Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

స్నేహబంధం (నీతి కథ )

$
0
0

అనగనగా ఒక ఊరిలో సునీల్ అనే బాలుడు ఉండేవాడు. వాడు ఇప్పుడు ఆరవ తరగతి చదువుతున్నాడు. వాళ్ల స్కూలులో ఉపాధ్యాయులు చక్కటి పాఠాలు చెబుతూ నీతి నియమాలు చెబుతుంటారు. కాకపోతే సునీల్‌తో పాటు క్లాసులో నలుగురు పిల్లలు ఒకే బెంచీలో కూర్చుంటారు. వాళ్ళు నలుగురు ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలు ఆలకించకుండా ఆలకిస్తున్నట్టు నటిస్తూ పక్కన కూర్చున్న సునీల్‌ను కూడ చెడగొడుతూ ఉండేవాళ్లు. ఇంకా మిగతా పిల్లల పుస్తకాలు దాచేయడం, వాళ్లు పుస్తకాలు వెతుక్కుంటుంటే మాకు తెలియదని చెప్పేవాళ్లు. అలాగే తోటి విద్యార్థులను ఏడిపిస్తూ ఉండేవాళ్లు. ఇంతేకాదు ఆ నలుగురు పిల్లలు బయటకు వస్తే చిన్నచిన్న దొంగతనాలు చేస్తుండేవారు. ఒక రోజు సునీల్ తన బెంచీలో కూర్చున్న నలుగురు స్నేహితులను మార్చడానికి ప్రయత్నించాడు. ‘మన స్కూలు క్రమశిక్షణ గల స్కూలు, మీరు ఇలాగే చేస్తే టీచర్లకు తెలిస్తే మిమ్మల్ని కొట్టి మీ పేర్లు తీసేసి ఇంటికి పంపుతారు. దొంగతనం చేయడం వల్ల ఈ రోజు గడిచిపోయింది కదా అనుకుంటాం, దొంగతనం ఏదో ఒక రోజు బయటపడుతుంది. అప్పుడు మిమ్మల్ని చితక బాదుతారు. మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. చెడ్డ పేరు తెచ్చుకోడానికి నిమిషం పట్టదు’ అని చెప్పాడు. కానీ వాళ్లు వినకుండా పుస్తకాలు దాచేయడం ప్రారంభించారు. ఒక రోజు వాళ్లు పుస్తకాలు తీయడం ఒక అబ్బాయి చూసి టీచరుకి చెప్పాడు. అప్పుడు టీచరు ఆ నలుగురిని పిలిచి ‘మీ బ్యాగులు తీసుకురండి’ అని చెప్పి ఆ బ్యాగులోంచి పుస్తకాలు తీసి ఎవరివి వాళ్లకు ఇచ్చి క్షమాపణ చెప్పమన్నారు. ఆ తరువాత వాళ్లను చేతుల మీద కొట్టి ఇటువంటి పనులు ఎప్పుడైనా చేస్తే మిమ్మల్ని స్కూలు నుండి పంపిచేస్తానన్నారు. అయినా సరే వాళ్లు మారలేదు. మళ్లీ మరునాడు జేబులో పర్సులు దొంగతనం చేయడానికి బజారుకెళ్లి అక్కడ కూడ దొరికిపోయారు. వాళ్లను చితకబాది ‘మీరు చదువుకున్న పిల్లలేనా, దొంగతనం చేయవచ్చా’ అంటూ తరిమితరిమి కొడుతుంటే వాళ్లు ఆయాస పడుతూ క్లాసులో వచ్చి సునీల్ బెంచీలో కూర్చున్నారు. ‘మళ్లీ దొంగతనం చేసి దొరికిపోయారా?’ అని సునీల్ ప్రశ్నించగా అవును సునీల్ దొరికిపోయాం, వాళ్లు కొడుతుంటే పారిపోయి వచ్చామని’ చెప్పారు. అప్పుడు సునీల్ ‘మీకు చిన్న ఉపాయం చెబుతాను, ఒకచోట బోలెడంత డబ్బు, బంగారం ఉన్నాయి, మీరు ఒక నెల రోజులు నేను చెప్పినట్లు వినండి, అప్పుడు అదంతా ఎక్కడుందో చెబుతా’నన్నాడు. దాంతో నలుగురిలో ఒకరు ‘మనం రోజు దొంగతనం చేయడం ఎందుకు, ఒక నెలరోజులు వీడి మాటలు ఆలకిస్తే బోలెడంత బంగారం, డబ్బు దొరుకుతుంది.’ ప్రస్తుతానికి సరే అనేద్దాం అనుకుని ‘సరే సునీల్ నువ్వు నెల రోజులు ఎలా చెబితే అలాగే చేస్తాం, ఏమి చెయ్యమంటావు చెప్పు’ అని అడిగారు.
