
‘నువ్వేం చేస్తున్నావు?’ అడిగాడు భార్యను భర్త సుగుణాకర్.
‘ఏం చేస్తున్నాను. చెత్తను గోడవతల పారపోస్తున్నాను’ అన్నది శాంతంగా రాధ.
‘గొడ అవతల పారపోస్తే అది గాలి దుమారానికి ఎక్కడికి వెళుతుంది?’ అన్నాడు కోపంగా!
‘ఎక్కడికెళితే మనకేంటి! మన ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు!’ అన్నది.
‘అదే తప్పు! మన ఇల్లునే కాకుండా మన చుట్టూ పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి! ఆ మాత్రం తెలియదా! ఇంటర్ చదివావు కదా!’ అన్నాడు ఆగ్రహంగా!
‘ఇంటర్ చదివితే ఏంటి! నా ఇల్లు-నా వాళ్లు ఆరోగ్యంగా ఉంటే నాకంతే చాలు! అంతేగానీ - ఊరంతా శుభ్రత కోసం నేనెందుకు బాధపడాలి! నాకంత ఖర్మ పట్టలేదు!’ అన్నది నిష్టూరంగా!
‘నేనంటున్నది ఊరు అంతా శుభ్రం చేయమని అనటం లేదు. నీ ఇంట్లోని చెత్తా చెదారాన్ని బయట వేయకుండా ఒక చెత్తకుండీలోనైనా లేదా ఒక కాగితం డబ్బాలోనైనా పోయాల! అలా అయితే గ్రామ పంచాయతీ వాళ్ల వాహనం వచ్చినప్పుడు ఆ చెత్త వాళ్ల వాహనంలో పడవేస్తే సరిపోతుంది కదా!’ అన్నాడు నెమ్మదిగా.
‘మీరు బయట తిరిగి చూసిన ‘స్వచ్ఛ భారత్’ విషయాలు, సంగతులన్నీ చూసి నాకిలా ప్రబోధం చేస్తున్నారా! మునుపటి రోజుల్లో ఇదంతా ఎక్కడిది! ఎవరి వ్యాపకం వారికుండేది. ఊరంతా శుభ్రతకోసం ఇలా మాట్లాడేవాళ్లు, నీతులు చెప్పేవాళ్లు ఎక్కడుండేవారు! మీరంతా చోద్యం చేస్తున్నారుగానీ..’
‘రోజులు మారుతున్నాయి. ఆ విషయం నీకు తెలియదా! అప్పుడు చదువు సంధ్యలు ఎక్కువగా లేవు! ఆడవాళ్ల చదువు గురించి పట్టించుకునేవారు కాదు. ఇంట్లో నుండి బయట కాలుపెట్టేవాళ్లు కాదు! కాలం మారింది. సవ్యంగా అన్నీ మారుతున్నాయి. మనమూ మారాలి! ఆడవాళ్లు ఇంటా, బయటా స్వేచ్ఛతో తిరుగుతున్నారు. మగవాళ్లతో సమానంగా చదువుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. మగవాళ్లు కూడా చదువుకున్న భార్యలనే ఎన్నుకుంటున్నారు. అప్పటికన్నా ఇప్పుడు ఆరోగ్యరీత్యా కూడా ఎంతో ఎదిగింది దేశం-ప్రదేశం. ఇవన్నీ చూస్తూ కూడా మనం మారిపోవాలి! అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రం సమైక్యంగా ఉండేది. ఇప్పుడు నాయకులు పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది. మన తెలంగాణ కోసం ప్రధానమంత్రి ఆదేశంతో ‘స్వచ్ఛ భారత్’లోని మంచి విషయాన్ని మనం కూడా పట్టించుకుని, ఆచరించి చెత్తా చెదారం అందరం శుభ్రం చేసే పనిని మొదలుపెడితే గ్రామం అంతా పరిశుభ్రంగా మారి అందరం ఆరోగ్యమే మహాభాగ్యంగా బ్రతుకుతాం కదా!’ అన్నాడు సుదీర్ఘంగా మాట్లాడుతూ సుగుణాకర్.
