Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

నారాయణపూర్ రిజర్వాయర్‌కు ఎల్లంపల్లి నీరివ్వండి

$
0
0

గంగాధర, ఆగస్టు 11: మెట్ట ప్రాంతమైన గంగాధర, రామడుగు, కొడిమ్యాల, మల్యా ల మండలాల్లోని పంట పొలాలకు సాగు నీరందించే నారాయణపూర్ రిజర్వాయర్‌కు ఎల్లంపల్లి నీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు శనివారం గంగాధరలో పెద్దఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. గంగాధర చౌరస్తాలోని కరీంనగర్- జగిత్యాల ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు. దీంతో ఆ రహదారిపై సుమారు గంటపాటు ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయి, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నాయకులు, కార్యకర్తలను రోడ్డు మీది నుం చి తరలించి, రాకపోకలను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య, పీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం, మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఎల్లంపల్లి రిజర్వాయర్‌లో నిండా నీరున్నా చొప్పదండి నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతాలకు సాగునీరందించటంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఎంపీలు పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించా రు. నారాయణపూర్ రిజర్వాయర్‌కు నీటిని పంపింగ్ చేయటం ద్వారా ప్రస్తుతం నార్లు పోసి నీటి కోసం చూస్తున్న రైతాంగానికి ఎంతో ఉపశమనం కలుగుతుందన్నారు. వెంటనే రిజర్వాయర్‌కి నీటి పంపింగ్ ప్రారంభించక పోతే రైతాంగంచే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. కాంగ్రెస్ మండలాల అధ్యక్షులు రా మిడి రాజిరెడ్డి, అనుమండ్ల రుఘు, రాజేశ్వర్‌రెడ్డి, మల్యాల ఎంపీపీ శ్రీలత, జడ్పీ టీసీ శోభారాణి, వివిధ మండలాల నేతలు కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే
* కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి మహేందర్‌రెడ్డి
ముస్తాబాద్, ఆగస్టు 11: కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలేనని కాంగ్రెస్ నియోజక ఇన్‌చార్జీ కేకే.మహేందర్‌రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దొమ్మాట నర్సయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆరూ పేరుకే రైతు పక్షపాతి అని, చెప్తున్న దానికి చేస్తున్న దానికి ఎక్కడ పొంతన ఉండటం లేదన్నారు. పంటరుణాల మాఫీ బ్యాంకుల్లో క్లియర్ కాలేదన్నారు. విత్తనాలు, మందుల కంపెనీలు కేసీఆర్ బంధువులవే కావడంతో నకిలీ విత్తనాల విక్రయాల వ్యవహారంపై పీడీ యాక్ట్ అమలవడం లేదని, బతుకమ్మ చీరల వ్యవహారంలో 150 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగిందని, ఇసుక అక్రమ రవాణాతో కోట్లు కూడబెడ్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు, టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పి, కాంగ్రెస్‌కు పట్టం కడ్తారన్నారు. కార్యక్రమంలో నాయకులు బండారు బాల్‌రెడ్డి, గౌస్, సద్ది లక్ష్మారెడ్డి, కే.శ్రీనివాస్‌గౌడ్, జే.లచ్చిరెడ్డి , తదితరులు పాల్గొన్నారు.


15న వస్తున్న ‘గీత గోవిందం’

$
0
0

‘అర్జున్‌రెడ్డి’ చిత్రంతో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ హీరోగా జిఏ 2 పిక్చర్స్ బ్యానర్‌లో చేస్తున్న చిత్రం ‘గీతగోవిందం’. ఈ చిత్రంలో ఛలో హీరోయిన్ రష్మిక మందాన్న గీత పాత్రలో నటిస్తున్నారు. గీతాఆర్ట్స్‌లో ‘శ్రీరస్తుశుభమస్తు’ లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో విజయం సాధించిన పరశురాం (బుజ్జి) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాణంలో అల్లుఅరవింద్‌గారి సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు అల్లుఅరవింద్ మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందంలో మొదటి సాంగ్ ‘ఇంకేం ఇంకేం కావాలే..’ని విడుదల చేసినప్పడు ఎంతో రెస్పాన్స్ లభించింది. గోపీసుందర్ అద్భుతమైన మెలోడియస్ సాంగ్స్ అందించారు. సిడ్ శ్రీరామ్ ఈ అద్భుతమైన పాటను ఆలపించారు. అనంత శ్రీరామ్ అందమైన పదాలతో ఈ పాటను రచించారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పరశురాం మంచి టేస్ట్‌వున్న దర్శకుడు. హీరోయిన్ రష్మిక పాత్ర పేరు గీత.. ఈ చిత్రం తరువాత తనని గీత అని పిలుస్తారు అంత బాగా నటించింది. ఈనెల 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అని అన్నారు. దర్శకుడు పరుశురామ్ (బుజ్జి) మాట్లాడుతూ.. గీత గోవిందం చిత్రాన్ని రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. అల్లుఅరవింద్‌గారి బ్లెస్సింగ్స్‌తో బన్నీ వాసు సపోర్ట్‌తోఈ చిత్రం చాలాబాగా వచ్చింది. టాలీవుడ్ లేటెస్ట్ సెనే్సషన్ స్టార్ విజయ్ దేవరకొండ గోవిందంగా అందర్నీ అలరిస్తాడు. రష్మిక తన పాత్రలో పరకాయప్రవేశం చేసింది అన్నారు.

సప్తగిరి ‘గజదొంగ’

$
0
0

‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’, ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని, మార్కెట్‌ని సొంతం చేసుకున్నారు టాప్ కమెడియన్ సప్తగిరి. ఆయన హీరోగా ‘గజదొంగ’ పేరుతో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందనుంది. నంద నందనా ప్రాజెక్ట్స్ పతాకంపై శర్మ చుక్కా, యెడల నరేంద్ర, జి.వి.ఎన్.రెడ్డి చిత్రాన్ని నిర్మించనున్నారు. గీతాఆర్ట్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థల్లో దర్శకత్వశాఖలో పనిచేసిన డి.రామకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలు శర్మ చుక్కా, యెడల నరేంద్ర, జి.వి.ఎన్.రెడ్డి మాట్లాడుతూ- ‘‘సప్తగిరికి యాప్ట్ సబ్జెక్ట్ ఇది. సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి. మహానటుడు ఎన్టీఆర్ నటించిన ‘గజదొంగ’కూ, దీనికీ సంబంధం లేదు. ఇందులో సప్తగిరిది దొంగలకు దొంగలాంటి పాత్ర. అసలుసిసలు దొంగల్ని దోచుకుని సమాజానికి ఉపయోగపడే దొంగగా కనిపించనున్నాడు. విలేజ్, టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఆగస్టు తొలి వారంలో చిత్రీకరణ మొదలుపెడతాం’’అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రవీణ్ వనమాలి, సంగీతం: బుల్గానిన్, ఆర్ట్: వర్మ, మూలకథ-రచనా సహకారం: జి.టి.ఆర్.మహేంద్ర, పి.వి.సతీష్, లైన్ ప్రొడ్యూసర్: ఆర్.వి.వి.వి.ప్రసాద్, నిర్మాతలు: శర్మ చుక్కా, యెడల నరేంద్ర,రి జి.వి.ఎన్.రెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: డి.రామకృష్ణ.

24న ‘అంతకుమించి’ విడుదల

$
0
0

ఎస్‌జై ఫిలిమ్స్ పతాకంపై యు అండ్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పించు చిత్రం ‘అంతకుమించి’, జై, రష్మీ గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 24న విడుదలవుతోంది. చిత్ర విశేషాలను దర్శకుడు జానీ వివరిస్తూ.. ‘‘మా సినిమా ట్రైలర్‌ను సుకుమార్‌గారు విడుదల చేశారు.. మంచి రెస్పాన్స్ వచ్చింది. రష్మీ చాలా బాగా నటించారు. తనే ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. హీరో జై కొత్తవాడు అయినా ఎక్కడా ఆ ఫీల్ కలగదు. అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. మ్యూజిక్, కెమెరా..వర్క్‌ఔట్ అయితే సినిమా వర్క్ ఔట్ అవుతుందని చెప్పాను వారిద్దరూ అదే పాలో అయ్యి అద్భుతంగా ఇచ్చారు. ఇది నా డెబ్యూ. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. హీరో జై మాట్లాడుతూ.. ‘సినిమా లాస్ట్ టూ రీల్స్‌లో ఆడియన్స్ కచ్చితంగా భయపడతారు. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో టైటిల్ పడుతుంది. అంతకు మించి అని అప్పుడు అర్ధం అవుతుంది. ఈ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అని. రష్మీ అల్టిమేట్ పెర్ఫామెన్స్‌తో సినిమాకు ప్రాణం పోశారు. మా సహ నిర్మాతలు భాను, కన్నాలు నాకు ఎంతగానో సహకరించారు. అందుకే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. ఖచ్చితంగా అందరికీ నచ్చి తీరుతుంది’ అని అన్నారు. హీరోయిన్ రష్మీ మాట్లాడుతూ.. ‘అందరి ఎఫర్ట్ ఈ అంతకుమించి సినిమా. చాలా ఎంజాయ్ చేసి కష్టపడి పనిచేసాము. నిర్మాతల ముఖాల్లో స్మైల్ కనపడితే తృప్తిగా ఉంటుంది. అదే ఈ చిత్ర నిర్మాతల్లో నేను చూశాను. హీరో కమ్ ప్రొడ్యూసర్ జై మంచి నటుడే కాదు మంచి టెక్నికల్ నాలెడ్జి కూడా ఉంది. ఈ చిత్రం ఎక్కువగా నైట్ షూట్స్ చేశాము. ఇందులో నేను డూప్ లేకుండా స్టంట్స్ కూడా చేశాను. సినిమా హారర్ థ్రిల్లర్ గనుక అందరికీ నచ్చి తీరుతుందని భావిస్తున్నా’ అన్నారు. జై, రష్మీగౌతమ్, అజయ్ ఘోష్, టిఎన్‌ఆర్, మధునందన్, హర్ష, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: మోహన్ చందా, సినిమాటోగ్రఫీ: పి.బాలిరెడ్డి, ఎడిటర్: క్రాంతి (ఆర్‌కె), సంగీతం: సునీల్ కశ్యప్, ఆర్ట్: నాగు, కొరియోగ్రాఫర్: సుధీర్‌కుమార్, ఫైట్స్ (రామ్ సుంకర), కో-డైరెక్టర్: ఎ.మధుసూధనరెడ్డి, సంపత్ రుద్రారపు, ఇనుముల ఉమామహేశ్వరరావు, కో-ప్రొడ్యూసర్స్: భానుప్రకాష్ తేళ్ల, కన్నా తిరుమనాథం, నిర్మాత: సతీష్, ఎ.పద్మనాభరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జానీ.

సెన్సార్‌లో త్రినేత్రి

$
0
0

ఎడవెల్లి రాంరెడ్డి సమర్పణలో లక్షిత ఆర్ట్స్ పతాకంపై తిరుపతి కె.వర్మ దర్శకత్వంలో ఎడవెల్లి వెంకట్‌రెడ్డి మరియు కాచిడి గోపాల్‌రెడ్డి నిర్మాతలుగా నిర్మిస్తున్న చిత్రం త్రినేత్రి. మేఘన, ఆరోహి, వృశాలి ముఖ్య తారాగణంతో పోసాని కృష్ణమురళి కీలక పాత్రలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని సెన్సార్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా నిర్మాతలు ఎడవెల్లి వెంకట్‌రెడ్డి, కాచిడి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘లక్షిత ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న మొదటి చిత్రం ఇది. ఈ చిత్రానికి త్రినేత్రి అనే పవర్‌ఫుల్ టైటిల్ పెట్టాం. మా సినిమాలో పోసాని కృష్ణమురళి చేయటం మా అదృష్టం. వారికి మరియు ఇతర నటీనటులకి మా కృతజ్ఞతలు. పోసానిగారు మా సినిమా కథ విని కథ చాలా బాగుంది అని ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది అని అన్నారు. సినిమా షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్, వరంగల్, మంచిర్యాల, కరీంనగర్ వంటి వాస్తవిక లొకేషన్‌లో షూటింగ్ చేశాం. ఈ సినిమా ట్రైలర్‌ను సోషల్ మీడియా విడుదలచేసాం’ అని తెలిపారు. ఎడవెల్లి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘్ఫస్ట్ కాపీ కొంతమంది ప్రముఖులు చూసి ఆడవాళ్లపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై మంచి సినిమా వచ్చింది అని అభినందించారు’అని తెలిపారు. దర్శకుడు తిరుపతి కె.వర్మ మాట్లాడుతూ.. ‘ఇది ఆడవారికి సంబంధించిన సినిమా. ప్రతిఒక్క మహిళా చూడతగ్గ సినిమా. ఇవాళ సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న యదార్థ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా. ఆడవాళ్లు తిరగబడితే ఎలా ఉంటుంది అన్నదే ఈ సినిమా కథ. మా త్రినేత్రి సినిమా అందరినీ అలరిస్తుంది. పోసాని కృష్ణమురళిగారు కీలక పాత్రలో చేస్తున్నారు. వారి పాత్ర ఈ సినిమాకి హైలైట్‌గా ఉంటుంది. ఈ సినిమా ట్రైలర్‌ను సోషల్ మీడియాకు విడుదల చేయటం జరిగింది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలి అని కోరుకుంటున్నాం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వి.వి.ఎస్.చారి, మ్యూజిక్ డైరెక్టర్: జయంత్, పాటలు: అడ్డిచర్లసాగర్, మండిగం రాము, ఎం.శ్రావణ్, మాటలు: హర్ష, అడ్డిచర్ల సాగర్, నాగేంద్ర బొలిషెట్టి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరుపతి కె.వర్మ.

