చిత్రాన్ని ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపుదిద్దామని, 45 రోజుల్లో షూ టింగ్ పూర్తి చేసిన ఈ సినిమా ఎంతో రిచ్‌గా వచ్చిందని, ఇప్పటివరకూ విడుదలైన ఆడియోలలో బెస్ట్ ఆడియోగా నిలుస్తుందని చిత్ర దర్శకుడు పవ న్ వడయార్ తెలిపారు. కార్యక్రమంలో విష్ణు, మనోజ్, మంచులక్ష్మి, దర్శకుడు మారుతి, జె.ప్రభాకర్‌రెడ్డి, శ్రీకాంత్ నవాజ్, జె.బి పాల్గొన్నారు. సాక్షీ చౌదరి, సల్మాన్‌కౌర్ ముండి, రేచెల్ వియిస్, అనూ ప్రియా గోయెంకా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో పోసాని కృష్ణమురళి, అలీ, షాయాజీ షిండే, రఘుబాబు, చంద్రమోహన్, కె.్ధన్‌రాజ్, వై.శ్రీనివాస్‌రెడ్డి, కె.శివశంకర్, గీతాసింగ్, సత్యం రాజేష్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, అచ్చు, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, మాటలు: శ్రీ్ధర్ శీపన, పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, కందికొండ, ఎస్. ఎ.కె. బాసా, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, నిర్మాతలు: శిరీషా-శ్రీ్ధర్, రచనా, దర్శకత్వం: పవన్ వడయార్.

రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై పవన్ వడయార్
english title: 
potugadu

‘మిస్టర్ మనీ’ ఆడియో

$
0
0

నవీన్, అలేఖ్య నూతన కథానాయకులుగా జర్నలిస్ట్ ఫ్రెండ్స్ మూవీస్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘మిస్టర్ మనీ’. కంది రామచంద్రారెడ్డి దర్శకత్వంలో మందాడి అరవింద్‌రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రంలోని పాటలు ఆదిత్యా మ్యూజిక్స్‌ద్వారా మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. కేంద్ర మంత్రి బల్‌రామ్ నాయక్ ఆడియో సీడీని విడుదల చేసి తొలి కాపీని హీరో శ్రీహరికి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకుడు కంది రామచంద్రారెడ్డి మాట్లాడుతూ- మణుగూరు ప్రాంతానికి చెందిన జర్నలిస్టులందరం కలిసి ఈ చిత్రాన్ని నిర్మించామని, కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిర్మించిన ఈ సినిమా ఎక్కడా బోర్‌కొట్టదని, ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు. సోలో హీరోగా తాను నటించిన చిత్రం ఇదని,30 రోజులకుపైగా మణుగూరులో సినిమా షూటింగ్ చేశామని హీరో నవీన్ తెలిపారు. గత 15 ఏళ్ళుగా తమ దర్శకుడు జర్నలిస్ట్‌గా పనిచేశారని, అతనితో ఈ సినిమా నిర్మించడం సంతోషంగా ఉందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఈ చిత్రంలో ఉన్నాయని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత మందాడి అరవింద్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పుప్పాల రమేష్, ఘంటాడి కృష్ణ, కొండవలస, శంకర్‌రావు, రేగ కాంతారావు, ప్రేమ్‌కుమార్ పట్రా తదితరులు పాల్గొన్నారు. పృధ్విరాజ్, తా.రమేష్, తడివేలు, సుమన్‌శెట్టి, ద్రాక్షారామం సరోజ, చిత్రం శ్రీను, ఫణికాంత్, చంద్రవౌళి, వేదం నాగయ్య, పొట్టి చిట్టిబాబు, బండ జ్యోతి, పలాస శ్రీను, నల్లబాలు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:రైసాబ్, ఎడిటింగ్:అరవింద్‌రెడ్డి, పాటలు:వెంగళ భాస్కర్, శ్రీనివాస్, సతీష్, సంగీతం:శ్రీవెంకట్, నిర్మాత: మందాడి అరవింద్‌రెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కంది రామచంద్రారెడ్డి.

నవీన్, అలేఖ్య నూతన కథానాయకులుగా
english title: 
mr. money audio release

క్లైమాక్స్‌లో ‘ఒక్కసారి ప్రేమిస్తే..’

$
0
0

భవానీ శంకర్, జయంతి, హీరో హీరోయిన్లుగా నక్కా కృష్ణగౌడ్ దర్శకత్వంలో మురళి మూవీ క్రియేషన్స్ పతాకంపై పొందూరి రామమోహనరావు, పొందూరి సాయి మురళీకృష్ణ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఒక్కసారి ప్రేమిస్తే..’ (ఏడు జన్మల బంధం). ప్రస్తుతం ఈ చిత్రం క్లైమాక్స్‌లో ఉంది. ఈ సందర్భంగా నిర్మాత పొందూరి రామమోహన్‌రావు చిత్ర విశేషాలు వివరిస్తూ ‘‘ప్రేమ అనే పదానికి సరైన నిర్వచనం తెలియక యువత వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాంటి యువతకు సందేశాత్మకమైన చిత్రమిది. ఇందులో మొత్తం ఐదు పాటలున్నాయి. ఒకటి ఐటెమ్ సాంగ్. వీటికి లక్ష్మణ్‌సాయి వినసొంపైన బాణీలను సమకూర్చారు. ఈ నెల చివరివారంలో ఆడియోను విడుదల చేస్తాం. దర్శకుడు నక్కా కృష్ణగౌడ్‌కు దర్శకుడిగా ఇది రెండవ చిత్రం. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కరీంనగర్, సదాశివపేట, హైదరాబాద్ తదితర అందమైన ప్రదేశాల్లో జరిపాం. ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్స్‌కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయి. ఆగస్టులో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. దర్శకుడు నక్కా కృష్ణగౌడ్ మాట్లాడుతూ- ఇదొక ముక్కోణపు ప్రేమకథా చిత్రం. ఆరు జన్మలుగా ప్రేమలో విజయం పొందలేక ఏడవ జన్మలోనైనా ప్రేమలో విజయం సాధించాలని ఆరాటపడే ఓ ప్రేమ జంట కథ ఇది. హీరో హీరోయిన్లు మంచి నటన కనబరిచారు. మిగతా నటుల సహకారంతో ఓ టీమ్‌వర్క్‌గా సినిమాని అహ్లాదకరమైన వాతావరణంలో పూర్తి చేశాం. ఈ చిత్రం మా అందరికీ మంచి పేరుతెచ్చిపెడుతుందన్న నమ్మకం ఉంది అన్నారు. జీవా, వినోద్, రఘునాధ్‌రెడ్డి, బాబూమోహన్, తా.రమేష్, తిరుపతి ప్రకాష్, సుమన్‌శెట్టి, పొట్టి చిట్టి, చిట్టిబాబు, తిలక్, రమ్యారెడ్డి, చిట్టెమ్మ, సరోజ, ఎస్.లక్ష్మి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: చిత్తజల్లు ప్రసాద్, సంగీతం:లక్ష్మణ్ సాయి, కెమెరా: గిరి, కొరియోగ్రఫీ: రామారావు, సమర్పణ: పొందూరి లక్ష్మీదేవి, నిర్మాతలు: పొందూరి రామ్‌మోహన్‌రావు, పొందూరి సాయిమురళీ కృష్ణ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నక్కా కృష్ణగౌడ్.

భవానీ శంకర్, జయంతి, హీరో హీరోయిన్లుగా
english title: 
okkasari..
Viewing all 69482 articles
Browse latest View live