అమరావతి, మే 24: బిజెపితో పొత్తుపై ఎవరూ మాట్లాడవద్దు.. కేశినేని నానిని పిలిచి హెచ్చరించండి అని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పి ఇరవై నాలుగు గంటలు కాకముందే, అధినేత ఆదేశాలను బేఖాతరు చేస్తూ విజయవాడ ఎంపి కేశినేని నాని మళ్లీ ధిక్కార స్వరం వినిపించారు. బిజెపితో పొత్తు లేకపోతే మరింత మెజారిటీ వచ్చేదన్న తన గత వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, బిజెపితో పొత్తు వల్లే తనకు గత ఎన్నికల్లో మెజారిటీ తగ్గిందన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. ‘నేను మాట్లాడినదాంట్లో తప్పేమీ లేదు. నా తలపగిలినా కొండను ఢీ కొనేందుకు సిద్ధం. నా కాన్ఫిడెన్స్ అలాంటిది. కార్యకర్తల్లో ప్రేరణ కోసమే అలా మాట్లాడా. అయినా నేను మాట్లాడింది పార్టీ సమావేశంలోనే కానీ బహిరంగసభలో కాదు కదా.. ఒకవేళ ఈ అంశంపై చంద్రబాబు వివరణ కోరితే ఆయనకే వివరణ ఇస్తా.. నాకు ఆయనే అధిష్ఠానం. పొత్తులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయాలన్నీ నాయకత్వం చూసుకుంటుంద’ని వ్యాఖ్యానించారు. కొండను ఢీ కొనేందుకు సిద్ధమన్న ఆయన వ్యాఖ్యలు బిజెపినుద్దేశించి చేసినవేనని స్పష్టమవుతోంది. బిజెపితో పొత్తు వల్లే తనకు మెజారిటీ తగ్గిందన్న నాని వ్యాఖ్యలపై మంగళవారం రాత్రి జరిగిన టెలీ కాన్ఫరెన్సులో ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు, నానిని పిలిచి హెచ్చరించాలంటూ పార్టీ కార్యక్రమాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ చౌదరిని ఆదేశించారు. మళ్లీ బుధవారం ఉదయం కూడా క్రమశిక్షణ అంశంపైనే నేతలతో టెలీ కాన్ఫరెన్సులో మాట్లాడిన బాబు, విజయవాడ ఎంపి ప్రస్తావించిన బిజెపితో పొత్తు అంశాన్ని గుర్తు చేశారు. ఇకపై ఎవరూ పొత్తులకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ ఎవరు మీడియాకెక్కినా నేరుగా సస్పెండ్ చేస్తానని కూడా స్పష్టం చేశారు. అయితే బాబు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కేశినేని కొన్ని గంటల తర్వాత ధిక్కార గళం వినిపించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది.
↧