న్యూఢిల్లీ, డిసెంబర్ 1: నిర్భయ కేసులో తమకు క్షమాబిక్ష ప్రసాదించాల్సిందిగా దోషి దాఖలు చేసిన పిటిషన్ను నిర్ధ్వంద్వంగా తిరస్కరించాలని ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ను కోరింది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నుంచి లెఫ్ట్నెంట్ గవర్నర్ అనిల్ బైజల్కు ఫైలు వెళ్ళింది. నిర్భయ కేసులో దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వద్ద క్షమాబిక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీలో 23 ఏళ్ళ పారామెడికల్ విద్యార్థినిపై 2012 సంవత్సరం డిసెంబర్ 16/17 (రాత్రి) నడుస్తున్న వాహనంలో ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, ఆ తర్వాత నడుస్తున్న వాహనంలో నుంచి రోడ్డుపై తోసేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయాలైన బాధితురాలు అదే నెలలో 29వ తేదీన మరణించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు ఢిల్లీ నుంచి సింగపూర్లోని వౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రికి తీసుకెళ్ళినా ఫలితం లేకపోయింది. అయితే ఈ ఘటనలో దోషుల్లో ఒకరైన శర్మ తనకు క్షమాబిక్ష ఇవ్వాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతిని ఆశ్రయించడాన్ని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది సమాజంలో అత్యతంత హీనమైన ఘటన అని, ఇందులో దోషులెవరినీ వదలరాదని, శర్మ క్షమాబిక్ష పిటిషన్ను తిరస్కరించాలని ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ను కోరింది. దోషి శర్మ తీహార్ జైలులో ఉన్నాడు. మరో దోషి ముఖేష్ దాఖలు చేసిన క్షమాబిక్ష పిటిషన్ను రాష్ట్రపతి తోసిపుచ్చినట్లు అధికారులు తెలిపారు. మరో నిందితుడు రామ్ సింగ్ జైలులోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
నిర్భయ కేసు.. క్షమాబిక్ష పిటిషన్ తిరస్కరించండి
బహుజనుల పార్టీని ఇంకా విస్తరించాలి

లక్నో, డిసెంబర్ 1: బహుజన్ సమాజ్ పార్టీని ఇంకా విస్తరించాలని ఆ పార్టీ అధినేత్రి మాయావతి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ ఆఫీసు బేరర్ల సమావేశంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ చీఫ్ మాయావతి ప్రసంగిస్తూ జార్ఞండ్, ఢిల్లీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనా పార్టీ దృష్టి సారించాల్సి ఉందన్నారు. పార్టీని అట్టడుగు స్థాయి నుంచి మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ భీంరావు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఘన నివాళి అర్పించాలని కోరారు. అంబేద్కర్ను గౌరవించుకోవాలన్న ఉద్దేశంతో లోగడ డాక్టర్ భీంరావు అంబేద్కర్ సామాజిక పరివర్తన్ స్థల్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహారాష్టల్రో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను ఆమె ప్రస్తావించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సాధించింది ఏమీ లేదని ఆమె విమర్శించారు. ఇది పూర్తిగా అనాలోచిత చర్య అని ఆమె విమర్శించారు. నిరుద్యోగ సమస్య నిర్మూలనకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆయన అన్నారు. జనవరి 15న మాయావతి జన్మదినోత్సవాన్ని ‘జనకళ్యాణకారి దివస్’గా జరుపుకోవాలని కార్యకర్తలకు పార్టీ సూచించింది.
