Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అమ్మా.. నాన్న.. ఓ బంటి! (చిన్ని కథ)

$
0
0

‘నాన్నా.. బంటీ! నువ్వు తరచూ స్కూల్‌కి ఆబ్సెంట్ అయితే పాఠాలు పోతాయి. ఖర్మకాలి రేపు ఎగ్జామ్‌లో అందులోని క్వశ్చనే్స వస్తే జవాబు తెలియక నువ్వు తలపట్టుక్కూర్చుంటావ్. అప్పుడు అందరి ముందు బ్యాడ్ షేమ్ అవుతావ్’ లాలనగా అన్నాడు తండ్రి ఫోర్త్‌క్లాస్ చదువుతున్న బంటీతో.
‘మీ నాన్న అలాగే అంటారులేరా బంటీ! నువ్వుమాత్రం నేను చెప్పినట్టుగా వినాలి. బాగాచదివి మంచిపేరు తెచ్చుకోవాలి. అప్పుడు నీకు బోలెడన్ని బొమ్మలు, చాక్లెట్లు, ఐస్‌క్రీంలు..’ అని తల్లి అంటుంటే బంటి తండ్రి అడ్డుపడి,.. ‘కొనిస్తావా? నీ దగ్గర డబ్బులున్నాయా?’ అన్నాడు వ్యంగ్యంగా. ‘నేనెందుకు కొనిస్తాను. నేను ఉద్యోగం చేస్తున్నానా? మీరే కొనిస్తారు’ అని సవాలు విసిరింది. బంటి బుర్రగోక్కుంటూ స్కూల్ బస్ ఎక్కాడు.
‘బంటీ! ఏంటి ఆలోచిస్తున్నావ్? నువీమధ్య మరీ నల్లపూసవు అవుతున్నావ్. ఇంతకీ హోంవర్క్ చేశావా?’ అడిగింది టీచర్.
‘చేశాను. కానీ, మీతో మాట్లాడాలి టీచర్’! నసిగాడు బంటి.
‘నాతోనా?.. ఏం మాట్లాడాలి?’ బంటీకేసి అనుమానంగా చూసింది టీచర్.
‘వెధవా! వేలెడంత లేవు. నా వయసేంటి. నీ వయసేంటి. పెద్ద ఆరిందలా నువ్వూ, నీ ఫోజూ’ స్వగతంలో బంటిని తిట్టింది టీచర్. అప్పుడు బంటి ఉదయం ఇంట్లో జరిగిన తల్లిదండ్రుల సంవాదం టీచర్ ముందుపెట్టాడు.
‘ఓర్నీ! ఏదో ఊహించుకుని అనవసరంగా టెన్షన్ పడ్డానుకదరా!’.. మళ్లీ స్వగతంలో అనుకుని ఒక్కసారి ఊపిరిపీల్చుకుని బంటి డౌట్ క్లియర్ చేసింది.
‘ఇప్పుడు చెప్పండి టీచర్! మా మమీ కరెక్టా? మా డాడీ కరెక్టా?’ ప్రశ్నించాడు.
‘ఇద్దరూ కరెక్టేరా! ఎవరు ఎలాచెప్పినా నీ మంచికోసమే చెప్పారు. నీ ఫ్యూచర్ బాగుండాలని మీ మమీ డాడీ కోరుకుంటున్నారు’ వివరించింది టీచర్.
‘సరే టీచర్! ఇంకెప్పుడూ స్కూల్ మానను. వానైనా, వరదైనా, పిడుగులైనా నా అడుగులు బడివైపే’ కామ్రేడ్‌లా అన్నాడు బంటి. వాడి విప్లవ ధోరణికి టీచర్ కాస్త భయపడి ఆ వెంటనే క్లాప్స్‌కొడుతూ ‘శెభాష్ బంటీ! వెరీగుడ్.. కీపిటప్’ అంటూ తనను తాను సంబాళించుకుంది.

