Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

ఖర్చులకు కళ్లెం!

$
0
0

డబ్బు సంపాదించడం కన్నా ఖర్చు చేసే విధానం కూడా కీలకమే. ఎంత సంపాదిస్తేనేం ఖర్చుపై అదుపు లేకపోతే పొదుపు ఉండదు. పొదుపు లేనప్పుడు మీ వద్ద సంపదా ఉండదు. సంపాదించడం ఒక కళ అంటారు. సంపాదించడమే కాదు ఖర్చు చేయడం కూడా కలే.
మాట్లాడ కూడని సమయంలో మాట్లాడడం ఎంత తప్పో, మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడక పోవడం కూడా అంతే తప్పు. మాటలకు సంబంధించిన నియమమే ఖర్చుకు సంబంధించి కూడా వర్తిస్తుంది. ఖర్చు చేయాల్సిన సమయంలో, చేయాల్సిన సందర్భంలో ఖర్చు చేయాల్సిందే. అదే సమయంలో అవసరం లేని ఖర్చు తలకు మించిన భారం అవుతుంది. ఏది అవసరం ఐన ఖర్చు? ఏది అనవసర ఖర్చు అనే దానిపై మొదటి నుంచి అవగాహన ఉంటే ఆర్థిక శాస్త్రం అబ్బినట్టే ఇలాంటి వారికి ఆర్థిక స్వాతంత్య్రం లభించకుండా ఎవరూ ఆపలేరు.
ఈకాలంలో ఐటి కంపెనీల్లో ఉద్యోగాలు చేసే వారే కాదు సాధారణ చదువులు చదివిన వారు సైతం ఆన్ లైన్‌లో కొనేస్తున్నారు. ఓ రెండు దశాబ్దాల క్రితం ఆన్‌లైన్ మార్కెట్ మొదలైనప్పుడు బుడగలా పడిపోయింది. అప్పుడు అందరూ అనుకున్నట్టే జరిగింది. చీపురు కట్టను సైతం పట్టుకుని చూసి సంతృప్తి చెందిన తరువాతనే కొనడం భారతీయుల అలవాటు ఆన్‌లైన్‌లో చూసి కొనడానికి అసాధ్యం ఆన్‌లైన్ మార్కెట్ నిలబడదు అనుకున్నారు. కానీ ఇప్పుడు చదువుకున్న వారు పెద్దగా చదువు లేని వారు అనే తేడా లేదు. పిల్లలు పెద్దలు అనే తేడా లేదు. వస్తువులే కాదు చివరకు ఇంట్లో ఉదయం టిఫిన్ కోసం సైతం ఆన్‌లైన్‌లో స్విగ్గీని ఆశ్రయించేస్తున్నాం.
సాధారణంగా మన అందరం చేసే ఖర్చులను గమనించిన తరువాత ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై నిపుణులు కొన్ని సూచనలు చేశారు. కొన్నిసార్లు మనం ఈ వస్తువు కొని తీరాలి అనుకుంటాం. ఎంత ధర ఐనా సరే ఇప్పుడే ఇక్కడే కొనేస్తాను అనుకుంటారు. నచ్చిన దుస్తులు కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్ కావచ్చు. మొదటి రోజు మొదటి ఆట టికెట్ కావచ్చు. ఎంత డబ్బయినా సరే బ్లాక్‌లో కొని మొదటి రోజు మొదటి ఆట చూడడం కొందరికి ఓ అలవాటు. భవిష్యత్తు గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ఇలాంటి వాటికి అలవాటు కావద్దు. రెండు రోజులు ఆగితే ఆ సినిమా సగం ధరతో చూడవచ్చు. మార్కెట్‌లో రోజుకు డజను సెల్‌ఫోన్ మోడల్స్ వస్తున్నాయి. ఇప్పుడున్నది సరిపోదా? అని మీకు మీరు ప్రశ్నించుకోవాలి.
ఆన్‌లైన్ కొనుగోలు వల్ల ఎంత ఖర్చు చేస్తున్నామనే ఆలోచన ఉండదు. ఆన్‌లైన్‌లో ఏం కావాలో టిక్ పెడితే చాలు. క్రెడిట్ కార్డు పిన్ నంబర్ నొక్కితే చాలు. చేతి నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు కాబట్టి ఈ వస్తువు ధర ఇంత ఉంటుందా? అవసరమా? అనే ఆలోచన రాదు.
ఖర్చు మీద అదుపు ఉండాలి అంటే ఒక వస్తువు కొనేప్పుడు మీకు మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఒక షాప్‌లో కొనే వస్తువు కావచ్చు. ఆన్‌లైన్‌లో కొనడం కావచ్చు. ఒక వస్తువు ఖరీదు ఐదు వేల రూపాయలు అనుకుందాం. అది కొనేప్పుడు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. నెలకు కనీసం 26 రోజులు ఉద్యోగం చేస్తారు. రోజుకు ఎనిమిది గంటలు కష్టపడతారు. మీ జీతం గంటకు ఎంతో లెక్క తేల్చండి. మీరు కొనే వస్తువు మీ ఎన్నిగంటల శ్రమనో ప్రశ్నించుకోండి. అన్ని గంటల శ్రమతో ఆ వస్తువును కొనడం అవసరమా? ఆ మేరకు ఆ వస్తువు వల్ల నువ్వు ప్రయోజనం పొందగలవా? అని మిమ్ములను మీరు ప్రశ్నించుకోవాలి. ఈ రోజు ఐదువేల రూపాయలతో వస్తువు కొనుగోలు చేశారు బాగానే ఉంది. ఇదే ఐదువేల రూపాయలను భవిష్యత్తు కోసం ఇనె్వస్ట్ చేస్తే 10-20 ఏళ్లలో ఆ మొత్తం ఎంత అవుతుంది అని కూడా అంచనా వేయాలి. ఇదేం లెక్క అనిపించవచ్చు. వృధా ఖర్చులను ఇలాంటి ఆలోచనే అదుపు చేస్తుంది. ఓ 10-15 ఏళ్ల క్రితం యాదగిరిగుట్టలో పదివేలకు ఎకరం లభించేది. ఇప్పుడు ఐదారు కోట్ల రూపాయలు పెడితే కానీ ఎకరం లభించదు. కనీసం తొమ్మిది శాతం వడ్డీ లెక్కలతో చూసుకున్నా ఈ రోజు వృధాగా చేసిన ఐదువేల రూపాయలు ఇరవై ఏళ్ళలో భారీ మొత్తం అవుతుంది.
ఈ రోజు వృధా ఖర్చు ఐదువేలే లే పోతే పోయింది అనిపించవచ్చు. కానీ ఈ రోజు విలువతోనే చూడవద్దు అదే మొత్తాన్ని ఇనె్వస్ట్ చేస్తే పది ఇరవై సంవత్సరాల్లో దాని విలువ ఎంత ఉంటుంది అని కూడా ఆలోచించాలి. ఇదే మొత్తాన్ని మీ రిటైర్‌మెంట్ కోసం ఇనె్వస్ట్ చేస్తే పెద్ద వయసులో పిల్లల కన్నా పెద్ద అండగా నిలుస్తుంది. ఏ ఖర్చు చేయాలన్నా దాని వస్తవ విలువ ఎంత ఉంటుంది అని చూడాలి. నచ్చింది కదా ఎంతైనా ఓకే అనే తత్వం వద్దు .
అసలు ఖర్చే చేయకూడదు అని కాదు. దేనికి ఖర్చు చేయాలి ఎంత వరకు ఖర్చు చేయాలి. మనం కష్టపడి సంపాదించిన దానికి తగిన విలువ పొందుతున్నామా? అనే ఆలోచనతో ఖర్చు చేయాలి. అనివార్యంగా చేయాల్సిన ఖర్చులు ఉంటాయి. దానిని ఆపలేం. అపాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఏది అవసరం? ఏది అనవసరం అనే అవగాహన ఉండాలి.
పెద్దగా అవసరం లేని దానికి ఇప్పుడో పది వేల రూపాయలు ఖర్చు చేద్దామా? అలా చేస్తే కలిగే ప్రయోజనం? లేకుండా ఆ పదివేలు రేపటి కోసం ఇనె్వస్ట్ చేస్తేకలిగే దీర్ఘకాలిక ప్రయోజనం ఏమిటి? అని మీకు మీరు ప్రశ్నించుకుని మీ మనసు చెప్పిన సమాధానాన్ని విని, ఆచరిస్తే మీ భవిష్యత్తుకు ఢోకా లేదు.


సీతమ్మ తాతగారు

$
0
0

తుషార నిశ్వాసల్లో మన్యం మత్తుగా నిదురపోతుంది. శిశిరభానుని మన్యప్రవేశాన్ని నీరదాలు నిరాకరిస్తున్నాయి. నిరీక్షణా తాపంతో రగిలిన ఆ చలిదీపం తన మయూఖాస్త్రాలతో మబ్బుల్ని మంచుని చీల్చి మన్యాన్ని వెలిగించింది. మన్యం మత్తు వదిలింది. అస్తాల తాకిడకికి మత్తు వదిలిన కొన్ని జీవులు కూసాయి, కొన్ని లేచాయి. అలా లేచిన ఒక జీవి మారేడుమిల్లి రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుంది. ఒక చేతిలోకర్ర, కర్రకి వేళ్ళాడగట్టిన వాటర్‌బాటిల్, తలకి మఫ్లర్ శరీరానికి స్వెట్టర్ తగిలించుకున్న ఓ పద్ధెనిమిదేళ్ళ కుర్రాడు అడవిలోని చిన్న గుట్టమీదకెళ్తున్నాడు. అతను రోజూ తిరిగే ప్రదేశమే. తెలిసిన అడవే. కాని ఆ కుర్రాడికి అప్పుడు తెలియదు మరో రెండు నిముషాల్లో తను ఎప్పుడూ చూడని దృశ్యం ఒకటి అడవిలో చూడబోతున్నాడని. అదే.. మనిషి
ప్రకృతి పచ్చని పైటమీద చిమ్మిన ఈ రుధిర వర్ణకథ.
సీతమ్మ, సీతమ్మ తాగారిని చూడ్డానికి రంపచోడవరం ఊరంతా కదిలొచ్చింది. మారేడుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రాంగణం మనుషులతో నిండిపోయింది. వచ్చిన జనాన్ని పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. తమని లోపలికి పంపాలని ఎంత బ్రతిమిలాడినా, ముందు నిలబడిన ఓ పదిమందిని మాత్రమే లోపలకి పంపి మిగిలిన జనాన్ని ఆరోగ్య కేంద్రం బయటే నిలబెట్టేశారు పోలీసులు. లోపలకెళ్ళిన జనానికి ఒక గదిలో సీతమ్మ, సీతమ్మ తాతగారు పక్కపక్కనే కనిపించారు. బయట వున్న జనం సీతమ్మని చూడ్డానికి వదలాలని పోలీసులని అర్థిస్తున్నారు. సీతమ్మని ఇంతగా ప్రేమిస్తున్న వీళ్ళు ఆమెని దాదాపు పదిహేనేళ్ళ క్రితం రంపచోడవరంలో మొట్టమొదటిసారి చూశారు.
మందార మొక్కలకి నీళ్ళు పోస్తూ కనిపించింది ఓ ముగ్ద మందారం. పువ్వులు అభినందించే నవ్వు తనది. పచ్చ పట్టులంగా వేసుకుని తోటంతా ఎగురుతూ హాయిగా తిరుగుతుంది ఆ రెక్కలు తొడగని ఐదేళ్ళ సీతాకోక చిలుక.. పేరు సీత. తను తడిచిన ప్రతిసారీ భూదేవి మట్టితో సీత పాదాలకి పారాణి పెడుతోంది. సీత వంగుని కాళ్ళకంటిన మట్టిని చెరుపుకుంటుంటే అది కాస్త చుట్టూ ఇంకా పాకుతుందేగాని పోవట్లేదు.
‘‘అమ్మ’’ అని ఎవరో పిలవడంతో వంగునే తల పైకెత్తి చూసింది సీత. ఎవరో కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళు కనపడ్డారు. సీత నిలబడి వాళ్లందరిని ఓసారి చూసి దగ్గరకెళ్ళింది. వచ్చిన వాళ్ళలో ఒకాయన ‘అమ్మా..’ అని వాక్యం పూర్తిచేసేలోపే ‘నా పేరు అమ్మ కాదండి సీత. సీత నా పేరు’ అంది నవ్వుతూ.
ఆ మాటకక్కడికొచ్చిన వాళ్లందరూ కూడా నవ్వారు నాటి చిన్నారి సీతని చూసి. ‘సరే సీతమ్మా, అయ్యగారింట్లో ఉన్నారా?’ గుంపులో ఒక ఆడమనిషి అడిగింది.
‘‘లేరు. ఇంట్లో మా తాతగారు నేనే ఉన్నాం’’. తనకి తెలిసిన నిజం చెప్పింది సీత.
వచ్చినవాళ్ళకి సీతకి వాకిట్లో మాటలు జరుగుతుండగానే పంచె కట్టుకుని, తెలుపురంగు చొక్కాతో ఇంట్లోనుండి గంభీరంగా నడుచుకుంటూ బయటికి వచ్చారో అరవయ్యేళ్ళ మనిషి. ఆరడుగుల ఎత్తు, ప్రశాంత వదనం. ఆ మనిషిని చూడగానే సీతకి ఎదురుగా నిలుచున్న జనమంతా నమస్కారం చేశారు. సీత వెనక్కి తిరిగి చూసింది. వచ్చిన వాళ్ళకి తాతగారు నమస్కారం చేస్తూ కనిపించారు. పరిగెత్తుకుంటూ తాతగారి దగ్గరకెళ్లింది సీత. ఆయన కిందకి వంగి, సీతని ఎత్తుకుని జనందగ్గరికి కదిలారు.
‘‘అయ్యా దండాలయ్యా.. నా పేరు రాములు. ఇది నా పెళ్ళాం లచ్మి. మేము, ఈళ్ళంతా ఇక్కడే ఉంటామయ్యా’’ అని తనతో వచ్చిన వాళ్ళందరినీ చేత్తో చూపిస్తూ పరిచయం చేశాడు రాములు.
‘‘తమరీడకి కొత్తగా వచ్చారని తెలిసినాది. మేవీడకి తమర్నో సాయమడుగుతాకి వచ్చామయ్యా. సెప్పేదా అయ్యా?’’- జనం మాట్లాడుతుంది అర్థంకాక తాతగారి వంకే చూస్తుంది సీత. తాతగారు చెప్పమని తలూపిన తర్వాత మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టాడు రాములు.
‘‘ఏంలేదయ్యా.. మీరు సదుపు సెప్పే అయ్యోరని తెలిసింది. మా పిలకాయలు బడికిపోక పొద్దుగూకుల సెట్టెమ్మక సేలెమ్మట పడి తిరుగుతున్నారు. ఆళ్లకి కూసంత అ ఆలు సెప్తారని అడుగుతాకొచ్చామయ్యా’’ రాములు వున్న విషయం నేరుగా చెప్పాడు.
‘‘బడికి ఎందుకు వెళ్ళట్లేదు పిల్లలు?’’ తాతగారి మాటలకి తల తిప్పింది సీత.
‘‘బడా? ఆడెవరున్నారయ్య సెప్పేదానికి? ఉండే ఒక్క పంతులయ్య పోయినేడే ఊరొదిలిపోయే. అయినా ఎవురన్నా ఈడెందుకుంటారయ్యా? ఏవుందీడ? ఒక సుఖమా పాడా.. రోగాలు రొష్టులు తప్ప పిల్లకాయలన్నా సదూకుంటే ఈడ నుంచి బైటడతారని మా ఆశయ్యా’’ బాధ, కోపం కలగలిపిన మాటలు వచ్చాయి రాములు భార్య లచ్మి నోట్లోనుండి.
‘‘సరే.. పిల్లల్ని రేపటినుండి పంపించండి’’. ఆ మాటకి వచ్చిన జనం తెగ సంబరపడ్డారు. వాళ్ళు పండించిన కూరగాయలు, పండ్లు తీసుకెళ్ళి పెద్దాయన ముందు పెట్టి దండం పెట్టారు.
‘‘ఇవన్నీ దేనికీ? వద్దు.. తీసుకెళ్ళండి.. మీ పిల్లల్ని మాత్రం పంపించండి చాలు..’’
‘‘అలా అనకయ్యా. మా ఆనందం కోసం ఉంచండయ్య. కాదనకండి. మీకేం కావాలన్నా చెప్పండి దొరా సిటికలో సేసిపడేత్తామ్’’ సంబరంగా చెప్పాడు రాములు.
‘‘మీ అభిమానానికి కృతజ్ఞతలు. కానీ నన్ను అయ్యా, దొరా అనిపిలవకండి. నాకు నచ్చదు. నా పేరు సత్యనారాయణ. నా పేరుకి గౌరవిమచ్చి పిలిస్తే చాలు..’’
‘‘సచ్చినారాయనగారు’’ రాములు పలికాడు. సీత ఘొల్లున నవ్వింది. రాములు కంగారు పడ్డాడు. వెనుక జనానికి ఏం జరిగిందో అర్థంకాలేదు.
‘‘సచ్చి కాదు.. సత్యనారాయణ’’ తాతగారు మళ్లీ పలికి చెప్పారు. సీత ఇంకా నవ్వుకుంది.
‘‘స..చ్చ్.. స..స సత్తినారాయన’’
‘‘అది సత్తినారాయన.. నత్తినారాయణ కాదు.. సత్యనారాయణ’’ సీత తాతగారి మెడ చుట్టూ చేతులు వేసి కుడిభుజంమీద తల వాల్చి వెక్కివెక్కి నవ్వింది.
వెనక గుంపుల జనమంతా పేరు పలుకుదామనుకుని నోట్లో అనుకుంటున్నారు కానీ ఒక్కరిక్కూడా చేతకావడంలేదు. ఒకరి మొహం ఒకళ్ళు చూసుకున్నారు.
పెద్దాయనకి కోపమొస్తుందని భయపడిన రాములు ‘‘అయ్యా, మీ పేరు సెప్పడం మా వల్లయేట్టు లేదు కానీ, నాకో ఆలోసన తట్టింది. తమరు ఈ బుజ్జి సీతమ్మ తాతగారు గందా, అయితే ఇకనుండి మేము తమర్ని ‘సీతమ్మ తాతగార’నే పిలుత్తాం. ఏమంటారయ్యా?’’ నవ్వుతున్న సీత కళ్ళు ఒక్కసారిగా విప్పారి ఆశ్చర్యంతో నిండిపోయాయి. సీత తాతగారి వంక చూసి నవ్వింది. తాతగారు కూడా తిరిగి నవ్వారు.
‘‘సరే అలానే పిలవండి’’ అని ఆనందంతో సీతని ముద్దాడుతూ చెప్పారు సీతమ్మ తాతగారు. ఆ రోజునుండి రంపచోడవరంలో పాతవాళ్ళకైనా, కొత్తవాళ్ళకైనా ఆయన పేరు సీతమ్మ తాతగారు.
వచ్చిన ఊరి జనం వెళ్లిపోయారు. సీత తాతగారి చెవిలో మెల్లిగా చెప్పింది ‘‘తాతగారు మీ బట్టలు మట్టయిపోయాయి’’. తాతగారు తల దించి చూసుకున్నారు. మొక్కలకి నీళ్ళు పోసినప్పుడు సీత పాదాలకంటుకున్న మట్టంతా చొక్కా పంచెకి అంటుకుంది. తాతగారు ఎడం చేత్తో సీత పాదాలకున్న మట్టిని తుడిచి అరికాల్లో చక్కిలిగింతలు పెట్టారు. అంతే.. ఆకాశానికి తలెత్తి నోరంతా తెరిచి గట్టిగా అరిచి నవ్వింది సీత. తాతగారు సీత వంక చూసి నవ్వి, ముద్దుపెట్టుకుని ‘్ఫర్వాలేదులే కడిగితే అదే పోతుంది’ అని సీతను ఎత్తుకునే లోపలికి వెళ్లారు.
సీతమ్మ, తాతగారు ఊళ్ళో జనంతో తొందరగా కలిసిపోయారు. కానీ జనానికి సీతమ్మ తాతగారి కుటుంబం గురించి ఏ విషయము తెలియలేదు. ఆయన్ని అడిగే ధైర్యమూ లేదు వాళ్ళకి. ఎక్కడికెళ్లినా ఇద్దరే. సీత, తాతగారు. ఒకరికొకరు తోడు. తాతగారు ముద్దు చేసేటప్పుడు సీతని ‘సీతాకోచిలుక’ అని పిలిచేవారు. తాతగారు చేతక్ బండి నడుపుతుంటే సీత ముందు నిలబడేది. సీతాకోకచిలుకలా స్పీడోమీర్‌కి అటూ ఇటూ చేతులుంచి, గాల్లో తేలిపొమ్మని జుట్టుని వదిలేసేది. సీతని అలా చూసినవాళ్ళెవరైనా తను ప్రపంచాన్ని గెలవడానికే వెళ్తుందని నమ్మేవారు. సీత కూడా అదే నమ్మింది. సీతమ్మ తాతగారు ఊళ్ళో పిల్లలతోపాటు సీతకి చదువు చెప్పేవారు. ఆయన ప్రయత్నం వల్ల ఊళ్ళోనున్న బడికి మాస్టార్ వచ్చాడు. పిల్లలు బడికి వెళ్ళడం మొదలుపెట్టారు. వాళ్ళతోపాటే సీత కూడా వెళ్ళేది. అడిగినవారికి సహాయం చేస్తూనే ఉండేవారు సీతమ్మ తాతగారు. రోజురోజుకి అక్కడ జనానికి ఆయనమీద గౌరవం, భయం రెండూ పెరుగుతూనే వచ్చాయి.
ఋతువులు మారాయి. పదిసార్లు మారాయి. పదేళ్ళు గడిచిపోయాయి. సీతాకోకచిలుక రెక్కలు పూర్తిగా విచ్చుకున్నాయి. స్పీడోమీటర్ పక్కనుండి సీత చేతులు యాక్సిలేటర్, క్లచ్, బ్రేక్‌మీదకెళ్లాయి. ఎక్కడికెళ్లినా సీత చేతక్ మీదే వెళ్తుండేది. ఒకసారి తాతగారికి వొంట్లో బాగోపోతే ఆయన్ని హాస్పిటల్‌కి తనే బండిమీద తీసుకెళ్లింది. తాతగారిలానే సీత ఊళ్ళో ఎవరికి ఏం కావాలన్నా చేసిపెట్టేది. అందరితో ఆడుకునేది ఎంతవాళ్ళనైనా ఆటపట్టించేది. అందమైన సీత అల్లరి సీతగా ఎదిగింది. ఎంత అల్లరి చేసినా చదువులో మాత్రం ఎప్పుడూ ముందుండేది. ఆ పల్లెటూళ్లో ఉండి చదివే పదో తరగతి రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది సీత. ఇంటర్‌లో బైపిసి తీసుకుంది. ఎంసెట్‌లో తనకొచ్చిన రాంక్‌కి కాకినాడ ఆర్‌ఎంసిలో మెడిసిన్ చదవాలనుకుంది. కానీ సీత కాకినాడ వెళ్లడానికి తాతగారు ఒప్పుకోలేదు. ఏం చదవాలనుకున్నా తన దగ్గరే ఉండి చదవమన్నారు. ఆయన రంపచోడవరం విడిచి రానని, సీతని కూడా పంపనని చెప్పేశారు. తాతగారు తనని కాకినాడ ఎందుకు పంపనంటున్నారో అర్థం కాలేదు సీతకి. తాతగారు సీతకి ఒకటి చెయ్యొద్దని చెప్పడం అదే మొదటిసారి.
రోజులు గడుస్తున్నా తాతగారింకా ఆందోళనగానే ఉంటున్నారు. సీత కూడా కాకినాడ మెడిసిన్ సీట్ గురించి మళ్లీ మాట్లాడలేదు. సీత ఇక ఆ విషయం గురించి వదిలేసి ఎప్పట్లానే తాతగారితో ఉండాలనుకుని ఆయనతో మాట్లాడేది. కానీ, తాతగారు సీతతో ఇదివరకట్లా మాట్లాడలేకపోతున్నారు. ఏం అడ్డుపడుతుందో? తాతగారు డల్‌గా ఉండటం చూడలేక తను కాకినాడ వెళ్లనని ఆ ఊళ్ళోనే డిగ్రీ చదువుతానని చెప్పింది సీత. తాతగారు మాట్లాడలేదు. ఆనందపడలేదు. ఎప్పుడూ ఉషారుగా తిరిగే పిల్ల అసలు బయటికెళ్లడమే మానేసింది. చేతక్ దుమ్ము పట్టి ఇంట్లోనే పడుకునేది. సీత, తాతగారు బయట పెద్దగా కనిపించకపోవడంతో వాళ్ళని చూడ్డానికి జనం ఇంటికి వచ్చేవారు. వచ్చినవాళ్ళతో నవ్వుతూ మాట్లాడేవారిద్దరూ. వాళ్ళు వెళ్లిన తర్వాత మళ్లీ అంతా నిశ్శబ్దం. ఇళ్లు నిశ్శబ్దంగా, కాలం భారంగా గడుస్తున్న రోజులవి.
సీత గదిలో లైట్ వేశారు తాతగారు. సీత మంచంమీద దుప్పటి కప్పుకుని పడుకుంది. మెల్లగా నడుచుకుంటూ వెళ్లి మంచం మీద సీత పక్కన కూర్చున్నారు తాతగారు. కాసేపు సీతనలాచూస్తూ బాధపడ్డారు. ఆయన కుడి చేత్తో సీత ఎడమ చెంపని ప్రేమగా తడిమి ‘సీతాకోకచిలుక’ అని పిలిచారు. సీతకి మెలకువొచ్చి కళ్ళు తెరిచి చూసింది. తన పక్కన తాతగారు కూర్చుని ఉన్నారు. సీతని చూసి మొహంలో బాధని తుడిచి కొంచెం నవ్వుని అద్దారు తాతగారు. అర్థరాత్రి వేళ తాతగార్ని పక్కన చూసేటప్పటికి వెంటనే లేచి కూర్చుని ‘ఏమైంది తాతగారు?’ అని కంగారుగా అడిగింది సీత. తాతగారు సీత కళ్ళలోకి చూస్తూ మాట్లాడారు.. ‘‘అదా.. కొన్ని రోజులనుండి మనింటి సీతాకోకచిలుక డల్‌గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళడంలేదు. నవ్వడం కూడా మర్చిపోయింది. అదే ఎందుకా అనడుగుదామని వచ్చా.. ఏమైంది సీతాకోకచిలుకకి?’’. తాతగారి మాటలకి బిక్కమొహం పెట్టింది సీత. తాతగారు సీత కుడి చేతిని తీసుకుని గినె్నలో తెచ్చిన గోరింటాకు పెడుతూ మాట్లాడారు.
‘‘నువ్వు గోరింటాకు పెట్టుకోకపోయేసరికి చెట్టుకున్న ఆకులు కూడా వడలిపోయాయి, తెలుసా?’’ తాతగారి మాటలకి చాలాకాలంగా రాని నవ్వు సీతకి ఒక్కసారే లోపలనుండి పైకి తన్నుకొచ్చింది. గుండెలో పేరుకున్న బాధ శుభ్రమయ్యేంతవరకు నవ్వింది. అర్థరాత్రి లేపి గోరింటాకు పెడుతున్న తాతగారి ప్రేమకి మురిసిపోయింది సీత.
‘‘అయితే.. ఇప్పుడు సీతాకోకచిలుక ఇంకా పైకి ఎగరాలనుకుంటుంది. పైచదువులకి కాకినాడ వెళ్తానంటుంది. అంతేనా?’’ అరిచేతులో చందమామ పెడుతూ అడిగారు తాతగారు.
‘‘మనమిద్దరం వెళదాం తాతగారు. మీరు లేకుండా నేనక్కడ ఒక్కదానే్న ఎలా ఉండగలను?’’
‘‘ఉండాలిగా మరి.. ఈ రోజు కాకపోయినా రేపైనా, నేను పోయిన తర్వాతయినా ఒక్కదానివే ఉండాలిగా’’ కఠినమైన తాతగారి మాటలకి ఏడ్చేసింది సీత. మొట్టమొదటిసారి సీతకి అనిపించింది ఈ లోకంలో

