Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

భూ పంపిణీకి 1533 ఎకరాలు సిద్ధం

$
0
0

గుంటూరు, డిసెంబర్ 16: జిల్లాలో చేపట్టాల్సిన 7వ భూ పంపిణీకి సంబంధించి అవసరమైన అన్ని చర్యలు ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ మండల అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయం నుండి నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలోని గురజాల, నరసరావుపేట డివిజన్లలో పంపిణీ చేయాల్సిన భూమి ఎక్కువగా ఉందని, గుంటూరు డివిజన్‌లో కొంతమేరకు పంపిణీ చేయాల్సిన భూములున్నట్లు తెలుస్తోందన్నారు. ఏడవ విడత భూ పంపిణీలో సుమారు 1533 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఒక కుటుంబంలో ఎక్కువ మంది ఆడపిల్లలు, పేదరికంతో ఉన్న వారికి పంపిణీలో ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఓటరు నమోదు కార్యక్రమం ఈనెల 17వ తేదీతో పూర్తవుతుందని, ఇందుకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ స్వయంగా పరిశీలించి ఈనెల 30 లోగా విచారణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 2014 జనవరి 16వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటించాల్సి ఉన్నందున ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాల వలన పంటలు కోల్పోయిన రైతులకు పెట్టుబడి రాయితీ చెల్లించేందుకు ఇంకా రైతులచే బ్యాంకు ఖాతాయలు తెరిపించే ప్రక్రియ పూర్తి కాలేదని చెప్పారు. త్వరితగతిన పూర్తిచేసి నివేదికలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాల కింద మంజూరు చేసిన యూనిట్లను జనవరి నెలాఖరులోగా గ్రౌండింగ్ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. రాజీవ్ విద్యాదీవెన కింద ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులచే బ్యాంకు ఖాతాలు తెరిచే ప్రక్రియను ఈనెల 25వ తేదీలోగా పూర్తి చేయాలని సంబంధిత మండల విద్యాశాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. బహిరంగ మార్కెట్‌లో పత్తి కొనుగోలు ధర ఎక్కువగా ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, తహశీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు ఈ విషయంపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. కేంద్రప్రభుత్వం పత్తి పంటకు కనీస మద్దతు ధరగా 4 వేలు నిర్ణయించినందున అంతకు తక్కువగా బహిరంగ మార్కెట్‌లో రైతుల నుండి పత్తి కొనుగోలు చేసినట్లయితే తక్షణమే భారత పత్తి సంస్థ (సిసిఐ) ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.

సోనియాకు తొత్తుగా మారిన స్పీకర్
గుంటూరు, డిసెంబర్ 16: శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోనియాగాంధీకి తొత్తుగా మారారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు ఆరోపించారు. అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టినందుకు నిరసనగా టిడిపి నాయకులు, కార్యకర్తలు సోమవారం స్థానిక లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బిల్లు ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ స్పీకర్ మనోహర్ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని తొందరంగా చీల్చేందుకు ఉత్సాహ పడుతోందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు భిన్నంగా తెలంగాణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారన్నారు. స్పీకర్, గవర్నర్ వంటి రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి సైతం దిగ్విజయ్‌సింగ్ ప్రలోభాలకు గురి చేయడం శోచనీయమన్నారు. 8 కోట్ల తెలుగు ప్రజల తలరాతను మార్చే కీలకమైన ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుపై అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదించకుండా గందరగోళం నడుమ హడావుడిగా శాసనసభలో ప్రవేశపెట్టారన్నారు. సభా సంప్రదాయాలకు, నియమాలను ఉల్లంఘించి స్పీకర్ పదవికే మనోహర్ కళంకం తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోక ముందే సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా టిఆర్‌ఎస్, తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై దాడులకు పాల్పడటం క్షమార్హం కాదన్నారు. సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారిపై దాడిని తీవ్రంగా నిరసిస్తున్నామని, అందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే సెక్రటేరియట్‌లో సీమాంధ్ర ఉద్యోగులపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు దాడి చేయడం దారుణమన్నారు. 63 పేజీలు, 13 షెడ్యూల్డ్ బిల్లును సభ్యులకు ఇచ్చి వారు బిల్లు పూర్తిగా చదవకుండానే సభలో చర్చ ప్రారంభించాలనడం అన్యాయమన్నారు. బిల్లులో ఉన్న లోటుపాట్లపై చర్చించాల్సిన ఆవశ్యకత సభ్యులందరికీ ఉందని, ఆ అవకాశం సభ్యులకు ఇవ్వకుండా హడావుడిగా ప్రక్రియ ప్రారంభించడం సరికాదన్నారు. సభ్యుల హక్కులను హరించే విధంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని, మొన్న బిఎసిలో తీసుకున్న అంశాలపై చర్చ పెట్టకుండా తెలంగాణ బిల్లుపై రాష్టప్రతి 40 రోజుల గడువు ఇచ్చినా ప్రజా సమస్యలు, బడుగుల సంక్షేమాన్ని గాలికొదిలేసి కెసిఆర్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మానుకొండ శివప్రసాద్, కనగాల చిట్టిబాబు, వట్టికూటి హర్షవర్ధన్, దామచర్ల శ్రీనివాసరావు, అజయ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

స్పీకర్ వైఖరి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు
తెనాలి, డిసెంబర్ 16: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే తీరులో రాజ్యాంగానికి గొడ్డలి పెట్టుగా శాసన సభా సమావేశాల్లో స్పీకర్ నాదెండ్ల మనోహర్ టి బిల్లు ప్రవేశపెట్టారని వైసిపి నాయకులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం తీవ్ర స్థాయిలో వ్యక్తం చేశారు.సోమవారం శాసన సభా సమావేశాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై, గుంటూరు జిల్లా తెనాలిలో వైసిపి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ రాత్రి పొద్దుపోయాక గాంధీచౌక్ సెంటర్‌లో స్పీకర్ నాదెండ్ల మనోహర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పార్టీ కార్యాలయం నుండి స్పీకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గాంధీ చౌక్‌కు చేరుకున్న నాయకులు అదే సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి సమైక్యవాదాన్ని చాటుతు నినాదాలు చేశారు. క్రమంలోమాజీ కేంద్ర మంత్రి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శాసన సభా సమావేశాల్లో నిబంధనలకు విరుద్దంగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలంగాణ బిల్లు హడావిడిగ ప్రవేశపెట్టారని, రాష్ట్ర పతి సందేశాన్ని కూడా సభ్యుల ఆందోళనలు మిన్నంటుతున్న చదివించిన తీరు, రాజ్యాంగానికి గొడ్డలి పెట్టన్నారు. వేమూరు నియోజక వర్గ ఇంచార్జి మేరుగ నాగార్జున మాట్లాడుతూ శాసన సభలో టి బిల్లు వచ్చే సమాయానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు, స్పీకర్ కూడా మధ్యాహ్నం వరకు లేరని వీరంతా ఉద్దేశ్య పూర్వకంగా రాష్టవ్రిభజనకు సహకరిస్తున్నారని విమర్శించారు. ఇదే కార్యక్రమంలో వైసిపి నాయకులు అన్నాబత్తుని శివకుమార్, గుదిబండి చినవెంకటరెడ్డి, గల్లా చందు, మాజీ ఎమ్మెల్యే మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి,సుద్దపల్లి నాగరాజు, డాక్టర్ వేమూరు శేషగిరిరావు, వేమూరు, తెనాలి నియోజక వర్గాల వైసిపి నాయకులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల దుర్మరణం
మంగళగిరి, డిసెంబర్ 16: మండల పరిధిలోని కాజగ్రామ పొలాల్లో సోమవారం విద్యుదాఘాతంతో బత్తల పాపారాయుడు (21), దాసరి కొండలరావు (22) అనే యువకులు దుర్మరణం పాలయ్యారు. రూరల్ పోలీసుల కధనం ప్రకారం నెల్లూరు జిల్లా బిట్రగుంట మండలం బొర్రారెడ్డిపాలెంకు చెందిన పాపారాయుడు, అదే జిల్లా దగదర్తి మండలం దగదర్తికి చెందిన కొండలరావు మూడురోజుల క్రితం వరినూర్పిడి యంత్రం వెంట కూలీలుగా కాజకు చేరుకున్నారు. వరినూర్పిడి కోసం యంత్రాన్ని లారీపై ఉంచి పొలానికి వెళుతుండగా మార్గమధ్యంలో విద్యుత్ వైర్లు యంత్రానికి తగిలేంత కిందికి ఉండటంతో లారీ ముందుకు వెళ్లేందుకు వీలుగా కర్ర సహాయంతో తీగలను పైకెత్తగా కర్ర విరిగి విద్యుత్ వైర్లు లారీకి తాకడంతో లారీలో ఉన్న పాపారాయుడు, కొండలరావు విద్యుత్ షాక్‌కు గురై అక్కడి కక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో యువకుడు క్షణాల్లో లారీనుంచి దూకేయడంతో ప్రాణాపాయం నుంచి బైటపడ్డాడు. సిఐ మధుసూధనరావు, ఎస్సై సత్యనారాయణ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.
30 సార్లు రక్తదానం చేసిన పసుపులేటి శ్రీ్ధర్
పెదకూరపాడు, డిసెంబర్ 16: ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా 17 ఏళ్లుగా విధులు నిర్వహిస్తూ అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో తన వంతుగా పాలు పంచుకుంటున్న పసుపులేటి శ్రీ్ధర్, తాను పనిచేసే పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు స్కూలు దుస్తులు, ఇతర వౌలిక వసతుల ఏర్పాటుకు ఆర్థికసాయం అందజేస్తూ, అనేక మంది పేద విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తూ సాయమందజేసిన శ్రీ్ధర్‌ను సోమవారం పెదకూరపాడులో బుజ్జి జన్మదిన వేడుకల్లో 30వ సారి రక్తదానం చేసిన సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గుంటుపల్లి కోటేశ్వరరావు, జిల్లా యుటిఎఫ్ నాయకుడు కళాదర్, బెల్లంకొండ శివశంకర్, అవ్వారి రవి, వజ్చా మహేష్, కన్నబాబు, దాసరి ప్రకాష్ తదితరులు అభినందించారు. అలాగే ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ కె వియన్నారావు, జిడిసిసి చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య, డిసిఎంఎస్ చైర్మన్ ఇక్కుర్తి సాంబశివరావు, వెన్నా సాంబశివారెడ్డి తదితరులు ఉపాధ్యాయుడు శ్రీ్ధర్‌ను పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
మోటారు సైకిళ్లు ఢీకొని ఐదుగురికి గాయాలు
మేడికొండూరు, డిసెంబర్ 16: రెండు మోటారు సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఐదుగురికి గాయాలైన సంఘటన గుంటూరు-మాచర్ల ప్రధాన రహదారిపై గుంటూరు బ్రాంచ్ కాల్వ వద్ద ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పేరేచర్ల నుండి పిడుగురాళ్ల వెళ్తున్న షేక్ సుభాని, ఖాజా మొహిద్దీన్ మోటార్ సైకిల్, మేడికొండూరు నుండి గుంటూరు వెళ్తున్న నవత రాజు, కల్యాణ్, మురళిల ద్విచక్ర వాహనం ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొనడంతో మొత్తం ఐదుగురూ గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 అంబులెన్సు ద్వారా గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సిఐ సుధాకర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి విజయం ఖాయం
గుంటూరు (పట్నంబజారు), డిసెంబర్ 16: సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి విజయం తథ్యమని, ఈ పార్టీ ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడే సామర్థ్యం ఏ పార్టీకీ లేదని భారతీయ జనతా మజ్దూర్ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి సుబ్బారావు పేర్కొన్నారు. సోమవారం స్థానిక 8వ డివిజన్‌లో బిజెపి కార్యవర్గ సమావేశం అరవపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ నగరంలోని అన్ని డివిజన్లలో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కార్యకర్తలు సన్నద్ధం కావాలన్నారు. బిజెపి నగర కార్యదర్శి అరవతల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందన్నారు. ఈ సమావేశంలో అమ్మిశెట్టి ఆంజనేయులు, నేరెళ్ల మాధవరావు, సూరిబాబు, కారంశెట్టి రమేష్, జూపూడి రంగరాజు, డి సత్యనారాయణ, పాండురంగ విఠల్ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
ముక్కోటికి సమన్వయంతో ఏర్పాట్లు
మంగళగిరి, డిసెంబర్ 16: స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి (ముక్కోటి) పర్వదినం సందర్భంగా వచ్చేనెల 10వ తేదీ రాత్రి జాగరణ, 11వ తేదీన తెల్లవారుఝాము నుంచి ఉత్తర ద్వార దర్శనానికి తరలివచ్చే భక్తులకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆప్కోచైర్మన్ మురుగుడు హనుమంతరావు అన్నారు. ముక్కోటి ఏర్పాట్లపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సోమవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ముక్కోటి వాల్‌పోస్టరును ధనుర్మాస మహోత్సవ ఆహ్వాన పత్రికను మురుగుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ ఎంఎస్‌ఆర్ కృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మురుగుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఉత్తర ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు త్వరిత గతిన దర్శనం జరిగే విధంగా క్యూలైన్లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని, బంగారు దక్షిణావృత శంఖంతో ఇచ్చే తీర్థం పవిత్రంగా ఉండేలా చూడాలని, మంచిపాత్రల్లో తీర్థం ఉంచి భక్తులకు అందించాలని అన్నారు. ఆర్‌టిసి డిపో మేనేజర్ బాపిరాజు మాట్లాడుతూ ముక్కోటి సందర్భంగా విజయవాడ, గుంటూరు, తెనాలి ప్రాంతాలనుంచి భక్తుల రాకపోకలకు వీలుగా బస్సులు నడుపుతామని అన్నారు. ఆర్ అండ్ బి, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, విద్యుత్, పోలీసు, దేవాదాయశాఖ, రెవిన్యూ, మున్సిపల్ అధికారులు తమ శాఖాపరంగా తీసుకునే చర్యలను వివరించారు. ఇఓ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ముక్కోటి ఏర్పాట్లపై వివరించారు. ఎంపిడిఓ శ్యామలాదేవి, మున్సిపల్ కమిషనర్ పి శ్రీనివాసరావు, సిఐ రావూరి రమేష్‌బాబు, ఎఎంసి చైర్మన్ సుంకర రఘుపతిరావు తదితరులు ప్రసంగించారు. ముక్కోటి పర్వదినాన్ని రాష్టస్థ్రాయి ఉత్సవంగా ప్రభుత్వం గుర్తించే విధంగా చూడాలని వాసవి సేవాసమితి అధ్యక్షుడు మాజేటి సూర్యవేణుగోపాలకృష్ణ కోరగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి ప్రయత్నిస్తామని ఆప్కో చైర్మన్ మురుగుడు హామీ ఇచ్చారు. వాకా ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
నత్తనడకన మరుగుదొడ్ల నిర్మాణం

పొన్నూరు, డిసెంబర్ 16: కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని నిర్మల్ భారత్ అభియాన్ ప్రాజెక్టు ద్వారా యుద్ధ ప్రాతిపదికన చేపట్టినప్పటికీ మండలంలో నత్తనడక నడుస్తోంది. మండల పరిధిలోని 29 గ్రామాల్లో కేవలం ఆరు గ్రామాల్లో మాత్రమే ఈ పథకం ద్వారా పనులు చేపట్టారు. ఈ ఆరు గ్రామాల్లో 1,512 మరుగుదొడ్ల నిర్మాణానికి అంచనాలు వేసి అనుమతి ఇచ్చినప్పటికీ పూర్తయినవి కేవలం 34 మాత్రమే. పరిసరాల పరిశుభ్రత మన లక్ష్యం సురక్షిత పారిశుద్ధ్య మన ధ్యేయం అని గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగంగా మలవిసర్జన చేయవద్దని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అయితే గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించడంలో మాత్రం విఫలమవుతుందని చెప్పక తప్పదు. మండల పరిధిలో మొత్తం 29 గ్రామ పంయతీలున్నాయి. కాగా గోళ్లముడిపాడు, కసుకర్రు, మామిళ్లపల్లి, నండూరు, సీతారామపురం, వల్లభరావుపాలెంలలో మాత్రమే మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. ఇవి కూడా నత్తనడకన సాగుతున్నాయి. మామిళ్లపల్లి గ్రామంలో అత్యధికంగా 530 మరుగుదొడ్లకు అంచనా పనులు పూర్తికాగా కేవలం 2 మరుగుదొడ్ల నిర్మాణం మాత్రమే పూరె్తైంది. నండూరులో 480కు గాను 16, కసుకర్రులో 204కు గాను 9, గోళ్లముడిపాడులో 190కు గాను 4, సీతారామపురంలో 97కు గాను 2, వల్లభరావుపాలెంలో 29కు గాను కేవలం ఒకటి మాత్రమే మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. గోళ్లముడిపాడులో మరుగుదొడ్ల నిర్మాణం నిమిత్తం దాదాపు 3,600 రూపాయలు పై చిలుకు ఇవ్వడానికి నాట్కో కంపెనీ ముందుకు వచ్చింది. అయినా ఆశించిన ఫలితం లేకపోయింది. దీనికితోడు ప్రతినెలా 100 మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని ఇందిరా క్రాంతి పథం ద్వారా టార్గెట్లు ప్రకటించినప్పటికీ పథకం ఎక్కడ వేసిన గొంగలి అక్కడేనన్న చందంగా ఉంది. గత నెల 20వ తేదీన దొప్పలపూడి, పెదపాలెం, ములుకుదురు గ్రామాలకు చెందిన 70 మంది మహిళలు తమకు మరుగుదొడ్లు నిర్మించాలని ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహశీల్దార్, ఎండిఒ కార్యాలయాల వద్ద ధర్నా చేసి తమ సమస్యను వివరిస్తూ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. అయినప్పటికీ ఆయా గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం సజావుగా సాగేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు.
పంట రక్షణకు రైతుల అవస్థలు
తాడేపల్లి, డిసెంబర్ 16: తాడేపల్లి మండల పరిధిలోని చిర్రావూరు గ్రామంలో రైతులు సోమవారం అష్టకష్టాలు పడ్డారు. ఇటీవల కురిసిన వర్షాల వలన వరి చేలు నీటిలో మునిగిపోవటంతో రైతులు కోతలు ప్రారంభించి పంటను రోడ్డుపై పరిచారు. ఈ క్రమంలో ఎకరానికి 5వేలు రూపాయలు కోతకు, ఇతర కూలీ చార్జీలు ఒక్కొక్కరికి రూ. 300 రైతులు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది.
దేశ ఆర్థికాభివృద్ధిలో రిజర్వు బ్యాంకు పాత్ర కీలకం
గుంటూరు (పట్నంబజారు), డిసెంబర్ 16: స్వాతంత్య్రానంతరం దేశ ఆర్థిక, సామాజికాభివృద్ధికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రణాళికాబద్ధమైన కృషి కొనసాగిస్తున్నట్లు ఆ బ్యాంకు హైదరాబాద్ శాఖ అసిస్టెంట్ మేనేజర్ చంద్రమోహన్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక బ్రాడీపేటలోని బండ్లమూడి హనుమాయమ్మ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు ఆంధ్రాబ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు సహకారంతో ఆర్‌బిఐ కార్యకలాపాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యవక్తగా పాల్గొన్న చంద్రమోహన్ మాట్లాడుతూ ఆర్‌బిఐ దేశ ద్రవ్య వ్యవస్థపై పర్యవేక్షణాధికారం కలిగి ఉంటుందన్నారు. అంతేకాకుండా విదేశీ ఆర్థిక ప్రభావాలకు కాపలాదారుగా పనిచేస్తుందన్నారు. జాతీయ ప్రైవేటు బ్యాంకులతో పాటు ఆర్థిక వ్యవహారాలు నిర్వహించే సంస్థల తీరు తెన్నులను విశే్లషిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 20 ప్రాంతీయ కార్యాలయాలతో వాణిజ్య బ్యాంకుల్లోని 4,200 కరెన్సీ చెస్ట్‌ల ద్వారా నోట్లు, నాణాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు దాచుకున్న డబ్బులకు భరోసా కల్పిస్తూ ఆ ధనం ద్వారా ఆర్థిక ప్రగతికి ఉపయోగపడేలా గురుతర బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు వివరించారు. ఎల్‌డిఎం రామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు పొదుపుపై, బ్యాంకుల ద్వారా రైతులకు వ్యవసాయం, విద్య, వైద్య, స్వయం సహాయక రుణాల కార్యకలాపాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సదస్సులో ఆర్‌బిఐ సహాయాధికారి ఎంసి ప్రసాద్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఫైనాన్షియల్ ఇన్‌క్లూషన్ విభాగాధికారి జనార్ధనరావు, బ్రాంచి మేనేజర్ శివరామిరెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ శాంతి భూషన్, హెచ్‌ఎం జెవి రమణి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
ఏసీబీ వలలో మున్సిపల్ ఆర్‌ఐ
చిలకలూరిపేట, డిసెంబర్ 16: స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో ఆర్‌ఐగా పనిచేస్తున్న వెంకట్రామయ్య లంచం తీసుకుంటూ సోమవారం మధ్యాహ్నం ఎసిబి అధికారులకు దొరికిపోయాడు. ఎసిబి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని పాటిమీద నివాసముంటున్న ప్రభుత్వ టీచర్ కె శ్రీనివాసరావు ఇంటిపన్ను విషయంలో జరిగిన ఉదంతమన్నారు. 5 వేల లంచం ఇవ్వకపోతే శ్రీనివాసరావు ఇంటికి 3,500 రూపాయల పన్ను విధిస్తానని తరచూ బెదిరించే వాడని తెలిపారు. అధికారుల పథకం ప్రకారం శ్రీనివాసరావు మున్సిపల్ ఆర్‌ఐ వెంకటరామయ్యకు 5 వేలు లంచం ఇవ్వగా ఆ డబ్బును ప్యాంటు జేబులో పెట్టుకున్నాడని, తాము దాడి చేసిన సమయంలో అవి బయటపడ్డాయని ఎసిబి డిఎస్‌పి విజయబాబు తెలిపారు. ఈ దాడిలో ఎసిబి సిఐలు శ్రీనివాసరావు, నాగరాజు, సీతారామాంజనేయులు, రవి తదితరులు పాల్గొన్నారు.

శ్రామిక మహిళా ఉద్యమ నిర్మాణానికి నడుం బిగించాలి
గుంటూరు , డిసెంబర్ 16: శ్రామిక మహిళా ఉద్యమ నిర్మాణంలో మహిళలు కీలకపాత్ర పోషించాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వి సంధ్య పిలుపునిచ్చారు. సోమవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నగరంలో జరిగింది. ఈ సందర్భంగా సంధ్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి విప్లవ మహిళా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న ప్రగతిశీల మహిళా సంఘం ఇటీవల మహిళా ఉద్యమంలో పలు కీలక అంశాలపై చర్చించిందన్నారు. అణిచివేతకు గురవుతున్న ఆదివాసి, దళిత, బహుజన, అట్టడుగు శ్రామిక వర్గాల ప్రజలను సమీకరించి ఉద్యమంలో భాగస్వాములను చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బాలికల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కార్యకర్తలు సన్నద్ధం కావాలన్నారు. రాష్ట్రంలో నానాటికీ మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, దాడులను నియంత్రించేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా వి సంధ్య, ఎన్ విష్ణు, మరో 13 మందితో ఆఫీసు బేరర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. పార్లమెంటు ముందున్న స్పెషల్ కాంపొనెంట్ ప్లాన్, షెడ్యూల్ ట్రైబల్ ప్లాన్‌కు సంబంధించిన బిల్లును వెంటనే ఆమోదించి కోటాలో సబ్ కోటా కింద నిధులు కేటాయించాలని, పలు తీర్మానాలు సమావేశంలో చేశారు.
నకిలీ విత్తన బాధిత రైతులకు
నష్టపరిహారం ఇవ్వాలంటూ ధర్నా
వినుకొండ, డిసెంబర్ 16: నకిలీ విత్తనాలను సాగుచేసి నష్టపోయిన రైతులకు తక్షణమేప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతుసంఘం, సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక శివయ్యస్థూపం సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. వినుకొండ నియోజకవర్గంలోని వేల్పూరు, ఇర్లపాడు, పోట్లూరు, ముప్పాళ్ళ, బొగ్గరం, చిట్టాపురంగ్రామాలకు చెందిన రైతులు ఖరీఫ్ సీజన్‌లో పట్టణంలోని పలు విత్తనాల దుకాణాల్లో వరివిత్తనాలను సాగుచేశారని, ఎకరాకు 20వేలనుండి 25వేలవరకు పెట్టుబడులు పెట్టి సాగుచేయగా, పైరు పెరగకపోవడంతో రైతులు పూర్తిగా నష్టపోయారని రైతుసంఘం నాయకులు కంచేటి శివరామకృష్ణ, ఉలవలపూడి రాము, బండి కోటయ్య, బొల్లా శ్రీనివాసరావు, మారుతీవరప్రసాద్‌లు తెలిపారు. సిపిఐ, రైతుసంఘం నాయకులు, రైతులు స్థానిక వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, నకిలీ విత్తనాలను విక్రయించిన దుకాణాల యాజనుమాలపై చర్యలు తీసుకోవలేదన్నారు.
తక్షణమే రైతులకు న్యాయం జరగని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో రైతుసంఘం నాయకులు, సిపిఐ నాయకులతోపాటు పలుగ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

టెన్నికాయిట్‌లో ఓలేరు విద్యార్థినుల ప్రతిభ

భట్టిప్రోలు, డిసెంబర్ 16: ఇటీవల చెరుకుపల్లి మండలం రాజోలులో జరిగిన జిల్లా బాలికల సెంట్రర్ జోన్ ఆటలపోటీల్లో మండలంలోని ఓలేరు ఎస్‌జెవిఎస్ పాఠశాల విద్యార్థినులు సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో టెన్నీకాయిడ్‌లో ప్రథమ స్థానం సాధించినట్లు హెచ్‌ఎం సత్యప్రసాద్ తెలిపారు. ఈసందర్భంగా సోమవారం పాఠశాలలో జరిగిన అభినందన సభలో గెలుపొందిన బాలికలను, పిఇటి సాంబశివరావును పాఠశాల కరస్పాండెంట్ దేవినేని మల్లిఖార్జునరావు, ఉపాధ్యాయులు రామారావు, సురేష్, వెంకటరావు తదితరులు అభినందించారు.
రబీలో వరికి సాగునీరు ఇవ్వాలి
పిడుగురాళ్ళ, డిసెంబర్ 16: రబీలో వరిసాగుకు ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీటిని ఇవ్వాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుడిమాండ్ చేశారు. సోమవారం స్థానిక తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలు భారీవర్షాలకు దెబ్బనడంతో అన్నదాలు తీవ్రంగా నష్టపోయారన్నారు. బ్యాంకులు, ఎరువుల వ్యాపారులవద్ద అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారని, ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు రబీలో వరిపంటసాగుకు నీటిని ఇవ్వాలన్నారు. నాగార్జునసాగర్‌ప్రాజెక్టులో 574అడుగుల నీరు ఉందని, సాగు, తాగునీటికి సరిపోతుందన్నారు. జిల్లాలో ముగ్గురు రాష్ట్ర, ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నప్పటికీ, రైతులను ఆదుకోవడంలో వారు విఫలమయ్యారన్నారు. జిల్లాలో దెబ్బతిన్న పంటలను వ్యవసాయశాఖమంత్రి రఘువీరారెడ్డి ఎక్కడా పరిశీలించలేదన్నారు. రబీలో రైతులకు ఉచితంగా విత్తనాలను అందజేయాలని, 75కిలోల ధాన్యం బస్తాకు 1500 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో నీటిపారుదల శాఖామంత్రిని, సిఎంను కలిసి రబీలో వరిసాగుకు సాగునీరు వచ్చేవిధంగా కోరతామన్నారు. ఈసమావేశంలో టిడిపి నాయకులు వర్ల రత్నం, బాబావలి, షేక్ అమీర్, దేవదానం, హనుమంతరావుతదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీలో దాడి ఘటనపై చీఫ్‌విప్ చర్యలు తీసుకోవాలి
నరసరావుపేట, డిసెంబర్ 16: పోలీసులు, మీడియాసాక్షిగా అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై జరిగిన దాడి సంఘటనపై ఛీప్‌విప్ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీలో టీబిల్లు చర్చకు వస్తుందని తెలిసినప్పటికీ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనాయకుడు నారా చంద్రబాబునాయుడు సమైక్యాంధ్ర, సమన్యాయం ముసుగులో రాష్ట్రప్రజలను అయోమయానికి గురిచేశారని, దీనికి వారిరువురు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రులచే రాజీనామాలు చేయించకుండా, అసెంబ్లీలో తీర్మానం వస్తే తమ తడాఖా చూపిస్తామని మీడియా ముందు ప్రగల్భాలు పలికారని, టి బిల్లు అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఆరోగ్యం బాగలేదంటూ నాటకాలాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్జీవోలచే సమ్మె చేయించారని, అనంతరం సమ్మెను విరమింపచేశారని, టి బిల్లు వచ్చిన తర్వాత అశోక్‌బాబు మీడియాముందు మాట్లాడటమే తప్ప కార్యాచవరణలో ఏమీలేదన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు తెలంగాణాబిల్లు అసెంబ్లీకి వస్తే గైర్హాజరుకావడం ఏమిటని ప్రశ్నించారు. కనీసం తాను చెప్పే సమన్యాయం గురించి అయినా అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉందా, లేదా అని ప్రశ్నించారు. హైదరాబాదులో జరిగిన బీసీల సదస్సుకు చంద్రబాబునాయుడు హాజరయ్యారని, అసెంబ్లీకి మాత్రం సమయం కేటాయించకపోవడం దారుణమన్నారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరి ప్రజలకు తెలుసన్నారు. ఇక్కడి తెలుగుదేశంపార్టీ నాయకులు సమైక్యాంధ్ర కోసం ధర్నాలు, బంద్‌లు, ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇవన్నీ వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలను తెలుగుదేశంపార్టీ నాయకులు కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. టిడిపి నాయకులు చంద్రబాబునాయుడు ఇంటిముందు ధర్నాచేసి, సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్లు చెప్పించాలని డాక్టర్ గోపిరెడ్డి కోరారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శనివారం నాడే ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటుచేసి సమైక్య నినాదాన్ని అసెంబ్లీలో వినిపించాలని చెప్పినట్లు డాక్టర్ గోపిరెడ్డి తెలిపారు. ఈసమావేశంలో పిల్లి ఓబుల్‌రెడ్డి, శంకర్‌యాదవ్, సుజాతపాల్ తదితరులు పాల్గొన్నారు.

చోరీకి గురైన 9 సవర్ల బంగారం స్వాధీనం
మాచవరం, డిసెంబర్ 16: మండలంలోని కొత్తపినె్నల్లిగ్రామంలో చోరీకి గురైన రెండులక్షల విలువైన బంగారాన్ని పిడుగురాళ్ళ రూరల్ సిఐ బిలాలుద్ధీన్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ మహమ్మద్ షఫీ ఎట్టకేలకు రికవరీ చేశారు. వివరాల్లోకి వెళితే...ఈనెల మూడోతేదీన కొత్తపినె్నల్లిగ్రామానికి చెందిన గాదె శివారెడ్డి ఇంట్లో ఎవరులేని సమయంలో ఇంట్లోని బీరువాను పగులగొట్టి దొంగలు తొమ్మిది సవర్ల బంగారాన్ని చోరీచేశారు. ఈనెల పదోతేదీన మాచవరం పోలీసుస్టేషన్‌లో శివారెడ్డ్ఫిర్యాదుచేశారు. ఈమేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు జరిపారు. సోమవారం పినె్నల్లిబస్టాండ్ సెంటర్‌లో ఉన్న సిరా పూర్ణచంద్రారెడ్డిపై అనుమానంతో విచారణ జరపగా, బంగారాన్ని చోరీ చేసినట్లు పూర్ణాచంద్రారెడ్డి వెల్లడించాడు. పూర్ణచంద్రారెడ్డివద్దనుండి తొమ్మిది సవర్ల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడైన పూర్ణచంద్రారెడ్డిని పిడుగురాళ్ళకోర్టులో హాజరుపర్చినట్లు ఎస్‌ఐ మహమ్మద్ షఫీ, ట్రైనింగ్ ఎస్‌ఐ హరిబాబు తెలిపారు.
కేరళ రైల్వే పోలీసుల దౌర్జన్యంపై హెచ్‌ఆర్‌సికి ఫిర్యాదు
నరసరావుపేట, డిసెంబర్ 16: ఆంధ్రరాష్ట్రానికి చెందిన అయ్యప్పస్వామి భక్తులపై కేరళరాష్ట్ర రైల్వే పోలీసులు దౌర్జన్యం చేయడంపై మానవహక్కుల కమిషన్‌కు నరసరావుపేట అయ్యప్పస్వామి భజన బృందం సభ్యులు శనివారం ఫిర్యాదుచేయగా, దీనిపై స్పందించిన హెచ్‌ఆర్‌సి సభ్యులు ఏపి చీఫ్ సెక్రటరీకి జరిగిన దాడిపై విచారణ జరిపి కేరళ రాష్ట్రప్రభుత్వంతో మాట్లాడి, వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటోతేదీలోగా నివేదికను అందజేయాలని ఆదేశించారు. ఈమేరకు నరసరావుపేట అయ్యప్పస్వామి భక్తులు సోమవారం ప్రకటనను అందజేశారు. ఆంధ్రరాష్ట్రం నుండి కేరళకు వెళ్ళిన అయ్యప్పభక్తులు తిరుగు ప్రయాణంలో శబరి ఎక్స్‌ప్రెస్‌లోని లింగారెడ్డి అనే భక్తుని సీటులో మప్టీలో ఉన్న రైల్వే కానిస్టేబుల్ కూర్చుని అహంకారంతో లింగారెడ్డికి సీటు ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తూ, భౌతికదాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో తీర్థయాత్రలు చేస్తున్న ఆంధ్రరాష్ట్ర భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని వారి కోరినట్లు పేర్కొన్నారు. భక్తులు స్వేచ్ఛగా ప్రయాణం చేసే హక్కును కల్పించాలని కోరినట్లు డప్పు శ్రీను, చౌడం శ్రీనివాసరావు, మాచర్ల బాబు, చందోలు సాంబశివరావుగుప్త, రామచంద్రరావు, మణికుమార్ బహుదూర్, చంద్రశేఖర్, పి కృష్ణ తదితరులు ఆ ప్రకటనలో తెలిపారు.

ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్
ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు
వినుకొండ, డిసెంబర్ 16: పట్టణ ఆర్టీసి ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్టీసిడిపోవద్ద రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వపరం చేయాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని, రిటైర్డ్ ఉద్యోగులకు ఐదువేల రూపాయలకు పెన్షన్‌ను పెంచాలని, కార్మికులపై పనిభారం తగ్గించాలనే తదితర డిమాండ్లతో ఎంప్లారుూస్ యూనియన్ కార్మికులు దీక్ష చేపట్టారు. దీక్షలో ఆర్టీసీ కార్మికులు జెజె జశ్వంత్, ఏపిరెడ్డి, వి ఆంజనేయులు, షేక్ షరీఫ్, రావు, రవీంద్రనాధ్, జెఎస్ రావు, షేక్ ముస్త్ఫా తదితరులు పాల్గొన్నారు. దీక్షాశిబిరాన్ని ఆర్టీసీ నాయకులు కె రమేష్‌బాబు, పి శ్రీనివాసరావు, సాంబశివరావు, సంజీవరావు, షేక్ బాజీ, జె చంద్రశేఖరరావులు పర్యవేక్షించారు.

జిల్లాలో చేపట్టాల్సిన 7వ భూ పంపిణీకి సంబంధించి
english title: 
land

ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా దొంగ ఓట్లు

$
0
0

ఒంగోలు, డిసెంబర్ 16: భారత ఎన్నికల కమిషన్ ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఓటర్ల జాబితా రూపకల్పనలో భారీగా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో భారీఎత్తున ఓటర్ల నమోదులో అక్రమాలు జరిగాయంటూ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అయినప్పటికీ జిల్లా యంత్రాంగంలో మాత్రం మార్పు రాలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాకేంద్రమైన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 13,400 దొంగ ఓట్లు ఉన్నట్లు ఒంగోలు ఆర్‌డిఒ మురళికి తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు సోమవారం సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు. కాగా ఓటర్ల నమోదులో అక్రమాలను అరికట్టాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈనెల 18న కలసి వినతిపత్రాన్ని సమర్పించనున్నట్లు ఆంధ్రభూమి ప్రతినిధికి హైదరాబాద్ నుండి ఫోన్‌లో తెలిపారు. మృతి చెందినవారి పేర్లను తొలగించకుండా ఆ ఓట్లను యథావిధిగా ఓటర్ల జాబితాలో ముద్రించారని టిడిపి నాయకులు ఆర్‌డిఒకు వివరించారు. నూతన ఓటర్లను చేర్పించాలని భారత ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పదేపదే అధికారులను ఆదేశిస్తున్నప్పటికి ఆచరణలో మాత్రం జరగటం లేదని టిడిపి నాయకులు ధ్వజమెత్తుతున్నారు. ఫారం -7ను నూతన ఓటర్ల నుండి అధికారులు తీసుకోవటం లేదని ఆరోపించారు. ఇప్పటికి మూడుసార్లు ఆర్‌డిఒకు ఇచ్చినా ఫలితం లేదని నేతలు విమర్శిస్తున్నారు. బూత్‌లెవల్ అధికారులు ఆ బూత్‌లకు వచ్చే సమయంలో ముందుగా బూత్ ఏజెంట్లకు సమాచారం ఇవ్వాలని కాని అలాంటి సమాచారాన్ని అధికారులు ఇవ్వటం లేదని టిడిపి నేతలు మండిపడుతున్నారు. గతంలో కూడా ఒంగోలు నియోజకవర్గ పరిధిలో 14వేల దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిపారు. కాగా కొత్తపట్నం మండలంలోని అల్లూరు, ఒంగోలు మండలంలోని నర్సాపురం అగ్రహారం, పెళ్ళూరు, త్రోవగుంట ప్రాంతాలకు చెందిన వారి ఓట్లు ఒంగోలు నగరంలో ఉన్నాయని టిడిపి నేతలు పేర్కొంటున్నారు. అలాంటి ఓటర్లను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని సత్యనారాయణపురానికి చెందిన వీరిశెట్టి విజయలక్ష్మి తండ్రి పేరు సాంబశివరావు, ఇంటినెంబరు 4-300-1గా ఓటు ఉంది. అదే పేరుతో వీరిశెట్టి విజయలక్ష్మి, భర్త పేరు సాంబశివరావు, ఇంటి నెంబరు 4-300 (1)గా మరో ఓటు ఉంది. ఇలాంటి తప్పులు ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో కోకొల్లలుగా ఉన్నాయని టిడిపి నేతలు సాక్ష్యాధారాలతో ఒంగోలు ఆర్‌డిఒకు నివేదిక సమర్పించారు. ఆర్‌డిఒను కలిసిన వారిలో జిల్లా టిడిపి నేతలు టి మస్తాన్‌రావు, కె వెంకటేశ్వర్లు, బి వాసుకృష్ణ, చినయోగయ్య తదితరులు ఉన్నారు. మొత్తంమీద ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో దొంగ ఓటర్లపై ఎన్నికల కమిషన్ స్పందిస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది.

టి-బిల్లు ప్రతులు దగ్ధం
జాతీయ రహదారిపై
వైకాపా రాస్తారాకో
ఒంగోలు, డిసెంబర్ 16: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపించిన తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతవౌతున్నాయి. సోమవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లాపార్టీ కార్యాలయం దగ్గర తెలంగాణ బిల్లు ప్రతులను చించి కాల్చివేశారు. ఈసందర్భంగా వైకాపా నాయకులు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఉద్యమం దీర్ఘకాలంగా ఉద్ధృతంగా జరుగుతున్నప్పటికీ కిరణ్ ప్రభుత్వం నేరుగా అసెంబ్లీకి టి-బిల్లును పంపటం దారుణమన్నారు. సమైక్యాంధ్ర కోసం తీర్మానం చేయాల్సి ఉండగా తెలంగాణ బిల్లుకు అనుకూలంగా కేంద్రం వ్యహరించటం బాధాకరమన్నారు. అదేవిధంగా సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో టి బిల్లును వ్యతిరేకిస్తూ ఐదవ నెంబరు జాతీయ రహదారిపై రాస్తారాకో నిర్వహించారు. స్ధానిక లాయర్‌పేటలోని ప్రకాశం పంతులు విగ్రహం వద్ద నుండి విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి ఐదవ నెంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈకార్యక్రమంలో విద్యార్థి జెఎసి రాష్ట్ర కోకన్వీనర్ రాయపాటి జగదీష్ మాట్లాడుతూ అసెంబ్లీలో టి-బిల్లును సీమాంధ్ర ప్రాంతానికి చెందిన శాసనసభ్యులందరూ వ్యతిరేకించాలని కోరారు. బిఎసి సమావేశంలో టి బిల్లుపై చర్చ లేకపోయినా కావాలని దిగ్జీరాజా ఇచ్చిన సొమ్ముతో సమైక్యాంధ్ర చాంపియన్ అయిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జ్వరం సాకుతో, సీమాంధ్ర ద్రోహి అయిన స్పీకర్ నాదెండ్ల మనోహర్ సీమాంధ్ర ప్రజలను మోసం చేసి టి బిల్లును అసెంబ్లీలో పెట్టి సీమాంధ్ర ప్రజల గొంతు కోశారన్నారు. ఆయా కార్యక్రమాల్లో వైకాపా ఒంగోలు నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, జిల్లా ఎస్‌సి సెల్ కన్వీనర్ కంచర్ల సుధాకర్, బిసి సెల్ కన్వీనర్ కఠారి శంకర్, జిల్లాపార్టీ అధికార ప్రతినిధి కఠారి రామచంద్రరావు, సమైక్యాంధ్ర రాష్ట్ర విద్యార్ధి జెఎసి జిల్లా యువజన కన్వీనర్ కన్నా వరప్రసాదు, నగర కన్వీనర్ ఎ ఉదయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఆపాలి
ఒంగోలులో ఆటోల బంద్ సంపూర్ణం
ఒంగోలు, డిసెంబర్ 16: ఆటో కార్మికులను ట్రాఫిక్ పోలీసులు వేధించడం మానుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఆటో కార్మికులపై ట్రాఫిక్ పోలీసులు విధిస్తున్న అధిక జరిమానాలు, వేధింపులకు వ్యతిరేకంగా ఎపి ఆటో అండ్ ట్రాలీ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలు నగరంలో ఆటోల బంద్ సంపూర్ణంగా జరిగింది. ఆటోడ్రైవర్‌లు స్వచ్ఛందంగా ఆటోలు నిలిపివేసి కొత్త మార్కెట్ వద్ద సిఐటియు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ భారీ సభ జరిగింది. ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, సిఐటియు నగర ఉపాధ్యక్షులు జివి కొండారెడ్డి, నగర కార్యదర్శి బి వెంకట్రావు, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎండి బేగ్‌లు మాట్లాడారు. నగరంలో ట్రాఫిక్ సిఐ ప్రతి ఆటోకు ప్రతిసారి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. అధిక జరిమానాలు భరించలేక కార్మికులు అర్థాకలితో అలమటిస్తున్నట్లు తెలిపారు. హోంగార్డులు కార్మికులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ట్రాఫిక్ సిఐ ఉద్దేశపూర్వకంగా ఆటోస్టాండ్లు ఏర్పాటు కాకుండా తన కార్యాలయంలోనే ఫైళ్ళను తొక్కిపెట్టారని మండిపడ్డారు. యూనియన్ పలుమార్లు విన్నవించినప్పటికీ జాయింట్ మీటింగ్ ఏర్పాటుచేసి సామరస్యంగా సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోకపోగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నట్లు ధ్వజమెత్తారు. ఒంగోలు వన్ టౌన్, తాలూకా సిఐలు బిటి నాయక్, ఐ శ్రీనివాసన్‌లు సభ దగ్గరకు వచ్చి ఛలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ విరమించుకొని డిఎస్‌పి చర్చలకు ఆహ్వానించారని తద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పడంతో సిఐటియు నాయకత్వం అందుకు అంగీకరించింది. దీంతో ఆటో కార్మికులు భారీ ప్రదర్శనతో కర్నూల్ రోడ్డు, అద్దంకి బస్టాండ్, పాత మార్కెట్, ట్రంకురోడ్డు సెంటర్ మీదుగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ప్రదర్శనకు ఆటో వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షుడు డి వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంగరాల శ్రీనివాసరావు, కార్యదర్శి తంబి శ్రీనివాసులు, కోశాధికారి ఎ కోటేశ్వరరావు, డి పృద్వీరాజ్, సత్యానందం, రమణారెడ్డి, హనుమంతరావు, ఎస్‌కె సిలార్‌బాబు, కె శ్రీనివాస్ చౌదరి, సిహెచ్ శ్రీనివాసరావు, తోట శ్రీను, కుమార్‌లు నాయకత్వం వహించారు. అనంతరం సిఐటియు నగర అధ్యక్షులు దామా శ్రీనివాసులు, నాయకులు ఎస్‌డి హుస్సేన్, జి బాలకృష్ణ, కెఎఫ్ బాబు, ఎ శ్రీనివాసరావులతో కూడిన ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం ఒంగోలు డిఎస్‌పి చాంబర్‌లో చర్చలు జరిగాయి. ఒంగోలు డిఎస్‌పి జాషువా, వన్ టౌన్ సిఐ బిటి నాయక్, తాలూకా సిఐ శ్రీనివాసన్, ఎంపి మాగుంట ప్రతినిధులు అయినాబత్తిన ఘనశ్యామ్, మంత్రి శ్రీనివాసరావు, గొర్రెపాటి శ్రీనివాసరావు, సిఐటియు నాయకులు జివి కొండారెడ్డి, బి వెంకట్రావు, చీకటి శ్రీనివాసరావు, రావూరి శ్రీనివాసరావు, పాపని సుబ్బారావు, ఆటో యూనియన్ స్టాండ్ వారి ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఇరువురు ఐదు అంశాలపై ఒక అంగీకారానికి వచ్చారు. ట్రాఫిక్ అడ్వయిజరీ కమిటీని ఏర్పాటుచేసి క్షేత్రస్థాయి పరిశీలన చేసి త్వరలో ఆటోస్టాండ్లను ఏర్పాటు చేస్తామని, అధిక జరిమానాల విధానం రద్దు చేస్తామని, హోంగార్డుల ఆడగాలను నివారిస్తామని, పర్మినెంట్ పోలీస్ నెంబర్లు ఇస్తామని, ఒంగోలులో ఇచ్చే నెంబర్లు శింగరాయకొండ, కొండేపి, జరుగుమల్లి, చీమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు, ఎన్‌జి పాడు, కొత్తపట్నం మండలాలకు కూడా పోలీస్ నెంబర్లు వర్తిస్తాయని హామీ ఇచ్చారు. డ్రైవర్ పక్కన ఒక ప్యాసింజర్‌ను కూర్చోబెట్టుకునే అవకాశం కూడా ఇవ్వనున్నట్లు డిఎస్‌పి వెల్లడించారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సంపూర్ణంగా ఆటోల బంద్ జరగడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

ధర్మవరపు మృతి కళాకారులకు తీరని లోటు
నల్లూరి ఘన నివాళి
ఒంగోలు, డిసెంబర్ 16 : ప్రఖ్యాత సినీ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరణం కళాకారులకు తీరని లోటని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు ( అన్న) అన్నారు. సోమవారం రాత్రి స్థానిక సివిఎన్ రీడింగ్ రూము హాలులో నల్లూరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన సినీ హాస్యనటుడు నవ్వులరేడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాకు చెందిన ధర్మవరపు దూరదర్శన్‌లో మొదటి తెలుగు సీరియల్స్ అయిన ఆనందోబ్రహ్మ, అనగనగా ఒక శోభ అనే కార్యక్రమాలను ప్రారంభించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారని కొనియాడారు. ఒంగోలులోని సిఎస్‌ఆర్ శర్మా కాలేజీలో చదువుతూ అనేక నాటికలలో ప్రదర్శించి మంచి పేరు ప్రతిష్టలు పొందినట్లు తెలిపారు. ఆ తరువాత సినీ రంగంలో కూడా ప్రవేశించి 589 సినిమాల్లో నటించి ప్రేక్షకులను తన నటనతో అలరింప చేశారని ప్రశంసించారు. అలాంటి ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరణించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆయన మృతికి ఘన నివాళులు అర్పిస్తూ కుటుంబానికి సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌టిఆర్ కళాపరిషత్ అద్యక్షుడు ఈదర హరిబాబు, కళాకారులు ఎస్ సుబ్బారావు, మిడసల మల్లికార్జున్, పివిఆర్ చౌదరి, అంగలకుర్తి ప్రసాద్, ఎస్‌కె సబ్‌దర్, ఎల్ శంకర్, కెవి సుబ్బారావు, దాసయ్య, వీరాస్వామి, చిట్టా శివప్రసాద్, రాజశేఖర్, రాఘవులు, గాండ్ల శ్రీను తదితరులు పాల్గొని ధర్మవరపు నటనను, మంచితనాన్ని ప్రస్తుతించారు.