- డి వెంకట్రావు,
ఉయ్యూరు, కృష్ణా జిల్లా.

వెంటాడే పద్యం..

పరిశుద్ధాంతరంగమే ముక్తికి మార్గం

ఏ వేదంబు పఠించె లూత, భుజంగంబే శాస్తమ్రుల్చూసె దా
నే విద్యాభ్యసనం బొనర్చెగరి, చెంచేమంత్ర మూహించె బో
దా విర్భావ విధానముల్ చదువులయ్యా కావు మీ పాద సం
సేవాసక్తియె కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!
భావం: లూత అంటే సాలెపురుగు అని అర్థం. సాలెపురుగు ఏఏ వేదాలు చదివింది? పాము ఏ విద్యాభ్యాసం చేసింది? చెంచువాడు ఏ మంత్రాలు నేర్చుకున్నాడు? వీరందరూ నీ సన్నిధిని చేరుకోలేదా? ఓ శ్రీకాళహస్తీశ్వరుడా! నీ పాద సన్నిధిని చేరుకోవడానికి జీవులన్నిటికీ చదువులతో పనిలేదు. పరిశుద్ధమైన అంతరంగంతో నిన్ను పూజిస్తే చాలు!
ఒక మహారణ్యంలో చెట్టుకింద శివలింగం ఒకటి ఉంది. ఒక సాలెపురుగు ఆ శివలింగాన్ని పూజిస్తోంది. ఒకరోజు ‘ఎండకి ఎండి వానకు తడిచి శివుడు బాధపడుతున్నాడు. గూడు అల్లిపెడతాను’ అనుకుని శివలింగం పైన సాలెగూడు అల్లింది ఆ జీవి. మర్నాడు పూజారి వచ్చి గూడు తీసివేసి ప్రమిదలో దీపం వెలిగించి వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు సాలెపురుగు మళ్లీ గూడు అల్లింది. పూజారి వచ్చి గూడు తీసివేసి దీపం వెలిగించి వెళ్లాడు. ‘నేను అల్లిన గూడు ఈ దీపం ప్రతిరోజూ కాల్చివేస్తోంది కాబోలు. దీన్ని నేను మింగేస్తాను’ అనుకుంటూ సాలెపురుగు ఆ మంటలోకి దూకి, ఆహుతైపోయింది. శివుడు దాని భక్తికి మెచ్చి తనలో ఐక్యం చేసుకున్నాడు.
అదేవిధంగా ఓ పాము, ఓ ఏనుగు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పూజలు చేసి వెళుతున్నాయి. ఏనుగు పాము పెట్టిన పూలు ఊదేసి, తొండంతో నీళ్లు తెచ్చి అభిషేకం చేసి, కొలనులోని తామరపూలతో పూజించి వెళ్లేది. పాము వచ్చి చూసేసరికి తాను చేసిన పూజను తుడిచివేసి వేరే ఎవరో వచ్చి వెళుతున్నారు అని గ్రహించింది. ఇలా కొద్దిరోజులు జరిగాయి. ఒకరోజు ఎలాగైనా తన శత్రువు అంతు తేల్చుకోవాలని పాము రహస్యంగా తామరపూల మధ్య దాక్కుని ఉంది. ఏనుగు వచ్చి వాడిన పూలు తీసివేయటానికి తొండం జాపగానే ముక్కు రంధ్రాల్లోకి జరజరా పాకుతూ వెళ్లింది పాము. ఇష్టమొచ్చిన చోటల్లా కసిదీరా కాటువేసింది. ఏనుగు బాధతో అడవి దద్దరిల్లేటట్లు ఘీంకరించింది.
