ఆధునిక తెలుగు కవితా ప్రక్రియలలో వచన కవిత్వానికి ఉన్న స్థానం ఎంతో విశిష్టమైంది. అద్భుతమైన ప్రక్రియ వచన కవిత్వం. ప్రజాస్వామ్యయుగ కవితా వాహికగా వచన కవిత్వం అభివర్ణింపబడింది. కుందుర్తి చెప్పినట్టుగా ఒక బలమైన ఉద్యమంగా వచన కవిత్వం బహుముఖంగా వ్యాపించింది.
పద్య కవిత్వానికి సమాంతరంగా ప్రారంభమైన ప్రక్రియగా వచన కవిత్వం గురించి చాలామంది విశే్లషకులు చెప్పుకొచ్చారు. ఆధునిక భావాలను సమర్ధవంతంగా చదువరులకు చేరవేయడంలో వచనమే సరైందని భావించే పరిస్థితి కనిపించి ఆ ప్రక్రియ బలిమిని పెంచింది. ఛందోబద్ధమైన పద్య నిర్మాణంగానే కాకుండా నిత్య వ్యవహార పదాలతో కవిత్వం రాసే వచన కవుల సంఖ్య క్రమంగా పెరిగింది. వర్తమాన ఆలోచనా ధారతో సామాన్యుడిని సైతం ఆకట్టుకునే ప్రక్రియగా వచన కవిత్వం పేరొందింది. ఆధునిక యుగపు ప్రతిబింబంగా వచన కవిత్వాన్ని మార్చే దిశగా లెక్కకు మించిన రచనలు ఈ ప్రక్రియలో వచ్చాయి. వర్తమాన అంశాలే వచనానికి ప్రాణలక్షణం కావడంతో చదువరుల ఆదరణ కూడా క్రమంగా పెరిగింది.
వచన గేయాన్ని ఆంగ్లంలో ‘ఫ్రీవర్స్’అని ఫ్రెంచి భాషలో ‘వర్స్లిబ్రే’అని చెబుతారు. ఫ్రెంచి భాషలో ఈ ప్రక్రియ ప్రారంభంకాగా ఆ కవుల ప్రభావంతో ఇంగ్లీషు కవులు ముందడుగేసి రాశారు. వాల్ట్విట్మన్, ఆర్నాల్డ్ వంటి కవులు గొప్ప వచనాన్ని వెలయించారని సినారె ఒకచోట వ్యాఖ్యానించారు. తెలుగులో ఫ్రీవర్స్ను వచన గేయం, వచన పద్యం, ముక్తచ్ఛందం, స్వచ్ఛంద కవిత్వం అనిబద్ధ కవిత్వం అని చెప్పినప్పటికీ సర్వేసర్వత్రా వచన కవిత్వమనే పేరు స్థిరపడిపోయింది. స్వేచ్ఛగా తమ భావాలను వెల్లడించేందుకు తోడ్పడే ప్రక్రియగా వచన కవిత్వానికి ఎంతో ఆదరణ దక్కింది. వ్యవహారికశైలి వచన కవిత్వానికి ప్రత్యేకతగా నిలిచింది.
విభిన్న దృక్కోణాలు, దృక్పథాలతో అనేకమంది వచన కవిత్వాన్ని వ్యాఖ్యానించే ప్రయత్నంచేశారు. శ్రీశ్రీ, పఠాభి, ఆరుద్ర, కుందుర్తి, చేరా, అరిపిరాల విశ్వం, కెవి రమణారెడ్డి, రోణంకి అప్పలస్వామి, సినారె వంటి వారు నిరాడంబరత, నిరలంకారత వచన కవిత ప్రదానమైన లక్షణాలుగా చెప్పారు. సారళ్యం, సూటిగా హృదయానికి తాకే కూర్పు, శబ్దక్రమం, నుడికారాల వినియోగం, రసపోషణ, సంభాషణల స్థాయిని అందుకునే తీరు కనిపించడం వచన కవితలోని విశేషమని తెలిపారు.
వచన కవిత్వం విస్తృతమైనది, వైవిధ్యంతో కూడుకున్నదన్నది స్పష్టమవుతున్నది. వచన కవితా నిర్వచనం కవినిబట్టి, కవితనుబట్టి మారుతుందని సుప్రసిద్ధ విమర్శకులు టిఎల్ కాంతారావు అభిప్రాయపడ్డారు. విశాలమైన పరిధికలది వచన కవిత్వమని అనేకులు చెప్పారు. సమగ్రంగా-శాస్ర్తియంగా ఆలోచిస్తే వచన కవిత్వంలో అనేక అంశాల కదంబాన్ని గమనించవచ్చు. ముద్దుకృష్ణ రచించిన ‘తురాయి’ తెలుగులో దొరికిన మొదటి కవిత అంటూ ఆరుద్ర ఉదాహరించారు.
కవికొండల వెంకటరావు రాసిన నక్కాసామిగాడు కృష్ణాపత్రికలో వన కవితగా ప్రచురితమైంది. 1939లో పఠాభి ‘్ఫడేలు రాగాల డజన్’ మొదటి గ్రంథమని కొందరు, 1938లో వెలువడిన శిష్ట్లా ఉమామహేశ్వరరావు ‘నవమి చిలుక’, విష్ణ్ధునువు మొదటిదని మరికొందరు వ్యాఖ్యానించారు. వచన కవులలో ముద్దుకృష్ణ, నారాయణబాబు, శ్రీశ్రీ, పురిపండా, పాలగుమ్మి పద్మరాజు, పఠాభి, జరుక్శాస్ర్తీ, సంపత్, సింగరాచార్య, అజంతా, బైరాగి, కాళోజీ, దాశరథి, శేషేంద్ర, సినారె వంటి ఎందరెందరో వచన కవితల వెలుగును విస్తరింపజేశారు. దిగంబర కవులు, పైగంబర కవులు, చేతనావర్త కవులు, అనుభూతివాద కవులు, స్ర్తివాద, దళితవాద కవులు, నూతన ప్రక్రియల కవులు వచన కవిత్వానికి జవజీవాలు కల్పించి గౌరవాన్ని పెంచారు. సినారె ‘విశ్వంభర’ జ్ఞానపీఠం పొంది వచన కవిత్వాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్ళింది. ఎందరో ప్రవర్థమాన, వర్థమాన కవులు వచన కవిత్వంలో సరికొత్తదనాన్ని జోడిస్తూ ముందుకు సాగుతున్నారు. శిల్పం, అభివ్యక్తిలో ప్రత్యేకతను సంతరించుకొని ఆదరణీయ ప్రక్రియగా వచన కవిత్వం కొనసాగుతున్నది.
వసివాడని కుసుమం వచనం
మరణపు కొస

మరణాన్ని మోస్తున్న కళ్లు
తడబడినప్పుడు
గుండె తన స్థానాన్ని
మార్చుకున్న అలికిడి
ముందుకు తూలుతున్నది
దేహం మాత్రమే కాదు
భవిష్యత్తుతో పాటు
కొన్ని జతల కలలు కూడాను
మించిన దానికంటే
ముందుకు సాగడమంటే
చీకటి మట్టిని నెత్తిపై పోసుకోవడమే
పాదాలను
భూమిలో తడుపుకోవాలి గాని..
తలను పాతేసుకుంటే
చూపు ఎలా కనపడుతుంది?
కాలిపై కాలేసుకోవడం
హుందాగానే ఉంటుంది...
మర్చిపోకు
నువ్వున్నది మరణశయ్యపై
బహుశ నిమిషపు దూరంలో...
చాలాసేపటి నుండి
నా కాళ్లకు ఏదో గుచ్చుకుంటోంది
తడిమి చూసాను
మనిషి పారేసుకున్న ముందుచూపులు
ఆక్సిడెంట్ జోన్లో
అదుపు చేయడం కాదు
అదుపులో ఉండాలి
అప్పుడే
తూర్పు మొగ్గ విడగడం చూడగలవు...
చీకటి వెలుగులు

జీవితమంటేనే
శబ్ద నిశ్శబ్దాలమయం
జననం నుండి మరణం దాకా...
చీకటి వెలుగుల మధ్య
జరిపే ప్రయాణం!
చీకితోనే కదా...
వెలుగుకు అస్తిత్వం!
నిశ్శబ్దాన్ని ఆశ్రయస్తే కదా...
శబ్దాన్ని ఆస్వాదించగలం!
రాత్రి తర్వాత
పగలు వచ్చినట్లు
కష్టాల కడలి దాటాక
ఇక చేరేది
సుఖాల తీరమే!
నేటి అనుభవమే
రేపటికి
మూలధనం...
కాలగమనంలో కొన్ని క్షణాలు
మనల్ని నిరాశపరిచినా...
అవే...
రేపటి ఆశలకు
తొడుగుతాయ చిగురులు!
అలాగే
శశిని కమ్మిన చీకటి
శాశ్వతం కానట్లు...
మనల్ని కలతపెట్టే
వెతలు తాత్కాలికమే కానీ...
ఉండవు కలకాలం!
ఎటమటం

బువ్వ తినకుంట అలిగిన కొడుకులున
బెదిరిస్తావా, చేరదీస్తవానే బాపు
కష్టమో నిష్టూరమో కడుపునొప్పోని తోని
మాట్లాడతావా, కొట్లాడుతావా సారు
కడుపు సగం ఎండి ఏడుస్తాంటే
ఎసరు పెడతావా, ఎస్లనే పల్గోడుతవానే నాయన
కలుపుకునుడా, అట్లనే ఏకేరే ఉంచుడా
ఎనుకటి మాటలు సుతులాయంచుకోవాలె గని
సంగ సంగ ఎగురుడు ఎందుకే అన్నయ
ముండ్లు కుచ్చితే పండ్లతోని పీకుతనంటివి
గడ్డమీన కూకున్నంక పట్టుకారన్న పట్టవైతివి
పయ్యలు అసలే కదలద్దు
సకల జనుల తడాక సూపియ్యలె
అప్పటి మాటలు యాదికి రావట్టే గదనే పెద్దన్న
సమ్మె అంటే సమ్మెట పట్టవడ్తివి
సంగం గింగం సంగతి సూస్తనంటన్నవ్
ఎట్లనే పెద్దనాయన గిట్ల అయతే
కూకుండ వెట్టి నలుగుట్ల మెప్పియ్య
గిది గుర్రం గది మైదానం, తెల్లగోలు చెయ్య
మేసేటివి మేస్తయ,
తెంపుకునేటివి తెంపుకుంటయ
బండి ఎటమటం నడుస్తున్నట్టున్నది పెద్దబాపు
కొత్తంగా అమ్రిచ్చుకున్నం గదా,
పైలం దొర్రగిల పడగాల.
వేయిపడగల పాపరేడు

కాశీ విశ్వవిద్యాలయం పార్లమెంటు హాలు కిటకిటలాడుతున్నది. హాలు వసారా చుట్టూ కూడా జనం గజిబిజిగా ఇరుక్కుని ఉన్నారు. వేదిక ముందువరుసలో విశ్వవిద్యాలయోపాధ్యక్షులు ఆచార్య నరేంద్రదేవ్, విశ్వవిద్యాలయాచార్యులు, ప్రముఖుడు ఆసీనులయి ఉన్నారు. వేదిక నుంచి -
‘‘గోదావరీ పావనోదార వాఃపూర / మఖిల భారతము మా దన్ననాడు, / తుంగభద్రా సముత్తుంగ రావముతోడ / కవులగానము శ్రుతిగలయునాడు’’ - అని మేఘ గంభీర నిర్ఘోషం వినబడగానే కలకలం చప్పున చల్లారింది. అందరూ చెవులు దోరపెట్టుకొని వినసాగారు. శ్రోతలలో తెనుగు తెలియని హిందీ బెంగాలీవారే పెక్కుమంది. వారిని ఏదో రసధుని ముంచెత్తింది. వేదికనుంచి మరికొంత సేపటికి -
‘‘పరసుఖదశా పరీపా
క రామణియక మెరుంగు కచసాన్నిధ్యా
త్తరమణ ప్రథమ స్పర్శ
ప్రరూఢి మెడవొలిచె సూత్రబంధన వేళన్’’
అని వివాహ ఘట్టమూ, ఆఖరున
‘‘అమరీ కైశిక పారిజాత కుసుమో
హాస్వాదు నీ బాలకాం
డము నీ భక్తుడు శోభనాద్రి దగు సం
తానంబు జన్మాద్యపా
యము తప్పించుతః....’’
అని మంగళ పద్యం వినిపించాయి.
పది నిముషాలపాటు కరతాళ ధ్వనుల కోలాహలం ఆగలేదు. తర్వాత ఆచార్య నరేంద్రదేవ్ లేచి వేదిక అధిరోహించి, పద్యాలు చదివినవారిని గాఢాలింగనం చేసుకొని, ‘‘ఈ గమకం, సంస్కృత వృత్తాలగతి, శయ్య దేశంలోనే అపూర్వం. సంస్కృతాంధ్రాలు ఇంత సహజీవనం చేస్తాయని మాకు తెలియదు. ఇలాటి కవి దేశంలో ఉన్నారని కూడా మేము ఎరుగం. హిందీలో ‘రీతి సంప్రదాయ’ మనే విశిష్ట విధానానికి ప్రవర్తకులు తెనుగువారు. ఈ కవి రచనారీతి భారతదేశంలోనే విశిష్టమయింది. దీనిని ఆంధ్ర రీతి అని కాని, విశ్వనాథరీతి అని కాని అందాము’’ అంటూ ఉండగా జయజయ నినాదాలతో మరొకమారు సభాంగణం ప్రతిధ్వనితమైంది. ఆచార్య నరేంద్రదేవ్ ఆ కవికి దుశ్శాలువలు కప్పి, తులసీ రామాయణం, అవదీ వ్యాకరణం, నిఘంటువు మొదలయినవి బహూకరించారు. పర రాష్ట్రంలో సాటి తెనుగువానికి, తెలుగు వాణికి జరిగిన ఆ మహాగౌరవం తలంచుకుంటేనే ఒళ్లు కడిమిచెట్టవుతుంది. ఆ కవి - శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు. వారిని ఫలానా అని చెప్పడం సూర్యుణ్ని దివిటీతో చూపడమే.
విశ్వనాథవారు పట్టి సాధించని సాహిత్య ప్రక్రియ అంటూ లేదు. మెట్టి చూడని సారస్వతమంటూ లేదు. వారిని తలచుకొన్నప్పుడెల్లా హంపీ విరూపాక్షాలయ గోపురం, దానికి అనతిదూరంలోని పంపాసరోవరం, మహాబలిపురంలోని దీపస్తంభం, దాని పక్కనే దొర్లాడే తరంగ హస్తనిస్తులమై మహోదధి, వింధ్యాటవీమధ్య మణిచిత్ర కూటం, దాని పక్కనే పారే గద్గదనదద్గోదావరీపూరం, వేయి మైళ్ళ వేగంతో వీచే ఝంఝామారుతం, దానిని అనుసరించి వచ్చే అకాల జలధర ధారాసంపాతం, అభ్రం కష శిఖరరాజి విరాజమాన హిమవన్నగం, అగాధాధమై తిమితిమింగిలాకులమైన పసిఫిక్ మహాసాగరం స్ఫురిస్తాయి.
వారు ఇంతటివారు కావడానికి నినాదం, స్వయంకృషీ, పట్టుదలనూ. ఈ గుణాలు ఏర్పడడానికి మూలహేతువు వారు తలయెత్తే నాటికే పిత్రార్జితం పూర్తిగా తుడిచిపెట్టుకొని పోవడం. వారి పితృపాదులు శ్రీ శోభనాద్రిగారు వందంజిల్లర యకరాల పెద్ద భూస్వామి. ఆయన మహభోగి; మహాత్యాగి. వారి యింట భుజించనివారు నందమూరు పరిసర ప్రాంతాలలోనేకాక కృష్ణా జిల్లాలోనే లేరని ప్రతీతి.
విశ్వనాథవారు జన్మించింది నందమూరులోనే (1893), అయినా, విద్యార్థి దశ అంతా బందరులో హిందూ హైస్కూలులోను, నోబుల్ కాలేజిలోను గడిపారు. ఆ దశలో హిందూ హైస్కూలు ఆవరణంలోని కానుగచెట్లెక్కి కూర్చొని, ముచ్చట ముడి సర్దుకుంటూ ‘శృంగార వీథి’ అని పద్యాలు చెప్పారు.
మొదట్లో శ్రీ పింగళి లక్ష్మీకాంతంగారితో కలిసి పద్యాలు చెబుదామని వారికి ఉబలాటగా ఉండేది. ఒకనాడు బందరు రామలింగేశ్వరస్వామి ఆలయంలో కలుసుకున్నప్పుడు ‘‘నీతో కలసి పద్యాలు చెబుదామని ఉందోయ్!’’ అన్నారట. ‘‘్ఛస్: నీకేమి వచ్చు. సంస్కృతమా? తెలుగా? ఇంగ్లీషా?’’ అని పింగళివారు కస్సుమన్నారట. ‘ఇది సంగతి?’ అనుకున్నారు విశ్వనాథవారు. పొంగే రక్తం: పట్టుదల పెరిగింది. సంస్కృతం సాధించదలచుకున్నారు. ‘‘సత్కవి చెళ్లపిళ్ల వేంకన గురువంచు జెప్పి కొనగా నదిగొప్ప’’ అని వారు చెప్పుకున్నా, నిజానికి వారి శిక్షాగురువు శ్రీ విమలానంద భారతి (పూర్వాశ్రమంలో శ్రీ కె.టి.రామారావు). వారితో కలిసి, సంస్కృత రామాయణ భారతాలు పిండి చేశారు. పాణినీయం పుక్కిట బట్టారు. ఈ నిరంతర పరిశ్రమ వల్లనే కాబోలు బి.ఎ. పలుమారు తప్పారు. (డిగ్రీ త్వరగా చేతికి రాలేదనే ఆవేదన శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారికి ‘‘ఆంధ్ర ప్రశస్తి’’ని అంకితమిస్తూ అవతారికలో చెప్పిన ‘‘డిగ్రీలు లేని పాండిత్యము... ఈ పాడు కాలానబుట్టి’’ ఇత్యాదులలో ధ్వనించింది.) తర్వాత వారు ఎం.ఎ., కూడా పాసయారు.