చెరువులోపడి ఒకరు మృతి
కంభం, డిసెంబర్ 16: కంభం చెరువుకట్టపై తేరాతేజ్ పండుగ నిర్వహిస్తుండగా అది చూసేందుకు చిన్నకంభంకు చెందిన బిటెక్ విద్యార్థి ఎ హరిబాబు (21) వెళ్ళి ఈత కొడుతూ మృతి చెందాడు. కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని స్నేహితులు తెలిపారు. విషయం తెలుసుకున్న తండ్రి వెంకటేశ్వర్లు సృహతప్పిపోయాడు. అతనిని వెంటనే 108 ద్వారా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హరిబాబు మృతదేహాం కోసం చెరువులో గాలిస్తున్నారు.

ఆత్మహత్యలకు నెలవు కంభం చెరువు
* నిత్యం మృతి చెందుతున్న యువకులు
* భద్రత లేకపోవడమే కారణమా..?
మార్కాపురం, డిసెంబర్ 16: ఆసియాఖండంలోనే అత్యంత పెద్దచెరువుగా ప్రఖ్యాతిగాంచిన కంభం చెరువు ఆత్మహత్యలకు నిలయంగా మారింది. గత కొనే్నళ్ళుగా విద్యార్థులు, యువకులు, మహిళలు ఈ చెరువులోదూకి ఆత్మహత్యలు చేసుకోవడంతో కంభం చెరువు ఆత్మహత్యలకు నెలవుగా ప్రసిద్ధికెక్కింది. గతంలో ఒక వివాహిత యువతి కుటుంబ కలహాలతో కలతచెంది ఈ చెరువులోదూకి ఆత్మహత్య చేసుకోగా, మరోయువతి ప్రేమ విఫలమై కంభంచెరువులోని నీటి పరిణామం తెలుసుకునే వంతెనపై సూసైడ్ నోట్‌రాసిపెట్టి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇలా సంవత్సరంలో 10కిమించి ఆత్మహత్యలు ఈచెరువులో జరుగుతున్నాయి. మొన్నటికిమొన్న ఓ ఇంటర్ విద్యార్థిని పరీక్షలు తప్పుతాననే భయంతో చెరువులోదూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో సంచలనం సృష్టించింది. ఈ సంఘటన మరువకముందే చిన్నకంభంకు చెందిన యువకుడు గరికతొక్కుడు (తేరాతేజ్) పండుగ చూసేందుకు వెళ్ళి ఈత కొడుతూ మృత్యువాత పడ్డాడు. శ్రీకృష్ణదేవరాయల సమయంలో నిర్మించిన చెరువు రైతులకు సాగునీరు అందించేందుకు ప్రకృతి సోయగాల మధ్యఉంది. ఈప్రాంతప్రజలు సేదతీర్చుకోవాలంటే ఎలాంటి ఉద్యానవనాలు లేకపోవడంతో ఈ చెరువును సందర్శించి ఆనందం పొందుతారు. ఈ చెరువు మండలం చుట్టుపక్కల గ్రామాలకు సాగు, తాగునీరు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలాంటి ఈ చెరువులో చేపల పెంపకందారులు చేపలను వదిలి పెంచుతారు. చేపల పెంపకందారుల మధ్య గతంలో ఒకసారి వివాదాలు ఏర్పడటంతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ చెరువునీటిని విషపూరితం చేసి చేపలను చంపారు. ఈ పరిస్థితుల్లో ఈచెరువు సూసైడ్ పాయింట్‌గా మారడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా నీటిపారుదలశాఖ అధికారులు ఈప్రాంతంలో కాపాలా ఏర్పాటు చేసి ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

అటవీశాఖ అధికారులకు ఆయుధాలు మంజూరు చేయాలి
* ఎపి జూనియర్ ఫారెస్టుఅసోసియేషన్ డిమాండ్
మార్కాపురం టౌన్, డిసెంబర్ 16: అటవీశాఖ సిబ్బందికి ప్రభుత్వం ఆయుధాలను మంజూరుచేసి విధినిర్వహణకు పంపాలని ఎపి జూనియర్ ఫారెస్టు అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ టి చిరంజీవి అన్నారు. స్థానిక అటవీశాఖ కార్యాలయంలో సోమవారం జరిగిన అటవీఅధికారుల సంతాపసభలో ఆయన మాట్లాడారు. శేషాచలం కొండల్లోని అటవీప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్ల చేతుల్లో అతిదారుణంగా హత్యకాబడిన అటవీశాఖ అధికారులు శ్రీధర్, ఉపఅటవీక్షేత్ర అధికారి డేవిడ్‌కరుణాకర్‌లను చంపడం హేయమైన చర్య అన్నారు. అధికారులు నిరాయుధులు కావడంతో దుంగడులు దుశ్చర్యలకు పాల్పడ్డారని, ప్రభుత్వం అధికారులకు ఆయుధాలను మంజూరుచేసి కనపడితే కాల్చివేత ఉత్తర్వులను అమలుచేస్తేకానీ అడవిదొంగల ఆటలు అరికట్టలేమని అన్నారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స చేయించాలని, కిడ్నాప్‌కు గురైన వారిని సురక్షితంగా కాపాడాలని కోరారు. బేస్‌క్యాంప్‌ల పహారీని మరింతగా ప్రతిష్టపరచి అటవీజంతువుల అభివృద్ధికి కృషి చేయాలని, అంతరించిపోతున్న వృక్షాలను కాపాడేందుకు ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిన స్పీకర్
* తండ్రిని తలపించేవిధంగా వ్యవహరించడం అన్యాయం
మార్కాపురం, డిసెంబర్ 16: రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడం అన్యాయమని జిల్లాటిడిపి అధికారప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం అన్నారు. సోమవారం శాసనసభలో జరిగిన తీరుపై ఆయన మాట్లాడుతూ ఆనాడు ఎన్టీ రామారావు ఇతరదేశాలకు వెళ్ళిన సమయంలో స్పీకర్ తండ్రి నాదెండ్ల భాస్కర్‌రావు అక్రమమార్గంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనిచేసి అధికారం చేజిక్కించుకున్నారని అన్నారు. ప్రస్తుతం శాసనసభ స్పీకర్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారని అన్నారు. శాసనసభలో సీమాంధ్ర ఎమ్మెల్యేలకు కనీస సమాచారం లేకుండా బిల్లును ప్రవేశపెట్టడం అన్యాయమని అన్నారు. అలాగే శాసనసభ నాయకులు ముఖ్యమంత్రి సభలో లేని సమయంలో ఇలాంటి కీలకమైన బిల్లును శాసనసభలో తీసుకురావడం అన్యాయమని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఒకవైపు బిఎసిలో చర్చించి సభకు బిల్లు తీసుకురావడం జరుగుతుందని చెప్పినప్పటికీ ఆయన మాటలుకూడా కాదని ఎలా బిల్లు ప్రవేశపెట్టారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఆనాడు ఆయన తండ్రి నాదెండ్ల భాస్కరరావుకు ప్రజలు ఏవిధమైన గుణపాఠం చెప్పారో స్పీకర్‌కు అదే గుణపాఠం చెబుతారని అన్నారు. తెలుగుదేశంపార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, కేవలం యుపిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానంపైనే తాము వ్యతిరేకిస్తున్నామని, బిల్లుపై చర్చ జరిగేవిషయంలో కూడా ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేయడం ఖాయమని అన్నారు.

అమలు కాని భూపంపిణీ
పేదలకు పట్టాలు ఇవ్వాలి
సిఎస్‌పురం, డిసెంబర్ 16: ప్రభుత్వం ఆర్భాటంగా విడతల వారీగా భూములు పంపిణీ చేస్తున్నరే తప్ప లబ్ధిదారులకు భూములు పంపిణీ చేయడంలేదని, ఇదంతా ఒక బూటకం అని ఏపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్రావు విమర్శించారు. సిపిఐ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్రావు మాట్లాడుతూ మూడవ విడత భూ పంపిణీలో భాగంగా పెదరాజుపాలెం, నల్లమడుగుల గ్రామాలలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను అస్సైన్డ్‌మెంట్ కమిటీలో ఆమోదించినప్పటికి నేటికి వారికి భూపంపిణీ చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని తెలిపారు. అధికారుల చుట్టూ పలుసార్లు లబ్ధిదారులు తిరిగినా పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. అర్హులైన పేదలకు భూమి పట్టాలు, నివేశన స్థల పట్టాలు ఇవ్వాలని కోరారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని, ఆపథకాలు ఎస్సీ,ఎస్టీలకు దక్కడం లేదన్నారు. పేదల ప్రయోజనాలను కాపాడడంలో యుపిఎ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అందుకు నిదర్శనం నిన్న నాలుగు రాష్ట్రాలలో వచ్చిన ఫలితాలే అని ఆయన విమర్శించారు. పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ సిహెచ్ నాగభూషణానికి అందజేశారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్‌డి వౌలాలి, గిరిజన సమైక్య జిల్లా కన్వీనర్ శ్రీరామ్ శ్రీనివాసులు, సిపిఐ మండల కార్యదర్శి ఎస్‌కెవై పెదమస్తాన్, ఎం వెంకటకొండయ్య, బాలగురువయ్య, ఏసోబు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా కాశినాయన ఆరాధన
కనిగిరి, డిసెంబర్ 16: స్థానిక కొత్తపేటలో వెలసిన శ్రీ్భగవాన్ కాశినాయన ఆరాధనోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ ఉత్సవాలలో వేలాది మంది భక్తులు పాల్గొని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆరాధనోత్సవాలలో భాగంగా గుడిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు సుబ్బారావు అధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాశినాయన ఆరాధన పూజాలను ముక్కు కాశిరెడ్డి, అదిలక్ష్మమ్మ దంపతులు నిర్వహించాగా, పులి శ్రీవాసులురెడ్డి విజయలక్ష్మి స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు రాజాల ఆదిరెడ్డి అధ్వర్యంలో నెల్లూరు సాయిబాబ అర్కెస్ట్రా పాటకచ్చేరి నిర్వహించారు. కాగా వేలాదిమంది భక్తులకు అన్నదానం కార్యక్రమానికి హాజరయ్యారు. ఆరాధనోత్సవాలను ఆలయ కమిటీ వర్క్‌ంగ్ ప్రెసిడెంట్ వెన్న శ్రీనివాసరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ముక్కు శ్రీహరిరెడ్డి, సుబ్బరెడ్డి, కత్తులపల్లి భాస్కరరెడ్డి, బి మాలకోండయ్య, తోకల తిరుపతిరావు అరాధనా మహోత్సవాన్ని పర్వవేక్షంచి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూశారు.

‘అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి’
కందుకూరు రూరల్, డిసెంబర్ 16: కార్మికులను పక్కదారి పట్టించేందుకు చేస్తున్న అసత్య ప్రచారాలను యూనియన్ కార్మికులు తిప్పి కొట్టాలని ఎంప్లాయిస్ యూనియన్ స్థానిక డిపో కార్యదర్శి పి రామ్మూర్తి అన్నారు. సోమవారం స్థానిక ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం సమీపంలో ఆర్టీసీలో కాంట్రాక్టు పద్దతి ద్వారా విధులు నిర్వహిస్తున్న కార్మికులను కొనసాగించాలని ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర సమితి ఇచ్చి పిలుపు మేరకు కార్మికులు నిరాహార దీక్ష నిర్వహించారు. ఈదీక్షా శిబిరాన్ని సందర్శించి రామ్మూర్తి మాట్లాడుతూ ఎంప్లాయిస్ యూనియన్ ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్న విధంగా 24వేల మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని యాజమాన్యంతో పలు దఫాలుగా చర్చించామన్నారు. అందులో భాగంగా గత నెల 25న రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో యూనియన్ రాష్ట్ర నాయకులు చర్చించారని ఆయన అన్నారు. అయితే కొన్ని యూనియన్లు యాజమాన్యం కార్మికులకు అన్యాయం చేస్తుందని ధర్నాలకు పిలుపునిచ్చి విరమించారని అన్నారు. అయితే కార్మిక సంక్షేమమే లక్ష్యంగా గల ఎంప్లాయిస్ యూనియన్ మరలా యాజమాన్యంతో చర్చించి కార్మికుల సమస్యల పరిష్కారానికి హామీ తీసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికైనా కార్మికుల పక్షాన నిరంతరం పోరాడే ఎంప్లాయిస్ యూనియన్‌పై అసత్య ప్రచారాలు చేస్తే కార్మికులే గుణపాఠం చెబుతారన్నారు. దీక్షా శిబిరంలో ఆర్టీసీ కార్మికులు ఎంఎన్ రావు, పిసిహెచ్ నరసింహారావు, ఎం నరసింహారావు, కె శ్రీనివాసులు, జి హరిబాబు కూర్చున్నారు. ఈకార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ మాజీ నాయకులు డిపి రంగయ్య, నాయకులు గోళ్ళ మాధవరావు, రాజు, శివయ్య, ఆదినారాయణ, బాబు, నరసింహారావు, కార్మికులు పాల్గొన్నారు.

టిడిపి నేతల ఆరోపణ * రేపు ఎన్నికల ప్రధానాధికారిని కలవనున్న దామచర్ల
english title: 
donga votlu

జివిఎంసిలో కుదుపు

$
0
0

విశాఖపట్నం, డిసెంబర్ 16: గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థలో ప్రక్షాళన ప్రారంభమైంది. సుదీర్ఘ కాలంగా ఒకే సీటులో పాతుకుపోయి, చేతికందినంత దండుకుంటూ కోట్లు కూడబెట్టిన వారిని, వారికి ఇతోధికంగా సహాయం చేస్తున్న వారిని, ఎడా పెడా బదిలీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వివిధ శాఖల నుంచి కావాలని జివిఎంసిలో డిప్యుటేషన్ వస్తుంటారు. లక్షలు ఖర్చు చేసి ఇక్కడి పోస్ట్‌లను కొనుక్కుంటుంటారు. వారు పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకోవడమే కాకుండా, జివిఎంసిలో ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఆలోచన వారిలో బలంగా పాతుకుపోతుంది. దీంతో బల్ల కిందే కాదు, ఎక్కడపడితే అక్కడ చేయి చాచి, డబ్బులు దండుకుంటున్నారు. ఈ పాపాన్ని జివిఎంసి ఉన్నతాధికారులకు కూడా కాస్తంత అంటించి, సుదీర్ఘం కాలం ఆయా సీట్లలోనే పాతుకుపోయి, సంపాదన అంటే వెగటుపుట్టేంతగా సంపాదించుకుంటున్నారు. ఎంత మంది కమిషనర్లు వచ్చినా, వీరిని ఆయా సీట్ల నుంచి కదపడం సాధ్యం కాకుండాపోయింది. అప్పుడప్పుడు ఎసిబి అధికారులు వందలు..వేలు లంచం తీసుకునే చిరు ఉద్యోగులను వలలో వేసుకుని పట్టుకుపోతున్నారు. కానీ ఇక్కడ లక్షలకు లక్షలు దిగమింగుతున్న వారిని ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు. ఒకవేళ ఆయా సీట్ల నుంచి వీరిని కదపాలనకున్నా, ఉత్తర్వులు రాక మునుపే, రాజకీయ సిఫార్స్‌లు వచ్చేస్తున్నాయి. దీంతో కమిషనర్ కూడా ఏమీ చేయలేని దుస్థితికి చేరుకున్నారు.
తాజాగా జివిఎంసిలో అన్ని విభాగాల్లోని ఉద్యోగులను బదిలీ చేయడానికి ప్రస్తుత కమిషనర్ సత్యనారాయణ శ్రీకారం చుట్టారు. చాలా కాలంగా ఒకే సీటులో పాతుకుపోయిన ఉద్యోగులను బదిలీ చేస్తున్నారు. కమిషనర్ పేషీలో ఉన్న ఔట్ సోర్సింగ్ సిబ్బందితో సహా సుమారు 120 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని బదిలీ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. అలాగే శాశ్వత ఉద్యోగులను కూడా వదిలిపెట్టడం లేదు. వారికి కూడా స్థాన చలనం కల్పిస్తున్నారు. దీంతో జివిఎంసి ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. చాలా కాలంగా కడుపులో చల్ల కదలకుండా కూర్చుని పనిచేసుకుంటూ, సాయంత్రానికి జేబులు నింపుకొంటూ వెళ్ళే వాళ్లంతా లబోదిబోమంటున్నారు. బదిలీ విషయం తెలుసుకున్న సదరు సిబ్బంది అంతా, రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నారు.
జివిఎంసిలో ఇటీవల ఓ అధికారి ఎసిబికి దొరికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి భరతం పట్టడమే కాకుండా, కార్పొరేషన్ పరువు ప్రతిష్ఠలను కాస్తంతైనా కాపాడాలన్న ఉద్దేశంతో కమిషనర్ తీసుకుంటున్న చర్యలు ఏమేరకు ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాలి.

22,23 తేదీల్లో జివిఎంసి బడ్జెట్ సమావేశాలు
* రేపటికి బడ్జెట్ సిద్ధం
విశాఖపట్నం, డిసెంబర్ 16: జివిఎంసి బడ్జెట్ సమావేశాలను ఈనెల 22, 23 తేదీల్లో నిర్వహించనున్నట్టు కమిషనర్ సత్యనారాయణ తెలియచేశారు. సోమవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ బడ్జెట్‌ను బుధవారం నాటికి సిద్ధం చేస్తామని తెలిపారు. జివిఎంసి స్పెషల్ ఆఫీసర్ జోషి 22, 23 తేదీల్లో విశాఖలోనే ఉంటారని కమిషనర్ వెల్లడించారు.

అమ్మహస్తం పథకానికి జిసిసి చింతపండు సిద్ధం
* ఈ సారి ఐదు జిల్లాలకు సరఫరా
విశాఖపట్నం, డిసెంబర్ 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అమ్మహస్తం పథకానికి అవసరమైన చింతపండును అందించేందుకు గిరిజన సహకార సంస్థ (జిసిసి) సిద్ధపడుతోంది. ఇందుకు సంబంధించి గతంలోనే కుదిరిన అంగీకారం మేరకు తొలుత రెండు జిల్లాలకే చింతపండు అందించేందుకు అంగీకరించిన జిసిసి ఇపుడు ఐదు జిల్లాలకు దీనిని అందివ్వాలని నిర్ణయించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చింతపండు ప్యాకెట్లను అందజేస్తోంది. వీటిని ఆయా జిల్లాల పౌరసరఫరాల విభాగాలకు అందజేస్తుంది. ఐదు జిల్లాలకు సంబంధించి పూర్తిస్థాయిలో ప్రభుత్వం కోరిన నాణ్యతతో కూడిన చింతపండును అందివ్వగలిగితే ఆ తరువాత దశలవారీగా మరికొన్ని జిల్లాలకు విస్తరించే యోచనలో ఉంది. ఇప్పటికే విశాఖ జిల్లా పాడేరు, విజయనగరం జిల్లాలో పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట, చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రాంతాల నుంచి చింతపండును పెద్ద మొత్తంలో జిసిసి సేకరించగలుగుతోంది. ఈ తరహాలో సేకరించిన చింతపండును పిక్కతీసి, ప్యాకెట్ల రూపంలో మార్పు చేసేందుకు గిరిజన మహిళా సంక్షేమ సంఘాలకు జిసిసి అవకాశం కల్పిస్తోంది. దీనివల్ల గిరిజన మహిళ ప్రోత్సహించి ఉపాధి కల్పించవచ్చని సంస్థ భావిస్తోంది. లాభ, నష్టాలు లేని పద్ధతిలో చింతపండును అమ్మహస్తం పథకాన్ని అందిస్తున్న జిసిసి ఈ పథకంలో భాగమైన కారం, పసుపు, పప్పులు వంటివి సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ విధంగా ప్రతి ఏడాది 250 కోట్ల రూపాయల మేర సాధిస్తున్న ఆదాయాన్ని 300 కోట్లకు పెంచే విధంగా సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

తీరప్రాంత పరిరిక్షణ అందరి బాధ్యత
విశాలాక్షిగనర్, డిసెంబర్ 16: సాంప్రదాయ వనరుల వెలకితీతకు కీలకంగా ఉన్న తీరప్రాంతాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైన ఉందని ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్-్ఛన్సలర్ ఆచార్య జిఎస్‌ఎన్ రాజు అన్నారు. సోమవారం ఏయు డెల్టా స్టడీస్ ఇనిస్టిట్యూట్ విభాగం వద్ద ఓఎన్‌జిసి సహకారంతో డెల్టా స్టడీస్ విభాగం మోడర్నన్ డెల్టా - ఏ ఫీల్ట్ అనే అంశంపై సదస్సు, శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్, గ్యాస్, వెలికితీతకు గోదావరి, కృష్ణా, డెల్టా నదీ పరివాహక ప్రాంతాలు దేశంలోనే ప్రసిద్దిగాంచాయన్నారు. ఇది వ్యవసాయానికే కాకుండా రసాయనక అవసరాలు వెలికితీయడానికి అవసరం అవుతుందన్నారు. వనరులు వెలికితీసే క్రమంలో పర్యావరణ కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. అనంతరం ఓఎన్‌జిసి డిజిఎం జనరల్ ఎస్‌కె మహంతి మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధితో డెల్టా ప్రాంతం ముడిపడి ఉందన్నారు. అయితే ఈ డెల్టా ప్రాంతంలో ఇక్కడ వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందన్నారు. వ్యవసాయం, వనరుల వెలికితీత సమన్వయంతో ఓఎన్‌జిసి వ్యవహరిస్తోందన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు డెల్టా స్టడీస్‌పై అధ్యయనం చేస్తారు. దీనికి ఓఎన్‌జిసి శిక్షణిస్తారని డెల్టా స్టడీస్ ఇనిస్టిట్యూట్ కోర్సు డైరెక్టర్ ప్రొఫెసర్ కె.సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఏయు కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.జ్ఞానమణి, డిఎస్‌ఐ డైరెక్టర్ ప్రొగ్రామ్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎం.జగనాధరావు, టీచింగ్ అసోసియేషట్ నుంచి డాక్టర్ టి.కరుణకరుడు, విద్యార్థులు, పరిశోధకులు, ఆచార్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డెల్టా స్టడీస్‌కు చెందిన సావనీర్‌ను ఆవిష్కరించారు.

వైభవంగా ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలు
సింహాచలం, డిసెంబర్ 16 : శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు దేవాలయంలో దర్శనాలు నిలిపివేశారు. సూర్యభగవానుడు ధనూరాశిలో ప్రవేశించిన శుభ ఘడయలలో ఆగమ శాస్త్రానుసారం దేవాలయంలో వైదికాదికాలు నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభానికి ప్రతీకగా నెలగంట మోగించారు. గోదాదేవి సన్నిధిలో తిరుప్పావై తొలి పాశురాన్ని వైదికులు శాస్త్రోక్తంగా విన్నపం చేశారు. ఉత్సవ మూర్తులను ఆస్థాన మండపంలో వేంచింపజేసి సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. వేద పారాయణలు నిర్వహించారు. గోదాదేవిని పల్లకిలో వేంచింపజేసి బేడా మండపంలో తిరువీధి నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చక పురోహితుడు మోర్త సీతారామాచార్యులు ధనుర్మాస విశిష్టతను వివరించారు. గోదాదేవి వైభవ వైశిష్ట్యమే తిరుప్పావై అని తెలిపారు. శ్రీరంగనాథుడిని పొందడం కోసం గోదాదేవి నెలరోజుల పాటు ఆచరించి చూపినదే మార్గశిర వ్రతమని వివరించారు. శ్రీ రంగనాథుడిపై ముప్ఫై పాశురాలను స్వయంగా రాసి పారాయణ చేయడం జరిగిందని, వాటినే ఆలయాలలో ప్రతిరోజూ పారాయణ చేస్తామని ఆయన తెలిపారు. జనవరి 14న బోగి పండగ రోజుల గోదా శ్రీరంగనాథుల కల్యాణంతో ధనుర్మాస వ్రతం పూర్తి అవుతుందని ఆయన తెలిపారు.

మన్యంలో ప్రతి గ్రామానికి రోడ్డు
ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వినయ్‌చంద్
పాడేరు, డిసెంబర్ 16: విశాఖ మన్యంలో ప్రతి గ్రామానికి రహదారిని నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్ తెలిపారు. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఏజెన్సీలో ప్రస్తుతం ఉన్న రహదారి సదుపాయాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాలకు రహదారుల నిర్మాణంతోనే అభివృద్ధిని వేగవంతం చేయవచ్చునని అన్నారు. ఏజెన్సీ పదకొండు మండలాల్లో ప్రస్తుతం రహదారి లేని గ్రామాలను ఇంజనీరింగ్ అధికారులు తక్షణమే గుర్తించి ఆయా గ్రామాలకు రోడ్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. మన్యంలోని పదకొండు మండలాల పరిధిలో గల 244 పంచాయతీలలో చిట్టచివరి గ్రామానికి సైతం అంబులెన్స్ వెళ్లే విధంగా రహదారులు నిర్మించేందుకు మ్యాప్‌లతో సహా ప్రతిపాదనలు తయారు చేయాలని ఆయన సూచించారు. ఇందుకుగాను డివిజన్ స్థాయి ఇంజనీరింగ్ అధికారుల నేతృత్వంలో ఇంజనీరింగ్ అధికారులు స్వయంగా ప్రతి గ్రామాన్ని సందర్శించి పది రోజులలోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసేటప్పుడు స్థల సమస్య, అటవీ శాఖ అడ్డంకులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. రోడ్ల నిర్మాణం ఎక్కడ చేపడితే గిరిజనులకు ప్రయోజనం ఉంటుందో గిరిజనులకు అవగాహన ఉండాలని ఆయన అన్నారు. అందుబాటులో ఉన్న నిధులను బట్టి ఏజెన్సీలో ఫ్రతి గిరిజన గ్రామానికి రహదారిని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆదిమజాతి గిరిజన గ్రామాలకు రహదారుల నిర్మాణంలో ముందుగా ప్రాధాన్యత కల్పిస్తామని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథక ప్రయోజనాలను ప్రతి గ్రామానికి వర్తింప చేయాలని ఆయన ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు అంకితబావంతో పనిచేయాలని, అభివృద్ధి పనులలో ఒక్క రూపాయి వృధా చేసినా సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇంజనీరింగ్ అధికారులు ముందుగా అనుమతులు తీసుకోకుండా ఏజెన్సీ ప్రాంతాన్ని విడిచివెళ్లరాదని ఆయన ఆదేశించారు. ఏజెన్సీలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన బాధ్యత పర్యవేక్షక ఇంజనీర్లదేనని ఆయన చెప్పారు. గిరిజన ప్రాంతానికి నూతనంగా 22 అంబులెన్స్‌లు మంజూరైనట్టు ఆయన తెలిపారు. గిరిజనులకు అంబులెన్స్ సేవలు అందించాలని వినయ్‌చంద్ చెప్పారు. ఈ సమావేశంలో ఐ.టి.డి.ఎ. సహాయ ప్రాజెక్టు అధికారి పి.వి.ఎస్.నాయుడు, గిరిజన సంక్షేమ శాఖ పాడేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.ఆర్.జి.నాయుడు, ఏజెన్సీలోని పదకొండు మండలాల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

జిల్లాలో ఆరువేల కోట్ల రుణాలు లక్ష్యం
కోటవురట్ల, డిసెంబర్ 16: జిల్లాలో వివిధ బ్యాంకుల ద్వారా ఈ ఏడాది ఆరువేల కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయిచినట్లు జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ జయబాబు తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం బ్యాంకు మేనేజర్లు, ఎడీవోలు, వివిధ శాఖలకు చెందిన అధికారులతో రుణాలు మంజూరు, వసూళ్ళపై జయబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీప్‌లో 600 కోట్ల రూపాయల రుణాలు రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా 500 కోట్ల రూపాయలు అందజేసామన్నారు. రైతులకు లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఈవిషయాన్ని రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. బ్యాంకర్లు రుణ వసూళ్ళఫై దృష్టి సారించాలన్నారు. వసూళ్ళఫై ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని చేరే విధంగా కృషి చేయాలన్నారు. మొండి బకాయి దారులపై ఆర్. ఆర్.యాక్టును అమలు చేయాలన్నారు. సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు మాత్రమే వడ్డీ రాయితీ వర్తిస్తుందన్నారు. ఈవిషయాన్ని రైతులకు తెలియజేయాలన్నారు. రుణ వసూళ్ళలో బ్యాంకర్లకు అధికారులు సహకరించాలని కోరారు. ఈసమావేశంలో ఇన్‌చార్జ్ ఎడీవో చంద్రశేఖర్, స్థానిక ఎస్.బి. ఐ. బ్రాంచ్ మేనేజర విక్రమ్, ఫీల్డ్ ఆఫీసర్ నూర్‌భాషా , స్థానిక డి.సి.సి.బి. బ్రాంచ్ మేనేజర్ టి. శ్రీరామ్మూర్తి, పలువురు అధికారులు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.

కారు ఢీకొని రైతు మృతి
సబ్బవరం, డిసెంబర్ 16: మండలంలోని గొటి వాడ వద్ద సబ్బవరం - చోడవరం రోడ్డుపై సోమవారం ఉదయం 6 గంటలకు జరిగిన కారు ఢీ కొట్టిన ప్రమాదంలో పాల కేంద్రానికి పాలు తీసుకెళ్తున్న రైతు ఇరోతి రాములు(58) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈసంఘటనకు సంబంధించి స్ధానిక ఎస్‌ఐ జి.గోవిందరావు తెలిపిన వివరాలిలాఉన్నాయి. గొటివాడ కాలనీ కి చెందిన ఇరోతి శ్రీరాములు సోమవారం ఉదయానే్న పాలకేంద్రానికి సైకిల్‌పై పాలు తీసుకెళ్తున్న సమయంలో చోడవరం వైపు నుంచి అతివేగంగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీరాములు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే స్ధానికులు ఆతడిని ప్రాణం ఉందని సబ్బవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు సంఘటనా స్ధలంలోనే అతను మృతి చెందినట్లు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ తెలిపారు.
తేనె టీగల దాడి.. మృత దేహాన్ని వదిలి పరాయిన బంధువులు
ఇదిలా ఉండగా మండలంలోని గొటివాడ వద్ద కారు ఢీ కొట్టిన ప్రమాదంలో మృతి చెందిన ఇరోతి శ్రీరాముల మృత దేహాన్ని సబ్బవరం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బంధువులు సంఘటనా స్థలానికి తీసుకెళ్లి అక్కడ చింత చెట్లకింద ఉంచారు. అదే చెట్టుపై తేనె పట్టుకు ఉన్న తేనెటీగలు మృత దేహం వద్దకు చేరుకున్న బంధువులను చూసి ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో మృత దేహాన్ని వదిలి తమ ప్రాణాలు నిలుపుకునేందుకు పరుగులు తీశారు. అయితే మృత దేహాన్ని తీసుకెళ్లిన బంధువులు ఒక్కసారిగా పరుగులు తీయటం పట్ల విషయం అర్ధంకాని జనం అవాక్యయ్యారు. చివరికి విషయం తెలియటంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఐరన్ వ్యాపారులకు బురిడీ
రూ. 40 కోట్లతో పరారీ
* పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
గాజువాక, డిసెంబర్ 16: తమను మోసం చేసి సుమారు 40 కోట్ల రూపాయలతో ఇద్దరు ఐరన్ వ్యాపారులు పరారయ్యారని ఉక్కు తుక్కు వ్యాపారులు సోమవారం గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి బాధితులు, పోలీసులు అందించిన వివరాలిలావున్నాయి. విజయవాడ ప్రాంతానికి చెందిన వ్యాపారి, గాజువాక, ఆటోనగర్ ప్రాంతానికి చెందిన మరో వ్యాపారి బంధువులు. వీరిద్దరు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో సుమారు 60 మంది ఇనప తుక్కు వ్యాపారులు వద్ద పాత ఇనుమును కొనుగోలు చేసే వారు. కొనుగోలు చేసిన ఈ ఇనుమను ఇనప రాడ్లుగా తయారు చేసి విక్రయిస్తారు. దీంట్లో భాగంగా ఇనుప తుక్కు వ్యాపారులకు సుమారు 40కోట్ల రూపాయలు బకాయి పడినట్లు బాధితులు తెలిపారు. ఆరు నెలలు నుండి వ్యాపారులకు డబ్బు చెల్లించకుండా తిరుగుతున్నట్లు బాధితులు తెలిపారు. ఈ తరుణంలో విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దీంట్లో భాగంగా విశాఖపట్నం ప్రాంతానికి వ్యాపారి స్టీల్ పరిశ్రమ ముందు సోమవారం బాధితులు ఆందోళనకు దిగారు. ఈ తరుణంలో గాజువాక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వ్యాపారుల ఆచూకీ తెలియజేస్తే లక్ష రూపాయల బహుమతి ఇస్తామని బాధితులు ప్లకార్డులు ప్రదర్శించారు.

‘నష్టపరిహారం అందించాలి’
విశాఖపట్నం, డిసెంబర్ 16: ఇటీవల ఏర్పడిన పైలిన్ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన బాధిత కుటుంబాలు సోమవారం కలెక్టరేట్‌కు చేరుకున్నాయి. తుపాను బీభత్సంతో ఇళ్ళలోకి నీరు చేరి, కూలిపోవడం, మరికొన్ని దెబ్బతినడంతో నిలువ నీడ లేని పరిస్థితులు నెలకొన్నాయని మహిళలు ఆందోళన వ్యక్తంచేశారు. వైఎస్సార్‌సిపి నాయకుడు గోవింద్ నాయకత్వంలో యలమంచిలి అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీకి చెందిన దాదాపు వంద మంది మహిళలు, కుటుంబ సభ్యులు తరలి వచ్చారు. వీరంతా తమ గోడును కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్‌కు విన్నవించుకున్నారు. తుపాను కారణంగా ఆస్తులు కోల్పోయి, తీవ్రంగా నష్టపోయామని, దీనిని అంచనా వేసి తగిన ఆర్థిక సహాయాన్ని అందించాల్సిందిగా కోరారు.

* పీఠమేసుకున్న సిబ్బందికి స్థాన చలనం * అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే వారిపై కఠిన వైఖరి
english title: 
gvmc

‘ఫిర్యాదులపరిష్కారానికే ఎస్పీ గ్రీవెన్స్ సెల్’

$
0
0

విజయనగరం , డిసెంబర్ 16: స్థానిక పోలీస్‌స్టేషన్లలో బాధితులకు తగిన న్యాయం జరగని పక్షంలో ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్ సెల్ ద్వారా తగిన న్యాయం పొందవచ్చని జిల్లా ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్ సెల్‌లో ఎస్పీ ఇక్బాల్ పాల్గొని బాధితుల నుంచి స్వయంగా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా బాధితుల చేసిన ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ ఇక్బాల్ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. గంట్యాడ మండలం బురధపాడు గ్రామానికి చెందిన మహిళ తన వరిపంటను కొంతమంది లాక్కున్నారని ఫిర్యాదు చేశారు. కొమరాడ మండలం తొడుము గ్రామానికి చెందిన మహిళ తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు.

‘త్రుల్లో అవగాహనకే భూచేతన పథకం’
గజపతినగరం, డిసెంబర్ 16 : ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతు పట్ల రైతుల్లో అవగాహన కల్పించడానికి భూచేతన పథకాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ ఉప సంచాలకుడు కె.లక్ష్మణరావు చెప్పారు. మండలంలోని సీతారాంపురం గ్రామంలో సోమవారం జరిగిన రైతుల అవగాహన సదస్సులో సాగు పద్దతుల పట్ల వివరించారు. జిల్లాలోని గంట్యాడ, గజపతినగరం, పాచిపెంట మండలాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో 520 హెక్టార్లలో పంటలు సాగు చేస్తున్నట్లు చెప్పారు. రబీలో పప్పుదినుసుల రకాలకు చెందిన పెసర, మినుము, కొమ్ము శెనగలు, మొక్కజొన్న, పత్తిపంటల సాగులో అనుసరించాల్సిన మెళుకువల గురించి రైతులకు చేసి చూపిస్తున్నట్లు తెలిపారు. విత్తన శుద్ధితో శిలీంద్రం ద్వారా వ్యాపించే తెగుళ్లు నివారించ వచ్చని చెప్పారు. విచక్షణా రహితంగా సస్యరక్షణ మందులు రసాయనిక ఎరువులు వాడకం వలన భూమి నిస్సారం అయిపొతున్నట్లు చెప్పారు. రసాయనిక ఎరువులతోపాటు కంపోస్ట్, పచ్చి రోట్ట సేంద్రియ ఎరువులు అలాగే వృక్ష సంబంధిత సస్యరక్షణ మందులు వినియోగించాలని కోరారు. ఎడిఎ సిహెచ్ లచ్చన్న, ఏరువాక శాస్తవ్రేత్త పి.గురుమూర్తి, మండల వ్యవసాయ అధికారి టి.సంగీత, భూసార పరీక్షా కేంద్రం ఎడిఎ నాగభూషణరావు, ఎఇఓలు ఎం.సౌజన్య, ఎ.సతీష్ తదితరులు పాల్గొన్నారు.

కానిస్టేబుల్ ఆత్మహత్య
విజయనగరం, డిసెంబర్ 16 : ప్రేమ వైఫల్యం చెందడంతో మనస్తాపం చెందిన సివిల్ కానిస్టేబుల్ సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొమరాడ మండలం స్వామినాయుడువలస గ్రామానికి చెందిన పడాల కిశోర్‌కుమార్ (28), ప్రస్తుతం కోమరాడ పోలీసు స్టేషన్‌లో క్యాట్‌పార్టీలో పని చేస్తున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా ప్రేమ విఫలం కావడంతో మనస్తాపంతో ఉన్న అతను మక్కువ మండలంలో సివిల్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న తమ సహచరుడి వద్దకు వెళ్లాడు. అక్కడ తన సహచరుని గదిలో ఉంటూ సోమవారం పురుగు మందుతాగడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో కిశోర్‌కుమార్ మిత్రుడు జిల్లా కేంద్రంలో ఒ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయుల ధర్నా
విజయనగరం, డిసెంబర్ 16: జిల్లాలో పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ, మున్సిపల్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాయింట్ స్ట్ఫా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని యూటీఎఫ్ నాయకులు శేషగిరి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జీవో 610 కింద జిల్లాకు వచ్చిన 700 మంది ఉపాధ్యాయులకు నేటి వరకు టిటిఎ బిల్లులు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి డిఇఒ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో అన్ని కేడర్లకు చెందిన ఉపాధ్యాయుల ఇంటిగ్రేటెడ్ సీనియార్టీ జాబితాను విడుదల చేయాలన్నారు. అన్ని డీఎస్సీలలో రోస్టర్ లిస్టులను విడుదల చేయాలన్నారు. మండల స్థాయిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎంఇఒలు ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి నెల పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలన్నారు. జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించి జెడ్పి పిఎఫ్ అకౌంట్‌లను ఆన్‌లైన్‌లో ఉంచాలన్నారు. ఖాతాలు అప్‌డేట్ చేసి ఆన్‌లైన్ చేయాలన్నారు. విజయనగరం మున్సిపాల్టీలో గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులను, స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు. ఐటిడిఎ పరిథిలోని 349 గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు ఆశ్రమ పాఠశాలల్లో చేరమని చెబుతున్నారని దీనివల్ల తల్లిదండ్రులకు పిల్లలు దూరమై డ్రాప్‌అవుట్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ ధర్నాలో యూటీఎఫ్ నేతలు రాము తదితరులు పాల్గొన్నారు.

‘ప్రజల్లో భయాందోళనలు పారదోలాలి’
విజయనగరం, డిసెంబర్ 16: పట్టణంలో కర్ఫ్యూ విధించినపుడు జనంలో ఏర్పడిన భయం నేటికి ఉందని, ఆ పరిస్థితులను పారద్రోలాలని టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు డిమాండ్ చేశారు. సోమవారం కోట జంక్షన్ వద్ద ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు అతి వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కాగా, అటువంటి పరిస్థితులు పునరావృత్తంగాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఈ సందర్భంగా పట్టణ పార్టీ అధ్యక్షుడు ప్రసాదుల రామకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ పార్టీ నేతలు ఎస్‌ఎన్‌ఎం రాజు, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.

అర్జీదారులతో కిటకిటలాడిన ‘గ్రీవెన్స్’
విజయనగరం, డిసెంబర్ 16 : తనదైన ముద్రతో జిల్లా గ్రీవెన్స్ సెల్‌కు వచ్చే వారిలో విశ్వాసాన్ని పెంచుతున్న కలెక్టర్ కాంతిలాల్‌దండే ఈసోమవారం నాటి గ్రీవెన్స్ సెల్‌లో మరో అడుగు ముందుకు వేసి తక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు. గ్రీవెన్స్ సెల్‌లో ప్రజానీకం అందజేసిన వినతులను పరిశీలించి వాటి పరిష్కారానికి అధికారులను సైతం ఆఘమేఘాల మీద పరుగులు తీయించారు. ఇటీవల కాలంలో జిల్లా గ్రీవెన్స్ సెల్‌కు కలెక్టర్ స్వయంగా హాజరై అర్జీదారుల వినతులు స్వయంగా పరిశీలించి అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలిస్తుండడంతో సమస్యల పరిష్కారం అవుతాయన్న నమ్మకం ప్రజానీకానికి పెరిగింది. ఇందుకు నిదర్శనంగా 267పైబడి సామాజిక, వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన వినతులు అందాయి. పట్టణంలోని కంటోనె్మంట్‌లో అంబేద్కర్ కాలనీలోని ఒక ఇంటి వివాదానికి సంబంధించి తనకు న్యాయం చేయాలంటూ ఒక వ్యక్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి కలెక్టర్ స్పందించి వాస్తవాలు పరిశీలించి నివేదికను అందజేయాలని సంబంధిత మండల తహశీల్దార్‌ను ఆదేశించారు. రజకులకు దోబిఖానాలు నిర్మించేందుకు నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభం కాలేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతూ రజక సంఘం అధ్యక్షుడు ఎ.సింహాచలం కోరారు. తమ భూములకు సంబంధించి పట్టాదారు పాస్‌పుస్తకాలను, అండంగళ్‌ను వెంటనే ఇప్పించాలని దత్తిరాజేరు మండలం ఎస్.్భర్జివలసకు చెందిన పలువురు రైతులకు కలెక్టర్‌ను అభ్యర్ధించారు. వైద్య ధ్రువీకరణపత్రాలు అందజేయాలంటూ వికలాంగులు అత్యధిక సంఖ్యలో వ్యక్తిగతంగా వినతులు అందజేశారు. గ్రీవెన్స్ సెల్‌లో ఎజెసి నాగేశ్వరావుతోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించండి
విజయనగరం, డిసెంబర్ 16: ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పథకాలైన సబ్‌ప్లాన్, జలయజ్ఞం, బంగారుతల్లి, వడ్డీలేని రుణాలు, గృహాలు, పింఛన్లు తదితర పథకాలపై విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక వాహనం ద్వారా అన్నిగ్రామాల్లో ప్రచారం చేపట్టాలన్నారు. గ్రామీణ పారిశుద్ధ్యం, వ్యక్తిగత మరుగుదొడ్ల ఆవశ్యకతపై కూడా కళాబృందాల ద్వారా అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. కాగా, జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలకు తొమ్మిది వాహనాలు కేటాయించినట్టు తెలిపారు. అందులో మొదటి విడత కింద ఐదు వాహనాలు జిల్లాకు వచ్చినట్టు డిపిఆర్వో గోవిందరాజులు తెలిపారు. వీటిని చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం, కురపాం నియోజకవర్గాల పరిథిలో వినియోగించనున్నట్టు చెప్పారు. ప్రతి వాహనంలో ఒక ప్రొజెక్టర్‌తోపాటు జనరేటర్, లైటింగ్ మైక్ సిస్టమ్ ఏర్పాటు చేశామని ప్రతి వాహనంలో ఐదుగురు కళాకారులు ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై గేయనాటికల కార్యక్రమాలను ప్రదర్శిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం డివిజనల్ పిఆర్వో డి.రమేష్, ఎపిఆర్వో జానకమ్మ, సూపర్‌వైజర్ కె.బి.సింగ్ పలువురు కళాకారులు పాల్గొన్నారు.

పట్టణంలో సమైక్యవాదుల నిరసన
విజయనగరం , డిసెంబర్ 16: రాష్టశ్రాసనసభలో విభజన బిల్లు ముసాయిదాను ప్రవేశపెట్టడాన్ని విశాలాంధ్ర మహాసభ విజయనగరం ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. దీనిని నిరసిస్తూ సోమవారం ఇక్కడ మయూరి జంక్షన్ వద్ద ర్యాలీ నిర్వహించారు. విభజన బిల్లు ముసాయిదాకు వ్యతిరేకంగా సమైక్యవాదులు నినాదాలు చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ముసాయిదా బిల్లు ప్రతులను దగ్థం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశాలాంధ్ర మహాసభ జిల్లా కన్వీనర్ మామిడి అప్పలనాయుడు మాట్లాడుతూ తెలుగుప్రజల గుండెలపై కాంగ్రెస్‌ప్రభుత్వం విభజన బిల్లు ముసాయిదా కుంపటిని ఉంచిందన్నారు. బిజెపి, సిపిఐ, తెలుగుదేశంపార్టీలు ఈ కుంపట్లో మంటలు రాజేస్తున్నాయని విమర్శించారు. ఈ బిల్లును సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా వ్యతిరేకించాలని, కానిపక్షంలో వారికి, వారి కుటుంబసభ్యులకు రాజకీయ, సామాజిక బహిష్కరణ తప్పదని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో తెలుగుప్రజలు అప్రమత్తంగా కావాలని, బిల్లుకి వ్యతిరేకంగా సమైక్యపోరుకు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ నేతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇట్లా కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
జామి, డిసెంబర్ 16 : మండలంలోని కోరుకొండ రైల్వే స్టేషన్ సమీపంలో గుడారాలు వేసుకుని నివాసం ఉంటున్న ఒక అంతర్ రాష్ట్ర ముఠా సోమవారం పట్టుబడింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పంజాబ్ రాష్ట్రానికి చెందిన తర్బీర్‌భాటియా, జగదీష్‌భాటియా, రణభీర్‌సింగ్ భాటియా అనే అంతర్‌రాష్ట్ర ముఠాకు చెందిన వ్యక్తులు పట్టుబడ్డారు. వీరిపై మహారాష్టల్రో పులులను హతమార్చిన కేసులు ఉన్నట్లు మహారాష్ట్ర అటవీశాఖ అధికారి విశాల్‌వౌళి తెలిపారు. అయితే వీరి గురించి గత ఆరు నెలలుగా గాలింపు చేపడుతున్నామని సెల్ టవర్ల ఆధారంతో వీరు ఉండే ప్రాంతాన్ని గమనించి జిల్లా పోలీసులు అధికారులు ఓఎస్‌డి కె.ప్రవీణ్‌కుమార్, స్థానిక ఎస్సై లూథర్‌బాబుల సహకారంతో పట్టుకున్నట్లు తెలిపారు. ఫ్లాస్టిక్ పువ్వులు, ఫర్నిచర్ వస్తువులను విక్రయిస్తున్న ఇక్కడ జీవనం సాగిస్తున్నట్లు ఉండడంపై వీరిపై అనుమానంతో పట్టుకోవడం జరిగిందని స్థానిక ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

స్థానిక పోలీస్‌స్టేషన్లలో బాధితులకు తగిన న్యాయం జరగని
english title: 
g

రగిలిన జ్వాలలు!