ఇక తనకు మృత్యువు తప్పదని భావించి, శత్రువు తప్పించుకుని వెళ్లటానికి వీలు లేకుండా తొండాన్ని గుండ్రంగా చుట్టి పరుగెత్తుకుంటూ వెళ్లి కుంభస్థలంతో కొండని ఢీకొంది. తొండం లోపల ఉన్న పాము చితికిపోయింది. కుంభస్థలం బద్దలయ్యి ఏనుగు మరణించింది. ఆ రెండు జీవుల భక్తికి, ఆత్మార్పణకు మెచ్చి శివుడు వాటిని తనలో ఐక్యం చేసుకున్నాడు.
ఆ అరణ్యానికి సమీపంలోని చెంచుగూడెంలో తిన్నడు అనే శివభక్తుడు ఉన్నాడు. అతను జంతువులను వేటాడి మాంసభక్షణ చేస్తుంటాడు. ప్రతిరోజూ కాల్చిన జంతుమాంసం రెండు చేతులతో పట్టుకుని, శివలింగంపైన ఉన్న పూలు కాలితో లాగివేసి, శుభ్రం చేసి, పుక్కిట పట్టిన నీటితో అభిషేకం చేసి జంతుమాంసం నైవేద్యం పెట్టేవాడు. కాలితో తొక్కటం, ఎంగిలి నీళ్లు శివుడి పైన పోయటం అపచారం అని తెలియని నిరక్షరాస్యుడు తిన్నడు. పరమేశ్వరుడు అతని భక్తిని పరీక్షింపదలచాడు. శివలింగం కుడి కంటి నుంచి రక్తం కారసాగింది. తిన్నడు ఆకు పసరు వేశాడు. కట్టుకట్టాడు. అయినా రక్తప్రవాహం ఆగలేదు.
చివరికి ‘కన్నుకి కనే్న మందు’ అని నిశ్చయించుకుని బాకుతో తన కన్ను పెకలించుకుని శివలింగానికి అంటించాడు. రక్తప్రవాహం ఆగింది. ఇంతలో శివలింగం ఎడమ కంటిలో నుంచి కూడా రక్తం కారసాగింది. తన రెండో కన్ను కూడా పెకలించాలనుకున్నాడు. రెండు కళ్లూ లేకపోతే కన్ను అంటించవలసిన చోటు తెలియదని పాదంతో శివలింగం ఎడమ కంటిని నొక్కిపట్టి, తన రెండో కంటిని కూడా పెకలించి లింగానికి అంటించాడు. శివుడు అతని భక్తికి మెచ్చి ప్రత్యక్షమై రెండు కళ్లు తిరిగి వచ్చేటట్లు చేశాడు. ‘్భలోకంలో సర్వసుఖాలు పొందిన తర్వాత కైలాసానికి చేరుకుంటావు’ అని ఆశీర్వదించి అంతర్థానమయ్యాడు.
సాలెపురుగు, పాము, ఏనుగు, తిన్నడు అందరూ అక్షరజ్ఞానం లేని వారే! పరిశుద్ధమైన మనసుతో అర్చించి శివసాయుజ్యం పొందారు. కనుక ముక్తిని పొందటానికి చదువులతో పనిలేదు- అని ఈ పద్యం ద్వారా కవి చెప్పారు. ఈ పద్యం ధూర్జటి రచించిన ‘కాళహస్తీశ్వర శతకం’ లోనిది.