నిరంతర సంస్కృత కావ్య వ్యాసంగంతో విలక్షణత సంపాదిద్దామనే అభినివేశంతో వారి రచన క్లిష్టతరమయింది. అప్పటి బందరు కవులు ముందు మెచ్చుకుంటూ వెనుక వెక్కిరించేవారట. ‘‘పాషాణ పాక ప్రభూ’’ అని కూడా సంబోధించారు. ఆ విమర్శలకు వారి మనసు కొంత కలగుండు పడింది. సంఘర్షణ బయలుదేరింది. ‘‘నా మార్గం నాదే. నేను ఎందుకు ఒకరివెంట పెరుగుపెట్టాలి?’’ అనే నిశ్చయానికి వచ్చారు. ఈ ఆవేదన అర్ధ శతాబ్దిక్రితం కృష్ణా పత్రికలో ప్రకటితమైన కినె్నరసాని పద్యాలలో కనిపిస్తుంది.
వారు జీవిక కోసం నేషనల్, హిందూ, ఎ.సి.కాలేజీలలో కొంతకాలం, విజయవాడ కళాశాలలో ఇరవై ఏళ్లూ ఆంధ్ర భాషాచార్యులుగా ఉన్నా, కరీంనగర్ కళాశాల ప్రిన్సిపాలుగాను ఉన్నా, సాహిత్య అకాడెమీ ఉపాధ్యక్షులుగా ఉన్నా, శాసనమండలి సభ్యులుగా ఉన్నా ప్రధాన వ్యాసంగం రచన. లేడికి లేచిందే వేళ అన్నట్టుగా వారు వెళ్ళిందే కాలేజీ వేళగా గడిచాయి ఉద్యోగాలన్నీ.
వారి తొలి కవిత గిరికుమారుని ప్రణయ గీతాలని అంటారు. మొదటి నవల సగం వ్రాసి వదలిపెట్టారు. ముద్రితమైన మొదటి నవల ఏకవీర. నాటినుంచి పుంఖాను పుంఖంగా పత్రికలలోను, విడిగాను వేయి పడగలు, చెలియలికట్ట, బద్దెన సేనాని, సముద్రపు దిబ్బ, మ్రోయు తుమ్మెద మొదలయిన నవలలు: ఆంధ్రప్రశస్తి, ఋతుసంహారం, విశ్వనాథ మధ్యాక్కరలు, రామాయణ కల్పవృక్షం మొదలయిన కావ్యాలు: కినె్నరసాని పాటలు, కోకిలమ్మ పెళ్ళి, బానిసల దీవి, ఉయ్యాలతాళ్లు మొదలయిన గేయ కావ్యాలు; నర్తనశాల, సౌప్తిక ప్రళయము, అనార్కలీ, వేనరాజు, త్రిశూలం, కళింగరాజ్యం మొదలయిన నాటకాలు; అద్భుత శర్మిష్ఠ సంస్కృత నాటకం వ్రాశారు. ‘మాకళిదుర్గంలో కుక్క’ మొదలైన కథలు ఎన్నో వ్రాశారు. ఇటీవలనే పురాణవైర గ్రంథమాల పేర దాదాపు ఇరవై నవలలు వ్రాశారు. ఇటీవల వ్రాసింది మ్రోయు తుమ్మెద. ఇంకా నేటికి వ్రాస్తున్నారు; రేపూ వ్రాస్తారు.
ఇంత కవిత చెప్పినా, తిరుపతి వేంకటేశ్వరుల శిష్యులమని చెప్పుకున్నా వారు ఎప్పుడూ అవధానం చేయలేదు. ఒకానొకప్పుడు ‘‘ద్రుపదభూపతి యజ్ఞ్ధూమంబు వెంబడి బాహిరిల్లిన చంద్భ్రమరవేణి’’ అని వేణీ సంహార కథ ఆశువుగా మాత్రం చెప్పారు.
ప్రతి రచయిత పాత్రలకూ ఏదో ఆలంబన విభావం ఉంటుందనడం నిజం. కాని, విశ్వనాథవారి పాత్రలు కొంత వేషం మార్చుకొని తిరిగే లోకంలోని మానవులే పూర్తిగా విశ్వనాథవారు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకం మనుష్యుల సావాసంలో ఉంటారు- వారు పరమోత్తములూ కావచ్చు, పరమ నికృష్టులూ కావచ్చు. అలాటి వారి స్వరూప స్వభావాలన్నీ కొంత కల్పనాకల్పంతో వారి తర్వాతి రచనలలో అచ్చయాయన్నమాటే. పిదప అలాటివారి సహవాసం వారికి ఉండదు. ఈ విధంగా తెరచిరాజు ముంజులూరి కృష్ణారావనే నటుని జీవితం. చెలియలికట్ట ‘ఫ్రీలవ్’ ఉద్యమంపై దెబ్బ. హరిజను నాయకుడైన బద్దెన సేనాని నేటి పలువురి గాథల పుట్ట, వేయిపడగలలో నేటి నాయకులు, పత్రికా సంపాదకులు పలువురు మనకు కన్నుల గడుతారు. వేనరాజు బందరు జాతీయ కళాశాల కుళ్లు కడిగివేసిన మడివేలు. దమయంతీ ద్వితీయ స్వయంవరం తమ ఆంధ్ర విశ్వవిద్యాలయోద్యోగ ప్రయత్న నాటకం. మ్రోయు తుమ్మెద కరీంనగరులోని ఒక మహాగాయకుని ఇతివృత్తం. పేరుకూడా కరీంనగర్ పరిసరాల మ్రోయుతుమ్మెద వాగుదే.
విశ్వనాథవారి రచనలలో శాశ్వత లక్ష్యమేకాక సమసామయికోద్యమాల ప్రభావం గలవీ చాల ఉన్నాయి; ‘‘బానిస గుడిసెల పజ్జల పయోరాశి ఎందులకో?’’ అని ఆరంభమై ‘‘వయోరాశి వీచివాత్య పరుపులిడుట ఇందులకా?’’ అని ముగిసే బానిసల ద్వీపం, ‘‘ఎడ్ల కనులకు గంతలు’’ అని ప్రారంభమయ్యే ఉయ్యాల త్రాళ్లు ఆనాటి భారతీయుల బానిస బ్రతుకుకు ముకురాలు.
విశ్వనాథవారి రచనా విధానం విచిత్రాతి విచిత్రం. కూర్చునే బల్ల అవీ ఏమీ లేవు. పద్యాలయితే వందకు పైగా తలలోనే వ్రాసుకుని తర్వాత స్వయంగా కాయితంపై పెడుతారు. వచనమయితే, వారు చెబుతూంటే ఇతరులు వ్రాసుకోవలసిందే. ఏకవీర వ్రాసినప్పుడు మాత్రం ప్రతి శుక్రవారం టెంకాయకొట్టి పూజ చేసి మిత్రులకు వినిపించే వారట. వేయిపడగలు మొదట్లో స్వయంగా వ్రాయడం ప్రారంభించగా మూడు ప్రకరణాలు మూడునెలలు పట్టింది. ఇది సరికాదని చెప్పడం ప్రారంభించి వేయి పుటలు 29 నాళ్ళలో చెప్పారట. నవల ఏదీ నాలుగునాళ్ళకు మించలేదు.
వారి అలవాట్లు మరీ వింతగా ఉంటాయి. వారు మంచి భోక్త. ఆవకాయలో పచ్చి మిరపకాయ కొరుక్కుంటారు. హాస్య ప్రియులు. వారు జిలేబీ జాతి. స్టంట్ సినిమాలన్నా, ఇంగ్లీషు సినిమాలన్నా వారికి ప్రీతి మెండు.
వారి రచనలలో ఏది నిలుస్తుందీ అంటే ప్రతిదీ నిలుస్తుందనేవారున్నారు. కాని, ‘‘తన కావ్యం ప్రతివాడూ గొప్పదంటాడు. ప్రతివాడూ తన అభిప్రాయమే గొప్పదంటాడు. ఎవరో నా ఏకవీర ఉత్తమమన్నారు. నేను ఉత్తమమని ఎందుకనాలి? ఒక తరంపోయి మరొకతరం వచ్చినట్టు చెప్పిన వేయిపడగలు గొప్పది కాదా? దాని గుణగణాలు ఎవరైనా పరిశీలించారా? ఎంతో ‘సైకాలజీ’ గుప్పించిన చెలియలికట్ట ఏమైనట్టు? పురాణ వైర గ్రంథమాలలో ఒక్కొక్క నవలలో ఒక్కొక్క శిల్పం చూపానే? ఎవరైనా చూచారా? మన ప్రమాణాలు నిలుస్తాయా? ఎంతో పోయె! దేవాలయాలే కూలిపోయె!’’ అంటారు వారు.
‘‘అయినా, అన్నిటికన్నా విశ్వనాథ మధ్యాక్కరలు శిల్పవైలక్షణ్యంతోను, భావనా సౌకుమార్యంతోను దేశిచ్ఛందోవిశేషంవల్లను శాశ్వతంగా ఉంటుందండీ’’ అన్నాను. వారు ఒప్పలేదు. ‘‘రామాయణ కల్పవృక్షాన్ని మించిన కవిత్వం ఉండదు. సర్వశక్తులూ పెట్టి వ్రాశాను. పరమేశ్వరుడు అనుగ్రహించాడు. నారాయణుడే పరమేశ్వరుడు’’ అన్నారు వారు.
పత్రికలంటే వారు ఉగ్రులైపోతారు. పత్రికా సంపాదకులకు శిక్షణ అవసరమని వారి సూచన. ప్రతి అడ్డమైనవాడూ వ్రాసినది ప్రచురించి సాహిత్య ప్రమాణాలు పాడుచేస్తున్నారు పత్రికలవారని, బాధ్యత గుర్తెరగడం లేదని వారి విమర్శ.
వారు పట్టుబట్టలు కట్టుకుని భోజనం చేయడం చూచి ఎవరైనా, ‘‘మరీ సనాతన ధర్మం పునశ్చరితవౌతుందా?’’ అని ప్రశ్నిస్తే, ‘‘సనాతన ధర్మం రాదు. కాని వేదమతానుసరణ తప్పదు. అది వినా ప్రపంచ శాంతి ఉండదు. ఏ ఇజమూ గట్టెక్కించదు. వేదిజం ఒక్కటే శరణ్యం’’ అంటారు వారు.
‘‘మీరు సాధించనిది లేదు. సాహితీ సమితి వారి ఆక్షేపణకు కోపం వచ్చి, పాశ్చాత్య సాహిత్యానే్న మధించివేశారు. ఇంగ్లీషులోను, సంస్కృతంలోను, కవిత చెబితే ఎంతో బాగుండును. దిగంతాలకు కీర్తి వ్యాపించేది’’ అని అంటామనుకోండి. ఇంగ్లీషులో ఏ రవీంద్రుడిలాగో, ఇలియట్స్లాగో కవితా భాష వ్రాసే అలవాటు పోయింది. సంస్కృతంలో ఇప్పుడు వ్రాస్తే ప్రాచీన కవుల పరంపరలో ఏ వెయ్యినొక్కటో వాణ్నో అవుతాను. తెలుగులోనంటారా, పనె్నండుగురు ప్రాచీన మహాకవుల తర్వాత పదమూడవ వాణ్ని నేను’’ అంటారు.
లక్షన్నర పుటలకు పైగా వ్రాసిన విశ్వనాథవారు ఏ సిద్ధాంతం చెప్పినా, ఏమి వ్రాసినా వారి రచనలకున్న ప్రాచుర్యం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే మరే కవి రచనలకూ లేదు. వారితో పోల్చదగినవారు అలనాటి క్షేమేంద్రుడు, పడమటి సీమ బాల్జాక్, నేటి రాహుల్ సాంకృత్యాయనులూను.
వేయిపడగల పాపరేడూ, చెలియలికట్ట లేని పసిఫిక్ పాథోనిధీ, మూడడుగులతో నేల కొలిచిన త్రివిక్రముడూ ఒక్క రూపంలో తెనుగు సాహిత్య లోకంలో అవతరించినట్టు నాకు పొడగట్టుతారు విశ్వనాథవారు.
గానగంధర్వుడు ఘంటసాల



డిసెంబర్ 4న ఘంటసాల జయంతి
*
తన గానామృతంతో ఆబాలగోపాలాన్ని ఊహల లోకంలో విహరింపజేసిన గాన గంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు. ఘంటసాల అనగానే ఆ మధుర గాయకుడే ప్రతి ఒక్కరి మనసును తాకుతాడు. జీవితంలో అనేక కష్టనష్టాను చవిచూసి, ఒక్కో మెట్టు ఎదిగి సంగీత ప్రియుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న గాయక దిగ్గజం 4 డిసెంబర్ 1922లో సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని చౌటపల్లి గ్రామంలో తెలుగు బ్రాహ్మణులలో వెలనాటి వైదిక అర్చక కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలో తండ్రి సూర్యనారాయణ ఘంటసాలను భుజాలపై ఎక్కించుకుని భజన కార్యక్రమాలకు, భక్తి సంగీత కచేరీలకు తీసుకుని వెళ్లేవాడు. తండ్రి ఆ కచేరీలలో పాటలు పాడుతుండగా ఘంటసాల అందుకు అనుగుణంగా నాట్యం చేసేవారు. ఆ నాట్యానికి అందరూ ముగ్ధులై ప్రశంసిస్తూ ‘బాల భరతుడు’ అని పిలిచేవారు. ఘంటసాల 11వ ఏట తండ్రి సూర్యనారాయణ కన్ను మూశారు. ఘంటసాల పెద్ద సంగీత విద్వాంసుడు కావాలని సూర్యనారాయణ కోరిక. కానీ తండ్రి మరణంతో ఆ కుటుంబం తల్లి రత్తమ్మ తమ్ముడైన ర్యాలీ పిచ్చయ్య వద్దకు చేరింది.
తండ్రి కల నెరవేర్చడానికి సంగీత శిక్షణ
తాను సంగీత విద్వాంసుడు కావాలని తండ్రి కన్నకలల్ని నెరవేర్చాలనే తపనతో ఘంటసాల గురుకులంలో చేరారు. అక్కడి కట్టుబాట్లను ఆయన తట్టుకోలేక తిరిగి తన ఊరికి వచ్చేశారు. ఆ సమయంలో సమీప గ్రామంలో సంగీత పోటీలు జరిగాయి. ఆ కచేరీలో సంగీత విద్వాంసుడితో పోటీ పడిన ఘంటసాల ఓడిపోయారు. అందరూ నవ్వుకోవడంతో ఆయనలో పట్టుదల పెరిగింది. అప్పటికి ఘంటసాల తొమ్మిదవ తరగతి వరకు మాత్రమే విద్యాభ్యాసం చేశారు. తరువాత చదువు అబ్బలేదు. నాటకాల వాళ్లు పరిచయం కావడంతో సతీసక్కుబాయి, చింతామణి ఇత్యాది నాటకాలలో చిన్నచిన్న వేషాలు వేసేవారు. అయితే ఘంటసాలకు సంగీతంపై మక్కువ తగ్గలేదు. తండ్రి బ్రతికున్న రోజుల్లో ఘంటసాలను అక్కున చేర్చుకుని సంగీత విద్యను నేర్చుకుని తరించమని కోరేవారు. ఆ కారణంగా తనకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల వద్దకు వెళ్లి వాళ్ల ఇళ్లల్లో పనికి కుదిరి సంగీతం నేర్చుకోవాలని ఆయన భావించారు. రెండు సంవత్సరాల కాలంలో ఒకరి ఇంట్లో వంట చేయడం, మరొకరి ఇంట్లో బట్టలు ఉతకడం చేస్తూ సంగీత నేర్చుకోవడం ప్రారంభించారు. ఆ తరువాత సంగీత కళాశాలకు వెళ్లి అభ్యసించడమే సరైన పద్ధతని భావించిన ఘంటసాల తన వద్దగల 50 రూపాయల విలువగల ఉంగరాన్ని ఎనిమిది రూపాయలకు అమ్మి అప్పట్లో ఆంధ్ర రాష్ట్రంలోని విజయనగరంలో కల ఏకైక సంగీత కళాశాలకు చేరుకున్నారు. విజయనగరం చేరేప్పటికి వేసవి సెలవుల కారణంగా కళాశాల మూసి ఉంది. అక్కడి ప్రిన్సిపల్ను అభ్యర్థించగా కళాశాల ఆవరణలో బస చేయడానికి అంగీకరించాడు. సంగీత మహామహులైన ఆదిభట్ల నారాయణ, ద్వారం వెంకటస్వామి నాయుడు వంటి విజయనగర విద్వాంసుల గురించి ఘంటసాల విని ఉన్నారు. ఏది ఏమైనా అక్కడే సంగీత శిక్షణను పొందాలని బలీయమైన సంకల్పానికి పూనుకున్నారు. ఘంటసాల అక్కడే ఉండి రోజుకొక ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవారు. సంగీత కళాశాలలో శిక్షణ చేస్తున్న సమయంలో కొందరు విద్యార్థులు చేసిన తప్పును ఘంటసాలపై వేయడంతో కళాశాల నుండి బహిష్కరించారు. ఈ విషయం తెలిసిన వారాలు పెట్టే కుటుంబాల వారు ఘంటసాలను తమ ఇళ్లకు రావద్దనడంతో భోజనం సమస్య వచ్చి పడింది. ఏం చేయాలో పాలుపోక ఆయన ఎల్లమ్మ గుడికి వెళ్లి తలదాచుకున్నారు. ఆ సమయంలో గుడికి వచ్చిన పట్రాయని సీతారామశాస్ర్తీ ఘంటసాల గురించి తెలుసుకుని తన ఇంట ఉచిత సంగీత శిక్షణ నివ్వడానికి అంగీకరించారు. ఈ కృతజ్ఞతతో ఘంటసాల బ్రతికున్నంత కాలం తన గురువంటే పట్రాయని సీతారామశాస్ర్తీ అని చెప్పుకున్నారు.
