Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

నిషా (కథ)

$
0
0

గంగాధర్‌రావు సాటాపూర్ ప్రాథమిక పాఠశాలకు బదిలీమీద వచ్చాడు. అప్పటికే అక్కడ అపరంజని, పింగాక్షిలనే ఇద్దరు ఉపాధ్యాయినులు పనిచేస్తున్నారు. మీటింగ్‌ల కోసం విద్యాధికారి కార్యాలయానికి తిరగలేక వాళ్లిద్దరూ గంగాధరరావునే హెడ్‌మాస్టర్‌గా ఉండమన్నారు. సాటాపూర్‌లో అదొక్కటే పాఠశాల అవడంతో వారివాళ్లందరూ ‘మా హెడ్‌మాస్టర్‌గారు’ అని సంబోధించేవారు. బడిలో కొత్త పుస్తకాలు వచ్చినా, ఆటల్లో విద్యార్థులు బహుమతులు గెలిచినా పిల్లలకు బహూకరించేది హెడ్‌మాస్టర్ గంగాధర్‌రావే. ఆగస్టు 15 అయినా, జనవరి 26 అయినా జెండా ఎగరేసేది హెడ్‌మాస్టర్ గంగాధర్‌రావే. మండల సమావేశాలకు, శిక్షణ తరగతులకు తప్పకుండా వెళ్లేవాడు గంగాధర్‌రావే. మండలాఫీసులో ‘సాటాపూర్ హెడ్‌మాస్టర్‌గారు’ అని పిలిచేది కూడా గంగాధర్‌రావునే. మండల ఆఫీసునుండో, ఎమ్మార్వోనుండో, డిఇఓ నుండో ఉత్తరాలు వస్తే తెరిచేది కూడా హెడ్‌మాస్టర్ గంగాధర్‌రావే. తిరిగి వాటికి తగిన విధంగా జవాబులు రాసేది కూడా ఆయనే. ఏ పత్రం రాసినా చివరికి సంతకం చేసేది హెడ్‌మాస్టర్ గంగాధర్‌రావే. క్రమక్రమంగా గంధార్‌రావు తన స్నేహితులకు, చుట్టాలకు హెడ్‌మాస్టర్ గంగాధర్‌రావుగానే పరిచయం చేసుకోవడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే పరిచయస్తులు, వీధివాళ్ళు, బంధువులు అందరూ ఆయన్ని హెడ్‌మాస్టర్ గంగాధర్‌రావు అని పిలవడానికి అలవాటుపడ్డారు.
సాటాపూర్‌కు గంగాధర్‌రావు వచ్చి మూడేళ్లు దాటాయి. జూన్‌లో మళ్లీ బదిలీల కోసం ప్రకటన వచ్చింది. గంగాధర్‌రావు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కాని నచ్చిన ఊరు దొరక్క వెళ్లలేదు. అపరంజని టీచర్ బదిలీ మీద వేరే ఊరు వెళ్లిపోయింది. ఆ ఖాళీలో రామ్‌దాస్ వచ్చారు. జూలై మొదటి తేదీకల్లా విధుల్లో చేరాలని ఉత్తర్వులు వచ్చాయి.
గంగాధర్‌రావుకన్నా రామ్‌దాస్ సీనియర్. దీంతో హెడ్‌మాస్టర్ గంగాధర్‌రావుకు షాక్ తగిలింది. గత మూడేళ్లుగా తాను సాటాపూర్‌కు హెడ్‌మాస్టర్. ఇప్పుడు తనకున్నా సీనియర్ అయిన రామ్‌దాస్ వస్తే తాను మామూలు ఉపాధ్యాయుడు అవుతాడు. సాటాపూర్ హెడ్‌మాస్టర్ పదవి పోతుందనిపించడంతో మనసంతా ఆందోళనతో నిండిపోయింది.
ఏంచేయాలో తోచక ఉపాధ్యాయ సంఘ భవనానికి వెళ్లాడు. చిన్న చిన్న పైరవీలు చేసే నాయకుడు అప్పారావును కలిసి తన బాధను చెప్పుకున్నాడు. ‘నేను రామ్‌దాస్‌గారికి చెప్పి చూస్తాను. మన ప్రయత్నం మనం చేద్దాం’ అని భరోసా ఇచ్చాడు అప్పారావు.
మర్నాడు సాయంత్రం అప్పారావు రామ్‌దాస్‌ని కలిశాడు. ఆ మాటా ఈ మాటా మాట్లాడి మెల్లిగా అసలు విషయంలోకి వచ్చాడు.
‘సాటాపూర్ హెడ్‌మాస్టర్‌గా గంగాధర్‌రావు ఉంటేనే బాగుంటుంది’ అన్నాడు.
‘గంగాధర్‌రావు నాకన్నా జూనియర్ కదా? అతనెలా హెడ్‌మాస్టర్ అవుతాడు’ అడిగాడు రామ్‌దాస్.
‘గత మూడేళ్లుగా గంగాధర్‌రావు సాటాపూర్‌లో హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. స్కూల్‌ను చక్కగా నిర్వహిస్తున్నాడు. ఇకముందు కూడా ఇలాగే ఉంటే బావుంటుంది’ చెప్పుకొచ్చాడు అప్పారావు.
‘కావొచ్చు. కానీ గంగాధర్‌రావు 96 డిఎస్‌సి, నేను 95 డిఎస్‌సి. కాబట్టి నేనే సీనియర్‌ని. నా జూనియర్‌ని హెడ్‌మాస్టర్‌గా నేనెందుకు అంగీకరించాలి’ అని ప్రశ్నించాడు రామ్‌దాస్.
‘అది కాదన్నా... సాటాపూర్‌లోనూ, మొత్తం మండలంలోనూ హెడ్‌మాస్టర్‌గా పిలిపించుకుంటున్న గంగాధర్‌రావు ఇకముందు అసిస్టెంట్‌గా పిలిపించుకోవడం ఎంత బాధగా ఉంటుందో చెప్పు. ఎవరైనా ‘పూలమ్మిన చోట కట్టెలమ్మగలరా? నువ్వే చెప్పు. ఒక సంవత్సరం ఆగితే తర్వాతి కౌన్సిలింగ్‌లో వేరే ఊరికి బదిలీ అయిపోతాడు. దానికి నేను హామీ’ అన్నాడు అప్పారావు.
తలెత్తి సూటిగా అప్పారావు కళ్లల్లోకి చూశాడు రామ్‌దాస్.
‘అప్పారావ్... కాలం మారింది. పూలమ్మిన చోట కట్టెలమ్మగలరా అనేది పాత నానుడి. ఈ రోజుల్లో పూలు అమ్మితే లాభం వస్తుందనుకుంటే పూలే అమ్ముతాడు. కట్టెలమ్మితో లాభమనుకుంటే కట్టెలే అమ్ముతాడు. నేడు లాభంతో పనికాని వస్తువులతో ఏం పని? వాటిని ఇంట్లో అయితే ఉంచుకోం కదా’ ఎదురుదెబ్బ కొట్టాడు.
‘నేను సీనియర్‌ని, నా జూనియర్ దగ్గర నేను అసిస్టెంట్‌గా పనిచేయలేను. నేనే హెడ్‌మాస్టర్‌ని అవుతాను. అడ్జెస్టు అవమని గంగాధర్‌రావుకే చెప్పండి’ అనేసి వెళ్లిపోయాడు రాందాస్.
ఆ మర్నాడు అప్పారావు సందేశం విన్న గంగాధర్‌రావుకి నిషా దిగడం మొదలైంది.
- అగేహానంద్
ఇం.నెం.3-9-52, కోటగల్లి,
నిజామాబాద్. ఫోన్: 9951939737

కొత్త పుస్తకం

అనురాగ బంధాలు...
‘స్నేహ పరిమళాలు’!

స్నేహపరిమళాలు
(కథల సంపుటి),
పేజీలు: 68. వెల: రూ.85/-
ప్రతులకు సెల్ నంబర్: 9490189081లో సంప్రదించండి.

తెలంగాణ రాష్ట్రంలోని సీనియర్ కథకుల్లో ఒకరైన కీ.శే.గర్శకుర్తి సురవౌళి కథావారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న గర్శకుర్తి శ్యామల ఇటీవల వెలువరించిన స్నేహపరిమళాలు కథాసంపుటిద్వారా ఇంపైన కథాపరిమళాలను అందజేశారు. ఇందులోని 11 కథలు పాఠకులను ఆలోచింపజేస్తాయి. స్వీయఅనుభవాలు, సంఘటనల సన్నివేశాలను, సమకాలీనతలను కలగలిపి కథలను రాశారు.
తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, మాండలిక భాష తదితర అంశాలతోపాటు, ప్రేమ ఆప్యాయతలు, పరిచయాలు, బంధాలను, మానవీయతలను రచయిత్రి, తమ కథల్లో ఇమిడ్చి, హృద్యంగా చిత్రించడంలో సఫలీకృతులయ్యారు. వారి చిన్నాన్న సురవౌళి రాసిన అంగడి పొద్దు కథ మాదిరిగా, వీరి కథలు పాఠకుల హృదయాలను పరవశింపజేస్తాయి. ఒక విధంగా వీరి కథలు సకారాత్మకమైన కథలే. రచయిత్రి గత రెండు దశాబ్దాల నుండి వచన కవిత్వం, సాహితీ వ్యాసాలు, ఆధ్యాత్మిక విషయాలపై ముఖ్యంగా శ్రద్ధకనబరచారు. తనకు వారసత్వంగా సంక్రమించిన కథలపై కూడ దృష్టి నిలిపి 11 స్నేహపరిమళాలుగా మనకు అందజేశారు. వీరి 11 కథల్లో నాలుగు పెద్దకథలు, ఏడు చిన్నకథలున్నాయి. వీరి కథల్లో కార్డు స్వగతం కథ మనను ఇట్టే ఆకట్టుకుంటుంది. నేటి ఆధునిక కమ్యూనికేషన్స్ విస్తరణ సౌకర్యాలు ముందు, దెబ్బతిన్న తపాలా వ్యవస్థను, ముఖ్యంగా ఉత్తరాలు రాసే అలావాట్లను ఎలా మాయం చేసిందో రచయిత్రి మనకు చక్కగా వివరిస్తారు. పోస్ట్ కార్డుకు పట్టిన గ్రహణాన్ని తేటతెల్లం చేస్తారు. బంధం కథ చదివితే యధార్థ సంఘటనలు మనకు చర్వితచరణమవుతాయి. ఆర్టీసీ బస్సులో కలిసిన రచయిత్రి, తన పక్కన కూర్చున్న చిన్నపాపను పలకరించి, ఒడిలో ఎత్తుకుని ముద్దాడటం, ఆ పాపలో తన మనువలను తలుచుకోవడం కనిపిస్తుంది. పాప బర్త్‌డేకు గ్రీటింగ్, లేదా గిఫ్ట్ పంపించడానికి అడ్రస్ అడగి రాసుకోవడం, ఈ తతంగమంతా ఏ బంధంగా నడిచిందని, ఆమె తనకు తాను అనుకోవడంతో కథ ముగుస్తుంది.
డప్పులు-బోనాల పండుగ దళిత కథగా, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబంగా కనిపిస్తుంది. పరిమిత కుటుంబానికి మరో భాష్యం చెప్పేలా ‘పాపకోరిక’ కథ మనకు గోచరిస్తుంది. ఇందులో సంపన్నురాలు, ఎల్‌ఐసి ఉద్యోగినియైన సౌజన్య తనకున్న ఒకే ఒక కూతురు గూర్చి ఆఫీసులో గొప్పలు చెప్పుకుంటుంది. తన తల్లితండ్రులకు తానే ఒక్కర్తే కూతురుకావడం వల్లే ఆమె ఇలా వ్యవహరించిందేమో. కథలో మలుపేమిటంటే తన ఏకైక కూతురు కార్తీక, తాను ఇంట్లో ఆడుకోవడానికి తనకు చెల్లిగారి తమ్ముడుగాని కావాలని మారాం చేస్తుంది. తన స్నేహితురాలైన రాధీ ఇంటికి చుట్టాలు రావడం, వారితో ఆనందంగా గడుపుతూ ఆరోజు బడికి రాకపోవడాన్ని కార్తీక తమ తల్లికి చెబుతుంది. ఇందువల్ల సౌజన్య మరోతోడుకై ఆలోచించే కథే పాపకోరికగా రచయిత్రి విడమరచి చెబుతుంది. రచయితలైన అరుణ, చంద్ర మధ్యల వున్న పరస్పర స్నేహబంధాన్ని, మధ్యలో కలిగిన మసస్పర్థల్ని విశే్లషిస్తు రాసిన టైటిల్‌కథ స్నేహమధురిమ. కథ నేటి సమాజంలో ఆడామగా స్నేహితులకు ఎదురయ్యే పరిస్థితుల్ని చక్కగా ఆవిష్కరించింది. లోతైన స్నేహానికి స్ర్తి,పురుష భేదాలుండవని నిరూపించేలా వుంది. రచయిత్రి ఈ రెండు పాత్రల ద్వారా ఈ కథను నడిపించిన తీరు, స్నేహానికున్న ప్రాముఖ్యతను వివరించిన తీరును ప్రశసించకుండా వుండలేం. కేవలం వంద రూపాయలు దొరకక తన కాలేజీ జీవితం ఎలా ఆగిపోయింది, రచయితయ్యాక తన జీవితం, సంపాదన ఎలా పెరిగిందో గత స్మృతులను నెమరువేసే కథ-మలుపులోమెరుపు. ఇందులో యోగీశ్వర్ వందరూపాయల కోసం తన మామయ్య ఇంటికివెళ్ళి మొండిచేయితో రావడం, తదుపరి చిన్నజాబ్‌లు చేస్తు, రచయితగా పేరు తెచ్చుకోవడం, ఆరోజే వందరూపాయలు దొరికివుంటే తన జీవితంలో ఎలా మలుపుతిరిగి వుండేదో తలుచుకోవడంతో కథ ముగుస్తుంది. ఈకథను మరింత ఆసక్తిగా పొడిగించే వీలున్నా, రచయిత్రి ఎందుకో వినియోగించుకోలేదేమోననిపిస్తుంది.
బతుకుపై తెగింపుతో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించే వారికి ఈకథ పరిష్కారాన్ని చూపిస్తుంది. మధ్య తరగతి కుటుంబాల్లో వుండే తీరని కోరికలు, అసంతృప్తి, చాలీచాలని జీతం, భార్యాపిల్లల కోరిక తీర్చలేని అసమర్థత మొదలగు అంశాలతో ఆత్మహత్య చేసుకోవాలని కొందరు ప్రయత్నిస్తుంటారు.
ఆత్మహత్యలు తగవని సామాజిక ప్రయోజనాన్ని ఆశించి రాసిన కథ ‘బతుకు’. చనుబాలతో పెరిగి, ఎదిగాక తల్లిప్రేమకు ఎలా గండి కొట్టాడో రచయిత్రి, మనోహర్ పాత్ర ద్వారా తెలియపరుస్తుంది. ‘వెతల నడుమ చదువు’ కథ తెలంగాణ మాండలికంలో రాయడం రచయిత్రి చూపిన నిపుణత అభినందించతగింది. రచయిత్రి మరిన్ని కథా సంపుటాలను వెలువరించాలని ఆశిద్దాం.

- సంకేపల్లి నాగేంద్రశర్మ, సెల్: 9441797650

సాహితీమూర్తులు

అమృతపానం చేసిన కవి

అనుభూతి ప్రధానమైన వచన కవిత్వానికి పాదుచేసి నీళ్లుపోసినవాడు తిలక్. చక్కగా రాయగలగటం అంటే చక్కగా ఆలోచించగలగటం, చక్కగా అనుభూతి చెందటం, అంతే చక్కగా విశదీకరించటం అంటాడు బఫ్పెన్. తిలక్ మాటల్లో కవిత్వం అంటే ఒక ఆల్కెమీ. దాని రహస్యం ఒక్క కవికే తెల్సు అంటాడు. రసానంద డోలికల్లో ఊగించి, మదిని రసప్లావితం చేసే అభినివేశం గల కవిత్వానికి ఊపిరిలూదింది తిలక్. అతని మాటల్లో ‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు, నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు. నా అక్షరాలు వెనె్నలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అంటారు. అంటే భావప్రసారానికి అనువైన భాషలో ఆయన అల్లిన అందమైన శబ్దాలు, పద చిత్రణలు, ఊహలు, కవిత్వపు చిక్కదనపు లోతులు వెరసి ఆయన తన కవిత్వం గురించి చెబుతూ ‘నా కవిత్వం కాదొక తత్త్వం మరికాదు మీరనే మనస్తత్వం’ అంటారు. అయినప్పటికిని ఆయన కవితల నిండా అబ్బురపరిచే పద చిత్రాలు, నవ కవితా నిర్మాణశైలి, కవితా వస్తు సంపద, భావగాఢత వెరసి ఆయన్నొక అభ్యుదక కవిగాను అదే విధంగా భావకవితా సారథిగాను నిలబెట్టింది. ఆయన రచించిన అమృతం కురిసిన రాత్రి 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును సొంతం చేసుకుంది. ఈ కవితల సంపుటికే 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ఇచ్చారు. తిలక్ కథల సంపుటిలో మొత్తం 29 కథలున్నాయి. వీటిలో బహుళ ప్రాచుర్యం పొందినవి ఊరి చివర ఇల్లు, నల్లజర్లరోడ్డు, అతని కోరిక, దొంగ కథానికలు, కాగా కావ్యాలు అమృతం కురిసిన రాత్రి, ప్రభాతము- సంధ్య, గోరువంకలు, సీత. తననెంతో గారాబంగా పెంచి పెద్దచేసిన తండ్రి మరణము తిలక్‌ను తీవ్రంగా కలచివేసినది. తీవ్ర మానసిక ఆందోళనలకు గురైన తిలక్ చివరికి తీవ్రమైన నరాల వ్యాధి బారినపడి 1966 జూన్ 30వ తేదిన మరణించారు. తిలక్ కథల్లో మాక్సింగోర్కీ సమాజ వాస్తవికత, రవీంద్రనాథ్ టాగోర్ భావుకత, అగుపిస్తాయని విమర్శకుల అభిప్రాయం. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ, ఆంగ్ల రొమాంటిక్ కవులైన కీట్స్, షెల్లీల ప్రభావం అతని కవితలపై ప్రబలంగా ఉంది.
ఆర్తగీతం, ప్రార్థన, కఠినోపనిషత్, అమృతం కురిసిన రాత్రి ఖండికలు చిరస్మరణీయులు. తిలక్ నవత- కవితలో కవిత్వం యొక్క రహస్యాన్ని విన్పించారు. సంక్లిష్టత వేరు, సందిగ్ధత వేరు అంటూనే ‘కవిత్వంలో అబ్స్‌క్యూరిటీ కొన్ని సందర్భాలలో ఉండొచ్చును. కాని పాఠకుడికి నీ అనుభూతి ఆకారం అందాలి, హత్తుకోవాలి. అది ట్రాన్స్‌పరెంట్ చీకటై ఉండాలి. నిన్ను పలకరించాలి. కవిత కొత్త అనుభవాల కాంతిపేటికను తెరవాలి’ అంటూ కవిత్వానికి ఒక కొత్త అర్ధాన్ని నిర్వచించారు. కుందుర్తివారు తిలక్‌ను ఒకానొక సందర్భంలో కలసినపుడు ఆయన రూపలావణ్యాలకు అచ్చెరువొందారు. గగనమొక రేకు/ కన్నుగవ సోకు/ ఎరుపెరుపు చెక్కిళ్ళ/ విరిసినది చెంగల్వ/ అని తిలక్ సంధ్య అనే కవితలో రాసినట్టుగా ఆయన మంచి రూపసి. ఆయన ఆర్తగీతంలో ఇంక నన్ను నిర్బంధించకు నేస్తం/ ఈ రాత్రి నేను పాడలేను/ ఈ కృత్రిమ వేషాన్ని అభినయింపలేను/ మానవత లేని లోకాన్ని స్తుతింపలేను/ మానవునిగా శిరసెత్తుకు తిరగలేను/ ఈ నాగరికతారణ్యవాసం భరింపలేను/ అంటారు. ఈ పంక్తుల్లో ఆయన జీవన దృక్పథం ద్యోతకమవుతుంది. అలాగే కవిగా తన సున్నిత హృదయాన్ని పాఠకుల ముందుంచుతారు. సమాజంపై నిర్దుష్ట అవగాహన కల్గిన కవిగా, దగా, వంననను ఖండిస్తూ ఆయన రాసిన ఆర్తగీతం అడుగడుగును గుండె తడిని తాకుతుంది. గొంగళి పురుగులులో ఆయన సామెత చెప్పినట్టుగా ‘పంచదార లేదు/ పాలడబ్బా లేదు/, బొగ్గుల్లేవ్/, రాత్రికి రగ్గుల్లేవు’ అంటూ అలాగే న్యూసిలబస్ కవితలో ‘అమెరికాలో డాలర్లు పండును/ ఇండియాలో సంతానం పండును’ అంటూ మధ్య మధ్యతరగతి మందహాసాన్ని చురుక్కుమన్పిస్తారు. ఈ పంక్తులు నేటికి మధ్యతరగతి జీవనాన్ని ప్రతిబింబిస్తాయి అనటంలో అతిశయోక్తి లేదు. ఆయన ‘నీడలు’ కవితలోని పంక్తులు విషాద స్వరాల్నేవో విన్పిస్తాయి. అవి- ‘చీకటి పడుతోంది/ చిటారుకొమ్మన నక్షత్రం చిక్కుకుంది/ శిథిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతుంది/ దారంతా గోతులు/ యిల్లేమో దూరం/ చేతిలో దీపం లేదు/ ధైర్యమే ఒక కవచం/ అంటూ జీవన యానాన్ని సూత్రీకరించారు. జీవితంలో ఎన్ని చిక్కుముళ్ళు ఎదురైనా ధైర్యంతో పోరు సల్పాల్సిందేనని కవిగా తిలక్ పిలుపునిచ్చారు. ప్రఖ్యాత అమెరికన్ కవి రాబర్ట్ ఫ్రాస్ట్ కవితా పంక్తులతో ఎన్నదగినవి నీడలు కవితా పంక్తులు. ‘ద వూడ్స్ ఆర్ లలీ డార్క్ అండ్ డీప్, బట్ ఐ హాల్ ప్రామిసెస్ టు కీప్, అండ్ మైల్స్ టుగో బిఫోర్ ఐస్లీప్, అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్’- చీకటి మయమైన, దట్టమైన అడవులగుండా నేను ప్రయాణించాల్సి ఉంది. నేను శాశ్వత నిద్రకు చేరువయ్యేలోపే జీవన లక్ష్యాన్ని చేరుకోవాలి. కవిగా తిలక్ మానవతావాది. దిగులును, బాధను, విషాదాన్ని అద్భుతంగా పలికించగల భావుకుడు. అగ్నిజల్లినా, అమృతం కురిసినా అందం, ఆనందం కవిత్వం పరమావధియని చెప్పిన తిలక్ నిజంగానే అమృతం తాగారు. అమరుడయ్యారు.
- బి. కళాగోపాల్, 9441631029

మనోగీతికలు

నీతో పంచుకున్న క్షణాలు!

నీతో పంచుకున్న క్షణాలు
పదే పదే పలవరిస్తూ
హాలాహలాన్ని మింగుతూ
ఎన్ని చీకటి లోయల్లో జారి
కుప్పకూలిపోయాయో... నీవు లేక!

సెకన్ల ముల్లుకి జ్ఞాపకాల తాడు కట్టి
బలవంతపు పరుగులు పెట్టిస్తున్నా...
భారమైన క్షణాలకి బందీనై
హృదయ స్పందనలకి వేగం నేర్పలేకపోతున్నా!

కనురెప్పల్లో మరిగే కన్నీరు
గొంతులోకి జారుతూ గుండెను మండిస్తోంది
తలపుల భాండానికి చిల్లులు పెడుతూ
మదిని ఛిద్రం చేసే జ్ఞాపకాల తూటాలు!

మన అనుబంధానికి గాఢత తగ్గి
నిశ్శబ్దామ్లాన్ని తాగడం అలవాటు చేసుకున్నా
జారిపోయే వౌనాన్ని బతిమాలుకుంటున్నా
నీ తోడైనా నాకు కావాలని!

ఘడియల ముళ్ళు సడి లేకుండా
రాలిపోయే క్షణాలకి విషాదపు గాట్లు పెట్టినా
హృదిపొరలని అదిమి పట్టినా
ఆగదే కన్నీటిస్రావం!!

- శ్రీస్వర్ణ, 09958960068

శూన్యం నుంచి
శూన్యం లోకి...
శూన్యం నుంచి వచ్చావు
శూన్యంలోకి వెళ్తావు
మధ్యలో వచ్చి నిలిచింది
చైతన్యయుత జీవితం
అనుభవించు, ఆనందించు
చైతన్యం పంచిపెట్టు
చిన్నదైనదీ జీవితం
చింతలతో చిత్తుచేయకు
పంతంతో సాగు ముందుకు
అత్యున్నత శిఖరం అందుకో
ఆదర్శంగా నిలిచిపో
కలకాలం నీవు లేకున్నా
ఇలయందు నీ పేరుండాలి
అదే సార్థకం - అదే జీవితం!

- చెన్నమనేని ప్రేమసాగర్‌రావు
9912118554

బాంధవ్యం
ప్రేమలన్నిటిలోన ఎన్నదగిన ప్రేమ
అమ్మ ప్రేమే కదా అవనిలోన
బాంధవ్యమును పెంచి
బంధుత్వమును పంచి
బంధమే కదా దాంపత్యమనిన
కష్టనష్టముకోర్చి
ఓర్మితో కూర్మితో సాధించే
సంతోషమే కదా స్వర్గసీమ
మదినెంత కుందెడు
నెపమెంతటిదినైన
మాన్పి వేసెడి ధన్వంతరియేగదా
చెలిమి యగును
ఇట్టి బాంధవ్యములేగద
ఇలలోన వెలసిన
మానవాళికి వనె్నతెచ్చి
మహిత నిలుచు.

- ఎల్.గాయత్రి
కౌటాల, ఫోన్: 9949431849

పుస్తకం
బంధాలు అనే అట్టలను
చుట్టూ నిలుపుకుని
కాగితం అనే
కల్మషం లేని అమ్మ ఒడిలో
బిడ్డలుగా ముద్దుగా ఒదిగిన
అక్షరాలు, పదాలు
ఆ చిన్నారి బిడ్డలకు
దిష్టి తగలకుండా ఉండేందుకేనేమో
అపురూపంగా కళాత్మకంగా
రంగురంగుల బొమ్మలు
ఆ బొమ్మల్లో ఎన్నో భావాలు
హృదయాన్ని హత్తుకునే ఎన్నో బంధాలు
చూసే కళ్ళు అలసిపోవు
ఇంకా ఆతృతగా చూడాలనిపిస్తుంది
తనివితీరా చదవాలనిపిస్తుంది
ఆ అనుభూతిని పదిమందితో
పంచుకోవాలనిపిస్తుంది
చదివే హృదయాలు ఉన్నంతకాలం
చెరిగిపోని గురుతులే
చెరపలేని అక్షరాలే
ఈ పుస్తకాలు!

- గసికంటి సంజీవ్, కరీంనగర్
8374490013
........................................................
email : merupuknr@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం కోసం ఈ క్రిందిచిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫోటో, చిరునామాతో ఈ మెయిల్ అడ్రస్‌కు పంపించండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. email : merupuknr@andhrabhoomi.net

కథ
english title: 
uthara telangana
author: 
- అగేహానంద్

విజిల్ ఊదిన అమిత్ షా

$
0
0

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమ తెలంగాణ శాఖకు విజిల్ ఊదిపోయారు. ఇక పరుగుతీయవలసిన పని కిషన్‌రెడ్డి బృందంపై ఉంటుంది. అందుకు ఢిల్లీనుంచి కావలసిన ప్రోత్సాహం లభించగలదని షా మాటలను బట్టి అర్థమవుతున్నది. కాని ప్రధాన బాధ్యత మాత్రం రాష్ట్ర శాఖదని వేరే చెప్పనక్కరలేదు. అమిత్ షా రాక సందర్భంగా మూడునాలుగు రోజులపా టు హైదరాబాద్‌లో తగినంత సంరంభం కన్పించింది. ఇటీవలి ఎన్నికలలో పార్టీ ఘన విజయానికి ఆయన ప్రణాళికలు రచించారన్న పేరురావటం, మరొక వైపు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడటం ఈ సంరంభానికి కారణాలైనట్లు కన్పిస్తున్నదే. అందుకు తగినట్లు రాష్ట్ర నాయకులకు షా ఒక లక్ష్యం చెప్పిపోయారు. అది 2019లో అధికారానికి రావ టం. అందుకోసం ఒక కార్యక్రమావళిని నిర్దేశించారు. పార్టీ నిర్మాణం బూత్ స్థాయి, గ్రామస్థాయినుంచి ఎట్లా జరగాలి; ఎటువంటి అంశాలపై ప్రజలను కదిలించటం, ప్రభుత్వాన్ని వత్తిడిచేయటం అవసరం; అయిదేళ్లపాటు అందరూ ‘‘కష్టిం చి’’పనిచేయటం వంటివి అందులో ఉన్నాయి. ఆయన మాటలలో మరొక రెండు ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నట్లు మనం చూడవచ్చు. వాటిలో ఒకటి టిడిపితో భవిష్యత్ సంబంధాలు. రెండవది, తమవెనుక కేంద్రం ఉందన్న భరోసా ఇవ్వటం. ఎన్నికల అనంతరం బిజెపి- టిడిపి సంబంధాలు తెలంగాణలో అస్థిరంగా మారాయి. టిడిపి పట్ల ప్రజలలోగల వ్యతిరేకత ఆ పార్టీతో పొత్తువల్ల తమపై కూడా ప్రభావాన్ని చూపిందన్న భావన బిజెపి నాయకులు, శ్రేణులలో గట్టిగా ఏర్పడింది. ఆ పొత్తుకు ఎన్నికల ముందునుంచే వ్యతిరేకి అయిన కిషన్‌రెడ్డి వాదనకు తదనంతర పరిణామాలతో బలం వచ్చింది. దానితో ఇక జిహెచ్‌ఎంసి ఎన్నికలలో పొత్తువద్దని స్థానిక నేతలు ఇంచుమించు నిర్ణయించుకున్నారు. కానీ ఆ ఆలోచనకు అమిత్ షా తెరదించినట్లు తెరదించినట్టు తెలుస్తోంది. ఇపుడిక వారు కలిసి పోటీచేయటమే కాదు, మెదక్ లోక్‌సభ ఉప ఎ న్నికలో బిజెపి పోటీ, వారి అభ్యర్థికి టిడిపి మద్దతు ఇవ్వడం ఖాయంకాగల సూచనలు కన్పిస్తున్నాయి. ఇదే విధమైన పరస్పర అవగాహన వరంగల్ కార్పొరేషన్‌లోనూ కుదరవచ్చు.ఇందులో మిళితమై దీర్ఘకాలిక వ్యూహం ప్రసక్తికూడా వస్తుంది. తెలంగాణలో 2019లో తమకు అధికారం కావాలని టిడిపి, బిజెపి రెండూ అంటున్నాయి. దాని అర్థం అది సాధ్యమనివారు నమ్ముతున్నారని కాదు. పైగా ఊదే రాజకీయ బూరలు ఎవరివైనా, ఎప్పుడైనా అట్లాగే ఉంటాయి. దానిని అట్లుంచి అసలు విషయం చూస్తే, తెలంగాణలో నిజమైన దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకుసాగే దృష్టితో బిజెపి వ్యవహరిస్తున్నదని భావించవచ్చు. అందుకు భిన్నంగా, టిడిపికి అటువంటి భ్రమలు ఉంటాయనుకోలేము. వారికి గత ‘తెలంగాణ వ్యతిరేక’ ముద్ర గాఢమైన పచ్చబొట్టుగా మారటం అందుకు కారణం. ఆ స్థితిలో వారికి పరిమిత ప్రయోజనాలుంటాయి. అవి ఎంత నెరవేరితే అంత సంతృప్తి. అయితే అందుకైనా బిజెపి సహకారం అవసరం. చివరకు తేలేదేమంటే, క్రమక్రమంగా బిజెపికి టిడిపి ‘సహ కథానాయకుని’ పాత్రగా మిగిలే రోజులు రావచ్చు.
మొత్తానికి, బిజెపి-టిడిపి పొత్తు ఇక ఉండకపోవచ్చనే స్థితి కాస్తా అమిత్ షా పర్యటనతో ఒక స్పష్టతకు వచ్చింది. ఇది బిజెపికి ఉపయోగపడుతుందా లేక ఇటీవలి ఎన్నికలలోవలె గుదిబండగానే కొనసాగుతుందా అంటే, ప్రస్తుత వాతావరణాన్నిబట్టి ఆలోచించినపుడు అందుకే అవకాశాలెక్కువ. వాతావరణం మునుముందు మారితే చెప్పలేము. కాని అదంత తేలిక కాదు. ఎందువల్ల? పైన అనుకున్న ‘గాఢమైన పచ్చబొట్టు’ టిడిపికి చెరిగిపోయే అవకాశం లేదు. ఇది ఒక కారణమైతే, టిడిపి వివిధాంశాలలో మోదీ ప్రభుత్వపు అండతో తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూనే ఉందన్నది అక్కడి ప్రజలకు ఒక నమ్మకంగా మారింది. ఆ నమ్మకాన్ని బలపరిచేది సగటున వారానికొకటి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. వాటిని ఒక జాబితాగా రాయవచ్చు. ఈ స్థితి కేసీఆర్- చంద్రబాబుల రాజ్‌భవన్ కరచాలనాలతో సమసిపోయేది ఎంతమాత్రం కాదు. వారిద్దరిమధ్య పేచీలకు కారణాలు చరిత్రలో- వర్తమానంలో- భవిష్యత్తులో కూడా ఉన్నాయి. అందులో సహేతుకమేది, నిర్హేతుకమేది అన్న అకడమిక్ చర్చ విజ్ఞానదాయకంగా ఉంటుంది గాని సమస్యను పరిష్కరించదు. ఎందుకంటే, విభజన అనంతరం సైతం నిజంగానే సమస్యలు సృష్టిస్తున్న విషయాలు కొన్నున్నాయి. అదిగాక రాజకీయమన్నది సరేసరి. దీనంతటి దృష్ట్యా, వాతావరణం మారటం గాని, టిడిపికి గల పచ్చబొట్టు రంగు వెలవటం గాని, ఆ పార్టీతో చెలిమి బిజెపికి గుదిబండ కాకపోవటం గాని సాధ్యమనిపించదు. ఆ దృష్ట్యా, అమిత్ షా చెప్పిపోయిన ప్రణాళిక ఈ కోణంనుంచి ఏ విధంగా పరిగణించగలదన్నది రానున్న రోజులలో ఆసక్తిగా గమనించవలసిన విషయమవుతున్నది. ఇక తక్కిన విషయాలకు వస్తే, మొన్న బిజెపి అధికారానికి వచ్చింది ఉత్తరాది రాష్ట్రాలు, పశ్చిమ రాష్ట్రాల బలంతోనని, 2019 నాటికి తూర్పు రాష్ట్రాలతోపాటు దక్షిణ దేశంపై దృష్టి కేంద్రీకరిస్తున్నామని అమిత్ షా అన్నారు. అందులో భాగం గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బలపడటం లక్ష్యం. అందుకోసం సంస్థను ఏ విధంగా శక్తివంతం చేయాలో ఆయన చెప్పింది పైన చూసాము. అయితే అది చూసేందుకు ఎంత నీట్‌గా కన్పిస్తుందో చేసేందుకు అంత తేలికైనదేమీకాదని అమిత్ షాకు, కిషన్‌రెడ్డికి తెలియనిది కాదు. అందుకు కొన్ని గట్టి సమస్యలే ఉన్నాయి.
ఒకటి ‘‘కష్టించి’’పనిచేయటం. ఈ మాటకు రాష్ట్ర బిజెపి చెప్పుకోగల నిర్వచనం ఏమిటో తెలియదు. ఆ లక్షణం ఇపుడు లెఫ్ట్‌తోసహా అన్ని పార్టీలకు పోయినట్లు, బిజెపికీ లేదు. అప్పుడప్పుడు ధర్నా, రస్తారోకో చేసి మీడియా కవరేజీతో అలసిపోవటమే ఇపుడందరికీ కష్టపడటం కిందలెక్క. అయితే, ఇందుకు పరిమితం కాగల అవకాశాలు అమిత్ షా ఇచ్చిన ప్రణాళికలో లేవు. ఆయన బూత్ స్థాయి, గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం జరగాలని ఒక మాట, ప్రజల సమస్యలపై పనిచేయటం, హామీల అమలుకు ప్రభుత్వంపై వత్తిడి చేయటం అని మరొక మాట చెప్పిపోయారు. ఈ రెండు మాటలను కలిపి అర్థంచెప్పుకుంటే పార్టీవారు గ్రామస్థాయినుంచి ఆయా అంశాలపై పనిచేయవలసి ఉంటుందన్న మాట. ఇది ఎంతవరకు చేస్తారన్నది ఒక ప్రశ్న. ఎందుకంటే, లోగడ వాజపేయి పాలనా కాలంలో దానిని ఆసరాచేసుకుని పార్టీని నిర్మించుకునే అవకాశం వచ్చింది. కాని వారు ఇందిరాపార్క్‌వద్ద మీడియాకోసం మాత్రమే ‘‘కష్ట’’పడ్డారు. అదే ఇప్పుడూ జరగాలని ఏమీలేదు. కాని భిన్నంగా చేయగలరా అన్నది మాత్రం ప్రశే్న. ఇక్కడ కాకున్నా కేంద్రంలో అధికారంలో ఉన్నామని అమిత్ షా భరోసా ఇచ్చినా, ఇక్కడ పనిచేయనిదే అక్కడి అధికారంతో జరిగేది ఉండదు.
ప్రజల సమస్యలు చేపట్టటం, హామీల అమలుకు వత్తిడి చేయటమన్నది కూడా ఏవిధంగా ఆలోచించి ఏ కార్యక్రమాలు చేపట్టగలరనేది అంత తేలిక విషయం కాదు. గత నెలరోజులుగా రాష్ట్ర బిజెపి వ్యవహరణలో ఆలోచన కన్న అతి మాత్రమే కన్పించింది. ఉదాహరణకు పంట రుణాల మాఫీ కొన్ని కారణాలవల్ల ఇపుడు అన్ని రాష్ట్రాలకూ సమస్యగానే మారింది. ఆర్‌బిఐ వైఖరి కన్పిస్తున్నదే. అటువంటి స్థితిలో హంగామావల్ల కలిగే ఫలితమేంటి? పైగా వారి ఆంధ్రప్రదేశ్ సోదరులు ఈ ప్రశ్నపై కిమ్మనటం లేదు. ఇక్కడ గొడవకు బదులు ఢిల్లీవెళ్లి ఆర్థికశాఖతో ఆర్‌బిఐకి చెప్పించి తమ రైతు ప్రేమను నిరూపించుకోవచ్చుగదా అనే సవాలుకు వారు జవాబివ్వగల పరిస్థితి లేదు. ఫీజు రీఇంబర్స్‌మెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, గవర్నర్ అధికారాల వంటి అంశాలలోనూ తెలంగాణలో గల విస్తారమైన జనాభిప్రాయానికి, బిజెపి వైఖరికి సంబంధం కన్పించదు. అనగా వారికి ఆలోచనకన్న దూకుడు ఎక్కువైందన్నమాట. ఇదే వైఖరి కొనసాగితే సమస్యలు ఇంకా పెరుగుతాయి.
ఒకవేళ వారు ‘‘సమస్యల’’కోసం వెతుకుతూ గ్రామాలకు వెళ్లినట్లయితే, తమకు టిడిపితోగల మైత్రి గురించి ఆ పార్టీకి వెంకయ్యనాయుడు ‘సంధానకర్త’ కావటంపై వివిధాంశాలపై ‘‘కావాలని రాజకీయం చేయటం’’ గురించి, కేంద్రం తెలంగాణపై ‘‘పక్షపాతం’’చూపుతున్నా సరిదిద్దించ లేకపోవటంపై ప్రశ్నలు ఎదురై తమకే సమస్యలుగా మారితే ఆశ్చర్యపడనక్కరలేదు. అందువల్లవారు ముందుగా ‘‘ప్రజల మూడ్’’పై తమకు సున్నితంకాగల ఈ ప్రశ్నలపై ఎప్పటికపుడు పరిశీలనలు చేయించుకోవాలి. సానియామీర్జాను, గోలకొండను, ప్రభుత్వ లోగోలో చార్మినార్‌ను వివాదం చేయటం వంటి అపరిపక్వ సంప్రదాయక ఎత్తుగడలవల్ల ప్రజలలో తమ ‘‘బ్యాంక్’’ ఏమీపెరగకపోగా వ్యతిరేకత ఎక్కువవుతున్నదని గ్రహించాలి. మజ్లిస్ పార్టీని ముస్లిం ప్రజలను వేరుచేసి చూసే తెలివైన వ్యూహాన్ని టిఆర్‌ఎస్ అనుసరిస్తున్నది. తెలంగాణ బిజెపి తన పాత చట్రంలో ఇరుక్కుపోయి ఉంది.
అందువల్ల, అమిత్ షా పర్యటనవల్ల ఒక తాత్కాలికమైన వాతావరణం ఏర్పడిందనుకుంటే, అది నిర్దిష్ట రూపాలు తీసుకునేందుకు, ముందుకు పోయేందుకు స్థానిక నాయకత్వం చాలానే కష్టపడాలి.

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమ తెలంగాణ శాఖకు విజిల్ ఊదిపోయారు.
english title: 
whistle
author: 
- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)

తోచీ తోచనమ్మ వైరస్ ఐస్‌బకెట్!

$
0
0

తోచీ తోచనమ్మకు భర్త మీద కోపం వచ్చింది. కోపమెందుకో ఆమెకు గుర్తు లేదు. కానీ కోపం మాత్రం ఉంది. తాను అలిగానని తోటి కోడలు పుట్టింటికి వెళతానని అల్టిమేటం ఇచ్చింది. పుట్టింటికి వెళదామంటే అంతకు ముందు రోజే పుట్టింటి మీద అలిగి మెట్టినింటికి వచ్చిందాయె ఇప్పుడేం చేస్తుందే ఏదో ఒక చోట అలగాలి తప్పదు. అందుకే అలిగి తోటి కోడలు పుట్టింటికి వెళతానంది. తోచీ తోచనమ్మ తోటికోడలి పుట్టింటికి వెళితే అక్కడేమైంది అంటే ?
భర్త మీద కోపం వస్తే పుట్టింటికి వెళ్లాలి, పుట్టింటి వాళ్లపై కోపం వస్తే మెట్టినింటిలోనే ఉండి భర్తను సాధించాలి. అంతే తప్ప తోచీ తోచకుండా తోటి కోడలి పుట్టింటికి వెళితే అక్కడ ఆమెను పట్టించుకునేదెవరు? తోచీ తోచకుండా చేసే పనులకు పెద్దగా అర్ధాలు ఉండవు. తోయకపోవడం ఒక్కటే కారణం. ఈ తోచీతోచనమ్మలు వెనకటికి తెలుగునాట మాత్రమే కాదు ఈనాటికీ పాశ్చాత్యుల్లో సైతం ఉన్నారు. అమెరికాలో ఇలా తోచీ తోచని వాళ్లు సముద్రం ఒడ్డున గాడిదలపై ఎక్కి పరుగు పందేల్లో పాల్గొనే వారని ఓషో రజనీష్ వాళ్ల గురించి చెప్పుకొచ్చారు. కొంత కాలానికి అదే విసుగేసి మళ్లీ ఏమీ తోచక పోవడంతో ఈసారి ఆ గాడిదలను తాము మోస్తూ పరుగు పందాలు నిర్వహించారు. అది చూసిన వారికి వారిలో ఎవరు గాడిదో? ఎవరు మనిషో? అర్థం కాక అయోమయంలో పడే ఉంటారు.
కృష్ణశాస్ర్తీ బాధ ప్రపంచ బాధ అన్నట్టు కొందరికీ ఏదీ తోచక పోతే అది వారొక్కరి బాధే కాదు ప్రపంచ బాధ అవుతుంది. అందులోనే వాళ్లేమీ అల్లాటప్పా తోచీ తోచనమ్మలు కాదు. సెలబ్రిటీలు వాళ్ల సమస్య మొత్తం ప్రపంచ సమస్య అయిపోయింది. ఈ సెలబ్రిటీల తోచి తోచని అంటు రోగం ప్రపంచ వ్యాప్తం అయింది. ఇది సెలబ్రిటీల వైరస్‌గా మారిపోయింది. తలపై ఐస్ వాటర్ గుమ్మరించుకొని వీడియో తీసి దాన్ని నెట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఐస్ బకెట్‌ను తల మీద గుమ్మరించుకోవడమేనట బిల్‌గేట్స్ మొదలుకొని బాలివుడ్ తారల వరకు ఇప్పుడు ఐస్ బకెట్ చాలెంజ్ వైరస్ అందరినీ ముంచెత్తేస్తోంది. ఎబోలా వైరస్ ప్రపంచాన్ని గజగజవణికిస్తే, ఐస్ బకెట్ చాలెంజ్‌ను స్వీకరించిన తారలు తలపై చల్లని ఐస్ నీటిని కుమ్మరించుకుని చలితో వణికిపోతున్నారు. అమెరికాలో ఒకావిడ పాపులర్ టీవి షోలో పుట్టిన ఈ వైరస్ అతి వేగంగా భారత్‌కు వ్యాపించింది. గతంలో రష్యాలో వర్షం పడితే మన దేశంలో కొందరికి తుమ్ములోచ్చేవి. ఇప్పుడు అక్కడెక్కడో అమెరికా టీవి షోలో వైరస్ పుడితే బాలీవుడ్‌ను ముంచెత్తుతుంది. బకెట్‌లోని ఐస్‌ను తలపై గుమ్మరించుకోవాలి ఇదో చాలెంజ్. ఈ చాలెంజ్‌ను స్వీకరించినా? స్వీకరించకపోయినా? గెలిచినా ఓడినా ఎంతో కొంత సేవా కార్యక్రమాలకు చెల్లించాలి. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు పోటీగా గల్లీ క్రికెట్ పుట్టినట్టు ఐస్ బకెట్‌కు పోటీగా రైస్ బకెట్ చాలెంజ్ పుట్టింది. అమెరికాలోని తోచీ తోచని వాళ్ల వ్యవహారాలు చూసి విసుగెత్తిన ఒక సామాజిక కార్యకర్త రైస్ బకెట్ చాలెంజ్‌కు రూపకల్పన చేసింది. బకెట్ బియ్యం ఇస్తే ఒక కుటుంబానికి నెల రోజుల భోజనం దొరుకుందని ఈ చాలెంజ్ ప్రారంభించింది. బకెట్ బియ్యం ఇవ్వలేకపోతే వంద రూపాయలు ఇవ్వాలి. అయితే సెలబ్రిటీల ఐస్ బకెట్‌లో ఉన్నంత వెర్రి ఒక కుటుంబానికి బకెట్ బియ్యంలో ఉండదు కాబట్టి ఈ చాలెంజ్ ప్రచారం సామాజిక మాధ్యమాలకే పరిమితం అయింది. ఐస్ బకెట్ చాలెంజ్‌లా కార్పొరేట్ మిడియా దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. సంపన్నులు, సెలబ్రిటీలు ఎంత బిజీగా ఉన్నా, వాళ్లూ తోచీ తోచని తనంతో ఇబ్బంది పడుతుంటారని, ఇలాంటి వైరస్‌లను చూస్తే తెలుస్తుంది. వంటింటి పార్వతి వంటి పని ముగిశాక తీరిక దొరికితే పక్కింటి లక్ష్మితో వరండాలో నిలుచోని తోచనప్పుడు కబుర్లు చెప్పుకుంటారు. సెలబ్రిటీలు చీమలు దూరని భవంతుల్లో నివసిస్తారు, మొగుడి గారికో గది భార్యగారికో గది విడివిడిగా ఉంటుంది. మగడనే వాడు ఇంటికి వచ్చాడా? లేదా అనేదే తెలియదు. అలాంటప్పుడు తోచనప్పుడు పక్కింటి వారితో కబుర్లు చెప్పుకునేంతటి అదృష్టం వారికెక్కడిది. ఏమీ తోయకపోవడం అనేది అందరిలోనూ కనిపిస్తుంది. అయితే ఎవరికి వారు తమ తమ స్థాయిలో ఆ పనులు చేస్తుంటారు. అధికారం అనుభవించి, ప్రతిపక్షంలోకి వచ్చిన వారికి ఏమీ తోచక పోవడం నరక ప్రాయం లాంటిది. ఒకవైపు అధికారం పోయిందనే బాధ, మరోవైపు ప్రత్యర్థి చేతిలో అధికారం ఉందనే బాధ. ఈ ఆలోచనలతో వారి కసలు నిద్రనే పట్టదు. తమకు నిద్ర లేనప్పుడు తమను ఓడించిన ప్రజలకు నిద్ర ఎందుకుండాలని సమస్యలు లేకపోతే సృష్టించి మరీ ఉద్యమిస్తారు. మేం అధికారం లోకి వస్తే భూలోక స్వర్గం చూపిస్తాం అంటారు. ఒకవేళ అధికారంలోకి వస్తే తోచీ తోచనప్పుడు ఇచ్చిన హామీలే అసలు సమస్యలుగా మారుతాయి. రైతులారా! మీరు రుణాలు చెల్లించకండి.. నేను రాగానే రద్దు చేస్తానో అంటూ ఏదో తోచీ తోచనప్పుడు ఇచ్చిన హామీ అధికారంలోకి వచ్చాక తలకు చుట్టుకుంది. రాత్ గయి బాత్ గయి అన్నట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలను అధికారంలోకి వచ్చాక అడగడం అన్యాయం అనిపిస్తుంది కానీ పాపం ఆ మాట పైకి చెప్పలేరు. చెన్నారెడ్డిని బయట ఉంచితే ప్రమాదం అని ఇందిరాగాంధీకి చాలా మంది తెలుగు నాయకులు చెప్పేవారట! పదవి ఊడబెరికి ఏమీ తోచని పరిస్థితి కల్పిస్తే ఆయన అధినాయకురాలిపైనే తిరుగుబాటు చేస్తారని, అందుకే ఆయన్నినిరంతరం బిజీగా ఉంచాలని సలహా ఇచ్చేవాళ్లట! సెలబ్రిటీలకు ఏమీ తోచక పోతే ఐస్ బకెట్ చాలెంజ్ లాంటి సిల్లీ గేమ్స్ పుడతాయేమో కానీ రాజకీయ నాయకులకు ఏమీ తోచక పోతే ప్రజలకు ప్రమాదం. రాజకీయ నాయకులకు అధికారం ఉండి పని లేకపోయినా, అధికారం లేక పని లేకపోయినా రెండూ ప్రజల పాలిట ప్రమాదమే. సాధారణ వ్యక్తులు ఏ పనీ లేకపోతే ఏదో ఒక వ్యసనానికి బానిసగా మారి తమను తాము నష్టపరుచుకుంటే నాయకులు మాత్రం ఏమీ తోచక పోతే అల్లకల్లోలం సృష్టిస్తారు.