- గోనుగుంట మురళీకృష్ణ
రేపల్లె, గుంటూరు జిల్లా.
మొబైల్ : 9701260448

పుస్తక పరిచయం

తుపాను గొంతులో
దింపిన ‘కలము’

ఇరవై, ముప్ఫై లైన్ల కవిత రాయడమే కొంత కష్టమనుకుంటే, అదీ కొన్ని దశాబ్దాల కృషితో కవిత్వం రాయడంలో పదునెక్కుతుంది. కానీ, ఈ గ్రంథకర్త రవికుమార్ అప్పుడప్పుడు తప్ప వరుసగా కవితలు రాస్తున్న దాఖలాలు లేవు. ఒకేసారి దీర్ఘ కవిత రాయడం.. అదీ ఇంత అద్భుతంగా, ఒక ఉద్ధృతమైన భావధారతో రాయడం నిజంగా ఆశ్చర్యకరమే!
దీర్ఘకవిత రాయాలంటే సరైన అంశం తీసుకోవాలి. ఆ అంశంపై కవికి పూర్తి అవగాహన ఉండాలి. కవిత ప్రారంభం, నడక, ముగింపు ఒకే పట్టున సాగి అది పాఠకుడి మనసుకు బలంగా హత్తుకోవాలి. ఆలోచనాత్మక సందేశాన్ని స్వీకరించడంతో ఆ అంశం పది కాలాలపాటు పాఠకుడి మనస్సులో గుర్తుండిపోయి సమాజ మార్పునకు ఉసిగొల్పే దిశను కలిగించాలి. అప్పుడే దీర్ఘ కవితకి ప్రయోజనం. ఆ ప్రయోజనం ఈ ‘దింపుడు ఖలము’ వల్ల సిద్ధిస్తుంది. సమాజంలో జరిగిన ఘోర నష్టానికి ఈ కవి ఎంత త్వరగా స్పందించాడంటే, తాను ఉంటున్న ఊరికి సుదూరాన వున్న విశాఖపట్నంలో ప్రకృతి చేసిన విలయతాండవ విధ్వంసానికి చలించిపోయి, కేవలం ఒకరోజు గడవక ముందే ఈ దీర్ఘకవిత రాయడం. నిజంగా నిజమైన కవి లక్షణం అంటే ఇదే!
‘దింపుడు ఖలము’ అంటే ఏంటీ? ముందు నాకూ సరిగా అర్థం కాలేదు. దింపుడు ఖలము అంటే చనిపోయిన మనిషికి చేసే తుదియాత్రలో.. చిట్టచివరిసారిగా.. మళ్లీ ఆ మనిషి బతికొస్తాడేమోనని.. ఆశ చావక.. మూడుసార్లు (శవాన్ని దించి) పిలిచే పిలుపే ‘దింపుడు ఖలము’. చనిపోయిన మనిషిపై ఆశ చావక ఇంకా పిలవడం అంటే, మనిషి ఎంత ఆశాజీవో అర్థం చేసుకోవచ్చు! శీర్షికే ఇంత ఆలోచనాత్మకంగా ఉందంటే, అందులోని కవిత్వం ఎలా ఉంటుంది? ఎక్కడో జరిగిన ఎంతో ఘోరమైన, విషాదకర సంఘటనల్ని సైతం దృశ్యరూపం కట్టిస్తే ఎటువంటి పాఠకుడినైనా హృదయం ద్రవింపచేస్తుందనడంలో సందేహం లేదు.
‘కట్టుకున్న గూళ్లు కూల్చేస్తూ
పురుడు పోసుకోని గుడ్లను
పగలగొడుతూ
పచ్చిగా, పిచ్చిగా పిసికి వదిలేస్తుంది..
కన్నబిడ్డని శ్మశానానికి మోసుకెళ్లే
తల్లికి తెలుస్తుంది
కాన్పు ఎంత కష్టమో
పంట కోస్తున్న రైతుకు తెలుస్తుంది
ఆకలి విలువ ఏంటో!
నీకేం తెలుసు?
నిజానికి నువ్వో రాక్షసివి