$
0
0

శ్రీకాకుళం, డిసెంబర్ 16: గత నాలుగు నెలలకు పైగా సమైక్యాంధ్ర కోరుతూ సిక్కోలు వాసులు ఉద్యమిస్తూనే ఉన్నారు.వీరు చేస్తున్న ఆందోళనలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా విభజనను ఆమోదించి..టి.బిల్లు సిద్ధం చేయడమే కాకుండా అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టడంపై సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా టి.బిల్లుపై నిరసన జ్వాలలు ఎగిసాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు రెండు నెలలుగా జీతాలు కాదు..జీవితాలే ముఖ్యమంటూ అర్ధాకలితో చేసిన ఉద్యమాన్ని యుపిఏ లెక్కచేయకపోవడం దారుణమంటూ ఆవేదన చెం దుతున్నారు. దౌర్జన్యంగా రాష్ట్రాన్ని విభజించేందుకు ఆగమేఘాల మీద చర్యలు చేపడుతున్నా నిమ్మకునీరెత్తినట్లుఉన్న సీమాంధ్ర ప్రజాప్రతినిధుల తీరును ఎండగడుతున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా టి.బిల్లు ప్రతులను తగలబెడుతూ సోనియా గో బ్యాక్ అంటూ నినాదాలతో పాటు సమైక్య నినాదాలు మిన్నంటాయి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు పలువురు సమైక్యవాదులు సమైక్య పరిరక్షణ వేదిక సారథ్యంలో నిరసనల పర్వం కొనసాగించారు. దిష్టిబొమ్మల దగ్ధం, పలు ప్రధాన కూడళ్ల వద్ద మానవహారాలు, రాస్తారాకోలు, ర్యాలీలతో ఆందోళన చోటుచేసుకొంది. ఇదిలా ఉండగా పట్టణంలో కేంద్ర ఐటి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి క్యాంపు కార్యాలయాన్ని సమైక్య వాదులు ముట్టడించి ఆందోళన చేపట్టారు. సిగ్గులేని కేంద్రమంత్రులు అంటూ నినాదాలు చేస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు రెండు రోజులుగా చేపట్టిన రిలే నిరాహారదీక్షలతో పాటు సోమవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా శాఖ పిలుపుమేరకు మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి సారథ్యంలో పార్టీ కార్యకర్తలు ఏడురోడ్ల కూడలి వద్ద ధర్నా చేపట్టారు. సోనియా గో బ్యాక్, ఇటలీ గో బ్యాక్ అంటూ నినాదా లు చేస్తూ టి.బిల్లుకు రాష్టప్రతి 40 రోజులు సమయం ఇచ్చినా సభలో హడావిడిగా ప్రవేశపెట్టడం కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంలో భాగమే అన్నారు. అంబేద్కర్ జంక్షన్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జిల్లా కమిటీ సారథ్యంలో సమైక్య ర్యాలీ చేపట్టారు. మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. టి.బిల్లును దగ్ధం చేసి నిరసన వ్యక్తంచేశారు. అలాగే పలు మండల కేంద్రాల్లో సమైక్యవాదులు తమ నిరసనలను వ్యక్తంచేశారు.

* భక్తులకు 18 నుంచి సాంస్కృతిక కనువిందు
ఆదిత్యుని సన్నిధిలో.. ఆధ్యాత్మిక సంరంభానికి రంగం సిద్ధం
శ్రీకాకుళం, డిసెంబర్ 16: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణస్వామివారి దేవస్థానంలో మహాకుంభాభిషేక, మహాసౌరయాగ సంస్కృతి సంరంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 18 నుండి ప్రతిరోజు ఉద యం ఆలయ మండపాల్లో యాగపూజలు జరుగనున్నా యి. అదేవిధంగా భక్తులకు ఆహ్లాదాన్ని చేకూర్చడానికి ఇంద్రపుష్కరిణి ఆవరణలో ప్రత్యేక వేదికను ఏర్పరచి హరికథ, నాట్య, లలితగాన, పౌరాణిక నాటకాలు తదితర ప్రదర్శించనున్నారు. ఆలయ ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ నేతృత్వంలో కమిటీ బుధవారం నుండి ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం ప్రదర్శించనున్న సాంస్కృతిక కార్యక్రమాలను ప్రణాళిక రూపొందించారు. భక్తులంతా ఈ అరుదైన కార్యక్రమాలను వీక్షించి జయప్రదం చేయాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. వివరాలివే..
18వ తేదీ సా. 5.30 గంటలకు జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ కార్యక్రమాల్ని ప్రారంభించనున్నారు. అనంతరం పర్లాఖిమిడి, విజయనగరం, శ్రీకాకుళానికి చెందిన రేడియో కళాకారులు ఇనపకుర్తి మన్మథరావు, సుందరంపల్లి శ్రీనివాసరావు, అన్నవరపు శ్రీనివాసరావు, ఎం.లోకేశ్వరరావులచే సెక్సోఫోన్ కచేరి జరుగుతుంది. రాత్రి ఏడు గంటలకు కృష్ణా జిల్లాకు చెందిన టి.వి.రేడియో కళాకారిణి విన్నకోట రామకుమారిచే హరికథా గానలహరి. 19వ తేదీన రేడియో కళాకారులు జగ్గారావు, దుంపల ఈశ్వరరావులచే క్లార్‌నెట్ కచేరి. రాత్రి ఏడు గంటలకు జిల్లా కళాకారులచే కురుక్షేత్రంలోని ఔద్ధత్యభంగం నాటకం ప్రదర్శిస్తారు. 20వ తేదీ పి.సాయిజ్యోతిచే కూచిపూడి నాట్యం. అనంతరం ఆదిత్య వైభవం భక్తి సంగీత కార్యక్రమాలు జరుగుతాయి. 21వ తేదీన హైదరాబాద్‌కు చెందిన భాగవతుల సేతురామ్-వనజ ఉదయ్‌లచే గిరిజా కల్యాణం. 22వ తేదీన సాయంత్రం సాయిశివ నృత్యకళానికేతన్, నృత్యదర్శకులు శివకుమార్ శిష్యబృందంచే భారతనాట్యం, అనంతరం రఘుపాత్రుని శ్రీకాంత్, శిష్యబృందంచే విఘ్నేశ్వర స్తుతి, శక్తిస్వరూపిణి, శివతాండవం, ఆదిత్యుని ఏకాంత సేవ నృత్యరూపకాలు. 23న చెన్నైకు చెందిన రాజేష్ వైద్యచే వైణిక నాథ సమ్మేళనం వీణా నైపుణ్యప్రదర్శన. ఈయన పలు సినిమాలకు సంగీతం సమకూర్చారు. 24వ తేదీన విశాఖపట్నంకు చెందిన చైతన్య సోదరులచే వాగ్నేయ వైభవం భక్తి సంగీత విభావరి కార్యక్రమం. రాత్రి ఎనిమిది గంటలకు చింతామణి నాటకంలో అనుభూతి పరివర్తన ఘట్టం ప్రదర్శిస్తారు. 25న సాయంత్రం హైదరాబాద్ రేడియో ఆర్టిస్టు పప్పు పద్మప్రసన్నచే వీణావాద కచేరి అనంతరం సినీ సంగీత దర్శకులు ఎస్.వాసురావు ఆధ్వర్యంలో భక్తిసంగీతలహరి. 26వ తేదీ రాత్రి కంచికామకోటి పీఠం ఆస్థాన విధ్వాంసులు, మావుడూరు సత్యనారాయణశర్మచే నవవాద్య తరంగణి ఉంటుంది. 27న శ్రీమద్రామాయణ విశేషాలు, భక్తజన వర్ధనం, భక్తకుచేల హరికథ. అనంతరం బండారు చిట్టిబాబుచే లలిత సంగీతం. 28న కిల్లి పరిమలచే భరతనాట్యం అనంతరం భక్తిసంగీత విభావరి జరుగుతుంది. 29న హైదరాబాద్‌కు చెందిన పెరవళి జయభాస్కర్ బృందంచే కర్ణాటక స్వరలయ సుధావాద్య సమ్మేళనం , రాత్రి 8.30 గంటలకు సీతారామ కల్యాణం నాటకం. 30న కర్ణాటకకు చెందిన లక్ష్మీగురురాజ్‌చే మువ్వలసవ్వడి భరతనాట్య ప్రదర్శన ఉంటుంది.ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రముఖులు ప్రారంభిస్తారు.

త్వరలో శాశ్వత ఆధార్ కేంద్రాల ఏర్పాటు
శ్రీకాకుళం, డిసెంబర్ 16: జిల్లాలో శాశ్వత ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి ఒకటవ తేదీ నుండి అన్ని మం డల కేంద్రాల్లో, శ్రీకాకుళం పురపాలక సంఘంలో ఆరు కేంద్రాలు పనిస్తాయన్నారు. ఆధార్‌కార్డులు ఇప్పటివరకు నమోదు చేయించుకున్నవారు చేర్పులు మార్పులు ఈ కేంద్రంలో చేయించుకోవచ్చునని తెలిపారు. మీసేవా కార్యక్ర మం గూర్చి మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరానికి కళాశాలలో, పాఠశాల విద్యార్థుల తాకిడి మే, జూన్ నెలల్లో అధికంగా ఉం టుందని, ఇప్పటి నుండే విద్యార్థులకు కుల, ఆదా య తదితర ధ్రువపత్రాలను తీసుకోవాల్సిందిగా సమాచారం అందించాలని డిఇఒను ఆదేశించారు. మీసేవలో పొందినపత్రాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామన్నారు. మీసేవ ద్వారా 150 సేవలు అందిస్తున్నామన్నారు. ఓటరు నకిలీ కార్డులు, ఆధార్ కార్డులు పొందవచ్చునని చెప్పారు. ఓటరుగా మీసేవ కేంద్రంలో నమోదుకావచ్చునని చెప్పారు. ఉపాధి హామీ పనులను తక్షణం ప్రారభించాలని ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం మరింత వేగవంతం చేయాలన్నారు. విద్య, వైద్య శాఖలు తమ పనితీరుకు పారామీటర్స్‌ను రూపొందించాలని ఆదేశించారు. మాతృ మరణాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని, ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో ప్రగతి సంతృప్తికరంగా లేదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్‌ఎస్ రాజ్‌కుమార్, డిఆర్‌డిఏ పిడి రజనీకాంతరావు, డ్వామా పిడి కల్యాణచక్రవర్తి, డిఎంహెచ్‌ఒ గీతాంజలి, పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు బివిఎస్ చిరంజీవి, ఆర్‌విఎం పిఒ నగేష్, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు అచ్యుతానందగుప్తా, వ్యవసాయ శాఖ జెడి మురళీకృష్ణా, డిఇఒ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.

రూ.11 వేల కోట్ల బ్యాంక్ లింకేజిలు లక్ష్యం
* ఎనిమిది ఐటిడిఎల పరిధిలో ఎస్‌హెచ్‌జి సంఘాలను బలోపేతం చేయాలి
* సెర్ప్ అసిస్టెంట్ సిఇఓ మురళి
సీతంపేట, డిసెంబర్ 16: ఈ ఏడాది రూ.11 వేల కోట్లు బ్యాంక్‌లింకేజి రుణాలు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సెర్ప్ రాష్ట్ర అసిస్టెంట్ సిఇఓ మురళి చెప్పారు. సోమవారం సీతంపేట ఏజెన్సీలోని కీసరజోడు పంచాయతీ పరిధిలో పర్యటించిన ఆయన పొంజరుగూడ గ్రామాన్ని సందర్శించి గిరిజన మహిళలతో మాట్లాడారు.అనంతరం స్థానిక ఐటిడిఎ కార్యాలయంలో ఐకెపి ఏపిఎం,డిపిఎంలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 10.40లక్షల సంఘాలు, 1.16కోట్ల మంది సభ్యులు ఉన్నారన్నారు. ఈ ఏడాది రూ11 వేల కోట్లు బ్యాంక్‌లింకేజి రుణాలు లక్ష్యం కాగా ఇప్పటికి రూ 8వేల కోట్లు వర కు లింకేజి రుణాలు ఇచ్చామన్నారు. బంగారుతల్లి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 5.6 లక్షల మంది పిల్లలను గుర్తించామన్నారు. వారికి రూ.170కోట్లు వరకు చెల్లించామని తెలిపారు. అలాగే ఏపిఆర్‌ఐజిపి(రూరల్ ఇన్‌క్లూజివ్ గ్రోత్) పథకంలో భాగంగా ఐటిడిఎల పరిధిలోని 1098 మండలాలను పరిగణలోకి తీసుకొని అన్ని కార్యక్రమాలు ఈ పథకం ద్వారా చేస్తామన్నారు. 2300 పాలప్రగతి కేంద్రాలు ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే రాష్ట్రంలో 76 లక్షల మందికి పెన్షన్‌లు ఇస్తున్నామని, రచ్చబండలో 8.6 లక్షల పెన్షన్‌లు ఇచ్చామన్నారు. శతశాతం అంగవైకల్యం ఉన్న వికలాంగులకు రూ.1000 వరకు పింఛన్ ఇచ్చే అవకాశం ఉందని, దీనికి సంబంధించి పరిశీలిస్తున్నామ న్నారు. రాష్ట్రంలో 26 వేల అమృతహస్తం కేంద్రాలతో పాటు 2600 బాలబడి కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు.అలాగే ఈ ఏడాది స్ర్తినిధి బ్యాంక్ ద్వారా రూ.1000 కోట్లు రుణాలు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అదే విధంగా ఎన్‌పిఎం పథ కం ద్వారా 36 వేల మంది రైతులతో సుస్థిర వ్యవసాయం చేయిస్తున్నామన్నారు. తన పరిశీలనలో అభయహస్తం పథ కం బాగుందన్నారు. ఐటిడిఎల స్థాయిలో గ్రీవెన్స్‌ను పక్కాగా నిర్వహించాలన్నారు. అనంతరం ఐకెపి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఐటిడిఎ పీవో కె సునీల్‌రాజ్‌కుమార్, ఐకెపి ఏపిడి కుమార్, డిపిఎం సత్యంనాయుడు, ఏపిఎంలు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి కృపారాణి ఇంటి ముట్టడి
శ్రీకాకుళం , డిసెంబర్ 16: రాష్ట్ర విభజన బిల్లు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో జిల్లా విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో పట్టణంలోని కేంద్ర ఐటి, కమ్యూనికేషన్లు శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఉదయం సుమారు మూడు వందల మంది విద్యార్థులు, సమై క్యరాష్ట్ర పరిరక్షణ వేదిక నేతలు కలసి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి సమైక్య నినాదాలు చేశా రు. సమైక్యవాదులు మూకుమ్మడిగా కేంద్ర మంత్రి కార్యాలయాన్ని ముట్టడించడంతో టూ టౌన్ సిఐ రాధాకృష్ణ సారథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పా టు చేశారు. సమైక్యవాదులను లోపలికి పోనీయకుం డా అడ్డుకునేందుకు రోప్‌పార్టీని ఏర్పాటు చేశారు. గతంలో కేంద్ర మంత్రి కార్యాలయం ముట టడి సందర్భంగా అద్దాలు పగులగొట్టిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు ముందుగానే భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు కార్యాలయానికి దూరం గా బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సమైక్యవాదులు సిగ్గులేని మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినదించారు. సీమాంధ్ర మం త్రుల చేతకాని తనంగానే రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి చేరుకొందని ఆరోపించారు. సమైక్యం కోరుతూ ప్రజలు గత 150 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన చేపడుతున్నప్పటికీ, ప్రజల ఓట్లతో గెలిచి అందలమెక్కిన మంత్రులు ప్రజలను గాలికొదిలి వారు రాజభోగాలు అనుభవించడం అన్యాయమన్నారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాజకీయ భవిత్యవ్యం కనుమరుగుకాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో హేమంతకుమార్, ముఖేష్, మహేష్, హనుమంతు సాయిరాం, కిల్లారి నారాయణరావు, వై.ఉమామహేశ్వరరావు, కొంక్యాణ వేణుగోపాలరావు, జామి భీమశంకర్, దుప్పల వెంకటరావు, పి.జయరాం పాల్గొన్నారు.

ప్రచార కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలి
శ్రీకాకుళం, డిసెంబర్ 16: జిల్లాలో ప్రారంభించిన ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లేందుకు ప్రచార కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ సౌరభ్‌గౌర్ అధికారులను ఆదేశించారు. ప్రచార కార్యక్రమాలు, ఓటర్ల నమోదు కార్యక్రమం, ఆధార్ సీడింగ్, ఉపాధి హామీ పథకం తదితర కార్యక్రమాలపై సోమవారం సాయంత్రం మండల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. జిల్లాలో పది నియోజకవర్గాలకు పది ప్రచార వాహనాలు వస్తున్నాయని, అందులో ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల నియోజకవర్గాలకు ఇప్పటికే వాహనాలు వచ్చాయని చెప్పారు. మిగిలిన నియోజకవర్గాలకు ఒకటి, రెండురోజుల్లో చేరుకుంటాయన్నారు. పది నియోజకవర్గాల్లో వచ్చే జనవరి 12వ తేదీ వరకు నిర్వహించే ప్రదర్శనల వివరాలను గ్రామాల వారీగా పంపించామని తెలిపారు. ఇచ్చిన తేదీలలో సాయంత్రం ఏడు గంటల నుండి కళాబృందాల ద్వారా ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఈ ప్రచార వాహనాల ద్వారా కళాశాలలు, పాఠశాలల వద్ద ఓటర్ల నమోదు కార్యక్రమం, అమ్మలాలన పథకం గూర్చి కూడా ప్రత్యేకంగా వివరించాలన్నారు. వాహనంలో రాజీవ్ యువశక్తి, ఓటరు నమోదు ఫారాలు, సర్పంచ్‌లకు రాసిన ఉత్తరాలు, ఇతర ప్రచార బ్రోచర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలపై దీనిని ప్రత్యేకంగా రూపొందించారన్నారు. జిల్లాలో మంచి శిక్షణా సంస్థలు నెలకొల్పామని, వాటిలో యువత వివిధ కోర్సుల గూర్చి శిక్షణ పొందవచ్చునని తెలిపారు. కళాకారులకు వసతి గృహం లేదా రెసిడెన్షియల్ పాఠశాలలో రాత్రి బస ఏర్పాటుచేయాలని సూచించారు. ప్రతి మండలం నుండి ఒక ఇన్‌ఛార్జ్‌ను ప్రచార వాహనానికి నియమించాలని ఆదేశించారు. ఆర్.ఐ వాహనంతో వెళ్లేటట్లు చర్యలు చేపట్టాలని, ఎంపిడిఒ, తహశీల్దార్ తరచూ తనిఖీలు నిర్వహించాలన్నారు. మం డలాలకు వాహనాలు వచ్చునప్పుడు అచ్చట ప్రారంభ కార్యక్రమం చేయాలని సూచించారు. ఓటర్ల నమోదు కార్యక్రమం గూర్చి మాట్లాడుతూ బూత్‌స్థాయి అధికారి ఇతర పోలింగ్ కేంద్రాలకు చెందిన ఫారాలను స్వీకరించడం లేదని ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఏ పోలింగ్ కేంద్రం పరిధికి చెందిన ఫారాలను అయినా స్వీకరించాలని స్పష్టంచేశారు. ఓటరు నమోదు ఫారంతోపాటు రెండు ఫోటోలు, నివాస ధ్రువీకరణ నకలు అందిస్తే సరిపోతుందని చెప్పారు. ఆధార్ సీడింగ్ త్వరితగతిన చేయాలని పేర్కొన్నారు. రోజుకు కనీసం ఐదువందల వరకు చేయాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవె న్యూ అధికారి నూర్‌భాషా ఖాసీం, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పి.రజనీకాంతరావు, ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.శివరామనాయకర్, జిల్లా పౌరసరఫరాల అధికారి రమేష్ పాల్గొన్నారు.

డయల్ యువర్ కలెక్టర్‌కు 22 వినతులు
పాతశ్రీకాకుళం, డిసెంబర్ 16: డయల్‌యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 22 వినతులు వచ్చాయి. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ సౌరభ్‌గౌర్ స్వీకరించారు. ఇటీవలి సంభవించిన భారీ వర్షాలకు కృష్ణసాగరం చెరువు పూర్తిగా దెబ్బతిన్న కారణంగా మరమ్మతులు జరిపించాలని ఎచ్చెర్ల మండలం భగీరథపురానికి చెందిన ఎన్.కృష్ణమూర్తి ఫిర్యాదు చేసారు. పెద్దసాన చౌకధరల దుకాణంలో డీలరు సరుకులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు టెక్కలికి చెం దిన ధర్మారావు ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లు తమకు మంజూరైనప్పటికీ లింటల్ లెవల్ వరకు నిర్మాణానికి అనుమతిప్పించాల్సిందిగా కొత్తూరు చెందిన ఇప్పిలి రామారావు కోరారు. వంశధార ఎడమ కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయాలని నంది గాం మండలం కణితూరుకు చెందిన ఎం.శ్యామలరావు విన్నవించారు. గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని కొత్తూరుకు చెందిన ఐ.ప్రభాకరరావు కోరారు. తలసముద్రం చెరువుకు గండి పడడంతో పాడైన రోడ్డు మరమ్మతు పనులను త్వరితగతిన జరిపించాలని పోలాకికి చెందిన డి.రామయ్య కోరారు. ఈ కార్యక్రమంలో ఎజెసి ఆర్.ఎస్.రాజ్‌కుమార్, డిఆర్‌డిఏ పి.డి రజనీకాంతరావు, డిఎంహెచ్‌ఒ గీతాంజలి, ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు.

అభిమానులు మరింత స్ఫూర్తి నింపారు
* సమాలోచన సభ విజయంపై రామ్‌మనోహరనాయుడు
శ్రీకాకుళం, డిసెంబర్ 16: రాజకీయ సమాలోచన సభకు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారని, దీనిని విజయవంతం చేసిన వారికి ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్‌మనోహరనాయుడు కృతజ్ఞతలు తెలిపారు. వర్జిన్‌రాక్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవితంలో ఇది మధురమైన ఘట్టమని, అభిమానులంతా నమ్మకాన్ని పెంచి మరింత స్ఫూర్తినింపారన్నారు. సమాలోచన సభకు మహిళలు అధిక సం ఖ్యలో హాజరయ్యారని, వీరందరికీ ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో కార్యకర్తలు, అభిమానుల అభిప్రాయాలను క్రోడీకరించి ముందుకు పోనున్నట్లు వెల్లడించారు. సమాలోచన సభకు మూడువేల మంది కార్యకర్తలు వస్తారని ఊహిస్తే ఆరువేలకు పైగా హాజరైనట్లు చెప్పారు. డిసిసి అధ్యక్షుడు నర్తు నరేంద్రయాదవ్ మాట్లాడుతూ నాయకత్వ పటిమ గల వ్యక్తి అవసరమని, ధర్మాన నాయకత్వాన్ని అందరూ సమర్ధిస్తూ గురుతర బాధ్యతను పెంచారన్నారు.ఈ సమావేశంలో డిసిఎంఎస్ అధ్యక్షుడు గొండు కృష్ణమూర్తి, పిఎసిఎస్ అధ్యక్షుడు జి.కృష్ణమూర్తి, ముంజేటి కృష్ణ, డి.పి.దేవ్, మండవిల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

కార్మిక యూనియన్లను అణచివేసేందుకు కుట్ర
శ్రీకాకుళం , డిసెంబర్ 16: రానున్న రోజుల్లో ప్రభుత్వం ప్రజల హక్కులపై మరిన్ని దాడులు నిర్వహించేందుకు సిద్ధపడుతోందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.సుధా భాస్కర్ ఆరోపించారు. సిటు 8వ జిల్లా మహాసభలు ముగింపు సందర్భంగా స్థానిక రైస్ మిల్లు అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమం లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని బయటపడేందుకు ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోవాలన్న ఆలోచనతో పేదలకు ప్రభుత్వం అందజేస్తున్న రాయితీలకు మంగళం పాడాలని యోచిస్తోందన్నారు. రాయితీలంటే గ్యాస్, బియ్యం వంటివే కాకుం డా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు సరఫరాలోనూ కోత విధించడానికి పూనుకుందన్నారు. రానున్న రోజుల్లో పేద ప్రజలపై మరిన్ని భారాలతో దాడులకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆరోపించారు. కార్మికలోకం హక్కులు హరిం చి పెట్టుబడిదారుల వత్తిడితో చట్టాలను ఎత్తేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. కార్మికవర్గాలపై దాడులు మొదలయ్యాయని, పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతూ కార్మికశాఖ చట్టాలను ఉల్లంఘనకు పాల్పడుతున్న ఉదాంతాలను వివరించారు. ట్రేడ్ యూనియన్లు నడువకుండా చేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని, అయితే ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు సమష్టి పోరాటాలే శరణ్యమన్నారు. ఇం దుకు సిటు శక్తివంతమైన యూనియన్‌గా ఎదిగిందన్నారు. సిటు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు జిల్లాలో నెలకొల్పనున్న అణువిద్యుత్ కేంద్రాల నిర్మా ణం వద్దు అంటూ తీర్మానం ప్రవేశపెట్టగా, సిటు జిల్లా అధ్యక్షుడు ఎం.తిరుపతిరావు ఏకవాక్య తీర్మానంతో ఆమోదించారు. కార్యక్రమంలో పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నర్శింగరావు, సిటు రాష్ట్ర అధ్యక్షుడు భూపాల్, పంచాది అరుణ, కె.నాగమణి, పి.తేజేశ్వరరావుఉన్నారు.

గత నాలుగు నెలలకు పైగా సమైక్యాంధ్ర కోరుతూ సిక్కోలు
english title: 
ragilina jwalalu

సమైక్య దీప్తికి సజీవ స్ఫూర్తి...

$
0
0

బ్రిటన్ తదితర విదేశాల దురాక్రమణనుండి మన దేశానికి భౌగోళిక విముక్తి దశలవారీగా జరిగింది! క్రీస్తుశకం 1947 ఆగస్టు 15వ తేదీన విముక్తి లభించడం ‘ప్రతీక’ మాత్రమే. తెలంగాణ, కర్నాటకలోని మహారాష్టల్రోని కొన్ని ప్రాంతాలు కలిసిన హైదరాబాద్ ప్రాంతానికి 1948 సెప్టెంబర్ 17వరకు స్వాతంత్య్రం లేదు! సుభాష్ చంద్రబోస్ 1943లో అండమాన్ దీవులను ఈశాన్యంలోని కొన్ని ప్రాంతాలను బ్రిటిష్‌వారి నుండి విముక్తం చేయగలిగాడు. 1943 అక్టోబర్ 21న రాసవిహారీ వసు అధ్యక్షుడుగా, సుభాస్ చంద్రబోస్ ప్రధానమంత్రిగా స్వతం త్ర ప్రభుత్వం కూడ ఏర్పడింది! ఈ ప్రభుత్వాన్ని జపాన్ గుర్తించింది కూడ! బ్రిటిష్ వారు గుర్తించని ప్రథమ ప్రధానమంత్రి సుభాస్‌చంద్రబోస్... బ్రిటిష్‌వారు గుర్తించలేదు కాబట్టి స్వతంత్ర భారతీయ చరిత్రకారులు సైతం గుర్తించకపోవడం కొనసాగుతున్న భావ దాస్యానికి చిహ్నం! భౌగోళిక స్వాతం త్య్రం లభించినప్పటికీ భావదాస్య విముక్తికోసం ఇప్పటికీ పోరాటం నడుస్తూనే ఉంది. ఈ పోరాటానికి జాతీయ సమగ్రతా సాధకుడు సర్దార్ పటేల్ కేంద్ర బిందువు కావడం నడుస్తున్న చరిత్ర! డిసెంబర్ 15వ తేదీన సర్దార్ పటేల్ వర్ధంతి అన్న విషయం జాతీయ సమాజానికి అకస్మాత్తుగా స్ఫురించడం శుభ పరిణామం. 1875 అక్టోబర్ 31న జన్మించిన వల్లభభాయి ఝవేర్ భాయ్ పటేల్ జీవితం భారత జాతీయ భౌగోళిక సమగ్రతకు ప్రతీక, జాతీయ సాంస్కృతిక సమైక్యభావ కాంతి కళిక! కానీ ఆయన పుట్టినరోజును సైతం పెద్దగా పట్టించుకోక పోవడం అరవై దశాబ్దుల జాతీయ వైపరీత్యం! ఇప్పుడు పుట్టిన రోజును మాత్రమే కాదు, పరమపదించిన రోజును సైతం కోట్లాది మంది గుర్తుచేసుకోవడం దేశ చరిత్రకు జరిగిపోయిన అన్యాయాలను సవరించడానికి శ్రీకారం కాగలదు! సర్దార్ వర్ధంతి రోజున దేశమంతటా దాదాపు పదకొండువందల చోట్ల సమైక్యతకోసం పరుగు పందాలను నిర్వహించారట! పాఠశాలల విద్యార్థులు కళాశాలల విద్యార్థులు ఇతరేతర యువతీ యువకులు లక్షల సంఖ్యలో ‘వల్లభ మంత్రి’ స్ఫూర్తితో పరుగులు తీయడం మరుగున పడిన స్ఫూర్తిని మళ్లీ నిలబెట్టడం! ఉక్కు నరాలు ఇనుప కండరాలు వజ్ర సంకల్ప నిబద్ధులైన యువజనుల గురించి వివేకానందస్వామి ఆకాంక్షించాడు. ఆయన ఆకాంక్షకు సాకారం సర్దార్‌పటేల్ జీవన ప్రస్థానం! సర్దార్‌పటేల్ జన్మించే నాటికి వివేకానందుడైన నరేంద్రుడు పనె్నండేళ్ల వాడు! వివేకానందుడు మరణించే నాటికి వల్లభ భాయి ఇరవై ఆరేళ్ల యువకుడు!
ఆయన భారత జాతీయ సామాజిక క్షేత్రమంతటా సంచరించకపోయి ఉంచినట్టయితే బ్రిటిష్ దురాక్రమణదారులు వెళ్లిపోయిన తరువాత వారి భౌగోళిక విభజన షడ్యంత్రం కొనసాగి ఉండేది. భారతదేశం మధ్యలో అనేక స్వతంత్ర దేశాలు వెలసి ఉండేవి! ఒక వ్యక్తి శరీరంలో మరో ప్రాణి మొలచినట్టయితే అది పురుగవుతుంది, అది పుండవుతుంది! భారత మాతృదేవి శరీరమంతటా ఈ విచ్ఛిన్నకరమైన స్వతంత్ర దేశాలనే పురుగులు పుండ్లు ఏర్పడకుండా నిరోధించగలిగిన సహజసిద్ధ వైద్యుడు వల్లభభాయి పటేల్! బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారతదేశాన్ని దురాక్రమించిన తరువాత రెండుగా విభజించి పెత్తనం చెలాయించారు! యాబయి ఐదు శాతం భూభాగాన్ని బ్రిటిష్‌వారు స్వయంగా పాలించారు. ఈ భూభాగంపై దేశంలోని డెబ్బయి శాతం ప్రజలు నివసించారు. మిగిలిన ముప్పయి శాతం ప్రజలు నివసించిన నలబయిఐదు శాతం భూభాగాన్ని బ్రిటన్ పరమోన్నత అధికార- పారవౌంటసీ- పరిధికి లోబడిన స్వదేశీయ పాలకులు పాలించారు. బ్రిటన్ ప్రత్యక్ష దురాక్రమణలోని భూభాగాన్ని ‘ప్రాంతాలు’- ప్రావెనె్సస్-గా విడగొట్టారు. వీటిపై గవర్నర్లు పెత్తనం వహించారు. స్వదేశీయ పాలకుల పెత్తనం వహించిన భూభాగం సంస్థానాలు- స్టేట్స్-గా విడిపోయింది. 1947కు పూర్వం బ్రిటిష్ పాలిత దేశం మధ్యలో ఇలాంటి సంస్థానాలు దాదాపు ఐదువందల అరవై ఐదు ఉండేవి. బ్రిటిష్‌వారు తమ నిష్క్రమణకు పూర్వం ఈ ‘సంస్థానాల’ను అన్నింటినీ దేశంలో విలీనం చేయాలి! దానివల్ల ఒకే భారత స్వతంత్ర దేశం ఏర్పడుతుంది. కానీ అలాచేయడంవల్ల కొత్తగా స్వతంత్రం పొందే దేశం ‘సమస్యల’నుండి విముక్తం అవుతుంది. అలా ‘సమస్యలు’ లేని భారతదేశం అగ్రరాజ్యంగా ఎదుగుతుంది. భారతదేశం అగ్ర రాజ్యంగా ఎదగడం పాశ్చాత్యులకు నచ్చని పరిణామం!
అందువల్లనే బ్రిటిష్‌వారు అవశేష భారతదేశాన్ని 1947లో మళ్లీ విభజించారు. భారతదేశంనుండి గాంధారం, బర్మా, శ్రీలంక, మాల్‌దీవులు, నేపాల్, భూటాన్ వివిధ సమయాలలో విడిపోవడం బ్రిటన్ దురాక్రమణ ఫలితం. అందువల్ల 1947నాటికే అఖండ భారతదేశం ‘అవశేష భారతం’గా మారింది. ఈ అవశేష భారతం మధ్యలో ఈ వందలాది స్వతంత్ర సంస్థానాలు! ఇదీ 1947నాటి స్థితి! అవశేష భారతదేశాన్ని మళ్లీ విడగొట్టి 1947 ఆగస్టు 14న పాకిస్తాన్‌ను ఏర్పాటుచేశారు! పరస్పరం కలహించుకుంటూ ఈ కలహాలకోసం పెద్దఎత్తున సైనిక వ్యయం చేస్తున్న భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, శ్రీలంక, మాల్ దీవులు, అఫ్ఘానిస్తాన్, నేపాల్, భూటాన్‌లు అనాదిగా ఉండిన రీతిలోనే ఒకే దేశంగా ఉండి ఉంటే ఈ అఖండ భారతదేశం చైనాకంటె పెద్దదిగా ఉండేది! యుద్ధ్భయం లేని ఈ అఖండ భారతం ఈ సైనిక వ్యయాన్ని సంక్షేమంకోసం, ఆర్థిక ప్రగతికోసం వెచ్చించగలిగి ఉండేది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సార్వభౌమ దేశంగా ఎదిగి ఉండేది! కానీ అది జరగకుండా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు శాశ్వతమైన ఏర్పాటుచేసి పోయారు!! మిగిలిన ‘్భరత్’ మధ్యలో ఈ సంస్థానాలను నెలకొల్పిపోయారు! ఈ సంస్థానాలు కూడ స్వతంత్ర దేశాలుగానో, బ్రిటిష్ పాలనలోవలె అర్ధ స్వతంత్ర దేశాలుగానో ఉండి ఉంటే మన దేశం మరింత బలహీన పడి ఉండేది! అలా జరగకుండా నిరోధించినవాడు సర్దార్‌పటేల్! ‘అవశేష దేశ’ విభజనను ఆపలేక పోయినప్పటికీ ఖండిత భారత్‌లో మళ్లీ ఐదువందలకు పైగా స్వతంత్ర దేశాలు ఏర్పడకుండా నిరోధించగలిగాడు!! సర్దార్ పటేల్ లేకపోయినట్టయితే అనేకానేక సంస్థానాలు ‘యధాతథ’స్థితి- స్టాండ్ స్టిల్- ఒప్పందాన్ని అడ్డుపెట్టుకొని స్వతంత్ర దేశాలుగా ఉండేవి! ఈ‘సంస్థానాలు’ భారత్‌లో కాని పాకిస్తాన్‌లో కాని విలీనం కావచ్చునని లేదా, ‘స్టాండ్ స్టిల్’ ఒప్పందం ప్రాతిపదికగా స్వతంత్రంగా ఉండవచ్చునని బ్రిటిష్ దోపిడీదారులు చెప్పిపోయారు! సర్దార్‌పటేల్ కాక జవహర్‌లాల్‌నెహ్రూ స్వయంగా ఈ సంస్థానాలను భారత్‌లో విలీనంచేసే ప్రక్రియను ఆరంభించి ఉంటే ‘జమ్మూకాశ్మీర్’ తరహా సమస్యలు మరిన్ని ఏర్పడి ఉండేవి. జమ్మూకాశ్మీర్‌కు ‘ప్రత్యేక ప్రతిపత్తి’కట్టబెట్టడంవల్లనే అక్కడ సర్వమత సమభావ వ్యవస్థకు విఘాతం ఏర్పడింది, జిహాదీ బీభత్సకాండ పెరిగింది! దేశంలోని అన్ని సంస్థానాలనూ విలీనం చేయగలిగిన, పటేల్‌కు జమ్మూకాశ్మీర్ వ్యవహారంలో మాత్రం నెహ్రూ అడ్డుతగలడమే ఇందుకు కారణం! పటేల్ మాటను నెహ్రూ పట్టించుకోని మరో వ్యవహారం చైనా టిబెట్‌ను దురాక్రమించడం!!
పటేల్ మాట చెల్లిన వందలాది సంస్థానాల విలీనం విషయంలో విలీనం తరువాత ఎలాంటి సమస్యలూ ఏర్పడలేదు! కాశ్మీర్, టిబెట్ వ్యవహారాలలో నెహ్రూ మాట చెల్లింది. ఒకటి ఆంతరంగిక కల్లోలానికి కేంద్రమైపోయింది. రెండవది బాహ్య ప్రమాదాలకు ఆలవాలమైపోయింది. చైనా దురాక్రమణను నిరోధించడానికై మన దేశం సహాయంకోసం టిబెట్ ఎదురుచూస్తోంది- అని పటేల్ వ్రాసిన ఉత్తరానికి సమాధానంగా, ‘‘టిబెట్ స్వాతంత్య్రం చచ్చిపోయింది...’’అని జవహర్‌లాల్ సమాధానం చెప్పడం చరిత్ర! జమ్మూకాశ్మీర్‌ను పూర్తిగా విముక్తంచేయాలని, పాకిస్తాన్ దురాక్రమణ అంతమయ్యేవరకు యుద్ధంచేయాలని పటేల్ భావించాడు. కానీ మూడవ వంతు కాశ్మీర్ పాకిస్తాన్ దురాక్రమణలో మిగిలి ఉండిన సమయంలోనే నెహ్రూ యుద్ధాన్ని ఆపుచేయించాడు! పాకిస్తాన్‌తో వివాదాన్ని ఐక్యరాజ్యసమితికి నివేదించి అంతర్గత సమస్యను అంతర్జాతీయ వేదికలకెక్కించాడు!! ఈ ‘ఐక్యరాజ్యసమితి’జోక్యాన్ని పటేల్ నిరసించాడు, కాశ్మీర్ విషయంలో నిరోధించలేక పోయినప్పటికీ హైదరాబాద్ సంస్థానం విషయంలో మాత్రం ‘ఐక్యరాజ్యసమితి’ రంగప్రవేశం చేయకుండా ‘ఉక్కుమనిషి’ అడ్డుకోగలిగాడు! అంతర్గత సమస్యలను పనికట్టుకొని అంతర్జాతీయపు రచ్చలకెక్కించడం నేలవిడిచి సాముచేయడం వంటిది! నెహ్రూ ఇలా నేల విడిచి సాము చేసినట్టు ఆయనకు అత్యంత సన్నిహితుడైన అప్పటి ఆంగ్లేయ గవర్నర్ జనరల్ వౌంట్ బాటన్ సైతం మహాత్మాగాంధీ వద్ద వ్యాఖ్యానించాడట! ‘‘వల్లభభాయి పటేల్ కాళ్లు భూమి మీద ఉన్నాయి, జవహర్‌లాల్ నెహ్రూ కాళ్లు ఎప్పుడూ మేఘాలలో ఉంటాయి...’’ అని వౌంట్ బాటెన్ గాంధీజీతో చెప్పినట్టు మణిబెన్‌పటేల్ తమ ‘దినచర్య’ డైరీలో వ్రాసుకున్నారు! మణిబెన్ వల్లభభాయిపటేల్ కుమార్తె! కానీ పటేల్ మాత్రం ‘తెల్లబొల్లి’ ప్రశంసలకు పొంగిపోలేదు! అందుకే జునాగఢ్ నవాబును ‘మంచి’చేసుకోవాలన్న వౌం ట్ బాటన్ మాటను సర్దార్ పట్టించుకోలేదు! పోలీసు చర్య ద్వారా మాత్రమే లొంగి వస్తాడన్న పటేల్ విధానం విజయవంతమైంది! ‘‘ఆయన ఇష్టంవచ్చినట్టు చేసుకోమనండి...’’ అని వౌంట్ బాటన్‌కు పటేల్ హెచ్చరిక కూడ చేయగలిగాడు. ఈ హెచ్చరిక చేసిన మరుసటి రోజుననే వౌంట్‌బాటన్, 1947 నవంబర్ 11న, ఢిల్లీనుండి లండన్‌కు వెళ్లిపోయాడు! మళ్లీ రాలేదు! రాజగోపాలాచారి గవర్నర్ జనరల్ అయ్యాడు!!
నిరాయుధ ఉద్యమంతోపాటు సాయుధ సమరం కూడ భారత స్వాతంత్య్ర సాధన లక్ష్యం సమగ్రం కావడానికి దోహదం చేయడం చరిత్ర! ఈ చరిత్రను సృష్టించిన వాడు సర్దార్‌పటేల్! ‘‘చరిత్రను వ్రాస్తూ కాలాన్ని వృధాచేయడం కంటె చరిత్రను నిర్మించడానికి శ్రమించడం కర్తవ్యం...’’ అన్నది తోటి భారతీయులకు పటేల్ ఇచ్చిన సందేశం! మహాత్మాగాంధీ సంపూర్ణ నిరాయుధవాది! ‘అహింస’ ఆయన ఏకైక ఆయుధం! నేతాజీ సంపూర్ణ సాయుధ సమరవాది! ఈ మహనీయుల మార్గాలను సమన్వయం చేసిన ఆచరణశీలి పటేల్! నిరాయుధమా? సాయుధమా? అన్న మీమాంసకు ఆయన దూరం! అందుకే జునాగఢ్‌కు, హైదరాబాద్‌కు సాయుధ మార్గంలోనే స్వాతంత్య్రాన్ని ప్రసాదించాడు!! ఆ తరువాత గోవా కూడ సాయుధ సమరం ద్వారానే స్వతంత్రమై దేశంలో మళ్లీ కలిసిపోయింది...

విశ్లేషణ
english title: 
vishleshana
author: 
- హెబ్బార్ నాగేశ్వరరావు

సంపద అందరికీ అందాలి

$
0
0

మన దేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఆనాడు క్లిష్ట సమస్యగానే ఉంది. మన దేశంలో 560 సంస్థానాలుండేవి. అదృష్టవశాత్తు సమర్థవంతమైన నాయకత్వం ఉండ టం జాతీయ ఉద్యమంలో ప్రధాన పాత్రధారులైన సర్దార్‌వల్లభాయ్ పటేల్ హోం మంత్రిగా ఉండటం, బి.పి.మీనన్ లాంటి అంకితభావం కలిగిన అధికారులుండటం దేశం అదృష్టంగా భావించాలి. వారి అంకిత స్వభావాన్ని అనుమానపడే మనుషులు ఆనాడు లేరు. అందుకే ఆనాటి దేశ నిర్మాణం సులభసాధ్యమైంది.
ఏకీకరణ అంటే చినిగిన కాగితాన్ని అంటుపెట్టటం లాంటిది కాదు. ఎన్నో విషయాలను గమనంలోకి తీసుకోవాలి. అయినా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను లోతుగా అధ్యయనం చేశారు. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిటీలను ఏర్పాటుచేశారు. ప్రజాపోరాటాల వలననో ఇతర ఒత్తిడుల వలననో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రాష్ట్రాలను రూపొందించటంలో కేవలం ఒకే భాష అనే ప్రాతిపదిక మాత్రమే కాకుండా ఆర్థిక, భౌగోళిక భౌతిక పరిస్థితులను కూడా గమనంలోకి తీసుకుంటే అది ఎంతో శాస్ర్తియంగా ఉండేది. రాష్ట్రాలను రూపొందించటం భావోద్వేగ దృష్టికోణంతో మాత్రమే కాదు. ఆ ప్రాంత ప్రజల నేపథ్యాన్ని గమనంలోకి తీసుకోవాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడటంలో కూడా అదే తొందరపాటు జరిగిందా? అన్న అనుమానం వస్తున్నది. సర్కారు జిల్లాలు, తెలంగాణ జిల్లాలు, రాయలసీమ జిల్లాలు...ఈ మూడు ప్రాంతాలను కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు సర్కారు జిల్లాల పరిస్థితి వేరు. బ్రిటిష్ ప్రభుత్వం రాజనీతి పాలన వలన ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు వచ్చాయి. ఆనాడు సంపద ఉత్పత్తికి నీరే ప్రధానం. కాబట్టి సహజ వనరులను ఉపయోగించుకుని సర్కారు జిల్లాలు అభివృద్ధి చెందాయి. సంపద సృష్టించి ఆ సంపదను ఇతర రంగాల్లో పెట్టుబడి పెడితే తిరిగి సంపద సంపదను సృష్టిస్తుంది. ఆ సంపద పంపిణీ కాకుంటే పెట్టుబడిదారి వ్యవస్థకు కారణభూతమవుతుంది. ఆ సంపద కారణంగా అభివృద్ధికి బదులుగా అంతరాల సృష్టికూడా జరుగుతుంది. పెత్తందార్లు తమ పెట్టుబడిని వృద్ధిచేసుకునేందుకై లాభాలు వచ్చే రంగంలోకి వెళతారు. దాని ప్రభావం ఇతర రంగాలపై పడుతుంది. కేవలం ఈ కారణం వల్లనే విద్య, వైద్యరంగాలపై పెట్టుబడిదారి ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్నది.
అదే తెలంగాణ భూస్వామ్య వ్యవస్థ క్రింద ఉన్న ప్రాంతం. చుట్టూ వనరులుంటాయి. ఫ్యూడల్ వ్యవస్థలో వనరులను వినియోగ వస్తువులుగా చేయకపోవటం వలన దరిద్రం సహజంగానే తిష్టవేసుకునే ఉంటుంది. ఇతర ప్రాంతాల మాదిరిగా తమ జీవన ప్రమాణం ఎందుకు పెరగటంలేదని ఆలోచించే వ్యక్తులు ఈ సమయంలోనే బయటకు వస్తారు. ఆ ఆలోచనలే ఎదిగి ఉద్యమాలుగా మారుతాయి. ఆ ఉద్యమమే తిరిగి సాయుధ పోరాటంగా మారింది. వనరులను వినియోగ వస్తువుగా మార్చుకునేందుకు పోరాటాలు వస్తా యి. దానివలన ప్రజలు త్యాగాలకు సిద్ధపడ్డారు. రాయలసీమలో వనరులు పరిమితంగా ఉన్నాయి. అక్కడ కూడా భూస్వామ్య వ్యవస్థ ఉంది. దీనివల్లనే అంతరాలు బాగా పెరిగాయి. బ్రిటిష్ పాలనలో ఉండటం వలన దారిద్య్రం ఉన్నప్పటికినీ క్రిస్టియన్ మిషనరీల వలన కొద్దోగొప్పో విద్యావ్యాప్తి జరిగింది. ఆ విద్యావ్యాప్తిలో కొన్ని ఉద్యోగాలు సంపాదించటంవల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. బ్రిటిష్ ప్రభుత్వం మన వ్యవస్థలో అంతరాలను అలాగే ఉంచి ప్రజాపోరాటాలు రాకుండా జాగ్రత్తవహించారు. ఈ మూడు నేపథ్యాలు వేరు. అంతరాలు గల గ్రేడెడ్ సమాజం విషయంలో మూడు ప్రాంతాలు ఒకటేనని చెప్పవచ్చును.
ఒక ప్రాంతం వనరులను వినియోగించుకోవటం వల్ల దారిద్య్ర నిర్మూలనలో కొద్ది చలనం వచ్చింది. అభివృద్ధి సాధ్యమైంది. మరోప్రాంతంలో వనరులున్నా తిష్ట వేసిన దారిద్య్రం పోరాటాలకు దారితీసింది. మన రాష్ట్రంలో అశాంతి చెలరేగడానికి ఇదే ముఖ్య కారణం. ఈ అరవై సంవత్సరాల కాలంలో సాంకేతిక రంగంలో పెద్ద ఎత్తున వనరులను వినియోగ వస్తువులుగా మార్చే సాంకేతిక పరిజ్ఞానం రావటంవలన సంపద సృష్టించబడుతున్నది. ఆ సంపద అందరికీ అందలేదు. సమాజంలో అంతరాలు పెరుగుతూ వచ్చా యి.
ఒక ప్రాంతం పోరాటాలకు త్యాగాలకు అలవాటుపడింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఎగయటానికి దోహదపడింది. దీనివల్ల ఇతర ప్రాంతాలలో అంతరాలు లేవని కాదు. తెలంగాణ పోరాట నేపథ్యం ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుందనే భయంతో కొన్ని ఆధిపత్య శక్తులు, తమ స్వార్థ ప్రయోజనాలకోసం వూహాజనితమైన భావాలను ప్రచారంచేసి తమ కట్టడాలను కాపాడుకుంటారు. మరి వూహాజనిత భావాలు నీటి బుడగల మాదిరిగా ఎప్పుడైనా కొట్టుకుపోతాయి. తెలంగాణ రాష్టస్రాధన ఉద్యమం అన్ని ప్రాంతాలకు అక్కడి కష్టజీవులకు ఆదర్శంగానే నిలుస్తాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం వెనుక అనేక చారిత్రక కారణాలున్నాయ. వెనుక బాటుతనం, అన్ని రంగాల్లో తాము అభివృద్ధ చెందకపోవడం, వంటి కారణాలు తెలంగాణ ప్రజలను ఉద్యమ పథాన్ని ఎంచుకునేలా చేశాయ.
ఉద్యమానికి దారితీసిన ‘మూలకారణం’ లో నిజాయతీ ఉన్నప్పుడు అది విజయవంతమై తీరుతుంది. తెలంగాణ ఉద్యమమే అందుకు ఉదాహరణ.