సెట్స్‌పైకి భీష్మ?

$
0
0

నితిన్ హీరోగా ఛలో దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘ భీష్మ’ అనే చిత్రం త్వరలో తెరకెక్కటానికి రంగం సిద్ధమవుతోంది. కాగా, ఈ చిత్రానికి ‘సింగిల్ ఫరెవర్’ అనేది ఉపశీర్షిక. ఛలో’ మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా వెంకీ ఎంటర్‌టైనింగ్‌గా మలచనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే వెంకీ ఫుల్ స్క్రిప్ట్ పూర్తిచేశారట. ఈ నెలాఖర్లో ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. నితిన్ శ్రీనివాస కళ్యాణంతో బిజీగా ఉండటం కారణంగా ఆలస్యం అయిందని తెలుస్తోంది. శ్రీనివాసకళ్యాణం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దాంతో నితిన్ ఈనెలాఖరుకల్లా పూర్తిగా భీష్మ చిత్రానికి అందుబాటులో ఉండనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన హన్సిక హీరోయిన్‌గా నటిస్తోంది.

ప్రగతికి బాట మానవత్వమే

$
0
0

మానవ విజ్ఞానం విద్యుత్ వేగంతో విజృంభిస్తున్నది. భౌతికపరంగా మానవుని జీవన విధానం అనేక మార్పులకులోనైంది. కానీ ఆధ్యాత్మికంగా మానవుడు తన ఆలోచనంతా పరమాత్మ సృష్టిమీదే ఉంచాడు. సిద్ధాంతాలకు అతీతంగా సనాతన ఆధ్యాత్మిక చింతన సాహిత్యాన్ని కళలను తనతరాలుగా విభిన్నమైన పద్ధతి రూపములో ప్రభావితం చేస్తున్నది.
భారతీ య ఆధ్యాత్మిక సంస్కృతి చాలా పటిష్టమైంది. ఆలోచనలు అనంతమైనా, మతము, భాష, వేషధారణ, ఆహారపు అలవాట్లు, పండుగలు, విద్య, సాహిత్యం, కళలు, ఆచారాలు, సంప్రదాయాలు వేరు వేరుగా వున్నా ఆధ్యాత్మిక సంస్కృతి మారదు. భిన్నత్వం భారతీయ సంస్కృతి భౌతిక స్వరూప లక్షణం. సంగీతం, సాహిత్యం, శిల్పకళ, చిత్ర కళలను మానవుడు నేర్చుకుని తన ప్రత్యేకతను నిరూపించుకున్నాడు.
మానవ సంస్కృతి మానవ జాతి విశిష్టతను ఉన్నత స్థితినీ వేదముల పట్ల మానవ అభిరుచిని ప్రదర్శిస్తుంది. ఆర్యుల చరిత్ర ఆధారంగా నాటి నుంచి నేటి వరకు వేద సాహిత్యం ద్వారానే మనిషి పురోగతిని సాధిస్తున్నాడు.
మానవ ప్రాశస్త్యము పెరగడానికి కారణం అన్ని మతాలకు, శాఖలకు ప్రతిపాదనలకు వేద సాహిత్యమే ప్రధాన కారకం. వేదాలు మానవుని నిగూఢ ఆత్మశక్తిని ప్రేరేపించాయి.
నిరాడంబర జీవనము, శాంతియుత సహజీవనము, స్నేహము, సహకారము మానవుని ప్రాధాన్యతను పెంచాయి. జ్ఞానసముపార్జనలో మానవుని లోని ఆంతరంగిక శక్తి అతని జీవన విధానానే్న మార్చివేసింది. వ్యక్తి శ్రేయస్సుతో సంఘ శ్రేయస్సు ముడిపడి విశ్వమానవ కల్యాణానికి దారి తీసింది.
మానవ శ్రేయస్సు పురుషార్థాలతో ముడిపడి ఉంది. ధర్మము, అర్ధము, కామము, మోక్షము పురుషార్థాలు. బ్రహ్మచర్యంతో విద్యను అభ్యసించాలి. వివాహం ద్వారా గృహస్థాశ్రమంలో అడుగుపెడతారు. తనపై ఆధారపడిన వారిని పోషించడానికి ధనాన్ని న్యాయంగా సంపాదించాలి. కుటుంబ అవసరాలతో పాటు తన కోరికలను ఈ ఆశ్రమంలోనే తీర్చుకుంటూ జీవనం సాగిస్తాడు. ధర్మఅర్ధకామాలనే మూడు పురుషార్ధాలు మానవుని సాంఘిన జీవనానికి సంబంధించినవి. మోక్షం మాత్రం అతని వ్యక్తిగతమైంది.
ఆధునిక కాలంలో అనేక వాదాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అవి స్వార్థపరమైనవి. ఏ వాదంలో నిజమున్నదో సామాన్యులు అర్ధం చేసుకోవడం కష్టం. మానవతావాదంలేని ఏ వాదమైనా ప్రయోజనం లేని వాదంగా గుర్తించబడుతుంది. గౌతమబుద్ధుడు అష్టాంగ మార్గాలను సూచించాడు. సరియైన జ్ఞానము, వాక్కు, దృష్టి, జీవనము, క్రియ, మార్గము, ఆలోచన, ధ్యానము మొదలైన మార్గాలు మానవ జీవన క్రమశిక్షణకు ఉత్ప్రేరకాలు. సనాతన ధర్మాన్ని ఎప్పటికప్పుడు సాహిత్యంలో వివిధ రూపాలల్లో ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అవే పురాణాలుగా, ఇతిహాసాలుగా రచించబడ్డాయి. ప్రకృతి, ప్రకృతిశక్తులు మానవునికి మధ్యగల సంబంధాలను వేదాల ద్వారా మనిషి తెలుసుకొన్నాడు. వేదాంత చర్చలద్వారా ఉపనిషత్తులు రూపొందాయి. అనేక సూక్తులు సందేశాల సమాహారమే ఉపనిషత్తులు.
ఐతరేయ ఉపనిషత్తు శరీరంలోకి ఆత్మ ప్రవేశము, ప్రశ్నోపనిషత్తు స్ర్తిపురుష సంయోగము పవిత్రకార్యము, కేనోపనిషత్తు గురుశిష్య సంబంధాలను చాందోగ్యోపనిషత్తు బ్రహ్మా జ్ఞానాన్ని ఈశఓపనిషత్తు సామాజిక అవగాహన కఠోపనిషత్తు సూక్ష్మబుద్ధి తైత్తిరీయోపనిషత్తు నీతి సూత్రాలను, బ్రహ్మ దారణ్యకోపనిషత్తు అశ్వమేథంకంటే ఆత్మజ్ఞా నము గొప్పదని, ముండకోపనిషత్తు జ్ఞానమార్గము, కర్మమార్గము, మాండుక్యోపనిషత్తు ఇంద్రియ జ్ఞానము మొదలైన విషయాలను తెలియ జేస్తాయి.
మానవునికి స్నేహధర్మం బాగా తెలుసు. స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తులు ఎందరో ఉన్నారు. శ్రీరాముడు వాలిపై బాణం వేసినపుడు గానీ వాలికి తన తప్పేమిటో తెలియలేదు. వాలి మరణానంతరం శ్రీరాముడు సుగ్రీవునితో స్నేహం వల్ల సీతాదేవి జాడ తెలిసికొని రావణాసురుడిని సంహరించగలిగాడు. ఈ స్నేహం మానవాళికి ఎంతో శ్రేయోదాయకం. మానవ ధర్మాన్ని మానవత్వం రంగరించి చక్కగా నెరవేర్చడానికి మార్గదర్శిగా నిలుస్తున్నది.
దీర్ఘదృష్టి, సమయపాలన, విచక్షణ మానవునికి సరియైన జీవనం సాగిండానికి ప్రాముఖ్యతను వహిస్తాయి. మానవులను మూడు విధాలుగా వర్గీకరించారు. ప్రథములు (పూర్ణవిశిష్టతః) మధ్యములు (అత్యంత సామాన్యతః)అధములు (నికృష్టదుష్టగ్రహః) ఈ వర్గీకరణ మానవ లక్షణాలను ప్రతిబింబిస్తుంది.
మానవుడు అనేక రంగాలలో కృషి చేస్తూ తన ప్రతిభను కనబరుస్తున్నాడు. మానవుని కృషి ప్రపంచానికి తెలియ చేసే ప్రక్రియకు నాందీ వాక్యం. అనేక బోధనలు, సందేశాల ద్వారా భగవంతుడు మనిషికి సందేశాలను ఇస్తున్నాడు. వాటిని అర్ధం చేసుకొని మనిషి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మనిషి ఎప్పుడూ మానవత్వంతో చరిస్తేనే అతనికి పురోగతి ఉంటుంది. మానవత్వం మరిచి రాక్షసత్వానికి దగ్గరైతే నరుడు నారాయణుడు కాక నాకానికి వెళ్లలేక రెండు కాళ్లజంతువు వలె మారిపోతాడు. మనిషిని కూడా రెండు కాళ్ల జంతువు అనడంలో అర్థం అదే. అందుకే పరమాత్మ గురించి తెలుసుకొని పశుజన్మనుంచి పశుపతి కాగలిగితే మానవ జన్మ ధన్యం అయినట్లు అవుతుంది.
ప్రతిమనిషి కొన్న ఆశయాలను ఏర్పర్చుకుని మానవత్వంతో దివ్యత్వం వైపు అడుగులు వేయాలి. అదే మానవ జీవన ప్రగతికి ఆదర్శం అవుతుంది.

ఊహే మధురం

$
0
0

ప్రాకృతమూలం
కమలా అరా ణమలిఆ హంసా ఉడ్డావిఆ ణ అపిఉచ్ఛా!
కేణాపి గామత డాఏ అబ్భం ఉత్తాణ అం వ్యూఢమ్ (మృగాంకుడు)

సంస్కృత చ్ఛాయ
కమలాకర నమృదితా హంసా ఉడ్డాయితా నచపితృష్వసం!
కేనాపి గ్రామ తడాగే అభ్రముత్తానితం క్షిప్తమ్
తెలుగు
తే.గీ పద్మరాగములన నొప్పు పద్మ చయము
హాయిగా నున్న రాయంచ తతుల
చెలగుచున్నట్టి మనయూరి చెరువు జూడ
ఆకసమునుదించి పరచినట్టులుండె
- ఒక యువతి తన మేనత్తతో ఇలా అంటోంది. ‘‘పద్మరాగాల వంటి పద్మా లు, తెల్లని రాయంచలను మన ఊరి చెరువులో చూస్తుంటే తెల్లని మేఘాలుగల ఎర్రబారిన ఆకాశాన్ని దించి వెల్లకిలా చెరువులో నిలిపినట్లుంది కదా! అత్తా!’’ అని కవితాత్మకంగా వర్ణించింది. ఎల్లని మేఘాలు రాయంచలలాగా, పద్మాలు ఎర్రబారిన ఆకాశంలో ఉన్నాయని గాథాకారుని భావం.
వివరణ:
ఇరవై
నాలుగు గంటల ఛానల్స్ సోషల్ మీడియా లేని రోజుల్లో ప్రకృతే వారికి వినోదం, విజ్ఞానం హాయగా ప్రకృతిని పరిశీలించి, పరవ శించారు నాటి జనం. ప్రకృతి దేవుడిచ్చిన వరం. దాన్ని కాపాడుకోవడం అత్య వసరం. మంచినీటి చెరువుల్ని కాలుష్యా కాసారాలుగా మార్చకుంటే నేడు మనమూ చెరువుల్లో అందమైన పద్మాల ను చూడవచ్చు. హాయగా తిరిగేచేపలనూ వీక్షించువచ్చు. స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు. అందమైన వూహాలతో జీవితాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చు. కనుక కాలుష్య రహిత ప్రదేశాల కోసం ప్రయత్నిద్దాం పదండి.

ఇంకావుంది...


వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

$
0
0

కనుక మానవ లోక సంఘటనలు గ్రహలోకానికి ప్రతిబింబాలు. ఇది ఒక చక్రం! ఈ చక్రంలో కేవలం పూర్వ కర్మల ప్రతిబింబాలు మాత్రమేకాక, మానవుల సంకల్పబలం అనే కొత్త అంశం కూడా వచ్చి చేరింది. అందువల్ల ఈ ప్రతిబింబ చక్రం నిత్య చలనశీలంగా మారిపోయింది. ఈ సత్యాన్ని గ్రహించక, ఈనాటి వైజ్ఞానికులు భూలోక సంఘటనలకు కారణాలను భూలోకంలో మాత్రమే వెతుక్కుంటున్నారు.
అందువల్ల, అనేకచోట్ల మూలకారణాలు తెలియక ఇబ్బందిపడుతున్నారు. అయితే, ఇరవైయో శతాబ్ది ఉత్తర భాగంలోకి వచ్చేసరికి అనేకమంది నోబుల్ పురస్కార గ్రహీతలు తమ దృష్టిని మార్చుకున్నారు.
ఉదాహరణకు ఆర్థర్ ఎడింగ్‌టన్ ఒకచోట మాట్లాడుతూ,- ‘‘హైసన్‌బర్గు’’ యొక్క ‘‘ప్రిన్సిపల్ ఆఫ్ అన్‌సర్టినిటీ’’- అనిశ్చితావాద ఆవిష్కరణతో విజ్ఞానశాస్త్రం తన పరిధులనుదాటి వేదాంత మత శాస్త్రాల పరిధిలోకి ప్రవేశించింది’’- అన్నాడు.
మన సనాతన మహర్షులు ఈ ప్రతిబింబ చక్రగమనాన్ని మొదట్నించీ చాలా శ్రద్ధగా గమనించారు. అందువల్ల వారు మానవ జీవితాలలో, యుగ సంధులలోని విశిష్ట జీవుల జీవిత చరిత్రలను చెప్పేటప్పుడు, ఈ ప్రతిబింబ చక్రాన్ని దృష్టిలో వుంచుకుని మాత్రమే మాట్లాడారు. అందువల్ల వారి కథాకథన రీతి ఇటు మానవ లోకానికీ, ఆపైన గ్రహలోకానికీ, ఇంకా పైన దేవలోకానికీ- కొద్దిపాటి తేడాలతో సమన్వయిస్తూ సాగిపోతూ వుంటుంది.
అందువల్ల, ఒక రాముడి కథో, ఒక కృష్ణుడి కథో చెప్పేటప్పుడు, వాల్మీకి గానీ, వ్యాసుడు గానీ, జరగని కథ చెప్పరు.... జరిగిన దానిని మాత్రమే చెప్పి ఊరుకోరు. జరిగినది దేనికి ప్రతిబింబమో, దాన్ని కూడా దాంతో కలిపే చెబుతారు! అలా చెప్పటంలో కథ కొన్నిచోట్ల రెండంచలుగాను, కొన్నిచోట్ల మూడంచలుగానూ పెరుగుతూ వుంటుంది. ఏదైనా విశేషం వున్నచోటే ఇలాటి సూచనలు చేస్తూ వుంటారు- అన్నిచోట్లా చెయ్యరు!
ఈ గ్రహ గోళాల స్థాయి సంకేతాలు గానీ, దేవతాలోక స్థాయి సంకేతాలు గానీ, ఈనాడు మన పండితుల సంప్రదాయంలో పరిపూర్ణంగా లేవు. అనేక కారణాలవల్ల ఈ సంప్రదాయాలు తెగిపోయాయి. కొందరు మేధావులు కొన్నిచోట్ల ఆ సంకేతాలను పట్టుకుని వివరిస్తూ వుంటారు. అవే అంతరార్థాలుగా చెలామణీ అవుతూ వుంటాయి. వీటిని పూర్తిగా చెప్పలేక పోవటంవల్ల, కొంతమంది తొందరపాటుతో అంతరార్థాలే సత్యమనీ- అసలు కథ జరగనే లేదనీ, వాదన లేవదీస్తూ వుంటారు. మరి కొందరు అంతరార్థమే కల్పన అనీ, అసలు కథ సత్యమనీ వాదిస్తూ వుంటారు.
మూడు ప్రతిబింబాల చక్ర సిద్ధాంతాన్ని మనం బాగా అర్థంచేసుకుంటే, ఇలాంటి అతివాదాల జోలికి పోవలసిన అవసరం వుండదు. భూమిమీదా ఈ సంఘటన జరిగింది- దానికి కారణం గ్రహలోకంలోనూ వుంది, దేవతాలోకంలోనూ వుంది- అనే సత్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశీలిస్తే, సత్యం మరింత విస్పష్టంగా మనకు సాక్షాత్కరిస్తుంది. ఇందుకు నిదర్శనాలు మహాభారతంలో చాలా ఎక్కువగా వున్నాయి.
వ్యాసమహర్షి ఆదిపర్వం దగ్గర్నించీ, ఆనుశాసనిక పర్వంవరకూ ప్రతిపర్వంలోనూ ఈ అంశాలను ప్రస్తావిస్తూనే వచ్చారు. ప్రస్ఫుటంగా వచ్చే కొన్ని ఉదాహరణలను మాత్రం మనం యిప్పుడు పరిశీలిద్దాం. ఉదాహరణకు, మహాభారతంలో పాండవులు నివసించిన లక్కయిల్లు తగలబడిపోయిన ఘట్టం! లక్క యిల్లు తగలబడిపోయిన రోజు ఏది, పాండవులు తప్పించుకుని అడవుల్లో ప్రయాణంచేసి ‘‘ఏకచక్ర పురం’’లో బయటపడిన రోజు ఏది?- వీటిని వ్యాస భగవానుడు కొంచెం నిగూఢంగా చెబితే, తెలుగు మహాభారతంలో నన్నయ భట్టారకుడు మరింత విస్పష్టంగా చెప్పాడు.
కృష్ణపక్షే చతుర్దశ్యాం రాత్రివస్యాం పురోచనః
భవనస్య తవ ద్వారి ప్రదాస్యతి హుతాశనమ్‌॥
- అని వ్యాస భగవానుడు చెప్పాడు.
అంటే ఒకానొక మాసంయొక్క బహుళ చతుర్దశినాటి రాత్రి ఆ యింటికి నిప్పుపెట్టాలని దుర్యోధనుడు నిశ్చయం చేశాడు. కానీ అది యేమాసం? ఆ మాట వ్యాసుడు చెప్పలేదు!
పాండవులు ఏకచక్రపురంలో ఆరుమాసాలు ఉన్నాక బయటపడ్డారని నన్నయ భట్టారకుడు లెక్కచెప్పాడు. ఈ లెక్క మూలంలో లేదు. మరి ఆయన ఎలాచెప్పాడు? నన్నయకు వ్యాసుడు ఆది పర్వంలో చెప్పిన ఖగోళ రహస్యాలు తెలుసు.
ధర్మరాజు మఖానక్షత్ర ప్రభావంవల్ల జన్మించినవాడు. అర్జునుడు ఉత్తర ఫల్గుణి, భీముడు స్వాతి, నకుల సహదేవులు అశ్వినీ నక్షత్రం.
ఖగోళ దృష్టితోచూస్తే ఈ నక్షత్రాలన్నీ కూడా భాద్రపద మాసం చివరలో సూర్యుడితోపాటు ప్రయాణం చేస్తుండటంవల్ల కనిపించకుండాపోతాయి. ఆర్నెల్లు గడిచి ఫాల్గుణం చివరకు వచ్చేసరికి ఇవి సూర్యుడికి దూరమై రాత్రిపూట కంటకి కనిపిస్తాయి. ఈ నక్షత్రాలు అంతర్థానమైన రోజుల్లో పాండవులు కూడా జనానికి కనపడకుండా వుండటం- ఒక విచిత్ర విధి లీల!
*
ఇంకావుంది...
*
‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.
*
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

సర్ప రక్షకురాలు మానసాదేవి

$
0
0

త్రినేత్రుడైన పరమేశ్వరుని మానస పుత్రిక శ్రీ మాతా మానసదేవి. ఆమెను మనసారా పూజిస్తే భయంకరమైన కాల సర్ప దోషాలు కూడా తొలగిపోతాయి. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని బిల్వపర్వతంపై వెలసిన ఆమె యుగయుగాలుగా భక్తులను తన చల్లని చూపులతో సంరక్షిస్తున్నారు. ఆమె దయ వుంటే చాలు ఏమైనా సాధించవచ్చని కోట్లాదిమంది భక్తుల నమ్మకం. సర్పాలకు మానవులు తెలిసిగానీ తెలియక గానీ చేసిన పాపాలను అమ్మను స్మరిస్తేనే పోగొడుతుంది. అందుకనే కాలసర్పదోష నివరణకు ఆ మాతను ప్రార్థించాలి. అమ్మవారిని నిత్యం కొలిస్తే సకల సంపదలకు ఎటువంటి లోటు ఉండదని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి.
సర్ప రక్షకురాలు
మాతా మానసాదేవి అన్న వాసుకి. ఆమెను జరత్కారువు అనే మహర్షికిచ్చి వివాహం చేస్తారు. ఆమెకు మరో పేరు కూడా జరత్కారువు కావడం గమనార్హం. ఈ దంపతులకు అస్తీకుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. ఒక రోజున జనమేజయ రాజు సర్పయాగం ప్రారంభిస్తాడు. తన తండ్రైన పరీక్షిత్తు మహారాజును తక్షకుడు అనే నాగు చంపడంతో ఆయన ఆగ్రహం చెంది ఈ యాగం నిర్వహిస్తాడు.
ఋత్వికుల మంత్ర పఠనంతో భూమండలంమీద వున్న వేలాది నాగులు వచ్చి యాగంలో పడిపోవడం ప్రారంభించాయి. నాగులలో శ్రేష్ఠుడైన వాసుకి భీతిల్లితుండటంతో సోదరి మానసదేవి తన కుమారుడైన అస్తీకుడిని యజ్ఞం నిలిపివేసేందుకు పంపుతుంది. అస్తీకుని తల్లి నాగ స్ర్తి, తండ్రి బ్రాహ్మణ మహర్షి. ఒకే పేరుతో వున్న దంపతుల పిల్లలే యాగాన్ని నిలిపివేసేందుకు అర్హులు అని తెలియడంతో అస్తీకుడు ఆ కార్యాన్ని నెరవేర్చగలడని తల్లి భావించింది. యాగ ప్రదేశానికి వెళ్లిన అస్తీకునికి జనమేజయుడు సాదరంగా స్వాగతం పలుకుతాడు.
ఏం కావాలో కోరుకోమన్న రాజును ఆయన తక్షణమే యాగాన్ని నిలిపివేయమని విన్నవిస్తాడు. దీంతో మాటకు కట్టుబడిన జనమేజయుడు వెంటనే యాగాన్ని నిలిపివేయడంతో సర్ప సంహారం నిలిచిపోయింది. దీంతో నాగజాతి అస్తీకునికి కృతజ్ఞతలు తెలిపింది. అందరూ ఆయన తల్లి మానసాదేవి సమక్షానికి చేరుకొని నాగులను కాపాడినందుకు భక్తితో ప్రణమిల్లారు. సర్పజాతిని సంరక్షించిన మాతా మానసాదేవి అంటే నాగులకు విశిష్టమైన గౌరవం. అందుకే ఆమెను పూజిస్తే అన్ని సర్పదోషాలు తొలగిపోతాయి. సంతానలేమికి కూడా కాలసర్పదోషం కారణమని చెబుతారు. అందుకనే ఆ మాతను పూజిస్తే సంతాన ఫలం కలుగుతుంది.
బిల్వ పర్వతంపై ఆలయం
హరిద్వార్‌లోని బిల్వ పర్వతంపై అమ్మవారి ఆలయం వుంది. ఆలయాన్ని సిద్ధపీఠంగా వ్యవహరిస్తారు. సమీపంలోనే మాయాదేవి ఆలయం, చండీదేవి ఆలయాలు వున్నాయి. మూడు ఆలయాలు శక్తిపీఠాలు కావడం విశేషం. పర్వతంపై వున్న అమ్మవారి సన్నిధికి చేరుకోవాలంటే మెట్ల మార్గం ద్వారా రోప్‌వే వుంది. రోప్‌వేలో వెళ్లే సమయంలో గంగానది పరివాహక సుందర దృశ్యం మనకు అలౌకిక దివ్యానుభూతిని మిగల్చుతుంది. సన్నిధానంలో మాత మానసదేవిని సందర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో వున్న వృక్షానికి దారాలు కట్టి తమ కోరిక నెరవేర్చాలని వేడుకోవాలి. అమ్మవారి అభీష్ఠంతో కోరికలు నెరవేరిన అనంతరం తిరిగి ఆలయాన్ని దర్శించుకోవాలి.
*
మానసాదేవి ఆలయ మార్గం
- ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ పట్టణానికి దేశంలోని అన్ని ప్రాంతాలనుండి రవాణా సౌకర్యాలున్నాయి.
- డెహ్రాడూన్‌లో విమానాశ్రయముంది.
అక్కడినుంచి హరిద్వార్ 35 కి.మీ దూరం. ప్రవేటు వాహనాల ద్వారా హరిద్వార్ చేరుకోవచ్చు.
- హరిద్వార్ రైల్వేస్టేషన్ నుంచి ఆలయం 2.5 కి.మీ దూరంలో వుంది.
- రోప్‌వే ద్వారా వెళితే హిమాలయ పర్వత శ్రేణిలోని శివాలిక్ అందాలు, గంగానది ప్రవాహాన్ని వీక్షించవచ్చు.