*చిత్రం... బీఎస్పీ అధినేత్రి మాయావతి
ప్రైవేటు ఉద్యోగాలు 80 శాతం స్థానికులకే
ముంబయి, డిసెంబర్ 1: మహారాష్ట్ర వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వం నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించిందని, రాష్ట్రంలోని ప్రైవేటు ఉద్యోగాలలో స్థానికులకు 80 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తూ ఒక చట్టాన్ని తీసుకురానుందని రాష్ట్ర గవర్నర్ బీఎస్ కోశ్యారి తెలిపారు. కోశ్యారి ఆదివారం నాడిక్కడ విధాన్ భవన్లో జరిగిన శాసనసభ, శాసన మండలి సభ్యుల సంయుక్త సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. గవర్నర్ తన ప్రసంగంలో కొత్త రాష్ట్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో అనుసరించనున్న స్థూల అజెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వం సామాన్యులకు రూ. పదికే భోజన సౌకర్యం కల్పిస్తుందని, ప్రతి జిల్లాలో ఒక సూపర్-స్పెషాలిటి హాస్పిటల్ను ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. చట్టబద్ధంగా 80శాతం ఉద్యోగాలను స్థానిక యువతకు కేటాయించడం, రూ. పదికే భోజన సౌకర్యం కల్పించడం, సూపర్ స్పెషాలిటి ఆసుపత్రుల నిర్మాణం వంటివి కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ)లో ఉన్నాయి. అధికార శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ఈ సీఎంపీని రూపొందించింది. కొత్త ప్రభుత్వం త్వరలోనే రాష్ట్ర ఆర్థిక వాస్తవ పరిస్థితిని వెల్లడిస్తుందని గవర్నర్ తెలిపారు. రాష్ట్రంలో రూ. 1కే వైద్య పరీక్షలు నిర్వహించే క్లినిక్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. నవంబర్ నెలలో కురిసిన అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న రైతులను ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలోని 34 జిల్లాల్లో గల 349 తాలుకాల్లో రైతుల పంటలు దెబ్బతిన్నాయి. రైతుల పంటలకు తగిన ధరలు కల్పించడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
మాకు న్యాయం చేయరా?

భోపాల్, డిసెంబర్ 1: భోపాల్ విషవాయువు ఘటనలో వేలాది మంది మరణించి మూడున్నర దశాబ్దాలైనా బాధితులకు ఇంత వరకు సరైన న్యాయం జరగలేదన్న ఆక్రోషం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రపంచంలోనే అత్యంత భయానక పారిశ్రామిక దుర్ఘటనగా పేర్కొంటున్న భోపాల్ విష వాయువు ఉదంత బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఆదివారం మానవహారంగా ఏర్పడ్డారు. 1984 డిసెంబర్ రెండో తేదీ అర్థరాత్రి ఇక్కడి యూనియన్ కార్బైడ్ సంస్థ నుంచి విషవాయువు లీక్ కావడంతో వేలాది మంది మరణించగా, కొన్ని లక్షల మంది అత్యంత తీవ్రమైన అనారోగ్య సమస్యలకు లోనయ్యారు. ఆ విషవాయువుకు లోనుకావడం, దాని వ్యర్థాలను యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ భూమిలోనే డంప్ చేయడం వల్ల తమకు అనేక రకాలుగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఆందోళనకారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం యూనియన్ కార్బైడ్ నిర్వహిస్తున్న డౌవ్ కెమికల్స్ సంస్థ ‘కాలుష్య కారకులదే బాధ్యత’ అన్న నిబంధనల ప్రకారం తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధ్యతారాహిత్యంగా ఈ పురుగుల ఫ్యాక్టరీ విషపూరిత వ్యర్థాలను భూమిలోకి పాతివేయడం వల్ల భూగర్భ జలాలు దాదాపు నాలుగు కిలో మీటర్ల మేర కలుషతమైపోయాయని ఆందోళనకారులు తెలిపారు. 1990 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఇక్కడి భూగర్భ జలాలను ప్రభుత్వ ఏజెన్సీలు పరీక్షించాయని, ఈ జలాల్లో ప్రమాదకర రసాయనాలు, పురుగుల మందులు తీవ్రంగా ఉన్నట్లు తేలిందని సామాజిక కార్యకర్తలు రషీదాబీ, చంపాదేవి శుక్లాలు తెలిపారు. దాదాపు 30 మీటర్ల లోతుల్లో ఈ ప్రమాదకర వ్యర్థాలు పాతుకుపోయాయనని, ఫలితంగా కొన్ని కిలో మీటర్ల మేర పరిసరాల్లోని భూగర్బ జలాలు విషతుల్యం అయ్యాయని తెలిపారు. ఈ విషపూరిత జలాలను తాగడం వల్ల ఇక్కడి ప్రజలు చర్మవ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు తదితరాలకు లోనవుతున్నారని, వీరి జీర్ణ ప్రక్రియ కూడా దెబ్బతిన్నదని తెలిపారు. ఈ ప్రాంతం భూభాగాన్ని భూగర్భ జలాలను పూర్తిగా చేయాల్సిన బాధ్యత తప్పు చేసిన యూనియన్ కార్బైడ్దేనని ప్రస్తుతం ఈ సంస్థను చేపట్టిన డౌవ్ కెమికల్స్ పరిహారాన్ని చేపట్టాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో డౌవ్ కెమికల్స్పై కేంద్ర ప్రభుత్వం వత్తిడి తేవాలని పిల్లల రక్షకుల పరిరక్షకురాలు నౌషీన్ ఖాన్ డిమాండ్ చేశారు.
