Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

చిన్మయానంద కేసును బలహీనపరుస్తున్నారు..

$
0
0

న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల నేరారోపణలపై అరెస్టు అయిన చిన్మయానంద కేసును పోలీసులు నీరుగారుస్తున్నారని బాధితురాలు, న్యాయశాస్త్ర విద్యార్థిని ఆరోపించింది. తనపై అత్యాచారానికి పాల్పడి చిన్మయానంద చాలా పెద్ద తప్పు చేశారు. కాని చిన్న శిక్ష విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో తనకు అసంతృప్తిగా ఉందని, సెక్షన్ 376కి బదులు సెక్షన్ 376సి విధించటం సరికాదని ఆమె పేర్కొన్నారు. కాగా న్యాయశాస్త్ర విద్యార్థినిని బ్లాక్‌మెయిల్ చేసి ఏడాదిపాటు అత్యాచారానికి పాల్పడిన చిన్మయానందను శుక్రవారం అరెస్టు చేసి ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.


ఫ్రాంక్‌ఫర్డ్‌లో ఆగిన ప్రధాని మోదీ

$
0
0

న్యూఢిల్లీ: వారం రోజుల పర్యటన నిమిత్తం నిన్నరాత్రి అమెరికా బయలుదేరి వెళ్లిన ప్రధాని మోదీ సాంకేతిక కారణాల రీత్యా జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్‌లో ఆగారు. విమానాశ్రయంలో జర్మనీలోని భారత రాయబారి ముక్తా తోమర్, కాన్సూల్ జనరల్ ప్రతిభా పార్కర్ మోదీకి స్వాగతం పలికారు. రెండు గంటలు గడిపిన ప్రధాని అక్కడ నుంచి హ్యుస్టన్ బయలుదేరి వెళ్లారు. 22వ తేదీన హౌదీ మోదీ స‌భ జ‌ర‌నున్న‌ది. ఆ త‌ర్వాత మ‌రుస‌టి రోజున‌.. పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ను డోనాల్డ్ ట్రంప్ క‌లుసుకోనున్నారు. న్యూయార్క్‌లో జ‌ర‌గ‌నున్న యూఎన్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీ స‌మావేశాల స‌మ‌యంలో ఇమ్రాన్‌తో ట్రంప్ భేటీకానున్నారు. ఈనెల 24వ తేదీన మ‌రోసారి ప్ర‌ధాని మోదీతో ట్రంప్ భేటీ కానున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

అక్టోబర్ 21నమహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు

$
0
0

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబరు 21న మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా తెలిపారు. రెండు రాష్ర్టాల్లో అక్టోబర్‌ 24న ఓట్ల లెక్కింపు ఉంటుందని, అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయని ఈ రెండు రాష్ర్టాల ఎన్నికల నోటిఫికేషన్‌ సెప్టెంబర్‌ 27న విడుదల కానుందని ఆయన చెప్పారు. నామినేషన్లకు చివరి తేదీ అక్టోబర్‌ 4. హర్యానా అసెంబ్లీకి నవంబర్‌ 2వ తేదీతో, మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్‌ 9వ తేదీతో గడువు ముగియనుంది అని తెలిపారు. మహారాష్ట్రలో 288, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. మహారాష్ట్రలో 8.94 కోట్ల మంది, హర్యానాలో 1.82 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

పాక్ కాల్పులను తిప్పికొట్టిన భారత్

$
0
0

జమ్మూకశ్మీర్: పాకిస్థాన్‌లోని పూంచ్ జిల్లాలో పాక్ ఆర్మీ జరిపిన కాల్పులను భారత్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. శనివారం ఉదయం షాహపూర్, కెర్నీ సెక్టార్లలోని సరిహద్దుల్లో పాకిస్థాన్ సైనికులు కాల్పులకు దిగారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ సైనిక దళాలు మోర్టార్లతో కాల్పులకు దిగారు. భారత సైన్యం ఎదురు దాడి చేయడంతో సమర్థంగా తిప్పి కొట్టింది. సరిహద్దు గ్రామాల్లో మోర్టారు, పేలని బాంబును భారత సైనికులు కనుగొన్నారు.

యూపీ రైతులు ర్యాలీ

$
0
0

లక్నో: చెరకు రైతుల బకాయిలు చెల్లించాలని కోరుతూ యూపీ రైతులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఢిల్లీ వైపుగా సాగింది. భారతీయ కిసాన్ సంఘటన ఆధ్వర్యంలో జరిగే ఈ ర్యాలీ ఢిల్లీలోని కిసాన్ ఘాట్ దిశగా బయలుదేరింది. పంట‌ల‌కు కూడా రుణ‌మాఫీని ప్ర‌క‌టించాల‌ని రైతులు కోరుతున్నారు. ఢిల్లీ-యూపీ బోర్డ‌ర్ వ‌ద్ద ఉన్న ఘాజీపూర్‌లో పోలీసులు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. కిసాన్ ఘాట్ వైపు వ‌స్తున్న రైతుల‌ను అడ్డుకునేందుకు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు పోలీసులు చెప్పారు. త‌మ డిమాండ్ల‌కు ప్ర‌భుత్వం అంగీకారం తెలిపితే, తాము తిరిగి వెన‌క్కి వెళ్తామ‌ని భార‌తీయ కిసాన్ సంఘ్ అధ్య‌క్షుడు పురాన్ సింగ్ తెలిపారు.

తదుపరి లక్ష్యం మిషన్ ‘గగన్‌యాన్’:శివన్

$
0
0

భువనేశ్వర్: ఇస్రో తదుపరి లక్ష్యం మిషన్ ‘గగన్‌యాన్’ అని ఛైర్మన్ శివన్ వెల్లడించారు. ఆయన భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడుతూ 2022 నాటికి భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 98శాతం విజయవంతమైందని, విక్రమ్ ల్యాండర్ కోసం అనే్వషణ కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఆర్బిటర్ చక్కగా పనిచేస్తుందని, ఇందులో అమర్చిన 8 సైన్సు పరికరాలు తమ విధులను చక్కగా నిర్వర్తిస్తున్నాయని తెలిపారు. విక్రమ్‌తో కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోవటానికి కారణాలను ఇస్రో అనే్వషిస్తుందని, వారి నివేదిక అందిన తరువాత తదుపరి కార్యాచరణ చేపడతామని తెలిపారు.

ఐటీఐఆర్‌పై అసెంబ్లీలో రగడ

$
0
0

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఐటీఐఆర్‌పై అధికార-ప్రతిపక్షం మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి కేటీఆర్-ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క మధ్య వాదోపవాదాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఉద్యోగాల కోసమేనని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ఐటీ రంగంలో అభివృద్ధి చెందాలనే యూపీఏ ప్రభుత్వం ఐటీఐఆర్‌ను మంజూరు చేసిందని, ఎందుకు ఆ ప్రాజెక్టును సాధించలేదని నిలదీశారు. ఐటీఐఆర్ ద్వారా మొత్తం 70 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. అసెంబ్లీలో ఐటీఐఆర్ కోసం తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. భట్టి వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ.. ఐటీఐఆర్ విధానాన్ని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. యూపీఏ ప్రభుత్వం 2013లో బెంగుళూరు, హైదరాబాద్‌లో ఐటీఐఆర్ అనుమతి ఇచ్చిందని, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఐటీఐఆర్‌‌ కోసం కాంగ్రెసోళ్లేదో ఉద్ధరించినట్లు...తామేదో నాశనం చేసినట్టు మాట్లాడం సరికాదని హితవు పలికారు.

రక్తదాన శిబిరం ప్రారంభించిన గవర్నర్ తమిళిసై

$
0
0

హైదరాబాద్: నగరంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొన్నారు. గోకరాజు రంగరాజు కళాశాల నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతలో స్పూర్తిని నింపేలా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన నిర్వహకులకు అభినందనలు తెలిపారు.


మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత

$
0
0

హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి విషమించటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన కన్నుమూశారు. శివప్రసాద్ చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో 1951 జూలై 11న జన్మించారు. తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. తదనంతరం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 1999లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన సత్యవేడు ఎమ్మెల్యేగా గెలిచి సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. తదనంతరం ఎంపీగా చిత్తూరు లోకసభ స్థానం నుంచి పోటీచేసి రెండుసార్లు గెలుపొందారు. ఎంపీగా ఆయన పలు కమిటీల్లో పనిచేశారు.

నటుడు..దర్శకుడు

స్వతహాగా రంగస్థల నటుడైన శివప్రసాద్ పలు సినిమాల్లో నటించారు. కొన్ని సినిమాలకు దర్శకుడిగా పనిచేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ప్రతి నాయకుడిగా వివిధ పాత్రలు పోషించారు. దూసుకెల్తా, తులసి, మస్కా, కుబేరులు, ఒక్కమగాడు తదితర చిత్రాలలో నటించారు. ఇల్లాలు, కొక్కరొకో, ప్రేమతపస్సు తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఆకట్టుకునే వేషధారణలు

ఎంపీగా పార్లమెంటు సమావేశాల్లో విభిన్న వేషధారణలతో ఆయన రాష్ట్ర ప్రభుత్వ సమస్యలను తీసుకువెళ్లేవారు. ముఖ్యంగా ఏపీ విభజన సమయంలోనూ, ఆ తర్వాత ప్రత్యేక హోదా సాధన విషయంలో రోజుకొక వేషధారణతో వెళ్లి సభ్యులను ఆకట్టుకునేవారు.

చంద్రబాబు సంతాపం

మాజీ ఎంపీ శివప్రసాద్ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రజల మనస్సులో సుస్థిర స్థానం సంపాదించారని అన్నారు.

పురపాలక చట్ట సవరణ బిల్లుకు ఆమోదం

$
0
0

హైదరాబాద్: పురపాలక చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మంత్రి కేటీఆర్ ఈ రోజు ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు, పౌరుడే కేంద్రబిందువుగా మారాలనే లక్ష్యంతో ఈ బిల్లును తీసుకువస్తున్నట్లు తెలిపారు. సభలో ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం పొందింది.

చంద్రబాబు నివాసానికి మళ్లీ నోటీసులు

$
0
0

విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి సీఆర్‌డీఏ అధికారులు మళ్లీ నోటీసులు అంటించారు. వారం రోజుల్లో అక్రమ కట్టడాలను తొలగించాలని అందులో పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులకు సంతృప్తికరమైన సమాధానం రాలేదు అన్నారు. కాగా కృష్ణానదికి వరద ఉద్దృతి వచ్చినపుడు మునిగిపోయే అవకాశం ఉన్నందున వెంటనే ఇక్కడ నుంచి ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా నోటీసులు అంటించారు.

రాయలసీమకు వర్షసూచన

$
0
0

విజయవాడ: రాయల సీమ జిల్లాలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉందని తెలిపింది.

ప్రతి వేదికపై ఉగ్రవాద వ్యతిరేక పోరు

$
0
0

న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను కూడగట్టడంలో భారత్ విదేశీ విధానాల్లో భాగమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్భరుద్దీన్ అన్నారు. ఉగ్రవాద వ్యతిరేక పోరులో భారత్ రెండు విజయాలను సాధించిందని తెలిపారు. పూల్వామా దాడి జరిగినపుడు ఆ దాడిని వ్యతిరేకిస్తూ ఐరాసా భద్రతామండలిలో తీర్మానం చేయటం, యూఎన్‌ఎస్‌సీ ఖండించటం ఇదే తొలిసారి అని అన్నారు. అలాగే మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించటంతో భారత్ విజయం సాధించిందని అన్నారు. కశ్మీర్ అంశాన్ని ఐరాస సమావేశంలో పాక్ లేవనెత్తుతుందనే అంశంపై మాట్లాడుతూ అసందర్భ ప్రసంగాలతో తమ కాలాన్ని వృథా చేసుకోవటాన్ని వారికే వదిలేస్తున్నామని అన్నారు.

రెక్కలు( సండేగీత)

$
0
0

మనం ఏ పని చేద్దామని అనుకొన్న దానికి అడ్డువేసే వ్యక్తులు ఎందరో-
మన ఆకాంక్షలని, ఆశలని తక్కువ చేసేవాళ్ళే ఎక్కువమంది వుంటారు.
ఆ పనిలో మనం అనుకున్న విధంగా విజయం సాధించకపోతే - వాళ్ళు అనేమాట- ‘నేను ముందే చెప్పాను’.
అక్కడితో వూరుకోరు.
మన మొఖంమీద ఓ చిన్న నవ్వును విసిరి మనలని చిన్నబుచ్చుతారు.
మనం చేయబోయే పని విజయవంతం కాదని వాళ్ళు లక్ష కారణాలు చెబుతారు.
మనం ఎగరడం ఇష్టంలేని వ్యక్తులు ఎందరో
మన రెక్కలకి క్లిప్పులు వేసేవాళ్ళు మరెందరో
మనకు నేల ఎంత ముఖ్యమో, ఆకాశం అంతే ముఖ్యం. అందుకని మనం ఎగరాల్సిందే!
అందుకని వాళ్ళు మన రెక్కలకి
క్లిప్పులు బిగించకుండా చూసుకోవాలి.
అంతే!

పది సంవత్సరాలు

$
0
0

2029లో ఈ రోజు ఎలా వుంటుందో ఊహించండి. అలాగే పది సంవత్సరాల తరువాత మీరు ఎలా వుంటారో ఊహించండి. ఊహించడం కష్టమేమీ కాదు.
అదేవిధంగా పది సంవత్సరాల క్రితం మీరు ఎలా వున్నారో ఆలోచించండి. ఇప్పటికన్నా తక్కువ స్థాయిలో బహుశా మీరు వుండి వుండవచ్చు. మీలోని మార్పు మీకు తెలియకుండా జరిగి ఉండవచ్చు. లేదా మీరు ఉద్దేశ్యపూర్వకంగా మార్పుని తీసుకొని వచ్చి ఉండవచ్చు.
పది సంవత్సరాల వ్యవధిలో చాలా మార్పులు వచ్చి వుంటాయి. పిల్లలు పెద్దవాళ్ళయిపోయి వుంటారు. పైచదువులకి విదేశాలకి వెళ్ళి వుంటారు. కొంతమందికి ప్రమోషన్లు వచ్చి పైస్థాయికి చేరుకొని వుంటారు.
మన గురించి మనకు కొన్ని అంచనాలు వుంటాయి. వారం రోజుల్లోనే ఏదో సాధించగలమని అనుకుంటాం. అదేవిధంగా సంవత్సరంలో ఏమీ సాధించలేమని అనుకుంటాం. కొన్నిసార్లు చాలా ఎక్కువగా ఊహిస్తాం. మరికొన్నిసార్లు చాలా తక్కువగా ఊహిస్తాం.
ప్రతి సంవత్సరం కూడా ఏవో సాధించాలని కొన్ని ప్రణాళికలు వేస్తాం. చాలావాటిని మధ్యలో వదిలేస్తాం. ఈ సంవత్సరంలో అప్పుడే 70 శాతం గడిచిపోయింది. మిగిలిన 30 శాతంలో కూడా మనం అనుకున్నది సాధించవచ్చు.
కాలం ఆగదు. మనం ఉపయోగించుకున్నా, ఉపయోగించుకోకున్నా అది ఆగదు.


