
గంగాధర్రావు సాటాపూర్ ప్రాథమిక పాఠశాలకు బదిలీమీద వచ్చాడు. అప్పటికే అక్కడ అపరంజని, పింగాక్షిలనే ఇద్దరు ఉపాధ్యాయినులు పనిచేస్తున్నారు. మీటింగ్ల కోసం విద్యాధికారి కార్యాలయానికి తిరగలేక వాళ్లిద్దరూ గంగాధరరావునే హెడ్మాస్టర్గా ఉండమన్నారు. సాటాపూర్లో అదొక్కటే పాఠశాల అవడంతో వారివాళ్లందరూ ‘మా హెడ్మాస్టర్గారు’ అని సంబోధించేవారు. బడిలో కొత్త పుస్తకాలు వచ్చినా, ఆటల్లో విద్యార్థులు బహుమతులు గెలిచినా పిల్లలకు బహూకరించేది హెడ్మాస్టర్ గంగాధర్రావే. ఆగస్టు 15 అయినా, జనవరి 26 అయినా జెండా ఎగరేసేది హెడ్మాస్టర్ గంగాధర్రావే. మండల సమావేశాలకు, శిక్షణ తరగతులకు తప్పకుండా వెళ్లేవాడు గంగాధర్రావే. మండలాఫీసులో ‘సాటాపూర్ హెడ్మాస్టర్గారు’ అని పిలిచేది కూడా గంగాధర్రావునే. మండల ఆఫీసునుండో, ఎమ్మార్వోనుండో, డిఇఓ నుండో ఉత్తరాలు వస్తే తెరిచేది కూడా హెడ్మాస్టర్ గంగాధర్రావే. తిరిగి వాటికి తగిన విధంగా జవాబులు రాసేది కూడా ఆయనే. ఏ పత్రం రాసినా చివరికి సంతకం చేసేది హెడ్మాస్టర్ గంగాధర్రావే. క్రమక్రమంగా గంధార్రావు తన స్నేహితులకు, చుట్టాలకు హెడ్మాస్టర్ గంగాధర్రావుగానే పరిచయం చేసుకోవడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే పరిచయస్తులు, వీధివాళ్ళు, బంధువులు అందరూ ఆయన్ని హెడ్మాస్టర్ గంగాధర్రావు అని పిలవడానికి అలవాటుపడ్డారు.
సాటాపూర్కు గంగాధర్రావు వచ్చి మూడేళ్లు దాటాయి. జూన్లో మళ్లీ బదిలీల కోసం ప్రకటన వచ్చింది. గంగాధర్రావు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కాని నచ్చిన ఊరు దొరక్క వెళ్లలేదు. అపరంజని టీచర్ బదిలీ మీద వేరే ఊరు వెళ్లిపోయింది. ఆ ఖాళీలో రామ్దాస్ వచ్చారు. జూలై మొదటి తేదీకల్లా విధుల్లో చేరాలని ఉత్తర్వులు వచ్చాయి.
గంగాధర్రావుకన్నా రామ్దాస్ సీనియర్. దీంతో హెడ్మాస్టర్ గంగాధర్రావుకు షాక్ తగిలింది. గత మూడేళ్లుగా తాను సాటాపూర్కు హెడ్మాస్టర్. ఇప్పుడు తనకున్నా సీనియర్ అయిన రామ్దాస్ వస్తే తాను మామూలు ఉపాధ్యాయుడు అవుతాడు. సాటాపూర్ హెడ్మాస్టర్ పదవి పోతుందనిపించడంతో మనసంతా ఆందోళనతో నిండిపోయింది.
ఏంచేయాలో తోచక ఉపాధ్యాయ సంఘ భవనానికి వెళ్లాడు. చిన్న చిన్న పైరవీలు చేసే నాయకుడు అప్పారావును కలిసి తన బాధను చెప్పుకున్నాడు. ‘నేను రామ్దాస్గారికి చెప్పి చూస్తాను. మన ప్రయత్నం మనం చేద్దాం’ అని భరోసా ఇచ్చాడు అప్పారావు.