‘అబ్బ.. లాయర్లా మాట్లాడి గెలిచారు శ్రీవారు! మీ మాటలన్నీవింటూంటే నిజమే అన్పిస్తుంది. నాటి అనారోగ్య సమస్యల నుంచి నేటి ఆరోగ్య విషయాలు గొప్పవి! ఆరోగ్యం కోసం ఈ చెత్తాచెదారం ఇంటా- బయటా లేకుండా చేస్తే మనచుట్టూ ప్రదేశాలు కూడా ఆరోగ్యంగా ఉండి మనమంతా ఆయుష్షు పెంచుకునే వీలుంటుంది. మీరు చెప్పింది నిజమే’ అన్నది ఆనందంగా రాధ.
‘నాన్నా! అమ్మ మొద్దు బుర్రను శుద్ధి చేశారు. మీరు అమ్మను ఇంత బాగా మార్చినందుకు అభినందనలు నాన్నా’! అన్నది వాళ్ల అపురూప ముద్దుబిడ్డ పదహారేళ్ల సరళ!
‘నువ్వు ఇంత తొందరగా శుభ్రం అవుతావని కలలో అనుకోలేదు. వెరీగుడ్ రాధా!’ అన్నాడు సుగుణాకర్.
- నమిలికొండ జగన్మాధవరావు
బోయిన్పల్లి
చిన్న కథ
వివేకవంతుడు
అనగనగా ఒక ఊరిలో మోక్ష, సిద్ధు అనే ఇద్దరు బాలురు ఉండేవారు. వీరిలో మోక్ష పెద్దవాడు కాగా సిద్ధు చిన్నవాడు. మోక్ష చదువులోను, ఆటపాటల్లోను ముందుండేవాడు. దీంతో అతనిని స్కూల్లో ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు, బంధువులు బాగా మెచ్చుకునేవారు. చిన్నవాడు సిద్ధు తెలివి తక్కువగా వ్యవహరించేవాడు. బద్ధకంగా ఉండేవాడు. వాడిని ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఒక రోజు వాళ్ల బంధువులు వచ్చి పెళ్లికి రమ్మనమని పిలిచారు. ఆ పెళ్లికి తల్లిదండ్రులతో కలిసి మోక్ష, సిద్ధు ఇద్దరూ బయలుదేరారు. అక్కడ మోక్షను అందరూ పలుకరించే వారు. ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్లు కూడా వచ్చి మోక్ష నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చావట కదా, ఆటల పోటీల్లో ఫస్ట్ వచ్చావట, అని ఒకరి తరువాత ఒకరు బంధువులందరూ పలుకరించే వారు. సిద్ధు తనను కూడా పలుకరిస్తారని వారందరికీ ఎదురుగా నిలబడి ఉండేవాడు. వాడిని ఎవరూ పట్టించుకునే వారు కాదు. పలుకరించే వారూ కాదు. అప్పుడు సిద్ధు తనను ఎవరూ పలుకరించలేదని, పట్టించుకోలేదని వాళ్ల అమ్మ వద్ద బాధపడ్డాడు. అప్పుడు వాళ్ల అమ్మ సిద్ధూని దగ్గరకు తీసుకుని, నువ్వు కూడా నాన్నా బాగా చదువుకోవాలి. మనకు డబ్బు ఎంత ముఖ్యమో చదువు కూడా అంతే ముఖ్యమని చెప్పింది. చదువుకుంటేనే దేశంలో అందరూ గౌరవిస్తారని, మనల్ని పట్టించుకుంటారని తెలిపింది.
మనకు ఉన్నదాంట్లో కొంత తోటి వారికి సహాయ పడాలి, పెద్దవాళ్లు ఎవరు కనిపించినా నమస్కరించి వినయంగా మాట్లాడటం నేర్చుకోవాలి, నీకంటె చిన్న పిల్లలకు నీవంతు సహాయం చేయాలి, తోటి వారికి ఉపకరించే పనులు చేయాలి ఇలా ఎన్నో మంచి మాటలు చెప్పింది. అప్పటి నుండి సిద్ధూలో మార్పు వచ్చింది.