స్వాధ్యాయ సందోహం- 68

$
0
0

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
గ్రంథ విజ్ఞానం మరియు దాని అనుష్ఠానమూ రెండూ కూడ సమానంగా ఎవడు కలిగి యుంటాడో ఆతడు గురుత్వాన్ని లేదా ఆచార్యత్వాన్ని వహించే యోగ్యుడుకాగలడు. బ్రహ్మవేత్త అయిన గురువు శిష్యుణ్ణి ముందుగా బ్రహ్మవిద్యా సంపన్నుడిగా చేస్తాడు. అందుకే మంత్ర ద్వితీయార్థంలో గురువు బ్రహ్మజ్ఞాన నేతృత్త్వం స్థాపింపబడింది.
***
చల్లని చూపు
తవ స్వాదిష్ఠాగ్నే సందృష్టి రిదా చిదహ్న ఇదా చిదక్తోః
శ్రీయే రుక్మోన రోచత ఉపాకే॥ ఋ.4-10-5.
ప్రతిపదార్థం:- అగ్నే= ఓ అగ్నే!; తవ= నీ; స్వాదిష్ఠా= ఆనందదాయకమైన; సందృష్టి ఇత్= చల్లని చూపే; అహ్న+చిత్+ఆ= దినారంభం నుండి; అక్తోః+చిత్+ఆ= రాత్రివరకు; ఇత్= కూడ! రుక్మః+న= బంగారంవలె ప్రకాశవంతమై; ఉపాకే= సన్నిహితమై! శ్రీయే= శుభదాయకంగా; రోచతే= వెలుగుతూ ఉంది.
భావం:- ఓ అగ్నీ! ఆనందప్రదాయకమైన నీ చల్లని చూపు దినారంభం నుండి రాత్రివరకు బంగారంవలె ప్రకాశవంతమై మాకు సన్నిహితమై శుభదాయకంగా వెలుగుతూ ఉంది.
వివరణ:- చూపు రెండువైపుల పదునుగల కత్తివంటిదని పెద్దలంటారు. ఆ చూపు బారినపడినవారు ఎవరైనా తీవ్రంగా నష్టపడతారు. సుందరి వాలుచూపుసోకి ఎందరో కాముకజనులు పిచ్చివాళ్లయిపోయిన గాథలెన్నో కనబడతాయి. క్రోధం వచ్చినవారి కళ్లు ఎఱ్ఱబడతాయి. ఆతడి కళ్లలోనికి చూడటమే భయాన్ని కలిగిస్తుంది. పిల్లలు తమ మనోభావాలను అన్నింటిని ప్రకటించలేరు. తల్లిని మాత్రం దీనంగా చూస్తారు. మరి ఆ బిడ్డలను చూచిన తల్లిలో ప్రేమ ఎలా ఉబుకుతుంది? అంటె బిడ్డ అమాయకపు చూపులే తల్లిలో మాతృప్రేమను వెల్లువగా ప్రవహింపజేస్తుంది.
ఇలా దృష్టి చాలా శక్తివంతమైంది. అది నవ్వేవాళ్లను ఏడిపిస్తుంది. ఏడ్చేవాళ్లను నవ్విస్తుంది. మిత్రుణ్ణి శత్రువుగా చేస్తుంది. శత్రువును ప్రాణమిత్రుడుగా చేస్తుంది. మహాపురుషుల దృష్టి అధమాధముల పాపాన్ని కూడ ప్రక్షాళితం చేయగలదని సజ్జనులెందరెందరో చెప్పే గాథలెన్నో ఉన్నాయి. సజ్జనుల దృష్టి పాప సముద్రాభిముఖంగా ప్రవహించే దుర్జనుల చిత్తనదీ ప్రవాహాన్ని పుణ్యసముద్రాభిముఖంగా మరలించి వారిని పవిత్రులుగా చేస్తుంది. దృష్టి మనోగతమైన భావాలకు దర్పణమని మనస్తత్వవేత్తలు చెబుతారు. అది నిజమే. సాధారణంగా లోకంలో ఆశాదృష్టులు, కోపిష్టి కళ్లు, కుళ్లుకళ్లు, ప్రేమకళ్లు, మత్తుకళ్లు, ఇలా వినబడే మాటలు ఈ మాటనే సత్యంచేస్తాయి. కళ్ళు భిన్నభిన్న మనోభావాలను రకరకాల భంగిమలను ప్రదర్శిస్తాయి. ఒక్క మూఢులు తప్ప జ్ఞానులు, చదువరులు అందరూ ఆ నేత్ర భంగిమల వెనుకగల మనోభిప్రాయాలను గ్రహించగలరు. ఇట్టి మనోభావాలలోని తారతమ్యాన్ని గుర్తించియే కళ్లలో కనబడే చల్లనిచూపు మహిమను ఈ మంత్రం ‘‘తవ స్వాదిష్ఠాగ్నే సం దృష్టిః’’ ఓ అగ్నీ! నీ చూపుచల్లనిది అని ప్రశంసించింది.
సన్మార్గాన్ని చూపేవాడు కళ్లు చిట్లించితే ఇది మంచి మార్గం కాదు చెడు మార్గంలో పడిపోతున్నావని హెచ్చరికకు సంకేతం. గురువుకళ్లతో అయిష్టంగా చూస్తే నేర్చిన విద్యలో తప్పు దొర్లిందని మందలింపు. మరి గురువులకే గురువయిన జగద్గురువుల వాత్సల్యదృష్టి మనపై పడకుంటే మనకు ఏ గతి పడుతుంది?
*
ఇంకావుంది...

పలా జో(ష్)

$
0
0

ఒకప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండ్ సెట్ చేసిన స్టైల్ - పలాజో. నడుము దగ్గర నుంచి పొడవుతో పాటు వెడల్పు కూడా పెరుగుతూ పాదాల వరకు ఉండే పలాజో ప్యాంట్ స్టైల్ కొత్త హంగులతో మళ్లీ ఇపుడు తెరమీదకి వచ్చేసింది. సంప్రదాయ శ్రేణిగా భావించే ధోతీకి ఇపుడు మళ్లీ ఆదరణ లభిస్తోంది. దీనికి జతగా పొట్టి టాప్, కుర్తీలను ఎంచుకోవడం మామూలే. అయితే ఇవి కుచ్చిళ్లు, అడుగున వెడల్పుగా ఉండటం ఎగుడు దిగుడు డిజైన్లతో వస్తున్నాయి ఇప్పుడు. ఇవి క్రాప్, కాప్తాన్, ఎసెమెట్రికల్ టాప్‌లకు చక్కగా నప్పుతాయి.
అమ్మాయిలు ట్రెడిషన్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో.. కొత్త ఫ్యాషన్స్‌ను అంతే ఆదరిస్తారు. నయా ట్రెండ్స్‌ను అనుసరించడంలో ఇతర దేశాల ఫ్యాషన్ ప్రియులతో సిటీ అమ్మాయిలు ఏ మాత్రం తీసిపోరు. ఇంకా చెప్పాలంటే వారికి ధీటుగా నిలబడతారు.
ఒక్క ఫ్యాషన్ రంగమనే కాదు, అన్నిట్లోనూ వారు ముందుంటున్నారు. ఒకప్పుడు ఒక్క పలాజోనే తీసుకుంటే జతగా పొట్టి కుర్తీ, ఒంటికి అతుక్కునే టాప్‌లను ఎంచుకునేవారు. ఇపుడతా తీరు మారింది. పొడవాటి కుర్తాలకు మడమ వరకూ ఉండే పలాజోని జతచేయడం ఫ్యాషన్. ఇవి వేసుకున్నపుడు కాస్త ఎత్తు తక్కువగా కనిపించినా వాటికీ ప్రాధాన్యం ఇస్తున్నారు. పలాజోలకు సరిజోడైన కుర్తీలు ధరిస్తే కళగా మెరిసిపోవడమే కాదు ఆధునికతా ఉట్టిపడటం ఖాయం.
20వ శతాబ్దంలో పుట్టిన పలాజో ట్రెండ్ భారతీయ సంప్రదాయ వస్తధ్రారణకు తోడై చాలా అందంగా కని పిస్తోంది.
స్ట్రయిట్ కట్ సల్వార్, స్టైలిష్ అనార్కలీ, సింపుల్ కాటన్ కుర్తా- ఇలా వేటిమీదకైనా పలాజో ప్యాంట్లు సరిపడతాయి. 1930లో ఫ్రెంచ్ విమెన్ ఫ్యాషన్ డిజైనర్ కోకో చానెల్ పలాజో ప్యాంట్ స్టైల్‌ను డిజైన్ చేసినప్పటినుంచి ఎంతోమంది హాలీవుడ్ స్టార్స్ ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతూ వచ్చారు. 1960కి ముందు కేవలం విశ్రాంతి సమయంలోను, సాయంత్రం పార్టీలకో, బయటికి వెళ్ళేటప్పుడు ధరిస్తుండేవారు. 1970ల్లో ఫ్యాషన్ ప్రపంచంలో ఒక సంచలనంగా నిలిచిన పలాజో స్టైల్ 1980ల్లో కనుమరుగైనా, కొత్తతరం మళ్లీ ఈ స్టైల్‌కే ఓటేశారు. అప్పటినుంచి రకరకాల హంగులతో వస్తున్న పలాజీలు ఇపుడు కొత్త కొత్త ప్రింట్స్, డిజైన్లతో మరింత కలర్‌ఫుల్‌గా కనువిందు చేస్తున్నాయి. అందంగా ఫ్యాషనబుల్‌గా ఉండడమే కాదు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. చూడడానికి బెల్‌బాటమ్ ప్యాంటులా అనిపించినప్పటికీ దీని స్టైలే సెపరేటు.

ఊహాలోకం

$
0
0

ఆలోచనల
రెక్కల తొడుక్కుని
మధుర భావ పక్షులు
అంతరంగమనే ఆకాశంలో
విహరిస్తూ
నన్ను కవ్విస్తుంటే
ఊహాలోకాల్లోకి జారిపోయా!
ఇంకేముంది
హృదయపు పూదోటలో
విచ్చుకున్న సృజన కుసుమాలు
రంగవల్లులను తలపించేలా..
హరివిల్లును మరిపించేలా
భావుకతా వర్ణాలను
ఒంటికి అద్దుకుని
అందాలను ఆరబోస్తూ
అలరింప
పదబంధాలతో
జతకట్టాయి!
మిసమిసమాడే
సొబగులతో
గుసగుసలాడేందుకు
లే మొగ్గల వోలె
సిగ్గులొలిక బోస్తూ
కాగితపు బుగ్గలను
ముద్దాడ ముచ్చట పడుతున్నాయి
అక్షర తారలై..
పున్నమి నాటి చంద్రుని
సరసన చేరి
చైతన్యపు వెలుగులను పంచేందుకు
ఆరాట పడుతున్నాయి