పోలీసుల పనితీరు భేష్

గుంటూరు, డిసెంబర్ 1: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటనలో కొందరు నిరసనకారులు చెప్పులు, రాళ్లు విసిరిన ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సౌత్ కోస్టల్ జోన్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ తెలిపారు. వారిపై కేసు నమోదు చేశామని, పోలీసులు అత్యంత సమర్థవంతంగా వ్యవహరించడం వల్ల ఆరోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పారు. గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఏర్పా టు చేసిన విలేఖరుల సమావేశంలో ఐజీ మాట్లాడుతూ గత నెల 28న మాజీ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా రూరల్ ఎస్పీ సీహెచ్ విజయారావు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పారు. 207 మంది
సిబ్బందితో బందోబస్తు విధులు నిర్వహించామన్నారు. కొందరు రైతులు వెంకటాయపాలెం గ్రామ సమీపాన సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై వారిని అడ్డుకున్నారన్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కొంత ఉద్రిక్తత ఏర్పడిందని, అయినప్పటికీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రెండు వర్గాలను దూరంగా చెదరగొట్టారన్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్పై బాపయ్య అనే రైతు చెప్పు, శృంగారపతి సందీప్ అనే వ్యక్తి చిన్నచిన్న రాళ్లు విసిరాడని, అంతేతప్ప ఎలాంటి దాడియత్నం జరగలేదన్నారు. వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీసు స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఈ ఘటనపై గుంటూరు లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ (క్రైం) దర్యాప్తు చేస్తున్నారని, వారం రోజుల్లో నివేదికను వెల్లడిస్తామని ఐజీ వినీత్ బ్రిజ్లాల్ వివరించారు. సమావేశంలో గుంటూరు రూరల్ ఎస్పీ సీహెచ్ విజయారావు, అదనపు ఎస్పీ (అడ్మిన్) కే చక్రవర్తి పాల్గొన్నారు.
*చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఐజీ వినీత్ బ్రిజ్లాల్, రూరల్ ఎస్పీ విజయారావు
విద్యుత్ రంగానికి కొత్త వెలుగులు!

