కట్టంగూర్, సెప్టెంబర్ 21: గ్రామాల్లో ఏళ్ల తరబడిగా పేరుకుపోయిన సమస్యలకు ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యచరణ కార్యక్రమంతో పరిష్కరమవుతున్నాయి. ఎన్ని సార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్న స్పందించక పోగా ఈకార్యక్రమం ద్వారా చేపడుతున్నారు. మండలకేంద్రంలో నిరంతరం రద్దీగా ఉండే ఈదులూరు రోడ్డులోని ఎన్జీబీ బ్యాంకు, కృష్ణాజలాల ట్యాంకుల వద్ద రోడ్డు గుంతలమయమై పలు గ్రామాలకు వెళ్లే ప్రజలు నిత్యం నరకయాతనకు గురయ్యేవారు. ఇదే రోడ్డున అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నిత్యం వెళ్లే అధికారులు సైతం పట్టించుకోలేదు. అయితే ప్రత్యేక కార్యాచరణలో భాగంగా గ్రామంలో పర్యటించిన అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్య తీవ్రతను గుర్తించి తక్షణమే పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. డీపీవో విష్ణువర్ధన్రెడ్డి, డీఎల్పీవో ప్రతాప్నాయక్, గ్రామ నోడల్ అధికారి, పీఆర్ ఎఈ మహ్మద్ జమీల్ అహ్మద్, పంచాయతీ కార్యదర్శి సుందర మురళీమోహన్లు నిన్న సందర్శించి శనివారం ప్రత్యేక చొరవతో కంకర, మట్టితో గుంతలు పూడ్చి సమస్యకు పరిష్కరం చూపారు. దీంతో పలు గ్రామాల ప్రజలు ప్రత్యేక పథకం ద్వారా తమ వెతలు తీరాయంటూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
ప్రత్యేక ప్రణాళికతో సమస్యల పరిష్కారం
అది అక్రమ నిర్మాణమే..
అమరావతి, సెప్టెంబర్ 21: ఉండవల్లిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి మరోసారి సీఆర్డీఏ అధికారులు నోటీసులు అంటించారు. గత రెండు నెలల క్రితం రాజకీయ దుమారం రేపిన ఈ వివాదం మరింత ముదరుతోంది. నదీ పరివాహక ప్రాంతంలో గరిష్ఠ వరద నీటిమట్టం లోపల ఈ భవనాలను నిర్మించారని మొత్తం 1.318 ఎకరాల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్, స్విమ్మింగ్పూల్, డ్రెస్సింగ్ రూం నిర్మాణాలన్నీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని, వరద నీటిమట్టానికి 30 మీటర్ల లోపే స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారని రాజధాని ప్రాధికార అభివృద్ధి సంస్థ (సీఆర్డీఎ) నోటీసులో వివరించింది. వరద నీటి ప్రవాహానికి 100 మీటర్ల పైబడి అదీ రివర్ కన్జర్వేషన్ బోర్డ్తో పాటు తగిన అనుమతులు ఉంటేనే నిర్మించాలని స్పష్టం చేసింది. దీంతో పాటు వరద నీటి కరకట్ట 22 మీటర్ల ఎత్తున ఉందని, దాని దిగువన నిర్మాణాలు చేపట్టరాదని గుర్తుచేసింది. కృష్ణానదీ తీరాన ఉండవల్లిలో అక్రమ కట్టడాలను తొలగించాలని గత మూడు నెలల క్రితమే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రజావేదికను అధికారులు కూల్చివేశారు. నదీ తీరాన ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటినీ తొలగించాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని ఎస్టేట్స్ భవనానికి ఈ ఏడాది జూలై 12వ తేదీన మొదటి సారిగా నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు.
విత్తనాలపై భారీగా రాయతీలు
బిజినేపల్లి, సెప్టెంబర్ 21: గతంలో ఎన్నడూలేని విధంగా వేరుశనగ విత్తనానికి భారీ రాయితీ ఇవ్వడం జరిగిందని, రైతులు విత్తనాన్ని దుర్వినియోగం చేయవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నింరజన్రెడ్డి అన్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయం ఆవరణలో రాయితీ వేరుశనగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో కే6 రకానికి రూ.13వేలు క్వింటాలుకు ఉంటే ప్రభుత్వం రైతుకు రాయితీపై రూ.5వేలకు ఇస్తున్నదని, 44.44శాతం సబ్సిడీపై ఇస్తున్నదని గతంలో ఎన్నడూ ఇంత రాయితీ ఇవ్వలేదని, రైతులు ఇట్టి విత్తనాలను దుర్వినియోగం చేయవద్దన్నారు. ఎవ్వరైన దళారులు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేరుశనగలో ఎన్నో ఉప ఉత్పత్తులు వస్తాయని, నూనెగింజల పంటలలో వేరుశనగ ప్రధాన పంటగా మారిందని, ప్రభుత్వం దీనికి అధిక ప్రాధాన్యతను ఇచ్చి ఎన్నో పరిశోధనలను చేస్తుందన్నారు. ప్రస్తుతం ఎకరాకు 13 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నదని, దానిని 20 క్వింటాళ్ల దిగుబడివచ్చేలా వ్యవసాయ శాస్తవ్రేత్తలు పరిశోధనలు చేస్తున్నారని అన్నారు. రైతులందరికి సరిపడ విత్తనాలు వస్తాయని ఆందోళన చెందవద్దన్నారు. గుజారత్, అనంతపూర్, కడప జిల్లాలో వారం రోజులలో వేరుశనగ పంట చేతికి వస్తుందని అప్పుడు ప్రభుత్వం సరిపడ విత్తనాన్ని అందిస్తుందన్నారు. ఎంపీ పోతుగంటి రాములు మాట్లాడుతూ కోనసీమను తలపించేలా సీఏం కేసీఆర్ పాలమూరును చేస్తున్నారని, రైతు క్షేమంగా ఉంటే రాష్ట్రం సుభీక్షంగా ఉంటుందని అన్నారు. దానిని దృష్టిలో ఉంచుకొని దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఇవ్వని ప్రోత్సాహం వ్యవసాయ రంగానికి సీఏం కేసీఆర్ ప్రాధాన్యతను ఇస్తున్నారని అన్నారు. బడ్జేట్లో 30శాతం నిధులు వ్యవసాయ రంగానికే కేటాయిస్తున్నారని అన్నారు. రాబోయే రోజులలో తెలంగాణ విత్తనభాండగారంగా మారి ప్రపంచ దేశాలకు విత్తనాన్ని ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతుందన్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి మాట్లాడుతూ గత నెలలో యూరియా కొరత ఏర్పడితే వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి ప్రత్యేక శ్రద్ద తీసుకొని విశాఖ పోర్టుకువెళ్లి త్వరతగతిన వచ్చేలా ఏర్పాట్లు చేసి పంపిణీకి చర్యలు తీసుకున్నారని అన్నారు.సీఎం కేసీఆర్ కల్తీలేని ఆహార పదార్థాలను ప్రజలకు అందించాలని కృతనిశ్చయంతో ఉన్నారని అన్నారు. రైతు సమస్యలు తెలిసిన సీఎం ఉండటం రాష్ట్రం చేసుకున్న అదృష్టమన్నారు. వేరుశనగతో చేసిన పదార్థాలలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయని, రాబోయే రోజులలో వేరుశనగ ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉంటుందన్నారు. త్వరలోనే మార్కెండేయ రిజర్వాయర్ నిర్మాణ సర్వేను పూర్తి చేసి మండలంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ పద్మావతి, జడ్పీటీసీ హరిచరణ్రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్గౌడ్, సింగిల్విండో అధ్యక్షులు వెంకటస్వామి, మార్కెట్యార్డు కమిటి చైర్మన్ దొడ్ల ఈశ్వర్రెడ్డి, ఎంపీటీసీలు మంగి విజయ్, చిన్నారెడ్డిలతోపాటు సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ తెరపైకి వర్గాల కుంపట్లు

మహబూబ్నగర్, సెప్టెంబర్ 21: మళ్లీ తెరపైకి కాంగ్రెస్ గ్రూప్ కుంపట్లు వచ్చేశాయి. గ్రూపులకు నిలయంగా మారిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆ కారణంగా చాలా మంది కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ల మధ్య వార్ మొదలైంది. రేవంత్రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని వంగూర్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నేతగా ఉన్నారు. అయితే ఈయనకు ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా తనకంటూ ఓ వర్గం ఉంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నేతలను, ముఖ్యమంత్రితో సహ అందరిని సందర్భం వచ్చినప్పుడల్లా తుప్పారా పడుతున్నారు. దాంతో రేవంత్రెడ్డి క్రేజ్ కాంగ్రెస్ పార్టీలో ఓ స్థాయికి ఎదిగిపోయింది. ఆయనను కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ రాష్ట్రంలో బడా నేతగా భావిస్తున్నారు. ఇదే తరహలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ రాజకీయ ఒనమాలు కాంగ్రెస్ నుండి కావడంతో ఆయనకు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఫాలొయింగ్ ఉంది. ఈ ఇద్దరిని ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు యువనేతలుగా భావిస్తున్నారు. సంపత్కుమార్ ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈయనకు రాహుల్గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సినియర్ నాయకులతో కూడా పరిచయాలు ఉన్నాయి. ఇవన్ని ఎలా ఉనప్పటికిని రేవంత్రెడ్డి, సంపత్కుమార్లు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వారు. ఈ నేపథ్యంలోనే నల్లమల అటవీ ప్రాంతంలో యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా హైదరాబాద్లో నిర్వహించిన ఓ సమావేశం ఈ ఇద్దరి నేతల మధ్య బేదాభిప్రాయాలను సృష్టించింది. వీరిద్దరితో పాటు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి కార్యదర్శి వంశీచంద్రెడ్డి కూడా ఈ గ్రూపుల్లో చిక్కుకున్నారు. యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశం జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య గ్రూపుల కుంపట్లు తెరపైకి తీసుకువచ్చింది. జనసేన అధినేత పవన్కళ్యాణ్ దగ్గర ఫోటోలకు అవకాశం దక్కలేదని యూరేనియంపై ఏబిసిడిలు కూడా సంపత్కు తెలియదని రేవంత్రెడ్డి అనడం అదేవిధంగా సంపత్కుమార్, చల్లా వంశీచంద్రెడ్డి కూడా ఆ సమావేశం గురించి రేవంత్పై విమర్శలు గుప్పించడంతో వీరిమధ్య ఉన్నటువంటి బేధాభిప్రాయాలు భగ్గుమన్నాయి. ఇటివల రేవంత్రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి సోనియాగాంధీని కలువగా రెండుమూడు రోజులకే సంపత్కుమార్, చల్లా వంశీచంద్రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీని కలువడంతో అప్పటి నుండే ఈ ముగ్గురి నేతల మధ్య గ్రూపులు బయటపడ్డట్లు వెల్లడైంది. అయితే ఇటివల జరిగిన పరిణామాలపై రేవంత్రెడ్డి, సంపత్కుమార్పై, వంశీచంద్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు వంశీచంద్రెడ్డి మాత్రం స్పందించలేదు. కాగా సంపత్కుమార్ మాత్రం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు స్పందించారు.
ఇలా రేవంత్, సంపత్ల మధ్య మాటల వేడి ప్రారంభం కావడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్లో మళ్లీ గ్రూపుల కుంపట్లు తెరపైకి వచ్చాయి. ఈ కారణంగా నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాలతో పాటు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో కూడా కాంగ్రెస్ శ్రేణులు డైలమాలో పడ్డారు. ఈ ఇద్దరు యువనేతలు పరస్పరంగా మాటల తూటాలు పెల్చుకోవడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్లో మరో కుంపటి మొదలైందని కొందరు కాంగ్రెస్ సినియర్ నాయకులు చర్చించుకుంటున్నారు. రేవంత్రెడ్డి, సంపత్ల మధ్య నెలకొన్న వార్ ఎటువైపు దారి తీస్తుందోననే చర్చ మాత్రం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఊపందుకుంది.
*చిత్రాలు.. ఎంపీ రేవంత్ రెడ్డి
*ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్
కాంగ్రెస్కే ఓటేయండి

నేరేడుచర్ల, సెప్టెంబర్ 21: హుజూర్నగర్ ఉప ఎన్నిక తీర్పుపై రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉందని పీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం నేరేడుచర్లలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల సందీప్రెడ్డి గృహంలో పలువురు కాంగ్రెస్పార్టీలో చేరిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ నేడు హుజూర్నగర్ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించనున్నందున మాజీ మంత్రి, సీఎల్పీ మాజీ నాయకుడు కుందూరు జానారెడ్డి పాల్గొన్న ఈ సమావేశంతోనే ఉప ఎన్నిక ప్రచారం ప్రారంభం కావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అవినీతి అధికారానికి, అహకారంపై, నీతి, నిజాయితి, చిత్తశుద్ధికి మధ్య హుజూర్నగర్ ఉప ఎన్నిక పోటీ జరుగుతుందన్నారు. రాష్ట్రం మొత్తం హుజూర్నగర్ ఎన్నికవైపే చూస్తుందని, ఎన్నికల్లో అధికారపార్టీ పంపిణీ చేసే డబ్బును, మద్యాన్ని తీసుకోని ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేయాలన్నారు. 30వేల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమంలో పాల్గొన్నవారికి టికెట్ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. గతంలో హుజూర్నగర్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండేదని నేడు గ్రామగ్రామ ఘర్షణలు, పోలీసుల అక్రమ కేసులతో, వేధింపులతో ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నేరేడుచర్ల మండలంలో రహదారుల అభివృద్ధి పనులు, విద్యుత్ సబ్స్టేషన్లు, తాగునీటి సమస్యలు పరిష్కరించింది తానేనని, ప్రస్తుత పాలకులు తట్టెడు మట్టిని కూడా పోయలేదని విమర్శించారు. డబుల్బెడ్రూం గృహాలు మంజూరు చేయకపోవడమే కాక నిర్మించిన ఇందిరమ్మ గృహాలకు కూడా నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. నేరేడుచర్లలో రహదారి విస్తరణలో పేద ప్రజల నివాస గృహాలు తొలగింపును ఖండిస్తామన్నారు. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, ఈ ఎన్నిక భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు మార్గదర్శకం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్పార్టీ గెలుపుతో కేసీఆర్ అహంకారానికి అడ్డుకట్ట వేయడానికి దోహదపడుతుందన్నారు. వివిధ పార్టీలకు చెందిన వారు, తటస్థంగా ఉన్నవారు కాంగ్రెస్పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. ఆశించిన స్థాయిలో రాష్ట్రంలో పాలన కొనసాగడంలేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కీలకంగా పనిచేశామన్నారు. ఉద్యమం సమయంలో కేసీఆర్ను అరెస్ట్ చేసిన తెలంగాణ రాష్ట్రం కోసం విడిపించామని గుర్తు చేశారు. ఆరు సంవత్సరాల్లో కేవలం 20వేల డబుల్బెడ్రూంలను మాత్రమే నిర్మించారని, పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్పార్టీనేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన సాగర్ ప్రాజెక్టు వలనే పేద ప్రజలకు ఉపాది లభిస్తుందన్నారు. నిరుద్యోగ భృతి, రుణమాఫి ఊసేలేదని ఆరోపించారు. గతంలో సాయుధపోరాటంలో పోలీసులను ఎదిరించిన సంఘటనను గుర్తు చేసుకోని నేడు ఉద్యమించాలన్నారు. ఉప ఎన్నిక పరిష్కారం కాని ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి హెచ్చరిక కావాలన్నారు. మొదట కాంగ్రెస్పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. సమావేశంలో సూర్యాపేట, నల్లగొండ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్, శంకర్నాయక్, పాలకీడు ఎంపీపీ భూక్యా గోపాల్, బెట్టెతండా సర్పంచ్ మోతీలాల్, కాంగ్రెస్ నాయకులు వల్లంశెట్ల లచ్చయ్య, బచ్చలకూరి ప్రకాశ్, రామారావు, కోడిద మనోజ్, రామకృష్ణారెడ్డి, ఉరిమళ్ల రాధాకృష్ణ, బైరెడ్డి జితేందర్రెడ్డి, నాగిరెడ్డిలు పాల్గొన్నారు.
*చిత్రం...నేరేడుచర్లలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి
శ్రీశైలం నుంచి నీరు విడుదల

శ్రీశైలం ప్రాజెక్టు, సెప్టెంబర్ 21: శ్రీశైలం రిజర్వాయర్కు ఎగువ నుంచి వస్తున్న వరదనీరు సమాంతరంగా వస్తుండటంతో ప్రాజెక్టులోని మూడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం సాయంత్రం ఆరుగంటల సమయానికి జూరాల నుంచి వరద గేట్ల ద్వారా 29,910 క్యూసెక్కులు, విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ను ఉత్పత్తిచేస్తూ 45,207 క్యూసెక్కులు, సుంకేసుల డ్యాం నుంచి 44,460 క్యూసెక్కులు మొత్తం లక్షా 19,568 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్లోకి వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ 26,850 క్యూసెక్కులు, భూగర్భ విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ 40,259 క్యూసెక్కులు, కేఎల్ఐ ద్వారా 1600 క్యూసెక్కులు, హంద్రీనీవా కాలువ ద్వారా 2026క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటర్ ద్వారా 5వేల క్యూసెక్కులు, ప్రాజెక్టు గేట్లు మూడు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 83,949 క్యూసెక్కులు మొత్తం లక్షా 60వేల 333 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
గడిచిన 24 గంటలలో కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 13.039 మిలియన్ యూనిట్లు, భూగర్భ విద్యుత్ కేంద్రం ద్వారా 19.944 మిలియన్ యూనిట్లు మొత్తం 33.083 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ గ్రిడ్కు అందించారు. శనివారం సాయంత్రానికి రిజర్వాయర్లో గరిష్ట నీటిమట్టం 885 అడుగులకుగాను 884.80 అడుగులుగా, గరిష్ట నీటి నిలువ 215టీఎంసీలకుగాను 214.3637 టీఎంసీలుగా నమోదై ఉన్నది.
*చిత్రం...శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మూడుగేట్లతో నీటిని విడుదల చేస్తున్న దృశ్యం.
50 టీఎంసీలకు చేరువగా ఎస్సారెస్పీ

నిజామాబాద్, సెప్టెంబర్ 21: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ రిజర్వాయర్కు వరదనీరు పోటెత్తుతోంది. స్థానికంగానే కాకుండా ఎగువన మహారాష్టల్రోనూ గడిచిన రెండుమూడు రోజుల నుండి ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షాలతో ఎస్సారెస్పీలోకి వరద జలాలు పెద్దఎత్తున వచ్చి చేరుతున్నాయి. దీంతో ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి వడివడిగా చేరువవుతోంది. శనివారం సాయంత్రం నాటికి ఎగువ ప్రాంతాల నుండి 58వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని, ఇన్ఫ్లో ఇదేవిధంగా కొనసాగితే సెప్టెంబర్ నెలాఖరులోపే ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి మట్టాన్ని సంతరించుకునే అవకాశాలు లేకపోలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే ఎస్సారెస్పీ విషయంలో మరోమారు సెప్టెంబర్ సెంటిమెంటు ఫలించినట్లవుతుంది. భారీగా వచ్చి చేరుతున్న ఇన్ఫ్లోలతో ప్రతీ మూడు గంటలకు ఒక టీఎంసీ వరకు నీటి నిల్వలు పెరుగుతుండడం ఈ అంచనాలకు ఆస్కారం కల్పిస్తోంది. రిజర్వాయర్ ఎగువ ప్రాంతాలైన నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో కురుస్తున్న వర్షాలతో పాటు మహారాష్టల్రోని విష్ణుపురి, అమ్దురా, బలేగాం, బాబ్లీ ప్రాజెక్టుల మిగులు జలాలు తోడవడంతో ఎస్సారెస్పీలోకి 58వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. దీంతో 1091.00అడుగులు, 90టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్లో, శనివారం సాయంత్రం నాటికి 1077.90అడుగులు, 47.10టీఎంసీలకు నీటిమట్టం చేరుకుంది. శుక్రవారం సాయంత్రం వరకు కూడా 1074.80 అడుగులు, 39.238 టీఎంసీల వద్దే నీరు నిలిచి ఉండగా, 24గంటల వ్యవధిలోనే దాదాపు ఎనిమిది టీఎంసీల వరకు వరద జలాలు రిజర్వాయర్లోకి వచ్చి చేరాయి. మరో 36గంటల పాటు ఇదే తరహాలో ఇన్ఫ్లోలు కొనసాగే అవకాశాలుండడం వల్ల ఈసారి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం ఇదే రోజున రిజర్వాయర్ నీటిమట్టం 1084.50అడుగులు, 65.294టీఎంసీల వద్ద నిల్వ ఉందని ఏ.ఈ మహేందర్ తెలిపారు.
*చిత్రం...వడివడిగా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువవుతున్న శ్రీరాంసాగర్ రిజర్వాయర్
శ్రీలంకతో సిరీస్కు పాక్ జట్టు ఎంపిక
కరాచీ, సెప్టెంబర్ 21: ప్రపంచకప్లో పేలవమైన ఆటతీరుతో గ్రూప్లోనే టోర్నీ నుంచి నిష్రక్రమించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయ. మెగా టోర్నీ తర్వాత తొలి సిరీస్ ఆడుతున్న పాక్ జట్టుకు చీఫ్ సెలక్టర్, హెడ్ కోచ్గా మాజీ ఆటగాడు మిస్బావుల్ హక్ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నియమించింది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిస్బా బలమైన జట్టును ఎంపిక చేసినట్లు పేర్కొన్నాడు. ఈ సీరిస్లో సీనియర్ ఆటగాడు మహ్మద్ హఫీజ్ను పక్కనబెట్టారు. మరోవైపు ఇటీవల పేలవ ఫాంతో తంటాలు పడుతున్న మహ్మద్ అమీర్కు చోటు కల్పించాడు. శనివారం ఎంపిక చేసిన జట్టులో ఐదుగురు కొత్త ఆటగాళ్లను తీసుకున్నారు. ఈ సందర్బంగా మిస్బా మాట్లాడుతూ ‘మేం బలమైన జట్టును ఎంపిక చేయాలని భావించాం. అందుకే ఐదుగురుకొత్త వాళ్లను ఎంపిక చేశాం. ఇందులో నలుగురు ప్రపంచకప్కు ఆడాల్సిన వాళ్లే. కానీ వారికి అవకాశం దక్కలేదు. అన్ని విభాగాల్లో పాక్ బలంగా ఉంది. పరిస్థితులకు తగ్గట్లు ఆడితే పాక్దే విజయం’ అని పేర్కొన్నాడు.
పాకిస్తాన్ జట్టు: సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్), బాబర్ అజమ్ (వైస్ కెప్టెన్), అబిద్ అలీ, ఆసిఫ్ అలీ, ఫఖర్ జామన్, హారీస్ సోహైల్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీమ్, ఇమాముల్ హక్, అమిర్, మహ్మద్ హస్నైన్, నవాజ్, రియాజ్, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ షిన్వారీ, వాహబ్ రియాజ్.
గ్రేవ్స్ అర్ధ సెంచరీ; ట్రైడెంట్స్ విజయం
సెయంట్ లూసియా, సెప్టెంబర్ 21: కరేబియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో సెయంట్ లూసియా జూక్స్ జట్టుపై బార్బడోస్ ట్రైడెంట్స్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచిన లూసియా జూక్స్ ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. దీంతో ట్రైడెంట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయ 172 పరుగులు చేసింది. ట్రైడెంట్స్ బ్యాట్స్మెన్లలో జస్టిన్ గ్రేవ్స్ (57), జొనథాన్ కర్టర్ (30), జాన్సన్ చార్లెస్ (28) రాణించారు. లూసియా జూక్స్ బౌలర్లలో కెస్రిక్ విలియమ్స్ 3 వికెట్లు తీయగా, ఒబెడ్ మెక్కాయ్ 2, రకీం కార్న్వాల్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన లూసియా జూక్స్ 101 పరుగులకే కుప్పకూలింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్మన్ హర్దస్ విజియన్ (31), కొలిన్ డీ గ్రాండ్ హోం (28) మాత్రమే రాణించడంతో 71 పరుగులతో పరాజయం పాలైంది. ట్రైడెంట్స్ బౌలర్లలో జోషువా బిషప్, జాసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, రేమన్ రిఫెర్, జోష్ లాలర్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
పంగల్కు రజతం

ఎక్టారిన్బర్గ్ (రష్యా), సెప్టెంబర్ 21: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్స్ టోర్నీలో భారత యువ బాక్సర్ అమిత్ పంగల్ రజతాన్ని సంపాదించాడు. ఈ మెగా టోర్నమెంట్లో రజతాన్ని కైవసం చేసుకున్న తొలి భారత బాక్సర్గా చరిత్ర సృష్టించాడు. ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ ఫైనల్కు చేరి, బంగారు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన పంగల్ ఉజ్బెకిస్తాన్ బాక్సర్ షఖోబిదిన్ జోయిరోవ్ చేతిలో 0-5తేడాతో ఓటమి చవిచూశాడు. ద్వితీయ స్థానానే్న సంపాదించినా ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్స్లో రజతాన్ని సంపాదించిన తొలి భారతీయుడిగా పంగల్ ఘన కీర్తినే దక్కించుకున్నాడు. తన కంటే ఎత్తులోనూ, శారీరక దారుఢ్యంలోనూ మెరుగైన రీతిలోనే ఉన్న ఉజ్బెక్ బాక్సర్పై చివరి వరకూ పంగల్ సర్వశక్తులూ ఒడ్డి పోరాడాడు. అయినా అంతిమ ఫలితంలో ఈ యువ కిశోరానికి కాంస్యమే దక్కింది. ఆసియా క్రీడల్లోనూ, ఆసియా చాంపియన్ షిప్స్లోనూ అద్భుతమైన ప్రతిభ కనబరిచి బంగారు పతకాలను సొంతం చేసుకున్న ఘనత కలిగిన పంగల్ రజతం సాధించడం కూడా ఓ చారిత్రక విజయంగానే పరిగణిస్తున్నారు. ఎదురుడానికి సంబంధించిన పోరులో ఇటు పంగల్ అటు జోయిరోవ్లు మొదటి మూడు నిముషాల్లో పరస్పరం ఎదుర్కోవడంలో తడబడ్డారు. రెండో రౌండ్లో పోటీ రసకందాయంలో పడింది. ప్రత్యర్థి లోపాలను విజయావకాశాలుగా మలుచుకోవడానికి పంగల్ శత విధాలా ప్రయత్నించాడు. దానికి తగ్గట్టుగానే ఉజ్బెక్ బాక్సర్ కూడా పోటీనిచ్చాడు. ఇక తుది పోరు అత్యంత ఉద్విగ్నంగా, ఆసక్తికరంగా సాగింది. నువ్వా నేనా అన్న రీతిలో ఇరువురు బాక్సర్లు తీవ్ర స్థాయిలోనే తలపడ్డారు. పంగాల్ తన శక్తినంతా కూడగట్టుకుని తీవ్రస్థాయిలోనే పోటీనిచ్చినా అంతిమంగా జోయిరోవ్దే పైచేయి అయింది. 0-5పాయింట్ల తేడాతో చాంపియన్షిప్ టోర్నీలో ఉజ్బెక్ బాక్సర్దే పైచేయి అయింది. 2017 ఆసియా చాంపియన్షిప్ పోటీలో కాంస్యం గెలుచుని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాటి నుంచి పంగల్కు ఎదురే లేదు.
*చిత్రం...అమిత్ పంగల్
పొట్టి సిరీస్పై కన్ను

బెంగళూరు: ప్రపంచకప్ తర్వాత కోహ్లీ సేన జైత్రయాత్ర కొనసాగుతోంది. వెస్టిండీస్ పర్యటన లో మూడు ఫార్మాట్లలో అదరగొట్టి, సిరీస్లు కైవసం చేసుకున్న టీమిం డియా స్వదేశంలోనూ అదే బాటలో పయణిస్తోంది. ఈసారి దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్పై కనే్నసింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ధర్మశాల వేదికగా జరగాల్సిన మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా, మొహాలీలో జరిగిన రెండో మ్యాచ్ను 7 వికెట్ల తేడాతో గెలుచుకుంది. ఆదివారం జరిగే చివరి టీ20 లో విజయం సాధించి, సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
ఓటమి ఫోబియా..
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే పొట్టి ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని ఇరు జట్లు ఈ సిరీస్ను ప్రతిష్టా త్మకంగా భావించి బరిలోకి దిగాయ. అయతే ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్లో గ్రూప్ స్టేజీ నుంచే టోర్నీ నుంచి నిష్క్రమించిన దక్షిణాఫ్రికా ఆ తర్వాత భారీ మార్పులతో భారత పర్యటనకు వచ్చిం ది. అయతే మొహాలీ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో కెప్టెన్ డికాక్తో పాటు టెంబ బవుమా మినహా మరెవరూ రాణించకపోవడంతో ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. గత మ్యాచ్లో అగ్రశ్రేణి బౌలర్లున్నా లక్ష్యాన్ని కాపాడులేకపోయంది. దీంతో సఫారీ జట్టుకు ఓటమి ఫోబియా పట్టుకున్నట్లయంది.
రోహిత్ రాణించేనా?
ప్రపంచకప్ అద్భుతంగా రాణించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు. కేవ లం ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే సాధించాడు. దక్షి ణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లోనూ కేవలం 12 పరు గులు మాత్రమే చేశాడు. అయతే టీ20 ప్రపంచకప్ దృష్ట్యా రోహిత్ తిరిగి తన ఫాంను కొనసాగిస్తే జట్టుకు ఒంటి చెత్తో విజయాన్ని అందిచగలడని అభిమానులు కోరుకుంటున్నారు. అయతే చినస్వామి స్టేడియంలో రోహిత్ మంచి రికార్డే ఉండడం విశేషం. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫాంను కొనసాగిస్తున్నాడు. గత మ్యాచ్ లో అర్ధ సెంచరీ సాధించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా టీ20ల్లో అత్యధిక అర్ధ సెంచరీలు, అత్యధిక పరుగులు చేసిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మిడిలార్డర్లో శ్రేయా స్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాతో పాటు లోయర్ ఆర్డర్లో రవీంద్ర జడేజాతో జట్టు బ్యాటింగ్ విభాగం లో బలంగానే కనిపిస్తోంది.
పంత్పైనే అందరి కళ్లు..
రేపు జరగబోయే చివరి టీ20 మ్యాచ్లో అందరి చూపు టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్పైనే ఉన్నాయ. వరుసగా విఫలమవుతున్నా పంత్ మాత్రం కనీసం ఇచ్చిన అవకాశాలను వినియోగించుకోవడంలో విఫలమవుతున్నాడు. ఆరంభంలో టెస్టుల్లో సెంచరీతో రాణించి అందరి చూపు తన వైపు తిప్పుకున్నా పంత్ పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం నిరా శ పరుస్తూనే ఉన్నాడు. అతడి ఫాంపై మాజీలతో పాటు అభి మానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బౌలింగ్ విభాగం లో సీనియర్లు జస్ప్రీత్ బుమ్రా, భువ నేశ్వర్ కుమార్ లేని లోటు ను కుర్రాళ్లు వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్ భర్తీ చేస్తున్నా రు. వీరికి తోడు జడేజా ఉండనే ఉన్నాడు. ఏదేమై నా పొట్టి సిరీస్ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.
జట్ల వివరాలు:
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ సైని.
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్ (కెప్టెన్), రస్సె వండర్ డుస్సెన్ (వైస్ కెప్టెన్), టెంబ బవుమా, జూనియర్ దాల, జోర్న్ ఫార్టిన్, బ్యూరన్ హెండ్రిక్స్, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్జ్, అండిలె ఫ్లెహ్లుక్వాయో, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబద, తబ్రెయజ్ షంసి, జాన్-జాన్ స్ముట్స్.
రాశిఫలం -09/22/2019
ఈ వారం తార

అవికా గోర్
*
ఫొటో బై రవికుమార్ చౌదరి
రేనాటి సూరీడా..

భారీతనానికి
టాలీ’తరం కేరాఫ్ అడ్రెస్సవుతోంది.
పాన్ ఇండియా సినిమాలన్నీ
ప్రాంతీయ భాషా పరిశ్రమ నుంచే ఉద్భవిస్తున్నాయని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తోంది. భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు చిత్రసీమ గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తోందంటే -కారణం వచ్చిన రెండూ మూడు పెద్ద చిత్రాల గురించి కాదు.. ఈ అనుసరణ ఎంతవరకూ కొనసాగగలదన్న అంశం గురించే.
నాలుగొందల కోట్ల పెట్టుబడితో రెండు భాగాల బాహుబలి ఆవిష్కృతమైనపుడు -యాధృచ్చికంగా జరిగిందనుకున్నారు. రెండేళ్లు తిరక్కుండా అంతే బడ్జెట్తో -సాహో వచ్చినపుడూ మళ్లీ అలాంటి సీన్ చూడలేంలే అనే అన్నారు. ఇప్పుడు సుమారు మూడొందల కోట్లతో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రెడీ అయినపుడు -టాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాల అనుసరణ ఎంతకాలం? అన్న విషయాన్ని ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనలకు నాంది పలుకుతోన్న చిత్రం సైరా.
పాన్ ఇండియా సినిమా మళ్లీ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదన్న మాట అప్పుడెలా వినిపించిందో ఇప్పుడూ అలానే వినిపిస్తుంది. కానీ, వచ్చే చిత్రాలు వస్తూనే ఉన్నాయి. ఇంకా వస్తాయి. వస్తూనే ఉంటాయనీ ధైర్యంగా చెప్పగలిగే పరిస్థితి టాలీవుడ్లో కనిపిస్తోంది.
సైరా.
భారత స్వతంత్ర తొలి పోరాటకర్త జీవిత కథ. బ్రిటీష్ పాలనపై కత్తిగట్టిన వీరుల చిత్రాలు టాలీవుడ్కు కొత్తకాదు. కాని -సిపాయి తిరుగుబాటుకు ముందే హింసాత్మకమార్గంలో కత్తిదూసిన అజ్ఞాత వీరుడి కథే సైరా. రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర పోషిస్తోన్న చిరంజీవి -తెలుగు సినీ కథానాయక చరిత్రకు కొత్త వెలుగునిస్తాడా? చూడాలి.
**
నటించడాన్ని -జీవించటం నుంచే మొదలెట్టాడు చిరంజీవి. పాత్రలోకి ఒదిగిపోయే ద్రావణంలా -తనవంతు పాత్రే పోషించాడు. అలా ఎన్నో పాత్రల్లోకి ఒదిగిపోయి -‘చిరంజీవి’గా మిగిలాడు కొణిదెల వరప్రసాద్. పదేళ్ల క్రితంనాటి కలను నెరవేర్చుకోడానికీ -సెకెండ్ ఇన్నింగ్స్లోనూ కాయకష్టానికి సిద్ధమైన చిరు ప్రస్థానాన్ని ‘సైరా’ వరకూ పరిశీలిద్దాం.
1978లో ‘ప్రాణం ఖరీదు’తో తెరంగేట్రం చేసిన చిరు, ‘మనఊరి పాండవులు’గా ఆడియన్స్కి దగ్గరైపోయాడు. వెండితెరపై 1988కే అంటే పదేళ్లలో యముడికి మొగుడుతో సెంచరీ కొట్టాడు చిరు. అవకాశాలు వెతుక్కునే స్థాయినుంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేస్థాయికి ఎదిగిన చిరంజీవికి ఒక దశలో పోటీ అన్నదే లేకుండాపోయింది. నాలుగు దశాబ్దాల కాలంలో తిరుగులేని హీరోగా నిలబడటానికి కారణం -చిరంజీవిలోని నటన ఒక్కటే కాదు, పరుగాపని తత్వం. ‘మెగా’ స్టార్డమ్ ఊరకనే రాలేదు. ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులన్నీ దాటాకే దక్కింది. చిరంజీవి చేసిన చిత్రాలన్నీ బ్లాక్బస్టర్లు, సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్టే కాదు. ఫ్లాపులున్నాయి. అట్టర్ఫ్లాప్లున్నాయ్. ఎన్నో చిత్రాలు యావరేజ్లు, అబౌ యావరేజ్లు, బిలో యావరేజ్ల దగ్గరా ఆగిపోయాయి. సంఖ్యాపరంగా చూస్తే -చిరంజీవి చిత్రాల్లో హిట్లు 53. సూపర్ హిట్లు కేవలం నాలుగే. ఇండస్ట్రీ హిట్లు ఐదు, ఫ్లాప్లు 41, అట్టర్ ఫ్లాప్లు 21, యావరేజ్లు 15, అబౌ యావరేజ్ 4, బిలో యావరేజ్ 8.
150 చిత్రాల్లో ఎన్నో చిత్రాలు తస్సుమన్నా -అది చిరంజీవి చిత్రం అన్న పేరు తెచ్చుకుంది. అదే మెగాస్టార్ను చేసింది.
ఇప్పుడు చిరంజీవికి హిట్టు ఫట్టుతో సంబంధం లేదు. ఏ సినిమా చేసినా -అది చిరంజీవి సినిమా అనే రేంజ్లోనే సెకెండ్ ఇన్నింగ్సూ మొదలవుతుంది. పూర్తి చారిత్రక చిత్రంలో తననుతాను చూసుకోబోతున్నాడు చిరు. అదే సైరా. టీజర్ సెనే్సషన్ అయ్యింది. ‘సూర్యుడివై వీరుడివై వెలుగే పంచావు’ అంటూ టైటిల్ సాంగ్ ఆడియన్స్ నాల్కల మీద ఆడుతోంది. ఇప్పటివరకు చిరంజీవికి కాస్ట్యూమ్ డ్రామా లేకపోయింది. కానీ సైరాతో అదీ ఫుల్ఫిల్ అయిపోతుంది. పదేళ్ల క్రితమే అనుకున్న కథ.. సుమారుగా మూడేళ్లు నిర్మాణం జరుపుకున్న సినిమా -సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తోంది సైరా.
కథను బలంగా చెప్పడానికి దేశంలో ఆరితేరిన నటులను తెచ్చిపెట్టుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా అమితాబ్ కనిపించనున్నాడు. ఝాన్సీ లక్ష్మిబాయిగా అనుష్క, రాజా పండి పాత్రలో తమిళ హీరో విజయ్ సేతుపతి, అవుకురాజుగా కన్నడ స్టార్ సుదీప్, దేశభక్తి కలిగిన లక్ష్మి పాత్రలో తమన్నా భాటియా, రాజ కుటుంబానికి చెందిన దేశభక్తుడు వీరారెడ్డిగా జగపతిబాబు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భార్య సిద్దమ్మగా నయనతార నటిస్తున్నారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి పెర్ఫార్మెన్స్పై ఆడియన్స్లో ఆసక్తి కనిపిస్తోంది. చారిత్రక నేపథ్యం కలిగిన చిత్రం, పైగా
సమరయోథుడి జీవిత కథ కనుక స్క్రిప్ట్వర్క్పై ఎక్కువ కష్టమే పెట్టామని చెబుతోంది చిత్రబృందం. నరసింహారెడ్డి జీవితాన్ని తెలుసుకోడానికి చెన్నై లైబ్రరీలో పుస్తకాలు అధ్యయనం చేశామని, తంగిరాల సుబ్బారావు రాసిన పుస్తకాలు, బ్రిటీషర్లు ప్రచురించిన గెజిట్లు.. ఉయ్యాలవాడ ఎక్కడెక్కడ తిరిగాడు, ఏ ప్రాంతంలో పోరాటాలు సలిపాడు, ప్రభుత్వం అతన్ని ఎక్కడ ఉరితీసింది.. ఇలాంటి విషయాలు సేకరించి ఉద్దంత రచయితల సహకారంతో స్క్రిప్ట్ పూర్తి చేశారని తెలుస్తోంది. ఇక యుద్ధ సన్నివేశాల కోసం జార్జియా నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో క్రొత్త ప్రపంచానే్న ఆవిష్కరించి, వెయ్యిమందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారని తెలుస్తోంది. హైదరాబాద్లోనూ భారీ సెట్స్వేసి చిత్ర నిర్మాణం పూర్తి చేశారు. పాన్ ఇండియా సినిమా కనుక తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు.
బాహుబలికి ఇది సమానస్థాయిలో ఉంటుందా? అంటే బాహుబలి రెండు భాగలూ జానపదాలు. కానీ ఇదొక వీరుడి యదార్థ జీవితగాథ. భారతదేశ చరిత్రలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం, బ్రిటీషర్లపై ఆయన తిరుగుబాట్లలోని కీలక ఘట్టాలు చిత్రంలో కనిపించనున్నాయి.
ఈ భారీ చిత్రానికి నిర్మాత -చిరంజీవి తనయుడు రామ్చరణ్. ‘కొణిదెల ప్రొడక్షన్స్’ బ్యానర్పై దాదాపు 250 కోట్ల నిర్మాణ వ్యయంతో పూర్తి చేశారు. దర్శకుడు సురేందర్రెడ్డి మూడేళ్ల సమయం తీసుకుని ఈ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించాడు. కథకు రచనా సహకారం, సలహాలు పరుచూరి బ్రదర్స్ అందిస్తే, మాటల్ని తూటాల్లా పేల్చే బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందించారు. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ ఒక ఎత్తు. రత్నవేలు దేశంలోని టాప్ టెన్ సినిమాటోగ్రాఫర్లలో ఒకరు. యాక్షన్ ఎపిసోడ్స్ని రామ్లక్ష్మణ్, సంగీతాన్ని అమిత్ త్రివేదీ సమకూర్చారు. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ -పవన్కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో అట్రాక్షన్.
కథ విషయానికొస్తే..
1857నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎదురు నిలిచినటువంటి విప్లవ వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. స్వాతంత్య్ర సంగ్రామంలో ఈయన పాత్ర పెద్దది. ఝాన్సీలక్ష్మీబాయి, భగత్సింగ్లకు తీసిపోని విప్లవకెరటం ఉయ్యాలవాడ. తన జీవితానే్న త్యాగం చేసిన వీరుడు చరిత్రలో కనుమరుగయ్యాడు. ఆయన కాలంలో జరిగిన తిరుగుబాట్లు, మిత్రులు, శత్రువులు, పరిస్థితులు, పోరాటాలు, గెలుపు ఓటములు, యుద్ధాలు జరిగిన విధానం, ఎందుకోసం ఆ తిరుగుబాటు జరిగింది, అజాత శత్రువులెవరు? అనే విషయాలనే తెరమీదికెక్కించడం జరిగింది. ఈయన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు. అయితే ఈయన కర్నూలు (రాయలసీమ) ప్రాంతానికి చెందినవాడు. అయినప్పటికీ కేవలం ప్రాంతానికే పరిమితం కాకుండా యాస, భాషలు కాస్త అందరికీ అర్థమయ్యేలా చిత్రంలోని మాటలు, పరిసరాలుంటాయి. నరసింహారెడ్డి ఈ సినిమా కథలో ఒక పాలెగాడు. అయినప్పటికీ దాదాపు 70మంది పాలెగాళ్లను తాటిమీదకుతెచ్చి రాజులమీద ఎదురుదాడి చేయడమే ఇందులోని సారాంశం.
మరో పది రోజుల్లో ఈ భారీ బడ్జెట్ చిత్రం విడుదల కానుంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న ‘సైరా’ -టాలీవుడ్ స్టామినాను ఎంత గొప్పగా చెప్పనుందో చూద్దాం.
ప్రకృతి ఒడిలో పూల పండుగ

సమైక్య జీవన విధానానికి, సామాజిక ఏకత్వానికి ప్రతీకలు మన పండుగలు. భారతదేశ చరిత్రకు, సంస్కృతికి, సంప్రదాయాలకు పండుగలే ప్రధానం. జాతి క్రమశిక్షణకు, ఆధ్యాత్మిక సరళికి ఆధారం పండుగలే.. అలాంటి పండుగల్లో ముఖ్యమైనది ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు.. అమ్మవారితో పాటు ప్రకృతి స్వరూపిణిని కూడా అమ్మతల్లిగా భావించి బతుకమ్మగా ఆరాధిస్తారు తెలంగాణ ఆడపడుచులు. ఆటపాటలతో, అందమైన ముగ్గులతో, కనువిందైన పూలతో ‘బతుకమ్మ’ను పేర్చి పూజ చేస్తారు. ప్రపంచంలో పూలతో దేవుడిని పూజించడం సర్వసాధారణమైన అంశం. కానీ ఆ పూలనే పరమ పవిత్రంగా పూజించడం అనేది తెలంగాణ ప్రత్యేకత. ప్రకృతిని ప్రేమించడమనేది అనాది జీవన సంప్రదాయం. ‘బతుకును బతుకమ్మా’ అని వేడుకోవడం తెలంగాణ మట్టికున్న మహిమాన్విత ఆచారం. ఆధునికత ఎన్ని హొయలొలికినా మనిషి మనాది నుంచి అనాదిగా వస్తున్న సంప్రదాయాలను అనేకం వదులుకున్నా పూలతో తన సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు.
పూలుగుడులు, గోపురాలు, మఠాలు, మర్యాదలు లేకపోయినా తెలంగాణ మనిషి గుండెల్లో ఎన్ని తరాలు మారినా ఎన్ని తంతెలు ఎదిగినా వాటికి ప్రత్యేకమైన గౌరవస్థానం ఆదానప్రదానాలుగా వస్తున్నది. అలా రావడానికి బతుకమ్మ ఒక స్ఫూర్తి. తెలంగాణ ఇల్లిల్లూ పూలవనమై మెరిసి మురిసిపోవడానికి ఇక్కడి జనజీవం శిఖరాయమానం. సహజంగా పండుగలు పౌరాణిక గాథల ఆధారంగా ఆవిర్భవిస్తాయి. కానీ బతుకమ్మ పండుగ పుట్టుకకు అలాంటి కారణాలు, ఆధారాలు కనిపించవు. ప్రకృతిని స్ర్తిగా పూజించే విధానమే బతుకమ్మ. అంతేకాదు, బతుకమ్మ పాటలు ఎక్కువగా రామాయణ, భారత, భాగవతం మొదలైన పౌరాణిక కథావస్తువుతో ఉంటాయి. తెలంగాణకే ప్రత్యేకమైన అపురూపమైన కానుక బతుకమ్మ. ప్రకృతిని ప్రేమించడం తెలంగాణ సంస్కృతికి ఉన్న మహోన్నత లక్షణం. ప్రకృతి ప్రసాదిత పూలను పేర్చి బతుకునీయవమ్మా... అంటూ బతుకమ్మను కొలిచే అరుదైన పండుగ బతుకమ్మ. తెలంగాణలో ఎక్కడ చూసినా తొమ్మిది రోజులూ పూలజాతరే.. ఊరూరా పూలవనమే..
ఆశ్వయుజ మాసం వచ్చేస్తుందంటే.. బతుకమ్మ పండుగ కూడా వచ్చేసినట్లే.. భాద్రపద అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుపుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎంత ప్రాముఖ్యత అంటే.. రాష్ట్ర పండుగగా అధికారికంగా జరిపేంత.. దసరాకు రెండు రోజుల ముందు వచ్చే ఈ పండుగను బతుకమ్మ పండుగ, బతకమ్మ పండుగ, గౌరీ పండుగ, సద్దుల పండుగ అనే పేర్లతో పిలుస్తారు.
మహాలయ అమావాస్య నుంచి మహర్నవమి వరకు సాగే ఈ ఉత్సవం తెలంగాణ సాంస్కృతిక సౌరభాల్ని వెదజల్లుతుంది. ఇక్కడ గడపగడపలో బతుకమ్మ తొమ్మిదిరోజులపాటు కనువిందు చేస్తుంది. తొమ్మిది పూర్ణత్వానికి ప్రతీక. నవ విధులకు, నవావరణాలకు ప్రతిబింబంగా బతుకమ్మను తొమ్మిది రకాల పూలతో అలంకరిస్తారు. తంగేడు, గునుగు, కట్ల, రుద్రాక్ష, సీతమ్మజడ, గోరింట, గుమ్మడి, బంతి, మందార, గనే్నరు, బీర, నిత్యమల్లె పుష్పాలను క్రమపద్ధతిలో అమర్చుతారు. మధ్యలో పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. ఈమె ఈ తొమ్మిదిరోజులు పుట్టింటికి వచ్చినట్లుగా భావించి ..
బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో..
బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
తంగేడు పువ్వై తరలిరావే తల్లి..
మందార పువ్వై మురిపెంగరా.. కల్పవల్లీ..
పారిజాతమై పరిమళించగరావే..
పున్నాగ పువ్వై పులకించగరావే..
బంగారు బతుకమ్మా..
సింగారాల మాయమ్మా..
బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో..
-అంటూ తమ మమకారాన్ని చాటుకుంటారు పుట్టింటివారు.
సెప్టెంబరు, అక్టోబర్ నెలల్లో తెలంగాణ ప్రాంతం అంతా పండుగ కోలాహలం కనిపిస్తుంది. అన్ని పండుగల్లో బతుకమ్మ పండుగకు విశిష్టమైన స్థానం ఉంది. దసరా పండుగకు ఎంత ప్రాధాన్యం ఉందో బతుకమ్మ పండుగకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. ఇది మహిళలకు సంబంధించిన పండుగ. వర్షాకాలం ముగిసిపోయి, శీతాకాలం ప్రవేశిస్తున్న సమయంలో వాతావరణం పచ్చగా ఉంటుంది. ప్రకృతి మాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టుగా ఉంటుంది. రకరకాల పూలతో చెట్లన్నీ విరబూస్తాయి. ముఖ్యంగా గునుగు, తంగేడు పూలు విరగకాసి ప్రకృతి మాతకు మరింత అందాన్ని అద్దుతాయి. చెరువులన్నీ కొత్త నీటితో కళకళలాడుతూ ఉంటాయి. ఇలాంటి వాతావరణంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్నంతా ‘బతుకమ్మ’లో పేర్చి వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు.
బతుకమ్మ కథ..
బతుకమ్మ పండుగ వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన కథలు రెండున్నాయి. మొదటి కథ..
మహిషాసురుడితో యుద్ధం చేసిన దుర్గాదేవి అలసటతో సొమ్మసిల్లి, పడిపోయింది. తో టి మహిళలు ఆమెకు సేవ లు చేసి పాటలను ఆలపిస్తూ, ఆమెలో తిరిగి చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. సపర్యలు చేసి సేదతీర్చారు. తొమ్మిదోనాడు ఆది పరాశక్తి అలసట పూర్తిగా తీరిపోయింది. వెంటనే దుర్గాదేవి విశ్వ చైతన్యమూర్తిగా అవతరించి మహిషాసురుణ్ణి సంహరించింది. లోకంలోని చీకట్లను, చెడులను పారద్రోలి కొత్త వెలుగును ప్రసరింపచేసింది. అందరికీ బతుకునిచ్చిన అమ్మ కాబట్టి ఆమెను ‘బతుకమ్మ’గా వ్యవహరించి పూజిస్తారు ఆడపడుచులు. ఇక రెండో కథ.. ఒక బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుందట. అప్పు డు ఆ ఊరి ప్రజలందరూ ‘నువ్వు చనిపోయినా అం దరి మనస్సులో కలకాలం ‘బతుకమ్మా..’’ అని దీవించారట.. అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ, ఆమెనే గౌరమ్మగా పూ జిస్తూ ‘బతుకమ్మ’ పండుగ చేసుకుంటారు. ‘బతుకమ్మ’ వేడుక సందర్భంగా స్ర్తిలందరూ తమ కు ఎలాంటి ఆపదలూ రాకూడదని, తమ భర్తకు, పిల్లలకు ఎలాంటి ఆపద రాకూడదని గౌరమ్మని వేడుకుంటారు. బతుకమ్మ పండుగకి సంబంధించి మరో వృత్తాంతం కూడా ప్రచారంలో ఉంది. ఇంకొక వృత్తాంతంలో దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం కోసం పూజలు చేయగా ఆయన భార్య లక్ష్మీదేవి అనుగ్రహముతో ఒక కూతుర్ని కన్నది. ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టారు. పసిబిడ్డ అయిన లక్ష్మి అనేక గండములను ఎదుర్కొంది. అప్పుడు తల్లిదండ్రులు ఆమెకి ‘బతుకమ్మ’ అని పేరు పెట్టారు. అప్పటి నుండి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను పూజించడం ఆనవాయితీ అయిందట.
బతుకమ్మ పండుగకు వారం ముందు నుంచే ఇళ్ళలో హడావుడి మొదలవుతుంది. ఈ పండుగ కోసం ఎదురుచూసే తెలంగాణ ఆడపడుచులు పండుగకు వారం రోజుల ముందే పుట్టింటికి చేరుకుని ఆనందోత్సాహాలతో పండుగకు సన్నాహాలు చేసుకుంటారు. ప్రధాన పండుగకు వారం రోజుల ముందు నుంచే ఆడపడుచులు చిన్న చిన్న బతుకమ్మలను తయారుచేసి ప్రతిరోజూ సాయంత్రం ఆ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ శ్రావ్యంగా పాటలు పాడతారు. ఆ తర్వాత చెరువులో బతుకమ్మని నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండుగ చివరిరోజు జరిగే వేడుకలను, ఆ వైభవాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలవు. నయన మనోహరంగా ఉంటుంది ఆ సన్నివేశం. ఆ రోజున పురుషులంతా పచ్చిక బయళ్ళలోకి పోయి తంగేడు, గునుగ, కలువ పూలను కోసుకుని వస్తారు. ఆ తర్వాత ఇంట్లో అందరూ గునుగ, తంగేడు, కలువ పువ్వుల్ని, మరికొన్ని పువ్వుల్ని కలిపి బతుకమ్మను తయారుచేస్తారు. బతుకమ్మలో మిగతా ఎన్ని పూలు ఉన్నా గునుగ పూలు, తంగేడు పూలదే ఆధిపత్యం ఉంటుంది.
ఒక రాగి పళ్ళెంలో గునుగు, తంగేడు పూలతో పాటు ఇతర పూలను కలిపి వలయాకారంలో పేరుస్తారు. ఇలా పై వరకు ఒక రంగు పుష్పం తరువాత మరో రంగు పుష్పాన్ని పెడుతూ ఆకర్షణీయంగా తయారుచేస్తారు. ఆ తర్వాత తంగేడు పూలను కట్టగా కట్టి వాటిపై పేరుస్తారు. మధ్యలో కూడా రకరకాల పూలను ఉపయోగిస్తారు. ఈ పూల అమరిక ఎంత పెద్దగా ఉంటే బతుకమ్మ అంత పెద్దగా, అంత అందంగా రూపొందుతుంది. పూలను చక్కగా పేర్చడం పూర్తయిన తర్వాత పైన పసుపుతో తయారుచేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ఇలా తయారుచేసిన బతుకమ్మను పూజ గదిలో అమర్చి పూజిస్తారు. తరువాత బతుకమ్మను బయటకు తీసుకువచ్చి ఆడపడుచులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ, పాటలతో గౌరీదేవిని కీర్తిస్తారు. ఆడపడుచులు కొత్త బట్టలను కట్టుకుని, ఆభరణాలను ధరించి చాలాసేపు ఆటపాటలతో గడిపాక ఆడవారు, మగవారు కలిసి చెరువులో నిమజ్జనం చేస్తారు. తరువాత పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం.. అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. వేరుశెనగ లేదా పెసలను దోరగా వేయించి పిండి చేసి బెల్లంతో కలిపి సత్తుపిండిని తయారుచేస్తారు. దీంతో పాటు పెరుగన్నాన్ని కూడా బతుకమ్మ ఆడేచోటుకు తీసుకువచ్చి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుని ప్రసాదంలా తింటారు.
బతుకమ్మ వేడుకల చివరిరోజు సాయంత్రం ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు, ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్నవారు కూడా వారి బతుకమ్మలను ఇదేవిధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. ఐక్యత, ప్రేమతో మానవహారంలా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. ఒకరు ముందుగా పాట మొదలుపెడితే మిగిలినవారు గొంతు కలుపుతూ పాడతారు. ఈ జానపద గీతాలు ప్రత్యేకమైన తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరిస్తాయి. చీకటిపడే వేళకి ఆడపడుచులందరూ బతుకమ్మలను తలపై పెట్టుకుని పెద్ద చెరువుకుగానీ, తటాకం వైపుగానీ ఊరేగింపుగా వెళ్తారు. ఈ ఊరేగింపు అందంగా అలకరించుకున్న స్ర్తిలు, బతుకమ్మలు, వాయిద్యాలతో కన్నుల పండుగగా ఉంటుంది. జలాశయం చేరుకున్న మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ, ఆడుతూ నీటిలో జార విడుస్తారు. ఆ తరువాత పంచదార, రొట్టెతో చేసిన ‘మలీద’ అనే వంటకాన్ని బంధువులకు పంచి పెడతారు.
గర్భపూజ..
మనిషి పుట్టుకకు ఆధారమైన (మిగతా 10వ పేజీలో)
గర్భాన్ని పూజించడం, గౌరవించడం.. జానపదుల సంస్కృతి. ‘బతుకమ్మ’ను గర్భానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి.. గర్భపూజను, మాతృమూర్తిని పూజించడమే- ‘బతుకమ్మ’ అంటారు. తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ పండుగను నవమాసాలకు ప్రతీకగా చెప్పవచ్చు. ఈ కారణంగానే బతుకమ్మ పండుగ మహిళల సంతాన సాఫల్యతకు సంబంధించిన పండుగ అని అంటుంటారు. బతుకమ్మ వేడుకల్లో పాడే పాటల్లోనూ గర్భవతులైనరవారు ఏ మాసంలో ఏం తినాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?? అనే విషయాలు తెలుస్తాయ. రకరకాల పూలతో పేర్చిన బతుకమ్మలను చూస్తే.. లింగం, భూమి, గర్భం, ధాన్యరాశి ఆకారాల్లో కనిపిస్తుంటాయి. అంటే పూలన్నింటినీ గర్భాకారంలో పేర్చి ఆడి, పాడి, పూజించి పునఃసృష్టికి స్వాగతం పలకడం ఈ పండుగ అంతరార్థం. మహిళలకు ప్రకృతితో ఉన్న అనుబంధానికి ఈ ‘బతుకమ్మ పండుగ’ అద్దం పడుతోంది. బతుకమ్మ పండుగ ప్రకృతి పండుగగా, భూదేవి పండుగగా చెప్పవచ్చు. ప్రకృతి, భూదేవి అనేవి రెండూ పునరుత్పత్తి రూపాలే.. అందుకే బతుకమ్మ పాటల్లో వైద్యం, సేద్యం రెండూ కనిపిస్తాయి. బొడ్డెమ్మ, బతుకమ్మలు కడుపు పంటకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. అందులో భాగంగానే రెండు దశల్లో ఈ బతుకమ్మ పండుగ జరుగుతుంది. బొడ్డెమ్మ పండుగలో గద్దెకు, వెంపలి చెట్టుకు.. బతుకమ్మ పండుగలో పూలకు ప్రాధాన్యం ఇస్తారు. బొడ్డెమ్మ పండుగలో బాలికలకు, బతుకమ్మ పండుగలో మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది.
బతుకమ్మ పండుగను మాతృస్వామ్య వ్యవస్థకు ప్రతిరూపంగా కూడా చెప్పవచ్చు. ఇది తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి చిహ్నం. అందుకే బతుకమ్మ పండుగలో పురుషులకు స్థానం కనిపించదు. బతుకమ్మ ఆడే సమయంలో పురుషులు ఉండకూడదు. బాలికలు బొడ్డెమ్మలు ఆడుకునేటప్పుడు అన్నదమ్ములు రాకూడదు. తెలంగాణలో ఇప్పుడు పూజిస్తున్న ఎల్లమ్మ, సమ్మక్క సారలమ్మ, ముత్యాలమ్మ, బతుకమ్మ అందరూ ఒకప్పటి పురుషాధిక్యతను ఎదిరించి పోరాడిన రూపాలే.. ఈ పండుగలన్నీ మహిళను విముక్తి చేసుకోవడానికి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఏర్పాటు చేసుకున్న పండుగలే.. ఇలా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల సమ్మేళన రూపమైన ‘అమ్మ’ను పూజిస్తారు మహిళలు. దీంతో పాటు ప్రేమ, శాంతి, సత్యం, క్షమ, ధ్యానం, అహింస, నిగ్రహం, భూతదయ అనే అష్టపుష్పాలతో, మన మనోపుష్పమైన తొమ్మిదో పుష్పాన్ని కూడా జతచేసి అమ్మను పూజించడమే బతుకమ్మ వేడుక.
పండుగ - ఇతిహాసాలు
తెలంగాణ జానపదుల పండుగగా ప్రారంభమై, ఆ తర్వాత నగరాలకు, విదేశాలకు పాకిన ఈ పండుగ ప్రాశస్త్యం, పుట్టుక వెనుక ఆసక్తికర కథనాలెన్నో ఉన్నాయి. కాకతీయ చక్రవర్తుల కాలంలో అంటే సుమారు 12వ శతాబ్ది నుంచి ఈ పండుగ ఉన్నట్లు ఆధారాలున్నాయి. ఆ కాలంలో పూలను బతుకుగా భావించి సుకుమార భావన కల స్ర్తిలు ఆడే ఆటగా బొడ్డెను గౌరమ్మగా పూజించడం వల్ల బతుకమ్మగా మారిందనే భావన ఉంది. మహిషాసుర సంహారం కోసం అవతరించిన దుర్గాదేవి తొమ్మిది రోజుల్లో పెరిగి పెద్దదై రాక్షస సంహారం చేయడంలో ఆమె అనుగ్రహం కోరి మహిళలు చేసే ఆరాధనే బతుకమ్మ అని కొందరి అభిప్రాయం. గంగాగౌరీ సంవాదంలో భాగంగా శివుడు తలపై పెట్టుకున్న గంగను చూసి పార్వతి అసూయ చెంది గంగను అందరూ పూజిస్తున్నారని తన తల్లితో చెబుతుంది. అప్పుడు తల్లి ఓదార్చి గంగపై... నిన్ను పూల తెప్పలా తేలించి పూజించేలా చేస్తానంటుంది. అదే బతుకమ్మగా రూపాంతరం చెందినదని కూడా చెబుతారు.
పూర్వం అక్కెమ్మ అనే యువతికి ఏడుగురు అన్నలుంటే పెద్ద వదిన పాలలో విషయం కలిపి మరదలికి తాగించి చంపి వేసి ఆ తర్వాత ఊరి బయట పాతి పెట్టింది. అక్కడ అడవి తంగేడు చెట్టు పుట్టి విరగబూసింది. ఊరికి వెళ్లి వచ్చిన అన్నలు చెల్లెకు పూలిద్దామని దెంపబోతే ఆమె ఆత్మ తన మరణం గురించి చెబుతుంది. అప్పుడు అన్నలు- నీకు ఏం కావాలో కోరుకోమంటే ఈ తంగేడు పూలల్లో తనను చూసుకొమ్మని, ఏటా తన పేరిట పండుగ చేయండని అనడంతో ఈ పండుగ ఏర్పడినట్లు మరో కథ ప్రాచుర్యంలో ఉంది. చాలాకాలం కిందట సంతానం లేక పరితపిస్తున్న దంపతులకు ఓ అమ్మాయి దొరకగా, వారు అమ్మవారి ప్రసాదంగా భావించి పెంచి పెద్ద చేస్తారు. ఆమె పలు మహిమలు చూపుతూ లోకహిత కార్యాలు చేయడంతో ఆమె చుట్టూ చేరి దైవ స్వరూపంగా మహిళలు కొలువగా ఈ పండుగ వచ్చిందని ఓ కథ. ఒక జంటకు కలిగిన పిల్లలు మరణిస్తుంటే పార్వతిని ప్రార్థించారట. ఆమె దయతో ఒక కూతురు జన్మించగా బతుకుతుందట. ఆమెకు బతుకమ్మ అని నామకరణం చేయడంతో ఈ పండుగ వచ్చిందని చెబుతారు. చోళరాజైన జైన ధర్మాంగదుడు, అతని భార్య సత్యవతికి కలిగిన వంద మంది కుమారులు యుద్ధ రంగంలో చనిపోగా లక్ష్మీదేవిని తమ కుమార్తెగా జన్మించమని ప్రార్థించగా ఆమె తమ కూతురై జన్మించిన సందర్భంలో సమస్త మునులు రాజు ఇంటికి వచ్చి చిరకాలం బతుకమ్మా.. అని ఆశీర్వదించగా ఈ పండుగ ఏర్పడినట్లు కూడా పెద్దలు చెబుతారు.
*
తొమ్మిది రోజుల వేడుక
ఒక్కోరోజు ఒక్కో రూపంలో బతుకమ్మను పూజిస్తారు.
మొదటి రోజు: ఎంగిలిపూల బతుకమ్మ
రెండో రోజు: అటుకుల బతుకమ్మ
మూడో రోజు: ముద్దపప్పు బతుకమ్మ
నాలుగో రోజు: నానే బియ్యం బతుకమ్మ
ఐదో రోజు: అట్ల బతుకమ్మ
ఆరో రోజు: అలిగిన బతుకమ్మ
ఏడో రోజు: సకినాల లేదా వేపకాయల బతుకమ్మ
ఎనిమిదో రోజు: వెన్నముద్దల బతుకమ్మ
తొమ్మిదో రోజు: సద్దుల బతుకమ్మ
ఎంగిలి పువ్వుల బతుకమ్మ
బతుకమ్మ నవరాత్రుల్లో మొదటిరోజును ఎంగిలిపువ్వు అంటారు. అలా ఎందుకంటారంటే బతుకమ్మను పేర్చడానికి వాడే పూలను ఒకరోజు ఉమదే తెంపుకొచ్చి వాటి వాడిపోకుండా నీళ్లలో వేసి మరునాడు బతుకమ్మగా పేరుస్తారు. అందుకే మొదటిరోజును ఎంగిలిపువ్వు అంటారు. ఈ రోజునాడు తెలంగాణ పల్లెల్లో వాయనంగా తమలపాకులు, తులసి ఆకులు ఇచ్చుకుంటారు.
అటుకుల బతుకమ్మ
రెండోరోజునాడు ఉదయానే్న అడవికి వెళ్లి తంగేడు, గునుగు, బంతి, చామంతి, అడవి గడ్డిపూలు తీసుకువస్తారు. ఈ పూలను రెండు ఎత్తులలో గౌరమ్మను పేర్చి, ఆడవారు అందరూ కలిసి ఆడుకొని సాయంత్రం చెరువల్లో వేస్తారు. రెండోరోజు అటుకులు వాయనంగా పెడతారు.
ముద్దపప్పు బతుకమ్మ
మూడోరోజు బతుకమ్మను మూడంతరాల్లో చామంతి, మందార, సీతమ్మ జడ, రామబాణం పూలతో అలంకరించి తామర పాత్రల్లో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు. శిఖరంపై గౌరమ్మను ఉంచి ఉదయం పూజలు చేసి సాయంత్రం గుడి దగ్గరో లేక నాలుగు బాటలు కాడ అందరూ కలిసి ఆడవారు ఆడుకుని చెరువుల్లో వేసి వస్తారు. ఈ రోజు వాయనంగా సత్తుపిండి, పెసర్లు, చక్కెర, బెల్లం కలిపి పెడతారు.
నానే బియ్యం బతుకమ్మ
నాలుగో రోజు నానబియ్యం ఫలహారంగా పెడతారు. ఈ రోజు తంగేడు, గునుగు పూలతో నాలుగంతరాలు బతుకమ్మను పేర్చి శిఖరంపై గౌరమ్మను పెడతారు. వాయనంగా నానబోసిన బియ్యాన్ని బెల్లంతో కానీ పంచదారతో కానీ కలిపి ముద్దలు చేసి పెడతారు.
అట్ల బతుకమ్మ
ఐదో రోజు తంగేడు, గునుగు, చామంతి, మందార, గుమ్మడి పూలను అయిందరాలుగా పేర్చి బతుకమ్మను ఆడతారు. ఈ రోజు వాయనంగా పిండితో చేసిన అట్లను పెడతారు.
అలిగిన బతుకమ్మ
ఆరో రోజు ఎలాంటి పూలతో బతుకమ్మను అలంకరించరు. పూర్వకాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందని ఆరో రోజు బతుకమ్మను ఆడరు.
వేపకాయల బతుకమ్మ
ఏడో రోజు బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతిచ గులాబీ పూలతో ఏడంతరాలు పేర్చి ఆడుకుని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈ రోజు వాయనంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి పెడతారు. పప్పు బెల్లాలను నైవేద్యంగా పెడతారు.
వెన్నముద్దల బతుకమ్మ
ఎనిమిదో రోజు తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డిపువ్వు.. మొదలైన పూలతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆటపాటల మధ్య చెరువులో వేస్తారు. ఈ రోజు వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ఇస్తారు.
సద్దుల బతుకమ్మ
ఇదే చివరి పండుగరోజు. ఈ రోజు ఎన్ని పూలు దొరికితే అన్ని పూలతో బతుకమ్మను పెద్దగా పేరుస్తారు. ఈ రోజు మహిళలు చాలా ఉత్సాహంగా ఆడతారు. పాడుతారు. అలాగే పెద్ద బతుకమ్మ పక్కన చిన్నగా గౌరమ్మను కూడా తయారుచేసి చాలా జాగ్రత్తగా ఎత్తుకుని బతుకమ్మను వేసిన తరువాత గౌరమ్మను పూజించి వారి చెంపలకు పసుపును రాసుకుంటారు. చివరి రోజు కాబట్టి చాలా చీకటి పడేవరకు ఆడుకుంటారు ఆడవారు. పెద్ద బతుకమ్మ రోజు ఎక్కడ ఉన్నా వారి సొంత ఊరికి చేరుకుని ఆడపిల్లలు అందరూ కలిసి ఆనందంగా బతుకమ్మను ఆడుకుని చెరువులో నిమజ్జనం చేస్తారు.
*
బతుకమ్మ పాట
మనిషికి, ప్రకృతికి సంబంధించిన పండుగగా బతుకమ్మ పండుగను చెప్పుకుంటారు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితానికి, ప్రకృతితో విడదీయరాని అనుబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది. కానీ ఈ బిజీ జీవితాలలో మనుషులతోనే కలువలేకపోతున్న మనిషి ఇక ప్రకృతితో ఎలా కలుస్తాడు. బతుకమ్మ పండుగకి మాత్రం కచ్చితంగా తొమ్మిది రోజులు మాత్రం ప్రతి మనిషి ప్రకృతితో మమేకమైపోతారు.. అదే బతుకమ్మ పండుగ గొప్పతనం.
శ్రీ గౌరి నీ పూజ ఉయ్యాలో
శ్రీ గౌరి నీ పూజ ఉయ్యాలో
చెయ్యబోతినమ్మ ఉయ్యాలో
కాపాడు మమ్మేలు ఉయ్యాలో
కైలాస రాణి ఉయ్యాలో
శంకరా పార్వతి ఉయ్యాలో
శంబు రాణివే తల్లి ఉయ్యాలో
తల్లి నినె్నప్పుడు ఉయ్యాలో
ధ్యానించెదమ్మ ఉయ్యాలో
కాపాడు మమ్మేలు ఉయ్యాలో
కైలాస రాణి ఉయ్యాలో
అంభికా నాకిదే ఉయ్యాలో
విడిసద ఉయ్యాలో
ఆకాశ గంగతో ఉయ్యాలో
ఆచుమించుము తల్లి ఉయ్యాలో
పసుపు కుంకుమ నీకు ఉయ్యాలో
పట్టదమే తల్లి ఉయ్యాలో
సారె చీరెలు నీకు ఉయ్యాలో
పెట్టెదమే తల్లి నీకు ఉయ్యాలో
పువ్వులు, బుకలు నీకు ఉయ్యాలో
చల్లెదము నీకు ఉయ్యాలో
అత్తరు, పన్నీరు ఉయ్యాలో
చల్లెదమమ్మ నీకు ఉయ్యాలో
పట్టుచీరెలు నీకు ఉయ్యాలో
పెడుదము మా తల్లి ఉయ్యాలో
నిద్రపోవే తల్లి ఉయ్యాలో
నిద్రపోవమ్మ తల్లి ఉయ్యాలో
నిద్రకు నూరేళ్లు ఉయ్యాలో
నీకు వెయ్యేళ్లు ఉయ్యాలో
నిను కన్నతల్లికి ఉయ్యాలో
నిండా నూరేళ్లు ఉయ్యాలో
*
కృష్ణా, గోదావరి నదులను అనుసంధానిస్తాం

కర్నూలు, సెప్టెంబర్ 21: కృష్ణానది ద్వారా లభ్యమయ్యే నీటిలో ఏటేటా తగ్గుదల నమోదవుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల రెవెన్యూ డివిజన్లో వరద ప్రాంతాలను ఆయన శనివారం ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. అనంతరం నంద్యాల పురపాలక సంఘం కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కృష్ణానది నీటితో రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి గోదావరి నదితో అనుసంధానం చేసే చర్యలు చేపట్టామని తెలిపారు. ఇందుకు తెలంగాణ సహకారం అవసరమన్నారు. అందుకే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. కేంద్ర జలవనరుల సంఘం లెక్కల ప్రకారం 47 సంవత్సరాల క్రితం ప్రతి ఏటా 1200 టీఎంసీల నీరు కృష్ణానదిలో లభ్యమయ్యేదని పేర్కొన్నారు. 10 సంవత్సరాల క్రితం అది 600 టీఎంసీలకు, అయిదేళ్లుగా 400 టీఎంసీలకు పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాజలాలతో రాయలసీమ ప్రాంతాన్ని ఆదుకోవడానికి గోదావరి నదితో అనుసంధానించడం కోసం కృషి చేస్తున్నామని వెల్లడించారు. రాయలసీమలోని ప్రతి జలాశయాన్ని కృష్ణాజలాలతో నింపడానికి ప్రథమ ప్రాధాన్యతినిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఇందుకు ఏం చర్యలు తీసుకోవాలో నిపుణుల నివేదికలను పరిశీలించిన అనంతరం కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. నంద్యాల ప్రాంతంలో 17 మండలాల్లో రైతులు, సామాన్య ప్రజలు వరద కారణంగా నష్టపోయారని అన్నారు. బాధితులకు ఇచ్చే నష్టపరిహారం విషయంలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని
సూచించారు. నష్టం అంచనా వేసేటపుడు 15 శాతం అధికంగా చేర్చి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఇక వరద బాధితులకు ప్రస్తుతం ఇస్తున్న నష్టపరిహారానికి మరో రూ.2వేలు కలిపి ఇవ్వాలని కలెక్టర్ వీరపాండియన్కు సూచించారు. వరద కారణంగా జరిగిన నష్టం అంచనా వేయడంలో వ్యవసాయశాఖ అధికారుల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నంద్యాల ప్రాంతంలో వరద నివారణకు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చర్యలు ప్రారంభించినప్పటికీ ఆ తరువాత నిర్లక్ష్యం చేశారని తెలిపారు. కుందూనది వెడల్పు, చామకాలువ వెంట వరదగోడ నిర్మాణం వంటి కార్యక్రమాలు త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. నంద్యాల ప్రాంతంలో జరిగిన నష్టం సుమారు రూ.784 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారని సీఎం తెలిపారు. ఇందులో రహదారులు, భవనాలశాఖ ఒక్కటే సుమారు రూ.422 కోట్లు, పంచాయితీరాజ్ శాఖ రూ.103 కోట్ల నష్టం వాటిల్లినట్లు నివేదికలు రూపొందించాయన్నారు. 31 వేల హెక్టార్లలో సాధారణ పంటలు, రెండు వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. వరద బాధితులందరికీ పరిహారం అందించి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రులు కన్నబాబు, గుమ్మనూరు జయరాం, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్రెడ్డి, గంగుల బ్రిజేందర్ రెడ్డి, శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్రెడ్డి, కలెక్టర్ వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ పఠాన్షెట్టి రవిసుభాష్, ఎస్పీ ఫక్కీరప్ప తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... నంద్యాలలో ఏర్పాటు చేసిన వరద బాధిత ప్రాంత చిత్రాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి జగన్
17 రాష్ట్రాల్లో మోగిన నగారా

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: మహారాష్ట్ర, హర్యానా శాసనసభలకు ఎన్నికలు, తెలంగాణ తదితర పదిహేడు రాష్ట్రాల్లోని 63 శాసనసభ సీట్లు, బిహార్లోని ఒక లోకసభ స్థానానికి ఉప ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, హర్యానా శాసనసభలతోపాటు 63 ఖాళీ స్థానాలకు అక్టోబర్ 21న ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. రెండు రాష్ట్రాల శాసనసభలు, 17 రాష్ట్రాల్లోని 63 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల ఫలితాలను అక్టోబర్ 24న ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా శనివారం విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ రెండోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారి జరుగుతున్న ఎన్నికలివి. నాలుగు నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన భారీ మెజారిటీ, మోదీ ప్రభుత్వం ఇటీవల జమ్ముకాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేసి ఆర్టికల్ 35ను రద్దు చేయటం, ట్రిపుల్ తలాక్ బిల్లుకు చట్టరూపం కల్పించిన నేపథ్యంలో జరుగుతున్న మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల్లో అధికార పార్టీ మరోసారి ఘనవిజయం సాధించే అవకాశాలున్నాయి.
మహారాష్ట్ర, హర్యానా శాసనసభలకు పోటీ చేసేవారు తమ నామినేషన్ పత్రాలను అక్టోబర్ నాలుగో తేదీలోగా దాఖలు చేయవలసి ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ ఏడో తేదీతో గడువు ముగుస్తుంది. బిహార్లోని ఒక లోక్సభ సీటుతోపాటు పదిహేడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 63 శాసనసభ సీట్లకు జరిగే ఉప ఎన్నికలకు నామినేషన్లను సెప్టెంబర్ 30లోగా దాఖలు చేయవలసి ఉంటుంది. నామినేషన్లను అక్టోబర్ 3లోగా ఉపసంహరించుకోవలసి ఉంటుంది. కోటీ ఎనభై రెండు లక్షల మంది ఓటర్లున్న హర్యానా శాసనసభ కాల పరిమితి నవంబర్ రెండుతో ముగుస్తుంటే.. ఎనిమిది కోట్ల తొంభై లక్షల మంది ఓటర్లు ఉన్న మహారాష్ట్ర శాసనసభ కాల పరిమితి నవంబర్ 9వ తేదీతో ముగుస్తుంది.
తెలంగాణతోపాటు అరుణాచల్ప్రదేశ్, బిహార్, చత్తీస్గఢ్, అస్సాం, గుజరాత్, హిమాచల్ప్రదేశ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, పాండిచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్లోని 63 శాసనసభ సీట్లకు ఉప ఎన్నికలు జరగవలసి ఉన్నది. వీటితోపాటు బిహార్లోని ఒక లోక్సభ సీటుకు ఉప ఎన్నికలు జరుగుతాయి. కర్నాటకలో పదిహేడు, అస్సాం, గుజరాత్, పంజాబ్, బిహార్ రాష్ట్రాల్లో నాలుగేసి స్థానాలకు, ఉత్తరప్రదేశ్లో పదకొండు, కేరళలో ఐదు, సిక్కింలో మూడు, హిమాచల్ప్రదేశ్లో రెండు, తమిళనాడు, రాజస్థాన్లో రెండేసి స్థానాలకు, అరుణాచల్ప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, పాండిచ్చేరిలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతాయి.
శాసనసభల, ఉప ఎన్నికల ప్రచారంలో ప్లాస్టిక్ ప్రచార సామాగ్రిని ఉపయోగించకూడదని ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా అన్ని రాజకీయ పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతో దోహదపడుతుందని ఆయన సూచించారు. ఎన్నికల ప్రచారం కోసం ఆయా రాజకీయ పార్టీలు పెద్దఎత్తున బ్యానర్లు, స్టిక్క, ఇతర ప్రచార సామాగ్రిని ఉపయోగించటం తెలిసిందే. తమ ఎన్నికల ప్రచార సామాగ్రిని తయారు చేసుకోవటంలో ప్లాస్టిక్ను ఉపయోగించకూడదని సునీల్ అరోరా విజ్ఞప్తి చేయడం విశేషం.
*చిత్రం... న్యూఢిల్లీలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేస్తున్న కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా. ఇరువైపుల కమిషనర్లు అశోక్ లవాసా, సునీల్ చంద్ర
ప్రతి పాఠశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతా
ఘట్కేసర్, సెప్టెంబర్ 21: పోచారం పురపాలక సంఘం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు మంత్రి మల్లారెడ్డి స్వంత ఖర్చులతో రంగులు వేయించటం పట్ల మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు బోయపల్లి కొండల్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అన్నోజిగూడ, రాజీవ్ గృహకల్ప కాలనీలలోని ప్రభుత్వ పాఠశాలలను శనివారం సందర్శించి పరిశీలించారు. రంగులు వేయటం పూర్తి కావటంతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఆకర్షణీయంగా కనపడుతున్నట్లు తెలిపారు. రెండు పాఠశాలలకు మంత్రి మల్లారెడ్డి రెండేసి లక్షల చొప్పున స్వంత నిధులను అందజేసినట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని పాఠశాలలను దాతల సహకారంతో ఆకర్షణీయంగా మార్చుతామని చెప్పారు.
రోగులతో ఆసుపత్రులు కిటికిట
మహేశ్వరం, సెప్టెంబర్ 21. ఇటీవల ముసురు వర్షాలతో దోమలు బెడద పెరగడంతో పల్లె పట్టణం తేడా లేకుండా జర్వాలు విజృంబిస్తున్నాయి. మహేశ్వరం మండలంతో పాటు పురపాలిక పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ భాధితులు పెరుగుతున్నారు. శనివారం తెల్లవారుఝామున ఎన్డీ తండాలో పదోతరగతి చదువుతున్న బాలిక డెంగీతో మృత్యువాత పడటంతో అందరికీ వణుకు పుడుతుంది. వందల మంది పిల్లలు, పెద్దలు అనే తేడా జ్వరాలతో బాధపడుతున్నారు. మహేశ్వరం సీహెచ్సీ ఆసుపత్రిలో రోజుకు 150 మందికి పైగా జ్వరంతో బాధపడుతున్నవారు.వస్తున్నట్లు వైద్యులు ఇంద్రాసేనారెడ్డి తెలిపారు.
ప్రభుత్వం ఆసుపత్రిలో గదులు విశాలంగా లేకపోవడంతో ఇరుకుగా ఉన్న వాటిలోనే రోగులను ఉంచారు. దీంతో ప్రజలు ప్రైవేటు వైద్యానే్న నమ్ముకుంటున్నారు. మండలంలోని అన్ని గ్రామాలల్లోనూ జర్వాల తీవ్రత ఇదే తీరుగా ఉంది 30 రోజుల కార్యచరణలో నిమగ్నమైన అధికారులు, ప్రజా ప్రతినిధులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
బహుజన సాహిత్య జాతీయ సదస్సుకు ఆహ్వానం
సికిందరాబాద్ : బహుజన సాహిత్య అకాడమీ ఈ నెల 29న ముంబైలో నిర్వహించనున్న జాతీయ సదస్సుకు నగరానికి చెందిన సామాజిక కార్యకర్త కృష్ణపూజారికి ఆహ్వానం పలికారు. ఈ సదస్సుకు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవాకు చెందిన 500 మంది ప్రతినిధులతో పాటు కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుగానున్నట్లు కృష్ణపూజారి తెలిపారు.
ఈ సదస్సులో ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారిపై జరుగుతున్న దాడులు, కొనసాగుతున్న వేధింపులు, ఇపుడున్న చట్టాలు అమలు తీరుతెన్ను, మరింత పటిష్టంగా అమలు చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై సదస్సు తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సులోనే సికిందరాబాద్ అడ్డగుట్టకు చెందిన గంటా రాజుసాగర్కు జాతీయ సేవా రత్న అవార్డును ప్రదానం చేయనున్నట్లు కృష్ణపూజారి వివరించారు. సదస్సుకు తనను ఆహ్వానించినందుకు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యన్తో పాటు బీఎస్ఏ జాతీయ, ప్రాంతీయ నాయకులకు కృష్ణపూజారి కృతజ్ఞతలు తెలిపారు.
దసరాలోపు పీఆర్సీ ప్రకటించక పోతే సమరమే
ఖైరతాబాద్ : దసరా పండుగలోపు ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించక పోతే ప్రభుత్వంపై సమరనాదం పూరిస్తామని టీఎన్జీఓలు హెచ్చరించింది. శనివారం ఎర్రమంజిల్లోని జలసౌద ప్రధాన కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన నగర శాఖ అధ్యక్షుడు ప్రతాప్ను ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్తో కలిసి ప్రతాప్ మాట్లాడారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. నిత్యం ధనిక రాష్ట్రం అని చెప్పే పాలకులు ఉద్యోగులకు న్యాయబద్దంగా రావాల్సిన పీఆర్సీని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో జాయింట్ సెక్రెటరీ అనిత, శ్రీరామ్, విజయ్ మోహన్రావు, విఠల్ బాబు, బాలరాజు, ఆంజనేయులు, నాగిరెడ్డి, వినోద్ పాల్గొన్నారు.