పల్లెకు ప్రగతి శోభ

$
0
0

ఊహల్లో పల్లె చిత్రం ముగ్ధమనోహరం. గలగల పారే ఏరు... ఏటి పక్కన ఊరు. మట్టి పరిమళాల్ని వెదజల్లే ఎర్రెర్రని రాదారి... ఆధ్యాత్మికతతో అలరించే ఆలయ జేగంటల సవ్వడి. మనోయవనికపై ఏ చిత్రకారుడో అద్భుతంగా చిత్రీకరించిన పెయింటింగ్‌లా పల్లెసీమ ఆకట్టుకుంటుంది.
వాస్తవం మాత్రం అందుకు విరుద్ధం. కనీస సౌకర్యాలకు కూడా నోచని పల్లెలెన్నో ఇప్పటికీ ఇక్కట్లతో సహజీవనం సాగిస్తున్నాయి. అయితే, ఆ పల్లె బతుకుల్ని సమూలంగా మార్చి గ్రామీణ భారతాన్ని అభ్యుదయ పథంలో నడిపించేందుకు నడుంబిగిస్తూ ప్రవాస భారతీయులెందరో సంకల్పించడం ఆహ్వానించదగ్గ శుభ పరిణామం. ఆ దిశలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న రేవతి మెట్టుకూరు ఒకరు.
ప్రవాస భారతీయురాలైన రేవతి రెండు గ్రామాల్ని దత్తత తీసుకుని తాను స్థాపించిన ‘మనస్వ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్’(ఎంఐఎఫ్) ద్వారా అనేకానేక అభివృద్ధి కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌కి దగ్గర్లోని మొయినాబాద్ మండలం బాకారం గ్రామంలో 2017లో స్వయంగా కొన్ని ప్రగతి పనుల్ని చేపట్టిన రేవతి... ఇటీవల సురంగల్ గ్రామాన్ని కూడా లక్ష్యం చేసుకున్నారు. ఈ రెండు గ్రామాల్లోనూ ప్రజలకు సౌకర్యం కలిగించే వివిధ పనులకు శ్రీకారం చుట్టారు.
జీవన నేపథ్యం
రేవతి మెట్టుకూరు 2005లో ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలో పిజి చేసారు. వెనువెంటనే ఐటీ సంస్థలో చేరారు. ఆ సంస్థలో చేరిన అయిదేళ్ల స్వల్పవ్యవధిలోనే సీనియర్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. అనంతరం ఐటీ సంస్థనుంచి బయటకి వచ్చిన రేవతి అమెరికాలోనే మరో మూడు ప్రముఖ ఐటి సంస్థల్లో పని చేసారు. వృత్తిరీత్యా ఎంత ఎదిగినా ఆమెకి సంతృప్తి కలగలేదు. కారణం-తండ్రి బాల్‌రెడ్డినుంచి వారసత్వంగా వచ్చిన సేవాదృక్పథం తన చుట్టూ ఉన్న సమాజానికి ఇతోధికంగా ఏదో చేయాలనే తపన ఆమెని నిలువనీయలేదు. చిన్నతనంలో ఓసారి తన స్నేహితురాలు స్కూల్ ఫీజు కట్టలేని స్థితిలో ఉంటే.. తట్టుకోలేక తన మెడలోని బంగారు గొలుసునిచ్చేసిన సంఘటన ఇప్పటికీ ఆమెకి గుర్తే. తనలా చేసిందని తెలుసుకున్న తండ్రి ఆ బంగారు గొలుసుని తీసుకుని ఆ అమ్మాయి ఫీజు కూడా తనే కట్టడం కూడా ఆమెకి జ్ఞాపకమే. చేతనైనంతలో ఇతరులకు సాయపడమంటూ తండ్రి తరచూ హితబోధ చేస్తుండడం కూడా తనని సేవారంగంలో అంకితభావంతో పని చేసేందుకు ఎంతో ఊతమిచ్చిందని రేవతి తరచు చెప్తుంటారు.
వేతనంలోని 30 శాతం సమాజ సేవకే:
ఐటి ప్రొఫెషనల్‌గా చేరిన మొదటి నెలనుంచి తన వేతనంలో 30శాతం పక్కకు తీసి ఇండియాలోని తన తండ్రికి రేవతి పంపించేవారు. ఆ డబ్బు పేద విద్యార్థుల ఫీజులకు, రోగాల్తో బాధపడుతున్న వ్యక్తులకు తండ్రి వితరణ చేసేవారు. అంతేకాదు, హైదరాబాద్‌కి చెందిన వేగేశ్న ఫౌండేషన్ లాంటి సంస్థలకు ఎన్నోసార్లు రేవతి విరాళాలు సేకరించి సాయపడ్డారు. విరాళాల సేకరణ నిమిత్తం అమెరికాకి వచ్చే కళాకారులకు భోజన వసతి సౌకర్యాల్ని ఆమె సమకూర్చేవారు.
టెనె్నన్సీ తెలుగు సంఘం అధ్యక్షురాలిగా..
టెనె్నన్సీ తెలుగు సంఘం అధ్యక్షురాలిగా అతి చిన్నవయసులోనే రేవతి బృహత్తర బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు. అధ్యక్షురాలిగా ఇంత చిన్నపిల్ల ఏంచేస్తుందని తెలుగు సంఘం సభ్యులు మొదట అనుమానించినా.. తర్వాత్తర్వాత ఆమె పనితీరుకి అబ్బురపడి అభినందించడం ఓ చరిత్ర అంతకుముందువరకూ ఆ తెలుగు సంఘం కేవలం చిన్నచిన్న సమావేశాలకు మాత్రమే పరిమితంకాగా.. రేవతి అధ్యక్షురాలిగా మారిన తర్వాత సేవామార్గంవేపు సంఘాన్ని ఉరుకులుపరుగులు పెట్టించిన ఘనత కూడా మరో చరిత్రే. అధ్యక్షురాలిగా ఉన్న రెండేళ్లకాలంలోనూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్వచ్ఛంద సేవాసంస్థల కోసం నాలుగుకోట్ల రూపాయలు విరాళ రూపంలో రేవతి సేకరించారు. తను, తన పరిచయస్థుల ద్వారా సేకరించిన మరో రెండు కోట్లు అదనంగా ఇచ్చారు.
సింపుల్ మైండ్స్ వ్యవస్థాపకురాలిగా..
గ్రీన్‌కార్డ్ రావడంతో అమెరికాలో ‘సింపుల్ మైండ్స్’ అనే ఐటి సంస్థను రేవతి స్థాపించారు. ఐటి రంగంలో తెలుగు యువతను కూడా ప్రోత్సహించాలనే దృక్పథంతో భారత్‌లోనూ ‘సింపుల్ మైండ్స్’ శాఖను కూడా ఏర్పాటుచేసారు. సేవా కార్యక్రమాల నిర్వహణ కోసం తన తనయుడు పేరిట ‘మనస్వ్ ఇంటర్నేషనల్’ ఫౌండేషన్‌ను స్థాపించారు. హైదరాబాద్‌లో ఉంటున్న తల్లిదండ్రులకోసం ఆరునెలలకోసారి వస్తూ ఇక్కడి సేవాకార్యక్రమాల్ని స్వయంగా పర్యవేక్షిస్తూ ముందుకు సాగుతున్నారు.
రెండు గ్రామాల ఆడపడుచు
ప్రస్తుతం రేవతి మెట్టుకూరు బాకారం, సురంగల్ గ్రామాల సర్వతోముఖాభివృద్ధికోసం పాటుపడుతున్నారు. ఈ రెండు గ్రామాల్లోనూ ప్రజలమధ్య ఐక్యత ఉండేందుకుగాను ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాల్సిందిగా ఉద్బోధిస్తూ తనవంతుగా ప్రతి ఏటా సీతారామ కళ్యాణాన్ని స్వయంగా జరిపిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మక ‘స్వచ్ఛ్భారత్’ కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామాల్లోనూ చీపురు పట్టి మరీ రహదారుల్ని శుభ్రం చేసారు. ఆమె అందించిన స్ఫూర్తితో గ్రామస్థులు కూడా నడుం బిగించి ఆమె వెంట నడిచారు. హోటళ్లలో ఎంగిలి పళ్లాలు కింద పడనివ్వకుండా ప్రత్యేక చెత్తబుట్టల్ని అందించడం ‘స్వచ్ఛ్భారత్’ కార్యక్రమంలో భాగం. ప్లాస్టిక్‌కి దూరంగా ఉండాలని సూచిస్తూ గ్రామాల్లో అనవసరమైన ప్లాస్టిక్ కనిపించకూడదంటూ సూచించారు.
బడి, గుడి ఎంత సమర్ధవంతంగా నిర్వహించిన గ్రామాలే ప్రగతి సాధిస్తాయన్న భావజాలానికి విస్తృత ప్రచారం కల్పించారు. ఈ రెండు గ్రామాల్లోనూ స్కూళ్లకు వెల్లవేసి, ప్రముఖుల చిత్రపటాల్తోపాటు వారు నినదించిన సూక్తుల్ని గోడలపైన లిఖింపచేసారు. స్కూల్ లైబ్రరీలలో ప్రాజెక్టర్, కంప్యూటర్ తదితర సౌకర్యాల్ని సమకూర్చారు.
‘బాకారం’ పచ్చళ్లు వెరీ స్పెషల్
బాకారం గ్రామస్థులకు పచ్చళ్ల తయారీలో ప్రత్యేక శిక్షణ ఇప్పించడమే కాకుండా ‘బాకారం పచ్చళ్లు’అనే బ్రాండ్ ఇమేజ్‌తో దేశవిదేశాల్లో ఈ పచ్చళ్ల వ్యాపారానికి విస్తృత వేదిక ఏర్పాటుచేసారు. వైద్య శిబిరాలు నిర్వహించడమే కాకుండా, గ్రామాల్లో నిరుద్యోగుల్ని గుర్తించి వారికి ఉపాధి అవకాశాల్ని అందించేందుకు విశేషమైన కృషి చేసారు. చేస్తున్నారు. ఇండియా వచ్చినప్పుడు స్వయంగా సేవా కార్యక్రమాల్ని పర్యవేక్షించే రేవతి.. తను అమెరికా వెళ్లినా ఇక్కడి పనులకు ఏమాత్రం ఆటంకం కలుగకుండా ఉండేందుకు అన్నిరకాల చర్యలు తీసుకున్నారు. ‘మనస్వ్ ఇంటర్నేషనల్’ ఫౌండేషన్ ప్రతినిధులు ఆమె పరోక్షంలో ఈ గ్రామాల్లో పర్యటించి అవసరాలకు తగ్గట్లు స్పందిస్తున్నారు.
ప్రవాస భారతీయురాలైన రేవతిని మనసా వాచా కర్మణా మరెంతమందో స్ఫూర్తిగా తీసుకుని సేవాదృక్పథంతో ముందుకు వస్తే పల్లెసీమల ముఖచిత్రాలు మరింత సుందరంగా రూపు దిద్దుకుంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

నిండైన నిద్రకు..

$
0
0

హాయిగా నిద్రపోతే మెదడు చురుకుగా పనిచేస్తుంది. అలసట మాయ మవుతుంది. చేయాల్సిన పనుల్లో మరుపు రాదు. ఉత్సాహంగా ఉల్లాసంగా పనిచేయాలంటే సరైన నిద్ర అవసరమే. కేవలం చిన్న పిల్లలే కాదు మహిళలకు పురుషులకు కూడా అవసరమే. కానీ ఈమధ్య నిద్ర పట్టటం లేదు అనేవారు ఎక్కువ అవుతున్నారు. ఉద్యోగాలు, టీవీలు చూడడాలు, ఫోన్లు అనేక రకాల మాధ్యమాల మధ్య బతికే మనిషి నిద్రకు దూరమవుతున్నాడు. అనేక రోగాల బారిన పడుతున్నాడు. సరైన తిండి సరైన నిద్ర కరువు ఏర్పడితే రోగాలు దరి చేరుతాయి. అందుకే సరైన నిద్ర ఉండి తీరాల్సిన వాటిల్లో ఒకటి అంటున్నారు వైద్యులు.ప్రతి మనిషి కూడా 6 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి. దానికోసం మనసు ప్రశాంతంగా ఉండాలి. నిద్రసుఖమెరుగదు అన్నా కూడా నిద్ర పోవడానికి సరైన పడక తీరు ఉండాలి.
పరుపులు గట్టిగానో, అతిమెత్తగానో ఉండకూడదు. దిండ్లు కూడా సక్రమంగా ఉండాలి. అతి ఎత్తుగా దిండు ఉంటే మెడ నొప్పికి దారితీస్తుంది. అసలు దిండు లేకుండా పడుకోవడం మంచిదనే వైద్యులున్నారు. తలగడ లేకుండా పడుకునే వారు అరుదుగా ఉంటారు కనుక తలగడను అతి ఎత్తుగా కాకుండా గట్టిగా కాకుండా, ఎగుడు దిగుడులేకుండా చూసుకోవాలి.పడక గదిలోవెలుతురు తక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. లేత రంగులు మంచి నిద్రను కలుగచేస్తాయి. కొందరికి చీకటిగా ఉంటే నిద్ర వస్తుంది. అట్లాంటి ముదురు రంగు కర్టెన్సు వాడితే మంచిది. కొందరికి సన్నని వెలుతురు ఉండాలి. వారు బెడ్ లైటు రంగును నీలంగానో, పచ్చగానో ఉంచుకుంటే మంచినిద్ర వస్తుంది.
వీటితో పాటుగా నిద్రకు వెళ్లే గంటముందే భోజనం ముగించుకోవాలి. భోజనం తరువాత తప్పనిసరిగా అరగంట నడవాలి. నిద్ర పోబోయేముందు ఒక గ్లాసు పాలు తీసుకొంటే మంచి నిద్ర పడుతుంది.
నిద్ర పోయే ముందు కాసేపు మీకిష్టమైన దైవ ధ్యానం చేస్తే మరీ మంచిది. కాసేపు చిన్నపాటి వ్యాయామాలు, లేకుంటే నడక మంచినిద్రను ఇస్తాయి.
ఏ నామమూ జపించకుండా శ్వాస మీద ధ్యాస పెట్టి కాసేపు వౌనంగా కూర్చుని తరువాత పడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
చిన్నప్పటి నుంచి నిద్రపోవడానికి సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోను నిద్రకుపక్రమించాల్సిందే. కొందరు నిద్ర లేవడానికి అలారాన్ని పెట్టుకుంటూ ఉంటారు. ఈ అలారం శబ్దం నిద్ర మీద ప్రభావాన్ని చూపుతుంది. అలారం లేకుండానే మనసులో ఫలాన టైములో లేవాలి అని కచ్చితమైన అభిప్రాయంతో పెట్టుకుంటే ఆ సమయానికి మెలుకువ దానంతట అదే వచ్చేస్తుంది.
రోజు సూర్యుడు రాకముందే నిద్రలేచే పద్ధతి వల్ల ఆరోగ్యమూ బాగుంటుంది. ఆయుష్యు వృద్ధి అవుతుంది. చాలామంది ఆరోగ్య రహస్యం నిద్ర తొందరగా లేవడమే అంటారు. రాత్రి 12 దాకా మేల్కొవడమూ మంచిది కాదు పొద్దున ఏడైనా లేవకుండా ఉండడమూ మంచిది కాదు. అందుకే తొందరగా పడుకుని తొందరగా లేస్తే అటు ఆరోగ్యమూ ఇటు ఉల్లాసమూ మన సొంతం అవుతాయి.