శ్రద్ధగా చదువుకోవడం మొదలు పెట్టాడు. తోటి వారికి పుస్తకాలు లేకపోతే వారికి సాయం చేయడం, అలాగే చిన్న పిల్లలకు పెన్నులు, పెన్సిళ్లు, చిన్న చిన్న సాయం చేస్తూంటే వాళ్లందరూ థాంక్స్ అని చెబుతుంటే సిద్ధు చాలా ఆనంద పడేవాడు.
ఒకరోజు ముసలి తాత రోడ్డు దాటలేక పోతే చెయ్యి పట్టుకుని రోడ్డు దాటించాడు. అప్పుడు తాత చాలా థాంక్స్ బాబూ! నూరేళ్లు వర్ధిల్లాలి అని దీవించాడు. అప్పుడు సిద్ధు చాలా ఆనంద పడ్డాడు. ఇలా చిన్నప్పుటి నుండి సిద్ధూ మంచి పనులు చేస్తూ వచ్చాడు. పెద్దయ్యాక మంచి ఉద్యోగం చేస్తూ గొప్ప వివేకవంతుడయ్యాడు.
- జగదీశ్వరి
మనోగీతికలు
నిజం గొంతు విప్పితే..!
ఎగిరే పక్షుల స్వేచ్ఛాగీతంలో
వాస్తవ బింబాల సోదా!
అపశృతులు పలుకుతున్నాయంటూ
కత్తులతో మూసేస్తున్న
నిజం గొంతు తలుపులు!
మందిర-మసీదు నిర్మాణాల్లో
చేతులెత్తిన మనుష్యులే
వర్గ ఆయుధాలపై రచించుకుంటున్న
కృత్రిమ నిజాల ఆర్తనాదాలు!
నిజం ఇప్పుడు..
ఏ గుండె గొంతులోంచి
పెల్లుబుకుతుందో చెప్పటం కష్టం!
నిజం ఇప్పుడు..
ఏ రెండు సరిహద్దులపై
ప్రయాణిస్తుందో తేల్చటం కష్టమే!
నిజం ఇప్పుడు..
ఏ రాత్రి నీడన
అబద్ధపు ముసుగేసుకొని
కూర్చుందో.. కనిపెట్టడం మహాకష్టం!
రంగు వెలసిన చరిత్ర శిథిలాల్లో
మూలుగుతున్న నిజాల నీడల్ని
జైలు గోడల్లో పాడిపెడ్తున్న రణతంత్రాలు!
నిజం మాట్లాడేవాడు
కానీకి కొరకాని రోజులు ఇప్పుడు!
నిజం మాట్లాడమంటే
నిప్పుల స్నానం ఆచరించినట్లే..
నిజం మాట్లాడుతుంటే..
దూసుకొస్తున్న యుద్ధ తూటాల చప్పుడు!
నిజం గొంతు విప్పితే..
మిగిలేది వఠ్ఠిబో(తో)లు దేహాలే!!
బి.కళాగోపాల్
నిజామాబాద్, 9441631029
స్నేహమా
స్నేహం అనేది
రెండక్షరాల రూపమది
రెండు ఎదల స్వరూపమది
నిర్వచనానికి అందనిది
నిరాశ జీవి పెన్నిధి
ప్రాణం కన్నా తీయనిది
ప్రాణానికి ప్రాణం ఇచ్చేది
మల్లెకన్నా చల్లనిది
మకరందం మదిలో చల్లేది
వెనె్నలకన్నా హాయి అది
మనసును మైమరపించునది
బాధలను తొలగించునది
ఇరువురి నొకటిగ కలుపునది
మనసులు ఒకటిగ కలుపునది
ఆశాజీవికి అందనిది
మోసానికది దూరమిది
సంఘంలోనే తీయనిది
సృష్టిలోనే మాయనిది
మమకారాన్ని పంచునది
మానవత్వాన్ని పెంచునది
కామిడి సతీష్ రెడ్డి
పరకాల
సెల్.నం.9848445134
పల్లె జ్ఞాపకం
పండక్కి మా పల్లెటూరికెళ్లే
దీపావళి పండుగ టపాసుల
మోతల్లోనే కనిపించింది..