అప్పుడు సునీల్ ‘తెల్లవారుజామునే నిద్రలేచి శ్రద్ధగా ఒక గంట సేపు చదువు కోవాలి. తరువాత స్నానం చేసి దేవుడ్ని పూజించి రెండు చేతులతో నమస్కారం చేయాలి. నిత్యం వినాయకుడికి నమస్కారం చేసి స్కూలుకు రావాలి. ఏరోజు పాఠాలు ఆ రోజే చదవాలని’ చెప్పి సునీల్ వాళ్లంతట వాళ్లు చదవగలిగేలా చేశాడు. సునీల్ చెప్పినట్టుగానే ఆ నలుగురు పిల్లలు 15 రోజులు చేశారు. ఈ లోగా క్వార్టర్లీ పరీక్షలు జరిగాయి. వాళ్ల నలుగురు పరీక్షలు బాగా రాసారు. టీచర్లు మార్కులిస్తూ వాళ్లను మెచ్చుకుని ఇంకా బాగా చదివి మళ్లీ వచ్చే పరీక్షల్లో కూడ బాగా రాస్తే ఇంకా మంచి మార్కులొస్తాయన్నారు. అప్పటి నుండి వాళ్లకి చదవాలనే కోరిక పుట్టింది. ఇకపోతే తన బెంచీలో కూర్చున్న పిల్లలను వాళ్లంతట వాళ్లు చదువుకునేలా చేసినందుకు సునీల్‌ను టీచర్లు అభినందించారు. తోటి విద్యార్థులకు అర్థం కాకపోయినా వాళ్లకి కూడ సునీల్ చెబుతుంటాడు. ఒక ప్రశ్న అర్థం ఇంటి దగ్గర రెండుసార్లు చదువుతాడు. దానిని స్కూలుకు వచ్చాక ఇతరులకు చెప్పడం వల్ల సునీల్‌కు జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది. ఒక రోజు సునీల్ స్కూలుకు దిగాలుగా వచ్చాడు. నెల రోజుల గడువు అయిపోయింది. వాళ్లు మళ్లీ చదవడం మానేస్తారేమో, డబ్బు, బంగారం అడుగుతారేమోనని దిగాలుగా కూర్చున్నాడు.
ఇంతలో ఆ నలుగురు వచ్చి సునీల్‌ను ఎందుకు అలా ఉన్నావని అడిగారు. మీకు నెల రోజుల గడువు అయిపోయింది, మీరు చదవడం మానేస్తారేమోనని అనేలోగా ఆ నలుగురు ‘సునీల్ ఈ నెల రోజులు ఎలా చదివామో అలాగే చదువుతాం, నువ్వు మాతో ఉంటే చాలు, నీ స్నేహమే మాకు బోలెడంత డబ్బు, నీ నోటి మాటలే బంగారం’ అంటూ సునీల్ చేతులు పట్టుకుని ‘నీ స్నేహం ఎన్నటికీ విడువకూడదు’ అంటుంటే క్లాసులో మిగిలిన పిల్లలు కూడ వచ్చి వారితో చేతులు కలిపారు.
ఈ గొప్ప బంధమే స్నేహ బంధం కాబట్టి చిట్టిపొట్టి బాలలూ మనమంతా మనకి తెలిసినవి ఇతరులకు చెప్పడం వల్ల జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. మనకు చదువు బాగా వస్తుంది. సరేనా.
నీతి: మంచివారితో స్నేహం చేస్తే
ఎంతటి చెడ్డవాడైనా మంచి వాళ్లవుతారు.