తాతగారు తప్ప తనకెవ్వరూ లేరని. భయపడిపోయింది సీత.
‘‘మీ అమ్మా నాన్నని ఆక్సిడెంట్‌లో పొగొట్టుకున్నా. మీ నానమ్మని కాన్సర్‌కి అప్పజెప్పా. నాకు మిగిలింది నువ్వొక్కదానివే తల్లి. అందుకే ఏ కీడు నీడ కూడా నీమీద పడకూడదని ఐదేళ్ళ వయసప్పుడు నిన్ను ఎత్తుకొని ఇంతదూరం తీసుకొచ్చా. అప్పుడు అనిపించలేదు కానీ, ఇప్పుడనిపిస్తుంది నాకేమైనా జరిగితే నీ పరిస్థితి ఏంటని? ఎక్కువ ప్రేమించడం కూడా తప్పేనమ్మా. అది ఈ తాతకి ఈమధ్యే తెలిసింది’’.
సీత తన తల్లిదండ్రుల గురించి మొదటిసారి విన్నది. అలాగే తాతగారు కళ్ళల్లో నీళ్ళు కూడా మొదటిసారి చూసింది. సీతకి మాటలు రాలేదు.
‘‘ఇన్నాళ్ళు నేను చేసిన తప్పుని ఇప్పుడు దిద్దుకుంటా. కాకినాడ వెళ్లి చదువుకో. ఇవాల్టి నుండి నీ గురించి నువ్వే ఆలోచించుకోవాలి. అక్కడ ఈ తాత ఉండడు. తాత ఉంటేనే కాదు, ఈ తాత లేకపోయినా నువ్వు బ్రతకాలి. వందేళ్ళు హాయిగా బ్రతకాలి. యు ఆర్ ఆన్ యువర్ ఓన్ నౌ సీత అని సీత నుదుటిమీద ముద్దుపెట్టారు తాతగారు. తాతగార్ని గట్టిగా హత్తుకుని చాలాసేపటివరకూ వెక్కి వెక్కి ఏడ్చింది సీత.
సీతని మెడికల్ కాలేజ్ హాస్టల్‌లో జాయిన్ చేసి సాయంత్రానికి తిరిగి రంపచోడవరం వచ్చేశారు సీతమ్మ తాతగారు. ప్రతిరోజూ తాతగారు సీతకి ఫోన్ చేసేవారు. ప్రతి శనివారం కాలేజ్ అయిపోయాక సీత తాతగారిని చూడ్డానికి ఊరు బయల్దేరేది. ఊళ్ళో వాళ్ళందరూ సీతని చూసి తెగ మురిసిపోయేవారు. ఎవరైనా ‘డాక్టరమ్మ’ అని పిలిస్తే వాళ్ళని తిట్టి తన పేరు అది కాదని నవ్వుతూ చెప్పేది సీత. చదువు రెండు సంవత్సరాలు పూర్తిచేసి మూడో సంవత్సరంలోకి ప్రవేశించింది సీత. ఆ యేడు కాలేజీ స్టూడెంట్స్ అందరూ పిక్నిక్‌కి మారేడుమిల్లికి వెళ్ళారు. అది సీత వాళ్ళ ఊరికి ఇంచుమించు పాతిక కిలోమీటర్లు. ప్రయాణం జరుగుతున్నంతసేపు బస్సులోనుండి కనిపించే ప్రదేశాలని తన స్నేహితులకి వివరించింది సీత. స్టూడెంట్స్ బస్‌లో రోజంతా మారేడుమిల్లి చుట్టుప్రక్కలున్న జలపాతాలని, వ్యూపాయింట్స్‌ని చూసి సాయంత్రం చీకటిపడే సమయానికి రిసార్ట్స్‌కి బయలుదేరారు. బస్ రిసార్డ్స్ దగ్గర ఆగింది. అందరూ ప్రెష్ అవ్వడానికి వెళ్ళారు. సీత తాతగారిని చూడ్డానికి రంపచోడవరం వెళ్తున్నాని ఫ్రెండ్స్‌కి చెప్పి బయలుదేరింది. ఆర్‌టిసి బస్ కోసం వెయిట్ చేస్తున్న సీత ముందుకి ఒక బైక్ వచ్చి ఆగింది. బైక్‌మీద వచ్చింది తనక్లాస్‌మేట్ రాకేష్.
‘‘హాయ్ అమిగో.. వాట్ ఆర్ యు డూయింగ్ హయిర్’’ రాకేష్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘‘హాయ్ వెయిటింగ్ ఫర్ ఎ బస్ అమిగో’’ నవ్వుతూ సమాధానం చెప్పింది సీత.
‘‘యు వాంట్ మి టు డ్రాప్?’’
‘‘యు డోంట్ వర్రీ మాన్. ఐ గాట్ దిస్’’
‘‘హో.. కమాన్ సీత. ఐకన్ డ్రాప్ యు ఎనీవేర్.. జస్ట్ సే ఇట్ గర్ల్’’
‘‘ఓకె.. ఇఫ్ యు ఇన్సిస్ట్’’ అనిచెప్పి సీత రాకేష్ బైక్ ఎక్కింది.
‘‘యా.. దట్స్ మై బేమీ గర్ల్. లెట్స్ రాక్ ఇట్’’ రాకేష్ బైక్ స్టార్ట్ చేశాడు.
సీత వెనుకనుండి రాకేష్‌కి తన తాతగారి గురించి చెబుతుంది. రాకేష్ బైక్‌ని స్పీడ్‌గా నడుపుతున్నాడు. దారిలో చిన్న నదీ పాయ కనిపించడంతో బైక్‌ని ఆపాడు రాకేష్. సనె్సట్ అవుతుంది అప్పుడే. చూడ్డానికి వ్యూ అద్భుతంగా అనిపించింది సీతకి. ‘‘ఇట్స్ రియల్లీ అమేజింగ్’’ అంది సీత. ఆ మాట విన్న రాకేష్ వెంటనే బైక్‌ని పక్కనేవున్న అడవి దారిలోకి పోనిచ్చి చిన్న గట్టుమీద ఎక్కించాడు. అసలు ఏం జరిగిందో సీతకి అర్థమయ్యేలోపే సీత అడవిలోని గుట్టమీదుంది. రాకేష్ బైక్ ఇంజిన్ ఆఫ్ చేసి సీతతో ‘కమాన్ మేట్.. లెట్ క్లిక్ సం ఫొటోస్.. మేక్ సం మెమరీస్’’ అన్నాడు. రాకేష్ చేసిన పనికి సీతకి కోపం వచ్చి తిట్టింది. రాకేష్ సన్ బ్యాగ్రౌండ్‌లో వచ్చేట్లు సెల్ఫీ తీసుకున్నాడు. సీతని పిలిచినా రాలేదు కోపంతో.
చీకటి పడిపోయేవరకు ఫొటోస్ తీసుకున్నాడు రాకేష్. ఇక సహనం కోల్పోయిన సీత రాకేష్ మీద అరిచింది.
‘‘ఇట్స్ గెటింగ్ లేట్ రాకేష్.. లెట్స్ గో.. జస్ట్ డ్రా హోమ్’’.
‘‘ఓ.. ఓ.. వి విల్ గో మై లేడీ, బట్ బిఫోర్ దట్ వి హావ్ టు మేక్ సం మెమొరీస్’’ ఫొటోస్ తీసుకుంటున్న రాకేష్ టోన్ నచ్చలేదు సీతకి.
‘‘్ఫర్ మెమరీస్ వి హావ్ టు మేక్ సం లవ్.. రైట్ సీత?’’ సీతకి వొళ్ళు మండిపోయింది ఆ మాటకి.
‘‘ఏం పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావా రాకేష్. మర్యాదగా నన్నింటి దగ్గర దింపు, లేకపోతే నా దారిన నన్ను వదిలెయ్. నేనే వెళ్తా’’ కోపంతో ఊగిపోతూ చెప్పింది సీత.
‘‘ఇంత దూరం వచ్చాక కష్టం సీత. నువొప్పకుంటే .. వి విల్ ఎంజాయ్ టుగెదర్, అదర్‌వైజ్ ఐ విల్ స్టాబ్ యు ఇన్ ద హార్ట్ అండ్ హావ్ యువర్ బాడీ లేటర్’’ చాలా ప్రశాంతంగా చెప్పాడు రాకేష్. ‘‘ఐ హావ్ టు కనె్ఫస్ యు.. ఐ నెవెర్ ట్రైడ్ నెక్రోఫిలియా’’- ఈ మాటలకి సీత కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. పారిపోవడానికి ప్రయత్నించిన సీత జుట్టు పట్టుకు లాగాడు రాకేష్. గింజుకుంటున్న సీత రెండు చేతుల్ని వెనక్కి విరిచాడు. నొప్పితో విలవిలలాడిపోయింది సీత. రాకేష్ ఎడమ చేత్తో సీత మెడని నొక్కి పెట్టి తన దగ్గరికి లాక్కున్నాడు. సీతకి ఊపిరి అందలేదు.
సీత చెవిలో రాకేష్ ఆఖరిసారి మాట్లాడాడు. ‘యు లైక్ వయలెన్స్.. హా? యు మేకింగ్ మి వెరీ యాంగ్రీ సీత. లెట్స్ ఫినిష్ ఇట్ ఇన్ త్రీ’’
సీత విదిలించి కొడుతుంది. ఇంతలో సీత గుండెల్లోకి బలంగా చాకుతో పొడిచాడు రాకేష్. రక్తం వెదజిమ్మింది. సీతకి నొప్పి ఎక్కువయ్యేలోపే గుండెలో వరుసగా ఆరుసార్లు పొడిచాడు రాకేష్. సీత రక్తంతో తడిచిపోయింది. కింద నేలలో రక్తపుమడుగు కట్టింది. సీతలో చలనం పోయింది. రాకేష్ సీత శరీరాన్ని పక్కనే వున్న ఒక ఎండిన చెట్టుకి ఆన్చి, పడిపోకుండా చేతుల్ని చెట్టుకొమ్మకి సీత చున్నీతో కట్టాడు. చుట్టూ చీకటి. ఎదుట ఎప్పటినుండో కోరుకున్న అమ్మాయి శరీరం. చలిగాలికి సిగరెట్ వెలిగించి చెట్టుకి కట్టిన సీత వంకే చూశాడు రాకేష్. సిగరెట్ అయిపోయింది. గుట్టమీద నుండి విసిరేద్దామని పక్కకి ఒక అడుగు వేశాడు. అంతే.. అడుగు సీతమ్మ రక్తంతో పుట్టిన మడుగులో పడింది. కాలు జారింది. రాకేష్ ఆ గ్టుమీదనుండి ఘాట్ రోడ్డుమీద పడ్డాడు. అసలే వెహికల్స్ తక్కువ తిరిగే ఆ రూట్‌లో రాత్రంతా రాకేష్ శరీరం మీదనుండి ఎన్ని లారీలు వెళ్ళాయో తెలియదు. కానీ తెల్లవారిన తర్వాత చూసివాళ్ళకి నడుము ప్రాంతంనుండి కిందవరకు నుజ్జునుజ్జయిపోయిన ఒక శరీరం కనిపించింది.
***
సీతని చూడ్డానికి తమని కూడా లోపలికి పంపాలని జనం మారేడుమిల్లి ఆరోగ్య కేంద్రం బయటింకా గొడవ చేస్తున్నారు. ఆకాశమంతా మబ్బులు పట్టాయి. వీచే గాలి వేగం పెరిగి ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా చల్లబడింది. పోలీసులు లోపలికి వదిలిన పదిమందిలో రాములు కూడా ఉన్నాడు. రాములు మిగతా ఊరి వాళ్ళని తీసుకుని సీతమ్మనుంచిన గది దగ్గరికి వెళ్ళాడు. గది చీకటిగా వుంది. లైట్ లేదు. గదికున్న కిటికీలోనుండే మసక వెలుతురు పడుతుంది. చల్లటిగాలి వస్తుంది. తలుపు వెనక్కి తసి లోపలికెళ్లిన రాములు కంటికి స్టూల్‌మీద కూర్చున్న సీతమ్మ తాతగారు కనిపించారు. ఆ పక్కన స్ట్రెచర్ పైన పూర్తిగా తెల్ల దుప్పటితో కప్పున్న ఒక బాడీ ఉంది. రాములు తాతగారి దగ్గరికి నడిచాడు. రాములు అడుగుల చప్పుడే ప్రతిధ్వనిస్తుంది అ గదిలో. డెబ్బై అయిదేళ్ళ తాతగారు నరాలు ఉబ్బి, ముడతలు పడిన తన కుడి చేత్తో నెత్తురు, మన్ను అంటిన సీతమ్మ అరికాలును గట్టిగా పట్టుకుని కూర్చున్నారు. నుదుటిని పాదంపై ఆన్చి కళ్ళు మూసుకున్నారు. ఎంతసేటినుండి ఉన్నారో అలా! రాములు వచ్చి తాతగారి భుజంమీద చేయి వేసాక ఆయన తల ఎత్తి పైకి చూశారు. తాతగార్ని చూడగానే రాములు ఏడ్చేశాడు. తాతగారి చేయి మాత్రం సీతమ్మ పాదాన్ని ఊతంగా అలా గట్టిగా పట్టుకునే వుంది. తాతగారికి ధైర్యం చెప్పడానికి ఆ గదిలో నిలబడిన ఒక్కరిక్కూడా ధైర్యం సరిపోలేదు. తాతగారు ఏడవలేదు. సీతని చూసినప్పటినుండి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఇంతలో ఒక పోలీసు వచ్చి సీత బాడీని పోస్టుమార్టంకి రాజమండ్రి తీసుకెళ్ళాలని చెప్పి వెళ్లిపోయాడు. ఆ మాట విన్న వెంటనే స్టూల్‌మీదనుండి నెమ్మదిగా లేచారు తాతగారు. చేత్తో పట్టుకున్న సీత పాదాన్ని మెల్లగా విడిచిపెట్టారు. తాతగారికి చేతికి సీతమ్మ రక్తం, కాలికున్న మట్టి అంటుకున్నాయి. చేయి మళ్లీ వణకడం మొదలుపెటిటంది. చనిపోయిన సీతని చూసినప్పటినుండి తాతారి చేయి వణుకుతోంది. వణుకుతున్న చేతితోనే తాతగారి గదిలోనుండి బయటికి వెళ్ళారు. రాములు తాతగారి వెనకే వెళ్ళాడు.
గదిలోనుండి ఒకటే ఏడుపులు. బంధువులు, మిత్రులు అందరూ జరిగిన ఘోరానికి ఎగ ఏడుస్తున్నారు. రాకేష్ తల్లినైతే ఆపడం ఎవరివల్లా కావడంలేదు. కొడుకు చేసిన తప్పుకి ఓ మూల గోడకానుకుని లోలోపలే ఏడుస్తున్నాడు రాకేష్ తండ్రి. ఏడుస్తున్న వాళ్ళంతా గుమ్మం దగ్గర నిలబడున్న సీతమ్మ తాతగార్ని చూసి ఏడవడం తగ్గించారు కొంచెం. తెల్ల పంచె, తెల్ల చొక్కా వేసుకున్న తాతగారు లోపలికి నడుచుకుంటూ స్ట్రెచర్‌మీదున్న రాకేష్ దగ్గరికొచ్చి ఆగారు. ఏడుస్తున్న రాకేష్ వాళ్ళ అమ్మ కూడా తాతగార్ని చూసి ఏడుపు ఆపింది. ఇద్దరు ఆడవాళ్ళు రాకేష్ తల్లిని పక్కకి తీసుకెళ్ళారు. గదంతా నిశ్శబ్దం. నీరసంవల్ల సరిగ్గా నిలబడలేకపోతున్నారు తాతగారు. రాకేష్ తండ్రి వచ్చిన సీతమ్మ తాతగారిని చూడలేక తలదించుకున్నారు. తాతగారు రాకేష్‌ని పది నిముషాలపాటు దీర్ఘంగా చూశారు. కింద సగం బాడీ లేదు. తలంతా కట్లు కట్టారు. మొహం రూపు మాత్రం తెలుస్తుంది. గదిలో వున్నవాళ్ళకి ఆయన ఏం చూస్తున్నారో అర్థం కాలేదు. తన సీతని చంపిన దుర్మార్గుడు ఎదురుగా శవంలా పడున్నాడు. చచ్చినవాడ్ని మళ్లీ బ్రతికించి చంపాలన్న కోపం వచ్చింది తాతగారికి. పది నిముషాలనుండి ఏమి మాట్లాడకుండా బొమ్మలా నుంచున్న తాతగారు అందరూ చూస్తుండగానే చెయ్యెత్తి రాకేష్ చెంప పగలకొట్టారు. ఆ దెబ్బకి గదిలో నిశ్శబ్దం బద్దలైంది. రాకేష్ తల్లి, బంధువులు, మిత్రులు అందరూ షాక్ అయిపోయారు. శవాన్ని చెంపదెబ్బకొట్టడం వాళ్ళెప్పుడూ వినలేదు, చూడలేదు. వాళ్ళు షాక్‌లోనుండి బయటపడేలోపలే శవం రెండో చెంప కూడా పగిలింది. మూల నుంచున్న రాకేష్ తండ్రికి లోపల్నుంచి ఏడుపు తన్నుకొచ్చింది. సిగ్గుతో మొహాన్ని చేతుల్లో దాచుకుని ఏడ్చేశారు. శవాన్ని కొడుతుంటే తాతగార్ని ఆపడానికి ఆ గదిలో వున్నవాళ్ళెవరికీ ధైర్యం సరిపోలేదు. రాకేష్ మొహానికి తాతగారి చేతికున్న రక్తం, మట్టి అంటుకున్నాయి. అందరూ షాక్‌లో వుండగానే ఆ గదిలోనుండి మెల్లగా కాళ్లీడ్చుకుంటూ బయటికి వెళ్లిపోయారు తాతగారు. తాతగారి చేతి వణుకు ఆగింది.
ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న తాతగార్ని రాములు ఎంత పిలిచినా వెనక్కి తిరగలేదు. పిలుస్తూ ఆయన వెనుక పరిగెత్తాడు. తాతగారు ఆగలేదు. రాములు తాతగారికి దగ్గరగా వెళ్ళినపుడు మాత్రం చిన్న ఏడుపు మూలుగు వినిపించింది. అది విన్న రాములు ఇక కదల్లేక ఏడుస్తూ అక్కడే నిలబడిపోయాడు. సీతమ్మ తాతగారు అలా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు.
సీతమ్మ తాతగారి బ్రతుకులో వసంతం వెళ్లిపోయింది. చివరకు ఆయన మాత్రం వసంతాన్ని ఎన్నటికీ తాకలేని ఓ శిశిరంలా మిగిలిపోయారు.
సీతమ్మ తాతగారి కోసమైనా శిథిల జ్ఞాపకాలని కాల్చే చోటు ఎక్కుడుంటుందో వెళ్లి వెతకాలనిపిస్తుంది నాకు.

=================================================================
కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.netకు మెయల్‌లో పంపాలి.

కందమూలాలు-2

$
0
0

ఆయుర్వేధ గ్రంథాల్లో దీన్ని లైంగిక శక్తిని పెంచే ద్రవ్యాలలో ఒకటిగా (ఎఫ్రొడిజియాక్స్) చెప్తారు. బలకరమైన ఔషధాల్లో ఒకటి. ఇంకా ఇతర ఔషధ ప్రయోజనాలు కూడా దీనికున్నాయి. శరీరానికి సుఖంగా ఉండే పరిస్థితిని కలిగిస్తాయి. అనీజీగా, నలతగా ఉన్నదనిపించటం దీని వలన తగ్గుతుందన్నమాట. ముఖ్యంగా క్షీణింపజేసే వ్యాధుల్లో దీన్ని ఔషధంగా ప్రయోగిస్తారు.
నిజానికి నేలతాడి లేత దుంపలు కూరగాయల మార్కెట్లోకొస్తే సామాన్య మానవుడికి ఒక అద్భుత బలకర ఔషధం అందుబాటులోకి వచ్చినట్టే లెక్క. సుఖ సంసారాన్ని పెంచే ద్రవ్యం చేతికి అందితే అంతకు మించిన వరం ఇంకేముంటుంది?
నేలతాడి గడ్డలు అని మూలికలు అమ్మే షాపుల్లో లేదా, పెద్ద పచారీ షాపుల్లో అడగండి దొరుకుతాయి. ఎండించిన దుంపలే దొరుకుతాయి. వాటి శుభ్రం చేసుకుని మెత్తగా దంచిన పొడిని అరచెంచా నుండీ ఒక చెంచా వరకూ తీసుకుని, వేడిపాలలో వేసుకుని జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, ఏలకులు, జీడిపప్పు వగైరా చేర్చి తాగండి. రోజూ ఉదయం పూట లేదా రాత్రిపూట తీసుకోవచ్చు. చిక్కిపోతున్న పిల్లలకు, చదువుకునే పిల్లలకు సంకోచం లేకుండా ఇస్తే, చదువు శ్రమను తట్టుకోగలుగుతారు. ఆటగాళ్లు, పోటుగాళ్లకు ఇది వారి శరీర దారుఢ్యాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది.
ఉబ్బసం తగ్గుతుంది. ఊపిరితిత్తులు బలసంపన్నం అవుతాయి. ఆయాసం ఆగుతుంది. శొంఠి పొడి, నేలతాడి గడ్డల పొడి సమానంగా తీసుకుని పెరుగులో కలిపి తింటే విరేచనాలు ఆగుతాయి. వాముపొడితో కలిపి తింటే దగ్గు ఆగుతుంది.

పిల్లిపీచర దుంపల కూర, పప్పు, పచ్చడి, పాయసం
శతావరి అనేది ఆయుర్వేద ఔషధాల గురించి తెలిసిన ప్రతీ ఒక్కరికీ పరిచయం ఉన్న పేరే! పిల్లిపీచర, పెద్ద పిల్లిపీచర ఇలా పిలుస్తారు. పెద్దదైనా చిన్నదైనా గుణాలు ఒక్కటే! ఇది కూడా కూరగాయల మార్కెట్లోకి తేవలసిన ఆహార ద్రవ్యమే! అవగాహన లేకపోవటం వలన మనం కోల్పోతున్న ప్రకృతి వరాలలో ఇది ఒకటి!
పురాణకాలపు మహానుభావుల మేథాశక్తికి, శరీర దారుఢ్యానికి కీలకమైన రహస్యం వారి ఆహార పదార్థాల్లో ఇలాంటి అద్భుత ద్రవ్యాలు ఉండేవి. మనం నిస్సారమైన ద్రవ్యాలను గొప్ప అనుకుని ఫ్యాషన్ కోసం తింటున్నాం. అందువలన శారీరక, మానసిక దృఢత్వాన్ని స్వయంగా కోల్పోతున్నాం.
రక్తస్రావాలు అవుతున్న వారికి, విరేచనాలు అవుతున్న వారికి, షుగరు వ్యాధి కారణంగా క్షీణించి పోతున్న వారికి, తలతిరుగుడు, ఒళ్లు తూలుడు ఉన్నవారికి, ఫిట్స్ జబ్బుతో బాధపడేవారికి, ఎయిడ్స్, క్షయ, హెపటైటిస్ బి లాంటి క్షీణింపజేసే వ్యాధులతో బాధపడేవారికి, సంతానం లేనివారికి, గర్భాశయ దోషాలతో బాధపడేవారికి, వీర్యకణాలు తక్కువగా ఉన్నవారికి, పేగుపూత, జీర్ణకోశ వ్యాధులు, ముఖ్యంగా అమీబియాసిస్ వ్యాధులతో బాధపడేవారికి, బీపీ, గుండె జబ్బుల్తో బాధపడేవారికి, లివరు వ్యాధులతో బాధపడేవారికి పిల్లిపీచర దుంపలు ఔషధంగా పని చేస్తాయి. ఇవేవీ లేనివారు తింటే ఇలాంటివి రాకుండా ఉంటాయి. అందరికీ మేలు చేసే ద్రవ్యం ఇది.
గ్రామీణ ప్రాంతాల్లో తాజా లేతదుంపలు దొరికితే కూర, పప్పు, పులుసు, పచ్చడి వగైరా చేసుకోవచ్చు. లేదా పెద్ద పచారీ షాపుల్లోనూ, వనమూలికలు అమ్మే షాపుల్లోనూ ఎండించిన దుంపలు దొరుకుతాయి. వీటిని తెచ్చుకుని మెత్తగా మిక్సీ పట్టి, ఆ పొడితో పాయసం కాచుకుని తాగవచ్చు. పాయసంలో జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, ఏలకుల్లాంటివి తగు మోతాదులో కలుపుకుని తాగితే అద్భుతంగా పని చేస్తాయి. జీర్ణకోశ వ్యాధుల్లో పెరుగుతో తీసుకుంటే మంచిది.

పాతాళస్వర్గం-31

$
0
0

పాత నేరాలతో సహా బైటకపడ్డ ధర్మారావు, అనిల్, కాంతారావులకి యావజ్జీవం, వాళ్ళకి సహకరించిన కొందరికి తగిన శిక్షలు పడి కటకటాల వెనక్కి వెళ్లిపోయారు. టీవీలు, పేపర్లు గౌతమి, చందన సాహసాలని అభినందిస్తూ ఆకాశానికెత్తేశాయి. ప్రభు, విజయనాయక్, ప్రయాగలని పట్టువదలని విక్రమార్కుల్లా దొంగలూ, నగలూ, అపురూప విగ్రహాలు దొరికేదాకా వదలకుండా విజయం సాధించినందుకు ప్రశంసించాయి. ఎంతో రహస్య పథకాలు వేసి, ‘దొంగలు నగలు దొరికేదాకా నిద్రపోనని శపథం చేసిన చంద్రని ప్రతిపక్షాలవారు సైతం భళా భళా చంద్రా’ అంటూ మెచ్చుకున్నారు.
ఓమంచి రోజున గుళ్ళోని అమ్మవార్లు, అయ్యవార్లు మళ్లీ ఆభరణాలన్నీ ధరించి వెలిగిపోయారు. ఆలయానికి పూర్వవైభవం వచ్చేసింది. బ్లాక్ టైగర్‌ని ఓ రాక్షసుడిలా భావించిన జనాలు అతని త్యాగబుద్ధిని గురించి విని ముక్కున వేలేసుకున్నారు. ఒకసారి అతన్ని చూడాలని కూడా ఆశపడ్డారు. అయితే అటుకేసి వెళ్ళరాదనే ఆంక్ష విని ఆ ఆశని చంపుకున్నారు.
చంద్రక్కూడా ఒకసారి అతన్ని కలిసి, కృతజ్ఞతలు చెప్పుకోవాలనీ, ఆటవికులకి ఏదైనా సహాయం చేద్దామని అనిపించినా ప్రభు, విజయనాయక్‌ల మాట మీద ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
శంకరయ్య ఆరోగ్యం బావుండడంతో కన్నతల్లి నీడలా భావించే కొండమీదికి చేరిపోయారు. కూతురు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఓ దుర్మారుడైపోయాడే అన్న బాధ వున్నా, పెళ్లికాకముందే అతని విషయం బైటపడినందుకు ఆనందించాడు. అయితే కూతురి మనసులో ఏముందో ఆ తండ్రికి అర్థంకాలేదు.
గౌతమి కూడా అంతకుముందు ఏం జరగనట్టు కొండకిందికి, కొండమీదికి చెట్ల కిందికి వెళ్ళొస్తూనే వుంది. తరచూ విజయనాయక్, ప్రభు, ప్రయాగ లాంటివారిని కలిసి కబుర్లు చెప్తూనే వుంది. ఓ మంచి డాక్టర్ అలా గడపడం బాధగా అనిపించింది చంద్రకి. ఆమె అనిల్‌ని ప్రేమించిందనీ, ఇద్దరూ పెళ్లిచేసుకోవాలనుకున్నారనీ అతనికి తెలుసు. అందుకే పెళ్లి మాట ఎత్తకుండా చక్కని పరిసరాల్లో ఓ హాస్పిటల్ కట్టించి ఆమెకి ప్రెజెంట్ చేశాడు. గుడికి మరింత సెక్యూరిటీ ఏర్పాటుచెయ్యడమే కాక శంకరయ్య ఇంటిక్కూడా తగిన పనివాళ్ళని ఏర్పాటుచేశాడు. గౌతమి, శంకరయ్య ఆనందంగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. గౌతమి మొహంలో దిగుల్లాంటిది కనిపిస్తుందేమో అని చూశాడు. కానీ అలాంటిదేం ఆమె మొహంలో కనిపించలేదు. ఎప్పటిలా నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతోంది.
‘‘చాలా గుండె నిబ్బరం గల యువతి’’ అని మెచ్చుకున్నాడు కూడా. అయితే ప్రభుని గురించే అతనికి అయోమయంగా వుంది. అతనిలో మునుపటి ఉత్సాహం కనిపించడంలేదు. ఏం చెప్పినా యాంత్రికంగా చేసుకుపోతున్నాడు. అది చాలా బాధగా వుందతనికి.
ఆ రోజు తనతోపాటు భోజనానికి కూర్చోపెట్టుకుని అడవిలోని విషయాల గురించి ఎత్తాడు. అడవిని గురించి ఎత్తగానే ప్రభు కళ్ళముందుగా మెదిలిన వ్యక్తి శకుని.
‘‘మీరంతా వాదించారుగానీ ఇంత సహయం చేసిన ఆ బ్లాక్ టైగర్ వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే బావుండేది ప్రభూ! కనీసం కొన్ని పశువుల్ని మేకలు కోళ్ళలాంటితో ఆ ఆటవికులు వాటితోనైనా కాస్త హాయిగా బతుకుతారు’’ అన్నాడు చంద్ర. అడవి సంపద గురించి పెద్దగా చెప్పలేదతనికెవరూ.
‘‘వాళ్లకి పాడి పంటలకేం కొదవ చంద్రా! మిస్టర్ శకుని ఏర్పాటుచేసిన భూతల స్వర్గం వాళ్లకుంది’’ అప్రయత్నంగా అన్నాడు ప్రభు.
తృళ్ళిపడ్డాడు చంద్ర.
‘‘మిస్టర్ శకుని?.. అతనెవరు? అతను స్వర్గం తయారుచెయ్యడం ఏమిటి?’’ అన్నాడు విస్మయంగా.
అప్పటికి స్పృహలోకొచ్చాడు ప్రభు.
‘‘అదే.. ఆ ఆడది.. నిజంగా భూతల స్వర్గంలాగే వుంటుంది చంద్రా. పచ్చని చెట్లు, సెలయేళ్ళు..’’ అన్నాడు బలవంతంగా నవ్వుతూ. అతనేదో అబద్ధం చెప్తున్నాడనిపించింది చంద్రకి.
‘‘ప్రభూ! అడవికెళ్ళొచ్చిందగ్గర్నించి నువ్వు మారిపోయావురా! అంతకుముందు, ఏ చిన్న విషయమైనా నాతో చెప్పకుండా తిండే తినేవాడివే కాదు, నాకన్నా ఆత్మీయులు ఎవరూ లేరనేవాడివి. ఇపుడు పెద్ద విషయాలే నాదగ్గర దాస్తున్నావనిపిస్తోంది. అంటే నేను ఆత్మీయుణ్ణి కాదనుకొనవచ్చా?’’ అన్నాడు గంభీరంగా.
కంగారుగా చూశాడు ప్రభు!
‘‘చెప్పు! ఎవరా శకుని?’’ మళ్లీ అన్నాడు చంద్ర. చదువు, సంస్కారం నేర్పాడు. దొంగతనాలు మాన్పించి మానవత్వం నూరిపోశాడు. కొన్ని సౌకర్యాలు కూడా ఏర్పరిచాడు. ఆనాటి సంపద ఇవాళ మన పరం అయిందంటే అది ఆయన దయే’’ అన్నాడు ప్రభు.
‘‘విద్యాధికుడు, అంటే నగరవాసే అయుండాలి. కానీ శకుని పేరేవిటి? అంత చదువుకున్నవాడు ఆ బ్లాక్ టైగర్ దగ్గర వుండడం ఏవిటి?’’ప్రశ్నలతో వుక్కిరిబిక్కిరి చేసేశాడు చంద్ర.
ప్రభు నోట మాట రాలేదు.
‘‘అసలీ విషయాలేం నాకు చెప్పలేదేం. అదే ఆ శకునివల్లే టైగర్ దోచిన సొమ్ము మనకప్పగించాడని నిలదీసినట్టు అన్నాడు చంద్ర.
‘‘సారీ చంద్రా! నీకు చెప్పకూడదని కాదు. కానీ మిస్టర్ నాయక్, ఆ శకుని కూడా విషయం చెప్పద్దన్నారు’’ అన్నాడు ప్రభు మెల్లగా.
‘‘నాయక్ చెప్పద్దన్నడా?’’ చంద్ర గొంతులోకి తీక్షణత వచ్చేసింది. మరింత కంగారుపడి పోయాడు ప్రభు- అతని పరిస్థితి అర్థం చేసుకున్న చంద్ర.
‘‘్ఫర్వాలేదు, చెప్పు! నేను నాయక్కి చెప్పను. అతనికే కాదు ఎవరికీ చెప్పను. చెప్పు! ఆ శకుని ఎవరు? అతను అక్కడెందుకున్నాడు?’’ అన్నాడు అనునయంగా.
‘‘ఆ.. శకునిగాడు.. ఓ పోలీసాఫీసర్’’
‘‘వ్వాట్?’’ అరిచినట్టు అన్నాడు ప్రభు.
‘‘అంతేకాదు.. ఆయన.. ఆయన మన నాయక్ గారి కన్న తండ్రి’’ మరో బాంబ్ పేల్చాడు ప్రభు.
నిజంగానే నెత్తిన పిడుగు పడ్డట్టయింది చంద్రకి.
‘‘నీకు మతిపోయిందా? విజయ నాయక్ తండ్రి పోలీసాఫీసరే. కానీ ఆయన పోయి ఇరవై ఏళ్ళయింది’’ అన్నాడు చిరాగ్గా.
‘‘లేదు చంద్రా! ఆయన బతికే వున్నాడు’’ అంటూ, తప్పనిసరిగా శకుని, దొర కలిసి చెప్పినవి, శకుని నిర్మించిన పాతాళస్వర్గం గురించి, నగలని ఎలా కాపాడిందీ, ఆటవికులకి ఎన్ని సౌకర్యాలు కలిగించిందీ అన్నీ చెప్పేశాడు ప్రభు. ఎన్ని సౌకర్యాలు కలిగించిందీ అన్నీ చెప్పేశాడు ప్రభు.
‘‘మైగాడ్! సిఐ రామచంద్ర బతికే వున్నాడా? శకునిగా పనులు చేస్తున్నాడా? నిజంగా గర్వపడాల్సిన విషయం. అంత గొప్ప వ్యక్తిని గురించి నాయక్ ఎందుకు చెప్పద్దన్నాడు, ఏదో ఆలోచిస్తూ అన్నాడు చంద్ర.
‘‘లేదు చంద్రా! తండ్రిని రమ్మని ఎంతో బతిమాలాడు మిస్టర్ నాయక్. కానీ ఆయన ఒప్పుకోలేదు సరికదా, తన గురించి చెప్పద్దనీ, మళ్లీ తనని చూడ్డానికి రాకూడదనీ ఆంక్షలు పెట్టాడు’’ అంటూ శకుని హెచ్చరింపులన్నీ చెప్పాడు ప్రభు.
‘‘ఓ.. అందుకేనా, నాయక్ మొహంలో కూడా ఏదో బాధ కనిపిస్తోంది. అడవిలో అష్టకష్టాలూ పడిరావడంవల్ల అలా వున్నాడేమో అనుకున్నాను. అవును మరి, ఇన్నాళ్ళ తర్వాత తండ్రి కనిపించి, పరాయివాడిలా ప్రదర్శిస్తే ఎవరి మనసైనా దెబ్బతింటుంది. కానీ ఇంతకాలానికి కొడుకు కనిపించినా చలించని ఆ తండ్రేం తండ్రి?’’ అన్నాడు చంద్ర.
‘‘లేదు చంద్రా కొడుకుని చూసినపుడు ఆయన కళ్ళలో కనిపించిన వెలుగు నేనింకా మర్చిపోలేదు. వీడ్కోలు ఇస్తూ ‘చింటూ’ అంటూ అతన్ని గుండెలకి హత్తుకున్నాడు. ఆయన కళ్ళు ధారాపాతమయ్యాయి. ఆ కొడుక్కన్నా ఆటవికుల క్షేమం చూడ్డమే అతని ధ్యేయం అనుకున్నట్టున్నాడు. ఇంకమీదట మనం కలుసుకోలేం అన్నపుడు ఆ తండ్రీ కొడుకులిద్దరి మొహాల్లో ఎంత బాధ వుందో కళ్ళారా చూసిన మా అందరి కళ్ళలోనూ నీళ్ళూరాయి’’ అంటూ అంతా చెప్పేశాడు ప్రభు. అంతేకాదు ఈ విషయం తను చెప్పినట్టు నాయక్‌గారికి తెలియవద్దని బతిమాలాడా ప్రభు.
‘‘సరేలే.. ఇంక నీ విషయం చెప్పు’’అన్నాడు చంద్ర.
‘‘నా విషయమా?’’
‘‘అదే నువ్వు అడవినించి వచ్చిందగ్గర్నించీ చూస్తున్నాను. నువ్వు చాలా డల్‌గా వుంటున్నావ్. ఇది కేవలం ఆ శకుని గారి గురించే అనుకోను. ఎనీ ప్రాబ్లమ్? అన్నాడు చంద్ర అతనికేసి పరిశీలనగా చూస్తూ.
‘‘నాకు ప్రాబ్లమ్ ఏం లేదు. అంత మంచివాడిలా కనిపించే అనిల్ ఇన్ని నేరాలెలా చేశాడా అని ఆలోచిస్తున్నాను- పరధ్యానంగా అన్నాడు ప్రభు.
‘‘నిజమే. కానీ దానికి నువ్వంత టెన్షన్ పడ్డనికి అవకాశం లేదే’’
‘‘అబ్బే టెన్షనేం వుంది. అడవిలో జరిగిన అనుభవాలన్నీ కళ్ళముందు కదిలి వాటిని గురించే ఆలోచించకుండా నీకలా అనిపిస్తోందంతే’’ నవ్వేశాడు ప్రభు.
‘‘గుడ్! అన్నీ చెప్పావుగానీ అసలైన విషయం చెప్పలేదు’’ ఓరగా అతనికేసి చూస్తూ అన్నాడు చంద్ర.
‘‘ఏ విషయం?’’’ అర్థం కానట్టు చూశాడు ప్రభు.
‘‘అదదేంటి మిస్టర్ ఎవిడెన్స్! అడవిలో నీకూ, మీ క్లూకి మధ్య జరిగిన సంఘటనలేమైనా వుంటే చెప్పు. హేపీగా ఫీలవుతాను’’ నవ్వుతూ అన్నాడు చంద్ర.
‘‘్ఛ! ఛ! నేను ఎవిడెన్స్ ఏమిటి?’’ కంగారుగా అన్నాడు ప్రభు.
మన క్లూ.. తన భర్త ఎవిడెన్స్ అని చెప్పింది. ఆ అనిల్‌గాడిని అండని అనుకుందామంటే వాడు జైలుకెళ్లినా ఆమె దిగులుపడడంలేదు. అసలు అతను జైలుకెళ్ళడానికి ముఖ్య కారకురాలు కూడా ఆమె. కాబట్టి ఆమె ఎవిడెన్స్ అతను కాదని తేలిపోయింది. ఇపుడు నువ్వే ఎవిడెన్స్ ఎందుకవకూడదు?
‘‘్ఛ! ఛ! నేను ఎవిడెన్స్ ఏంటి?’’ కంగారుపడిపోయాడు ప్రభు.
‘‘తన భర్త ఎవిడెన్స్ అని చెప్పింది. నినే్న ఊహించి ఆ పేరు పెట్టుకుని వుంటుంది. ఓసారి అడిగి చూడకూడదూ?’’
‘‘ఏమిటి చంద్రా నీ మాటలు. పెళ్ళికాని పిల్ల అంటే బావుండదని, తన క్లూ పేరిట, ఎవిడెన్స్ అని ఓ పేరు తగిలించుకుంది. పెళ్ళయిన వాళ్ల వెంట ఎవరూ పడరుగా. అందుకే తన జాగ్రత్తలో వుంది’’ అన్నాడుప్రభు.
‘‘అయితే గౌతమిమీద నీకెలాంటి అభిప్రాయం లేదన్నమాట!’’

‘‘సదభిప్రాయమే’’
‘‘అయితే ఆమెని నువ్వే ఎందుకు పెళ్లిచేసుకోకూడదూ?’’
‘‘్ఛ! ఆమెని నేను చేసుకోవటం ఏమిటి? తను అనిల్‌ని ప్రేమించింది’’ అన్నాడు. అతని గొంతులోని దిగులుని గమనించాడు చంద్ర.
‘‘నువ్వు కూడా ఆమె పట్ల మనసు పారేసుకున్నానని నాకు తెలుసు’’ అన్నాడు ఓరగా చూస్తూ.
‘‘ఆమె అంటే ఇష్టం ఏర్పడిన మాట నిజమే చంద్రా, కానీ ఆమె అనిల్‌కి మనసిచ్చింది’’ అన్నాడు ప్రభు.
చంద్ర మొహం గంభీరంగా అయిపోయింది.
‘‘ఓ! ఆమె ఎపుడో, ఎవర్నో ప్రేమించిందని ఎవర్నో ప్రేమించినదాన్ని చేసుకోవడం ఏవిటని ఆలోచిస్తున్నావా?’’ అన్నాడు.
‘‘్ఛ! ఛ! అదికాదు’’ కంగారు పడిపోయాడు ప్రభు.
‘‘మరి తనని చేసుకోవడానికి అభ్యంతరం ఏమిటి?’’
‘‘...’’
‘‘ఒక్క మాట చెప్పుప్రభూ! నువ్వు క్లూగా చూసినప్పటినుంచి నువ్వామెని ఇష్టపడుతున్నావని గమనిస్తూనే వున్నాను. అది నా భ్రమ అని ఇప్పుడనిపిస్తోంది. ఒక్క మాట అడుగుతాను చెప్పు. నువ్వామెని ప్రేమించలేదా?’’ అన్నాడు చంద్ర.
‘‘ప్రేమించడమా? మామూలుగా కాదు ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను’’.
‘‘ఆమె అనిల్‌ని ప్రేమిస్తోందని తెలిసే ఆమెని ఆరాధించావ్ కదూ?’’
‘‘అవును. క్లూగా ఆమెని ప్రేమించాను. ఆమె అనిల్ గురించి చెప్పినపుడు నిరాశపడిపోయాను. అలా అని నా ప్రేమని వదులుకోలేదు. నా ప్రేమారాధనలని నా గుండెల్లోనే పదిలంగా దాచుకున్నాను. కానీ అతన్ని గురించి అనుమానాలు చెప్పినపుడు, ఆమె అతన్ని హేట్ చేసినపుడు నాలోని ఆశ మళ్లీ వూపిరిపోసుకుంది. అంతేకాదు, ఆమె మనసులో నాకు చోటుందని తెలిశాక హిమాలయాలెక్కినంత సంబరపడిపోయాను. కానీ ఆమె దగ్గరికెళ్లి చెప్పడానికి మాత్రం ధైర్యం చాలడంలేదు’’ తనని తాను మర్చిపోయి మనసులోనిదంతా చెప్పేశాడు ప్రభు.

ప్రభు మాటలకి పకపక నవ్వేశాడు చంద్ర.
‘‘ద గ్రేట్ ఐఎఎస్ ఆఫీసర్ ప్రభుదేవ ఓ ఆడపిల్ల ముందు మాట్లాడ్డానికి భయపడడమా.. షేమ్! నీకే కాదు నాక్కూడా అవమానమే’’ అన్నాడు అల్లరిగా.
‘‘తనగురించి నీకు తెలియదు చంద్రా. సరదాగా మాట్లాడుతూనే సీరియస్ అయిపోతుంది. అంతలోనే నవ్వేస్తుంది.
‘‘అసలామె నిన్ను ప్రేమిస్తోందని నీకు తెలుసా?’’ అన్నాడు చంద్ర ఏదో ఆలోచిస్తూ.
‘‘తెలుసు. అడవిలో ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. ఒకళ్ళకొకళ్ళం తోడున్నాం. ఒకరికొకరం ఓదార్చుకున్నాం. నన్ను సేవ్ చెయ్యడానికే అనుకో. నన్ను తన వుడ్‌బిగా వాళ్లకి పరిచయం చేసింది.
‘‘అదే ప్రేమ అనుకుంటున్నావా? పిచ్చి ప్రభూ! ఆపదలో ఆగర్భ శత్రువులు సైతం ప్రేమగా, చనువుగా మాట్లాడుకుంటారు. అదే ప్రేమ అనుకుంటే ఎలా? అడవినుంచి వచ్చాక అలా మాట్లాడిందా?’’ అతని మనసులోని విషయాన్ని రాబట్టాలన్నట్టు అన్నాడు చంద్ర.
‘‘కాదు చంద్రా! ఆమె నన్ను ప్రేమిస్తోందని నాకు బాగా తెలుసు. నాకు ఆడవాళ్ళని గురించి అంతగా తెలియకపోయినా గౌతమి విషయంలో మాత్రం నేను పొరపడలేదు’’ అన్నాడు ప్రభు స్థిర స్వరంతో
‘‘గుడ్! మంచి ప్రోగ్రెస్ వుంది. ఆమె నిన్ను ప్రేమిస్తోందని ఎలా కనిపెట్టావ్? అడవిలో ప్రణయగీతాలూ, ఏటి స్నానాలూ వెనె్నల విహారాలూ లాంటివన్నీ అయిపోయాయా? పర్లే చెప్పు.. రేపు మీ పెళ్లి చేయాల్సింది నేనే’’ అన్నాడు చంద్ర మరింత ఉత్సాహంగా.
‘‘్ఛ! అలాంటివేం జరగలేదు కానీ ఓ చిన్న సంఘటన జరిగింది’’.
‘‘ఏవిటది? కొంపతీసి పెళ్లికాకుండానే...’’
‘‘్ఛ! ఛ! అది కాదు’’ కంగారుపడిపోయాడు ప్రభు.
‘‘మరి ఏవిటి సంఘటన?’
‘‘అది ముఖ్య విషయమే అనుకోవాలి. నీకు చెప్పాలనుకున్నాను గానీ.. కాస్త మొహమాటపడ్డాను.
‘‘నా దగ్గర విషయాలు దాచడం నీకలవాటేగా.. చెప్పు’’ అన్నాడు చంద్ర కుతూహలంగా.

‘‘మా మాటలు ప్రవర్తన చూసి మేమిద్దరం నిజంగానే ప్రేమికులం అనుకుని, మీ పెళ్లికి మేమెలా రాలేంకదా అంటూ అక్కడివాళ్ళంతా కలిసి మా ఇద్దరిచేతా దండలు మార్పించి, విందు భోజనాలు పెట్టి డాన్సులు చేసి చాలా హంగామా చేశారు.’’ తల దించుకుని మెల్లగా చెప్పాడు ప్రభు.
చంద్ర మొహంలోకి వుత్సాహం వచ్చేసింది.
‘‘వావ్! అయితే మీ ఇద్దరికీ పెళ్ళయిపోయిందన్నమాట, మనలో మనమాట. పెళ్ళి మాత్రమేనా.. లేక శోభనం కూడా జరిపించేశారా?’’ ఎప్పుడూ లేనంత అల్లరిగా అన్నాడు చంద్ర.
‘‘ఇదిగో! నువ్వలా అంటావనే నీకు చెప్పలేదు.’’ అలిగినట్లు అన్నాడు ప్రభు.
‘‘లేదు లేదు. చెప్పు తర్వాతేమయింది?’’
‘‘ఏం కాలేదు. కానీ నేనామె మెడలో దండవేస్తున్నప్పుడు ముందు నిర్ఘాంతపోయినా, తర్వాత ఆమె కళ్ళు మెరవడం, చెంపలు కందిపోవడం, వాలిపోతున్న కళ్ళతో నా మెడలో దండవెయ్యడం చూశాక ఆమె కూడా నన్ను ప్రేమిస్తోందనిపించింది.’’అన్నాడు ప్రభు నసిగినట్టు.
చంద్రమొహంలోకి మరింత వుత్సాహం వచ్చేసింది.
‘‘మరింక నసుగుతావెందుకు. వెంటనే శంకరయ్యగారి దగ్గరికెళ్ళి లగ్నాలు పెట్టించక’’ అన్నాడు అతనికి అభినందనలు చెప్పి.
‘‘అది నీ పని’’ గోముగా అన్నాడు ప్రభు.
‘‘ఏవిఁట్రా మరీ ఆడపిల్లకన్నా సిగ్గుపడి పోతున్నావ్. సరే.. ఇంక అంతా నాకొదిలెయ్. నేను చూసుకుంటాను. అయినా ఇంత మంచి విషయాన్ని చెప్పడానికి ఇన్నాళ్ళు పట్టింది. ఇంక ఆ క్లూ దగ్గరికెళ్ళేసరికి నీకు మాటేరాదెమో. అసలే ఆ పిల్ల డేరింగ్ పర్సన్. ఆమెదగ్గర కాస్త జాగ్రత్తగా వుండు.’’
‘‘పో చంద్రా! మరీ నన్ను చేతకానివాడి కింద తీసిపడేస్తున్నావ్. అయినా గౌతమి నువ్వనుకున్నంత రాలుగాయి కాదు. రహస్య సంఘటనలని రాబట్టడానికి క్లూలా వ్యవహరిస్తుందంతే, అదీ ప్రజాసేవకోసం, దేశ రక్షణకోసం తాపత్రయ పడుతుంది’’ అన్నాడు ప్రభు.
‘‘నిజమే. ఆమె డాక్టరుగాకాక ఏ పోలీసు డిపార్ట్‌మెంట్‌లోనే వుంటే ఇంకా రాణించేది.’’
‘‘నేనూ అదే అనుకున్నాను’’ నవ్వాడు ప్రభు.
***
సి.ఎమ్. కబురందుకున్న విజయనాయక్ వున్న పాటున వూడిపడ్డాడు. మళ్ళీ ఏం కొంప మునిగిందా అని అనుమానిస్తూనే అతన్ని ఆప్యాయంగా ఆహ్వానించి తన పర్సనల్ రూమ్‌లోకి తీసికెళ్ళాడు చంద్ర.
‘‘ఏంటి సర్’’ ఎనీ ప్రాబ్లమ్?’’అన్నాడు నాయక్ కంగారుగా.
‘‘పెద్ద ప్రాబ్లమే’’ నవ్వాడు చంద్ర.
‘‘ఏవిఁటి సార్? మిస్ క్లూ మళ్ళీ ఏమైనా క్లూ అందించిందా? తనూ నవ్వుతూనే అన్నాడు నాయక్.
‘‘క్లూ కాదు. క్లూ ఎవిడెనే్స ఓ మంచి క్లూ అందించాడు’’
‘‘క్లూ ఎవిడెన్సా?’’
‘‘అదే మిస్టర్ నాయక్స్, మిస్టర్ ఎవిడెన్స్! అంటే మన ప్రభు...’’
‘‘ఓ! అర్ధమయింది. తనకి, గౌతమికీ అడవి పెళ్ళిచేశారని ప్రభు చెప్పారా?’’ నవ్వుతూ అన్నాడు నాయక్.
‘‘ఎస్! మీరంతా పెళ్ళిపెద్దలై ఆశీర్వదించారుగా?’’
‘‘అదే... ఆ దొర కూతురు చిన్నీవాళ్ళు ముందువెనక ఆలోచించకుండా ఏదో దండలు మార్పించారు. ‘నసిగినట్టు అన్నాడు నాయక్’.
‘‘అదే మనం నిజం పెళ్ళిచేసి వాళ్ళిద్దర్నీ ఒకటి చెయ్యాలి!’’
‘‘చెయ్యచ్చు, కానీ...ఆ గౌతమి...’’
‘‘అనిల్‌ని ప్రేమించిందంటారు. అంతేనా? ఆమెలో గౌతమికాక ‘క్లూ’అనే ఓ సాహస యువతి దాగుంది. ఆ క్లూయే ధర్మారావు వాళ్ళ ప్లాన్స్‌ని, వాళ్ళద్వారా చేరి ప్రేమ నటించిన అనిల్ వుద్దేశాన్నీ కనిపెట్టి వాళ్ళకి తగిన విధంగా నటించి అతని హాస్పిటల్లో చేరి ఎన్నో రహస్యాలు కనిపెట్టింది. తన ఫ్రెండైన చందనని లూసీ పేరుతో నర్స్‌గా పంపింది. తాము దాచిన నగల్ని బ్లాక్ టైగరే దొంగిలించి వుంటాడన్న నమ్మకంతో అడవిలో ప్రవేశించి, విజయం సాధించడమేకాక బ్లాక్‌టైగర్ మీదున్న అపోహలన్నీ తుడిచేసింది. అఫ్‌కోర్స్ మీరంతా ఆమెకి అండగా నిల్చోరనుకోండి. ఇంతకీ నేను చెప్పేదేమిటంటే ఆ అనిల్‌మీద అనుమానంతో అతన్ని ప్రేమించినట్టు నటించిందే కానీ నిజంగా అతన్ని ప్రేమించలేదు. అతను దోషిగా నిరూపించి తేలిగ్గా వూపిరి తీసుకుంది. ఇదంతా నేను వూహించిందికాదు నాయక్. స్వయంగా ఆమె నోటినించి విన్నవే. ప్రభు చెప్పింతర్వాత ఆమెతో నేను మాట్లాడాను’’ నవ్వుతూ చెప్పాడు చంద్ర.
నాయక్ మొహంలోకి వుత్సాహం వచ్చింది.
(ఇంకావుంది)

కాలుష్య రాజధాని.. ఢిల్లీ

$
0
0

నగరాల్లో, పట్టణాల్లో శుభ్రమైన గాలి లభిస్తున్న తీరుతెన్నులు ఎలా ఉన్నాయో ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిధ దేశాల్లో అధ్యయనం చేసి నిర్దిష్ట పరిమితిని మించి కాలుష్యం బారిన పడిన నగరాల జాబితా తయా రుచేసింది. మరీ ముఖ్యంగా వాయు కాలుష్యం మరింత తీవ్రం కావడం ఎంత ప్రమాదకరమో తెలియజెప్పింది. ఈ జాబితాలో న్యూయార్క్, లండన్ వంటి నగరాలే కాక ఢిల్లీ కూడా ఉంది. 91 దేశాల్లోని దాదాపు 1600 నగరాల్లో జరిపిన అధ్యయనాల ఆధారంగా ఒక నివేదిక తయారుచేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దీని ప్రకారం అత్యంత కాలుష్యం బారిన పడిన వంద నగరాల్లో భారతదేశానికి చెందిన 34 నగరాలు ఉన్నాయి. అలాగే భరించశక్యం కానంత తీవ్రస్థాయికి చేరిన యాభై నగరాల్లో 22 నగరాలు భారతదేశంలోనే ఉన్నాయి. వీటిని మరింత వర్గీకరించి అత్యంత వాయుకాలుష్యం బారిన పడిన నగరాలుగా పదింటిని గుర్తించారు.
అవి...
1. ఢిల్లీ
2. పాట్నా - బీహార్
3. గ్వాలియర్ - మధ్యప్రదేశ్
4. రారుపూర్ - చత్తీస్‌గఢ్
5. అహ్మదాబాద్ - గుజరాత్
6. ఫిరోజాబాద్ - ఉత్తరప్రదేశ్
7. అమృతసర్ - పంజాబ్
8. కాన్పూర్ - ఉత్తరప్రదేశ్
9. ఆగ్రా - ఉత్తరప్రదేశ్
10. లూథియానా - పంజాబ్
ఈ పది నగరాల్లో నిర్దిష్ట స్థాయికి మించిన అత్యంత ప్రమాదకర కాలుష్య కారకాలైన సల్ఫేట్, నైట్రేట్, బ్లాక్ కార్బన్ కణాలు గాలిలో కలుస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాలు వివరించాయి. వేగంగా పారిశ్రామీకరణ చెందుతున్న దేశాల్లో కాలుష్యమరణాలు అధికంగా ఉన్నాయి. వాయుకాలుష్యం కారణంగా ప్రపంచంలో శ్వాసకోశ వ్యాధులతో ఏటా సుమారు 38 లక్షల మంది చనిపోతుంటే వారిలో భారత్‌కు చెందినవారు సుమారు 15 లక్షల మంది ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాలుష్య మరణాలు మూడోవంతు ఉన్న భారతదేశానికి ఈ నివేదిక ఓ హెచ్చరిక. గాలిలో ఉండే అత్యంత ప్రమాదకరమైన కణాలు శరీరంలోకి చేరడం వల్ల శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల కేన్సర్, ఇనె్ఫక్షన్స్, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం వంటి రోగాల బారిన పడి చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున వాయుకాలుష్యం కూడా అదే నిష్పత్తిలో పెరిగిపోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వేగంగా అభివృద్ధి సాధిస్తున్నామని, ఆర్థికరంగం కొత్త పుంతలు తొక్కుతున్నదనీ పాలకులు చెబుతున్నప్పుడు వినడానికి బాగుంటుంది కానీ అది ప్రాణాలను తోడేస్తున్నదని ఎవరూ ఆలోచించడం లేదు. అభివృద్ధి యావలో ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న పాలకులకు ఈ నివేదిక హెచ్చరికలతో పాటు తక్షణ చర్యల అవసరాన్ని కూడా గుర్తుచేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. పర్యావరణాన్ని, కాలుష్యాన్ని అభివృద్ధి నిరోధక అంశాలుగా చూడటమంటే ప్రజల ప్రాణాలకు ముప్పు తేవడమే..

వారం వారం గోచారం (22.9.2019నుంచి 28.9.2019వరకు)

$
0
0

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈవారం ప్రారంభంలో కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. వేరువేరు రూపాల్లో సంప్రదింపులు. అనేక రకాల వార్తలు కన్‌ఫ్యూజ్ చేసే అవకాశం. వ్యాపారాదుల్లో శుభపరిణామాలు. భాగస్వామ్యాల్లో అనుకూలత. ఇతరుల సహకారంకోసం ప్రయత్నిస్తారు. ప్రయాణాదులకు అవకాశం. విహార యాత్రలలో కాలం ధనం వ్యర్థంకాకుండా చూసుకోవాలి. వారం మధ్యమంలో సౌకర్యాలు ప్రభావితంచేస్తాయి. సౌఖ్యంగా గడుపుతారు. గృహవాహనాది వ్యవహారాల్లో మంచి నిర్ణయాదులుంటాయి. పార్టీలు చేసుకునే అవకాశం. మాతృసౌఖ్యం ఉంటుంది. తల్లివైపు బంధువుల కార్యక్రమాలుంటాయి. వారాంతంలో అభీష్టాలు నెరవేర్చుకునే ప్రయత్నం. కొంత ఉద్రిక్త భావనలు తప్పకపోవచ్చు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈవారం ప్రారంభంలో లాభాలు సంతోషాన్నిస్తాయి. అత్యధిక ప్రయోజనాలను ఆశిస్తారు. శ్రమ లేకుండా ఫలితాలుపొందాలనే భావాలు వస్తుంటాయి. కుటుంబంలో అనుకూలత. మానసికమైన ఒత్తిడులకు కూడా అవకాశంఉంది. నిర్ణయాదులు ఆలస్యం అవుతాయి. పెద్దల ఆశీస్సులకోసం ప్రయత్నిస్తారు. వారం మధ్యమంలో ఖర్చులు అధికం. పెట్టుబడులు సంతోషాన్నిస్తాయి. ఆహార విహారాలకోసం ధనం కాలం వెచ్చిస్తారు. ప్రయాణాదులుంటాయి. విహార యాత్రలకు కూడా అవకాశం ఉంటుంది. సౌఖ్యంగా గడుపుతారు. పూర్తి విశ్రాంతి లభిస్తుంది. వ్యతిరేకతలున్నా విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. వారాంతంలో నిర్ణయాదులు సంతోషాన్నిస్తాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈవారం ప్రారంభంలో భాగస్వామ్యాలపై దృష్టి, సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. కొత్త పరిచయాల్లో జాగ్రత్తవహించాలి. భాగస్వామితో కొంత అప్రమత్తంగా మెలగాలి. కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలున్నాయి. నూతన కార్యక్రమాలపై దృష్టిఉన్నా బద్ధకంగా ఉంటుంది. పనులను వాయిదావేస్తుంటారు. వారం మధ్యమంలో ఆరోగ్య సమస్యలకు అవకాశం. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆహార విహారాల్లో జాగ్రత్త. నిర్ణయాదులను వాయిదావేయడం మంచిది. అనుకోని సమస్యలు, ఊహించని సంఘటనలకు అవకాశం. శ్రమలేని సంపాదనలపై దృష్టి, కుటుంబ వ్యవహారాల్లోనూ జాగ్రత్తగా మెలగాలి. వారాంతంలో ఉన్నత వ్యవహారాలను నిర్వహించే ప్రయత్నం. కీర్తిప్రతిష్ఠలు పెంచుకుంటారు.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈవారం ప్రారంభంలో కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. బంధువర్గ వ్యవహారాల్లో కొంత అప్రమత్తంగా మెలగాలి. వ్యాపార వ్యవహారాలు లభిస్తాయి. క్రియేటివిటీ పెరుగుతుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. సంతానంతో సంతోషం. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని సమస్యలున్నా అధిగమిస్తారు. నిల్వధనం పోకుండా చూసుకోవాలి. వారం మధ్యమంలో సంప్రదింపులు సంతోషాన్నిస్తాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. మాతృవర్గంవారి సపోర్ట్ దొరుకుతుంది. మీడియా రంగంలోనివారికి అనుకూలం. దగ్గరి ప్రయాణాలుంటాయి. ఆధ్యాత్మిక యాత్రలవల్ల మరింత మేలు. వైజ్ఞానిక వ్యవహారాలు పూర్తి సంతృప్తినిస్తాయి. వారాంతంలో సౌకర్యాల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈవారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అనేక కార్యక్రమాలను నిర్వహించాల్సి వస్తుంది. వేరువేరు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపారాదుల్లో అనుకూలత. నిర్ణయాదులు సమస్యలకు గురిచేయవచ్చు. శ్రమాధిక్యం. కృషితో సామాజిక గౌరవం పెంచుకుంటారు. ఆహార విహారాల్లో సమస్యలుంటాయి. వారం మధ్యమంలో అన్నిరకాలుగా ధనధాన్య లాభాలు. ఏ పనిచేసినా ప్రయోజనాన్ని ఆశిస్తారు. ఆహార విహారాలకు అనుకూలం. ఆలోచనలకు రూపకల్పన. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. క్రియేటివిటీ పెంచుకుంటారు. కొత్త పనులపై దృష్టిఉంటుంది. ప్రయాణాదులు ఉంటాయి. నిర్ణయాదుల్లో చాలా జాగ్రత్తగా మెలగాల్సివస్తుంది. అధికారిక వ్యవహారాల్లో అప్రమత్తం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో పోటీలు అధికం. ఒత్తిడులతో కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుంది. కార్యనిర్వహణలో శ్రమ. ఋణాలు, రోగాలు శ్రమకు గురిచేయవచ్చు. అన్ని పనుల్లోనూ జాగ్రత్తఅవసరం. విజయ సాధన. పోటీ రంగంలో గుర్తింపు ఉంటుంది. వ్యర్థమైన ఖర్చులకు, ప్రయాణాలకు అవకాశం. అసంతృప్తి ఉంటుంది. వారం మధ్యమంలో పరిచయాలు స్నేహానుబంధాలు విస్తారిస్తాయి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. గౌరవ మర్యాదలుంటాయి. ఆహార విహారాలకు అనుకూలం. మిత్రులతో కలయిక సంతోషాన్నిస్తుంది. కార్యనిర్వహణ దక్షత. అనేక బాధ్యతలను నిర్వర్తిస్తారు. అనారోగ్య భావనలకు అవకాశం. ఆకస్మిక నష్టాలుంటాయి.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసంఉన్నా ఇతరుల భావాలకు లొంగిపోతుంటారు. సౌకర్యాలపై ప్రత్యేకదృష్టి. బాధ్యతలు అధికవౌతాయి. భాగస్వామ్యాల్లో అనుకూలత. వ్యాపారాదులు విస్తరించుకునే ప్రయత్నం. తొందరపాటు నిర్ణయాదులు కూడదు. వారం మధ్యమంలో కుటుంబంలో అన్నీ శుభపరిణామాలు. బంధువర్గంవారు సంతోషాన్నిస్తారు. నిల్వధనం పెరుగుతుంది. మాటతీరువల్ల సంతోషం పెరుగుతుంది. ఆత్మీయత ఏర్పడుతుంది. కొన్ని ఊహించని ఇబ్బందులున్నా అధిగమిస్తారు. వారాంతంలో కమ్యూనికేషన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సంప్రదింపుల్లో కొంత చికాకు. సౌకర్యాలు, సౌఖ్యాలకు సంబంధించిన సమాచారాలు అందుతాయి.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈవారం ప్రారంభంలో ఉన్నత లక్ష్యాలపై దృష్టి. సుదూర ప్రయాణాదులు. వ్యాపారాదుల్లో అనుకూలత. ఖర్చులు పెట్టుబడులుకూడా ఉంటాయి. సంప్రదింపుల్లో సమస్యలు. సేవక వర్గ సహకారం మాత్రం లభిస్తుంది. ఉన్నతమైన విద్య, వైజ్ఞానికభావాలు విస్తరించే అవకాశం ఉంది. వారం మధ్యమంలో వృత్తిలో అనుకూలత. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం. సామాజిక గౌరవం పెంచుకుంటారు. ఆహార విహారాల్లో శుభపరిణామాలు. సంతోషంగా గడుపుతారు. గుర్తింపు లభిస్తుంది. తండ్రి తరఫు బంధువుల వ్యవహారాలను నిర్వహించాల్సి వస్తుంది. కార్యనిర్వహణలో దక్షత. వారాంతంలో ప్రయోజనాలు సంతోషాన్నిస్తాయి. అనేక రూపాల్లో లాభాలకు అవకాశం. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో మానసికమైన సంతోషం. సృజనాత్మక శక్తి. సంతానవర్గంతో సంతోషంగా గడుపుతారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆశించిన లాభాలు అందకపోవచ్చు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కొంత ఆందోళన కూడా ఉంటుంది. దైవధ్యానం తప్పనిసరి. వారం మధ్యమంలో వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు లభిస్తుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. పోటీల్లో విజయం సాధిస్తారు. ఋణాదులను అధిగమిస్తారు. ఖర్చులు పెట్టుబడులు కూడా ఉంటాయి. ఆశించిన విశ్రాంతి అందక పోవచ్చు. పనుల ఒత్తిడి తీవ్రం అవుతుంది. వారాంతంలో పరిచయాలు విస్తరిస్తాయి. స్నేహానుబంధాలు పెంచుకునే ప్రయత్నం. పాత మిత్రుల కలయిక, స్మృతులు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈవారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులు అత్యధికం అవుతాయి. పరామర్శలకు అవకాశం. సౌఖ్యంగా గడపాలనే ప్రయత్నం. ప్రయాణాలు, సౌకర్యాలు, సౌఖ్యంకోసం కాలం ధనం బాగా వెచ్చించాల్సి వస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. సంప్రదింపుల్లో శుభపరిణామాలు. మంచి వార్తలు వింటారు. వ్యతిరేకతలు ఇబ్బంది పెడతాయి. పోటీ రంగంలో సమస్యలు. వారం మధ్యమంలో ఆత్మవిశ్వాసంతో కార్యనిర్వహణ. అనేక కార్యక్రమాల బాధ్యతలుంటాయి. గుర్తింపు, గౌరవాదులు పెంచుకుంటారు. ఆహారాదుల్లో అనుకూలత. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. తొందరగా పూర్తిచేసే ప్రయత్నం. భాగస్వామ్యాల్లో శుభపరిణామాలు. వారాంతంలో కుటుంబంలో అనుకూలత. రాజకీయ వ్యవహారాలపై దృష్టి.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈవారం ప్రారంభంలో అనుకోని సమస్యలుంటాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులకు అవకాశం. ఆర్థిక నిర్ణయాదుల్లో జాగ్రత్త. వ్యాపార లోపాలుంటాయి. ఆశించిన లాభాలు అందకపోవచ్చు. కుటుంబంలో ఒత్తిడులు. మాట విలువ తగ్గే సూచనలు. ముఖ్యమైన నిర్ణయాదులను వాయిదావేసుకోవాలి. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ అనుకూలత. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. సుదూర ప్రయాణాలకు అవకాశం. వైజ్ఞానిక, సాంకేతిక రంగాల్లో పరిశోధనలకు అనుకూలం. ఆధ్యాత్మిక వ్యవహారాలుంటాయి. ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం. సంతోషంగా గడుపుతారు. వారాంతంలో వృత్తిలో అనుకూలత.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈవారం ప్రారంభంలో ఆహార విహారాలపై దృష్టి. సౌఖ్యంకోసం ప్రయత్నం. గృహ వాహనాది సౌకర్యాల విషయంలో జాగ్రత్తఅవసరం. ప్రయాణాలలో ముందుజాగ్రత్తలు అవసరం. విద్యారంగంలోని పిల్లలకు శ్రమాధిక్యం. వృత్తిఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. పదోన్నతులు వాయిదాపడే సూచనలు. వ్యాపార భాగస్వామ్యాలకు అనుకూలం. వారం మధ్యమంలో అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. అన్ని పనుల్లోనూ సంతోషం. క్రియేటివిటీతో పనిచేసేస్తారు. ప్రణాళికాబద్ధమైన వ్యవస్థ ఉంటుంది. సంతానంతో సంతోషంగా గడుపుతారు. లాభాలు సంతృప్తినిస్తాయి. ప్రయోజన దృష్టిపెంచుకుంటారు. కొత్త పనులపై దృష్టిఉంటుంది. వారాంతంలో వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు లభిస్తుంది.

పదాల్లో పోలిక.. రోగాల్లో తేడా..

$
0
0

ఇంగ్లీషులో ఇనె్ఫక్షస్, కంటేజియస్ అని రెండు మాటలు ఉన్నాయి. వీటి అర్థంలో పోలిక ఉంది కానీ ఈ రెండూ రెండు విభిన్నమైన భావాలని చెబుతాయి. ఒక ప్రియానువల్ల కాని, వైరస్ వల్ల కాని, బేక్టీరియం వల్ల కాని, ఫంగస్‌వల్ల కాని, పేరసైట్‌వల్ల కాని వచ్చే రోగాలని ‘‘ఇనె్ఫక్షన్ డిసీజెస్’’అంటారు. అంటే, మన శరీరానికి ‘స్వంతం’కాని లాటి పదార్థాలు శరీరంలోకి ప్రవేశించి రోగకారకులు అయినప్పుడు ‘ఇనె్ఫక్షన్’ అన్న మాట వాడతాం. ఒక జీవినుండి మరొక జీవికి అంటుకునే రోగాలని ‘‘కంటేజియస్ డిసీజెస్’’అని కాని, ‘‘కమ్యూనికబుల్ డిసీజెస్’’అని కాని, ‘ట్రాన్స్‌మిసిబుల్ డిసీజెస్’ అని కాని అంటారు.
‘‘సి.జె.డి.’’అనే జబ్బు ఉంది. ఇది ప్రియానులు మన శరీరంలో జొరబడ్డంవల్ల వస్తుంది. కాని ఇది ఒకరి నుండి మరొకరికి అంటుకోదు. అంటే ఈ ‘‘సి.జె.డి.’’ జబ్బుతో తీసుకుంటూన్న వ్యక్తి దరిదాపుల్లోకి వెళ్లినంతమాత్రాన ఆ జబ్బు మనకి అంటుకోదు. కనుక ఇది ‘‘ఇనె్ఫక్షన్ డిసీజ్’’మాత్రమే. దోమకాటువల్ల మనకి సంక్రమించే మలేరియా వంటి రోగం కూడ ‘‘ఇనె్ఫక్షన్ డిసీజ్’’ కోవకే చెందుతుంది.
కాని మలేరియా కేవలం ఒకరిలో తిష్టవేసుకుని ఉండిపోదు కదా. మలేరియా ఉన్న రోగిని కరిచిన దోమ మరొకరిని కరిస్తే ఆ రెండవ వ్యక్తికి మలేరియా వచ్చే సావకాశం ఉంది. ఈ దృష్టితోచూస్తే మలేరియాని ‘‘కంటేజియస్’’అని అనుకోవచ్చు. కాని ఈ సందర్భంలో అలా అనం. ఈ వ్యత్యాసం ఇన్‌ఫ్లుయెంజా విషయంలో స్ఫుటంగా కనిపిస్తుంది. ఇన్‌ఫ్లుయెంజా లేదా ఫ్లుఇన్ఫ్‌క్షన్ మాత్రమే కాకుండా కంటేజియస్ కూడా! ఎందుకంటే ఒకరికి ఫ్లూవస్తే వారికి సమీపంలోఉన్న మరొకరికిగాని, వారిని తాకిన వారికి గాని అంటుకునే సావకాశం బాగా ఉంది. కనుక ఈ రెండురకాల రోగాల మధ్య ఒక గీత గీసి ఒక పక్క ఇనె్ఫక్షన్ మరొక పక్క కంటేజియస్ అని చెప్పటం కొంచెం కష్టం. ఇనె్ఫక్షన్‌లు ఎన్నో విధాలుగా రావచ్చు, కాని అన్ని ఇనె్ఫక్షన్‌లూ ఒకరినుండి మరొకరికి అంటుకోవు. మరొక విధంగా చెప్పాలంటే సూక్ష్మజీవులు మన శరీరంలో ప్రవేశించి అక్కడ తిష్టవేస్తే అది ‘తిష్ట’(లేదా ఇనె్ఫక్షన్), దాని వల్ల వచ్చే రోగం తిష్టరోగం. ఈ రోగం ఒకరి నుండి మరొకరికి అంటుకుంటే అది ‘అంటు’(లేదా కంటేజియస్), దానివల్ల వచ్చే రోగం అంటురోగం. ఇప్పుడు తిష్టతత్త్వం అంటే ఇనె్ఫక్షన్, అంటుతత్త్వం అంటే కంటేజియస్ అని మనం తెలుగులో వాడుకోవచ్చు.
కంటేజియస్ అనే విశేషణానికి నా నిఘంటువులో ‘‘అం టు, సోకుడు, సంక్రామిక, సాంక్రామిక’’అనే అర్థాలు కూడ ఇచ్చేను. ఇనె్ఫక్షన్ అంటే ‘‘తిష్ట, సంక్రామిక’’ అని ఇచ్చేను. నిఘంటు నిర్మాణంలో కొన్ని ఇబ్బందులవల్ల ‘‘సంక్రామిక’’అనే అర్థం రెండింటికీ ఇవ్వవలసి వచ్చింది. కాని ఇక్కడ ఈ మాటల అర్థాలలోని తేడా వివరించేను కనుక వీటి అర్థాలలో విభేదం చూపించగలిగేను.
తిష్టతత్త్వం గురించి మరికొంచెం తెలుసుకుందాం. తిష్టకి అనేక కారణాలు ఉన్నా ముఖ్యంగా చెప్పుకోవలసినవి బేక్టీరియంలు, వైరసులు. ఉదాహరణకి క్షయ బేక్టీరియంవల్ల వచ్చేది తిష్టవ్యాధి. జలుబు, ఆటలమ్మ, మశూచికం, ‘‘ఎ.ఐ.డి.ఎస్’’ మొదలైనవి వైరస్‌వల్లవచ్చే తిష్టవ్యాధులు.
బేక్టీరియం అతి సూక్ష్మమైన ఏక కణ జీవి. ఈ జీవులు అనేక రకములైన వాతావరణాల్లో స్వతంత్రంగా బతకగలవు. వైరస్ ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైన ‘‘విష రేణువు.’’ ఈ రేణువులు (విషాణువులు) స్వతంత్ర ప్రతిపత్తితో బతకలేవు. అంటే వీటికి ఆతిథ్యం ఇవ్వటానికి ఒక అభ్యాగతి ఉండాలి. అందుకనే ఇవి మొక్కలలోకో, జంతువులలోకో, మనుష్యులలోకో ప్రవేశించిన తరువాతే వృద్ధిచెంది హానిచేస్తాయి. సామాన్యులకి ఈ సూక్ష్మాలు అన్నీ అనవసరం. మనం అంతా గుర్తుపెట్టుకోవలసినది ఏమిటంటే పెనిసిలిన్ వంటి ‘‘ఏంటీ బయాటిక్’’లు బేక్టీరియంల మీదనే పనిచెయ్యగలవుకాని, వైరస్‌ల మీద వాటికి ఏవిధమైన ప్రభావమూ లేదు. కనుక వైరస్‌వల్ల వచ్చే జలుబు, ఫ్లూవంటి వ్యాధులకి పెనిసిలిన్ వంటి ఏంటీబయాటిక్ మందులు వేసుకోవటంవల్ల ప్రయోజనం ఏమీ లేదు; పైపెచ్చు చీటికీ, మాటికీ పెనిసిలిన్ వంటి ఏంటీబయోటిక్ మందులు వాడడం మంచిది కూడా కాదు. అలావాడితే వాటికి శరీరం అలవాటుపడిపోయి నిజంగా అవసరం వచ్చినప్పుడు ఆ మందులు వాడితే అవి పని చెయ్యవు.

హిందూదేశం అనకూడదా?

$
0
0

ఇదెక్కడి విడ్డూరం?! కిందటి శతాబ్దం పూర్తి అయ్యేవరకూ హిందూజాతి, భారతజాతి సమానార్థకాలుగానే వ్యవహరించేవారు ఈ దేశ విద్యావంతులు. జాతిపరంగా మన దేశంలో నివసించే వారందరూ హిందువులే. మత విశ్వాసాలు, ఆరాధనలు, పారలౌకిక చింతనలు పరంగా ఆయా మతాల పరిగణనలుండేవి. మనకు స్వాతంత్య్రం సిద్ధించేదాకా పాఠశాలల, కళాశాలల వార్షికోత్సవాలలో, బహిరంగ సభా సమావేశాలలో ‘నమో హిందుమాత’ అని తాదాత్మ్యంతో దేశభక్తిగీతం, తక్కిన పాటలతో పాటుపడేవారు. నాకు పది, పదకొండేళ్ళ వయసున అంటే 1947 వరకు ఈ పాట స్వాతంత్రోద్యమ ప్రబోధగీతంగా పరిగణననీయమవుతూనే ఉండేది. ఇపుడు కొన్ని వర్గాల వారు తాము అగ్ర సెక్యులరిస్టులనుకొనేవారూ, మార్క్సిస్టులు ‘హిందూ’ అనగానే ఉలికిపడుతున్నారు.
ఖిలాఫత్ ఉద్యమంతో భారతీయులకేమీ సంబంధం లేకపోయినా మహాత్మాగాంధీ గారి పుణ్యమా అని! జాతి విద్వేష భావాలకీ దేశంలో అంకురారోపణ జరిగింది. అఖిల భారత కాంగ్రెసు వారి తొలి తొలి సమావేశాలదాకా ‘హిందూ’ పదానికి బహిష్కరణ లేకపోగా స్వాగత దీప్తులే ప్రకాశించేవి. నటేశన్ అండ్ కో వారు చెన్నపట్నం నుంచి దేశ నాయకుల చరిత్రలు చిన్న చిన్నవి ప్రకటించేవారు. ఒక పత్రిక కూడా ప్రచురించేవారు. ఆ పత్రిక పేరు ‘ఇండియన్ సోషల్ రిఫార్మర్’. దీనికి తుల్యస్థానీయంగా మన్నవ బుచ్చయ్య పంతులు నడిపిన పత్రిక ‘హిందూ జన సంస్కారిణి’. ఈ పత్రిక కొన్ని సంచికలు శ్రీ వేటూరి శంకర శాస్ర్తీగారు నాకిచ్చారు. స్వామి వివేకానంద చికాగో ప్రసంగం ఈ పత్రికలో ప్రసక్తమైంది. ఈ పత్రిక సుమారు 25 ఏళ్ళు వెలువడింది. బుచ్చయ్య పంతులు తర్వాత ఆయన కుమారుడు సింహాచలం పంతులు కొనే్నళ్ళు నడిపారు.
1857లో ప్రిన్సాఫ్ వేల్స్ (బ్రిటీష్ రాజకుమారుడు) భారతదేశాన్ని సందర్శించాడు. అప్పుడు రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాలలో ఇంగ్లీషు బోధించే వావిలాల వాసుదేవ శాస్ర్తీ వేల్సు రాజకుమారుడి రాకను స్వాగతిస్తూ, సంస్తుతిస్తూ, బ్రిటీష్ ప్రభుత్వాన్ని పొగుడుతూ స్వాగత పద్యాలు రాసిన వీరేశలింగం పంతులు నడుపుతున్న వివేక వర్థిని పత్రికలో ప్రకటించాడు. ఆ పద్యాలలో ఇంగ్లీషువారు హిందూ దేశ ఉద్దారకులుగానే వాసుదేవశస్ర్తీ పేర్కొన్నారు.
స్వదేశీ సంస్థానాధిపతులు, పెద్ద నగరాలలో విద్వన్మండలి ‘వేల్సు యువరాజు’ రాకను హర్షాతిరేకంతో ఆమోదించారు. సన్మానాలు చేశారు. పెద్దనగరాలలో ఆయన సన్మానం కోసం పెద్ద పెద్ద విరాళాలు సేకరించారు. ఈయన కాబోయే బ్రటీష్ చక్రవర్తి అన్నమాట. అందుకే ఈ హంగామా అంతాను. ఈ సందర్భంగా లండన్‌లో రాజ వంశానికి సుగంధ లేపన సామగ్రి అందించే ‘క్రౌన్ ఫెర్మ్యూరీ కంపెనీ’వారు, ప్రిన్సాఫ్ వేల్స్ భారతదేశ సందర్శనం గురించి దేశభాషలలో ఉత్తమ గ్రంథ రచన చేసినవారికి నగదు బహుమానం ప్రకటించారు. ఈ పోటీకి ఎన్ని గ్రంథాలు వచ్చాయో, గ్రంథ ప్రాశస్త్య నిర్ణాయకులెవరో తెలియదు కాని కొక్కొండ వెంకటరత్న శర్మగారి ‘ప్రిన్సాఫ్ వేల్స్ హిందూ దేశ సందర్శన యాత్రకు’ ప్రధమ బహుమానం వచ్చింది. భారతి పత్రికలో నిడుదవోలు వెంకటరావు గారు కొక్కొండ వారి గూర్చి మూడు సంచికలలో రాసిన విపుల రచనలో ఈ వివరాలన్నీ ఉన్నాయి (1933).
సత్తిరాజు సీతారామయ్యగారు నడిపిన పత్రిక పేరు ‘హిందూ సుందరి’. ఇది ఏలూరు నుంచి వచ్చేది.
ఇవన్నీ ఇలా ఉంచుదాం. ఇప్పటికిప్పుడు ‘హిందూస్థాన్ షిప్‌యార్డ్ హిందూస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్, కొమర్రాజువారి ‘హిందూ మహాయుగం’ పేర్లు మార్చేస్తారా? ఏమని మారస్తారు? అన్నిటికన్నా పాపం కమ్యూనిస్టు మహామేధావుల మెడుకు చుట్టుకునే హిందూ మహాసముద్రం పేరు ఏమని మారుస్తారు? ప్రాచీన కాలంలో ‘మహాదధి’ అని దానికి పేరట. సంస్కృతం అంటే వెర్రి చింతులు తొక్కే అభ్యుదయ దిషణాగ్రేసరులు హిందూ సముద్రం పేరు ఏమని మారుస్తారు? వింతలలో వింత ఎన్.రామ్‌గారు తమ పత్రిక పేరు ‘ది నేషన్’ అనో, ‘ది భారత్’ అనో మార్చుకోవచ్చుకదా! ఘంటాకర్ణుడు నారాయణ శబ్దం విననొల్లక చెవులకు గంటలు కట్టుకున్నట్లు ఏచూరి సీతారామ్, బృందాకారత్, ఎన్.రామ్ వర్గీయులు నెత్తి మొత్తుకుంటారేమో!
చిలకమర్తివారి పద్యం ‘హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ’ పద్యాన్ని నిషేధిస్తారా? ఇది వందేమాతరోద్యమకాలం నాటి పద్యం. ఆ తరువాత సంవత్సరం లాలా లజపతిరాయ్ మహాశయుడిని బర్మా మాండలే జైలుకు పంపే ప్రవాస శిక్ష విధించినపుడు చిలకమర్తి కరుణోద్వేగపూరితమైన పద్యాలలో హిందూదేశమనే ప్రసక్తి ఉంది. ఇట్లా 1850 నుంచి దాదాపు 1950 దాకా హిందూ సంస్కృతి, హిందూ దేశం హిందూ ధర్మమని నూరుసార్లైనా చూపగల ఆకరాలు (సోర్సెస్)న్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ వారైనా, బిజెపి వారిపైనా పడి గగ్గోలు పెడుతూ విలపించటం దేనికి?
నిజంగా బిజెపి వారికి తాదాత్మ్య దేశభక్తే ఉన్నట్లయితే ‘నమో హిందూ మాతా, సుజాత, నమో జగన్మాత అమోఘ దివ్య జ్ఞాన సమేత అఖండ వర భరతఖండ మాతా, నమో హిందూమాత’ అనే చైతన్యోద్భోక దేశభక్తి గీతాన్ని పాడుతూ దేశీయ శత్రువులను కవ్వించాలి. ఈ దివ్యగీతం రాసిందెవరో మరుగున పడిపోయింది. ఈ పాట చాలా బాగుంటుంది.
వేదుల సత్యనారాయణ శాస్ర్తీగారి రచన ఏమో అనుకోవటానికి చిరు ఆధారాలున్నాయి. ఆయన సమకాలిక తరం కవి పండితులు, దేశభక్తులు ఇపుడు లేదు కదా?!!


అతి తెలివి (కథ)

$
0
0

గోపాలపురంలో వున్న సత్యం ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. తెలివైనాడు.. చదువులో ముందు ఉండేవాడు. తమ ఊరిలో అయిదవ తరగతి వరకే ఉండడంతో ఊరిలో ఉండే మిగిలిన పిల్లలు సుబ్రహ్మణ్యం, నాగేంద్ర, అచ్యుత్, సుబ్బారావులతో కలిసి ప్రక్క ఊరు అయిన నరేంద్ర పట్నం వెళ్లి చదువుకునేవాడు.
సత్యం ఇంటిప్రక్కనే సుబ్రహ్మణ్యం ఇల్లుకూడా ఉండడం.. ఇద్దరూ బంధువులు కావడంతో.. సత్యం మరింత చనువుగా.. మనసులో మాటను దాచుకోకుండా అరమరికలు లేకుండా ఉండేవాడు.
సుబ్రహ్మణ్యనికే కాస్త భేషజం ఎక్కువ.
తండ్రి ఊరిలో మోతుబరి రైతు కావడంతో, దేనికీ లోటులేకపోవడం.. ప్రక్క ఊరిలో వున్న హైస్కూలికి వెళ్ళడానికి తండ్రి ఓ సైకిలు కూడా కొనివ్వడంతో, అతిశయం తోడై గర్విష్టిగా తయారయ్యాడు.
సత్యం తండ్రికి వున్న కొద్దిపాటి పొలంతో ఆర్థిక లేమితో సతమతమయ్యేవాడు.
పొలం పనులలో తండ్రికి సహాయం చెయ్యడంవలన స్కూల్‌కి కాస్త ఆలస్యంగా బయలుదేరాల్సి వస్తుండేది. అలాంటి సమయంలో సుబ్రహ్మణ్యాన్ని బ్రతిమాలి అతని సైకిలు ఎక్కేవాడు. సత్యాన్ని సైకిలు ఎక్కించుకోవడం సుబ్రహ్మణ్యానికి అంత ఇష్టం లేకపోయినా.. తనని ఎక్కించుకుని తొక్కేవాడు కాబట్టి, వప్పుకునేవాడు.
ఒకసారి..
స్కూల్ నుంచి ఇంటికివచ్చిన సత్యం వాళ్ళమ్మని బ్రతిమాలుతున్నాడు. ‘‘అమ్మా! నా సీమెండి (అల్యూమినియం) టిఫిన్ డబ్బా చిలుంపట్టి బాగా పాడయ్యింది కదా! మా స్కూల్లో అందరూ స్టీలు డబ్బాలు తెచ్చుకుంటున్నారు. నేనూ అలాంటిది కొనుక్కుంటానే. మన ఊరి ‘బాపిరాజు’ కొట్లో ఒక డబ్బా వుంది. పదకొండు రూపాయలు చెబితే, తొమ్మిది రూపాయలకు బేరం ఆడాను. రేపు డబ్బులు తెచ్చి, తీసుకువెళతానని వచ్చాను.. తొమ్మిది రూపాయలు ఇవ్వవే’’ అని.
ఊరిలో వున్న బాపిరాజు కొట్లో దొరకని వస్తువు వుండదు. మందుబిళ్ళలు దగ్గర నుంచి పప్పు, బియ్యం వంటి కిరణా సరుకులతో పాటు స్టీలు వస్తువులూ, చిన్నపిల్లల బట్టలు కూడా దొరుకుతాయి. పల్లెటూరిలో అదోపెద్ద సూపర్ మార్కెట్.
‘‘ఇప్పటికిప్పుడు అంటే, ఎలాగరా? చేతిలో డబ్బులండాలి కదా! మీ నాన్నని అడుగు’’ చెప్పింది తల్లి బంగారమ్మ.
తండ్రి ముందే ఖర్చుని కాదంటాడు. అయినా అడిగాడు. కథ అంతా వినిపించాడు.
‘‘కొబ్బరికాయల తాత రావాలి. తీసుకెళ్లిన కొబ్బరి కాయల లెక్క ఇస్తే అపుడు చూద్దాం!’’ అన్నాడు తండ్రి కొండారెడ్డి.
ఆ కొబ్బరికాయల తాత రెండు మూడు రోజులకు ఓసారి వచ్చి ఊరిలో వాళ్ళ దగ్గిర కొబ్బరికాయలు కొని.. డబ్బులు ఇచ్చి వెళుతుంటాడు. అప్పుడే వాళ్ళ చేతిలో కాసిన్ని డబ్బులు కనిపిస్తాయి.
అప్పటివరకూ ఆగితే, ఆ ‘డబ్బా’ అక్కడ ఉంటుందా! అక్కడ ఒకటే ఉండడం అది తనకు ఎంతగానో నచ్చడంతో బాపిరాజుతో ‘‘రేపే వచ్చి కొనుక్కుంటానని మరెవ్వరికీ.. ఇవ్వద్దని’’ చెప్పి మరీ వచ్చాడు.
‘‘నువ్వు వచ్చే లోపు మరే బేరం తగలకుండా ఉంటే ఉంచుతాను’’ చెప్పాడు బాపిరాజు వ్యాపార ధర్మంగా.
తండ్రి అలా అనడంతో చేసేది లేక మిన్నకుండిపోయాడు.
తల్లి దగ్గర అస్సలు డబ్బులు ఉండక కాదు. ఇల్లు గడవడం కోసం కొద్దో గొప్పో ఉంటాయి. జీవితాన్ని అలా పట్టుకుంటే తప్ప నడవదని ముందు జాగ్రత్త.
ఆ రాత్రి సత్యం అలిగాడు. బంగారమ్మ ‘రెండు రోజులు ఆగు’ సముదాయించింది.
***
రెండు రోజుల తరువాత మధ్యాహ్నం పూట...
స్కూల్ పిల్లలందరూ ఎప్పటిలానే వేపచెట్టు చప్టామీద కూర్చుని కారేజీలు, టిఫిన్ డబ్బాలూ విప్పుకుంటున్నారు. సత్యం తన రంగు వెలసిన డబ్బా మూత తియ్యడానికి ఇబ్బంది పడుతుంటే, సుబ్రహ్మణ్యం తళతళలాడే తన కొత్త డబ్బా తీసి అందరికీ చూపించాడు.
అందరూ ‘చాలా బాగుంది, ఎంత’ అడిగారు.
ఆ మెచ్చుకోలుకి పొంగిపోయి ‘పది రూపాయలు’ చెప్పాడు ఉత్సాహంగా.
సత్యానికి నోట మాట రాలేదు. తను కలలు కంటున్నదానిలానే, నీలం రంగు స్టిక్కరుతో సరిగ్గా అలానే ఉంది. ఆశ్చర్యం నుంచి తేరుకుని ‘ఎక్కడ కొన్నావ్’ అడిగాడు.
‘బాపిరాజు కొట్లోనే’ కాలర్ ఎగరేశాడు.
అక్కడ తప్ప మన ఊరిలో సరుకులెక్కడ దొరుకుతాయి అన్నంత ధీమాగా. తను ఆ వస్తువు కొనాలనుకున్న విషయం సుబ్రహ్మణ్యానికి చెప్పాడు. కానీ రెండు రోజులైనా కొనలేకపోయాడు.
తమ ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకొని సుబ్రహ్మణ్యం అవకాశం తీసుకున్నాడు.
తనదనుకున్న వస్తువు చేజారిపోయింది. తనకన్నా ముందుగా వెళ్లి ‘అదే’ డబ్బాను.. ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి స్వంతం చేసుకున్నాడు.
జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పి బాధపడ్డాడు సత్యం.
స్నేహితుడు అలాంటి పని చేస్తాడని అనుకోలేదు. ఏదైనా ప్రక్కవాళ్ళతో పంచుకోవడం సత్యానికి అలవాటు. అదే మనస్తాపాన్ని తెచ్చిపెట్టింది.
కొడుకు బాధపడడం కొండారెడ్డిని కదిలించింది. బంగారమ్మ కూడా బాధపడింది.
‘‘పోతేపోయిందిలేరా! ఒక అవకాశం పోతే, ఇంకోటి వస్తుంది. మన చేతిలో డబ్బు ఉండాలేగానీ, అంతకన్నా మంచిదే కొనుక్కోవచ్చు. టౌనులో అయితే పెద్ద షాపులుంటాయి. రేపుమన చేలో కాసిన బీరకాయలు, బెండకాయలూ తీసుకుని మార్కెట్టుకి వెళుతున్నాను. వచ్చేటప్పుడు అంతకన్నా మంచిది తెస్తాలే’’ ఓదార్చాడు.
సత్యం ముఖంపై చిరునవ్వు వెలిసింది.
అన్నట్టుగానే ఇంకాస్త బాగున్న రెండు అరలు వున్న స్టీలు డబ్బా కొని కొడుక్కి ఇచ్చాడు. సత్యం చాలా సంతోషపడ్డాడు. తను ఇష్టపడిన దానికన్నా చాలా బాగుంది.
****
అదే పది రూపాయలకి.. సత్యం రెండు అరలు వున్న స్టీలు డబ్బా కొనుక్కోవడం.. మింగుడుపడలేదు సుబ్రహ్మణ్యానికి.
ఆ మరునాడే, తన బాపిరాజు దగ్గరకు వెళ్లి ‘తొమ్మిది రూపాయలు ఇస్తానన్నాడు’.
‘‘లేదు. బేరం అయిపోయింది. మీ సత్యమే అడిగాడు’’ చెప్పాడు బాపిరాజు.
‘‘వాడు రాలేదు కదా!’’
మాట్లాడలేదు బాపిరాజు.
‘‘పది రూపాయలు ఇస్తాను’’ అనడంతో.. తీసి ఇచ్చాడు. ఎంతైనా లాభం.. లాభమే కదా!
తనే భేషజానికి పోయి అతి తెలివిగా ప్రవర్తించాడు. అందుకే తోటి పిల్లలు ఈసారి సత్యం టిఫిన్ డబ్బాని మెచ్చుకుంటుంటే, వౌనంగా ఉండిపోయాడు.

‘రంగుల పండుగ’లో సోయగాల విందు!

$
0
0

శరీరాన్ని ‘కాన్వాసు’గా భావించే తత్వం మానవ సమాజాల్లో అనాదిగా కనిపిస్తోంది. అందుకే అలంకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆదిమ సమాజాల్లో ఇప్పటికీ అనేక రకాలుగా తమ శరీరాలను ‘రంగుల’తో అలంకరించుకోవడాన్ని గమనించవచ్చు. ముఖ్యంగా ‘ముఖం’పై వివిధ రంగులను పూసుకుని, రాసుకుని సామూహిక ఉత్సవాలకు, సమష్టి పండుగలకు హాజరవడం చూడవచ్చు. మహానగరాల్లో ‘బాడీ పెయింటింగ్’ సంస్కృతి కూడా కనిపిస్తున్నది.
ఈ ‘తత్వం’, ‘పచ్చబొట్టు’ పొడిపించుకోవడం నుంచి వచ్చిందని చెప్పుకోవచ్చు. శరీరాన్ని ప్రదర్శనకు అనువైన ‘వేదిక’గా భావించి అనేక ఆకృతులను పచ్చబొట్టుగా పొడిపించుకునే వైనం ప్రపంచమంతటా కనిపిస్తోంది. వర్తమానంలో మెట్రో నగరాల్లో దీనే్న ‘టాటూ’గా నాజూకుగా పిలుచుకుంటున్నారు. ఇందులో అమ్మాయిల, మహిళల సంఖ్య గణనీయంగా ఉండటం గమనించతగ్గ విషయం. ‘నడిచే కాన్వాసులు’గా కనిపించేందుకు కొందరు ఇష్టపడటాన్ని సైతం చూడవచ్చు.
ఈ ‘తత్వాన్ని’ చిత్రకారిణి విమల మారోజు బలంగా పట్టుకున్నారు. పట్టుకోవడమేగాక ఆ తత్వాన్ని పరాకాష్టకు తీసుకెళ్ళారు. చిత్రకళా ప్రపంచంలో ఓ సరికొత్త సృజన కోణాన్ని తనదైన సిగ్నేచర్ శైలిగా ప్రకటించారు. సౌందర్యరాశిని కాన్వాసుపై పరిచారు.
ఆడవారి కళ్లు చేప కళ్ళతో పోలుస్తారు. ప్రబంధ కావ్యాల్లోనూ ఈ ఉపమానం కనిపిస్తోంది. విమల తన ‘కాన్వాసు’ను కావ్యస్థాయికి తీసుకెళ్ళి సరికొత్త రంగుల ప్రబంధ రచన చేశారు. బహుశ సమకాలీన చిత్రకళా ప్రపంచంలో కాన్వాసుపై స్ర్తి శరీరానికి మరింత వనె్న తెచ్చేందుకు ‘మత్స్యకంటి’ని వాడుకున్న దాఖలాలు కనిపించవు. అందమైన ఆడవారి కళ్ళను కమలాలతోనూ పోల్చుతారు. అందానికి ఆకర్షణీయతకు, తాత్వికతకు, పరిపక్వతకు సైతం ఆ పుష్పాన్ని పేర్కొంటారు. స్ర్తిల శరీరాలపై ఆమె వేసిన చేప కళ్లు పుష్పాల్లా శోభిల్లుతాయి. అందుకేనేమో బెంగాల్లో చేపలను జలపుష్పాలని పిలుస్తారు. అందమైన స్ర్తి శరీరం... జల పుష్పాలు ఒకచోట చేరితే రంగుల కావ్యభాష తన్నుకొస్తుంది. విమల ఆ ‘్భష’ను పొదిమి పట్టుకుని పెయింటింగ్స్ వేస్తూ రంగుల బ(వ)సంతమాడుతున్నారు. ఆమె కాన్వాసు నిండా రంగుల పండుగనే దర్శనమిస్తోంది. స్ర్తి సోయగం సరికొత్త కోణంలో ఆవిష్కృతమవుతోంది. జల పుష్ప సౌందర్యం... సోయగం, విమల చూసిన స్ర్తి సౌందర్యం... సోయగం పోటీపడుతున్నట్టుగా ఉంటుంది. ఒక సౌందర్యం రాశినే చూసి ‘తట్టుకో’లేనివారు, జమిలిగా అందాల రాశులను ‘కుప్ప’పోస్తే రసజ్ఞుల గుండె గుల్లవుతుంది. ఆ ‘చర్య’నే చిత్రకారిణి ఆశించి బొమ్మలు గీశారు. తనదైన గొప్ప శైలిని లోకానికి చాటారు. ఆ రకంగా ఆమె తన రంగంలో అగ్రస్థానంలో నిలిచారు.
ఈ వినూత్న శైలీ విన్యాసానికి తెరలేపిన విమల మారోజు 1976లో పూర్వపు నల్లగొండ జిల్లా, దామరచర్ల మండలం అడవిదేవులపల్లిలో జన్మించారు. ప్రాథమిక విద్య అక్కడే జరిగింది. తండ్రి భాస్కరాచారి స్వర్ణకారుడు. సరికొత్త డిజైన్లలో నగలు తయారుచేయడంలో పేరొందాడు. గోటి (నఖ)తో చిత్రాలు గీసేవాడు. ఆ వాతావరణంలో పుట్టిపెరిగిన విమల పాఠశాల విద్య చదువుతున్నప్పుడే బొమ్మలు చూసి, గీసే అలవాటు చేసుకున్నారు. అదొక సబ్జెక్టుగా భావించి తనకు తోచిన రీతిలో గీయడం అలవర్చుకున్నారు.
మిర్యాలగూడలో ఇంటర్ విద్య చదువుతున్నప్పుడు హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ‘బొమ్మల చదువు’ బిఎఫ్‌ఏ కోర్సు ఉందని తెలుసుకుని హైదరాబాద్‌కు వచ్చి 1999లో ఎంట్రెన్స్ రాసి చేరిపోయారు.
వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ చదువుకోవడం ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. తన చిత్ర రచన కోర్సుకు అవసరమైన సబ్జెక్టు తన కళ్ళముందుకొచ్చినట్టనిపించింది. మెట్రోనగర మహిళల అభిరుచి, అలంకరణ, ఆసక్తి, ‘టాటూ’ (పచ్చబొట్టు)వేసుకోవడం, కదిలే కాన్వాసుగా దర్శనమవడంతో తనలోని సృజనాత్మకత మేల్కొన్నది. కళాత్మకత పొంగుకొచ్చింది. కాగితంపై తోటి వారిని చిత్రించడం ప్రారంభమైంది. తొలుత తన స్కెచ్‌లకు మోడల్స్‌గా వారే నిలిచారు. ఆ అభ్యాసం, సాధన ఊహించని రీతిలో తనదైన ‘శైలి’కి బీజం వేసింది. బిఎఫ్‌ఏలో ప్రాథమిక అంశాల పునాది పడ్డాక 2002 సంవత్సరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎఫ్‌ఏ కోర్సులో చేరాక స్వతంత్య్ర భావాలను ప్రొఫెసర్లు ప్రోత్సహించడం, ఏ సబ్జెక్టుపై సంపూర్ణ విశ్వాసమున్నదో ఆ సబ్జెక్టు లోతుల్లోకి వెళ్ళమని ప్రోత్సహించడంతో అప్పటికే వందలాది స్ర్తిల బొమ్మలు వేయడంతో ఆ సబ్జెక్టుపైనే మరింత లోతైన సారాంశాన్ని పట్టుకోవాలన్న పట్టుదలతో స్ర్తి శరీరానే్న కాన్వాసుగా భావించి నిజమైన కాన్వాసుపై ఆ కాన్వాసును తెచ్చి అనేక ఆకృతులను అద్దడం ప్రారంభించానని ఆమె గుర్తుచేసుకున్నారు.
తొలుత స్ర్తి శరీరాన్ని, ఆ శరీరంపై కొన్ని ‘ప్యాట్రెన్స్’వేయడంతో తన ప్రస్థానం ప్రారంభమైందని, అలాగే స్వర్ణ్భారాలను సైతం జోడించానని, కొన్నిసార్లు తల జుట్టులేకుండా తలపై కూడా వివిధ ఆకృతులను చిత్రించేందుకు కాన్వాసుగా వాడుకున్నానని, స్ర్తి శరీరం సిల్వర్ రంగులో ఉండటం, మిగతా ప్యాట్రెన్స్, నేపధ్యం వివిధ రంగుల తోరణంగా ఉండటంతో ఆ ఫ్రేమ్ ఎంతో ఆకర్షణీయంగా ఉబికి వచ్చిందని ఆమె చెప్పారు. మెహందీ వేసుకుంటే కనిపించే ఆకృతులను రంగుల్లో చేతులకు వేసి సరికొత్త సొగసును ఆమె పరిచయం చేశారు. ఆమధ్య విడుదలైన ఓ భారీ బడ్జెట్ తెలుగు సినిమాలోని పచ్చబొట్టు... పాటను జ్ఞాపకం చేసే రీతిలో రెండుచేతులు కలిసినప్పుడు ఒకే ప్యాట్రెన్ కనిపించే ప్రయోగం అబ్బురపరుస్తుంది. నేపధ్యంలో అందమైన రంగుల చుక్కలు, జరీ అంచు చీరలోని మోటిఫ్ ఆరేసినట్టు చూపడం ఓ గొప్ప ‘విజువల్ ట్రీట్’గాక ఏమవుతుంది?
మరికొన్ని బొమ్మల్లో మహిళల నగల అలంకరణ ప్రియత్వాన్ని తనదైన శైలిలో చూపారు. ఈ బొమ్మల్లో జల పుష్పాలతోపాటు స్వర్ణ్భారణాలు, వాటి ప్యాట్రెన్స్ దర్శనమిస్తాయి. నగల డిజైన్లలో తనకున్న ఆసక్తి ఆ విధంగా బహిర్గతమవుతోంది.
మెక్సికో చిత్రకారిణి, స్ర్తివాద విప్లవకారిణి ప్రిదకార్లో చిత్రాలంటే తనకెంతో ఇష్టమని, ఆమె ప్రభావం తనపై ఉందని, మరో చిత్రకారుడు క్లింట్ వేసే ‘స్ట్రోక్’, టెక్చర్, టెక్స్‌టైల్ డిజైన్ తనకెంతో నచ్చుతుందని విమల అంటున్నారు.
దశాబ్దం క్రితమే కొత్త ఢిల్లీలోని ఎలిమెంటరీ గ్యాలరీలో ప్రముఖ చిత్రకారులు తోట వైకుంఠం, ఏలె లక్ష్మణ్, బైరు రఘురామ్ తదితరుల చిత్రాలతోపాటు విమల చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. హైదరాబాద్‌లోని ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో తన తొలి ‘సోలో షో’ను నిర్వహించారు. అనేక నగరాల్లో గ్రూపు షోలలోనూ ఆమె తన చిత్రాలను ప్రదర్శించారు... ప్రశంసలందుకున్నారు.
ఈ ప్రస్థానంలో పొందిన పరిణతితో తనదైన శైలితో, సమ్మోహనపరిచే తరహాలో మరిన్ని జల పుష్పాలతో, పుష్పాల్లాంటి సుకుమార స్ర్తి శరీరాకృతులతో వచ్చే మహిళా దినోత్సవంనాడు హైదరాబాద్‌లో భారీ సందడి చేయబోతున్నానని ఆమె భరోసా ఇస్తున్నారు.
-విమల మారోజు 74165 28362

స్వదేశీ ఉగ్రం

$
0
0

బందోబస్త్ ** ఫర్వాలేదు

తారాగణం: సూర్య, మోహన్‌లాల్, సాయేషా సెహగల్, బొమన్ ఇరానీ, ఆర్య, చిరాగ్‌జాని, సముద్రఖని, పూర్ణ తదితరులు
సంగీతం: హారిస్ జయరాజ్
కెమెరా: ఎంఎస్ ప్రభు
నిర్మాత: సుబాస్కరన్
దర్శకత్వం: కెవి ఆనంద్
=================================================================
‘లోకాన దొంగలు వేరే లేరయా.. దూరాన ఎక్కడినుంచో రారయా..’ అనే ఓ పాత తెలుగు పాట గతంలో విన్నదే. ఈ చిత్రం చూస్తుంటే ఈ పాటే గుర్తొస్తుంది. ఉగ్రవాదులు ఎక్కడో పాకిస్తాన్ నుండి సరిహద్దుల మీదుగా దాటి భారతదేశం వచ్చి ఉగ్రదాడులు చేస్తున్నారన్న అనేక వార్తలు చూస్తూనే వుంటాం. అయితే అన్ని దాడులు పక్కదేశాలనుండి వచ్చిన ఉగ్రవాదులు చేస్తున్నవి కాదని, భారతదేశంలో కూడా కంటికి కనిపించని ఉగ్రవాదులు సృష్టించే మారణహోమం కూడా పక్క దేశాల ఖాతాలోనే పడిపోతోందని, తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని ఈ చిత్రం చర్చించే ప్రయత్నం చేసింది. కాకపోతే ఫ్లైఓవర్లు ఎక్కువైపోయి కథ నేలమీదకు రాకుండా పుట్టిలోనే కలిసిపోయింది.
కథ
సామాన్య రైతుగా పరిచయమైన రవికిషోర్ (సూర్య), ఆ తరువాత ప్రధానమంత్రి ప్రధాన అంగరక్షకుడిగా మారతాడు. ప్రధాని చంద్రకాంత్ వర్మ (మోహన్‌లాల్) రక్షణ కోసం తన శాయశక్తులూ ఉపయోగించి ఉగ్రవాదుల పన్నాగాలను నాశనం చేస్తుంటాడు. స్వదేశంలోవున్న ఓ పెద్ద వ్యాపారవేత్త మహదేవ్ (బొమన్ ఇరానీ) ప్రధానికి అత్యంత ఆప్తుడు. అతనికి లేని వ్యాపారాలు లేవు. పక్క దేశాలనుండి భారతదేశ ప్రధాని చంద్రకాంత్ వర్మని హతమార్చడానికి అనేక ప్రయత్నాలు జరుగుతూనే వుంటాయి. ఈ నేపథ్యంలో కాశ్మీర్ నేపథ్యంలో జరిగిన ఓ సభలో ట్రక్ బాంబ్ పేలి ప్రధాని చనిపోతాడు. అక్కడేవున్న రవికిషోర్ ఉగ్రవాదుల పన్నాగాలను పసిగట్టలేకపోవడంతో ఈ ఘోరం జరిగిపోతుంది. ఈ హత్య వెనుకవున్న నిజమైన శక్తులను పట్టుకోవడానికి కథానాయకుడు ఏం చేశాడనేదే మిగతా కథ.
విరివిగా పొలాలపై రసాయన ఎరువులు చల్లడంతో నేల తల్లి గొడ్రాలైపోతుందని, దానికి ప్రకృతి వ్యవసాయమే పరిష్కారమని చెప్పే కథానాయకుడు, ఆ తరువాత ఒక్కసారిగా రూపురేఖలు మారి ప్రధాని వద్ద కనిపిస్తాడు. విదేశీ మిలట్రీ వద్దనున్న రసాయనిక ఆయుధాలను తుపాన్ సమయంలో వెళ్లి నాశనం చేయడం, ప్రధాని లండన్ వెళ్లినపుడు హత్య చేయడానికి ప్రయత్నాల సన్నివేశాలు ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తాయి. స్లీపర్ సెల్‌లా వ్యవహరించే కథానాయకుడు ఆ తరువాత అదంతా శత్రుమూకలను నాశనం చేయడానికేనని చెప్పడంతో రివర్స్ గేర్‌లా మారింది. కెమికల్ వెపన్స్ తుపాను సమయంలో నాశనం చేస్తే వాటి ప్రభావం వుండదంటూ ఓ సిద్ధాంతాన్ని దర్శకుడు చెప్పడం ప్రేక్షకుడిని సరిగా ప్రిపేర్ చేయకపోవడంతో అర్థంకాదు. సర్జికల్ స్ట్రైక్‌లాంటి అంశాలను కూడా తీసుకుని ఉగ్రమూకలమీద మిలటరీ అటాక్స్ చేయడం కూడా ప్రస్తుత ట్రెండ్‌కు తగినదే. ప్రధాని హత్యకు జరిగిన కుట్రను పరిశోధన చేస్తూ మిడతలదండులాంటి ఉపకథలు కూడా ఈ చిత్రంలో కథానాయకుడు పరిష్కరించాల్సి వస్తుంది. ఇలా అనేక విషయాలను చెప్పాలనుకున్నారు కానీ ఏ విషయాన్నీ పూర్తిగా చెప్పలేకపోయారు. బయోవార్, ఎంటమాలజీ వార్ లాంటివి తీసుకొని సిల్లీ ఫెరా అనే మిడతల దండు దండయాత్రల నేపథ్యంలో చిత్రాన్ని లాగించే ప్రయత్నం చేసినా అవి
ప్రేక్షకుడిని ఆకట్టుకోవు. వ్యాపారాలు చేసే కోటీశ్వరులుబ్యాంకులనుండి అప్పులు చేసి పారిపోతే, రైతు అప్పులు చేసి పారిపోరని చెప్పడం బావుంది. యురేనియం తవ్వకాలవలె ధోరియం త్రవ్వకాలను ఈ చిత్రంలో చర్చించారు. దీనివెనుక వ్యాపారవేత్త మహదేవ్ హస్తం వుందని చెప్పడంతో అసలైన విలన్ అతడేనని అర్థమైపోతుంది. ఆ పాత్రను పూర్తి నిడివిలో చెప్పకపోవడంతో ప్రేక్షకుడి దృష్టి పడదు. ఎంతసేపటికి ఉగ్రవాదులు అని చెబుతూ వెళ్ళారు. ప్రధాని హత్య తరువాత ఆయన కొడుకు అభి (ఆర్య)ను ప్రధానమంత్రిని చేస్తారు. ఆ పాత్రను కూడా సరిగా తీర్చిదిద్దలేదు. చిన్నపిల్లాడి చేష్టలతో ఆ పాత్ర తేలిపోయింది. ధోరియం తవ్వద్దంటూ ధర్నాలు చేసే రైతులపై కాల్పులు జరపడం, అందులో కొందరు దొంగ రైతులు పోలీసులపై బాంబులు వేయడం లాంటి సన్నివేశాలు గతంలో చూసినవే. చిట్టచివరికి స్వదేశంలో వున్న ఉగ్రవాది వ్యాపారవేత్త మహదేవేనని చెప్పడానికి ఎంత ప్రయత్నించినా మొదట చెప్పిన విదేశీ ఉగ్రవాదుల ముద్రే ప్రేక్షకుడి మనోఫలకంపై ఉంటుంది. కె.వి.ఆనంద్ గతంలో చేసిన చిత్రాలలో ఓ వైవిధ్యమైన శైలి, కథలో కొత్తదనం వుంటుంది. కానీ ఈ చిత్రంలో ఏదీ కనపడదు. డబ్బింగ్ సినిమా అవ్వడంతో అక్కడక్కడ తెలుగు హోర్డింగులు పెట్టినా ఎల్లమ్మ, పుల్లమ్మ చెరుకు ముక్కలాంటి సింగారి పాటల్లో పూర్తి తమిళ వాసన కనిపిస్తుంది. ఎన్నో తారాల సంగమం అంబరమొక్కటే అన్నపాట ఆకట్టుకుంటుంది. శాంటియాగో బర్త్‌డే పార్టీ పాటలో బాణీ, వేసిన స్టెప్పులు సరికొత్తగా వుంటాయి. సూర్య గతంలో చేసిన అనేక చిత్రాల స్థాయిలోనే ఈ చిత్రాన్ని తన స్టామినాతో నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ కథ, కథనాలు తేలిపోవడంతో అతని కృషి వృధా అయింది. మోహన్‌లాల్ పాత్రకు ఎటువంటి ప్రాధాన్యత లేదు. సాయేషా సెహగల్ హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉంది అన్నట్టు వుంది. సినిమా మొత్తాన్ని సూర్య, సముద్రఖని మోసేశారు. కెమెరా పనితనం ఫర్వాలేదు.

ఆగం జేసిండు!

$
0
0

గద్దలకొండ గణేష్ ** ఫర్వాలేదు

తారాగణం: వరుణ్‌తేజ్, పూజాహెగ్దె, అధర్వ మురళి, మృణాళిని, రవి, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, రఘుబాబు, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, రచ్చరవి, ఫిష్ వెంకట్, రాజారవీంద్ర, డింపుల్ హయత్, అన్నపూర్ణ, సుప్రియాపాఠక్, నాగినీడు, అశోక్‌కుమార్, గౌతంరాజు
సంగీతం: మిక్కీ జె మేయర్
కెమేరా: అయినాంకా బోస్
కూర్పు: ఛోటా కె ప్రసాద్
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట
దర్శకత్వం: హరీష్ శంకర్
===============================================================
ప్రతి నాయకుడిని ప్రధాన పాత్రగా తీసుకునో లేదా విలనే్న హీరోగా ప్రొజెక్ట్ చేసి చిత్రం తీయడమనే ప్రక్రియ సీనియర్ ఎన్టీఆర్ కాలం నుంచి ఇప్పటివరకూ అడపాదడపా తెలుగు తెరపై దర్శనమిస్తోన్న సంగతి తెలిసిందే. మరి గద్దలకొండ గణేష్ ప్రత్యేకతేమిటంటే ఇప్పటివరకూ నాయక పాత్రల్ని, అందులోనూ ఓ తరహా నాజూకు పాత్రల్ని నాణ్యమైన తీరులో పోషించిన వరుణ్ తేజ్‌ను పక్కా ఫ్యాక్షనిస్టుగా చూపడానికి ప్రయత్నించడం. ఆ ప్రయత్నం అటూ ఇటూ అవుతుందేమోనన్న చిన్నపాటి భావనతో మూల చిత్రం తమిళ జిగర్తాండలో లేని లవ్‌ట్రాక్‌ను వరుణ్‌తేజ్‌కు కల్పించడం జరిగింది. దానికితోడు మోటుగావున్నా కామెడీ కోటింగ్‌ను హరీష్‌శంకర్ స్టైల్లో ఇచ్చారు. ఇన్నిచేసినా మూడు గంటల నిడివి సినిమాలో కొన్నిచోట్ల స్పష్టంగా సాగిన అసంగతాలూ, సెకండాఫ్‌లోని స్లాగ్‌నెస్.. చిత్రం ఫర్వాలేదన్న స్థాయికి మించనివ్వలేదు.
షాట్ గ్యాప్‌లో షార్ట్ ఫిల్మ్ తీస్తూ దర్శకుడి కోపానికి బలైన అభిలాష్ (అధర్వ మురళి), అనంతరం తనకొచ్చిన పెద్దతెర చిత్ర దర్శక అవకాశాన్ని వైవిధ్యవంతంగా మలచాలనుకుంటాడు. ఓ గ్యాంగ్‌స్టర్ జీవిత కథను తెరకెక్కించే ప్రయత్నంలో గద్దలకొండ వస్తాడు. అక్కడ తారసపడిన గ్యాంగ్‌స్టర్ గణేష్ బయోపిక్ తీద్దామని ఫిక్సవుతాడు. అలా ఆత్మకథ మలచడంలో అతనెదుర్కొన్న చిక్కులు, గణేష్ అంతరంగం సంగతులూ, అతను మారిన విధానంతో చిత్రం సుదీర్ఘపయనం సాగిస్తుంది. కానీ చూపే పోకడలో కనిపించిన అపసవ్యాల్ని డైరెక్టర్ ఖాతరు చేయలేదు.
ఓ బజారులో నడిరోడ్డుపై ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని చంపేస్తే, అది చూసిన తల్లి మూగదన్న కారణంగా సాక్ష్యం చెప్పలేనంత మాత్రాన గణేష్ తప్పించుకోడమన్నది న్యాయవ్యవస్థ పనితీరుపై ఏమాత్రం అవగాహన లేకుండా తీసినదనిపించింది. పోనీ తాను తప్పించుకోడానికి గణేష్, తన తల్లిని మూగదని చెప్పినా ఆమెతోపాటు ఆ సంఘటన చూసిన వాళ్లనేకులున్నారు. వాళ్లను తప్పనిసరిగా కోర్టులో ఎవిడెన్సులుగా ప్రొడ్యూస్ చెయ్యొచ్చు. ఇలాంటి వాటిపై హరీష్ శంకర్ ఫోకస్సే చెయ్యలేదు.
అలాగే చిత్ర ఆరంభంలో సినిమా అన్నది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ తప్ప, మెసేజిలివ్వడానికి కాదు. ఆటెన్‌బరో గాంధీ చూసి ఎంతమంది గాంధీలుగా మారారు? ‘్భరతీయుడు’, ‘్ఠగూర్’ చిత్రాలు చూసినా ఎంతమంది లంచం తీసుకోడం మానేశారు? అని అభిలాష్‌తో చెప్పిస్తారు. తిరిగి పతాక సన్నివేశం వచ్చేటప్పటికి కరకు రాతి గణేష్, సినిమా చూసి తనపై ఆత్మీయతను కురిపించిన తుపాకీ రాజు కూతురు, ఎంతోకాలం మాటవున్నా మూగగా బ్రతికిన అతని తల్లి (సుప్రియాపాఠక్) మాట్లాడటం చూసి మారిపోయిన సంగతినీ చూపారు. ఇవి పరస్పర విరుద్ధ్భావనలు. వాస్తవానికి సినిమాలోనే మరోచోట చెప్పినట్టు సినిమా మాధ్యమం ప్రభావం సమాజంపై అపారం. కాలాలుమారి సినిమా రూపంమారినా దృశ్యమాధ్యమం విలువ ఎప్పటికీ ఉంటుంది. అందుకే ఎవరు ఏయే మాధ్యమాల్లో ఉన్నా అత్యధిక శాతం దృశ్య మాధ్యమంవైపే మొగ్గుచూపేది. ఒకసారి రౌడీషీట్ తెరిచిన తర్వాత అతను జైలునుంచి వచ్చేసినా, వారి కదలికలపై ఎప్పుడూ పోలీసుల నిఘా ఉంటుంది. వారి సరళిపై నియమిత కాలంలో రిపోర్టులు పై అధికారులకీ పంపాల్సి ఉంటుంది. ఇన్ని బంధనాల్లో ఉండే గణేష్‌లాంటి రౌడీషీటర్, ఈ చిత్రంలో సాగిన ‘హవా’లాంటిది సాధ్యపడదు. అది 1982లోనైనా, మరెప్పుడైనా. ఇక సినిమాలో ప్రతీ చిన్న పాయింట్‌కీ సుదీర్ఘ వివరణ సన్నివేశాలు చిత్రంపై ఆసక్తి సన్నగిల్లేలా చేశాయి. గణేష్ గ్రూపులోవున్న బలి (ప్రభాస్ శ్రీను)నుంచి వివరాలు రాబట్టడానికి అతనికుండే అసభ్య చిత్రాల వీక్షణ తదితరాలూ లాంటివి ఇందుకుదాహరణగా చెప్పచ్చు. సినిమా యాక్టింగ్ ట్రైనింగ్ పేరిట మునిమాణిక్యం.. (బ్రహ్మాజీ)తో నడిపించిన సన్నివేశాలూ కుదిస్తే బావుండేది. అంతకుబదులుగా అంతటి ఠఫ్ నేచర్డ్ గణేష్, సినిమా ప్రపోజల్‌కు వెంటనే పడిపోయినట్లుగాకాక కొంత ప్రాతిపదికతో కూడిన సన్నివేశాలకు అవకాశం కల్గిస్తే బావుండేది. ఇలా చూపకపోవడంవల్ల సినిమాకు ప్రాణమైన ఎమోషన్స్ కొన్ని మిస్సయ్యాయి. గతం వర్తమాన సన్నివేశాలు చూపడంలోనూ కొంత గందరగోళమేర్పడింది. దానిపై క్లారిటీ ఇస్తే బావుండేది. వరుణ్‌తేజ్ విశ్వరూపానికీ చిత్రం రూటేసింది అని చెప్పచ్చు. వీలైనంతవరకూ పాత్రకు న్యాయం చెయ్యడానికి ఆయన ప్రయత్నించారు. అయితే గణేష్ పాత్రలో పలికిన తెలంగాణ యాస కొన్నిచోట్ల కృతకంగా ఉంది. దానిపై ఇంకాస్త సాధన చెయ్యాల్సిన అవసరం కన్పడింది. ఒకచోట ‘మోకా’ (అవకాశం) అన్న పదాన్ని ‘మేకా’ అని పల్కారు. కొన్నిచోట్ల యాసనే వదిలేశారు. చాన్నాళ్ల తర్వాత తల్లి గొంతు విన్న సందర్భంలో వరుణ్ చూపిన భావోద్వేగం సీను బాగా పండింది. 1982లో వచ్చిన ‘దేవత’ చిత్రంలో ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’... పాటకు శోభన్‌లా వరుణ్ అభినయించిన తీరు బావున్నా, అందులో నటుడు చిరంజీవి తాలూకు ముఖ కవళికలు ఎక్కువ కనిపించాయి. అది అతని తప్పుకాదు. ఇన్‌బిల్ట్‌గా వరుణ్‌లోని జీన్స్ సహజ లక్షణాలు. ఈ పాటలోనే కాకుండా, చాలాచోట్ల ఎయిటీ, నైంటీస్‌లోని చిరంజీవి వేరియేషన్స్ చాలా వరుణ్‌లో ఇందులో కన్పడ్డాయి. ఇదే పాటలో పూజాహెగ్డే దాదాపు శ్రీదేవి స్థాయిలోనే నటించింది. పూజ పాత్ర పరిధి తక్కువైనా ఉన్నంతలో ఉనికి చూపింది. అభిగా అధర్వ బాగా నటించినా, అతనికిచ్చిన డబ్బింగ్ వాయిస్ సరిగా మ్యాచ్‌కాలేదు. బుజ్జమ్మగా మృణాళినీ రవి ముద్దుగా నటించింది. చింతపండు మల్లికార్జున్‌గా సత్యకీచిత్రం పెద్ద బ్రేకు. ‘నువ్వే సెకండ్ హీరో’ అన్నప్పుడు అతను చూపిన ఎక్స్‌ప్రెషన్స్ ఆకట్టుకున్నాయి. ప్రభాస్‌శ్రీను, రచ్చరవి, ఫిష్ వెంకట్ తదితర కామెడీ బ్యాచ్‌లో తుపాకీరాజు పాత్రధారి నటనకు బాగా రెస్పాన్స్ వచ్చింది. కానీ అతను నటుడు వేణుమాధవ్‌ని అనుకరించడం మానేయాలి. ‘జరాజరా’ పాటలో శక్తివంచన లేకుండా డింపుల్ హయత్ స్కిన్‌షో చేసినా, ఆ పాట కొరియోగ్రఫీ బావుంది. పాట ట్యూన్ కూడా బావుంది. పాటలోని మాటల్లో గణేష్ పాత్రధారినుద్దేశించి, ‘సూపర్‌హిట్టూ నీ హైటూ’, సూపర్‌హిట్టూ మీసంకట్టూ, బొమ్మే హిట్టూ’ అన్నవి బావున్నాయి. అలాగే ఇంకోచోట ‘గుడుగుడు గుంచం చుట్టూ గలాటలోనే మంచిచెడ్డా మూలకు నెట్టేయి’ అన్న పదప్రయోగం తమాషాగా వుంది. అనురాగ్ కులకర్ణి, ఉమానేహా పాట పాడిన విధానమూ బావుంది. గగనవీధిలో ఘననిశీధిలో పాటనుకూడా మిక్కీజెమేయర్ బాగా కంపోజ్ చేశారు. సినిమాలో ఓ పాటలో ‘నీ దమ్మే నీకున్నా బందోబస్త్’ అన్న మాట ఒకటుంది. అది సరిగ్గా ఈ చిత్ర మాటలు-మార్పులు- దర్శకత్వ విభాగాలకు కర్త అయిన హరీష్ శంకర్‌కు వర్తిస్తుంది. రీమేక్‌లోనూ అనుకూల మార్పులు (అనుకోకుండా ఆఖరిక్షణంలో చిత్రం పేరులో మార్పులూ వచ్చాయి) చేసే తన పంధాలో తాను ఈ చిత్రాన్ని మలిచారు. హరీష్ గత చిత్రం ‘గబ్బర్‌సింగ్’లో అంత్యాక్షరి పెడితే ఇందులో చిత్రలహరి పేరిట పాత పాటల్ని వినే అవకాశం కల్పించారు. అదేవిధంగా మాటల్లో తనదైన శైలినీ కనపర్చారు. దాపూద్ ఇబ్రహీం దగ్గరుంచి దారిన పొయ్యే దానయ్య వరకూ అందర్నీ ఈయన టచ్ చేసేశారు. సినిమామీదున్న ధ్యాస ఎలాగైతే పోదో వివరిస్తూ ‘ఎంచుకున్న పనినుంచి వేరే పనిలోకి వెళితే కాంప్రమైజ్, అందులోనే వుండిచేస్తే ఎడ్జస్ట్‌మెంట్’ అంటూ తనికెళ్ల భరణి పాత్రచేత పలికించిన మాటలూ గుండెను హత్తుకున్నాయి. ‘బతికున్నంత కాలం మనమంటే భయపడినవాళ్లు, మన చావుని కోరుకుంటారు తప్ప మనం బతకాలని కోరుకోరు’ అన్న వాక్యమూ అర్ధవంతంగా ఉంది. అయితే ప్రభాస్‌శ్రీను పాత్ర ద్వారా ‘ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్’ అంటూ కాల్‌గరల్స్ ఎదుట చెప్పించిన డైలాగ్, ప్రభాకర్ పాత్ర చేసే శృంగార సన్నివేశంలో అక్కడున్న స్ర్తిపాత్ర ద్వారా ‘పీక్‌లో వెళ్లిపోతావేమిటి?’ అన్న మాటలూ తొలగించినా చిత్రానికొచ్చిన నష్టమేం లేదు. ‘ఎక్కువ ఆగం చేసేవాడు, ఏనాడో ఒకనాడు ఆగమైపోతాడు’ అన్న డైలాగూ బాగా పేలింది. అయినాంకా బోస్ కెమెరా ఆర్టిస్టులను బాగా ప్రెజంట్ చేసింది. ప్రత్యేకించి వరుణ్‌తేజ్ పాత్ర ఎలివేట్ అవడానికి బోస్ కెమెరా బాగా సహకరించింది. అన్నట్లు చిత్రం మొత్తంలో దాదాపు ప్రతి ఫ్రేములోనూ ‘మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అన్న టైటిల్‌కార్డు కొనసాగింది. దాంతోపాటు ఒకచోట ‘ర్యాగింగ్ ఈజ్ పనిష్‌బుల్ అఫెన్స్’ అన్న క్యాప్షనూ కన్పడింది. ఏతావాతా పరిశీలిస్తే ఛోటా కె ప్రసాద్ (ఎడిటర్) కత్తెరకు ఓ ముప్ఫై నిమిషాలు పనిపెట్టి ఉంటే సినిమా ఇంకా పకడ్బందీగా ఉండేది. చిత్రం విడుదలకు ముందస్తు చేసే ప్రచారంలో భాగంగా చిత్ర నాయకుడు వరుణ్‌తేజ్ చెప్తూ సినిమాలో చూపే అంశం బావుంటే పెద్దవ్యవధి సినిమాలైనా ప్రేక్షకులు ఓకే అంటారన్నారు. అయితే చూపే కంటెంట్ ఎంతబావున్నా దాని సారం డైల్యూట్ అవకుండా ఉండాలంటే బ్రిలిటీ (క్లుప్తత) ఎంతో అవసరం. ఇది గ్రహిస్తే బావుంటుంది.

నా పాత్రలకు మరణం లేదు

$
0
0

భౌతికంగా నేను లేకున్నా నా పాత్రలకు మరణం రాదు. జీవితానికి ఇంతకన్నా ఏంకావాలి? సర్వమత సమ్మేళనమన్నట్టు నా చిత్రాలు అన్ని మతాలవారికీ చేరాయన్న యాది నన్ను సదా ఆనందంగా ఉంచుతుంది

అనుకున్నామని జరగవు అన్నీ
అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికనీ
అనుకోవడమే మనిషి పని
-అన్నాడు ఆచార్య ఆత్రేయ.
**
మనిషిని మనసుని కాచి వడపోసినవాడు ఆత్రేయ. అందుకే -ఆయన చెప్పిన జీవిత సత్యాలు లైఫ్‌లో మనకు ఎదురవ్వకపోయినా.. అయినట్టే భ్రమిస్తాం. లేదూ జరిగిన సంఘటనకు అన్వయించుకుంటాం. అదీ ఆత్రేయ అక్షరాల్లోని బలం.
జరిగిందో.. జరిగినట్టుగా అన్వయించుకోవాలో తెలీదుగాని -విజయ్‌చందర్‌కీ ఆత్రేయ అక్షరాల్లోని భావుకత సెగ తగిలింది. అదెలాగంటే -విజయ్‌చందర్ ‘కౌబాయ్’గా వెలుగుతున్న రోజులవి. ఠక్కున -కరుణామయుడయ్యాడు. అప్పటికి ఆర్థికపరంగా నిలదొక్కుకున్న పరిస్థితి లేదు. లైఫ్ ఇంకా ట్రయల్స్‌లోనే ఉంది. కాని -అప్పటికి సంపాదించిన అనుభవంతో సంకల్పం బలపడింది. అంతే -నటీనటులు సహకరించారు. సాంకేతిక నిపుణులు కలిసొచ్చారు. నాలుగున్నరేళ్లు కష్టపడ్డారు. కట్‌చేస్తే -కరుణామయుడు ఆవిష్కృతమయ్యాడు. చిత్రమేంటంటే -సినిమా మొత్తం జెరూసలెంలో జరుగుతున్న భ్రమలోనే ఆడియన్స్ ఉన్నారు. అది -‘సినిమాటోగ్రాఫర్ కెఎస్ ప్రసాద్ పనితనం’ అంటూ అప్పటి జ్ఞాపకాన్ని పొదివిపట్టారు విజయ్‌చందర్. ఏసును శిలువవేసే సందర్భంలో -కాళ్లకు, చేతులకు మేకులు కొట్టే సన్నివేశం గురించి అడిగినపుడు.. ‘అదంతా మేకప్‌మెన్ సత్యం గొప్పతనం’ అంటారాయన.
‘సమకూర్చుకున్న ఆర్థిక వనరులతో ఏరోజుకారోజు యుద్ధం చేస్తున్నాం. ఆరోజు -బాగానే డబ్బు సమకూరింది. దాంతో నాలుగు సన్నివేశాలన్నా తీసేయాలన్నది నా ఆలోచన. కెమెరామెన్‌కు చెప్పాను. యూనిట్ రెడీ అయిపోయింది. నేనొకటి తలిస్తే.. నేచరింకోటి తలచింది. ఆకాశం మేఘావృతమైంది. లైట్ ఫెయిలైంది కనుక -షూటింగ్ కష్టమన్నాడు కెమెరామెన్ ప్రసాద్. అప్పుడే -పక్కలో కాదు, గుండెల్లో బల్లెం దిగినట్టు అనిపించింది. షూటింగ్ పెట్టకపోతే చాలా నష్టపోతానని ఏదోకవిధంగా చేద్దామని అభ్యర్థించాను. ససేమిరా అన్నాడు ప్రసాద్. ఒకవిధంగా గొడవాడుకుంటున్నట్టే ఉంది మామధ్య సంభాషణ. చివరికి నా పట్టుదల, దీనస్థితి చూసి -క్లైమేట్‌కు అనుగుణంగా భూమి కనిపించే షాట్స్ తీస్తానన్నాడు. అతనామాట అనగానే నా బుర్ర పాదరసంలా పనిచేసింది. ఏసుకు శిలువవేసే టైంలో కెమెరా భూమినే చూపించాలి కనుక, ఆ షాట్ తీసేద్దామని ఓ నిర్ణయానికి వచ్చాం. ఏసు శిలువ మోసుకెళ్లే సీను. ప్రక్కనున్న యోధులు నన్ను కొట్టాలి. వాళ్లేమో జంకుతున్నారు. ఓపక్క టైం వేస్టవుతోంది. చిరాకొచ్చింది. కొట్టకపోతే పేమెంట్ కట్ అన్నాను. కొండపైనుంచి తోసే సన్నివేశమూ అంతే. నిజానికి సినిమాలో ఉన్నట్టు వాళ్లు నన్ను తోయలేదు. నాకు నేనే దొర్లుకుంటూ వెళ్లిపోయా’ అంటూ గుర్తు చేసుకున్నారు విజయ్‌చందర్.
ఇంకో విషయం -‘శిలువ వేశాక ఏసు చనిపోయాడో లేదో చూడడానికి కడుపులో బల్లెం గుచ్చుతారు. ఆ బల్లెం గుచ్చిన సీన్‌లో కడుపుపై తగిలిన దెబ్బ తాలూకు మచ్చ ఇదిగో’ అని చూపిస్తూ నవ్వేశారు. మేకులు కొట్టినపుడు రక్తం చిమ్మే సీన్ గుర్తు చేసుకుంటూ -నా నడుం వెనుక నుంచి సన్నని తెల్లని ప్లాస్టిక్ పైపులు కనపడకుండా సెట్‌చేశాడు కెమెరామెన్. ఆ పైపులకు పశువులకిచ్చే ఇంజెక్షన్ జతచేసి ఎర్రరంగు ఇంజెక్ట్ చేసేవాళ్లు. అయితే మేకు కొట్టిన ప్రతిసారీ ఇంజెక్షన్ చేసినా, ఒక్కోసారి రంగు చిమ్మేది కాదు. అదే సీన్‌ని ఎన్నిసార్లు చేశామో గుర్తు లేదు. రెండు రోల్స్ ఫిల్మ్ మాత్రం అయిపోయింది. వాటన్నింటి నుంచీ బావున్నవాటిని జాగ్రత్తగా ఏరుకుని -ఎడిటింగ్‌లో సెట్‌చేశాం. లైటింగ్ లేదంటూ కెమెరామెన్ నో చెప్పటంతో, డిప్రెషన్‌లోకి వెళ్లినపుడు వచ్చిన ఓ ఆలోచన అద్భుతమైన సన్నివేశమైంది’ అంటారు విజయ్‌చందర్. అనుకున్నామని జరగవు అన్ని/ అనుకోలేదని ఆగవు కొన్ని.. అన్న ఆత్రేయ మాటల్ని ఇక్కడ అన్వయించుకోవచ్చు.
**
కరుణామయుడు ఓ అద్భుతమైంది. ఘన విజయం సాధించింది. ఆ ఉత్సాహంతోనే బాపు డైరెక్షన్‌లో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర రూపొందించాలని అనుకున్నారు విజయ్‌చందర్. ఆ విషయాన్ని సంప్రదించారు కూడా. అందుకు బాపు -‘కరుణామయుడు బాగా ఆడుతుంది. మరోసారి జీసస్ చిత్రం చేస్తేనే బావుంటుందేమో’ అని సలహా ఇచ్చారు. ఆయన సలహాకు స్నేహితులూ ఓటేశారు. అప్పటికి యన్టీఆర్ -వీరబ్రహ్మేంద్రస్వామి చిత్రం చేయలేదు. ఆ పాత్రపై మక్కువ వున్నా, బాపు సలహాతో బైబిల్‌లోని దారితప్పిన కొడుకు కథనం తీసుకొని ముళ్లపూడి మాటలు, స్క్రీన్‌ప్లే రాశారు. రాజమండ్రిలో సినిమా షూటింగ్ చేశారు. సుమలత ఆ సినిమాతోనే పరిచయమైంది. ‘యామి.. శిశువా’ అన్న మానరిజమ్‌తో నూతన్‌ప్రసాద్ పాత్ర అద్భుతంగా పండింది. ఆ సినిమా -రాజాధిరాజు. శారద వదిన పాత్రలో ఒదిగిపోయింది. రాజాధిరాజు చిత్రం నేషనల్ అవార్డుకూ ఎంపికైంది. అన్ని వర్గాలనుండి అద్భుతమైన స్పందన వచ్చింది.
ఆంధ్రకేసరి చిత్రం తీయడానికి కారణమేమిటి? అన్న ప్రశ్నకు -‘నిజానికి టంగుటూరి ప్రకాశం పంతులు మా తాతగారు. అలాగని ఆయనపై ప్రేమతో సినిమా రూపొందించలేదు. యన్టీఆర్ అప్పుడే రాజకీయ పార్టీ పెట్టారు. ఆ టైంలోనే ఈ సినిమా మొదలెట్టాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక అప్పటి రాజకీయ నేతలు ఎంత గొప్ప వ్యక్తిత్వం కిలగి ఉండేవారు, ఇప్పటి నేతలు ఎలావున్నారన్న బేరీజుతో సినిమా చేయాలనకున్నాం’ అంటారు విజయ్‌చందర్. దేశంకోసం అనేక త్యాగాలు చేసి, సంపాదనను దేశాభివృద్ధికి ఇచ్చేసిన వాళ్లెక్కడ? స్వార్థం చూసుకుంటున్న ఇప్పటి నేతలెక్కడ? అన్నది ప్రేక్షకులకు చెప్పాలన్న ఉద్దేశంతో సినిమా రూపొందించానంటారు ఆయన. ఇప్పటి తరలాకూ ఆ సినిమా మార్గదర్శే అంటారు విజయ్‌చందర్.
స్వాతంత్య్రం రావడం నాకు తెలుసు. ఆ టైంలో స్కూల్లో జెండాలు పట్టుకుని తిరిగేవాడిని. అప్పటి రాజకీయ చైతన్యం, ఇప్పటి రాజకీయ దుస్థితి మదిలోకొచ్చినపుడు -గుండె బరువెక్కుతుందని దేశ పౌరుడిగా తన వాణి వినిపించారాయన.
సిఎస్ రావు దర్శకత్వంలో వేమన చరిత్ర తీయాలనుకున్నాను. ఆ చిత్రాన్ని కెవి రెడ్డి దర్శకత్వంలో చిత్తూరు నాగయ్య హీరోగా రూపొందించిన సంగతి తెలిసిందే. అంత గొప్ప చిత్రాన్ని ఇప్పుడు నిర్మించటం, ఆ పాత్రను పోషించటం కత్తిమీద సామని నాకు తెలుసు. అయితే మొదటి చిత్రానికి మచ్చరాకుండా సినిమా చేయాలనుకున్నాం. తొలి సగంలో నా గొంతుకు ఇబ్బంది రావడంతో డబ్బింగ్ చెప్పించాం. రెండోసగంలో నా గొంతే ఉంటుంది. మీరన్నట్టు విశ్వదా పాత్రకు ఓ గ్లామర్ హీరోయిన్‌ని పెడితే బాగానేవుండేది. కానీ అర్చన అప్పటికే జాతీయ అవార్డుతో మంచి నటిగా నిరూపించుకుంది. అందుకే ఆ పాత్రకు ఆమెను ఎంపిక చేశారనిపిస్తుంది. అదంతా దర్శక నిర్మాతల ఇష్టమే. ఇక వేమన పాత్ర చిత్రణలో ఆయన ఎలా కూచుంటాడు, ఎలా నడుస్తాడు అనేది చాలా ప్రాక్టీస్ చేశా. చివరి సీన్ చిత్రీకరించేటప్పుడు కెమెరామెన్ హరి అనుమోలు పనితనం కన్పిస్తుంది. జీవసమాధి పొందే సమయంలో ఒంటిపై బట్ట ఉండకూడదు కదా, అలా చేస్తావా అని అడిగారు దర్శక నిర్మాతలు. మీరు చిత్రీకరిస్తారంటే ఆ వున్న చిన్న బట్ట కూడా తీసేసి వెళతానన్నాను నేను. ఆవిధంగా ఓ సన్నివేశం కూడా చిత్రీకరించారు. నాకు తెలియకుండానే ఆ పాత్రలో లీనమైపోయాను. అలా ఆ సీన్ దిగంబరంగానే నటించాను. ఆ సినిమా షూటింగ్‌లో కెఆర్ విజయ వదినగా నటించి చాలా మెచ్చుకున్నారు. చివరి సన్నివేశంలో తన వాళ్లను కూడా చూడకుండా ఓ అద్భుతమైన అలౌకిక ఆనందంతో చేసిన సన్నివేశంలో నాగయ్య నటనను ఇమిటేట్ చేయకుండా నా పద్ధతిలో నేను చేసే ప్రయత్నం చేశా. అది కూడా బాగా పండింది.
రాజు దర్శకత్వంలో చేసిన గొప్ప చిత్రం -కబీర్‌దాస్. అందులో పాటలన్నీ అద్భుతంగా వుంటాయి. అలాగే శ్రీ షిరిడీ సాయిబాబా మహత్మ్యం చిత్రంలో నటించమన్నప్పుడు మొదట ఆ పాత్రను నేను చేయలేనన్నాను. కరుణామయుడు చిత్రం చేశావు కదా, మరొక దేవుడికి సంబంధించిన చిత్రం ఎందుకులే అనుకున్నా. కానీ యూనిట్‌వాళ్లంతా మీరు చేస్తే బాగుంటుందనటంతో మేకప్ నాకు సంతృప్తికరంగా ఉంటేనే చేస్తానన్నాను. నాలుగైదుసార్లు మేకప్ చేసి విగ్గులు తగిలించారు. కానీ సంతృప్తి కలగలేదు. విగ్గు తీసేసి -నేను షిరిడీ సాయిలా కనిపించడంలేదు. చేయను అన్నాను. యూనిట్‌వాళ్లు మళ్లీ మళ్లీ ప్రయత్నించి మేకప్ చేశారు. ఫైనల్‌గా అద్భుతంగా వచ్చింది ఆ గెటప్. పాత్రలో పాత్రధారుడు కనిపించకూడదన్న దర్శకుడు పి వాసు సలహాతో చేయడానికి సిద్ధమయ్యా. షూటింగ్ టైంలో చేతులు, కాళ్లు, వేళ్లు వాటికవే వంకర్లు పోవడం మొదలుపెట్టాయి. రషెస్ చూసినవారు దేవుడు సినిమా కదా అలా చేస్తున్నావేంటి అనడిగారు. ఏమో నాకు తెలియకుండానే అలా జరుగుతుందని చెప్పా. వాసు ఇచ్చిన ప్రోత్సాహంతో మొత్తానికి పాత్ర చేసేశాను’ అంటారు విజయ్‌చందర్. ఆ తరువాత -బాబా దిగివచ్చాడా? అన్నట్టే ఉందని అనేకమంది అన్నారు. చాలా సంతోషపడ్డాను అంటారు విజయ్‌చందర్. ‘సాయి శరణం.. బాబా శరణు శరణం’ అన్న పాటలో కడుపులో పేగులుతీసి శుద్ధి చేసుకునే సన్నివేశం ఉంది. నిజానికి ఆ సీన్ దర్శకుడికి ఇష్టం లేదు. కానీ, నేను పట్టబట్టి చేశా. ఆ సన్నివేశం చిత్రీకరించే లొకేషన్‌కు రానని దర్శకుడు భయపడిపోయాడు. ఆ సన్నివేశం అద్భుతంగా పండింది’ అంటూ గుర్తు చేసుకున్నారు విజయ్‌చందర్.
‘ఇప్పుడంతా బయోపిక్స్ అంటున్నారు. నేను ఆ కాలంలోనే బయోపిక్స్ తీశా. కొత్తగా రాజకీయాలకు వచ్చినవాళ్లు, కొత్త రాజకీయ పద్ధతులను చూపించాలిగా. అలా చేయాలని నేను అనుకుంటాను. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ చూసినా అలా చేయడం లేదు. ఓ రెండు మూడు వందల చిత్రాలు చేసిన అనుభవం లేదు, రికార్డూ లేదు నాకు. మరి నేనేం చేశానని వెనక్కి తిరిగి చూసుకుంటే, చేసిన నాలుగు చిత్రాలైనా మరొక నటుడు చేయలేని విధంగా చేశానని అంటుండటం నాకు గొప్పగా అనిపిస్తుంది. రాముడు, కృష్ణుడంటే ఎన్టీఆర్ గుర్తొస్తారు. ఏసు, సాయి అంటే విజయ్‌చందరే గుర్తొస్తాడన్న మాట చాలు నా జీవితానికి. ఇప్పటికీ నేను ఏదైనా చర్చికెళ్తే.. ఏసయ్య వచ్చాడంటారు. బాబా గుడికెళ్తే సాయి వచ్చాడంటారు. నన్నో దేవుడిలా చూస్తారు. ఇదంతా నా తల్లిదండ్రుల పుణ్యఫలంగా భావిస్తా. భౌతికంగా నేను లేకపోయినా నా పాత్రలకు మరణం ఎప్పటికీ రాదు. ఈ జీవితానికి ఇంతకన్నా ఏంకావాలి. సర్వమత సమ్మేళనం అన్నట్టుగా నా చిత్రాలు అన్ని మతాలవారికీ చేరాయన్న ఆనందం ననె్నప్పుడు ఆనందంగా ఉంచుతుంది’ అంటూ ముగించారు విజయ్ చందర్.

కోతి పిల్లని హీరో చేసి వంద రోజులాడిస్తా!( ఆనాటి హృదయాల..)

$
0
0

బాబూ చూడూ. ఈ సినిమాలో చెయ్యడం నీ అదృష్టం. కాదంటే ఓ కోతి పిల్లని హీరో చేసి.. బొమ్మతీసి వందరోజులాడిస్తా’ అన్నాడు రాఘవ. ఆయన తరహాలో లౌడ్ ఛాలెంజ్ విసురుతూ. ‘మీ సినిమా వంద రోజులు కాదు రెండొందలు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ నమ్రంగా చెప్పి పంపించాడు శోభన్ బాబు.

ఆయనకు నూటామూడేళ్లు.
తెలుగు సినిమా తల్లికి ఇద్దరు అపూర్వమైన దర్శకుల్ని పరిచయం చేసిన నిర్మాత. ఆ ఇద్దరిలో ఒకరు దాసరి నారాయణరావు. మరొకరు కోడి రామకృష్ణ. ఇద్దరూ శతాధిక చిత్రాల దర్శకులే.
ఇంతకీ ఆ నూటమూడేళ్ల మొండి ఘటం ఎవరో తెలుసా? ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ. మొండిఘటం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఆయన ఎవర్నీ లెఖ్ఖ చెయ్యరు. అనుకున్నది చేసేస్తారు. అవసరమైతే చెయ్యి చేసుకుంటారు. అవసరమనుకుంటే కారు తాళాలు చేతికిచ్చి.. రేపట్నించి దర్జాగా తిరగమంటారు. అందరూ వందకి పది పదులు లెక్కపెడితే... ఆయన రూపాయికి వంద పైసలు లెక్కపెడతాడు. ఖర్చుపెట్టిన ప్రతి పైసా తెరమీద కనిపించాలంటాడు. అదీ నిర్మాతతత్వం. అచ్చంగా, రాఘవతత్వం.
రాఘవ, ఏకాంబరేశ్వరరావు వీరంతా కంబైన్డ్‌గా విజయ్‌భట్ మూవీస్ భట్‌తో కలిసి సినిమాలు చేసేవారు. అప్పట్లో ఒక సీజనంతా యస్వీ రంగారావే హీరో. మొనగాళ్లకు మొనగాడు, జగత్‌జెట్టీలు, జగత్ కిలాడీలు. ఇలా ‘జగత్’మకుటంగా వచ్చిన చాలా చిత్రాలున్నాయి. ఆ చిత్రాలకు రచయితగా పరిచయమైన వ్యక్తే దాసరి నారాయణరావు. దాసరి ఆలోచనలు నచ్చి, కథ చెప్పే విధానం నచ్చి.. ఓ కథకు విపరీతంగా ఆకర్షితుడైన రాఘవ నువ్వే ఈ సినిమా డైరెక్టరువి పో అనేశారు. అంతే, నిర్మాణ పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఆ కథే తాత-మనమడు.
దర్శకుడు సిద్ధంగా వున్నాడు. కథ, మాటలు, స్క్రీన్‌ప్లే బౌండ్‌బుక్‌తో సిద్ధంగా వున్నాడు. హీరో కావాలి కదా- అప్పటికి కొన్ని సినిమాల్లో చేసిన హీరో శోభన్‌బాబు తప్పకుండా ఒప్పుకుంటాడన్న నమ్మకంతో వున్నాడు రాఘవ. పైగా శోభన్ సౌమ్యుడు. యస్వీఆర్ తాత పాత్రకు ఒప్పుకున్నాడు. సత్యనారాయణ, రాజసులోచన, అంజలీదేవి అంతా ఒప్పుకున్నారు. శోభన్‌బాబు హీరో అనేసరికి విజయనిర్మల కూడా ఒప్పుకుంది. తీరా షూటింగ్ దగ్గరపడుతుంది. రాఘవ శోభన్‌ని కలిసి హాపీగా న్యూస్ చెప్పాడు. అద్భుతమైన కథ.. అద్భుతమైన దర్శకుడు. మనం ఈ సినిమాని ఛాలెంజింగ్‌గా చేద్దామన్నాడు. రాఘవ సహజంగా ఆవేశపరుడు.
కథ వింటున్నపుడు, చెబుతున్నపుడు అద్భుతంగా వుంది. మరి దర్శకుడు కొత్తకదా. ఇపుడిపుడే నేను గ్లామరు పాత్రలేస్తూ లేడీ ఆడియన్సుకి దగ్గరవుతున్నా. బాగా కథ చెప్పిన దర్శకుడు చిత్రాన్ని బాగా తియ్యాలన్న రూలేం లేదుకదా. బాగా తీయనూ వచ్చును. ఎందుకైనా మంచిది. ఈ సినిమావరకూ నన్ను వదిలెయ్యండి. దయచేసి నామీద ఎక్స్‌పెరిమెంట్ చెయ్యకండి’ అంటూ సున్నితంగా తిరస్కరించాడు శోభన్. మరో మాటాడే అవకాశం ఇవ్వకుండా.
రాఘవకి అరికాలి మంట నెత్తికెక్కింది.
వెంటనే ‘బాబూ చూడూ. ఈ సినిమాలో చెయ్యడం నీ అదృష్టం. నువు చెయ్యనంటే ఓ కోతి పిల్లని హీరోని చేసి.. బొమ్మతీసి ఆ బొమ్మని వందరోజులాడిస్తా’. ఆయన తరహాలో లౌడ్‌గా ఛాలెంజ్ విసిరాడు. ‘మీ సినిమా వంద రోజులు కాదు రెండువందలు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ శోభన్‌బాబు వినమ్రంగా చెప్పి పంపించాడు.
ఆ కసితో వెంటనే రాజబాబుని బుక్‌చేసి నువ్వే నా హీరో అన్నాడు. రాజబాబుకేం అర్ధంకాలేదు. విజయనిర్మలకి అంతకన్నా అర్ధంకాలేదు. రాజబాబు హీరో ఏమిటి? నేను హీరోయిన్ ఏవిటి? తనూ శోభన్‌బాబులాగే మరో సినిమా చూద్దాం లెండి’ అంది. అయితే కృష్ణ ఒప్పుకోలేదు. రాఘవ లాంటి నిజాయితీగల నిర్మాత దగ్గర పనిచెయ్యడం మన అదృష్టం, చెయ్యి అన్నారు. ఆ సినిమాకు యూనిట్ అంతా అహర్నిశలూ శ్రమించారు.
దాసరికిది చావుబతుకుల సమస్య. యస్వీఆర్, సత్యనారాయణ. రాజసులోచన, అంజమ్మ అందరూ దాసరిని ఆశీర్వదించారు. సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది. మొదట హీరో కృష్ణ చూశారు. రాఘవని అభినందిస్తూ ‘నువ్వు వంద రోజులాడిస్తానన్నావు. ఈ సినిమా రెండు వందల రోజులకు పైనే ఆడుతుంది. కంగ్రాట్స్’ అంటూ రాఘవని అభినందించాడు. అలాగే రెండువందల రోజులాడింది. ఆ సందర్భంగా 8899 ఫియెట్ కారు (మిరప పండు) కొని దర్శకుడికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. సెంటిమెంట్‌గా దాసరి ఆ కారునే ఉపయోగించేవాడు. ఆ కోతిపిల్ల రాజబాబుతోనే దాసరి ‘ఎవరికివారే యమునాతీరే’ చిత్రం తీసి సూపర్‌హిట్ చేశాడు.

శ్రీకృష్ణార్జున యుద్ధం (నాకు నచ్చిన సినిమా)

$
0
0

యన్టీఆర్, ఏయన్నార్ బావ బావమరదులుగా నటించిన మహాభారత నేపథ్య చిత్రం -శ్రీకృష్ణార్జున యుద్ధం. 1963 జనవరి 1న జయంతి పిక్చర్స్ బ్యానర్‌పై విడుదలైంది. కృష్ణుడిగా యన్టీఆర్, అర్జునుడిగా ఏఎన్నార్ నటనా వైదుష్యానికి పట్టంగట్టిన సినిమా. నిర్మాత, దర్శకుడు కెవి రెడ్డి అత్యంత శ్రద్ధతో నిర్మించిన చిత్రం. పింగళి నాగేంద్ర సంభాషణలు చేకూర్చగా పెండ్యాల సంగీతం, వెండితెర దృశ్యావిష్కరణకు ప్రముఖుడైన రవికాంత్ నగాయిచ్ కెమెరాతో సృష్టించబడిన దృశ్యకావ్యం. కృష్ణార్జునుల నడుము యుద్ధదృశ్యం ఆడియన్స్‌కి ఆనందాశ్చార్యాలు కలిగిస్తాయి. సుభద్రగా బి సరోజాదేవి, సత్యభామగా జి వరలక్ష్మి, నారదుడిగా కాంతారావు, రుక్మిణిగా జూ రంజని, బలరాముడిగా మిక్కిలినేని, రేవతిగా ఛాయాదేవి, గయుడిగా ధూళిపాళ, ధర్మరాజుగా గుమ్మడి, అక్రూరుడిగా చిత్తూరు నాగేశ్వరరావు, చిన్నమునిగా అల్లు రామలింగయ్య, అతని జోడి బాలసరస్వతి- శివుడిగా ప్రభాకరరెడ్డి బ్రహ్మదేవుడిగా ఎవి సుబ్బారావు, దుర్యోధనుడిగా ముక్కామల, కర్ణుడిగా సత్యనారాయణ పాత్రలు పోషించారు. పౌరాణిక చిత్రాల నిర్మాణంలో తెలుగువారికి సాధికారత ఉన్నదనటంలో అతిశయోక్తిలేదు. నటీనటుల హావభావాలు, మేలిమి బంగారు పాటలు, అమృత గుళికల్లాంటి సన్నివేశాలు.. వెండితెరపై పౌరాణిక చిత్రావిష్కరణ అజరామరం. బ్లాక్ అండ్ వైట్‌లో తీయబడిన సాంకేతిక అద్భుత రసకావ్యమిది.
మహాభారతంలోని అరణ్యపర్వంలో -వనవాసమందు అర్జునుడి ఆయుధ సంపత్తి సమకూర్చుకొనుటకై తీర్థయాత్రలు చేస్తాడు. ద్వారకలో ప్రేయసి సుభద్రను చూసి యతి వేషమునచేరి తన ప్రేమను బావ కృష్ణుని సహకారంతో గెలిపించుకుంటాడు. అండదండగావున్న కృష్ణపరమాత్మ, అర్జునుని మధ్య నడిచిన నాటకమే సినిమా సారాంశం. ‘గయోపాఖ్యానము’ నేపధ్యంలో జరుగుతుంది. సినిమా విడుదలై 54 ఏళ్లయినా -నిత్యనూతనంగా వెలుగు ప్రసరించే ముగ్ధమనోహర తెలుగు దృశ్యకావ్యం. ఈ సినిమా నాకు చాలా ఇష్టం.


నీతో ప్రతిక్షణం (నాకు నచ్చిన పాట )

$
0
0

నీతో ప్రతిక్షణం ఓహో/ ఎంతో మనోహరం ఓహో -అంటూ ప్రారంభమై నడిచే ప్రతి బాట/ నడపాలి మనవెంట బ్రహ్మోత్సవం’ అనే పల్లవితో సాగే బ్రహ్మోత్సవం చిత్రంలోని టైటిల్ సాంగ్ ఎంతో అర్ధవంతంగా హృదయాన్ని తాకుతుంది. పాటలోని ప్రతి పదం ఓ అద్భుతం. సిరివెనె్నల సీతారామశాస్ర్తీ కలం పదును, మిక్కీ జే మేయర్ బాణీ, మైనంపాటి శ్రీరామచంద్ర వాణి త్రివేణీ సంగమంలా సాగి శ్రోతల్ని ఓలలాడిస్తాయి. ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలన్పించే సంగీతం బీట్‌తో సాగుతుందీ పాట. ‘నిత్యమూ మనతో మనకే రణం/ ఎప్పుడూ ఏదో ఓ కారణం’ అలాగే ‘ఎన్నడో వెనకటి జన్మల ఋణం/ తీర్చుకోవాలనిపించే తనం’ అంటూ సాగే చరణాలు మానవ సంబంధాల్ని తట్టిలేపుతాయి. 2016 మే 20న విడుదలైన ఈ సినిమా ఫలితం విషయం పక్కనబెడితే -పాటలన్నీ జీవితాన్ని కాచి వడబోసేవే. అందులో ‘ఆణిముత్యం’ ఈ పాట. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వ ప్రతిభ, ప్రసాద్ వి పొట్లూరి వంటి అభిరుచిగల నిర్మాత, మహేష్‌బాబు, కాజల్ అగర్వాల్, సమంతల స్క్రీన్ ప్రెజెన్స్ పాటను పది కాలాలపాటు నిలబెట్టగలిగాయి. ఇప్పటికి ఎన్నిసార్లు విన్నానో నాకే తెలీదు. ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించేంత ఇష్టం ఈ పాటంటే. ఈ పాట స్ఫూర్తితో పాతికేళ్లనాడు డిగ్రీ నాతో కలిసి చదువుకొన్న మిత్రులందరినీ వెదికిపట్టుకొని 2018లో ‘గెట్ టుగెదర్’ చేశాను కావలి జవహర్ భారతి కళాశాలలో. అమెరికా, సౌతాఫిక్రావంటి దేశాల నుండి, వివిధ రాష్ట్రాలనుండి కూడా మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని గెట్ టుగెదర్‌లు చేసే పనిలో ఉన్నాం, మిత్రులంతా.

ఫిలిం క్విజ్-149

$
0
0

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. గుణ 369 కోసం హీరో కార్తికేయకు సీన్ వివరిస్తున్న దర్శకుడెవరు?
2. కంటేనే అమ్మ అని అంటే ఎలా? అని ప్రశ్నించిన పాటల రచయత?
3. 2007లో చందమామ? 2017లో నక్షత్రం? కామన్ దర్శకుడు?
4. జూ.ఎన్టీఆర్‌తో రంభ కామియో అప్పీరెన్స్ కోసం నాచోరె నాచోరె.. పాట రాసిందెవరు?
5. గోపాల గోపాల చిత్రంలో వెంకటేష్ పాత్ర పేరు? ప్రఖ్యాత నటుడిలో రావు మిస్సైంది..
6. ప్రియ వాసుదేవ్ మణి అయ్యర్ ఏ తార పూర్తి పేరు?
7. ఆడదాని వంటిమీద చేయ వేస్తే నరకాల్సింది వేలు కాదు తల.. అన్న డైలాగ్ చెప్పిన హీరో?
8. అలా మొదలైంది చిత్రానికి సంగీతం సమకూర్చింది?
9. కల్యాణ వైభోగమే చిత్రంలో హీరోయన్ పాత్ర పేరు?
10. పక్క చిత్రంలో నటి ఎవరు?

సమాధానాలు- 147

1. నీవెవరో..
2. భట్టాచారి
3. మాటలకందని..
4. టైగర్
5. గుణశేఖర్
6. పాండవులు
7. శతమానంభవతి
8. తకిట తకిట
9. పి చంద్రశేఖర్ రెడ్డి
10. కృతిగార్గ్

సరైన సమాధానాలు రాసిన వారు

ఎం అహ్మద్, డి గన్నవరం
జివీ రాజేంద్ర, నంద్యాల
ఆర్ కరుణ, భీమవరం
కె దినేష్‌రెడ్డి, కందుకూరు
బిఆర్ కృష్ణ, దిండి
ఎస్ లక్ష్మీరావ్, సికింద్రాబాద్
పి వల్లభ, గుంటూరు
ఎం ప్రసాద్, వరంగల్
కె ప్రసన్న, హైదరాబాద్
ఎ వేంకటేశ్వర రావు, తుని
జి మల్లిక, పాలకొల్లు
వై చక్రవర్తి, అమరావతి
ఆర్వీఎస్ కమల, ఘట్‌కేసర్
జి వేణుకుమార్, అనపర్తి
పి సురేందర్, కర్నూలు

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

పూర్‌లీడర్

$
0
0

300 కోట్ల దోపిడీ. ఆరు హత్యలు. రెంటికీ కారకుడైన విలన్. వాడిపై -ఐదుగురు బాధిత మహిళల పగ. యాక్షన్ రివేంజ్‌కు -ట్రూ కాపీ రాసే నవలా రచయిత. ఈ ముడిసరుకుతో కథల్లుకోమంటే.. -అంటూ నానీస్ గ్యాంగ్‌లీడర్‌పై వెనె్నలలో రాసిన రివ్యూ భలే అనిపించింది. వెనె్నల రివ్యూలకు ఓ ప్రత్యేకత ఉంటుందన్నది నిజం. ఆ క్వాలిటీని మెయన్‌టెయన్ చేస్తూ పత్రికలో ఇస్తున్న రివ్యూలు బావుంటున్నాయ. నిజానికి గ్యాంగ్‌లీడర్ చిత్రం అంత తీసిపారేయతగ్గదిగా లేదు. కాకపోతే, హీరో ఎలిమెంట్‌ను దర్శకుడు సమర్థంగా చూపించలేకపోవడంతో -ఆడియన్స్‌లో నీరసం వచ్చేసింది. కామెడీపరంగాను, కంటెంట్‌పరంగాను, క్వాలిటీపరంగానూ.. ఇలా సినిమా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసినా -స్క్రిప్ట్‌పట్ల దర్శకుడు మరికొంత జాగ్రత్త తీసుకునివుంటే సినిమా మరోలా ఉండేది.
-మల్లికార్జున శర్మ, ర్యాలి
మనోళ్లేరీ..
తెలుగు సినిమాలు, టీవీ సీరియల్స్‌ని పరభాషా నటీనటులే రాజ్యమేలుతున్నారు. తెలుగువాళ్లకు ప్రాధాన్యం తక్కువవుతుంది. ముఖ్యంగా తెలుగు సీరియల్స్‌లో సీనియర్లకు అవకాశాలు వస్తున్నా, కొత్తగా హీరోయిన్ పాత్రలకు చాన్స్‌లే రావడం లేదు. ఎక్కువగా కన్నడ, తమిళ పరిశ్రమల నుంచే వలస వస్తున్నారు. డబ్బింగ్ సీరియళ్ల వెల్లువ తగ్గి, తెలుగు సీరియల్స్ పెరిగినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక సినిమాల్లోనూ తొంభై శాతం హీరోయిన్లు ఇతర భాషల నుంచి వస్తున్న వాళ్లే. ఇదే పరిస్థితి చాలాకాలంగా కనిపిస్తోంది. టాలెంట్‌వున్నా.. అవకాశం ఇచ్చేవాళ్లు లేక ప్యాడప్ ఆర్టిస్టులకే పరిమితమైపోతున్నారు. స్థానిక నటులకు అవకాశమిప్పించే విషయంలో ‘మా’ చొరవ చూపాలి. వృద్ధకళాకారులకూ తగు పాత్రల్లో అవకాశాలిప్పించి జీవనోపాధి కల్పించాలి. పరాయివాళ్లు వద్దని కాదు, మనవాళ్లూ బతకాలిగా.
-ఎఆర్ రామారావు, ఖమ్మం
కుదేలైన కురుక్షేత్రం
కన్నడ భాష అనువాద చిత్రం ‘కురుక్షేత్రం’ సాంకేతికంగా భారీ చిత్రమే తప్ప -కథాపరంగా మెప్పించలేకపోయింది. ఎన్టీఆర్ శ్రీకృష్ణపాండవీయం, దాన వీర శూర కర్ణ చిత్రాల స్ఫూర్తితో కథా కథనాలు తయారు చేసుకొని సినిమా తీశారు. వెనె్నలకంటి పద్యాల జోలికి వెళ్లకుండా ఆ తరహా డైలాగులనే చిత్రానికి అందించారు. మయసభ నిర్మాణం భారీ తనంతో అలరించింది. పాట కూడ బాగానే ఉంది. సాయికుమార్ తమ్ముడు రవిశంకర్ శకునిగా.. మన ధూళిపాళను అన్నిరకాలుగా అనుకరించి రాణించారు. దుర్యోధనుడిగా దర్శన్, కర్ణుడిగా అర్జున్ ఆకోవ రూపాల్లో రాణించేందుకు చేసిన ప్రయత్నం సఫలమైంది. భీముడు పాత్రధారి కుడా బాగానే చేశాడు. వయస్సుడిగిన అంబరీష్ భీష్ముడిగా బాగాలేడు. కొన్నిచోట్ల డైలాగ్స్ బాగున్నాయి. బానబొజ్జతో శ్రీకృష్ణుడిని చూడలేం. జరిగే కథనం ఆపి రాయబారం సీను నుండి కురుక్షేత్రం యుద్ధ ఘట్టంతో చిత్రాన్ని ముగించారు. కురుక్షేత్ర యుద్ధ సన్నివేశాలను భారీ టెక్నాలజీతో తీశారు. ఫైట్స్ భారీస్థాయితో బాగా తీశారు. అసలు దీనికోసమే సినిమా నిర్మాణం చేసినట్టు అనిపిస్తోంది. స్నేహ ద్రౌపదిగా చేసిందేమీలేదు. ఈనాడు పౌరాణికాలు ఎంత భారీతనంతో తీసినా ఆనాటి పౌరాణికాలముందు దిగదుడుపే!
-పీవీఎస్ ప్రసాదరావు, అద్దంకి
తప్పులేదు..
సామాజిక మాధ్యమాల్లో మరోసారి చిన్మయ విరుచుకుపడింది. ఈసారి కమల్‌హాసన్ మీద. ఎందుకంటే ఆయన తమిళంలో బిగ్‌బాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. బిగ్‌బాస్ కానె్సప్ట్ తెలుసుకదా. బాహ్య ప్రపంచంతో ఫోన్, టీవీలతో సంబంధం లేకుండా ఒక ఇంట్లో కొందరు పోటీదారులు ఆడ, మగ కొంతకాలం కలిసుండాలి. కబుర్లు, జోకులు, ఆటపాటలు, వంటలు చేసుకుంటూ ఓవారం బానే ఉంటుంది. తరువాతే -వాదోపవాదాలు, కొట్లాటలూ ప్రారంభమవుతాయి. కాలక్రమంలో ప్రతి వ్యక్తి గురించి మిగిలిన వారి అభిప్రాయాలు అడుగుతారు. మైనస్‌లు వచ్చినోళ్లు బయటకు పోవాలి. తమిళ షోలో ఒకడు కాలేజీ రోజుల్లో రష్‌గా ఉండే బస్సులు, కాంటీన్లలో అమ్మాయిల వెనక చేరి వారిని ఎక్కడెక్కడో గుచ్చి, మరెక్కడో టచ్ చేసి ఎంజాయ్ చేసేవాడినని చెప్తే అదో ఘనకార్యంలా కమల్‌హాసన్‌తోబాటు ఆ యింటిలోని సభ్యులంతా నవ్వేశారట. ఇది నవ్వులాట వ్యవహారమా? సిగ్గులేదూ? పైగా రాజకీయ పార్టీ పెట్టి ఇలాంటి పోకిరి పనులకు నవ్వుతావా? అంటూ చిన్మయి ఆగ్రహించింది. ఆమె ఆగ్రహం సహేతుకమేకదా!
-శుభ, కాకినాడ
తెలివైన బిజినెస్
సినిమా విడుదల ముందు ఆడియో రిలీజ్, ఫస్ట్‌లుక్, టీజర్ లాంటి జిమ్మిక్స్, విడుదల అయ్యాక ఫస్ట్‌డే కలక్షన్, విజయోత్సవమంటూ భజంత్రీలు మోత సహజమే. సినిమా ప్రమోషన్‌కోసం నానావిధ రభస మామూలే. ఇప్పుడు కొత్తగా థియేట్రికల్ రైట్స్ డబ్బింగ్ లేదా రీమేక్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఎంత కలక్ట్ చేసిందో దండోరా వేయటం కొత్త ట్రిక్. డియర్ కామ్రేడ్ చిత్రం విడుదలకు ముందే హిందీ రీమేక్ హక్కులు కరణ్‌జోహార్ (క.జో.) 5 కోట్లకు కొన్నాడని కొందరు, కాదు 6 కోట్లు అని మరికొందరు గొంతు చించుకొని ప్రచారం చేసినా ఆ చిత్ర హీరో విజయ్‌దేవరకొండగాని కజోగాని పెదవి విప్పలేదు. అసలు రహస్యం హిందీ చిత్ర విమర్శకుడు బయట పెట్టాడు. అంత డబ్బుపోసి రీమేక్ హక్కులు కొనడానికి కజో చేతగానివాడు కాదు. నిజానికి ఆయన రైట్స్ కొన్నా కథను మార్చేశాడు. హీరో ప్రాధాన్యం తగ్గించి మీటూ అంటూ హీరోయిన్ పోరాడిన వైనం కథలో చొప్పించాడట. ఇది హీరోయిన్ ప్రాధాన్య చిత్రం. తెలుగులోనూ డియర్ కామ్రేడ్‌కి మిశ్రమ స్పందనే లభించింది. నిడివి ఎక్కువైందంటూ కొంతభాగం తొలగించి క్యాంటీన్ పాట కలిపినా కలక్షన్లు పెరగలేదు. ఇదీ కామ్రేడ్ బండారం!
-స్నేహమాధురి, పెద్దాపురం

దైవ బలం

$
0
0

మద్రాస్‌లో పొన్నలూరి బ్రదర్స్ సొంత స్టూడియో నిర్మించారు. పొన్నలూరి బ్రదర్స్ బ్యానర్‌పై ఇదే స్టూడియోలో 1957లో ‘్భగ్యరేఖ’ చిత్రాన్ని యన్టీ రామారావు, జమున కాంబినేషన్‌లో రూపొందించారు. ప్రముఖ దర్శకులు బిఎన్ రెడ్డి ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. వాహినీ సంస్థ చిత్రాలకేకాక ఇతర చిత్రాల సంస్థలకూ బిఎన్ రెడ్డి పనిచేయటం ‘్భగ్యరేఖ’తోనే ప్రారంభం కావటం విశేషం. ఆ చిత్రానికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చారు. భాగ్యరేఖ చిత్రానికి రాష్టప్రతి రజిత పతకం లభించింది. తరువాత పొన్నలూరి బ్రదర్స్ -యన్టీఆర్, అంజలి, రాజసులోచనతో ‘శోభ’ (1958), యన్టీఆర్, జానకి కాంబినేషన్‌లో ‘కాడెద్దులు- ఎకరం నేల’ (1960) నిర్మించారు. ‘శోభ’ చిత్రానికి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఏఎం రాజా సంగీత దర్శకత్వం వహించారు. ప్రసిద్ధ క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్యనటుడు, నాటక రచయిత రావి కొండలరావు ‘శోభ’ చిత్రం ద్వారానే సినీ రంగానికి పరిచయమయ్యారు. పొన్నలూరి బ్రదర్స్ బ్యానర్‌పై నిర్మాతలలో ఒకరైన వసంతకుమార్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో 1959లో రూపొందించిన జానపద చిత్రం ‘దైవబలం’. తరువాత వీరు 1966లో ‘పాదుకా పట్ట్భాషేకం’, 1973లో ‘పూలమాల’ చిత్రాలు నిర్మించారు.
దైవబలం చిత్రం 1959 సెప్టెంబర్ 17న విడుదలై 60ఏళ్లు పూర్తి చేసుకుంది.
యన్టీఆర్, జయశ్రీ (జయచిత్ర తల్లి.. అసలు పేరు అమ్మాజి) కాంబినేషన్‌లో వసంత్‌కుమార్‌రెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో ‘దైవబలం’ రూపొందింది. ఛాయాగ్రహణం: బిజె రెడ్డి
శబ్దగ్రహణం: కణ్ణన్
కళ: వాలి
సంగీతం: అశ్వద్ధామ
నేపథ్య సంగీతం: టీవీ రాజు
మాటలు, పద్యాలు: పరశురామ్
మేటి హాలాహలమ్మును మ్రింగవచ్చు/ ప్రళయ కాలాగ్నిలో బడి బ్రతుకవచ్చు/ ఎంత బలవంతుడైన.. తానెవ్వడైన/ దైవబలమును కాదనతరముగాదు. పరశురామ్ రచించిన ఈ పద్యాన్ని ఘంటసాల గానం చేశారు. ఈ పద్యంలోని సత్యాన్ని నిరూపించే కథతో రూపొందిన చిత్రం -దైవబలం.
మాళవ దేశ మహారాజు ఉగ్రసేనుడు (గుమ్మడి). అతని కుమార్తె రూప. ఆమె జాతకం చూసిన జ్యోతిష్యులు.. ఓ సామాన్యుడు ఆమెకు భర్త అవుతాడని చెబుతారు. విధి లిఖితాన్ని మార్చాలని ఉగ్రసేనుడు ప్రయత్నిస్తాడు. జ్యోతిషులను పంపించేసి, ఆ లక్షణాలుకల బాలుడు చంద్రసేనుని కనిపెడతారు. ఆ బాలుని తల్లి (మాలతి) వద్దనుంచి తెచ్చి వధించమని తలారులను మహారాజు ఆజ్ఞాపిస్తాడు. ఆ బాలుని తలారులు వదిలిపెట్టడంతో, అతడు తల్లితో కలిసి ఓ గురువు ఆశ్రయంలో ఆశ్రమవాసిగా పెరిగి సకల విద్యలు నేరుస్తాడు. ఒకనాడు రాకుమారి రూప (జయశ్రీ)ని కలిసిన చంద్రసేనుడు (యన్టీ రామారావు) ఆమె అనురాగం పొందుతాడు. రాకుమారి స్వయంవరానికి ఏర్పాటు చేసిన పోటీలలో పాల్గొని విజయం సాధిస్తాడు. అతడెవరో నిజం తెలుసుకున్న ఉగ్రసేనుడు అతన్ని భూతమందిరంలో బంధించగా, చంద్రసేనుడు అతన్ని వధించి రూప చెలికత్తె (బాల) సాయంతో తప్పించుకొని మృత్యుమందిరం చేరతారు. అక్కడ గంధర్వుని పత్ని, భర్త శాప విమోచనం కోసం సంగీత వృక్షాన్ని కోరుతుంది. కంకాక్షుడు (ముక్కామల) అనే రాక్షసరాజు వద్దనున్న సంగీత వృక్షాన్ని అతి ప్రయాసతో సాధించి, తనను ప్రేమించాననే కంకాక్షుని కుమార్తె (గిరిజ) వలపునుండి తప్పించుకుని రూపతోసహా చంద్రసేనుడు మాళవ రాజ్యం చేరతాడు. చంద్రసేన రూపలను బంధించి ఉరిశిక్ష విధించిన మహరాజు ఉగ్రసేనుడు, తన ఆలోచన మార్చుకొని ఇద్దరికీ వివాహం జరిపించి.. దైవ నిర్ణయాన్ని ఎంతటివారికైనా తప్పింపరాదన్న నిజాన్ని వెల్లడించటంతో చిత్రం ముగుస్తుంది.
ఈ చిత్రంలో చంద్రసేనుని బంధించిన వారికి రాశులలో బంగారం ఇస్తారన్న రాజు ప్రకటనతో అతన్ని బంధించటానికి యత్నించిన టక్కు, టమారాలుగా రేలంగి, రమణారెడ్డి నటించారు. యన్టీఆర్ మిత్రుడు, ఆశ్రమవాసిగా కస్తూరి శివరావు నటించగా, ప్రముఖ నటుడు శోభన్‌బాబు మృత్యుమందిరంలో (కావలివానిగా, గంధర్వుల కుమారునిగా) నటించారు. అతని తల్లిగా మోహన.. ఇంకా అనేకమంచి ఇతర పాత్రలు పోషించారు.
దర్శకులు వసంతకుమార్‌రెడ్డి కథానుగుణంగా సన్నివేశాలను తీర్చిదిద్దటంలో చాకచక్యం చూపించారు. ఓ జానపద చిత్రానికి తగిన విధంగా అన్ని అంశాలను మేళవించటం కనిపిస్తుంది. హీరో స్వయంవర పోటీల్లో అన్ని విన్యాసాల్లో పాల్గొనటం; రథాలమీద గుర్రాల మీద పోరాటాలు; భూతమందిరంలో.. తెలివిగా భూతం కాలిలోని కన్ను నొక్కి అంతం చేయటం; ఉగ్రసేనునినుంచి పారిపోయి మృత్యుమందిరం చేరిన రూపను పూవుగా మారిస్తే.. గంధర్వుని నుంచి ఆమెను రక్షించటానికి కంకాక్షుని రాజ్యంచేరిన చంద్రసేనుడు అతనితో చేసే పోరాటాలు; అక్కడ బందీకావటం; రూపతోసహా పారిపోతూ కంకాక్షునితో గుహలో జరిపిన పోరాటం; కంకాక్షుని ప్రాణంవున్న జీవిని పట్టి రూప వధించటం; హాస్యంకోసం రేలంగి, రమణారెడ్డిలపై ఓ పాట, సన్నివేశాలు, తల్లినుంచి చిన్నతనంలో చంద్రసేనుడు విడిపోయినపుడు విషాద గీతాన్ని అడవిలో తల్లీబిడ్డలపై చిత్రీకరణ -లేనే లేదా రానే రాదా బాబును చూసే భాగ్యము (తల్లి, బాలుడు చంద్రపై).. లేనే లేదా రానే రాదా అమ్మను చూసే భాగ్యము (రచన: సీనియర్ సముద్రాల, గానం: వైదేహి). చిత్రం చివరలో కూతురును బంధించిన మహారాజు ఉగ్రసేనునికి ఆమె బాల్యంలో తండ్రితో ప్రహ్లాదుని వృత్తాంతము గురించి చేసిన చర్చ గుర్తుకువచ్చి.. కూతురు రూపకోసం కారాగారం వద్దకు వచ్చి ఆమెను, చంద్రసేనుని విడిపించి, వారికి వివాహం జరుపనిశ్చయించి ‘దైవబలం’ గూర్చి వివరించటం, రాజులోని మానసిక పరివర్తన, మార్పునకు సంకేతంగా ఆ సన్నివేశాన్ని రూపొందించటం అర్ధవంతంగా నిలిచింది.
చిత్రంలో చంద్రసేనునిగా యన్టీ రామారావు పాత్రోచితం, పలు వైవిధ్య సన్నివేశానుగుణంగా నటన ప్రదర్శించారు. అతని జోడి రూపగా జయశ్రీ తన పాత్రకు తగిన నటనతో అలరించింది. చిత్రంలో వారిరువురిపై చిత్రీకరించిన నేటికీ అలరించే యుగళ గీతం -అందాల ఓ చందమామ రావోయి (గానం: పిబి శ్రీనివాస్, ఎస్ జానకి; రచన: అనిశెట్టి). హవాయిన్ గిటార్ బేస్‌తో పాట సాగుతుంది. చిత్రంలో పద్యాలు, పాటలు 14పైగా ఉన్నాయి. వాటిలో కొన్ని రమణారెడ్డి, రేలంగిలపై హాస్య గీతం -కొడితే కోస్తాలే కొట్టాలి ఒరే చిచ్చరపిడుగా (రచన: కొసరాజు, గానం: పిఠాపురం, మాధవపెద్ది). గిరిజపై చిత్రీకరించిన గీతం -జీవితం ఎంతో హాయి.. ఈ యవ్వనమే (గానం: వైదేహి, రచన: అనిశెట్టి). -చిరు చిరు నవ్వుల పువ్వుల మురిసే యుగళ గీతం యన్టీఆర్, జయశ్రీలపై (గానం: పిబి శ్రీనివాస్, ఎస్ జానకి, రచన: అనిశెట్టి), మరో గీతం -నిను వరియించి మదికరగించి (గానం: పిబి శ్రీనివాస్, జానకి; రచన: అనిశెట్టి) అశ్వద్దామ సంగీతంతో అలరించేలా రూపొందాయి.
దైవబలం చిత్రం స్క్రీన్‌ప్లే, ఫొటోగ్రఫీ, సంగీతం, నటీనటుల అభినయంపరంగా అలరించేలా రూపొందినా.. అంతగా ఆర్థిక విజయం సాధించలేదు. ‘అందాల ఓ చందమామ’ గీతం విన్నపుడల్లా మాత్రం ఈ చిత్రం గుర్తుకు రావటం.. ఓ మంచి జ్ఞాపకంగా మిగలటం హర్షణీయాంశం.

కాలువ నీటిని తరలించవద్ద

$
0
0

వలిగొండ, సెప్టెంబర్ 21: మండలంలోని వెలువర్తి చెరువులో నుండి దిగువకు వెళ్లే కాలువకు పైపులైన్ వేసి నీటిని తరలించవద్దంటూ పలుగ్రామాల రైతులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే భీమలింగం కాలువ ద్వారా నిండే వెలువర్తి చెరువు నుండి మొగిలిపాక చెరువును నింపేందుకై మొగిలిపాక రైతులు పైపులైన్‌లను వేసేందుకై వెలువర్తి చెరువు నుండి బయటకు వచ్చే కాలువ వద్ద పనులకై ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అయితే కాలువకు పైపులైన్‌లు వేసి దిగువ ప్రాంత రైతులకు నీటిని రాకుండా చేస్తున్నారని పాలడుగు, కూరెళ్ల, పల్లెర్ల, లింగరాజుపల్లి, నర్సపురం, ముద్దాపురం, వెంకటాపురం, చిత్తాపురం గ్రామాల రైతులు ప్రారంభోత్సవం వద్దకు రావడం జరిగింది. దీనితో కొద్దిసేపు రైతుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా దిగువ గ్రామాల రైతులు మాట్లాడుతూ కాలువకు పైపులైన్‌లు వేసుకోవద్దని తమకు నష్టం కలిగించవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సామరాంరెడ్డి, ఉప్పల్‌రెడ్డి, వెంకటనర్సయ్య, సోలిపురం మల్లారెడ్డి, మరిపట్ల యాదయ్య, విఠల్‌రెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
చెరువులో నుండే పైపులైన్ వేసుకుంటాం
కాలువ దిగువ ప్రాంత రైతులు భావిస్తున్నట్లు తాము కాలువ నుండి పైపులైన్ వేసుకోవడంలేదని చెరువులో నుండే తమ చెరువును నింపుకోవడానికి వేసుకుంటామని మొగిలిపాక గ్రామానికి చెందిన ముద్దసాని కిరణ్‌రెడ్డి, గ్రామస్తులు అన్నారు. వెలువర్తి చెరువు నిండి అలుగు పోసినప్పుడే తాము నీటిని పంపింగ్ చేస్తామని తమ చెరువు నిండగానే పంపింగ్‌ను నిలిపివేస్తామని తమకు కేవలం భూగర్భ జలాల పెంపుకోసమే చెరువును నింపుకుంటున్నామని దీనిని దిగువ ప్రాంత రైతులు గమనించి, సహకరించాలని కోరారు.

Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>