నీడనిచ్చే తల్లి మా ఊడలమర్రి
చింతలు తీర్చే మా చింత చెట్టు..
చల్లని చూపుల మా అమ్మ వేపచెట్టు..
ఆ జాడలేదు..
నేను సిర్రగోనె ఆడిన ఆ నీడ లేదు
ఊరవతల కొండ
మా గుండెనిండా అండదండై
మా వెన్నంటి ఉండేది..
నేను దొంగాపోలీస్ ఆడిన
ఆ కొండ దొంగల పాలయింది..
సాయంత్రమైతే వెనె్నల వెలుగుల్లో
గోటి బిళ్ళా, తొక్కుడు బిళ్ళా..
అన్నీ కల్లలే!
బుల్లితెర అందమైన బాల్యాన్ని
బురిడీ కొట్టించింది..
నేడు కులవృత్తుల తళుక్కులు లేవు
ఆప్యాయతల పలుకులు లేవు
నా పల్లెతల్లి
ఒకప్పటి అందమైన జ్ఞాపకం మాత్రమే
మనుషులు మనసు నిండా
అమావాస్య నింపుకొని
టపాసుల మోతల్లో దీపావళి వేగుగ
చూస్తున్నారు..
- తాళ్ల భిక్షపతి
హుజూరాబాద్
సెల్.నం.8008099080
పుస్తక సమీక్ష
విరహం చిలికిన
‘ప్రేమించే హృదయం!’
ప్రేమించే హృదయం
(దీర్ఘకవిత),
వెల:100/-
ప్రతులకు:
ఇంటి నెంబర్:11-27-166,
కొత్తవాడ, వరంగల్.
సెల్ నెం. : 9885314335.
ప్రేమ జీవితంలో ముఖ్యమైనది, జీవితాన్ని నిత్య చైతన్యపరిచే దివ్యౌషధం. మనం ప్రేమను పరస్పరానురాగంగా ఇతరులకు పంచగలిగితేనే సంతృప్తివుంటుంది. యువతీ,యువకులు, తల్లితండ్రులు, భార్యాభర్తలు, స్నేహితులది ప్రేమ కావచ్చు, కాని ప్రేయసీ-ప్రియుల ప్రేమలే ప్రత్యేకం. ప్రేమను చచ్చి సాధించేకన్నా, బతికి సాధించుకోవాలన్న ధ్యేయంతో ప్రేమించే హృదయంగా రచయిత కవిత్వాన్ని రాసినట్లు స్పస్టమవుతోంది. ప్రేమానుభూతి, భావ కవిత్వాలకు చిరునామాలుగా దేవులపల్లి కృష్ణశాస్ర్తీ, డా.సినారె, దాశరథి, ఆత్రేయలతోపాటు, ఈ ప్రాంతంలో డా. కలువకుంట రామక్రిష్ణ, సబ్బని లక్ష్మీనారాయణలు నిలిచి, ప్రేమ కవిత్వాన్ని రమణీయంగా సృజించారు. ఇంకా ఇలా ఎందరెందరో కవులు వున్నారు. ప్రేమ విషయంలోకి వెడితే, రాధాక్రిష్ణులు, సలీం-అనార్కలి, ఉమర్- ఖయ్యాం, దేవదాస్-పారూలు ప్రేమచరిత్రలకు ఆరాధ్యనీయులుగా నిలిచారు. తాజ్, షాజహాన్ల ప్రేమకు సాక్షిగా ప్రపంచ అద్భుత సౌధం తాజ్మహల్ ఆగ్రాలో వెలిసింది. ప్రేమ కవిత్వం రాయడమంటే ప్రేమించబడినపుడే దాని విలువ తెలుస్తుంది. అది అనుభవైక వేద్యమై వుండాలి, ప్రేమామృతంలో మునిగి తేలి, తగిన పరిణతి పొందగలిగినపుడే అది సాధ్యమవుతుంది. అట్లాంటి ప్రేమించే ప్రేమను స్ఫూర్తిగా ప్రధాన వస్తువుగా తీసుకుని వరంగల్కు చెందిన యువకవి జి.రాజేంప్రసాద్ దీర్ఘకవిత్వం రాశారు.