- చెల్లాయ్ వీర సంతోషి జగదీశ్వరి,
9వ తరగతి, కొత్తూరు స్ట్రీట్, నిమ్మతోట,
సామర్లకోట.

కవి పరిచయం

పద్యాన్ని
దౌడు తీయించే ‘గుర్రం’

పద్యంలో ఆయన పదాలు పరవశింప చేస్తాయి. శ్లోకంలో ఆయన భావాలు శోభింప చేస్తాయి. పామరుడయితే ఆయన పద్యాల్ని ఆహ్లాదంగా పాడుకుంటాడు. పండితులైతే ఆయన శ్లోకాలు చదివి శ్లాఘిస్తారు. ఓ అసాధారణ ప్రక్రియతో అసామాన్యంగా మహామహుల ఘనతను కీర్తించిన అక్షర ప్రేమికుడాయన. గుర్రం ధర్మోజీరావు కోనసీమ నుంచి కవితాశ్వంపై పద్యగానం చేసుకుంటూ వస్తున్న కవి పండితుడు. ప్రేమించడం తెలిస్తే కవిత్వం రాయడం సులువనేది భావ కవుల వాదన. దానికి బలం చేకూర్చారు గుర్రం వారు. ముందుగా తనకు తెలిసిన మిత్రుని కులాంతర, ప్రేమ వివాహంపై మొదటి కావ్యం ‘ఆనంద మోహిని’ రాశారు. తన మొదటి పుస్తకం ముద్రించడంలో ఎన్ని బాలారిష్టాలు పడ్డారో రాయడంలో కూడా అంతే కష్టపడ్డారు. రాయడంలో ఇక వెనుకడుగనేది లేకుండా తర్వాత క్రీస్తు మీద సుప్రభాతాలు రాశారు. మరో పద్య కావ్యం ‘నాన్న’ను ఇటీవలే సుప్రసిద్ధులైన పండితుల ముందు ఆవిష్కరింప చేశారు. అలాగే సంస్కృతంలో తన సత్తా చూపెట్టే దిశగా అంబేద్కర్‌పై సుప్రభాతం రాశారు. కవి ప్రసిద్ధులు బోయి భీమన్న అంబేద్కర్‌ను కవితల్లో చెప్పారు. అయితే తాను రాసేటప్పటికీ దాన్ని చదవ లేదని తెలిపారు. అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, అన్నదాత అర్థర్ కాటన్‌పై ఉదాహరణ కావ్యాలు రాసిన మొదటి కవి ధర్మోజీరావు మాస్టారు. తెలుగు సాహిత్యంలో ప్రత్యేక ప్రక్రియ ఉదాహరణ కావ్య రచన. అది ఏ కొద్దిమందో రాసే ప్రక్రియ. దాన్ని ఔపాసన పట్టారు. భగవంతుణ్ణి ప్రార్థించే స్వరూప క్రియే ఈ ఉదాహరణ ప్రక్రియ. పూజ్యనీయుల మీద మహనీయుల మీద ఎన్నో వచ్చాయి ఇవి. శ్రీ భీమరాయ ఉదాహరణ కావ్యం తరువాత మరింత అధ్యయన శీలంతో అవగాహన పెంచుకుని సర్వ లక్షణ సమ్మతంగా మిగిలిన కావ్యాలు రాశానంటారు. వివిధ సాహితీ సంస్థలు అనేక బిరుదులతో ఆయన్ని సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నాయి. పద్య కవితా సుధానిధి, కవితా విశారద, హృద్య పద్య కవి బిరుదులు ఆయన పేరుకు ముందు అలంకృతమయ్యాయి.