అభ్యుదయ కళామందిర్.. ఆవంత్స సోమసుందర్

$
0
0

అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ’’ అన్నాడు చేమకూర వేంకటకవి. ఆ మాట అప్పటికేమో గానీ ఇప్పటివరకూ గోదావరిజిల్లాలకు అన్వర్ధవౌతూ వస్తోంది. ముఖ్యంగా పిఠాపురం రాజావారి కళాశాలకు స్థల మహత్యమో మరేమోగానీ, అక్కడ చదివిన వారెవరూ వ్యర్థజీవితాన్ని గడపలేదు. తెలుగు సాహిత్యంలో మొదటినుంచీ అభ్యుదయభావాలు కలిగియుండి, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న కొద్దిమందిలో ఆవంత్స సోమసుందర్ ఒకరు. స్వతంత్రభావాలు, సొంత ఆలోచన, పరిశీలనాదృష్టి, సద్యఃస్పందన, కవితాశక్తి, పదునైన పదబంధాలను విసరగలిగే చాకచక్యం, ఎంత పెద్దవారినైనా నిలబెట్టగల పాండితీప్రకర్ష, సంస్కృత భాషా సాహిత్యాలపై అపారమైన అధికారం, రత్నపరిశోధకులకు ఉండవలసిన రాపిడిపెట్టే నైపుణ్యం, అన్నిటినీ మించి సదసద్ జ్ఞాన విచక్షణ, విమర్శనా దక్షత సోమసుందర్ గారిని సోమేశ్వరు నంతటివానిగా నిలబెట్టాయి. అందులోనూ అయన జన్మించిన నాటి పరిస్థితులు ఆయనను మరింత విజృంభించేలా చేశాయి. ఒకపక్క భావ కవిత్వ ప్రభావం, మరోపక్క అభ్యుదయ భావనలు, ఇంకోపక్క వ్యావహారిక భాషోద్యమం, అవతల పక్క కమ్యూనిస్టు భావజాలం , అందులోనే తిరుపతి వేంకటకవులు, వెంకట పార్వతీశ్వరకవుల సంప్రదాయ అవధాన జయ కేతనం. ఇన్నిటిమధ్య ఏదారిని వెళ్ళాలి? ఏదిశగా పురోగమించాలి? అన్నీ అనే్న. దేన్నీ వదులుకోకూడదు. ఇదీ ఆనాడున్న సందిగ్ధ పరిస్థితి. ఒక్కసారిగా తెలుగు సాహిత్యోద్యానవనం నూరు రేకులతో విప్పారి సుగంధాలు దశదిశలా వెదజల్లుతుంటే ఏ పుష్పాన్ని ఆఘ్రాణించాలి? దేన్ని వదిలిపెట్టాలి? అనే మీమాంస ప్రతివాళ్ళలోనూ గుబులు పుట్టించింది. అప్పుడు సోమసుందర్ లోని విమర్శకుడు బుద్ధిపెట్టి ఆలోచించాడు. దానికితోడు దేశంలో గాంధీ నాయకత్వంలో జరుగుతున్న స్వాతంత్య్రోద్యమం సోమసుందర్‌ను ఆకర్షిం చింది. వెంటనే 1942-43లలో క్విట్ ఇండియా ఉద్యమంలోకి ఆయన దూకేశాడు. యువజన నాయకుడై తన తోటి విద్యార్థులందరినీ సమీకరించుకుని గాంధీజీ వెంట నడిచాడు. లాఠీదెబ్బలు తిన్నాడు. ఆ ఆవేశంలో తీక్షణమైన దేశభక్తి కవిత్వం ఆయన నోటినుండి ఉరికింది. ఇక అప్పటినుండీ దేశంలో ఎక్కడ ఏ సంఘటన చోటుచేసుకున్నా సోమసుందర్ స్పందించటం, ఫలితంగా అప్పటి ప్రభావాన్ని బట్టి అభ్యుదయ గీతాలు, కవితలు ఆవేశపూరితంగా ఆయన కలంనుంచి ఉరుకులు పెట్టటం మొదలయ్యింది. ఒకవంక కవితలు అగ్నికణాల మాదిరిగా ఉరికించటంతో పాటు ఎంత లోతు భావనలో ఉన్నా విమర్శనా దృష్టిని కోల్పోకుండా పద ప్రయోగాలనుంచీ భావాల విసురులవరకూ ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీ లించి ఒక నిబద్ధతకు నిలిచిన సాహితీమూర్తి సోమసుందర్. అప్పటికే నిజాం ఆంగ్లేయులతో కలిసి తన భద్రతకు భరోసా పొంది ప్రజలను పీడించుకు తినటం, కాల్చుకు తినటంతో ప్రజల బ్రతుకు దుర్భరమైంది. తన అనుచరులైన రజాకార్లతో నిజాం హైదరాబాద్ ప్రాంతంలో దోపిడీలు సాగించాడు. జనం బ్రతకటానికి వీల్లేని పరిస్థితులు సృష్టించాడు. అప్పుడు సోమసుందర్ కలం వజ్రాయుధం వలె నిజాం పైకి ఎక్కుపెట్టబడింది. ఆ కవితలు నాటుబాంబుల్లా జనాన్ని రెచ్చగొట్టాయి. బ్రిటిష్ ప్రభుత్వం సోమసుందర్ ‘‘వజ్రాయుధం’’ కవితా సంపుటిని నిషేధించింది. ప్రజా బాహుళ్యంతో సోమసుందర్ అంతగా కలిసిపోయేవాడు అని చెప్పటానికి ఇదొక నిదర్శనం.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగువారికి విడిగా రాష్ట్రం కావాలని ఆనాడు అమరజీవి పొట్టిశ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా అప్పటి ప్రధాని నెహ్రూ పట్టించుకోని పరిస్థితుల్లో సోమసుందర్ ‘‘జ్వాల’’ అనే పత్రికలో వారానికి ఒక ఈటెలాంటి కవితను వెలిగించేవాడు. అది ఆంధ్రోద్యమానికి కాగడా వెలిగించినట్లయింది ఆ తరువాత ఆ కవితలన్నిటినీ కలిపి ‘‘కాహళి’’ అనే పేరుతో ఒక సంపుటిగా వెలువరించారు. దేశంలో ఎక్కడ ఏ కదలిక వచ్చినా, అది మంచిగానీ బాధగానీ ఏదైనా సరే సోమసుందర్ స్పందించకుండా ఉండేవాడుకాదు. 1953లో గోదావరికి విపరీతమైన వరదలు వచ్చి ఊళ్లకు ఊళ్ళే ఊడ్చుకు పోయాయి. కొట్టుకుపోతున్న గడ్డిఇళ్ళపైకెక్కి ప్రాణాల కోసం విలపించిన ఆర్తుల ఆర్తనాదాలు సోమసుందర్‌ను కలవర పెట్టాయి. ఆ ప్రమాదకర పరిస్థితుల్లో గోదావరీతీరంవెంట నడుస్తూ సోమసుందర్ ఆపన్నులకు ధైర్యాన్ని చెప్పాడు. వారి దీన హీన స్థితిని చూసి చలించిపోయాడు. సహజంగా కవి కావటం వలన కరుణ రసపూరితంగా కవితలను వెలయించాడు. ‘‘గోదావరీ జల ప్రళయం’’ పేరుతో తరువాత కాలంలో అవి సంపుటిగా వచ్చాయి. సోమసుందర్ అనునిత్యమూ ఏదోఒకటి రాస్తూనే ఉండేవాడు. ఆయన ప్రధానంగా అభ్యుదయ భావాలున్న ఆధునిక కవియే అయినా ఆయన సంప్రదాయాన్ని విస్మరించలేదు. సంప్రదాయ ఛందస్సులను విడనాడలేదు. ఛందస్సర్ప పరిష్వంగాలు అని తీండ్రించిన కవులరోజుల్లోనే వారి భావాలను అడ్డుకున్నాడా అన్నట్లుగా మారుమూల ఛందస్సుల్ని తీసుకుని ఛందోబద్ధంగా పద్యాలు రాశాడు. అలా ఒకటో రెండో కాదు. ఏకంగా ఒక సుదీర్ఘకావ్యానే్న రాశాడు. అయితే ‘‘రక్తాక్షి’’ అనే పేరుతో రాసిన ఆ కావ్యంలో ఇతివృత్తం మాత్రం అభ్యుదయవాదానికి చెందినదే. కేవలం విప్లవ గీతాలనేకాక, సోమసుందర్ లలిత గీతాలు కూడా రాశాడు. ఇవేకాకుండా సోమసుందర్ సామాజిక స్ఫూర్తితో రాసిన రచనలు కూడా ఉన్నాయి. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని సోమసుందర్ సమర్ధించాడు. దేశమంతా దాన్ని వ్యతిరేకిస్తే, మేధావియైన సోమసుందర్ సమర్ధించటం చాలామందికి నచ్చలేదు. అప్పట్లో ఆంధ్రజ్యోతికి నార్ల వెంకటేశ్వరరావు ప్రధాన సంపాదకుడు. సోమసుందర్ ఆ పత్రికకు వ్యాసాలూ రాస్తే నార్లవారు అలాంటి అభిప్రాయాలు తగవని చెప్పి సోమసుందర్ చేత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అభిప్రాయాన్ని చెప్పించారు. తన అభిప్రాయాలు మార్చుకోవాల్సివస్తే సోమసుందర్ పట్టుదలకు పోయేవాడుకాడు. అలాగని తాను సరియైన విమర్శ చేసినప్పుడు ఎవరు చెప్పినా వినేవాడు కూడా కాదు. సోమసుందర్ శ్రీశ్రీ రచనలపైనా, దేవులపల్లి కృష్ణశాస్ర్తి రచనల గురించీ, సినారె రచనల గురించీ విస్తృతమైన, సమగ్రమైన వ్యాఖ్యలు రాసి తెలుగు సాహిత్యాభిమానులకు అపురూపమైన కానుకలను అందించాడు. ఈయన సిద్ధాంతపరంగా మార్క్సిస్ట్ అయినా ఒంటెద్దుపోకడ పోలేదు. నిలబడి మార్క్స్ భావాలను విశే్లషించాడు. తన ‘‘వ్యాసావళి’’లో మార్క్స్ చెప్పిన సిద్ధాంతాలను విశే్లషిస్తూ వాటి ఆచరణాత్మక మార్గాలను అనే్వషించాడు. ఒక వ్యక్తిలో ఇన్ని భావాలు ఉండటం చాలా అపురూపం. ఆయన మార్క్సిస్ట్. అభ్యుదయవాది. అదే సందర్భంలో సంప్రదాయాలను గౌరవించే సభ్యతగల పెద్దమనిషి. వాస్తవికత కోసం అంకితమైన గొప్ప విమర్శకుడు. ముందుచూపుగల దార్శనికుడు. రచయిత యైనవాడు సమాజ నడవడికి ప్రతిక్షణం స్పందించాలి. సరియైన దిశానిర్దేశనం చేయాలి. తన పేరు ప్రఖ్యాతుల కోసం తన పంధాను మార్చుకునే అస్వతంత్రపుజీవి కారాదు. అప్పుడే రచయితకు బాధ్యత పెరుగుతుంది. గౌరవం పెరుగుతుంది. సమాజం అవసరమైనవేళ సహాయం కోసం రచయిత వంక చూస్తుంది. అలా సమాజానికి సరియైన మార్గాన్ని చూపగలవాడే నిజమైన రచయిత. అతడు కీర్తికిరీటాల కోసం తపన చెందడు. తన మనుగడ కోసం కాళ్ళు కడగడు. సోమసుందర్ అలాంటి నిజమైన రచయిత. అతడు పొందిన సత్కారాలు కేవలం నామమాత్రమైనవి. అనంతంగా ఆయన రాసిన రచనలు తెలుగువారికి అమూల్య సంపద.
1924లో తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దగ్గరలోని శంఖవరంలో జన్మించిన సోమసుందర్ నిజంగా ఒక కారణజన్ముడు. సంస్కృతం చదివి మార్క్సిస్టు అయినవారిలో సోమసుందర్ అరుదైన వ్యక్తి. ధారాళంగా పద్యాన్ని వ్రాయగలిగీ, వజ్రాయుధం లాంటి వచన కవితల్ని అందించాడంటే అది ఆయన భాషా సౌధపు గట్టిదనమే. ఆయన జీవితంలోని గొప్ప విశేషమేమంటే ఆయన జీవితం చివరి నిమిషం వరకూ 92ఏళ్ళు నిండినా రాస్తూనే వెళ్ళిపోయాడు. భావి తరాలకు ఆయన రచనా స్ఫూర్తి ఆదర్శపాత్రం. ఆలోచనా శక్తి ఆచరణ సూత్రం.