రగిలిపోయే పగోడివి’.. అంటూ తుపాను సృష్టించిన విధ్వంసాన్ని, అది మిగిల్చిన విషాదఛాయలను వర్ణిస్తూ, ఆ తుపానుకే మళ్లీ ఒకసారి విడమరిచి చూపిస్తూ దూషిస్తాడు ఈ కవి.
‘నీలో పుట్టేవాటికి
బంధుత్వాలు లేవు
అందుకే నీకు ప్రేమ తెలియదు
నిత్యం చలిస్తూ.. నిలువెల్లా కదిలిపోతూ
కనికరమనే గుణాన్ని
విసర్జించేసావ్
కేవలం గొడ్రాలైన మంత్రసానిలా
మారిపోయావ్
నీకు కన్నతల్లి విలువ తెలియదు
రొమ్ము చీకుతూ
పాలుకుడిసే పెదాల మత్తు ఎగరవు’ అంటూ.. ఇవన్నీ తెలిస్తే ఇంత వలయాన్ని సృష్టించలేవని.. గుక్క తిప్పుకోనివ్వకుండా నిందిస్తాడు. ఈ నింద ఎంతవరకు పోయిందంటే, నిందించి.. ప్రశ్నించే ప్రతిసారీ ‘నేను ఎందుకు ఇంత విలయాన్ని సృష్టించాన్రా బాబూ’.. అనుకుంటూ ఆ తుపానే విలవిల్లాడి బాధపడేంతగా ప్రశ్నల తుపాన్ సృష్టించి వదిలాడు రవికుమార్.
‘నిలువెల్లా విరిగిపడిన చెట్టు నినే్నం చేసింది
తల తెగి పడ్టట్టు
కోసుకుపోయిన రోడ్డు
నినే్నం ఎదురించింది..?
చేసిన అప్పులు తీరకముందే
ఇళ్లు కూల్చేసావ్
కళకళ లాడుతున్న
పంటను తుడిచి పెట్టేసావ్
లెక్క చెప్పు..
నోరులేని జీవాల్ని ఎన్ని చంపావ్?’.. అంటూ తుపాన్ ఉద్ధృతి కంటే ప్రచండ వేగంగా ఉక్కిరిబిక్కిరి చేస్తాడు కవి.
ఈ కవితా వేగం.. ఈ ప్రశ్నల వర్ష ఉద్ధృతి ఇలాగే కొనసాగిస్తూ, ఒకప్పుడు తుపాను రాకమునుపు నగరం ఎలా ఉండేది, ఆ తరువాతి విపత్కర దుష్పరిణామాల వల్ల ఏవిధంగా ఎవరికి ప్రయోజనం చేకూరుస్తున్నదీ.. ఎవరికి నష్టాన్ని చవిచూపిస్తున్నదీ విపులంగా కవిత్వీకరించిన తీరు బహు ప్రశంసనీయం. ఈ అంశం కవిని ఎంతో కలత చెందేలా చేయకపోతే.. ఎంతో హృదయానుభవం చవిచూడకపోతే ఇంత బలమైన కవిత్వభాష అబ్బదు. ఈ ప్రవాహం ఇంత ఉద్ధృతిగా సాగదు.
ఇక ముగింపుకి వచ్చేసరికి.. తుపాను తీరం దాటి విధ్వంసం దృశ్యాలు చేదుగా మిగిలే క్షణంలోకి వచ్చేసరికి.. ఇక్కడే అసలు కవిత్వం జాలువారేది, కవి హృదయ ఘోష ప్రవాహంగా ముంచెత్తేది. ఇది మాటలతో చెప్పేది కాదు.. చదివి, రేపటి తరానికి మనం ఏం మిగల్చాలో తెలియజేసేది! విధ్వంసం క్షణాల్లో చనిపోయిన మనిషి, మళ్లీ మనిషిగా మేల్కొని, ఆత్మవిమర్శ చేసుకొని.. ఏవిధంగా ముందుకు సాగాలో తెలుసుకోవాల్సిన తరుణమిది. కదలండి.. కదిలిరండి.. ఈ కవితోపాటు మీరు.. నేను.. మనమందరమూ! నవసమాజ నిర్మాణానికి నడుం కడదాం.. రేపటి తరానికి మంచి బాట వేద్దాం!