మర్నాడు సాయంత్రం అప్పారావు రామ్దాస్ని కలిశాడు. ఆ మాటా ఈ మాటా మాట్లాడి మెల్లిగా అసలు విషయంలోకి వచ్చాడు.
‘సాటాపూర్ హెడ్మాస్టర్గా గంగాధర్రావు ఉంటేనే బాగుంటుంది’ అన్నాడు.
‘గంగాధర్రావు నాకన్నా జూనియర్ కదా? అతనెలా హెడ్మాస్టర్ అవుతాడు’ అడిగాడు రామ్దాస్.
‘గత మూడేళ్లుగా గంగాధర్రావు సాటాపూర్లో హెడ్మాస్టర్గా పనిచేస్తున్నాడు. స్కూల్ను చక్కగా నిర్వహిస్తున్నాడు. ఇకముందు కూడా ఇలాగే ఉంటే బావుంటుంది’ చెప్పుకొచ్చాడు అప్పారావు.
‘కావొచ్చు. కానీ గంగాధర్రావు 96 డిఎస్సి, నేను 95 డిఎస్సి. కాబట్టి నేనే సీనియర్ని. నా జూనియర్ని హెడ్మాస్టర్గా నేనెందుకు అంగీకరించాలి’ అని ప్రశ్నించాడు రామ్దాస్.
‘అది కాదన్నా... సాటాపూర్లోనూ, మొత్తం మండలంలోనూ హెడ్మాస్టర్గా పిలిపించుకుంటున్న గంగాధర్రావు ఇకముందు అసిస్టెంట్గా పిలిపించుకోవడం ఎంత బాధగా ఉంటుందో చెప్పు. ఎవరైనా ‘పూలమ్మిన చోట కట్టెలమ్మగలరా? నువ్వే చెప్పు. ఒక సంవత్సరం ఆగితే తర్వాతి కౌన్సిలింగ్లో వేరే ఊరికి బదిలీ అయిపోతాడు. దానికి నేను హామీ’ అన్నాడు అప్పారావు.
తలెత్తి సూటిగా అప్పారావు కళ్లల్లోకి చూశాడు రామ్దాస్.
‘అప్పారావ్... కాలం మారింది. పూలమ్మిన చోట కట్టెలమ్మగలరా అనేది పాత నానుడి. ఈ రోజుల్లో పూలు అమ్మితే లాభం వస్తుందనుకుంటే పూలే అమ్ముతాడు. కట్టెలమ్మితో లాభమనుకుంటే కట్టెలే అమ్ముతాడు. నేడు లాభంతో పనికాని వస్తువులతో ఏం పని? వాటిని ఇంట్లో అయితే ఉంచుకోం కదా’ ఎదురుదెబ్బ కొట్టాడు.
‘నేను సీనియర్ని, నా జూనియర్ దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేయలేను. నేనే హెడ్మాస్టర్ని అవుతాను. అడ్జెస్టు అవమని గంగాధర్రావుకే చెప్పండి’ అనేసి వెళ్లిపోయాడు రాందాస్.
ఆ మర్నాడు అప్పారావు సందేశం విన్న గంగాధర్రావుకి నిషా దిగడం మొదలైంది.
- అగేహానంద్
ఇం.నెం.3-9-52, కోటగల్లి,
నిజామాబాద్. ఫోన్: 9951939737
కొత్త పుస్తకం
అనురాగ బంధాలు...
‘స్నేహ పరిమళాలు’!
స్నేహపరిమళాలు
(కథల సంపుటి),
పేజీలు: 68. వెల: రూ.85/-
ప్రతులకు సెల్ నంబర్: 9490189081లో సంప్రదించండి.