కబంధుడి చేత చిక్కిన రామలక్ష్మణులు ( అరణ్యకాండ)

$
0
0

జటాయువును సొదమీద పెట్టి, అగ్ని రగిలించి, తన తండ్రిలాగే ఆయనకూ నిప్పుపెట్టి జింక మాంసంతో పిండాలు చేశాడు. ఆ పిండాలను లేత పచ్చిక మీద వుంచి, బ్రాహ్మణులు స్వర్గప్రాప్తికోసం మనుష్య ప్రేతాలను ఉద్దేశించి ఏ మంత్రాలను చదువుతారో అవే చదివాడు. ఆ తరువాత గోదావరీ నదిలో తమ్ముడితో సహా స్నానంచేసి, జటాయువుకు నీళ్లు వదిలారు. మరణించిన గద్ద రాజు మహర్షి సమానుడైన రామచంద్రుడి చేత సంస్కారం పొంది పుణ్యలోకాలకు పోయాడు. ఇలా రామలక్ష్మణులు కర్మలు చేసి, జటాయువు మీదనే మనసుంచి, సీతాదేవి తనకు లభిస్తుందని ఆయన చెప్పిన మాటలను విశ్వసించి, సీతాదేవిని కలవాలన్న కోరికతో అడవుల జాడ పట్టుకునిపోయారు.
రాజకుమారులు రామలక్ష్మణులు ఇద్దరూ, నైరుతి మూలంగా కొంత దూరంపోయి, ఆ అడవికి మూడు కోసుల దూరంలోవున్న క్రౌంచారణ్యంలోకి ప్రవేశించి, అక్కడ బడలిక తీర్చుకోవడానికి మధ్య మధ్య చెట్ల నీడల్లో కూర్చుంటూ, అనేక అడవి మృగాలున్న ఆ అడవిలో సీతను వెతకసాగారు. ఆ క్రౌంచారణ్యం దాటి తూర్పుగాపోయి, మతంగవనంలో మూడు కోసుల దూరాన వున్న ఒక కొసను సమీపించారు. అది పాతాళంలాగా మిక్కిలి భయంకరంగా శాశ్వతమైన గాడాంధకారం లాగా వుంది. అక్కడ కొంచెం దూరం నుండే భయంకర రాక్షసి ఒకటి వాడి కోరలతో, తల వెంట్రుకలు విరియబోసుకుని, మృగాలను తినేదైన వేలాడే పొట్టతో రామలక్ష్మణులను అడ్డగించింది.
అడ్డగించిన తరువాత ముందు నడుస్తున్న లక్ష్మణుడిని నిలిపి, చేతులతో ఆయనను గట్టిగా కౌగలించుకుని, మొహంతో ఆ రాక్షసి ఇలా అన్నది. ‘‘ప్రియనాథా! నీకు నేను పెళ్లాన్నవుతాను. మనం బతికినంత కాలం అడవుల్లో ఏటి ఒడ్డుల్లో ఆడుకుందాం. త్వరగా రా...పోదాం. నా పేరు అయోముఖి అంటారు.’’ ఇలా ఆమె చెప్పగా లక్ష్మణుడు కోపంతో, కత్తి దూసి, దాని ముక్కు, చెవులు, చన్నులు నరికాడు. అది మొర్రో అంటూ మొత్తుకుంటూ వచ్చిన దోవలో వెళ్లింది. అది పోగానే, తమ దారిలో అడవిలోపోతున్న సమయంలో రామచంద్రమూర్తితో లక్ష్మణుడు ఇలా అన్నాడు. ‘‘అన్నా! గుండె చెదిరింది. ఎడమ భుజం అదురుతున్నది. ఏదో కీడు కలగబోతున్నట్లు అనిపిస్తున్నది. అన్నా! నా మాట విను. మనకేదో నష్టం రాబోతున్నది. యుద్ధప్రయత్నంలో వుందాం. కష్టంవచ్చినా మనకు జయం కలుగుతుందని కూడా శకునాల ద్వారా అర్థమవుతున్నది’’అని లక్ష్మణుడు చెప్పగా వాళ్లిద్దరూ అడవుల్లో వెతుక్కుంటూ పోతుండగా వారికి అడవిని చీల్చుకుంటూ పెద్ద ధ్వని వినిపించింది. అదేంటోనని అడవిలో వెతుకుతుంటే ఒకచోట ఒక భయంకరాకారం కనిపించింది.
పర్వతం లాంటి పెద్ద దేహం, పెద్ద రొమ్ము, తల మెడ లేకుండా, బిరుసు వెంట్రుకలు, నల్లటి మబ్బు లాంటి, ఉరుము లాంటి ధ్వని, నిప్పుల్లాంటి ఒంటి పెద్ద కన్ను, పెద్ద కోరలు, జింక-ఏనుగు మొదలైన అడవి మృగాలతో ఆడుకునే ఆసక్తి, యోజనం పొడుగు చేతులు కలవాడిని, నోరు తెరిచి వున్న వాడిని, తమ దారికి అడ్డంగా వున్నా వాడిని, కబంధుడిని సమీపించారు రామలక్ష్మణులు. ఆ రాక్షసుడు వీళ్ళిద్దరినీ తన రెండు చేతులతో పట్టుకున్నాడు. సూర్య తేజస్సు లాంటి తేజస్సు ఉన్నప్పటికీ, పెద్దపెద్ద విల్లు బాణాలు ఉన్నప్పటికీ, చేత కత్తులున్నా, మహాబలవంతులైన, ఆ సమయంలో వారిద్దరూ శత్రువు చేత చిక్కి ఆపదపాలయ్యారు. ధైర్యం, పరాక్రమంకల రామచంద్రమూర్తి వాటిని వదలలేదు. చిన్నవాడైనా లక్ష్మణుడు ధైర్యం చెడలేదు. అయినా, వ్యసన పడుతూ అన్నతో ఇలా అన్నాడు.
‘‘అన్నా! నాగతి చూశావా? రాక్షసుడి చేతుల్లో చిక్కుకున్నాను. వీడి నోట్లో పడేట్లు నన్ను వదిలి నువ్వైనా దూరంగా పరుగెత్తు. ఇద్దరిలో ఒకరు బతికినా మంచిదే కదా? ఏ విధంగానైనా నువ్వు నీ భార్యను కలుసుకుంటావని తోస్తున్నది. కాబట్టి నిన్ను ఒకటి ప్రార్థిస్తున్నాను. నువ్వు రాజువై రాజ్యసంపద పూర్తిగా అనుభవిస్తున్నప్పుడు నన్ను మర్చిపోవద్దు.’’అని లక్ష్మణుడు చెప్పగా, విని రామచంద్రుడు ‘‘లక్ష్మణా! నువ్వుకూడా పిరికివాడిలాగా, పామరుడిలాగా బాధపడ్తున్నావా? ఇప్పుడేం మించిపోయింది?.’’ఇలా వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుంటే ఆ భయంకర రాక్షసుడు ఇలా అన్నాడు.
‘‘మీరెవరు? విల్లు, బాణాలు, కత్తులు ధరించి వాదికొమ్ముల కోడెల్లాగా తిరుగుతున్నారు. ఆకలిగా వున్న నా నోట్లో పడడానికి ఇంత దూరం ఎందుకు వచ్చారు? నా బారిన పడ్డ మీరు ఏ ఉపాయం చేసినా బతకలేరు. మీకు వందేళ్ళు నేటితో ముగిశాయి.’’ అని ఇలా గర్వంతో అంటున్న రాక్షసుడి మాట విని తమ్ముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు రాముడు. ‘‘కష్టంమీద కష్టం కలుగుతున్న మనకు చివరకు ప్రాణానికే ముప్పువచ్చింది. ప్రియురాలు లభించకపోతేపోయే. భార్యను పోగొట్టుకుని మళ్లీ రాబట్టుకోలేక పోయాడన్న అపకీర్తికితోడూ రాముడు అడవిలో చచ్చాడన్న అపకీర్తికూడా వస్తున్నది. ప్రియురాలిని కష్టంనుండి తప్పించలేకపోయాను. ఆ పని అయినట్లయితే మరణ భయం లేదు. ఔరౌరా! ఏం ఆశ్చర్యం? భూమీద పుట్టిన ప్రాణులపైన కాలానికి ఎంత శౌర్యం వుందో చూశావా? నిన్ను, నన్ను కూడా దుఃఖంతో కృశించేట్లు చేసింది. మనగతే ఇలా వుంటే, కాలాని వశపడకుండా తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం? ఎంత గొప్ప ధైర్యంగలవారు, సత్య పరాక్రములు, లక్ష్యసిద్ధికలవారు, యుద్ధంలో శత్రువులకు సహింలేని పరాక్రమం వున్నా కాలం అనుకూలించకపోతే, ప్రతికూలిస్తే, నిర్వీర్యులై పడిపోతారు. దైవం ప్రాణులను చంపాలనుకుంటే అసాధ్యం ఏదీలేదు. విధికి అసాధ్యం వుందా?’’
-సశేషం

పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690

ఉత్తమ నటనకి అసలు పేరు.. సావిత్రి

$
0
0

ఫందొమ్మిది వందల 63, మే నెలలో ఆంధ్రపత్రిక ‘వీక్లీ’లో పడ్డ తెరమీద- తెరవెనుక శీర్షికకి సావిత్రిని యింటర్వ్యూ చేసినప్పుడు ఆమె మిగతా అందరి తెలుగు టాప్ స్టార్స్‌కన్నా ‘యమబిజీ’గా వున్నది. ఒకసారి ఫోన్ చేస్తే‘బొంబాయి వెళ్ళారండీ!’ అన్నారు. మరొకసారి ప్రయత్నం చేస్తే ‘‘హైదరాబాదులో వున్నాద’’న్నారు. సరే, ఈ స్పెషల్ ఫీచర్ ‘‘ఎక్స్‌క్యూజివ్’’... ప్రయివేటు- చిత్రాలతో మన వీక్లీలో అచ్చుఅవుతున్నప్పుడు కూడా ఆవిడ ఢిల్లీలో ఉన్నది. ఇక్కడ నేను చేసుకుంటున్న జ్ఞాపకాలు, రాస్తున్న సావిత్రి వ్యాపకాలు అలనాటివే ఎక్కువ భాగం ఆ రెండు వారాల నా అన్ని సచిత్ర శీర్షికనుంచి ఎత్తిరాస్తున్నాను యిప్పుడు.
ఇవాళ సావిత్రి గురించి తెలియని తెలుగువారు ఉండరు. (ప్రేక్షకులు). సొంతంగా రుూ మహానటి మీద అభిప్రాయం ఏర్పరచుకునే వుంటారెందరూ... అప్పుడామె మూడు రకాలుగా ‘‘బిజీ’’వుంది. తమిళ చలనచిత్ర రంగంలో సావిత్రి గణేషన్‌గా ‘‘టాప్’’, తెలుగులో సరేసరి, మూడో పాత్ర? నిజ జీవితంలో ‘‘కాదళ్ మన్నన్’’గా (మన్మధుడు అని అర్ధంట) వాసికెక్కిన జెమినీ గణేషన్ సతీమణిగా, ఇల్లాలుగా అంత బిజీగావున్న ఆమెని నేను పలకరించినప్పుడు ‘‘నిబ్బరం’’గా వుంది. తానే హాల్లోకి వచ్చి తొంగి చూసి ‘‘ఇదో వచ్చేస్తున్నానిప్పుడే ‘‘ఉక్కారుంగో’’అని అని నాలిక కరుచుకుని ‘‘వచ్చేస్తానిప్పుడే...’’అన్నది తెలుగులో. పదహారణాల నవ్వు నవ్వి. జెమినీ గణేషన్ సావిత్రిగారల గారాల పట్టి చాముండేశ్వరికి అప్పుడారేళ్ళు కాబోలు. ‘‘అది బళ్ళోకి వెళ్లింది’’ అన్నది. అంటే రుూ ఇంటర్‌వ్యూలో ‘‘మారాం’’చేయదు అన్న హామీ అన్నమాట.
శోభాయమానంగా అలంకరించి వున్న ‘‘ఇల్లు’’-అవతల చిన్ని ఉద్యానవనం పలకరిస్తున్నది. ‘‘తీరికవేళల్లో ఏంచేస్తారు?’’ మొదలు పెట్టాను సంభాషణల దాడి- ‘‘తీరికా? అదెట్లా ఉంటుందేం?’’అన్నది. పద్మరేకుల్లాంటి కనులను ఇలా విప్పారజేసి-
తీరికవేళల్లో వీణ వాయించుకుంటానందామె. తన టీపాయి మీద అప్పుడు జమున వీణవాయిస్తున్న ముఖ చిత్రం-వున్న వీక్లీ వున్నది- ‘‘నేరకపోయి కదిపాను, అనుకున్నాను. ‘‘అబ్బే!’’అన్నది. వారపత్రిక మీద గల ముఖ చిత్రాన్ని యిలా పట్టుకుని ఎద్దేవా చేసింది.
సహజంగా నటులు, కళాకారులు, రచయితల మధ్య మాత్సర్యం వుంటుంది.
‘‘జమున గ్లామర్ స్టార్ అప్పుడు’’.
వీణ వాయించడం తెలిసినవాళ్ళు అలా పట్టుకుని కూర్చోరు, అన్నది.
నా ఎదురుగా కూర్చున్న ఆమె పరిచారికకి ఏవో ‘‘స్నాక్స్’’గట్రా తెమ్మని సైగ చేస్తూనే
‘‘మరెలా పట్టుకుంటారో?’’ నేను రెట్టించాను.
సావిత్రి గారూ! ఆమెను ఆ పోజు యివ్వమని నేనే రిక్వెస్టు చేశా.
అలా ఫొటో తీయించుకున్నాను... ‘‘నేరం నాదే’’అన్నాను నవ్వుతూ అంటూనే నా ప్రశ్నను కొనసాగించాను- అంతలో ఆమె వీణ తెప్పించుకుంది.
‘‘అంటే మీరు వీణావాదనంలో ఎక్స్‌పర్టు అన్నమాటే!’’
ఫొటోగ్రాఫరికి ఆమె వీణతో వున్న ‘‘్ఫటో’’తీసుకోమని ‘‘సైగ’’ చేశాను.
‘‘ఏమిటి మీ ఉద్దేశ్యం? సావిత్రికి వీణరాదనా? పాట కూడా వచ్చును తెలుస్తోంది. అయితే పాడమనకండీ?’’ అని నవ్వేసింది.
వీణ శృతి చేసుకుంటున్నది. ఆమె జార్జెట్ చీర కట్టుకుని వచ్చింది.
నిండుగా కూర్చొని ‘వాతాపి గణపతి భజేహం..’ మొదట వాయించింది.
కుమారి జమున మీద ఏదో కామెంట్ చేసింది కూడా.
ఐతే ‘‘ఆఫ్ ది రికార్డ్’’అది. ‘‘సావిత్రిగారూ! మా బెజవాడలో ‘‘మీ ఫ్యాన్స్ ఎక్కువ’’ అన్నాను.
‘‘మన బెజవాడ’’అనండి. అన్నది నవ్వుతూ. జస్ట్ ఫ్రూట్‌జ్యూస్...
నాకు చాలు మాడమ్! అన్నాను.
‘‘నేను డిట్టో’’అన్నది. ఫొటోగ్రాఫర్ వేపు సంకేతించి ‘‘క్లాసు’’సరుకేనా అన్నది.
‘‘టాప్-’’మా బాస్ రాధాకృష్ణగారి మనిషి అన్నాను.
బయట ఉద్యానవనంలో ఫొటోలు బాగుంటాయి కదూ? అంటే వెంటనే బయట కుర్చీలు వేయించి
కొబ్బరి మట్టల మీద అరిటాకుల విన్యాసం లాగ వుండే ‘‘పెద్ద క్రోటన్ చెట్టు’’కూడా వుంది. దాన్ని ‘‘బ్యాక్‌గ్రౌండు’’గా ఫోజు ఇవ్వమన్నాను. అద్భుతంగా ఆ ఆకుల ముందునుంచి గొప్ప పోజు యిచ్చింది.
ఫొటోగ్రాఫర్‌ని ‘‘అపెర్చర్ ఎంత పెట్టావ్? అనడిగింది. అవుట్ డోర్‌లో, మిట్టమధ్యాహ్నం ఎండ నెత్తిన ఎక్కుతోంది... ‘‘లెవెన్’’పెట్టుచాలు అన్నది. ‘‘్ఫ్లష్’’మాత్రం కొట్టు అంటూ సూచనలు యిస్తూ ‘‘నాతో’’ అని కారు ప్రక్కన పోజుయిచ్చింది.
‘‘కారుమీద వద్దులేండి’’.
సోఫాకమ్ బెడ్ కమ్ వుయ్యాల వుందిగా అటూ. ‘‘పాండవోద్యాగ విజయాలలో శ్రీకృష్ణుని ఫోజు’’అంటూ నేనిచ్చిన సూచనకి నవ్వుతూ, నాటకాల అనుభవం మాత్రం వున్నట్లు లేదే మీకు? అన్నది. మీ ఉద్దేశ్యం నాకు అర్ధమయ్యింది అంటూ నాలుగైదు పోజులు, రెండు పర్యాయాలు చీరెలు మార్చి మార్చి సహకరించిందామె.
‘‘ప్యాకప్’’యింకా కాస్ట్యూమ్ ఛేంజీ లేదు. ఓన్లీ ‘‘టచ్ అప్’’అంటూ తానే మొహం ఇలా చిన్న అద్దంలో చూసుకొంది.
మామూలుగా ఉందిగా ‘‘నా పేటెంట్’’ భంగిమ మెట్లమీదకి ఎక్కి ల్యాండింగ్ మలుపులోనుండి క్రిందకి యిలా తొంగి చూసే పోజు. ఇవన్నీ చాలానే అయ్యాయి. ‘‘ఇన్ని ఫొటోలు తీస్తున్నారు.’’ అన్నీ పడతాయా? అన్నది కాస్త చిరాకుగా పడతాయా?’’ పట్టకపోతే చిన్న సైజుచేసి వేస్తాం’’ అన్నాను నవ్వుతూ.
ఆమె ఫొటోగ్రాఫర్‌ని చూస్తూ ‘‘ఇక నువ్వు దయచేయ్. ఎక్కడైనా రాంగ్ ఏంగిల్ వచ్చిందో? అంటూ నవ్వింది. తర్జని చూపించి ఆనక తనకి హిందీలో ఎంత డిమాండు వచ్చిందో చెప్పింది. ‘‘సౌత్ మీనాకుమారిగా తనకు ఎంతో ఖ్యాతి వుంది. అసలు సావిత్రి కనులకు ఉన్న భావ వ్యక్తీకరణ పటిమ, మరొకరికి లేదు. ‘‘గంగాకి లహరేం’’అన్న సినిమాకి మొదట మీనాకుమారిని అడిగారు. ఆనక ‘‘నన్ను తీసుకున్నారు’’అన్నది. ‘‘ఘర్ బసాకే దెఖో’లో నటిస్తున్నాను అన్నది. ఈ సుదీర్ఘమైన ఇంటర్వ్యూ రెండువారాలు వేశాను. ‘‘అందమైన కళ్లు విజయవంతమైన నటన’’అంటూ రైటప్ యిస్తూ... ఆమెది ఔచిత్యమెరిగిన నటన, సందర్భం తెలుసుకున్న భావ ప్రకటనా పటిమ అన్న వ్యాసాలు యిచ్చాను. తెలుగునాట- ఆ వీక్లీని ‘స్టాల్స్’లో నిలువునా తెరచి సెంటర్‌స్ప్రెడ్ కనపడేలా వ్రేలాడదీశారు. నిజానికి తెలుగు నటీమణులలో యింత స్పీడుగా ‘‘శత చిత్ర విజయాన్ని’’అందుకున్నవాళ్ళు మరొకరు లేరు.