తోచీ తోచనమ్మకు భర్త మీద కోపం వచ్చింది.
english title: 
ice bucket

జీవితం సూఫీ తత్వం, మేధస్సులో మార్క్సిజం

$
0
0

జీవన ప్రయాణంలో చావు కలిగించే బాధని మరవలేం.
జననం ఆనందమే. కాని అది క్షణికం.
చావు గుర్తున్నంతగా జననాలు గుర్తుండవు.
పుటుకకీ చావుకి మధ్య బతుకు ఉంటుంది. ఆ బతుకే మనిషి జీవితం. అదే జ్ఞాపకం. ఆ మనిషి తాలూకూ ప్రతి విషయం వ్యక్తులకు, కుటుంబానికి, సమాజానికి సంబంధం ఉంటుంది. చాలామంది మరణం కుటుంబానికి పరిమితం. పనిచేసిన ప్రదేశానికి సీమితం. కాని సమాజంకోసం పరితపించి కార్యాచరణలోకి దిగినవారి బతుకు సామాజికం. ఆ చావు ఒక వెలితి. అది పూడ్చలేనిది. అలాంటి ఒక మరణం మొన్న 20 ఆగస్టు (బుధవారం)నాడు సంభవించింది. మరణించిన వ్యక్తి మహమ్మద్ తాజుద్దీన్ ఖాన్. అతడిని ఎం.టి.ఖాన్ అని పిలుస్తారు. మిత్రులు, పెద్దలు ఖాన్ సాబ్ అంటారు.
ఖాన్ సాబ్ మరణం పూడ్చలేని లోటు. అటువంటి మనిషిని రాబోయే తరం చూడాలంటే సాధ్యంకాదు. అలాంటి వారిని చూపాలని ఆశ ఉన్నా నెరవేర్చలేం. మహిమలు గల దేవుడిని చూడాలని కోరతారు. కాని చేతలనే మహిమల స్థాయి చేకూర్చిన వాడిని అందరికీ చూపాలని అనిపిస్తుంది. ఇప్పుడు ఖాన్ సాహెబ్‌ని భౌతికంగా చూపలేను. కాని అక్షరాలలో చూపాలని మాత్రం గాఢమైన తపన పడుతున్నాను.
హైదరాబాదు పాతబస్తీకి అమోఘమైన చరిత్ర ఉంది. అందమైన నిర్మాణం ఉంది. సదా గుర్తుంచుకునే జీవన మూల్యాల ఖజానా అది. ఆ మధ్య రాజకీయ పార్టీల చేతుల్లో విషకన్య అయ్యింది. పర ప్రాంతంనుండి వచ్చి సహచరులను పదవీచ్యుతులను చేయడానికి మతకల్లోలాలు లేపారు తప్ప అక్కడ గతంలోనూ, వర్తమానంలోనూ సహజీవన సంస్కృతే ఉంది. ఆ సంస్కృతిని నిలపడానికి నిరంతరం కృషిచేసిన వారిలో ఖాన్ లాంటి వారి పాత్ర చెప్పుకోదగింది. ప్రతి ఉద్రిక్త సమయం ముందే పసిగట్టి నివారణ చర్యగా శాంతి కమిటీల ద్వారా, వ్యక్తిగా నిర్మానుష్యమైన రోడ్డుమీద సంచరిస్తూ ప్రజలమధ్య అవగాహన పెంచాడు. ఖాన్ సంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందినవాడైనా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోలేదు. ఆ కోణంలో ఆలోచించలేదు. మానవత్వం, మనిషి ధర్మం దృష్టితో జీవించాడు. ఆలోచించాడు. ఏ పనినైనా అలాగే చేశాడు.
నిజానికి ఖాన్ పూర్వీకులు శతాబ్దాల క్రితం ప్రస్తుతం కర్నాటక రాష్ట్రంలోని గుల్‌బర్గానుండి వచ్చారని అంటారు. పురానాపూల్ వద్ద అబూహషీం మదాని దర్గా ప్రాంతంలో నివసించేవారు. తమ పూర్వీకుల పాత ఇంటిలో ఖాన్ సాబ్ జన్మించారు.
నిరంకుశత్వం, దోపిడి, దౌర్జన్యాన్ని ఎదుర్కొనే లక్షణం ప్రతి జీవికి ఉంది. అందులో మనిషికి ఆ గుణం ఎక్కువ. ఇది సహజ స్వభావం. దీనికి వ్యతిరేకంగా ఉండగలిగే స్వభావం వర్గప్రయోజనం, కుల స్వభావం, ప్రాంతాభిమానం కలిగిస్తుంది. వాటిని జయించగలిగిన వాడే మనిషి. ఆకారంవల్ల మానవుడు అనిపించుకోగలడేమో గాని ‘మనిషి’కాలేడు. మతం, కులం, వర్గం, ప్రాంతం ఇవేవీ లేనినాడు మనిషి ఉన్నాడు. ఇవన్నీ హెచ్చయిన నేడు మానవుడిలో మనిషితనం మృగ్యమైంది. ఖాన్ సాబ్ పదేళ్ళప్పుడే కాసీం రజ్వీ దురాగతాలపై రాళ్ళు విసిరాడు. నిజాం నిరంకుశత్వాన్ని నిరసించాడు. అందుకే విఖ్యాత కవి, కమ్యూనిస్టు అయన మక్దూం మోహినుద్దీన్, జవాద్ రజ్వీ వంటి వారితో కలసిపోయాడు. పొట్టివాడైనా గుండె గట్టిది. చిన్నవాడైనా ఆలోచనల్లో దిట్ట. చదువులో మొదటి బెంచి. అందుకే పారసీకం, ఉరుదూ, అరబీ, హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ప్రవీణుడు. ఈ భాషలలో అలవోకగా అనువాదాలు చేయగల ఏకైక వ్యక్తి ఆయనే. అందుకే ఆనాటి పీపుల్స్‌వార్ ఆధికారిక పత్రిక ‘పిలుపు’కి సంపాదకుడు. ‘న్యూస్‌టైం’ పత్రికలో అనువాదాలు, సంపాదక రచనలు చేశాడు. ‘సియాసత్’ ఉరుదూ పత్రికలో కాలమిస్టు. కవి. రచయితగా పేరుమోసాడు.
పైగా 1946 ప్రాంతాల్లో ఆంధ్రమహాసభల కార్యకర్త. అతివాదులు, మితవాదులు వేరుపడి ఆ సభలని విడివిడిగా జరుపుకున్నప్పుడు కమ్యూనిస్టుల వైపు నిలిచాడు. మక్దూం వెంట తిరిగి మార్క్సిజం పాఠాలు నేర్చుకుంటూ వాటిని వంటబట్టించుకున్నాడు. మరణించేవరకు అతను నిజమైన మార్క్సిస్టు.
ముస్లిం మతంలోని మంచి విషయాలను గ్రహించి మిగతా విషయాలను విమర్శించేవాడు. అలాగే హిందూ మత ఆధిపత్య ధోరణులను ఇష్టపడే వాడు కాదు. బురఖా విషయం గురించి రాస్తే పాతబస్తీ మహిళలు ఖాన్ సాబ్‌ని పరిగెత్తించారు. ఐనా ఏనాడూ జంకలేదు.
అవిభక్త కమ్యూనిస్టుపార్టీ సభ్యుడు. అది విడిపోయినప్పుడు అతివాద పంథా వైపే నిలిచాడు. ఆ పార్టీకూడా యథాతధ వాదంలో కూరుకుపోయి ప్రజోద్యమాలను విస్మరిస్తుంటే అందులోంచి విప్లవ కమ్యూనిస్టు పార్టీగా ఏర్పడగానే దానినే తన అడ్డాచేసుకున్నాడు. ఆ తరువాత పీపుల్స్‌వార్ పార్టీ పట్ల ఆకర్షితుడై ప్రజాసంఘాలలో చాలాకాలం పనిచేశాడు. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు. అన్నింటికి మించి ఖాన్‌గారు ఒక ‘మనిషి’. ఎన్ని అభిప్రాయభేదాలు ఎదురైనా ఎక్కడా ఒక్క మాట తూల లేదు. పరుష పదం వాడలేదు. సంయమనం అతని గుణం. పారదర్శకత అతని జీవన విధానం. ఏనాడూ నిర్మాణాలను శాసించలేదు. వాటికి ఒదిగి ఉన్నాడు. కాని కొందరు పార్టీని మభ్యపెట్టి నిర్మాణేతర శక్తులుగా ఎదగాలనుకున్నప్పుడు నిశ్శబ్దంగా వ్యతిరేకించాడు. లేదా వౌనాన్ని ఆశ్రయించాడు. రెండు దశాబ్దాల వౌనంవల్ల ఆయనకి నష్టం జరగకపోవచ్చు. కాని విప్లవ, ప్రగతిశీల ఉద్యమ రంగానికి తీరని నష్టం వాటిల్లింది.
ఖాన్ వ్యక్తికాదు. అతను అపురూపమైన భాషాశక్తి. శక్తిమంతమైన కవి. రచయిత. తన జీవిత ఆచరణతో అందరి మన్ననలను పొందిన వ్యక్తి. మహోన్నత వ్యక్తిత్వం అతని సొంతం. ఒక గొప్ప ఉపాధ్యాయుడు. సామాజిక మార్పు అతని వంటి వ్యక్తిత్వాలవల్లే సాధ్యం.
నిర్మాణాల్ని ఆసరాచేసుకుని, వాటిని కవచాలుగా చేసుకుని అహంభావం ప్రదర్శించే ఒకరిద్దరు విప్లవ రచయతల చర్యలవల్ల ప్రజలు చాలామంది దూరమయ్యారు. చీటికిమాటికి టెక్నికల్ విషయాలతో పేచీలు పడేవారిని చూసి ఖాన్‌సాబ్ పరేశాన్ అయ్యాడు. వారి అల్పత్వం చూసి కలతపడ్డారే గాని విమర్శించలేదు. ఈ విషయం గురించి అప్పుడప్పుడు బాధ వ్యక్తంచేసేవారు. ఇలాంటి అల్పజ్ఞులను ‘తెల్లబొద్దింకలు’ అనేవాడు. ఎర్ర గదిలో కర్రల లోతుల్లో దాగే తెల్ల చెదపురుగులు చూడ్డానికి చిన్నవైనా పెద్ద నష్టాన్ని కలిగిస్తాయని చెప్పేవాడు. ఐతే చెదలుని చూసి చూసీ చూడనట్లుండి దానిని పట్టించుకోకపోతే తీవ్ర నష్టం జరుగుతుందని, అవి ప్రగతిశీలుర మెదడుల్లోకి ప్రవేశించకుండా అప్రమత్తం ఆశించేవాడు. ఖాన్ అక్కడ అశక్తుడయ్యాడు. ఒక్కసారి రాజధానిగా నగరంలోకి వలసవచ్చిన ప్రగతిశీల కుటుంబాలు ఒక బృందంగా తయారై అందరి మీద ‘దాడి’ప్రారంభించాయ. అంతకుముందున్న మంచి వాతావరణంలో చిచ్చుపెట్టారు. ఒక్కొక్కరినే దూరం చేస్తూ తమ బృందమే నిజమైన, నిక్కమైన విప్లవవాదులుగా చెలామణి అయ్యారు. నిజానికి వారివల్ల ప్రగతిశీల భావ విప్లవ రంగం బలహీనపడింది. ఇదొక విషాదం. గొప్ప ఆచరణశీలి అయిన ఖాన్ అధ్యయనానికి పరిమితమయ్యాడు. ఉపాధ్యాయునిగా, అధ్యాపకునిగా పనిచేస్తున్న కాలంలో ఎమర్జెన్సీ, సికిందరాబాదు కుట్ర కేసులో పలుమార్లు జైలు పాలయ్యాడు. దాంతో సర్వీసులో బ్రేక్ వచ్చింది. ఎలాంటి పైరవీలు చేయకుండా ఇచ్చిన జీత భత్యాలతో కాలం గడిపాడు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంకోసం రెండున్నర దశాబ్దాలపాటు పాత్రికేయునిగా పనిచేశాడు. రాజధానికి వచ్చిన విప్లవకారులు మాత్రం ఎన్నిసార్లు జైలుకెళ్ళినా హాయిగా యాజమాన్యాలు, ప్రభుత్వ సహకారంతో బ్రేకాఫ్ సర్వీస్‌ని రెగ్యులరైజ్ చేయించుకున్నారు. ఇరవై ఏళ్ళుగా ఉద్యోగం చేయకుండానే పెన్షన్లు పొందుతున్నారు. ఇలాంటి వారితో పోలీస్తే ఖాన్ ఎంతటి ఉన్నతుడో పోల్చుకోవచ్చు. అతని పూర్వీకుల వారసత్వం సూఫీతత్వం. సూఫీలు అధికారంకోసం వెంపర్లాడరు. పేరుప్రఖ్యాతులకోసం ఆశించరు. డబ్బు సంపాదించాలని వ్యక్తిత్వం చంపుకోరు. ఆధిపత్య స్వభావాన్ని పరిహరించుకుంటూ దానిని వ్యతిరేకిస్తారు. ఖాన్‌గారు జీవితంలో సూఫీ. మేధోపరంగా మార్క్సిస్టు.
1977లో ‘మాభూమి’ సినిమా ఆయన ఇంటిలో చిత్రీకరిస్తున్నప్పుడు సుద్దాల హనుమంతు, బి.నరసింగరావుతోపాటుగా మొదటిసారి అక్కడే కలిశాను. స్టేట్ ఆర్కైవ్స్‌లో ‘కొమురం భీం’కి సంబంధించిన ఫైలు దొరికింది. అందులో కొంత భాగం ఉరుదూలో ఉంది. దాని అనువాదంకోసం వారి ఇంటికి వెళ్ళాను. కళ్ళు మూసి తెరిచేలోగా ఉరుదూనుండి ఆంగ్లంలోకి అనువదించి చేతిలో పెట్టాడు.
నేనూ, ఖాన్ మిత్రుడు షరీఫ్, కవి సూర్యవంశి ఖాన్‌గారిని కలిసి ‘‘స్వీయచరిత్ర’’ రాయాలని కోరాం. చాలారోజుల తరువాత అందుకు ఒప్పుకున్నాడు. రెండు తెల్లని బౌండు పుస్తకాలు తీసుకుపోయి ఇచ్చాం. ఆ ప్రయత్నంలో ఉండగానే అనారోగ్యం ఆవహించింది. తెల్లకాగితాలు తెల్లపోయాయి. చివరికంటూ తనదైన చిరునవ్వు. ఎలాంటి కల్మషం లేని వాక్కు. పాతబస్తీలో పూచిన ఆ ఎర్ర మోదుగ. ఒక గొప్ప ‘మనిషి’. మనుషుల్ని కోల్పోతున్న మానవులం. మనం ఖాన్‌లాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటే తిరిగి మనిషితనం మీద ప్రేమ కలుగుతుంది. ఒక భరోసా కలుగుతుంది. ఈ భూమిమీద ఇలాంటి మనుషులు ఉన్నందువల్లే ఇంకా భూగోళం బేలన్స్ కోల్పోలేదనిపిస్తుంది.
**

జీవన ప్రయాణంలో చావు కలిగించే బాధని మరవలేం.
english title: 
sufi tathvam
author: 
jayadhirtr@gmail.com - సెల్‌: 9951942242

ధరలు పెరిగితే శుభాకాంక్షలా!

$
0
0

ధరలు పెరిగితే శుభాకాంక్షలు తెలియచేస్తారా? ఔను..ఒక ఎమ్మెల్సీగారు పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీతకు శుభాకాంక్షలు తెలిపారు. సందర్భం చూద్దాం..శాసనమండలిలో సోమవారం నిత్యావసర సరకులపై చర్చ జరిగింది. నిత్యావసర సరకుల ధరల పెరిగాయని మంత్రి గారు నిండు సభలో సెలవిచ్చారు. ఈ లోగా ఒక ఎమ్మెల్సీ లేచి ‘మంత్రిగారికి శుభాకాంక్షలు’ తెలియచేస్తున్నానని అన్నారు. ధరల పెరిగినందుకు శుభాకాంక్షలు చెబుతున్నారా అంటూ తోటి సభ్యులు చిర్రుబుర్రులాడారు. దాంతో సదరు ఎమ్మెల్సీ లేచి..్ధరలు పెరిగినందుకు కాదు..సునీతమ్మ మంత్రిగా తొలి సారి మాట్లాడుతున్నందుకు ఆనందం పట్టలేక శుభాకాంక్షలు చెప్పానని చల్లగా చెప్పారు. దాంతో సభలో నవ్వులు విరిశాయి.
- పి.వి. రమణారావు

టూరిస్టు రోల్...
రాములమ్మగా పాపులర్ అయిన తెలుగు సినీ హీరోయిన్ విజయశాంతి తాను అసలు సిసలైన తెలంగాణ బిడ్డగా చెప్పుకుంటారు. అదే స్ఫూర్తితో ‘తల్లి తెలంగాణ’ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి ఆ తర్వాత దానిని టిఆర్‌ఎస్‌లో విలీనం చేసి ఒక పర్యాయం మెదక్ నుంచి ఎంపీగా గెలుపొంది ప్రస్తుతం మాజీగా మారిన సంగతి తెలిసిందే. టిఆర్‌ఎస్‌లో ఉన్నంత కాలం తెలంగాణ బిడ్డగా విజయశాంతిని ఆదరించగా, ఆమె ప్రస్తుతం సీమాంధ్ర బిడ్డగా మారిపోయారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకోవడానికి విజయశాంతి, సినీ హీరో పవన్ కల్యాణ్ ఇద్దరు నిరాకరించారు. దీంతో ఇక నుంచి వీరిని ఈ రాష్ట్రానికి పర్యాటకులుగా పరిగణిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. సినిమాలో గెస్ట్‌రోల్స్ మాత్రమే తెలిసిన వీరికి తాజాగా ఈ టూరిస్టు రోల్ ఏమిటో అర్థం కాక రాములమ్మ, పవన్‌కల్యాణ్‌లు తెగ ఫీల్ అయిపోతున్నట్టు వినికిడి.
- వెల్జాల చంద్రశేఖర్

దొరికి పోయిన ఇంద్రన్న
బిజెపి నేత ఇంద్రసేనారెడ్డి మొదటి నుంచి సమగ్ర కుటుంబ సర్వేను తీవ్రంగా విమర్శిస్తున్నారు. టీవి చర్చల్లో మాట్లాడుతూ చివరకు ఎన్యూమరేటర్లు మా ఇంటికే రాలేదు, ఇదేం సమగ్ర సర్వే అని మండిపడ్డారు. అంతా బాగానే ఉంది కానీ ఆయన ఇంట్లో సోఫాపై ఎన్యూమరేట్లను కూర్చోబెట్టి ఆయన వివరాలు అందజేస్తున్న ఫోటో మీడియాలో వచ్చింది. దాంతో ఫేస్‌బుక్‌లో ఈ రెండు ఫోటోలు ఒకే చోట పెట్టి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే అసమగ్రంగా ఉందంటే సరిపోయేది మా ఇంటికే రాలేదు అని చెప్పడంతో ఇంద్రసేనారెడ్డి చిక్కిపోయారు.
- మురళి

‘మా హయాంలో కాదు..’
ఏదైనా సంక్షేమ పథకం తమ ప్రభుత్వం హయాంలో ప్రవేశపెడితే అభివృద్ధి కోసం, అదే ఇతర పార్టీ ప్రభుత్వం ప్రవేశపెడితే అవినీతి కోసం.. అన్న చందంగా రాజకీయాలు తయారయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాట్లాడేందుకు ఆ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ‘ఎస్సీ, ఎస్టీ, గిరిజన అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. గత ప్రభుత్వాలు ఆయా వర్గాలకు అన్యాయం చేశాయి. నిధుల్లో పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డాయి.’ అంటూ మొదలుపెట్టారు. దీనిపై అక్కడే ఉన్న ఓ విలేఖరి స్పందిస్తూ ‘సార్.. గత ప్రభుత్వం అంటే 1994 నాటి నుంచి ఉన్న టిడిపి ప్రభుత్వం నుంచి కూడానా?! అని చమత్కరించారు. ప్రశ్నతో కాస్త తడబడ్డ మంత్రి వెంటనే తేరుకుని ‘లేదు.. లేదు... గత ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం..’ అని కవర్ చేసుకున్నారు. దీంతో సమావేశ మందిరంలో నవ్వులు వెల్లివిరిశాయి.
- కామిడి ప్రదీప్‌రెడ్డి

కాళ్ళకు ‘సర్వే’ బంధం..!
ఈ ‘సర్వే’బంధం ఏమిటా..! అని అనుకుంటున్నారా?, నిజమే సర్వేబంధమే గృహనిర్బంధంగా మారింది. తెలంగాణలో ఈ నెల 19న ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఈ సర్వే సక్సెస్ కావడానికి, ఎన్యూమరేటర్లు ఇళ్ళకు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులంతా అందుబాటులో ఉండేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున సెలవు ప్రకటించింది. సాధారణంగా సెలవు రాగానే సినిమాలు, షికార్లకు వెళ్ళే వారికి కాళ్ళకు ‘సర్వే’ బంధం పడింది. ఎన్యూమరేటర్లు ఎప్పుడు వస్తారా? అని ఇంట్లోని వారంతా ఎదురు చూస్తూ గడపాల్సి వచ్చింది. సర్వేజనా సుఖినోభవంతు అన్నట్లు కనీసం ఆ విధంగానైనా విరామం, విశ్రాంతి లభించింది.
- వి. ఈశ్వర్ రెడ్డి

ధరలు పెరిగితే శుభాకాంక్షలు తెలియచేస్తారా?
english title: 
mirch masala

నిరాడంబరులు కోటికొక్కరు!

$
0
0

సిరికిం జెప్పడు శంఖచక్రయుగముం జేదోయి సంధింపడే
పరివారంబునుం జీరడభ్రగపతి బన్నింప డాకర్ణికాం
తర థమ్మిల్లము జక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన న్వీడడు గజ ప్రాణావనోత్సాహియై
- ఈ పద్యం మహాకవి పోతన రచించిన భాగవతంలోని ‘గజేంద్ర మోక్షం’ ఘట్టం లోనిది. ఏనుగుల గుంపు అడవిలో తిరుగుతూ అలసిపోయి దాహం తీర్చుకోవటానికి ఒక మడుగులోకి దిగాయి. ఇంతలో మడుగులోని మొసలి తటాలున పైకి వచ్చి ఒక ఏనుగు కాలు ఒడిసి పట్టుకుంది. నీటి కల్లోలానికి మిగిలిన ఏనుగులన్నీ చెల్లాచెదురయ్యాయి. మొసలి చేతికి చిక్కిన ఏనుగు తొండంతో కొట్టింది. దంతాలతో పొడిచింది. భీకరంగా యుద్ధం చేసింది. ఆ యుద్ధం ఎన్నోరోజులు నిర్విరామంగా జరిగింది. కానీ నీటిలో ఉన్నప్పుడు మొసలికి బలం ఎక్కువ. స్థానబలం చేత అది ఏనుగు కాలు విడిచిపెట్టలేదు. గజేంద్రుడికి శక్తి సన్నగిల్లింది. ప్రాణాలు ఎగిరిపోయేటట్లు ఉన్నాయి. మూర్ఛ వచ్చేటట్లు ఉంది. ఇక ‘స్వామీ! నువ్వే దిక్కు. నువ్వుతప్ప నాకు ఇంకెవరూ లేరు. రక్షించు’ అంటూ విష్ణుమూర్తిని ప్రార్థించింది. ఆ సమయంలో విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవితో కలిసి వనవిహారం చేస్తున్నాడు. గజరాజు ప్రార్థన వినబడింది. అప్పుడు విష్ణుమూర్తి గజేంద్రుడి ప్రాణం కాపాడటానికి ఈవిధంగా వస్తున్నాడు- అని పోతన ఈ పద్యంలో వర్ణించాడు. ఏవిధంగా అంటే - చివాలున లేచాడు. లక్ష్మీదేవితో వెళుతున్నానని చెప్పలేదు. శంఖం, చక్రం వంటి ఆయుధాలు ధరించలేదు. ఏ పరివారాన్నీ వెంటరమ్మని అనలేదు. తన వాహనమైన అభ్రగపతిని (గరుత్మంతుడిని) పిలవలేదు. చెదిరి చెవుల మీద పడుతున్న తలవెంట్రుకలను సరిచేసుకోలేదు. లక్ష్మీదేవి చీర చెంగు తన చేతిలో చిక్కుబడిన సంగతి గమనించలేదు. పరుగున వెళ్లసాగాడు.
అలా పరుగున వెళ్లి మొసలిని వధించి ఏనుగును రక్షిస్తాడు. అదంతా తర్వాత కథ. ఈ పద్యం రాసే సమయంలో శ్రీనాధుడు పోతన ఇంటిలోనే ఉన్నాడు. శ్రీనాధుడు పోతన చెల్లెలి భర్త. ఆయన కూడా గొప్ప పండితుడే. కానీ శ్రీనాధుడు భోగి. పోతన యోగి.
‘ఇంత కవిత్వం వచ్చినవాడివి నీ కావ్యాన్ని ఏ మహారాజుకైనా అంకితం ఇస్తే కోరినంత ధనం ఇస్తాడు కదా! వ్యవసాయం చేసుకునే పని, ఈ దారిద్య్ర బాధ తప్పుతుంది’ అని శ్రీనాధుడు సలహా ఇస్తే పోతన అంగీకరించలేదు. అందువల్ల పోతన పట్ల శ్రీనాధుడికి కొంచెం తక్కువ భావం ఉంది. ఎలాగైనా చిన్నబుచ్చాలనే ఉద్దేశ్యంతో ఈ పద్యాన్ని విని ‘ఏమిటీ! విష్ణుమూర్తి ఆయుధాలు ధరించలేదా? పరివారాన్ని వెంట తీసుకువెళ్లలేదా! ఏమీలేకుండా వెళ్లి ఏంచేస్తాడు? చోద్యం చూస్తాడా?’ అని గేలి చేశాడు.
పోతన అప్పటికి వౌనం వహించాడు. ఆ మర్నాడు శ్రీనాధుడు తలస్నానం చేస్తున్న సమయం చూసి ఆయన ఐదేళ్ల కొడుకుని పోతన దాచిపెట్టి, పెద్ద బండరాయి తెచ్చి బావిలో వేశాడు. ‘్ఢం’ అని శబ్దం వచ్చింది. ‘బావా! నీ కుమారుడు బావిలో పడిపోయాడు’ అంటూ అరిచాడు.
‘అయ్యో! ఎక్కడ? ఎక్కడ?’ అంటూ శ్రీనాధుడు కంగారుగా వచ్చాడు. ‘స్నానం చేస్తూ మధ్యలో వచ్చావేమయ్యా! కుంకుడు రసం, ముఖం నిండా నురగ ఎలా కారుతుందో చూడు. శుభ్రంగా స్నానం చేసి, తల దువ్వుకుని, పట్టు పీతాంబరాలు కట్టుకుని రాకూడదా! చేతిలో తాడు ఏదీ? బక్కెట ఏదీ? ఏమీలేకుండా వచ్చి ఏంచేస్తావు? చోద్యం చూడటానికి వచ్చావా?’ అన్నాడు పోతన.
శ్రీనాధుడి ముఖం వెలవెలా పోయింది.
‘వెర్రి బావా! నీ కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే నీవు ఎంత ఆత్రుతతో వచ్చావో, భగవంతుడు కూడా తన భక్తులు ఆపదలో ఉన్నారని తెలిస్తే అలాగే వస్తాడయ్యా! భగవంతుడికి సృష్టిలోని ప్రాణికోటి అంతా బిడ్డలతో సమానమే. నీ కుమారుడికి ఎలాంటి ఆపదా రాలేదు. క్షేమంగా ఉన్నాడు. నీకు అర్థం కావటానికే ఇలా చేశాను’ అన్నాడు పోతన. శ్రీనాధుడు సిగ్గుతో తలదించుకున్నాడు.
భాగవతంలోని ఒక్కో పద్యం ఒక్కో రసగుళిక వంటిది. అంతటి గొప్ప కావ్యాన్ని రచించిన పోతన వ్యవసాయం చేసుకుంటూ జీవితం గడిపాడు. ఏ మహారాజుని ఆశ్రయించినా ఆయన పాండిత్యానికి కనకవర్షం కురిపించేవారు. కానీ ఆయన సిరి సంపదలను ఆశించక తన కావ్యాన్ని శ్రీరాముడికి అంకితమిచ్చాడు.
డబ్బుకి ప్రాధాన్యతనిచ్చే నేటికాలంలో ప్రతిఒక్కరూ పోతన చరిత్రను తెలుసుకోవాలి. డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా నిరాడంబరంగా గడిపేవారు ఇప్పడు కూడా నూటికో, కోటికో ఒక్కరుంటారు. అలాంటి వారు ఇతరుల ప్రశంసలు ఆశించరు. కంచు మోగినట్లు కనకము మోగదు కదా!

- గోనుగుంట మురళీకృష్ణ,
సెల్ నెం: 9701260448

కవి పరిచయం

చమత్కారయుతం... ఖాన్ కవిత్వం

కలం నిండి చమత్కారం, హృదయం నిండా సంస్కారం, చేతనలో సహకారం, తనువంతా ఉపకారతనం, అక్షరాల్లో పొదపరితనం వున్న కవి ఎం ఖాదర్‌ఖాన్. ఎవరి అనుమతి, ఆసరా లేకుండా పాఠకుల హృదయ సీమల్లోకి వెళ్లిపోయిన కవి. ఉర్దూ మాధ్యమంలో చదివే ముస్లిం కుర్రాళ్ల మధ్య తెలుగు మాధ్యమంలో ముస్లిం కుర్రాడు చదవడం విశేషం. అయితే పదకొండు మంది ఉర్దూ మీడియం విద్యార్థుల్లో ఒక్కడు2తెలుగు మాధ్యమంలో చదవడం గొప్ప విషయం. తెలుగు మీద, తెలుగు నుడికారం మీద ప్రాథమిక స్థాయిలోనే అవ్యాజమైన మమకారం ఏర్పడి పోయింది.
ఇలా చెప్పాలంటే ఆనాటి ఉపాధ్యాయుల ప్రభావం మరింత ఉందనే చెప్పాలి. వేదుల సత్యనారాయణ శర్మగారి ఆధ్వర్యంలో బాలకవి సమ్మేళనం జరిగేది. దానికి పది పంక్తుల్లో ఖాన్ కవిత రాసి పట్టుకెళితే నువ్వే రాశావా2అన్న మాస్టారు అనుమానం మరింత కసిని పెంచింది ఖాన్ గారిలో. ముస్లిం ఇంత చక్కగా రాస్తాడా అన్న అనుమానం అది. దానికి వెంటనే మరో కవిత రాసి తనలోని కవితావేశాన్ని చాటి చెప్పారు. ఆయన అభిరుచిని గమనించిన శర్మ మాస్టారు బాలకవి సమ్మేళనానికి కన్వీనర్‌ను చేశారు. కవిత్వ పోకడలకు అలా అంకురార్పణ జరిగిపోయింది తణుకులో. తెలుగు భాషా సంఘం అధ్యక్షులుగా చేసిన నండూరి రామకృష్ణాచార్యులుగారు తాడేపల్లిగూడెం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్. అదే కాలేజీలో చదువుతున్న ఖాన్ తెలుగు భాషాభిమానం ఎలా వుంటుందో చెప్పనవసరం లేదు. ఆయన ఆసక్తికి తగ్గట్టుగా కాలేజీ మ్యాగజైన్‌లో సభ్వత్యం కల్పించారు.
వచన కవితలోని వెసులుబాటును పట్టుకొన్న ఖాన్‌గారికి భిన్నంగా రాయడం నేర్పించింది సేతుమాధవస్వామి మాస్టారు. ఆయన తనను ముద్దుగా ‘ఖాన్ శాస్ర్తీ’ అని పిలిచేవారని ముచ్చటపడి చెప్పారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా ప్రతిస్పందించి రాయడం ఖాన్‌గారిలోని ప్రత్యేకత. బొంబాయి పేలుళ్లు జరిగిన తర్వాత ఆయనలోని ఆవేదనకు అక్షర రూపం. 3‘మా మాతృభూమిలో మా సోదరుల ముందు మీ వలన మేము సిగ్గు పడుతున్నాం. మీరు చేస్తున్నది మీ అభిమతం. అది మా మతం కానేకాదు. అదే మతం అయితే ఆ మతంలో మేము లేము, రాము’ అంటారు. ఆయనలోని భారతీయతకు అద్దంపట్టే ఈ పాదాలు 3‘మీరు ముస్లింలే కాదు, మీరు మనుషులే కాదు, మిమ్మల్ని చూసి సైతాను కూడ సిగ్గు పడతాడు’ అని ఈసడిస్తాడు. బొంబాయి పేలుళ్లు జరిగినపుడు ఆయన తన కుమారుని వద్ద వున్నారు. ఆ సంఘటన చూసిన ఆయన చాలా చలించిపోయారు. ఈ విషయాలను కథనాల రూపంలో ఇక్కడ పత్రికలకు అందించారు. ఉగ్రవాద దాడుల మీద ఆ నాటి హృదయ విదారకరమైన సంఘటన మీద చక్కటి కథనాలు అందించారు. కుమారుడు మీడియాలో పనిచేయడం వలన జర్నలిస్టు మిత్రుల సహకారంతో కళ్లారా చూసి వాటిని అక్షరబద్ధం చేశారు. తనను కలచి వేసిన సంఘటన గురించి చెప్తూ ఓ కానిస్టేబుల్ ఆయుధం లేకుండా ఎదిరించాడంటారు. ఉగ్రవాదుల అత్యంత ఆధునిక ఆయుధాల ముందు మన వాళ్ల వెపన్స్ ఎంతవంటారు. అయినా ఎంతో సాహసోపేతంగా పోరాడారంటారు. తూర్పు గోదావరి జిల్లాలో పుట్టి కవిగా ఖ్యాతి అయ్యారు కాని రాజమండ్రికి గర్వకారణమైనారు. ఇక్కడ చాలామందికి ఆయనతో ఉన్న అనుబంధమే ఆ కారణం.
వృత్తిరీత్యా పోస్టుమాస్టరుగా ఉద్యోగించిననాళ్లు ఆయన చాచిన స్నేహహస్తాన్ని అప్యాయంగా అందుకున్నారు ఖాన్‌గారు. కవిగానే కాదు హాసం క్లబ్ నిర్వాహకునిగా ఎందరికో పరిచయం. వైద్యో నారాయణో హరిః అన్నది ఆర్యోక్తి. దాని మీద ఓ కవిత రాసి డాక్టర్లను ఏకి పారేశారు. అశ్లీలత లేకుండా హాస్యాన్ని పండించడం ఎంత ఇష్టమంటే ఐదేళ్ల పాటు హాసం క్లబ్‌ను నడిపించడమే. ఎవీ అప్పారావు, డివి హనుమంతరావులతో ప్రతి నెల మూడో ఆదివారం నవ్వుల పంటను పుష్కలంగా పండించారు. హాసం... ఆ లాస్యంతో పదికాలాలు గుర్తుండిపోయేలా సినీ రచయిత, నటుడు రావికొండలరావు, సినీ రచయిత భమిడిపాటి రాధాకృష్ణలతో వార్షికోత్సవ ఉత్సవాన్ని సంబరంగా నిర్వహించారు.
మక్కాను మూడుసార్లు దర్శించుకున్న ఖాన్ సామరస్యానికి ప్రతీక అంటే ఆశ్చర్యం కాదు. బాబ్రీ మసీదు తీర్పుకు ముందు దివాన్‌చెరువు శర్మగారు ఖాన్‌గారు ‘కల్సిపోవాల్సింది ఈ మట్టిలోనే, మనమంతా ఒక్కటే’ కవితలతో రెండు వందల కాపీలు పంచి పెట్టడం సామరస్య నిదర్శనం. పోస్టుమాస్టారికం నుండి విశ్రాంతి జీవితాన్ని రాజమండ్రి ప్రకాష్‌నగర్‌లో గడుపుతున్నప్పటికీ రచనా వ్యాసాంగాన్ని ఆపలేదు. ఆయను అనుభవాలను అక్షరీకరించి పలు పత్రికలకు వ్యాసాలు అందిస్తున్నారు.

- రవికాంత్, 9642489244

అశ్లీలత లేకుండా హాస్యాన్ని
పండించడం ఖాన్‌గారికి ఎంతో ఇష్టం. దీనికి నిదర్శనం ఐదేళ్ల పాటు హాసం క్లబ్‌ను నడిపించడమే. కవిగానే కాదు హాసం క్లబ్ నిర్వాహకునిగా
ఎందరికో పరిచయం.

చిన్న కథ

ఏం బతుకులు

హరివిఠల్, శివశంకరం ఒకేసారి రిటైరయ్యారు. డబ్బు చేతికి వచ్చింది. పెన్షన్ కూడా బాగానే వస్తుంది. ఏంచేస్తే బాగుంటుంది?
‘బాబా గుడిలో నిత్యాన్నదానం..’
‘ఆ పని ఇప్పటికే చాలామంది మొదలుపెట్టేరు’
‘కొందరు ముష్టివాళ్లు అక్కడ తిని, అడుక్కుంది దోచుకుంటారు. ఒకడు పోస్టల్లో మా అబ్బాయి దగ్గర నాలుగు లక్షలు దాచాడు తెలుసా...’
‘కొందరు ఉచితంగా వస్తే తిని తొంగొని బేవార్స్ గాళ్లయి, అనారోగ్యం పాలవుతున్నారు. మనం ఒక ఆశ్రమం ‘సి’ ఆకారంలో నిర్మిద్దాం. అందులో ఇరవై గదులు, అరవై దాటిన వారికే ప్రవేశం. రిటైర్డ్ ఉద్యోగులైతే ఆరువేలు కట్టాలి. వంటవాడికి, అసిస్టెంట్‌కి పదివేల జీతం నేనిస్తాను. రోజూ వచ్చి చూసే రిటైర్డ్ గవర్నమెంట్ డాక్టర్‌కి పదివేలు నువ్వు ఇవ్వు.’
‘సీనియర్ సిటిజన్స్ కొందరికి ఇరవై వేలకి పైగా పెన్షన్.. అయినా వారికి ఇంట్లో విలువ, ప్రశాంతత వుండవు. అటువంటివారికి మన ఆశ్రమం స్వర్గ్ధామమే.’
‘అయితే రేపే మనం స్థలసేకరణ చెయ్యాలి. లేకపోతే వచ్చిన డబ్బుని మనవాళ్లే లాగేస్తారు. ఇవ్వకపోతే బంధాలు కట్!’ నవ్వుతూ అన్నాడు విఠల్.
మరునాడు పార్క్‌లో ఇద్దరూ కలిశారు. ఇద్దరి ముఖాల్లో దిగులు, విచారం.
‘ఏమైందిరా?’
‘ఇంటికెళ్లేసరికి నా మనవడు వచ్చాడు. నా దగ్గర నలభై లక్షలుంది, నువ్వొక ఇరవై సర్దితే అందమైన అపార్ట్‌మెంట్ కొనుక్కుని.. నీ పేరే పెడతానంటూ చెక్‌బుక్ తెచ్చి ఇచ్చాడు. నా కొడుకు వాడికి మద్దతిచ్చాడు’
‘ఏడాది క్రితం డా. ప్రభాకర్‌ని పెళ్లాడి నమ్మిన నా మనవరాలు ఎన్నడూ నన్ను మనసారా తాతయ్యా అని పిలిచింది లేదు. ఎలా తెలిసిందో... నాకు డబ్బు వచ్చిందని! భర్తతో పాటు వచ్చింది. వాళ్ల హాస్పిటల్‌లో నాలుగు గదులకి, ఎసి రూంలకి ఇరవై లక్షలు సర్దమంది. రోజుకి వెయ్యి రూపాయలు వస్తుందట. ఏడాదిలో నీ డబ్బు తిరిగిచ్చేస్తానంది. దానికి నా కోడలు వత్తాసు పలికింది. నా కొడుకు వంక చూశాను.
నువ్వు చిక్కుకుంది సాలెగూటిలో.. నేను పాతికేళ్ల క్రితమే! ఇప్పటికీ బయటికి రాలేకపోతున్నా... నీవల్ల ఏవౌతుంది? అన్నట్లు వుంది వాడి చూపు. నావంక జాలిగా చూస్తున్నాడు. కోడలితో గొడవపడి నెగ్గడం కల్ల! అందుకే మనవరాలికి అడిగినంత ఇచ్చా. తిరిగి వస్తుందని నమ్మకం లేదు. ఇప్పుడు మనలో ఎవరికైనా ఏదైనా పెద్ద రోగం వస్తే హాస్పిటల్ ఖర్చులకి సరిపడా డబ్బు కూడా లేదు. మొన్న జగపతికి హాస్పిటల్‌నించి వచ్చేసరికి ఇరవై ఆరు లక్షలు అయిందట. మనలో ఎవరికి కిడ్నీ చెడినా రెండోవారు ఇవ్వాలి. పనికి వస్తాయో లేదో? కనుక్కుందాం రారా’ అన్నాడు విఠల్.
ఏం బతుకులు..? మన డబ్బు మనకు నచ్చిన విధంగా ఖర్చు చేసుకునే స్వేచ్ఛలేదు- నిట్టూర్పు విడిచాడు శివశంకరం.

మనోగీతికలు

శ్రావణ మాసపు సందడి
ఎంతో ఆహ్లాదం హైందవ సంస్కృతి
శ్రావణ మాసంలో సందడి సోయగాల నిధి
శ్రావణాన్ని స్వాగతిస్తూ ఆషాఢం నిష్క్రమిస్తుంది
శృంగార కళల్ని ప్రోది చేసుకుని శ్రావణం శోభిల్లుతుంది!

ప్రతీ ఇల్లూ తనరారు పచ్చని తోరణాలతో
జడలు నిండిన పూలతో గోరింటాకు అరుణిమల మెరుపులతో
‘స్తీ’లేకుంటే శోభ/సిరి లేదని తుళ్లిపడుతూ
చూపుల శరములతో జవరాండ్రు చతురిమచూపుతారు!

కలువ కన్నుల కల భామినులు కలువ పూలుకొంటూ
‘పత్రి’ బేహారులతో బేరమాడు దృశ్యాలు బహుహృద్యమం
పచ్చని మిసమిసలు పొదుపుకున్న పడతులు ముసిముసినగవులతో
కాంతలు కొత్త చీరలు కట్టి సృష్టించారు నవ్యకాంతుల ధామం!

గాజుల గలగలతో ఆభరణాలు అలంకారాలతో
రాగరంజితం చేస్తారు హృదయాల్ని రాయంచల్లా తిరుగుతూ
ముచ్చటగొల్పు రంగవల్లులు తీర్చుతూ రమణులు రక్తి చూపుతారు
సౌందర్య ప్రేమికుల కన్నులు మాత్రమే/సొగసుల రహస్యాన్ని స్పృశిస్తాయి!

అగరు పొగల సుగంధ ద్రవ్యాలతో
తమ అందచందాలను హారతులిస్తూ
పారిజాత పుష్పాల్లా! పరిగ్రహించు ప్రేమ రాణుల్లా
భువికి దిగిన అప్సరసలా! అన్నట్టు దిగ్భ్రాంతి పర్చారు!

పిండివంటలు ప్రియముగా బరవసంగా
వడ్డిస్తుంటే డెందం అనురాగ డోలికవుతుంది
మన సంస్కృతికి సాంప్రదాయాలకు పట్టుగొమ్మలు స్ర్తిలు
స్ర్తిని గౌరవించు చోట నిలుస్తాయి శాంతి సౌభాగ్యాలు!

- మల్లిమొగ్గల గోపాలరావు, సెల్ నెం: 98857 43834

మేలుకొలుపు
మానవుడా నిద్రమేలుకో!
ఓసారి వెనుతిరిగి గతాన్ని చూసుకో!
పొందింది ఏమిటో!
పొగొట్టుకున్నదేమిటో!
తరచి చూసుకో!
తప్పు దిద్దుకో!

పెరుగుతూ పొగొట్టుకుంటున్నావ్ నీలో పసితనాన్ని
ఆర్పేసుకుంటున్నావు నీలోని అమాయకత్వాన్ని
మానవత్వానికి ముసుగు వేసి దానవత్వంలో ఆనందిస్తున్నావ్
జాలిని తుడిచివేసికొని జాలిగా జీవితాన్ని గడిపేస్తున్నావ్
మమతను నిద్రపుచ్చి మైకంలో కొట్టుకుంటున్నావ్
మార్థవాన్ని తరిమేసి గార్థ్భంలా మారిపోతున్నావ్
మంచికి సమాధి కట్టేసి వంచనతో జీవిత అంతస్తులు కట్టుకుంటున్నావ్

ఆగ్రహించకు
అబద్ధాల అంతస్తులు అట్టేకాలం నిలువవు
నిజము ఎప్పటికైనా వెలికిరాక మానదు
అందుకే నీచుట్టు ఉన్న చీకటిని ఛేదించు
మనసున్న మనిషిలా జీవించు

- రామలింగేశ్వరరావు.పి, రాజమండ్రి

ఎర్ర నీళ్ళు
అమ్మ గోదావరి
అప్పుడే రంగులద్దిన
ఎర్రటి నేతచీర
కట్టుకుంది కాబోలు!
కురిసిన వానజల్లుల్లో
తడిసి ముద్దయింది
రంగుదిగిన నీళ్ళు
నదిలా ప్రవహిస్తున్నాయి
ఎర్రనీటి గోదావరి
చూడ ముచ్చటైంది!

- ఎస్.ఆర్. పృధ్వి,
రాజమండ్రి

విద్యాలయం అంటే...
కేవలం విద్యను బోధించేది
పాఠాలను అవగాహన చేసి
పరీక్షలు నిర్వహించేది మాత్రమే
కాకుండా...
విద్యార్థుల అభివృద్ధికి, నైతిక విలువలకు
గుణశీల నిర్మాణాలకు వరం కావాలి!
ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ప్రక్రియ కళ
పవిత్ర విద్యాలయాల నుండి ఆరంభం కావాలి!
నిర్భయ2 అమానుష వృత్తాంతాలు...
పునరావృతం కాకుండా విద్యాలయాలు...
వెలుగు వేదికలు కూడా కావాలి!