విజయవాడ: విద్యుత్ రంగానికి కొత్త వెలుగులు సంతరింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇంధన రంగాన్ని పునాదుల నుంచి పటిష్టం చేయాలని భావిస్తోంది. గ్రామస్థాయి నుంచి వౌలిక వసతులు, సిబ్బంది నియామకం, నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన సేవలు అందించే దిశగా అడుగులు వేస్తోంది. చాలాకాలంగా అనేక పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యుత్ వ్యవస్థ ఇబ్బందులకు గురవుతోందన్న అభిప్రాయం నెలకొంది. సిబ్బంది కొరత వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఇబ్బందులు తలెత్తేవి. గ్రామ, మండల స్థాయిలో సేవలకు నైపుణ్యం లేని ప్రైవేట్ సిబ్బందిపై ఆధారపడుతున్నారనే అపవాదును మోయాల్సి వస్తోంది. తుపానులు, తదితర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు తగినంత మంది నిపుణులైన సిబ్బందిని సమకూర్చుకోవడం కత్తిమీద సాములా మారింది. కీలకమైన అసిస్టెంట్ ఇంజినీర్ల పోస్టులు కూడా ఖాళీగా ఉండటంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడుతోందన్న విమర్శలున్నాయి. దీనికితోడు అధికారుల కొరత, సబ్స్టేషన్లు, కొత్త లైన్ల పనులపై పర్యవేక్షణ లేక పురోగతి ఆశించిన మేర ఉండటం లేదు. ఈనేపథ్యంలో ప్రభుత్వం వివిధ నియామకాలను యుద్ధప్రాతిపదికన చేపడుతోంది. సమస్యలు అధిగమించటంపై ఇంధన శాఖ దృష్టి సారించింది. డిసెంబర్ 2న 170మంది అసిస్టెంట్ ఇంజనీర్ల (ఏఈల)కు నియామకాల పత్రాలు అందచేసేందుకు ఇంధన శాఖ ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 35మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను (ఏఈఈ), గ్రామ, మండల స్థాయిలో కీలకమైన ఎనర్జీ అసిస్టెంట్లనూ నియమించారు. 7966 మంది ఎనర్జీ అసిస్టెంట్ల పోస్టులు మంజూరు కాగా, 7990 మంది నియామకాలు పూర్తయ్యాయి. వీరిలో ఐటీఐ అభ్యర్థులకు కూడా ఉద్యోగ అవకాశం లభించింది. ఇది అరుదైన విషయమని అంటున్నారు. విద్యుత్ సబ్స్టేషన్లు, లైన్ల ఏర్పాటు పనులను సంస్థ వేగవంతం చేసింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న సబ్స్టేషన్ల సామర్థ్యం 10,965 ఎంవీఏలు. కర్నూలు జిల్లాలో మరో 1000 ఎంవీఏ సామర్థ్యం కలిగిన సబ్స్టేషన్ల నిర్మాణం టెండర్ల దశలో ఉంది. ఇప్పటికే ఏర్పాటైన సబ్స్టేషన్లను మెరుగుపరిచేందుకు ఇంధన శాఖ చర్యలు చేపట్టింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి ప్రత్యేకంగా విద్యుత్ పంపిణీ ఏర్పాట్లు చేయనుంది. అంతరాయం లేని విద్యుత్ సరఫరా, రైతులకు పగటి పూట 9గంటల విద్యుత్ అందించాలని అన్ని చర్యలు తీసుకుంటోంది. దీనిపై మంత్రి బాలినేని మాట్లాడుతూ
విద్యుత్ రంగం అంటే కొందరు పెట్టుబడిదారులకు సంబంధించిన అంశమనే భావన తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రజల్ని విద్యుత్ రంగంతో సమన్వయం చేసుకుని, భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలా వాతావరణం కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరునెలల్లో 8వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఇంధన శాఖదేనని తెలిపారు. విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్ది, రాష్ట్భ్రావృద్ధికి కీలకమైన ఇరుసుగా నిలిపేందుకు ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ఈసందర్భంగా ప్రజలు, ఉద్యోగుల సహకారాన్ని కోరుతున్నామని మంత్రి బాలినేని వివరించారు.
*చిత్రం...మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
మాజీ సీజే బాలకృష్ణన్కు ఈశ్వరీబాయి పురస్కారం

హైదరాబాద్, డిసెంబర్ 1: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాజీలేని పోరాటం చేసిన ధీర వనిత ఈశ్వరీ బాయి అని హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈశ్వరీబాయి జయంతిని పురస్కరించుకొని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్కు ఈశ్వరీ బాయి సార్మక అవార్డును గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రదానం చేశారు. రవీంద్రభారతిలో ఆదివారం సాయంత్రం ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా
దతాత్రేయ ప్రసంగిస్తూ బడుగు, బలహీన వర్గాల ప్రజల తరఫున జీవితాంతం ఈశ్వరీబాయి పోరాటం చేశారని కొనియాడారు. వర్తమాన రాజకీయాల్లో నైతిక విలువలు పతనం అవుతున్నాయని దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. ఈశ్వరీ బాయి తాను నమ్మిన సిద్ధాంతల కోసం అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఈశ్వరీబాయి రాజకీయ జీవితాన్ని ఈ తరం నాయకులు స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈశ్వరీబాయి జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. భావితరాలకు ఈశ్వరీబాయి జీవిత చరిత్రను తెలియజేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. హోం మంత్రి మహమూద్ అలీ, సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ కార్యక్రమంలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఈశ్వరీబాయి ప్రస్థానంపై సంక్షిప్త చిత్రాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వ సలహాదారుడు డా. కేవీ రమణాచారి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.