మాధుకర భిక్ష
ఇంతలో ఘంటసాలకు మరో చిక్కు వచ్చి పడింది. సంగీత గురువు సీతారామశాస్ర్తీ పేదవాడు కావడంతో భోజన వసతి కల్పించలేక పోయారు. ఆకలితో ఉన్న ఘంటసాల భుజానికి ఒక సాధువు జోలెకట్టి ఇంటింటా అడుక్కోవడం నేర్పించాడు. ఇలా ఆయన మాధుకరం (ఇంటింటికీ తిరిగి అడుక్కోవడం) చేయడం ప్రారంభించారు. భుజాన జోలె కట్టుకుని రెండు పూటలా సరిపడ అన్నాన్ని తెచ్చుకునేవారు. ఒక్కోసారి మిగిలిన అన్నం వస్త్రంలో చుట్టి ఉంచడం వల్ల సాయంత్రానికి చీమలు పట్టి పాడై పోయేది. ఆ సందర్భాలలో ఆయన పస్తులు ఉండవలసి వచ్చేది. ఆ సమయంలో చిన్న గినె్న కనుక్కోవడానికి డబ్బులు లేక మేనమామకు ఉత్తరం రాయగా ఆయన పంపిన డబ్బులతో చిన్న డబ్బా కొనుక్కుని అన్నాన్ని భద్రపరచుకుని తినేవారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న పిదప ‘ఏ తల్లి మొదట కబళం నా జోలెలో వేసిందో ఆమె ఆ వాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తునే ప్రసాదించింది’ అని ఘంటసాల స్వయంగా పలు వేదికలపై చెప్పుకున్నారు. కొందరు ఆకతాయి విద్యార్థుల వల్లనే ఘంటసాల సంగీత కళాశాల నుండి బయటకు వెళ్లవలసి వచ్చిందని తేలిన పిదప తిరిగి వారిని కళాశాలలో చేర్చుకున్నారు. శాస్ర్తీగారి వద్ద సంగీత శిక్షణ పొందడం వల్ల కోర్సును సునాయాసంగా పూర్తి చేశారు. విజయనగరంలో ఆరేళ్లపాటు శాస్ర్తియ సంగీతాన్ని అభ్యసించారు. సంగీతంలో పట్ట్భద్రుడైన తరువాత కొంతకాలం విజయనగరంలో సంగీత కచేరీలు చేశారు. ఆ తరువాత స్వగ్రామమైన చౌటపల్లెకి చేరి శ్రీరామనవమి, శారదా నవరాత్రులు, గణపతి నవరాత్రులు, వివాహ మహోత్సవాలలో సైతం సంగీత కచేరీలు చేస్తూ విద్యార్థులకు సంగీత శిక్షణ నిచ్చేవారు. అనంతరం మద్రాసు చేరి కొంతకాలం ఆలిండియా రేడియోలో శాస్ర్తియ సంగీత కార్యక్రమాలు ఇచ్చారు.
నాటక సమాజ స్థాపన
కేవలం సంగీత కచేరీలతో ఆర్థికంగా పుంజుకోలేమని భావించిన ఘంటసాల ఒక నాటక సమాజాన్ని స్థాపించారు. ఆ సమయంలోనే అద్దంకి శ్రీరామమూర్తి, పోరుపల్లి సుబ్బారావు, సత్యనారాయణ, పులిపాటి వెంకటేశ్వరరావు, పీసపాటి నరసింహమూర్తి, రఘురామయ్య ఇత్యాది పెద్దల పరిచయం ఏర్పడి వారితో నాటకాలలో సైతం నటించారు. అయితే నటుడిగా ఘంటసాలకు ఎటువంటి గుర్తింపూ రాలేదు. ఈ విధంగా ఒకవైపు కచేరీలు చేస్తూ, మరోవైపు సంగీతం శిక్షణనిస్తూ, ఇంకోవైపు నాటకాలు ఆడుతూ పలు సమస్యలతో సతమతవౌతున్న సమయంలో 1942లో ‘క్విట్ ఇండియా’ ఉద్యమం మహోగ్ర రూపం దాల్చింది. ఈ సమయంలో భారత పౌరుడిగా తన కర్తవ్యాన్ని గుర్తెరిగిన ఘంటసాల పర ప్రభుత్వ దాస్యం నుండి భారతదేశాన్ని కాపాడుకోవాలని భావించి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనగా 18 నెలలపాటు అలీపూర్ కారాగారంలో శిక్షను అనుభవించారు. జైలు జీవిత కాలంలో గోపాలరెడ్డి, పొట్టి శ్రీరాములు, ఎర్నేని సుబ్రహ్మణ్యం ఇత్యాది నాయకుల సహచర్యంలో ఘంటసాల అనేక విషయాలు నేర్చుకున్నారు.
వివాహం
ఘంటసాల జైలు నుండి విడుదలైన పిదప తిరిగి తన సంగీత, నాటక కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. ఈ సమయంలోనే తన మేనకోడలైన సావిత్రమ్మతో 4 మార్చి 1944న ఘంటసాలకు వివాహం జరిగింది. తన పెళ్లిలో తనే సంగీత కచేరీ చేసి ఆయన అందరినీ సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తారు. పెళ్లి జరిగిన కొంతకాలానికి అత్తగారి గ్రామమైన పెదపులివర్రుకు సముద్రాల రాఘవాచారి వచ్చారు. అప్పటికే సముద్రాల వారు సినీ పరిశ్రమలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఘంటసాల ప్రతిన గురించి విన్న సముద్రాల రాఘవాచారి ఒకసారి మద్రాసు వచ్చి కలవమన్నారు. సముద్రాల రాఘవాచారిని కలిసిన ఘంటసాలను రేణుకా ఫిలిమ్స్కు తీసుకువెళ్లి చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిల ముందు పాటలు పాడించారు. ఆ పాటలు విన్న వారిద్దరూ అవకాశం ఉన్నప్పుడు తప్పక సినిమాలలో పాడిస్తామని మాట ఇచ్చారు.
సినీ రంగంలోకి ఘంటసాల
సినీ అవకాశాల కోసం మద్రాసు వెళ్లిన ఘంటసాలకు సముద్రాల రాఘవాచారి తన ఇంట బస ఏర్పాటు చేశారు. ఆ ఇల్లు చాలా చిన్నది కావడంతో సముద్రాల వారిని కష్టపెట్టడం ఇష్టంలేని ఘంటసాల అక్కడ నుండి తన మకాంను పానగల్ పార్కుకు మార్చి వాచ్మేన్కు నెలకు రెండు రూపాయలు చెల్లించి అక్కడే బస చేశారు. పగలంతా అవకాశాల కోసం తిరిగి రాత్రికి పార్కులో నిద్రపోయేవారు. పార్కులో ఆకలితో ఉన్నవారికి తన భోజనంలో కొంచెం పెట్టి ఆకలి తీర్చేవారు. ఈ తరుణంలో సముద్రాల వారు మద్రాసు ఆలిండియా రేడియోలో లలిత గీతాల గాయకుడిగా ఘంటసాలకు అవకాశం ఇప్పించారు. ఇలా రేడియోలో పాటలు పాడుతూ, గాయకుడిగా సినీ అవకాశాల కోసం తిరుగుతూ, అప్పుడప్పుడూ సినిమాలలో చిన్నాచితకా వేషాలు వేస్తూ, మధ్యమధ్యలో బృంద గానాలలో పాడుతూ సినీరంగ ప్రముఖుల దృష్టిని ఆకర్షించారు.
ఘంటసాల గళానికి తిరస్కారం
మద్రాసు వెళ్లిన కొత్తలో తన గొంతు గ్రామఫోన్ రికార్డు పాడటానికి పనికి వస్తుందా? చూడమని ఘంటసాల ‘హిజ్ మాస్టర్స్ వాయిస్’ కంపెనీకి వెళ్లారు. అప్పట్లో ఆ గొంతు విన్నవారు ఈ గొంతు మైక్కు పనికిరాదని తేల్చి చెప్పారు. ఆ తరువాత పేకేటి శివరాం ‘హిస్ మాస్టర్స్ వాయిస్’ ఆర్కెస్ట్రా ఇన్చార్జ్ అయిన పిదప అవకాశం ఇవ్వడంతో ఘంటసాల గానం చేసిన తొలి గ్రామఫోన్ రికార్డు హెచ్.ఎం.వి. వారు విడుదల చేశారు. ఆ రికార్డులు బాగా అమ్ముడు పోవడంతో ఘంటసాలకు మంచి గుర్తింపు వచ్చింది.
సినీ గాయకుడిగా అవకాశం
తొలుత భానుమతి, రామకృష్ణలు తీసిన ‘స్వర్గసీమ’ చిత్రంలో ‘ఓహో నా రాజ’ పాట ద్వారా ఘంటసాల గళం తెలుగు చిత్రసీమకు పరిచయమయింది. తొలి పాటే భానుమతి సరసన పాడే అవకాశం పొందారు ఘంటసాల. భానుమతి వంటి సీనియర్ నటీమణి సరసన పాడటానికి తొలుత ఆయన భయపడ్డారు. చిత్తూరు నాగయ్య ధైర్యం చెప్పగా ఘంటసాల పాడిన ఆ పాటకు రూ.116 పారితోషికం పొందారు. తరువాత భానుమతి తీసిన ‘రత్నమాల’ చిత్రానికి సహాయ సంగీత దర్శకుడిగా అవకాశం లభించింది. ఆ చిత్రానికి సి.ఆర్.సుబ్బరామన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. వారికి సహాయ సంగీత దర్శకుడిగా ‘రత్నమాల’ చిత్రానికి తొలిసారిగా టైటిల్స్లో ఘంటసాల పేరు వేశారు. ఆ చిఅతంలో కొన్ని పాటలకు వరుసలు కట్టారు. సుబ్బరామన్ ఘంటసాల వారిని ‘రాజా’ అని పిలిచేవారు. 1947లో తన కుటుంబాన్ని మద్రాసుకు పిలిపించుకుని ఒక అద్దె ఇంట్లో కాపురమున్నారు ఘంటసాల. 1946-47 మధ్య ప్రాంతంలో ఘంటసాల వందకు పైగా కచేరీలు చేశారు. తదుపరి మన దేశం, బాలరాజు వంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించగా అవి ఎంతో ప్రజాదరణ పొందాయి. 1948లో విడుదలైన ‘బాలరాజు’ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావుకు నేపథ్య గానం అందించారు. ఇది ఆయన సంగీత జీవితాన్ని మలుపు తిప్పింది. ఘంటసాల సంగీతం నేర్చుకునేటప్పుడు ముద్దు పాపారావు
ఘంటసాల (10వ పేజీ తరువాయ)
అనే స్నేహితుడుండేవాడు. 1947లో ఆయన ఘంటసాలకు ఒక ఉత్తరం రాశరు. ‘అన్నా వెంకటేశ్వరరావు. నువ్వింత అన్యాయం చేస్తావనుకోలేదు. వాచీ కొనిపెట్టమంటే గొప్పవాడినయితే చూద్దాం అన్నావు. ఇప్పుడు గొప్పవాడివయ్యావు కదా? ఏదీ నా వాచీ’ అంటూ విజయనగరంలో ఉన్నప్పటి మాట గుర్తు చేశాడు పాపారావు. ఆ ఉత్తరం చదివిన ఘంటసాల వంద రూపాయలు మనియార్డర్ చేసి వాచీ కొనుక్కోమని ఉత్తరం రాశారు. మద్రాసు వస్తే హార్మోనియం వాయించడానికి మంచి అవకాశాలు కూడా లభిస్తాయని ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ, పాపారావుకు టైఫాయిడ్ జ్వరం రావడంతో లేఖ చేరేలోపే ఆయన చనిపోయాడు. ఈ సంఘటన ఘంటసాలను కలచివేసింది. ఆ తరువాత పాపారావు కుమారుడు నరసింగరావును తన ఇంట్లోనే పెట్టుకుని సొంత కుమారుడిలా పెంచి విద్యాబుద్ధులు నేర్పించారు. ఇది ఘంటసాల ఔదార్యానికి మచ్చుతునక
వెనుతిరగని ఘంటసాల
ఈ విధంగా సినీ ప్రస్థానం చేసిన ఘంటసాల వెనుతిరిగి చూసుకోలేదు. ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘లక్ష్మమ్మ’. ఈ చిత్రం నాలుగు సంస్థల చేతులు మారి 1950లో విడుదలైంది. ఆ చిత్రంలో నాయకిగా నటించిన కృష్ణవేణికి ‘లక్ష్మమ్మ’ చిత్రంలో పాటలు బాగా నచ్చడంతో ‘మన దేశం’ చిత్రంలో ఘంటసాలకు అవకాశం కల్పించారు. ఇది ఎన్టిఆర్ తొలి చిత్రం. 1951లో విడుదలైన ‘పాతాళభైరవి’ చిత్రం విడుదలతో తెలుగునాట ఘంటసాల పేరు మారుమ్రోగిపోయింది. ఆ సమయంలోనే మద్రాసులో ఇల్లు కొనుక్కుని కుటుంబాన్ని తెచ్చుకున్నారు. గృహ ప్రవేశం సందర్భంగా తన గురువైన సీతారామ శాస్ర్తీని మద్రాసుకు రావలసిందిగా ఆహ్వానంతోపాటు రైలు ఛార్జీలు కూడా పంపారు. గృహ ప్రవేశానికి వచ్చిన గురువుగారిని వెయ్యి నూట పదహార్లు, నూతన పట్టువస్త్రాలను వెండిపళ్లెంలో పెట్టి సత్కరించి సాష్టాంగ నమస్కారం చేసి తన గురుభక్తిని చాటుకున్న నిగర్వి ఘంటసాల. గృహ ప్రవేశ సమయంలోనే పాతాళభైరవి శత దినోత్సవ వేడుకలు జరిగాయి. ఘంటసాల హాజరు కాలేక పోవడంతో జ్ఞాపికను అందుకోలేక పోయారు. ఘంటసాల, సావిత్రమ్మ దంపతులకు 1951లో ఒక కొడుకు పుట్టాడు. విజయా సంస్థతో అనుబంధానికి గుర్తుగా ఆ అబ్బాయికి వేంకట సుబ్రహ్మణ్య విజయకుమార్ అని నామకరణం చేశారు. ఆ మీదట సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో ఘంటసాల వారు ‘మల్లీశ్వరి’ చిత్రంలో పాడిన పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. 1951లో విడుదలైన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావుకు ఘంటసాల నేపథ్య గానాన్ని అందించారు. విజయా వారు 1952లో నిర్మించిన ‘పెళ్లి చేసి చూడు’ అనే తెలుగు చిత్రానికి, ‘కల్యాణం పణ్ణిప్పార్’ అనే తమిళ చిత్రానికి ఘంటసాల సంగీత దర్శకత్వం వహించారు. ఇదే ఏడాది నిర్మించిన ‘పల్లెటూరు’ అనే చిత్రంలో తన గురుపుత్రులు బృందగానాన్ని పాడే అవకాశాన్ని ఘంటసాల కల్పించారు. అదే సమయంలో ఆంధ్రులకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని 19 అక్టోబర్ 1952లో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్షను పూనారు. ఈ నేపథ్యంలో శ్రీరాములు 15 డిసెంబర్ 1952లో మరణించారు. ఆయన భౌతిక కాయాన్ని ఊరేగింపుగా తీసుకుని వెళుతుంటే అంతిమ యాత్రలో పాల్గొన్న ఘంటసాల అనేక దేశభక్తి గీతాలను ఆలపించారు. తన తమ్ముడు సదాశివుడికి ఏదైనా చేస్తే బాగుంటుందనుకున్న ఘంటసాల చిత్ర నిర్మాతగా అతడ్ని నిలబెట్టాలని మరి కొందరితో కలిసి ‘పరోపకారం’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం సరిగా ఆడకపోవడంతో ఘంటసాల అప్పుల పాలయ్యారు. చలనచిత్ర నిర్మాణంలో తగిన అనుభవం లేని కారణంగానే ఘంటసాల చేతులు కాల్చుకుని అనేక రోజులు బాధపడ్డారు.