తెలంగాణ రాష్ట్రంలోని సీనియర్ కథకుల్లో ఒకరైన కీ.శే.గర్శకుర్తి సురవౌళి కథావారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న గర్శకుర్తి శ్యామల ఇటీవల వెలువరించిన స్నేహపరిమళాలు కథాసంపుటిద్వారా ఇంపైన కథాపరిమళాలను అందజేశారు. ఇందులోని 11 కథలు పాఠకులను ఆలోచింపజేస్తాయి. స్వీయఅనుభవాలు, సంఘటనల సన్నివేశాలను, సమకాలీనతలను కలగలిపి కథలను రాశారు.
తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, మాండలిక భాష తదితర అంశాలతోపాటు, ప్రేమ ఆప్యాయతలు, పరిచయాలు, బంధాలను, మానవీయతలను రచయిత్రి, తమ కథల్లో ఇమిడ్చి, హృద్యంగా చిత్రించడంలో సఫలీకృతులయ్యారు. వారి చిన్నాన్న సురవౌళి రాసిన అంగడి పొద్దు కథ మాదిరిగా, వీరి కథలు పాఠకుల హృదయాలను పరవశింపజేస్తాయి. ఒక విధంగా వీరి కథలు సకారాత్మకమైన కథలే. రచయిత్రి గత రెండు దశాబ్దాల నుండి వచన కవిత్వం, సాహితీ వ్యాసాలు, ఆధ్యాత్మిక విషయాలపై ముఖ్యంగా శ్రద్ధకనబరచారు. తనకు వారసత్వంగా సంక్రమించిన కథలపై కూడ దృష్టి నిలిపి 11 స్నేహపరిమళాలుగా మనకు అందజేశారు. వీరి 11 కథల్లో నాలుగు పెద్దకథలు, ఏడు చిన్నకథలున్నాయి. వీరి కథల్లో కార్డు స్వగతం కథ మనను ఇట్టే ఆకట్టుకుంటుంది. నేటి ఆధునిక కమ్యూనికేషన్స్ విస్తరణ సౌకర్యాలు ముందు, దెబ్బతిన్న తపాలా వ్యవస్థను, ముఖ్యంగా ఉత్తరాలు రాసే అలావాట్లను ఎలా మాయం చేసిందో రచయిత్రి మనకు చక్కగా వివరిస్తారు. పోస్ట్ కార్డుకు పట్టిన గ్రహణాన్ని తేటతెల్లం చేస్తారు. బంధం కథ చదివితే యధార్థ సంఘటనలు మనకు చర్వితచరణమవుతాయి. ఆర్టీసీ బస్సులో కలిసిన రచయిత్రి, తన పక్కన కూర్చున్న చిన్నపాపను పలకరించి, ఒడిలో ఎత్తుకుని ముద్దాడటం, ఆ పాపలో తన మనువలను తలుచుకోవడం కనిపిస్తుంది. పాప బర్త్డేకు గ్రీటింగ్, లేదా గిఫ్ట్ పంపించడానికి అడ్రస్ అడగి రాసుకోవడం, ఈ తతంగమంతా ఏ బంధంగా నడిచిందని, ఆమె తనకు తాను అనుకోవడంతో కథ ముగుస్తుంది.
డప్పులు-బోనాల పండుగ దళిత కథగా, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబంగా కనిపిస్తుంది. పరిమిత కుటుంబానికి మరో భాష్యం చెప్పేలా ‘పాపకోరిక’ కథ మనకు గోచరిస్తుంది. ఇందులో సంపన్నురాలు, ఎల్ఐసి ఉద్యోగినియైన సౌజన్య తనకున్న ఒకే ఒక కూతురు గూర్చి ఆఫీసులో గొప్పలు చెప్పుకుంటుంది. తన తల్లితండ్రులకు తానే ఒక్కర్తే కూతురుకావడం వల్లే ఆమె ఇలా వ్యవహరించిందేమో. కథలో మలుపేమిటంటే తన ఏకైక కూతురు కార్తీక, తాను ఇంట్లో ఆడుకోవడానికి తనకు చెల్లిగారి తమ్ముడుగాని కావాలని మారాం చేస్తుంది. తన స్నేహితురాలైన రాధీ ఇంటికి చుట్టాలు రావడం, వారితో ఆనందంగా గడుపుతూ ఆరోజు బడికి రాకపోవడాన్ని కార్తీక తమ తల్లికి చెబుతుంది. ఇందువల్ల సౌజన్య మరోతోడుకై ఆలోచించే కథే పాపకోరికగా రచయిత్రి విడమరచి చెబుతుంది. రచయితలైన అరుణ, చంద్ర మధ్యల వున్న పరస్పర స్నేహబంధాన్ని, మధ్యలో కలిగిన మసస్పర్థల్ని విశే్లషిస్తు రాసిన టైటిల్కథ స్నేహమధురిమ. కథ నేటి సమాజంలో ఆడామగా స్నేహితులకు ఎదురయ్యే పరిస్థితుల్ని చక్కగా ఆవిష్కరించింది. లోతైన స్నేహానికి స్ర్తి,పురుష భేదాలుండవని నిరూపించేలా వుంది. రచయిత్రి ఈ రెండు పాత్రల ద్వారా ఈ కథను నడిపించిన తీరు, స్నేహానికున్న ప్రాముఖ్యతను వివరించిన తీరును ప్రశసించకుండా వుండలేం. కేవలం వంద రూపాయలు దొరకక తన కాలేజీ జీవితం ఎలా ఆగిపోయింది, రచయితయ్యాక తన జీవితం, సంపాదన ఎలా పెరిగిందో గత స్మృతులను నెమరువేసే కథ-మలుపులోమెరుపు. ఇందులో యోగీశ్వర్ వందరూపాయల కోసం తన మామయ్య ఇంటికివెళ్ళి మొండిచేయితో రావడం, తదుపరి చిన్నజాబ్లు చేస్తు, రచయితగా పేరు తెచ్చుకోవడం, ఆరోజే వందరూపాయలు దొరికివుంటే తన జీవితంలో ఎలా మలుపుతిరిగి వుండేదో తలుచుకోవడంతో కథ ముగుస్తుంది. ఈకథను మరింత ఆసక్తిగా పొడిగించే వీలున్నా, రచయిత్రి ఎందుకో వినియోగించుకోలేదేమోననిపిస్తుంది.
బతుకుపై తెగింపుతో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించే వారికి ఈకథ పరిష్కారాన్ని చూపిస్తుంది. మధ్య తరగతి కుటుంబాల్లో వుండే తీరని కోరికలు, అసంతృప్తి, చాలీచాలని జీతం, భార్యాపిల్లల కోరిక తీర్చలేని అసమర్థత మొదలగు అంశాలతో ఆత్మహత్య చేసుకోవాలని కొందరు ప్రయత్నిస్తుంటారు.
ఆత్మహత్యలు తగవని సామాజిక ప్రయోజనాన్ని ఆశించి రాసిన కథ ‘బతుకు’. చనుబాలతో పెరిగి, ఎదిగాక తల్లిప్రేమకు ఎలా గండి కొట్టాడో రచయిత్రి, మనోహర్ పాత్ర ద్వారా తెలియపరుస్తుంది. ‘వెతల నడుమ చదువు’ కథ తెలంగాణ మాండలికంలో రాయడం రచయిత్రి చూపిన నిపుణత అభినందించతగింది. రచయిత్రి మరిన్ని కథా సంపుటాలను వెలువరించాలని ఆశిద్దాం.
- సంకేపల్లి నాగేంద్రశర్మ, సెల్: 9441797650
సాహితీమూర్తులు
అమృతపానం చేసిన కవి
అనుభూతి ప్రధానమైన వచన కవిత్వానికి పాదుచేసి నీళ్లుపోసినవాడు తిలక్. చక్కగా రాయగలగటం అంటే చక్కగా ఆలోచించగలగటం, చక్కగా అనుభూతి చెందటం, అంతే చక్కగా విశదీకరించటం అంటాడు బఫ్పెన్. తిలక్ మాటల్లో కవిత్వం అంటే ఒక ఆల్కెమీ. దాని రహస్యం ఒక్క కవికే తెల్సు అంటాడు. రసానంద డోలికల్లో ఊగించి, మదిని రసప్లావితం చేసే అభినివేశం గల కవిత్వానికి ఊపిరిలూదింది తిలక్. అతని మాటల్లో ‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు, నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు. నా అక్షరాలు వెనె్నలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అంటారు. అంటే భావప్రసారానికి అనువైన భాషలో ఆయన అల్లిన అందమైన శబ్దాలు, పద చిత్రణలు, ఊహలు, కవిత్వపు చిక్కదనపు లోతులు వెరసి ఆయన తన కవిత్వం గురించి చెబుతూ ‘నా కవిత్వం కాదొక తత్త్వం మరికాదు మీరనే మనస్తత్వం’ అంటారు. అయినప్పటికిని ఆయన కవితల నిండా అబ్బురపరిచే పద చిత్రాలు, నవ కవితా నిర్మాణశైలి, కవితా వస్తు సంపద, భావగాఢత వెరసి ఆయన్నొక అభ్యుదక కవిగాను అదే విధంగా భావకవితా సారథిగాను నిలబెట్టింది. ఆయన రచించిన అమృతం కురిసిన రాత్రి 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును సొంతం చేసుకుంది. ఈ కవితల సంపుటికే 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ఇచ్చారు. తిలక్ కథల సంపుటిలో మొత్తం 29 కథలున్నాయి. వీటిలో బహుళ ప్రాచుర్యం పొందినవి ఊరి చివర ఇల్లు, నల్లజర్లరోడ్డు, అతని కోరిక, దొంగ కథానికలు, కాగా కావ్యాలు అమృతం కురిసిన రాత్రి, ప్రభాతము- సంధ్య, గోరువంకలు, సీత. తననెంతో గారాబంగా పెంచి పెద్దచేసిన తండ్రి మరణము తిలక్ను తీవ్రంగా కలచివేసినది. తీవ్ర మానసిక ఆందోళనలకు గురైన తిలక్ చివరికి తీవ్రమైన నరాల వ్యాధి బారినపడి 1966 జూన్ 30వ తేదిన మరణించారు. తిలక్ కథల్లో మాక్సింగోర్కీ సమాజ వాస్తవికత, రవీంద్రనాథ్ టాగోర్ భావుకత, అగుపిస్తాయని విమర్శకుల అభిప్రాయం. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ, ఆంగ్ల రొమాంటిక్ కవులైన కీట్స్, షెల్లీల ప్రభావం అతని కవితలపై ప్రబలంగా ఉంది.
ఆర్తగీతం, ప్రార్థన, కఠినోపనిషత్, అమృతం కురిసిన రాత్రి ఖండికలు చిరస్మరణీయులు. తిలక్ నవత- కవితలో కవిత్వం యొక్క రహస్యాన్ని విన్పించారు. సంక్లిష్టత వేరు, సందిగ్ధత వేరు అంటూనే ‘కవిత్వంలో అబ్స్క్యూరిటీ కొన్ని సందర్భాలలో ఉండొచ్చును. కాని పాఠకుడికి నీ అనుభూతి ఆకారం అందాలి, హత్తుకోవాలి. అది ట్రాన్స్పరెంట్ చీకటై ఉండాలి. నిన్ను పలకరించాలి. కవిత కొత్త అనుభవాల కాంతిపేటికను తెరవాలి’ అంటూ కవిత్వానికి ఒక కొత్త అర్ధాన్ని