*చిత్రం...ఈశ్వరీబాయి స్మారక అవార్డును సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్కు ప్రదానం చేస్తున్న హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ
ఆమె ధీర వనిత

సికిందరాబాద్, డిసెంబర్ 1: స్వాతంత్య్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త జే.ఈశ్వరీబాయి జయంతిని పురస్కరించుకొని సికిందరాబాద్, ఈస్ట్ మారేడ్పల్లిలోని ఆమె విగ్రహానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి, ఈశ్వరీబాయి కుమార్తె గీతారెడ్డి పూలమాలలు వేసి
నివాళి అర్పించారు. ఈశ్వరీబాయి ధీర వనిత, ప్రజాగొంతుక, తెలంగాణ యాస, భాషలోనే మాట్లాడి అందరినీ మెప్పించిన గొప్ప మహిళ అని మంత్రి కొనియాడారు. 1969 తెలంగాణ ఉద్యమంలో శాంతియుత ఉద్యమం చేస్తున్న పిల్లలను రెచ్చగొట్టి బలిదానం తీసుకున్న విషయాన్ని అసెంబ్లీలో నిలదీసిన ధైర్యశాలి అని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమం, స్వాతంత్య్ర పోరాటంలో ఎన్నో విధాలుగా పోరాటాలు చేసిన ఈశ్వరీబాయి కడుపున పుట్టడం తన పూర్వ జన్మ సుకృతమని గీతారెడ్డి అన్నారు. ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్టు ద్వారా పేద విద్యార్థులకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. నేడు ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలను అందరూ వ్యతిరేకించాలని, ప్రతి మహిళ ఒక శక్తిగా ఎదగాలని అన్నారు.
*చిత్రం...ఈశ్వరీబాయి విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, గీతారెడ్డి
ప్రాణహితలో నాటు పడవ మునక

బెజ్జూరు, డిసెంబర్ 1: ప్రాణహిత నదిలో నాటు పడవ మునిగి ఇద్దరు గల్లంతైన సంఘటన కొమురంభీం జిల్లా చింతలమానెపెల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రవహిస్తున్న ప్రాణహిత నదిలో చింతలమానెపెల్లి మండలం గూడెం ప్రాణహిత నది పరీవాహక ప్రాంతంలో ఆదివారం నాటుపడవ మునిగి ఇద్దరు బీట్ అధికారులు గల్లంతయ్యారు. ఆదివారం ఉదయం పెట్రోలింగ్ కోసం ముగ్గురు బీట్ అధికారులు సద్దాం, సురేష్, బాలకృష్ణలతో పాటు పడవ నడిపే వ్యక్తి లింగయ్య, అర్జయ్య, కత్తరయ్య నాటు పడవలో వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో ప్రాణహితలో నీటి ప్రవాహం ఎక్కువై నాటు పడవలో చేరిపోవడంతో నాటు పడవ బోల్తాపడింది. బీట్ అధికారి సద్దాంతో పాటు లింగయ్య, అర్జయ్య, కత్తరయ్యలు సురక్షితంగా ప్రాణాలతో బయటపడగా, సురేష్, బాలకృష్ణ నాటు పడవ మునిగి గల్లంతయ్యారు. బాలకృష్ణ కాగజ్నగర్ మండలం చింతగూడ గ్రామానికి చెందిన వ్యక్తి కాగా, సురేష్ కెరమెరి మండలానికి చెందిన వ్యక్తి. ఇద్దరు బీట్ ఆఫీసర్లు గల్లంతు కావడంతో ప్రాణహిత నది గూడెం రేవుకు తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు చేరుకొని రెస్క్యూ టీమ్తో ప్రాణహిత నది పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. కాగజ్నగర్ డీఎస్పి బిఎల్ఎన్ స్వామి, పెంచికల్పేట ఎఫ్ ఆర్ఓ వేణుగోపాల్తో పాటు పోలీసులు గాలింపు నిర్వహిస్తున్నారు.
