భీమవరం, డిసెంబర్ 12: విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలో విష్ణు స్కూల్ ఈ నెల 13న ఎడుశాట్ శాటిలైట్ ఇంటరాక్టివ్ టెర్మినల్ ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి పర్యావరణ శాఖ మంత్రి బి గోపాలకృష్ణరెడ్డి, ఎపి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి ఇంజనీర్ వై నగేష్కుమార్, ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ పివి సుబ్బారావు, విజ్ఞాన్ ప్రసార్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ ఆర్ గోపిచంద్రన్, ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ ఇర్ఫాన బేగం, విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కెవి విష్ణురాజులు హాజరవుతారని శుక్రవారం భీమవరంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన తెలిపారు. ఈ ఎడుశాట్ పోర్టల్ ద్వారా విద్యార్థులకు శాస్ర్తియ, సాంకేతిక అంశాలపై తర్ఫీదు ఇస్తారు. రాష్ట్రంలో ఇది మూడవ సంస్థ కాగా, భారతదేశంలో ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న తొలి సంస్థ. ఎడుశాట్ ద్వారా పాఠశాల విద్యార్థులకు పరిశోధనాలపై ఆసక్తి పెంచడం, డిజిటల్ లైబ్రరీ, శాస్తవ్రేత్తల జీవిత చరిత్రలు తదితర అంశాల గురించి తెలుసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న నవీన ఆవిష్కరణల గురించి ఎడుశాట్ ద్వారా విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించవచ్చు.
గీత కార్మికులందరికీ పింఛన్లు ఇవ్వాలి
భీమవరం, డిసెంబర్ 12: రాష్ట్రంలో అర్హులైన కల్లుగీత కార్మికులందరికీ పింఛన్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి డిమాండ్ చేశారు. శుక్రవారం భీమవరంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిఒ 350 ప్రకారం ఖచ్చితంగా పింఛన్లు ఇచ్చి తీరాలన్నారు. ఎన్నో పోరాటాలు చేసి పింఛన్ల జీవో సాధించుకున్నామన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై కొందరు అధికారులకు అవగాహన లేకపోవడం వల్ల గీత కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవంగా వృత్తి చేసుకుని బతికే గీత కార్మికుడికి పింఛను ఇవ్వకపోవడం, కొన్నిచోట్ల రద్దుచేయడం చాలా అన్యాయమన్నారు. రాష్ట్రంలో 10వేల కొత్త మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలనలో రాష్ట్రంలో మద్యం ఏరులా పారుతోందన్నారు. గత ప్రభుత్వం కన్నా టిడిపి హయాంలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా పెరిగాయన్నారు. సమావేశంలో భీమవరం డివిజన్ నేతలు కడలి పాండు, జుత్తిగ వెంకటేశ్వరరావు, కడలి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
హుదూద్ బాధితులకు వృద్ధురాలు సాయం
ఏలూరు, డిసెంబర్ 12 : వృద్ధాప్యంలో కూడా సామాజిక బాధ్యతగా ఓ వృద్ధురాలు హుధూద్ తుఫాను బాధితులకు 20500 రూపాయలు ఆర్ధిక సహాయాన్ని అందించిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి) చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం హుధూద్ తుపాను బాధితుల సహాయార్ధం ఏలూరునకు చెందిన రిటైర్డు ఉద్యోగి స్వర్గీయ కె వెంకటేశ్వరరావు పేరు మీద ఆయన భార్య వెంకట లక్ష్మి దమయంతి ఎమ్మెల్యేకి 20500 రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేసింది. ఈ సందర్భంగా బుజ్జి మాట్లాడుతూ తుఫాను సంభవించి రెండు నెలలు అయినా కూడా పెద్ద మనస్సుతో స్పందించి విరాళం అందించడం అభినందనీయమన్నారు. సమాజంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే మనస్థత్వం కలగడం గొప్ప విషయమని, వృద్ధాప్యంలో కూడా మనకెందుకులే అనే భావనతో కాకుండా సాటివారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన దమయంతిని అభినందించారు. తుఫాను సమయంలో బాధితులను ప్రత్యక్షంగా ఆహార పదార్ధాలు అందించడమే కాకుండా 20 లక్షల రూపాయలకు పైగా విరాళాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించడానికి ఏలూరులోని దాతలు ముందుకు వచ్చి అందజేయడం జరిగిందని చెప్పారు. ఇందిర ప్రియదర్శిని సమాఖ్యకు చెందిన పీతల శైలజ, ఎ సుభద్ర, శివలింగ గంగాభవాని, పి లక్ష్మి, పట్లూరి వెంకటలక్ష్మి తదితరులు రెండు వేల రూపాయల విరాళాన్ని తుఫాను బాధితుల కోసం ఎమ్మెల్యేకు అందజేశారు.