- జోగిమహంతి సుధాకర్ పట్నాయక్, కాకినాడ, సెల్: 9399929619

.............................................................
email: merupurjy@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు..
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. merupurjy@andhrabhoomi.net

వెంటాడే పద్యం
english title: 
rajahmundry
author: 
- గోనుగుంట మురళీకృష్ణ, సెల్ నెం: 9701260448

ఏం బతుకులు (చిన్న కథ )

$
0
0

హరివిఠల్, శివశంకరం ఒకేసారి రిటైరయ్యారు. డబ్బు చేతికి వచ్చింది. పెన్షన్ కూడా బాగానే వస్తుంది. ఏంచేస్తే బాగుంటుంది?
‘బాబా గుడిలో నిత్యాన్నదానం..’
‘ఆ పని ఇప్పటికే చాలామంది మొదలుపెట్టేరు’
‘కొందరు ముష్టివాళ్లు అక్కడ తిని, అడుక్కుంది దోచుకుంటారు. ఒకడు పోస్టల్లో మా అబ్బాయి దగ్గర నాలుగు లక్షలు దాచాడు తెలుసా...’
‘కొందరు ఉచితంగా వస్తే తిని తొంగొని బేవార్స్ గాళ్లయి, అనారోగ్యం పాలవుతున్నారు. మనం ఒక ఆశ్రమం ‘సి’ ఆకారంలో నిర్మిద్దాం. అందులో ఇరవై గదులు, అరవై దాటిన వారికే ప్రవేశం. రిటైర్డ్ ఉద్యోగులైతే ఆరువేలు కట్టాలి. వంటవాడికి, అసిస్టెంట్‌కి పదివేల జీతం నేనిస్తాను. రోజూ వచ్చి చూసే రిటైర్డ్ గవర్నమెంట్ డాక్టర్‌కి పదివేలు నువ్వు ఇవ్వు.’
‘సీనియర్ సిటిజన్స్ కొందరికి ఇరవై వేలకి పైగా పెన్షన్.. అయినా వారికి ఇంట్లో విలువ, ప్రశాంతత వుండవు. అటువంటివారికి మన ఆశ్రమం స్వర్గ్ధామమే.’
‘అయితే రేపే మనం స్థలసేకరణ చెయ్యాలి. లేకపోతే వచ్చిన డబ్బుని మనవాళ్లే లాగేస్తారు. ఇవ్వకపోతే బంధాలు కట్!’ నవ్వుతూ అన్నాడు విఠల్.
మరునాడు పార్క్‌లో ఇద్దరూ కలిశారు. ఇద్దరి ముఖాల్లో దిగులు, విచారం.
‘ఏమైందిరా?’
‘ఇంటికెళ్లేసరికి నా మనవడు వచ్చాడు. నా దగ్గర నలభై లక్షలుంది, నువ్వొక ఇరవై సర్దితే అందమైన అపార్ట్‌మెంట్ కొనుక్కుని.. నీ పేరే పెడతానంటూ చెక్‌బుక్ తెచ్చి ఇచ్చాడు. నా కొడుకు వాడికి మద్దతిచ్చాడు’
‘ఏడాది క్రితం డా. ప్రభాకర్‌ని పెళ్లాడి నమ్మిన నా మనవరాలు ఎన్నడూ నన్ను మనసారా తాతయ్యా అని పిలిచింది లేదు. ఎలా తెలిసిందో... నాకు డబ్బు వచ్చిందని! భర్తతో పాటు వచ్చింది. వాళ్ల హాస్పిటల్‌లో నాలుగు గదులకి, ఎసి రూంలకి ఇరవై లక్షలు సర్దమంది. రోజుకి వెయ్యి రూపాయలు వస్తుందట. ఏడాదిలో నీ డబ్బు తిరిగిచ్చేస్తానంది. దానికి నా కోడలు వత్తాసు పలికింది. నా కొడుకు వంక చూశాను.
నువ్వు చిక్కుకుంది సాలెగూటిలో.. నేను పాతికేళ్ల క్రితమే! ఇప్పటికీ బయటికి రాలేకపోతున్నా... నీవల్ల ఏవౌతుంది? అన్నట్లు వుంది వాడి చూపు. నావంక జాలిగా చూస్తున్నాడు. కోడలితో గొడవపడి నెగ్గడం కల్ల! అందుకే మనవరాలికి అడిగినంత ఇచ్చా. తిరిగి వస్తుందని నమ్మకం లేదు. ఇప్పుడు మనలో ఎవరికైనా ఏదైనా పెద్ద రోగం వస్తే హాస్పిటల్ ఖర్చులకి సరిపడా డబ్బు కూడా లేదు. మొన్న జగపతికి హాస్పిటల్‌నించి వచ్చేసరికి ఇరవై ఆరు లక్షలు అయిందట. మనలో ఎవరికి కిడ్నీ చెడినా రెండోవారు ఇవ్వాలి. పనికి వస్తాయో లేదో? కనుక్కుందాం రారా’ అన్నాడు విఠల్.
ఏం బతుకులు..? మన డబ్బు మనకు నచ్చిన విధంగా ఖర్చు చేసుకునే స్వేచ్ఛలేదు- నిట్టూర్పు విడిచాడు శివశంకరం.
- వి సాయదుర్గ, ముత్యాలంపాడు, విజయవాడ.

వెంటాడే పద్యం

నిరాడంబరులు కోటికొక్కరు!

సిరికిం జెప్పడు శంఖచక్రయుగముం జేదోయి సంధింపడే
పరివారంబునుం జీరడభ్రగపతి బన్నింప డాకర్ణికాం
తర థమ్మిల్లము జక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన న్వీడడు గజ ప్రాణావనోత్సాహియై
ఈ పద్యం మహాకవి పోతన రచించిన భాగవతంలోని ‘గజేంద్ర మోక్షం’ ఘట్టం లోనిది. ఏనుగుల గుంపు అడవిలో తిరుగుతూ అలసిపోయి దాహం తీర్చుకోవటానికి ఒక మడుగులోకి దిగాయి. ఇంతలో మడుగులోని మొసలి తటాలున పైకి వచ్చి ఒక ఏనుగు కాలు ఒడిసి పట్టుకుంది. నీటి కల్లోలానికి మిగిలిన ఏనుగులన్నీ చెల్లాచెదురయ్యాయి. మొసలి చేతికి చిక్కిన ఏనుగు తొండంతో కొట్టింది. దంతాలతో పొడిచింది. భీకరంగా యుద్ధం చేసింది. ఆ యుద్ధం ఎన్నోరోజులు నిర్విరామంగా జరిగింది. కానీ నీటిలో ఉన్నప్పుడు మొసలికి బలం ఎక్కువ. స్థానబలం చేత అది ఏనుగు కాలు విడిచిపెట్టలేదు. గజేంద్రుడికి శక్తి సన్నగిల్లింది. ప్రాణాలు ఎగిరిపోయేటట్లు ఉన్నాయి. మూర్ఛ వచ్చేటట్లు ఉంది. ఇక ‘స్వామీ! నువ్వే దిక్కు. నువ్వుతప్ప నాకు ఇంకెవరూ లేరు. రక్షించు’ అంటూ విష్ణుమూర్తిని ప్రార్థించింది. ఆ సమయంలో విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవితో కలిసి వనవిహారం చేస్తున్నాడు. గజరాజు ప్రార్థన వినబడింది. అప్పుడు విష్ణుమూర్తి గజేంద్రుడి ప్రాణం కాపాడటానికి ఈవిధంగా వస్తున్నాడు- అని పోతన ఈ పద్యంలో వర్ణించాడు. ఏవిధంగా అంటే - చివాలున లేచాడు. లక్ష్మీదేవితో వెళుతున్నానని చెప్పలేదు. శంఖం, చక్రం వంటి ఆయుధాలు ధరించలేదు. ఏ పరివారాన్నీ వెంటరమ్మని అనలేదు. తన వాహనమైన అభ్రగపతిని (గరుత్మంతుడిని) పిలవలేదు. చెదిరి చెవుల మీద పడుతున్న తలవెంట్రుకలను సరిచేసుకోలేదు. లక్ష్మీదేవి చీర చెంగు తన చేతిలో చిక్కుబడిన సంగతి గమనించలేదు. పరుగున వెళ్లసాగాడు.
అలా పరుగున వెళ్లి మొసలిని వధించి ఏనుగును రక్షిస్తాడు. అదంతా తర్వాత కథ. ఈ పద్యం రాసే సమయంలో శ్రీనాధుడు పోతన ఇంటిలోనే ఉన్నాడు. శ్రీనాధుడు పోతన చెల్లెలి భర్త. ఆయన కూడా గొప్ప పండితుడే. కానీ శ్రీనాధుడు భోగి. పోతన యోగి.
‘ఇంత కవిత్వం వచ్చినవాడివి నీ కావ్యాన్ని ఏ మహారాజుకైనా అంకితం ఇస్తే కోరినంత ధనం ఇస్తాడు కదా! వ్యవసాయం చేసుకునే పని, ఈ దారిద్య్ర బాధ తప్పుతుంది’ అని శ్రీనాధుడు సలహా ఇస్తే పోతన అంగీకరించలేదు. అందువల్ల పోతన పట్ల శ్రీనాధుడికి కొంచెం తక్కువ భావం ఉంది. ఎలాగైనా చిన్నబుచ్చాలనే ఉద్దేశ్యంతో ఈ పద్యాన్ని విని ‘ఏమిటీ! విష్ణుమూర్తి ఆయుధాలు ధరించలేదా? పరివారాన్ని వెంట తీసుకువెళ్లలేదా! ఏమీలేకుండా వెళ్లి ఏంచేస్తాడు? చోద్యం చూస్తాడా?’ అని గేలి చేశాడు.
పోతన అప్పటికి వౌనం వహించాడు. ఆ మర్నాడు శ్రీనాధుడు తలస్నానం చేస్తున్న సమయం చూసి ఆయన ఐదేళ్ల కొడుకుని పోతన దాచిపెట్టి, పెద్ద బండరాయి తెచ్చి బావిలో వేశాడు. ‘్ఢం’ అని శబ్దం వచ్చింది. ‘బావా! నీ కుమారుడు బావిలో పడిపోయాడు’ అంటూ అరిచాడు.
‘అయ్యో! ఎక్కడ? ఎక్కడ?’ అంటూ శ్రీనాధుడు కంగారుగా వచ్చాడు. ‘స్నానం చేస్తూ మధ్యలో వచ్చావేమయ్యా! కుంకుడు రసం, ముఖం నిండా నురగ ఎలా కారుతుందో చూడు. శుభ్రంగా స్నానం చేసి, తల దువ్వుకుని, పట్టు పీతాంబరాలు కట్టుకుని రాకూడదా! చేతిలో తాడు ఏదీ? బక్కెట ఏదీ? ఏమీలేకుండా వచ్చి ఏంచేస్తావు? చోద్యం చూడటానికి వచ్చావా?’ అన్నాడు పోతన.
శ్రీనాధుడి ముఖం వెలవెలా పోయింది.
‘వెర్రి బావా! నీ కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే నీవు ఎంత ఆత్రుతతో వచ్చావో, భగవంతుడు కూడా తన భక్తులు ఆపదలో ఉన్నారని తెలిస్తే అలాగే వస్తాడయ్యా! భగవంతుడికి సృష్టిలోని ప్రాణికోటి అంతా బిడ్డలతో సమానమే. నీ కుమారుడికి ఎలాంటి ఆపదా రాలేదు. క్షేమంగా ఉన్నాడు. నీకు అర్థం కావటానికే ఇలా చేశాను’ అన్నాడు పోతన. శ్రీనాధుడు సిగ్గుతో తలదించుకున్నాడు.
భాగవతంలోని ఒక్కో పద్యం ఒక్కో రసగుళిక వంటిది. అంతటి గొప్ప కావ్యాన్ని రచించిన పోతన వ్యవసాయం చేసుకుంటూ జీవితం గడిపాడు. ఏ మహారాజుని ఆశ్రయించినా ఆయన పాండిత్యానికి కనకవర్షం కురిపించేవారు. కానీ ఆయన సిరి సంపదలను ఆశించక తన కావ్యాన్ని శ్రీరాముడికి అంకితమిచ్చాడు.
డబ్బుకి ప్రాధాన్యతనిచ్చే నేటికాలంలో ప్రతిఒక్కరూ పోతన చరిత్రను తెలుసుకోవాలి. డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా నిరాడంబరంగా గడిపేవారు ఇప్పడు కూడా నూటికో, కోటికో ఒక్కరుంటారు. అలాంటి వారు ఇతరుల ప్రశంసలు ఆశించరు. కంచు మోగినట్లు కనకము మోగదు కదా!
- గోనుగుంట మురళీకృష్ణ,
రేపల్లె, సెల్ నెం: 9701260448

పుస్తక సమీక్ష
అలా చదివి.. ‘ఇలా ఉందాం’!
నేటి సాంకేతిక యుగంలో మానవుడు తనకే తెలియని ఒకలాంటి అయోమయంలో అత్యంత కష్టంగా, అసంతృప్తితో జీవిస్తున్నాడు. సామాన్య మానవుడి నుండి సినిమా హీరోల వరకు కూడా ఈ ప్రపంచంలో పోటీతత్వాన్ని తట్టుకోలేక జాతకాన్ని నమ్ముకోవాలా? దైవానే్న నమ్ముకోవాలా? చేతికి పెట్టుకునే ఉంగరాన్ని, ఉంగరంలోని రాళ్లను నమ్ముకోవాలా? లేకపోతే పేరులో అక్షరాల్ని మార్చుకోవాలా? కష్టాన్ని నమ్ముకుని బతకాలా? అదృష్టాన్ని నమ్ముకుని బతకాలా? అసలు ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే బతుకుబండిని ఎలా నడిపించాలి? ఎలా ఉండాలి? ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎవరితో ఎలా ప్రవర్తించాలి?.. ఇలా సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలు, సందేహాలతో సతమతమవుతున్నాడు. వీటికోసం కొన్ని వేల రూపాయలు ఖర్చుపెట్టి ప్రస్తుతం వికాస తరగతులకు హాజరవుతున్నాడు. ఎంతో డబ్బు ఖర్చుపెట్టి రంగురంగుల రాళ్లు ధరిస్తున్నారు. పేరులో అక్షరాలు మార్చుకుంటున్నాడు. కానీ ఎన్ని మార్చినా మానవునిలో మాత్రం మార్పు కానరావటం లేదు. ఎలా బతకాలో అర్థంకావడం లేదు. వీటన్నింటికీ సమాధానాలు తెలియజేస్తూ కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రాంతవాసులైన ప్రముఖ రచయిత, సాహితీ విశే్లషకులు, కథ, గేయం, వచన కవిత, పద్యం, పాట, వ్యాసం.. ఇలా అన్ని ప్రక్రియల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న అలుపెరుగని కలం యోధుడు భట్రాజు శ్రీనివాసగాంధి తనదైన శైలిలో పదునైన పద్యాలతో ఆలోచనాత్మక, ఆచరణాత్మక అంశాలెన్నింటినో ‘ఇలా ఉందాం’ అనే శీర్షికన పద్య శతకాన్ని మనకి అందించారు. ఈ కావ్యంలో మనకు కావలసిన సామాజిక, నైతిక విలువలను తెలియజేస్తూ అద్భుతమైన కంద పద్యాలను రచించారు.
ఈ సృష్టి మనుగడకు కారణమైన తల్లిదండ్రులను గౌరవించాలి అంటూ అమ్మను నాన్నను విడువకని చెపుతూ..

నెమ్మిని పంచుట మరవకు, నిజమగు దాతల్
ఇమ్మహినగుదురు వారే!
కమ్మని ప్రేమలు ఒసగెడికన్పడు సురలే!
అమ్మను మరవకు. అమ్మ నేర్పిన కమ్మనైన తెలుగును మరువకు.
మాతృభాష మనలను నడిపించు మాన్యులుగా అంటూ -
కమ్మని తెలుగు మరవకు
అమ్మలు పలికిన తెలుగది అమ్మలమించున్
అమ్మ పలుకులు మధురమై
చిమ్మును తేనెలరుచులని చెప్పగ వినవే!
ఈ సమాజంలో బతకటం ఎంత కష్టమైనా, బాధైనా భయపడకు, నిజం చెప్పు. నిజం నిలకడగా గెలుపునిస్తుంది అంటూ -
నిజమును చెప్పుట శుభమగు
నిజమును దాచిన అశుభము: నీతియు చెడులే!
నిజమే చివరకు గెలుచును
నిజమొక వ్రతమని తలచుము నిక్కముగానే!
ఈ కాలంలో కాలాన్ని వృధాచేయక సమయాన్ని సరైనవిధంగా, మాటను మర్యాదగా పలకాలి. ఇలాచేస్తే ఎలాంటి అవరోధాలు రాకపోగా త్వరగా విజయాన్ని సాధించవచ్చునంటూ -
గడిచిన కాలము రాదిక,
విడచిన మాటలు మరలవు వీడును త్వరగా
విడువక మునుపె కనుగొనుము
కడకు కుములుటేలనోయి కాదనగలవా?
ఈ ప్రకృతిలోని ప్రతి జీవికి ప్రాణాధారమైన నీటిని వృథా చేయకు. నేటి ప్రపంచంలో నీటికోసమే యుద్ధాలు జరుగుతున్నాయి. దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య నీటి కోసం ఘర్షణలు జరుగుతున్నాయి. కనుక నీటిని కాపాడుకోండి అంటూ -
నీరే ప్రాణాధారము
నీరే జగతిని నిలుపును నిత్యము; ఇకపై
నీరును వృథగా చేయకు
నీరును ముందుతరములకు నిలువుంచుమురా!
మనిషిగా జన్మించిన మనం తోటివాడిని మనిషిగా చూసినప్పుడే జీవితానికి అర్థం, పరమార్థం. మనిషిలోని మంచితనాన్ని గుర్తించు. మనుగడ సాగించు అంటున్నారు కవి.
మనిషిని మనిషిగ చూడుము
మనిషికి మానవతగలదు మరువకుదానిన్
మనిషికి చెలిమిని పంచుము
మనుషులలోనకల మంచి మాపకు మెపుడున్!
ఇలాంటి మనిషికి, ప్రకృతికి, ఈ ప్రపంచానికి సంబంధించి అనేక అంశాలను వివరిస్తూ ఈ శతకాన్ని రచించారు కవి గాంధీగారు.
నేటి సమాజంలోని ప్రతి ఒక్కరికీ వారి జీవితాల అభివృద్ధికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ రచయతకు అక్షర నమస్సుమాంజలితో అభినందనలు తెలియజేస్తూ మరిన్ని రచనలు ఆశిస్తున్నాను.

- పూసపాటి వేదాద్రి,
జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా.
సెల్ నెం: 9912197694

మనోగీతికలు

చిట్టి గులాబీలు..
అప్పుడే విరబూసిన తోటలోని సుమాలు
అందమైన గులాబీలు
అరవిరిసిన మల్లెలు
పసిడివనె్నల చేమంతులు
రంగురంగుల ముద్దబంతులు
కదంబమాలగా కలిసి
చదువుల తల్లి
సరస్వతీ ఒడిలో చేరాలని
చిలుకపలుకుల చిన్నారుల్నీ
అమ్మఒడిని వీడలేక
నాన్న చేరువకు దూరమై
దిగులు ముఖాలకు
చిరునవ్వులంటించుకొని
టాటా.. బైబైలు చెప్పిన బుడతకీచులు
మోయలేనంత బరువు భుజాన వేసుకొని
కల్లాకపటం తెలియని బాల్యమిత్రులంతా
బడిబాట పట్టారు
మృత్యుశకటమని తెలియని
నాలుగు చక్రాల వాహనంలో
నవ్వుతూ తుళ్ళుతుంటే
ఓర్వలేని కాలం
రైలుబండి రూపంలో ఊపిరితీసింది
అక్షరాలు దిద్దుకొని
రేపటి పౌరులు కాబోతున్న బాలల్ని
రెక్కలు విరియకుండానే మొగ్గల్ని తుంచేసి
కొమ్మ నుంచి పూవుల్ని వేరుచేసినట్లు
కన్నపేగు బంధాన్ని కనికరం లేకుండా తెంపింది
కడుపుకోతకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చి
జీవితమంతా కుమిలికుమిలి ఏడ్వాలని
కడవలకొద్దీ కన్నీళ్లనిచ్చి
ఈ జన్మకి మీతో రుణం తీరిపోయిందని
చెప్పకుండానే వెళ్లిపోయిన చిన్నారులు
పెంచుకొన్న ప్రేమ తడి ఆరనే లేదు
పంచుకున్న మమతానురాగాలు
రుచిచూడకుండానే
మృత్యువు కబళిస్తుందని తెలియక
ఆ ప్రయాణం అంతిమ పయనమై
చిన్నారి మొగ్గల్నీ చదిమేసిన రైలుబండి
నిత్యశోకం మిగిల్చి కాటువేసింది
తనివి తీరకుండానే తలపుల్లో
గూడుకట్టుకొన్న విషాద వలయాలు
అంగవైకల్యంతో పడి ఉన్న మృత్యుంజయులు
ఏం పాపం చేశారని ఈ పసిమొగ్గలపై కక్ష
ఏ నేరం చేయకుండానే ఎందుకు వీళ్లకీ శిక్ష
ఘోరకలిలో బలైన చిన్నారులూ..
మీకిదే అక్షరాంజలి!

- తాటికోల పద్మావతి,
గుంటూరు.
సెల్ నెం: 9441753376

కన్నోళ్లు.. బాబోయ్!
పిల్లలందరూ సమానం అంటూనే
ఆడపిల్లల పట్ల వివక్ష చూపుతారు
మగపిల్లాడు ఫ్యాషన్ దుస్తులేస్తే
అదుర్స్ అంటారు
ఆడపిల్లైతే సంప్రదాయ దుస్తులే
ధరించాలంటారు
మగపిల్లాడు పరీక్ష తప్పితే
గట్టి ట్యూషన్ పెట్టి చదివిస్తారు
ఆడపిల్ల అయితే చదివింది చాలిక
ఏ అయ్యకో ముడిపెట్టేద్దాం అంటారు
మగపిల్లాడు క్లబ్బులు, పబ్బులకు వెళ్తే
ఈ వయసులో ఎంజాయ్ చెయ్యకపోతే
ముసలితనంలోనా అని లైట్‌గా తీసుకుంటారు
ఆడపిల్లైతే దీనికి బాగుపడే లక్షణాలు
లేనట్టుందే అంటూ క్లాసు పీకుతారు
మగపిల్లాణ్ణి ఆస్తికి వారసుడని చెప్తారు
ఆడపిల్లైతే మొదటి పురుడుపోస్తే చాలంటారు
మగపిల్లాడికి వయస్సు మించిపోతున్నా
ఎవరో ఒకరు పిల్లనివ్వకపోతారా అంటారు
ఈడొచ్చిన ఆడపిల్ల ఇంట్లో వుంటే
గుండెల మీద కుంపటిలా
దబ్బున వదిలించుకోవాలని చూస్తారు
ఇంట్లో ఇద్దరాడపిల్లలు, ఒక మగ పిల్లాడుంటే
బయటివాళ్లు మీకెందరు పిల్లలంటే
‘రెండు మైనస్, ఒక ప్లస్’ అని చెప్తారు
గర్భస్థ శిశువు మగపిల్లాడైతే పరవశించిపోతారు
ఆడపిల్లని తెలిస్తే ఉసూరుమంటారు
భ్రూణహత్యకు సైతం వెనకాడరు
జనాభాలో ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోటానికి
శిశువు నిర్ధారణ పరీక్షలే కారణం
అయితే..
ఇటీవల సివిల్స్ వంటి పోటీ ఫలితాల్లో
బాలుర కంటే బాలికలదే పైచేయి!
పైలట్ నుండి ఆస్ట్రోనాట్ వరకు
అన్ని రంగాల్లో ఆడపిల్లలే హైలైట్
మగపిల్లలు చదువయ్యాక విదేశీ బాటపడ్తుంటే
ఆడపిల్లలు తల్లిదండ్రులకు
బాసటగా నిలుస్తున్నారు
అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లోపిస్తే
తల్లిదండ్రుల్ని కొడుకులు
వృద్ధాశ్రమంలో వుంచడానికే సిద్ధపడతారు
కానీ అత్తారింటికెళ్లిన ఆడపిల్లలు
తల్లిదండ్రులు తమ ఇంటికొస్తే సంబరపడతారు
ఇకనైనా తల్లిదండ్రులు
ఈ దారుణ వివక్ష విడనాడితే మేలు!!
- బిఆర్‌సి మూర్తి, విజయవాడ.
ఫోన్ నెం: 0866 2437967

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పం

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email : merupuvj@andhrabhoomi.net

email: merupuvj@andhrabhoomi.net

చిన్న కథ
english title: 
vijayawada
author: 
- వి సాయదుర్గ

జయవిజయులు (కథానిక)

$
0
0

అది ముకుందపుర రాజ్యం!
ఆ రాజ్యం ఎంతో సస్యశ్యామలంగా ఉంటుంది. ఎటు చూసినా పంటలు, వాటికి పుష్కలంగా నీళ్లు అందించే తటాకాలు, చెరువులు, నదులతో ఆ రాజ్యం పుడమిపై పరుచుకున్న నిండు పచ్చదనంలా కనిపిస్తుంది.
రాజు సుసేనుడు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటాడు.
వ్యవసాయపరంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ముకుందపురం ఆ చుట్టుపక్కల అనేక రాజ్యాలకు తలలో నాలుకలా, పెద్దదిక్కులా ఉంటుంది. చాలా రాజ్యాలకు ముకుందపురం స్ఫూర్తి. ముకుందపురంలా అన్నింటా వృద్ధి పొందాలని, పేరు తెచ్చుకోవాలని ఆయా రాజ్యాల రాజులు, ప్రజలు కూడా భావిస్తూ ఉంటారు.
ఆ రాజ్యంలో జయవిజయులనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు.
వారిలో జయుడి కంటే విజయుడు మరింత తెలివైనవాడు. ఏదైనా ఇట్టే నేర్చుకునేవాడు. జయుడు కూడా దేనినైనా నేర్చుకునే వాడు కానీ... దానికి విజయుడి కంటే ఎక్కువ సమయం తీసుకునేవాడు. విజయుడు గణితం, రసాయనం వంటి శాస్త్రాలలో ముందుకు దూసుకెళ్లిపోయాడు. జయుడు వ్యవసాయ శాస్త్రంలో రాటుదేలి తండ్రి ద్వారా సంక్రమించిన భూముల్లో సేద్యం చేస్తూ బంగారం పండించాడు.
ఇద్దరికీ పెళ్లిళ్లు చేయాలని తల్లిదండ్రులు భావించారు. జయుడు తల్లిదండ్రుల మాటని మన్నించి వివాహానికి అంగీకరించాడు. విజయుడు మాత్రం తనకు అప్పుడే వివాహం చేసుకోవాలని లేదని ఖరాఖండిగా తల్లిదండ్రులకు చెప్పేశాడు.
పాపం తల్లిదండ్రులు ఏం చేయాలో తోచక మిన్నకుండిపోయారు.
అవి సంక్రాంతి పండగ రోజులు!
జయవిజయులు ఊరి చివర పొల్లాల్లో కలుసుకున్నారు.
‘‘విజయా! ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు?’’ అంటూ స్నేహితుడిని ప్రశ్నించాడు జయుడు.
‘‘నేనా... నేను...’’ అంటూ నీళ్లు నమిలాడు విజయుడు.
దానికి ఆశ్చర్యపోయిన జయుడు ‘‘అదేమిటి సమాధానం చెప్పడానికి తడబడుతున్నావు?’’ అన్నాడు జయుడు.
విజయుడు సమాధానం చెప్పలేదు.
ఇద్దరూ కాసేపు చల్లగాలిలో తిరిగి ఇంటికి చేరుకున్నారు.
అయితే జయుడికి స్నేహితుడి ధోరణి ఏదో అనుమానం కలగజేసింది.
‘విజయుడు ముకుందపురానికి వంద క్రోసుల దూరంలో గల వైశాఖేశ్వరంలో పెద్ద చదువులు చదువుతున్నాడని తెలుసు గానీ, అతను కచ్చితంగా ఏం చేస్తున్నాడో మాత్రం తెలియదు. అడిగితే నీళ్లు నములుతున్నాడు. తన ప్రాణస్నేహితుడు తప్పుదోవలో గానీ నడుస్తున్నాడా ఏమిటి?’ అని కంగారుపడ్డాడు జయుడు.
అది తెలుసుకోవడానికి పండగ సెలవులు అయిపోయాక వెళుతున్న విజయుడి వెంట రహస్యంగా అనుసరించి వెళ్లాడు.
అక్కడికి వెళ్లాక విజయుడి కదలికలపై నిఘా ఉంచాడు.
దాదాపు వారం రోజులు పరిశీలించి చూసిన తర్వాత విజయుడు పూర్తిగా తప్పుదోవలో నడవడమే కాకుండా గొప్ప రాజ్యంగా విలసిల్లుతున్న ముకుందపురాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న కౌండిన్యపురం రాజుతో చేతులు కలిపాడని, అందుకు గాను తనకు తెలిసిన గణితం, రసాయన శాస్త్రాల ద్వారా విధ్వంసకర విస్ఫోటనాల రూపకల్పన పనిలో పడినట్లు తెలుసుకున్నాడు.
ఇది ఇక్కడితో సమసిపోతే చిన్న శిక్షతోనే స్నేహితుడిని రక్షించుకోవచ్చని అనుకున్నాడు.
ఆగమేఘాల మీద ముకుందపురానికి చేరుకుని అత్యవసరంగా రాజుగారిని కలుసుకోవాలని అంతఃపుర ప్రధానాధికారికి విన్నవించుకున్నాడు.
తొలుత దానికి ఆయన అంగీకరించకపోయినా, రాజ్య రక్షణకు సంబంధించిన విషయమని చెప్పడంతో ఒప్పుకున్నాడు.
రాజు సుసేనుడిని కలుసుకున్న జయుడు తనకు తెలిసిన మొత్తం వివరాలు పూసగుచ్చినట్లు చెప్పేసాడు.
రాజుగారు వెంటనే పెద్ద సైన్యాన్ని వైశాఖేశ్వరానికి పంపించాడు.
జయుడు అందించిన పూర్తి సమాచారంతో సైనికులు ఆ రాజును, విజయుడిని బంధించారు.
నేరం నిరూపణ కావడమే కాకుండా చేసిన తప్పుకు విజయుడు పశ్చాత్తాపపడ్డాడు.
ముకుందపురం రాజు సుసేనుడు అతనికి మూడేళ్ల కారాగారవాసం విధించాడు.
దేశ క్షేమమే కాకుండా, ప్రాణస్నేహితుడు తప్పుడు దారిలో పయనించకూడదని ఆలోచించిన జయుడిని రాజుగారు ప్రశంసించి, తగిన రీతిన సత్కరించారు.
‘‘తెలివితేటలు లేని సజ్జనుడి కంటే తెలివైన దుష్టబుద్ధి గలవాడితోనే లోకానికి కంటకమని జయవిజయుల ఉదంతం వల్ల అర్థమవుతుంది. ఇటువంటి దుష్టబుద్ధి ఎప్పటికైనా బయటపడక తప్పదు. మన రాజ్యంలో ఎవరూ ఇటువంటి దుస్సాహసాల జోలికి పోకుండా జయుడిలా సజ్జనుల్లా ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నాడు రాజు సుసేనుడు.
అంతా జయుడిని అభినందిస్తూ కరతాళధ్వనులు చేశారు.

- దుర్గాప్రసాద్ సర్కార్

మన సాహితీమూర్తులు

కథల పాలవెల్లి...
పాలగుమ్మి

తెలుగు కథ అనగానే సాహితీ అభిమానులకు పాలగుమ్మి పద్మరాజు గుర్తుకొస్తారు. అది ఆయన గొప్పతనం మాత్రమే కాదు తెలుగుగడ్డకు లభించిన గొప్ప అదృష్టంగా భావించాలి. భూత, భవిష్యత్ కాలాలకు దిక్సూచిగా కథానికకు వారు కల్పించిన గౌరవ ప్రతిష్ఠలు ఎనలేనివి.
పాలగుమ్మి పద్మరాజు గురించి దేవులపల్లి కృష్ణశాస్ర్తీ ‘మంచి ఒడుపుగా, స్ఫుటంగా, రక్తమజ్జాస్థి మాంసాలతో మూర్తులను కట్టి వాటి ప్రకృతులను సరిపోయేటట్లు మాట్లాడించి, పనులు చేయించి కథాంతానికి తీసుకొనివెళ్లి వదిలేస్తారు. ఎవ్వడూ నెగ్గడు-ఎవ్వడూ పైకెక్కి కూచోడు, ఎవ్వడూ దండింపబడడు. పద్మరాజుది గద్దచూపు. ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి సంఘటన మీద వాలుతుంది. ఇంత సూక్ష్మమూ, విశే్లషణాశక్తి అతిగాఢమైన రాగం, ఆర్ద్రత ఉన్నాయి. అన్నీ ముందు ఇతని హృదయానికి, జీవితంలోనే భాగాలయినట్లుంటాయి. అనుభవాలతో, చలించిపోయే ప్రాణి, సైన్స్, ఆర్ట్ ఇతనిలో సరైన పాళ్లలో సమ్మేళనమొందాయి’ అంటారు వారితో అతి సాన్నిహిత్యంగా మెలిగి సూక్ష్మ పరిశీలన చేసిన వారిలా.
పద్మరాజు కాశీ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ డిగ్రీ 1937లో పొందారు. సాంప్రదాయక కవిత్వం రాయడంతో పాటు పత్రికల్లో విరివిగా కథలు, రేడియోకు నాటకాలు రాశారు. పాఠకుల మనసుల్ని విశేషంగా ఆకట్టుకోగల కథలు అధిక సంఖ్యలో రాసినందుకే ఇప్పటికీ ఆయన కీర్తి రెపరెపలాడుతూనే ఉంది. ‘నాలోని కథకుడు నాలోని సూత్రకారుడు కంటే బలమైనవాడు’ అని చెప్పుకోగల ధీటైన వ్యక్తి. ఆయన ప్రసిద్ధ కథ ‘గాలివాన’ ప్రపంచ ప్రసిద్ధి పొందడానికి ఎన్నో ఘట్టాలున్నాయి. ఆధ్యాత్మిక విషయాలు, లోతైన తాత్త్విక సంబంధమైన సంగతుల గురించి అద్వైతభావంతో జోడించి ఉపన్యసించగల దిట్ట. ఒకమారు రైల్లో ప్రయాణం చేస్తున్నారు. సౌమ్యవాదము, రమ్యరసవాదమూ గురించి ఉపన్యసించడానికి వెళుతున్నప్పుడు అదే రైల్లో బిచ్చగత్తె తారసపడింది. ఆమెనే ఒక పాత్రగా మలచి గాలివాన కథలోకి ప్రవేశపెట్టారు.
గాలివానను బ్రతుకు అవసరాన్ని తీర్చుకోవడానికి ఉపయోగించుకున్న ముష్టిది ఆ గాలివానకు బలైపోయింది. జీవితంలో నిర్దేశించుకున్న ప్రత్యేక విలువలు ఏమీ లేని బిచ్చగత్తె ఎలా ఉంటే అలా నిబ్బరంగా వుండగలిగింది. ఆ పరిస్థితిని చూసే రాజుగారికి జ్ఞానోదయం కలిగింది, స్ఫూర్తి పొందారు.
1952లో ఆయన రాసిన గాలివాన కథ ప్రపంచ సాహిత్యంలో కథకుడిగా పద్మరాజుకు అత్యున్నత స్థానాన్ని కల్పించింది. న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ వారు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన కథల పోటీలో ‘గాలివాన’కు ద్వితీయ బహుమతి వెయ్యిడాలర్లు ఇచ్చారు. 22 ప్రపంచ భాషల్లో జరిగిన ఈ పోటీలో నెగ్గుకు రావడం సామాన్య విషయం కాదని, కథకుడిగా పాలగుమ్మి పద్మరాజు మహత్తరమైన స్థానం పొందారని అనేకమంది ప్రముఖులు కొనియాడారు. ఆ తరువాత ‘గాలివాన’ కథ ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లోకి అనువాదమైంది. పద్మరాజు 1915లో జన్మించారు. విద్యాభ్యాసం అత్తిలి, రాజమండ్రిలో జరిగింది. వీరి తండ్రి సంస్కృతంలో పండితుడు. వారి తాతగారు పాండిత్యంలో ఆరితేరినవారు. వారి అభిరుచులు, అభిలాషలు వీరికి సంక్రమించాయని అనుకోవచ్చు. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే పద్యాలు రాసేవారు. స్వతంత్రంగా సంస్కృతాభ్యాసం చేస్తూ కాలేజీలో ప్రవేశించాక సాంప్రదాయక కవిత్వం రాయడం మొదలుపెట్టారు.
గ్రంథాలు పఠించడం, కావ్యాలు చదవడం ఆయన అభిరుచి. కాశీ విశ్వవిద్యాలయంలో పద్మరాజుకు స్కాలర్‌షిప్ రావడం చదువులో మరింత శ్రద్ధ పెరిగింది. సాహిత్య సృజన మొదలైంది. పద్మరాజు తొలికథ ‘సుబ్బి’ 1939లో భారతిలో అచ్చయింది. ఆంగ్లంలో త్రివేణిలో కూడా వచ్చింది. కాకినాడ సిఆర్ కాలేజీలో స్పెషల్ డిమాన్‌స్ట్రేటర్‌గా, రసాయనిక శాస్త్రంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు.
అప్పట్లో దేవులపల్లి కృష్ణశాస్ర్తీ తెలుగుశాఖలో పరిచయం అయ్యారు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ సాన్నిహిత్యంగా మసలుతూ సాహిత్యం కొనసాగించారు. రేడియో నాటకాలు, ప్రసంగాలు రాస్తూ తరచూ మద్రాసు వెళ్లేవారు. అక్కడ ప్రముఖ సాహితీవేత్తలతో పరిచయాలు ఏర్పడ్డాయి.
‘పట్నవాసం’ సీరియల్ నాటకం రేడియోకి రాసిచ్చారు. సుమారు ఆరునెలలు శ్రోతలను ఆకర్షించింది. అందులో ముఖ్యపాత్రలో షావుకారు జానకి పాల్గొన్నారు.
1943లో రాసిన పడవ ప్రయాణం కథ చాలా భారతీయ భాషల్లోకి వెళ్లింది. ఇదే కథ ఇంగ్లీష్, జర్మనీ, ఫ్రెంచ్, రష్యన్ భాషల్లోకి అనువాదమైంది. ఇలా ఎన్నో కథలు ఖ్యాతి గడించాయి. వాసనలేని పువ్వులు, కొలవరాని దూరం, వెండిసీసా, హెడ్‌మాస్టారు, ఎదురు చూస్తున్న ముహూర్తం, పరిహారం వంటి కథలు ఆయన కీర్తిని అజరామరం చేశాయి. అలాగే సినిమా కథలు కరణం కనకయ్య, వీలునామా, మానవులందరూ సోదరులేనా? కూడా అలరించాయి. ఎన్నో సినిమాలకు మాటలు రాశారు.
వీరు కేవలం కథకులే కాదు కవిత్వం, నవల, నాటికతో సహా డిటెక్టివ్ సాహిత్యం వరకు దాదాపు అన్ని సాహిత్య ప్రక్రియల్లో తన ప్రతిభను చాటుకున్నారు. గొప్ప కథ రాయడానికి రచయిత చేయవలసిన పనేమిటో ఆయన చెప్పారు. అనేక మూలాల్లోంచి మానవ ప్రవృత్తులను అర్థం చేసుకుని జీవనతత్త్వాన్ని అర్థవంతంగా చెప్పగలగాలి అన్నారు. ఆయన 1983లో పరమపదించిన తరువాత 1985లో కేంద్ర సాహిత్య అకాడమీ మేల్కొని, గుర్తించి అవార్డు ప్రకటించడం, ప్రముఖ కథకునిగా పాలగుమ్మి పద్మరాజు సాహితీ ప్రభంజనాన్ని సంస్మరించుకోవడమే. ఆయన మూర్తిని మన గుండెల్లో ప్రతిష్టించుకోవడమే పాలగుమ్మి పద్మరాజుకు నిజమైన నివాళి.

- అడపా రామకృష్ణ
సెల్ : 9505269091

పుస్తక సమీక్ష
నిజాల సునామీలు... శ్రీకాకుళం నానీలు

బమ్మిడి సుబ్బారావు కాశీబుగ్గ ఆంధ్రప్రదేశ్ సాహితీ సాంస్కృతిక సమాఖ్య కార్యదర్శిగా ఎన్నో సాహితీ కార్యక్రమాల్లో పాల్గొంటూ మంచి వక్తగా పేరుగాంచారు. సాహితీ అధ్యయనం ఆయన అభిరుచి. ఈ జిల్లా కవులు, రచయితల రచనలు, సంపుటాలు సేకరించడం ఆయన హాబీ.
కవుల కవితా సంపుటాలను క్షుణ్ణంగా చదివి సమీక్షించగల గొప్ప సమీక్షకుడు. కవితామ తల్లికి తనవంతు కృషిగా ఈ ‘శ్రీకాకుళం-నానీలు’కి శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం పోరాటాల ఉద్యమ సూర్యుళ్ల అడ్డా కానీ, నేడు వసల చిరునామా! ఏ కవి అయినా పల్లెను కవితా వస్తువుగా ఎంచుకుంటాడనటం అతిశయోక్తి కాదు. ఈ కవి మాత్రం నానీల్లో కూడా నేటి పల్లె దుస్థితి గురించి ఇలా రాశారు.
‘ఏనుగంత ఎత్తులో
నాడు
కాళ్లు విరిగిన చీమ
పల్లె నేడు....’
నానీ అనేది ఒక రూప ప్రక్రియ. దీన్ని 1997లో డాక్టర్ ఎన్.గోపి ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు 215 నానీల సంపుటాలు ప్రచురించబడ్డాయి.
అయితే కవితాశక్తి దృష్ట్యా వీరి నానీలు అగ్రశ్రేణిలో నిలుస్తాయని గోపి చెప్పడం గొప్ప విషయమే!
రైతు అవస్థల గురించి నేటి రైతు దుస్థితి గురించిన ఈ నానీని పరిశీలించండి
‘పొలంలో
బంగారం పండిస్తాడు
బ్యాంకు చుట్టూ బిచ్చగాడై
తిరుగుతాడు రైతు! నిజమేకదా!!
ప్రస్తుత సమాజం సారా రాక్షసికి బానిసై ఎన్నో సంసారాలు ఈ రాక్షసి విషకౌగిలికి బలవుతున్న విధానాన్ని తెలిపే ఈ నానీ చూడండి.
సంసారులిళ్లల్లో
సారా చుక్క
తులసివనంలో
గంజాయి మొక్క
నానీలపై ‘నానీ’ సృష్టిస్తూ ఇలా అంటాడు కవి.
టైంపాసు బఠానీలు కావు నానీలు
జీవన చిత్రణలో హేమా హేమీలు అంటాడు తెలివిగా కవి. నిజమే కదా....
చిన్న నానీ జనాన్ని
జాగృతం చేసే సునామీయే కదా అని నిరూపించే తీరు అద్భుతం.
సుబ్బారావు నానీలు ఆణిముత్యాలు. కొత్త కవుల కలాలకు ఆదర్శ చిత్రాలు...్భవిష్యత్ తరాల జీవిత సత్యాలు. నేడు అక్షరాలు కొనాల్సి వస్తోందని తెలిపే ఈ నానీ పరిశీలించండి
నేడు చదువు
అక్షరాలతో కాదు
లక్షలతో
కాకుంటే కోట్లతో! అవును మరి ప్రైవేట్ కళాశాలలు కళకళ.. ప్రభుత్వ పాఠశాలలు విలవిల. చాలా విలువైన ఈ శ్రీకాకుళం నానీలు ప్రతి పాఠకుడి ఇంటా ఉండాల్సిన సాహితీ చిరు చినుకులు.

- ఈవేమన,
సెల్ : 7893451307

మనోగీతికలు

బుద్ధి కుశలత!
అన్నలారా కంటున్నారా
రుణమాఫీలుంటాయని
తిరిగి తీర్చాలంటే
బడుగు ప్రాణమే దొరికిందా
మాయదారి రాజకీయం
ఆడుతోంది చదరంగం
కోట్లు కావాలంటే
బెల్టుషాపులే మెరవాలంట
రెండింతలు కావాలి సీసాల రేట్లు
ఖజానా నిండు కోట్లాది నోట్లు
మజాగా పొందు రుణాల మందు
రుణమాఫీలు చక్కనైన విందు
మద్యంలో మునిగిన వారందరికీ
మరువకుందురు గాక సంవత్సరీకాలు
అయ్యో అంటారా అన్నలారా
బుద్ధి కుశలతను పాటించలేరా
కృషితో నాస్తి పలాయనం కాదా
ఉచితం కదా అని గాలినెంత పీల్చగలరు?
అత్యాసకు పోయి ఆత్మత్యాగమెందుకు?

- అడపా చిదానందమూర్తి,
విశాఖపట్నం-4

నువ్వే నా సౌభాగ్యం!
నువ్వే నా సౌథానివి
నా దానివి గానానివి
ధ్యానానివి వసంతానివి
గాయత్రివి ధరిత్రివి
సావిత్రివి దేవతవి
భవితవి భాగ్యానివి
నీతోనే నా జీవితం
నీతోటిదే నా లోకం
నా జీవిత సర్వస్వం నువ్వే
నా ఈ జీవితం నీదే

- విద్వాన్ ఆండ్రకవి మూర్తి, అనకాపల్లి.

ప్రేమసూత్రం
మకరందాన్ని
గ్రోలుతున్న తేనెటీగ
పూలను దోచుకుంటున్నట్లా?
తనపై వాలగానే
వికసించి విందు చేసే పువ్వు
తన మాధుర్యాన్ని
అనుభవించే
అవకాశమిస్తుంది!
ఇక్కడ
దోచుకునేదేమిటి?
దోచబడేదేమిటి??
ఈ చర్య ప్రతిచర్యలలో
ఆ రెండింటికి
భాగస్వామ్యమున్నది!
పరిమళంతో ఆకర్షించే
పూల దిశకు
పయనిస్తుంది తేనెటీగ!!
పరిమళించడం
పువ్వు సహజత్వమైతే
పరిమళాన్ని
ఆస్వాదించడమూ
సహజమే!
ఆ రెండింటికీ వున్న
అవినాభావ సంబంధాన్ని
ఏ గణిత సూత్రాలతో
విభాగించగలం?
భౌతిక తత్వాన్ని
విశే్లషించే మేధస్సు
హృదయ భాషను
భావాలను
వ్యక్తం చేయలేదు!!
ఎదురుచూస్తూ నిరీక్షించే
పువ్వు మనసు
తేనెటీగకే తెలుసు!!!

- పొనుగుపాటి శ్రీకాంత్,
సెల్ నెం: 7204333655

email: merupuvsp@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి.
email: merupuvsp@andhrabhoomi.netఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

కథానిక
english title: 
vishaka
author: 
- దుర్గాప్రసాద్ సర్కార్

కాచిగూడ బిగ్ బజార్‌లో భారీ చోరీ

$
0
0

కాచిగూడ, ఆగస్టు 23: హైదరాబాద్ కాచిగూడలోని బిగ్‌బజార్‌లో శనివారం తెల్లవారుఝామున భారీ చోరీ జరిగింది. బిగ్‌బజార్ మూడో అంతస్తులోని ఈ-జోన్‌లో అత్యవసర ద్వారం నుండి లోనికి ప్రవేశించిన దుండగులు డిస్‌ప్లేలో ఉంచిన సుమారు 35 సెల్‌ఫోన్లు, ఏడు కెమెరాలు, 15 లాప్‌ట్యాప్‌లు ఊడ్చుకెళ్లారు. దీంతో పాటు స్టోర్ రూమ్‌లోని బీరువాలో ఉంచిన సెల్‌ఫోన్లు కూడా చోరీకి గురైనట్లు బిగ్‌బజార్ సిబ్బంది గుర్తించారు. చోరీకి గురైన సొత్తు విలువ దాదాపు 50 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. మాల్‌లో చోరీ జరిగిందన్న విషయం తెలుసుకున్న బిగ్‌బజార్ సిబ్బంది సుల్తాన్‌బజార్ పోలీసులకు సమాచారం అందించారు.
సుల్తాన్‌బజార్ ఎసిపి రవికుమార్ హుటహుటిన సంఘటన స్థలానికి చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీమ్ బృందాలను రప్పించి వేలిముద్రలను సేకరించారు.
అనంతరం ఎసిపి రవికుమార్ విలేఖరులకు ఘటన వివరాలను వెల్లడించారు. చోరీకి ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లు సీసీ కెమెరాల పుటేజ్‌లో తెలిసిందని తెలిపారు. అత్యవసర ద్వారం నుండి లోనికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారని వివరించారు.
గతంలో బిగ్‌బజార్‌లో పనిచేసిన సెక్యురిటీ గార్డులే చోరీకి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. చోరీకి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన్నట్లు ఏసిపి రవికుమార్ తెలిపారు.