*చిత్రం...సంఘటనా స్థలాన్ని పరిశీస్తున్న పోలీసు, అటవీ అధికారులు
రేపటి నుంచి ఆర్టీసీ చార్జీలు పెంపు
హైదరాబాద్ : రాష్ట్రంలో సోమవారం నుంచి కాకుండా మంగళవారం నుంచి బస్సు చార్జీలు పెంచుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో కార్యక్రమం అధికారులు పాల్గొన్నందున చార్జీల పెంచే యోచన మంగళవారానికి వాయిదా వేశామన్నారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సు చార్జీలు పెరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటికీ సమయాభావంతో పెంపు భారం మొదలు మూడో తేదీకి వాయిదా పడింది. కిలోమీటరుకు 20 పైసలు పెంచుతున్నామని స్వయంగా సీఎం ప్రకటన చేసిన విషయం తెల్సిందే. కనీసం రూ. 10 రూపాయలు టికెట్ ఉండే విధంగా అమలు చేయబోతున్నారు. చార్జీలు పెంచాలన్న అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరగే బస్సుల్లో కనీసం రూ. 10 టికెట్ ఉండబోతోంది.
ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో టికెట్లు ఎంత పెంచుతారో మంగళవారం నుంచి అమలు చేస్తారని బస్ భవన్ వర్గాలు తెలిపాయి.
ఆర్టీసీ కార్మికులకు సీఎం వరాల జల్లు

ఉద్యోగం ఉంటుందా? ఊడుతుందా? తెలియక 55 రోజులుగా టెన్షన్ పడిన ఆర్టీసీ కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. అది ఎంతగా అంటే... వారే ఆశ్చర్యపోయే విధంగా వరాలు ఇవ్వడంతో కార్మికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయా? అన్నంతగా... ఆదివారం ప్రగతి భవన్లో ఆర్టీసీ కార్మికులతో సమావేశమై వారితో కలిసి భోజనం చేశారు. అడక్కుండానే ఏకంగా 26 వరాలను కురిపించేశారు. ఇకపై మహిళా కండక్టర్లు ఖాకీ డ్రస్సు వేసుకోనవసరం లేదన్న హామీతో కార్మికలోకం ఉబ్బితబ్బిబ్బయంది. ఏటా లక్ష రూపాయల బోనస్ వచ్చే విధంగా పనిచేసి సంస్థను లాభాల బాటలో నడిపించాలని పిలుపునిచ్చారు. మరో తీపి వార్త ఏమిటంటే.. వీరి 58 సంవత్సరాల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాలకు పొడిగించారు.
*చిత్రం...ఆదివారం ప్రగతి భవన్లో ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్ కరచాలనం
రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంపు

హైదరాబాద్, డిసెంబర్ 1: టీఎస్ఆర్టీసీ కార్మికులపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వరాల జల్లు కురిపించారు. సమ్మె సందర్భంగా కార్మికులు చేసిన డిమాండ్ల కంటే ఎక్కువగా.. అదీ ఉహించని విధంగా అనేక తీపి కబుర్లు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించడం, వారిని షరతులు లేకుండా విధుల్లో చేర్చుకున్న నేపథ్యంలో ప్రగతి భవన్లో ఆదివారం కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి సీఎం భోజనం చేశాక ముఖాముఖిగా రెండు గంటలపాటు చర్చించి అనేక సమస్యలను పరిష్కారించడంతో పాటు మధ్య మధ్యలో పిట్టకథలతో వారిని కడుపుబ్బ నవ్వించారు.