1953లో విడుదలైన ‘దేవదాసు’ చిత్రం ఆయన జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. తెలుగు చిత్రసీమలో ఘంటసాల పేరు సుస్థిరమైంది. ‘దేవదాసు’ చిత్రంలో తన నటన కంటే ఘంటసాల వారి పాటలే తనకు చాలా ఇష్టమని అక్కినేని నాగేశ్వరరావు అనేక సందర్భాలలో చెప్పారు. మద్రాసు మ్యూజిక్ అకాడెమీ వారి వార్షిక సంగీత సభలో పాల్గొనడానికి 1953లో ప్రముఖ హిందుస్థానీ సంగీత విద్వాంసుడు బడే గులాం అలీఖాన్ తన ఎనిమిది మంది బృందంతో మద్రాసు వచ్చారు. వారి గానామృతానికి పరవశించిన ఘంటసాల వేదికపైకి వెళ్లి గులాం అలీఖాన్ను ఆలింగనం చేసుకున్నారు. ఆ బృందం రెండు నెలలపాటు భారతదేశంలో ఉండి కచేరీలు చేయాలనుకున్నారు. కానీ సరైన బస లభించకపోవడంతో కలవరపడుతుంటే వారందరికీ ఘంటసాల తన ఇంట బసను ఏర్పాటు చేశారు. ఆ తరువాత 1954 ఫిబ్రవరిలో వాహినీ స్టూడియోలో గులాం అలీఖాన్ కచేరీని ఘంటసాల ఏర్పాటు చేయించి మూడు గంటలసేపు గానం చేయించారు.
ఘంటసాల ప్రభంజనం
1955 తరవాత ఘంటసాల ప్రభంజనం మొదలైంది. ఆ ఏడాది ఆయన సంగీత దర్శకత్వంలో మొత్తం ఏడు చిత్రాలు విడుదల కావడం విశేషం. వాటిలో నాలుగు తమిళ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇదే ఏడాది విడుదలైన ‘అనార్కలి’ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చి పెట్టింది. 1956లో ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన ‘సొంత ఊరు’ చిత్రంతోపాటు కనకతార, చిరంజీవులు, జయం మనదే చిత్రాలు కూడా విడుదలయ్యాయి. 1957లో ఆయన సంగీత దర్శకత్వం వహించిన మాయాబజార్, వినాయకచవితి, సతీ అనసూయ, సారంధర చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ‘మాయాబజార్’ చిత్రం చక్కటి పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించి పెట్టింది. 1958లో ఆయన సంగీత దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం ‘గిరిజా కల్యాణం’ విడుదలైంది. అదే ఏడాది పార్వతీ కల్యాణం, పెళ్లినాటి ప్రమాణాలు, మంచి మనసుకు మంచి రోజులు ఇత్యాది నాలుగు చిత్రాలకు సంగీతం సమకూర్చారు. 1959లో సతీ సుకన్య, పెళ్లి సందడి, శభాష్ రాముడు చిత్రాలకు సంగీతం సమకూర్చారు. 1960లో విడుదలైన ‘శ్రీ వెంకటేశ్వర మహత్యం’ చిత్రంలో ‘శేషశైలావాస శ్రీ వేంకటేశ’ అనే పాటలో తెరపై కూడా ఘంటసాల స్వయంగా పాడుతున్నట్లు చిత్రించారు. 1961లో ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన శభాష్ రాజా, శ్రీకృష్ణ కుచేల చిత్రాలు విడుదలయ్యాయి. ఇదే ఏడాది ఆయన అద్భుతంగా పాటలు పాడిన జగదేక వీరుని కథ, భక్త జయదేవ, భార్యాభర్తలు, వాగ్దానం, వెలుగు నీడలు చిత్రాలు కూడా విడుదలయ్యాయి. 1962లో ఆయన గుండమ్మ కథ, టైగర్ రాముడు, రక్త సంబంధం చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. అటు గాయకుడిగా, ఇటు సంగీత దర్శకుడిగా ఘంటసాలకు తృప్తినిచ్చిన చిత్రం ‘గుండమ్మ కథ’. 1963లో లవకుశ, ఆప్తమిత్రుడు, బందిపోటు, వాల్మీకి చిత్రాలకు, 1964లో గుడిగంటలు, మర్మయోగి, వారసత్వం, శ్రీ సత్యనారాయణ మహత్మ్యం చిత్రాలకు సంగీతం సమకూర్చారు. 1964లో విడుదలైన అమరశిల్పి జక్కన, ఆత్మబలం, డాక్టర్ చక్రవర్తి, మూగమనసులు వంటి అనేక చిత్రాలు గాయకుడిగా ఘంటసాలకు కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించి పెట్టాయి. 1965లో పాండవ వనవాసం, సిఐడి, 1966లో పరమానందయ్య శిష్యుల కథ, శకుంతల, 1967లో నిర్దోషి, పుణ్యవతి, భువనసుందరి కథ, రహస్యం, పెద్దక్కయ్య, స్ర్తిజన్మ, వీరపూజ, 1968లో గోవుల గోపన్న, చుట్టరికాలు, జీవితబంధం, 1969లో జరిగిన కథ, భలే అబ్బాయిలు, 1970లో అలీబాబా నలభై దొంగలు, విజయం మనదే, మెరుపు వీరుడు, తల్లిదండ్రులు, రెండు కుటుంబాల కథ, 1971లో పట్టుకుంటే లక్ష, పట్టిందల్లా బంగారం, రామాలయం, రంగేళీ రాజా, 1972లో మేనకోలు, రామరాజ్యం, వంశోద్ధారకుడు, 1973లో తులసి ఇత్యాది అనేక చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. 1970 వరకు ప్రతి పాట ఘంటసాల పాడిందే అన్నా అతిశయోక్తి లేదు. సినిమాలకు సంబంధం లేకుండా దైవ భక్తిగీతాలు, దేశభక్తి గీతాలు, ఖండకావ్యాలు ఎన్నో ఆలపించారు. మహాకవులు గురజాడ అప్పారావు రచించిన ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ శ్రీశ్రీ కలం నుండి జాలువారిన ‘పొలాలన్నీ హలాల దున్ని’ ‘ఆనందం అర్ణవమైతే’ అనే గేయాలు, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్ర్తీ రచించిన ‘పుష్పవిలాపం’ ‘కుంతీకుమారి’ ఇత్యాది ఖండకావ్యాలకు సంగీతం సమకూర్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి తరఫున వంద అన్నమాచార్య కీర్తనలను పాడారు. దక్షిణ భారతదేశంలోని అనేక గ్రామాలు, పట్టణాలలో కచేరీలు చేసి ప్రజల ప్రశంస లందుకోవడంతోపాటు లెక్కలేనన్ని కళాసంస్థల, ప్రజా సంఘాల సత్కారాలు, పురస్కారాలు అందుకున్నారు. అప్పటి రాష్టప్రతి సర్వేపల్లి రాధాకృష్ణ సమక్షంలో ఘంటసాల పాడి ప్రశంసలందుకున్నారు. జగదేవవీరుని కథ చిత్రంలో ‘శివశంకరి’ అనే పాటను 14 రోజుల పాటు రిహార్సల్స్ చేసిన పిదప ఒకే టేక్లో రికార్డింగ్ జరిపించిన గాయక దిగ్గజం ఘంటసాల.
ఘంటసాలకు అనారోగ్యం
ఘంటసాల తల్లి రత్నమ్మ 1968 నవంబర్లో మరణించారు. ఆ తదుపరి సంవత్సరం 1969 తరువాత ఆయన తరచూ అనారోగ్యానికి గురయ్యారు. 26 జనవరి 1970లో గణతంత్ర దినోత్సవం నాడు ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అప్పటి రాష్టప్రతి వి.వి.గిరి చేతుల మీదుగా ఘంటసాల పద్మశ్రీ అందుకున్నారు. 1971లో అమెరికా, ఐరోపా దేశాలలో పర్యటించి కచేరీలు చేసి సంగీత ప్రియులను అలరించారు. అమెరికా వెళ్లి ప్రవాస భారతీయుల కోసం ఆయన పాడిన రఘుపతి రాఘవ రాజారాం, హరేరామ, హరేకృష్ణ పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 1972 అక్టోబర్లో రవీంద్రభారతిలో కచేరీ చేస్తుండగా గుండెనొప్పి అనిపించి ఉస్మానియా ఆసుపత్రిలో చేరి నెల రోజులపాటు ఉన్నారు. చాలాకాలం నుండి చక్కెర వ్యాధితో బాధపడుతున్న ఘంటసాల కొంతకాలం చికిత్స పొంది ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చారు. ఆ సమయంలోనే భగవద్గీత పాడాలనే కోరిక ఆయనకు కలిగింది. భగవద్గీత పాడే సమయంలో కాషాయ దుస్తులు ధరించి నేలపై పడుకునేవారు. ఘంటసాల పాడిన భగవద్గీత ఆయన జీవితంలో ఒక కలికితురాయి అని చెప్పవచ్చు. ఆ శ్రీకృష్ణ భగవానుడే వచ్చి భగవద్గీతను ఆలపించాడా? అన్నంత గొప్పగా ఆయన ఆలపించారు. భగవద్గీత పూర్తి చేసిన తరువాత సినిమాలలో పాడకూడదని ఆయన భావించినప్పటికీ పాడటం తప్పలేదు. 1972లో విడుదలైన భార్యాబిడ్డలు, విచిత్రబంధం, మేనకోడలు, రైతు కుటుంబం, బీదలపాట్లు, వంశోద్ధారకుడు, దత్తపుత్రుడు, బాలభారతం, సంపూర్ణ రామాయణం, బడిపంతులు, కాలం మారింది, కుల గౌరవం, కొడుకు-కోడలు, పండంటి కాపురం, మంచి రోజులు వచ్చాయి ఇత్యాది అనేక చిత్రాలలో ఆయన పాటలు పాడారు. ఆ తరువాత 1973లో భక్తతుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు ఇత్యాది అనేక చిత్రాలకు పాటలు పాడారు. ఆ చిత్రాలు విజయవంతంగా నడిచాయి. ఆ మీదట ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో 11 ఫిబ్రవరి 1974లో ఘంటసాల ఆస్పత్రిలోనే కన్నుమూశారు. ఆయన మరణవార్త విని తెలుగు జాతి శోక సముద్రంలో మునిగిపోయింది. తన గానామృతంలో ప్రజలను సంగీత ప్రపంచంలో విహరింపజేసిన ఆ గాన గంధర్వుడు అమరలోకాలకు చేరారు. తుది శ్వాస విడిచేవరకు నేను పాడుతూనే ఉండాలని ఘంటసాల, ఊపిరి ఉన్నంతవరకు నేను నటిస్తూనే ఉండాలని అక్కినేని నాగేశ్వరరావు అనుకునేవారు. ఘంటసాల మరణించినప్పుడు భౌతికకాయాన్ని చూడటానికి అక్కినేని వెళ్లకపోవడంతో విమర్శలు వెలువెత్తాయి. కానీ ఆ సమయంలో అక్కినేని గుండె జబ్బుతో బాధపడ్తున్నారు. అనారోగ్య సమస్యలతో వెళ్లడాన్ని వైద్యులు నిరాకరించడంతో అక్కినేని వెళ్లలేక పోయారు. ఘంటసాల చనిపోయిన రెండు నెలలకు 22 ఏప్రిల్ 1974లో ఎన్టీఆర్ విజయవాడ దుర్గా కళామందిర్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో భగవద్గీత రికార్డులను ఆవిష్కరించి తొలి రికార్డును కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకు అందజేశారు. భగవద్గీత గానం ద్వారా ఘంటసాల తెలుగు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, సింహళం ఇత్యాది అనేక భాషల్లో దాదాపు 13వేలకు పైగా పాటలు పాడి, 107 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన ఘంటసాల ప్రజల హృదయాలలో సుస్థిరం సంపాదించుకున్నారు. దాదాపు రెండు వేల విభిన్న పాటలకు ఆయన స్వరకల్పన చేశారు. పుట్టపర్తి సత్యసాయిబాబాకు ఆయన పరమభక్తుడు. కంచి కామకోటి పీఠాధిపతిని కూడా వారు కలిసేవారు. తిరుపతికి వెళ్లి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు. ఘంటసాల, సావిత్రమ్మ దంపతులకు ఇద్దరు మగ సంతానం విజయకుమార్, రత్నకుమార్, ముగ్గురు ఆడసంతానం శ్యామల, సుగుణ, శాంతి. పెద్ద కుమారుడు విజయకుమార్ కాలం చేశారు. చిన్న కుమారుడు రత్నకుమార్ ప్రస్తుతం కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చెన్నైలో ఉన్నారు. భార్య సావిత్రమ్మ చెన్నైలోని తన కుమార్తె శాంతి వద్ద ఉంటున్నారు. మరో ఇద్దరు కుమార్తెలు శ్యామల, సుగుణ హైదరాబాద్లో ఉంటున్నారు.
భారత ప్రభుత్వ తపాలా శాఖ వారు ఘంటసాల స్మృతికి గౌరవంగా 11 ఫిబ్రవరి 2003లో ఆయన ముఖారవిందంతో అయిదు రూపాయల తపాలా బిళ్లను విడుదల చేసింది. నాలుగు లక్షల స్టాంపులను అప్పట్లో ముద్రించారు. వారి కుమారుడు రత్నకుమార్ ‘పితృదేవోభవ’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఈ స్టాంపును విడుదల చేశారు. అప్పటి కేంద్ర కమ్యూనికేషన్ శాఖామాత్యులు తిరువనావుక్క రసర్ తొలి స్టాంపును ఘంటసాల సతీమణి సావిత్రికి అందజేశారు. దక్షిణ భారత నటీనట సమాఖ్య వారు 1962లో ఏర్పాటు చేసిన సభలో అప్పటి ఉపరాష్టప్రతి జాకీర్ హస్సేన్ చేతుల మీదుగా ఆయన సత్కారం పొందారు. 1971లో యుఎస్ఏ ప్రభుత్వం ఆయనకు శాంతి పతకాన్ని అందించింది. లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు ఘంటసాలను వరించాయి. నేటితరం గానగంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో సినీ మాటల రచయిత డా.పరుచూరి గోపాలకృష్ణ రచనలో వెలువడిన ‘మన ఘంటసాల’ గ్రంథంలో ఆయన జీవిత చరిత్రను అద్భుతమైన ఛాయాచిత్రాలతో ప్రచురించారు. ఈ గ్రంథానికి బాపు గీసిన ఘంటసాల వారి చిత్రాన్ని ముఖ చిత్రంగా ముద్రించారు. జర్మనీకి చెందిన కుర్త్వెబర్ అనే చిత్రకారుడు ఘంటసాల రేఖా చిత్రాన్ని చిత్రించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఘంటసాల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో కోటి రూపాయల వ్యయంతో 2002లో ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత, నృత్య కళాశాలను ప్రారంభించి సంగీతం, నృత్యంలో ఏడాదికి వందలాది మందికి శిక్షణనిస్తున్నారు.
నేటి తరం గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం హైదరాబాద్ లలిత కళాతోరణంలో నెలకొల్పిన ఘంటసాల విగ్రహాన్ని ప్రముఖ హిందీ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ 14 ఫిబ్రవరి 1993లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి సమక్షంలో ఆవిష్కరించారు.
ఘంటసాల భౌతికంగా మన మధ్య లేకున్నా అందరి హృదయాలలో కొలువైవున్న ఆ గానగంధర్వుడు, అమర గాయకుడికి నివాళులర్పిస్తూ అనునిత్యం స్మరించుకుంటూనే ఉన్నారు.
డార్క్ అవెన్యూ-8

కారు వెళ్తోంది. భార్గవి సమీర్ వంక చూసి అడిగింది.
‘శివప్రసాద్ వర్మ ఎక్కడున్నాడో కచ్చితంగా తెలిసినట్టే కదా?’
శివప్రసాద్ వర్మ ఎక్కడున్నాడో చెప్పాడు సమీర్.
‘అక్కడా? పెద్ద కోటీశ్వరుడు.. అలాంటి హోటల్లో?’
‘స్టార్ హోటల్లో ఉండే తాహత్తు లేక కాదు. స్టార్ హోటల్ అయితే తన ఐడెంటిటీ బయటపడుతుందన్న భయం. అందరి దృష్టి పడుతుంది. ఇలాంటి చిన్న హోటల్స్ అయితే ఎవరూ పట్టించుకోరు. తన పని తాను చేసుకుపోవచ్చు’ చెప్పాడు సమీర్.
‘క్రిమినల్ మైండ్ కదూ...’ అంది భార్గవి.
‘అతను క్రిమినల్ కాబట్టి కదా.. మనం అతడిని వెతుక్కుంటూ వెళ్తున్నాం’ నవ్వి అన్నాడు సమీర్.
‘నిజమే.. కానీ మరీ ఇంత క్రిమినల్ మైండా? డబ్బు కోసం స్వంత చెల్లెలిని.. చెల్లెలి కుటుంబాన్ని’
‘కన్నవాళ్లనే నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు. డబ్బుకన్నా అతి శక్తివంతమైనది మరోటి లేదని కొందరి నమ్మకం. అందుకే ఎంత డబ్బు వున్నా ఇంకా డబ్బు కోసం వెంపర్లాడుతూనే ఉంటారు. విషాదకరమైన విషయం ఏమిటంటే పది తరాలకు సరిపడే డబ్బు వున్నా ఇంకా డబ్బు కోసం పరిగెడుతూనే ఉంటారు. కదిలే కాలాన్ని.. కరిగిపోయే విలువైన జీవితాన్ని పట్టించుకోకుండా’ చెప్పాడు సమీర్.
అలాగే సమీర్ వంకే చూస్తోంది భార్గవి. ఎంత చక్కగా విశే్లషించాడు.