50 లక్షల విలువైన సెల్‌ఫోన్లు, లాప్‌ట్యాప్‌లు మాయం
english title: 
s

పసివాళ్లను మింగిన పంటకాల్వ

$
0
0

* మృతుల్లో ఇద్దరు తోబుట్టువులు
* చినగంగారంలో విషాదం
వెంకటాపురం, ఆగస్టు 24: ముక్కుపచ్చలారని పసిబాలలు వారు. అప్పటిదాకా తల్లిదండ్రులతో ఆప్యాయంగా ఆదివారం సెలవు దినం ఆటపాటలతో స్నేహితులతో గడిపారు. ఇంతలోనే పంటకాల్వ రూపంలో పొంచి ఉన్న మృత్యువు వారిని కబళించింది. ఆ పసివాళ్లను కిరాతకంగా మింగేసి వికటాట్టహాసం చేసింది. ఈ ఘటన ఆదివాసీ గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మండల పరిధిలోని బర్లగూడెం గ్రామపంచాయతీ చినగంగారం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సరదా వారి ప్రాణాలు తీసింది. గ్రామాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న పంటకాల్వలోకి దిగి వర్షిత, శ్రీజ, ఉపాసన అనే చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే...పదేళ్ల కిందట నిర్మాణం ప్రారంభమైన పాలెం ప్రాజెక్టు కాల్వలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు విజ్ఞప్తి మేరకు రిజర్వాయర్‌లోని నీటిని పంట కాల్వలకు విడుదల చేశారు. ఐదారురోజుల కిందటే నీరు విడుదల చేయడంతో తమ గ్రామంలోని కాల్వ గుండా నీటి ప్రవాహంలో స్నానాలు చేయాలని, కేరింతలు కొట్టాలని, తల్లిదండ్రుల కళ్లుగప్పి కాల్వలోకి ముగ్గురు చిన్నారులు దిగారు. ముందుగా ఉపాసన(5) మెట్టు నుంచి జారగా చెల్లిని రక్షించాలని అక్క శ్రీజ(9) చేయి అందించే క్రమంలో ఆమె కూడా జారిపోయింది. అదే సమయంలో వర్షిత కూడా ప్రవాహంలోకి వెళ్లిపోయింది. సుమారు 5,6 అడుగుల లోతున ప్రవహిస్తున్న పంట కాల్వలో క్షణాల్లో చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పిల్లలు కన్పించడం లేదని కాల్వ వద్దకు వచ్చిన గ్రామస్తులకు కొట్టుకుపోతున్న మృతదేహాలు కన్పించాయి. వెంటనేవారు ఆ మృతదేహాలను వెలికి తీశారు. శ్రీజ, ఉపాసనలు తోబుట్టువులు. వీరి తల్లిదండ్రులైన మొడెం చిరంజీవి, సరోజినిలకు ముగ్గురు ఆడపిల్లలే. మగసంతానం కోసం కావాలని ఆగడంతో వారి తల్లి ప్రస్తుతం 7 నెలల గర్భిణీగా ఉంది. అలాగే మృతిచెందిన మరో బాలిక వర్షిత తల్లిదండ్రులు రమేష్, సుధారాణిలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
గ్రామంలో విషాదం
ఆడుతూ పాడుతూ అందరికి తలలో నాలుకలా ఉన్న చిన్నారులు పంట కాల్వలో పడి చనిపోవడంతో చినగంగారం గ్రామవాసులంతా షాక్‌కు గురయ్యారు. విషాదంలో అలుముకుంది. చుట్టుపక్కల వ్యవసాయం చేసుకుంటున్న బంధువులు, గ్రామస్థులు అంతా తరలివచ్చి భోరున విలపిస్తున్న వారి తల్లిదండ్రులను ఓదార్చారు. వాజేడు పర్యటనకు వెళ్లి తిరిగి వస్తున్న ఐటీడీఓ పిఓ డి.దివ్య చిన్నారుల మరణవార్తను తెలుసుకుని ఆగారు. తహశీల్దారు రాఘవరెడ్డి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పరంగా సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. పోలీసు,రెవెన్యూ అధికారులు చిన్నారుల మృతదేహాలకు పంచనామా నిర్వహించారు.

గిరిజన చట్టాలు అమలు చేయాలి
కొత్తగూడెం , ఆగస్టు24: ఏజెన్సీ ఏరియాలలో గిరిజన చట్టాలను సక్రమంగా అమలు చేయాలని కోరుతూ ఐటిడిఎ పిఓ దివ్యకు లంబాడీ హక్కుల పోరాట సమితి ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎల్‌హెచ్‌పిఎస్ నాయకుడు గుగులోత్ రాజేష్ నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని ఐటిడిఎ సబ్ ప్లాన్ పరిధిలో ఉన్న 29 మండలాల్లో గిరిజన చట్టాలు సక్రమంగా అమలు కావడంలేదని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజనులు వ్యవసాయం చేసుకునేందుకు అవసరమైన నీటి సదుపాయాన్ని కల్పించాలని పేర్కొన్నారు. ఏజెన్సీ ఏరియాల్లో గిరిజన భూములను ఆక్రమించుకున్న వారిపై ఎల్‌టిఆర్ కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బానోత్ రమేష్, బాబురావు, సీతారాం తదితరులు పాల్గొన్నారు.

ఆ మూడు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలి
* రంపచోడవరం ఆర్డీఓకు వినతి
భద్రాచలం, ఆగస్టు 24: ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం గ్రామపంచాయతీలను తెలంగాణా రాష్ట్రంలోనే కొనసాగించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, రంపచోడవరం ఆర్డీఓలకు ముంపు మండలాల సర్పంచ్‌ల సంఘం ఆదివారం వినతిపత్రం సమర్పించింది. ముంపుప్రాంతమంతా ఖమ్మం బ్లాకులోనే ఉంచాలని డిమాండ్ చేశారు. రంపచోడవరం రావాలంటే ఈ మూడు పంచాయతీల ప్రజలు రెండు చోట్ల చెక్‌పోస్టుల్లో రుసుం చెల్లించాల్సి వస్తోందన్నారు. తమ జీవితాలు అగమ్యగోచరంగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. నక్కా వెంకన్న, డేగల రామకృష్ణ, అరికెల తిరపతిరావు తదితరులు ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి
* కుమారునికి తీవ్రగాయాలు
అశ్వాపురం, ఆగస్టు 24: అశ్వాపురం మండలం మొండికుంట సమీపంలోని కట్టుకాల్వ వాగు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాల పాలయ్యారు. పోలీసులు కథనం ప్రకారం... పాల్వంచ నుంచి మణుగూరు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని మణుగూరు నుంచి ఎదురుగా వస్తున్న కారు వేగంగా వస్తూ ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో పండ్ల కృష్ణమూర్తి(45) అక్కడికక్కడే మరణించగా, మృతుని కుమారుడు నర్సింహ(12) తీవ్రంగా గాయపడ్డాడు. సమచారం అందుకున్న వెంటనే అశ్వాపురం పోలీసులు సంఘటనా ప్రదేశాన్ని సందర్శించి గాయపడిన బాలుడిని 108 వాహనం ద్వారా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం బూర్గంపాడు ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ పుల్లయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సర్వే డేటాను పూర్తిస్థాయిలో నమోదు చేయండి
* జిల్లా కలెక్టర్ ఇలంబరిది
ఖానాపురం హవేలి, ఆగస్టు 24: కుటుంబ సమగ్ర సర్వే ద్వారా సేకరించిన డేటాను పూర్తిస్థాయిలా నమోదు చేయాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లకు జిల్లా కలెక్టర్ ఇలంబరిది సూచించారు. నగరంలోని ఎస్‌బిఐటి కళాశాలలో చేపడుతున్న డేటా ఎంట్రీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేలో సేకరించిన సమాచారాన్ని ఏ ఒక్క సమాచారం వదలకుండా సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చాలన్నారు. ఎస్‌బిఐటి కళాశాలలో 250కంప్యూటర్ల ద్వారా డేటా ఎంట్రీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. డేటా ఎంట్రీలో డ్వామా, ఆర్‌విఎం, ఎంపిడివో కార్యాలయాల, ఈజిఎస్‌కు సంబంధఇంచిన 40మంది ఆపరేటర్లు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జడ్పీ సిఈఓ కలెక్టర్‌కు వివరించారు. డేటా ఎంట్రీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగేందుకు అవసరమైన ఇంధనాన్ని సమకూర్చాలని ఆర్డీవోను ఆదేశించారు. డేటా ఎంట్రీ చేస్తున్న హాలులో ఎసి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ జిల్ల అధికారి శ్రీనివాసరావు, ఎస్‌బిఐటి ట్రస్ట్ వైస్ చైర్మన్ పొన్నం వెంకటేశ్వరరావు, లాలయ్య, ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి, సెక్రటరి అండ్ కరస్పాండెంట్ ప్రతాప్‌బాబు, ఐటి డిప్యూటీ తహశీల్ధార్ కాశీం తదితరులు పాల్గొన్నారు.

కొమ్ముగూడెంలో డెంగ్యూ జ్వర లక్షణాలు
* గ్రామాన్ని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి
జూలూరుపాడు, ఆగస్టు 24: మండలంలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు డెంగ్యూ జ్వర లక్షణాలతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంకా గ్రామంలో ఇరవై మందికి పైగా జ్వరంతో బాదపడుతూ మంచాన పడటంతో ఆదివారం స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆధ్యర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే పది రోజులకు పైగా గ్రామానికి చెందిన పలువురు ఒకరివెంట మరొకరు జ్వరం బారిన పడి ఆసుపత్రులలో వైద్యం పొందుతుండగా నాలుగైదు రోజలలో రోగుల ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతూ వస్తుంది. కొందరికి స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందినా తగ్గకపోవటంతో కొత్తగూడెంలోని ఆసుపత్రులకు వెళ్ళటంతో వైద్య పరీక్షల అనంతరం డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు ఆనుమానించారు. భూక్యా మోహన్‌లాల్, ఇందూశ్రీ, మీనాలకు రక్తంలోని ప్లేట్‌లెట్స్ తగ్గుతుండటంతో పాటు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో వైద్యుల సూచనల మేరకు మోహన్‌లాల్, ఇందూశ్రీలను హైద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి, మీనాను ఖమ్మంలోని మమత ఆసుపత్రిలో చేర్పించారు. వీరితో పాటు గ్రామంలో భూక్యా కిషన్,గణేష్,విజయేందర్,జ్యోతి,లక్ష్మి,పన్నాలాల్,పద్మ,హైమవతిలతోపాటు మరో ఇరవై మంది జ్వరపీడితులుగా గుర్తించారు.గ్రామంలో జ్వరాల పరిస్థితిని తెలుసుకున్న స్థానిక ప్రభుత్వ వైద్యశాఖ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ భానుప్రకాష్,జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రాంబాబులు గ్రామాన్ని సందర్శించి వైద్యులు,వైద్య సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. ఎఎన్‌ఎంలు. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరిగి రోగులను గుర్తించి, జ్వర పీడితుల నుంచి రక్తనమూనాలను సేకరించారు. జిల్లా అధికారులు కూడా గ్రామంలోని పలు వీధుల్లో తిరిగి జనావాసాల మద్య చెత్తాచెదారం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజలు తీసుకునే ఆహారం, తాగు నీరు కలుషితం లేకుండా కనీస జాగ్రత్త తీసుకోవాలని కోరారు. గ్రామంలో రోగుల పరిస్థితి మెరుగు పడేంత వరకు వైద్య శిబిరం ద్వారా వైద్యం అందించాలని వైద్యులు, సిబ్బందిని ఆదేసించారు. ఎంపిపి మూడు చిట్టిబాబు,గ్రామ సర్పంచ్ భూక్యా జ్యోతిలు వారి వెంట ఉన్నారు.

నవ తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం
* టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మోదుగు దేవదాసు
జూలూరుపాడు, ఆగస్టు 24: తెలంగాణ ప్రజలు కలలుకన్న నవతెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మోదుగు దేవదాసు అన్నారు. ఆదివారం జూలూరుపాడులో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక దృష్టి సారించారని, ఇందులో భాగంగా అన్ని వర్గాల ప్రజల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు చేరే విధంగా అధికారులు,ప్రజాప్రతినిధులు తమ వంతు కృషి చేయాలని ఆయన కోరారు. సంక్షేమ పధకాల అమలులో అవినీతి,అక్రమాలను అరికట్టేందుకే ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను సమర్థవంతంగా నిర్వహించిందన్నారు. ఈ సర్వే కారణంగా ఆర్హులైన లబ్ధిదారులకే సంబంధిత ప్రభుత్వ పథకాలు అందుతాయని, సర్వే నివేదిక భవిష్యత్ ప్రణాళికలకు కూడా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. నెల రోజుల క్రితం మన ఊరు మన ప్రణాళికల నివేదికల ద్వారా గ్రామా ల్లో వౌలిక సదుపాయాల కల్పనతో పాటు, అభివృద్ధికి ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వేల్పుల నర్శింహారావు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు మోదుగు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

తపాలా ఉద్యోగులు ఏ రాష్ట్రంవారో తేల్చాలి
* ఆలిండియా గ్రామీణ డాక్‌సేవక్ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ మహాదేవయ్య
ఖమ్మం(గాంధీచౌక్), ఆగస్టు 24: గ్రామీణ తపాల ఉద్యోగులు ఏరాష్ట్రానికి చెందుతారోతేల్చాలని ఆలిండియా గ్రామీణ డాక్‌సేవక్ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ మహాదేవయ్య అన్నారు. ఆదివారం స్థానిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఆలిండియా గ్రామీణ డాక్‌సేవక్స్ సర్కిల్ మహాసభలో ఆయన మాట్లాడుతూ జిడిఎస్‌లు ఎవరో తేల్చి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. తపాలశాఖలో పనిచేస్తున్న గ్రామీణ డాక్‌సేవక్‌లను ఏ ఉద్యోగ వర్గంగా పరిగణిస్తారో వెంటనే ప్రకటించాలన్నారు. జిడిఎస్‌లను 7వ వేతన సంఘం పరిధిలోకి తీసుకురానట్లైతే 2015నుండి సమరశీల పోరాటాలకు ప్రతి జిడిఎస్ ఉద్యోగులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 2010 నుండి అమల్లోకి వచ్చిన నూతన ఉద్యోగ నియామక పద్ధతిని పూర్తిగా రద్దుచేసి గ్రామీణ డాక్‌సేవక్‌ల నుండి 50శాతం డిపార్ట్‌మెంట్ ఉద్యోగాలకు తీసుకోవాలన్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా సీనియర్ గ్రామీణ డాక్ సేవకులను పోస్టుమాన్ ఉద్యోగాల్లో నియమించాలన్నారు. జిడిఎస్‌లను సివిల్ సర్వెంట్‌లుగా గుర్తించే వరకు ప్రతి జిడిఎస్ కేంద్ర కమిటీ ఇచ్చే పిలుపు మేరకు వివిధ కార్యక్రమాలు చేయాలన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ డాక్‌సేవక్‌ల సమస్యలను పరిష్కరించేందుకు పార్లమెంట్ ప్రస్తావిస్తానన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరిడింటెంట్ జి ముఖేశ్వరరావు, హైకోర్టు అడ్వకేట్ ఎం వెంకన్న, బి వెంకటేశ్వర్లు, రఘుబాబు, కామేశ్వరరావు పాల్గొన్నారు.

తుమ్మల వెంట కదలనున్న అనుచరగణం
వేలేరుపాడు, ఆగస్టు 24: వేలేరుపాడు మండలంలోని మాజీ ప్రజాప్రతినిధులతో పాటు మండల ప్రముఖులు ఎందరో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పార్టీ జంప్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇప్పటికే గత కొంతకాలం నుండి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ కార్యకలాపాల పట్ల ఆసక్తి కనబర్చకపోవడంతో పాటు స్తబ్ధతగా ఉండడంతో మండలంలోని ఆ వర్గ నాయకులంతా ఆయన ఎటు వెళితే ఆయన వెంటే తాము అని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం తుమ్మల టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారనే ప్రచారం ముమ్మరం కావడంతో వీరంతా సైతం తుమ్మలే మా నాయకుడు ఆయన ఎటు వెళ్తే మేము అటే, అసలు అభివృద్ధి జరిగింది కేవలం తుమ్మల వలనేనని బాహాటంగా పేర్కొంటున్నారు. రాగల రోజుల్లో తుమ్మల టిడిపిని విడిచి టిఆర్‌ఎస్‌లోకి వెళ్తే తామంతా ఆయన వెంటే కొనసాగుతామన్న విషయాన్ని వెల్లడించారు. ఇదే జరిగితే వేలేరుపాడు మండలంలో సైతం టిఆర్‌ఎస్ ప్రధాన శక్తిగా ఎదిగే అవకాశాలను ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

పేదలకు అన్నం పెట్టిన ఘనత ఎన్టీఆర్‌దే
* టిడిపి జిల్లా అధ్యక్షుడు కొండబాల
కొణిజర్ల, ఆగస్టు 24: పేదలకు రెండు పూటల అన్నం పెట్టిన ఘనత దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుదేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు పేర్కొన్నారు. కొణిజర్ల మండల పరిధిలోని అమ్మపాలెం గ్రామంలో పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ దోరల పాలన అంతమొందించి తెలుగుజాతీ ఆత్మగౌరవాన్ని కాపాడారని, భారతదేశ రాజకీయాలలో పెనుమార్పు తీసుకోచ్చి రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పిన మహనీయుడన్నారు. ఎన్టీఆర్ హయంలో పేదలు, రైతాంగం కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని మహిళలకు భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో ఆస్తిహక్కు చట్టం తీసుకోచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనమండలి సభ్యుడు పోట్ల నాగేశ్వరరావు, స్థానిక జెడ్పిటిసి సభ్యుడు సోమ్లానాయక్, ఎంపిటిసిలు కృష్ణమూర్తి, మీటునాయక్, సర్పంచ్‌లు సైదా, జ్యోతి, నర్సయ్య, పార్టీ మండల అధ్యక్షుడు పోట్ల శ్రీను, నియోజకవర్గ నాయకులు బాలాజీనాయక్, నాయకులు కిలారు మాధవరావు, చిరంజీవి, వెంకటలాలయ్య, అనంతరామయ్య, వీరయ్య, బాబు, తాతా సుధాకర్, మందడపు భాస్కర్‌రావు, గుర్రం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

ఫైనాన్స్ వ్యాపారి ఆత్మహత్య
చర్ల, ఆగస్టు 24: చర్ల మండలంలో బట్టలు, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న దొడ్డి నాగరాజు(45) ఆదివారం తెల్లవారుఝామున తాలిపేరులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగరాజు గత పది సంవత్సరాలుగా చర్ల మండలంలో బట్టల వ్యాపారం చేస్తూ, ఫైనాన్స్‌లు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం జిల్లా ఎస్పీ రంగనాథ్ అదేశాల మెరకు చర్ల పోలీసులు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వారిని స్టేషన్‌కు పిలిపించారు. చర్లలో పైనాన్స్ వ్యాపారం చేయవద్దని, అలా చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. స్టేషన్‌కు వెళ్ళినవారిలో నాగరాజు ఉన్నాడు. కాగా నాగరాజు చర్లలో గోరెంట్ల శ్రీను అనే వ్యక్తికి ఇంటి కాగితాలు తనఖాపెట్టుకొని 70 వేల రూపాయల నగదు ఇచ్చాడు. ఫైనాన్స్ వ్యాపారులను స్టేషన్‌కు పిలిపించుకున్న విషయం తెలుసుకున్న శ్రీను నాగరాజు ఇంటికి వెళ్ళి తనకు ఇచ్చిన ఫైనాన్స్ డబ్బులను అడగవద్దని, తనఖా పెట్టుకున్న కాగితాలను ఇవ్వాలని, లేకుంటే భార్య, పిల్లలతో కలిసి ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. దీంతో భయాందోళన చెందిన నాగరాజు శనివార ఇంటి నుండి వెళ్ళి ఆదివారం తెల్లవారుఝామున తాలిపేరులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చర్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

వైభవంగా సువర్ణలక్ష్మి దాంపత్య మహాయజ్ఞం
కామేపల్లి, ఆగస్టు 24: మండలంలోని ముచ్చర్ల గ్రామ సమీపంలోని ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం శ్రీవేణుదత్త సువర్ణలక్ష్మి దాంపత్య మహాయజ్ఞం అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా జరిగింది. భగవాన్ శ్రీరామదూత స్వామివారి ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాయజ్ఞ కార్యక్రమంలో 400 కుటుంబాలు పాలుపంచుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన విశేష పూజలు మహాయజ్ఞం అనంతరం శ్రీరామదూత స్వామి పాల్గొన్న వేలాది మంది భక్తులకు దాంపత్యజీవనం, ఆశాంతికి కారణాలు, యోగక్షేమాలు వంటి అంశాలపై సందేశం అందించారు. ఎటువంటి ఆశాంతి లేని కుటుంబం ద్వారానే మంచి సమాజం ఏర్పడుతుందని, తద్వారా ఆ గ్రామం, దేశం శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లుతుందని ఉపన్యసించారు. భార్య, భర్తలతో ఆర్థిక, మానసిక, ఆరోగ్యం, సంతానక్షేమం వంటి మానసిక ఆశాంతి వల్ల అకాల మరణాలు సంభవిస్తున్నాయని, స్ర్తిలు సమాజానికి ముఖ్యమైన బిందువు అని వారిని పూజించడం ద్వారానే శాంతి కలుగుతుందని వివరించారు. అనంతరం సుఖ జీవనం సాగించేందుకై వారికి మంత్రోపదేశం చేశారు. ముచ్చర్ల, పండితాపురం, సాతానిగూడెం, అబ్బాస్‌పురం, దాస్తుపల్లి, మద్దులపల్లి తదితర గ్రామాల నుండి హాజరైన వేలాది మంది భక్తులను ఆయన ఆశ్వీరదించారు. యజ్ఞంలో పాల్గొన్న కుటుంబ సభ్యులకు మాలధారణ జరిపించారు. కార్యక్రమంలో మూడు కృష్ణప్రసాద్, నాగుబండి సుధాకర్‌గుప్త, విలాసరావు, చిదంబరరావు, శంకర్, మాధవరావు, భగత్‌సింగ్, శ్రీరామదూత సేవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

విద్యాశాఖామంత్రిని కలిసిన కలెక్టర్
ఖమ్మం(మామిళ్ళగూడెం), ఆగస్టు 24: స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో రాష్ట్ర విద్యాశాఖామంత్రి జగదీశ్వర్‌రెడ్డిని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఇలంబరిది మర్యాదపూర్వకంగా ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని విద్యాశాఖపై పలు విషయాలను ఆయనకు వివరించారు. ఇదిలా ఉండగా టిఆర్‌ఎస్ ఖమ్మం నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్‌జెసి కృష్ణ ఆధ్వర్యంలో పలువురు జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం వద్దకు వెళ్ళి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అదే విధంగా ఖమ్మం నగరంలో కృష్ణ ఆధ్వర్యంలో పలువురు కమీషన్ వ్యాపారులు టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మాటేటి నాగేశ్వరరావు, గీత, వెంకన్న, నారాయణ, రామారావు, నీలం కృష్ణ, కురివెళ్ళ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు: పీఓ
భద్రాచలం, ఆగస్టు 24: ప్రజారోగ్యమే ధ్యేయంగా ఏజెన్సీ పరిధిలోని గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని ఐటీడీఏ పీఓ డి.దివ్య అన్నారు. ఆదివారం ఆమె వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని సందర్శించి, మందులు పరిశీలించారు. రోగులతో మాట్లాడారు. అనంతరం గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను స్వయంగా పరిశీలించారు. మంచినీటి ట్యాంకును క్లోరినేషన్ చేయించాలని ఆదేశించారు. వైరల్ జ్వరంతో బాధపడుతున్న కృష్ణయ్య ఇంటిని ఆమె సందర్శించి అతన్ని పరామర్శించారు. ప్రభుత్వ వైద్యానికే ప్రాధాన్యం ఇవ్వాలని వారికి సూచించారు. గ్రామంలోని ఎత్తిపోతల పథకాన్ని బాగు చేయించాలని గ్రామస్థులు పీఓకు వేడుకున్నారు. ఉపాధి దొరకడం లేదని వినతిపత్రం ఇవ్వగా ఉపాధి పనులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పెదగొల్లగూడెం పీహెచ్‌సీని సందర్శించారు. అసంపూర్తి భవనాన్ని చూసి అసంతృప్తి వ్యక్తంచేశారు. నెలలో పూర్తి చేసి తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రెండో విడత దోమల మందు పిచికారిని ఆమె పర్యవేక్షించారు. పీఓ వెంట వాజేడు వైద్యాధికారి డా.మోహన్‌కృష్ణ, గ్రామసర్పంచి కంబాలపల్లి అమరావతి తదితరులు ఉన్నారు.

బ్యాంక్ అకౌంట్ కోసం కూలీల మధ్య తోపులాట
ఇల్లెందు, ఆగస్టు 24: ఉపాధి హామీ పథకం ద్వారా పనులు నిర్వహిస్తున్న కూలీలకు వేతనాలు బ్యాంకు ద్వారా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించడంతోపాటు జీరో బ్యాంకు అకౌంట్ సదుపాయాలను ఉపాధి కూలీలకు కల్పించాలని ప్రభుత్వ ఆదేశించడంతో ఆదివారం పట్టణంలోని ఆంధ్రబ్యాంకు సిబ్బంది సేవలు అందించారు. ఒక్కసారీగా బ్యాంకు అకౌంట్ పొందేందుకు వందలాది మంది బ్యాంకుకు తరలిరావడంతో కూలీల మధ్య తోపులాట పరిస్థితి నెలకొంది. బ్యాంకులోపల జనం అధికంగా ఉండడంతో గేటు బయట పడిగాపులు కాసిన ఉపాధి కూలీలు త్వరగా అకౌంట్ పొందాలనే తాపత్రయంతో తోసుకోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆంధ్రబ్యాంకు ఆవరణంలో ఉపాధి కూలీల జాతరర కొనసాగింది. జీరో బ్యాలెన్స్ అకౌంట్ పుణ్యమా అని వృద్ధులు, చంటి పిల్లలు పడరాని పాట్లు పడాల్సి వచ్చింది.

తుమ్మల అభిప్రాయం మేరకే నడచుకుంటాం
* సత్తుపల్లి, వేంసూరు ఎంపీపీలు
సత్తుపల్లి, ఆగస్టు 24 : ఖమ్మం జిల్లాను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అభివృద్ధి చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయానికి అనుగుణంగా తాము పనిచేస్తామని సత్తుపల్లి, వేంసూరు మండలాల మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జ్యేష్ట అప్పారావు, మోటపోతుల జగన్నాధంలు తెలిపారు. ఆదివారం సాయంత్రం సత్తుపల్లిలోని గాదె సత్యనారాయణ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు తుమ్మలకు పూర్తి మద్దతు తెలిపారు. ఇటీవల తుమ్మల నాగేశ్వరరరావు తెలుగుదేశం పార్టీని వీడి టిఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతుండటంతో వేంసూరు, సత్తుపల్లి మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ మద్దతును ప్రకటిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆదివారం వేంసూరు మండలానికి చెందిన జడ్‌పిటిసి సభ్యుడు గుగులోతు బాషా, వేంసూరు సర్పంచ్ పలగాని అప్పారావు, సొసైటీ డైరెక్టర్ పాల నర్సారెడ్డిలు తుమ్మలకు తమ మద్దతును ప్రకటించారు. సందర్భంగా వారు విలేఖర్లతోమాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసి ఆర్ జిల్లాలో కోరుకున్న అసెంబ్లీ స్థానానికి సీటు ఇవ్వడంతోపాటు తన కేబినెట్‌లో మంత్రి పదవి ఇస్తానన్నప్పటికి తెలుగుదేశం పార్టీకి కట్టుబడి తుమ్మల పాలేరును వదిలి ఖమ్మం అసెంబ్లీకి పోటీకి దిగారని తెలిపారు. మూడు దశాబ్దాల పాటు ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వచ్చిన తుమ్మలను పార్టీ అధినాయకుడు చంద్రబాబు చిన్నచూపు చూడడం తగదన్నారు, కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలకు కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లాను తెలుగుదేశం కంచుకోట మార్చిన ఘనత తుమ్మలదేనని గుర్తుచేశారు. అటువంటి తుమ్మలను తెలుగుదేశం పార్టీ అవమానించడం తగదన్నారు. బంగారు తెలంగాణ సాధించే విషయంలో తుమ్మల టిఆర్‌ఎస్ పార్టీలోచేరినట్లయితే తాము తుమ్మలకు పూర్తి మద్దతు ప్రకటించడంతో పాటు తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెబుతామని తెలిపారు. కార్యక్రమంలో చల్లగుళ్ళ నరసింహారావు, కృష్ణయ్య, తదితరులున్నారు.

* మృతుల్లో ఇద్దరు తోబుట్టువులు * చినగంగారంలో విషాదం
english title: 
panta kaluva

పులుల రాజసానికి అంతిమ ఘడియలు!

$
0
0

* చెలరేగుతున్న వేటగాళ్లు
* యథేచ్ఛగా చర్మాలు, మాసం విక్రయం
* పట్టించుకోని అధికారులు
ఆత్మకూరు, ఆగస్టు 24 : నల్లమల అటవీ ప్రాంతంలో పులులకు అంతిమ ఘడియలు ప్రారంభమయ్యాయి. దేశంలోనే అతి పెద్ద విస్తారమైన నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ 3840 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇక్కడి ఫారెస్టు ఎన్‌ఎస్‌టిఆర్‌లోకి ప్రకాశం, కర్నూలు, నల్గొండ, మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల వరకూ విస్తరించి ఉంది. దీన్ని 1983లో పులుల అభయారణ్యంగా ప్రకటించారు. అధికారిక లెక్కల ప్రకారం 18వ శతాబ్ధంలో 40 వేలు ఉన్న పులుల సంఖ్య 1973లో ప్రాజెక్టు టైగర్ ప్రారంభం నాటికి 1800కు చేరుకున్నాయి. దేశంలో మొత్తం 42 పులుల అభయారణ్యాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 14 దేశాల్లో మాత్రమే పులులు జీవించడానికి అనుకూలమైన ప్రదేశాలు ఉన్నాయి. అధికంగా మన రాష్ట్రంలో సుమారు 140 పులులున్నాయి. వీటిలో అధికంగా ఎన్‌ఎస్‌టిఆర్‌లో ఉండడం విశేషం. 2012 నాటికి కేవలం 75 పులులు ఉన్నట్లు అటవీ అధికారులు ప్రకటించారు. పులుల లెక్కింపును స్టాండర్డ్ ఫగ్‌మార్క్ పద్ధతిని అవలంభిస్తారు. పులుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. అయితే ఇటీవల కాలంలో నల్లమల అటవీ ప్రాంతంలోని ఎన్‌ఎస్‌టిఆర్‌లో పులులను చంపి చర్మాలు, గోళ్లను ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అటవీ సమీప గ్రామాల్లో నిరక్షరాస్యులైన వేటగాళ్లుతో పని చేయించుకుని కొంత సొమ్ము ముట్టజెప్పి దాదాపు రూ.40 లక్షలకు ఒక్కో చర్మం అమ్ముకుంటున్నట్లు సమాచారం. వెలుగోడు రేంజ్‌లోని నారపురెడ్డికుంట వద్ద రెండు పులులు విషాహారం తిని చనిపోయినట్లు సమాచారం. అలాగే ఎనిమిది నెలల క్రితం శివపురం గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఓ పులి ఉచ్చులో పడి చనిపోయినట్లు రైతులు పేర్కొంటున్నారు. అధికారులకు అడవిలోని వన్యప్రాణులను అమూల్యమైన వృక్ష సంపదను సంరక్షించడానికి వాహనాలు, సిబ్బందిని ప్రభుత్వం కేటాయిస్తే అధికారులు మాత్రం వాహనాలను వారి వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకుంటున్నారే అటవీప్రాంతంలో తిరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీ సంరక్షణ కోసం లక్షలాది రూపాయలతో బేస్‌క్యాంపులు, కందకాలు తవ్వడం వంటి కార్యక్రమాలు చేపట్టినా వేటగాళ్లు మాత్రం నాటు తుపాకులతో యథేచ్ఛగా తిరుగుతూ వేటాడుతున్నట్లు పొలపర్లు పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో ఆత్మకూరు డిఎస్‌పి నరసింహారెడ్డి నల్లమల అటవీ సమీపంలో ఉన్న సిద్దాపురం గ్రామస్థుల నుంచి పది నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు అడవిలో విచ్చలవిడిగా సంచరిస్తూ కనిపించిన వారిని భయపెడుతూ యథేచ్ఛగా జంతువులను వేటాడి మాంసాన్ని కిలోల లెక్కన విక్రయించుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఐనముక్కల గ్రామంలో విజయబాబు నుంచి రెండు పులి చర్మాలను స్వాధీనం చేసుకుని అతన్ని విచారించగా సిద్దాపురం గ్రామంలో ఉన్న ఓ వ్యక్తి విక్రయించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. ఇంకా లెక్కలోకి రాని పులులు ఎన్నో మరణించినట్లు అటవీ సమీప గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఈ విషయం తెలిసినా తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అని అటవీశాఖ అధికారులు పుకార్లంటూ కొట్టివేస్తున్నారు. ఏటేటా పులుల సంఖ్య పెరుగుతోందని అశాస్ర్తియమైన సాంకేతిక పరిజ్ఞానంతో లెక్కలేస్తూ ప్రభుత్వానికి తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతినెలా మొదటి వారంలో పులుల సంచారాన్ని గుర్తించి సున్నిపెంటలో ఉన్న బయోడైవర్శిటీ అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంతో కార్యాలయ గదుల్లోనే కూర్చుని తూతూమంత్రంగా ఒకటో రెండో రాసుకుంటూ కాలం వెలిబుచ్చుతున్నట్లు సమాచారం. అలాగే ఎవరైనా వన్యప్రాణిని వేటాడి దొరికితే ఎఫ్‌ఐఆర్ రాయాల్సిన అధికారి కింది సిబ్బందితో కేసు నీరుగారే విధంగా రాస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో సాక్ష్యాత్తు అటవీ సిబ్బందిపైనే వేటగాళ్లు దాడిచేస్తే ఎఫ్‌ఐఆర్ బలహీనంగా రాసి పోలీస్‌స్టేషన్‌లో వేటగాళ్లతో రాజీ అయిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. దీంతో కిందిస్థాయి సిబ్బంది ఏమీ చేయలేక వేటగాళ్లు చేసే అక్రమాలు, అరాచకాలను భరించాల్సి వస్తోందని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించి పులుల సంరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
టిడిపి విజయం చూసి ఓర్వలేకే విమర్శలు
* ‘కోట్ల’ కోచ్ ప్యాక్టరీ ఎక్కడ?
* కాంగ్రెస్ నేతలకు మతిస్థిమితం లేదు
* మాజీమంత్రి కెయి ప్రభాకర్
కర్నూలు సిటీ, ఆగస్టు 24 : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన మెజార్టీని చూసి ఓర్వలేకే లేనిపోని అబాండాలు వేస్తున్నారని మాజీమంత్రి కెయి ప్రభాకర్ అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో టిడిపి జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అనవసరం తమ కుటుంబంపై అబాండాలు వేయటం తగదని సూచించారు. కోట్ల గత ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలై ప్రజలకు ముఖం చూపించలేక సొంత ఊరెళ్లి వ్యవసాయం చేసుకుంటూ గుడుపుతున్నాడన్నారు. ఈనేపథ్యంలో తన ఉనికి కోల్పోతామని భయపడి ప్రజల ముందుకు రాలేక ఇలా చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్న పది సంవత్సరాలు ఏం చేశారని ప్రశ్నిచారు. అంతేకాక చెరుకులపాడు నారాయణరెడ్డికి ఏమైనా అయితే కెయి కుటుంబానిదే బాధ్యత అని కోట్ల అన్న దానిపై ఆయన స్పందిస్తూ అందుకు తాము బాధ్యత వహిస్తాం, అయితే నారాయణరెడ్డి చేసిన చిన్న సోమన్న కిడ్నాప్‌తోపాటు ఎరుకలచెర్వులో వ్యక్తి అదృశ్యం కేసు, చెరుకులపాడులోని కురబ రోశన్న హత్య కేసును ఒప్పుకుంటాడా? అని ప్రశ్నించారు. ముఖ్యంగా గన్‌మెన్ల తొలగింపు అనేది ప్రభుత్వ పాలసీ అని అన్నారు. ఆ పాలసీకి అందరూ సమానమేనన్నారు. మాజీ ఎమ్మెల్యేలందరికీ ప్రభుత్వం గన్‌మెన్లను తొలగించిందన్నారు. గతంలో పరిటాల రవికి ప్రాణహాని ఉందని మొరపెట్టుకున్నా, ఆఖరికి ప్రధానికి ఫిర్యాదు చేసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కెడిసిసిలో 21 మంది సభ్యులు ఉంటే దాదాపు 17 మంది సంతకాలు చేశారని, తక్షణమే కెడిసిసి చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి పరూఖ్ మాట్లాడుతూ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయి సొంత ఊర్లో విశ్రాంతి తీసుకుంటూ, ఈరోజు బయటికి వచ్చి నిరాధారమైన వాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కర్నూలుకు ఇంటర్‌సిటీ, కోచ్ ఫాక్టరీ సాధించి పెట్టానని గొప్పలు చెప్పకున్నారని, అసలు కోచ్ ప్యాక్టరీ ఎక్కడా? అని ప్రశ్నించారు. మాజీమంత్రినైన తనకు గన్‌మెన్ లేడని, ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా చేస్తూ అవసరమైన వారికి మాత్రమే గన్‌మెన్లను నియమిస్తుందని గుర్తు చేశారు. అంతేగానీ చెరుకులపాటి నారాయణరెడ్డికి గన్‌మెన్‌ను తొలగించారని లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని, ఆయనేమైనా ఎమ్మెల్యేనా అని ప్రశ్నించారు. కాగా పిసిసి అధ్యక్షునిగా ఉన్న రఘువీరారెడ్డి ప్రకాశం పంతులు ఉత్సవాల్లో పాల్గొనకపోవటం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు యాదవ్, జంపాల మధు, తిరుపాల్‌బాబు, మల్లెల పుల్లారెడ్డి, హనుమంతరాయ చౌదరి, సతీష్ చౌదరి, రామకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.

పచ్చదనంతో సమృద్ధిగా వర్షాలు
* నంద్యాల ఎంపి ఎస్పీవైరెడ్డి
నంద్యాల అర్బన్, ఆగస్టు 24: పచ్చదనం పెంచుకుని పర్యావరణాన్ని కాపాడుకుంటేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పేద, సాద సుఖంగా జీవిస్తారని నంద్యాల పార్లమెంట్ సభ్యులు ఎస్పీవైరెడ్డి అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని ఎన్జీఓ కాలనీలోగల పురపాలక ఉన్నత పాఠశాలలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, చైర్ పర్సన్ దేశం సులోచన, కౌన్సిలర్లు, పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపి ఎస్పీవైరెడ్డి మాట్లాడుతూ పట్టణాలు, నగరాలు కాంక్రీట్ జంగల్స్‌గా మారడం వల్లే వర్షాలు సరిగా కురవడం లేదని, ఈ పరిస్థితి ఈ సంవత్సరంలో కళ్లకు కట్టినట్లు తెలిసిందని, రైతులు వర్షాలు కురవక పోవడంతో అల్లాడుతున్నారని అన్నారు. రాయలసీమలో ఎక్కువ భాగం వర్షాధారం క్రిందనే పంటలు సాగవుతున్నాయని, పచ్చదనాన్ని పెంచుకున్నపుడే సకాలంలో వర్షాలు కురుస్తాయని, వ్యవసాయం బాగా సాగినపుడే కరవు కాటకాలు ఉండవని ప్రజలంతా సుఖంగా జీవిస్తారని అన్నారు. నంద్యాల పట్టణంలో పచ్చదనం పెంచుకునేందుకు ప్రతి ఇంటి యజమాని నీడనిచ్చే ఒక మొక్కను నాటి పెంచుకుంటే దాని ఫలితం మనకు తొందరలోనే కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ దేశం సులోచన మాట్లాడుతూ మొక్కలు పెంచడంలో బాలికలు, మహిళలు ఉత్సాహంగా ముందుకు రావాలని, పురపాలక సంఘంలోని పొదుపు సంఘాల మహిళలు, పాఠశాలల అధ్యాపకులు, విద్యార్థులు మొక్కలు నాటి వాటిని సంరక్షించినపుడే భవిష్యత్ తరాలవారికి సహజ వనరులు ఇవ్వగలుగుతామన్నారు. మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణ పరిధిలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో 25వేల మొక్కలు నాటేందుకు అందుబాటులో ఉంచామన్నారు. మొక్కలు అవసరమైన వారు పురపాలక సంఘం అధికారులను సంప్రదించి తీసుకుపోవచ్చన్నారు. అలాగే నంద్యాల పట్టణంలో పచ్చదనం పెంచేందుకు నడుం బిగించిన బడ్డింగ్ హ్యాండ్స్ స్వచ్చంద సంస్థవారు కూడా 10వేల మొక్కలు పట్టణ ప్రజలకోసం అందుబాటులో ఉంచారని, ఈ మొక్కలను నాటడమే గాకుండా వాటిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. పురపాలకసంఘం, స్వచ్చంద సంస్థలు, బ్యాంకులు, వ్యాపార సంస్థలు, పారిశ్రామిక వేత్తలు ముందుకువచ్చి మొక్కలను సంరక్షించుకునేందుకు ట్రీ గార్డ్స్ అందజేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజ నీరు పాండురంగారావు, డిఇ నందయ్య, ఎఇలు రవిప్రకాష్, శ్రీనివాసరెడ్డి, శానిటరీ సూపర్‌వైజర్ జబ్బార్‌మియా, నర్సారెడ్డి, పిఓ సతీష్‌లతో పాటు పురపాలక పాఠశాల అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలను నాటారు.
లోకకల్యాణం కోసమే ధన్వంతరి యాగం
* 1800 మూలికల సువాసనతో గుభాళించిన మంత్రాలయం
* విశేషంగా పాల్గొన్న భక్తులు
మంత్రాలయం, ఆగస్టు 24 : పావన పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో ఆదివారం లోకకల్యాణం కోసం వైభవంగా ధన్వంతరి యాగంను వేదపండితుల మంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాలు, సుగందధ్రవ్యాలు, వనమూలికలతో నిర్వహించారు. దీంతో మంత్రాలయం క్షేత్రం వనమూలికల సువాసనలతో పరిమళించిది. బెంగళూరుకు చెందిన డాక్టర్ అశోక్‌కుమార్ సుమారు రూ.45 లక్షల వ్యయంతో 1800ల వనమూలికలతో మంత్రాలయంలో ధన్వంతరి యాగంను నిర్వహించారు. శ్రీమఠం యోగీంద్ర మండపం ముందు బాగంలో పెద్ద ఎత్తున ధన్వంతరి యాగంను ఉడిపిలోని అష్టమఠలకు చెందిన 30 మంది పాండిత్య వేధపండితులతో నిర్వహించారు. మఠం పీఠాదిపతులు శ్రీసుభుదేంద్రతీర్థులు అద్వర్యంలో ధన్వంతరి యాగంకు ప్రత్యేక పూజలు చేసి పూర్ణాహుతి నిర్వహించారు. యాగం తీలకించేందుకు ప్రత్యేకంగా ఉడిపి, బెంగళూరు, మంగళూరు, తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున డాక్టర్ అశోక్‌కుమార్‌కు దగ్గర చికిత్సలు తీసుకుంటున్న రోగులు తరలివచ్చారు.
ఆయుర్వేదంతో శాశ్వత రోగ నివారణ
ఆయుర్వేధం ద్వార శాశ్వతంగా రోగం నివారించవచ్చని డాక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. కేవలం రూ. 6 వేలుతో గుండెకు సంబందిచిన జబ్బును శాశ్వతంగా నయంచేయవచ్చన్నారు. అదే అల్లోపతి ద్వారా అయితే రూ. లక్షలు ఖర్చు చేసిన గుండె జబ్బు పూర్తిగా నయం కాదని తాత్కలికంగా మాత్రమే ఉపశమనం కల్గిస్తుందన్నారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 19 చోట్ల ధన్వంతరి యాగం చేయడం జరిగిందన్ని పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో 20వ ధన్వంతరి యాగం చేయడం ఎంతో సంతోషకరమాన్నారు.
సర్వరోగ నివారిణి ఆయుర్వేదం
సర్వరోగాలకు ఆయుర్వేదం మందులు చాల ఉపయోగకరంగా వుంటాయని మఠం పీఠాధిపతులు శ్రీసుభుదేంద్రతీర్థులు అన్నారు. ఆదివారం జరిగిన ధన్వంతరి యాగంలో భక్తులను ఉద్దేశించి మఠం పీఠాధిపతులు సుభుదేంద్రతీర్థులు మాట్లాడారు. దేశంలోని వనమూలికలను తీసుకువచ్చి ఇలాంటి యాగాలను చేయడం వల్ల దేశం సుభిక్షంగా వుంటుందన్నారు. అంతేకాకుండా యాగంలోకి వనమూలికలను వేయడం వల్ల దాని ద్వార వచ్చే పొగను ఆశ్వదిస్తే రోగాలు మాయవౌతాయన్నారు. అనంతరం ఈయాగంలో పాల్గొన డాక్టర్ అశోక్‌కుమార్‌కు, కర్ణాటక మాజీ డిజిపి గోపాల్ హోసూరుకు, శ్రీనివాస్‌తంత్రీక, వేదపండితులకు మఠం పీఠాధిపతులు స్వామి వారి శేషవస్త్రం, ఫలమంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వాదించారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు రాజాఎస్ గిరియాచార్యులు, వీఆర్ పంచముఖి, వాజీంద్రచార్, వెంకటేశాచార్, మఠం మేనేజర్ శ్రీనివాసరావు, శ్రీపతాచార్, అనంతస్వామి, వాదిరాజాచార్, గిరిష్ కనకవీడు, గోరుకల్లు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా తరగతులు
నిర్వహిస్తే దాడులు చేస్తాం
* ఎబివిపి నేతల హెచ్చరిక
కర్నూలు ఓల్డ్‌సిటీ, ఆగస్టు 24 : నగరంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తే దాడులు చేస్తామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) హెచ్చరించింది. ఈ మేరకు ఎబివిపి ఆధ్వర్యంలో ఆదివారం నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎబివిపి నగర కార్యదర్శి శివ మాట్లాడుతూ సెలవు దినాల్లో ప్రైవేట్ విద్యా సంస్థలు తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోకుండా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. విద్యార్థులను ర్యాంకులు, మార్కులు సాధించే యంత్రాలుగా తయారు చేస్తున్న ప్రైవేటుట్ కార్పొరేట్ విద్యా మాఫీయాను తరిమివేయాలన్నారు. నిబంధనలను తుంగలో తొక్కి విద్యా సంస్థలపై దాడులు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికైన డిఇఓ స్పందించి ఇలాంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి కార్యాలయం కార్యదర్శి రాజేష్, జోనల్ ఇంచార్జిలు ప్రశాంత్, సురేష్, ఎబివిపి కార్యకర్తలు లోకేష్, మణికంఠ, శ్రీరామ్, సాయి, గోపాల్ పాల్గొన్నారు.
సిఎం దృష్టికి గని కార్మికల సమస్యలు
* ఎమ్మెల్యే బిసి జనార్ధన్‌రెడ్డి
బనగానపల్లె, ఆగస్టు 24 : మండలంలోని మీరాపురం సమీపంలో ఉన్న లైమ్‌స్టోన్ గనుల్లో పనిచేసే కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే బిసి జనార్ధన్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేతోపాటు నంద్యాల ఆర్డీఓ నరసింహులు, మైనింగ్ ఎడి రాజశేఖర్, బనగానపల్లె తహశీల్దార్ ఏ శేషఫణి, ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి ఆదివారం గనుల ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 160 ఎకరాల్లో గనులకు గతంలో లీజులు ఇచ్చారని, అయితే దీన్ని మహాసిమంట్ ఫ్యాక్టరీకి లీజులు బదలాయించడంతో సమస్య వచ్చిందన్నారు. దీనివల్ల సుమారు 150 కార్మికుల కుటుంబాలు ఉపాధి కోల్పోయి వీధిన పడినట్లు అయిందన్నారు. ఈ సంఘటనతో తాము కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడంతో స్పందించిన ఆయన పరిశీలించి నివేదిక సమర్పించాలని నంద్యాల ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇందులో భాగంగానే గనులను పరిశీలించినట్లు తెలిపారు. సిమెంట్ ఫ్యాక్టరీకి ఎంతమేరకు లీజులు ఇచ్చారు, యాగంటి ఆలయం సమీపంలో గనులకు లీజులు ఎందుకు ఇచ్చారని, దీనివల్ల ఆలయ ఉనికి ముప్పు వాటిల్లుతుందని మైనింగ్ అధికారులను ప్రశ్నించారు. యాగంటి ఆలయం సమీపంలో లీజులు రద్దు చేయాలన్నారు. అలాగే మీరాపురం కార్మికుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడమే కాకుండా సిఎంతో స్వయంగా మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
నిర్ణయం కలెక్టర్‌దే : ఆర్డీఓ
గనుల సమస్యపై తుది నిర్ణయం కలెక్టర్‌దేనని ఆర్డీఓ నరసింహులు అన్నారు. వీరాపురం గనుల్లో పనులను సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం అడ్డుకోవడం వల్ల కార్మికులు ఉపాధి కోల్పోయిన విషయం వాస్తవమన్నారు. అయితే ఈ లీజులు ఎవరు ఎప్పుడు ఇచ్చారు. తర్వాత బదలాయింపు గురించి విచారించడం, లీజు జీఓలను పరిశీలించాల్సి ఉందన్నారు. తాము మైనింగ్ అధికారులతో కలిసి పూర్తిగా విచారించి, పరిశీలించి సమగ్రత నివేదికను కలెక్టరుకు సమర్పిస్తామన్నారు. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ చర్చించుకుని తుది నిర్ణయం తీసుకుంటారన్నారు.
పిడుగు పడి ఒకరి మృతి
* ఇద్దరికి తీవ్రగాయాలు
గోనెగండ్ల, ఆగస్టు 24:గోనెగండ్లకు చెందిన కందనాతి హాసీఫ్ (14) ఆదివారం రాత్రి పిడుగు పడి మృతి చెందాడు. మృతుని తండ్రి కందనాతి సలామ్, తమ్మడు అబ్బాస్‌లకు తీవ్రగాయాలైనాయి. ఉల్లి పంటకు నీరు కట్టడానికి వెళ్ళిన తండ్రి కుమారుడు ఈ ప్రమాదబారిన పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు స్థానిక జెడ్పీ హైస్కూల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నట్లు తల్లి కాషీబీ తెలిపింది. ప్రమాదంలో కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కలాం స్ఫూర్తితో ఆత్రేయ చిత్రం
* దర్శకులు శాంతికుమార్
కర్నూలు ఓల్డ్‌సిటీ, ఆగస్టు 24 : మాజీ రాష్టప్రతి అబ్దల్ కలాం స్ఫూర్తితోనే ఆత్రేయ చిత్రాన్ని తీశానని ఆత్రేయ చిత్ర దర్శకులు శాంతి కుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక శ్రీరామ థియేటర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం అన్నట్లుగా పేదల కోసం, అనాథల కోసం తమ వంతు సహాయం అందినపుడు నిజమైన భారతీయుడని అన్నారని తెలిపారు. తాను 3 చిత్రాలు తీశానని ఇది తన 3వ సినిమా అని ఈ చిత్రం ద్వారా వచ్చే నిధులను నిరుపేదలు, అనాథ చిన్నారులకు ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. తాను న్యూ జెర్సీలో తెలుగు అసోసియేషన్ గత పది సంవత్సరాలు పని చేశానని ఆక్కడ తాను ప్రదర్శించిన నాటకాలు ప్రాచ్యురం పొందాయన్నారు. తన తండ్రి సామాన్య ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే మేకప్‌మేన్‌గా చేస్తూ కళారంగానికి సేవ చేశారని తెలిపారు. తనకు కూడా కళలపై ఉన్న కోరితోనే సమాజానికి ఉపయోగ పడే చిత్రాలను తీస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి ఆత్రేయ పేరు ఎందుకు పెట్టామంటే ఆయన నిజ జీవితంలో ఉన్న ప్రజల హృదయాలకు హత్తుకునే రచనలు చేశారని తెలిపారు. ఈ చిత్రంలో తన కుమారుడు ఆధిత్య హీరోగా నటిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ నెల దసరన పండుగ రోజున విడుదల చేస్తామన్నారు. హీరో ఆధిత్య మాట్లాడుతూ ఈ చిత్రం కేవలం చిన్నారుల కోసమే తీసినట్లు తెలిపారు. హెచ్‌ఆర్ మేనేజర్ ఇమ్మానియేల్ మాట్లాడుతూ సిఎస్‌ఆర్ సంస్థ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా వృద్ధులు, అనాథలకు ఏటా 8లక్షల నుండి 10లక్షల దాకా ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