దింపుడు ఖలము
దీర్ఘ కవితా సంపుటి
రచన బరకు (బండికట్ల రవికుమార్)
వెల: రూ.25
ప్రతులకు: నాగం కవిత, ప్లాట్ నెం. 13,
ఎన్టీఆర్ కాలనీ, వెంకటాపురం పంచాయతీ,
ఏలూరు - 534002.

- చలపాక ప్రకాష్,
విజయవాడ.
మొబైల్ : 9247475975.

మనోగీతికలు

కన్నీటి పాట!
పున్నమి నెలవంకల్ని
నల్లని మేఘాలు మింగేశాయి
మమ్మల్ని చూస్తుంటే
పున్నమి నెలవంకల్ని చూసినట్లుండాల్సింది
మమ్మల్ని చూస్తుంటే
విరబూసిన పూదోటల్తో
మాట్లాడినట్లుండాల్సింది కానీ..
చీకటి ముసుగేసుకున్న
పండువెనె్నల్లా ఉన్నాము
నడుస్తున్న కాళరాత్రిలా ఉన్నాము
తారు డబ్బాల్లోంచి ముంచి తీసిన
పావురాయిల్లా ఉన్నాము
కోళ్ల ఫారాల్లో కోళ్లు.. బురఖాల పరదాల్లో మేము!
ముస్లిం సమాజంలో చైతన్యం
గాలిదుమారంలా రావాలి!!
ఆదివారం నాడు మార్కెట్‌లో
మటన్, చికెన్ అమ్మినట్లు
అరబ్ సేట్లకు మమ్మల్ని తెగనమ్మేస్తున్నారు
డబ్బుకు ఆశపడి కన్నపేగుల్ని
కసాయిలకు అంటకడుతున్నారు
తరతరాల నుంచి తిష్టవేసిన
మతఛాందసం మట్టిపాలవ్వాలి!
స్వాతిముత్యాలం
మీ చేతుల్లో నలిగిపోతున్నాం
పేదరికం అడ్డుగోడలైతే
మమ్మల్ని పురిట్లోనే చంపాల్సింది!
ఎందుకమ్మా.. పేగుబంధం లేదా నీకు?
పశువుల్ని సంతలకు, కబేళాలకు తరలిస్తున్నట్లు
మమ్మల్ని అరబ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు!
ఎందుకమ్మా.. మా జీవితాల్ని
కాళరాత్రిగా మార్చేస్తారు?
పాలుగారే పసిమొగ్గలం
రెక్కలు తెగిన పక్షులం మేము
అల్లా సాక్షిగా చెపుతున్నాం..
మా బతుకులు
బోర్లించిన గాజుపాత్రల కింద
గాలి ఆడని ఈగల్లా విలవిల్లాడుతున్నాయి!

(దగాపడుతున్న (పడిన) నా ముస్లిం
సోదరీమణులకు అంకితం)

- మొహ్మద్ బురహానుద్దీన్,
వేంసూరు, ఖమ్మం జిల్లా.
మొబైల్ : 9704076179

అంకెల వలయం
ఇపుడు నెంబరే నెంబర్‌వన్
నడిచొచ్చే నడక మీద నమ్మకం లేకనా
మనిషి మెడలో ఈ అంకెల అంటింపు?
అసలెవరో నకిలీ ఎవరో
అంకెల అంజనం వేసి ఎలా గుర్తిస్తారు?
ఇలా ప్రతి గడప గుండెల మీద
ఎన్నని పచ్చబొట్లు పొడుస్తారు?
నిజమైన జీవితం గురించి
అసలైన మనసు గురించి
అంకెలు తీర్మానించలేవు
సకాలంలో సాక్ష్యానందించలేవు
పాన్, రేషన్, ఆధార్, ఓటర్ కార్డులు,
బ్యాంకు ఖాతాలు జనాభా లెక్కలు
సాలెగూటిలా అంకెల వలయాలు
అల్లుకుపోతున్నపుడు మనిషికి మనిషే గుర్తుకు రానపుడు
ఇలా అంకెలు ఎవరిని గురించి
ఆరా తీసి గుర్తుంచుకుంటాయి?
అంచనాలు ఆర్భాటాలు ఎలా ఉన్నా
ఈ అంకెల కథలతో కంచికి చేరని కథలా
ఈ నగరీకరణ జాతరలో
తెగిన గాలిపటంలా మిగిలిపోకుండా
మనిషి మనిషి దోస్తులా నిలబడితే మేలు
మనకంటూ మనం చాలు!