నిర్వచించారు. కుందుర్తివారు తిలక్ను ఒకానొక సందర్భంలో కలసినపుడు ఆయన రూపలావణ్యాలకు అచ్చెరువొందారు. గగనమొక రేకు/ కన్నుగవ సోకు/ ఎరుపెరుపు చెక్కిళ్ళ/ విరిసినది చెంగల్వ/ అని తిలక్ సంధ్య అనే కవితలో రాసినట్టుగా ఆయన మంచి రూపసి. ఆయన ఆర్తగీతంలో ఇంక నన్ను నిర్బంధించకు నేస్తం/ ఈ రాత్రి నేను పాడలేను/ ఈ కృత్రిమ వేషాన్ని అభినయింపలేను/ మానవత లేని లోకాన్ని స్తుతింపలేను/ మానవునిగా శిరసెత్తుకు తిరగలేను/ ఈ నాగరికతారణ్యవాసం భరింపలేను/ అంటారు. ఈ పంక్తుల్లో ఆయన జీవన దృక్పథం ద్యోతకమవుతుంది. అలాగే కవిగా తన సున్నిత హృదయాన్ని పాఠకుల ముందుంచుతారు. సమాజంపై నిర్దుష్ట అవగాహన కల్గిన కవిగా, దగా, వంననను ఖండిస్తూ ఆయన రాసిన ఆర్తగీతం అడుగడుగును గుండె తడిని తాకుతుంది. గొంగళి పురుగులులో ఆయన సామెత చెప్పినట్టుగా ‘పంచదార లేదు/ పాలడబ్బా లేదు/, బొగ్గుల్లేవ్/, రాత్రికి రగ్గుల్లేవు’ అంటూ అలాగే న్యూసిలబస్ కవితలో ‘అమెరికాలో డాలర్లు పండును/ ఇండియాలో సంతానం పండును’ అంటూ మధ్య మధ్యతరగతి మందహాసాన్ని చురుక్కుమన్పిస్తారు. ఈ పంక్తులు నేటికి మధ్యతరగతి జీవనాన్ని ప్రతిబింబిస్తాయి అనటంలో అతిశయోక్తి లేదు. ఆయన ‘నీడలు’ కవితలోని పంక్తులు విషాద స్వరాల్నేవో విన్పిస్తాయి. అవి- ‘చీకటి పడుతోంది/ చిటారుకొమ్మన నక్షత్రం చిక్కుకుంది/ శిథిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతుంది/ దారంతా గోతులు/ యిల్లేమో దూరం/ చేతిలో దీపం లేదు/ ధైర్యమే ఒక కవచం/ అంటూ జీవన యానాన్ని సూత్రీకరించారు. జీవితంలో ఎన్ని చిక్కుముళ్ళు ఎదురైనా ధైర్యంతో పోరు సల్పాల్సిందేనని కవిగా తిలక్ పిలుపునిచ్చారు. ప్రఖ్యాత అమెరికన్ కవి రాబర్ట్ ఫ్రాస్ట్ కవితా పంక్తులతో ఎన్నదగినవి నీడలు కవితా పంక్తులు. ‘ద వూడ్స్ ఆర్ లలీ డార్క్ అండ్ డీప్, బట్ ఐ హాల్ ప్రామిసెస్ టు కీప్, అండ్ మైల్స్ టుగో బిఫోర్ ఐస్లీప్, అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్’- చీకటి మయమైన, దట్టమైన అడవులగుండా నేను ప్రయాణించాల్సి ఉంది. నేను శాశ్వత నిద్రకు చేరువయ్యేలోపే జీవన లక్ష్యాన్ని చేరుకోవాలి. కవిగా తిలక్ మానవతావాది. దిగులును, బాధను, విషాదాన్ని అద్భుతంగా పలికించగల భావుకుడు. అగ్నిజల్లినా, అమృతం కురిసినా అందం, ఆనందం కవిత్వం పరమావధియని చెప్పిన తిలక్ నిజంగానే అమృతం తాగారు. అమరుడయ్యారు.
- బి. కళాగోపాల్, 9441631029
మనోగీతికలు
నీతో పంచుకున్న క్షణాలు!
నీతో పంచుకున్న క్షణాలు
పదే పదే పలవరిస్తూ
హాలాహలాన్ని మింగుతూ
ఎన్ని చీకటి లోయల్లో జారి
కుప్పకూలిపోయాయో... నీవు లేక!
సెకన్ల ముల్లుకి జ్ఞాపకాల తాడు కట్టి
బలవంతపు పరుగులు పెట్టిస్తున్నా...
భారమైన క్షణాలకి బందీనై
హృదయ స్పందనలకి వేగం నేర్పలేకపోతున్నా!