మన దేశానికి స్వాతంత్య్రం లభించిన
english title: 
sampada
author: 
- చుక్కా రామయ్య

అనువంశిక పాలనతో అనర్థం

$
0
0

బ్రిటిష్ వారి పాలనా కాలంలో వివిధ సంస్థానాధిపతులు విక్టోరియా రాణిని ఆశ్రయించుకొని తమ పరిమిత రాజ్యపాలనను కాపాడుకున్నారు. అంతేకాని ఈ విక్టోరియా ఎవరు? ఈమెకు మనం ఊడిగం చేయటం ఏమిటి? అనే ఆలోచన వారికి శతాబ్దాలు గడిచినా రాలేదు.
1947వరకు స్వాతంత్య్రంకోసం గాంధీజీ నేతృత్వంలో పోరాటం సాగింది. స్వరాజ్యం వచ్చిన తర్వాత కాంగ్రెసు సంస్థను రద్దుచేయాలని గాంధీజీ భావించారు. అందుకు కాంగ్రెసువారు ఒప్పుకోలేదు. గాంధీగారి తర్వాత రాజకీయ నాయకత్వం నెహ్రూగారి చేతిలోకి వెళ్లింది. మన పాలెగాండ్రందరూ దేశవ్యాప్తంగా నెహ్రూ కుటుంబాన్ని ఆశ్రయించుకొని బ్రతకసాగారు. ఇదే స్వతంత్ర భారత చరిత్ర.
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కుటుంబ సభ్యులు ఏమైనారు? గరిమెళ్ల సత్యనారాయణ, మారేమండ రామచంద్రశాస్ర్తీ, కొడాలి ఆంజనేయులు, త్రిపురనేని రామస్వామిచౌదరి, తుమ్మల సీతారామమూర్తిచౌదరి, లాల్‌బహదూర్‌శాస్ర్తీ ఇలాంటి వారి పిల్లలంతా ఏమైనారు. మదనమోహన్ మాలవీయ, లోకమాన్య బాలగంగాధర తిలక్, గోపాలకృష్ణ గోఖలే వీరి సంతానం ఏమైనారు? ఎవరికీ తెలియదు. కేవలం ఒక నెహ్రూ కుటుంబం దేశ సార్వభౌమాధికారాన్ని అందుకున్నది- పాలించింది. శాసించింది- శపించింది. దాదాపు 60 ఏళ్లు ఒకే కుటుంబాన్ని నమ్ముకొని పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా చేశారు. ఇవ్వాళ ఇటలీ దేశంనుండి కోడలుగా వచ్చిన వ్యక్తి తన జన్మదిన కానుకగా డిసెంబరు 9వ తేదీని పురస్కరించుకొని ఇండో పాక్ విభజన లాంటి మరో విభజన చేస్తుంటే కాంగ్రెసు నాయకులలో కొందరు చంకలు గుద్దుకుంటున్నారు. ఇవ్వాళ ఓ వందమంది కౌరవులు దేశవ్యాప్తంగా సోనియాగాంధీ భజనలో జీవితం గడుపుకుంటున్నారు. వీరు అంగుష్టమాత్రులు. తాను స్వయంభువువై నాయకులుగా ఎదగలేరు. 1947కు ముందు కాంగ్రెసు చేసిన మంచి ఏమిటో ఈ తరంవారికి తెలియదు. అందువల్ల కాంగ్రెసు వృక్షం ఇక పండ్లు రాల్చే స్థితిలో లేదు. అందుకు వారు వేరే ప్రత్యామ్నాయం ఆలోచించుకోగలరా? సుశీల్‌కుమార్‌షిండే, గిరిజావ్యాస్, జయంతి నటరాజన్, నారాయణస్వామి, చిదంబరం, ఆంటో నీ, చాకో, దిగ్విజయ్‌సింగ్, కమలనాథ్, షీలాదీక్షిత్, కిల్లి కృపారాణి, పురంధీశ్వరి, పళ్లంరాజు, కావూరి సాంబశివరావు, ఎస్.ఎం. కృష్ణ, ఆస్కార్ ఫెర్నాండెజ్, మార్గెరట్ అల్వా వీరికిక రాజకీయ భవిష్యత్తులేదు. ఇదే నేటి సంక్షోభం!
డిసెంబరు 8వ తేదీ (2013)నాడు వెలువడిన ఐదు రాష్టల్ర ఎన్నికల ఫలితాలవల్ల దేశంలో కాంగ్రెసు పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా మిగిలిపోయింది. ‘కాంగ్రెసు ఓడిపోయినందుకు ఆనందిస్తున్నాను’’ అంటూ విజయవాడ ఎంపీ శ్రీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించటం ఆ పార్టీలోని ధిక్కార స్వరాన్ని తెలియజేస్తున్నది. 1975 ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా ఈజ్ ఇండియా- అని ఈ నాయకులు ప్రకటించారు. 1980లో ఒకనాడు శ్రీమతి సరోజినీపుల్లారెడ్డిని కలుద్దామని ఆమె ఇంటికి వెళ్లాడు. నా భర్త - నా జీవితం ఇందిరాగాంధీయే’ అని ఆమెగారు అన్నారు. దీనినిబట్టి మనవారు ఈ రాజవంశాన్ని ఎంత తీవ్రంగా ఆదరించారో తెలుస్తున్నది. మనం అక్బర్‌ను గౌరవించాము. గుంటూరులో జిన్నాటవర్ ఏర్పాటుచేశాము. ఢిల్లీలో ఒక వీధికి ఔరంగజేబుమార్గ్ అని పేరుపెట్టాము. విక్టోరియారాణికి వికటేశ్వరీదేవి అని పేరుపెట్టి వ్యాసుని పేరుతో భవిష్యత్ పురాణంలో ఒక అధ్యాయం చేర్చాము. ఎలిజబెత్, లేడీ వౌంట్‌బాటెన్, సోనియా ఇటాలియా బాంచను దొర సామి నీ కాల్మొక్తా? ఇదే ఈ భారత జాతి చరిత్ర!!
ఐతే ఈరకమైన ఒకే కుటుంబ పాలన తక్కిన చోట్ల కూడా చూడవచ్చు. యు.పి.లో ములా యం కుటుంబం, బీహారులో లల్లూ కుటుంబం, ఎ.పి.లో ఎన్.టి.ఆర్ కుటుం బం, తమిళనాడులో కరుణ కుటుంబం అనువంశిక పాలనకు శ్రీకారం చుట్టారు. ఫిలిం ఫీల్డులో ఒక నటుని కొడుకు నటుడు కావాలనుకుంటే అది వారి ఇష్టం. లాయరు కొడుకు లాయరు కావాలనుకోవటం సహజం. కాని రాజకీయాలు అలా కాదు. ప్రజాసేవ పేరుతో ఒకే కుటుంబం అధికారోన్మత్తతో దేశ సంపదను దోచుకోవటం సమర్ధనీయమేనా?? మదర్‌థెరిసా వలె వీరు కలకత్తా మురికివాడలలో ఆనువంశిక సేవాకార్యక్రమాలు చేపట్టవచ్చుకదా!!
ఢిల్లీలో ఉమాశంకర దీక్షిత్ అనే ప్రసిద్ధ రాజకీయ నాయకుడు ఉండేవారు. వారి కుటుంబానికి చెందిన వ్యక్తియే శ్రీమతి శీలాదీక్షిత్. ఆమె సమర్ధవంతంగా ఢిల్లీని అభివృద్ధిచేసిందని నిష్పాక్షికంగా ఉన్న విమర్శకులు చెప్పారు. అయితే అందరిలాగే ఆమెకూ ఆనువంశిక పాలనా లక్షణం సంక్రమించింది. తన కొడుకు సాందీప్ దీక్షిత్‌ను ఎఐసిసి నాయకుణ్ణి చేసింది. అతడు ఎంతవరకు వెళ్లాడంటే తెలుగుదేశానికి చెందిన ఒక ఎం.పి.ని చంపేస్తానని ఢిల్లీ వీధులల్లో తిరుగనివ్వను అని బెదిరించాడు. ఫలితంగా ఢిల్లీ అసెంబ్లీకి డిసెంబరు 2013లో జరిగిన ఎన్నికలలో అక్కడి ఏడు లక్షల మంది తెలుగువారు కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఓటువేశారు. శ్రీమతి శీలాదీక్షిత్ కూడా చాలా దారుణంగా ఓడిపోయింది.
మధ్యప్రదేశ్‌లో బిజెపి విజయానికి కారణం దిగ్విజయ్‌సింగ్ అంటే ఎవరూ నమ్మలేదు. కాని ఇది నిజం గ్వాలియర్ రాజవంశానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రి చేయాలని కాంగ్రెసు అధిష్టానం ఆలోచించింది. ఇతడు మాధవరావు సింధియా కొడుకు. ఆయన గ్వాలియర్ రాజమాత విజయరాజ సింధియా కొడుకు. ఇదొక రాజకుటుంబ పాలన. అయితే దిగ్విజయ్‌సింగ్ తన కొడుకు కోసం జ్యోతిరాదిత్యను బలహీనపరచాడనే వార్తలు అందాయి. పితృవాత్సల్యం అలాంటిది మరి!! ఎపి విభజనలో కీలక పాత్ర పోషిస్తున్నది ఈయనగారే.

బ్రిటిష్ వారి పాలనా కాలంలో వివిధ సంస్థానాధిపతులు
english title: 
queen victoria
author: 
- ముదిగొండ శివప్రసాద్

ముందు చూపులేని విద్యాశాఖ

$
0
0

విద్యాశాఖ అధికారుల పనితీరు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థంకాని పరిస్థితి. విద్యావలంటీర్ల నియామకమే ఇందుకు నిదర్శనం. జూన్ 12న ప్రతి ఏటా పాఠశాలలు ప్రారంభం కాగా కనీసం జూలైలో నైనా విద్యావలంటీర్ల్లను నియమించాలి. అయితే ఈయేడు అక్టోబర్ చివరి వారం వరకు కూడా ఖాళీగావున్న పోస్టులలో నియామకం చేపట్టలేదు. అయితే ఇటీవల ఆ ఖాళీల్లో విద్యా వలంటీర్లను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఐదు నెలలకోసం నియమించుకుంటున్నారు. జూన్ నుంచి సరైన సిబ్బంది లేక పాఠ్యాంశాలు సైతం పూర్తికాని పాఠశాలలెన్నో. ఇప్పుడు నష్టపోయింది విద్యార్థులు కాదా?
- వి.నవనీత్‌రాజ్, మద్నూర్

ఆనాటి కథాబలం ఏది?
హైద్రాబాద్‌లోని గోల్డెన్ థ్రెషోల్డ్‌లో గత ఆదివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆంధ్రభూమి సంపాదకులు శాస్ర్తీగారు చెప్పిన విధంగా వెనుకటి నవలల్లోని నాణ్యత ప్రస్తుతం ఎక్కడా కనిపించడంలేదు. ఆనాడు కోడూరి కౌసల్యాదేవి, ముప్పాళ్ళ రంగనాయకమ్మ, సాహిత్య కవి దువ్వూరి రామిరెడ్డిగార్ల సహజ కవిత్వం నవల యొక్క పటిష్టత కథాబలం ఎంతో గట్టి పునాదిగా వుండేది. రాను రాను చౌకబారు కథలు, ఆ కథలు బట్టి చలనచిత్రాలను నిర్మించడం వల్ల సమాజానికి ప్రయోజనం లేకుండాపోతున్నది. కౌసల్యదేవిగారి చక్రభ్రమణం నవల డాక్టర్ చక్రవర్తి చలనచిత్రంగా మొదటిసారిగా నంది అవార్డు పొందిన ఘనత దక్కిందంటే దాని విలువ చెప్పక్కరలేదు! మరి నేడు సాహిత్య పోకడలు, వాటి విలువ క్షీణించి పోతుండటం విచారకరం.
- కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు

రైతుల కంట కన్నీరు
గత రెండునెలలుగా కురిసిన భారీ వర్షాలు రైతులను కష్టాల్లో నెట్టేశాయి. ఏ రైతును కదిపినా కన్నీరే! కన్నీటి కథే! కూరగాయలు పండించేవారికి కూరగాయలే మిగిల్చాయి. పంటలన్నీ రైతుల్ని కుదేలు చేసాయి. వ్యవసాయం ఆధారంగావున్న కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ తుఫాన్ల ప్రభావం రైతుల పిల్లల చదువుల ఫీజులపై కూడా పడింది. వర్షంవల్ల పొలాల్లో మట్టి మేటవేసింది. ఈ విషయమై సంబంధిత నాయకులు స్పందించి పంట నష్టం ఋణాల్ని సాధ్యమైనంత త్వరలో చెల్లించి రైతులను ఆదుకోవాలని మనవి.
- ఈవేమన, శ్రీకాకుళం

ఉత్తరాయణం
english title: 
letters to the editor

తప్పుల తడక.. ఓటర్ల జాబితా..

$
0
0

కరీంనగర్ , డిసెంబర్ 18: ఓ వైపు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేస్తా ఉంటే, మరోవైపు బాబితాలో నుంచి ఓటర్ల పేర్లను తొలగించేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో అవకతవకలపై సవరణల విషయంలో ప్రత్యేక దృష్టి సారించడం, నాలుగైదు మాసాల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఓటర్ల నమోదు అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓటర్ల జాబితాలో 53వేల మందికిపైగా రెండు ప్రాంతాల్లో ఓటర్లుగా ఉండగా, జనాభా ప్రకారం మహిళా ఓటర్లు లేకపోవడం కొసమెరుపు. జాబితా తప్పుల తడకగా ఉందన్న ఆరోపణలు సర్వత్రా విన్పిస్తున్నాయి. ఇక రెండ్రోజులే మిగిలిన ఉన్న నేపథ్యంలో అధికారులు ఏ మేరకు జాబితాను సవరిస్తారో వేచిచూడాల్సిందే. రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు జిల్లాలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియతోపాటు జాబితాలో చేర్పులు, మార్పులు చేసే కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. నాలుగైదు మాసాల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషన్ కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు ఎన్నికల కమీషన్ ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌లతో సమీక్షలు నిర్వహిస్తోంది. అయినా, జాబితాలో తప్పులు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు చేపట్టిన మార్పులు, చేర్పుల ప్రక్రియలో సమారు 53వేలకు మందికిపైగా రెండుచోట్ల ఓటర్లుగా ఉన్నట్లు వెలుగుచూసింది. ఇంకా కూడా వెలుగుచూసే అవకాశం ఉంది. ఎందుకంటే వలసలు వెళ్లిన, ఉద్యోగ రీత్యా బయటకు వెళ్లిన, చనిపోయిన వారి పేర్లు జాబితాలో ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి. వలసలు వెళ్లిన వారు నివసించే చోటనే ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు ప్రచారం ఉంది. గతంలో జాబితాలో పేరు ఒక చోట ఉంటే, చిరునామా మరో చోట ఉండేది. పేరు, చిరుమానాలకే పరిమితమైన పొరపాట్లు ప్రస్తుతం ఫోటోల వరకు వెళ్లాయి. జాబితాలో ఒకరి ఫోటోకు బదులు మరోకరి ఫోటోలు ఉండటం, అందులో పేర్లు, చిరునామాలు పొంతనలేకుండా ఉండటం లాంటివి చోటుచేసుకుంటున్నాయి. ఓటరు గుర్తింపు కార్డులు ఫోటోతోసహా ఉన్నప్పటికీ జాబితాలో ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. పురుషులు వెయ్య మంది ఉంటే, మహిళలు 1009 మంది ఉన్నారు. అయినప్పటికీ 1009 మందిలో 987 మంది మహిళలు మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు. మున్సిపల్ కార్పోరేషన్‌లైన కరీంనగర్, రామగుండంలో ఈ సంఖ్య మరింత తక్కువ ఉండటం గమనార్హాం. ఈ లెక్కల ప్రకారం ఏడాది కాలంగా అధికారులు ఏమిచేస్తున్నారో బేరీజు వేసుకోవచ్చు. ఇదిలా ఉంటే 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని ఎన్నికల కమీషన్ పదేపదే ప్రకటిస్తోంది. జిల్లాలో 18నుంచి 19సంవత్సరాల వయస్సు గల యువత లక్షా 47వేల 215 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. గడువులోగా అర్హులైన వారందరిని నమోదు చేయాలని జిల్లా అధికారులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు 70వేలకుపైగా కొత్త ఓటర్లు నమోదైనట్లు తెలుస్తోంది. మిగిలిన ఓటర్లను చేర్పించాల్సి ఉండగా, గడువు మాత్రం రెండ్రోజులే మిగిలి ఉంది. ఒకవైపు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగుతా ఉంటే, మరోవైపు ఓటర్ల జాబితాలో నుంచి అర్హులైన వారిని తొలగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే కరీంనగర్ నగరంలో ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందంటూ, దాని సవరించాలని టిఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు రవీందర్‌సింగ్ విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు. మంగళవారం ధర్మపురి మండలంలోని గంగసముద్రం, సిర్‌పూర్‌నూత్‌పల్లి గ్రామస్తులు తమ పేర్లను జాబితాను తొలగించారని ఆందోళన చేపట్టారు. ఇవేకాక పలు గ్రామాల్లో ఇలాంటి ఆందోళనలు జరిగాయి. ఒకవైపు చేరికలు, మరోవైపు తొలగింపులతో ఓటర్ల జాబితాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కమీషన్ మాత్రం 2014 జనవరి 16న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని ప్రకటించింది. కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులు చేసే గడువు ఇక రెండ్రోజులే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు జాబితాలోని అకతవకల్ని ఎప్పుడు సరిచేస్తారో వేచిచూడాల్సిందే.
చైతన్యంతోనే మోసాలకు అడ్డుకట్ట
కరీంనగర్ టౌన్, డిసెంబర్ 18: వినియోగదారులు చైతన్యవంతులైతే సమాజంలో జరుగు మోసాలను అరికట్టవచ్చునని జిల్లా పౌరసరఫరాల అధికారి బి. చంద్రప్రకాశ్ అన్నా రు. డిసెంబర్ 18 నుండి 24 వరకు జరుగు జా తీయ వినియోగదారుల వారోత్సవాలను బుధవా రం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వినియోగదారులు చైతన్యవంతం కావాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. మెరుగైన సమాజ నిర్మాణానికి అందరు తోడ్పడాలని అన్నారు. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతీ వస్తువుకు ధర నిర్ణయిస్తుందని, వినియోగదారులు పూర్తి అవగాహనతో వస్తువులు కొనుగోలు చేయాలని, కొన్న వస్తువులకు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరను మాత్రమే చెల్లించాలని, అధికంగా చెల్లించరాదని తెలిపారు. జిల్లాలో 11 లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని, వారికి రూపాయికి కిలో నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆ బియ్యాన్ని లబ్ధిదారులు వాడుకోవాలని, అమ్ముకోకుండా వాడుకోవాలని కోరారు. వస్తు మార్పిడి ద్వారా బియ్యాన్ని ఇస్తున్నారని తెలిసిందని, పౌరసరఫరాల శాఖ ద్వారా దాడులు చేసి జిల్లాలో 155 కేసులు నమోదు చేశామని, పది కోట్ల విలువగల సరుకులు సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ధాన్యం సేకరణకు 620 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇంతవరకు 2.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, గత మూడు సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. బియ్యం, గ్యాస్ సిలిండర్లు, ఆయిల్‌పై ఏమైనా ఫిర్యాదులు ఉంటే 8008801450 కు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం ఇస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లా వినియోగదారుల మండలి సలహాదారులు ఎన్.శ్రీనివాస్ మాట్లాడుతూ డబ్బులు చెల్లించి వస్తువులు కొనుగోలు చేసేవారు సేవలు పొందేవారందరు వినియోగదారులేనని అన్నారు. వినియోగదారులకు రక్షణగా ప్రభుత్వం వినియోగదారుల పరిరక్షణ చట్టం 1986 ను తీసుకవచ్చిందని తెలిపారు. మోసపోయిన వినియోగదారులకు ఉచిత, సత్వర న్యాయం లభిస్తుందని అన్నారు. అట్టివారికి జిల్లా వినియోగదారుల ఫోరంలో ఆరు నెలల్లో తీర్పు వెలువడుతుందని తెలిపారు. జిల్లా ఫోరంలో కేసు వేస్తే న్యాయవాది అవసరం లేదని, ఎవరైనా సంప్రదించవచ్చునని తెలిపారు. జిల్లా వినియోగదారుల ఫోరంలో ఇంతవరకు పది వేలకు పైగా కేసులు పరిష్కారమైనాయని, దాదాపు 15 కోట్లకు పైగా జరిమానా విధించినట్లు తెలిపారు. వినియోగదారులు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి కె.లింగయ్య, జిల్లా వినియోగదారుల సమాచారం కేంద్రం కో-ఆర్డినేటర్ వి.లక్ష్మణ్ కుమార్, ఎస్సారార్ కళాశాల లెక్చరర్ మనోహరాచారి, రాజీవ్ విద్యామిషన్ సిఎంఓ శ్రీనివాస్, ఎఎంఓ ప్రభాకర్ రావు, శరత్ చంద్ర, కరీంనగర్ వినియోగదారుల మండలి సలహాదారులు ప్రకాశ్ హొల్లా, టి.గంగారాం, అధ్యక్షులు నారాయణ, కార్యదర్శి రాంచంద్రారెడ్డి, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.
బ్యాంకు సమ్మె సక్సెస్
నిలిచిపోయిన వ్యాపార లావాదేవీలు
తీవ్ర ఇబ్బందులుపడ్డ ఖాతాదారులు
ఎటిఎం కేంద్రాల వద్ద జన సందడి
కరీంనగర్ టౌన్, డిసెంబర్ 18: యే డాది గడుస్తున్నా పదవ వేతన ఒప్పం దం అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యుఎఫ్‌బియు) ఆధ్వర్యం లో చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం జిల్లాలోని అన్ని జాతీయ బ్యాంకుల ఉద్యోగులు తమ విధులను బహిష్కరించి బ్యాంకులను బంద్ నిరసన తెలియజేశారు. జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో ఎస్‌బిహెచ్, ఎస్‌బిఐ, ఆంధ్రాబ్యాంక్‌లతోపాటు పలు జాతీయ బ్యాంకుల ఎదుట ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేట్ బ్యాంకులకు ఇష్టమొచ్చినట్లు అనుమతులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. బ్యాంకులు మూసివేయడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులుపడగా, ఎటిఎం కేంద్రాల వద్ద జన సందడి నెలకొంది. జిల్లాలో సుమారు 200లకుపైగా జాతీయ బ్యాంకులు మూసివేయగా, కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలకు ఆటంకం కలిగింది. జిల్లాలో సమ్మె విజయవంతమైందని బ్యాంకు ఉద్యోగుల సంఘాల నాయకులు తెలిపారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఆయా బ్యాంక్‌ల యూనియన్ నాయకులు జీవన్‌కుమార్, కె.వెంకటేశ్వర్‌రావు, ఎ.ఎల్.ఎన్. శ్రాస్తి, బాషుమియా, నందకిషోర్, శ్రీనివాస్, కృష్ణ, వెంకటేశ్వర్లు, సలీంపాషా, శ్రీకాంత్‌లతోపాటు పలువురు నాయకులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యేడాది గడుస్తున్నా, పదవ వేతన ఓప్పందాన్ని అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన పదవ వేతన ఒప్పందాన్ని అమలు చేయడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
‘్భమి’ కథనానికి స్పందన
నకిలీ విలేఖరులపై విచారణకు ఆదేశం
జగిత్యాల, డిసెంబర్ 18: ‘నకిలీలు తస్మాత్ జా గ్రత్త’ అనే ‘ఆంధ్రభూ మి’లో వచ్చిన కథనానికి జి ల్లా ఎస్పీ శివకుమార్ స్పం దించారు. నకిలీ విలేఖరుల ఆచూకీపై కోరుట్ల పోలీసులను విచారణకు ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేర కు కోరుట్ల పోలీసులు వ్యాపారులను బెదిరింపులకు గురి చేసి న విలేఖరుల గూర్చి ఆరా తీయగా వ్యాపారులను బెదిరింపులకు గురి చేసింది అసలు విలేఖరులు కాదని, ఇది నకిలీల పనేనని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మేరకు వ్యాపారులు నకిలీ విలేఖరుల గూర్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా, విలేఖరుల పేరుతో వ్యాపారులను బెదిరించి డబ్బులు దండుకునేందుకు యత్నించిన నకిలీల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా వ్యాపారులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు పలువురు నకిలీ విలేఖరుల ఫోన్ నెంబర్లను తీసుకొని వీరితో పాటు నేరుగా రైస్‌మిల్లులకు వచ్చి విలేఖరుల పేరుతో బెదిరించి డబ్బులు కావాలని డిమాండ్ చేసిన వారి వివరాలను ఆధారాలతో సహా సేకరించి పోలీసులు విలేఖరుల ముసుగులో వ్యాపారులను బెదిరించింది నకిలీల పనేనని తేల్చారు. నలుగురు విలేఖరుల పేరుతో నకిలీలు వ్యాపారులను బెదిరింపులకు గురి చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ శివకుమార్‌కు బుధవారం రాత్రి సమాచార విచారణ కొనసాగించిన నకిలీ విలేఖరుల వివరాలు వెల్లడించినట్లు తెలిసింది.
సభా సమయాన్ని
వృథా చేస్తున్నారు..
రాష్టప్రతిని అవమానపరుస్తున్నారు
దీనికి కిరణ్, చంద్రబాబులే కారణం
టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి
కరీంనగర్ టౌన్, డిసెంబర్ 18: తెలంగాణ ముసాయిదా బిల్లు విషయంలో సీమాంధ్ర ఎమ్మెల్యేలు, నాయకులు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చించకుండా దాటవేస్తూ సభా సమయాన్ని వృధా చేస్తున్నారని తెలిపారు. బుధవారం సాయంత్రం నగరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభా సమయాన్ని వృధా చేయడమేకాకుండా రాష్టప్రతిని సైతం అవమానపరుస్తున్నారని అన్నారు. శాసనసభా గంట సేపు కొనసాగితే సమారు 5లక్షల 25వేల రూపాయల ఖర్చు అవుతుందని తెలిపారు. తెలంగాణ బిల్లుపై చర్చించకుండా రెండ్రోజులుగా సభా సమయాన్ని వృధా చేస్తూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి తెలంగాణ బిల్లుపై చర్చించి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చునని అన్నారు. ఇంకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగుతుందని అనుకుంటే అది వారి భ్రమే అవుతుందని అన్నారు. ఆరునూరైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని చెప్పారు. కిరణ్, చంద్రబాబు డైరెక్షన్‌లో సీమాంధ్ర ఎమ్మెల్యేలు నడుస్తున్నారని ఆరోపించారు. బిల్లుపై చర్చించి మీ ప్రాంత సమస్యల్ని పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు రవీందర్ సింగ్, గుంజపడుగు హరిప్రసాద్, బొడిగె శోభ, అనంతుల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

ఓ వైపు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేస్తా
english title: 
tappula tadaka

ఉద్యోగుల సమ్మెతో బ్యాంకులు బంద్

$
0
0

వరంగల్, డిసెంబర్ 18: జాతీయికరణ చేసిన బ్యాంకింగ్ రంగంలో అమలు చేస్తున్న సంస్కరణలతో తమకు చేటు జరుగుతుందని ఆరోపిస్తూ అఖిల భారత బ్యాంకు అధికారులు, ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో జరిగిన ఒకరోజు సమ్మెతో జిల్లాలో అన్ని బ్యాంకులు మూతపడ్డాయి. దీంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎటి ఎంలు కూడా పాక్షికంగా ఒక్కొచోట పూర్తిగా బంద్ కావడంతో మరింత అవస్థలపాలయ్యారు. బ్యాంకింగ్ రంగంలో అమలు చేస్తున్న సంస్కరణలను ఇటీవలికాలంలో బ్యాంకు ఉద్యోగులు, అధికారులు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బుధవారం దేశవ్యాప్త సమ్మెకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల ఫెడరేషన్ పిలుపునిచ్చింది. అందులో భాగంగా సమ్మెలో జిల్లాలోని అన్ని బ్యాంకులు పాల్గొని బ్యాంకు కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. వరంగల్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ జోనల్ కార్యాలయం, హన్మకొండలోని ఆంధ్రా బ్యాంకు ప్రధాన కార్యాలయంలో అధికారులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు సంఘాల నేతలు సత్యనారాయణ, శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సర్వీసు రూల్స్‌కు సంబంధించి ప్రయోజనాలు కాపాడాలని, ఐదురోజుల పని విధానం అమలు చేయాలని, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులపై స్పష్టత కోరుతూ నిరసన వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. దీంతో అఖిల భారత బ్యాంకు అధికారులు, ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని అన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 10లక్షల మంది ఉద్యోగులు ఈ బంద్‌లో పాల్గొన్నారని తెలిపారు. ఇకనైనా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

ఐటిడిఎ అధికారుల తీరుపై..
జెసి ఆగ్రహం
ప్రణాళికతో పనులు పూర్తిచేయాలని సూచన
మేడారం అభివృద్ధి పనులను పరిశీలించిన జెసి
గోవిందరావుపేట, డిసెంబర్ 18: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం కోట్లాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులను జాయింట్ కలెక్టర్ పౌసమిబసు బుధవారం పరిశీలించారు. ట్రైనీ కలెక్టర్ రాజీవ్ హన్మంతు, ములుగు ఆర్డీఓ మోతిలాల్‌తో కలసి పస్రా, తాడ్వాయిల మీదుగా మేడారం చేరుకున్నారు. పలు శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు శాఖలు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభిస్తే ఐటిడిఎ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను టెండర్ల ప్రక్రియ పూర్తి చేయకపోవడంపై జెసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ తేదీలోగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తారో సమగ్ర నివేదిక అందజేయాలని ఐటిడిఎ ట్రైబర్ వెల్ఫేర్ అధికారులకు జెసి ఆదేశాలు దాఖలు చేశారు. అభివృద్ధి పనులలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 2.25కోట్ల రూపాయలతో ఊరట్టం వంతెన పనులు అసంపూర్తిగా మిగలాగ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని సంబంధిత అధికారులను జెసి అడిగి తెలుసుకున్నారు. అయితే కాంట్రాక్టర్‌కు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, సకాలంలో స్పందించకపోతే శాఖా తరపున పనులు పూర్తిచేస్తామని అధికారులు జెసి వివరించారు. అంతేకాకుండా రోడ్డు పనులు చేపట్టే సమయంలో అటవీ శాఖ నుండి ఇబ్బందులు తలెత్తుతున్నాయని పలు శాఖల అధికారులు జెసి దృష్టికి తీసుకువచ్చారు. అయితే అభివృద్ధి పనుల అంచనాలు రూపొందించినప్పుడు మట్టి సేకరణ ఎక్కడి నుండి చేయాలో అంచనాల్లో పొందుపరచలేదా అని జెసి ప్రశ్నించారు. టెండర్‌లో పాల్గొనే సమయంలోనే కాంట్రాక్టర్లు ఆయా పనుల కోసం ముందుగానే అంచనాలు సిద్ధం చేసుకుంటారని, అటవీశాఖ అడ్డుకుంటున్నారనే పేరుతో పనులను జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అడవులకు నష్టం కలగకుండా ప్రైవేటు క్వారీల నుండే మట్టిని తరలించాలని సూచించారు. మేడారంలో పనులు చేసే అన్ని శాఖల అధికారులు ప్రణాళికలతో, నాణ్యతతో అభివృద్ధి పనులు పూర్తిచేయాలని అన్నారు. ప్రతి శాఖకు సంబంధించిన పనుల పురోగతిపై ప్రతివారం ముందుగానే నివేదికలు సిద్ధం చేయాలని, తమ పరిశీలనలో నివేదిక ప్రకారం స్థానికంగా పనులు జరగకపోతే అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని శాఖలు సమన్వయంతో జనవరి నెలాఖరులోగా పనులు పూర్తిచేసేలా చూడాలని, సమయం దగ్గర పడుతున్న కొద్ది అధికారులపై భారం పెరుగుతుందని గుర్తుచేశారు. కాగా పస్రా, తాడ్వాయి మధ్య గల రోడ్డు ఇరుకుగా ఉండటం, సైడ్‌బర్మ్‌లు అధ్వాన్నంగా ఉండటంతో అసహానం వ్యక్తం చేసిన జెసి పనుల పురోగతిపై నేషనల్ హైవే అధికారులను ప్రశ్నించారు. ఈ మేడారం జాతర ముందుగానే పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని ఎన్‌హెచ్ అధికారులు జెసికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో తహశీల్దార్ పూల్‌సింగ్‌తోపాటు పలు ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సిఎం ఫొటోలపై బురదనీళ్లు
ప్రభుత్వ ప్రచార వాహనాలను అడ్డుకున్న కాంగ్రెస్ నేత శ్రీహరి
వరంగల్, డిసెంబర్ 18: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేసేందుకు జిల్లాకు వచ్చిన వాహనాలను కాంగ్రెస్ నాయకుడు, శాఫ్ మాజీ డైరెక్టర్ రాజనాల శ్రీహరి బుధవారం అడ్డుకున్నారు. ఆ వాహనాలపై ఉన్న ముఖ్యమంత్రి ఫొటోలపై పేడ, బురద నీళ్లను చల్లి సిఎం ఫొటోలు కనిపించకుండా చేశారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సమాచార శాఖకు చెందిన ఆరు ప్రచార వాహనాలు బుధవారం జిల్లాకు వచ్చాయి. వీటిని రెవెన్యూ డివిజనల్ కేంద్రాలకు తరలించేందుకు వీలుగా జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో పార్కింగ్ చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న రాజనాల శ్రీహరి అక్కడికి చేరుకున్నారు. నీళ్లలో పేడ, బురదను కలిపి వాటిని సిఎం ఫొటోలపై చల్లారు. అంతేకాకుండా చీపురు కట్ట చేతపట్టుకుని పేడ నీళ్లలో ముంచి ఫొటోపై అద్దారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో ముఖ్యమంత్రి అడ్డుగా నిలుస్తున్నారని ఆరోపిస్తూ ఈ చర్యకు పూనుకున్నట్లు శ్రీహరి విలేఖరులతో చెప్పారు. తెలంగాణ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుని తథానుగుణంగా రాష్టప్రతి ద్వారా కేంద్ర ప్రభుత్వం బిల్లును అసెంబ్లీకి పంపించారని చెప్పారు. సీమాంధ్ర వాదనతో ముఖ్యమంత్రి విభజనకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. సిఎం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తగిన గుణపాఠం చెబుతామని శ్రీహరి హెచ్చరించారు.

-- ప్రభుత్వ వసతిగృహంలో --
విషాహారం తిని
విద్యార్థినులకు అస్వస్థత
నక్కలగుట్ట, డిసెంబర్ 18: నగరంలోని బాలసముద్రం ప్రభుత్వ సాంఘిక సంక్షేమ విద్యార్థినుల వసతిగృహంలో ఫుడ్ పాయిజన్ జరిగి పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు పూనుకోగా అధికారులు రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళితే.. బాలసముద్రంలో ఎస్సీ ఎస్‌ఎంహెచ్ హాస్టల్‌లో 280మంది విద్యార్థినులు వసతి పొందుతున్నారు. విద్యార్థినుల తాగునీటి వినియోగానికి బోరుబావి నీరు వాడటంతో అవి కలుషితమయ్యాయి. అంతేకాకుండా ఆ నీటితోనే వంటలు చేయడంతో భోజనం కూడా కలుషితమయింది. గత వారంరోజులుగా విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌కు గురవుతూ వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నా హాస్టల్ వార్డెన్ నవమణి పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపించారు. ఈ వారంలో మొత్తం 40నుండి 60మంది వరకు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని, దీంతో వారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రి, వరంగల్ ఎంజి ఎం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారని తెలుస్తోంది. ఆలస్యంగా ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో ఎబిఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పాలకుర్తి వెంకటేష్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆ హాస్టల్ ముందు ఆందోళనకు దిగి ధర్నా చేశారు. వార్డెన్ నిర్లక్ష్యం, నాణ్యతలేని ఆహారం ఇవ్వడంతోనే విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ జరిగిందని, వెంటనే వార్డెన్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలసి డిఎస్‌డబ్ల్యుఓ రమాదేవి, డిడి రోసన్న రంగంలోకి దిగి తగిన చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఎబిఎస్‌ఎఫ్ కార్యకర్తలు ఆందోళన విరమించారు.

రేపటి నుండి కాకతీయ
ఉత్సవాల ముగింపు

సౌండ్ అండ్ లైట్ ప్రదర్శన తిలకించిన కలెక్టర్
వరంగల్, డిసెంబర్ 18: ఏడాదికాలంగా కొనసాగుతున్న కాకతీయ ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం నుండి మూడురోజులపాటు ఈ వేడుకలు జరగనున్నాయి. కాకతీయ ప్రభువులు నిర్మించిన చారిత్రక వేయిస్తంభాల ఆలయం, వరంగల్‌కోట, రామప్ప దేవాలయం ప్రాంగణం వేదికలుగా ముగింపు కార్యక్రమాలను ఘనంగా చేపట్టనున్నారు. ముగింపు కార్యక్రమాల గ్రాండ్ రిహార్సల్ బుధవారం జరిగింది. వరంగల్‌కోట వేదికగా ప్రదర్శించిన సౌండ్ అండ్ లైట్ కార్యక్రమాన్ని కలెక్టర్ కిషన్ కుటుంబసభ్యులతో తిలకించారు. కాగా ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను పురస్కరించుకుని వరంగల్‌కోట ప్రాంగణంలోని కీర్తితోరణం, కుష్‌మహాల్ తదితర చోట్ల ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వెలుగులు కాంతులీనుతున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించిన కాకతీయ ఉత్సవాలలో భాగంగా ఏడాదిపాటు వివిధ కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించారు. ముగింపు వేడుకను కూడా గుర్తుంచుకునేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. చరిత్రలో కాకతీయ ప్రభువుల ప్రాభవం నిలిచే విధంగా, కాకతీయ ఉత్సవాల గుర్తుగా వరంగల్ నగరంలో భారీ పైలాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

అందరూ దేశభక్తిని
పెంపొందించుకోవాలి
స్వామి అర్చనానంద
ఆత్మకూరు, డిసెంబర్ 18: సమాజంలో ప్రతి ఒక్కరు దేశభక్తిని పెంపొందించుకోవాలని రామకృష్ణ మఠం స్వామి అర్చనానందజీ పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో చేపట్టిన రథయాత్ర బుధవారం ఆత్మకూరు మండలకేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా సర్పంచ్ సామ్యెల్, మాజీ సర్పంచ్ పలుకల మంజుల, మాజీ జడ్పీటిసి సత్యనారాయణ, ఆర్‌ఎస్‌ఎస్ మండల కార్యవాహ్ ఆర్.ఎల్.కె.ప్రసాద్, గ్రామ వికాస్‌పరిషత్ జిల్లా బాధ్యుడు శంకర్‌జీ, బిజెపి మండల అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్, ప్రొబేషనరీ ఎస్సై రవిచంద్ర, వివిధ పాఠశాలల విద్యార్థులు స్వాగతం పలికారు. రథయాత్ర సందర్భంగా కొత్తబస్టాండ్ వద్ద గల స్వామి వివేకానంద విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో వాడవాడల శోభాయాత్ర ఘనంగా జరిగింది. మహిళలు సరస్వతి విద్యామందిర్ వద్ద మంగళహారతులతో స్వాగతం పలికారు. పోచమ్మ సెంటర్‌లో శివాజీ విగ్రహానికి అర్చనానందజీ పూలమాల వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానందుడి అగ్నిమంత్రాలు మహాత్మాగాంధీ, భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, సుభాష్‌చంద్రబోస్ వంటి స్వాతంత్య్ర సమరయోధులకు స్ఫూర్తిని ఇచ్చాయని అన్నారు. ఇప్పటికీ స్వామిజీ జీవితచరిత్ర పఠిస్తే ఎందరో దేశభక్తులు తయారవుతారని చెప్పారు. స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు 120దేశాలలో జరుపుతున్నారని తెలిపారు. స్వామిని విశ్వగురువుగా ఆయన కొనియాడారు. దేశంకోసం త్యాగాలు చేసిన వారే నిజమైన హీరో అని అభివర్ణించారు. బలమే జీవనం, బలహీనమే మరణమని, వజ్రసంకల్పంతో దేశానైనా సాధించవచ్చని వివేకానందుడి బోధనలు నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.

యువకుడి
దారుణ హత్య
గోవిందరావుపేట, డిసెంబర్ 18: తాడ్వాయి మండలం భూపతిపూర్‌లో మంగళవారం అర్థరాత్రి పోడెం మహేష్ (20) యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్సై హతిరాం కథనం ప్రకారం ఛత్తీస్‌గడ్ ప్రాంతానికి చెందిన గుత్తికోయల కుటుంబాలు గత సంవత్సరకాలంగా మండలంలోని భూపతిపూర్ ప్రాంతంలో ఉంటున్నారు. భార్య లక్ష్మితోపాటు కలసి ఉంటున్న మహేష్ గత నాలుగురోజులుగా భార్యకు జ్వరం రావడంతో దగ్గరలో ఉన్న అమ్మమ్మ ఇంటికి పంపించాడు. అయితే బుధవారం ఉదయం భార్య లక్ష్మి ఇంటికి చేరుకోగా హత్యకు గురై మహేష్ శవం కనిపించింది. దీంతో స్థానికుల సహకారంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై హతిరాం వివరించారు.

పోస్టుమార్టం వద్ద ఉద్రిక్తత
భవానీని కొట్టి చంపారని బంధువుల ఆందోళన
పరారీలో భర్త, అత్త, మరిది
డిఎస్పీ హామీతో పోస్టుమార్టం
గూడూరు, డిసెంబర్ 18: మండలంలోని చిన్న ఎల్లాపురం శివారు వెంగంపేట గ్రామానికి చెందిన వివాహిత ఆరెళ్ల భవానీ (22) మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా బుధవారం పోస్టుమార్టం గది వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భవానీని కొట్టి చంపిన అనంతరం క్రిమిసంహార మందు తాగించారని, మృతురాలి తల్లితండ్రులు అప్పరాజుపల్లి గ్రామానికి చెందిన పైండ్ల కిష్టయ్య, రామక్కలు ఆరోపించారు. మంగళవారం రాత్రి మృతురాలి బంధువులు, అప్పరాజుపల్లి గ్రామస్థులు దాదాపు యాబై మంది వెంగంపేటకు చేరుకున్నారు. ఇదే సమయంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని, ముందే అంచనా వేసిన నర్సంపేట డిఎస్పీ కడియం చక్రవర్తి, పోలీసు బలగాలతో అదే రాత్రి గ్రామానికి చేరుకుని పోలీసు పికెట్‌ను ఏర్పాటు చేశారు. ఉదయం భవానీ మృతదేహాన్ని మండల కేంద్రంలోని పోస్టుమార్గం గదికి తీసుకరాగా అప్పరాజుపల్లి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో చేరుకుని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. మృతురాలి భర్త దేవేందర్, అత్త సమ్మక్క, మరిది స్వామిలు పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలపగా.. అయితే వీరంతా పోలీసు అదుపులో ఉన్నారని వారిని ఇక్కడికి తీసుకవస్తే పోస్టుమార్టం నిర్వహించేందుకు అంగీకరిస్తామని మృతురాలి బంధువులు భీష్మించుకుని బైఠాయించారు. ఈదశలో న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి చంద్రన్న జోక్యం చేసుకుని భవానీని చంపిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో తాము మృతురాలి కుటుంభానికి అండగా ఉండి ఆందోళన చేస్తామని చెప్పారు. డిఎస్పీ చక్రవర్తి మాట్లాడుతూ నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని హామి ఇచ్చారు. తీరా మృతదేహాన్ని పోస్టుమార్టం గదిలోపలికి తరలించే క్రమంలో మహిళలు మళ్లీ అడ్డుకున్నారు. సుమారు అరగంట పాటు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఈ దశలో అప్పుడే చేరుకుని మృతురాలి తోటి కోడలు ఆరెళ్లి స్వామి భార్య చెన్నారావుపేట మండలం జల్లి గ్రామానికి చెందిన వౌనికి తనను కూడా తీవ్రంగా అత్త, మామలు వేధించేవారని, గత నెల రోజులుగా పుట్టింట్లో ఉన్నట్లు డిఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది.పోస్టుమార్టం అనంతరం భవానీ మృతదేహాన్ని స్వగ్రామమైన అప్పరాజుపల్లికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

అవస్థలపాలైన ఖాతాదారులు
english title: 
warangal

ప్రజా ధనాన్ని దిగమింగిన అక్రమార్కులపై చర్యలేవీ...?

$
0
0

నిజామాబాద్, డిసెంబర్ 18: అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న ప్రజా ధనాన్ని దిగమింగిన అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సాహసించడం లేదు. ఈ నిస్తేజ వైఖరిని అనుకూలంగా మల్చుకుంటున్న పలువురు ప్రజాప్రతినిధులు దర్జాగా స్వాహాపర్వానికి పాల్పడుతున్నారు. తమ పరిపాలనా దక్షతతో అధికార యంత్రాంగాన్ని గాడిలో పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తూ, కటువుగా వ్యవహరిస్తారనే పేరొందిన కలెక్టర్ల హయాంలోనూ దుర్వినియోగమైన ప్రజా ధనాన్ని తిరిగి రాబట్టుకోలేకపోతున్నారు. ఒత్తిళ్లు పెరిగిన సమయంలో అక్రమార్కులకు కేవలం నోటీసులు అందించడంతోనే సరిపెట్టుకుంటున్నారు. తప్పుడు లెక్కలు చూపి నిధులను పక్కదారి పట్టించినట్టు విచారణలో నిర్ధారణ అయినప్పటికీ, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టకపోవడంలో గల ఆంతర్యమేమిటన్నది అంతుచిక్కడం లేదు. మాజీ సర్పంచ్‌ల నుండి మొదలుకుని, ఉపాధి హామీ పథకంలో వివిధ స్థాయిలలో లెక్కకుమిక్కిలి చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై ఏళ్ల తరబడి ఉదాసీన వైఖరినే అవలంభిస్తున్నారు. చివరకు పొరుగు రాష్ట్రాల నుండి రావాల్సిన నష్టపరిహారాన్ని రాబట్టుకోవడంలోనూ మీనమేషాలు లెక్కిస్తున్నారు. జిల్లాలో 718 గ్రామ పంచాయతీలు ఉండగా, గడిచిన 1984వ సంవత్సరం నుండి ఇప్పటివరకు సుమారు 167 మంది మాజీ సర్పంచ్‌లు వివిధ అభివృద్ధి పనుల కోసం మంజూరైన నిధులను స్వాహా చేసినట్టు అధికారుల విచారణల్లో వెలుగుచూసింది. ఆర్థిక సంఘం నిధులతో పాటు బిఆర్‌జిఎఫ్, ఇజిఎస్ పథకాల కింద మంజూరైన సొమ్మును, ప్రజల నుండి పన్నుల రూపేణా వసూలు చేసిన నిధుల్లో దాదాపు 1.28 కోట్ల రూపాయలను దిగమింగినట్టు నిర్ధారణ అయ్యింది. అయితే గడిచిన మూడు దశాబ్దాల కాలం నుండి అధికారులు ఇప్పటివరకు కేవలం ముగ్గురు మాజీ సర్పంచ్‌ల నుండి అతికష్టం మీద 2.09 లక్షల రూపాయలను మాత్రమే రికవరీ చేయగలిగారు. మిగతా వారికి నోటీసులు అందించడంతోనే సరిపెట్టుకుని చేతులు దులుపుకున్నారు. వాస్తవానికి నిధులు పక్కదారి పట్టించిన వారిపై రెవెన్యూ రికవరీ యాక్టును ప్రయోగిస్తూ వారి ఆస్తులను జప్తు చేయడమే కాకుండా, క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు అధికారులకు వెసులుబాటు ఉన్నప్పటికీ, మాజీ సర్పంచ్‌ల రాజకీయ పలుకుబడి తదితర కారణాల వల్ల ఈ దిశగా చర్యలు చేపట్టేందుకు జంకుతున్నారు. ఇక ఉపాధి హామీ పథకంలో గల్లంతైన నిధులను చూస్తే అడ్డూఅదుపూ లేని అవినీతి, అక్రమాలు కనిపిస్తాయి. ఆరు విడతలుగా జరిపిన సామాజిక తనిఖీల్లో జిల్లాలో 8.60 కోట్ల రూపాయల పైచిలుకు ప్రజాధనం దుర్వినియోగమైనట్టు తేలింది. ఆ మొత్తాన్ని అక్రమార్కుల నుండి వసూలు చేయాల్సిన అధికారులు, కేవలం 1.28 కోట్ల రూపాయలను మాత్రమే రికవరీ చేయగలిగారు. ఇబ్బడిముబ్బడిగా మంజూరయ్యే నిధులతో కాసుల వర్షం కురిపిస్తున్న ఉపాధి పనుల్లో పలువురు మేట్లు మొదలుకుని గ్రూప్ లీడర్లు, విఓలు, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎఇలు, పోస్టల్ సిబ్బంది, చివరకు ఎంపిడిఓ స్థాయి అధికారుల వరకు అందినమేరకు నిధులను దండుకున్నారు. ఇక ప్రజాప్రతినిధుల విషయానికి వస్తే మాజీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ప్రమేయం లెక్కకు మిక్కిలిగా ఉన్నట్టు తేలింది. జిల్లాలో 3600 మందికి ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంతో సంబంధాలున్నట్టు సోషల్ ఆడిట్‌లో వెల్లడైంది. అయినప్పటికీ బాధ్యులపై చర్యలు శూన్యంగానే మారాయి. కనీసం పక్కదారి పట్టించిన ప్రజాధనాన్ని సైతం తిరిగి రాబట్టుకోలేని నిస్సహాయ స్థితిలో అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లా సరిహద్దులో మంజీరా నది నుండి అక్రమంగా ఇసుక తరలింపునకు అనుమతులు మంజూరు చేసినట్టు జాయింట్ సర్వేలో వెల్లడైన నేపథ్యంలో పొరుగున ఉన్న మహారాష్టల్రోని నాందేడ్ జిల్లా యంత్రాంగం సుమారు 11 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని గత ఏడాదిన్నర క్రితం ఇక్కడి జిల్లా యంత్రాంగం నోటీసులు జారీ చేసింది. కోట్ల రూపాయల విలువ చేసే ఇసుకను కొల్లగొట్టిన మహా సర్కార్ ఈ నోటీసులకు నామమాత్రంగానైనా స్పందించకుండా, ఇంతవరకు నయాపైసా పరిహారం జమ చేయించలేదు. ఇదే తరహాలో అడ్డగోలుగా నాసిరకం పనులు జరిపించిన కాంట్రాక్టర్లకు సైతం లక్షలాది రూపాయల్లో విధించిన జరిమానాలు రికార్డులకే పరిమితం అవుతున్నాయి.

రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్న సీమాంధ్రులు

టి-బిల్లుపై అసెంబ్లీలో వెంటనే చర్చ జరపాలి

మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి

ఆర్మూర్, డిసెంబర్ 18: తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో వెంటనే చర్చ జరపాలని, బిల్లుపై చర్చించకుండా అసెంబ్లీని అడ్డుకుంటూ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారని మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్‌రెడ్డి అన్నారు. మండలంలోని మంథని గ్రామంలో బుధవారం పార్టీ మండల అధ్యక్షుడు పిసి బోజన్న అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, టి-బిల్లుపై చర్చించాలని రాష్టప్రతి అసెంబ్లీకి పంపిస్తే సీమాంధ్రులు అడ్డుకోవడం శోచనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల కలిగే నష్టాలు చర్చించాలే తప్ప బిల్లుపై ఎలాంటి చర్చ జరపకుండా అసెంబ్లీని వాయిదా వేయించడం రాష్టప్రతిని, రాజ్యాంగాన్ని అవమానపర్చడమే అవుతుందని అన్నారు. తెలంగాణ బిల్లును యుద్ధ విమానంలో పంపించకుంటే కాలినడకన పంపిస్తారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడితే నీటి, విద్యుత్ అంశాల్లో సీమాంధ్రులకు నష్టం జరుగుతుందని చెప్పడమే తప్ప అసెంబ్లీలో ఎందుకు చర్చించడం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటు కావడం ఖాయమని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ సందర్భంగా మంథని సర్పంచ్ మెట్టు వౌనికసంతోష్, వైసిపి యువకులు, వివిధ యువజన సంఘాలు సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని ఆయన పూలమాలలు వేసి అభినందించారు. అంతకుముందు డప్పు వాయిద్యాలతో సురేష్‌రెడ్డిని ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ కూడలి వద్ద ఆయన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ వైస్ చైర్మన్ శ్రావణ్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ వౌనిక, యువజన కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఖాందేశ్ శ్రీనివాస్, ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ త్రివేణి గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోజారెడ్డి, సర్పంచ్‌లు బొడ్డు గంగాధర్, రవిగౌడ్, అనురాధ, బోజారెడ్డి, డిసిసి కార్యదర్శి అర్గుల్ సురేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇ.గంగాధర్, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

31న జాతీయ రహదారుల దిగ్బంధం

ఈలోగా పసుపు కొనుగోలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి

ఆర్మూర్, డిసెంబర్ 18: పసుపు పండిస్తున్న రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వైఖరికి నిరసనగా ఈ నెల 31వ తేదీన ఆర్మూర్‌లో జాతీయ రహదారుల దిగ్బంధం చేయనున్నట్లు పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహంనాయుడు అన్నారు. ఆర్మూర్‌లోని రైతుసేవా కేంద్రంలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. పసుపు రైతుల సమస్యలపై ఆర్మూర్‌లో నిర్వహించనున్న రాష్ట్ర సదస్సుకు హాజరుకావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌ను కోరగా అందుకు సమ్మతించారని, ఈ విషయమై రాష్ట్ర పర్యటనకు వస్తున్నట్లు మంత్రి శరద్‌పవార్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఫోన్ చేయగా, రాష్ట్రంలో పరిస్థితులు బాగా లేవని, పర్యటనను వాయిదా వేసుకోవాలని సిఎం చెప్పడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. శరద్ పవార్ పర్యటనను వాయిదా వేయించిన ముఖ్యమంత్రి కిరణ్ వైఖరికి నిరసనగా ఈ నెల 31వ తేదీన ఆర్మూర్‌లో పసుపు రైతుల రాష్ట్ర స్థాయి గర్జన, జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాంత రైతులపై ముఖ్యమంత్రికి ప్రేమ లేదని దీంతో నిరూపణ అయ్యిందని విమర్శించారు. నాఫెడ్ లేదా మార్క్‌ఫెడ్ ద్వారా పసుపును కొనుగోలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాల్సి ఉంటుందని, ఈ సందర్భంగా నష్టం సంభవిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా నష్టాన్ని భరించాల్సి ఉంటుందని అన్నారు. 31వ తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి క్వింటాలు పసుపుకు 10 వేల రూపాయల మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని ప్రకటన చేయాలని, కేంద్రానికి లేఖ రాసి అనుమతి పొందాలని, లేనిపక్షంలో 31వ తేదీన జాతీయ రహదారుల దిగ్బంధం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి కిరణ్ కళ్లు తెరవాలని, లేకుంటే పసుపు రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. పసుపు రైతులను ఆదుకోకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని అన్నారు. ఈ సమావేశంలో బాల్కొండ మాజీ ఎంపిపి జక్క రాజేశ్వర్ పాల్గొన్నారు.

జాతీయస్థాయిలో
ఐఎపి నిజామాబాద్ చాప్టర్ ఉత్తమ ప్రదర్శన

ఇందూర్, డిసెంబర్ 18: ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఎపి) స్వర్జజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో నిజామాబాద్ ఐఎపి చాప్టర్‌కు కనకవర్షం కురిసిందని అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ నీల రాంచందర్, డాక్టర్ శ్రీశైలం వివరించారు. బుధవారం ఏర్పాటు చేసిన నిజామాబాద్ ఐఎపి హాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఐఎపి స్వర్ణ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన పోటీలకు ఈసారి నిజామాబాద్ నుండి పంపించిన విభాగాల్లోనూ బహుమతులు కైవసం చేసుకుందన్నారు. రెడ్‌క్రాస్‌తో సంయుక్తంగా 600పైగా విద్యార్థులతో కలిసి నిర్వహించిన బేసిక్ లైఫ్ స్కిల్స్ విభాగంలో దేశంలోనే అత్యుత్తమ శాఖగా ఎంపికైందన్నారు. ఓఆర్‌ఎస్ వారోత్సవాలు, పిల్లలు, కిశోర బాలల వారోత్సవాలలో ద్వితీయ స్థానం, తల్లిపాల వారోత్సవాలలో తృతీయ స్థానం దక్కించుకుందన్నారు. మొత్తం మీద ఓవరాల్‌గా నిజామాబాద్ ఐఎపి సెకండ్ బెస్ట్ ట్రూప్‌గా నిలిచిందన్నారు. ఇందుకు సంబంధించి 2014, జనవరి 9వ తేదీన బహుమతులు ప్రదానం చేస్తారని అన్నారు. విలేఖరుల సమావేశంలో ఐఎపి ప్రతినిధులు డాక్టర్ సుమలత, డాక్టర్ ఆనంద్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్టర్ల పనితీరుపై కలెక్టర్ ఆగ్రహాం

దోమకొండ, డిసెంబర్ 18: మండలంలో వివిధ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనితీరుపై జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అంబారీపేట్ గ్రామంలో పలు పథకాలను పనులను పరిశీలించారు. మండలంలోని అంబారీపేట్, కోనాపూర్, బీబీపేట్, యడారం గ్రామాల్లో చేపట్టిన సిసి రోడ్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సిసి రోడ్లపై క్యూరింగ్ ఏమాత్రం సరిగా లేదన్నారు. పంచాయతీరాజ్ వర్క్ ఇన్స్‌పెక్టర్ కిరణ్‌ను పిలిచి అనుభవం ఉన్న కార్మికులచే పనులు చేపిస్తే నాణ్యత ఉంటుందని, నాణ్యత లేని పనులు ఎందుకు చేస్తారని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. అదే గ్రామంలో ఉప ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ నిర్వహించి, అక్కడి విధులు నిర్వహిస్తున్న హెల్త్ అసిస్టెంట్ వినోద్‌ను రికార్డులోని వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెలివర్ కేసులు ఉంటే 108 సేవలను వినియోగించుకోవాలన్నారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా అంబారీపేట్ నుండి గ్రామ శివారు వరకు మెటల్ రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం బీబీపేట్, దోమకొండ గ్రామాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పనితీరు మార్చుకోకపోతే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల కేంద్రంలోని స్ర్తిశక్తి భవనం, ఎంపిపి కార్యాలయ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ గంగాధర్, ఎంపిడిఓ హిరణ్మయి, ఆర్‌ఐ గంగాధర్, పంచాయతీరాజ్ ఎఇ హన్మాగౌడ్, ఐకెపి ఎపిఎం సునితా, సర్పంచ్‌లు గంగవ్వ, గాడి లింగం, వెంకటి, తదితరులు ఉన్నారు.

బ్యాంకర్ల సమ్మెతో
వినియోగదారుల ఇబ్బందులు

నిజామాబాద్ టౌన్, డిసెంబర్ 18: డిమాండ్ల సాధన కోసం ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో బుధవారం వాణిజ్య బ్యాంకుల ఉద్యోగులు సమ్మె నిర్వహించడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా రోజువారీగా లావాదేవీలు నిర్వహించే వ్యాపార వర్గాల వారు బ్యాంకు సేవలు స్తంభించడంతో అపసోపాలుపడ్డారు. ఐసిఐసిఐ వంటి కొత్తగా ఏర్పాటైన కొన్ని బ్యాంకులు మినహా జాతీయం చేసిన జాబితాలో ఉన్న ఉన్న వాణిజ్య బ్యాంకులను మూసి ఉంచారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టి నిరసన తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో నూతనంగా ప్రవేశపెడుతున్న సంస్కరణలను ఉపసంహరించుకోవాలని, వేతనాల స్థిరీకరణ విషయంలో మొండి వైఖరిని విడనాడి ఇదివరకు కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. జిల్లా కేంద్రంలో ఎస్‌బిహెచ్ మెయిన్ బ్రాంచి ఎదుట సుమారు 400 మంది బ్యాంకు ఉద్యోగులు బైఠాయించి ధర్నా చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ గత ఎంతోకాలం నుండి పోరాడుతున్నప్పటికీ, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని యునైటెడ్ ఫోరం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, లేనిపక్షంలో నిరవధిక ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో బ్యాంకు ఎంప్లాయాస్ అసోసియేషన్ల ప్రతినిధులు బోస్‌బాబు, రాంకిషన్‌రావు, క్రాంతి, బల్వంత్‌రావు, నారాయణ, దివాకర్‌రెడ్డి, మాలతి, శ్రీనివాస్‌రావు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

కేసుల సత్వర పరిష్కారానికి
ఇ-కోర్టులు దోహదం
జిల్లా జడ్జి షమీమ్‌అఖ్తర్

బిచ్కుంద, డిసెంబర్ 18: మండల కేంద్రమైన బిచ్కుందలోని మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో నూతనంగా ఏర్పాటు చేసిన ఇ-కోర్టును బుధవారం జిల్లా జడ్జి షమీమ్‌అఖ్తర్ లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, కేసుల సత్వర పరిష్కారానికి ఇ-కోర్టు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఇప్పటికే జిల్లాలోని ఆర్మూర్, బోధన్, బాన్సువాడ కోర్టుల్లో దీనిని ఏర్పాటు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతిక విజ్ఞానాన్ని అన్వయించుకుని సాధ్యమైనంత త్వరగా కేసులను పరిష్కరించేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. అనంతరం ఆయన మెజిస్ట్రేట్ కోర్టు కోసం ఏర్పాటు చేస్తున్న భవన నిర్మాణం పనులను పరిశీలించారు. పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా లోపాలకు తావులేకుండా పనులను చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ అసద్‌అలీకి సూచించారు. జిల్లా జడ్జి వెంట మేజిస్ట్రేట్‌లు రమేష్, గంగాధర్, సిఐ వెంకటేశ్ తదితరులు ఉన్నారు.
బాన్సువాడలో ఇ-కోర్టు ప్రారంభం
బాన్సువాడ: బాన్సువాడలోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలోని భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇ-కోర్టు (జ్యుడీషియల్ సర్వీస్ సెంటర్)ను బుధవారం జిల్లా జడ్జి షమీమ్‌అఖ్తర్ ప్రారంభించారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు మొదలుకుని మున్సిఫ్ కోర్టు వరకు అన్ని న్యాయస్థానాల్లో కేసుల పురోగతి గురించి సామాన్యులు సైతం తెలుసుకునేలా అవకాశం కల్పించేందుకు ఇ-కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇ-కోర్టుకు సంబంధించిన వెబ్‌సైట్‌కు వెళ్లి ఆన్‌లైన్ విధానం ద్వారా వివిధ కేసుల వివరాలను తెలుసుకోవచ్చని సూచించారు. బాన్సువాడ కోర్టు పరిధిలోని అన్ని కేసుల వివరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానిక మేజిస్ట్రేట్ ఈశ్వరయ్యకు సూచించారు. ఇ-కోర్టు వెబ్‌సైట్ ద్వారా పాత్రికేయులు సైతం వివిధ కోర్టులు వెలువరించిన తీర్పుల గురించి తెలుసుకుని వాటి వివరాలను సేకరించవచ్చని అన్నారు. కాగా, కోర్టు భవనం పక్కనే శ్మశానవాటిక ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు జిల్లా జడ్జి దృష్టికి తేగా, స్థానిక కమ్యూనిటీ సెంటర్ భవనాన్ని ఆయన పరిశీలించారు. గతంలో ఇక్కడే కొన్నాళ్ల పాటు మున్సిఫ్ కోర్టు కొనసాగిందని, ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన కోర్టును ఏర్పాటు చేస్తే ఎంతో అనువుగా ఉంటుందని సీనియర్ న్యాయవాదులు శివకుమార్, రమాకాంత్, లక్ష్మారెడ్డి, మోహన్‌రెడ్డి, లక్ష్మినారాయణమూర్తి, హమీద్, ఖలీల్ తదితరులు జిల్లా జడ్జిని కోరారు. దీనిపై జిల్లా జడ్జి స్పందిస్తూ, కమ్యూనిటీ సెంటర్ స్థలానికి సంబంధించిన నివేదికను పంపిస్తే, భవన నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తానన్నారు. ఒకవేళ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భవన నిర్మాణం జరిపిస్తే, అద్దె చెల్లించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

టిడిపితో పొత్తు ప్రసక్తే లేదు
బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి

కామారెడ్డి, డిసెంబర్ 18: రాబోయే ఎన్నికల్లో బిజెపి పార్టీ టిడిపితో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బిజెపి జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో మోడీ ప్రభంజనం కొనసాగుతుందన్నారు. టిడిపితో పొత్తు పెట్టుకుంటే గతంలో బిజెపి చాలా నష్టపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పార్లమెంట్‌లో బిజెపి సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు మురళిధర్‌గౌడ్, మోతె క్రిష్ణాగౌడ్, గౌరెని లింబాద్రి, విఠల్‌గుప్తా, జులూరి సుధాకర్, అరికెల ప్రభాకర్ యాదవ్, నీలం చిన్నరాజులు, ఉప్పల హరిధర్ తదితరులు పాల్గొన్నారు.

నిజాంసుగర్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు భిక్షమయ్య

బోధన్, డిసెంబర్ 18: తెలుగుదేశం సర్కారు హయాంలో ప్రైవేటుపరమైన నిజాంసుగర్స్ చక్కెర కర్మాగారాలను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు భిక్షమయ్య డిమాండ్ చేశారు. బుధవారం నాడిక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కర్మాగారాల ప్రైవేటీకరణలో అక్రమాలు జరిగాయని సభాసంఘం స్పష్టం చేసిందని వివరించారు. అంతేకాకుండా ఈ కర్మాగారాలను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిఫార్సులు కూడా చేసిందని అన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా కర్మాగారాలను తిరిగి స్వాధీనం చేసుకోలేక పోయిందని ఆయన పేర్కొన్నారు. వందలాది కోట్ల రూపాయల విలువ చేసే ఈ కర్మాగారాలను కేవలం అరవై కోట్ల రూపాయలకు టిడిపి సర్కారు ధారాదత్తం చేసిందని ఆరోపించారు. స్వార్థపూరిత ఆలోచనలతో నిజాంనాటి కర్మాగారాలను కారుచౌక బేరంతో అప్పగించారని ఇది సమంజసం కాదన్నారు. ప్రస్తుతం వేసిన సబ్‌కేబినెట్ సంఘం ఈ ప్రాంత అభివృద్ధిని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్మాగారాలు తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటేనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఇక్కడి కార్మికులు, కర్షకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సబ్‌కేబినెట్ కర్మాగారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పట్ల ప్రైవేటు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన ధ్వజమెత్తారు. 2014 మార్చి 31 లోపు ఇక్కడి కార్మికుల డిమాండ్లకు యాజమాన్యం స్పందించి న్యాయం చేయాలని, లేనిపక్షంలో దేశవ్యాప్తంగా అన్ని సంస్థల కార్మికులు సమ్మెకు దిగుతారని ఆయన స్పష్టం చేశారు. విలేఖరుల సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌బాబు, శంకర్‌గౌడ్, ఏశాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

యువత రక్తదానానికి ముందుకు రావాలి
మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌రావు

బోధన్ రూరల్, డిసెంబర్ 18:యువకులు, విద్యార్థులు రక్తదానానికి ముందుకు రావాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం బోధన్ మండలం ఆచన్‌పల్లి గ్రామంలో గల ఇందూర్ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం ఎంతో గొప్పదని వివరించారు. ఒక వ్యక్తి ఏడాదికి ఆరుసార్లు రక్తదానం చేయవచ్చన్నారు. రక్తదానం చేయడం వలన ఒక మనిషి ప్రాణాన్ని కాపాడినట్లని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. రక్తదానంపై విద్యార్థులు గ్రామాలలోని ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. యువత గ్రామాలలో చేపట్టే ఇటువంటి సేవా కార్యక్రమాలకు తాము అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. రక్తదాన శిబిరంలో 68 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ ప్రతినిధులు కొడాలి కిషోర్, నర్సింహారెడ్డి, వై.శ్రీనివాస్‌రావు, లావణ్య, పి.లక్ష్మి, బసవేశ్వర్‌రావు, రమారెడ్డి, అనంతలక్ష్మి, సూర్యనారాయణ, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఓటరు నమోదు గడువు పెంపును
సద్వినియోగం చేసుకోవాలి

బాన్సువాడ, డిసెంబర్ 18: ఓటరు జాబితాలో కొత్తగా పేర్లు నమోదు చేసుకునే వారి కోసం ఎన్నికల సంఘం గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినందున ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని అదనపు జెసి డాక్టర్ శేషాద్రి కోరారు. బుధవారం ఆయన తహశీల్ కార్యాలయాన్ని సందర్శించారు. కొత్తగా ఓటర్ల జాబితాలో పేర్ల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాల గురించి తహశీల్దార్ శ్రీకాంత్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, నిబద్ధతతో సేవలందించే వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేందుకు ఓటు హక్కుతోనే అవకాశం లభిస్తుందన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని హితవు పలికారు.

గుల్లాలో ఘనంగా కుస్తీ పోటీలు

జుక్కల్, డిసెంబర్ 18: మండలంలోని పెద్దగుల్లాలో దత్త జయంతిని పురస్కరించుకుని బుధవారం కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు. కుస్తీలు పట్టేందుకు గాను పరిసర ప్రాంతాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దులోని హనేగాం, ఔరాద్, దెగ్లూర్ తదితర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో మల్లయోధులు పాల్గొన్నారు. సుమారు 20 వేల రూపాయలతో నిర్వహించిన ఈ పోటీల్లో ఆఖరి కుస్తీలో గెలుపొందిన విజేతకు 1100ర పాయల నగదు బహుమతిని అందజేశారు. ఉత్సవాల సందర్భంగా జారత నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వైశాలిసుధాకర్, గ్రామ నాయకులు మాధవరావుదేశాయ్, రాజుసేట్, కిషన్‌సేట్ తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ హిందీ సదస్సుకు శెట్పల్లి షరీఫ్ ఎంపిక

మోర్తాడ్, డిసెంబర్ 18: మోర్తాడ్ మండలం శెట్పల్లి ఉన్నత పాఠశాలకు చెందిన హిందీ భాష ఉపాధ్యాయుడు షరీఫ్ బెంగుళూర్‌లో జరుగనున్న అంతర్జాతీయ హిందీ సదస్సుకు ఎంపికయ్యాడు. ఈ నెల 27, 28వ తేదీలలో రెండు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సులో షరీఫ్ సినిమా యొక్క పరిభాష, స్వరూపం అనే అంశంపై ఉపన్యసించనున్నాడు. హిందీ సాహిత్యం-సినిమాలు అనే అంశంపై నాలుగు సంవత్సరాలుగా షరీఫ్ పరిశోధనలు చేస్తుండటంతో ఆయనకు ఈ అవకాశం లభించింది. ఢిల్లీలోని యుజిసి, హిందీ విభాగం, న్యూ ఆర్ట్స్ కామర్స్, సైన్స్ కళాశాలల ఆధ్వర్యంలో నిర్వహించనున్న సదస్సుకు అనేక దేశాల నుండి ప్రతినిధులు హాజరుకానున్నారు. కాగా, ఈ సదస్సుకు ఎంపికైన షరీఫ్‌ను గ్రామ సర్పంచ్ లింబాద్రి, ప్రధానోపాధ్యాయుడితో పాటు విద్యా కమిటీ అభినందించారు.

పాత రాజంపేట్ హౌసింగ్ కాలనీ
పెండింగ్ పనులకు మోక్షం
ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ

కామారెడ్డి, డిసెంబర్ 18: మండలంలోని పాతరాజంపేట్ హౌసింగ్ కాలనీలో పెండింగ్ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించిందని ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ చెప్పారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుండి ఫోన్‌లో మాట్లాడుతూ, రాజంపేట పాత హౌసింగ్ కాలనీపై సంబంధిత శాఖలో హౌసింగ్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో రివ్యూ సమావేశం నిర్వహించారని తెలిపారు. ఈ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న పనుల కోసం అధికారులకు సూచించడంతో మిగిలిన పనులను పూర్తి చేసేందుకు అధికారులు ఒప్పుకున్నారన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో 97 ఎకరాల భూమిలో 2400 వరకు ప్లాట్లను పేదలకు ఇచ్చానని, తన ఆదేశల మేరకు దర్శి కన్‌స్ట్రక్షన్స్ కాంట్రాక్టు 130 ఇళ్ళను నిర్మించారని, 2009నుండి మళ్ళీ ఎవరూ పట్టించుకోకపోవడంతో అవి పెండింగ్‌లో ఉండిపోయాయన్నారు. నిలిచిపోయిన ఆ పనులను ప్రారంభించేందుకు సంబంధిత శాఖ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించి, అదే స్థలంలో కొత్త లేఅవుటు తయారుచేసి, అక్కడ రోడ్లు, స్కూల్స్ బిల్డింగ్‌లు, 10 లక్షలతో కమ్యూనిటీ హాల్ లాంటి సౌకర్యాలతో మోడల్ కాలనీగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో గృహ నిర్మాణం కోసం 40 వేలు ఇచ్చే వారని, ఇప్పుడు 80 వేల రూపాయల వరకు ఇచ్చిన ఈ స్కీం పూర్తి కావడం లేదని, అందుకనే ఒక్కొక్క ఇంటికి లెట్రిన్, బాత్‌రూంలు నిర్మించేందుకు అదనంగా స్పెషల్ జీవో కింద కోటి రూపాయలు మంజూరైనట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పనులను నెలలోపు పూర్తి చేస్తారని, నూతన సంవత్సరం జనవరిలో సంబంధిత శాఖ మంత్రిచే శంకుస్థాపన పనులు చేయిస్తామన్నారు. సర్ట్ఫికెట్లు ఉన్న వారికి ఇక్కడ ఇళ్ళ స్థలాను చూపిస్తామన్నారు. అదనంగా 10వేల వరకు పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయన్నారు. సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఐఎఎస్ కార్యదర్శి కలికులం, హౌసింగ్ ఎండి వెంకటేశ్వర్‌రావు, నిజామాబాద్ పిడి చైతన్యకుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారని తెలిపారు.

విశ్వబ్రాహ్మణుల డిమాండ్లను టి.బిల్లులో పొందుపర్చాలి

ఇందూర్, డిసెంబర్ 18: తెలంగాణ ప్రాంత విశ్వబ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, తమ డిమాండ్లను తెలంగాణ బిల్లులో పొందుపర్చాలని నగర కమిటీ అధ్యక్షుడు వై.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. టి.బిల్లులో తమ డిమాండ్లను చేరుస్తూ, అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాల్లో వాటిపై చర్చించాలని కోరుతూ ఈ నెల 22వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఒకరోజు నిరాహార దీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు. బుధవారం నగర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశ్వబ్రాహ్మణుల డిమాండ్లపై అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాల్లో సమగ్రంగా చర్చ జరిపి, టి.బిల్లులో వాటిని పొందుపర్చాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు 22న చేపట్టనున్న నిరాహార దీక్షల్లో పెద్ద సంఖ్యలో విశ్వబ్రాహ్మణులు పాల్గొనాలని, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాలు సంఘీభావంగా నిలవాలని కోరారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంతో వెనుకబడి ఉన్న విశ్వబ్రాహ్మణ జాతిని సమున్నత స్థాయిలో నిలిపేందుకు తెలంగాణ సమాజం అండగా నిలువాలని అభ్యర్థించారు. ఈ సమావేశంలో తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు రవీంద్రకుమార్, వడ్ల మదన్, ఎం.బాలవీరాచారి, రాంమోహనచారి తదితరులు పాల్గొన్నారు.

స్ర్తినిధి రుణాలు అందరికీ అందేలా చూడాలి

ఐకెపి ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశం

భీమ్‌గల్, డిసెంబర్ 18: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్ర్తినిధి రుణాలు మహిళా సంఘాల సభ్యులందరికి అందేలా చూడాలని ఐకెపి ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశం సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో నాలుగు మండలాలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, అర్హులైన మహిళా సంఘాలకు రుణాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదివరకు రుణాలు పొందిన మహిళా సంఘాలు సకాలంలో వాయిదాలు చెల్లించే విధంగా చూడాలన్నారు. ప్రతినెలా గ్రామస్థాయిలో సదస్సులు ఏర్పాటు చేసి మహిళా గ్రూప్‌లలోని సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడంతో వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చూడాలన్నారు. మహిళ సంఘాలు రిజిస్ట్రర్లు సక్రమంగా నిర్వహించేలా సూచనలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఐకెపి జిల్లా ప్రాజెక్టు డిపిఎంలు నూకల శ్రీనివాస్, రమేష్‌తో పాటు భీమ్‌గల్, కమ్మర్‌పల్లి, మోర్తాడ్, వేల్పూర్ మండలాలకు చెందిన ఎపిఎంలు, సిసిలు తదితరులు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితాలో
బోగస్ పేర్ల నమోదును నిలువరించాలి

కలెక్టర్‌ను కోరిన నగర కాంగ్రెస్ అధ్యక్షుడు

నిజామాబాద్ , డిసెంబర్ 18: కొత్తగా చేపడుతున్న ఓటర్ల జాబితాలో బోగస్ పేర్లు నమోదు కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ ప్రద్యుమ్నను కలిసి వినతిపత్రం సమర్పించారు. నగరంలోని 15, 23, 25, 32 తదితర డివిజన్ల పరిధిలో బిజెపి, టిడిపిలకు చెందిన పలువురు నాయకులు ఓటర్ల జాబితాలో బోగస్ పేర్లను నమోదు చేయిస్తున్నారని, వారికి పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు సహకరిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఓటర్ల జాబితాలో కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న వారి పూర్తి వివరాలను సమగ్రంగా పరిశీలన జరిపించాలని, అధికారులను ఇంటింటికీ పంపి సర్వే చేయించాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, ఓటర్ల జాబితాలో బోగస్ పేర్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, క్షేత్ర స్థాయి పరిశీలన జరిపి ఓటర్లుగా అర్హులని నిర్ధారించుకున్న మీదటే వారి పేర్లను నమోదు చేయిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో పిసిసి సహాయ కార్యదర్శి రాజేంద్రప్రసాద్, మాజీ కార్పొరేటర్ వెంకటేశ్, సాయిబాబా ఆలయం చైర్మన్ ఆకుల చిన్నరాజేశ్వర్ తదితరులు ఉన్నారు.

హౌసింగ్ అధికారులకు ‘రాజీవ్ గృహకల్ప’ పాట్లు!

వసతుల లేమితో నివాసాలకు ససేమిరా అంటున్న లబ్ధిదారులు

నిజామాబాద్ , డిసెంబర్ 18: పట్టణ ప్రాంతాల్లోని పేద, బడుగు, బలహీన వర్గాల వారికి పక్కా గృహాలతో కూడిన వసతి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాజీవ్ గృహ కల్ప పథకం కింద నిర్మించిన గృహ సముదాయాలు ఏళ్ల తరబడి ఖాళీగానే ఉండిపోతున్నాయి. మొదట్లో వీటిని దక్కించుకునేందుకు ఎంతో ఆసక్తి కనబర్చిన లబ్ధిదారులు, వాటి నిర్మాణం అనంతరం గుజ్జన గూళ్లను తలపించే ఇరుకిరుకు గదులు, వౌలిక సదుపాయాల లేమిని చూసి, రాజీవ్ గృహకల్ప అపార్ట్‌మెంట్లలో నిర్మించిన ఫ్లాట్లలో నివసించేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పటికే అధికారులు అనేక పర్యాయాలు లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో, చివరకు వాటిని విక్రయించాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఖాళీగా ఉన్న ఫ్లాట్లను విక్రయిస్తామని, ఆసక్తి గల వారు తమను సంప్రదించాలంటూ హౌసింగ్ అధికారులు ఇటీవల ఫ్లెక్సీలను వేలాడదీశారు. అయినప్పటికీ వీటిని సొంతం చేసుకోవాలనే ఆసక్తి ప్రజల్లో ఏమాత్రం కనిపించడం లేదు. అధికారుల ఒత్తిడికి తోడు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో కొంతమంది లబ్ధిదారులు గృహకల్పలోని ఫ్లాట్లలో నివాసం ఉంటున్నారు. అయితే వారికి దాదాపు మూడు సంవత్సరాల నుండి వౌలిక వసతులు ఏమాత్రం మెరుగుపర్చకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి ఇబ్బందులను గమనించిన ఇతర లబ్ధిదారులు గృహకల్ప సముదాయంలో నివాసం ఉండేందుకు జంకుతున్నారు. దీనివల్ల సగానికి పైగా ఫ్లాట్లు ఇంకా ఖాళీగానే దర్శనం ఇస్తున్నాయి. మరోవైపు గృహకల్ప అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి రుణాలు మంజూరు చేసిన బ్యాంకుల నుండి ఒత్తిడి పెరుగుతుండడంతో, చివరకు అధికారులు ఫ్లాట్లను విక్రయానికి పెట్టారని తెలుస్తోంది. నిజామాబాద్ శివారులోని నాగారం ప్రాంతంలో గత నాలుగున్నరేళ్ల క్రితమే వీటి నిర్మాణాలు పూర్తయినప్పటికీ, ఇంకా వాటిని లబ్ధిదారులు స్వాధీనం చేసుకునేందుకు జంకుతున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

గల్లంతైన సొమ్ము కోట్లలో...రికవరీ లక్షల్లోపే! అక్రమార్కులపై చర్యలకు సాహసించని అధికార యంత్రాంగం
english title: 
public money

ఆశావహుల ఆశలు అడియాశలే

$
0
0

మహబూబ్‌నగర్, డిసెంబర్ 18: రాజకీయాలలో ఉండాలంటే నేతలకు పదవులు ఎంతో అవసరం. పదవులు ఉంటేనే గౌరవం ఉంటుందని ప్రజల్లో నేతగా పిలువబడుతామని ప్రతి నాయకుడు భావిస్తుంటారు. అయితే మున్సిపాలిటీ పట్టణాలలో ప్రస్తుతం నాయకులు తీవ్ర నిరాశతో ఉన్నారు. 2005 సంవత్సరంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో సెప్టెంబర్ కౌన్సిలర్లుగా నాయకులు గెలుపొందారు. అయితే వీరి పదవి కాలం 2010 సెప్టెంబర్‌లో ముగిసింది. వెంటనే ప్రభుత్వం మున్సిపాలిటీలలో పరిపాలన సౌలభ్యం కోసం అధికారులకు ప్రత్యేక హోదా కల్పిస్తూ ప్రత్యేక అధికారులుగా నియమించారు. ప్రస్తుతం మూడు సంవత్సరాల మూడు నెలలు దాటుతున్నప్పటికినీ ఇంకా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుండటం పట్ల నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అధికారులకే పాలన వ్యవహారాలను అప్పజెబుతూ ప్రభుత్వం జిఓలను జారీ చేస్తుంది. ఇటీవల మరో జిఓ జారీ చేస్తూ మరో ఆరునెలల పాటు మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారుల పాలనే ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించడం నేతలకు మింగుడు పడటం లేదు. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల్లో మున్సిపల్ ఎన్నికలపై పెట్టుకున్న ఆశలు రోజురోజుకు అడియాశలవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాతనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని స్పష్టమైన సంకేతాలు వెలువడటంతో నాయకులంతా నిరాశ పడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాప్రతినిధులుగా గెలుపొందాలనుకుంటున్న నాయకులు నిరుత్సాహానికి గురై పార్టీ కార్యక్రమాల వైపు కూడా కనె్నత్తి చూడటం లేదు. ఏదో నామమాత్రపు కార్యక్రమాలకు వస్తూ కంటితుడుపు చర్యగా ఇటు వచ్చి అటు వెళ్లిపోతున్నారు. జిల్లాలో గతంలో నాలుగు మున్సిపాలిటీలు మాత్రమే ఉండేయి. ప్రస్తుతం నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడటంతో జిల్లాలో షాద్‌నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అయిజ పట్టణాలలో కూడా ఎన్నికలు జరగడం లేదు. అదేవిధంగా మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నారాయణపేట మున్సిపాలిటీలలో కూడా ఎన్నికల నిర్వహణ లేకపోవడంతో నాయకులంతా నిరాశతో ఉన్నారు. సొంత పనులపై దృష్టి సారించిన నాయకులు ఎన్నికలు వచ్చినపుడు చూద్దాంలే అంటూ తమ అనుచరులతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గత ఐదు నెలల క్రితం పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన తరుణంలో మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహిస్తారని ఆశతో ఉన్న నేతలకు వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. దాంతో నాయకులు ఇక సార్వత్రిక ఎన్నికల తర్వాతే పురపాలక ఎన్నికలు ఉంటాయని నిశ్చయించుకున్నారు. ఏదిఏమైనా పురపాలక పట్టణాలలో కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న వివిధ పార్టీల నాయకుల ఆశలు ఇప్పట్లో నెరవేరే పరిస్థితి లేదు.

పురుగుల అన్నం పెడుతున్నారంటూ
విద్యార్థుల రాస్తారోకో
బాలానగర్, డిసెంబర్ 18: ఉడికి ఉడకని, పురుగులతో కూడిన అన్నం పెడుతున్నారని గురుకుల పాఠశాల విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బుధవారం బాలానగర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై విద్యార్థులు నిర్వహించిన రాస్తారోకోతో అరగంట పాటు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. బాలానగర్ సమీపాన ఉన్న గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యత లేని అన్నం పెడుతున్నారని ఆరోపించారు. అదే విధంగా నీళ్లచారు, పలచని మజ్జిగ, పండ్లను సక్రమంగా పంపిణీ చేయడం లేదని ఆరోపించారు. రాస్తారోకో చేస్తున్న విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు విద్యార్థులను పక్కకు జరిగే ప్రయత్నం చేయడంతో విద్యార్థులు రోడ్డుపై భీష్మించుకూర్చున్నారు. దీంతో డిసిసి ప్రధాన కార్యదర్శి దాస్‌రాంనాయక్ కల్పించుకుని విద్యార్థులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. అనంతరం స్థానిక తహశీల్దార్ లింగ్యానాయక్ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందజేసిన భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డికి సూచించారు. అనంతరం మధ్యాహ్నం జిల్లా గిరిజన గురుకుల విద్యాలయాల డిప్యూటీ సెక్రటరీ ఉపేంద్రచారి గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత గల ఆహారాన్ని అందించకపోతే కలెక్టరుకు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రిన్సిపాల్‌ను హెచ్చరించారు.

2014 పోరుకు కమలనాథుల సమాయత్తం
* గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టతకు వ్యూహం
* అనుబంధ సంఘాల బలోపేతంపై దృష్టి
* మండల స్థాయిలో సమావేశాలకు నిర్ణయం
మహబూబ్‌నగర్, డిసెంబర్ 18: ఇతర పార్టీలలో ఎన్నో సందేహాలు, రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నప్పటికీ బిజెపిలో మాత్రం 2014 సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తంగా కనబడుతోంది. వంద రోజుల్లోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో కమలనాథులు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. అందులో భాగంగా జిల్లా నేతలతో రాష్ట్ర పార్టీ నాయకులు తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులపై అంచనాలు వేస్తూ ఇక దూకుడుగా ఉండాలంటూ జాతీయ, రాష్ట్ర నేతలు క్యాడర్‌కు సూచనలు ఇస్తుండటంతో ఇక నాలుగు నెలల పాటు నిరంతర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు జిల్లా నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాలలో అవలంబించాల్సిన వ్యూహాలను కింది స్థాయి నుండి కార్యకర్తల మనోభిష్టం మేరకు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలి, నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోవాలనే వ్యూహాలపై సీనియర్ బిజెపి నాయకులతో తరచూ భేటీలు కావాలని జిల్లా నాయకత్వం భావిస్తోంది. ఒకపక్క బిజెపిని బలోపేతం చేస్తూనే మరోపక్క ప్రజాసమస్యలపై దృష్టి సారించాలని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు, జిల్లా కార్యవర్గ సభ్యులలోని మంచి వక్తలను గ్రామాలలో నిర్వహించే కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా పిలిపించి తమ ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునే విధంగా కూడా వ్యూహాలను రచించుకుంటున్నారు. తెలంగాణ అంశం తేలిపోయినా, తేలకున్నా రెండు విధాలుగా లాభం ఉంటుందని భావిస్తున్న బిజెపి నాయకత్వం ఇక దూకుడుగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. జిల్లాలోని షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, నారాయణపేట, మక్తల్, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి నియోజకవర్గాలలో పార్టీ క్యాడర్ బలంగా ఉండటం, ఇప్పటికే నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తుండటం, మిగతా నియోజకవర్గాలలో కొంత కష్టపడితే మరింత క్యాడర్ పెరిగి వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గాలలో మంచి ఫలితాలను సాధించవచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలలో కొంత నాయకత్వ లోపం ఉండటంతో త్వరలోనే ఆ లోపాన్ని భర్తీ చేసేందుకు నాయకులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. గద్వాల, కొల్లాపూర్, కొడంగల్, అలంపూర్, దేవరకద్ర నియోజకవర్గాలలో ఇతర పార్టీలకు సంబంధించిన నియోజకవర్గ స్థాయి నాయకులు బిజెపిలోకి వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే జిల్లాలో బిజెపి కూడా బలీయమైన శక్తిగా ఎదుగుతుందని, మోడీ ప్రభావంతో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునే విధంగా వీలుపడుతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. పార్టీ అనుబంధ సంఘాలను గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా గ్రామాలలో అన్ని వర్గాలకు సంబంధించిన యువకులను పార్టీలోకి చేర్పించుకునేందుకు వ్యూహాలను రచించుకుంటున్నారు. ప్రతి గ్రామంలో వందమంది యువకులను పార్టీలో చేర్పించుకుని వారికి బాధ్యతలు అప్పజెప్పి నరేంద్ర మోడీ గురించి ప్రజలకు వివరించే బాధ్యత కూడా వారికే అప్పగించనున్నట్లు తెలిసింది. మండల కేంద్రాలలో దాదాపు 150 మందికి పైగా యువకులకు బాధ్యతలు అప్పజెప్పి పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకోవాలని కూడా భావిస్తున్నారు. ఒకపక్క పార్టీ బలోపేతంతో పాటు మరోపక్క సంఘ్ పరివార్‌తో తరచూ పరివార్ బైటక్‌లను నిర్వహించి లోటుపాట్లను కూడా సవరించుకోవాలని జిల్లా నాయకత్వం భావిస్తుంది. పరివార్ సూచనల మేరకు ముందుకుపోవాలని కూడా వివిధ నియోజకవర్గాల నాయకులు భావిస్తున్నట్లు సమాచారం.

భర్తను హతమార్చిన భార్య, ప్రియుడు
* అలంపూర్ మండలంలో మృతదేహం లభ్యం
మానవపాడు, డిసెంబర్ 18: మహబూబ్‌నగర్ పట్టణంలో నివాసముంటున్న షేక్‌అప్సర్ అలియాస్ సాలేబాబాను భార్య, ప్రియుడు కలిసి హతమార్చి అలంపూర్ మండలంలోని క్యాతూరు గ్రామసమీపంలో మృతదే హాన్ని పూడ్చిపెట్టిన సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగుచూసింది. మహబూబ్‌నగర్ వన్‌టౌన్ సిఐ బాలాజీ కథనంమేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ పట్టణంలోని రామయ్యబోలేలో నివాసముంటున్న షేక్‌అప్సర్(32)ను ఈ నెల 10వ తేదీ రాత్రి నిద్రిస్తున్న సమయంలో భార్య ఫాతిమాభేగం, కారుడ్రైవర్ సోహెల్ ఆస్తికోసం హతమార్చారు. మృతదేహాన్ని అదేరోజు రాత్రి అలంపూర్ మండలం క్యాతూరు గ్రామానికి తీసుకువచ్చి సోహెల్‌తాతగారి సహాయంతో సమీపంలో ఉన్న కందిపంట పొలంలో పూడ్చిపెట్టారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఈ నెల 15వ తేదిన మృతుడి భార్య ఫాతిమా వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు భార్య ఫాతిమాను, డ్రైవర్ సోహెల్‌ను విచారించగా 10వ తేది అర్ధరాత్రి క్యాతూరు గ్రామసమీపంలో పూడ్చిపెట్టినట్లు పోలీసులకు తెలిపారు. బుధవారం వన్‌టౌన్ సిఐ నిందితుడు సోహెల్‌తో గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ హత్యను ఆస్తికోసమే హతమార్చినట్లు సిఐ తెలిపారు. ఈ సంఘటనలో అలంపూర్ సిఐ రాజు, మానవపాడు తహశీల్దార్ సైదులు పంచనామా నిర్వహించారు. వారితో పాటు డిప్యూటీ తహశీల్దార్ షేక్‌హుసేన్, విఆర్‌ఓలు భీంసేన్‌రావు, సాయిబాబాలు ఉన్నారు.

సమాజంలో యువత పాత్ర కీలకం
* కలెక్టర్ గిరిజాశంకర్
మహబూబ్‌నగర్, డిసెంబర్ 18: సమాజంలోని సమస్యలు పరిష్కరించడంలో యువత ముందుండాలని, ముఖ్యంగా యువత పాత్ర అన్ని రంగాలలో కీలకపాత్ర పోషిస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ అన్నారు. జిల్లా యువజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బుధవారం మహబూబ్‌నగర్‌లోని అంబేద్కర్ కళాభవన్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువజన ఉత్సవాలను నిర్వహిస్తాయని, అయితే యువత సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించాలని కోరారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ లాంటి జిల్లాలో నిరక్షరాస్యత, పేదరికం, అవగాహన లోపం వాటితో ప్రజలు బాధపడుతున్నారని, ప్రజలను చైతన్యం చేసే బాధ్యతను యువత స్వీకరించాలని కోరారు. అక్షరాస్యతను పెంపొందించడంలో ప్రతిఒక్కరు చదువుకునేలా చూడాలని కోరారు. జిల్లాలో ఎంతోమంది చదువుకున్న నిరుద్యోగ యువతీ, యువకులు ఉన్నారని, ఉద్యోగావకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అయితే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఉద్యోగాలు పొందవచ్చని కలెక్టర్ సూచించారు. జీలితంలో ఎలా బతకాలనే విషయాన్ని యువత నేర్చుకోవాలని అన్నారు. చదువుతో పాటు ఆటలు, పాటలు అన్నింటిలో ప్రావీణ్యం సంపాధించాలని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలలో సైతం నైపుణ్యం పొందాలని అన్నారు. పోటీ ప్రపంచంలో అన్నింటిని తట్టుకుని ధైర్యంగా నిలబడి విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి యువత కృషి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. సెట్మా ఇన్‌చార్జి సిఇఓ సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, విలువలను చాటిచెప్పేందుకు యువజన ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గతంలో మాదిరి కాకుండా ఈ సంవత్సరం గ్రామీణ ప్రాంతంలోని యువతను సైతం ఉత్తేజ పరిచేందుకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో యువజన ఉత్సవాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో ఎంపికైన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని అన్నారు. ఈనెలాఖరులో రాష్ట్ర స్థాయి పోటీలు ఉంటాయని, రాష్ట్ర స్థాయి పోటీలలో గెలుపొందిన వారికి 2014 జనవరిలో లూథియానలో జరిగే జాతీయ స్థాయి యువజన ఉత్సవాలలో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. జానపద నృత్యం, జానపద గీతం, ఏకాంకిక, శాస్ర్తియ సంగీతం తదితర అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో నెహ్రూ యువక కేంద్రం సమన్వయ కర్త సయ్యద్ సదాదోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

కస్తూర్భాగాంధీ విద్యాలయాల్లో 90 శాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలి
* కలెక్టర్ గిరిజాశంకర్
పాలమూరు, డిసెంబర్ 18: కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలలో ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో 90శాతంకు పైగా ఉత్తీర్ణత సాధించేందుకు నూతన ప్రత్యేక అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి మహబూబ్‌నగర్‌లోని రాజీవ్ విద్యామిషన్ సమావేశ మందిరంలో కెజిబివిలకు కొత్తగా ఎంపికైన ప్రత్యేక అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ ప్రత్యేక అధికారులు కెజిబివిల పరిపాలనతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందిపై ఆజమాయిషి కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా కెజిబివిలలో మంచి మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని తెలిపారు. 9, 10వ తరగతుల విద్యార్థినులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఈ సంవత్సరం పదవ తరగతిలో 90శాతంకు పైగా ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని అన్నారు. కెజిబివిలు చక్కగా నిర్వహించేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని, ఈనెల 20 నుండే దానిని అమలులోకి తీసుకురావాలని ఆదేశించారు. మాజీ ప్రత్యేక అధికారులు ఎవరైనా రికార్డులు అప్పగించేందుకు సహకరించనట్లయితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కెజిబివిలలో మధ్యలో బడిమానేసిన బాలికలు ఎలాంటి ఆధారం లేని వారు చేరుతారని, అందువల్ల ప్రత్యేక అధికారులు విద్యార్థినుల విద్యపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కెజిబివిని విడిచివెళ్లరాదని, ఒకవేళ ఎవరైనా అనుమతి లేకుండా వెళ్తే ఉద్యోగం నుండి తొలగిస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ గిరిజాశంకర్ ఆర్‌విఎం కార్యాలయంలో ఇంజనీర్లతో కెజిబివిల భవనాల నిర్మాణం, అదనపు తరగతి గదుల నిర్మాణంపై సమీక్షించారు. నిర్మాణంలో ఉన్న భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి చివరి నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. భవనాల నిర్మాణ ప్రగతిపై ప్రతిరోజు తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు జెసి, ఇన్‌చార్జి ఆర్‌విఎం పిఓ రాజారాం, ఆర్‌విఎం ఎఎంఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కిన యువత
తలకొండపల్లి, డిసెంబర్ 18: మండల కేంద్రమైన తలకొండపల్లిలో గత కొన్ని సంవత్సరాలుగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి బుధవారం ఎబివిపి, బిజెపి, టిఆర్‌ఎస్ తదితర పార్టీల నాయకులు, యువజన సంఘాల నాయకులు రోడ్డెక్కి నిరసనను వ్యక్తం చేశారు. గ్రామంలో కొత్తగా సర్పంచ్ అభ్యర్థి గెలిచినా సమస్యలు పరిష్కరించడం లేదని, సర్పంచ్ వెంటనే రాజీనామా చేయాలని యువకులు నినాదాలు చేశారు. గ్రామంలో పేరుకుపోయిన డ్రైనేజీల శుభ్రత, మరుగుదొడ్ల నిర్మాణాలు, రోడ్డు విస్తరణ, బస్టాండ్ సమీపంలో ప్రయాణికుల సౌకర్యార్థం మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణాలు, ఆర్యనాయక్ తండాకు రోడ్డు వేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు పాండుప్రసాద్, నాయకులు సజ్జుపాష, కృష్ణ, రామచంద్రి పాల్గొన్నారు.