ఈకవిత్వం చదువుతుంటే, ఏదో మధురోహల్లో తేలియాడినట్లుంటుంది. ఇందులో ప్రేమను సఫలీకృతంగా, కొంత విరహవేదనగా రెండు రకాలుగా చూపించారు. ప్రేమించే వారికే ప్రేమ విలువ తెలుస్తుందని, ప్రేమించే హృదయం వున్న ప్రతివారికి తెలుస్తుందని రచయిత విశ్వాసం. ప్రేమను పాజిటివ్గా చాలా వరకు చూపించినా, అక్కడక్కడ విరహంగా చూపించి, కవితలల్లి పాఠకులను ఆశ్చర్యాలకు గురిచేస్తారు. సంగీత దర్శకుడు చక్రితో ఇటీవల ఈపుస్తకాన్ని రచయిత ఆవిష్కరించి, పలువురి ప్రశంసలందుకున్నారు. ప్రేయసీ కోసం, మేఘాలతో సందేశం పంపిస్తున్నా/ నాచెలికి ఎండపడి కందిపోకుండా కాపాడమని/ ఆఫీస్ గదుల్లో అలసిపోకుండా చూడమని/ఏసీలతో విన్నవించుకుంటున్నానని ప్రియుడు కోరుకునే సందర్భాన్ని చక్కగా రచయిత కవిత్వీకరించాడు. ప్రేయసీ ప్రేమను ఇలా వర్ణించాడు. నీవు కన్నీరు కార్చితే/నాగుండె కరిగిపోతుంది/నీవు చిరునవ్వు నవ్వితే/నామనస్సు తేలిపోతుందని అంటాడు. ప్రేయసీ సౌందర్యాన్ని ఇలా వూహిస్తాడు. నీవు గగన మార్గాన పయనించడం చూస్తే / రంభ, ఊర్వశి, మేనకలను గెంటివేస్తుంది దేవలోకం..అంటాడు. నీ నీడను తాకినా చాలు ఒళ్ళంత పులకింత, ఏదో పులకింత / నీ వోర చూపు సోకినా ఎదలో ఏదో గిలిగింత అని తను ప్రేమించే ప్రేయసి కోసం కలలు గంటాడు. ప్రేయసి కోసం విరహవేదన్ని ఉలి పట్టిన శిల్పిలా చెక్కుతాడు.
వెల కట్టలేనిది బహుమతి ప్రేమ/ సృష్టిలో మొదలు ప్రేమ/ముల్లోకాలూ మునిగినా నశించనిది ప్రేమ అంటూ ప్రేమకున్న విలువను మహోన్నతంగా చాటిచెప్పాడు. ప్రేయసి కనబడితే ఎలా వుంటుందో భావగర్భితంగా చెప్పాడు. ప్రేమను వర్ణించే దృశ్యకావ్యంగా చెప్పినా, విరహాన్ని కూడా చక్కగా పండించాడు. విరహంలో కూడా ప్రేమించే హృదయాన్ని తాకడానికేమో. కవి రాజేంద్రప్రసాద్ గారికి కవిత్వంలో ఇప్పుడిప్పుడే ప్రవేశం వున్నట్లుంది, మరికొంత సవరించి, కొంత చిక్కగా, తప్పులు లేకుండా వుండి వుంటే ఈ పుస్తకం మరింతగా శోభించేది.
- ఎస్.నాగేంద్రశర్మ, 9441797650
రచనలకు ఆహ్వానం
నవ, యువ, ఔత్సాహిక రచయితలూ ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం... సమాజానికి కావాలి మణిదీపం...!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు,
పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా, మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి, ఆవిష్కరించే అద్భుత అవకాశమే ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి... నిస్తేజంగా ఉన్న భావుకతను
మేల్కొలపండి. ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.
ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్కు పంపండి.
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్.