అప్పుడు ఆమె కెరీర్ క్లయిమాక్స్‌లో వుంది.
‘‘చిన్నప్పుడు అంజలీదేవిగారు, అక్కినేని నాగేశ్వరరావుగారి సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని’’అన్నదామె. అనతి కాలంలో దక్షిణాది అగ్రశ్రేణి తారల సరసన ‘‘రైట్ రాయల్ వే’’లో చోటు సంపాదించుకున్నది.
తన పధ్నాలుగవ ఏట వెండితెర మీదకెక్కిన ఈ ‘‘నటి’’ని సంసారం సినిమాకి పిలిచి హీరోయిన్‌గాకాక ‘‘చిన్న సైడు పోర్షను’ఇచ్చారు. ‘‘పాతాళభైరవి’’లో (తెలుగు మరియు టామిల్‌లో) చిన్న డ్యాన్స్‌లో చోటుఇచ్చారు. తనే చెప్పింది. (తన జ్ఞాపకశక్తి అమోఘం.) 1951 నవంబర్ ఐదో తేదీనాడు ‘‘శాంతి’’అన్న సినిమాలో ముసిలి మొగుడి సరసన పడుచువేషం వేశాను. ‘‘అదే టర్నింగ్ పాయింట్’’. ఇంతకీ ఆ ముసలి మొగుడు ఎవరో తెలుసా? డా.గోవిందరాజుల సుబ్బారావుగారు (మాయలఫకీరు). అయితే సావిత్రిని ఆకాశపథాన ప్రత్యేక ‘‘తారగా’’నిలబెట్టింది. అక్కినేనిని ‘‘దేవదాసు’’ని పాత్రలో శరత్‌చంద్రుని ‘‘పార్వతి’’పాత్రలో (శరత్‌బాబు బ్రతికుంటే ‘్ఫదా’ అయిపోయేవాడు) ‘‘పార్వతి’’కి ప్రాణంపోసింది.
అరవ సినిమా ప్రేక్షకులు సావిత్రీ గణేశన్ అంటే పిచ్చెత్తిపోసాగారు. ఎస్వీ రంగారావు, సావిత్రిలకు అక్కడ ఒక్కటే ‘‘బిల్లింగ్’’
పది సంవత్సరాలు తిరగకుండానే 62నాటికి కథ విని తనకి పాత్ర నచ్చితేనే సినిమాలు ఒప్పుకునే స్థితికి ‘‘సూపర్‌స్టార్’’గా ఎదిగిపోయిందామె. ‘62లో ఆరు సినిమాలు చేసింది. కారు నడపడంలో స్పీడు జాస్తీ. జెమినీ కోప్పడుతాడుట. కెరీర్‌లోనూ అదే ‘‘స్పీడు’’. అందర్నీ మించిన ‘‘్ఫటోజెనిక్’’స్టార్ ఆమె. ఆమె యింటర్వ్యూ-చేయడం, రాయడం రెండూ కూడా నాకు ఒక ‘్ఛలెంజ్’ అయింది. సత్తువ కూడా చాలా ఖర్చు అయింది.
‘64 టైములైన్ దాటి నేను ఇక్కడ ప్రస్తావించను.
అప్పటికే తమిళంలో ‘‘పాశుమలార్’’ ‘‘పాపమన్నిప్పు’’ ‘కప్పలాట్టియ తమిళన్’లాంటి హిట్స్‌లో అలాగే తెలుగు వెలుగునీడలులో రికార్డులు బ్రద్దలుకొట్టిందామె. దొంగరాముడు, భలే రాముడు- ఏ రాముడైనా హీరోయిన్ ‘‘సావిత్రి’’అదరగొట్టేసిందన్నారు జనం. మాయాబజార్ అలాగే కన్యాశుల్కానికి అంటే ‘శశిరేఖ’కీ- ‘మధురవాణి’కి ప్రాణంపోసిన సావిత్రి అఖిల భారత ఖ్యాతి సంపాదించిందినాడే.
రక్తసంబంధం చిత్రం రెండు భాషల్లోను ప్రశంసాపత్రాలు అందుకుంది. ఇల్లు కట్టుకుంది. ఇల్లాలైంది. తల్లి అయింది. నేనెరిగిన నాటి సావిత్రి కథ ‘‘కీర్తికాంతులు’’ సుఖదీప్తిగలవే. ‘‘నా తమిళ చిత్రాలు హిందీలో తీస్తే నేనే వాటిల్లోను నటిస్తానన్నది’’ మహానటి సావిత్రి. టాలెంట్, అప్పీలు రెండూవున్న ఆమె నటన భావితరాలకు ఒక ట్రిటైజ్ నటనలో ఆమెదో ‘‘స్కూలు’’.
న్యూస్‌ప్రింట్ కొరత!
‘‘మాంచి ఊపు’’ అందుకుంటున్నది వారపత్రిక ప్రాచుర్యం. ఆ ‘‘టైము’’లోనే న్యూస్‌ప్రింట్ కొరత తగులుకున్నది. ఛాన్సు దొరికితే చాలు రాధాకృష్ణగారు న్యూస్‌ప్రింటు ఇక్కట్లు పాఠకులకు మనలో మాటగా వేరే నోటీసుగా అందిస్తున్న దశలో ‘‘ప్రకటనలు’’మాత్రం జోరందుకున్నాయి.
ఒక్కసారి 56 పేజీలే వేస్తున్నాం అని విన్నపాలు కూడా వేస్తున్నాము. ఇరవై ఎనిమిది పేజీలు ‘‘దాటకూడదు ప్రకటనలు’’అన్నారు. సరే, రుూలోగా పేజీలు నింపడం మరో సమస్య. బొమ్మలకోసం ఆర్టిస్టులకు పంపిన కథలు తిరిగి రావాలి. సెలక్షను అయిన కథలు రాధాకృష్ణగారి దగ్గరకుపోయి రావాలి. మధ్యలో పేజీలు ‘తెల్లముఖం’వేసుకొని కూర్చొనేవి. అప్పటికప్పుడు మేటర్ రాస్తూ కూర్చొనేవాణ్ణి- ‘‘అన్నీ దయ్యాల కబుర్లే.’’
కథ సీరియల్‌గా అలారాసిన కథయే- రాసి వెంటనే స్టాఫ్ ఆర్టిస్టు దశిక రామలింగేశ్వరరావుని పిలిచి బొమ్మవేయించి, కంపోజింగ్‌కి యిచ్చేసే వాణ్ణి. ‘‘ప్రకటనలు యిచ్చే ఆదాయమే’’- అసలు రాబడి కనుక ఆ డిపార్టుమెంట్‌లో పనిచేసే అటెండరు కూడా ‘‘మీ జీతాలు కూడా మేమే యిస్తున్నాం’’అండీ అని మాట్లాడేవాడు. చివరి క్షణంలో ప్రకటనలు వస్తే ఇక ఏదో ఒక శీర్షిక లాగిపడేయాలి.
పైగా ఆడవాళ్ళ శీర్షికలలో ప్రకటనలు పెట్టాలి అనేవాడు మా ‘నందకుమారుడు’ అన్నయ్యగారు. అసలు అడ్వర్‌టైజుమెంటు మానేజరు రామచంద్రయ్య డైలీకి అంకితం. వారపత్రికకి ప్రకటనలు కాపీలు తెచ్చేది,యిచ్చేది.. అంతా యంగ్‌మ్యాన్ నందకుమార్- అతణ్ణి చూస్తూనే-
‘‘నందకుమార్ రావయ్యా! మా భాగ్యంకొద్దీ దొరికావయ్యా... ఆ... ఆ?’’అని మాయాబజార్‌లో లక్షణకుమార్ (రేలంగి) పాత్రను పొగిడే స్టయిల్లో పాడే వాణ్ని గాని లోపల మండిపోయేది. వాళ్లు కావాలన్న ‘‘చోటు’’యివ్వాల్సిందేనంటారు ‘‘యాడ్స్’’వాళ్ళు-
‘‘ఇస్యూ’’క్లోజ్‌డ్ అనేవాణ్ని. పాఠకుడు వీళ్ళకన్నా కఠినాత్ముడు. నా ‘‘పౌండ్ ఆఫ్ ఫ్లెష్ నాకిచ్చీ అంటాడు. అంతా ప్రకటనలేనా? మాకు ‘సొడ్డు’’పెడుతున్నారు అంటూ ‘యాగీ’చేసే ‘లెటర్స్’సంఖ్య పెరిగింది... హాయ్! అల్లాహీ!
ఒక్కోసారి సర్కస్‌లో ‘దండెం’మీద గడకర్ర పట్టుకుని ‘‘్ఫట్స్’’చేసే దొమ్మరి సానిలాగా నాకు నేను కనపడేవాణ్ణి. ఆ టైములో నా ఫ్రెండ్ వాకాటి పాండురంగారావ్ గారొచ్చాడు. ఆయనకి ఆంధ్రపత్రిక అన్నా నా కథలన్నా చాలా యిష్టం. దానితో కారణం వుంది. వాళ్ళ నాన్నగారు కృష్ణమూర్తిగారు సర్క్యులేషన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారుట.
నావైపు చూస్తూ గంభీరంగా మొహంపెట్టి ‘‘నో రిప్లయి’’ మీ దగ్గరనుంచి నా ఉత్తరాలు అందకుండా వుండవుగాని... డోన్ట్‌కేర్ (యిలా నోరు పూరించి) అంతా ఆ సీటు మహిమ..అన్నాడు (వాత్సల్య భరిత) కోపంగా-
ఒకరి అంపశయ్య మరొకరి తూగుటుయ్యాల ‘‘స్వామీ’’అన్నాను నవ్వుతూ. ఆ టైములోనే మేము పాఠకులకి ఇంకా ఎక్కువ మ్యాటర్ యివ్వడంకోసం వీక్లీ ‘‘కాలమ్’’ వెడల్పు ఎక్కువ చేశాం. అంతేనా? నా బొమ్మలు, శీర్షికల పేర్లు చిన్నవిచేయాలి. అనుకున్నాం...