* చెలరేగుతున్న వేటగాళ్లు * యథేచ్ఛగా చర్మాలు, మాసం విక్రయం * పట్టించుకోని అధికారులు
english title: 
pululu

పాలమూరులో భారీ వర్షం

$
0
0

* నేలకొరిగిన చెట్లు.. తెగిన విద్యుత్ వైర్లు
* నిలిచిపోయిన కరెంట్ సరఫరా
చీకటిమయమైన జిల్లా కేంద్రం
* జలమయమైన రోడ్లు..
రాకపోకలకు అంతరాయం
మహబూబ్‌నగర్, ఆగస్టు 24: ఉదయం నుండి మధ్యాహ్నం వరకు భానుడి ప్రతాపంతో భగభగమన్న పాలమూరు పట్టణం సాయంత్రం ఒక్కసారిగా కారుమబ్బులతో కమ్ముకుని భారీ ఈదురుగాలులు వీచాయి. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ పట్టణంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కుంభవృష్టితో కూడిన వర్షం కురిసింది. దాంతో పట్టణంలోని రోడ్లన్నీ జలమయంగా మారాయి. ముఖ్యంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురియడంతో పట్టణంలోని పలు వీధులలో చెట్లు నేలకొరిగాయి. దాంతో విద్యుత్ వైర్లపై చెట్లు విరిగిపడటంతో వైర్లు సైతం తెగిపడ్డాయి. విద్యుత్ వైర్లపై చెట్లు విరిగిపడటంతో మహబూబ్‌నగర్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలన్ని చీకటిమయంగా మారాయి. రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షం పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. పాత బస్టాండ్, రాజేంద్రనగర్, న్యూటౌన్, బాయమ్మతోట, మర్లు, కలెక్టరేట్ సమీపంలోని పెద్దపెద్ద చెట్లు విరిగి విద్యుత్ వైర్లపై కూలడంతో వైర్లు తెగిపడ్డాయి. పట్టణంలోని వివిధ వీధులకు కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాత్రి పొద్దుపోయే దాక కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలుల కారణంగా మహబూబ్‌నగర్ పట్టణంలోని పలు వీధులలో ఒక్కసారిగా చెట్లు కూలి విద్యుత్ వైర్లపై పడటంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడి పట్టణమంతా చీకటిమయంగా మారింది. జిల్లా కేంద్రం నుండి హన్వాడ, భూత్పూర్, నవాబుపేట, కోయిలకొండ, దేవరకద్ర తదితర మండలాలకు కరెంట్ సరఫరాకు సైతం అంతరాయం ఏర్పడటంతో ఆయా మండలాల్లోని గ్రామాలు చీకటిమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లో న్యూటౌన్, రాజేంద్రనగర్, టిడిగుట్ట, కలెక్టరేట్, తెలంగాణ చౌరస్తా, బోయపల్లి గేటు, రైల్వేస్టేషన్ సమీపంలో రోడ్లపై వర్షం నీరు ఏరులై పారింది. ఏ రోడ్డు చూసినా జలమయమై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. న్యూటౌన్‌లో దాదాపు మూడు ఫీట్లకు పైగా రోడ్డుపై వర్షం నీరు నిల్వ ఉండటంతో హైదరాబాద్ - రాయిచూర్ వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉండగా వాహనాలను పోలీసులు దారి మళ్లించి పిల్లలమర్రి రోడ్డు నుంచి ప్రేమ్‌నగర్ మీదుగా తెలంగాణ చౌరస్తా, పాత బస్టాండ్, క్లాక్‌టవర్, రాజీవ్ చౌక్ మార్గాన వాహనాల రాకపోకలు కొనసాగాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రెండు మూడు ఫీట్ల మేరకు ప్రధాన రహదారిపై వర్షం నీరు నిలువ ఉండటంతో కొత్త బస్టాండ్ పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది. మహబూబ్‌నగర్ పట్టణంలో ఉన్నటువంటి ఏకైక ప్రధాన రోడ్డు మార్గం పలు ప్రాంతాలలో జల దిగ్బంధం కావడంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించి వివిధ వీధుల గుండా నారాయణపేట, మక్తల్, రాయిచూర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, కొడంగల్ ప్రాంతాలకు వెళ్లే వాహనాలను మళ్లించారు. కాగా ట్రాన్స్‌కో అధికారులను కరెంట్ సరఫరాపై ఆరా తీయగా పట్టణంలోని పలు వీధులలో చెట్లు విరిగి విద్యుత్ వైర్లపై పడటంతో వైర్లు కూడా తెగిపోవడంతో వాటిని సరి చేయడానికి మరో 12 గంటల సమయం పట్టవచ్చని వెల్లడించారు.

అవగాహనా లోపంతో అయోమయం
* పంట బీమా ప్రీమియంపై రైతులకు
అవగాహన కరువు
* ఆరు రోజుల గడువుతో అయోమయం
* 30 నాటికి బీమా ప్రీమియం
చెల్లించిన రైతులకే వర్తింపు
* పత్తి రైతులకు స్పష్టత లేక దిగాలు
మహబూబ్‌నగర్, ఆగస్టు 24: తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో కరవు ఛాయలు నెలకొన్నాయి. దాంతో పంటలు ఎండిపోతున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఇన్సూరెన్స్ కంపెనీలకు పంట బీమా పథకాన్ని అమలు చేయాలని ఆదేశించడంతో బీమా సంస్థలు ఈనెల 30వ తేదీలోపు రైతులు తమ పంటలకు బీమా చెల్లిస్తే పంట నష్టపరిహారం అందుతుందని గత నెల రోజుల క్రితమే మహబూబ్‌నగర్ జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే గత నెలలో రైతులకు ప్రచారం లేని కారణంగా జిల్లాలో ఆశించిన స్థాయిలో రైతులు పంటలపై బీమాను చేయించుకోలేకపోయారు. అయితే గత మూడు నాలుగు రోజుల క్రితం ప్రభుత్వం ఈనెల 30వ తేదీ వరకు కొత్తగా ఖరీఫ్ పంటలకు బీమా చేసుకోవడానికి జాతీయ పంటల బీమా పథకం నుండి ఈనెల 23వ తేదీన బీమా కంపెనీ ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఆరు రోజుల గడువు మాత్రమే ఉండటంతో రైతులందరు పంటలపై బీమా చేయించుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు భగవత్ స్వరూప్ తెలిపారు. కాగా మహబూబ్‌నగర్ జిల్లాలో మొక్కజొన్న, కంది, వరి పంటలతో పాటు పెద్దఎత్తున పత్తి పంటను కూడా రైతులు సాగు చేశారు. పత్తి పంటకు బీమా సౌకర్యం ఉందోలేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా జిల్లాలో 2.15 లక్షల హెక్టార్లలో పత్తి పంటను సాగు చేసిన రైతాంగం బీమా ప్రీమియం చెల్లింపుపై అయోమయంలో పడ్డారు. జూలై 31వ తేదీ వరకు పత్తికి బీమా ప్రీమియం చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీలు గడవు విధించడంతో అప్పట్లో వ్యవసాయశాఖ అధికారులు పత్తి రైతులకు అవగాహన కల్పించకపోవడంతో ఆశించిన స్థాయిలో బీమా ప్రీమియం చెల్లించలేకపోయారు. ప్రస్తుతం ఈనెల 30వ తేదీ వరకు బీమా ప్రీమియం చెల్లింపు గడువు ఉండటంతో అందులో పత్తిపై లేకపోవడంతో పత్తి సాగు చేసిన రైతులు మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరో ఆరు రోజుల గడువు మాత్రమే ఉండటంతో జిల్లా రైతాంగానికి వ్యవసాయశాఖ అధికారులు బీమా సౌకర్యంపై అవగాహన కల్పించకపోవడంతో జిల్లాలో ఇప్పటి వరకు ఎంతమంది రైతులు బీమా పథకంలో సభ్యులు అయ్యారో తెలియని పరిస్థితి ఉంది. ఏదిఏమైనప్పటికినీ పంటల బీమా పథకంపై జిల్లాలో రైతులకు ఆశించిన స్థాయిలో అవగాహన కలిగించకపోవడంతో బీమా ప్రీమియం చెల్లించడంలో వెనకంజలో ఉన్నారని చెప్పవచ్చు.

కాంగ్రెస్ శ్రేణుల్లో కదనోత్సాహం
మహబూబ్‌నగర్, ఆగస్టు 24: కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం భవిష్యత్తులో జిల్లాలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు తీసుకోవల్సిన చర్యలపై తెలంగాణ పిసిసి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నం హిందూ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ సదస్సుకు జిల్లా నుంచి పెద్దఎత్తున ఆ పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు ఉబేదుల్లా కొత్వాల్‌తో పాటు నాగర్‌కర్నూల్ ఎంపి నంది ఎల్లయ్య, మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి, ప్రస్తుత గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ, కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి, ఎఐసిసి కార్యదర్శి, వనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ చిన్నారెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్‌పర్సన్ రాధ అమర్‌తో పాటు గద్వాల, షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్లు సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో జిల్లా నేతలు ప్రసంగించి మహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తామని ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో పాటు కాంగ్రెస్ నేతలకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా 2009, 2014 రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సదస్సులో ఎన్నో అంశాలను ప్రస్తావించారు. అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పటికినీ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామనే అభిప్రాయాన్ని కూడా పలువురు కాంగ్రెస్ నాయకులు ఇందులో ప్రస్తావించినట్లు తెలిసింది. జిల్లాలోని 1331 గ్రామపంచాయతీలలో, మున్సిపాలిటీలలో వార్డుల వారిగా పార్టీని పటిష్టం చేసేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఇకమీదట ప్రతిపక్ష పార్టీ హోదాలో ప్రజాసమస్యలపై నిరంతరంగా ఉద్యమాలు చేసేందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఒకపక్క ప్రజల తరపున ఉద్యమాలు చేస్తూ మరోపక్క కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలను పటిష్టం చేసేందుకు కూడా పార్టీ సీనియర్ నాయకులు ఈ సదస్సులో చర్చించినట్లు సమాచారం. ఏదిఏమైనప్పటికినీ హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సదస్సు జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు నూతనోత్సాహాన్ని నింపిందని చెప్పవచ్చు.

డుమ్మా కొట్టిన బ్యాంకర్లపై కలెక్టర్ గుస్సా
* సమీక్షా సమావేశానికి హాజరుకాని పలువురు బ్యాంక్ అధికారులు
* ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టరు
కొందుర్గు, ఆగస్టు 24: రైతులు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాల వివరాలను పూర్తిగా బ్యాంక్ మేనేజర్లు జాబితాను ఇవ్వాలని జిల్లా కలెక్టరు జిడి ప్రియదర్శిని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కొందుర్గు మండల కేంద్రంలో బ్యాంకర్లు నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టరు జిడి ప్రియదర్శిని ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ఒకే బ్యాంకులో కాకుండా ఇతర బ్యాంకులలో తీసుకున్న రుణాల వివరాలు జాబితాను తెలపాలని, కుటుంబంలో ఒకరికి మాత్రమే లక్ష రూపాయల రుణమాఫీ వర్తిస్తుందని కలెక్టరు తెలిపారు. పంట రుణాలు, బంగారం రుణాలు రుణమాఫీకి వర్తిస్తాయని, బ్యాంకు అధికారులు రైతులు తీసుకున్న రుణాల వివరాలను పూర్తిగా అందజేయాలని ఆదేశించారు. కొంతమంది బ్యాంక్ అధికారులు సమావేశానికి హాజరుకాకపోవడంతో కలెక్టరు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని రైతులు మొత్తం 30.05కోట్ల రూపాయలను రుణాలు తీసుకున్నట్లు కలెక్టరు తెలిపారు. త్వరలో నిర్వహించే సోషల్ ఆడిట్‌లో ఒకే బ్యాంకుతోపాటు ఇతర బ్యాంకుల్లో రైతులు రుణాలు పొందినట్లు తేలితే రైతుల నుంచి డబ్బులను రికావరి చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో పంట రుణాల ప్రత్యేక అధికారి మదన్‌మోహన్ శెట్టి, షాద్‌నగర్, కొందుర్గు ఆంధ్రాబ్యాంకు మేనేజర్లు పుష్పలత, దివ్య, షాద్‌నగర్ ఎస్‌బిఐ మేనేజర్ కల్పనారాయ్, ఎస్‌బిహెచ్ కొల్లూర్ మేనేజర్ గోవింద్ రాజు, డిసిసిబి బ్యాంకు మేనేజర్ జ్యోతిరాణి, ఎపిజివిబి చౌదరిగూడ బ్రాంచి మేనేజర్ సురేష్, ఐసిఐసిఐ మేనేజర్ నవీన్, పిఎసిఎస్ కార్యదర్శి మహమూద్‌తోపాటు ఎంపిడివో శ్రీనివాసచార్య, డిప్యూటీ తహశీల్దార్ నాగేశ్వర్‌రావు, ఇవోఆర్డీ మహేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

గద్వాల మండలంలో
తీవ్ర తాగునీటి ఎద్దడి
* కలెక్టర్‌ను ఆశ్రయించిన పర్మాల గ్రామస్థులు
* ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని వినతి
గద్వాలటౌన్, ఆగస్టు 24: వర్షాభావ పరిస్థితులతో గద్వాల మండలంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. పిల్లాపాపలను వదిలి తాగునీటి కోసం వెంపర్లాడుతున్నారు. పంట పొలాలను ఆశ్రయిస్తున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ శనివారం పర్మాల గ్రామస్తులు జిల్లా కలెక్టర్ జిడి ప్రియదర్శిని ఆశ్రయించారు. ప్రత్యేక ట్యాంకర్లను ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. మండలంలోని శెట్టి ఆత్మకూర్, వెంకంపేట, పర్మాల, సంగాల, పూడూరు, వీరాపురం, అనంతపురం, ఎర్రపల్లి, బస్రాచెర్వు, ముల్కలపల్లి, తెలుగోనిపల్లి, బీరెల్లి తదితర గ్రామాలలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంది. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు ఎండకాలంలో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా ప్రజల దాహార్తి తీర్చేవారు. ఆగస్టు 1వ తేదీ నుండి అధికారుల సూచన మేరకు ట్యాంకర్ల సరఫరా నిలిపివేశారు. వర్షాభావం..కరెంటు కోతల కారణంగా తాగునీటి సమస్య జఠిలంగా మారింది. బిందె నీటి కోసం మూడు, నాలుగు కిలోమీటర్ల వెళ్లాల్సిన దుస్థితి తలెత్తింది. సంగాల, శెట్టి ఆత్మకూర్ గ్రామాలలోని బోర్లలో ఫ్లోరైడ్ నీరు వస్తుండడంతో ఆ నీటిని తాగరాదని అధికారులు సూచించారు. దీంతో ఆ రెండు గ్రామాలలో తాగునీటి కోసం రెండు, మూడు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. సైకిళ్లు, మోటార్ సైకిళ్లు, ఇతర వాహనాలపై వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నారు. మహిళలు వ్యవసాయ, కూలీ పనులు వదిలి నీటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రత్యేకంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

యూరియా కోసం
రైతుల ఘర్షణ
ధన్వాడ, ఆగస్టు 24: మండల పరిధిలోని తీలేరు సింగిల్‌విండో కార్యాలయం దగ్గర ఆదివారం యూరియా కోసం రైతులు ఘర్షణ పడ్డారు. తీలేరు సింగిల్‌విండో కార్యాలయానికి యూరియా బస్తాలు వచ్చాయని తెలుసుకున్న సింగిల్‌విండో పరిధిలోని గ్రామాల రైతులు పెద్దఎత్తున అక్కడికి వచ్చారు. యూరియా బస్తాలను తీసుకునేందుకు రైతులు క్యూ పద్దతి పాటించకపోవడంతో కొంత గందరగోళం ఏర్పడింది. పరిస్థితి అదుపుతప్పుతుందని గమనించిన సిఇఓ మాధవరావు మరికల్ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకుని రైతులు ఘర్షణ పడకుండా చర్యలు తీసుకున్నారు. చివరకు సింగిల్‌విండో మాధవరావు యూరియా బస్తాలను సోమవారం నుంచి పంపిణీ చేస్తామని చెప్పడంతో రైతులు అక్కడి నుండి వెళ్లిపోయారు.

సూర్యచంద్రులు ఉన్నంత వరకు టిడిపికి డోకా లేదు
* ప్రజల్లో చైతన్యం తెచ్చింది
ఎన్టీఆర్, బాబులే
* టిడిపి జిల్లా అధ్యక్షుడు
బక్కని నర్సిములు
వెల్దండ, ఆగస్టు 24: సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి డోకా లేదని, ప్రజలలో అన్ని రకాలుగా చైతన్యం తీసుకువచ్చింది దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడులేనని టిడిపి జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సిములు అన్నారు. ఆదివారం వెల్దండ మండల కేంద్రంలో టిడిపి మండల అధికార ప్రతినిధి యెన్నం సింహారెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సిములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లేదని గిట్టని వారు ప్రచారం చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారనే విషయాన్ని మరిచిపోయినట్లు ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంతో పాటు జాతీయ పార్టీగా గుర్తింపు కోసం చంద్రబాబునాయుడు వ్యూహరచన చేస్తున్నారని అన్నారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఒక్కొక్క రోజు చంద్రబాబు బస చేసి పార్టీ పటిష్టత కోసం శ్రీకారం చుట్టనున్నారని అన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం ఎన్టీఆర్, చంద్రబాబుల నుంచే సాధ్యమైందని, వీరిరువురి హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని అన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు, గ్రామ కమిటీలే మూల స్తంభాలు అని, కష్టకాలంలో ఉన్న పార్టీకి కార్యకర్తలు వెన్నంటే ఉండి పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పర్వత్‌రెడ్డి, టిడిపి తాలూకా ఇన్‌చార్జి దశరథ్‌నాయక్, మాజీ జడ్పీటిసి జంగయ్యగౌడ్, టిడిపి నాయకులు బాలకిష్టయ్యగౌడ్, సురేందర్‌గౌడ్, వజ్రలింగం, అంజప్ప, లక్ష్మోజి, అంజయ్యగౌడ్, బాలునాయక్, కండె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలి
విహెచ్‌పి జాతీయ నేత సత్యంజీ
గద్వాలటౌన్, ఆగస్టు 24: ధార్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని విహెచ్‌పి అఖిల భారత సహా కార్యదర్శి సత్యంజీ అన్నారు. ఆదివారం స్థానిక శివరామాంజనేయస్వామి ఆలయంలో విహెచ్‌పి హిందూ ధర్మప్రసార్ సమితి గ్రామ కమిటీ సభ్యుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సంస్కృతి, సాంప్రదాయాలను, సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలన్నారు. అంటరానితనం నిర్మూలన, అంబేద్కర్ ఆశయ సాధనకు విహెచ్‌పి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు, గోశాలలు, రక్తదాన శిబిరాలు నిర్వహించాలని సూచించారు. మతమార్పిడిలను అరికట్టాలని చెప్పారు. హిందూ బాలబాలికల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు జనహిత ఏకోపాధ్యాయ పాఠశాలలను విహెచ్‌పి నడుపుతోందన్నారు. ప్రతి గ్రామంలో కమిటీలు విహెచ్‌పి స్వర్ణ జయంతి ఉత్సవాలను ఏడాది పొడవున ధార్మిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్‌పి జిల్లా గౌరవ అధ్యక్షుడు అల్లూరి ఫణిమోహన్‌రావు, విహెచ్‌పి ధర్మప్రసార్ గద్వాల ప్రఖండ అధ్యక్షుడు సైదయ్య, జిల్లా ప్రముఖ్ జగదీశ్వర్‌రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఉత్సవాలకు ముస్తాబైన కుంబేస్వరస్వామి క్షేత్రం
మక్తల్, ఆగస్టు 24: మక్తల్ పట్టణంలో గల శివాజినగర్‌లోని శ్రీ కుంబేస్వరస్వామి ఆలయంలో శ్రావణమాసం పర్వదినోత్సవాలలో భాగంగా నెల రోజుల పాటు భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో భజనలు, విశేష పూజలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో సోమవారం శ్రావణ అమావాస్య ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్వాహకులు ఆలయాన్ని ఎంతో శోభయమానంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయంలో సోమవారం ఉదయం 8 గంటలకు రద్రాభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 6 గంటలకు పల్లకి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కర్మాచారి హన్మంతు, పాండు, లక్ష్మణ్‌లు తెలిపారు. వరంగల్‌లోని వెయ్యి స్థంబాల ఆలయం మాదిరిగా మక్తల్ పట్టణంలోని కుంబేశ్వరాలయం ఉందని చెప్పారు. అతి పురాతనమైన మందిరంగా పేరొందిన ఈ మందిరాన్ని యువకులు ఎంతో సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. మందిర అభివృద్ధికి ఎంతో మంది దాతలు సహకరించండతో నేడు ఈ మందిరం మక్తల్ పట్టణ నడిఒడ్డున ఎంతో సుందరంగా ఉండటం, వరంగల్‌లోని వేయి స్తంభాల మందిరాన్ని తలపించే విదంగా ఉండటం ఈప్రాంత హిందూ బందూవులందరు తమ అధృష్టంగా భావిస్తున్నారని నిర్వాకులు తెలిపారు. ఇట్టి దేవాలయ విశేష క్యాక్రమాలను తిలకించేందుకు మక్తల్ పట్టణ పురప్రముఖులతో పాటు వివిద గ్రామాల నుండి భక్తులు తరలి రావాలని వారు కోరారు. ఆలయ ప్రాంగణంలో కోలాటం, భజనలు, దాండియా, చెక్క్భజన, పలుకలకోలు వంటి భక్తి కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.

నేటి నుంచి శ్రీ మల్లిఖార్జునస్వామి బ్రహ్మోత్సవాలు
ధన్వాడ, ఆగస్టు 24: ధన్వాడ మండలం మరికల్ పట్టణంలో వెలసిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లిఖార్జునస్వామి శ్రావణమాస బ్రహ్మోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయని వీరశైవ సంఘం అధ్యక్షుడు జగదీశ్వర్ తెలిపారు. ఆదివారం మరికల్ పట్టణంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ మాట్లాడుతూ ఈనెల 25 నుండి 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. ఈనెల 25న శ్రీ మల్లిఖార్జునస్వామికి అభిషేకం, మంగళ హారతి, బిందె సేవ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 26న మహా రుద్రాభిషేకం, రథోత్సవం, పల్లకి సేవ, 27న అగ్నిగుండం, డోలాహరణ, మహా మంగళ హారతి కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సంఘం కార్యదర్శి టైలర్ వీరన్న, సభ్యులు జగదీష్, శెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

పరుగున వస్తున్న పార్వతీ తనయుడు
* గద్వాలలో చవితి వేడుకలకు
సిద్ధమైన వినాయక విగ్రహాలు
* వివిధ ఆకృతులలో
ఆకట్టుకుంటున్న గణనాథులు
గద్వాలటౌన్, ఆగస్టు 24: అమ్మకానికి గణనాథులు సిద్ధంగా ఉన్నారు. చిన్న..పెద్ద..సైజు వినాయకులు పట్టణంలో సిద్ధంగా ఉన్నాయి. ఈ నెల 29వ తేదీన వినాయక చవితి సందర్భంగా యువకులు, చిన్నారులు చందాలు పోగు చేస్తున్నారు. రూ.1000 నుండి రూ.30 వేల వరకు వినాయకులను బుక్ చేస్తున్నారు. బుక్ చేసుకున్న వినాయకులకు గుర్తులు వేశారు. గజాననపై, ఆంజనేయునిపై ఉన్న వినాయకులు ఆకట్టుకుంటున్నారు. విష్ణుమూర్తి ఆకారంలో వినాయకులు లభ్యమవుతున్నారు. పట్టణంలోని వినాయక కొనుగోలు కేంద్రాల ప్రజలతో కిటకిటలాడుతున్నాయి.

* నేలకొరిగిన చెట్లు.. తెగిన విద్యుత్ వైర్లు * నిలిచిపోయిన కరెంట్ సరఫరా చీకటిమయమైన జిల్లా కేంద్రం * జలమయమైన రోడ్లు.. రాకపోకలకు అంతరాయం
english title: 
heavy rain

ఉప ఎన్నికతో వేడెక్కిన రాజకీయం

$
0
0

గెలుపే లక్ష్యంగా బిజెపి-టిడిపి ఉమ్మడి అభ్యర్థిని దింపే యత్నం * అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న టిఆర్‌ఎస్, కాంగ్రెస్ * జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలతో నేడు కెసిఆర్ సమావేశం
సంగారెడ్డి, ఆగస్టు 24: వచ్చే నెల 13న జరిగే మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు సమీపిస్తుండగా అభ్యర్థుల ఎంపికకు పార్టీలు కసరత్తు చేస్తుండగా ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. బిజెపి-టిడిపి ఉప ఎన్నికలో కూడా ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపి గెలుపే లక్ష్యంగా అన్ని రకాల ఎత్తులు వేస్తున్నాయి. టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ ఎవరికి వారే స్వశక్తితో అభ్యర్థులను రంగంలోకి దింపి తమ సత్తాను నిరూపించుకోవాలని ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇందుకుగాను అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ వివాదరహితురాలైన మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి పేరును పరిశీలించి దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. టిడిపి-బిజెపి అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో ముఖాముఖీ పోటీ పడి గెలుపు దరిదాపుల్లోకి వచ్చిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డిని బరిలోకి దింపితే ఏ విధమైన ఫలితం ఉంటుందని, బిజెపి అభ్యర్థిని ఎవరిని పోటీకి నిలుపాలనే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపికి పోటీ చేసే అవకాశం వస్తే జిల్లాకు చెందిన వారిని పోటీలో నిలుపాలా లేక అధికార టిఆర్‌ఎస్ పార్టీని సమర్థవంతంగా ఎదుర్కొనే పొరుగు జిల్లాకు చెందిన వారికి అవకాశం కల్పించాలా అనే సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్‌రెడ్డి పేరును ఖరారు చేయవచ్చని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటుండగా ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం టిఎన్‌జివోస్ కేంద్ర కమిటీ అధ్యక్షులు దేవి ప్రసాద్‌కు అవకాశం ఇవ్వాలని పట్టుపడుతున్నారు. సింగపూర్ పర్యటనకు వెళ్లిన కెసిఆర్ సోమవారం వచ్చి జిల్లాకు చెందిన మంత్రి హరీష్‌రావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి జిల్లా స్థితిగతులపై సమీక్షించి, అభ్యర్థి విషయంలో కూడా చర్చించనున్నారు. ఈ విషయమై ఇప్పటికే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలకు సమావేశానికి రావాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. టికెట్ ఆశిస్తున్న ఆయా నేతలు ఎమ్మెల్యేల ద్వారా సిఫార్సు చేయించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నా చివరకి కెసిఆర్ మాటే శిరోధార్యమని చెప్పుకునే ఎమ్మెల్యేలు కూడా లేకపోలేదు. ప్రధాన పార్టీలైన టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి ఇప్పటి వరకు అభ్యర్థులను ఖరారు చేయకపోగా ఆయా పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా పరువు ప్రతిష్టగా భావించడమే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీచరిస్మాను ఉపయోగించి మరోమారు మెదక్ పార్లమెంటుపై పాగా వేయాలని వ్యూహరచన చేస్తోంది. బలమైన అభ్యర్థిని బరిలో దింపితేనే మెదక్ స్థానాన్ని స్వాధీనం చేసుకోవడం బిజెపికి సాధ్యమవుతుంది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాల తప్పులను సమకూర్చుకుని ప్రజల ముందుకు వెళ్లి లాభపడాలని యోచిస్తోంది. ఇటీవలే ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై టి.కాంగ్రెస్ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యతో పాటు జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకుల్లో ఆ గ్రామాన్ని సందర్శించి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కెసిఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు. ఇంటింటి సర్వే వల్ల ప్రజలకు నష్టం చేకూర్చుతుందనే ప్రజలకు అవగాహన కల్పించి ఉప ఎన్నికల్లో లబ్ధిపొందాలని పథకం రూపొందిస్తున్నారు. టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలను వివరించి గడచిన ఎన్నికల్లో కెసిఆర్‌కు వచ్చిన మెజార్టీని సాధించుకుని సత్తా ఏమిటో మరోమారు చూపించాలని, ఇందుకు ఎమ్మెల్యేలంతా కార్యకర్తలను సమీకరించుకోవాలని సందేశాలు ఇస్తోంది. దీంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఈ నెల 27వ తేదీతో నామినేషన్ల దాఖలు పూర్తి కాగానే ప్రచార పర్వం జోరందుకోవడం, ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలకు దిగడంతో రాజకీయం రసవత్తరంగా మారడం ఖాయం.

విష జ్వరాలతో పడకేసిన పల్లె
రేగోడ్, ఆగస్టు 24: మండలంలోని మర్‌పల్లి గ్రామంలో విష జ్వరాలు ప్రబలడంతో గ్రామం అంతా మంచానికే పరిమతమైంది. ఏ ఇంట్లో చూసిన చికెన్ గున్యా జ్వరాలతో బాధపడే బాధితులే దర్శనమిస్తున్నారు. బాధిత కుటుంబాలు ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శించి వేలాది రూపాయలను ఖర్చు చేస్తున్నా వ్యాధి తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, వైద్యాధికారులు గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు బాధితులకు చికిత్సలు అందించాలని కోరుతున్నారు.

సంగారెడ్డి డివిజన్‌లో భారీ వర్షం
సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌లో మురికి వాడలు జలమయం
పంటలకు ఊపిరి
సంగారెడ్డి, ఆగస్టు 24: పగలంతా ఎండకాసినా రాత్రి 7.30 గంటల నుంచి సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో భారీగా వర్షం కురిసింది. జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, పటన్‌చెరు పట్టణాలతో పాటు న్యాల్‌కల్, కోహీర్, ఝరాసంగం, రాయికోడ్, మునిపల్లి, కొండాపూర్ మండలాల్లో కుండపోతగా వర్షం కురిసింది. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మున్సిపల్ పట్టణాల్లోని మురికి వాడలు, లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయ. సంగారెడ్డిలోని నాల్‌సాబ్‌గడ్డా ప్రాంతంలో వర్షం నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షం నీరు వరదలా ఇళ్లలోకి వచ్చి చేరడంతో ప్రజలు రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సదాశివపేటలో కూడా భారీగా వర్షం కురియడంతో మురికి వాడల్లో నివసిస్తున్న ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. కాగా మెదక్, సిద్దిపేట రెవెన్యూ డివిజన్ల పరిధిలో రాత్రి 9.30 గంటల వరకు చినుకు కూడా పడలేదు. కురిసిన భారీ వర్షంతో కొన ఊపిరిలో కొట్టుమిట్టాడుతున్న ఆరుతడి పంటలకు కొండంత బలాన్ని చేకూర్చింది. ఎండిపోయే స్థితికి చేరుకున్న ప్రత్తిపంటకు కొంత ఊరటనివ్వడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మొత్తంమీద కురిసిన వర్షంతో అన్నదాతకు ఆపన్నహస్తం అందించినట్లైంది. మరిన్ని భారీ వర్షాలు కురిస్తే జలాశయాలు చెరువులు, కుంటలు, వాగుల్లోకి నీరు వస్తే రానున్న రోజుల్లో ప్రజలతో పాటు పాడిపశువులకు సైతం ఉపయోగకరంగా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భాద్రపద మాసంలో మరిన్ని వర్షాలు కురిపించి తనను ఆరాధించే భక్తులకు నీటి సమస్య రాకుండా విఘ్ననాయకుడు విఘ్నాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

పేకాట క్లబ్బులపై పోలీసుల దృష్టి
మెదక్‌తో ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు
సంగారెడ్డి, ఆగస్టు 24: జూదంతో అనేక కుటుంబాలు వీధుల పాలవుతున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా పేకాట, మట్కా, ఇతర జూదాలను కొనసాగించరాదని, తక్షణమే పేకాట క్లబ్బులపై దాడులు చేసి సమూలంగా అరికట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ఆదేశాలను మెదక్ జిల్లా పోలీసు యంత్రాంగం అమలు చేయడం ప్రారంభించింది. ఇందుకు మెదక్ పట్టణాన్ని వేదికగా చేసుకుని పోలీసులు దాడులు చేయడం ప్రారంభించారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం మెదక్‌లోని గుల్షన్ క్లబ్బుపై మెరుపు దాడి చేసి 18 మంది పేకాటరాయుళ్లను, 7800 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మట్కా మహమ్మారికి ప్రధాన కేంద్రమైన సదాశివపేటపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకుగాను ఇటీవలే మట్కా బుకీలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో కొనసాగుతున్న పేకాట, జూదాన్ని ప్రోత్సహించకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీగా చర్యలను చేపట్టింది. సదాశివపేట, జహీరాబాద్, కోహీర్, పటన్‌చెరు, సంగారెడ్డి పట్టణాల్లో మట్కాను ఉక్కుపాదంతో అణచివేస్తామని పోలీసులు చెబుతున్నా వారికి సవాల్‌గా మారింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో మట్కా మహమ్మారిని సమూలంగా అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారు. తమకు ఇష్టమైన మట్కా నంబర్లను సెల్‌ఫోన్ మెస్సేజ్‌ల ద్వారా బుకీలకు, ఏజెంట్లకు చేరవేయడం, బ్యాంకు అకౌంట్లకు డబ్బులను బదిలీ చేయడం లాంటి చర్యలు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. దీంతో ఎవరు ఎక్కడ మట్కా ఆడుతున్నారన్న విషయాన్ని పోలీసులు పసిగట్టలేకపోతున్నారు. అయినప్పటికీ పాత నేరస్తులపై దృష్టి సారించి మట్కా నిర్మూలనకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంమీద శ్రమలేకుండా ధన సంపాదన చేయాలనే దురాశకులోనై సర్వస్వాన్ని కోల్పోయి కుటుంబాలను రోడ్డున వేస్తున్న జూదరుల ఆశలను తగ్గించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ఆదేశాలతో ఎన్నో కుటుంబాలకు మేలు చేకూరుతుందని మహిళలు సైతం హర్షించడం గమనార్హం.

స్వచ్ఛంద సేవల్లో వాసవి క్లబ్ ముందుండాలి
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సదాశివపేట, ఆగస్టు 24: నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికి అనేక రకాల స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాసవి క్లబ్ మరిన్ని సేవలు అందించడానికి ముందుకు రావాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు. శ్రావణ మాసం చివరి రోజును పురస్కరించుకుని ఆర్యవైశ్య సమాజం, వాసవి క్లబ్, యువజన విభాగం, మహిళా విభాగం ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆదివారం లక్ష బిల్వార్చన, లక్ష పుష్పార్చన, కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ సమష్టిగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలే కాకుండా ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరికి ఆదర్శంగా వాసవి క్లబ్ నిలుస్తుందని అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో పురోగతి సాధించిన నేటి సమాజంలో నశించిపోతున్న మానవీయ విలువల పరిరక్షణకు వాసవి క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు స్పూర్తిగా నిలుస్తాయని అన్నారు. వాసవి క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గతంలో వానప్రస్తాశ్రమాల్లో జరిగేవని, ఇప్పుడు వాసవి క్లబ్ ద్వారా ప్రత్యక్షంగా చూస్తున్నామని అన్నారు. నియోజకవర్గ ప్రజలంతా ఏకమై తనను గెలిపించారని, ఈ గెలుపు తనదిగా భావించకుండా నియోజకవర్గ ప్రజలందరిగా స్వీకరించి అభివృద్ధికి అంకితభావంతో పని చేస్తానని అన్నారు. రానున్న ఐదేళ్ల కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి అన్ని వర్గాల వారి సలహాలు, సహకారాలు స్వీకరించి ప్రణాళిక బద్దంగా ముందుకు వెళతానని అన్నారు. సదాశివపేట పట్టణ ప్రజలు తాగునీటి కటకటను దశాబ్దాల కాలంగా ఎదుర్కొంటున్నారని, సమస్యను తీర్చే బాధ్యత తనపై ఉందన్నారు. పరహితమే తనహితంగా భావిస్తూ సేవా కార్యక్రమాలను నిర్వహించినప్పుడు మానసిక శాంతి చేకూరుతుందన్నారు. సదాశివపేట పట్టణంలో ఆధ్యాత్మిక, ధార్మిక చింతనలో ప్రజలు మునిగి తేలుతారని, అందుకు తగినట్లు పట్టణ ప్రజలు శాంతియుత వాతావరణంలో జీవిస్తున్నారని అన్నారు. కులాలకు అతీతంగా ఒకరికి ఒకరు తోడ్పాటునందించుకుని మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారని అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ పట్నం విజయలక్ష్మీ మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ మాస వ్రతం, లక్ష పుష్పార్చన, లక్ష బిల్వార్చన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. వాసవి మహిళల ఐక్యత ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అమ్మవారికి పూజలు నిర్వహించి మొక్కుకున్నారు.
ఎమ్మెల్యే, చైర్ పర్సన్లకు సన్మానం
ఆలయ సంఘం, వాసవి క్లబ్, యువజన విభాగం, మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్ పర్సన్ పట్నం విజయలక్ష్మీ సుబాష్‌ను శాలువాలు, మెమొంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు కోడూరి రమేష్, మాజీ కౌన్సిలర్ కోడూరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలి
* ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
పటన్‌చెరు, ఆగస్టు 24: బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పటన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం పటన్‌చెరు, ఆర్‌సి పురం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపిటిసిలు, మాజీ ఎంపిటిలు టిఆర్‌ఎస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పటన్‌చెరు ఎంపిపి శ్రీశైలంయాదవ్, సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సోంరెడ్డి, ఆర్‌సి పురం జడ్పీటిసి రాములుగౌడ్, ఎంపిపి యాదగిరి యాదవ్ పాల్గొన్నారు.

‘ఎన్నికల హామీలు బుట్టదాఖలు చేసిన ప్రభుత్వం’
గజ్వేల్, ఆగస్టు 24: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్ సర్కార్ నెరవేర్చడంలో పూర్తిగా విఫలం చెందిందని బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ నరేష్‌బాబు ఆరోపించారు. ఆదివారం వర్గల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 75 రోజులు గడిచినప్పటికి ఇచ్చిన హామీలను ఆమలు చేయని ఘనత వారికే దక్కుతుండగా, ఇంత వరకు ఒక సంక్షేమ పథకాన్ని కూడా ప్రవేశ పెట్టకపోవడం సిగ్గుచేటని నిలదీశారు. ఎన్నో ఆశలతో టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టిన ప్రజలకు సమీక్షాసమావేశాలతోనే రాష్ట్ర ముఖ్య మంత్రి సరిపెడుతున్నారని ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణ నినాదంతో ఓట్లు దండుకున్న ఆ సర్కార్ ప్రజాసంక్షేమాన్ని విస్మరించిందని చెప్పారు. మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలను కార్యోన్ముకులుగా చేసేందుకు గ్రామగ్రామాన పర్యటిస్తూ ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. ఈ ఎన్నికల్లో బిజెపి బలపర్చిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కోరారు. మెదక్ పార్లమెంటు స్థానం నుండి బిజెపి అభ్యర్థి గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి దక్కే ఆవకాశాలున్నందున తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుంతుందని వివరించారు. సమావేశంలో నేతలు రమేష్, కృష్ణ, గణేష్, దినేష్, అశోక్, వెంకటేష్, నవీన్, నసీర్, మహేష్‌లు పాల్గొన్నారు.

గెలుపే లక్ష్యంగా బిజెపి-టిడిపి ఉమ్మడి అభ్యర్థిని దింపే యత్నం * అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న టిఆర్‌ఎస్, కాంగ్రెస్ * జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలతో నేడు కెసిఆర్ సమావేశం
english title: 
bye elections

రుణమాఫీకి ఆధార్..రైతన్నల బేజార్ !!

$
0
0

మళ్లీ ఆధార్ లింకు..!

నల్లగొండ, ఆగస్టు 24: సంక్షేమ..సబ్సిడీ పథకాలన్నింటికి ఆధార్ కార్డును తప్పనిసరి చేసే ప్రక్రియ దిశగా ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాలు సాగుతుండటంతో ఆధార్ కార్డులకు ప్రాధాన్యత పెరిగిపోయింది. ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ గతంలో గందరగోళంగా సాగడంతో గ్యాస్ పంపిణీకి సంబంధించి ఆధార్ తప్పనిసరన్నదానిపై సడలింపు కల్పిస్తు గత యూపిఏ ప్రభుత్వం ప్రకటించింది. అయితే గ్యాస్ కంపనీలు మాత్రం ఆధార్ నెంబర్ లింకును కొనసాగిస్తుండగా ఇటు ప్రభుత్వం సైతం గ్రామాల్లో ఆధార్ కార్డుల జారీ కేంద్రాలు కొనసాగిస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి అంటు ప్రకటించగా తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ పథకానికి ఆధార్ నెంబర్ కావాలంటు కోరడంతో మరోసారి ఆధార్ నెంబర్‌ల ఆవశ్యకత అంశం చర్చనీయాంశమైంది. జిల్లాలో 2011జనాభా లెక్కల మేరకు 33లక్షల 89వేల జనాభా ఉండగా ఇప్పటిదాకా 31లక్షల 94మందికి ఆధార్ కార్డులు జారీ చేసినట్లుగా జిల్లా యంత్రాంగం లెక్కలు చెబుతున్నాయి. అయితే తాజాగా జరిగిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను పరిగణలోకి తీసుకుంటే జనాభా సంఖ్య 38లక్షలు దాటవచ్చని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో మరిన్ని లక్షల మందికి ఆధార్ కార్డులు జారీ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అటు ఆధార్ కోసం వివరాలు ఇచ్చిన వారిలో వేలాది మందికి ఆధార్ నెంబర్లు సాంకేతిక సాంకేతిక సమస్యలతో అందకపోవడం మరో సమస్యగా తయారైంది. ఇప్పటికే రేషన్ కార్డుదారులకు ఆధార్ కార్డు నెంబర్ల అనుసంధాన ప్రక్రియ కొనసాగుతుండగా 9,80,342కార్డులకు సంబంధించి 33,89,953మంది సభ్యులుండగా వారిలో గత మూడేళ్లుగా 25,14,509యూనిట్లకు ఆధార్ సీడింగ్ పూర్తయింది.
ఆధార్ కోసం రైతన్నల పరుగులు
తెలంగాణ ప్రభుత్వం పంట రుణాల మాఫీ కోసం రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డుల నెంబర్లు అందించాలని కోరడంతో రైతులు ఆధార్ కార్డు కోసం పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే ఆధార్ ఉన్న రైతులు బ్యాంకర్లకు తమ నెంబర్లను అందిస్తుండగా ఆధార్ లేని రైతులు కార్డు కోసం ఆధార్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 26ఆధార్ కార్డుల జారీ కేంద్రాలు పనిచేస్తుండటం గమనార్హం. జిల్లాలో 4,38,038మంది రైతులకు 1895కోట్ల రుణమాఫీ వర్తించనున్నట్లుగా లెక్కలు తేల్చగా వారంతా ఆధార్ కార్డులు బ్యాంకర్లకు సమర్పించాల్సివుంది. ఇప్పటికే చాల మంది రైతులకు ఆధార్ కార్డులు ఉన్న కొంతమందికి నెంబర్ జారీ కాబడిన కార్డులు జారీ కాలేదు. మరికొందరు ఫోటోలు వివరాలు ఇచ్చినా కార్డులు రాలేదు. బ్యాంకర్లు మాత్రం రైతుల నుండి ఆధార్ కార్డుల జీరాక్స్‌లు అడుగుతున్నారు. నిజానికి రుణమాఫీకి ఆధార్ లింక్ తప్పనిసరి కాకున్నా ఒక రైతుకు లక్ష వరకే రుణమాఫీ అందేలా చూసేందుకే ఆధార్ కార్డు అడుగుతున్నామని అధికారులు చెబుతున్నారు. వేర్వేరు బ్యాంకుల్లో వేర్వేరుగా లక్షకు పైగా రుణాలు తీసుకుంటే ఆధార్ కార్డు నెంబర్ సీడింగ్‌తో సదరు రైతుకు సంబంధించి ఏదైనా ఒక బ్యాంకులోని రుణం మాత్రమే మాఫీ జరిగేలా చూసేందుకే ఆధార్ అడుగుతున్నట్లుగా బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా తాజాగా రుణమాఫీకి ఆధార్ లంకే పెట్టడంతో గతంలో గ్యాస్ వినియోగదారుల మాదిరిగానే ప్రస్తుతం రైతులు కూడా ఆధార్ కార్డుల కోసం తంటాలు పడుతుండటం గమనార్హం.