ఏమో ఎడిసన్ కానూవచ్చు!

$
0
0

ప్రసన్నోషోదయ సమయాన
తిమిరపు తెరలు తొలగే తరుణాన
మూసి ఉన్న అంగళ్ళముందు
ముడుచుకొని, వరుసలో కూర్చొని
అనుబంధాలను పత్రికలలో అమర్చుకుంటూ
కట్టలు కట్టుకుంటూ
నిర్దేశింపబడ్డ క్షేత్రాలకై నిష్క్రమించబోతున్న
మన బార్నీ ఫ్లా హెర్టీ వారసులు.

ఉపాహారం లేక ఉత్త తేనీటితో సంతృప్తి
మిత్ర బృందాల ఉభయ కుశలోపరి.
తదుపరి, తమతమ సమస్యల సామూహిక చర్చ
కష్ట, సుఖాల, అనుభవాల పరస్పర అవగాహన
కుటుంబ, రాజకీయ, సినిమా, క్రీడా విషయాల
ఆసక్తికర చర్చ.

మందస్మిత ముఖ కవళికల కేరింతలానంతరం
సైకిల్ పై వ్యాయామాన్ని ఇష్టంతో
కనీస ఖర్చులకై కష్టంతో
ఉదయం వార్తావాహకుడుగా
మధ్యాహ్నం విద్యార్థిగా
సాలుకు నాలుగు పండుగ రోజుల సెలవులతో
వర్షాకాల, శీతాకాల అసౌకర్యాల నధిగమించి
బస్తీలు, బజార్లు, బహుళ అంతస్తు భవనాలు,
విద్యాలయాలు, వ్యాపార సంస్థలు, కార్యాలయాలు
సందులు, గొందులలో సైకిల్‌పై విన్యాసాలు.
విన్యాసాలు చేసే హీరో హస్తలాఘవంతో
విసిరేసిన పత్రిక తడిస్తే, పక్కింట్లో పడితే
ఒకరోజు గైర్హాజరయతే,
చందాదారునిచే చీవాట్లు.
‘అమ్మ వైద్య ఖర్చులకు’ నేనిస్తే తనకు ‘వస్తుందని’
అడిగాడు చందాని పేపర్ బాయ్.
అనిపించింది నా అంతరంగంలో, అలా...
పేపర్లమ్మి ఎడిసన్ ఎంత పెద్దవాడయ్యాడు!
ఏమో, ఎడిసన్ కానూవచ్చు వీడూ!
అయనా అబ్దుల్ కలామ్ అవనూవచ్చని.

విమర్శ అస్తిత్వాన్ని కోల్పోతోందా!

$
0
0

ప్రాచీన కాలంనుండి ఆధునిక కాలం వరకు తెలుగు సాహిత్యానికి వెన్నుముకగా నిలిచింది పదునైన విమర్శే. ఒక్క సాహిత్య రంగంలోనే కాదు, ఏ రంగంలో చూసినా నాణ్యతకు వారధిగా విమర్శ కనబడుతుంది. గాలి వానల బీభత్సానికి ఎదురొడ్డి నిలచిన వృక్షమే మహావృక్షమవుతుంది అన్న చందాన, విమర్శల ధాటికి తట్టుకు నిలబడిన సాహిత్యమే ఉత్తమ విలువలు కలిగిన సాహిత్యం అవుతుంది. ఎక్కడయితే విమర్శనాత్మక దృష్టి ఉండదో అక్కడ హెచ్చుతగ్గులు, నైపుణ్య ప్రభావితాలు ఉండవు. కాబట్టి గొప్ప సాహిత్యం రావాలన్నా, అది గుర్తింపబడాలన్నా సహేతుక విమర్శ తప్పనిసరి. అయితే ప్రస్తుత ఆధునిక సమాజంలో విమర్శ విశేష ప్రాధాన్యాన్ని కలిగి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సమాజంలో ఆర్థికపరమైన స్థిరత్వం, సామాజిక మాధ్యమాలు మారుమూల ప్రాంతాలకు చేరువవడం, వార్తాపత్రికలూ మరియు వివిధ సాహితీ సేవాసంస్థల ప్రోత్సాహం కారణంగా నవతరం కవులు అనుకోని విధంగా సాహిత్య రంగంలో దూసుకుపోతున్నారు. ఏ పాఠకుడు అయినాసరే నాణ్యమైన పుస్తకాలనే కోరుకుంటాడు. అంతేనా, యువ రచయితలు సైతం అలాంటి నాణ్యమైన రచనలు చదవడం ద్వారానే తమనుతాము సంస్కరించుకోగలిగి, ప్రభావవంతంగా మారగలుగుతారు. పరిణతితో కూడిన సాహిత్యాన్ని సాహితీ క్షేత్రంలో పారించగలుగుతారు. మరి సాహిత్యంలో నాణ్యతకు ఇంత ప్రాముఖ్యమున్న పరిస్థితుల్లో, ఏ రచనలో ఎంత సాహిత్యముందో కుండబద్దలు కొట్టినట్టు చెప్పేది సాహిత్యాన్ని అవపోసనపట్టిన విమర్శకులే. దాని ఆధారంగానే ఉన్నత ప్రమాణాలున్న రచనలు వెలుగులోకి వస్తాయి. ప్రమాణాలు లేనివి కాలగర్భంలో కలిసిపోతాయి. అందుకే సాహిత్యానికి విమర్శను వెనె్నముకగా చెప్పవచ్చు.
అయితే సాధారణంగా సాహిత్య పుస్తకాలలో ముందుమాటలు చూస్తూనే ఉంటాము. వీటినే సమీక్షలు అని అంటారు. మరి విమర్శ, సమీక్ష రెండూ ఒకటేనా అంటే ఇవి స్థూలంగా ఒకేలా తోచినా, సూక్ష్మంగా ఆలోచిస్తే ఈ రెండింటి మధ్య వైరుధ్యాలున్నాయి. అయితే ప్రస్తుత కాలంలో ఈ రెండూ తమ ఉనికిని చాటుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. ప్రస్తుతమున్న సమీక్షలను ఆధారంగా చేసుకుని ఒక పుస్తక సారాన్ని అంచనావేయడం దాదాపు అసాధ్యంగా ఉంది.
విమర్శకు కల కారణాలను తెలియపరచడం విమర్శకుడి కనీస బాధ్యత. అప్పుడే ఆ రచయితా తన తప్పులని సరిచేసుకుని, భవిష్యత్తులో అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాడు. కానీ ఇంతటి సున్నిత అంశాలని ఆయా విమర్శకులు విస్మరిస్తుండడంతో విమర్శకుడికి మరియు రచయితకు మధ్య భేదాభిప్రాయాలు రావడంతోపాటు, విమర్శను గౌరవించలేని స్థితి నేడు నెలకొంది. నారాయణరెడ్డిగారు అన్నట్లు ఇపుడిపుడే వెలుగుతున్న దీపాలను రెండుచేతులు అడ్డుపెట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత అనుభవజ్ఞులపై, విమర్శకులపై ఉంది. కావున సమీక్షలు వెలువరించే ముందు, విమర్శనాస్త్రాలు సంధించే ముందు హేతుబద్ధ ధోరణిని అనుసరించడం ఉత్తమం.
స్థూలంగా సమీక్షిస్తే ఎన్ని పుస్తకాలకి ముందుమాటలు రాసాము, ఎన్ని సభలకు అధ్యక్షత వహించాము అనేదానికన్నా, ఆయా సమీక్షలు ఆయా రచయితలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, సాహిత్య క్రియాశీలతకు ఎంతవరకు దోహదం చేస్తుంది అనే కోణంలో చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ రెండింటి అంతిమ లక్ష్యం క్షేత్రాన్ని దేదీప్యమానం చేయడమే.
మరి విమర్శలు ఎవరిపై చేయాలి, సూచనలను ఎవరికి ఇవ్వాలి అన్నది అనుభవజ్ఞులు గుర్తెరిగి నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది. అనుభవం ఉన్నవారిపై విమర్శ ఎక్కువ సకారాత్మక ప్రభావాన్ని చూపిస్తే, ఇపుడిపుడే సాహితీ క్షేత్రంలో మొలకలై వస్తున్న యువగళంపై సూచనలు అమిత ప్రభావాన్ని చూపిస్తాయి. విమర్శలోని లోతుల్ని అవగతం చేసుకోవాలంటే వారికి కనీస అనుభవసారం తప్పనిసరి. అప్పుడే విమర్శల ధాటికి తట్టుకుని నిలబడగలుగుతారు. లేదంటే వారి ఆరాటం గాలిలో ప్రమిదలుగా మారే ప్రమాదం ఉంది. ఇది తెలుగు సాహిత్యానికి శుభసూచకం కాదు. యువకులను విమర్శించడంకన్నా, వారి నైపుణ్యాలను పెంచే చర్యలపై దృష్టి కేంద్రీకరించాలి. ఇక విమర్శకుడికి అర్హత అవసరమా అని ప్రశ్నిస్తే, తప్పనిసరి అన్నదే సమాధానం. విమర్శ చేయాలంటే ఆయా అంశాలపై సంపూర్ణ అవగాహన, అనుభవం ఉండి తీరాలి, లేదంటే విమర్శ అసంపూర్ణంగా మిగలడమేకాక రచయిత మనోభావాల్ని అది దెబ్బతీస్తుంది. కాబట్టి విమర్శకులు వీలయినంత అవగాహనతో ముందుకెళ్లడం తప్పనిసరి. ప్రస్తుత కాలంలో తెలుగు సాహిత్యంలో విమర్శనాత్మక ప్రక్రియ అంత చురుకుగా మాత్రం లేదనేది నిర్వివాదాంశం. దురదృష్టవశాత్తు సాహిత్యంలోకూడా రాజకీయాలు ఎక్కువయ్యాయి. కూటములు, వర్గాలు ఎక్కువయి ఆధిపత్యపోరు కూడా అంతర్లీనంగా జరుగుతోంది. తమ వర్గంవారిని కాపాడుకుంటూ, అవతలి వర్గం వారిని విమర్శించే సంఘటనలు ఎక్కువయ్యాయి. కొన్ని సంఘటనలను చూస్తుంటే కేవలం రచనలు చేసేటపుడు మాత్రమే రచయిత మనసు నిష్కల్మషంగా ఉంటుంది అని అర్థం అవుతుంది. ఉత్తమ పురస్కారాల్లో, రచనల్లో అంతగా ప్రమాణాలు లేనివి గుర్తింపబడుతుండడం తెలుగు సాహిత్యానికి ఆమోదయోగ్యం కాదు. వీటిని ఎండగట్టేది విమర్శే. విమర్శనాత్మక దృష్టి క్రియాశీలంగా ఉన్నప్పుడే నాణ్యమైన రచనలకు గుర్తింపు లభిస్తుంది. అలాంటి విమర్శకులు సాహిత్యంలో అరుదుగా కనిపిస్తుండడం బాధాకరం. ఆరోగ్యకరమైన విమర్శనా చర్చ జరిగినపుడే గొప్ప రచనలు పురుడుబోసుకుంటాయి. విమర్శకు, గొప్ప రచనలకు అవినాభావ సంబంధం వుంది. విమర్శ ఎదురవనపుడు రచయిత తనను తాను పరిపూర్ణత సాధించినట్లుగా భావిస్తాడు. తద్వారా నిత్య విద్యార్థి అనే చెరనుండి విడివడి, తనకే అంతా తెలుసనే స్థితికి చేరుకుంటాడు. కాబట్టి విమర్శ రచయితని నిత్య విద్యార్థిని చేస్తుంది. అలాగే విమర్శకు ప్రతి విమర్శా తప్పనిసరి. సాహిత్య నాణ్యతకు విమర్శ వెనె్నముక అయితే, విమర్శకి ప్రతి విమర్శ వెనె్నముక. అపుడే విమర్శ సరైన దృక్కోణంలో వెళ్తుంది. కాబట్టి సహేతుక విమర్శనాత్మక శైలితో కూడిన విమర్శ సర్వదా ఆమోదయోగ్యమే.

ఇదా మొదటి చదువు వాచకం?!