ఎప్పుడూ సీరియస్గా ఉండే సమీర్ ఇంత లోతుగా ఆలోచిస్తాడని అనుకోలేదు..
అన్నింటికన్నా ఆమెకు సమీర్లో నచ్చింది -పక్కన అందమైన అమ్మాయి అందుబాటులో వున్నా.. చాలా డీసెంట్గా ఉండడం. అతనితో ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లొచ్చు’ అనేంత భరోసా ఇస్తాడు.
ముఖ్యంగా అతను పక్కనుంటే ప్రశాంతంగా సెక్యూర్డ్గా ఉంటుంది.
‘నాకు తెలిసి మనం వెళ్లేసరికి అతను ఉండకపోవచ్చు’ అన్నాడు సమీర్.
‘అదేమిటి?’
‘అదంతే.. ఎందుకంటే మనకన్నా అతను ఇంకా అడ్వాన్సులో ఉన్నాడు.. ఎప్పుడైతే దుర్జన్కుమార్ చనిపోయాడో.. అప్పుడే అతను ఎలర్ట్ అయ్యాడు’
భార్గవి కళ్లు మూసుకుంది. ఒక్కసారిగా ఏదో మగతగా అనిపించింది. కళ్లు బలవంతంగా తెరచి చూసి భయంతో బిగుసుకు పోయింది.
ఎదురుగా తమ కారుకు ఎదురుగా ఒక వృద్ధుడు వస్తున్నాడు. పొడవాటి తెల్లటి గడ్డం.. తీక్షణమైన చూపులు.. రోడ్డుకు అడ్డంగా...
‘కారాపండి’ గట్టిగా అరిచింది భార్గవి.
ఆమె మాటలతో సడెన్గా కారు ఆపారు. కీచుమని శబ్దం చేస్తూ కారాగింది. కారు ఎక్కువ స్పీడ్లో వెళ్లడం లేదు.. లేకపోతే పల్టీలు కొట్టేది.
‘ఏమైంది?’ కంగారుగా అడిగాడు సమీర్ భార్గవి భుజాలు పట్టి కుదుపుతూ. భార్గవి ఒక విధమైన షాక్లో వుంది. ఢిల్లీలో ఎలాంటి సంఘటన ఎదురైందో.. అలాంటి సంఘటనే...
‘కారుకు ఎదురుగా...’
సమీర్ రోడ్డు మీదికి చూశాడు.. ఏమీ లేదు.
‘నువ్వు ఏదో చూసి ఊహించుకుని భయపడ్డావు’ అన్నాడు సమీర్ డ్రైవర్ వైపు చూసి కారు పోనివ్వమని చెబుతూ..
‘తాను చూసింది నిజమే..’ అని సమీర్ని ఎలా నమ్మించాలో అర్థం కాలేదు.
* * *
అది చాలా పురాతనమైన హోటల్.. డొక్కు మంచం.. పెద్ద శబ్దంతో తిరిగే ఫ్యాన్.. ఇనుప కుర్చీలు.. ప్లాస్టిక్ వాటర్ బాటిల్.. ఒక కుర్చీలో రాజేంద్రనాథ్ కూచున్నాడు.
పంచె కట్టుకుని వున్నాడు. పంచె పైభాగంలో మినహా ఎలాంటి ఆచ్ఛాదనా లేదు. నుదురు మధ్యలో పెద్ద కుంకుమబొట్టు.. ఇనుప మంచం మధ్యలో నల్లటి వస్త్రం.. దాని మధ్యలో నిమ్మకాయలు.. కుంకుమ.. పద్మాసనంలో కూచున్నాడు. కళ్లు మూసుకున్నాడు. ధ్యానంలోకి వెళ్లాడు.
అతనే శివప్రసాద్ వర్మ.. చంద్రకళ అన్నయ్య.
అతను కళ్లు మూసుకోగానే చీకటి తెరలు కనిపించాయి.
ఆ చీకటి తెరల నుంచి వెలుతురు.. చితి తాలూకు వెలుతురు...
జంగానియా తీశ్మార్.. చితి ముందు కూచొని క్షుద్రోపాసన చేస్తోన్న తీశ్మార్...
‘శివప్రసాద్ వర్మ.. నువ్వు వెంటనే బయల్దేరి వచ్చేయ్. క్షుద్రోపాసనలో ఆఖరి ఘట్టం మొదలైంది. అర్ధరాత్రి రెండు గంటలకు దుర్ముహూర్తం.. క్షుద్రశక్తులు బలిని స్వీకరించే సమయం...
చంద్రకళ ఆత్మార్పణతో క్షుద్రశక్తులు నిధిని నీకు స్వంతం చేస్తాయి. నువ్వు బయల్దేరి రా..’ అతని గొంతులో ఆజ్ఞ వినిపిస్తోంది.
ధ్యానంలో నుంచి బయటకు వచ్చి కళ్లు తెరిచాడు శివప్రసాద్ వర్మ. అతని కళ్లు ఎర్రగా వున్నాయి. తన ఎదురుగా వున్న రాజేంద్రనాథ్ వైపు చూశాడు.
‘ఎలా వున్నారు బావా?’ ఆ అడగటంలో ధ్వనించిన కంఠంలో ఒళ్లు గగుర్పొడిచే హెచ్చరిక కనిపిస్తోంది.
‘శివప్రసాద్ వర్మ.. నాకు ఎనే్నళ్లు ఈ శిక్ష.. అన్నీ నువ్వు చెప్పినట్టే చేస్తున్నా.. అసలు నీకేం కావాలి.. నా ఆస్తి మొత్తం తీసుకో.. మీ నాన్న మీ చెల్లెలికి ఇచ్చిన ఆస్తి తీసుకో.. మమ్మల్ని వదిలేయ్. నన్నో ఆత్మలా నటించమన్నావ్.. నా భార్యాబిడ్డలను పిచ్చి వాళ్లుగా ముద్ర వేయించావు. అయినా వాళ్లు ప్రాణాలతో ఉంటే చాలనుకున్నాను. అందుకే ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. ఇప్పటికైనా నన్ను నా కుటుంబాన్ని వదిలేయ్.. నీకు కనిపించనంత దూరం వెళ్లిపోతాం’ అన్నాడు రాజేంద్రనాథ్.
‘ఎక్కడికెళ్తావ్ పిచ్చి అమాయకపు బావా! నీ ఆస్తి నా తండ్రి నా చెల్లెలికి ఇచ్చిన ఆస్తి మొత్తం కలిపితే నిధిలో వున్న ఒక్క వజ్రం విలువ చేయవు.. నిధిలో వున్నది సంపద కాదే.. కొన్ని శక్తులు నిక్షిప్తపరచిన తాళపత్ర గ్రంథాలూ ఉన్నాయి.... సరే బావా! నీకు నీ కుటుంబానికి విముక్తి కలిగిస్తాను.. నాతోపాటు నీ కుటుంబాన్ని చూడడానికి వచ్చేయ్’ అంటూ టేబుల్ మీద వున్న మొబైల్ తీసి ఎవరికో ఫోన్ చేశాడు.
‘ఓకే ఓకే రెండు హెలికాప్టర్లు..’ చెప్పి మొబైల్ ఆఫ్ చేసి
‘మనం ఈ హోటల్ గది ఖాళీ చేసి శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాం...’ చెప్పాడు డ్రెస్ వేసుకుంటూ..
పదే పది నిమిషాల్లో అక్కడి నుంచి బయల్దేరారు.
‘ఒక్క విషయం. రిసెప్షన్లో మనం రూమ్ ఖాళీ చేస్తున్నట్టు చెప్పడం లేదు. నువ్వు నోరు జారకు బావా.. నీ కుటుంబం ప్రాణాలు గాల్లోకి ఎగిరిపోతాయి’ చెప్పాడు శివప్రసాద్ వర్మ.
‘ఎందుకు?’ అడిగాడు రాజేంద్రనాథ్.
‘ఎందుకంటే మనం గది ఖాళీ చేశామంటే మన గురించి వేట మొదలవుతుంది. మనం ఇంకా ఇక్కడే ఉన్నామంటే మన కోసం ఇక్కడే కాపు కాస్తారు. ఈలోగా మనం హెలికాప్టర్లో జంగానియా వెళ్తాము. నీ భార్యాబిడ్డలు కూడా అక్కడికే వస్తారు’ చెప్పి ఒక చిన్న బ్యాగ్ను ఆ గది నుంచి బయటకు విసిరేశాడు. ఆ గది వెనుక భాగంలో చెత్తకుప్ప వుంది. ‘మనం వెళ్లి ఆ బ్యాగ్ కలెక్ట్ చేసుకుందాం?’ అన్నాడు. ఒక రోజు ముందే సామాను షిఫ్ట్ చేశాడు.
ఆ గదిలో నుంచి బయటకు వచ్చారు. రూమ్కు తాళం వేశారు.
రూమ్లో నుంచి బయటకు వచ్చే ముందు రాజేంద్రనాథ్ కావాలనే తన మొబైల్ ఫోన్ ఆ గదిలో మంచం మీద వదిలేసి వచ్చాడు.
మొబైల్లో శివప్రసాద్ వర్మ మాట్లాడిన మాటలు రికార్డ్ చేశాడు.
* * *
‘మేము మరో రెండు గంటల్లో వస్తాం.. మా కోసం ఎవరైనా వస్తే చెప్పండి’ చెప్పి రిసెప్షన్లో ‘కీ’ ఇచ్చి బయటకు నడిచాడు శివప్రసాద్ వర్మ రాజేంద్రనాథ్తో కలిసి.
వీళ్లు వెళ్లిన ఇరవై నిమిషాల తర్వాత ఆ హోటల్ ముందు కారులో నుంచి దిగారు సమీర్, భార్గవి.
రిసెప్షన్లోకి వచ్చి శివప్రసాద్ ఫొటో చూపించి అడిగాడు సమీర్.
‘కాసేపటి క్రితం వెళ్లారు సార్.. రావడానికి టైం పడుతుందట. వెయిట్ చేయమన్నారు’ చెప్పింది రిసెప్షనిస్ట్.
వెనక్కి తిరిగి వెళ్లబోయిన సమీర్ ఆగాడు. రిసెప్షనిస్ట్ వైపు చూసి ‘ఏం చెప్పారు?’ అని అడిగాడు.
‘ఎవరైనా వాళ్ల కోసం వస్తే వెయిట్ చేయమన్నారు సర్’ చెప్పింది రిసెప్షనిస్ట్ సమీర్ తన ఐడెంటిటీ చూపించాక.
**
‘మాకు ఆ గది చూపించండి. వెరీ అర్జెంట్’ చెప్పాడు సమీర్.
‘వాళ్లు మళ్లీ వస్తామని చెప్పారుగా’ అడిగింది భార్గవి.
‘ఊహూ... నా అంచనా నిజమైతే వాళ్లు గది ఖాళీ చేసి వెళ్లాలి’ చెప్పాడు వాళ్లు వున్న రూమ్ వైపు వెళ్తూ.
‘అదేమిటి?’ అడిగింది భార్గవి.
‘మనల్ని తప్పుదారి పట్టించడానికి.. మనం వాళ్ల కోసం ఇక్కడే వెయిట్ చేస్తామని అతడి ఉద్దేశం’ అంటూ ముందుకు కదిలాడు.
శివప్రసాద్ వర్మ వున్న రూమ్ను ఓపెన్ చేశాడు హోటల్ మేనేజర్.
అక్కడి వాతావరణం చూడగానే భార్గవిలో మళ్లీ భయం మొదలైంది.. మంచం మధ్యలో క్షుద్రపూజ జరిగిన ఆనవాళ్లు.
అంటే తనకు ఇందాక రోడ్డు మీద కనిపించిన దృశ్యానికి.. ఈ క్షుద్రపూజకు సంబంధం ఉందా?’
‘సర్ వాళ్లు చెప్పాపెట్టకుండా రూమ్ ఖాళీ చేశారు’ అన్నాడు మేనేజర్ వాళ్ళు రూమ్ ఖాళీ చేశారని కన్ఫర్మ చేసుకుని.
‘మీ దగ్గర అడ్వాన్స్ ఉంటుందిగా?’ అడిగాడు సమీర్.
‘ఉంటుంది సర్. రెండు రోజుల రెంట్ అడ్వాన్స్ ఉంటుంది. ఇక్కడ పనివాళ్లకు టిప్స్ కూడా బాగా ఇచ్చేవాడు’ చెప్పాడు మేనేజర్.
సమీర్కు సిట్యుయేషన్ అర్థమైంది. ఇప్పుడేం చేయాలి.. బయటకు నడుస్తూ ఆలోచిస్తూ వెళ్లి కారులో కూచొని చంద్రలేఖకు ఫోన్ చేద్దామని మొబైల్ తీశాడు. స్విచాఫ్లో వుంది. చార్జ్ అయిపోయిన విషయం ఈ హడావిడిలో గుర్తించలేదు.
వెంటనే ఛార్జర్ బ్యాంక్ తీసి కనెక్ట్ చేసి ఫోన్ ఆన్ చేశాడు. ఫోన్ ఆన్ చేయగానే వాట్సాప్లో చంద్రలేఖ పంపిన మెసేజ్.. జిపిఎస్ కనిపించింది.
వెంటనే జిపిఎస్ చూస్తుంటే సడెన్గా కట్ అయింది.. జిపిఎస్ చూపించడం లేదు.. ఫోన్ పోయి ఉండాలి. లేదా వాళ్లు లాక్కొని ఉండాలి.. లేదా ఆఫ్ చేయబడింది.
షిట్! ఇప్పుడెలా అనుకుంటూ ఉండగానే... చటుక్కున ఒక విషయం గుర్తొచ్చింది.
వెంటనే కారులో నుంచి దూకినంత పని చేసి హోటల్లోకి పరుగు పెట్టాడు. భార్గవి విషయం అర్థంకాక తాను కూడా సమీర్ కూడా పరుగెత్తింది.
అప్పుడే మేనేజర్ రూమ్ను క్లీన్ చేయించబోతున్నాడు.
‘స్టాపిట్’ అని అరిచి మంచం దగ్గరికి వెళ్లాడు. బ్లాక్కలర్ క్లాత్ మీద కుంకుమ నిమ్మకాయలు ఉన్నాయి. దానితోపాటు అదే బ్లాక్ కలర్ క్లాత్లో కలిసిపోయి ఉంది మొబైల్ ఫోన్.. రాజేంద్రనాథ్ కావాలని అక్కడ జారవిడిచిన ఫోన్. వెంటనే దాన్ని తీసుకున్నాడు.
* * *
భార్గవికి అంతా అయోమయంగా ఉంది.
సమీర్ కారు ఎక్కాక అడిగింద ‘ఏమైంది?’ అంటూ.
రాజేంద్రనాథ్ చాలా స్మార్ట్గా బిహేవ్ చేశాడు. శివప్రసాద్ వర్మ ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పాడు. మనల్ని తప్పుదోవ పట్టించాలని శివప్రసాద్ వర్మ ప్రయత్నిస్తే-
మనకు కరెక్ట్ వే చూపించాడు రాజేంద్రనాథ్.
చంద్రలేఖ ఫ్యామిలీని జంగానియా తరలిస్తున్నారు.
శివప్రసాద్ వర్మ కూడా అక్కడికే వెళ్తున్నాడు.
అక్కడ అసలు కథ మొదలవుతుంది.
ఈ కథకు ముగింపు కూడా అక్కడే...
మనకు టైం లేదు.. అంటూనే ఉన్నతాధికారులతో మాట్లాడాడు. అత్యవసరంగా హెలీకాప్టర్ కావాలని చెప్పాడు.
ఇక్కడి నుంచి జంగానియాకు ఎంత త్వరగా చేరుకుంటే అంత మంచిది. ఎందుకంటే క్షుద్రపూజలు అర్ధరాత్రి జరుగుతాయి. అందులోనూ ఆదివారం అమావాస్య. మూఢనమ్మకాలకు కలిసొచ్చిన రోజు...
భార్గవి మనసులో ఏదో భయం.. కానీ సమీర్ వున్నాడని నిశ్చింత. మనసైన వ్యక్తి మనసుకు నచ్చిన వ్యక్తి మన పక్కన ఉంటే ఇంత నిశ్చింత ఉంటుందా? అనిపించింది.
* * *
చంద్రలేఖ ఆలోచిస్తోంది. ఆమెకు అర్థమవుతుంది. తమ కుటుంబం ట్రాప్లో పడింది. ఇప్పుడు చేయవలసింది జరుగబోయే దానిని ఎదుర్కోవడమే.
ఫోన్ను దారిలోనే తీసేసుకున్నారు. సమీర్కు తమ ఆచూకీ చెప్పే అవకాశం లేదు. అయినా ఆమె మనసులో ఏదో మూల సమీర్ భార్గవి తమని కాపాడుతారనే నమ్ముతోంది.
వహీద్ ఇచ్చిన తాయెత్తును తల్లి మెడలో కట్టింది. తల్లి ప్రమాదంలో ఉందని అర్థమవుతోంది. తనకు ఎలాంటి ఆపద వచ్చినా తాను ఎదుర్కొంటుంది.. లేదా రాణించడానికి సిద్ధపడుతుంది. అమ్మ బావుండాలి. నాన్నను కలుసుకోవాలి.
ఒక్కో చిక్కుముడి అర్థం అవుతుంది.
డబ్బు కోసమే తన మామయ్య ఆడిన నాటకం.. కానీ ఇంత నీచానికి పాల్పడుతాడు అనుకోలేదు.
డబ్బు మనిషిని ఎంతకైనా దిగజారుస్తుందని ఆమె చదివిన క్రిమినాలజీ చెబుతుంది.
కారులో నుంచి హెలీకాప్టర్లోకి ఎక్కించారు.
ఒక విలయానికి కాలం సాక్షి కాబోతోంది.
* * *
జంగానియా
ప్రకృతి కనె్నర్ర చేస్తే నల్లబడ్డ క్షేత్రం.. ప్రేతాత్మలు మేఘాలను ఆవహించినట్టు..
ఈదురుగాలి గబ్బిలాలతో కలిసి గాలిలోకి ఎగిరినట్టు
చితిమంటలు మృత్యువును ఆహ్వానిస్తున్నట్టు...
ఎటు చూసినా సమాధులు...
అమావాస్య
అర్ధరాత్రి..
పిశాచాలు బలం పెంచుకునే నిశిరాత్రి...
తరతరాలుగా క్షుద్రోపాసనలతో ప్రేతాత్మలను ఆవాహన చేసుకున్న జంగానియా.. ప్రాంతం భీతిగొలిపేలా ఉంది.
సమాధుల మధ్య పెద్ద చితి మంట.
ఆ చితి మంట ముందు తొంభై తొమ్మిదేళ్ల తీశ్మార్...
చూపుల్లో క్రూరత్వం.. గొంతులో తగ్గని గాంభీర్యం
నలుగురంగు వస్త్రాన్ని ధరించి కాటుకను పెట్టుకుని కాళరాత్రి భయానకంగా కనిపిస్తున్నాడు.
ఒక హెలీకాప్టర్లో రాజేంద్రనాథ్ శివప్రసాద్ వర్మ దిగారు.
మరో హెలీకాప్టర్లో చంద్రకళ కుటుంబం దిగింది.
చంద్రకళను మినహాయించి చంద్రప్రభను చంద్రలేఖను చెట్టుకు కట్టేశారు. చంద్రకళ ట్రాన్స్లో ఉన్నట్టు ఉంది.
తీశ్మార్ ముందు నిలబడి ఉంది చంద్రకళ...
- ఇంకా ఉంది -
దగ్ధ స్పృహ
అన్నపూర్ణ లాంటి దేశం
ఆకలి దేహమై చిక్కిపోతున్నపుడు
ఆకాశమంత విస్తరి పరిచి
ప్రేమగా పంచ భక్ష్యాలూ వడ్డిస్తావు!
మంచి నీళ్లను మాత్రం ముట్టకూడదంటావు.
పాదం కదిపిన చోటల్లా
పెల్లుబికిన మహా వేదనకు చలిస్తూ
అమ్మ లాంటి రాజ్యం కోసం అహరహం పరితపిస్తూ
ఆకలి తీర్చే తావుల కోసం ఆమూలాగ్రం అనే్వషిస్తావు
ఎక్కడి నుండో మేలు రకం మొక్కలనే తెప్పిస్తావు.
కలల కంచె వేయిస్తావు
నారును తడిపే నీరును మాత్రం
వేరు మూలాలపై నుండి పారనివ్వవు!
మేధ మొదళ్లకు తీపి తడి తగలనివ్వవు.
దేశం గుక్కపెట్టి విలపిస్తున్నపుడు
తల్లిలా తల్లడిల్లిపోతావు!
అనాధలా దోసిళ్లు చాచి...
పాల కోసం పక్కవారిని ప్రాధేయపడతావు
అమ్మ స్తన్యం ఆశువుగా సేరుతున్న అమృత ధార
ఆకలి తీరుస్తుందన్న విషయమే మరచిపోతావు.
రేపటి ఆకాశంపై
పసితనాన్నీ పతంగం చేసి
స్వేచ్ఛగా ఎగరేసే స్వేచ్ఛ ప్రయత్నంలో
అమ్మఒడి వెచ్చదనం మరువకముందే
బరువైన పరాయి రెక్కలు తొడిగి
చురుకుగా పైకెగిరిపొమ్మని శాసిస్తావు
తెలియకుండానే శాపాన్ని బహూకరిస్తావు
నిర్మలాకాశపు వీధుల్లో ఆనంద వేదికల్ని సృష్టించి
వేడుకగా విహరించమని ఆజ్ఞాపిస్తావు
ఓ వెనె్నల లోకాన్ని ఊహిస్తున్న
నీ సౌహార్ద్ర సమయాల్లో
నీలమంతా శూన్యమన్న నిజాన్ని..
నువ్వు గుర్తుకు తెచ్చుకోవు.!
దూరపు కొండల నునుపుదనానికి ముచ్చటపడి
నీడనిచ్చే పచ్చని అడవిని ధ్వంసం చేస్తూ పోతే
మాతృభూమి మరుభూమిగా మారక తప్పదు
మరుగున పడ్డ మాతృభాష..
మృత భాషగా మిగలక మానదు.
విజయానికి ప్రతీక.. సుబ్రహ్మణ్యస్వామి

డిసెంబర్ 2 సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా...
*
ఆదిదంపతులు పార్వతీ పరమేశ్వరుల రెండవ కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి (కుమారస్వామి). ఆయన అన్న వినాయకుడు విఘ్నాధిపతి అయితే కుమారస్వామి విజయాధిపతిగా లోకం స్తుతిస్తుంది. తరిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని సకల దేవతా స్వరూపునిగా, జ్ఞాన స్వరూపుడిగా సర్వజగత్తు ఆరాధిస్తుంది.
కారణజన్ముడు
సుబ్రహ్మణ్య స్వామి కారణ జన్ముడు. లోకకంటకుడైన తారకాసురుని సంహరించడానికి అవతరించాడు. తారకాసురుని చేత పీడించబడిన దేవతలను, సాధు, సజ్జనులను కాపాడి విముక్తి కలిగించాడు. పదవీ భ్రష్టున్ని చేసిన ఇంద్రుణ్ణి తిరిగి సింహాసనాధిష్టుణ్ణి చేశాడు. తనను ఆరాధించి కార్యములు తలపెట్టిన వారందరికి జయములు చేకూర్చి విజయప్రదాతగా సుబ్రహ్మణ్యస్వామి లోక ఆరాధకుడయ్యాడు.
సుబ్రహ్మణ్య షష్టి విశిష్టత
సుబ్రహ్మణ్య స్వామి మార్గశిర షష్టినాడు జన్మించాడు. అదే దినాన తారకాసురున్ని సంహరించాడు. అదే షష్టిన ఇంద్రుని కుమార్తెలయిన ‘శ్రీదేవసేన’ ‘శ్రీవల్లీదేవి’ (పెంపుడు కుమార్తె)లను వివాహమాడాడు. అదే షష్టిన దేవతలకు సైన్యాధిపతి అయ్యాడు. అన్ని సంఘటనలు షష్టి పవిత్రదినానే్న సంభవించినందున సుబ్రహ్మణ్య షష్టిగా విశిష్టత సంతరించుకొని అది మహోన్నత పర్వదినంగా లోకంచే సుబ్రహ్మణ్య షష్టిగా నామకరణం జరిగి ఆరాధించబడుతోంది.
ఏడేళ్ల ప్రాయంలోనే
దేవతల సైన్యాధిపతి
బ్రహ్మ, విష్ణువు, ముక్కోటి దేవతల ప్రార్థనలను మన్నించి పరమశివుడు కేవలం ఏడేళ్ల వయసు బాలుడైన తన ద్వితీయ కుమారుడు కుమారస్వామికి దేవతల సైన్యానికి సర్వసైన్యాధిపత్య మహత్తర బాధ్యతను లోకోపకార నిమిత్తం అప్పగించాడు. తండ్రి ఆజ్ఞను శిరసావహించి కుమారస్వామి అతి భయంకరుడు, ప్రమాదకారి అయిన అసురుడు తారకాసురున్ని సంహరించి లోక కల్యాణం గావించాడు.
దేవసేనతో వివాహం
తారకాసుర సంహారంతో తనకు తిరిగి స్వర్గ్ధాపత్యాన్ని ప్రసాదించినందుకు ఇంద్రుడు పరమానంద భరితుడయ్యాడు. అందుకు కృతజ్ఞతగా తన కుమార్తె దేవసేనను సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి వివాహం చేశాడు. దీంతో కుమారస్వామిని అల్లునిగా, పరమేశ్వరుని వియ్యంకుడిగా చేసుకున్నాడు దేవేంద్రుడు.
వల్లితో కల్యాణం
ఇదే క్రమంలో - కణ్వ మహర్షి శాపవశాన నంబిరాజుగా అవతరించిన దేవేంద్రుడు వేట కోసం వచ్చి పొదల్లో లభించిన ఆడశిశువును తీసుకొని వచ్చి పొదల్లో లభించినందున ఆ శిశువుకు ‘వల్లి’ అని నామకరణం చేసి పెంపుడు తండ్రిగా అతిగారాబంతో పెంచాడు. ఆమె పూర్వ వృత్తాంతం.. కణ్వ మహర్షి శాపవశాన శివమునిగా అవతారమెత్తిన శ్రీ మహావిష్ణువు అడవిలో తపస్సు చేసుకుంటున్న సమయంలో అతనికి ఒక జింకతో సాంగత్యమేర్పడింది. ఈ నేపథ్యంలో శివమునికి, జింకకు ఒక ఆడశిశువు జన్మించింది. ఆ శిశువును జింక పొదల్లో వదిలి వెళ్లింది. వేట సందర్భాన ఆ పొదల నుంచి తెచ్చి సాకిన అమ్మాయే ‘వల్లిదేవి’ అని చెప్పి దేవేంద్రుడు ఆమెను కూడా సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి కళ్యాణ మహోత్సవమును వైభవోపేతంగా జరిపాడు. పెళ్లి పెద్దలుగా బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, ముక్కోటి దేవతలు అందరూ వచ్చి స్వర్ణ, పుష్ప అక్షింతలు చల్లి సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవిలను ఆశీర్వదించారు. అప్పటి నుంచి దేవసేన, వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్త జనుల పూజలందుకుంటున్నారు.
మయూర వాహనుడు: సర్ప ప్రేమికుడు
పరస్పర వైరుధ్యం ఉన్న మయూరమును వాహనంగా, సర్ప ప్రేమికుడిగా సర్పమును సుబ్రహ్మణ్య స్వామి చేపట్టి వాటికి సఖ్యత చేకూర్చి మయూర, సర్పధ్వజునిగా పేరు గాంచాడు. ఇందుకు గుర్తుగా, సుబ్రహ్మణ్యస్వామి చెంత సదా నెమలి, త్రాచుపామును చూస్తాము. అవి కూడా భక్తులకు ఆరాధనమయ్యాయి.
సుబ్రహ్మణ్య స్వామికి ఎన్నో పేర్లు
సుబ్రహ్మణ్యుడు, కార్తికేయుడు, స్కంధుడు, షణ్ముఖుడు, గుహుడు, కుమారస్వామి, శరవణుడు, మురుగేశుడు, శక్తివేలు, మయూర కేతువు, మహాసేనుడు, వైజయంతుడు అని ఇంకా మరెన్నో పేర్లు ఉన్నాయి.
స్వామికి ఎందరో పూజలు
స్వామిని ప్రపంచంలోని ఎందరెందరో తమ అభీష్టాలు నెరవేరడానికి పూజలు చేస్తారు. ముఖ్యంగా తాము తలపెట్టిన కార్యాల్లో విజయాన్ని కోరుతూ పూజిస్తారు. అలాగే సంతానం కోసం, విద్యాప్రాప్తి కోసం, వంశాభివృద్ధి కోసం, పాడిపంటలతో పిల్లా పాపలతో, సుఖశాంతులతో వర్థిల్లజేయాలని, పూజలు చేస్తారు. మార్గశిర షష్టినాడు పలువురు శత్రువులపై విజయాల కోసం పూజా పునస్కారాలు చేయడం విశేషం.
పాము మంత్రాలు
సుబ్రహ్మణ్య షష్టి రోజున సుబ్రహ్మణ్య స్వామి కృపకు పాత్రమై పాము మంత్రాలు నేర్చుకోవాలన్న విశ్వాసం ఉంది. ఈ క్రమంలో ఉపవాసం ఉండి సర్పమంత్రాన్ని దీక్షతో ఉపాసిస్తే మళ్లీ సంవత్సరం వరకు గొప్ప శక్తి ప్రభావితమై ఆ మంత్రం వచ్చి దివ్య మహిమాన్వితంగా పని చేస్తుందని పలువురిలో నమ్మకం ఉంది.
పూజా విధానం
సుబ్రహ్మణ్య షష్టినాడు వేకువ జామునే నిండుగా స్నానం చేసి అదే తడిబట్టలతో ఉపవాసం చేస్తూ స్వామివారి ఆలయానికి వెళ్లి పువ్వులూ, పండ్లు, పడగల రూపం లాంటివి స్వామికి సమర్పిస్తారు. దీన్ని నాగపూజగా కూడా భావిస్తారు.
బ్రహ్మచారి పేరుతో పూజలు
ఇక వివాహం కాక ముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని.. ‘బ్రహ్మచారి’గా ఆయనకు మరో పేరున్నందున.. ఆ పేరుతో గొప్పగా పూజిస్తారు. ఈ విధానంలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారికి పూజలు చేసి పట్టువస్త్రాలు సమర్పించి భోజనాలు పెట్టి గౌరవిస్తారు. బ్రహ్మచారికి పూజలు చేయడం స్వయంగా సుబ్రహ్మణ్య స్వామికి చేసినట్లుగా భక్తులు దివ్య అనుభూతిని చెందుతారు.
స్వామిని ఆరాధిస్తే...
స్వామిని ఆరాధిస్తే ఆయురారోగ్యాలతోపాటు జ్ఞానం లభిస్తుంది. సర్వం తానే ఉన్నవాడు, ఆరు ముఖాలుకల వాడు కనుకనే షణ్ముఖుడు అని పేరు వచ్చింది.
అంతటా ఘనంగా...
కార్తికమాసంలో శుద్ధ చవితినాడు నాగుల చవితినీ, మార్గశిర మాసంలో శుద్ధ షష్టినాడు దేవసేన, వల్లీసతుల సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారల కల్యాణ మహోత్సవాలను తెలుగునాట అన్ని గ్రామాల్లో పట్టణాల్లో ఘనంగా నిర్వహించి తరిస్తారు.
కోస్తా జిల్లాల్లో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో సుబ్రహ్మణ్య షష్టి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో సుబ్బారాయునికి పువ్వులు, పడగలు సమర్పిస్తారు. పెద్దఎత్తున పూజలు, అభిషేకాలు, అన్నదానాలు నిర్వహిస్తారు. కాగా పిల్లలకు సుబ్రహ్మణ్యం, బాలసుబ్రహ్మణ్యం, సుబ్బమ్మ, సుబ్బయ్య, సుబ్బారాయుడు, సుబ్బి, సుబ్బారావు పేర్లు పెట్టడం ద్వారా సుబ్రహ్మణ్య స్వామిపై తమ అపార భక్తిప్రపత్తులను చాటుకుంటారు.
ఇతర వ్రతాలు
మార్గశిర షష్టినాడే చంపా షష్టి, ప్రవార షష్టి వ్రతాలను కూడా చేయాలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి.
అనేక రూపాలలో...
సుబ్బారాయుడు బాలుడైన బాలసుబ్రహ్మణ్యంగా, పెద్దవాడై సుబ్రహ్మణ్యంగా, స్కంధుడిగా, షణ్ముఖుడిగా ఇలా అనేక రూపాలలో పూజలు అందుకుంటాడు.
శ్లోక పఠనం
ప్రత్యేకంగా పూజలు చేయలేని పరిస్థితి ఉన్నవారు కేవలం నిండు స్నానం ఆచరించి సుబ్రహ్మణ్య స్వామిని మదిలో తలచుకొని
శ్లో శక్తిహస్తం విరూపాక్షం శిభీవాహం షఢాననం
ధారుణం రిపురోగగ్నం భావమే కుక్కుట ధ్వయం
శ్లోకాన్ని వీలైనన్ని సార్లు త్రికరణ శుద్ధిగా పఠించినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృపకు పాత్రులై సుఖ సంతోషాలు, సర్వ శుభాలతోపాటు కైవల్యప్రాప్తిని పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి.
సామాజిక ప్రయోజనం
సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ వ్రతం వల్ల మహర్షులు సామాజిక ప్రయోజనాన్ని పొందుపరిచారు. మార్గశిర మాసం అంటే చలిపులిగా మారి పీక్కు తినే మాసం. ఈ మాసంలో చలి బాధను తోటివారు పడకుండా ఉత్తరీయాలు, కంబళ్లు, దుప్పట్లు వ్రత కార్యంలో భాగంగా దానం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. ఇదే సామాజిక ప్రయోజనం కలిగించే మహత్తర పుణ్య కార్యం.
తమిళనాడులో.. కావడి పండుగ
తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామిని ప్రతీ ఇంటా ఇలవేల్పుగా ఎంతో మక్కువగా, అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా కొలుస్తారు. స్వామికి ‘కావడి పండుగ’ (మొక్కు) నిర్వహిస్తారు. స్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవడం వల్ల స్వామి కృపకు పాత్రవౌతామన్నది భక్తుల నమ్మకం. కుండలను పంచదారతోను, పాలతోను నింపి వాటిని కావడితో మోసుకొని వెళ్లి కుమారస్వామికి సమర్పిస్తారు. ఈ విధంగా జరుపుకునే ‘కావడి పండుగ’ తమిళనాడులో ఎంతో ప్రసిద్ధికెక్కింది.
అనువైన కాలం
సుబ్రహ్మణ్య షష్టి వెళ్లగానే వానలు కూడా తగ్గుముఖం పడతాయనీ, చెరువుల్లో నీరు తేటగా మారుతాయనీ, అలా వానలు తగ్గాక చేసుకోవలసిన పనులన్నింటినీ చేసుకోడానికి అనువైన కాలంగా రైతులు సంబరపడతారు.. ఈ విధంగా సనాతన భారతీయ సంస్కృతి పరంపరలో సుబ్రహ్మణ్య షష్టిని విశిష్ట పర్వదిన మహోత్సవంగా జరుపుకుంటూ పునీతులవుతున్నారు భక్తులు.
వర్ణకారిణి ఈ ‘వేకువ’

కాన్వాస్, కాగితంపైగాక కొత్త తీరాలకు చిత్రకళ చేరుకుందని, ఆ నూతన తీరాలను తాకడమే నేటి చిత్రకారుల కర్తవ్యమని భావించి, ఆ సరికొత్త వేకువ వెలుగులను ముద్దాడాలని తహతహలాడే వినూత్న భావాల, విశేష అవగాహన గల చిత్రకారులకు వర్ధమాన చిత్రకారిణి ‘వేకువ’ ప్రాతినిధ్యం వహిస్తోంది.
అబ్బురపరిచే ఆలోచనలతో, మనసు పలికే మాటలకు రంగులు - రేఖలు జతచేసి సరికొత్త రంగుల ప్రపంచాన్ని సృష్టించేందుకు తాము ఈ భూమీద శ్వాసిస్తున్నామని విశ్వసిస్తూ, సరికొత్త ‘వేకువ’ను ఆవిష్కరించేందుకు తమ మేథను రంగరించి రంగుగా మార్చి ఆ ప్రయోగాలను పది మంది ముందు పరిచేందుకు తమ శక్తినంతా కూడదీసుకుని కదులుతున్న వర్తమాన చిత్రకారుల, మెరుపు తీగల ప్రతినిధి అందె వేకువ.
అలాగని వేల సంవత్సరాల సంప్రదాయ చిత్రకళను పట్టించుకోరా?.. అని ప్రశ్నిస్తే, అలాంటిదేమీ లేదు, ఆ చరిత్రనంతా ఔపోసన పట్టి, గుప్పిట్లో పట్టి నాల్గవ పారిశ్రామిక విప్లవం వెలుగులో వెల్లువెత్తిన సాంకేతిక పరిజ్ఞానం, జ్ఞానం, భావ విస్ఫోటనం సమకాలీన చిత్రకళలో కనిపించాలని వారి భావన, అభిమతం.
ఈ తరహా విప్లవాత్మక ప్రయోగానికి, భావ వ్యక్తీకరణకు అందె వేకువ తాను చదువుతున్న మాసాబ్ ట్యాంక్లోని ‘ఫైన్ ఆర్ట్స్ కాలేజీ’నే వేదిక చేసుకున్నారు. కళాశాలలోని కొంత భాగం ఎంపిక చేసుకుని గోడలకు, మెట్లకు నియాన్ పెయింట్ చేసి, చీకట్లో అల్ట్రా వయొలెట్ లైట్స్ ఆధారంగా వేల సంవత్సరాల ప్రపంచ చిత్రకళా చరిత్రను క్లుప్తంగా తన మిత్రుడు - చిత్రకారుడు సతీష్తో కలిసి పొందుపరిచారు. ఈ సరికొత్త ‘గ్లో ఆర్ట్’కు ఆమె, సతీష్ సరికొత్త నిర్వచనం చెప్పి చిత్రకళా రంగంలో ఓ సరికొత్త సంచలనం సృష్టించారు. వర్తమాన చిత్రకారుల ఆలోచనల మెరుపు అలలకు ఈ ప్రయోగం ఓ సంకేతం.
ఆదిమ మానవుడు గుహల్లో సహజ రంగులతో చిత్రించిన ఆకారాలు- ఆకృతుల నుంచి వర్తమాన నాల్గవ పారిశ్రామిక విప్లవం వరకు జరిగిన మానవ పరిణామంతోపాటు చిత్రకళ పరిణామ క్రమాన్ని చిత్రిక పట్టి చూపరులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ ప్రయోగం స్వల్ప బొమ్మలతో, భావాలతో అనల్ప అర్థం స్ఫురించేలా అటు చిత్రకారులను, ఆర్ట్ లవర్స్ను, సాధారణ వీక్షకులను ఆకట్టుకుంది. చిత్రకళా రంగంలో ప్రయోగాలకు, పరిణతకు హైదరాబాద్ నగరం వెనుకబడి లేదని చాటి చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తోంది.
జ్వలించే తపనతో, నవ నవోనే్మష ఆలోచనలతో నిరంతరం రంగులతో - రేఖలతో ‘నడక’ సాగించడం వల్ల, నిజాయితీగా ముందుకు సాగడం వల్ల సరికొత్త తీరాలను తాకవచ్చని, కొత్త ప్రయోగాలకు తెర తీయవచ్చని, సరికొత్త సృష్టికి పర్యాయపదంగా నిలవవచ్చని నిరూపిస్తున్న చిత్రకారుల్లో ‘వేకువ’ అగ్రభాగాన కనిపిస్తారు. చిత్రకళలో సరికొత్త వేకువను ముద్దాడాలనుకునే వారిలోనూ ఈ ‘వేకువ’ ఉషోదయంలా కనిపిస్తుంది.
సతీష్ - వేకువ తమ ‘గ్లో ఆర్ట్’తో మసక చీకట్లో రంగుల ప్రపంచానే్న గాక ఓ మాయా నగరిని సృష్టించి చూపరులను కట్టి పడేశారు. విభ్రమకు గురిచేసే ఆ వేదికకు ‘ఎక్స్ వై జెడ్ లాబొరేటరీస్’ అన్న శీర్షిక పెట్టి తాము చేసిన ప్రయోగానికి ఆహ్వానం పలికారు. ఆర్ట్ ఇప్పుడు కాగితం, కాన్వాస్పై లేదని మరోసారి నిరూపించారు. స్పందింపజేసే లక్షణం, ఆలోచింపజేసే ‘్ఫం’ ‘టెక్నిక్’ టెక్చర్ ‘సర్వాంతర్యామి’ అని చాటి చెప్పారు.
చిత్రకళా రంగంలో గతంలో అనేకానేక సిద్ధాంతాలు, ఇజాలు, పద్ధతులు వెలుగు చూశాయి. అవన్నీ ఆయా కాలాల ఆలోచనా సరళికి అద్దం పడతాయి. వర్తమాన నాల్గవ పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో, స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ యుగంలో దానికనుగుణమైన పద్ధతులు పురుడు పోసుకుంటాయని బలంగా విశ్వసిస్తున్న వారిలో ‘వేకువ’ ఒకరు.
ఈ గ్లో ఆర్ట్ సృజనకు ముందు ఆమె హైపర్ రియలిజం పద్ధతిలో కొన్ని బొమ్మలు పెన్సిల్తో వేశారు. వాటిలో ఓ పండు ముసలి అవ్వ బొమ్మ నిజంగానే హైపర్ రియలిస్టిక్గా కనిపిస్తుంది. ముడతలు పడిన చర్మం.. దీనమైన చూపులు, పూర్తిగా నెరసిన వెంట్రుకలు, ముఖంపై పిగ్మెంటేషన్ మచ్చలు ఎంతో నైపుణ్యం కనబరచి చిత్రించారు. అలాగే ఆమె అక్రలిక్ రంగుల్లో బతుకమ్మను చేతపట్టుకున్న మహిళ చిత్రాన్ని వినూత్నంగా చిత్రించారు. మదర్ అండ్ చైల్డ్ చిత్రాన్ని కూడా ఇదే మాధ్యమంలో ఆవిష్కరించారు. వర్తమాన అర్ధనారీశ్వర చిత్రాన్ని వుడ్కట్ మాధ్యమంలో చిత్రించారు. వాటర్ కలర్స్తోనూ ఆమె రకరకాల పూలను వేశారు. ముగ్ధమనోహరమైన రీతిలో, ఆకర్షణీయంగా చిత్రిక పట్టారు. ఇక వేకువకు ఇష్టమైన మరో మాధ్యమం.. ‘స్క్రాప్ డిజైన్’. అనేక పాత ఇనుప సామానుతో, తుక్కుతో ఆమె ఎన్నో ఆకృతులను రూపొందించారు. ఇందులో గుండుసూదులు, ఉన్ని దారం ముక్కలు, అవసరమైన చోట రంగు ముద్దలు వాడి ‘మిక్స్డ్ మీడియా’గా వీక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కొన్ని ఆకారాలు నైరూప్యంగా కనిపిస్తాయి. ‘మనసు చెప్పిన రీతిలో స్క్రాప్కు ఆకారమిచ్చాను తప్ప అదేమిటని అడిగితే నేనేమి సమాధానం చెప్పలేను.. మీ దృష్టి కోణానికి ఆ ఆకారం ఎలా అనిపిస్తే అదే అనుకోవచ్చు.. ఈ స్వేచ్ఛ అటు సృష్టికర్త అయిన చిత్రకారుడికి (శిల్పికి) ఉంది. ఇటు దాన్ని చూసే వీక్షకుడికీ ఉంద’ని ఆమె అంటున్నారు.
ఇలా విభిన్న పద్ధతుల్లో, మాధ్యమాల్లో తన సృజనను, నైపుణ్యాన్ని, కొత్త ‘చూపు’గల అందె వేకువ హైదరాబాద్లో 1996లో జన్మించారు. ఆమె తండ్రి సహజకవి, వాగ్గేయకారుడిగా గుర్తింపు పొందిన అందెశ్రీ. ఆ భావుకతను, రసాత్మకతను, ఉపమాన వైవిధ్యాన్ని ఆమె తన తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్నారనిపిస్తోంది. బాల్యం నుంచే బొమ్మలపై ఆసక్తి ఉండటం, అక్కడి ఉపాధ్యాయులు చిత్రకళపై ఆసక్తి ఉన్నవారిని ఎక్కువగా ప్రోత్సహించడంతో ఇంటర్మీడియట్కు వచ్చేసరికి చిత్రకళ తనలో ఓ భాగమైందని, అందుకే 2014 సంవత్సరంలో ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో బిఎఫ్ఏ కోర్సులో చేరానని వేకువ చెప్పారు. కాలేజీలో చేరాకనే ఆర్ట్కు ఓ సిద్ధాంతం ఉంటుందని, సిస్టమ్ ఉంటుందని తనకు బోధపడిందని కూడా ఆమె అంటున్నారు. స్టిల్ లైఫ్, పోట్రేట్స్, స్కల్ప్చర్, అప్లయిడ్ ఆర్ట్ ఇట్లా అనేక అంశాలతోపాటు ‘హిస్టరీ ఆఫ్ ఆర్ట్’లో మొత్తం ప్రపంచం ఇమిడి ఉంటుందని అది చిత్రకారుడి జ్ఞాన చక్షువులు తెరచుకునేలా చేసిందని చెప్పారు.
ఇండియన్ ఆర్ట్, వెస్ట్రన్ (పాశ్చాత్య) ఆర్ట్ పరిణామాలు, ఇజాలు, వాటి రూపకర్తలు.. వారి జీవితం కళ్ల ముందు పరచుకుంటుందని, అదెంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని, ఆ చరిత్రనే ముందుకు నడుపుతుందని కూడా ఆమె చెబుతున్నారు.
అదే కాలేజీలో ప్రస్తుతం ఎంఎఫ్ఏ చేస్తూ ఆఖరి పాదంలో ఉన్నానని, వివిధ వస్తువులను, పరికరాలను ఎలా ‘ఆర్ట్’ కోసం వాడాలి?.. ఉపయోగించాలనే జిజ్ఞాసతో, ఆలోచనా ప్రక్రియ (్థట్ ప్రాసెస్)లో ఉన్నానని, మెటల్.. స్క్రాప్ (ఇనుప సామాగ్రి)తో మెటల్ బీటింగ్ ఆర్ట్ను ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న తపనతో కదులుతున్నానని ఆమె చెబుతున్నారు.
‘వర్ణకారిణి’గా, సృజనకారిణిగా, ప్రయోగశీలిగా ఇటీవల అజంతా గుహల వద్ద జరిగిన వర్క్షాప్లో పాల్గొని సంప్రదాయ చిత్రకళను ఆధునిక చిత్రకళతో ఎలా మేళవించడానికి వీలుందో తన విద్యార్థి సహచరులతో, అధ్యాపకులతో కలిసి మేథోమథనం చేశారు. జీవితాంతం నేర్చుకునే, ప్రయోగం చేసే, పరిశోధించేదే చిత్రకళ అని ఆమె తన మనసులోని మాటను వెల్లడించారు. చిత్రకళ ఇప్పుడు కాగితం, కాన్వాసుపై నుంచి కదిలి మెటీరియల్ (వివిధ వస్తువులు) వైపు మళ్లిందని, అందుకే మెటల్ బీటింగ్ ఆర్ట్ వైపు అడుగులేస్తున్నానని, నవీనత, సృజన, ప్రయోగం తన ఊపిరి’ అని ‘నియాన్ రంగు’లా వెలిగిపోతూ ఆమె వెల్లడించారు.
అందె వేకువ 76800 10836
రాశిఫలం -12/03/2019
జోరుగా ఇసుక తవ్వకాలు
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా నదీతీరాల్లో గత కొద్ది రోజులుగా వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇసుక తవ్వకాలు ఊపందుకున్నాయి. గత నెలాఖరు వరకే 23లక్షల 81వేల 716 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా అయినట్లు అధికారులు తెలిపారు. నూతన ఇసుక విధానం అమల్లో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వానికి రూ. 89.31 కోట్ల మేర ఆదాయం లభించింది. స్టాక్ పాయింట్లలో గందరగోళానికి తావులేకుండా, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇసుక అమ్మకాలను పరిశీలిస్తే పశ్చిమ గోదావరి జిల్లాలోని రీచ్ల నుంచి రూ. 18.09 కోట్ల మేర ఆదాయం ప్రభుత్వానికి లభించింది. శ్రీకాకుళం జిల్లా నుంచి రూ. 5.74 కోట్లు, విజయనగరం సీనరేజ్ ద్వారా రూ. 55 లక్షలు, విశాఖ జిల్లా నుంచి రూ. 4.44 కోట్లు, తూర్పుగోదావరి జిల్లా నుంచి రూ. 9.60కోట్లు, గుంటూరు జిల్లా నుంచి రూ. 16.61 కోట్ల ఆదాయం లభించింది. ప్రకాశం జిల్లా నుంచి రూ. 1.71 కోట్లు, నెల్లూరు జిల్లా నుంచి రూ 8.05కోట్లు, కడప జిల్లా నుంచి రూ. 6.47 కోట్లు, చిత్తూరు జిల్లా నుంచి రూ. 4.02 కోట్లు, కర్నూలు జిల్లా నుంచి రూ. 3.82 కోట్లు, అనంతపురం జిల్లా నుంచి రూ. 5.97 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు అధికారులు వివరించారు.
నా మతం మానవత్వం

గుంటూరు, డిసెంబర్ 2: ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా భయపడేది లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలన్నింటినీ అమలు చేసేందుకు ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందడుగు వేస్తామని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల ఆరోపణల మధ్య రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతోందని, పరిపాలన సుభిక్షంగా ఉంటే జీర్ణించుకోలేని స్థితిలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సోమవారం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని గుంటూరు నగరంలోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో ప్రారంభించి, రోగులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం గుంటూరు మెడికల్ కళాశాల జింఖానా ఆడిటోరియంలో జరిగిన ప్రారంభోత్సవ సభకు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్త్ఫా అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే ఓర్వలేక కొందరు తనకు కులాన్ని, మతాన్ని కూడా ఆపాదించడం బాధాకరమన్నారు. తన మతం మానవత్వమయితే, తన కులం ఇచ్చిన ప్రతిమాటను నిలబెట్టుకోవడం అని సభికుల హర్షధ్వానాల మధ్య జగన్ ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టో రెండు పేజీలకే పరిమితం చేసి అన్ని హామీలను అమలు చేస్తున్నామన్నారు. మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్లో సమానమని, ఇది తెలియని కొందరు తమ ఇష్టారాజ్యంగా మాట్లాడటం బాధాకరమన్నారు. సుపరిపాలన అందిస్తుంటే ఈర్ష్యాద్వేషాలతో పొంతన లేని ప్రకటనలు
చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకం ద్వారా శస్త్ర చికిత్సలు చేయించుకుని వైద్యుల సిఫారసు మేరకు ఇంటికి వెళ్లి ఎటువంటి పనులు చేసుకోలేని వారికి విశ్రాంతి సమయంలో రోజుకి 225 రూపాయలు చొప్పున గరిష్ఠంగా నెలకు 5 వేల రూపాయల వరకు అందజేస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాలతో కూడిన మంచి మందులను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. 2020 జనవరి నాటికి హెల్త్ రికార్డులతో కూడిన ఆరోగ్యశ్రీ కార్డులను అందజేయడంతో పాటు ఇప్పటికే 1200 వ్యాధులకు విస్తరించిన ఆర్యోగశ్రీ పరిధిని 2 వేల రోగాలకు వర్తింపజేసేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. అలాగే డయాలసిస్ రోగులకు నెలకు 10 వేల రూపాయల పెన్షన్ అందిస్తామని చెప్పారు.
మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం లేదు
మద్యాన్ని ఆదాయ వనరుగా ప్రభుత్వం చూడటం లేదని, అందుకే ప్రైవేటు వ్యక్తులతో కాకుండా ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తూ సమయపాలన విధించామని స్పష్టంచేశారు. మద్యాన్ని ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా ధరలను పెంచామన్నారు. పేద విద్యార్థుల కోసం ఇంగ్లీషు మీడియం ప్రారంభిస్తుంటే కొందరు తమ ప్రభుత్వంపై అక్కస్సుతో నానా యాగీ చేస్తున్నారన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో డిసెంబర్ 15వ తేదీ నాటికి 510 రకాల మందులను అందుబాటులోకి తెస్తామన్నారు. నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్య పెంచుతామని, ప్రభుత్వాసుపత్రుల్లో నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా 1500 కోట్ల నిధులు కేటాయించి అన్ని హంగులతో సుందరీకరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఏడు చోట్ల బోధనాసుపత్రులను నిర్మించనున్నట్లు తెలిపారు. 2020 ఏప్రిల్ నాటికి 1060 అంబులెన్సులను కొనుగోలు చేసి 104, 108కి ఫోన్ చేస్తే 20 నిముషాల్లో ప్రమాద స్థలికి చేరుకునేలా చర్యలు చేపట్టామన్నారు. 66 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. ఆరు నెలల తర్వాత ప్రజలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నుండి మొదటి సారి పైలెట్ ప్రాజెక్టుగా జనవరి నుండి ప్రారంభిస్తామని, తరువాత ప్రతి జిల్లాకు ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సుల పోస్టులను భర్తీ చేసేందుకు వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి చర్యలు చేపడతామన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని చెన్నై, హైదరాబాద్, బెంగళూర్లలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కూడా అమలు చేస్తున్నామన్నారు. మీ అందరి అండదండలు ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతానని స్పష్టంచేశారు. ఈ సభలో రాష్ట్ర మంత్రులు మేకతోటి సుచరిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మోపిదేవి వెంకట రమణ, ఆళ్ల నాని, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ విప్ పినె్నల్లి రామకృష్ణారెడ్డి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య విద్యార్థులు, వైద్య నిపుణులు పాల్గొన్నారు.
*చిత్రం...జీజీహెచ్లో రోగిని పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించం

విజయవాడ: విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న రీడర్లతో సహా ఏ ఒక్కరినీ తొలగించబోమని, విద్యుత్ కాంట్రాక్టులు, కొనుగోళ్లలో ప్రజాధనాన్ని దుర్వినియోగం కానీయమని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఏపీ ట్రాన్స్కోలోకి నూతనంగా ఎంపికైన 170 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు నియామక ఉత్తర్వులు అందించే కార్యక్రమాన్ని సోమవారం విజయవాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై నూతనంగా ఎంపికైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించి ప్రోత్సహించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ధ్యేయమన్నారు. అందుకనుగుణంగానే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు మాసాల్లోనే విద్యుత్ శాఖలో 8వేల మంది ఎనర్జీ అసిస్టెంట్లను
నియమించామని, ఇప్పుడు 170 మంది ఏఈఈలను నియమిస్తున్నామన్నారు. ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న 4500 మంది విద్యుత్ రీడర్లను కూడా తొలగించవద్దని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. పోలవరం జల విద్యుత్ కేంద్రం రివర్స్ టెండరింగ్లో రూ. 800కోట్లు ఆదా అయిందని, విద్యుత్ కొనుగోళ్లలో కూడా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చేస్తున్నామన్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒకవైపు ప్రభుత్వశాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీచేస్తూ మరోవైపు అభివృద్ధి సంక్షేమాలను సమతుల్యం చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ విద్యత్ సరిపడినంత ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. విద్యుత్ వ్యవస్థలో కీలకమైన సబ్ స్టేషన్లలో ఉండే ఏఈఈలను నియమించడం ఆనందంగా ఉందన్నారు. ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ మాట్లాడుతూ అవినీతి రహిత పాలనను అందించాలనేది ప్రభుత్వ ధ్యేయమని, నూతనంగా నియమితులైన ఏఈఈలు విద్యుత్ వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా అవినీతి రహితంగా పని చేయాలన్నారు. విద్యుత్ను తక్కువ ధరకు కొనుగోలు చేయడం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లోనే రూ. 500కోట్లు, జెన్కోలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 180 కోట్లు ఆదా చేశామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యుత్ ఉద్యోగం సంఘాల నాయకులు లక్ష్మణరావు, వేద వ్యాసరావు మాట్లాడుతూ విద్యుత్ శాఖలో ఏఈఈలు పిల్లర్స్ లాంటి వారని అటువంటి కీలకమైన ఉద్యోగాలను భర్తీ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విజిలెన్స్ జేఎండీ కే వెంకటేశ్వరరావు, విద్యుత్ శాఖ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
‘జీరో ఎఫ్ఐఆర్’ పై వారంలో విధి విధానాలు

గుంటూరు, డిసెంబర్ 2: బాధితుల ఫిర్యాదులకు సంబంధించి రాష్టవ్య్రాప్తంగా జీరో ఎఫ్ఐఆర్ విధానం అమలు చేయాలంటూ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ, ముంబై తరహాలో రాష్ట్రంలో కూడా జీరో ఎఫ్ఐఆర్ను అమలు చేయాలన్నారు. ఈ విధానం అమలులో ఉంటే పోలీసు స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీసు స్టేషన్లోనైనా ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. నేరం జరిగిన ప్రాంతం తమ స్టేషన్ పరిధిలోది కాదంటూ పోలీసులు బాధితుల ఫిర్యాదును తిరస్కరించడానికి జీరో ఎఫ్ఐఆర్లో అవకాశం ఉండదని స్పష్టం చేశారు. జీరో ఎఫ్ఐఆర్ పేరిట బాధితులు ఏ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా దానిని తప్పకుండా స్వీకరించి, విచారణ జరిపి సంఘటనా స్థలం పరిధిలో ఉన్న స్టేషన్కు సదరు ఫిర్యాదును పోలీసులు బదిలీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసు వలంటీర్లకు శిక్షణ ఇచ్చే వర్క్షాప్ను సోమవారం ప్రారంభించిన సందర్భంలో డీజీపీ ఈ మేరకు వివరాలను వెల్లడించారు. గ్రామ సచివాలయాలకు అందే ఫిర్యాదులు నేరుగా పోలీసులకు అందేలా అనుసంధానం చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో ముందస్తు సమాచారం తెలుసుకునేందుకు మహిళా పోలీసు వలంటీర్ వ్యవస్థ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. బాల్య వివాహాలను అడ్డుకోవడం, పోక్సో చట్టం అమలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు వీలుంటుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని ప్రజల చెంతకు చేర్చడంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కీలకం కానుందని పేర్కొన్నారు. రాష్టవ్య్రాప్తంగా
14,967 పోలీసు వలంటీర్లు పనిచేయనున్నారని, 10 దశల్లో 11 కేంద్రాల్లో వలంటీర్లకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. మహిళా, శిశు రక్షణ, భద్రత దేశవ్యాప్తంగా సవాల్గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసు వలంటీర్ల ద్వారా కచ్చితమైన మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. దీనికి ప్రజల సహకారం, భాగస్వామ్యం అవసరమని డీజీపీ గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తిచేశారు.
*చిత్రం...కార్యక్రమంలో మాట్లాడుతున్న డీజీపీ
పట్టణ ప్రాంతాల్లో.. ఒక సెంటు స్థలమే!
పేదలందరికీ ఇళ్లపై అదనంగా మార్గదర్శకాలు జారీ
హేయం..ఘోరం
న్యూఢిల్లీ : అత్యంత హేయం, ఘోరం, పాశమికమంటూ ‘దిశ‘ అత్యాచారం, హత్య ఘటనపై లోక్సభ సభ్యులు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషుల్ని కఠినంగా శిక్షించాలని, త్వరిత గతిన శిక్ష అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఇలాంటి వారిని ఉరితీయాలని, రాళ్లతో కొట్టి చంపాలని, కాస్ట్రేషన్ వంటి కఠిన చర్యలూ తీసుకోవాలంటూ హైదరాబాద్ అమానుష ఘటనపై సభ్యులు డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్టాన్ని సవరించేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ప్రకటించారు. కిషన్ రెడ్డి సోమవారం లోకసభ జీరో అవర్లో హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్లో పశు వైద్యురాలిపై జరిగిన అత్యాచారంపై లోక్సభలో సభ్యుల జరిపిన చర్చకు బదులిస్తూ అత్యంత హీనమైన నేరాలకు పాల్పడే వారికి వీలున్నంత త్వరగా శిక్ష పడేలా చూసేందుకు తమ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పశు వైద్యురాలిపై జరిగిన అత్యాచారాన్ని అధికార, ప్రతిపక్షానికి చెందిన సభ్యులందరు తీవ్ర స్థాయిలో ఖండించారు. దేశంలో మహిళలకు భద్రత లేకుండాపోయిందని ప్రతిపక్షం సభ్యులు ఆరోపించారు.మహిళలపై అత్యాచారాలు చేసే వారిని ఉరితీయాలని కొందరు సభ్యులు డిమాండ్ చేస్తే మరి కొందరు వారిని కాస్ట్రేషన్కు గురి చేయాలి లేదా రాళ్లతో కొట్టి చంపాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత శిక్షా స్మృతి, సి.ఆర్.పి.సిని సవరించటం గురించి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. లోక్సభ ఈరోజు ఉదయం సమావేశం కాగానే పలువురు సభ్యులు లేచి శంషాబాద్ అత్యాచారం గురించి ప్రస్తావించారు. దీనికి స్పీకర్ ఓం బిర్లా బదులిస్తూ ఈ అంశందై జీరో
అవర్ చర్చకు అనుమతిస్తామంటూ వారిని శాంతపరిచారు. లోకసభ జీరో అవర్లో అధికార, ప్రతిపక్షాలకు చెందిన పలువురు సభ్యులు శంషాబాద్ అత్యాచారంపై మాట్లాడుతూ నేరస్తులను అత్యంత కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో విచ్చలవిడిగా కొనసాగుతున్న మద్యం విక్రయాల మూలంగానే ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని టి.పి.సి.సి అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎం.పి ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు. నేరస్తులకు వెంటనే శిక్ష పడేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు 30 రోజుల్లో శిక్ష పడేలా చట్టం తీసుకురావాలని టిఆర్ఎస్ పక్షం నాయకుడు నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు టి.ఆర్.ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నది, దుర్ఘతన జరిగిన ఆరు గంటల్లో నిందితులను అరెస్టు చేసిందని ఆయన చెప్పారు. ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలు క్షేత్ర స్థాయిల సక్రమంగా అమలు కాకపోవటం వలన శంషాబాద్ లాంటి సంఘటనలు జరుగుతున్నాయని బిజెపి సభ్యుడు బండి సంజయ్ చెప్పారు. మహిళలపై జరిగే అత్యాచారాలకు సంబంధించిన కేసులు సంవత్సరాల తరబడి జరగటం వలన బాధితులకు న్యాయం లభించటం లేదన్నారు. నిందితులకు వెంటనే శిక్ష పడేలా చట్టాలను సవరించాలని సంజయ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి సంఘటనల పట్ల శూన్య సహనం విధానాన్ని పాటించాలని ఎన్.సి.పి సభ్యురాలు సుప్రియా సూలే సూచించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం చట్టాలను సవరిస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు.
కొట్టి చంపాల్సిందే..
రేపిస్టులకు ఉరే..సరి*
కామాంధులను
ఉపేక్షించడానికి వీల్లేదు*
రాజ్యసభ ముక్తకంఠం
భావితరాల భవిష్యత్ కోసం టీడీపీ పోరాటం

కర్నూలు సిటీ, డిసెంబర్ 2: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంతరించి పోతుందన్న ప్రచారం జరుగుతోందని, తెలుగుజాతి ఉన్నంత వరకు తమ పార్టీ ఉంటుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. కర్నూ లు నగరంలో సోమవారం నిర్వహించిన పార్టీ విస్తృత
స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీని దెబ్బతీసే శక్తి ఎవ్వరికీ లేదన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు పార్టీ మనుగడకు ఢోకా లేదన్నారు. రాష్ట్రంలో 65 లక్షల మంది అనేక రంగాల్లో నిష్ణాతులైన సైనికులు పార్టీకి అండగా ఉన్నారన్నారు. ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని, గెలుపోటమిలను సమానంగా తీసుకుని ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో వైకాపా సాగిస్తున్న విధ్వంసకర పాలన గురించి ప్రజలకు వివరించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త ముందుకురావాలన్నారు. భావితరాల భవిష్యత్ కోసం కృషి చేసే పార్టీ తెలుగుదేశం అని ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాలన్నారు. భవిష్యత్లో 30 సంవత్సరాల పాటు ఏకధాటిగా అధికారంలో కొనసాగే విధంగా నాయకత్వ రూపకల్పనకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు వివరించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి సంస్థాగత ఎన్నికలు నిర్వహించి, అందులో యువతకు 33 శాతం అవకాశం కల్పించి పార్టీని మరింత పటిష్టం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నిర్వాకం వల్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లడంతో అభివృద్ధికి ఆటంకంగా మారుతోందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత కల్పించి, సంపద సృష్టించడంతో ఆదాయం తీసుకొచ్చిందన్నారు. అయితే వైయస్ జగన్ అభివృద్ధి గురించి పట్టించుకోవటం లేదని, కేవలం టీడీపి నాయకులను వేధించడమే పనిగా పెట్టుకున్నాడని ఆరోపించారు. ఉపాధి లేకపోతే ఆదాయం రాదని, ఆదాయం లేకపోతే రాష్ట్రం ఆర్థికంగా దివాల తీసే పరిస్థితి వస్తుందన్న విషయాన్ని గురించుకుని పరిపాలన కొనసాగించాలని సూచించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ఇసుక పాలసీతో పాటు అన్న క్యాంటీన్ల ఎత్తివేత, మద్యనిషేధంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ రద్దు చేస్తూ రద్దుల ప్రభుత్వంగా మారిందన్నారు. నవరత్నాల పేరుతో అధికారంలోకి వచ్చి వాటిని సక్రమంగా అమలు చేయటం లేదని, అమ్మఒడి మొదట అందరికీ వర్తింప జేస్తామని చెప్పి 75 శాతం హాజరు ఉండాలన్న నిబంధన పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాము ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకం కాదని, గతంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టి. రామారావు రెసిడెన్సియల్ పాఠశాలను ప్రవేశపెడితే తాను మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టానన్నారు. ఎస్సీ కులాలైన మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టానని తనపై ఆరోపణలు చేస్తున్నారని, సామాజిక న్యాయం కోసమే ఏబీసీడీ వర్గీకరణ చేశామన్నారు. ఎస్సీ కులాల్లో ఏబీసీడీ పెట్టడం వల్ల మాదిగలకు న్యాయం జరిగిందని స్పష్టం చేశారు. మహిళలపై అఘాత్యాలకు పాల్పతున్న మానవ మృగాలను బహిరంగంగా ఉరి తీయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రియాంకారెడ్డిని దారుణంగా చంపిన హంతకులను ఉరి తీయాలన్నారు. కార్యకర్తలు అధైర్య పడకుండా మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, భూమా అఖిల ప్రియ, ఏరాసు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీలు కెయి ప్రభాకర్, బిటి. నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు మీనాక్షి నాయుడు, కోట్ల సుజాతమ్మ, గౌరు చరితమ్మ, జనార్ధన్రెడ్డి, జయనాగేశ్వరెడ్డి, టీజీ. భరత్, మాండ్ర శివానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
విదేశాల నుంచి ఉల్లి

అమరావతి: దేశవ్యాప్తంగా ఉల్లి కొరతను అధిగమించేందుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వెల్లడించారు. దిగుమతులతో పాటు స్థానికంగా లభ్యమయ్యే ఉల్లిని కొనుగోలు చేసి పంపిణీ పాయింట్లు, రైతు బజార్ల ద్వారా ప్రజలకు సరసమైన ధరల్లో అందించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. ఈ విషయమై సోమవారం ఢిల్లీ నుంచి ఆయన వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాల వారీ ఉల్లి లభ్యత, ధరలు,
నిల్వలపై ఆరా తీశారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉల్లిపాయల సరఫరాను పెంపొందించేందుకు చేపట్టిన చర్యలు, ధరల నియంత్రణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వివరించారు. మహారాష్ట్ర నుంచే అధికంగా రాష్ట్రానికి ఉల్లి దిగుమతి అవుతోందని తెలిపారు. కొంత స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఉల్లిని ప్రజలు వినియోగిస్తున్నారని, కొరత కారణంగా ధరలు పెరిగాయన్నారు. రైతు బజార్ల ద్వారా సరసమైన ధరలకు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత సీజన్లో పండిస్తున్న ఉల్లి వచ్చే ఏడాది జనవరికి కానీ మార్కెట్లోకి రాదని అప్పటికి సమస్య తీరుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ లోగా కేంద్రం విదేశాల నుండి దిగుమతి చేసే సరకును రాష్ట్రానికి కొంత సరఫరా చేయాలని కోరారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు నిర్వహించే వ్యాపారులపై నిఘా తీవ్రతరం చేసి విజిలెన్స్ విభాగాన్ని అప్రమత్తం చేశామన్నారు. అవసరమైతే దాడులు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. సమావేశానికి రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి మధుసూదనరెడ్డి, కమిషనర్ ప్రద్యుమ్న తదితరులు హాజరయ్యారు.
*చిత్రం...వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎస్ నీలం సాహ్ని