(ఇంకా బోలెడుంది)

సమోసాల మతలబు!

$
0
0

మనలను మనం మాటలతో మోసం చేసుకోగూడదు
- పెర్సివాల్ లోవెల్
చెహరా అనే మాట ఈమధ్యన ఎక్కువగా వినిపించడంలేదు. ఉర్దూలో ఈమాటకు ముఖం అని అర్థం. తెలిసినముఖం అనడానికి జానా పహచానా చెహరా అనడం ఈ భాషలో అలవాటు. తెలుగులోమాత్రం అదే మాటకు మరేదో అర్థం ఉన్నట్లు అనుమానం. ఆచూకీ అంటే ఏమిటోనాకు తెలిదయు. ఈ మాటకు పతా, లేదా చిరునామా, లేదా ఉనికి లేదా ఎక్కడ ఉన్న సంగతి అని అర్థం అనుకుంటున్నాను. అది తెలుసుకోవాలంటే చెహరా ప్రసక్తిలోకి వస్తుంది. చెహరాలు దొరకడంలేదు అంటే ఉనికి గురించి సూచనలు, ఆధారాలు దొరకడంలేదు అనే అర్థం వచ్చే వాక్యాలు ఒకప్పుడు కనిపించేవి.
అన్నిటికన్నా ఆసక్తికరమైన మరొక మాట కచ్చేరి. కచహరి అంటే ఆఫీసు అని అర్థం. దీనికి తెలుగులో మాట లేదు. వెంటనే ఉంది, కార్యాలయం అంటారు. అది సంస్కృతం. పనిచేసే చోటు అంటే మనవాళ్లకు అందంగా కనిపించదు. పోలీసులను రక్షణ భటులు అంటే బాగుంటుంది. కావలివాళ్లు అంటే బాగుండదు. తమిళ్‌లో మాత్రం కావల్ అనే అంటారు. అదే పద్ధతిలో ఈ కచేరీ తెలుగు మాటగా చెలామణి అవుతున్నది. కోర్టు చేరి అంటే వ్యాజ్యాలు, వ్యవహారం అని అర్థం ఇంట్లో అయినా సరే బయటివాళ్ళు వచ్చి కూర్చుని సంప్రదింపులు చేసే గదిని కచేరి అనడం మనవాళ్ళకు అలవాటు. ఆసక్తికరం అని ఎందుకు అన్నారు అంటే, సంగీత సభ జరుగుతుంది,దాన్ని పట్టుకుని అక్కడ ఏదో వ్యవహారం జరిగినట్టు కచేరీ జరిగింది అని మనవాళ్ళు చెప్పుకుంటారు. సంగీతం సరదాగా, మానసిక ఆనందం కొరకు జరిగే ఒక కార్యక్రమం. అది వ్యాజ్యంగా, వ్యవహారంగా ఎందుకు మారిందో తెలియదు. కంచి ఆచార్యులు శంకర విజయేంద్రులకు సంగీతంలో నాకుగల ఆసక్తి గురించి తెలుసు. నేను చేసే కార్కలాపాలు కూడా తెలుసు. ఆయన దూరం నుంచి నన్ను చూసి, పేరు గుర్తుచేసుకోలేక, సంగీతం, కచేరీ అన్నారు. ఆ తరువాత హైదరాబాద్ అయ్యంగార్ అన్నారు.
మాటల వెనుక అర్థాలు వేరు. సినిమా పాట ప్రకారం ఆడవారి మాటలకు అర్థాలు వేరు. నా మాటప్రకారం చాలా మాటల వెనుక దాగివుండే అర్థాలు వేరు. వెతికి వాటిని అర్థం చేసుకుంటే మతలబు తెలుస్తుంది. మెంటల్ అంటారని తంటాలు పడకుండా, కొంటెతనానికి పోకుండా ఉంటే కొంత మంచి జరుగుతుంది.
ఉత్తరం రాస్తారు. ఇప్పుడా అలవాటు లేదు గానీ, మొన్నమొన్నటివరకూ కార్డు, ఇన్లాండ్ కవర్ లాంటివి ఉండేవి. అంతా రాసిన తురవాత చటుక్కున ఏదో ముఖ్యమైన విషయం గుర్తుకు వస్తుంది. అప్పుడు చివర మళ్లీ ఒక ముక్క చేరుస్తారు. ఇంగ్లీషులో ఇటువంటి ముక్క ముందు ఎన్‌బి అని పొడి అక్షరాలు ఉంటాయి. నిజం చెబుతున్నాను. ఆ మాలను ఎలా విస్తరించాలో నాకు తెలియదు. తెలిసినవాళ్ళు చెప్పి పుణ్యం కట్టుకోండి. ఒకప్పుడు తెలుగులో ఇటువంటి మాటకు ముందు తాజాకలం అన్నమాటను చేర్చేవారు. తాజా అగంటే తెలుగుమాట అని అందరూ ఒప్పుకుంటారు. నేను మాత్రం ఒప్పుకోను. తాజా అన్నది అసలుసిసలైన ఉర్దూమాట. దానికి అప్పుడే సిద్ధమైనది, అంటే ఫ్రెః అని అర్థం. ప్రతిరోజూ మధ్యాహ్నం మా ఇంటి ముందుగా సైకిల్‌మీద ఒక అతను సమోసాలు అమ్ముతూ తిరుగుతాడు. ఆయన అమ్మే సమోసాలు ఎప్పుడు తయారైనది తెలియదు. ఎంతసేపుగా అతను ఊరుమీదపడి వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నది కూడా తెలియదు. అతను మాత్రం సాయంత్రందాకా గరంగరం సమోసే, తాజా సమోసే అంటూనే ఉంటాడు. నాకు అక్కడ వ్యాకరణం ఒప్పుకోని ఒక సమాసం తోస్తుంది. మోసముతోకూడినది సమోసము లేదా సమోసా అనిపిస్తుంది. కానీ అది తప్పు, తప్పున్నర. చెప్పింది బాగుంది కానీ తప్పున్నర తరువాత తప్పున్నొకటి కూడా ఉంటుందా? కన్యాశుల్కం నాటకంలో గిరీశం శిష్యుడు వెంకటేశంతో బాటు వాళ్ల ఊరు వెళ్తాడు. అక్కడ ఒక పెద్దాయన గిరీశాన్ని చూచి ఈ తురక ఎవడోయ్ అని అడుగుతాడు. అంటే అతను బహఉశ లాగు, లడాయి వేసుకుని గానీ ఉన్నాడేమో. లాగు అంటే బాగానే ఉంది. కేవలం ప్రాస కలిసింది కదా అని లడాయి అన్నారు తప్పితే లాగుకూ లడాయకీ సంబంధం ఎక్కడిది. లడాయి అంటే తంపులాట, కొట్లాట అని కదా అర్థం. మన దేశంలో కలకాలంగా ఇస్లాము మతానికి చెందిన ముస్లిములు చాలామంది ఉన్నారు. ముసల్మాన్ అనే మాట ఇంగ్లీషులోకి వచ్చి ముస్లుం అయింది. ముసల్మానులలో వేరువేరు దేశాలవారు ఉంటారు. అరేబియా దేశాలకు చెందిన వారు అరబ్బులు, మరికొంతమందిపఠాలు. అదేరకంగా