గ్రామాల అభివృద్ధే లక్ష్యం
*ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
చౌటుప్పల్, ఆగస్టు 24: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం తంగడపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చింతలగూడెం, దామెర గ్రామాలలో దివీస్ లేబోరేటరీస్ పరిశ్రమ, పంచాయతీ నిధులతో ఏర్పాటు చేసిన ఫిల్టర్ ప్లాంట్లు, మహిళ భవనాన్ని ఆదివారం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాలో ఆయన మాట్లాడుతూ గ్రామాలలో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యతక్రమంలో పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రధానంగా ప్రజలను పట్టిపీడిస్తున్న ఫ్లోరిన్ సమస్య నుంచి విముక్తులను చేసేందుకు కృష్ణా జలాలను అందించేందుకు కృషి జరుగుతుందన్నారు. తెలంగాణ పునఃనిర్మాణం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తూ ముందుకు వెళ్తుందన్నారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల లోపు పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని గుర్తుచేశారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందించేందుకు సమగ్ర సర్వే నిర్వహించిందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాలలో సర్పంచ్ ముటుకులోజు దయాకరాచారి, ఉపసర్పంచ్ అరిగె కిష్టయ్య, జెడ్పీటిసి పెద్దిటి బుచ్చిరెడ్డి. ఎంపిటిసి కొండూరు వసంత, బి.పి.కరుణ, అయినాల మానస, ముస్కు వసంత, ఇప్ప మురళమ్మ, బొడ్డు ముత్యం, ఊదరి యాదయ్య, సామకూర యాదయ్య, ఊదరి లావణ్య, అరిగె రమేష్, సిలివేరు శంకరమ్మ, ఊడుగు సరిత, సుర్కంటి వెంకట్‌రెడ్డి, రాగీరు సత్యనారాయణ, రఘునందన్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, బి.పి.రాములు, కేతరాజు అచ్చయ్య, నారెడ్డి నర్సిరెడ్డి, రావుల అంజయ్య, బి.సత్యనారాయణ, రామరాజు, శేఖర్, మారగోని సత్తయ్య, ముస్కు విజయ, రజిత, బి.కిషోర్‌కుమార్‌చౌదరి, ధనుంజయ్య, సిఐ గట్టుమల్లు తదితరులు పాల్గొన్నారు.

దసరా కానుకగా పిఆర్‌సి ప్రకటించాలి
ఎమ్మెల్సీ పూల రవీందర్
రాజాపేట, ఆగస్టు 24: పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు దసరా కానుకగా రాష్ట్ర ప్రభుత్వం పిఆర్‌సి ప్రకటించాలని నల్లగొండ, వరంగల్ నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం కుర్రారం గ్రామానికి వచ్చిన సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే పేద విద్యార్థుల కోసం ఇంగ్లీష్ విద్యాబోధన అందించాలన్నారు. విద్యావాలంటీర్లను నియమించి, 2013లో బదిలీయైన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం పర్యవేక్షణాధికారులు, డిప్యూటీ డిఇవోలు ఎంఇవోల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. మన ఊరు-మన ప్రణాళిక, కుటుంబ సర్వే కార్యక్రమాలు చారిత్రక నిర్ణయమన్నారు. రాబోయే కాలంలో కెసిఆర్ నాయకత్వంలో నిజమైన అర్హులకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఈ సమావేశంలో టిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షంగౌడ్, అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షుడు మంచ ఉపేందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు బోడ విశ్వరూపం, ప్రధానోపాధ్యాయులు మహేందర్‌రెడ్డి, మాధవరెడ్డి, బాలరాజు, క్రాంతికుమార్ పాల్గొన్నారు.

ఆక్రమణకు గురైన చెర్వుల వివరాలపై సమగ్ర నివేదిక రూపొందించాలి
* ఆర్డీఓ కిషన్‌రావు
మిర్యాలగూడ, ఆగస్టు 24: ఆక్రమణకు గురైన చెర్వుల వివరాలను సమగ్ర నివేదికను రూపొందించి అందచేయాలని ఆర్డీఓ కిషన్‌రావు అన్నారు. ఆదివారం ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ పరిదిలోని తహశీల్దార్, ఐబి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెర్వుశిఖం భూములను ఆక్రమించిన వారికి నోటీసులు ఇవ్వాలని ఆయన అన్నారు. జిల్లాలో చెర్వులు ఆక్రమణకు గురయ్యాయని, నీటినిల్వ సామర్ధ్యం ఉన్న 184చెర్వులను కాపాడాలని కోరుతూ తుమ్మల సురేందర్‌రెడ్డి హైకోర్టుల ప్రజాప్రయోజనాల వాజ్యం కింద పిటీషన్ దాఖలు చేశారని, అయితే హైకోర్టు రెండునెలల్లో ఆక్రమణకు గురైన చెర్వుల వివరాలను, తీసుకున్న చర్యలను గురించి నివేదించాలని ఆదేశించిందని ఆయన అన్నారు. అంతేకాకుండా చెర్వును ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోని చెర్వులను కాపాడకపోతే సెప్టెంబర్ 9న ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందచేసినట్లు ఆయన అన్నారు. డివిజన్‌లోని మిర్యాలగూడ, నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్‌నగర్, మఠంపల్లి, నిడమనూరు, వేములపల్లి, అనుముల మండలాల్లోని 55చెర్వులు ఆక్రమణకు గురైనాయని వాటిని గుర్తించి నివేదికను తయారుచేసి అందచేయాలని ఆయన సూచించారు. అంతేకాకుండా చెర్వులకు సంబందించిన బౌండరీలను ఫిక్స్ చేయాలని ఆయన సూచించారు. సెప్టెంబర్ 4వ తేదివరకు చెర్వులకు సంబందించిన ఫోటోలు, నివేదికలు ఇవ్వాలని ఆయన అన్నారు. భూ ఆక్రమణ చట్టం 905ప్రకారం చెర్వులను ఆక్రమించుకున్న వారికి నోటీసులు జారీచేయాలని అంతేకాకుండా పట్ట్భాముల్లో సైతం పంటలు వేసిన వారికి నోటీసులు ఇవ్వాలని ఆయన సూచించారు. పట్ట్భాముల్లో పంటలు వేసుకున్న రైతులకు క్రిమిసంహారక మందులు, ఎరువులు వాడవద్దని నోటీసులు ఇవ్వాలని ఆయన అన్నారు. ఆక్రమణకు గురైన చెర్వులన్నింటిని గుర్తించి వాటికి సంబందించిన నివేదికను సమగ్రంగా రూపొందించి అందచేయాలని ఆయన అన్నారు. సమావేశంలో తహశీల్దార్‌లు కృష్ణారెడ్డి, సత్యనారాయణ, కెసి.ప్రమీల, ఐబి ఎఇలు మల్లయ్య, ఇజాజ్ అహ్మద్, చెన్నకేశవరెడ్డి, డిటి రఘునాద్ తదితరులు పాల్గొన్నారు.

గిరిజన హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాటం
నల్లగొండ టౌన్, ఆగస్టు 24: రాష్ట్రంలోని 75గిరిజన కళాశాల విద్యార్థుల హాస్టల్స్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరానికి విద్యార్థులు పోరాటాలకు కలిసిరావాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ శ్రీరాంనాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన గిరిజన్ కళాశాల హాస్టల్ విద్యార్థుల రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడుతు హాస్టల్స్ భవనం నిర్మాణం కోసం సబ్‌ప్లాన్ నిధుల నుండి నిధులు విడుదలై ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం అవసరమైన స్థలాలు కేటాయించకపోవడం శోచనీయమన్నారు. మెస్ చార్జిలు, స్కాలర్ షిప్‌లు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమావత్ రవినాయక్, నాయకులు ప్రకాశ్ నాయక్, మహేష్‌నాయక్, చందులాల్, వెంకన్న, శంకర్‌నాయణ, హరిష్‌కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధానకార్యదర్శి కోట రమేష్, ప్రియాంక, సరిత తదితరులు పాల్గొన్నారు.

రాచకొండలో పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహాలు
*ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
చౌటుప్పల్, ఆగస్టు 24: నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న రాచకొండ ప్రాంతంలో ఏదేని పరిశ్రమ, ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి మొదటిసారి సొంత నియోజకవర్గానికి విచ్చేసిన కర్నెకు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. జిల్లా సరిహద్దులో అడుగు పెట్టిన కర్నెకు నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. దండుమల్కాపురం శివారులోని శ్రీ ఆంధోళ్‌మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లగిరి, తంగడపల్లి, కొయ్యలగూడెం, చౌటుప్పల్‌లో కార్యకర్తలు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. తంగడపల్లిలోని తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాలలు వేశారు. కొయ్యలగూడెం చేనేత సహకార సంఘాన్ని సందర్శించి పేరుకుపోయిన చేనేత నిల్వలను పరిశీలించారు. కెసిఆర్ దృష్టికి సమస్యను తీసుకువచ్చి కొనుగోళ్లు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. లక్కారం శివారులోని హజ్రత్ సయ్యద్ అబ్బాస్ ఖాద్రీ దర్గాలో జరుగుతున్న ఉర్సు ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చౌటుప్పల్‌లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములున్న రాచకొండలో పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతీకువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. కేసిఆర్ సారథ్యంలో రాచకొండకు మహర్ధశ రానుందన్నారు. అనేక ప్రాజెక్టులు, పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని చెప్పారు. 14 యేళ్ల తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులకు తెలంగాణ పునఃనిర్మాణంలో భాగస్వాములను చేసేందుకు కెసిఆర్ ప్రభుత్వంలో అవకాశాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే తనకు ఎమ్మెల్సీ పదవి దక్కిందని ధీమాతో చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు వెళ్తుందన్నారు. పేద ప్రజల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని వివరించారు. ఎమ్మెల్సీ కోటా నిధులను పేదల సంక్షేమానికి ఖర్చు చేస్తానన్నారు. నయాపైసా కూడా దుర్వినియోగం కానివ్వనని చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర కీలకమైందన్నారు. అదేవిధంగా తెలంగాణ అభివృద్ధిలో కూడా కళాకారులు భాగస్వాములవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటిసి బొల్లా శివశంకర్, నాయకులు భీమిడి యాదిరెడ్డి, ముత్యాల భూపాల్‌రెడ్డి, సోమ అరుణ, రిక్కల సుధాకర్‌రెడ్డి, చిట్టెడి వెంకట్‌రెడ్డి, సిద్ధపేట శేఖర్‌రెడ్డి, అరిగె కిష్టయ్య, మహ్మద్ సలీం, కందగట్ల బిక్షపతి, ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, ముత్యాల అశోక్‌రెడ్డి, మాచర్ల కృష్ణ, వర్కాల శ్రీమన్నారాయణ, పేరేపల్లి స్వామి పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా విధానాన్ని ప్రకటించాలి
యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి
నల్లగొండ టౌన్, ఆగస్టు 24: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల విద్యావిధానాన్ని వెంటనే ప్రకటించాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నర్సిరెడ్డి తెలిపారు. యుటిఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం పట్టణంలోని యుటిఎఫ్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎం.రాజశేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో నర్సిరెడ్డి మాట్లాడుతూ పిఆర్‌సి నివేధిక ఆమోదించి 2013జూలై నుండి అమలు చేయాలని, పండిట్, పిఇటి పోస్టులను స్కూల్ అసిస్టెంట్‌లుగా అప్‌గ్రేడ్ చేసి పదోన్నతుల ద్వారా వెంటనే భర్తీ చేయాలని కోరారు. ప్రత్యేక ఉపాధ్యాయుల సర్వీస్‌లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలన్నారు. ఉద్యోగులకు ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు అమలు చేయాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరిపించేలా పాఠశాల విధానాన్ని ప్రకటించాలన్నారు. కెజి నుండి పిజి వరకు ఉచిత విద్య పాలసీ అమలుకు వెంటనే కార్యాచరణ ప్రకటించాలన్నారు. ఈ సమావేశంలో టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్.రాములు, కార్యవర్గ సభ్యులు పొలె వెంకటయ్య, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎన్.బలరాం, నాయకులు పి.లక్‌పతినాయక్, వై.సైదులు, జనార్ధన్, వెంకటేశం, శ్రీనివాసచార్యులు, రాజేందర్‌రెడ్డి, యాదయ్య, సరళా, అరుణ తదితరులు పాల్గొన్నారు.

ఆరు నెలలుగా అందని 104 ఉద్యోగుల వేతనాలు
పల్లెల్లో కుంటుపడుతున్న వైద్య సేవలు
నల్లగొండ టౌన్, ఆగస్టు 24: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉచిత వైద్య సేవలందించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన 104వాహనాల వైద్య సర్వీస్‌ల సక్రమ నిర్వహణ పట్ల ప్రభుత్వ శ్రద్ధ వహించకపోవడంతో క్రమంగా 104వైద్య సేవలు నామమాత్రమవుతున్నాయి. జిల్లాలో 104వాహనాలు 26ఉండగా ప్రస్తుతం వాటిలో 8వాహనాలు పని చేయడం లేదు. మిగతా 18వాహనాలు పనిచేస్తుండగా అందులో అరకొర సిబ్బంది..వైద్య పరికరాలు, మందులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. 104వైద్య సిబ్బందికి గత ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులను రెగ్యులైజ్ చేస్తామని, వేతనాలు పెంచుతామని గతంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు కాకపోవడంతో 104ఉద్యోగులు తీవ్ర నిరాశలో రోజులు వెళ్లదీస్తున్నారు. 104డ్రైవర్లకు పిఎఫ్ కటింగ్ పోగా 6700, ఫార్మాసిస్టులకు 9300, ల్యాబ్ టెక్నిషియన్లకు 9300, క్లస్టర్ పరిధిలో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు 8300వేతనాలు ఇస్తున్నారు. ఇతర వైద్య ఉద్యోగులతో పోల్చుకుంటే తమ వేతనాలు సగం కన్నా తక్కువేనని అవి కూడా తమకు నెల వారిగా ఇవ్వడం లేదంటు ఉద్యోగులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 18క్లస్టర్‌ల పరిధిలో ఫార్మాసిస్ట్‌లు, ల్యాబ్ టెక్నిషియన్లు, డ్రైవర్లు మొత్తం 153సిబ్బంది పనిచేస్తున్నారు. వాహనాలు సైతం రిపేర్లకు గురికాగా వాటిని ఏడాది కాలంకు పైగా మరమ్మతులు చేయించకపోవడంతో అవి మూలన పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో 104వైద్య సేవల సర్వీస్‌లు క్రమంగా గ్రామీణ ప్రజలకు దూరమవుతున్న తీరు ఆందోళనకరం. తమ వేతన బకాయిలను వెంటనే చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచడంతో రాజకీయ జోక్యాన్ని, ఉన్నతాధికారుల వేధింపులను నివారించాలని 104ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే మూలన పడిన వాహనాలను మరమ్మతులు జరిపించి అదనంగా మరో 10వాహనాలు సమకూర్చి 104సేవలను మరింత మెరుగుపరుచాలని వారు ప్రభుత్వాన్ని కోరుతుండటం విశేషం. చాలని 104ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మళ్లీ ఆధార్ లింకు..!
english title: 
adhar link

కళ్లెదుటే ఇసుక దోపిడీ

$
0
0

* పట్టా భూమిలో ఇసుక మేటల తొలగింపు పేరిట అనుమతులు
* మంజీరా గర్భానికి తూట్లు పొడుస్తున్న వైనం
* చోద్యం చూస్తున్న అధికార గణం!
నిజామాబాద్, ఆగస్టు 24: కాసుల వర్షం కురిపిస్తున్న ఇసుక రవాణాకు అలవాటుపడ్డ అక్రమార్కులు అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ జారవిడ్చుకోకుండా యథేచ్ఛగా తమ అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. రాజకీయ నేతల అండదండలతో బాహాటంగానే దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. మంజీర, గోదావరి నదులతో పాటు అనేక వాగులు, వంకలు కలిగిఉన్న నిజామాబాద్ జిల్లాలో గత ఐదారేళ్ల నుండి ఇసుక మాఫియా నదీ తీర ప్రాంతాలన్నింటిని తమ కబంధహస్తాల్లో చేర్చుకుని కాసుల వేట కొనసాగిస్తోంది. తాత్కాలిక అనుమతుల మాటున అనునిత్యం వందలాది వాహనాల్లో ఇసుకను తరలిస్తుండడం భూగర్భజలాల ఉనికినే ప్రశ్నార్ధకంగా మారుస్తోంది. పొరుగు జిల్లాల నుండి వచ్చిన వ్యాపారులకు పలువురు ప్రజాప్రతినిధులు వెన్నుదన్నుగా నిలుస్తూ ఇసుక రవాణాకు ఊతమందించడం పరిపాటిగా మారింది. ఇసుకాసురుల నుండి పెద్ద మొత్తంలో నజరానాలు ముడుతుండడంతో ఇసుక మాఫియాను పలుకుబడి కలిగిన ప్రజాప్రతినిధులు సైతం తమంతట తామే సంప్రదిస్తూ అన్ని విధాలుగా అండదండలుగా నిలుస్తామంటూ అభయహస్తం అందిస్తున్నారు. దీంతో నిబంధనలు అతిక్రమిస్తూ బాహాటంగానే దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, సంబంధిత రెవెన్యూ, పోలీస్, మైనింగ్, రవాణా తదితర శాఖలకు చెందిన అధికారులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునే సాహసానికి ఒడిగట్టడం లేదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈసారి వర్షాభావ పరిస్థితులు వెంటాడుతుండడంతో ఇసుక మాఫియా ముందస్తుగానే జూలు విదిల్చింది. ప్రైవేట్ వ్యక్తులకు చెందిన పట్టా భూముల్లో ఇసుక మేటలను తొలగించాలనే సాకుతో అనుమతులు పొంది, వాటి ముసుగులో అడ్డగోలుగా ఇసుక తరలింపు జరుపుతున్నారు.
మంజీరా తీర ప్రాంతాలైన బిచ్కుంద మండలంలోని చెట్లూర్, ఖత్‌గాం శివార్ల నుండి ఇసుక తరలింపు కోసం ఇప్పటికే రెవెన్యూ అధికారులు తాత్కాలిక అనుమతులు జారీ చేయగా, వీటి ముసుగులో పెద్దఎత్తున ఇసుక రవాణాకు రంగం సిద్ధం చేసుకున్నారు. చెట్లూర్‌లో 48సర్వే నెంబరులో గల సుమారు 8ఎకరాల స్థలంలో ఇసుక మేటలను తొలగించుకునే నెపంతో అనుమతులు పొందగా, ఖత్‌గాం శివారులో 52/సి/1 సర్వే నెం.లో సైతం ఇసుక మేటల తొలగింపు పేరుతో రెవెన్యూ అధికారుల నుండి అనుమతులు జారీ చేయించుకున్నారు. కానీ పై రెండు గ్రామాల్లోనూ సంబంధిత సర్వే నెంబర్లలో ఇసుక మేటలు మచ్చుకైనా కనిపించవంటే అతిశయోక్తి కాదు. పైపెచ్చు ఆ సర్వే నెంబర్లలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వరి పంటను సాగు చేస్తుండడం విశేషం. ఈ విషయమై ఖత్‌గాం గ్రామస్థులు ఒక రోజు క్రితమే తహశీల్దార్‌ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో స్థానికుల ఒత్తిడి మేరకు రెవెన్యూ అధికారులు ఆదివారం ఉదయం ఖత్‌గాంలోని పట్టా భూమిని పరిశీలించి పంటలు సాగు చేస్తున్నారని నిర్ధారించుకుని అనుమతులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఏకంగా పంటలు సాగు చేస్తున్న పట్టా భూముల నుండి ఇసుక తరలింపు కోసం అధికారులు అనుమతులు మంజూరు చేయడం స్థానికులను, ఆయకట్టు రైతాంగాన్ని విస్మయానికి గురి చేస్తోంది. ఈ తతంగం వెనుక పెద్దమొత్తంలో ముడుపులు చేతులు మారి ఉంటాయని బాహాటంగానే చర్చించుకుంటున్నారు. స్థానికుల అభ్యంతరాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోని అక్రమార్కులు, ఇసుక రవాణా కోసం ఏకంగా 35లక్షల రూపాయలను వెచ్చించి మరీ చెట్లూర్ నదీ తీర ప్రాంతం వరకు పక్కా రోడ్డును నిర్మించారు. ప్రతిఏటా వర్షాలు ఎడతెరపినిచ్చిన వెంటనే మంజీరా, గోదావరి తీర గ్రామాల నుండి ఇసుక రవాణాకు తెరతీయడం సర్వసాధారణంగా మారింది. బిచ్కుందలోని పుల్కల్, వాజిద్‌నగర్, గుండెనెమ్లి, హస్గుల్, చెట్లూర్, ఖత్‌గాం తదితర క్వారీల నుండి అనునిత్యం 150కు పైగా లారీలు, టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు ఇసుకను చేరవేస్తారు. అదేవిధంగా బీర్కూర్ మండలం బరంగెడ్గి, కిష్టాపూర్ క్వారీల నుండి సైతం ఇసుక లారీలు ఇబ్బడిముబ్బడిగా రాకపోకలు సాగిస్తుంటాయి. అన్నింటికి మించి సామర్థ్యానికి మించి ఇసుక తరలిస్తుండడం వల్ల రోడ్లన్నీ చెడిపోయి కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతోంది. పది నుండి 12టైర్లు కలిగిన ఒక్కో (టారస్) వాహనంలో 25 నుండి 30టన్నుల లోడ్‌తో ఇసుకను చేరవేస్తున్నారు. బీర్కూర్ నుండి బాన్సువాడ మీదుగా పిట్లం, జోగిపేట్, సంగారెడ్డి తదితర ప్రాంతాల గుండా హైదరాబాద్, జహీరాబాద్, బీదర్ వంటి ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు. ముందుగా మంజీరా నది నుండి పొక్లెయిన్‌ల సహాయంతో రేయింబవళ్లు నిర్విరామంగా తోడుతున్న ఇసుకను తమకు అనువైన ప్రాంతాల్లో డంప్ చేస్తూ, అక్కడి నుండి వరుసబెట్టి వాహనాల్లో తరలిస్తున్నారు. ఒక్కో టారస్ వాహనం లోడ్ కలిగిన ఇసుక హైదరాబాద్ నగరంలో 30వేల రూపాయల పైచిలుకు ధర పలుకుతున్నట్టు తెలుస్తోంది. దీంతో పట్టా భూములు కలిగిఉన్న రైతులతో కారుచౌక ఒప్పందం కుదుర్చుకుంటున్న వ్యాపారులు, సుదూర ప్రాంతాలకు ఇసుకను తరలించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు చెందిన పట్టా భూమిలో ఇసుక మేటలను తొలగించేందుకు అనుమతులు పొందినప్పటికీ, దాని ముసుగులో హద్దులు దాటి ఇసుక మేటలు అధికంగా ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. నిబంధనల ప్రకారం నదిలో నుండి ఇసుకను తీసేందుకు మనుషులను ఉపయోగించి, రెండు అడుగుల మేరకు మాత్రమే ఇసుకను తీయాల్సి ఉంటుంది. కానీ వ్యాపారులు అందుకు భిన్నంగా పొక్లెయినర్లను ఉపయోగిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.

జలవిద్యుత్ కేంద్రంలో 2మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనజెన్‌కో అసిస్టెంట్ డివిజినల్ ఇంజనీర్ శ్రీకాంత్

నిజాంసాగర్, ఆగస్టు24: నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు కింద రైతులు వేసిన పంటలను కాపాడేందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు సాగర్ జలాలను విడుదల కొనసాగుతోంది. ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు అనుసంధానంగా ఉన్న హెడ్‌స్లూయస్ జెన్‌కో రెండవ గేటు ద్వారా టర్బైన్‌లోనికి నీరు రావడంతో విద్యుత్ ఉత్పత్తి అవుతూ నీరు కాలువ ద్వారా ఆయకట్టు రైతుల పంటల కోసం నీటి విడుదల కొనసాగుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్ట్ ద్వారా 450 క్యూసెక్‌ల నీటిని విడుదల చేయడంతో 2వ టర్బైన్ ద్వారా 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని జెన్‌కో ఎడి ఇ శ్రీకాంత్ తెలిపారు. 0 డిస్ట్రిబ్యూటర్ నుంచి 50 డిస్ట్రిబ్యూటర్‌ల వరకు ఆయకట్టు కింద సుమారు 90 వేల ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు వేసుకున్నారని నీటిపారుదల శాఖ బోధన్ ఇఇ సత్యశీలారెడ్డి తెలిపారు. నీటిని వృధాచేయకుండా పొదుపుగా వాడుకోవాలని రైతులను కోరారు. డిస్ట్రిబ్యూటర్‌ల వద్ద ఇరిగేషన్ సిబ్బందిచే బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
వయోజనులు చదువుకోవాలి
రాష్ట్ర వనరుల కేంద్రం ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ మాలకొండయ్య
కామారెడ్డి రూరల్, ఆగస్టు 24: గ్రామాల్లోని వయోజనులు తప్పక చదువు నేర్చుకోవాలని రాష్ట్ర వనరుల కేంద్రం ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ మాల కొండయ్య అన్నారు. ఆదివారం మండలంలోని అన్ని గ్రామాల్లో సాక్షర భారత్ ఆధ్వర్యంలో ఎన్‌ఐఓఎస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్యాసంపల్లి గ్రామాన్ని ఆయన సందర్శించి విలేఖరులతో మాట్లాడారు. ఈరోజుల్లో అందరు చదువు నేర్చుకోని ఉంటే అభివృద్ధి చెందుతారన్నారు. సాక్షర భారత్ 4వ దశలో 3వ తరగతికి సంబంధించిన వయోజనులకు పరీక్షలు నిర్వహించారు. మండలంలో 1020మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 830మంది వయోజనులు పరీక్షలు రాశారు. ఆయన వెంట జిల్లా వయోజన విద్య ప్రాజెక్టు అధికారి వీరేశం, సర్పంచ్‌లు కట్లకుంట భారతిరాజయ్య, నిట్టు వెంకట్‌రావు, ఎంపిపి లద్దూరి మంగమ్మ, సాక్షర భారత్ మండల కో-ఆర్డినేటర్ బత్తుల రవి, కారోబార్ చంద్రకళ, గ్రామ కో-ఆర్డినేటర్లు నరేశ్, బాల్‌రాజు, అంజలి తదితరులున్నారు.

కేసిఆర్ సింగపూర్ పర్యటన విజయవంతం
* ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి
ఎల్లారెడ్డి, ఆగస్టు 24: సింగపూర్ పర్యటనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పర్యటన విజయవంతమైందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే స్థానిక విలేఖరులతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్‌లోని మలేషియాలో నిర్మిస్తున్న పుత్రజయ క్యాపిటల్ సెంటర్‌లోను సిఎంతోపాటు మంత్రి ఈటెల రాజేందర్, ఏనుగు రవీందర్‌రెడ్డిలు పరిశీలించారు. ఈ సెంటర్‌లో ప్రభుత్వ అధికారుల కోసం నివాస గృహాలు ఏర్పాటు జరుగుతోందన్నారు. ఈసందర్భంగా సింగపూర్ సాధించిన ప్రగతిని చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. అభివృద్ధి విషయంలో అక్కడి అధికారులతో చేసిన చర్చలు ఫలప్రదమైనట్లు ఎమ్మెల్యే చెప్పారు. సింగపూర్ రాజధాని కౌలాలంపూర్‌కు కారులో ప్రయా ణించి అభివృద్దిని చూడటంతోపాటు ఆకాశ హర్మ్యానాలకు తాకే విధంగా ఉన్న భవనాలు, విశాలమైన రోడ్లు, చూడముచ్చటైన ఫ్లైఓవర్‌రోడ్లను చూసి అభివృద్ధి అంటే ఇలా ఉండాలి అని అక్కడి అధికారులను మెచ్చుకోవడం జరిగిందన్నారు. ఇలాంటి అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసి చూపించడానికే ఈ పర్యటన తోడ్పడుతోందన్నారు. సిఎం కేసిఆర్‌తోపాటు సింగపూర్ వెళ్లడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆదివారం రాత్రి హైద్రాబాద్‌కు చేరుకుంటామని తెలిపారు.

అలంకరణలో ఉత్తమంగా నిలిచే గణేష్ మంటపాలకు బహుమతులు
* ఎంపి కల్వకుంట్ల కవిత వెల్లడి
నిజామాబాద్, ఆగస్టు 24: ఇకపై జిల్లా స్థాయిలో అత్యుత్తమ అలంకరణతో అందరినీ ఆకట్టుకునే రీతిలో ఏర్పాటు చేసే వినాయక మంటపాలను ఎంపిక చేసి మొదటి, ద్వితీయ బహుమతుల కింద తెరాస తరఫున భారీ నజరానాలు అందించనున్నామని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. మొదటి బహుమతి కింద ఎంపికయ్యే గణేష్ మండలికి లక్షా 51వేల రూపాయలు, ద్వితీయ బహుమతిగా లక్షా వేయి రూపాయల నగదు బహుమతులు ప్రదానం చేయనున్నామని చెప్పారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, హైదరాబాద్ తరువాత నిజామాబాద్ జిల్లాలోనే అత్యంత అట్టహాసంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో యువతను ప్రోత్సహించేందుకు, వారిలో కళాత్మకతను వెలికితీసేందుకు వీలుగా ఇక నుండి ప్రతిఏటా వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా అత్యుత్తమ అలంకరణలతో అలరించే గణేష్ మంటపాలను ఎంపిక చేసి నగదు బహుమతులు అందించాలని నిర్ణయించామన్నారు. జిల్లా ప్రజలు శాంతియుతంగా, ఆనందోత్సాహాల నడుమ గణేష్ నిమజ్జనోత్సవాలు జరుపుకోవాలని కోరారు. సాధ్యమైనంత వరకు పర్యావరణానికి హాని కలుగకుండా చూడాలని, మట్టి గణపతులను ప్రతిష్ఠించేలా ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించాలని, ప్రతిమల తయారీలో చాలావరకు రంగులను తక్కువగా వాడాలని హితవు పలికారు.
అన్ని వర్గాలకు లబ్ధి..తెరాస ప్రభుత్వ లక్ష్యం
కాగా, తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చాలన్నదే తెరాస ప్రభుత్వ లక్ష్యమని ఎంపి కవిత పేర్కొన్నారు. ఈ దిశగా ఇప్పటికే కెసిఆర్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఐఎఎస్, ఐపిఎస్‌ల విభజన సైతం పూర్తయిన దరిమిలా వివిధ శాఖలకు అధిపతుల నియామకాలు జరిగి సంక్షేమాభివృద్ధి పథకాల అమలు వేగవంతం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణను పారిశ్రామికంగా, ఐ.టి సెక్టార్‌లో అగ్రస్థానంలో నిలిపేందుకు తమ ప్రభుత్వం సరికొత్త పాలసీలు రూపొందిస్తూ ముందడుగు వేస్తోందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, కెజి నుండి పిజి వరకు ఉచిత విద్య అమలుకు, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం తదితర వాటిపై దృష్టిని కేంద్రీకరిస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలుపుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చే దిశగా తెరాస ప్రభుత్వం ముందుకు సాగుతోందని, బంగారు తెలంగాణ నిర్మాణానికి అన్ని వర్గాల వారు తమవంతు సహకారం అందించాలని ఎంపి కవిత కోరారు. విలేఖరుల సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్, తెరాస పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎఎస్.పోశెట్టి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, అధికార ప్రతినిధి సుజిత్‌సింగ్ ఠాకూర్, ఎంఎ.అలీం, సూదం లక్ష్మి పాల్గొన్నారు.

బిసి హస్టల్ సమస్యలు పరిష్కరించాలి
దోమకొండ, ఆగస్టు 24: మండల కేంద్రంలోని బిసి బాలుర వసతి గృహాంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదివారం పిడిఎస్‌యు నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు డివిజన్ అధ్యక్షులు రాజు మాట్లాడుతూ, హాస్టల్‌లో వౌలిక సదుపాయాలు లేనందున విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల వసతి లేదన్నారు. హాస్టల్ వార్డెన్ భోజరాం విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఇకనైన సంబంధిత అధికారులు స్పందించి హాస్టల్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని యెడల పిడిఎస్‌యు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు నాయకులు ప్రశాంత్, లోల ప్రశాంత్, రాకేశ్, నవీన్, వినయ్, అరుణ్, విద్యార్థులు పాల్గొన్నారు.

బంగారు తెలంగాణ సాధనలో కార్యకర్తలు భాగస్వాములు కావాలి
బోధన్, ఆగస్టు 34: ఎన్నో రకాల పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చుదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇందులో తెరాస కార్యకర్తలు భాగస్వాములు కావాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం బోధన్‌లో జరిగిన పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ బంగారు తెలంగాణ విషయంలో కార్యకర్తలు పాత్ర చాలా ప్రధానమైందన్నారు. గ్రామాలలోని సమస్యలను ఎప్పటి కప్పుడు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోవాలని వాటి పరిష్కారానికి కార్యకర్తల సలహాలు కూడా స్వీకరించడం జరుగుతుందన్నారు. పార్టీకి కార్యకర్తలు పట్టు కొమ్మలని ఈ విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో తెరాస కార్యకర్తలు చేసిన కృషిని మరువలేమన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితి బలమైన శక్తిగా ఎదిగిందని ఆమె గుర్తు చేశారు. తెరాసను విమర్శించిన పలు పార్టీలకు తెలంగాణ ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పారని అన్నారు. ఎంతో నమ్మకంతో తెరాసను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెరాస కార్యకర్తలు తమ వంతు కృషి చేయాలని కవిత పేర్కొన్నారు. బోధన్, నవీపేట్ రైల్వే గేట్‌లను వెడల్పు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. బోధన్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధాలన్నింటిని నిలుపుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనయే లక్ష్యంగా ముందుకెళుతున్నారని ఇందుకు పార్టీ శ్రేణులు అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. ఇప్పటికే పాలనాపరంగా అనేక మార్పులు వచ్చాయని త్వరలో మరికొన్ని మార్పులు కూడా రానున్నాయన్నారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో మెలిగితే అనుకున్న స్థాయిలో అభివృద్ధిని సాధించవచ్చన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ శాసనసభ్యుడు షకీల్ అహ్మద్, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, రాష్ట్ర నాయకుడు రజాక్, ఎత్తేశ్యాం, శ్యాంరావ్, శరత్‌రెడ్డి, గిర్దావర్ గంగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య పాల్గొన్నారు.

పోస్టుకార్డు, ఈమెయిల్ ద్వారా సిఎంకు సమస్యలను పంపించాలి
ఆర్మూర్, ఆగస్టు 24: ఆంక్షలు లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలని, పెండింగ్ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలని కోరుతూ విద్యార్థులే స్వయంగా పోస్టుకార్డు, ఈమెయిల్‌ల ద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తమ సమస్యలను పంపించాలని పిడిఎస్‌యు ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి నిమ్మల నిఖిల్ కోరారు. ఆర్మూర్ పట్టణంలోని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయంలో ఆదివారం పిడిఎస్‌యు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 25వ తేది నుంచి 30 వరకు విద్యార్థులే స్వయంగా తమ సమస్యలపై స్పందించాలని అన్నారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని జూనియర్, డిగ్రీ, వృత్తి విద్యా, ఇంజనీరింగ్, పిజి కళాశాలల విద్యార్థులు పోస్టుకార్డు, ఈమెయిల్ ద్వారా సమస్యలను పంపించి పరిష్కారం అయ్యే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అన్నారు. కెజి నుంచి పిజి వరకు ఉచిత నిర్బంధ విద్య విధి, విధానాలను ప్రకటించి అమలుకు తక్షణం పూనుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పిడిఎస్‌యు నాయకులు శ్యామ్, ఆనంద్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

డ్వాక్రా సంఘాలకు చెక్కులు పంపిణీ
బోధన్ , ఆగస్టు 24: బోధన్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన డ్వాక్రా సంఘాలకు ఆదివారం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితి రుణాల చెక్కులను పంపిణీ చేశారు. 501 డ్వాక్రా సంఘాలకు గాను 14 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కవిత మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబాలు బాగు పడతాయని కావున ప్రతీ ఒక్కరూ డ్వాక్రా సంఘంలో సభ్యులుగా చేరాలని అన్నారు. ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం జరుగుతుందని అలాగే అనేక గ్రామాలలో ఇంకా కొంతమంది మహిళలు డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా చేరలేరని వారందరిని డ్వాక్రా సంఘాలలో చేర్పించి గ్రూపులుగా తీర్చిదిద్దాలన్నారు. బ్యాంకుల ద్వారా ఇచ్చిన రుణాల ద్వారా చిరు వ్యాపారాలు చేసి అభివృద్ధి సాధించాలన్నారు. తెరాస ప్రభుత్వం హాయంలో చేతివృత్తుల వారికి అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందన్నారు. కులవృత్తులకు ఎంతో ప్రాధాన్యత ఉందని ఈ ప్రాధాన్యతను కాపాడేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్, బోధన్ నియోజకవర్గ శాసనసభ్యుడు షకీల్ అహ్మద్, మండల సమాఖ్య అధ్యక్షురాలు సునీత, ఐకెపి ఏపిఎం చిన్నయ్య, తెరాస నాయకులు రజాక్, శ్యాంరావ్, మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, శరత్‌రెడ్డి, గంగారెడ్డి పాల్గొన్నారు.

* పట్టా భూమిలో ఇసుక మేటల తొలగింపు పేరిట అనుమతులు * మంజీరా గర్భానికి తూట్లు పొడుస్తున్న వైనం * చోద్యం చూస్తున్న అధికార గణం!
english title: 
sand

మాఫీలో మెలిక!

$
0
0

శ్రీకాకుళం, ఆగస్టు 24: ఖరీఫ్ సీజన్ ముగిసేందుకు మరో 34 రోజులే గడువు ఉన్నప్పటికీ నేటివరకు రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల్లో మరింత అభత్రాభావం నెలకొంది. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవంలో రుణమాఫీపై తొలి సంతకం పెట్టినప్పటికీ ఇప్పటివరకు రిజర్వు బ్యాంకు ఎటువంటి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. తాజాగా కరవు జిల్లాలుగా కొన్ని ప్రాంతాలకే రీషెడ్యూల్‌ను పరిమితం చేసినప్పటికీ శ్రీకాకుళం జిల్లాకు చోటు దక్కడంతో ఇక్కడ రైతులకు ఊరటనిచ్చినట్లయింది. అయితే పంట రుణాలతో పాటు బంగారు ఆభరణాలు తాకట్టు రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే. కాని, బ్యాంకులకు మాత్రం తాజాగా ఉత్తర్వులు వెలువడటం ఇందులో బంగారు రుణాలపై మెలిక పెట్టడం అన్నదాతలను మరింత కలవరపెడుతోంది. బంగారు ఆభరణాలపై రుణం తీసుకున్న రైతులకు పంట రుణం లేకుంటేనే మాఫీ వర్తింపజేస్తామని సంబంధిత బ్యాంకులకు ఆదేశాలు అందడంతో అనేక మంది రైతులు ఖంగుతినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కో కుటుంబానికి 1.50 లక్షల రూపాయలు ప్రయోజనం చేకూరేలా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ బంగారు రుణాలపై మెలిక పెట్టడంతో అనేక మంది రైతులు అతి తక్కువ పంట రుణానికే పరిమితమయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. 2013, ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి సెప్టెంబర్ , 2013 మధ్య బంగారు ఆభరణాలపై పంట రుణాలు తీసుకున్న రైతులకు వర్తిస్తాయన్న మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు. అయితే ఈ రైతులెవరూ పంట రుణాలు పొందకుండా ఉండాలని మెలిక పెట్టడంతో అనేక మందికి రుణమాఫీ అందని ద్రాక్షగా మారే ప్రమాదం లేకపోలేదు.
ఇదిలా ఉండగా ఈ తేదీలకు ముందు పంట రుణం తీసుకునే రైతులంతా తక్షణమే చెల్లించి తిరిగి రుణ సదుపాయం అందిపుచ్చుకోవాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇటువంటి రైతులకు కొత్త రుణాలపై పావలావడ్డీకి రుణం అందించడమే కాకుండా రెండు శాతం అపరాధపు వడ్డీ మినహాయింపు ఉంటుందని బ్యాంకు అధికారులు సెలవిస్తున్నారు. కొత్త రుణాలకు పంటల బీమా పథకం వర్తిస్తుందని చెప్పుకొస్తున్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు స్వచ్ఛందంగా బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను చెల్లించి తిరిగి మరిన్ని రాయితీలు పొందాలని కోరుతూ కరపత్రాలను కూడా వీరు పంపిణీ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు రైతులను ఒకింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. వ్యవసాయ మదుపులు పెరిగిపోవడం వల్ల ఎకరాకు కేవలం 20 వేల రూపాయలే పంట రుణాన్ని బ్యాంకులు అందించడంతోఎరువులు, పురుగుమందులు కొనుగోలు నిమిత్తం అనేక మంది రైతులు తమవద్ద ఉన్న బంగారు ఆభరణాలు పట్టాదారు పాసుపుస్తకాలతో రుణం పొందడం పరిపాటి. అయితే కేవలం పంట రుణాన్ని బంగారు ఆభరణాల రుణాలకు ముడిపెట్టడం సబబుగా లేదని అనేక మంది రైతులు బ్యాంకు అధికారుల ఆంక్షలపై పెదవి విరుస్తున్నారు. దీనిపై మరోమారు పునరాలోచించి పంట రుణాలతో సంబంధం లేకుండా బంగారు ఆభరణాల రుణాలను కూడా పరిగణలోకి తీసుకుని ప్రతీ కుటుంబానికి 1.50 లక్షల రూపాయలు మాఫీ వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని రైతులంతా కోరుతున్నారు.
కరపత్రాలతో అవగాహన
రుణమాఫీపై రైతుల్లో మరింత అవగాహన పెంచేందుకు కరపత్రాలతో ప్రచారం నిర్వహిస్తున్నామని బ్యాంకు అధికారులు సుస్పష్టం చేస్తున్నారు. రిజర్వుబ్యాంకు నిబంధనల మేరకే రుణమాఫీ లేదా రీషెడ్యూల్ వర్తింపజేస్తామన్నారు. రుణాలు తీసుకున్న రైతులు ఎ.పి. ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ పట్ల ఏవైనా సందేహాలు ఉంటే బ్యాంకు అధికారులను సంప్రదించమంటూ ఇటీవల జరిగిన బ్యాంకర్ల సమావేశంలో జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించిన విషయం తెలిసిందే. ఏదిఏమైనప్పటికీ, రుణమాఫీ మాట ఏలా ఉన్నా, రైతులు మళ్లీ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల వద్ద బారులు తీరుకున్నారు. వీరిని వడ్డీవ్యాపారుల నుంచి తక్షణమే రక్షించాల్సిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వంపై ఉందంటూ అన్నీ వర్గాలవారు పేర్కొంటున్నారు.

గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
సీతంపేట, ఆగస్టు 24: గిరిజన సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖామంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. ఆదివారం స్థానిక పిఎమ్మార్సీ కేంద్రంలో ఐటిడిఎ చైర్మన్,జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అధ్యక్షతన సీతంపేట గిరిజనాభివృద్థి సంస్థ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖా మంత్రి రావెల కిషోర్‌బాబు,రాష్ట్ర కార్మిక, క్రీడలశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేని విభిన్న కార్యక్రమాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేస్తున్నారన్నారు. ఈ నెల 9వతేదిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వ పండుగగా నిర్వహించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు .సీతంపేట ఐటిడిఎలో నెలకొన్న లోపాలను సరిచేసుకొని అభివృద్థికి బాటలు వేస్తామని మంత్రి అన్నారు. గతంలో ఐటిడిఎ పిఒలకు సింగిల్‌మెన్ ఎడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఉండేవని(మిగతా 2వ పేజీలో)
అయితే ఇప్పుడు అవి లేవన్నారు. ఈ అధికారాలను తాము పిఒలకు కేటాయిస్తామన్నారు. శాఖాల అధికారులు విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే కిందిస్థాయి సిబ్బందిని కాకుండా జిల్లాస్థాయి అధికారులను ఇంటికి పంపిస్తామని మంత్రి హెచ్చరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు,ప్రజాప్రతినిధులు సమస్యల పై సమావేశంలో సతమతవౌతుంటే అధికారుల్లో చలనం లేదని మంత్రి కిషోర్‌బాబు అసహనం వ్యక్తంచేసారు. జిల్లాస్థాయిలో మోనటరింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేసి అందులో 10మంది టెక్నికల్ క్వాలిఫై సిబ్బందిని నియమించాలని మంత్రి జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌ను ఆదేశించారు.గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికి మంచినీరు.రహదారులు,విద్యుత్,వైద్యంవంటివి సక్రమంగా అందక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సందర్భంగా క్రీడల మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఐటిడిఎను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ప్రతీ మూడు నెలలకు ఒకసారి షెడ్యూల్ తప్పకుండా ఐటిడిఎ పాలకవర్గ సమావేశం నిర్వహించాలన్నారు.
పాలకవర్గ సమావేశంలో ప్రధానంగా పలు శాఖల పై చర్చించారు.వ్యవసాయానికి సంబంధించి ఎరువులు సక్రమంగా పంపిణిచేయడం లేదని సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. గిరిజన ప్రాంతాల్లో నాబార్డ్ ద్వారా చేపడుతున్న పనులకు సంబంధించి అటు ఐటిడిఎకు ఇటు ప్రజాప్రతినిధులకు తెలియకుండా నాబార్డ్‌గ్రాంట్‌లు ఎలా ఇచ్చారని కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.2009నుండి ఇంత వరకు రూ.1.80కోట్లతో చేపట్టిన పనుల వివరాలు తెలియజేయాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు ఏజెన్సీలో పనిచేయడానికి వీలు లేదని ఇంత వరకు నాబార్డ్ ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి కలెక్టర్ దృష్టిసారించాలని మంత్రి సూచించారు.
*గత పిఒ పాలన పై విచారణ
గతంలో ఐటిడిఎ పిఒగా పనిచేసిన సునీల్‌రాజ్‌కుమార్ హయాంలో జరిగిన పనులు,బడ్జెట్ వివరాలు,ఖర్చులు వంటి అంశాల పై హైదరాబాద్ స్థాయిలో విచారణ వేయాలని మంత్రి అచ్చెన్నాయుడు గిరిజన సంక్షేమశాఖా మంత్రి రావెల కిషోర్‌బాబును కోరారు.దీని పై మంత్రి స్పందిస్తూ విచారణ కమిటీని నియమిస్తామని చెప్పారు. పౌష్టికాహార లోపంతో గర్భిణీలు ఇబ్బందుల పడుతున్నారని,అలాగే శిశుమరణాలు అధికంగా జరుగుతున్నాయని దీని పై ప్రత్యేకదృష్టిసారించాలని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు చౌదరి ధనలక్ష్మి సమావేశం దృష్టికితీసుకువచ్చారు.
గిరిజన సంక్షేమ విద్య ఆగమ్యగోచరంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అసహనం వ్యక్తంచేసారు. గత సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏ మేరకు పరిష్కారం చేసారని ఐటిడిఎ పిఒ,డిడి కె నాగోరావును మంత్రి ప్రశ్నించారు. సీతంపేట ఐటిడిఎ పరిధిలో ఓ పట్టణంలో ఓ గిరిజన పాఠశాల ఏర్పాటుచేసి అక్కడకు పిల్లలను తరలించేందుకు రవాణా సౌకర్యానికి ఎంత ఖర్చు అవుతుందో తమకు ప్రతిపాదనలు అందజేయాలన్నారు.దీనిని పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపడుతామన్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు అందుబాటులో ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.పాలకొండ ఏరియా ఆసుపత్రిలో మత్తుడాక్టర్ లేడని పాలకొండ సమావేశం దృష్టికితీసుకువచ్చారు. అలాగే గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ పనులకు సంబంధించి నందిగాం,టెక్కలి మండలాల్లో విచారణ చేపట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు కలెక్టర్‌కు సూచించారు.అంతేకాకుండా నిధులు దుర్వినియోగానికి పాల్పడిన అధికారుల నుండి డబ్బులు కక్కించాలన్నారు. ఈ సమావేశంలో పాలకొండ, పాతపట్నం ఎమ్మెల్యేలు కళావతి, కలమట రమణ, అరకు ఎంపి కొత్తపల్లి గీత,పాలకొండ, టెక్కలి, శ్రీకాకుళం ఆర్డీఓలు శ్యాంప్రసాద్, గణేష్, తేజ్‌భరత్,డిఆర్‌డిఏ పిడి తనూజరాణి, డిఎంహెచ్‌ఓ గీతాంజలి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

‘బెంగ’ళదుంప!
శ్రీకాకుళం, ఆగస్టు 24: బంగాళ దుంపల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగాళ దుంపల ధరలు పెరిగాయి. కిలో 20 రూపాయలు అమ్మితే ఓ గొప్పగా చెప్పుకునేవారు. ఈ ఏడాది వాటి ధర ఏకంగా 30 నుండి 35 రూపాయలకు బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. రైతుబజారులో మాత్రం 29 రూపాయలకు విక్రయాలు సాగిస్తున్నారు. టమోటా ధర కూడా బహిరంగ మార్కెట్‌లో ఒక్కసారిగా 60 రూపాయలకు పెరిగిపోవడంతో జెసి చొరవ తీసుకుని నేరుగా టమాటాను జిల్లా కేంద్రానికి తెప్పించి రైతుబజారు ద్వారా కిలో 30 రూపాయలకు విక్రయాలు సాగిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో దుంపలు విరివిగా ఉన్నప్పటికీ కృత్రిమ కొరతను సృష్టించి ధరలను పెంచేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ పూరె్తైనప్పటికీ బంగాళ దుంపలు కిలో 30 రూపాయలకు పైన విక్రయించడం పట్ల వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

పేరుకే ఆయకట్టు.. నీరందితే ఒట్టు!
ఎచ్చెర్ల, ఆగస్టు 24: నారాయణపురం కుడికాలువకు శివారుగా ఉన్న భూములు దుస్థితి మరింత దయనీయంగా మారింది. ఓ పక్క వర్షాభావ పరిస్థితులు వెంటాడటం, మరోవైపు కాలువలో సాగునీరు అందకపోవడం ప్రతీ ఏటా ఖరీఫ్‌లో వరిసాగు కలసి రాకపోవడంతో ఆయకట్టు రైతులు అప్పులఊబిలో కూరుకుపోతున్నారు. మండలంలో రామజోగిపేట, ఒ.ఏ.అగ్రహారం, భగీరధపురం గ్రామాలకు చెందిన పంట పొలాలు బీడుభూములుగా మారాయి. నారుమళ్లు ముదిరిపోవడమే కాకుండా ఎదలు కూడా పూర్తిగా నీరు లేక ఎండిపోయే దయనీయ పరిస్థితులు వెంటాడుతున్నాయి. నారాయణపురం కుడికాలువకు శివారుగా ఉన్న మండలంలో ఇబ్రహీంబాద్ నుంచి భగీరధపురం వరకు సుమారు ఏడువేల ఎకరాలు ఆయకట్టు ఉంది. ప్రతీ ఏటా 1500 ఎకరాల వరకు ఉబాలు జరుగక ఆ రైతాంగం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఓ వైపు నీటితీరువా చెల్లించకతప్పడం లేదు. మరోవైపు పంటలు కలసిరాక నష్టాలు చవిచూడటమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా వీరిని వెంటాడుతున్నాయి. ఆధునీకరణ పనులు పూర్తి చేసి టైలాండ్‌కు నీరందిస్తామని నేతలు చెప్పిన మాటలు నీటిమూటలుగా మిగలడంతో ఖరీఫ్‌లో వరిసాగు అంటే ఈ రైతాంగం హడలిపోతున్నాడు. మరికొంతమంది రైతులు వ్యవసాయ పంపుసెట్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చినప్పటికీ ప్రభుత్వం కొత్త కనెక్షన్లు ఇవ్వకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ రంగాన్ని నమ్ముకున్న కూలీలకు వ్యవసాయ పనులు లేకపోవడంతో ఉపాధి ప్రశ్నార్ధకంగా మారింది. కాళ్లు అరిగేలా జిల్లా కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షణలు చేసినా సాగునీరు శివారు గ్రామాలకు చేరకపోవడం ఆయకట్టు రైతాంగం మరింత దిగులు చెందుతోంది. ఈ రైతాంగాన్ని ఆరుతడి పంటలు సాగు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహించి ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ వారంతా వాపోతున్నారు.
* వర్షాలు లేకపోవడం వల్లే..
ఆనకట్టు వద్ద వంద పాయింట్లు నీరు విడుదల చేస్తున్నా వర్షాలు లేకపోవడం వల్ల ఇప్పటివరకు టైలాండ్‌కు సాగునీరు చేరకపోవడం వాస్తవమే. లస్కర్ల కొరత కారణంతో సాగునీటి కష్టాలు ఆయకట్టు రైతాంగానికి తప్పటం లేదు. కావలసిన స్థాయిలో సిబ్బంది లేకపోవడం వల్ల శివారు గ్రామాలకు సాగునీరు అందించలేకపోతున్నాం. ఈ నెలాఖరుకల్లా టైలాండ్‌కు సాగునీరు చేరేలా చర్యలు తీసుకుంటాం.
- బగ్గు సత్యనారాయణ,
ఇరిగేషన్ ఎ.ఇ., కింతలి సెక్షన్.

సాక్షర్ భారత్ పరీక్షకు 28 వేల మంది హాజరు
సారవకోట, ఆగస్టు 24: జాతీయ ఓపెన్ స్కూల్ నిర్వహిస్తున్న పరీక్షలకు సాక్షరభారత్ ద్వారా నూతనంగా అక్షరాస్యులైన 28 వేల మంది హాజరైనట్లు రాష్ట్ర పరిశీలకులు అప్పలరాజు తెలిపారు. మండలంలో అలుదు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆదివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ పరీక్షకు ఐదు లక్షల మంది నూతన అక్షరాస్యులు హాజరుకాగలరని భావిస్తున్నామన్నారు. అదేవిధంగా ఈ పరీక్షను నిర్వహించేందుకు 1099 కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేశామని తెలిపారు. సారవకోట మండలలో ఏర్పాటు చేసిన 55 పరీక్షా కేంద్రాల ద్వారా 717 మంది నూతన అక్షరాస్యులకు అర్హత పరీక్ష నిర్వహించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మండలంలో చిన్నకిట్టాలపాడు పరీక్షా కేంద్రంలో అక్కడి గ్రామ కోఆర్డినేటర్ ఆదివారం పరీక్షలను నిర్వహించలేదు. పలు కేంద్రాల్లో పర్యవేక్షకులుగా పనిచేయాల్సిన అంగన్వాడీ కార్యకర్తలు గైర్హాజలవ్వడం కనిపించింది. ఈ కేంద్రాలను సూపర్‌వైజర్ రమణ, మండల కోఆర్డినేటర్ విజయలక్ష్మీ, ఎన్‌ఆర్‌ఇజిఎస్ ఎ.పి.ఒ సీతారాం తదితరులు పర్యవేక్షించారు.
దేవీ ఆశ్రమంలో శ్రీసూక్త సహిత హోమం
ఎచ్చెర్ల, ఆగస్టు 24: మండలంలో కుంచాలకూర్మయ్యపేట సమీపంలో ఉన్న దేవీ ఆశ్రమంలో గత 27 రోజులుగా శ్రీసూక్త సహిత హోమం సాగిస్తున్నారు. 1001 శ్రీచక్రపురం వ్యవస్థాపకులు తేజోమూర్తుల బాలభాస్కరశర్మ ఆదివారం 108 మంది సువాసినులతో 108 శ్రీసూక్త పారాయణ జపం నిర్వహించారు. జపాలతో పదవ హోమం సాగించారు. రాజరాజేశ్వరి సహిత రాజరాజేశ్వరునికి సహస్తప్రారాయణం చేపట్టారు. అంతేకాకుండా గణపతి పూజ, సుబ్రమణ్య హోమంను ఘనంగా నిర్వహించారు. భక్తులతో గులాబీ పూలతో పూజలు చేయించారు. పూర్ణాహుతి అనంతరం భక్తులకు ఆశీర్వచనం పలికి తీర్ధప్రసాదాలు అందించారు. వివిధ ప్రాంతాల నుండి ఈ హోమానికి తరలి వచ్చిన భక్తులకు అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ హోమంలో అనంతశర్మ, ప్రవీణ్‌శర్మ, నాగేశ్వరరావు, సంతోష్‌కుమార్, అయ్యప్పశ్రీను, బాబి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులు రాజకీయం చేస్తే సహించేది లేదు
ఆమదాలవలస, ఆగస్టు 24: జిల్లాలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ల వద్ద ఖాళీగా ఉన్న వందలాది షిఫ్ట్ ఆపరేటర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీలో విద్యుత్‌శాఖాధికారులు రాజకీయం చేస్తే తాను క్షమించేది లేదని మాజీ మంత్రి తమ్మినేని సీతారాం హెచ్చరించారు. ఆదివారం ఆయన నివాస గృహం వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి ఈ పోస్టులను దొడ్డిదారిన భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిని ఎట్టిపరిస్థితుల్లోను సహించమన్నారు. అసిస్టెంట్ జూనియర్ లైన్‌మెన్ పోస్టుల రిక్రూట్‌మెంట్‌లో గత ఎంతోకాలంగా సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్లు, హెల్పర్లకు కొంత రిజర్వేషన్ కల్పించి జె.ఎల్.ఎం.లుగా అవకాశం ఇవ్వడంతో భారీ ఎత్తున ఖాళీలు ఏర్పడ్డాయన్నారు. షిఫ్ట్ ఆపరేటర్లు, హెల్పర్ల ఖాళీలను జిల్లాకు చెందిన మంత్రి సొంత ఏజెంట్లను, కార్యకర్తలను, బంధువులను, అర్హత లేని వ్యక్తులను నియమించుకునేందుకు విద్యుత్ శాఖాధికారులపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

జగన్‌కు మతిభ్రమించింది
* మాజీ ఎమ్మెల్సీ హరిబాబు నాయుడు
శ్రీకాకుళం, ఆగస్టు 24: రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు ఒక్కరొక్కరుగా పార్టీని వీడటంతో ఆ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డికి మతిభ్రమించిందని మాజీ ఎమ్మెల్సీ గొర్లె హరిబాబు నాయుడు విమర్శించారు. ఆదివారం స్థానిక తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాసనసభ సమావేశాల్లో జగన్ తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. గత పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దోపిడీలకు పరోక్షంగా జగన్, కెవిపిలు కారణం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు పట్టి పీడిస్తుంటే వాటి పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషిచేస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని అన్నారు.
ఎక్కడైనా అధికార పక్షంపై జనం వ్యతిరేకత చూపడం సాధారణమని, ప్రజా సమస్యలను విడిచిపెట్టి రాజకీయ సమస్యలను మాట్లాడుతున్న జగన్‌పట్ల నేడు ప్రజలు వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి పి.వి.రమణ మాట్లాడుతూ జిల్లాలో దివంగత నేత ఎర్రన్నాయుడు వనరుల దోపిడీని అడ్డుకున్నారని, అందుకు ఆయన కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గౌరవించి సముచిత స్థానం కల్పించారని కొనియాడారు.
వైభవంగా చండీహోమం
* ముగిసిన కోటికుంకుమార్చన పూజలు
శ్రీకాకుళం, ఆగస్టు 24: పట్టణంలో గల పుణ్యపువీధిలో కొలువుతీరిన అభయాంజనేయ సహిత భద్రాద్రి సీతారాములవారి ఆలయ ఆవరణలో వైభవంగా లలితా చండీ హోమ పూజలు జరిగాయి. గత నెల ఏడవ తేదీ శ్రావణ మాసం ప్రారంభం నాటి నుంచి ఆలయ ఆవరణలో ధర్మకర్త ముక్కాల రాంబాబు, రాజారావు దంపతుల నిర్వహణలో అమ్మవారికి లలిత సహస్తన్రామ పారాయణాలు, కోటి కుంకుమార్చన పూజలు కొనసాగాయి. ఈ మేరకు ఆదివారం ముగింపు సందర్భంగా 216 మంది మహిళలు తమలార్చనలు, కుంకుమపూజలు, చండీహోమ పూజల్లో పాల్గొన్నారు. అరసవల్లి పురోహితులు నేతేటి రాజులు, హరిశర్మల నిర్వహణలో పెంటా శ్రీనివాసశర్మ, మేడూరి కృష్ణశర్మల వేద మంత్రోచ్ఛరణలు వైభవంగా పూర్ణాహుతి పూజలు జరిగాయి. మహిళలకు అమ్మవారికి శేషవస్త్రాలు, గాజులు, పసుపుకుంకుమలు, ప్రసాదాలను అందించి ఆశీర్వచనాలు పలికారు. అనంతరం భక్తులందరికీ అమ్మవారి అన్నప్రసాదాన్ని అందించారు.
మాతృభాష సజీవం
* తెరవే సాహిత్యగోష్టిలో కామేశ్వరరావు
శ్రీకాకుళం, ఆగస్టు 24: మాతృభాష పట్ల ప్రతి ఒక్కరికీ మమకారంతో పాటు సజీవంగా ఉండేందుకు కృషిచేయాలని తెలుగు రచయితల వేదిక గౌరవ అధ్యక్షులు బరాటం కామేశ్వరరావు అన్నారు. ఆదివారం స్థానిక వేదిక కార్యాలయంలో సాహిత్యగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష, సాహిత్యం కొరకు పనిచేసే సంస్థలకు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తగిన ప్రోత్సాహం అందడం ద్వారా భాషను సజీవంగా ఉంచుకునేందుకు మరిన్ని సాహిత్యాలు వచ్చే అవకాశముందని తెలిపారు. అనంతరం ఉత్తరావల్లి నాగేశ్వరరావు, పొట్నూరు వెంకటరావులు మాట్లాడగా, గుడిమెట్ల గోపాలకృష్ణ కవితలను వినిపించారు. దాసిరెడ్డి చిరంజీవి ఓ కథను వినిపించగా, సదాశివుని శంకరరావు తెలుగుభాషా పితామహుడు గిడుగు రామ్మూర్తిపై వ్యాసాన్ని రాసి వినిపించారు. కార్యక్రమంలో తెరవే ప్రతినిధులు ఆర్.వి.రమణమూర్తి, కోనే శ్రీ్ధర్, ఉపేంద్రశర్మ, చాడ శ్రీనివాస్, ఎం.వి.మల్లేశ్వరరావు, ఎస్.బ్రహ్మాజీ, ఎ.వి.టి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

దుబారా తగ్గించి సహకరించండి
ఆమదాలవలస, ఆగస్టు 24: పట్టణంలో మెట్టక్కివలస మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వచ్చిన టీచర్ల బృందానికి ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పాఠాలు చెప్పి హితబోధ చేశారు. స్థానిక ఎన్టీఆర్ పార్కు వద్ద ఆదివారం నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షుడు పేడాడ ప్రభాకరరావు ఆధ్వర్యంలో బాలికోన్నత పాఠశాల హెచ్.ఎం రాజ్యలక్ష్మీలతోపాటు పది మంది టీచర్లు కలసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. తమ పాఠశాలలో నాన్‌టీచింగ్ స్ట్ఫాను మంజూరు చేయాలని వారు కోరగా ప్రభుత్వ విప్ స్పందిస్తూ ప్రస్తుతం ప్రభుత్వం క్లిష్టపరిస్థితుల్లో ఉందని, దుబారా ఖర్చులు తగ్గించి పొదుపు చర్యలు చేపడుతుందని వివరించారు. మీ పాఠశాలలో ఎంత మంది పిల్లలు చదువుతున్నారని ఆయన ప్రశ్నించగా 170 మంది పిల్లలు ఉన్నట్లు టీచర్లు చెప్పారు. ఇంత తక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలకు నాన్ టీచింగ్ స్ట్ఫా కావాలంటే కుదరదని, పొందూరులో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1700 మంది విద్యార్థులు ఉన్నారని, అక్కడ కనీసం ఒక అటెండర్ కూడా లేరని, అంతా వారే చూసుకుంటున్నారని హితబోధ చేశారు. మాది బాలికల పాఠశాల అని టీచర్లు చెప్పగా పొందూరు హైస్కూల్‌లో కూడా 900 మంది బాలికలు, 800 మంది బాలురు ఉన్నారని, అనేక పోటీపరీక్షలకు ఈ పాఠశాల ప్రధాన కేంద్రంగా ఉందని, అయినా వారు నాన్‌టీచింగ్ స్ట్ఫాను అడుగలేదన్నారు. మీరు స్ట్ఫాను పెట్టాలని అడుగడం సబబా కాదా అని మీరే నిర్ణయించుకోవాలని సూచించారు.
* పట్టణాన్ని గ్రీన్‌బెల్ట్‌గా తయారుచేస్తాం
నిత్యం జీడితొక్క కాలుష్యంతో విలవిల్లాడుతున్న పట్టణంలో భారీ ఎత్తున మొక్కలు నాటి గ్రీన్‌బెల్టు పట్టణంగా తయారు చేస్తామని ప్రభుత్వ విప్ రవికుమార్ అన్నారు. మొక్కలను నాటిన అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలంటే ప్రతీ ఒక్కరూ ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లోను, నివాసిత ప్రాంతాల్లో విధిగా మొక్కలు నాటి పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, మున్సిపల్ చైర్‌పర్సన్ తమ్మినేని గీత, టిడిపి నాయకులు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

అరసవల్లిలో భక్తుల కోలాహలం
శ్రీకాకుళం, ఆగస్టు 24: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో కనిపించారు. శ్రావణ మాసం ముగింపు రోజు కావడంతో సుధూర ప్రాంతాల నుండి ఇక్కడకు చేరుకుని పూజలు జరిపారు. పలువురు సూర్యనమస్కారాలు నిర్వహించగా మరికొందరు తలనీలాలు అర్పించి ఇంద్రపుష్కరిణిలో పుణ్యస్నానాలాచరించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఇ.ఒ ఆర్.పుష్పనాధం ఏర్పాట్లను సమీక్షిస్తూ ఆలయ ఆదాయం పెంచే దశలో 25 రూపాయల టిక్కెట్లను ప్రోత్సహించారు.
* ఆదిత్యుని సన్నిధిలో
శ్రీకృష్ణాష్టమి పూజలు
శ్రీకృష్ణుని జయంతిని పురస్కరించుకుని ఆదిత్యుని సన్నిధిలో వేడుకలు జరుగుతున్నాయి. ఈ మేరకు అర్చకులు శ్రీకృష్ణుని అవతారంలో ఆదిత్య నారాయణుల వారిని విశేషాలంకరణ చేసి అనివెట్టి మండపం వద్ద కొలువుతీర్చారు. ప్రతీరోజూ ఉదయం, సాయంత్రం శ్రీకృష్ణ అర్చనలు నిర్వహిస్తున్నారు. స్థానికులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ పూజల్లో పాల్గొంటున్నారు.

ఖరీఫ్ సీజన్ ముగిసేందుకు మరో 34 రోజులే గడువు
english title: 
melika

పార్టీని బూత్‌స్థాయిలో పటిష్టం చేయాలి

$
0
0

* కార్పొరేషన్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి
* జిల్లా కాంగ్రెస్ నేతలకు దిగ్విజయ్‌సింగ్ హుకుం
వరంగల్, ఆగస్టు 24: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, జడ్పీ, మండల పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లో మెజారిటీ వచ్చినా జిల్లా నాయకుల అనైక్యత కారణంగా పార్టీ అభ్యర్థుల ఓటమిని దృష్టిలో పెట్టుకుని వరంగల్ నగర పాలకసంస్థ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ జిల్లా నాయకులను ఆదేశించారు. జిల్లా, నగరంలో పార్టీని, అనుబంధ విభాగాలను పటిష్టం చేయాలని సూచించారు. ఆది, సోమవారాల్లో హైదరాబాద్‌లో జరుగుతున్న పార్టీ మేధోమథనం కార్యక్రమానికి హాజరైన జిల్లా నాయకులతో దిగ్విజయ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ పాత్ర కీలకమైనా, ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారని, పార్టీ పరాజయానికి కారణం ఏమిటనేది నాయకులు ఆలోచించాలన్నారు. జిల్లాలో, వరంగల్ నగరంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేదిశలో కార్యాచరణ చేపట్టాలని సూచించారు. నగరపాలక సంస్థకు జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డివిజన్ స్థాయిలో పార్టీ కమిటీలతోపాటు అనుంబంధ విభాగాల కమిటీలను కూడా వేయాలని దిగ్విజయ్‌సింగ్ జిల్లా బాధ్యులను ఆదేశించారు. మాజీమంత్రి బస్వరాజు సారయ్య, మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మినహా ఆయా స్థానాల నుంచి పోటీచేసిన అభ్యర్థులు, ముఖ్యనాయకులు సమావేశానికి హాజరయ్యారు.

నగరంలో డాగ్‌షో సందడి
వరంగల్, ఆగస్టు 24: నగరంలో కాకతీయ కెనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం డాగ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి 136 శునకాలను తీసుకువచ్చారు. యజమానులు తమ పెంపుడు శునకాలతో చేయించిన వివిధ ఫీట్లు కార్యక్రమానికి ప్రజలకు ఆనందం, ఆశ్చర్యం కలిగించాయి. డాగ్ షో కార్యక్రమానికి 26జాతులకు చెందిన శునకాలను ప్రదర్శనకు తీసుకువచ్చారని నిర్వాహకులు, అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ప్రదీప్‌రెడ్డి, డాక్టర్ రమణారెడ్డి తెలిపారు. డాగ్‌షోలో ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చిన శునకాల యజమానులకు బహుమతులు అందచేశారు.

తెలంగాణపై గవర్నర్‌కు అధికారం తగదు
ఎంపి సీతారాం నాయక్
మరిపెడ, ఆగస్టు 24: తెలంగాణ రాష్ట్రంపై గవర్నర్ అధికారాలకు స్వస్తి పలకనున్నట్లు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు సీతారాంనాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఖమ్మం జిల్లా టిఆర్‌ఎస్ ఇన్‌చార్జ్జి నూకల నరేష్‌రెడ్డితో కలిసి విలేఖరులతో మాట్లాడుతూ రాజ్యాంగంలోని 166 సెక్షన్ లోని 8ని అధారంగా చేసుకుని తమ హక్కులను కాపాడేందుకు హైదరాబాద్‌ను సీమాంధ్రులు తమ ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారన్నా రు. 21వ తేదీన ఇరు రాష్ట్రాల నేతలతో కేంద్రమంత్రితో జరిగిన చర్చల ఫలితంగా తెలంగాణపై గవర్నర్‌కు అధికారాలు ఉండకూడదని తేల్చిచెప్పడం జరిగిందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు భూమి పంపిణీ చేసే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగిందన్నారు. మార్కెట్, మండల కమిటీలలో గిరిజనులకు 21శాతం పదవులు ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశం లో జెఎసి కన్వీనర్ అశోక్‌కుమార్, టిఆర్‌ఎస్ నాయకులు రాంపెల్లి అబ్బయ్య, శ్రీనివాస్, అమరేందర్‌రెడ్డి, ఉపేందర్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

న్యాయం కోసం భర్త ఇంటి ముందు దీక్ష
జఫర్‌గడ్, ఆగస్టు 24: మండలంలోని రఘునాథ్‌పల్లి గ్రామానికి చెందిన ఎడ్ల యశోద తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భర్త ఇంటి ఎదుట దీక్ష చేపట్టిన సంఘటన ఆదివారం జరిగింది. గ్రామస్థులు, బాధితురాలి కథనం ప్రకారం.. మండలంలోని రఘనాథ్‌పల్లి గ్రామానికి చెందిన తాటికాయల సంపత్.. అదే గ్రామానికి చెందిన యశోదను 25 ఏళ్ళ క్రిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కూతురు పుట్టాక సంపత్ తాటిపల్లికి చెందిన మరో యువతిని వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య ఉండగానే రెండవ పెళ్లి చేసుకోవటంతో మొదటి భార్య యశోద భర్తను నిలదీసింది. న్యాయం చేస్తానని భర్త సంపత్ చెప్పటంతో అప్పటికి ఆ విషయం సద్దుమణిగింది. ప్రస్తుతం కూతురుకు పెళ్లీడు రావటంతో పెళ్లి చేయాలని భర్తను కోరగా, మీతో తనకు ఎటువంటి సంబంధం లేదంటూ మొండికేశాడు. ఈ విషయాన్ని గ్రామపెద్దలకు, కులపెద్దలకు చెప్పగా, వారు కూడా సంపత్‌ను పంచాయతీకి పిలవగా, పెద్దమనుషులను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. దాంతో యశోద తన కూతరుతో కలిసి భర్త సంపత్ ఇంటికి వెళ్లగా, అప్పటికే సంపత్ ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయాడు. దాంతో యశోద భర్త ఇంటిముందు వౌనదీక్ష చేపట్టారు. విషయం తెలుసుకున్న జఫర్‌గడ్ పోలీసులు రఘునాథ్‌పల్లికి చేరుకుని యశోదను దీక్ష విరమించాలని సముదాయించినా.. ససేమిరా అనటంతో వెనక్కి వెళ్లిపోయారు. బాధితురాలు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

ప్రజల దాహర్తిని తీర్చుటకు ప్రత్యేక కార్యచరణ
* మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్
* సిఎం దృష్టికి తీసుకువెళ్తా
మహబూబాబాద్, ఆగస్టు 24:కోటాను రూపాయలు వెచ్చించి పట్టణ ప్రజలకు శుద్ధి చేసిన తాగు నీరు అందించాలని ప్రభుత్వం మునే్నరు వాగుపై నిర్మించిన ఫిల్టర్ బెడ్‌లు పనికి రాకుండా పోతున్నాయని మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. ప్రజల దాహర్తిని తీర్చేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించి ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసకువెళ్లనున్నట్లు తెలిపారు. ఆదివారం మునే్నరు వాగుపై ఫిల్టర్ బెడ్‌లను అకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో ఫిల్టర్ బెడ్‌ల పని తీరును చూసి విస్మయానికి గురయ్యారు. దీనికంతటికి గత పాలకుల పాపమేనని విమర్శించారు. పాకురు పట్టిన పంపింగ్ వెల్స్, పంప్‌హౌస్‌లను పర్యవేక్షించారు. పంప్‌హౌస్ అలంకార ప్రాయంగా మారడం మూలంగా శుద్ధి చేయని నీరే ప్రజలకు సరఫరా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపం ‘పాలకులదా’..అధికారులదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు అయినా ఫలితం శూన్యంగా మారిందని అన్నారు. కనీసం గేట్ వాల్స్‌ను కూడా పట్టించుకునే నాధుడే లేడని అన్నారు. రావాటర్ వద్ద ఉన్న 50ఎహెచ్‌పి మోటర్ ఎందుకు వృధాగా ఉందని అక్కడ ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జానాల చెరువు, పూసపల్లి చెరువుల స్థితి గతులను తెలుసుకున్నారు. ఫిల్టర్ బెడ్, స్టాండ్ బెడ్‌లతో పాటు నూతనంగా నిర్మించిన స్టాండ్ బెడ్‌లు కూడా నిరుపయోగంగా మారాయని అన్నారు. ఫిల్టర్ బెడ్‌కు మరమ్మత్తులు చేయకపోవడం వల్లన నీటి కొరత ఏర్పడిందన్నారు.మరో సారి ఫిల్టర్ బెడ్‌లను అకస్మికంగా పరిశీలిస్తానని అక్కడ ఉన్న సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మార్నేని వెంకన్న, ఫరీద్, నిమ్మల శ్రీను, సిపిఐ అజయ్, స్వప్నపోతురాజు, జయశ్రీ, గోగుల అనురాధరాజు, గొడుగు శ్రీను, నెల్లికుదురు సింగిల్‌విండో చైర్మన్ కాసం లక్ష్మీ చంద్రశేఖర్‌రెడ్డి, గుడిబోయిన శేణు, జల్ల పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.

నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోండి
* ఉత్సవాల నిర్వాహకులకు అర్బన్ ఎస్పీ సూచన
వరంగల్, ఆగస్టు 24: వరంగల్ నగరంలో ఈ నెల 29వ తేదీ నుంచి జరిగే వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు తమతమ మండపాల వద్ద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు సూచించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలు, చేపట్టవలసిన ఏర్పాట్లపై ఉత్సవ కమిటీలకు ఆదివారం మార్గదర్శకాలను ఎస్పీ విడుదల చేసారు. మండపాలను, విగ్రహాలను ప్రజలు ఉపయోగించే రహదారులకు ఆటంకంగా ఏర్పాటు చేయవద్దని తెలిపారు. మండపాల నిర్మాణానికి నాణ్యమైన సామాగ్రిని ఉపయోగించాలని, వర్షాలకు, జనాల తాకిడి అధికంగా ఉన్న సందర్భంలో మండపాలు కూలిపోకుండా ధృడంగా ఏర్పాటు చేయాలని సూచించారు. మండపాలు, విగ్రహాల ఏర్పాటుకు సంబంధిత ప్రాంతాల్లోని పోలీసు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని, దీనికోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దరఖాస్తుతోపాటు మైక్ అనుమతి, విద్యుత్‌శాఖ అధికారుల అనుమతి పత్రాలను తప్పనిసరిగా జత చేయాలని తెలిపారు. మండపాలలో విద్యుత్ సరఫరా కోసం నాణ్యమైన కరెంటు వైర్లను ఉపయోగించాలని అన్నారు. మండపాల వద్ద బాక్స్ టైపు లౌడ్‌స్పీకర్లను మాత్రమే ఏర్పాటు చేయాలని, మతపరమైన భక్తిపాటలు ఉపయోగించే విధంగా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలకు అసౌకర్యం కలిగించేలా లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు చేయవద్దని తెలిపారు. వినాయక మండపాల వద్ద పెట్రోలు, డీజిల్, కిరోసిన్ వంటి మండే స్వభావం కలిగిన వస్తువులు లేకుండా చూడాలని, ముందుజాగ్రత్త చర్యగా మండపాల వద్ద నీరు, ఇసుక నిలువ చేసి ఉంచాలని చెప్పారు. మండపాల వద్ద జాగ్రత్త చర్యల కోసం ముగ్గురు చొప్పున వాలంటీర్లును ఏర్పాటు చేసుకోవాలని, వాలంటీర్ల పేర్లు, వారి సెల్‌ఫోన్ నంబర్లతో కూడిన ఫ్లెక్సీని మండలపాల వద్ద అందరికి కనిపించేలా ఏర్పాటుచేయాలని తెలిపారు. మండపాల వద్ద ఉండే నిర్వాహకులు, వాలంటీర్లు తప్పనిసరిగా గుర్తింపుకార్డులు కలిగి ఉండాలని చెప్పారు. నవరాత్రి ఉత్సవాల రోజులలో రాత్రి 10గంటల తరువాత ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని, లక్కీ డ్రాలు నిర్వహించకూడదని, , జూదం, మద్యం సేవించటం వంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరపకూడదని స్పష్టం చేసారు. నవరాత్రి ఉత్సవాలు జరిగే రోజుల్లో మండపాల వద్ద క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, వచ్చే భక్తులు వారి వాహనాలు పార్కింగ్ చేసుకునేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని అన్నారు. నవరాత్రి ఉత్సవాల రోజులలో మండపాల వద్ద అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనబడితే సమీపంలోని పోలీస్ స్టేషన్ల అధికారులకుగానీ, డయల్ 100కుగానీ ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు.

వణికిస్తున్న వర్షాభావం
కమ్ముకొస్తున్న కరవు మేఘాలు
* ప్రశ్నర్థకమైన ఖరీప్ సాగు
* బీటలు మారుతున్న పోలాలు
* విద్యుత్ కోతలతో అన్నదాతల ఉక్కిరిబిక్కిరి
* ఆందోళన చెందుతున్న రైతాంగం
పరకాల టౌన్, ఆగస్టు 24: ఖరీఫ్ సీజన్ అన్నదాతలకు కన్నీటి సేద్యమవుతుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులలో సాగు విస్తీణం తగ్గిపోయింది. వరుణుడు కరుణించకపోవడంతో కోటి ఆశలతో దుక్కిదున్నిన పొలాలకు, పంటలకు సాగు నీరు లేక బీటలు వారుతున్నాయి. వర్షాలు కురవకపోవడంతో రైతాంగం పంట సాగు చేయలేకపోతున్నారు. ఇప్పుడు కరవు మేఘాలు మరోసారి కనిపిస్తుండడంతో రైతులు తీవ్ర భయందోళనకు లోనవుతున్నారు. వర్షాలు లేక చెరువులలో నీరందక పోవడంతో వేసిన పంటలకు అన్నదాతలు సాగు నీరు అందించలేక సతమతమవుతున్నారు దీంతో వరి నాట్లు ఎండిపోయి పంట నష్టం వాటిల్లుతోంది. పంటను నమ్ముకొని పెట్టిన పెట్టుబుడులు సాగు నీరు లేక పూర్తిగా నష్టపోతున్నారు. బావుల నీరు సరిపోక కాలువల నీరందక దిక్కుతోచని స్థితులలో రైతులు కోట్టుమిట్టాడుతున్నారు.
* ఎడారిగా కనిపిస్తున్న పంట పొలాలు...
గతేడాది ఇప్పటి వరకు కలుపు దశకు వచ్చిన వరి పొలాలు ప్రస్తుత ఖరీఫ్ నాట్లు కూడా వేయకపోవడంతో వరి పొలాలు ఎడారిగా కనిపిస్తున్నాయి. కేవలం వర్షాభావ పరిస్థితులపై మాత్రమే ఆధారపడి జీవనం సాగించే ఈ ప్రాంతంలోని రైతులు ఇంత వరకు చెరువులు, కుంటలు కింద కనీసం 10 శాతం కూడా నాటు వేయలేదని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. సబ్ డివిజన్‌లో పత్తి తరువాత వరి ముఖ్య పంట. కాగా, ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఇందులో 10శాతం పోలాలు కూడా సాగుకు నోచుకునే పరిస్థితులు కనిపించడం లేదు. వర్షాలు కురిసినట్లయితే పంట పొలాలలో భూమి పచ్చగా కనిపించడంతో పాటుగా రైతులు, కూలీలతో కళకళలాడుతు కనిపించేది. కాని వర్షాభావ పరిస్థితుల వల్ల ఎడారిగా కనిపిస్తుండడంతో అన్నదాతలు అందోళనకు గురవుతున్నారు.
* ఎండి పోతున్న వరి నార్లు
వర్షాలు కురవపోవడంవల్ల నాట్లు వేయడానికి అరుద్ర కార్తెలో రైతులు పోసుకున్న వరి నార్లు ఎండి పోతున్నాయని పలు గ్రామాల్లో రైతులు వాపోతున్నారు. డివిజన్‌లో అనేక గ్రామాలలో వర్షాభావ పరిస్థితుల వల్ల వరి నార్లు ఎండిపోవడం, పోసిన నార్లు ముదిరిపోతుండడంతో రైతులు మనోవేదనకు గురువుతున్నారు. వర్షాకాలం గడిచిపోతున్నా వర్షాల జాడలేక అన్నదాతలు దిగులు చెందుతున్నారు. నాట్ల కోసం పోసిన నార్లు ఎండిపోయి అక్కరకు రాకుండా పోతున్నాయి. నాట్లు వేసిన పొలాలన్ని నీరులేక పగుళ్ల బారినాయి. పెట్టిన పెట్టుబడులు మట్టిపాలైనాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎండలు రోజు రోజుకు పెరుగుతుండడంతో వ్యవసాయ సాగుపై ఆశలు రైతులకు సన్నగిల్లుతున్నాయి. వరుణ దేవుడు కరణించి వర్షాలు కురవాలని ప్రజలు, రైతులు పూజలు, యగాలు, కప్పతల్లి, కోలాటలు ఆటలు ఆడుతున్నారు. వర్షాభావంతో రైతన్నలు మనోధైర్యం చెడి ఆత్మహత్యల వైపు దృష్టి సారిస్తున్నారని రైతు సంఘాల నాయకులు వాపోతున్నారు. చిట్యాల మండలం సబ్బుక్కపల్లి గ్రామానికి చెందిన సమ్మయ్య తనకున్న మూడు ఎకరాల పొలంలో వరి నార్లు, మరో మూడు ఎకరాల పొలంలో పత్తి పంట వేశాడు. అయితే కరెండు లేని కారణంగా కనీసం నారుముడి తడుపుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడుగా వర్షాభావం తోడుకావడంతో పంటల పెట్టుబడి కోసం చేసిన అప్పులు అలాగే ఉండడంతో తన చేను వద్ద బలవంతంగా తనువు చాలించాడు. అదేవిధంగా వర్షాలు లేక పంట ఎండిపోతుండగా మనోవేదనతో ముస్త్యాలపల్లికి చెందిన కౌలు రైతు బందెల చిన్న కొంరయ్య మృతి చెందాడు. ఏది ఏమైనా కరువు మేఘాలు కమ్ముకొస్తున్న తరుణంలో రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలన్ని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.

నగరంలో ఘనంగా బోనాల పండుగ
వరంగల్, ఆగస్టు 24: వరంగల్ నగరంలోని పలుప్రాంతాలలో ఆదివారం బోనాల పండగ ఘనంగా జరిగింది. శ్రావణమాసం మరో రెండురోజులలో ముగస్తుండటం.. సెలవురోజు ఆదివారం కావటంతో నగర ప్రజలు ఉత్సాహభరిత వాతావరణంలో బోనాల పండుగను జరుపుకున్నారు. ఉదయం నుంచే మహిళలు తలంటు స్నానాలు చేసి బోనాలు తయారు చేసి ఉరేగింపుగా సమీపంలోని పోచమ్మ గుళ్లకు వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కొందరు భక్తులు అమ్మవారికి కోళ్లు, మేకలు సమర్పించారు. బోనాల పండుగను పురస్కరించుకుని హైద్రాబాద్ తదితర ప్రాంతాలలో ఉన్న తమ బంధుమిత్రులను ఆహ్వానించి విందుభోజనాలు ఏర్పాటు చేసారు. మద్యం కొనుగోళ్లతో వైన్‌షాపుల వద్ద రద్దీ కనిపించింది.

పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తా: డిప్యూటీ సిఎం రాజయ్య
స్టేషన్ ఘన్‌పూర్, ఆగస్టు 24: తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి సర్వత్రా కృషి చేస్తానని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టరు తాటికొండ రాజయ్య అన్నారు. జిల్లా పాల ఉత్పత్తి దారుల సంఘం, పాల శీతలీకరణ కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో సంయుక్తంగా నిర్వహించిన పాడి-పంటపై రైతుల అవగాహన సదస్సుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డాక్టరు రాజయ్య ముఖ్య అతిధిగా హాజరుకాగా వరంగల్ ఎంపి కడియం శ్రీహరి విశిష్ట అతిధిగా హాజరైనారు. మండల కేంద్రంలోని పాల శీతలీకరణ కేంద్రంలో ఏర్పాటు చేసిన పాల ఉత్పత్తి తయారీ కేంద్రాన్ని వారు ప్రారంభించారు. అనంతరం స్థానిక బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఉపముఖ్యమంత్రి డాక్టరు రాజయ్య, వరంగల్ ఎంపి కడియం శ్రీహరిలు పాల్గొని, ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పశువుల పాకలను సందర్శించి, ఆయా రైతులనుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపముఖ్యమంత్రి రాజయ్య మాట్లాడుతూ పాడి పరిశ్రమ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల సాధనకు ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను సరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే పాడి రైతుల సంక్షేమమే ప్రధానమని ఆయన అన్నారు. అలాంటి పాడి రైతులతో పాటు, వ్యవసాయ రైతులను ఆదరించి, హక్కున చేర్చుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందన్నారు. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వంలో రైతు రుణ మాఫీ ప్రకటించి దేశ వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం నేడుప్రఖ్యాతలు గడించిందన్నారు. అంతేకాక సమగ్ర కుటుంబ సర్వే ద్వారా నిజమైన లభ్దిదారుల ఎంపిక చేయడంతో, ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పధకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ఘన్‌పూర్ పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు చింతకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా పశుగణాభివృద్ధి చైర్మెన్ పాపారెడ్డి, సంయుక్త సంచాలకులు శంకర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు రామారావు, ఉప సంచాలకులు క్రష్టస్వామి, స్థానిక సింగిల్‌విండో చైర్మెన్ గట్టు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

* కార్పొరేషన్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి * జిల్లా కాంగ్రెస్ నేతలకు దిగ్విజయ్‌సింగ్ హుకుం
english title: 
diggy

శాస్ర్తియ పరిశోధనలవైపు విద్యార్థులను ప్రోత్సహించాలి

$
0
0

* రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
గుంటూరు, ఆగస్టు 24: శాస్ర్తియ పరిశోధనల పట్ల విద్యార్థులు ఆసక్తి కనబర్చేవిధంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం స్థానిక ఆగ్జీలియం హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిలో మంచి ఆలోచనలను కల్గజేయాలని, వారిలోని సృజనాత్మకతను, నైపుణ్యాలను వెలికితీసి మంచి శాస్తజ్ఞ్రులుగా ఎదిగేలా తయారు చేయాలని సూచించారు. కేంద్రప్రభుత్వం 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలలోపు గల విద్యార్థుల్లో శాస్త్ర పరిశోధన పట్ల ఆసక్తి పెంచేలా ఇన్స్‌పైర్ అవార్డులు కల్పించిందని ఒక్కొక్క విద్యార్థికి 5 వేల రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగించుకుంటూ అద్భుతాలు సృష్టించాలన్నారు. ఇందుకు అధునాతన యంత్రాలు, పరిజ్ఞానంతో ముందుకెళ్లాలన్నారు. విద్యార్థులను శాస్ర్తియ పరిశోధనల పట్ల ఆసక్తి పెంచేలా ఉపాధ్యాయులు, విద్యాశాఖ కృషి చేయాలని మంత్రి సూచించారు. ఈ వైజ్ఞానిక మూడు రోజులు ఉంటుందని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో సైన్స్ ప్రముఖపాత్ర వహిస్తుందని, ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలో సైన్స్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే ప్రదర్శనలు తిలకించినట్లయితే విద్యార్థుల్లో కొత్త కొత్త ఆలోచనలు రేకెత్తుతాయన్నారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ సైన్స్ వ్యవసాయరంగం అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని, గొప్ప శాస్తవ్రేత్తలను ఆదర్శంగా తీసుకుని సైన్స్ పట్ల విద్యార్థులు ఆసక్తి పెంచుకునేలా చూడాలన్నారు. మరో ఎమ్మెల్సీ బి నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో తాత్విక, శాస్ర్తీయ ఆలోచనలు పెంచేలా ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. విద్యార్థులు మంచి పౌరులుగా ఎదిగేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. అనంతరం మంత్రి పుల్లారావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రదర్శనలను తిలకించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్త్ఫా, మోదుగుల వేణుగోపాలరెడ్డి, అడిషనల్ జెసి నాగేశ్వరరావు, పాఠశాల ఆర్‌జెడి పి పార్వతి, డిఇఒ ఆంజనేయులు, ఆగ్జీలియం హైస్కూల్ కరస్పాండెంట్ తదితరులు పాల్గొన్నారు.

మద్యంషాపు తొలగించాలంటూ మహిళల ఆందోళన
తాడికొండ, ఆగస్టు 24: మండల పరిధిలోని పొనె్నకల్లు గ్రామంలో ఎస్సీ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన మద్యంషాపును వెంటనే తొలగించాలంటూ ఆదివారం మహిళలు ఆందోళన చేశారు. మద్యానికి బానిసలుగా మారి తమ భర్తలు పుస్తులను సైతం తాకట్టుపెట్టి మద్యం సేవిస్తున్నారని, దీంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాకుండా మహిళలు, విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయిందని, మద్యంబాబుల ఆగడాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. దళిత కాలనీలో ఈ మద్యంషాపును వెంటనే తొలగించాలని డిమాండ్‌చేశారు.

మానవాళి మనుగడలో చెట్లదే ప్రాముఖ్యత
అచ్చంపేట, ఆగస్టు 24: మానవాళి మనుగడకు చెట్లు ముఖ్యభూమిక పోషిస్తాయని సర్పంచ్ వెంకయ్య అన్నారు. 65వ వన మహోత్సవంలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో ఆదివారం గురుకుల పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకయ్య మాట్లాడుతూ అందరూ చెట్లు నాటి సంరక్షించాలన్నారు. పెద్దలు తమ పిల్లలకు మొక్కలు నాటి వాటిని ప్రేమగా చూసుకునేలా చైతన్య పర్చాలన్నారు. చెట్లు వాతావరణ సమతుల్యతను కాపాడి కాలానుగుణంగా వర్షాలు కురిసేందుకు దోహదం చేస్తాయన్నారు. వన మహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణలో వేప, గానుగ ఇతర మొక్కలను అతిథులు నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ అనిల్‌కుమార్, అటవీశాఖ డిఆర్‌ఒ తులసీరావు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ముక్తుం, నాగార్జున, ఏసురత్నం, ఎపిఒ సాంబశివరావు, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు జాషువా, ప్రసాద్, కొత్తపల్తి సర్పంచ్ ఎన్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

మంగళగిరి ఎమ్మెల్యేకి ఇసుక మాఫియా బెదిరింపు లేఖ
మంగళగిరి, ఆగస్టు 24: స్థానిక శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కి ఇసుక మాఫియానుంచి బెదిరింపు లేఖ వచ్చింది. పోస్టుద్వారా పట్టణంలోని పాతబస్టాండ్ సెంటర్లో గల ఆయన నివాసం ఆర్‌ఆర్ టవర్స్‌కు లేఖ శనివారం చేరింది. కాగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి ఆదివారం వచ్చి చూడగా లేఖ ఉంది. లేఖ సారాంశం ఇలా ఉంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి నువ్వు మా ఇసుక వ్యాపారాలకు అడ్డుతగులుతున్నావు. ఇలా చేయటం వలన ఇబ్బందులు ఎదుర్కొంటావు. ఇసుక మాఫియా అంటే ఏమిటో నీకు తెలియదు. మాకు అడ్డువచ్చిన వారిని ఎవరినీ వదలం. మంగళగిరి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు లంచం తీసుకుని మాజోలికి రాలేదు. కానీ నువ్వు మా జోలికి వస్తున్నావు, చిర్రావూరు ఇసుక రీచ్‌లను తనిఖీచేసి మైనింగ్ ఇరిగేషన్ అధికారులకు ఫోన్‌చేసి అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని చెప్తున్నావు. ఇలా చేస్తే నిన్ను బతకనివ్వం. మా వెనుక పెద్ద ఇసుక మాఫియా ఉంది. మంగళగిరి ప్రాంతంలో ఇసుక రీచ్‌ల గురించి వదిలిపెట్టు. లేదంటే నిన్ను చంపేస్తాం. నిన్ను భయపెట్టాలని కాదు. భౌతిక దాడులు తప్పవు ఖబడ్దార్ అని లేఖలో ఉంది. ఆదివారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పట్టణ సిఐ రావూరి సురేష్‌బాబును కలిసి తనకు వచ్చిన బెదిరింపు లేఖను చూపి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని సిఐ సురేష్‌బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ గతంలో కూడా తనకు బెదిరింపు లేఖ వచ్చిందని, పోలీసులకు ఫిర్యాదు చేశానని, తనను బెదిరిస్తే అక్రమ వ్యాపారాలు సాగనిస్తానని అనుకోవటం సరైంది కాదని, బెదిరింపులకు భయపడేది లేదని అన్నారు. ఇసుక, మట్టి అక్రమ తరలింపు , భూ కబ్జాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని, జిల్లా కలెక్టర్, ఎస్పీ దృష్టికి కూడా తనకువచ్చిన బెదిరింపు లేఖ గురించి తీసుకు వెళతానని ఆయన పేర్కొన్నారు.

పసిపిల్లలు - పచ్చని చెట్లు ఒక్కటే
నరసరావుపేట, ఆగస్టు 24: పసిపిల్లలు, పచ్చని చెట్లు ఒక్కటేనని శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఆదివారం స్థానిక భువనచంద్రటౌన్ హాల్లో మున్సిపాల్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నీరు-చెట్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఆర్డీవో యం శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. పసిపిల్లలను ఎలా పెంచుతామో, చెట్లను కూడా అదే విధంగా పెంచాలని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. చెట్లు పెంచే కార్యక్రమాన్ని ఆడబిడ్డలకు అప్పగించాలని సూచించారు. జిల్లాలోనే నరసరావుపేటలో ఉన్న చెట్లు మరెక్కడాలేవన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు నాటాలన్నారు. నరసరావుపేట పట్టణంలో 18సంవత్సరాల క్రితమే తాము పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా చెట్లు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. వాతావరణంలో మార్పు, ధూళి, శబ్ధకాలుష్యం నివారించాలంటే చెట్లను పెంచడం తప్పనిసరన్నారు. సత్తెనపల్లిని నరసరావుపేటకు ధీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. కోటప్పకొండ దేవాలయంలో రెండోదశ అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రానున్న మహాశివరాత్రికి పర్యాటక, పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మండలంలోని కాకాని గ్రామం వద్ద జెఎన్‌టీయుసీ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరైందన్నారు. పట్టణంలోని రెండో రైల్వేగేటు వద్ద ఆర్‌ఓబీ లేదా ఆర్‌యుబీకి ప్రతిపాదనలు పంపించామన్నారు. మున్సిపాలిటీ నుండి 25శాతం, రైల్వే నిధులు 75శాతం వచ్చే విధంగా ఎంపీ రాయపాటి సాంబశివరావు కృషిచేయాలన్నారు. పట్టణంలో విద్యార్థులకు కావాల్సిన వన్నీ సమకూరుస్తామన్నారు. ఎంపీ రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డాక్టర్ కోడెలకు పెద్ద బాధ్యతైన స్పీకర్ పదవిని ఇచ్చారని అన్నారు. ఆయన తప్ప ఎవరూ సమర్ధవంతంగా సభను నడపలేరన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. డాక్టర్ కోడెల సనుసన్నల్లో తాము పయనిస్తామన్నారు. నరసరావుపేటలో నామినేషన్ వేస్తే పదివేల ఓట్లతో గెలిచేవారన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలకు తాను ముందుంటానని అన్నారు. అధికార పార్టీకి సహాయ, సహకారాలను అందచేస్తామని స్పష్టం చేశారు. జెఎన్‌టియుకే సంబంధించిన ప్రతిపాదనలు గత ప్రభుత్వానికి అందచేయడం జరిగిందన్నారు. ఆర్థికపరమైన చిక్కులు తొలిగిపోవాల్సి ఉందన్నారు. అదే విధంగా ప్రకాష్‌నగర్ రెండోగేటు వద్ద లిమిటెడ్ హై సబ్‌వేను ఏర్పాటుచేస్తే, అది మూడు నెలల్లో పూర్తవుతుందన్నారు. డాక్టర్ నలబోతు వెంకట్రావు మాట్లాడుతూ పర్యావరణం కలుషితమైన దేశాలలో భారతదేశం ముందుందన్నారు. మొక్కలను పెంచడమేకాక, ఆ మొక్కలను కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, వైస్ చైర్మన్ మీరావలి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఎంఈ సీతారామారావు తదితరులు పాల్గొన్నారు. తొలుత మున్సిపల్ కార్యాలయం నుండి ర్యాలీగా ప్రకాష్‌నగర్‌లోని భువనచంద్ర టౌన్ హాల్ వద్దకు ర్యాలీగా వచ్చారు. అనంతరం భువనచంద్రటౌన్ హాల్లో ఎంపీ, స్పీకర్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

శారీరక - మానసిక ఆరోగ్యం కోసమే యోగ సాధన
తెనాలి, ఆగస్టు 24: శారీరక - మానసిక ఆరోగ్యం కోసం మన ప్రాచీన ఋషి సంప్రదాయంద్వారా వెలుగులోకి వచ్చిన యోగసాధన నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన అవసరం ఉందని 95శాతం అనారోగ్య సమస్యలు మానసికమైన వత్తిడుల కారణంగానే వస్తుంటాయని తలనుండిపాదం వరకు ఉన్న 72వేల నాడులను ఉత్తేజపరిచేందుకు యోగ సాధన అవసరమని శ్రీ ఋషియోగ గురూజీ ఉపేంద్రసాయి పేర్కొన్నారు. స్థానిక మారీస్‌పేటలోని శివాలయం కల్యాణ మండపం వేదికగా 15రోజుల యోగ శిక్షణ తరగతులు అవగాహన సదస్సు ఆదివారం నిర్వహించారు. పరిచయ క్లాస్‌ద్వారా ఉపేంద్రసాయి గురూజీ యోగసాధన అవసరాన్ని వివరించారు. సృష్టిలోని 84కోట్ల జీవరాసుల్లో మానవుడు ఒకటైనప్పటికి, మానవుడుకే అదనంగా జ్ఞానాభివృద్ధి అవకాశం లభించడానికి గల కారణం చెబుతూ జంతుజాలం వెనె్నముక అడ్డంగా ఉంటుందని, మానవుడి వెనె్నముక నిటారుగా నిలువుగా ఉండటం, జ్ఞానాభివృద్ధికి ఓ కారణంగా వివరించారు. కుండలినిశక్తి, మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మనిపూరక, అనాహత, విసుద్ధ చక్రాల పనితీరు తక్కువగా, ఎక్కువగా ఉన్నా శారీరక మానసిక సమస్యలుంటాయని, సక్రమంగా పనిచేసేందుకు వత్తిడిలేని వ్యాయామ విధులను సాధన చేయడం, ప్రకృతి ప్రసాదించిన అమృతాహారం స్వీకరించడం ద్వారా శరీరం - మనస్సు కూడా మనస్వాధీనంలోకి తెచ్చుకోవచ్చన్నారు. కాగా సోమవారం నుండి రోజుకు 3బ్యాచ్‌లద్వారా శిక్షణా తగరతులు 15రోజులపాటు కొనసాగిస్తామని, సాధన సమయంలో ప్రత్యేక అమృతాహారాన్ని సరఫరా చేయనున్నట్లు గురూజీ వివరించారు. కార్యక్రమం శివాలయం కమిటి చైర్మన్ గ్రంధి సేతుమాధవరావు, వెలుగూరి శ్రీనివాసరావు, ఎం. సత్యనారాయణశెట్టి తదితర యోగ సాధకులు పాల్గొన్నారు.

పట్టణాన్ని పచ్చని వనంగా మార్చుదాం
మాచర్ల, ఆగస్టు 24: పురపాలక సంఘ పరిధిలో కాలుష్యాన్ని తరిమికొట్టి పచ్చని వనంగా మార్చేందుకు అందరం కలసి శ్రమించాలని పురపాలక సంఘ ఛైర్మన్ గోపవరపు శ్రీదేవి కోరారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో పచ్చతోరణం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజురోజుకు పర్యావరణం కాలుష్యమవటంతో ఓజోన్ పొర దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. చెట్లను నరకటం మితిమీరి ప్లాస్టిక్ వస్తువులను వినియోగించటం ద్వారానే వాతావరణం కలుషితమవుతుందన్నారు. ప్లాస్టిక్ రహిత పురపాలక సంఘంగా మార్చేందుకు పట్టణంలోని ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు. అనంతరం పచ్చతోరణం ర్యాలీనీ జెండా ఊపి ప్రారంభించారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటూ నినాదాలు చేసుకుంటూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తామని ప్రమాణం చేశారు. అంతకుముందు పురపాలక సంఘ కార్యలయ ఆవరణలో ఛైర్మన్ శ్రీదేవి, వైస్ ఛైర్మన్ మంగమ్మ, కమిషనర్ మురళీకృష్ణ, కౌన్సిలర్లు మొక్కలు నాటారు. పట్టణ ఎస్‌ఐ సింగయ్య పట్టణంలోని డివైడర్‌పై మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ మురళీ, టీడీపీ నాయకులు డాక్టర్ నెల్లూరి పార్వతయ్య, షేక్ అబ్దుల్ జలీల్, వైయస్సార్‌సీపీ నాయకుల బిజ్జం సుధాకర్‌రెడ్డి, పోలా శ్రీనివాసరావులు పాల్గొన్నారు.

మీరు సక్రమంగా పనిచేయండి..
మీ సమస్యలను పరిష్కరిస్తాం
నరసరావుపేట, ఆగస్టు 24: సర్వే ఉద్యోగులు సక్రమంగా పనిచేయండి, వారి సమస్యలను తాము పరిష్కరిస్తామని శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక ఆర్డీవో కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన సర్వే ఉద్యోగుల సంఘం భవనం ప్రారంభించిన అనంతరం ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. ఈసభకు సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. కొత్త రాష్ట్రంలో కొత్త సమస్యలున్నాయని, మీరు మాకు సమస్య కాకూడదని హితవు పలికారు. సర్వేయర్లు అనేది చాలా చిన్న ఉద్యోగం అనుకుంటామని, అయితే సర్వేయర్ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో గుండెకాయ వంటివాడన్నారు. సర్వేయర్ లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఉంటాయన్నారు. సర్వేయర్ల వల్ల తాను కొన్ని సమయాల్లో ఇబ్బందులు పడ్డానన్నారు. సర్వేయర్లు సక్రమంగా లేకపోతే రిజిస్ట్రేషన్లు నిలిచిపోతాయన్నారు. సర్వేయర్లు సమస్యలను పెంచవద్దన్నారు. మీరు మీ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలన్నారు. సర్వేయర్లు తమ సమస్యలను తెలిపారని, అందులో న్యాయపరమైన డిమాండ్లను పరిశీలించి, పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో యం శ్రీనివాసరావు, నాగసరపు సుబ్బరాయగుప్తా, మీరావలి, సర్వే అండ్ ల్యాండ్స్ సహాయ సంచాలకులు కేజియాకుమారి, ప్రముఖ పారిశ్రామికవేత్త శిద్ధా వెంకటేశ్వరరావు, ఎపి బాబూరావు, యస్‌కెయమ్ సుభాని, కెవి శేషగిరిరావు, కిషోర్, పి విజయకుమార్, యంవి నాగేశ్వరరావు, సులేమాన్‌ఖాన్, టి సుధాకర్, పి వందనం, జి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు పూర్వవైభవం తేవాలి
తెనాలి, ఆగస్టు 24: తెనాలి పట్టణానికి తలమానికంగా నిర్మించిన ప్రభత్వ ఏరియా వైద్యశాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరు అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. 15లక్షల రూపాయల నిధులతో కొనుగోలుచేసిన అధునాతన ఆల్ట్రాసౌండ్ మిషన్‌ను ఆదివారం ఎమ్మెల్యే ఆలపాటి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 200పడకల ఆసుపత్రిలో ప్రస్తుతం అధునాతన సేవలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. పరిసర ప్రాంత ప్రజలందరూ వీటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతంలో ప్రభుత్వ వైద్యశాలలో గైనకాలజిస్టుల కొరత ఉండేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను గుర్తించి శాశ్విత గైనకాలజిస్టును నియమించటం జరిగిందన్నారు. గతంలో అనేక కేసులు గుంటూరు, ఇతర ప్రాంతాలకు పంపటం జరిగేదని, ప్రస్తుతం ఆ ఇబ్బంది లేదన్నారు. ప్రతి నెలా ఆసుపత్రిలో సమావేశాలు నిర్వహించటం జరుగుతుందని, ఎటువంటి లోపాలులేకుండా చూడాలని సూచించారు. అనంతరం ఇసిజి విభాగానికి సంబంధించిన నూతన పరికరాలను ఆయన ప్రారంభించారు. ఈకార్యక్రమంలో వైద్యవిదాన పరిషత్, జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి, సూపరింటెండెంట్ ఏ రవీంద్రకుమార్, స్థానిక కౌన్సిలర్లు ఇస్రం ఆశీర్వాదం, రామా నాగలక్ష్మిగాయత్రం, ఈదర అలేఖ్య, పట్టణ టిడిపి అధ్యక్షులు మహ్మద్ ఖుద్దూస్, రావి సూర్యకిరణ్‌తేజ, పలువురు నాయకులు, వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వాణిజ్య పొలాలను సందర్శించిన మంత్రి పత్తిపాటి
శావల్యాపురం, ఆగస్టు 24: రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యవసాయశాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఆదివారం కనమర్లపూడి సమీపంలోని కంది, గోరుచిక్కుడు, పత్తిపొలాలను ఆయన సందర్శించి, పంట పోలాల్లో కాడెద్దులతో అరకదున్నారు. అనంతరం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు కూలీల ఖర్చు తగ్గించేందుకు యాంత్రీకరణ పద్ధతులను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రైతులు కోరిన కంపెనీ వ్యవసాయ పనిముట్లను రాయితీపై అందచేయనున్నట్లు తెలిపారు. అందుకు గానూ 19.58కోట్ల రూపాయల వ్యవసాయ పరికరాలను ఈ ఏడాది రైతులకు అందచేస్తున్నట్లు తెలిపారు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమన్నారు. ఆరోగ్య కార్డులు మాదిరిగా రైతులకు భూసార పరీక్షల కార్డులను అందచేస్తున్నట్లు తెలిపారు. సాగర్ కాలువలకు అందచేసిన తాగునీటిని త్వరలో సాగునీరుగా విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు ఏడు గంటల పాటు మూడు ఫేజ్‌ల విద్యుత్‌ను అందచేస్తున్నట్లు తెలిపారు. 1.50లక్షల లోపు తీసుకున్న పంట రుణాలను రెండు నెలల్లో మాఫీ చేయనున్నట్లు తెలిపారు. రైతుల పంటల మార్పిడి విధానాన్ని అవలంభించాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో తాగునీరు, భూముల వసతి ఉన్నాయని, అందుకుగానూ వినుకొండ నియోజకవర్గంలో వ్యవసాయ పరిశ్రమను ఏర్పాటు చేయాలని మంత్రి పత్తిపాటిని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాయితీపై అందించే వ్యవసాయ పనిముట్లు అందరికీ అందలేదని, శ్రద్ధ తీసుకుని నాణ్యమైన వ్యవసాయ పనిముట్లను అందరికీ రాయితీ అందించాలని మంత్రి పత్తిపాటిని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఏడీ విజయలక్ష్మి, శ్రీ్ధర్, ఎడిఏ పాషా, ఏవో ప్రసాద్, వ్యవసాయ శాస్తవ్రేత్తలు ఈదర నారాయణ, ఆదినారాయణ, వెంకటేశ్వర్లు, మండల పార్టీ నాయకులు విశ్వనాధం, మస్తాన్, హనుమంతురావు తదితరులు పాల్గొన్నారు.

* రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
english title: 
pulla rao

విశాఖ అభివృద్ధికి కృషి చేస్తా

$
0
0

విశాఖపట్నం, ఆగస్టు 24: విశాఖను ముంబై మాదిరి ఆర్థిక నగరంగా తీర్చిదిద్దేందకు తాను అన్ని విధాలా ప్రయత్నం చేస్తానని రాజ్యసభ సభ్యులు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. ఆయన స్వగృహంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ తరువాత అతి పెద్ద నగరం విశాఖ అని, దీనికి రాజధాని స్థాయి ఉందని అన్నారు. ఆ హోదా దీనికి దక్కాలని తెలిపారు. మెరుగైన, పెద్ద నగరంగా అభివృద్ధి చేందాల్సి ఉందన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి చర్యలు తీసుకోవాలన్నారు. పలు సమస్యలపై తాను ఢిల్లీలో తరచూ మంత్రులను కలుస్తూ ఉంటానన్నారు. కేంద్రం ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా అభివృద్ధి చేయాలన్నారు. బిజెపితో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం దీనిపై పోరాడాల్సి ఉందన్నారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరిగేదన్నారు. సహజసిద్ధమైన ప్రకృతి అందాలు, సుందర సాగరతీరం, అందమైన ప్రదేశాలు కలిగి ఉన్న విశాఖలో సినిమా పరిశ్రమను తీసుకురావాల్సి ఉందని, ఇందుకోసం తన వంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తగిన భూములు కేటాయించాలని, అలాగే జూనియర్ ఆర్టిస్టుల నుంచి ప్రతిఒక్కర్ని ఆదుకోవాల్సి ఉందన్నారు. ప్రత్యేక హోదా అంశంపై బిల్లులో ఉన్నా, దీనికి తగిన నిధులు కేటాయించకపోతే సమస్య తీరదని, త్వరగా వీటిని మంజూరు చేయాల్సి ఉందన్నారు. తమిళనాడులో ఆయా రాజకీయపార్టీల మధ్య విభేదాలున్నా అభివృద్ధి విషయంలో ఒక్కటయ్యాయని చెప్పారు. మంచి పనుల కోసం కాంగ్రెస్‌పార్టీ సంపూర్ణ మద్ధతు ఉంటుందన్నారు.
ఆర్ధిక బిల్లుపై కేంద్ర ఆర్ధిక, రక్షణశాఖామంత్రి అరుణ్‌జైట్లీతో చర్చించానన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు కేంద్రం సమాంతర న్యాయం చేయాలని, అభివృద్ధి కోసం తగినన్ని నిధులు కేటాయించాలన్నారు. రెండు రాష్ట్రాలకు సమాంతర న్యాయం జరగాలన్నారు. 40 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం మూడేళ్ళ కిందటనే తాను ప్రారంభించానని, ఈ లక్ష్యం నెరవేరుతుందని టిఎస్సార్ స్పష్టంచేశారు. ఇప్పటికే తొమ్మిది లక్షల మొక్కలు నాటే కార్యక్రమం పూర్తయ్యిందన్నారు. రాబోయే రోజుల్లో ఇది కూడా పూర్తవుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం హర్షణీయమని, అయితే ఆంధ్ర రాష్ట్రం అంతటా పట్టణాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. అగనంపూడిలో రూ.400 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన క్యాన్సర్ ఆసుపత్రికి శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీని కోరినట్టు చెప్పారు. ఇది జరిగితే ఆంధ్రా, చత్తీస్‌గడ్, ఒడిషా రాష్ట్రాలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజ శ్రీనివాస్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు, నగర మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, బాణాల శ్రీనివాసరావు, ఎస్‌కె భాషా తదితరులు పాల్గొన్నారు.

గ్రీన్ ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం
గాజువాక, ఆగస్టు 24: వన మహోత్సవాన్ని ఒక ఉద్యమంలా తీసుకుని రాష్ట్రాన్ని గ్రీన్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రజలు ముందుకు రావాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణరెడ్డి అన్నారు. 65వ వన మహోత్సవాలు ఆదివారం మహావిశాఖ గాజువాక జోనల్ పరిధి 59వ వార్తు తుంగ్లాంలో జరిగింది. అటవీశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కామినేని శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా తుంగ్లాం సమీపంలో గల రైల్వే స్థలంలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి బొజ్జల మాట్లాడుతూ కాలుష్య రహిత సమాజాన్ని స్థాపించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఆనాటి నుండి పోరాటం సాగిస్తుందన్నారు. గత టీడీపీ ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా కోట్లాది మొక్కలను నాటిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. నాడు నాటిన మొక్కలు తప్పా ఈ పదేళ్లలో ఒక్క మొక్కను కాంగ్రెస్ ప్రభుత్వం నాటిన దాఖలాలు లేవనన్నారు. ఉన్న మొక్కలను నరికి వేశారన్నారు. రాష్ట్రంలో ఒక హరిత విప్లవాన్ని తీసుకు వచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 రాష్ట్రాల్లో సుమారు 1000 కిలో మీటర్ల మేర తీర ప్రాంతం ఉందన్నారు. ఈ తీర ప్రాంతం అటవీశాఖ ఆధ్వర్యంలో ఉందన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో తీర ప్రాంతాల్లో వన సంరక్షణ సమితులను ఏర్పాటు చేసి పచ్చదనాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. జిల్లాకు కోటి మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయం చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. మొక్కలు నాటడం, పరిరక్షణ వంటి కార్యక్రమాల్లో కొత్త టెక్నాలజీని తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. అంతకుముందు రాష్ట్ర పంచారాజ్‌శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ మొక్కలను నాటడమే కాదు పరిరక్షించడంలో ప్రజలు భాగస్వామ్యం ఉండాలన్నారు. ప్రభుత్వాలు మొక్కలు నాటుతున్న 40శాతం మొక్కలు మాత్రమే ఉంటున్నాయన్నారు. మిగిలిన మొక్కలు ప్రజల నిర్లక్ష్యం కారణంగా కనమరుగు అవుతున్నాయన్నారు. కాలుష్యాన్ని నుండి కాపాడే మొక్కలను నాశనం చేస్తే ప్రజలకు ప్రాణ వాయువు అందదన్న సంగతి తెలుసుకోవాలన్నారు. నీడ నిచ్చే మొక్కే మనిషికి ప్రాణవాయువును అందిస్తుందన్నారు. దీంట్లో ప్రజలు భాగస్వామ్యం ఎంతైన అవసరం అన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారి జోసెప్, అధికారులు ర్వాయ్, రెడ్డి, జిల్లా కలెక్టర్ యువరాజ్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటేందుకు రైల్వే అధికారులు స్థలాన్ని అందించగా హెచ్‌పిసిఎల్, కోరమండల్ అధికారులు మొక్కలను అందించారు. ఇదిలావుండగా వన మహోత్సవాలకు సంబంధించి అటవీశాఖ అధికారులు రూపొందించిన ప్లెక్సీలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఫోటోను పెట్టలేదు. దీంతో స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

మావోలు కనె్నర్ర
విశాఖపట్నం, ఆగస్టు 24: విశాఖ మన్యం మళ్లీ వేడెక్కింది. బాక్సైట్ తవ్వకాలు జరుపుతామని ప్రభుత్వం చెప్పడంతో మన్యంలో మళ్లీ అలజడి ప్రారంభమైంది. గత ప్రభుత్వాలు బాక్సైట్ తవ్వకాలను తాత్కాలికంగా విరమించుకున్నాయి. కానీ ఈనెల 8,9 తేదీల్లో చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లాకు వచ్చినప్పుడు గిరిజనులతోనే బాక్సైట్ తవ్వకాలు జరిపిస్తామని ప్రకటించారు. ఆ తరువాత ఆయన మంత్రివర్గ సహచరులు కూడా బాక్సైట్ తవ్వకాలను జరుపుతామని చెప్పుకొస్తున్నారు. దీనిపై మావోయిస్ట్‌లు కనె్నర్ర చేశారు. గిరిజనులను ఉసిగొలిపారు. వారు విల్లంబులు పట్టుకుని రోడ్డెక్కారు. ఇప్పుడు విశాఖ ఏజెన్సీ నివురుకప్పిన నిపులా మారింది. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలకు సుముఖత చూపలేదు. ఇప్పుడు ఆయనంతట ఆయనగా బాక్సైట్ తవ్వకాలపై దృష్టి పెట్టారా? లేదా ప్రధాన మంత్రి మోది వత్తిడితో బాక్సైట్ తవ్వకాలకు ఉపక్రమిస్తున్నారా? అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. విశాఖ ఏజెన్సీలో ఎనిమిది వేల హెక్టార్లలో ఐదు లక్షల కోట్ల టన్నుల బాక్సైట్ ఖనిజం ఉంది. బాక్సైట్ తవ్వకాలు జరిపితే అరుకులో 42 గ్రామాలు, జికె వీధిలో 150, అనంతగిరిలో 32 గ్రామాలకు ముప్పు ఉందని నిపుణులు తెలియచేస్తున్నారు. సుమారు 10 వేల గిరిజన కుటుంబాలు వీధిన పడతాయని చెపుతున్నారు. బాక్సైట్ తవ్వకాల వలన పర్యావరణ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. పర్యావరణ వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలూ ఈ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నాయి. ఒకప్పుడు ఈ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఉద్యమించిన తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు బాక్సైట్‌ను వెలికి తీయడానికి ఉపక్రమిస్తోంది. ఈ పరిస్థితులను గమనిస్తున్న నక్సల్స్ తుపాకి ఎక్కుపెట్టారు. దీంతో ఏజెన్సీలో అలజడి ప్రారంభమైంది. ఒకప్పుడు బాక్సైట్ తవ్వకాలపై సర్వే చేయడానికి వెళ్లిన అధికారులను ముప్ప తిప్పలు పెట్టి, వెనక్కు తిప్పి పంపించారు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా ఇప్పుడు ప్రతిఘటన ఎదురవుతుందనడంలో సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వం వత్తిడితో, రాష్ట్ర ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు ఉపక్రమిస్తే, ఏజెన్సీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. కాగా, ఇప్పటి వరకూ ఏజెన్సీలో స్తబ్దుగా ఉన్న నక్సల్స్ బాక్సైట్ తవ్వకాలపై ప్రకటనతో బయటకు వచ్చారు. వారు ప్రత్యక్ష పోరుకు దిగితే, వారిని అరికట్టడం పోలీసులకు సవాలుగా పరిణమించనుంది. ఏదియేమైన ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీలో ప్రభుత్వం మంటలు రేపడం దురదృష్టకరం.

ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష
విశాఖపట్నం , ఆగస్టు 24: నగరంలో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. 24 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఈ పరీక్షలకు 11,710 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ఈ పరీక్షను విశాఖ, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ పరీక్షా కేంద్రాలలో నిర్వహించారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు జరిగిన పరీక్షకు 4466 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు జరిగిన పేపర్-2 పరీక్షలో 4405 మంది హాజరయ్యారు. ఈ పరీక్షా కేంద్రాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ పరీక్షా కేంద్రాలను ఎజెసి వై.నరసింహారావు తదితరులు తనిఖీ చేశారు. రాజమండ్రికి చెందిన ఒక వికలాంగ విద్యార్థి సైతం హాజరై పరీక్ష రాశాడు.

ఎయిర్ కనెక్టివిటీతోనే విశాఖ అభివృద్ధి
విశాఖపట్నం, ఆగస్టు 24: ఎయిర్ కనెక్టివిటీతోనే విశాఖ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని ఎంపి సుబ్బరామిరెడ్డి అన్నారు. ఎయిర్ ట్రావలర్స్ అసోసియేషన్ (ఇండియా) ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ విశాఖకు మంచి భవిష్యత్ ఉందని అన్నారు. భారీ పరిశ్రమలు విశాఖకు తరలి వస్తున్నాయని చెప్పారు. ఎయిర్ కనెక్టివిటీ ఉంటే, పారిశ్రామికంగా కూడా విశాఖ అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ మాట్లాడుతూ విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వంలో చర్యలు తీసుకున్నామని అన్నారు. అయితే విమాన సర్వీసులు మరింతగా పెరిగితే, పర్యాటకానికి ఢోకా లేదని ఆయన అన్నారు. ఎయు విసి జిఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ ఇటువంటి సమావేశాలు పదే పదే నిర్వహించడం వలన విమానయాన సంస్థలు సర్వీసులు నడపడానికి అవకాశాలు ఉంటాయని అన్నారు. ఎయిర్ ఇండియా మాజీ డైరక్టర్, ఏవియేషన్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఎస్‌ఎన్ రెడ్డి మాట్లాడుతూ విశాఖ ఎయిర్ పోర్టు అభివృద్ధికి అనేక ప్రతిబంధకాలు ఉన్నాయని చెప్పారు. దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కూడా లేనప్పుడు విశాఖ ఎయిర్‌పోర్టులో ఎరోబ్రిడ్జెస్ నిర్మించామని అన్నారు. ఎయిర్ ఇండియాకు దక్షిణ భారత దేశం నుంచి లాభాలు గణనీయంగా వస్తున్నాయని అన్నారు. త్వరలోనే విజయవాడ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ఈ విమానాశ్రయం నుంచి టర్బో మెగా ఏవియేషన్ లిమిటెడ్ కొన్ని సర్వీసులను నడపాలని భావిస్తోందని అన్నారు. శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి నాజర్ మాట్లాడుతూ భారత దేశం నుంచి 10 విమాన సర్వీసులను నడుపుతున్నామని అన్నారు. ఫ్లై దుబాయ్ విమానయాన సంస్థ ప్రతినిధి డ్రపాణ్ సత్యదాసన్ మాట్లాడుతూ విశాఖ నుంచి నడపడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని అన్నారు.

సమస్యలు పరిష్కరించాలి
* మంత్రికి మత్స్యకారుల వినతి
విశాఖపట్నం, ఆగస్టు 24: అసంఘటిత కార్మిక సామాజిక భద్రత చట్టం-2008ను మత్స్యకార్మికులకు పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర కార్మిక, ఉపాధి, యువజన క్రీడలశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకి విశాఖ జిల్లా సాంప్రదాయ మత్స్యకార్మిక యూనియన్ ప్రతినిధులు ఆదివారం వినతిపత్రం అందజేశారు. కేంద్రం అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ఈ చట్టం-2008లో ప్రవేశపెట్టి ఇప్పటికి ఆరేళ్ళు కావస్తున్నా ఆంధ్ర రాష్ట్రంలో అసంఘటిత కార్మికుల సంక్షేమ పథకాలు అసలు అందడంలేదని ఆందోళన వ్యక్తంచేశారు. మంత్రిని కలిసిన వారిలో యూనియన్ ప్రతినిధులు ఓ.బోసన్న, టి,శంకర్, అప్పలరాజు ఉన్నారు.

సోలార్ విద్యుత్ వైపు ప్రభుత్వం మొగ్గు
విశాఖపట్నం, ఆగస్టు 24: రోజురోజుకి బొగ్గు కొరత తీవ్రతరమవుతోంది. అలాగే వర్షాభావ పరిస్థితులతో జల విద్యుత్ కేంద్రాలు కష్టాల్లో పడుతున్నాయి. రెండు రకాలుగా విద్యుత్ ఉత్పత్తి సాధ్యపడకపోవడంతో చేసేదిలేక ప్రభుత్వం ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరిస్తోంది. అదీ తనపై ఎటువంటి ఆర్థిక భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తోంది. సోలార్ ప్రాజెక్టుల స్థాపనకు ఆసక్తి కలిగిన ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను సైతం ఆహ్వానిస్తోంది. అయితే ఈ బాధ్యతను రాష్ట్రంలోనున్న ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్), సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఎస్‌పిడిఎస్‌ఎల్)లకి ప్రభుత్వం అప్పగించింది. కేవలం ఒక నోటిఫికేషన్ ద్వారా సోలార్ ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకువచ్చే విధానం త్వరలో అమలు కానుంది.
ఆంధ్రాలో 500 మెగావాట్ల సోలార్ విద్యుత్
రానున్న రెండేళ్ళల్లో అంటే 2016వ సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్రంలో 500 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలోభాగంగా ఈ రెండు విద్యుత్ పంపిణీ సంస్థలకు 50 శాతం వంతున సోలార్ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే విధంగా లక్ష్యాలను నిర్దేశించింది. అయితే దీని కోసం సంస్థలు చేయాల్సిందల్లా ఆసక్తి ఉన్న ఔత్సాహికులు, ప్రైవేటు సంస్థల నుంచి దరఖాస్తులు స్వీకరించడమే. వచ్చేనెల 17వ తేదీలోపు దరఖాస్తులకు గడువు నిర్ణయించింది. ఈ లోపు సోలార్ ప్రాజెక్టు కోసం ముందుకొచ్చే వారి నుంచి దరఖాస్తులను తీసకుని తక్కువ ధరకు సోలార్ విద్యుత్ అమ్మే వారికే అవకాశం కల్పించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇటువంటి దరఖాస్తుల వివరాలన్నింటినీ కంప్యూటీకరించి ఆ తరువాత వీరిని పిలుస్తుంది. ఈ విధంగా ఈపిడిసిఎల్ పరిధిలో 250 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకుగాను 26 ప్రదేశాలను గుర్తించాల్సి ఉంది. ఇందులో ఒక్క విశాఖ జిల్లా పరిధిలో ఆరు ప్రదేశాలను గుర్తించాలి. ఒకే జిల్లా నుంచి సోలార్ విద్యుత్‌ను తీసుకోవడం కూడా సమస్యగా భావించే ప్రభుత్వం ప్రతి జిల్లాకు దీనిని తీసుకునే విధంగా చర్యలు చేపట్టింది.
సంస్థ సబ్‌స్టేషన్లకు అనుసంధానం
ప్రతి జిల్లాలో ఏర్పాటయ్యే సోలార్ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్‌కు చెందిన సబ్‌స్టేషన్లకు అనుసంధానం చేస్తారు. దీనివల్ల నేరుగా విద్యుత్‌ను తీసుకోవడం సులభమవుతుంది. ఈ విధంగా తీసుకున్న విద్యుత్‌ను నేరుగా గృహ, వాణిజ్య అవసరాలకు సంస్థ మంజూరు చేస్తుంది.
సోలార్ ఒక్కటే ప్రత్యామ్నాయం
ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురావడం ఒక్కటే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం భావిస్తోంది. అందువలనే ఆంధ్ర రాష్ట్రంలో వీటిని అధిక సంఖ్యలో ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది.

జెడ్పీ స్థారుూ సంఘం ఎన్నికలు ఏకగ్రీవం
విశాఖపట్నం , ఆగస్టు 24: జిల్లా పరిషత్ స్థారుూ సంఘం కమిటీ సభ్యుల ఎంపిక ఏకగ్రీవంగా జరిగింది. ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మన్ లాలం భవాని ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికలలో పలువురు జడ్పీటిసిలు పాల్గొన్నారు. దీనిలో ఏడు కమిటీలుంటాయి. ఈ ఏడు కమిటీలను ఏకగ్రీవంగానే నియమించడం జరిగింది. వీటిలో మొదటిస్థాయి కమిటీ ప్లానింగ్ అండ్ ఫైనాన్స్‌కు చైర్‌పర్సన్‌గా లాలం భవాని వ్యవహరిస్తుండగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, పార్లమెంట్ సభ్యులు ముత్తెంశెట్టి శ్రీనివాసరావు, శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, గిడి ఈశ్వరి, జడ్పీటిసి సభ్యులు కరక సత్యనారాయణ, సింగిడి ఆదినారాయణ, వంటర వెంకటలక్ష్మి సభ్యులుగా వ్యవహరిస్తారు. అలాగే రెండవ స్థాయి కమిటీ గ్రామీణాభివృద్ధికి చైర్మన్‌గా చైర్‌పర్సన్ వ్యవహరిస్తుండగా ఎంపి కొత్తపల్లి గీత, రాజ్యసభ సభ్యులు టి.సుబ్బరామిరెడ్డి, ఎమ్మెల్యేలు కెఎస్‌ఎన్.రాజు, జడ్పీటిసి సభ్యులు ఎస్.అప్పారావు, మారిక నూకరాజు, పాపుపర్తి నూకరత్నం, మంచెన పద్మకుమారి, శ్రీరామమూర్తి సభ్యులుగా వ్యవహరిస్తారు. మూడవ స్థాయి కమిటీ వ్యవసాయానికి సంబంధించి వైస్‌చైర్మన్ కొట్టేడ అప్పారావు చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా విశాఖ ఎంపి కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీలు ఎంవిఎస్.శర్మ, డివి.సూర్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, జడ్పీటిసి సభ్యులు గాడి శ్రీరామమూర్తి, కొప్పిశెట్టి కొండబాబులు సభ్యులుగా వ్యవహరిస్తారు. అలాగే నాల్గవ స్థాయి కమిటీ విద్య, వైద్యానికి సంబంధించి చైర్మన్ లాలం భవాని వ్యవహరిస్తుండగా ఎమ్మెల్సీ గాడి శ్రీనివాసులనాయుడు, జడ్పీటిసిలు మామిడి సురేంద్ర, చిటికెల తారకవేణుగోపాల్, డి.లక్ష్మీసత్యనారాయణ, కాశిపల్లి కుమారి, ఎం.కుజ్జమ్మ, గంటా నళినికృష్ణా, జి.ప్రభావతిలు సభ్యులుగా వ్యవహరిస్తారు. ఐదవ కమిటీ మహిళా సంక్షేమానికి సంబంధించి దేవరాపల్లి జడ్పీటిసి గాలి వరలక్ష్మి చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, జడ్పీటిసిలు బోనండి రామలక్ష్మి, పల్లెల గంగాభవాని, కాంబు సూర్యమణి, సాగరి వసంతకుమారి, దాసరి గురయ్య, చొక్కాల రామారావుసభ్యులుగా వ్యవహరిస్తారు. ఆరవస్థాయి కమిటీ సాంఘీక సంక్షేమానికి సంబంధించి కశింకోట జడ్పీటిసి మాలసాల కాసులమ్మ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, జడ్పీటిసి సభ్యులు కె.సన్యాసిరావు, గేదెల సత్యనారాయం, రాగిన వెంకటరమణ, కూన వనజ, చదలవాడ సువర్ణలత, జరసింగి గంగాభవాని, కూడా కాసులమ్మ సభ్యులుగా వ్యవహరిస్తారు. ఏడవస్థాయి కమిటీ పనులకు చైర్మన్‌గా జడ్పీ చైర్మన్ లాలం భవాని వ్యవహరిస్తుండగా జిల్లా మంత్రి అయ్యన్నపాత్రుడు, శాసనసభ్యులు పిలా గోవింద్, పంచకర్ల రమేష్‌బాబు, బూడి ముత్యాలనాయుడు, జడ్పీటిసిలు బొట్టా లక్ష్మి, పైలా జగన్నాధరావు, జనపరెడ్డి శ్రీనివాసరావు, కాశిరెడ్డి దామోదర్‌రావు, పూలపర్తి సత్యవతిలు సభ్యులుగా వ్యవహరిస్తారు. ఎన్నికల అనంతరం స్థానిక విలేఖరులతో జడ్పీ చైర్మన్ లాలం భవాని మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాల కాలంలో సభ్యులమంతా ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ విశాఖ జిల్లా అభివృద్ధికి పాటుపడతామని పిలుపునిచ్చారు. మాడుగుల ఎమ్మెల్యే ముత్యాలనాయుడు మాట్లాడుతూ సమావేశాలు సక్రమంగా జరిగేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కెఎస్‌ఎన్.రాజు, కిడారి సర్వేశ్వరరావు, ఎమ్మెల్యే సూర్యనారాయంరాజు, జిల్లా పరిషత్ సిఇఓ మహేశ్వర్‌రెడ్డి, పలువురు జడ్పీటిసిలు పాల్గొన్నారు.

నారాయణ మంత్రంతో సింహాచలేశుని దర్శనం
సింహాచలం, ఆగస్టు 24: ఓం నమో నారాయణాయ నమం: అంటూ శ్రీమన్నారాయణుడి మంత్రజపం చేసుకుంటూ గుంటూరుకు చెందిన అరవైమంది అంధులు ఆదివారం సింహాచలేశుని దర్శనం చేసుకున్నారు. కనులతో భగవంతుడిని దర్శించలేని అంధులు తమ మదిలో ఆ వరాహనరసింహుడి రూపాన్ని దర్శించుకున్నారు. అంతరాలయంలో మూలవిరాట్ సన్నిధి చుట్టూ నారాయణ మంత్ర జపం చేసుకుంటూ ప్రదక్షిణ చేసుకున్నారు. స్వామివారి సన్నిధితో పాటు గోదాదేవి సన్నిధిలో అంధులు హారతులు స్వీకరించారు. బేడా మండపంలో ఆశీనులై మరోసారి హరినామస్మరణ చేశారు. దేవాలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఆర్.వి.వి.ఎస్. ప్రసాద్, పిఆర్‌ఒ తులారాముడు అంధులకు స్వాగతం పలికి దగ్గరుండి ఏర్పాట్లు చూశారు. విఐపిల మార్గంలో ప్రత్యేకంగా ప్రవేశం కల్పించారు. లడ్డూ, పులిహోర ప్రసాదాలు అందజేశారు. అన్నదానంలో ప్రత్యేకంగా అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం గుంటూరు నుండి వచ్చిన శ్రీ షిర్డీసాయి దీనజన సేవాసమితి అంధుల, వికలాంగుల పాఠశాలకు చెందిన అంధులకు దేవస్థానం ప్రత్యేకంగా వసతి కూడా ఏర్పాటు చేసింది. ఈవో రామచంద్రమోహన్ ఆదేశాల మేరకు ఎఈవో కృష్ణమాచార్యులు మిగిలిన అధికారులను అనుసంధానం చేసి అంధులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూశారు. దేవస్థానం అధికారుల ఆదరణకు అంధులు, సేవా సమితి నిర్వాహకులు ముగ్ధులయ్యారు. దీనజనులపట్ల దేవస్థానం చూపించిన ఆదరణకు వారంతా అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

రాష్ట్రంలో కోటి మొక్కలు పెంపకం
* మంత్రి అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం, ఆగస్టు 24 : రాష్ట్రంలో కోటి మొక్కలను నాటే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని పంచాయతీరాజ్ శాఖామంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆదివారం నీరు - మొక్క కార్యక్రమంలో భాగంగా బలిఘట్టం, వైజంక్షన్‌వద్ద పురపాలక సంఘం చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి మొక్క నాటి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధిహామీ పథకంలో రెండు లక్షల ఎకరాల్లో మొక్కలు నాటి, పెంచే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. అయిదెకరాల లోపు భూమి కలిగి ఉన్న రైతులకు పొలం గట్లపై పెంచేందుకు మొక్కల సరఫరాతోపాటు వాటి పరిరక్షణ మూడేళ్ల వరకు నగదును చెల్లిస్తామన్నారు. అటవీశాఖ ద్వారా 20 లక్షలు, పురపాలక సంఘాలల్లో 20 లక్షల మొక్కలు పెంచుతామన్నారు. కలప నరికివేత, అక్రమరవాణా, దోపిడీ నుండి అడవులను కాపాడేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. నర్సీపట్నంలో 16,182 ఇళ్లు ఉండగా, వాటిలో కనీసం 10 వేల ఇళ్లవద్ద మొక్కలు పెంచితే పరిసరాలు చల్లగా ఉండి వర్షాలు కురుస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక అభివృద్ధి సంస్థ ద్వారా అభివృద్ధి పరిచే మున్సిపాలిటీల్లో నర్సీపట్నం ఉందన్నారు. పట్టణ అభివృద్ధికి చేపట్టే పథకాలను వివరిస్తూ భూగర్భ మురుగునీటి కాలువల, చెత్త నిర్వహణ, సౌర విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపాలిటీలో ప్రతినెలా విద్యుత్ బిల్లులుగా రెండు లక్షల 50వేల రూపాయలు చెల్లిస్తున్నారని, సౌర విద్యుత్ వలన ఈ మొత్తం ఆదా అవుతుందన్నారు. ఇప్పటికే చైనాకు చెందిన ఇద్దరు, హైదరాబాద్‌కు చెందిన ఒక నిపుణులు వచ్చి ప్రణాళికను తయారు చేస్తున్నారన్నారు. నర్సీపట్నం ప్రధాన రహదారిని 80 అడుగులకు విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఆరునెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోయేవారికి పారితోషికాలు అందజేస్తామన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు అన్ని పంచాయతీలకు విడుదల చేశామని, ఈ నిధులతో పారిశుద్ధ్య పనులు మెరుగు పరచుకోవాలన్నారు. నర్సీపట్నంలో ఎనిమిది ఎకరాల్లో డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి తప్పనిసరిగా మరుగుదొడ్డి నిర్మించాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి మరుగుదొడ్లుకు అనుసంధానం చేస్తామన్నారు.
500 మందితో రక్తదానం: సెప్టెంబర్ 4న తన పుట్టినరోజు సందర్భంగా 500 మందిచే రక్తదానం చేయించాలని అయ్యన్నపాత్రుడు కోరారు. జన్మదినం సందర్భంగా అట్టహాసాలు చేయవద్దని, ప్రజలకు ఉపయోగపడే రక్తదానం చేపట్టాలన్నారు. ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అటవీ డివిజనల్ అధికారి లక్ష్మణ్, ఆర్డీవో సూర్యారావు, తహశీల్ధార్ పార్వతీశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సింహాచలం, మున్సిపల్ చైర్మెన్ సిహెచ్.అనిత, వైస్ చైర్మెన్ సన్యాసిపాత్రుడు, ఎంపిపి రమణమ్మ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

నియోజకవర్గం అభివృద్ధికి సమష్టి కృషి
* ఎంపి అవంతి శ్రీనివాస్
అనకాపల్లి, ఆగస్టు 24: అనకాపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సమష్టిగా కృషి చేయాలని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు కోరారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో ప్రజలు ఓట్లువేసి గెలిపించారని, అందుకు చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా నేరవేర్చేందుకు కృషిచేస్తున్నారని తెలిపారు. ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక వసతుల మెరుగుకు విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. ఈ మండలంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించాలన్నారు. ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నాయో అధికారులకే తెలియలేని పరిస్థితి నెలకొందని, ఈ మధ్య చంద్రబాబు పర్యటనలో అనకాపల్లి మండలంలో ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయని ప్రశ్నిస్తే చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. నియోజకవర్గం అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని, ఈ విషయంలో అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే క్షమించేది లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వృద్ధాప్య పెన్షన్లు 200 నుండి వెయ్యి రూపాయలు చేశారని, అక్టోబర్ నుండి అమలులోకి వస్తాయని, దానికి పెన్షన్‌లో లేనివారు కొత్తగా అప్లికేషన్‌లు పెట్టుకుని, రేషన్‌కార్డులో వయస్సును ధ్రువీకరించుకోవాలన్నారు. ఎమ్మెల్యే పీలా గోవింద మాట్లాడుతూ పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు అందజేయడంలో కాలయాపన చేస్తున్నారని, ఇప్పటికే పెండింగ్‌లో ఎక్కువశాతం ఉండిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పట్టాదారు పాసుపుస్తకం లేకపోవడంతో రైతు రుణాల మాఫీలో కోల్పోయారన్నారు. జిరాయితీ భూములకు పాస్‌పుస్తకాలు అధికారులపై ఒత్తిడి చేసి రైతులకు అందజేసేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రణాళికాబద్దంగా నియోజకవర్గం అభివృద్ధి చెందేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపి తెలిపారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపిపి కొణతాల వెంకట సావిత్రి, కశింకోట ఎంపిపి పెంటకోట సుబ్బలక్ష్మి, ఎంపిడిఒ సందీప్, జివిఎంసి జోనల్ కమీషనర్ చంద్రశేఖర్, తహశీల్దార్ భాస్కర్‌రెడ్డి అధికారులు పాల్గొన్నారు.

ఎస్.ఐ. ఇంటిలో పేలుడు పదార్థాలు
ముంచంగిపుట్టు, ఆగస్టు 24: ఆంధ్ర-ఒడిశ్సా సరిహద్దు ప్రాంతమైన మాచ్‌ఖండ్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఇంట్లో మావోయిస్టులు అమర్చిన పేలుడు పదార్థాలను ఒడిశ్సా పోలీసులు ఆదివారం కనుగొని వాటిని తొలగించారు. మాచ్‌ఖండ్ సబ్ ఇన్‌స్పెక్టర్ విజయకుమార్ రౌత్‌రాయ్ రెండు రోజులు సెలవు పెట్టి వేరే ప్రాంతానికి వెళ్లారు. రౌత్‌రాయ్ శనివారం ఇంటికి వచ్చేసరికి ఇంటి బయట రెండు వైర్లు ఉండడాన్ని గమనించి ఇంటిలోకి వెళ్లకుండా స్పెషల్ బ్రాంచి పోలీసు విభాగానికి సమాచారం అందించారు. ఆదివారం బాంబుస్వ్యాడ్ ఎస్.ఐ. ఇంటిలో తనిఖీలు నిర్వహించగా, ఇంటిలో ఉన్న టిఫిన్ బాక్స్‌లో ఐదు కిలోల పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్స్ బయటపడ్డాయి. కోరాపుట్టు సబ్ డివిజనల్ పోలీసు అధికారి శ్రీరామనాయక్ ఆధ్వర్యంలో బాంబుస్వ్యాడ్ బృందం వీటిని తొలగించింది. మాచ్‌ఖండ్ ఎస్.ఐ. విజయకుమార్ రౌత్‌రాయికి మావోయిస్టుల నుంచి గతంలో పలు హెచ్చరికలు జారీ కావడమే కాకుండా ఆయనపై గోడ పత్రికలు కూడా వెలిశాయి. ఎస్.ఐ.ను హతమార్చేందుకు మావోయిస్టులు ఈ చర్యకు పాల్పడినట్టుగా పోలీసువర్గాలు భావిస్తున్నాయి.

‘మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడండి’
అనకాపల్లి, ఆగస్టు 24: ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణను కాపాడాలని అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు అవంతి శ్రీనివాసరావు కోరారు. స్థానిక మున్సిపల్ పెదహైస్కూల్‌లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యావరణాన్ని కా పాడాలనే ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరులో నీరు - చెట్టు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. తాము నీరు - చెట్టు అనే కార్యక్రమాన్ని అనకాపల్లిలో ప్రారంభించినట్లు తెలిపారు. మొదటి విడతగా మూడువేల మొక్కలను పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. అనంతరం మున్సిపల్ పెదహైస్కూల్‌లో ఆయన మొక్కలు నాటారు. జివిఎంసి కార్యాలయంలో ఎమ్మెల్యే పీలా గోవింద మొక్కలు నాటారు. అనంతరం అసంపూర్తిగా నిలిచిపోయిన మెయిన్‌రోడ్డు విస్తరణ పనులను 15 లక్షల రూపాయలతో నిర్మించనున్న శిలాఫలకానికి ఆయన శంకుస్థ్ఫాన చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్ చంద్రశేఖర్, టిడిపి నాయకులు బుద్ధ నాగజగదీష్, డాక్టర్ కెకెవిఎ నారాయణరావు, డాక్టర్ సత్యవతి, మళ్ల సురేంద్ర పాల్గొన్నారు.

విశాఖను ముంబై మాదిరి ఆర్థిక నగరంగా తీర్చిదిద్దేందకు తాను అన్ని విధాలా
english title: 
visakha

ఆర్డీఎస్ కెనాల్‌కు గండి

$
0
0

మానవపాడు, ఆగస్టు 25: మహబూబ్ నగర్ జిల్లా, మానవపాడు మండల కేంద్రంలో భారీ వర్షం కురువడంతో ఆర్డీఎస్ కెనాల్‌కు గండిపడి పంట పొలాలు నీట మునిగిపోయాయి. సోమవారం చీఫ్ ఇంజనీర్ ప్రకాష్ సంఘటన స్థలానికి చేరుకొని పంట పొలాలను పరిశీలించారు. 20 నుంచి 30 ఎకరాల దాక పంటలు నీట మునిగాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. గంఢిపడిన ప్రదేశంలో వెంటనే మరమ్మతులు చేపడుతామన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా, మానవపాడు మండల కేంద్రంలో భారీ వర్షం కురువడంతో ఆర్డీఎస్ కెనాల్‌కు గండిపడి
english title: 
r
Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>