ఆరోపణలు అవాస్తవం
గద్వాల, డిసెంబర్ 18: మాజీ మంత్రి డికె సమరసింహారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే భరతసింహారెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవమని లాయర్లలో క్రిమినల్ లాయరంటూ మాట్లాడడం అవివేకమని న్యాయవాదులు వసంతరావు, పెద్దరాముడు, పూజారిశ్రీ్ధర్, లత్తిపురం వెంకట్రామిరెడ్డిలు అన్నారు. బుధవారం మాజీ మంత్రి సమరసింహారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ పెన్సిలిన్ ఫ్యాక్టరి భూముల విషయంలో ఎన్నికలు ముగిసిన నాలుగు నెలల తరువాత బంగ్లాలో పిలిచి రైతులకు ఒక్కోక్కరికి రూ.25వేలు ఇచ్చి మీరెంత తిన్నారో ప్రజలకు వివరించాలన్నారు. వక్ఫ్‌బోర్డు భూములు కబ్జాచేసిన వారిలో మీ అనుచరులే ఎక్కువగా ఉన్నారని గుర్తించుకోవాలని, పునరావాస కేంద్రాల్లో వాటాలు తింటున్నది ఎవరో ఆయా గ్రామాల ప్రజలకు తెలిసిందేనని విమర్శించారు. లాయర్లలో అనుచరులెవ్వరు ఉండరని జూనియర్లు ఉంటారని ఈ విషయం గ్రహించాలని వారు సూచించారు.

* సార్వత్రిక ఎన్నికల తర్వాతే మున్సిపల్ పోరు * ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగింపు
english title: 
special officers

విద్యార్థినిపై కిరోసిన్ దాడి ఘటనపై నిరసనల వెల్లువ

$
0
0

నల్లగొండ, డిసెంబర్ 18: ఇంజనీరింగ్ విద్యార్ధిని తలారి అరుణపై ప్రేమోన్మాది కిరోసిన్ దాడితో జరిపిన హత్యాయత్నాన్ని నిరసిస్తు బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుండి నిరసనలు వెల్లువెత్తాయి. విద్యార్ధి సంఘాలు ఈ ఘటనను నిరసిస్తు జిల్లా వ్యాప్తంగా తలపెట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. విద్యార్థులు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, రాజకీయ పక్షాలు పెద్ద సంఖ్యలో నిరసన ర్యాలీలు నిర్వహించి అరుణపై జరిగిన దాడిని తీవ్రంగా నిరసించారు. ర్యాలీల్లో బాలికలు, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటు రాసిన నినాదాలతో విద్యార్ధినిలు ఫ్లకార్డ్సు ధరించి నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు. నల్లగొండ, భువనగిరి, మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ, కోదాడ, సూర్యాపేట, చౌటుప్పల్, చిట్యాల, వలిగొండ, రామన్నపేట, మోత్కూర్, ఆలేరు, తిరుమలగిరి, తుంగతుర్తి, నేరడుచర్ల, హాలియా తదితర ప్రాంతాల్లో విద్యాసంస్థలు మూసివేసి విద్యార్థులు, రాజకీయ పక్షాలు, మహిళా సంఘాలు భారీ నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులతో కొద్ధిసేపు వాగ్వివాదం అనంతరం విద్యార్థి సంఘాల ప్రతినిధులను ఎస్పీని కలిసేందుకు అనుమతించారు. అరుణపై దాడికి పాల్పడిన నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలంటు ఎస్పీ టి.ప్రభాకర్‌రావు విద్యార్థి సంఘాల నాయకులు వినతి పత్రం అందించారు. సిపిఎం, సిపిఐ, న్యూడెమోక్రసీల, మహిళా సంఘాల నేతల బృందం జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులును కలిసి ఆరుణపై హత్యాయత్నం చేసిన నిందితులపై చట్టపర చర్యలు తీసుకోవడంతో పాటు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. నల్లగొండ మహాత్మగాంధీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి నిందితుల దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దగ్ధం చేసి తమ నిరసన తెలిపారు. మరోవైపు జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఎబివిపి, పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ, టిఎన్‌ఎస్‌ఎఫ్, దళిత, ఐద్వా, ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం, బిజెపి మహిళా మోర్చా, ఎమ్మార్పీఎస్ తదితర సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకోలు, నిరసన ర్యాలీలు నిర్వహించి దాడికి పాల్పడిన నిందితుల దిష్టిబొమ్మలను దహనం చేశారు.

పులిచింతల ముంపు బాధితులకు
అత్యధిక నష్టపరిహారం చెల్లించాం
గృహనిర్మాణశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
హుజూర్‌నగర్, డిసెంబర్ 18 : భారతదేశ చరిత్రలోనే పులిచింతల ప్రాజక్టు ముంపు బాధితులకు అత్యధిక నష్టపరిహరం చెల్లించటం జరిగిందని రాష్ట్ర గృహనిర్మాణశాఖా మంత్రి యన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. బుధవారం సాయంత్రం తన నివాసంలో జరిగిన పులిచింతల ముంపు బాధితుల, అధికారుల సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ 13915 ఎకరాలు ముంపుకు గురికాగా 13908 ఎకరాలకు 164 కోట్ల రూపాయలు నష్టపరిహరంగా చెల్లించామని అన్నారు. 5534 ఇండ్లు ముంపుకు గురికాగా 5399 గృహలనకు 43 కోట్లు చెల్లించారని చెప్పారు. ఇప్పటి వరకు సహాయ పునరావాస పనులకు 505 కోట్లు వ్యయం చేశారని 137 కోట్లు వౌలిక అవసరాలకు ఖర్చు చేశారని అన్నారు. 148 కోట్లతో కృష్ణానది నుండి 4 ఎత్తిపోతల పధకాలు నిర్మాణం అవుతున్నాయని 18300 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని అన్నారు. ప్రస్తుతం 90 కోట్ల రూపాయలతో మరో 2 ఎత్తిపోతల పధకాలు మంజూరు అయినాయని పులిచింతల ముంపు బాధిత రైతుల భూములకు నీరు సరఫరా కానున్నదని మంత్రి చెప్పారు. జిల్లా యంత్రాంగ పులిచింతల ముంపు ప్రజలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి సహాయ, పునరావాస పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కోరారు. నక్కగూడెం, రఘునాధపాలెం, గుండ్లపల్లి, మట్టపల్లి గ్రామాలు ముంపుకు గురైతున్నవా, లేదా తెలుసుకోవటానికి జాయింట్ కలెక్టర్, పులిచింతల యస్‌ఇ, హుజూర్‌నగర్ ఓయస్‌డిల ఆధ్వర్యలో ముగ్గురు సభ్యుల కమిటీ వేశారని వారం రోజుల్లో నివేదిక అందజేస్తారని మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో సహాయ పునరావాస కమీషనర్ శ్రీదేవి, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదిత్యనాధ్‌దాసు, పులిచింత సిఇ సాంబయ్య, యస్‌ఇ వెంకటేశ్వరరావు, పంచాయితీరాజ్ యస్‌ఇ భాస్కర్‌రావు, పులిచింతల ప్రత్యేక కలెక్టర్ జె వెంకటేశ్వరావు, ఐడిసి డైరెక్టర్ సాముల శివారెడ్డి, బాధిత రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

జిల్లాలో బ్యాంకుల బంద్ విజయవంతం
నల్లగొండ టౌన్, డిసెంబర్ 18: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం పలు బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన బ్యాంకుల బంద్ జిల్లాలో విజయవంతమైంది. జిల్లాలోని భువనగిరి, సూర్యాపేట, మిర్యాలగూడ, నల్లగొండ డివిజన్‌లలో బ్యాంకుల బంద్‌తో ఆర్థిక లావాదేవీలు పూర్తిగా స్తంభించడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని ఎస్‌బిహెచ్, ఎస్‌బి ఐ, కెనెరా, ఆంధ్ర బ్యాంకుల ఉద్యోగులు బ్యాంకులు బంద్ చేసి బ్యాంకుల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేతన సవరణ, బ్యాంకు రంగంలో చేపడుతున్న సంస్కరణలకు వ్యతిరేకంగా బంద్ నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలోకి దిగనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సమ్మెలో 42బ్రాంచిలలో 3వేల మంది సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ పిజె.జేమ్స్, వి.శ్రవణ్‌కుమార్, ఎల్లయ్య, మూర్తి, కలీం, బ్రాంచి సెక్రటరీ బిక్షమయ్య, మల్లయ్య, అంజయ్య, విక్రం, మనోహర్, అస్మాసుల్తానా, శ్రీకాంత్, కమలాకర్‌రెడ్డి, వినోద్‌కుమార్, పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.

27న ఎస్సీ, ఎస్టీల భూసమస్యల పరిష్కారానికై ప్రత్యేక గ్రీవెన్స్
కలెక్టరేట్, డిసెంబర్ 18: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలు( ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల( ఎస్టీ)లకు సంబంధించిన భూ సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం ఈనెల 27న ప్రత్యేక గ్రీవెన్స్‌డేను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహింస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలు వారి భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు, ఫిర్యాదులును ప్రత్యేక గ్రీవెన్స్‌డే ద్వారా స్వయంగా స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. దరఖాస్తులు స్వీకరించి తగిన రశీదులను అందజేస్తామని తెలిపారు. ఇట్టి అవకాశాన్ని ఎస్సీ, ఎస్టీ వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రత్యేక గ్రీవెన్స్‌డే రోజు ఆయా డివిజన్లకు సంబంధించిన డివిజనల్ పరిపాలనాధికారులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, కలెక్టర్ కార్యాలయంలో అందుబాటులో ఉండి దరఖాస్తులను స్వీకరించి రశీదులు జారీ చేయాల్సి ఉంటుందని, తప్పని సరిగా హజరుకావాలని జెసి పేర్కొన్నారు.

పరిపాలనలో దిక్సూచిగా నిలిచిన ఘనత జ్యోతిబసుదే
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చెరుపల్లి సీతారాములు

చిట్యాల, డిసెంబర్ 18: ప్రజలకు స్వచ్ఛమైన పరిపాలనందించి వారి హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచి పరిపాలనలో దిక్సూచిగా నిలిచిన ఘనత దివంగత ముఖ్యమంత్రి జ్యోతీబసుదేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం జరిగిన పార్టీ చిట్యాల, రామన్నపేట, నార్కట్‌పల్లి మండలాల సంయుక్త సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సిపిఎం ప్రభుత్వ హయాంలో భూసంస్కణలను అమలు పరిచారని, నీతి నిజాయితీ పరిపాలనను అందించి దేశానికే ఆదర్శంగా నిలిచారని, నిజాయితీ పరిపాలనను దేశానికి సూచించేలా ఆయన దిక్సూచిలా నిలిచారన్నారు. 2014 సంవత్సరంలో జ్యోతీబసు శతజయంతి ఉత్సవాలను పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామన్నారు. నిత్యావసర వస్తువుల ధరలతో పాటు అన్ని ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయని సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. ధరలు పెరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తనట్లుగా వ్యవహరిస్తూ సామాన్య ప్రజల గోడును పట్టించుకోవడంలేదని విమర్శించారు. ధరలు పెగుతున్నా వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలంచెందినదని ఈ ప్రభుత్వం అసమర్ధ ప్రభుత్వమని ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పాలన్నారు. ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధం, రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పామనగుళ్ళ అచ్చాలు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ డివిజన్ కార్యదర్శి ఎండి. జహంగీర్, జిల్లా నాయకులు మేక అశోక్‌రెడ్డి, బోళ్ళ నర్సింహారెడ్డి, మామిడి సర్వయ్య, పార్టీ కార్యదర్శులు జిట్ట నగేష్, జల్లెల పెంటయ్య, నాయకులు రాచమళ్ళ రాంచంద్రం, చెర్కుపల్లి పెద్దులు, అవిశెట్టి శంకరయ్య, గాలి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

అరుణపై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి
నల్లగొండ టౌన్, డిసెంబర్ 18: తలారి అరుణపై మంగళవారం దాడిచేసిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు నిర్భయచట్టం అమలు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ పలు సంఘాలు జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు, ఎస్పీ ప్రభాకర్‌రావులకు, ఉన్నతాధికారులకు బుధవారం ఆయా కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేశారు. బాధితురాలి కుటుంబానికి 10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా, ఎపి మహిళ సమాక్య, సిపి ఎం, సిపి ఐ నాయకులు కలెక్టర్‌కు వినతి పత్రాలను అందజేశారు. ఈసందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహ్మరెడ్డి, సిపిఐ జిల్లాకార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి ఐద్వా సంఘం నాయకులు ప్రభావతి, అమరావతి, హేమలత, పద్మ, సునితా, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యనాయకులు యు.సృజన, పానుగంటి పద్మ, కలకొండ అరుణ, వసంత, ధనలక్ష్మి, శిరీష తదితరులు ఉన్నారు. ఎస్పీకి వినతి అందించిన వారిలో ఎబివిపి నాయకులు సంతోష్, సిద్దు, గణేష్, జహసింహ, హరీష్, సైదులు, వేణుగోపాల్, అశోక్, వసీం, టి ఆర్ ఎస్‌వి నాయకులు శోభన్‌బాబు, బోమరబోయిన నాగార్జున, తదితరులు ఉన్నారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో జెసి హరిజవహర్‌లాల్‌కు వినతి పత్రం అందించిన వారిలో కెవిపి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేకల భద్రాద్రి, కొండమడుగు నర్సింహ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ముల్కలపల్లి రాములు, అంబేద్కర్ భవన అభివృద్ధి కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, ఎస్సీ సంఘం నాయకులు బర్రె సుదర్శన్, కత్తుల షణ్ముఖ కుమార్, నల్లబెల్లి వెంకటయ్య, రవీందర్ నగేష్ శశిధర్ ఉన్నారు.

సారా అమ్మరాదని గ్రామస్థుల తీర్మానం
అమ్మితే 10వేల జరిమానా
ఆత్మకూర్, డిసెంబర్ 18: మండలంలోని కూరెళ్ల గ్రామంలో గ్రామస్తులంతా కలిసి బుధవారం గ్రామపంచాయతీ కార్యాయంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో సర్పంచ్ బాషబోయిన ఉప్పలయ్య, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, మహిళ సంఘాల సభ్యులు అఖిలపక్ష పార్టీల నాయకులు, యువజన సంఘాల సభ్యులు, అన్ని కులాల సంఘలాల అధ్యక్షులు సమావేశం నిర్వహించారు. గ్రామంలో మధ్యపానం, నాటుసారా అమ్మరాదని గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ తీర్మాణాన్ని ఉల్లంగిచినట్లయితే సారా, మందు అమ్మిన వారిపై 10వేల జరిమానా విధించి, నల్లా కనెక్షన్, ఫిల్టర్ నీరు, రేషన్‌బియ్యం, విద్యుత్ సరఫరాలను నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. కల్తీ కల్లు అమ్మిన వారిపై జరిమానా విధిస్తామన్నారు. ఈ సమావేశంలో కూరెళ్ల గ్రామ మధ్యపాన నిషేద కమిటీ అధ్యక్షుడు ఉప్పలయ్య, సభ్యులు వి.సత్యనారాయణ, శ్రీహరి, ఎం.నర్సింహ్మ, వెంకటేష్, రాములు, ముత్యాలకృష్ణ, యాదగిరిరెడ్డి, ఉప్పల నర్సింహ్మ, లాల్‌మహ్మద్, వేముల బిక్షం, ఇడుకుల శ్రీను, మారుపాక కృష్ణ, నిమ్మల చంద్రమ్మ, అరుణ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సెస్సీ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి
భువనగిరి, డిసెంబర్ 18: సాంఘిక సంక్షేమ ఎస్సీ, బిసి వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న 10వ తరగతి విద్యార్ధులు రాబోయే వార్షిక పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి బి.శ్రీనివాస్‌రెడ్డి కోరారు. బుధవారం స్థానిక శ్రీసాయికృప డిగ్రీ కళాశాలలో పదవ తరగతి విద్యార్ధులకు అవసరమైన ప్రత్యేక ప్రేరణ తరగతులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక పరీక్షల్లో 80శాతానికి పైగా మార్కులు సాధించిన విద్యార్ధులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా ఉన్నత విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి విద్యార్ధి పట్టుదలతో చదివి పదవ తరగతి వార్షిక పరీక్షల్లో వందకు వంద శాతం మార్కులు తెచ్చుకోవాలని ఆయన సూచించారు. అదే విధంగా ప్రతిరోజు విద్యార్ధులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యలో వెనుకబడిన విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్ధుల భవిష్యత్‌కు పునాదిగా నిలిచే పదవ తరగతి పరీక్షల కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించి దాని ప్రకారం బోధన కొనసాగించాలని ఉపాధ్యాయులను కోరారు. ఈకార్యక్రమంలో వాత్సల్య విద్యాసంస్థల చైర్మన్ దరిపల్లి అనంతరాములు, కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్‌కుమార్, సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు పి.నరేందర్‌రెడ్డి, పి.దయాకర్‌లు పాల్గొన్నారు.

వికలాంగుల హక్కుల సాధనకు నిరంతర పోరాటం
నల్లగొండ టౌన్, డిసెంబర్ 18: వికలాంగుల హక్కుల సాధనకు నిరంతరం ఉద్యమిస్తామని ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. బుధవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక టౌన్ హల్‌లో నిర్వహించిన జిల్లా వికలాంగులు విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇతర రాష్ట్రాలలో వికలాంగులకు వెయ్యి రూపాయలకు పైగా పించన్లు ఇస్తున్నారన్నారు. వందశాతం వికలాంగత కల్గిన వారికి ప్రతి నెల 1500 ఇవ్వాలని అదేవిధంగా 40నుండి 80శాతం కల్గిన వారికి వెయ్యి, 20నుండి 40శాతం వరకు వికలాంగత్వం కల్గిన వారికి 500పించన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సమస్యలపై చట్టసభల్లో ఏనాడు చర్చలు జరుగలేదని రాజకీయంగా వికలాంగులకు ఎక్కువశాతం సీట్లు కేటాయించి పాలనలో వారిని భాగస్వామ్యం చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే రాయితీని వికలాంగులకు సైతం ఇచ్చే విధంగా పోరాటం చేస్తున్నామని అదేవిధంగా వికలాంగులను పెళ్లి చేసుకునే సకలాంగులకు ఒక లక్ష రూపాయలు, పెళ్లి చేసుకునే ఇద్దరు వికలాంగులైతే వారికి 2లక్షలు ప్రభుత్వం ప్రోత్సాహకం ఇవ్వాలని పోరాటం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. బడుగు బలహీన వికలాంగ అభివృద్ధికై వికలాంగుల సమక్షంలో త్వరలో తాను పెట్టే కొత్తపార్టీని ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అందె రాంబాబు, జిల్లా అధ్యక్షుడు కొత్త వెంకన్న, నాయకులు లింగాల పెద్దన్న, లక్ష్మి, కాశీం, సైదులు, రమేష్, జిల్లా నలుమూలల నుండి వచ్చిన వికలాంగులు పాల్గొన్నారు.

మూసీ నీటి విడుదల
కేతేపల్లి, డిసెంబర్ 18: జిల్లాలో రెండో అతిపెద్ద ప్రాజెక్టు అయిన మూసీ ప్రాజెక్టు నుండి ఆరుతడి పంటల సాగుకు మొదటి విడుతగా బుధవారం నీటిపారుదల శాఖ ఈఈ హమీద్‌ఖాన్ అధికారులు ఆయకట్టు పరిధిలోని కుడి, ఎడవ కాల్వలకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నీటిని దుర్వినియోగం చేయకుండా సక్రమంగా వాడుకొని చివరి ఆయకట్టుకు కూడా నీటిని అందించేందుకు సహకరించాలని కోరారు.

* ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన * జిల్లా వ్యాప్తంగా నిరసనలు
english title: 
protests

అడిగిన వారందరికీ ఉపాధి కల్పన

$
0
0

సంగారెడ్డి,డిసెంబర్ 18: పని అడిగితే పక్షం రోజుల్లో జాబ్‌కార్డు కలిగిన కూలీలకు అవకాశం కల్పించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ పేర్కొన్నారు. బుధవారం జిల్లాలోని ఉపాధి హామి పథకం సిబ్బందితో ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. 15రోజుల్లో కూలీలకు ఉపాధి కల్పించి వలసలు నిరోదించకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ నెల 15వ తేదీ నాటికి ఇచ్చిన లక్ష్యం కంటే ఎక్కువ మంది కూలీలకు పని కల్పించిన మిరుదొడ్డి,తొగుట,నారాయణఖేడ్, కల్హేర్, టేక్మాల్ మరియు పెద్దశంకరంపేట మండలాలకు చెందిన ఎపిఓలను ఆయన అభినందించారు.అంతేకాకుండా నిర్ధేశించిన లక్ష్యంలో 50శాతం కూడ పూర్తి చేయని ఎపిఓలపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఈ నెల 22వ తేదీ నాటికి లక్ష్యాలను పూర్తి చేయని వారిపై 23వ తేదీన ఎపిఓ, టెక్నికల్ అసిస్టేంట్,క్షేత్రస్థాయి సహాయకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇందిరమ్మ పచ్చతోరణంలో కూడ ప్రగతిని సాధించాలని కోరారు.స్మార్ట్ కార్డు ద్వారా వేతనాల చెల్లింపులో పెండింగ్‌లో ఉన్న డేటాలో గ్రామాల వారీగా తనిఖీ చేసి ఇందులో చనిపోయిన వారి లిస్టు, వలసలు పోయిన వారి లిస్టు,గ్రామాల్లో నివాసం ఉండి వేతనం అందని వారి లిస్టులను ఈ నెల 25లోపు సమర్పించాలని ఎపిఓలను ఆదేశించారు.

ఉద్యోగుల సమ్మెతో బ్యాంకులు బంద్
సిద్దిపేట , డిసెంబర్ 18: బ్యాంకింగ్ రంగంలో చేపడుతున్న సంస్కరణలను తక్షణం నిలిపి వేయడంతో పాటు, వెతన సవరణను చేపట్టాలని కోరుతు బ్యాంక్ ఉద్యోగ సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపుతో బుధవారం పట్టణంలో బ్యాంక్‌లు బందు అయ్యాయి. బ్యాంక్‌లు బందు ఉండడంవల్ల ఆయా శాఖలకు వచ్చిన ఖాతాదారులు కొంత ఇబ్బంది పడ్డారు. బ్యాంకింగ్ రంగంలో ఆన్‌లైన్ విధానాన్ని సైతం బంద్ చెయడంతో ఎటియంలు సైతం బంద్ అయ్యాయి. దీంతో అత్యవసరంగా డబ్బులు అవసరమైన వారు ఇబ్బంది పడ్డారు. భారత అర్ధిక వృద్దికి బ్యాంకింగ్ రంగం ఎంతో తొడ్పడుతున్న బ్యాంక్ ఉద్యోగులకు తగ్గట్టుగా వెతనాలు కల్పించడం లేదన్న దృశ్య బ్యాంకింగ్ రంగంలో కొత్త సంస్కరణలు తెచ్చి వెతనాలు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు.

ఐకెపి కేంద్రాల ద్వారా 14లక్షల మెట్రిక్ టన్నుల
ధాన్యం సేకరణ లక్ష్యం
సిద్దిపేట, డిసెంబర్ 18: రాష్ట్ర వ్యాప్తంగా ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 14లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని లక్ష్యంగా ఎంచుకున్నట్లు సివిల్‌సప్లై ఎండి అనీల్‌కుమార్ తెలిపారు. సిద్దిపేటలో గోడౌన్‌లను పరిశీలించిన అనంతరం స్థానిక రెవెన్యూ గెస్టుహౌజ్‌లో విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటివరకు 8లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరించామన్నారు. రాష్టవ్య్రాప్తంగా 2200ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 50శాతానికి పైగా ధాన్యం కరీంనగర్ జిల్లా నుంచే వస్తుందన్నారు. రైతుల సంక్షేమం కోసమే తాము పాటుపడుతున్నామని, అన్నదాతలకు గిట్టుబాటు ధర అందించడమే తమ లక్ష్యమన్నారు. ప్రభుత్వం 1340గిట్టుబాటు ధర నిర్ణయించగా ప్రస్తుతం బహిరంగమార్కెట్‌లో గిట్టుబాటు ధరకంటే అధికంగా ధర వస్తుందన్నారు. దీంతో అన్నదాతలు ఐకెపి కేంద్రాల్లో తక్కువగా అమ్ముతున్నారన్నారు. పెద్ద మార్కెట్‌యార్డుల్లో సివిల్‌సప్లై ధాన్యం కేంధ్రాలు ఏర్పాటు చేయాలని భావించినా సిబ్బంది కొరతతో ఆ దిశగా చర్యలు చేపట్టలేదన్నారు. రాష్టవ్య్రాప్తంగా 300పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దీంతో రిటైర్డ్ ఉద్యోగులతో కొన్ని కేంధ్రాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది 65గోడౌన్ల నిర్మాణం దశలో ఉన్నాయని, ప్రతి గోడౌన్‌కు 25లక్షలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి 25కోట్లతో వందగోడౌన్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లాలో పటాన్‌చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, రామాయంపేట ప్రాంతాల్లో గోడౌన్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. గోడౌన్ల నిర్మాణంతో ధాన్యంకు భద్రత ఉంటుందన్నారు. ఎంఎల్‌ఎస్ పాయింట్‌లను మరమ్మత్తులు చేపట్టి కంప్యూటరైజ్ చేయనున్నట్లు తెలిపారు. 439ఎంఎల్‌ఎస్ పాయింట్లలో కంప్యూటర్, ఆపరేటర్లను సైతం నియమించనున్నట్లు తెలిపారు. హఫీజ్‌పేటలో 9గోడౌన్లతో ఫైలెట్ ప్రాజెక్టుగా చేపట్టామన్నారు. త్వరలోనే అన్ని జిల్లాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. మనబియ్యం పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో ఇప్పటిదాకా 30వేల టన్నుల బియ్యం సేకరించామన్నారు. అమ్మహస్తం పథకాన్ని మరింత పకడ్బంధీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. అమ్మహస్తం పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం డాక్యుమెంటరీ రూపొందించి ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సివిల్‌సప్లై జిఎం కళాధర్‌రావు, తహశీల్దార్ ఎన్‌వై గిరి పాల్గొన్నారు.
అమెరికా దౌష్ట్యంపై ఆగ్రహం
బి.విజయలక్ష్మి మాట్లాడుతూ ఒక భారత రాయబారి పట్ల అమెరికా ప్రభుత్వం దుర్మార్గంగా,అవమానకర రీతిలో అరెస్టు చేసి దారుణంగా వ్యవహరించడం భారతీయులను అగ్రహవేశాలకు గురిచేసిందన్నారు.్భరతీయ సంస్కృతి సంప్రాదాయలను గౌరవించకుండా అమెరికా ప్రభుత్వం ఇలా వ్యవహరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.ఇలా దుర్మార్గంగా వ్యవహరించిన అమెరికా ప్రభుత్వంతో భారతదేశ ప్రభుత్వం స్నేహ సంబంధాలు,సహాయ సహకారాలను తక్షణమే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి మహిళ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యమ్మ, పట్టణ అధ్యక్షురాలు లక్ష్మి, కార్యదర్శి శ్యామల, బిజెపి నాయకులు నర్సారెడ్డి, వెంకట్ నర్సింహారెడ్డి, నాగరాజు, మల్లేశం, దుర్గాప్రసాద్, వీరారెడ్డి, ప్రభాకర్‌గౌడ్, విష్ణు, విజయ్, సుదీర్‌రెడ్డి, చారి తదితరులు పాల్గొన్నారు.

శ్రమశక్తి సంఘాలు
హక్కులను సద్వినియోగం చేసుకోవాలి
- డ్వామా ఎపిడి వసంత సుగుణ -
గజ్వేల్, డిసెంబర్ 18: శ్రమశక్తిసంఘాలు తమ హక్కులను సద్వినియోగం చేసుకుంటూ ఆత్మగౌరవంతో బ్రతకాలని డ్వామా అదనపుప్రాజెక్టు డైరెక్టర్ వసంతసుగుణ తెలిపారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బుదవారం దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ఆమె ప్రసంగించారు. ఉపాధిహామీ కూలీలు సంఘటితంగా ఉంటూ చట్టం కల్పించిన వంద రోజుల పని దినాలను సద్వినియోగం చేసుకొని పని చేయు సందర్భంగా ఎదురవుతున్న ఇబ్బందుల ను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని కోరారు. ముఖ్యంగా నిరుపేద రైతులు, వ్యవసాయ కూలీల కోసం కేంద్రం ఉపాధిహామీ పథకాన్ని ఆమలు చేస్తుండగా, ప్రతి కూలీ పని కోసం దరఖాస్తు చేసుకోవడంతో పాటు మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం వెచ్చిస్తున్న రూ,9100లు పొంది సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే భూముల అభివృద్ధి పనులు చేసుకోవాలనుకునే వారు పని గుర్తింపు కార్యక్రమం లో పాల్గొనాలని సూచించారు. కాగా ప్రతి నెల 3వ బుదవారం ఎంపిడిఓ కార్యాలయంలో ఉపాధిహామీ కూలీలు సమావేశమై వివిధ అంశాలపై చర్చించు కోవాలని వివరించారు. డిబిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏగొండస్వామి, జిల్లా కార్యదర్శి శివకుమార్, మండల శాఖ అధ్యక్షులు నాగభూషణం, ఎపిఓ మల్లేశం పాల్గొన్నారు.

ఆలయాల అభివృద్ధికి కృషి
* ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి హామీ
సదాశివపేట, డిసెంబర్ 18: ఆధ్యాత్మిక భావాలకు ఆలవాలమైన సదాశివపేట పట్టణంలోని వివిధ మందిరాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అన్నారు. దత్త జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ యేడాది కూడా పట్టణంలోని మానిక్ ప్రభు మందిరంలో నిర్వహిస్తున్న జాతర ఉత్సవాలకు మంగళవారం రాత్రి జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణంలో శివ, వైష్ణవ అనే తేడా లేకుండా ఆశ్రమ పీఠాలకు సంబంధించిన మందిరాలు ఉండటం సంతోషకరమని అన్నారు. మానిక్ ప్రభు మందిరం అభివృద్ధిలో తనవంతు చేయూతను ఇస్తానని, ఇందుకుగాను ఐదు లక్షల రూపాయల విరాళాన్ని ఆయన ప్రకటించారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నానని మంచినీటి సమస్య పరిష్కారానికి దురదృష్టం వెంటాడుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. 2014 సంవత్సరంలో పట్టణంలోని గడప గడపకు మంజీర నీటిని అందించే వరకు విశ్రమించబోనని అన్నారు. వేలాది మందికి ఇళ్ల పట్టాలు సైతం అందించినట్లు తెలిపారు. అంతర్గత రోడ్లు, బస్టాండ్, ఉబ చెరువు ట్యాంకు బాండ్‌గా మార్చడం లాంటి వాటిపై దృష్టి పెట్టానని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పట్నం సుబాష్, మున్సిపల్ మాజీ చైర్మన్ మునిపల్లి సత్యనారాయణ, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ అనీల్‌రెడ్డి, యూత్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా మందిరానికి చెందిన పలువురు యువకులు రికార్డింగ్ డ్యాన్సులు చేస్తుండగా ఎమ్మెల్యే వారితో కలిసి చిందులు వేసి ప్రోత్సహించారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు జాతీయ జెండాను పోలిన దుస్తువులు ధరించి స్వాగతం పలికారు.

పని అడిగితే పక్షం రోజుల్లో జాబ్‌కార్డు కలిగిన కూలీలకు అవకాశం
english title: 
employment

చైనా మార్కెట్‌తోనే స్మగ్లింగ్ పెరిగింది

$
0
0

తిరుపతి, డిసెంబర్ 18: ప్రపంచంలో అత్యంత అరుదుగా శేషాచలం అడవుల్లో లభించే విలువైన ఎర్రచందనం వృక్ష సంపదను కొల్లగొట్టేందుకు చైనా స్మగ్లింగ్‌ను ప్రోత్సహిస్తున్నది. చైనా వస్తువులను ఎలా స్మగ్లింగ్ గూడ్స్‌గా భారతదేశంలోకి సముద్రమార్గం ద్వారా సరఫరా చేస్తోందో అదే తరహాలో దేశంలోని ఎర్రచందనం సంపదను కూడా తమ దేశానికి తెప్పించుకునేందుకు అడ్డదారులు వెతుకుతోంది. దేశంలో ప్రభుత్వ లోపభూయిష్ట విధానం, రాజకీయ వ్యవస్థ అధికారాలతో విలువైన ఎర్రచందనం వృక్ష సంపద దేశ సరిహద్దులు దాటుతోంది. ఎర్రచందనంకు ధర నిర్ణయించాల్సిన మనం పరాయి దేశాల చేతిల్లో కీలుబొమ్మలుగా మారడం దారుణమైన పరిస్థితి అని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ప్రభుత్వ విధానాలతోనే చైనా మన మార్కెట్‌లోకి ప్రవేశించిందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వెలసి ఉన్న శేషాచలం అడవుల్లో మాత్రమే ఈ ఎర్రచందనం వృక్ష సంపద ఉంది. చిత్తూరు, కడప జిల్లాలతో పాటు కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొంత భాగం మాత్రమే ఎర్రచందనం వృక్ష సంపద విస్తరించింది ఉంది. సుమారు 4.50 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ విలువైన ఎర్రబంగా కాపాడుకునేందుకు ప్రభుత్వం ఎటువంటి ప్రత్యేక చర్యలు తీసుకోలేదు. అటవీశాఖ అడవుల్లోని ఇతర వృక్షాల వలే ఈ వృక్షాలను కూడా కాపాడాలన్న నిబంధనలతో ప్రభుత్వం సర్వసాధారణంగానే వ్యవహరిస్తోంది. ప్రతి నిత్యం వందల టన్నుల జిల్లా సరిహద్దులు దాటుతున్నా తూతూ మంత్రంగా పట్టుకుంటూ అధికారులు చేతులు దులుపుకునే పరిస్థితి ఉంది. గతంలో అయితే ఏనాడు కూడా దుంగలు తప్ప దొంగలను పట్టుకున్న సందర్భాలు లేవు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు అటవీశాఖ, పోలీసు శాఖను సమన్వయం చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఓఎస్‌డిగా ఉదయ్‌కుమార్‌ను నియమించారు. ఓఎస్‌డి ఉదయ్‌కుమార్ నేతృత్వంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంటి దొంగలతో ఏమాత్రం ఫలితం దక్కలేదు. దీంతో అడవుల్లో కాకుండా రహదారుల్లోనే పట్టుకోవాలన్న తలంపుతో ఆయన ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసి ఫలితాలను తీసుకువచ్చారు. మూలాలను పెకలించాలన్న దృక్పథంతో అసలు స్మగ్లర్లను ఏరివేయాలన్న కృతనిశ్చయంతో చేసిన ప్రయత్నాలు పూర్తి స్థాయి ఫలితాలను ఇవ్వకున్నా కొంత మేరకు ఇచ్చాయి. చెన్నై సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అధికారిని, అటవీశాఖ అధికారులను, పోలీసులను పట్టుకుని అరెస్టులు చూపిన విషయం విదితమే. అంతేకాకుండా వైట్ కాలర్ స్మగ్లర్లను కూడా పట్టుకుని ఆయన సత్ఫలితాలను చూపారు. వైఎస్‌ఆర్ కడప జిల్లాలో బండారు శివయ్య, బండారు హరి, తిరుపతికి చెందిన భాను తదితర స్మగ్లర్లను చిత్తూరు, కడప జిల్లాల్లో వేటాడి పట్టుకున్నారు. చెన్నైలో, చైనాలో దాగి ఉన్న బడా ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోవడానికి ప్రభుత్వం నుండి తగిన అధికారులు, ఆదేశాలు లేకపోవడంతో అటవీశాఖ, పోలీసు శాఖ పూర్తి స్థాయిలో విధులు నిర్వహించలేక పోతోంది. ఒక వైపు దుంగలను, మరో వైపు దొంగలను పట్టుకుంటున్నా ప్రభుత్వం నుండి అధికారులకు ఎటువంటి ప్రశంసలు లేకపోగా విమర్శలు, ఇబ్బందులు తలెత్తడటంతో స్మగ్లర్లకు వరంగా మారుతోంది. దీంతో అటవీశాఖ సిబ్బందిలో నిద్రాణం, నిరుత్సాహం రాజ్యమేలుతోంది. పట్టుకుంటున్న కూలీలు, స్మగ్లర్లు జైళ్లకు అలా వెళ్లి ఇలా వస్తుండటంతో అధికారుల ఆత్మవిశ్వాసం దెబ్బతింటున్నది. స్మగ్లర్లపై పిడి యాక్టు ప్రయోగించడానికి అనేక నిబంధనలు పెట్టింది. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా పిడి యాక్టు పెట్టిన అధికారులు ఇబ్బందుల్లో పడుతున్నారు. అనేక మంది రిటైర్డు అయిన డిఎఫ్‌ఓలు నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్న సందర్భాలున్నాయి. దీంతో స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బిడ్డింగ్స్‌కు ఆహ్వానించినా మార్కెట్లోకి ఎవ్వరు రావడం లేదు. స్మగ్లర్లు తమకు అడ్డు వచ్చిన అధికారులను సైతం హతమార్చుతున్నారంటే రాజకీయ, ఆర్థిక అండదండలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్థం అవుతోంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎర్రచందనం పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా పట్టుపడిన ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు పట్ల కఠిన చట్టాలు తీసుకోవడంతో పాటు అటవీశాఖ అధికారులకు విశేష అధికారాలు ఇస్తే తప్ప వ్యవస్థలో మార్పు రాదన్నది అక్షర సత్యం.

సామర్థ్య పరీక్షల పేరుతో వేధించడం మానుకోవాలి
* ఎడి బిల్డింగ్ ముందు అన్నమయ్య కళాకారుల ఆందోళన
* ఇఓ, జెఇఓల హామీతో ధర్నా విరమణ
తిరుపతి, డిసెంబర్ 18: సామర్థ్య పరీక్షల పేరుతో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులను వేధించడం మానుకోవాలని కోరుతూ ప్రాజెక్టు కళాకారులు టిటిడి పరిపాలనా భవనం ముందు బైఠాయించి ధర్నాను నిర్వహించారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి 12.30 వరకు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ప్రసంగిస్తూ కళాకారుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి, టిటిడి యాజమాన్యం కళాకారుల అభిప్రాయాలను పెడచెవినపెట్టి సామర్థ్య పరీక్షలకు పూనుకోవడం అన్యాయమని విమర్శించారు. కళాకారుల వౌలిక సమస్యలను పరిష్కరించకుండా పరీక్షల నిర్వహణకు అత్యుత్సాహం చూపుతున్నారని, అన్నమాచార్య ప్రాజెక్టు అధికారులు కళాకారుల్లో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇవో హామీలు, బోర్డు నిర్ణయాల అమలుకు ప్రథమ ఫ్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 19వ తేదీ నుండి చేపట్టిన ఇంటర్వ్యూలను తక్షణం రద్దుచేయాలని విజ్ఞప్తి చేశారు. యూనియన్ అధ్యక్షులు ఇ.మునికన్నయ్య మాట్లాడుతూ ఇప్పటికి నాలుగుసార్లు ఇంటర్వ్యూలకు హాజరయ్యామని, 5వసారి ఇంటర్వ్యూలు నిర్వహించడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు.
ఇఓ కారును అడ్డుకున్న కళాకారులు
12 గంటల సమయంలో కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ఇఓ కారును కళాకారులు అడ్డుకున్నారు. ఇఓ తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఇఓ ఎం.జి గోపాల్, కందారపు మురళి, యూనియన్ నాయకులతో మాట్లాడుతూ కళాకారులు ఎవరినీ తొలగించబోమని, గ్రేడింగ్‌లు తగ్గించడం లేదని, వేతనాలు పెంచుతున్నామని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని వివరించారు. కళాకారులందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇఓతో జరిగిన చర్చల్లో గౌరవాధ్యక్షులు కందారపుమురళి, అధ్యక్షులు ఇ.మునికన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎం.గుగులప్ప, చంద్రశేఖర్, సరస్వతీ ప్రసాద్, ఆనంద్, లోకనాధ రెడ్డి, నారాయణ,కుప్పుస్వామి, విద్యాదర్, మోహన, రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సామర్థ పరీక్షలు రద్దు : జెఇఓ
19వ తేదీనుంచి ఎస్.వి సంగీత కళాశాలలలో తలపెట్టిన సామర్థ్య పరీక్షలను రద్దు చేస్తున్నామని జెఇఓ పోలా భాస్కర్ ప్రకటించారు. ప్రాజెక్టులో పనిచేస్తున్న కళాకారులందరి బాగోగులు గురించి ఆలోచిస్తున్నామని, అందుకు అనుగుణమైన చర్యలు చేపడుతున్నామని, ప్రాజెక్టులో కొందరి అధికారుల అవగాహనా రాహిత్యం వలన తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని, కళాకారులు ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కళాకారుల సమ్మతితోనే కళాకారుల సామర్థ్యం అంచనా వేస్తామని కళాకారులు ఆందోళన చెందుతున్నట్లు యాజమాన్యం ప్రవర్తించబోదని, ధర్మప్రచారం విస్తృతం చేయడానికి కార్యక్రమాలు పెంచబోతున్నట్లు జెఇఓ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం అధ్యక్షులు ఇ.మునికన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎం.గంగులప్ప కళాకారులు కె.చంద్రశేఖర్, రాజా, బషీర్, రేవతి, భార్గవి, టిఎం నాగమణి, అలిమేలు, సరస్వతీ ప్రసాద్, కుప్పుస్వామి, విద్యాధర్, టి భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

విధులు సక్రమంగా నిర్వర్తించండి
* సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఆదేశం
* వచ్చే ఏడాది నుంచి పైలట్ పథకం కింద ఆంగ్లబోధన
రొంపిచెర్ల, డిసెంబర్ 18: ఉద్యోగాలు జాగ్రత్తగా చేయండి.. తక్కువ సమయంలో ఎక్కువ పనిచేయండి.. బాగాపనిచేసి మంచి పేరు తెచ్చుకోండి అని కలెక్టర్ రామ్‌గోపాల్ అధికారులకు సూచించారు. బుధవారం రొంపిచెర్ల మండలపరిత్ కార్యాలయంలో ఆయన వివిధశాఖల అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. మండలంలో బిఆర్‌జిఎఫ్ నిధులతో పనులు నత్తనడక జరుగుతున్నందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గ్రాంట్లతో పనులు చేయిస్తున్నందుకు అధికారులను తప్పుబట్టారు. బిఆర్‌జిఎఫ్ నిధులు పది శాతం కూడా ఖర్చుపెట్టలేదు ఇక యుసిలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. బిఆర్‌జిఎఫ్ నిధులు గురించి సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఎంపిడిఒ ఉమాలక్ష్మిని నిధులు ఎంత వచ్చింది తెలుసుకోకపోతే ఎట్లని కలెక్టర్ విస్తుపోయారు. మండలంలో తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో వ్యవసాయ బావుల నుంచి నీటిని అద్దెకు తీసుకుని నీటి సరఫరా చేయాలని అర్‌డబ్ల్యుఎస్ అధికారులతో అన్నారు. పంటల సాగు, చెరువుల కింద ఆయకట్టు భూముల విస్తీర్ణం, సీడ్ డ్రమ్ వాడకం గురించి వ్యవసాయశాఖ అధికారులను వివరాలు అడిగారు. మండలంలో స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది రూ. 10.34 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా ఇంత వరకు రూ. 7 కోట్లు రుణాలుగా ఇచ్చామని ఈ ఏడాది లోపల లక్ష్యం పూర్తిచేస్తామని ఐకేపీ ఎపిఎం స్వర్ణలత తెలిపారు. పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అన్నారు. మండలంలో 2006 నుంచి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ళలో 539 ఇళ్ళు ఇంకా నిర్మాణం చేపట్టలేదని హౌసింగ్ డిఇ శంకర్‌లాల్ అన్నారు. ఇల్లు అవసరమా లేదా గుర్తించకుండా ఇళ్ళు మంజూరు చేయడం వల్లే ఇలాంటి పొరబాట్లు జరిగాయని, కట్టుకోని వారి ఇళ్ళు రద్దుచేసి కొత్తవారికి ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. విద్యాశాఖ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్వీఎం లెక్క ప్రకారం మండలంలో 60 నుంచి 70 మంది బడిబయట పిల్లలు జాబితా ఇచ్చారని మండల విద్యాశాఖ బడిబయట పిల్లలు ఇద్దరు తప్ప ఎక్కువ మంది లేరని అంటున్నారని దీన్ని మరోసారి పరిశీలించాలని విద్యాశాఖాధికారి చంద్రమోహన్‌రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో మండల ప్రత్యేకాధికారి రామ్మోహన్‌రెడ్డి, ఎంపిడి ఒ ఉమాలక్ష్మి, తహశీల్దార్ సుధాకరయ్య, అధికారులు ఎల్లయ్య, కళ్యాణ్‌బాబు, యోగానంద్, సుబ్రమణ్యంనాయుడు, బాలకృష్ణ, విజయకుమార్, సిడిపి ఒ నాగశైలజ, కొండయ్య, స్వర్ణలత, నందకుమార్‌రెడ్డి, చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాపురానికి రాలేదని భార్యను హతమార్చిన భర్త
ఐరాల, డిసెంబర్ 18: కాపురానికి రాలేదని భార్యను భర్త హతమార్చిన సంఘటన ఐరాల మండలం సింగనపల్లె సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వెదురుగుండ్లపల్లె ఆనందయ్య కుమార్తె శ్రీలత(22)కు తిరుపతికి చెందిన నాగరాజుకు ఏడాది క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడడంతో నెలరోజుల క్రితం శ్రీలత పుట్టింటికి వచ్చింది. భార్యను కాపురానికి తీసుకురావడానికి వెదురుగుండ్లపల్లెలోని తన అత్త ఇంటికి నాగరాజు మంగళవారం మేకలు మేపేందుకు దగ్గరే ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగినట్లు తెలిపారు. భర్త నాగరాజు ఆవేశాన్ని అదుపు చేసుకోలేక శ్రీలతను గొంతునులిమి పక్కనే ఉన్న ముళ్ల పొదల్లో చంపి పడేసి బుధవారం ఉదయం నాగరాజు పోలీస్టేషన్‌కు వెళ్లి తనకు తానే లొంగిపోయాడు. అనంతరం సిఐ శ్రీకాంత్, ఎస్సై వాసంతి సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు ఎస్సై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
సత్యవేడు, డిసెంబర్ 18: సత్యవేడు - తడ మార్గం శ్రీసిటీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న బి సురేష్ (28) అనే కార్మికుడు మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. సత్యవేడు మండలం రాజపాళ్యెం దళితవాడకు చెందిన బి సురేష్ శ్రీసిటిలో ఆంత్రోస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. బుధవారం విధులు ముగించుకుని తన స్నేహితుడు మురిగేషన్‌తో కలిసి ద్విచక్రవాహనంలో ఇంటికి వెళుతుండగా శ్రీసిటి సమీపంలో ఎదురుగా తమిళనాడు నుండి ద్విచక్ర వాహనం వస్తున్న వారు వేగంగా ఢీకొనడంతో పక్కనే వెళుతున్న జెసిబి కింద పడి సురేష్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. సురేష్ వెనుక సీట్లో ఉన్న మురిగేషన్ కాలుపైకి జెసిబి ఎక్కడంతో కాలు విరిగి పోయింది. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి శ్రీసిటి అంబులెన్స్‌లో తరలించారు. మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించారు. సురేష్ మృతదేహాన్ని పోస్టు నిమిత్తం సత్యవేడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సత్యవేడు సిఎస్‌ఐ శివకుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సురేష్ మృతితో రాచపాళ్యెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సురేష్‌కు ఇటీవలే వివాహం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

శ్రీవారి ఆలయం ముందు గుండెపోటుతో భక్తుడు మృతి
* ఆలస్యంగా సహస్ర దీపాలంకరణ సేవ
తిరుపతి, డిసెంబర్ 18: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన తమిళనాడు రాష్ట్రం ఈరోడ్డుకు చెందిన పద్మనాభం అనే అయ్యప్ప భక్తుడు బుధవారం ఆలయం ముందున్న గ్యాలరీ వద్ద మృతి చెందారు. ఈ విషయాన్ని గమనించిన టిటిడి ఉద్యోగులు వెంటనే మృతదేహాన్ని తిరుమల అశ్వనీ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా సాయంత్రం వైభవోత్సవ మండపంలో జరిగిన సహస్ర దీపాలంకరణ సేవను ఆలస్యంగా, నామమాత్రంగా నిర్వహించారు. అంతకు మునుపు సంప్రోక్షణా కార్యక్రమాలను చేపట్టారు.