పాలకొల్లు మండలంలోని బల్లిపాడు గరువులో పుట్టిన ధర్మోజీరావు మాస్టారు తాత్విక స్పర్శను పొందుతూనే హేతుతత్వ భావనలను అంది పుచ్చుకున్నారు. సినీ రచయిత డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ తమకు పాఠాలు బోధించడంతోపాటు పలు నాటకాల్లో పాత్రలు వేయించి ప్రదర్శింప చేశారని చెప్పారు. భజంత్రీలు, తెరవెనుక నాటికలు పేరు తెచ్చాయన్నారు. తెర వెనుక నాటికలో తాను రచించిన పాత్రకు ద్వితీయ బహుమతి వచ్చిందన్నారు. ఆనాటి ఉత్సాహం అనుభవంతో ‘ఓహో! ఆంధ్ర భోజ’ పద్య నాటకానికి పద్యాలు రాశారు. అది ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే నంది నాటకోత్సవాలకు అర్హత పొందింది. ఆయన కలం నుండి జాలువారిన సంకలనంలోని సుమారు 10 పాటలతోపాటు మరికొన్ని పాటల్ని ఆడియో చేసే ప్రయత్నంలో ఉన్నట్టు చెప్పారు. సాహితీ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు చిత్రలేఖనంలో కూడా మాస్టారుకి అభినివేశం ఉంది. ధర్మోజీ మాస్టారు రాసిన మొదటి పుస్తకం ‘ఆనంద మోహిని’పై రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం జి గంగరాజు అనే విద్యార్థి ఎంఫిల్ సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. కవితా తృష్ణ అధ్యయన కాంక్ష తీరని ఆయన ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం డీన్‌గా చేసిన ఆచార్య మసన చెన్నప్ప రచనలపై పరిశోధన చేస్తున్నారు. తిరుపతి ఎస్‌వి శిల్ప కళాశాలలో పదేళ్లు పండితునిగా పనిచేసే సమయంలో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి సంస్కృతం ఎస్‌వి యూనివర్సిటీ నుండి తెలుగులో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జూనియర్ లెక్చరర్‌గా కృష్ణా జిల్లా అవనిగడ్డలో కాలూని, అక్కడ నుండి మామిడికుదురులో పదేళ్లు పనిచేశారు. ప్రస్తుతం రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేస్తున్నారు.