కనురెప్పల్లో మరిగే కన్నీరు
గొంతులోకి జారుతూ గుండెను మండిస్తోంది
తలపుల భాండానికి చిల్లులు పెడుతూ
మదిని ఛిద్రం చేసే జ్ఞాపకాల తూటాలు!
మన అనుబంధానికి గాఢత తగ్గి
నిశ్శబ్దామ్లాన్ని తాగడం అలవాటు చేసుకున్నా
జారిపోయే వౌనాన్ని బతిమాలుకుంటున్నా
నీ తోడైనా నాకు కావాలని!
ఘడియల ముళ్ళు సడి లేకుండా
రాలిపోయే క్షణాలకి విషాదపు గాట్లు పెట్టినా
హృదిపొరలని అదిమి పట్టినా
ఆగదే కన్నీటిస్రావం!!
- శ్రీస్వర్ణ, 09958960068
శూన్యం నుంచి
శూన్యం లోకి...
శూన్యం నుంచి వచ్చావు
శూన్యంలోకి వెళ్తావు
మధ్యలో వచ్చి నిలిచింది
చైతన్యయుత జీవితం
అనుభవించు, ఆనందించు
చైతన్యం పంచిపెట్టు
చిన్నదైనదీ జీవితం
చింతలతో చిత్తుచేయకు
పంతంతో సాగు ముందుకు
అత్యున్నత శిఖరం అందుకో
ఆదర్శంగా నిలిచిపో
కలకాలం నీవు లేకున్నా
ఇలయందు నీ పేరుండాలి
అదే సార్థకం - అదే జీవితం!
- చెన్నమనేని ప్రేమసాగర్రావు
9912118554
బాంధవ్యం
ప్రేమలన్నిటిలోన ఎన్నదగిన ప్రేమ
అమ్మ ప్రేమే కదా అవనిలోన
బాంధవ్యమును పెంచి
బంధుత్వమును పంచి
బంధమే కదా దాంపత్యమనిన
కష్టనష్టముకోర్చి
ఓర్మితో కూర్మితో సాధించే
సంతోషమే కదా స్వర్గసీమ
మదినెంత కుందెడు
నెపమెంతటిదినైన
మాన్పి వేసెడి ధన్వంతరియేగదా
చెలిమి యగును
ఇట్టి బాంధవ్యములేగద
ఇలలోన వెలసిన
మానవాళికి వనె్నతెచ్చి
మహిత నిలుచు.
- ఎల్.గాయత్రి
కౌటాల, ఫోన్: 9949431849
పుస్తకం
బంధాలు అనే అట్టలను
చుట్టూ నిలుపుకుని
కాగితం అనే
కల్మషం లేని అమ్మ ఒడిలో
బిడ్డలుగా ముద్దుగా ఒదిగిన
అక్షరాలు, పదాలు
ఆ చిన్నారి బిడ్డలకు
దిష్టి తగలకుండా ఉండేందుకేనేమో
అపురూపంగా కళాత్మకంగా
రంగురంగుల బొమ్మలు
ఆ బొమ్మల్లో ఎన్నో భావాలు
హృదయాన్ని హత్తుకునే ఎన్నో బంధాలు
చూసే కళ్ళు అలసిపోవు
ఇంకా ఆతృతగా చూడాలనిపిస్తుంది
తనివితీరా చదవాలనిపిస్తుంది
ఆ అనుభూతిని పదిమందితో
పంచుకోవాలనిపిస్తుంది
చదివే హృదయాలు ఉన్నంతకాలం
చెరిగిపోని గురుతులే
చెరపలేని అక్షరాలే
ఈ పుస్తకాలు!
- గసికంటి సంజీవ్, కరీంనగర్
8374490013
........................................................
email : merupuknr@andhrabhoomi.net
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం కోసం ఈ క్రిందిచిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫోటో, చిరునామాతో ఈ మెయిల్ అడ్రస్కు పంపించండి.
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. email : merupuknr@andhrabhoomi.net