ఘనంగా ముగిసిన యువజనోత్సవాలు
తిరుపతి, డిసెంబర్ 18: సెట్విన్ ఆధ్వర్యంలో గత రెండురోజులుగా తిరుపతి ఎస్వీ సంగీత నృత్య కళాశాలలో నిర్వహిస్తున్న యువజనోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ పి వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో ప్రావీణ్యత సాధించి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలన్నారు. దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను అందజేశారు. జానపద నృత్యంలో గ్రూప్స్ విభాగంలో తిరుపతికి చెందిన నందిని, రమ్య బృదం, పుత్తూరుకు చెందిన నేతాజి బృందాలు మొదటి, ద్వితీయ బహుమతులను అందుకున్నారు. జానపద సంగీతంలో తిరుపతికి చెందిన కృష్ణవేణి, పుత్తూరుకు చెందిన హర్షిత బృందాలు మొదటి, ద్వితీయ బహుమతులను అందుకున్నారు. భరత నాట్యంలో శివప్రసాద్, ఒడిస్సా నృత్యంలో తిరుపతికి చెందిన రేష్మా, కూచిపూడిలో పుత్తూరుకు చెందిన హిందుమతిలు విజేతలుగా నిలిచారు. ప్లూట్ వాయిద్యంలో తిరుపతికి చెందిన ప్రేమలత, శాస్ర్తియ సంగీతంలో తిరుపతికి చెందిన రేఖ, శ్రీకాళహస్తికి చెందిన మల్లికలు మొదటి రెండు బహుమతులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ సిఇఓ లావణ్యవేణి, ఎస్వీ సంగీత, నృత్యకళాశాల ప్రిన్సిపాల్ చల్లా ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.

అదుపులో 12 మంది ఎర్రచందనం కూలీలు
వెదురుకుప్పం, డిసెంబర్ 17: మండలంలోని కురివికుప్పం అటవీప్రాంతంలో తమిళనాడుకు చెందిన 12 మంది ఎర్రచందనం కూలీలను బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ నాగన్న తెలిపారు. మరో 13 మంది కోసం అడవిలో విస్తృతంగా గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానికులు ఎర్రచందనం కూలీలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించాలని ఎస్‌ఐ కోరారు.

ప్రత్యేక అవసరాలు కల్గిన వారికి అధికారులే మార్గదర్శకులు
* ఎజెసి వెంకటసుబ్బారెడ్డి స్పష్టం
తిరుపతి, డిసెంబర్ 18: ప్రత్యేక అవసరాలు కల్గిన వారికి మార్గదర్శకులు మీరే అని అధికారులను ఉద్దేశించి జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాస్ భవనంలో డివిజన్ స్థాయి వికలాంగులు, వయోవృద్ధులకు సంబంధించిన చట్టాలు, పథకాలు, సదుపాయాలపై సమీకృత అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి సంబంధించిన ఏపనికైనా వారు మీ వద్దకు వచ్చినప్పుడు ఆలస్యం చేయక ఆపని వెంటనే పూర్తిచేసి పంపాలన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన వారు అంటే ప్రత్యేక నైపుణ్యం కల్గిన వారని గ్రహించాలన్నారు. దయచేసి వారిపై జాలి,దయ చూపకండి, సహృదయంతోవారిని అర్థంచేసుకోవాలన్నారు. జిల్లాలో గల అన్ని మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో వారికోసం ర్యాంపులను ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. చిన్నారి చూపు పథకం కింద గత ఏడాది 9,750 మంది చిన్నారులకు కంటి అద్దాలను పంపిణీ చేసి రాష్ట్ర స్థాయిలో ప్రధమస్థానం పొందామని గుర్తుచేశారు. వినికిడి సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించి త్వరలో వారికి అవసరమైన పరికరాలను అందిస్తామన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వేతర సంస్థలు కూడా వారికోసం ఎంతో కృషి చేస్తున్నాయన్నారు. ఉద్యోగాల భర్తీకై ప్రతిశాఖలో మూడు శాతం రిజర్వేషన్ మేర ఖాళీ వివరాలను తెప్పించుకొని త్వరలో భర్తీచేస్తామన్నారు. వికలాంగులను వివాహం చేసుకున్న వారికి ప్రభుత్వం ప్రోత్సాహక బహుమతిని రూ. 50 వేల వరకు ఇస్తున్నదన్నారు. ఈనెల 23 నుండి 26 వరకు చిత్తూరు అంబేద్కర్ భవన్‌లో కృత్రిమ కాలు - క్యాలిబర్ శిబిరంను ఏర్పాటచేస్తామన్నారు. ఇందులో వికలాంగులకు అవసరమైన పరికరాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి అనేకమంది వైద్యనిపుణులు వస్తున్నారన్నారు. తిరుపతి 5వ జిల్లా సెషన్స్ జడ్జి జస్టిస్ హెచ్. చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి ప్రభుత్వం అనేక చట్టాలను రూపొందించారన్నారు. వికలాంగులు అన్న పదాన్ని వాడకూడదని, ప్రత్యేక అవసరాలు కలిగిన వారు అని సంబోదించాలన్నారు. మానవసేవే మాధవసేవ అనుకునే వారిపట్ల ప్రేమ, ఆప్యాయతతో వారికి సేవలందించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వికలాంగుల శాఖ సహాయ సంచాలకులు ప్రసాదరావు, అర్బన్ ఐకెపి పిడి శివకుమార్, తహశీల్దార్‌లు, ఐకెపి సిబ్బంది, స్వచ్ఛంద సేవాసంస్థ ప్రతినిధులు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారు పాల్గొన్నారు.

‘నాణ్యమైన పరిశోధనలపై యువత దృష్టి సారించాలి’
తిరుపతి, డిసెంబర్ 17: నాణ్యమైన పరిశోధనలపై యువత దృష్టి సారించి సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జంతుశాస్త విభాగాధిపతి, పిప్స్ సదస్సు కార్యదర్శి ఆచార్య మచ్చా భాస్కర్ పిలుపునిచ్చారు. శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో గత 2 రోజులుగా వర్శిటీ జంతుశాస్త్ర విభాగం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫిజియోలాజికల్ సొసైటీస్ సంయుక్త ఆధ్వర్యలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు నాణ్యమైన పరిశోధనలు, ఆవశ్యకత సమాజానికి ఎంతో అవసరం ఆన్నారు. పరిశోధనా రంగంలో వస్తున్న నూతన పోకడల దృష్ట్యా యువత నూతన ఆవిష్కరణల దిశగా తమ పరిశోధనలను మెరుగుపరచుకుంటూ దినదినాభివృద్ధి చెందాలన్నారు. ఈ దృక్పథంతోనే శరీర ధర్మ శాస్త్రం, ఔషధశాస్త్రం, జీవసాంకేతిక శాస్త్రం, వ్యాధి నివారణోపాయాలు అనే కీలకాంశాలపై అంతర్జాతీయ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ, విదేశాల నుంచి ఈ సదస్సుకు విచ్చేసిన 300 మంది శాస్తవ్రేత్తలు, యువ పరిశోధకులు పాల్గొని తమ పరిశోధనా వ్యాసాలను సమర్పించారు. గురువారం ముగింపు కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా ఉత్తమ పరిశోధనలకు బహుమతి ప్రదానం చేయనున్నారు. బెంగళూరుకు చెందిన నిమ్‌హెన్స్ పరిశోధనా సంస్థకు చెందిన ప్రముఖ శాస్తవ్రేత్త డాక్టర్ బిఎస్ శంకర్‌నారాయణ రావ్ పాల్గొని మెదడుకు సంబంధించిన వ్యాధుల నివారణలో ఎదుర్కొనే సవాళ్లను కూలంకషంగా వివరించారు. కోల్‌కత్తా వర్శిటీ శాస్తవ్రేత్త డాక్టర్ అమర్ కె.చంద్ర వాతావరణం కాలుష్యంవల్ల థైరాయిడ్ గ్రంధిపై పడే ప్రభావం, తద్వారా ఏర్పడే జీవన సమస్యల గూర్చి వివరించారు. కాకతీయ వర్శిటీ ఆచార్యులు వై. ప్రమీలాదేవి మెదడు మూలకణాలు ఉత్పత్తి, మానసిక రుగ్మతలు నివారణలో వాటి పాత్రలను సుదీర్ఘంగా వివరించారు. స్విమ్స్ ఆచార్యులు డాక్టర్ పివిజికె శర్మ మాట్లాడుతూ మూలకణాల ద్వారా పునరుత్పత్తి, ఔషధాల తయారీలో పోషించే పాత్రను వివరించారు. డాక్టర్ అల్లాడి మోహన్ క్షయవ్యాధి, మధుమేహ వ్యాధి ప్రభావం వాటి ద్వంద్వ ప్రభావాన్ని సవివరంగా తెలిపారు.

బ్యాంకర్ల మెరుపు సమ్మె
* స్థంభించిన లావాదేవీలు
తిరుపతి, డిసెంబర్ 18: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బ్యాంకర్లు మెరుపు సమ్మెకు దిగారు. తిరుపతిలోని సుమారు 100కుపైగా బ్యాంకులు, బ్రాంచి కార్యాలయాలు అఖిల భారత బ్యాంకర్ల సమ్మెలో భాగంగా తిరుపతి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగుల సంఘం నేతలు నాయకులు ధన్వంత్‌కుమార్, కె మూర్తి, సంపత్‌కుమార్, బాలశ్రీనివాస నాయక్, బాబు, నరేంద్ర సింహాజి, అశ్వర్థ నారాయణ, చంద్రశేఖర్‌లు మాట్లాడుతూ ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటును నిలిపివేయాలని, అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల ప్రైవేటీకరణ, విదేశీ పెట్టుబడుల విధానం తదితర అంశాలను కేంద్ర ప్రభుత్వం దూర దృష్టితో ఆలోచించాలన్నారు. అవుట్ సోర్సింగ్ విధానంతో పనివత్తిడికి గురి అవుతున్న ఉద్యోగులను కాపాడాలని కోరారు. అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బుధవారం ఒక్కరోజే కోట్లాది రూపాయలు లావాదేవీలు ఆగిపోయాయి. ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

* ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలతోనే తప్పిదాలు * నక్సలైట్ల మూమెంట్‌తో 1995లో ఆయుధాలు వెనక్కు తీసుకున్న ప్రభుత్వం * పరిధి తగ్గించి, ఆయుధాలు ఇవ్వాలని అటవీశాఖ సిబ్బంది డిమాండ్
english title: 
china market

వివేకానందుడి ఆశయాల సాధనే యువత లక్ష్యం కావాలి

$
0
0

రాజమండ్రి, డిసెంబర్ 18: యువతపైనే స్వామి వివేకానందుడు ఆశలు పెట్టుకున్నారని, ఆయన ఆశలు, ఆశయాల సాధనే యువత లక్ష్యంకావాలని వివేకానంద విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్ స్వామి ఆత్మప్రియానంద పిలుపునిచ్చారు. రామకృష్ణమఠం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా రాజమండ్రిలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో బుధవారం ప్రారంభమైన మూడు రోజుల రాష్ట్ర స్థాయి యువ సమ్మేళనం ప్రారంభోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. స్వామి వివేకానందుడు కేవలం భారతీయుడయినప్పటికీ, ఇతర దేశాలు కూడా ఆయనే తమ ప్రతినిధిగా భావించాయన్నారు. ఆయన యవ్వన దశ అంతా అమెరికా, యూరప్ దేశాల్లోనే గడిచిందని, భారతదేశానికి తిరిగి వచ్చే నాటికి ఆయన ఆరోగ్యం క్షీణించిందన్నారు. వివేకానందుడు ఒక ప్రాంతానికి, దేశానికో చెందిన వ్యక్తి కాదని, ఆయనను విశ్వనేతగా ప్రపంచమంతా అంగీకరించిందన్నారు. యువకులు జ్ఞానం, భక్తి, కర్మ యోగాలను సంయోగంగా తీసుకోవాలని వివేకానందుడు భోధించారన్నారు. అలాంటి యువకులు ధీరులుగా, ధీశక్తి కలిగిన వారిగా నిలబడతారని వివేకానందుడు చెప్పారన్నారు. సౌశీల్యం, వ్యక్తిత్వం యువతకు అత్యంత ముఖ్యమన్నారు. అలాంటి వ్యక్తిత్వం, సౌశీల్యం కలిగిన వారు ప్రతి వ్యక్తిలోను భగవంతుడ్ని దర్శిస్తారన్నారు. భగవద్గీత, ఉపనిషత్తుల్లోని సారాంశాన్ని గ్రహించాలని వివేకానందుడు బోధించారన్నారు. అనిర్వచనీయమైన అసహాయత హాని చేస్తుందని, అందువల్ల నిరాశావాదాన్ని విడనాడాలని స్వామి ఆత్మప్రియానంద యువకులకు సూచించారు. నిద్రాదేవత భారతీయ యువతకు ఆరాధ్య దేవత కాకూడదన్నారు. కష్టపడి పనిచేసే వారికి ఫలితాలు వెన్నంటి ఉంటాయన్నారు. స్వామి వివేకానందుడు బోధనలు యువతకు నిరంతరం మార్గదర్శకమన్నారు. సభకు రాజమండ్రి రామకృష్ణమఠం అధ్యక్షుడు కపాలీశానంద అధ్యక్షతవహించారు. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో ఉన్న రామకృష్ణాశ్రమం కార్యదర్శి స్వామి సర్వస్తానంద మాట్లాడుతూ స్వామి వివేకానంద అద్భుతమైన ముందుచూపున్న మహావ్యక్తి అని చెప్పారు. అందుకే 150వ జయంతి ఉత్సవాలు నేటికీ ప్రభావితం చేస్తున్నాయన్నారు. యువకులు ముందుకు రావాలని, దేశ జనాభాలో 25ఏళ్ల లోపు ఉన్న వారు 42శాతం మంది ఉన్నప్పటికీ, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల సగటు వయస్సు 68ఏళ్లుగా ఉందన్నారు. యువకులు ముందుకొస్తే దేశ రూపురేఖలు మారతాయన్నారు. హిందూయిజంలో అనేక గొప్ప విషయాలు ఉన్నాయని, కానీ వాటిని ఆచరించకపోవటం వల్లే అనేక సమస్యలు వెంటాడుతున్నాయన్నారు. ఇప్పటికీ దేశంలో 25శాతం మంది దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారన్నారు. 40శాతం మంది యువకులు నిరుద్యోగులుగా ఉన్నారన్నారు. పాశ్చాత్య దేశాల్లోని మంచిని స్వీకరించాలేగానీ, పాశ్చాత్య సంస్కృతిని కాదని స్వామి సర్వస్తానంద చెప్పారు. మానసిక బలం, నైతిక బలంతో విజయాలను సాధించవచ్చని చెప్పారు. భారతీయం సత్యవాణి మాట్లాడుతూ దేశానికి మహత్తర శక్తిని ప్రసాదించి, పురోగమన దిశగా మళ్లించేందుకు స్వామి వివేకానంద శంఖం పూరించారన్నారు. స్వామి వివేకానందుడి సూచించిన మార్గంలో యువత పయనించాలని, యువత లేవాలని, మేల్కొనాలని పిలుపునిచ్చారు. జీవిత లక్ష్యాలను నిర్ధేశించుకుని సాధించాలని, భారతదేశాన్ని జగద్గురు స్థానంలో నిలబెట్టాలన్నారు. సభలో ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, స్వామి అమృతానంద, బేలూరు మఠం అధ్యక్షుడు స్వామి రఘునాథానంద, కపాలీశానంద, యోగప్రియానంద తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు రామకృష్ణమఠం నుండి వివేకానంద సర్కిల్ వరకు సాగిన ఊరేగింపులో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహానికి సిబిఐ పూర్వ జాయింట్ డైరక్టర్ వివి లక్ష్మీనారాయణ, భారతీయం సత్యవాణి, స్వామి కపాలీశానంద, యోగప్రియానంద తదితరులు పూలమాలలు వేసి, హారతి ఇచ్చారు. రాష్ట్ర నలుమూలల నుండి సుమారు 4వేల మంది విద్యార్ధులు, యువకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 150మంది చిన్నారులు స్వామి వివేకానంద వేషధారణతో ఊరేగింపులో పాల్గొనటం అందర్నీ ఆకట్టుకుంది.

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె విజయవంతం
స్తంభించిన 475 శాఖల కార్యకలాపాలు
కాకినాడ, డిసెంబర్ 18: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) బ్యాంకు ఉద్యోగుల దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బుధవారం తూర్పు గోదావరి జిల్లాలో బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన 475 శాఖలు మూతపడ్డాయి. ఆయా శాఖలకు చెందిన వేలాది మంది బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొని నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జిల్లా కేంద్రం కాకినాడ, రాజమండ్రి, అమలాపురం తదితర పట్టణాల్లో బ్యాంక్ ఉద్యోగులు దేశ వ్యాప్త సమ్మెను పురస్కరించుకుని ప్రదర్శనలు నిర్వహించారు. దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. పదవ ద్వైపాక్షిక వేతన ఒప్పందాన్ని వెంటనే కుదుర్చుకోవాలని, ప్రజావ్యతిరేక బ్యాంకింగ్ రంగ సంస్కరణలను తక్షణం నిలిపివేయాలని ఉద్యోగులు నినాదాలు చేశారు. కాకినాడ నగరంలోని మెయిన్‌రోడ్‌లో గల ఆంధ్రాబ్యాంక్ జోనల్ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన ప్రదర్శనలో యుఎఫ్‌బిఐ కన్వీనర్ కె ఆదినారాయణమూర్తి కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్లు తమ సమస్యలపై వెంటనే స్పందించి డిమాండ్లు నెరవేర్చాలని సూచించారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో వివిధ జాతీయ, కార్పొరేట్, ప్రైవేట్ బ్యాంక్‌ల ఉద్యోగులు పాల్గొన్నారు.

టిబిల్లు ప్రతులు దగ్ధం
కాకినాడ, డిసెంబర్ 18: రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా బిల్లును నిరసిస్తూ కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు దగ్ధం చేశారు.సుమారు 317 పేజీల ముసాయిదాను దీక్షా నిర్వహిస్తున్న జిల్లా పరిషత్ సెంటర్‌లో నిప్పంటించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకోవాలని, అలాగే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేయాలని నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తామంతా ఆందోళన ఉదృతం చేస్తామన్నారు.

ఎంపి ల్యాడ్స్ తరహాలో సిఎస్‌ఆర్ నిధులు మంజూరు
కలెక్టర్ నీతూప్రసాద్
కాకినాడ, డిసెంబర్ 18: జిల్లాలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ క్రింద మంజూరు చేసే పనులన్నింటినీ ఎంపి ల్యాడ్స్ తరహాలో అమలుచేయనున్నట్టు జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ చెప్పారు. దీనికోసం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు చేపట్టనున్నట్టు తెలియజేశారు. జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన పనుల పురోగతి, పెండింగ్ పనులపై సమీక్ష నిర్వహించేందుకు కలెక్టరేట్‌లో బుధవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ కార్పొరేట్ కంపెనీలు అందించే సహకారంతో మంజూరు చేసే పనులన్నింటినీ సెంట్రలైజ్డ్‌గా జిల్లా కలెక్టర్ ద్వారానే మంజూరు ఇస్తామన్నారు. దీనివలన ఆయా పనుల మానిటరింగ్ సుళువుగా ఉంటుందన్నారు. ఎంపి ల్యాడ్స్ తరహాలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ నిధులను ఖర్చు చేస్తామని, అవకతవకలకు ఆస్కారం లేకుండా పంచాయతీరాజ్ అధికార్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 40 స్ర్తిశక్తి భవనాల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన మరో 18 భవనాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మరో వారం రోజుల్లో నూతన ఇసుక విధానం అమల్లోకి రానున్నందున వివిధ నిర్మాణాలకు అవసరమైన ఇసుక సమస్య తగ్గుతుందన్నారు. సైక్లోన్ షెల్టర్లను పాఠశాలలు, అంగన్వాడీ భవనాలకు సమీపంలో నిర్మించాలని సూచించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం క్రింద వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సరఫరా కోసం మంజూరైన పనులను నెలరోజుల్లోగా పూర్తి చేయాలని చెప్పారు. రాష్ట్రీయ కృషి వికాస యోజన క్రింద మత్స్యశాఖ ద్వారా మంజూరైన డ్రైఫిష్ ప్లాట్‌ఫారంల నిర్మాణం పూర్తయిందని, ఉపాధి హామీ పథకంలో జిఒ 389,129 క్రింద మంజూరైన వివిధ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికార్లను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ డి మార్కండేయులు, పంచాయతీరాజ్ ఎస్‌ఇ వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీ్ధర్‌రెడ్డి, డ్వామా ఇన్‌ఛార్జి పిడి మల్లిబాబు, జిల్లా పరిషత్ ఇన్‌ఛార్జి సిఇఒ పద్మ, మత్స్యశాఖ డిడి గోవిందయ్య, ప్రణాళికాధికారి మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

మరో ప్రేమోన్మాదం...
*బాలికపై కిరోసిన్ పోసి సజీవ దహన యత్నం*చావుబతుకుల మధ్య అభాగిని
పిఠాపురం, డిసెంబర్ 18: ప్రేమోన్మాది దాడికి గురై విలవిల్లాడుతున్న మరో అభాగ్య బాలిక వ్యథ ఇది... ప్రేమ పేరుతో ఆమెను వేధించిన యువకుడే తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకోబోతోందనే అక్కసుతో ఆమె ఇంటికే వెళ్లి, కిరోసిన్ పోసి, సజీవ దహనానికి ప్రయత్నించాడు. మరికొద్ది రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పిఠాపురంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈఘటన అందరినీ కలచివేసింది. బాధితురాలి తండ్రి శంకర్రావు కథనం ప్రకారం వివరాలిలావున్నాయి. పట్టణంలో మెకానిక్‌గా పనిచేసే శంకర్రావుకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె రేవతి స్థానికంగా ఒక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. పట్టణానికే చెందిన నవీన్ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేధించేవాడు. విషయం తెలుసుకున్న శంకర్రావు అతడిని మందలించాడు. కాగా బాలికకు వివాహం నిశ్చయమయ్యింది. ఈనెల 22న వివాహం జరగాల్సివుంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఇంటివద్ద ఒంటరిగా ఉన్న బాలికపై నవీన్ కిరోసిన్ పోసి నిప్పంటించాడు. 50 శాతం కాలిన గాయాలైన ఆమె ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ప్రేమ వేధింపులతోనే పెళ్లి ప్రయత్నం
బాధితురాలు రేవతి పిఠాపురం పట్టణంలోని బాదం మాధవరావు హైస్కూలులో 10వ తరగతి చదువుతోంది. నవీన్ వేధింపులు భరించలేక తల్లిదండ్రుల పాఠశాల మాన్పించేశారు. ఈ నేపథ్యంలో పెళ్లి నిశ్చయించారు. ప్రేమోన్మాది నవీన్ ఇంటర్ వరకూ చదివాడు. కాకినాడలో ఒక రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. రేవతి తనకు దక్కదని తెలిసే కిరోసిన్‌పోసి నిప్పంటించడని బాధితురాలి తండ్రి శంకర్ భోరున విలపిస్తున్నాడు. నిరుపేదలైన తాము గుట్టుగా సంసారం నెట్టుకొస్తుంటే తమకి ఈ గతి ఏమిటో అర్ధం కావడంలేదని ఆయన విలపిస్తున్నారు.
ఆసుపత్రిలో హహాకారాలు....
కాగా తీవ్రంగా కాలిన గాయాలతో బాలిక రేవతి పిఠాపురం ఆసుపత్రిలో చేసిన హాహాకారాలు చూపరులను కలచివేశాయి. గాయాల బాధ తట్టుకోలేక ఆమె ఆసుపత్రి ప్రాంగణంలో పరుగులు తీయడం హృదయ విదారకంగా మారింది. అల్లారుముద్దుగా పెరిగిన రేవతి నిత్యం తల్లిచాటు బిడ్డగా అందరిని చిరునవ్వుతో ఆప్యాయంగా పలుకరించేదని స్థానికులు తెలిపారు.
పోలీసుల అదుపులో నిందితుడు?
కాగా ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడు నవీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. నిందితుడు సంఘటనా స్థలంలో వదిలివెళ్లిన సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు అతడి ఆచూకీ కనిపెట్టినట్టు సమాచారం. విషయం తెల్సిన వెంటనే హుటాహుటిన పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సిఐ రాంబాబు, ఎస్‌ఐ లక్ష్మినారాయణలు సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ దొరికిన సెల్‌ఫోన్ ఆధారంగా నిందితుడు నవీనే అని నిర్ధారించుకున్నారు.

మైనర్ బాలిక ఆరోగ్యం విషమం
కాకినాడ , డిసెంబర్ 18: ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన బాలిక రేవతి పరిస్థితి విషమంగా ఉంది. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పిఠాపురం సిఐ రాంబాబు స్వయంగా ప్రభుత్వాసుపత్రి వద్ద ఉండి బాలికకు అవసరమైన వైద్య సహాయాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై కాకినాడ డిఎస్పీ విజయభాస్కరరెడ్డి మాట్లాడుతూ బాలికకు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తున్నామని ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

మున్సిపల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పెద్దపీట
మున్సిపల్ సబార్డినేట్ సర్వీసెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల
సామర్లకోట, డిసెంబర్ 18: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న హెల్త్‌కార్డులు, తదితర సమస్యల పరిష్కారానికి చిత్తశుధ్దితో తనవంతు కృషిచేస్తానని మున్సిపల్ సబార్డినేట్ సర్వీసెస్ అసొసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సామర్లకోట మున్సిపల్ కమిషనర్ జ్యోతుల నాగేంద్ర ప్రసాద్ హమీ ఇచ్చారు. ఇటీవల సామర్లకోట లో నిర్వహించిన రాష్ట్ర అసోసియేషన్ సమావేశంలో స్థానిక కమిషనర్ జ్యోతుల నాగేంద్ర ప్రసాద్‌ను అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్న సందర్భంగా బుధవారం సాయంత్రం మున్సిపల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు స్థానిక అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు కె విల్సన్ జయకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత జ్యోతుల నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తనకున్న అనుభవంతో ఉద్యోగుల సర్వీసు సమస్యలు, హెల్త్‌కార్డులు వంటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా కమిషనర్‌ను సహ ఉద్యోగులు, సిబ్బంది, పలువురు పూలమాలలు, దుశ్శాలువాలు, మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఇ చుక్కా శ్రీనివాసరావు, టిపిఎస్ కెవి నాగశాస్త్రులు, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది తాండ్ర సుదీర్‌కుమార్, మేనేజర్ నస్రీన్‌బేగం, బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు సుంకువిల్లి బాపిరాజు, మాజీ కౌన్సిలర్ కాపుగంటి పైడి రత్నం, ఆర్‌ఐ మేకా నాగేశ్వర్రావు, శానిటరీ ఇన్స్‌పెక్టర్‌లు సిహెచ్ వెంకటేశ్వర్రావు, ఎఇలు కె సత్యనారాయణ, సిహెచ్ కృష్ణమూర్తి, ఎంప్లాయిస్ అసొసియేషన్ అధ్యక్షుడు కె రఘుప్రసాద్, ప్రతినిధులు బంగారు అప్పారావు, ఆయా శాఖల ప్రతినిధులు, సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.

సహాయ పరికరాలతో వికలాంగులు జీవనాన్ని మెరుగుపర్చుకోవాలి
కలెక్టర్ నీతూప్రసాద్
కాకినాడ సిటీ, డిసెంబర్ 18: వికలాంగులు సహాయ పరికరాలు ఉపయోగించడం ద్వారా వారి జీవనాన్ని సులభతరంగా గడపడానికి వీలుంటుందని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ తెలవిపారు. బుధవారం స్థానిక మెక్లారిన్ హైస్కూల్లో వికలాంగులు, వయోవృద్థులు సంక్షేమ శాఖ డిఆర్‌డిఎ, మెప్మా, రాజీవ్ విద్యామిషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి వికలాంగులకు సహాయ పరికరాలు ఎంపిక శిబిరం ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికలాంగులు సహాయ పరికరాలు అమర్చడం ద్వారా వారి పనులు వారు చేసుకుంటారని వారిలో న్యూన్యతా భావం తొలగిపోతుందన్నారు. వికలాంగులకు సహాయ పరికరాలు అమర్చడం వల్ల వారిలోని ప్రతిభను కనబరిచి విభిన్న ప్రతిభావంతులుగా నీరుపించుకున్నారన్నారు. మానసిక వికలాంగులకు, చిన్నపిల్లలకు రాజీవ్ విద్యామిషన్ ద్వారా మంచి పధకం ఉందని దీనిని తెలుసుకుని వికలాంగులు ఉపయోగించుకోవాలన్నారు. బడికి వెళ్ళలేని పిల్లలకు మీ ఇంటికి వచ్చి ఉపాధ్యాయులు విద్యను భోదిస్తారని, తద్వారా బుద్ది పెరిగి స్వంతంగా పనులు చేసుకోగలుగుతారన్నారు. నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తే వారి పనులు వారే చేసుకుంటారని, ఇందుకు అవసరమైన కౌన్సిలింగ్, అవగాహన కల్పిస్తారని, శారీరక వికలాంగులు ఫిజియోధెరపి కూడా చేస్తారన్నారు. ఖచ్చితంగా దీని వల్ల వికలాంగులకు లాభం ఉంటుందని, ఇందుకు ప్రభుత్వం అందజేస్తున్న అవసరమైన పరికరాలు, సౌకర్యాలు తెల్సుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బదిరులకు ఇఎన్‌టి వైద్యుల ద్వారా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శ్రవణ యంత్రాలు పంపిణీ చేస్తారన్నారు. డివిజనల్ స్థాయి శిబిరముల గురించి వికలాంగులకు తెలియజేసి అవగాహన కల్పించాలని ఈ సదవకాశం సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ శిబిరాలకు హాజరు కాలేని వికలాంగులకు, మిగిలిన డివిజన్‌లలో నిర్వహించే శిబిరాలకు హాజరై పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. అనంతరం వైద్య పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమా మనోవికాశ కేంద్రం ప్రతినిధి పెద్దిరెడ్డి, అర్బన్ తహశీల్దార్ ఎం రామూర్తి, వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ కేంద్రాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి
ఇపిడిసిఎల్ సలహాదారు ఆర్‌విఆర్ రావు
రాజమండ్రి, డిసెంబర్ 18: భవిష్యత్‌లో సాంప్రదాయ విద్యుత్‌కు తీవ్ర కొరత ఏర్పడనున్న నేపథ్యంలో సౌర విద్యుత్ ఉత్పత్తిని, విద్యుత్ పొదుపు చర్యలను ప్రోత్సహిస్తున్నట్లు ఎపిఇపిడిసిఎల్ విద్యుత్ పొదుపు సలహాదారు ఆర్‌వి రమణారావు వెల్లడించారు. ఎపిఇపిడిసిఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో గల విద్యుత్ కేంద్రాలు, ఉప కేంద్రాల్లో ఖాళీ ప్రదేశాల్లో సౌర విద్యుత్ ప్యానళ్లను ఏర్పాటు చేసి, సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని, దాన్ని గ్రిడ్‌కు అనుసంధానించాలని సూచించామన్నారు. ఇందుకు రూ. 18కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశామన్నారు. బుధవారం ట్రాన్స్‌కో ఎస్‌ఇ కార్యాలయంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆయన విద్యుత్ పొదుపు, సౌర విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా తనను కలిసిన విలేఖర్లతో రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో 67శాతం బొగ్గు నుంచి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. అయితే థర్మల్ విద్యుత్ వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందన్నారు. సౌర విద్యుత్ వల్ల పర్యావరణానికి కూడా ఎలాంటి హాని జరగదన్నారు. మరో 40ఏళ్ల తరువాత జల, గ్యాస్ నిక్షేపాలు తరిగిపోతాయన్నారు. అప్పుడు విద్యుత్‌కు తీవ్ర కొరత ఏర్పడుతుందన్నారు. ఈపరిస్థితిని అధిగమించేందుకు సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామన్నారు. విద్యుత్ పొదుపుతో పాటు, విద్యుత్ సద్వినియోగంపై కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఒక యూనిట్‌ను ఆదా చేస్తే 2యూనిట్లు ఉత్పత్తి చేసినట్టేనని రమణారావు చెప్పారు. గృహాల్లో కూడా సబ్సిడీపై సౌర విద్యుత్ ఉత్పత్తి పరికరాలను సరఫరా చేస్తున్నామన్నారు. గృహాల్లో 3 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే పరికరాలకు ఎంఎన్‌ఆర్‌ఇ, నెడ్‌క్యాప్ 50శాతం సబ్సిడీ లభిస్తుందని వివరించారు. ఇందుకోసం నెట్‌మీటర్లను ఎపిఇపిడిసిఎల్ 50శాతం సబ్సిడీపై సరఫరా చేస్తుందన్నారు. ఆయన వెంట టెక్నికల్ డిఇ తిలక్‌కుమార్ కూడా ఉన్నారు.

స్వామివివేకానంద స్ఫూర్తితో భారతదేశానికి పూర్వవైభవం
రాజమండ్రి, డిసెంబర్ 18: స్వామి వివేకానందుడి స్ఫూర్తితో భారతదేశానికి పూర్వవైభవం లభిస్తుందని మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణ, భారతీయ సంస్థ నిర్వాహకురాలు సత్యవాణి ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశం మళ్లీ ప్రపంచానికి జగద్గురువుగా మారే అవకాశం ఉందన్నారు. శ్రీరామకృష్ణమఠం ఆధ్వర్యంలో జరుగుతున్న స్వామి వివేకానంద 150వ జయంతోత్సవాల్లో భాగంగా లక్ష్మీనారాయణ, సత్యవాణిలు బుధవారం కంబాలచెరువు వద్దగల వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి వెంట వివేకానందుడి వేషాదరణలో రామకృష్ణ మఠం నుంచి కంబాలచెరువు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వివేకానందుడు యువతకు స్ఫూర్తిప్రదాత అన్నారు. ఆయన జీవితం గురించి విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. ఒక్కో విద్యార్థి ఒక వివేకానందుడిలా మారి ఆయన బాటలో నవభారత నిర్మాణానికి కృషిచేయాలన్నారు. 150ఏళ్ల క్రితమే వివేకానందుడు నవభారత నిర్మాణానికి కృషిచేశారన్నారు. భారతదేశానికి ఆధ్యాత్మిక కేంద్రంగా పునాది వేశారన్నారు. దేశం ప్రస్తుతం కీలక మలుపులో ఉందని, ఈదశలో యువత కీలకమైన పాత్ర పోషించాలన్నారు.

ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు
కాకినాడ సిటీ, డిసెంబర్ 18: కాకినాడ నగరంలో ఓ ఖైదీ పరారీకి కారణమైన ఇద్దరు కానిస్టేబుళ్ళను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఎన్ శివశంకరరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న సంసాని వెంకటరమణను గత సోమవారం కాకినాడ కోర్టుకు ఇద్దరు కానిస్టేబుళ్ళు తీసుకురాగా వారి నుండి ఖైదీ చాకచక్యంగా పరారయ్యాడు. ఈ ఘటనకు కారకులైన దేవీపట్నం కానిస్టేబుల్ డి శివకుమార్, ద్రాక్షారామా కానిస్టేబుల్ ఎం అప్పలరాజును సస్పెండ్ చేస్తూ బుధవారం రాత్రి ఎస్పీ శివశంకరరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర విభజనకు నిరసనగా విద్యార్థి గర్జన
రాజమండ్రి, డిసెంబర్ 18: రాష్ట్ర విభజనకు నిరసనగా, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన టి బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు గర్జించారు. వేలాది మంది విద్యార్థులు కంబాలచెరువు వివేకానందుడి విగ్రహం వద్దకు ర్యాలీగా బైఠాయించి, రాష్ట్ర విభజనకు నిరసనగా నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ముసాయిదా బిల్లు ప్రతులను దహనం చేశారు. విద్యార్థుల గర్జనతో ఈరోడ్డులో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. రుకా నాయకుడు టికె విశే్వశ్వరరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సమైక్యాంధ్రకోసం విద్యార్థులు ధర్నా
రాజోలు, డిసెంబర్ 18: సమైక్యాంధ్రకు మద్దతుగా రాజోలు మండలానికి చెందిన విద్యార్థులు తాటిపాక సెంటర్‌లో బుధవారం ధర్నా నిర్వహించారు. రాజోలులో వున్న ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల, పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని మాట్లాడుతూ శాసన సభలో తెలంగాణా బిల్లును తిప్పి కొట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోను రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న నిరసనలు చేపట్టారు. అనంతరం రెండు గంటల పాటు మానవహారం నిర్వహించి వాహనాల రాకపోకలు నిలిపివేశారు.

వివేకానంద విశ్వవిద్యాలయం విసి స్వామి ఆత్మప్రియానంద
english title: 
viveka

మాయాబజార్!

$
0
0

ఏలూరు, డిసెంబర్ 18: అక్కడ కాకపోతే...ఇక్కడ అన్న చందంగా సరికొత్త వ్యూహాన్ని కార్పొరేషన్ నిర్వాహకులు తెరపైకి తీసుకువస్తున్నట్లు కన్పిస్తోంది. ఒక ప్రయత్నం చేయటం అది బెడిసికొడితే మరోచోట మళ్లీ అవకాశాలు కల్పించటం మాదిరిగా ఈ చెరువుల మాయ సాగిపోతోంది. ఇప్పటికే కృష్ణమాయ కుంభకోణంతో గందరగోళంగా మారిన కార్పొరేషన్ వ్యవహారం అదే వరుసలో చెరువుల వ్యవహారం కూడా చేరిపోవటంతో మొత్తంమీద ఇది భారీగానే సాగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పెషల్ ఆఫీసరు హోదాలో జిల్లా కలెక్టరు సిద్ధార్ధ్‌జైన్ ఇటీవల గజ్జలవారి చెరువు వేలం వ్యవహారాన్ని నిలిపివేసి పద్దతిగా చేయాలని చెపుతూనే దానికి తగిన సూచనలు కూడా జారీ చేశారు. దీంతో అప్పటికే అసలు వ్యవహారం నడిపించేసిన కార్పోరేషన్ పెద్దలకు ఇది మింగుడుపడలేదు. దీంతో అనుకున్న చెరువు ఎలాగా చేయి జారిందని భావించి మరో రెండు చెరువులను తెరపైకి తీసుకువచ్చి వెనువెంటనే వేలం వ్యవహారం ముగించేశారు. ఈ చెరువుల లీజు వ్యవహారంలోకి వెళితే కార్పోరేషన్ ఆధీనంలో ఉన్న చెరువుల్లో చేపలు పట్టుకునేందుకు లీజుకు ఇస్తారు. ఆవిధంగానే గజ్జలవారి చెరువు వేలం అత్యంత రహస్యంగా సాగించారు. అయితే ఈ ఫైల్‌ను పరిశీలించిన కార్పోరేషన్ స్పెషల్ ఆఫీసరు, కలెక్టరు సిద్ధార్ధ్‌జైన్ ఈ వ్యవహారంలో శాస్ర్తియత లేదని, మత్స్యశాఖతో ఆ చెరువులో ఎంతమొత్తంలో చేపలు ఉంటాయో నిర్ధారణ చేయించి ఆతర్వాత ఏలూరు తహసిల్దార్ సమక్షంలో బహిరంగ వేలం నిర్వహించాలని సూచిస్తూ ఆఫైల్‌ను పంపివేశారు. మరి కార్పోరేషన్ పెద్దలు ఈ సూచనను ఎలా అర్ధం చేసుకున్నారో గాని గజ్జలవారి చెరువుకు అనుసరించమని చెప్పిన సూచనలు మిగిలిన చెరువులకు వర్తించవనుకున్నారో లేక ముందుగానే మాయ జరిగిపోయిందో తెలియదుగాని గజ్జల వారి చెరువును మినహాయించి కార్పోరేషన్ పరిధిలో ఉన్న వెంకన్నచెరువు, లక్ష్మక్క చెరువులకు బుధవారం వేలం పాటలు నిర్వహించేశారు. ఈ చెరువుల్లో ఇంతకుముందు కలెక్టరు సూచించిన విధంగా ఎంతమొత్తంలో చేపలు ఉంటాయో అన్న అంచనా కార్పొరేషన్ వద్ద కూడా లేదనే చెప్పాలి. అయినప్పటికీ వాటికి మొత్తాలు నిర్ణయించేసి వాటి ఆధారంగా మూడేళ్ల కాలపరిమితికి వేలం జరిపించేశారు. ఈ చెరువులకు కూడా అవే సూచనలు వర్తిస్తాయన్న అంశం దాదాపుగా కామన్‌సెన్స్ పాయింట్ అనే చెప్పుకోవాలి. అయినప్పటికీ కార్పొరేషన్ మాత్రం ఈ చిన్న పాయింట్ అర్ధం కాలేదో, అర్ధం కానట్టు ఉన్నారో తెలియదుగాని వేలం మాత్రం ముగించేశారు. అయితే ఇప్పటికీ ఇది ఒక కొలిక్కి వచ్చినట్లు కాదన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఈ ఫైళ్లు కూడా మళ్లీ స్పెషల్ ఆఫీసరు ఆమోదముద్రకు వెళ్లాల్సి ఉంది. ఆసమయంలో ఇంతకుముందు చేసిన సూచనలు ఎంతవరకు అమలయ్యాయి, వాటిని ఈ చెరువుల విషయంలో ఎందుకు అమలుచేయలేదు అన్న ప్రశ్నలు తలెత్తక మానవని చెపుతున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఒకపక్క కృష్ణమాయ పేరుతో దుకాణాలకు భారీగా వసూళ్లు చేసి లోపాయికారీగానే వ్యవహారాలు నడిపించేసిన కార్పొరేషన్‌కు ఆ ఫైల్ తిరిగొచ్చి తల బొప్పికట్టినా ఇంకా ఆ పైత్యం మాత్రం తగ్గినట్లు కన్పించటం లేదు. ఈసారి ఏకంగా కలెక్టరు చెర్వుల విషయంలో అభ్యంతరం చెప్పినా మరో రెండు చెర్వులను వెంటవెంటనే తెరపైకి తీసుకురావటం, వేలం ముగిసిందన్న ముద్ర వేసేయటం జరిగిపోయింది. బుధవారం నాటి పరిణామాల్లో అయిదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వెంకన్న చెర్వుకు ఏడాదికి లక్షా 30వేల రూపాయల చొప్పున మూడేళ్లపాటు లీజుకు పాడుకున్నారు. మొత్తం ఏడుగురు పాటదారులు పాటలో పాల్గొనగా కార్పోరేషన్ ఆవరణలోనే వీరంతా రింగ్ అయి అతితక్కువ మొత్తానికి చెర్వు దక్కించుకున్నారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. అలాగే లక్ష్మక్క చెర్వుకు ఏడాదికి లక్షా 56వేల రూపాయల చొప్పున మూడేళ్లపాటు లీజుకు పాడుకున్నారు. దీనిలో ఆరుగురు పాటదారులు పాల్గొనగా ఇక్కడ కూడా రింగ్ అయిపోయి తక్కువ మొత్తానికే చెర్వును దక్కించుకోగలిగారు.

సమైక్యవాదానికి సంకెళ్లు
చింతలపూడి, డిసెంబర్ 18: సమైక్య వాదానికి సంకెళ్లు పడ్డాయి... కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు వ్యతిరేకంగా సమైక్య రాష్ట్ర నినాదాలతో నిరసన తెలిపిన చింతలపూడి మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ తదితరులను ఊహించని రీతిలో నాటకీయ ఫక్కీలో బుధవారం రెండోసారి అరెస్టు చేశారు. రాజేష్‌తోపాటు వైసిపికి చెందిన మరో 19 మంది నాయకులను కూడా తిరిగి అరెస్టు చేయడంతో పట్టణ ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. మంగళవారం కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం కేంద్ర మంత్రి, స్థానిక ఎంపి కావూరి సాంబశివరావు చింతలపూడి రావడం, మద్దాల రాజేష్ ఆధ్వర్యంలో సమైక్య వాదులు నిరసన తెలపడం, కావూరి వారిని అసభ్య పదజాలంతో దూషించడం, కావూరి పైకి కోడిగుడ్లు విసరడం, పోలీసులు రాజేష్‌తో సహా 20 మందిని అరెస్టుచేసి తదుపరి బెయిలుపై విడుదల చేయడం పాఠకులకు విదితమే. అయితే ఊహించని రీతిలో బుధవారం మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో పోలీసులు మద్దాల రాజేష్ ఇంటిపై దాడిచేసి అనారోగ్యంతో నిద్రిస్తున్న ఆయనను బలవంతంగా అరెస్టు చేశారు. అయితే జీపులో రావడానికి నిరాకరించిన రాజేష్ దాదాపు 2 కిలోమీటర్లు మెయిన్ రోడ్డుపై పోలీస్ పహరాలో కాలినడకన స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సమైక్య ద్రోహి, దళిత ద్రోహి, కావూరి నశించాలి అనే కార్యకర్తల, అభిమానుల నినాదాలతో మెయిన్ రోడ్డు దద్దరిల్లింది. మద్దాల రాజేష్‌తోబాటు మంగళవారం అరెస్టు చేసిన 20 మందిని తిరిగి అరెస్టు చేయడంతో వందల సంఖ్యలో వీరి అభిమానులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద కొంత ఉద్రిక్తత ఏర్పడింది. తదుపరి పోలీసులు అరెస్టు చేసిన 20 మందిని స్థానిక కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ పి పురుషోత్తమరావు వీరికి తొలుత రిమాండ్ విధించి, తదుపరి బెయిల్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా బెయిల్‌కోసం దరఖాస్తు చేసుకోడానికి మద్దాల తిరస్కరించారు. అయితే సమైక్య న్యాయవాదుల జెఎసి సభ్యులు రాజేష్‌కు నచ్చజెప్పి బెయిల్‌కు దరఖాస్తుకు ఒప్పించారు. ఈ సంఘటనతో పట్టణంలో సర్వత్రా చర్చగా మారాయి. కాగా అరెస్టయిన వారిలో మాజీ ఎమ్మెల్యే రాజేష్‌తోబాటు స్థానిక సర్పంచ్ మారిశెట్టి జగన్, ఉప సర్పంచ్ బొల్లం వెంకటలక్ష్మి, వార్డు మెంబర్ బి అన్నపూర్ణ, మాజీ ఎఎంసి ఛైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సిపి నాయకులు గంధం చంటి, గోలి చంద్రశేఖర్‌రెడ్డి, సిహెచ్ నరేంద్రరాజు, జె శ్రీహరరెడ్డి, శ్రీనివాస గౌడ్, కె రవి, ఇమ్మానియేల్, యు రామకృష్ణ, వెంకటేశ్వరరావు, చెంచమ రాజు, జల్లిపల్లి పుల్లారావు, పి నర్సారెడ్డి, రమేష్‌రెడ్డి, రామరాజు నాయక్, తోట కుమార్ ఉన్నారు. వీరిపై ఐపిసి సెక్షన్ 141, 149, 341 సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి అరెస్టు చేసినట్టు స్థానిక సిఐ వెంకటేశ్వరరావు తెలిపారు.

కేసులకు భయపడం...
సమైక్యవాదాన్ని వదలం:రాజేష్
చింతలపూడి, డిసెంబర్ 18: ఎలాంటి కేసులకైనా భయపడేది లేదని, సమైక్య రాష్ట్ర వాదాన్ని విడనాడేది లేదని చింతలపూడి మాజీ ఎమ్మెల్యే, వైసిపి నియోజకవర్గ కన్వీనర్ మద్దాల రాజేష్‌కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి కావూరికి ప్రజాస్వామ్య బద్ధంగా సమైక్య రాష్ట్రంకోసం నిరసన తెలిపినందుకు కావూరి తన అధికార బలంతో జిల్లా అధికారులపై వత్తిడి తెచ్చి తనను రెండోసారి అరెస్టు చేయించారని ఆరోపించారు. ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేసి సమైక్య ద్రోహి అయిన కావూరి సమైక్యాంధ్రను కోరుకునే తనతోపాటు 20 మందిపై అక్రమ కేసులు పెట్టించి అరెస్టు చేయించడం సమైక్య ఉద్యమానికి తూట్లు పొడవడమేనన్నారు. ఈ చర్య సమైక్య వాదులపై దాడి అని, సమైక్య వాదానికి వ్యితిరేకమైన కుట్ర అని రాజేష్ పేర్కొన్నారు. ఈ కేసులకే కాదు, ఇంతకంటె పెద్ద కేసులు పెట్టినా భయపడేది లేదని, ప్రజలు అంతా గమనిస్తున్నారని, జగన్ నాయకత్వంలో సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకుంటామని మద్దాల ప్రకటించారు.
నేడు చింతలపూడి బంద్
స్థానిక మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌తోబాటు 20 మందిని అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సమైక్య జెఎసిలు గురువారం చింతలపూడి బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌కు సహకరించాల్సిందిగా బుధవారం సాయంత్రం పట్టణంలో మైక్‌లో విస్తృత ప్రచారం చేశారు.

కావూరి క్షమాపణ చెప్పాలి
-ఏలూరులో దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఎన్జీవోలు
ఏలూరు, డిసెంబర్ 18: సమైక్యవాదులను, ప్రభుత్వ ఉద్యోగులను దుర్భాషలాడిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు క్షమాపణలు చెప్పితీరాలని ఎన్‌జిఓ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. స్ధానిక ఫైర్‌స్టేషన్ సెంటరులో ఎన్‌జిఓ సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి కావూరి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈసందర్భంగా నగర సంఘం అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనను అడ్డుకోలేకపోయిన కేంద్రమంత్రి కావూరి సీమాంధ్ర ఉద్యమం జరుగుతున్నా ఆ ఉద్యమాన్ని దుర్భాషలాడే పరిస్ధితి రావటం దారుణమన్నారు. ఉద్యమంలో భాగంగా అడ్డుకున్న ఎన్‌జిఓలను, సమైక్యవాదులను దుర్భాషలాడటం సమంజసం కాదని పేర్కొన్నారు. ఉద్యోగులు లంచగొండులైతే మంత్రి పదవి కోసం రాష్ట్రానే్న తాకట్టు పెట్టిన కావూరి పెద్ద లంచగొండి అని ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా ప్రజలు తరిమేస్తే పశ్చిమగోదావరికి వచ్చి రెండుసార్లు ఇక్కడి ప్రజలు, ఉద్యోగులు ఓట్లు వేస్తే గెల్చి పదవిని పట్టుకుని వేళ్లాడుతున్నారని విమర్శించారు. ఉద్యోగులను దుర్భాషలాడటం కావూరి అహంకారానికి నిదర్శనమన్నారు. సీమాంధ్ర ఉద్యమానికి తూట్లు పొడిచింది కావూరి వంటివారేనని ధ్వజమెత్తారు. బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే కావూరిని ఏలూరులో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో పంచాయితీరాజ్ మినిస్టీరియల్ అసోసియేషన్ అధ్యక్షులు జి శ్రీ్ధర్‌రాజు, ఎన్‌జిఓ నాయకులు నెర్సు వెంకట రామారావు, లీలామోహన్, సురేష్, లీలాకుమారి, సునీత, రాజు తదితరులు పాల్గొన్నారు.

భద్రాచలంపై పూర్తిహక్కు సీమాంధ్రదే
భీమవరం, డిసెంబర్ 18: భద్రాచలం 1956కు ముందు సీమాంధ్ర ప్రాంతంలోనే ఉండేదని, దానిపై పూర్తిహక్కు ఈ ప్రాంతవాసులకే ఉంటుందని భారతీయ జనతాపార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, భీమవరం అసెంబ్లీ కన్వీనర్ అల్లూరి సాయిదుర్గరాజు పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజలను యుపిఎ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. శాసనసభలో ప్రవేశపెట్టిన తెలంగాణ బిల్లుకు సీమాంధ్ర భారతీయ జనతాపార్టీ వ్యతిరేకమని ఆయన స్పష్టంచేశారు. ఒకేవేళ ఆ బిల్లుకి భారతీయ జనతాపార్టీ అధినాయకత్వం పూర్తిస్థాయిలో మద్దతిస్తే పదవులను వదులుకోవడానికైనా వెనకడబోమని ఆయన ప్రకటించారు. బుధవారం భీమవరం పార్టీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాయిదుర్గరాజు, పట్టణ అధ్యక్షుడు అరసవల్లి సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి అడ్డగర్ల ప్రభాకర గాంధీ మాట్లాడారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను సోనియాగాంధీకి వివరించడంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు, కేంద్ర మంత్రులు విఫలమయ్యారని వెల్లడించారు. బిజెపి పదవుల కోసం పనిచేయదని, రాష్ట్ర భవిష్యత్తు కోసమే పనిచేస్తుందన్నారు. ముఖ్యంగా శాసనసభలో రాష్ట్ర విభజన అంశంలో స్పష్టత లేదని, అన్ని సమస్యలకూ పరిష్కారాన్ని చూపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు. 2014లో భారతీయ జనతాపార్టీ నరేంద్ర మోడి నాయకత్వంలో పూర్తిస్థాయిలో అధికారంలోకి వస్తుందని, ఆ తరువాతే సీమాంధ్ర, తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని పట్టణ అధ్యక్షుడు అరసవల్లి సుబ్రహ్మణ్యం అన్నారు.

ఏజెన్సీలో వాణిజ్య నిర్మాణాలపై విచారణ
జీలుగుమిల్లి, డిసెంబర్ 18: ఏజన్సీలో వాణిజ్య సముదాయాల నిర్మాణంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించనున్నట్టు జంగారెడ్డిగూడెం డివిజినల్ పంచాయతీ అధికారి కె.సాయిబాబా తెలిపారు. ఏజన్సీలో పీసీ చట్టం ఉల్లంఘించి, ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారని గిరిజనుడు పద్దం రామకృష్ణ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో బుధవారం జీలుగుమిల్లి విచారణకు వచ్చిన డిఎల్‌పిఒను గిరిజనేతరులు నిలదీశారు. జీలుగుమిల్లిలో వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్న 38 మందికి ఇఒ పిఆర్‌డి పేరుతో నోటీసులు జారీ చేశారు. వారంతా బుధవారం పరిశీలనకు వచ్చిన డిఎల్‌పిఒ సాయిబాబను చుట్టుముట్టి తమ కుటుంబాలు 50 నుండి వందేళ్ళుగా ఏజన్సీలో నివిస్తున్నాయని, తాము జీవించేందుకు వ్యాపారాలు చేసుకోకూడదా? అనుమతులు లేకుండా ఇళ్ళ నిర్మాణం చేసుకునే వీలున్నప్పుడు, వ్యాపార భవనాలు ఎందుకు నిర్మించుకోరాదని ప్రశ్నించారు. ఒకపక్క రెవెన్యూ శాఖ గిరిజనేతరులకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇస్తుంటే, మరో పక్క గృహనిర్మాణ శాఖ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణలకు అనుమతులు ఇస్తున్నారని, ఈ పరిస్థితులలో చట్టం ప్రకారం ఆ రెండు శాఖలపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. కొద్దిసేపు వాగ్వివాదాల అనంతరం డిఎల్‌పిఒ సాయిబాబా విలేఖరులతో మాట్లాడుతూ ఉన్నతాధికార్ల ఆదేశాల మేరకే తాను పరిశీలనకు వచ్చినట్టు చెప్పారు. పూర్తిస్థాయి నివేదిక ఉన్నతాధికార్లకు అందజేస్తానని చెప్పారు. గిరిజనేతరుల అభ్యంతరాలను సైతం నివేదిస్తానని చెప్పారు. జీలుగుమిల్లి గ్రామ కార్యదర్శి తాతారావును వేరే పంచాయతీకి బదిలీ చేస్తున్నట్టు తెలిపారు. టి.గంగన్నగూడెం కార్యదర్శిని ఇక్కడ ఇన్‌ఛార్జిగా నియమిస్తామని చెప్పారు. సర్పంచ్ మొడియం రామచంద్రరావు, ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో గ్రామ కార్యదర్శిని బదిలీ చేస్తున్నట్టు వివరించారు.

ముగిసిన యువతరంగ్
ఏలూరు, డిసెంబర్ 18: జాతీయ, సాంస్కృతిక సమగ్రతకు యువత నడుంబిగించాలని జిల్లా జాయింట్ కలెక్టరు డాక్టరు టి బాబూరావునాయుడు అన్నారు. స్ధానిక ఇండోర్ స్టేడియంలో మూడురోజులపాటు నిర్వహిస్తున్న యువతరంగ్ జిల్లా స్ధాయి యువజనోత్సవాల ముగింపులో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో యువత నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాల్సి ఉండగా నేడు యువతరం కీలక విషయాల్లో ఆసక్తి చూపలేకపోతున్నదని ఇటువంటి పరిస్ధితి విడనాడాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. జిల్లాలో లక్షా 26వేల మంది యువత ఓటుహక్కు పొందాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 25వేల మంది మాత్రమే ఓటుహక్కు నమోదు చేసుకున్నారని, మిగిలినవారి కోసం గ్రామీణ ప్రాంతాలలో విస్తృతస్ధాయి ప్రచారాన్ని నిర్వహించాల్సి ఉందన్నారు. ఎదుగుదలకు అవరోధంగా నిలిచే పిరికితనం, భయాన్ని యువత పారద్రోలినప్పుడే మంచి భవిష్యత్ లభిస్తుందన్నారు. ఉజ్వల భవిష్యత్ నిర్దేశించుకునేందుకు ప్రణాళిక, ఆలోచనపటిమను పెంపొందించుకోవాలన్నారు. దేశంలోని యువతలో సరైన నిర్దేశం, అంకితభావం కొరవడటం మూలంగానే క్రీడల్లో వెనుకబాటుతనం కనపడుతుందన్నారు. యువతశాతం ఎక్కువగా ఉన్న భారతదేశం ప్రపంచంలో అద్భుతమైన శక్తిగా నిలిచేందుకు యువత పాత్ర ఎంతో కీలకమైందన్నారు. వివిధ పోటీల్లో విజేతలకు డాక్టరు బాబూరావునాయుడు సర్ట్ఫికెట్లు, మెమొంటోలను అందజేశారు. హెల్దీబేబీ పోటీల్లో పాల్గొన్న యం అనన్యశ్రీ, యస్ లయశ్రీ, సిహెచ్ నాగచైతన్య, పి భార్గవసాయి, పి మహాలక్ష్మిలకు మెమొంటోలు, సర్ట్ఫికెట్లు అందజేశారు. ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌గా నిలిచిన డిఎన్‌ఆర్ కళాశాలకు ఆ కళాశాల తరపున హాజరైన కార్యదర్శి రామకృష్ణంరాజుకు మెమొంటో అందజేశారు. తొలుత నాట్యాచార్య గండికోట రాజేష్ శిష్యబృందం ప్రదర్శించిన నృత్యరూపకంతోపాటు పలువురు యువతీయువకులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సెట్‌వెల్ సిఇఓ ఎండిహెచ్ మెహర్రాజ్, మైనార్టీస్ కార్పోరేషన్ ఇడి మహ్మద్ జలీల్ అహ్మద్‌గౌరి, డిపిఆర్‌ఓ ఆర్‌విఎస్ రామచంద్రరావు, సహాయ పర్యాటక శాఖాధికారి పట్ట్భా పాల్గొన్నారు.

గ్రంథాలయాల్లో పాఠకులు కోరుకునే పుస్తకాలు
భీమడోలు, డిసెంబర్ 18 : గ్రంధాలయాల పట్ల పాఠకుల ఆసక్తి పెంచేందుకు పబ్లిక్ ఆన్ డిమాండ్ పేర పాఠకులు కోరుకొన్న పుస్తకాన్ని అందజేయనున్నామని గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ నాగ చంద్రారెడ్డి అన్నారు. ఆయన బుధవారం సాయంత్రం మండలంలోని గుండుగొలను, భీమడోలు శాఖా గ్రంధాలయాలను సందర్శించారు. పాఠకులు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో పాఠకులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. పాఠకుల డిమాండ్‌పై భీమడోలు గ్రంధాలయ పాలకుడు సిహెచ్ నాగేశ్వరరావును అడిగారు. రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ పబ్లిక్ ఆన్ డిమాండ్ కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించామన్నారు. వీటి వివరాలు ప్రతి గ్రంధాలయంలో పాఠకులకు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలోని అన్ని గ్రంధాలయాలను ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఆన్‌లైన్ ద్వారా పాఠకులు తమకు అవసరమైన పుస్తకం ఏ గ్రంధాలయంలో అందుబాటులో ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవచ్చునన్నారు. నవలల సరఫరాపై ప్రభుత్వం కొంత మేరకు ఆంక్షలు విధించిందన్నారు. అయినప్పటికీ పాఠకులు కోరుకొనే ప్రాచుర్యం పొందిన నవలలు అందుబాటులో ఉంచుతామన్నారు. గ్రంధాలయాల అభివృద్ధికి స్థానిక సంస్థలు గ్రంధాలయాల సెస్‌లు సంస్థకు చెల్లించాలని కోరారు. దీనికి సహకరించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. జనవరిలో జిల్లాలోని ఆరు కేంద్రాలలోని నూతన భవనాలలో గ్రంధాలయాలు ప్రారంభం కానున్నాయన్నారు. నల్లజర్ల, కామవరపుకోట, లింగపాలెంలో నూతన భవనాల నిర్మాణానికి స్థల సేకరణ అడ్డంకిగా ఏర్పడిందన్నారు. భీమడోలు గ్రంధాలయానికి స్థల సేకరణ విషయం హైదరాబాద్ స్థాయిలో పెండింగ్‌లో వుందన్నారు. భీమడోలు గ్రంధాలయాన్ని మోడల్ గ్రంధాలయంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ జిల్లా కార్యదర్శి సిహెచ్ మదార్, గ్రంధాలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ చింతా శ్రీరామచంద్రమూర్తి, సభ్యులు వై ఏడుకొండలు, సుతాపల్లి ప్రసాద్, మద్దాల అప్పారావు పాల్గొన్నారు.

భీమవరంలో ప్రణీత హల్‌చల్
భీమవరం, డిసెంబర్ 18: అత్తారింటికి దారేది ఫేం ప్రణీత బుధవారం భీమవరంలో సందడి చేశారు. స్థానిక ఆనంద ఫంక్షన్ హాలులో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ అండ్ సేల్స్ వస్త్ర షోరూం ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు.

విదార్థుల్లో క్రీడాస్ఫూరి పెంపొందించాలి
భీమవరం, డిసెంబర్ 18: విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని డిఎన్నార్ కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు గోకరాజు వెంకట నర్సింహరాజు అన్నారు. భీమవరం గన్నాబత్తుల క్రీడామైదానంలో భీమవరం జోన్ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యాన భీమవరం జోన్ ఆటల పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సభకు భీమవరం జోన్ అధ్యక్షుడు కె.సత్యనారాయణ ప్రసాద్ అధ్యక్షత వహించారు. విద్యార్థులు తొలుత క్రీడామార్చ్ నిర్వహించారు. డిఎన్నార్ కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకట నర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) క్రీడాజ్యోతి వెలిగించి ఆటల పోటీలు ప్రారంభించారు. విద్యార్థుల స్వాగత నృత్యంతో సభ ప్రారంభమైంది. డివైఇఒ కె.రామకృష్ణంరాజు సభలో స్వాగత ఉపన్యాసం చేశారు. పిఇటిలు కెఎస్‌ఎన్ ప్రసాద్, పి.గంగాధర్, జి.నర్మద, డివి రామభద్రరాజు, కె.చిట్టిబాబు, సిహెచ్.శ్రీనివాస్, కె.విజయశ్రీ, కె.వెంకటేశ్వరరావు, సిహెచ్.సుందర్‌కుమార్ పోటీలను పర్యవేక్షించారు.
రాణిస్తున్న క్రీడాకారులు
భీమవరం జోన్ ఆటల పోటీల్లో 100 మీ, 200 మీ, 400 మీ, 800 మీ, 1500 మీ, లాంగ్‌జంప్, షార్ట్‌పుట్ క్రీడాల్లో పోటీలు జరిగాయి. అలాగే జూనియర్స్ విభాగంలో 100 మీ, 200 మీ, 400 మీ, 800 మీ, షాట్‌పుట్, డిస్కస్ త్రో, లాంగ్‌జంప్ పోటీలు జరిగాయి. అలాగే సబ్ జూనియర్స్ విభాగంలో కూడా పోటీలు జరిగాయి.
కాపులకు రిజర్వేషన్ కల్పించాలి
చింతలపూడి, డిసెంబర్ 18: అన్ని రంగాల్లో వెనుకబడిన కాపులకు రిజర్వేషన్లతోబాటు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించాలని కాపునాడు సమావేశం డిమాండ్ చేసింది. చింతలపూడి నియోజకవర్గ కాపునాడు సమావేశం బుధవారం స్థానిక మార్కెట్ యార్డులో జరిగింది. రాష్ట్ర నాయకుడు సిద్ధోజి, రాంబాబు, జిల్లా కాపునాడు అధ్యక్షుడు చినమిల్లి వెంకట్రాయుడు, ప్రధాన కార్యదర్శి టి ప్రభాకరరావు, స్థానిక ఎఎంసి ఛైర్మన్ తూతా లక్ష్మణ్‌రావు, బొడ్డు వెంకటేశ్వరరావు, జి విక్రమనాయుడు, కె రాంబాబు పాల్గొన్నారు.

అక్కడ కాకపోతే...ఇక్కడ అన్న చందంగా సరికొత్త వ్యూహాన్ని
english title: 
maya bazar

26న సీజ్ లారీ వేలం

$
0
0

నెల్లూరు, డిసెంబర్ 18: తమ శాఖ పరిధిలో సీజ్ అయిన అశోక్ లైలాండ్ లారీ (ఏపి 26 టిటి 7951)ను ఈ నెల 26న వేలం వేయనున్నట్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ నెల్లూరు రెండో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ లారీ గత ఏడాది మద్యం అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిందన్నారు. తమ కార్యాలయ ఆవరణలో 26న ఉదయం పదిన్నర గంటలకు వేలం వేస్తున్నట్లు చెప్పారు.

కోవూరులో ఎటిఎం చోరీకి విఫల యత్నం
కోవూరు, డిసెంబర్ 18: పట్టణంలో మైథిలి సెంటర్ సమీపంలో నున్న ఆంధ్రాబ్యాంక్ ఏటి ఎంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి ప్రయత్నించి విఫలయత్నం జరిగిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. స్థానిక పోలీసుల సమాచారం మేరకు పట్టణంలోని మైథిలి హాల్ సెంటర్ సమీపంలో ఆంధ్రాబ్యాంక్ ఏటి ఎం ఉంది. ఈ ఏటి ఎం సంరక్షణను టాటా కన్సల్‌టెన్సీకి అప్పగించారు. టాటా వారు ఏటి ఎంకు సెక్కూరిటీని నియమించలేదు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ఏటి ఎంలోకి ప్రవేశించి, ఇనుపరాడ్లతో సిసి కెమేరాలను అద్దాలను ద్వంసం చేశారు. ఏటి ఎం నగదు వచ్చే భాగాన్ని ద్వంసం చేశారు. ఏటి ఎం తెరుచుకోకపోయేసరికి చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు. ఎతంకూ నగదు రాకపోయేసరిగి అక్కడినుంచి ఉడాయించారు. తెల్లవారు జామున స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. కోవూరు పి ఎస్సై నాగరాజు, అంధ్రాబ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్‌రెడ్డి, టాటా కన్‌న్సల్‌టెన్సీ సిబ్బంది, వేలిముద్ర అధికారులు ఏటి ఎంను పరిశీలించారు. ఏటి ఎంలో 15లక్షలరూపాయలను లోడ్‌చేసి ఉంచారు. అందులో కార్డుదారులు 350000ల రూపాయలను డ్రా చేసి ఉన్నారు. మిగిలిన నగదు ఏటి ఎంలోనే ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ వదిలి వెళ్లిన ఇనుప రాడ్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోవూరు పి ఎస్సై తెలిపారు.

30 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
నాయుడుపేట, డిసెంబరు 18: విన్నమాల గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 26 క్వింటాళ్ల ఉప్పుడు బియ్యం, 4 క్వింటాళ్ల పచ్చి బియ్యం బుధవారం పౌర సరఫరాల విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ జి.మల్లికార్జున సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. విన్నమాల గ్రామంలో నివాసం ఉంటున్న వాకాటా హరి నివాసంలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచారన్న సమాచారం అందుకున్న అధికారులు ఇంటిపై దాడి చేయగా అప్పటికే సమాచారం అందుకొన్న హరి ఇంటికి తాళాలు వేసి పలాయనం చిత్తంగించాడు. ఇంటి తలుపులు తెరవాలని వారి బంధువులకు తెలిపినప్పటికీ ఎవరూ స్పందించక పోవడంతో అధికారులు తలుపులు పగుల గొట్టి బియ్యాన్ని స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం సరుకుల పంచనామ నిర్వహించారు. ఈ దాడుల్లో ఎఎస్‌వో హరి, డిటి కాంతయ్య, ఆరై గోపినాథ్‌రెడ్డి, విఆర్వో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
సూళ్లూరుపేటలో..
సూళ్లూరుపేట : సూళ్లూరుపేటలో రైస్‌మిల్లులపై డిఎస్‌వో ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు చేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ రైస్‌మిల్లులో నిబంధనలకు విరుద్ధంగా 100టన్నుల బిపిటి బియ్యం బస్తాలు నిల్వ ఉండడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 6ఎ కేసు నమోదు చేసి రైస్‌మిల్లును సీజ్‌చేశారు.

జనవరి 8,9,10 తేదీల్లో పక్షుల పండుగ
సూళ్లూరుపేట, డిసెంబరు 18: ప్రతియేటా సూళ్లూరుపేట వేదికగా నిర్వహించే పక్షుల పండుగను ప్రణాళికా బద్ధంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ అన్నారు. ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణపై బుధవారం స్థానిక చెంగాళమ్మ కల్యాణ మండపంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల నుంచి పులికాట్, నేలపట్టుకు వలస వచ్చే పక్షుల కోసం పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పక్షుల పండుగ నిర్వహించేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వచ్చే ఏడాది జనవరి 8,9,10తేదీల్లో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పక్షుల పడుగ నిర్వహించేందుకు మూహూర్తం ఖరారు చేశారు. ఫెస్టివల్ కన్వీనర్‌గా గృహ నిర్మాణ శాఖ అధికారి రవిప్రకాష్‌ను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో జరిగిన లోటుపాట్లను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ స్టాల్స్‌తో పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామన్నారు. నేలపట్టులో సందర్శకుల కోసం ప్రత్యేకంగా తాగునీరు, బస్సుల సౌకర్యం కల్పిస్తామన్నారు.
తడ మండలం భీములవారిపాళెం పడవల రేవులో పర్యాటకుల కోసం బోటు షికారు ఏర్పాటు చేస్తామన్నారు. మూడు రోజుల్లో ఫెస్టివల్‌పై అధికారులు నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశం అనంతరం జూనియర్ కళాశాల మైదానాన్ని అధికారులతో కలసి పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో జితేంద్ర, డ్వామా పిడి గౌతమిరెడ్డి, టూరిజం శాఖ అధికారి నాగభూషణం, గూడూరు డీఎస్పీ చౌడేశ్వరిదేవి, నాయుడుపేట ఆర్డీవో ఎం.వి రమణ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఉద్యోగుల సమ్మెతో మూతపడ్డ బ్యాంకులు
నెల్లూరు, డిసెంబర్ 18: యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకర్ల యూనియన్ ఇచ్చిన పిలుపుతో జిల్లావ్యాప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి. మంగళవారం జరిగిన ఈ సమ్మె కారణంగా జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యి కోట్ల రూపాయల వరకు ఆర్థిక లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. జిల్లా పరిధిలో 342 బ్యాంకులున్నాయి. ఈ సందర్భంగా నగరంలోని బారకాస్ ఎస్‌బిఐ ప్రధాన బ్రాంచి వద్ద జరిగిన ధర్నాలో భాగంగా ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతూ కొత్తగా ప్రైవేట్ బ్యాంకులకు లైసెన్స్‌లు ఇస్తుండటాన్ని తప్పుబట్టారు. ఈ పరిణామం ప్రైవేటీకరణకు దారి తీస్తుందన్నారు. పే రివిజన్ కమిషన్ వేసి ఐదేళ్లు దాటి 18 నెలలైనా ఇంతవరకు ఈ సమస్య పరిష్కరించకపోవడం దారుణమన్నారు. 30శాతం వరకు ఇవ్వాల్సిన పిఆర్‌సి కేవలం 5 శాతంకే పరిమితం చేస్తుండటాన్ని కూడా తప్పుబట్టారు. బ్యాంకింగ్ సంస్కరణలు చేయడాన్ని కూడా విమర్శించారు. కార్యక్రమానికి బ్యాంకర్ల ఫోరమ్ జిల్లా అధ్యక్షులు ఎన్వీఎస్ ప్రసాద్ నేతృత్వం వహించారు.

తహశీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ చోరీ
బాలాయపల్లి, డిసెంబర్ 18: తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ప్రధాన తలుపు తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు మూడు రూముల తాళాలు పగులగొట్టారు. తహశీల్దార్ ఉపయోగించే కంప్యూటర్‌ను అపహరించుకొని వెళ్లారు. కంప్యూటర్ రూం తాళాలు పగుల గొట్టినా అక్కడ ఏమీ తాకలేదు. ఎఎస్‌ఓ రూంలో బీరువా తాళాలు పగుల గొట్టి కాగితాలు చిందర వందర చేశారు. అక్కడ ఉన్న ఒక గోనెసంచి, అట్టపెట్టే తీసుకొన్నారు. ఈ అట్టపెట్టె, గోనెసంచిలోనే కంప్యూటర్‌ను అపహరించుకుని వెళ్లుంటారని భావిస్తున్నారు. దొంగలు ప్రధాన ద్వారం తలుపునకు లోపల గడియపెట్టి కుర్చీలు అడ్డుపెట్టి వెనక ద్వారం నుండి పారిపోయారు. కార్యాలయంలో చోరీ విషయం గుర్తించిన స్వీపర్ తహశీల్దార్‌కు సమాచారం అందించింది. పోలీసులు పరిశీలించే వరకు తహశీల్దార్ పూర్ణచంద్రరావు సిబ్బందిని ఎవరినీ లోనికి వెళ్లనీయలేదు. ఎస్సై ఎం కొండయ్య, పిఎస్సై నాగరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి క్లూస్‌టీంకు సమాచారం అందించారు. నెల్లూరు నుండి వచ్చిన క్లూస్‌టీం సభ్యులు వేలి ముద్రలనుసేకరించారు. ఎస్సై మాలకొండయ్య తహశీల్దార్ పూర్ణచంద్రరావును, కార్యాలయ సిబ్బందిని విచారించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

తమ శాఖ పరిధిలో సీజ్ అయిన అశోక్ లైలాండ్ లారీ
english title: 
auction

జిల్లావ్యాప్తంగా బ్యాంకుల సమ్మె

$
0
0

ఖాతాదారుల ఇక్కట్లు
ఒంగోలు, డిసెంబర్ 18:యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్‌లు ఇచ్చిన పిలుపుమేరకు జిల్లావ్యాప్తంగా జాతీయ బ్యాంకులకు చెందిన సిబ్బంది బుధవారం సమ్మెలో పాల్గొన్నారు. బ్యాంకు సిబ్బంది సమ్మెతో సుమారు రెండు వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి, దీంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచి, టౌన్ బ్రాంచి, ఎస్‌ఎంఇ బ్రాంచి, కోర్టు బ్రాంచి, ప్రకాశం భవనం బ్రాంచి, కర్నూలురోడ్డు బ్రాంచి, ఆర్‌బిఒ బ్రాంచీలకు చెందిన సిబ్బంది స్థానిక స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచి వద్ద సమావేశమై నినాదాలు చేశారు. వేతన సవరణ ఒప్పందాన్ని త్వరగా పరిష్కరించాలని, బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలకు వ్యతిరేకంగా సిబ్బంది నినాదాలు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాలను నిలిపివేసి లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పబ్లిక్ సెక్టారు బ్యాంకుల ప్రైవేటీకరణ ఆపాలని, బ్యాంకింగ్ రంగంలో కారుణ్య నియామకాలను పునరుద్ధరించాలని సిబ్బంది నినాదాలు చేశారు. ఈసందర్భంగా ఎస్‌బిఐ ఎస్‌యుహెచ్‌సి గుంటూరు వైస్ ప్రెసిడెంట్ ఎం కృష్ణ మాట్లాడుతూ వేతన సవరణ ఒప్పందాన్ని త్వరగా పరిష్కరించాలని, సబ్‌స్ట్ఫా రిక్రూట్‌మెంట్ జరపాలని డిమాండ్ చేశారు. ప్రకాశం రీజియన్ కార్యదర్శి జి విజయమోహన్ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలను నిలుపుదల చేయాలన్నారు. బ్యాంకు ఉద్యోగులకు సిఐటియు జిల్లాకార్యదర్శి డి శ్రీనివాసరావు సంఘీభావాన్ని ప్రకటించి ప్రసంగించారు. బ్యాంకింగ్ రంగ ఒత్తిళ్లను ముందుముందు ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సిండికేట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద ఎఐబిఇఏ నాయకులు వి పార్ధసారధి అధ్యక్షతన సభ జరిగింది. ఆయా కార్యక్రమాల్లో ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జిల్లాఅధ్యక్షుడు సర్దార్, సిఐటియు జిల్లాకార్యదర్శి సిహెచ్ శ్రీనివాసరావు, ఎఐబిఓఏ నాయకులు ఎ సుధాకరరావు, పికె రాజేశ్వరరావు, మల్లికార్జునరావు, డి కోటేశ్వరరావు, నగర కో ఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు ఎ వేణుగోపాలరావు, బిఇఎఫ్‌ఐ నాయకులు సిహెచ్ శోభన్‌బాబు, ఒంగోలు నగర కమ్యూనిస్టు సమితి కార్యదర్శి యు ప్రకాశరావు, యూనియన్ ఒంగోలు కార్యదర్శులు వి కృష్ణమోహన్, వి శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, జివి సుబ్బారావు, జకీర్, కెఎన్‌బి చారి, నరేంద్ర, యు నాగేశ్వరరావు, రాజశేఖరరెడ్డి, ఉద్యోగులు పాల్గొని ప్రసంగించారు.

తొమ్మిది మంది ఎస్‌ఐలు బదిలీ
ఒంగోలు, డిసెంబర్ 18:జిల్లాలో మరో తొమ్మిది ఎస్‌ఐలను బదిలీచేస్తూ జిల్లా ఎస్‌పి పి ప్రమోద్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పొదిలిలో ఎస్‌ఐగా పని చేస్తున్న కె కమలాకర్‌ను టంగుటూరు పోలీస్‌స్టేషన్‌కు, టంగుటూరులో పనిచేస్తున్న వై వెంకటరమణయ్యను కందూకురు టౌన్ పోలీసుస్టేషన్‌కు, కంభంలో పనిచేస్తున్న జె రామకోటయ్యను దర్శికి బదిలీ చేశారు. అదేవిధంగా దొనకొండలో పనిచేస్తున్న సిహెచ్ హజరత్తయ్యను కంభం, కందూకురులో పనిచేస్తున్న హెచ్‌ఎస్ హుస్సేన్ బాషాను గుడ్లూరు, గుడ్లూరులో పనిచేస్తున్న ఎన్ నాగమల్లేశ్వరరావును పొదిలి, దర్శిలో పనిచేస్తున్న వై నాగరాజును త్రిపురాంతకం, కురిచేడులో పనిచేస్తున్న ఎస్ సుబ్బారావును చినగంజాం, చినగంజాంలో పనిచేస్తున్న ఎం రాజేష్‌ను దొనకొండకు బదిలీచేస్తూ జిల్లా ఎస్‌పి ప్రమోద్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.

మిన్నంటుతున్న ఆందోళనలు
తెలంగాణ బిల్లు ప్రతులను తగలబెట్టిన న్యాయవాదులు
విద్యార్థి జెఎసి ఫ్రంట్ నేతల ధర్నా
ఒంగోలు, డిసెంబర్ 18: కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు మిన్నంటుతున్నాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని జిల్లా కోర్టు సెంటర్ వద్ద న్యాయవాదులు తెలంగాణ బిల్లు ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపి అక్కడే రాస్తారోకో చేపట్టారు. ఈసందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పైనిడి సుబ్బారావు, ప్రధానకార్యదర్శి పి సుబ్బారావు, బార్ అసోసియేషన్ నాయకులు శిరిగిరి రంగారావు తదితరులు మాట్లాడుతూ తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడటం బాధాకరమన్నారు. సీమాంధ్రకు చెందిన శాసనసభ్యులందరూ మూకుమ్మడిగా తెలంగాణ బిల్లును వ్యతిరేకించి సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్, సమైక్యాంధ్ర విద్యార్థి ఫ్రంట్ ఆధ్వర్యంలో ఒంగోలులోని దివంగత మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహం వద్ద తెలంగాణ బిల్లును సీమాంధ్ర శాసనసభ్యులు ఓడించాలని డిమాండ్ చేస్తు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు పైనం నాగరాజు, ఆప్సా జిల్లా అధ్యక్షుడు మాధవరావు, గౌరవాధ్యక్షులు కిశోర్, రామిరెడ్డిలు మాట్లాడుతూ సీమాంధ్రకు చెందిన శాసనసభ్యులందరూ పార్టీలకు అతీతంగా తెలంగాణ బిల్లును ఓడించి సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు. గత వంద రోజులకు పైగా సీమాంధ్రకు చెందిన ప్రజలు, విద్యార్థులు ఆందోళనలు చేపట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లుకు అసెంబ్లీకి పంపటం బాధాకరమని పేర్కొన్నారు. సీమాంధ్రకు చెందిన శాసనసభ్యులు ఇప్పటికైనా కళ్ళుతెరిచి సమైక్యాంధ్ర సాధించేందుకు కృషి చేయాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ నాయకులు మల్లికార్జున్, సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ఫ్రంట్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కందుకూరి రాజశేఖర్, నాయకులు విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.

ఆధార్ దరఖాస్తులకు తోపులాట
కందుకూరు రూరల్, డిసెంబర్ 18: స్థానిక ఎన్‌జిఓ భవనంలో ఆధార్ దరఖాస్తులు పొందేందుకు ప్రజలు అధిక సంఖ్యలో రావడంతో కేంద్రం వద్ద తోపులాట జరిగింది. ఐదు రోజులకు ఒకసారి మాత్రమే దరఖాస్తులు పంపిణీ చేయడంతో ప్రజలు అధిక సంఖ్యలో ఆధార్ కేంద్రం వద్దకు చేరుకోవడంతో తోపులాట జరిగింది. పరిస్థితిని గమనించిన తహశీల్దార్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి వరుసక్రమం ఏర్పాటు చేసి దరఖాస్తులు పంపిణీకి సహకరించారు.

ట్రాఫిక్ దిగ్బంధంలో చీరాల పట్టించుకోని పోలీసులు
చీరాల, డిసెంబర్ 18: చీరాల పట్టణం ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకున్నది. ట్రాఫిక్ పోలీసులు ఉదారంగా వ్యవహరించటంతో వాహనదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పట్టణంలో ప్రతిరోజు వేలాది వాహనాలు తిరుగుతుంటాయి. ప్రధాన కూడళ్లల్లో ఆటోలు నిలపటంతో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆటోడ్రైవర్ల నుండి ట్రాఫిక్ పోలీసులు మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మామూళ్లు ఇవ్వని వారిపై ఇష్టం వచ్చినట్లు ట్రాఫిక్ సిబ్బంది చలానాలు రాస్తుండటంతో ఆటోడ్రైవర్లు బెంబేలెత్తిపోతున్నారు. అధికారులకు మామూళ్ళు ఇస్తున్నామనే నెపంతో డ్రైవర్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. మద్యం సేవించి ఆటో నడిపినా ట్రాఫిక్ పోలీసులు వారిని నివారించటానికి సాహసించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం 18 సంవత్సరాలు నిండనివారు, లైసెన్స్‌లు లేనివారు వాహనాలను నడపకూడదు. కాని దాదాపు ముప్పై శాతం మంది 18 సంవత్సరాలలోపు వయస్సు కలిగినవారే ఆటోలను నడుపుతున్నారు. ఆటోలకు సరైన అనుమతి పత్రాలు లేకపోయినా, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నా, రోడ్డుకు అడ్డంగా వాహనాలను నిలుపుదల చేసినా ట్రాఫిక్ పోలీసులు మిన్నకుంటున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు పదుల సంఖ్యలో హోమ్‌గార్డులను వినియోగిస్తున్నా ట్రాఫిక్‌ను నియంత్రించ లేకపోతున్నారు. కొంతమంది ఆటోడ్రైవర్లు నేరప్రవృత్తి కలిగినవారు ఉండటం వల్ల అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారిపట్ల పోలీసులు అప్రమత్తంగా వుండాలని ప్రజలు కోరుతున్నారు. హోమ్‌గార్డులు ఆటోడ్రైవర్లు నుంచి రోజు వారి మామూళ్ళు వసూలు చేస్తున్నట్లు డ్రైవర్లు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో పోలీసులు ఆటోడ్రైవర్‌లపై నిబంధనలు విధించారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే ఆటోలను సీజ్ చేస్తామని డిఎస్‌పి ఆటో డ్రైవర్‌లకు హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా లైసెన్స్‌లు లేకుండా, మద్యం సేవించి ఆటోలను నడిపితే కఠిన చర్యలు ఉంటాయని కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. అయినా ఆటోడ్రైవర్లు మాత్రం యథాతథంగా ఆటోలను నడుపుతున్నారు.

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్
సిఎండి హెచ్‌జె దొర స్పష్టం
చీరాల, డిసెంబర్ 18: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి ఎపిఎస్‌పిడిసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌జె దొర తెలిపారు. బుధవారం స్థానిక సబ్ డివిజన్ కార్యాలయంలో విద్యుత్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ముందుగా రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ చీరాల పరిధిలో మూడు సబ్ స్టేషన్‌లు మంజూరయ్యాయని, వీటిల్లో రెండు పూర్తయ్యాయని, మరొకటి ఫిబ్రవరిలో నిర్మించనున్నట్లు తెలిపారు. గతంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉండేదని, ప్రస్తుతం కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. రానున్న వేసవికాలంలో కూడా విద్యుత్ కొరత లేకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లులు రెవెన్యూ, వ్యవసాయ తదితర శాఖలలో ఆలస్యం అవుతున్నాయని, జాప్యం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. సిబ్బంది కొరత లేకుండా కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నామని అన్నారు. 45మంది సిబ్బంది కావాలని 2011లో ప్రభుత్వానికి విన్నవించుకోగా 20మందికి అవకాశం కల్పించిందని త్వరలో ఈ భర్తీ పూర్తిచేస్తామని అన్నారు. కృష్ణపట్నంలో 800 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రం నిర్మాణం త్వరలో పూర్తవుతుందని చెప్పారు. పరిశ్రమలు, వ్యవసాయంపై విద్యుత్ కోతలను ఎత్తివేశామని తెలిపారు. కార్యక్రమంలో ఆపరేషన్ డైరెక్టర్ తిరుపతి రాధాకృష్ణ, ఎస్‌ఇ జయభారతరావు, డిఇ తోట శ్రీనివాసరావు, చీరాల, వేటపాలెం, ఎఇ, ఎడిఇలు పాల్గొన్నారు.

పంటలకు సాగునీరివ్వాలి:కరణం
పంగులూరు, డిసెంబర్ 18: సాగర్ శివారు భూములకు సాగునీరు అందించాలని రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు కరణం బలరామకృష్ణమూర్తి డిమాండ్ చేశారు. బుధవారం ఎన్‌ఎస్‌పి కాలువ రాంకూరు వద్ద పమిడిపాడు మేజర్ కాలువ నీటిపారుదలను ఆయన పరిశీలించారు. మేజర్ కాలువకు 330 క్యూసెక్కుల నీరు పారుదల ఉండాల్సి ఉండగా 152 క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రవహిస్తోందని అన్నారు. ఈ విషయమై ఎన్‌ఎస్‌పి డిఇ శంకరనారాయణను ఫోన్‌లో సంప్రదించారు. గత వారంగా మేజర్ కాలువకు 152క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రవహిస్తోందని ఈ నీరు పంటలకు చాలదని నీటి విడుదలను పెంచాల్సిందిగా ఆయన కోరారు. ఆయన వెంట టిడిపి మండల అధ్యక్షులు చింతల సహాదేవుడు, జిల్లా కార్యదర్శి కుక్కపల్లి ఏడుకొండలు, వర్క్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.

పోలేరమ్మ ఆలయంలో చోరీ
పర్చూరు, డిసెంబర్ 18:మండలంలోని నూతలపాడు గ్రామంలో గల పోలేరమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరగ్గా గ్రామస్థులు బుధవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంకొల్లు సిఐ సత్యకైలాస్‌నాధ్, ఎస్సై ఎ శ్రీహరిరావు ఆలయానికి చేరుకొని చోరీ జరిగిన తీరుపై పరిశీలించారు. గ్రామస్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి ఆలయ మండపంలోని గ్రిల్స్ తొలగించి ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారికి అలంకరించే అరచేతి వెండి తొడుగును అపహరించుకెళ్ళారు. ఒంగోలు నుంచి వచ్చిన క్లూస్‌టీం ఆనవాళ్ళను సేకరించింది. అలాగే గుంటూరునుంచి వచ్చిన జాగిలాలు ఆలయ ప్రాంగణంలో తిరిగాయి. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చోరీ జరిగిన స్థలాన్ని చీరాల డిఎస్‌పి డి నరహర పరిశీలించారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు.

విద్యుత్ అధికారులపై రైతుల కనె్నర్ర
పుల్లల చెరువు విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి
స్టేషన్‌కు తాళాలు వేసిన రైతులు
పుల్లల చెరువు, డిసెంబర్ 18: మండల కేంద్రమైన పుల్లల చెరువులోని రైతులు బుధవారం విద్యుత్ అధికారులపై కనే్నర్ర చేశారు. వందలాది ఎకరాల్లో పత్తి, మిరప , వరి పంటలు ఎండుముఖం పట్టడంతో వారు విద్యుత్ అధికారులపై అందోళనకు దిగారు. కనీసం రోజుకు రెండు గంటలు కూడా విద్యుత్ సక్రమంగా ఇవ్వడంలేదని, ఇటీవల మూడు రోజులకు గాను కేవలం ఆరుగంటలు మాత్రమే విద్యుత్ ఇచ్చారని రైతులు వాపోయారు. ఇదేవిధంగా విద్యుత్ సరఫరా చేస్తే వేలకువేల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంటలు ఎండిపోయి కనీసం పెట్టుబడులు కూడా రాసి పరిస్థితి ఏర్పడిందనివారు ఆందోళన వ్యక్తం చేశారు. పుల్లలచెరువు గామ్రానికి చెందిన సుమారు 200మంది రైతులు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి తాళాలు వేశారు. సంబంధింత అధికారులతో అధికారులు మాట్లాడి ఈరోజు నుంచి సక్రమంగా విద్యుత్ ఇస్తామని చెప్పడంతో వారు దాడి విరమించారు.

అక్షరాస్యతా శాతం పెంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
*కలెక్టర్ విజయ్‌కుమార్
మార్టూరు, డిసెంబర్ 18 : జిల్లాలో అక్షరాస్యతా శాతాన్ని పెంచడానికి గ్రామ ఐక్యసంఘాల ప్రతినిధులు కృషిచేయాలని కలెక్టర్ విజయ్‌కుమార్ అన్నారు. బుధవారం మార్టూరులో విజయలక్ష్మి కల్యాణమండపంలో పదిమండలాల గ్రామల ఐక్యసంఘాల సభ్యులతో ఆయన మాట్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 53శాతం మహిళా నిరక్ష్యరాస్యులు ఉన్నారని వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని అన్నారు. మార్చి 23లోపు 10లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకుకృషిచేయాలని అన్నారు. విద్య వలన సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మూడ నమ్మకాలు పారద్రోలడానికి విద్య ఉపయోగపడుతుందని అందువల్ల ప్రతి ఒక్కరూ విద్యనభ్యసించినప్పుడే దేశం అభివృద్ది చెందుతుందని అన్నారు. స్ర్తి నిరక్ష్యరాస్యులైతే ఆ కుటుంబం కూడా వెనుకబడుంటుదని అందువల్ల ఐక్య సంఘాలు ఇంటింటికీ తిరిగి విద్య యోక్క ప్రాముఖ్యతను వారికి తెలియజేయాలని అన్నారు. గ్రామ ఐక్య సంఘాల సభ్యులు ఆయా గ్రామాల్లో నూటికి నూరు శాతం కృషిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా మార్టూరులో గ్రానైట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేముల పల్లి శ్రీనివాసరావు అక్షర ప్రకాశానికి సంబంధించిన మెటీరియల్‌ను (40000) పంపిణీచేశారు. ఈ కార్యక్రమంను డి ఆర్‌డి పిడి పద్మజ, ఏపిడి రవికుమార్, వయోజన విద్యపిడి వీరభద్రయ్య, ప్రత్యేకాధికారి అఖిల్, ఎండి ఓ బత్తిన సింగయ్య, ఎం ఆర్ ఓ సుధాకర్, ఎం ఇ ఓ తిరుమల కిషోర్‌బాబు తదితరు పాల్గొన్నారు.

గనుల లీజు దరఖాస్తులను పరిష్కరించాలి:కలెక్టర్
ఒంగోలు, డిసెంబర్ 18: జిల్లాలో గనుల శాఖ ద్వారా లీజు అనుమతులకోసం వచ్చిన అర్హత కలిగిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లాకలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ గనుల శాఖాధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక సిపిఒ సమావేశ మందిరంలో గనులశాఖ లీజు అనుమతుల మంజూరుపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో గనుల లీజుకోసం వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం మంజూరుచేసిన జీవో రెండు ప్రకారం నిబంధనలను పాటించి మంజూరు చేయాలన్నారు. గనుల లీజుల విషయంపై అభ్యంతరాలు ఉంటే దరఖాస్తులను తిరస్కరించాలన్నారు. గనుల లీజులకు సంబంధించి రెవెన్యూ డివిజన్ల అధికారులు, గనుల శాఖ ఎడి, డివిజన్ ఫారెస్టు అధికారి సంయుక్తంగా విచారణ చేపట్టి నివేదికలు ఇవ్వాలన్నారు. గనుల లీజుల కోసం 462 దరఖాస్తులు వివిధ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈసమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె యాకూబ్‌నాయక్, గనుల శాఖ ఒంగోలు ఎడి కె సుబ్రహ్మణ్వేశ్వరరావు, మార్కాపురం ఎడి శ్రీనివాసరావు, ఒంగోలు, కందుకూరు, మార్కాపురం ఆర్‌డిఒలు మురళి, బాపిరెడ్డి, సత్యనారాయణ, మార్కాపురం, గిద్దలూరు డిఎఫ్‌ఒలు తదితరులు పాల్గొన్నారు.

చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయనే అపోహలు విడనాడండి:కలెక్టర్
ఒంగోలు, డిసెంబర్ 18: చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయనే అపోహలు విడనాడాలని జిల్లాకలెక్టర్ విజయకుమార్ తెలిపారు. బుధవారం స్థానిక సీతారామ కల్యాణ మండపంలో ప్రకాశం అక్షర విజయం కార్యక్రమంపై ఇందిరాక్రాంతి పథం, గ్రామసమైక్య సంఘ సభ్యులకు అవగాహన సదస్సు జరిగింది. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్వయం సహాయక సంఘాల్లో ఉన్న సభ్యులు కుటుంబ సభ్యులందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు. పొదుపు పథకాలను సక్రమంగా వినియోగించుకోవటంలో మహిళలు విజయం సాధించారన్నారు. సంఘంలో మహిళా సంఘాల పట్ల గౌరవం పెరిగిందన్నారు. ప్రకాశం అక్షర విజయం కార్యక్రమాన్ని స్వయం సహయక సంఘాలు ప్రత్యేక బాధ్యత తీసుకుని విజయవంతం చేయాలన్నారు. చదువుకున్న కుటుంబాలు ఎలా ఉంటాయి, చదువులేని కుటుంబాలు ఎలా ఉంటాయో పరిస్థితులను వివరించారు. చదువు కేవలం ఉద్యోగం కోసం కాదని, చదువుకోవటం వలన సమాజంలో జరిగే మంచిచెడులను సూక్ష్మంగా తెలుసుకునేందుకు వీలుంటుందన్నారు. చదువుకుంటే సమాజంలో తలెత్తుకుని ధైర్యంగా తిరగవచ్చునని తెలిపారు. ఈసమావేశంలో డిఆర్‌డిఎ పిడి పద్మజ, రాజీవ్ విద్యామిషన్ పిఒ రామశేషు, వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాగరాజరావు తదితరులు పాల్గొన్నారు.

వేట కుక్కల దాడిలో 15 గొర్రెపిల్లలు మృతి
దర్శి, డిసెంబర్ 18: మండలంలోని తానంచింతల గ్రామంలో బుధవారం వేటకుక్కలు దాడి చేయటంతో ఆ గ్రామానికి చెందిన ఒంటేరు శ్రీనివాసరావు, గురవయ్యలకు చెందిన 15 గొర్రెపిల్లలు మృతి చెందాయి. తరచుగా వేటకుక్కలు దాడి చేస్తుండటంతో గొర్రెల యజమానులు భారీగా నష్టపోతున్నారు. పెద్దమొత్తంలో వేటకుక్కలు దాడి చేయటం దర్శి ప్రాంతంలో ఇదే ప్రథమం.

నిలిచిపోయిన లావాదేవీలు
english title: 
banks strike
Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>