-రవికాంత్, రాజమండ్రి, సెల్:96424 89244

పుస్తక పరిచయం

చదువు పట్ల ఆసక్తి పెంచే ‘అంబేడ్కర్ కథ’

కథ చెప్పడంలో ఒక ప్రత్యేకత ఉండాలి, అలానే కథ రాయడంలో కూడా. కథను ఎంచుకోవడంలోను దృష్టి పెట్టాలనే ఆలోచనతో వచ్చిన కథ మాత్రం ముమ్మాటికి ‘పిల్లలకోసం అంబేడ్కర్ కథ’. నేతల ప్రతాప్ కుమార్ కవి కావడం, ఉపాధ్యాయ వృత్తిలో ఉండటం వల్ల పిల్లలకు ఎలా బోధించాలో తెలుసు. కనుకనే సులభ శైలిలో కథను రాసి మంచి మార్కులు కొట్టేశారు. నిజంగా బాధ్యతగా చెప్పుకుంటే, అందించాల్సినంతగా పిల్లలకు బాల సాహిత్యాన్ని అందించడం లేదు. బహుశా అలాంటి కొరతను తీర్చే ప్రయత్నంగా కవి నేతల చేపట్టడం హర్షణీయం.
ముఖ్యంగా పిల్లల్లో పఠనీయతను పెంచడం, అదే సందర్భంలో మన మహనీయుల గురించి తెలపడం అవసరం. బాల సాహిత్యంలో నీతి కథలకు కొదవ లేదు. కాని జాతి గర్వించే నాయకుల గురించి తెలిపే చిన్న కథా సాహిత్యాన్ని విరివిగా ప్రోత్సహించాల్సిన అవసరాన్ని తెలిపింది ప్రతాప్ రాసిన అంబేడ్కర్ కథ. అంబేడ్కర్ ఆశయం కోసం అహర్నిశలూ ఆలోచించేదే ఆయన కవిత్వం. అంతరంగాన్ని ప్రక్షాళన చేసుకుని జాతి విముక్తి చెందాలనే ఆశయంతో ఆయన కలం పట్టారు. దళితులు అభ్యున్నతి పొందాలన్నా, ఉన్నత ఆశయాలు పెంపొందించుకోవాలన్నా ఆలోచనా విధానంలో పరిష్కారయుతమైన జ్ఞానాన్ని సాధించటానికి సాహిత్యం తోడ్పడుతుంది. ఆ ఉద్దేశంతోనే అంబేడ్కర్ కవిత్వంగా దళిత సాహిత్యంలో ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు నేతల ప్రతాప్‌కుమార్. చిన్న పిల్లల మెదళ్లలోకి చొచ్చుకుపోయే ఆధార భూతం భాష, భావం. ఆ రెండింటిని సమ పాళ్లలో గుర్తెరిగి విషయంపై శ్రద్ధ వహిస్తే చక్కని కథ రూపుదాల్చడం సులువు. దాన్ని అక్షరాల రుజువు చేశారు రచయిత. అంబేడ్కర్ లాంటి మహోన్నతుని గురించి తెలియచెబుతూనే విద్య యొక్క ఆవశ్యకతను ప్రముఖ పరిచి విశదీకరించడంలో నేతల ప్రతాప్ నూటికి నూరుపాళ్లు విజయం సాధించారు. బాల్యంలో అంబేడ్కర్ పడిన కష్టాలు కడగండ్లు వివరిస్తూనే చదువు పట్ల ఆయనకున్న అభిలాషను చక్కగా వివరించారు. ఎన్ని అవమానాలు పొందినా ఎక్కడ ఛీత్కారాలు జరిగినా మొక్కవోని దీక్షతో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని అధిగమించిన ఆయన వ్యక్తిత్వాన్ని బాలలందరూ ముఖ్యంగా ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లలందరూ అలవరచుకోమని చెప్పే మంచి ప్రయత్నం ఈ పుస్తకం. పుస్తకంలో మూడు విషయాల్ని ఆసక్తికరంగా చెప్పారు రచయిత. అంబేడ్కర్ ఆరాధ్య దేవతలు ముగ్గురు, ఆదర్శ గురువులు ముగ్గురు, అభిరుచులు మూడు. ఆరాధ్య దేవతలంటే విద్య, స్వాభిమానం, శీలం. గురువులు బుద్ధుడు, కబీరు, పూలే. ఇష్టపడేవి పుస్తకాలు, పెయింటింగ్, బట్టలు. ఉత్తమమైన మూడు జీవన లక్ష్యాలు పెంపొందించుకునే దిశగా వాటిని జీవన నైపుణ్యాలుగా ఎలా మలచుకోవాలో చక్కగా చెప్పారు. ఇదేదో జీవిత కథలా కాకుండా విద్యార్థులకవసరమైన చదువుకు మార్గదర్శకంగా ఉండేలా రాశారు. ఆనాడు అంబేడ్కర్ ఎదుర్కొన్న అడ్డంకులు ఆటంకాలు తెలిపే రీతిలో దీన్ని కథగా మలచడం బావుంది. అంబేడ్కర్ ఎంత పుస్తక పిపాసో తెలిసిందే. కేవలం పుస్తకాల కోసం ‘రాజగృహం’ పేర ఒక భవనాన్ని కట్టారు. దేశ విదేశాల నుండి ఎనె్నన్నో పుస్తకాలు సేకరించి పెట్టారు. ఆయన చదువుకోటానికి లైబ్రరీలు ఎంత దోహదపడ్డాయో తెలపటానికి ఆయన నిర్మించిన ఈ పుస్తక భాండాగారమే నిదర్శనం. ఈ పుస్తకం ఐదుసార్లు ముద్రితమై విద్యార్థులకు చాలా చేరువైంది.

- అమృత్, 9494982274

ప్రతులకు: ఎన్ పద్మావతి 3-152, పైడిపర్రు,
తణుకు, ప.గో.జిల్లా

మనోగీతికలు

వాన బంధం
వాన
వాకిలి ముందు క్రొత్త ముగ్గేస్తోంది
చినుకు చినుకు
చుక్కలై
గాలి గీతలతో
ముగ్గు ఆనంద కెరటమై
జెండాలా రెపరెపలాడుతోంది
కనుచూపు మేరంతా
చిగురు వెలుగు
చినుకు కాగితం మీద
కాలం సంతకం చేస్తోంది
బాల్యాన్ని
వాన చిగురింప చేస్తోంది
అన్నదాత హృదయంలో
ఆనందాల తడి
అమ్మ అన్నం గినె్నలో
అన్నం పెట్టినట్టు
చినుకు
చిగురుకు గోరుముద్దలందిస్తోంది
చినుకు అందం
మట్టి అద్దంలో కనిపిస్తోంది
హృదయానికి చల్లదనం
స్పర్శ
అనుభూతి వెల్లువ వాన జాడ
అమ్మ ప్రేమలా
వాన జీవితంలో భాగమే
అమ్మలేకుండా జన్మలేదు
వాన లేకుండా ప్రకృతి లేదు
కాలానికి పచ్చని వంతెన వాన

- నల్లా నరసింహమూర్తి
కురసాల వారి వీధి,
అమలాపురం
సెల్: 92475 77501

చదువు విలువ తెలుసుకో !
చదువు విలువ తెలుసుకోండి బాలలారా !
సంస్కారం నేర్చుకోండి పిల్లలారా !
చదువుతోనే గెలుపు కావాలంది మెరుపు

అమ్మవడిలో భాష నేర్చి, బడిలో అఆలు దిద్ది
విజ్ఞులైన మలిగురువుకు శాశ్వత చిరునామా చూపి
సాగిపో, సాగిపో మున్ముందుకు సాగిపో !

విద్య లేనివాడు వింత పశువన్నది నాటి మాట
సంస్కారం లేనివాడు అసురుడే నేటిమాట
నేర్చుకో, నేర్చుకో సంస్కారం నేర్చుకో !

మాతా పితరుల ఋణం తీర్చాలి ముందు
జన్మభూమితో బంధం కావాలి పసందు
తీర్చుకో, తీర్చుకో దేశ ఋణం తీర్చుకో !

నైతిక విలువలు లేని విద్య వృథా అని తెలుసుకో
దేశమంటే మట్టి కాదు, మనుషులని తెలుసుకో
తరిమివేయ్, తరిమివేయ్, అవినీతిని తరిమివేయ్!

పరిశుభ్రతే దేముడనే సత్యాన్ని తెలుసుకో
వ్యక్తి నుండి మొదలుపెట్టి విస్తరించు శక్తిగా
వెదజల్లు... వెదజల్లు.. పరిమళాలు వెదజల్లు !

- వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు
రాజమండ్రి, 9491171327

రాక్షసులారా మారండి!
చిలిపి మాటలతో చేరదీసి
చిరునవ్వులతో రెచ్చగొట్టి
వయసు మార్పులతో మేము పడిన వేళ
మీలో రాక్షసుడు వళ్లు విరుచుకుంటాడు

మాకు కళ్లు మూసుకుపోతాయి
మా చుట్టూ ఉన్న ప్రపంచం కనబడదు
మా ‘సెల్‌ఫోన్లు’ నిలువ నివ్వవు
మా వయసు తొందరలు ఊబిలో పడేస్తాయి

జీవితం తగలబడిపోతుంటే
పరువు ప్రతిష్ఠలు నాశనమైతే
విలువైనవి కోల్పోతే
అప్పుడు తోడుంటాయి కన్నీళ్లు!

గోదావరి పరవళ్లు
ఆత్మహత్యల ఒరవళ్లు
రాక్షసులారా మారండి
రమణులను రక్షించండి

- కె ఉమ, బిఎస్సీ (ద్వితీయ)
రాజమండ్రి

రచనలకు ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం... సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు,
కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు,
పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా, మీరు రాసిన అక్షరానికి
అచ్చురూపం ఇచ్చి, ఆవిష్కరించే అద్భుత అవకాశమే ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి... నిస్తేజంగా ఉన్న భావుకతను
మేల్కొలపండి. ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

email: merupurjy@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

రుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా.

email: merupurjy@andhrabhoomi.net

నీతి కథ
english title: 
s
author: 
వీర సంతోషి జగదీశ్వరి

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>