$
0
0

సిబియస్‌ఇ సిలబస్ ప్రకారం వివిధ పాఠ్యాంశాలను బోధిస్తున్నాం అని చెప్పుకునే స్కూళ్ళలోని ఒక రికగ్నైజ్డ్ స్కూలువారి ఒకటవ తరగతి తెలుగు వాచకం (Text Book)లో 5వ పుటలో ఒక రూపాయి నాణెం బొమ్మ పక్కన ‘బు’ అనే అక్షరంతో మొదలయ్యే పదమంటూ ‘బుక’ అని పేర్కొన్నారు. ఆ వాచక రచయిత్రి. వాచకం పేరు ‘ఆపిల్ తెలుగు భారతి- (1).
రూపాయి అనే పదానికి పర్యాయ పదం ‘రూక’. అంతేగాని ‘బుక’ అనేది కానే కాదు. కవి పండితులైన కీ.శే.మహాకాళి సుబ్బారాయుడుగారి శబ్దార్థ చంద్రిక గాని, కీ.శే.జయంతి రామయ్యగారి వంటి మహా పండితులు కలసి కూర్చొని, కూర్చిన శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువులోగాని, మఱే ఇతర నిఘంటువులోనైనా గాని ఎవరూ రూపాయి శబ్దాన్ని ‘బు’క’గా పేర్కొనలేదు. ‘రూక’లోని రకారం కేవలం ‘ఊ’కార పూర్వక రకాల హల్లు ధ్వని మాత్రమే.
ఏ తెలుగు నిఘంటువులోనూ అకారాది క్రమంలో ‘బు’ అనే దాని కింద ఏ పదమూ లేదు. కారణం ‘బు’ కారంతో తెలుగులో అసలు పదాలే లేవు. ఈ ‘బు’ కారం కేవలం సంస్కృత వాఙ్మయంలోనే కనిపిస్తుంది. ‘బు’ అనేది వేద వాఙ్మయంలో ఉంటే ఉండవచ్చు. కానీ అవేవీ తెలుగు పదాలు కావు.
ఈ ‘బు’ స్వరానికి మారురూపమే వృత్వం అన్నా, వట్రుసుడి అన్నా. దాని లేఖన చిహ్నం ‘ౄ’. ఈ దీర్ఘస్వర ‘బు’కారంతో ఇటు అచ్చుతో గాని, అటు హల్లుతోగాని ప్రారంభమయ్యే శబ్దమే కనిపించదు మన వాఙ్మయంలో.
కేవలం హ్రస్వ ఋకారం- అంటే - హ్రస్వ వట్రుసుడి (వృత్వం)తో మాత్రమే శబ్దాలు కోకొల్లలుగా ఉన్నాయి- ఋషి, ఋక్కు, ఋజువు, ఋణము, కృష్ణ, తృష్ణ, గృధ్రము, జృంభణ, నృపుడు, పృథివి, మృగము, సృష్టి, హృది- ఇలా. అసలు యథార్థానికి ఈ ‘ఋ’(ృ) ధ్వనికి ఛందస్సులో ఇ, ఈ, లు, ఏ, ఏలతో కూడిన హల్లులతో మాత్రమే యతిమైత్రి ఉంది. మనం ఆచరణలోకూడా ‘కృష్ణ’ శబ్దాన్ని ‘క్రిష్ణ’ అని పలుకుతుంటాము.
ఇక సంస్కృతంలోనయితే తప్పకుండా ‘ఋ’ స్వరాన్ని ‘ఇ’కారంతో మాత్రమే పలుకుతారు. ఇంగ్లీషులో రాసేటప్పుడు కూడా ‘ని’ అనే అచ్చు అక్షరా(VOWEL))నే్న వాడతారు. ఉదాహరణకు SANSKRIT (సాన్స్‌క్రిట్), KRISHI, BRINDAVAN, BRIHATKATHA (బృహత్క్థ)- ఇలానే రాస్తారు.
ఒక్క తెలుగులో మాత్రమే ‘ఋ’ కారాన్ని (వృత్వ ధ్వనిని) ఉకారంతో పలకటం కనిపిస్తుంది- కృతి (క్రుతి), నమస్కృతి (నమస్క్రు....), కృషి, (క్రుషి), ఋషి (రుషి), ఇలాగే భృతి, భృత్యుడు, స్మృతి, ధృతి, కృతఘు్నడు, కృతజ్ఞత మొదలైన పదాలన్నీ ఉకార ఉచ్చారణతోనే వ్యవహృతాలవుతుంటాయి. బహుశః ఇలా తలపోస్తూ ‘ఆపిల్ తెలుగు భారతి 1వ తరగతి వాచక’ రచయిత్రి రూక నాణేనికి ‘బుక’ అని అక్షర రూప నిర్ణయంచేసి ఉండాలి. అది నూటికి నూఱుపాళ్ళు పొరపాటే.
అన్ని నిఘంటువులలోనూ ‘రూ’ అనే అక్షరంతో మొదలయ్యే పదాల జాబితాలోని మొట్టమొదటి పదం ‘రూక’ అనే ఉంది. ‘రూక’కు అర్థాలు ధనము, చిన్నమెత్తు వెండి- లేక- బంగారు నాణెము అని చెప్పబడ్డాయి.
మఱి రుూ ‘బుక’ ఆ పుస్తక రచయిత్రికి ఏ శబ్దకోశంలో ‘మోగిందో’ అంతుబట్టటం లేదు. అక్షర బీజాలు, చదువు పునాదులు, బాస మొలకలు పాదుకొనాల్సిన ఒకటవ తరగతి పసి పిల్లల విద్యామానస క్షేత్రాలలో ఇలాంటి ‘దోషాలు’ నాటుకుపోవటం ఏమాత్రం శ్రేయస్కరం గాని, వాంఛనీయం గాని, ఉపేక్షార్హంగానీ కాదు.
ఇదే వాచకం 9వ పుటలో రామ ములగకాయ (పండు) (చిత్తూరు జిల్లాలో ‘తక్కాళీ’) బొమ్మపక్కన ‘టమాట’ అని ఉంది. ఈ అక్షరత్రయ సముదాయ రూపం ఉచ్చారణా సుందరంగా లేదు. TOMATO అనే దానిని టొమాటో అని పలికితేనే వినసొంపుగాను, శ్రవణ సుభగంగానూ ఉంటుంది. టొమాటో అనే పదంలోని ‘మ’కారాన్ని CAT, MAT, RAT, MAN వంటి పదాలలోని ఏటవాలు అచ్చు (SLANT VOWEL) ధ్వనితోనే పలకాలి, పిల్లలచేత పలికించాలి. అలాగే పలుకుతాం కూడా.
11వ పుటలో ‘బ’ అనే అక్షరాన్ని పరిచయం చేస్తూ ‘బకము’ అని ఉంది. 1వ తరగతి పిల్లలకు అంత సంస్కృతపు మాఱుమూల శబ్దం అవసరమా? బడి, బల్లి, బద్ద, బట్ట, బజ్జి, బండ, బంతి, బలపము- అయిదారేళ్ళ పిల్లవాడికి పరిచయముండే ఇలాంటి పదాన్ని ఏదో ఒక దాన్ని ఎన్నుకొని బొమ్మ వేయించి ఉంటే బాగుండేది.
అలాగే 12వ పేజీలో ఉష (సూర్యోదయం) అనే మాఱుమూల పదానికి మాఱుగా వేషములాంటి తేలిగ్గా అర్థమయ్యే పదాన్ని ఎన్నుకుంటే బాగుండేదేమో!
12వ పేజీలోనే ఉన్న ‘క్షవరము’ అనే శబ్దం తప్పు. ‘క్షౌరం’ అనాలి. క్షురము అంటే వెండ్రుకలను తగ్గించటానికి వాడే కత్తి. క్షురము అనే పరికరంతో చేసే పని క్షౌరము. అంతేగాని క్షవరం అనే శబ్దరూపం ఏర్పడదు. మూలం - వౌలికం; కుటిలం - కౌటిల్యం; శుచి - శౌచం - మొదలైన శబ్దాల లాగే ఇది భావార్థక తద్ధిత రూపం. క్షవరం అనే తప్పుడు రాత రూపంతో శబ్దాన్ని బాల్యదశలోనే అలవాటు చేయటం భాషా యోషకే అపచారం, అవమానం.
27వ పుటలోని ‘గురువును వినుము’ అనే వాక్యం తెలుగు వాక్య నిర్మాణ పద్ధతికి తగ్గట్టుగాను, సహజ సుందరంగాను లేదు. "HEAR THE TEACHER'’ ‘గురుం శ్రుణు’ అనే విద్యర్థక ఆంగ్ల, సంస్కృత వాక్యాలను మనసులో అనుకొని, తెలుగులోకి దించినట్టు కృతకంగా ఉంది. ఆ భావవాక్యాన్ని తెలుగులో రాసేటప్పుడు ‘గురువు చెప్పేది వినుము’ అంటూ ఒక విశేషణాత్మక క్రియానామవాచక ద్వితీయా విభక్త్యర్థక భావాన్ని తెలియజేసే పదాన్ని (చెప్పేది అనే శబ్దాన్ని) తప్పక తెచ్చుకోవాలి. దీనిని అలోప కర్మ పద వాక్యం అంటారు.
‘‘గురవును వినుము’ అని మా పుస్తకంలో వాక్యంగూడా ఉన్నది. కనుక అది రైటే’’ అంటూ ఎవరైనా పిల్లవాడు ఆ అర్థంలోనే తన వాచకంలో రచయిత్రి ఇచ్చిన వాక్యాన్ని ఇళ్ళల్లో తన సంభాషణల్లో పలికితే, ప్రాక్టికల్‌గా ఉపయోగిస్తే- లేక- ప్రయోగిస్తే ‘‘ఇదేం చదువురా నాయనా?!’’ అంటూ అందరూ హేళనగా నవ్వుతారు. అలా పిల్లల్ని నవ్వులపాలు చేసే ఇలాంటి వాక్య రచనలా పాఠ్యపుస్తకాల్లోను, ప్రాథమిక వాచకాల్లోనూ ఉండాల్సింది?!
33వ పుట మొదటి పంక్తిలోని 6వ పదం అయిన ‘శృతి’ అనే దానికి అర్థం లేదు. అసలు ఆ రూపమే లేదు శబ్దార్థ చంద్రిక, సూర్యరాయాంధ్రం, ఆసియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, న్యూఢిల్లీ, చెన్నై వారల సంస్కృతాంధ్ర నిఘంటువు, వామన్ శివరామ్ ఆప్టే మహాశయుడు కూర్చిన సంస్కృత- ఆంగ్ల, ఆంగ్ల-సంస్కృత నిఘంటువులు మొదలైన వాటిలో దేంట్లోను. మఱి ‘ఆపిల్’ వాచక రచయిత్రి ‘శృతి’ని ఎక్కడ విన్నారో, కన్నారో ఏమో! ‘శ్రుతి’ అనే శబ్దం అయితే ఉన్నది. చెవి, శ్రవణము, అనుకొనే మాట (జనశ్రుతి), ధ్వని, వేదం, వేదమంత్రము, వేదజ్ఞానం, శ్రవణ నక్షత్రం, విషమ కర్ణం, రేఖావిశేషం (జ్యామితిలో), సూక్తి, సుద్ది అనే పలు విధాల అర్థాలలో, ఈ ‘శ్రుతి’నే ‘శృతి’ అనుకున్నారేమో రచయిత్రి! ఇలా మన వాచక రచనలు జరిగితే మన బాస చదువుల ప్రామాణికత, భవితవ్యాలు భూగోళమంత ప్రశ్నార్థకాలు.
వాచకాలు, పాఠ్యగ్రంథాలు రాసేవాళ్ళు ఒకటికి రెండుసార్లు తాము తయారుచేసే వౌలిక ప్రతి (మాతృకాప్రతి)ని తమకంటే అనుభవజ్ఞులు, విద్యావృద్ధులు, అక్షర జ్ఞాన పరిశుద్ధులు అయిన వాళ్ళకు చూపించి అలాంటి వాళ్ళచేత ఔననిపించుకోవటం మంచిది. సి.బి.ఎస్.ఇ. విద్యావేత్తలు, విద్యాధికారులు కూడా అక్షర-్భషాజ్ఞానంలో తలలు పండిన పండితులను ఫైనల్ కన్సల్టెంట్లుగా నియమించుకొని, వాళ్ళు ధ్రువీకరించి, యోగ్యతాపత్రం ఇచ్చాకనే ఏ వాచకాTEXT BOOK)నికైనా ఆమోదముద్ర వేయాలి, విద్యాలయాల్లో పఠన, పాఠనాదులకు అనుమతించాలి.
అక్షరం పరబ్రహ్మ స్వరూపం, కాకూడదది అపభ్రంశం. పదం భారతీదేవి పదమంజీరం. కాకూడదది భ్రష్టాకారం- పఠన, పాఠక మనోవికారం.

తూర్పు పడమరల వాన!

$
0
0

‘తూర్పు పడమరల కలయక అసంభవం’ - ఒకనాటి మాట
తూర్పుకిటువైపు
పడమటకటువైపు
వేలాది మైళ్ల దూరాన్ని
కలిపిన ఒకే వాన
ఒకే కాలాన
సమాంతరంగా
మబ్బుల కుండలన్నీ ఢీకొని
ఉరిమి మెరిసి
పగిలి వర్షించి
ప్రాక్ పశ్చిమాకాశాలన్నీ
జలధారలతో
నేలమీది కాలాన్ని
నిర్నిద్ర సెల్‌ఫోన్ల సిగ్నల్స్‌ను
భూగోళ కొసలతో
వాణిజ్య వ్యాపార సూత్రాలన్నీ
ముడిపడి - చెల్లాచెదురై
విశ్వాసాలన్నీ తలకిందులై...!!
(న్యూజెర్సీలో ఉ.9 గం.కు, అదేరోజు హైదరాబాద్‌లో సా. 6.30 గం.కు ఒకే క్షణాన
ఏకధాటిగా తొమ్మిదిన్నర గంటల తేడాలోనే కురిసిన వర్షం)

Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>