తుర్కిస్తాన్ అని టర్కీకి చెందినవారు తుర్క్‌లు. వారే తురకలు. అంతేగాని అదేదో అవమానకరమైన మాట ఏ మాత్రంకాదు. ఒకప్పుడు నేను మృగనయని అనే టీవీ సీరియల్‌ను తెలుగులోకి మార్చే ప్రయత్నంగా పైలెట్ స్క్రిప్ట్‌ను అనువదించారు. అందులో తుర్క్ దేశంవారు దాడి చేశారు అని అర్థంవచ్చే మాట ఉంది. దాన్నినేను తురకలు దాడిచేశారు అని అనువదించాను. అధికారులకు అది నచ్చలేదు. ముస్లింలలు దాడి చేశారు అని రాయించారు. తురకలు ముస్లింలే కానీ ముసల్మానులు అందరూ తురకలు కాదు అని మనవాళ్ళకు తెలియదు. కన్యాశుల్కం పద్ధతిలో ఆ మాట అదేదో అనకూడనిది అని అందరికీ ఒక అభిప్రాయం.
ఇంతవరకు తురకల భాష ప్రభావం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నట్లు అనుమానం కలిగింది. మొదట్లో ఇంగ్లీషు మాటలు కూడా కొన్ని అనుకున్నాము. అదేమీ లేకుండా మన తెలుగులోనే మనవాళ్ళకి అర్థం కాని మాటలు కావలసినన్ని ఉన్నాయి, అన్నది అందరూ ఎరిగిన సత్యం. ఒకప్పుడు ప్రజా గాయకుడు వంగపండు ప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటికి ఇంకా ఆంధ్రప్రభ వార పత్రిక ఉండేది. అందులో ఆయన రాసిన కథ ఒకటి వచ్చింది. అది అసలుసిసలైన కళింగాంధ్ర భాషలో వుంది. నేను దాన్ని యాస అనడంలేదన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలి. మొత్తం కలిపి ఒకే భాష కాదు. ఈమాట ఇలా అంటున్నందుకు నన్ను అందరూ క్షమించండి. ప్రతి ఇరవై కిలోమీటర్లకు తెలుగు నాః అర్థంకాని స్థాయికి మారిపోతుంది. ప్రసాద్‌గారి కథ చాలా ఓపికగా చదివాను. ఇంతకుముందే గణేష్ పాత్రో, రంధి సోమరాజు, రావిశాస్ర్తీ లాంటి మహామహుల రచనలను ఎంతో ఓపికగా చిదివాను. ఆ మాటల మీద వల్లమాలిన అభిమానం పుట్టింది. కనుక విశాఖ వెళ్ళే అవకాశం వచ్చినపుడల్లా అక్కడి వారి మాటలను చాలా జాగ్రత్తగా విన్నాను. హాస్టల్‌లో ఒకసారి ఆ ప్రభావంతో నేను వేసిన ఒక డైలాగ్ విని నా మిత్రుడు ఒకడు నీవు తప్పకుండా కళింగాంధ్ర వాడివి అని నాతో వాదం వేసుకున్నాడు. భాషలోని భేదాలపట్ల నాకున్న ఆసక్తిని చెప్పడానికి మాత్రమే ఈ సంగతులన్నీ ప్రస్తావిస్తాను. మొత్తం ప్రసాద్‌గారితో నేను ఒక ప్రస్తావన చేశాను. ఆయన కథను నేను తెలంగాణ భాషలో రాస్తాను, అన్నాను. అప్పుడది ఇక్కడి వారికి కూడా అర్థం అవుతుంది అన్నాను. హాయిగా నవ్వుకున్నాము తప్పిస్తే ఆ పని మాత్రం జరుగలేదు. దేవరాజు మహారాజు, నందిని సిద్ధారెడ్డి లాంటివాళ్ళు అప్పట్లో తెలంగాణ భాషలో కవితలు, కథలు రాస్తే చాలామందికి అర్థం కాలేదు. నేను ఒక అంతర్జాతీయ బహుమతి పొందిన యూరోపియన్ కథను గ్రామీణ వాతవారణం ప్రతిబింబించాలని కోరికతో తెలంగాణ భాషలో అనువదించి పంపితే ఒకానొక ప్రసిద్ధ పత్రికవాళ్ళు అర్థం కాలేదు అన్నారు. భాష పరిస్థితి ఇలా ఉంటుంది. కిటికీ అన్నమాట యూదులనుండి మనకు వచ్చింది, అనినేను ఇవాళ చెబితే అందరూ ముక్కున వేలు వేసుకుంటరా. మనకు తెలిసింది గవాక్షం. వెనకట మేము తనబ్బీ అనే వాళ్లం. అది అప్పుడు తురకలకు కూడా తెలియదేమో. గవాక్షం అంటే అది సంస్కృతం అసలు తెలుగు మాట ఏమిటి? నాకు తెలియదు.
సాలెపిల్లు శెత్తిరి గుడుమలు అంటే ఏమిటి? ఎవరైనా చెపితే సంతోషిస్తాను. ఎవరైనా చెప్పగలిగితే వాళ్లు తప్పకుండా పాలమూరి వాండ్లే అయ్యుండాలి. సాలె అంటే శాల. అంటే పాఠశాల. అంటే బడి. సాలెకువొయ్యే ఈడొచ్చింది, లేకుంటె యాలయింది అనుడు మాకు అలవాటే. అర్తమవుతది గూడ. గుడ్కంగ అంటే కూడా అనే మాటకు మరొక రూపం ఎర్కేనా, శెత్తిరి అనేది చతురులు నుంచి వచ్చిందేమో అని నా అనుమానం. అంటే తుంటరివారలని భావము. ఇక గుడుమలు అనే మాట నేను మా ఊర్ల ద్ప ఇంక యాడ ఇనలేదు. ఆ మాటకు గూడ తుంటరులనే అర్తము కాదంటే అర్థము. ఇపుడు మ ఊరి వాండ్లకు సుత అంటే కూడా ఈ మాట తెలియకపోవచ్చు.
నేను ఈ తీరున ఎన్ని ముచ్చెట్లయిన చెప్పగలుగుత. చెప్పాలనే నా బాధ గూడ. ఏదో ఒకరకంగా మాటలు కాయింతెం మానికి ఎక్కాలె. అచ్చుతప్పు కానే కాదు. కాయింతెం అంటే కమ్మ. కాగజ్. అపుడు ఆ మాటలు ఎవరికన్న కనవడుతయి. లేదంటె మనుసులల్ల మనుషులల్ల మాయమయిపోతయి. మారు గూడ మాకు దెలిసిన మాటలు చెప్పండి. అందరికి దెలిసెటట్టు వాటి మతలబు ఈడ రాతము. అవి తెలంగన లేకుంటె తెలంగాణ మాటలే కావాలని లేదు. తెలుగులో ఎంత వైవిధ్యం ఉన్నది చెప్పేందుకు ఇదొక ప్రయాస... అంతే.

ఏకాంతంలో..

$
0
0

ఏకాంతంలో నేనొక
ప్రశ్నల పుట్టనయిపోతాను
ఎనె్నన్నో ప్రశ్నలు!
నేనెవరు?
నా గమ్యం ఏమిటి?
నా గమనం ఎటువైపు?
మనసు సంద్రంలో
ఏవేవో ప్రశ్నల కెరటాలు!

ఏకాంతంలో నేనొక
అక్షరాల చెట్టయిపోతాను
వాక్యాల కొమ్మలకు
ఊగుతుంటాను
నావేలి కొసలు ప్రసవించిన
అక్షరాలను ప్రేమగా
నిమురుతుంటాను!

ఏకాంతంలో నేనొక
ఆలోచనల బుట్టనయిపోతాను
అందమైన జ్ఞాపకాల పూలతో
అంతర్మథనపు తీయనిపళ్ళతో
నన్ను నేను
నింపుకుంటాను!

కాసింత ఏకాంతం
పంచే పరిమళాన్ని
ఒకింత వౌనం
నింపే ఆహ్లాదాన్ని
ఎప్పటికీ పోగొట్టుకోలేను!

ఎందుకంటే
ఏకాంతం
నన్ను శిలలా చెక్కే ఉలి
నేను మనసు పారేసుకున్న చెలి!

నిత్య చైతన్య కవిత్వమా!

$
0
0

ఈ మిట్ట పల్లాల బతుకు నీడలేద
సాహిత్యపు దారిన నే పయనిస్తుంటే
నను కదలకుండ బిగిస్తుంటిని
ఓ ప్రేమామృత కవిత్వమా!

నీపై నాకున్న అభిమానం నీకు తెల్సి
ఏదైనా సొంపైన కవిత్వం రాయమని
నాలో ఎగిసిపడుతుంటివి
ఓ చిరునగవుల కవిత్వమా!

మబ్బులపై తేలియాడే పక్షుల తోరణాలవలె
కొండల్లో జాలువారె నదీ సోయగాలవలె
వసంత కోకికల రాగాలవలె
సుమధుర గేయాల రాయిస్తుంటివి ఓ బహువనె్నల కవిత్వమా!

ఇలా అయితే నాకు తీరికెలాయని
నే సాగర పాతాళంలో దాక్కుంటె
మత్యగ్రంధివైవచ్చి నా కళ్ళు మూస్తుంటివి
దాగుడుమూతలతో నన్నాట పట్టించకమ్మా
ఓ మాయలమారి కవిత్వమా!

నీకందొద్దని ఆకాశానికెగిస్తే
చంద్రుడిపై మోజుగల తారలవలె
నన్నాకర్షిస్తూ నీ వలలో పడేస్తుంటివి
ఓ తళుకులొలుకు కవిత్వమా!

దారేది కానరాక నీకందకుండా
నే దైన్యంగా పరుగెడుతూంటే
దివ్య వాగ్దేవివై అమృత సుభాషితాల వర్షిస్తుంటివి
ఓ మహత్వ పూర్ణ కవిత్వమా!

సరే! రావమ్మా! ఓ సృజనశీల కవిత్వమా!
నీ కృపామలంతో కాలానుగుణ
కవిత్వ శిఖరాన్నధిరోహిస్త
నను వీడిపోకమ్మా ఓ నిత్య కవిత్వ చైతన్యమా!

Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>