- బి. గోవర్ధనరావు, సెల్ : 9441968930

దంత వేదాంతం
నిండు చూలాలకు
ఆసుపత్రులే పురుడు పోయవు
ఆటోరిక్షాలు కూడా పోస్తాయి!
చట్టసభలు దుర్ముహూర్తాల్లో
చట్టాలు ఆమోదించాయి
మండుటెండలో మానవత్వానికి వడదెబ్బ కొట్టింది
పంచభూతాలను ‘కామాత్మ’ ఆవహించింది
‘నిర్భయం’ గుండెనిండా పీల్చుకున్న
‘మృగాళ్ల తోడేళ్ల గుంపు’ నాయకత్వ
హవా నడుస్తోంది!
గర్భం చీల్చుకు పుట్టిన గతాన్ని
గాఢ సుషుప్తిలో మరచిపోయిన మగతనం
అమ్మతనాన్ని అంగట్లో ఆరడి పెడుతోంది
సంప్రదాయాల తలలు పట్టుక్కూర్చున్న
తలపండిన వేదాంతులు తకరారు పడిపోతూ
సిగ్గును తలకెత్తుకుంటున్నారు
విశ్వాసాలకు నరాల బలహీనత ఎందుకొచ్చిందని?
గడియారంలో కొట్టుకుంటున్న గుండె
కాలగమన సూచికల్ని కదలిస్తున్నట్లు
అంతర్వాహినై అసురత్వం
వెర్రిజడలు పెంచుకుని
జనజీవన గమనానికి
అద్దం పడుతోంది!
జ్ఞాపకాల్ని మరలుస్తున్న దుర్ఘటనల ఆనవాళ్లు
ఎక్కడ తవ్వినా పురావస్తు శాస్తవ్రేత్తల
దిక్సూచికి అందకుండా
ఆదర్శాల గొడుగు కిందకు చేరాయి
వౌనఋషుల సమావేశంలో
వక్రత్వమే విక్రమత్వంగా పరిక్రమించే
మూకాంధకార మూకల వెకిలితనం
ముఖాలకు ముసుగులు వేసుకు నర్తిస్తోంది
శ్మశాన వైరాగ్యం సమాజానికి
సమాధి కడుతోంది!
అసహజాలే కాలగతిన సహజాలై
సజీవ సత్యాలుగా నిత్య సుభాషితాలుగా
చలామణి కావటం విడ్డూరంకాకేమిటి?
గతం కలల పొట్లాంగా చుట్టచుట్టుకుంది
వర్తమానపు కృతకత్వం
అక్షరరూపం దాల్చి హస్త్భూషణమైంది
ఇదింతే! అందరితో పాటు మనం!
నలుగురు నడిచే దారి ఉత్తమం!!
ఎవరెలాపోతే మనకేం?!
‘మనం, మన కుటుంబం’ హాయిగా వున్నాం!
ఒక్కరివల్ల ఏవౌతుంది కనుక?
మనకెందుకు? మనకెందుకు?
మార్చటం సాధ్యం కానందుకు!!

- బిఎస్ నారాయణ
దుర్గ్భాట్టు,
బాపట్ల, గుంటూరు జిల్లా.
మొబైల్ : 9346911199
email: merupuvj@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి vijmerupu@gmail.com

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007.

చిన్ని కథ
english title: 
s
author: 
- డి వెంకట్రావు

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles