Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఎఫ్‌ఐపిబి రద్దు

$
0
0

న్యూఢిల్లీ, మే 24: విదేశీ పెట్టుబడుల విధానాన్ని మరింత సరళతరం చేయడంలో భాగంగా పాతికేళ్లుగా దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రతిపాదనలను పరిశీలిస్తున్న విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) రద్దయ్యింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం ఇక్కడ సమావేశమైన కేంద్ర కేబినెట్ దీన్ని ఆమోదించింది.
ఈ ఆర్థిక సంవత్సరానికి (2017-18)గాను ఈ ఏడాది ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక సాధారణ బడ్జెట్‌లో ఎఫ్‌ఐపిబి రద్దును ప్రతిపాదించినది తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో వివిధ మంత్రిత్వ శాఖలతో ఏర్పడినదే ఎఫ్‌ఐపిబి. కాగా, తాజా కేబినెట్ భేటీలో ఎఫ్‌ఐపిబి రద్దు ప్రతిపాదన చర్చకు రాగా, దానికి ఆమోదముద్ర పడింది. కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం జైట్లీ విలేఖరులతో మాట్లాడుతూ ఎఫ్‌ఐపిబిని రద్దు చేశామని, దీని స్థానంలో కొత్త విధానాన్ని తీసుకువస్తామని చెప్పారు. విదేశీ పెట్టుబడులపై కేబినెట్ ఆమోదించిన ప్రమాణాల ప్రకారం సంబంధిత మంత్రిత్వ శాఖలు సూచించిన ప్రతిపాదనలతో నూతన విధానం రూపొందుతుందని తెలిపారు.
అయితే సున్నితమైన, ప్రధానమైన రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలకు హోం మంత్రిత్వ శాఖ ఆమోదం లభించాల్సి ఉంటుందన్నారు. ఆర్థిక సరళీకరణలో భాగంగా 1990వ దశకంలో ప్రధాని కార్యాలయం ఆధ్వర్యంలో ఎఫ్‌ఐపిబి ఏర్పాటైంది. ఎఫ్‌ఐపిబి రద్దు నేపథ్యంలో ప్రస్తుతం రక్షణ, రిటైల్ ట్రేడింగ్ తదితర 11 రంగాల్లోకి వచ్చే విదేశీ పెట్టుబడులకు మాత్రమే ప్రభుత్వ అనుమతి అవసరం. మిగతా అన్ని రంగాల్లోకి విదేశీ పెట్టుబడులు ఆటోమెటిగ్గా వచ్చేస్తాయి. ఇక ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన 2016-17 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 9 శాతం పెరగగా, వాటి విలువ 43.48 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇకపోతే ఎఫ్‌ఐపిబి రద్దుతో దేశంలోకి ఎఫ్‌డిఐల రాక పెరుగుతుందని పారిశ్రామిక సంఘం సిఐఐ అభిప్రాయపడింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ ప్రకటించారు.
చెరకు ఎఫ్‌ఆర్‌పి రూ. 25 పెంపు
చెరకు కనీస గిట్టుబాటు ధర (ఎఫ్‌ఆర్‌పి)ను ఈ ఏడాది అక్టోబర్‌తో మొదలయ్యే ఈ ఆర్థిక సంవత్సరానికి (2017-18)గాను క్వింటాల్‌కు 25 రూపాయలను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
మంగళవారం జరిగిన ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ (సిసిఇఎ) సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. చెరకు రైతులకు చట్టబద్ధంగా దక్కే ధరే ఈ ఎఫ్‌ఆర్‌పి. తాజా పెంపుతో క్వింటాల్ చెరకు కనీస ధర 255 రూపాయలకు చేరింది. ఈ ఎఫ్‌ఆర్‌పికి తగ్గకుండా ఎంతైనా నిర్ణయించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు, మిల్లరకు స్వేచ్ఛ ఉంటుంది.
హోటల్ జన్‌పథ్ మూసివేత
మరోవైపు జన్‌పథ్ హోటల్‌ను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారతీయ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఐటిడిసి) ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ హోటల్ ఢిల్లీలో ఉంది.
కాగా, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు దీన్ని బదలాయించడానికి కేంద్ర కేబినెట్ మంగళవారం అంగీకరించింది. ఈ హోటల్‌ను ప్రభుత్వ కార్యాలయాల అవసరాలకు వినియోగించనున్నారు. తాజా నిర్ణయంతో ఐటిడిసి షేర్ విలువ మంగళవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో 6.69 శాతం పడిపోయి 516.80 వద్ద నిలిచింది.

చిత్రం... కేబినెట్ సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతున్న జైట్లీ


Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>