అలాగే, తాను సమ్మె సందర్భంగా మొండిగా వ్యవహరించిన విషయాన్ని కూడా సీఎం స్వయంగా ప్రస్తావించారు. సమ్మె సందర్భంగా చనిపోయిన కార్మికుల కుటుంబంలోని ఒకరికి వారం రోజుల్లో ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే, వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తామన్నారు. నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని, ప్రతి ఉద్యోగికీ ఏడాదికి లక్ష రూపాయల బోనస్ అందుకునే స్థితికి చేరుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ఆర్టీసీలో ఒక్కరిని కూడా ఉద్యోగంలోంచి తీసేయకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. అలాగే, ఏ ఒక్క రూటులో కూడా ప్రైవేట్కు అనుమతించబోమని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి బడ్జెట్లోనే ఆర్టీసీకి వెయ్యి కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు. సమ్మెకు ముందటి నెల సెప్టెంబర్ జీతాన్ని సోమవారమే చెల్లించనున్నట్టు ప్రకటించారు. సమ్మె కాలానికి చెందిన జీతాన్ని ఏకమొత్తంగా ఒకేసారి చెల్లిస్తామన్నారు. ఇక నుంచి ఆర్టీసీలో పదవీ విరమణ వయో పరిమితిని 58 నుంచి 60కి పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇక నుంచి కండక్టర్లు, డ్రైవర్లను కార్మికులుగా కాకుండా ఉద్యోగులుగా సంబోధించాలన్నారు. మహిళ ఉద్యోగులకు రాత్రి 8 గంటల వరకే డ్యూటీ కేటాయించడంతో పాటు యూనిఫామ్ కాకుండా వారు తమ ఇష్టమైన డ్రస్ వేసుకోవచ్చని అన్నారు. పురుష ఉద్యోగులకు కూడా ఖాకీ డ్రస్ వద్దంటే రంగు మార్చుస్తామని సీఎం హామీ ఇచ్చారు. రెండేళ్లపాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు ఉండవని ప్రకటించారు. డిపోకు ఇద్దరి చొప్పున కార్మికులు సభ్యులుగా ఉండేలా కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. కార్మికుల పీఎఫ్ బకాయిలు, సీసీఎస్ డబ్బులను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మొత్తంగా 26 వరాలను సీఎం ప్రకటిస్తూ ఇక నుంచి ఆర్టీసీకి తానే బ్రాండ్ అంబాసీడర్గా ఉంటానని అన్నారు. ఇలా ఉండగా సీఎం తన ప్రసంగం మధ్యలో ఓ పిట్టకథ చెప్పి నవ్వించారు. ప్రతి పనిలో కొందరు చెడగొట్టేవాళ్లు ఉంటారన్నారు. రామాయణ యుద్ధంలో రామబాణం వల్ల అర్దాయుష్షుతో మరణించిన రాక్షసులు కొందరు తమ పరిస్థితి ఏమిటనీ రాముణ్ణి అడిగితే, కలియుగంలో మీరు అక్కడక్కడా పుట్టండని అన్నారని చెప్పారు. అలా పుట్టిన వాళ్లే మనుషులను పీక్కుతింటున్నారని, వారే ఆర్టీసీలో అందరినీ ఇబ్బంది పెడుతున్నారని పరోక్షంగా యూనియన్లను విమర్శించారు. తాను రవాణా మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించి లాభాల బాటలోకి ఎలా తీసుకెళ్లింది సీఎం కేసీఆర్ సవివరంగా వివరించారు.
*చిత్రం...ఆర్టీసీ కార్మికులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటా మంతీ
ఘనంగా సామూహిక వివాహాలు

నాగర్కర్నూల్, డిసెంబర్ 1: ఎంజెఆర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి ఆదివారం నిర్వహించిన సామూహిక వివాహమహోత్సవంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావుతోపాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖుల సమక్షంలో 165 జంటలు ఏకమయ్యాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గాయకులు పాడిన పాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఐదు రోజుల పాటు నిర్వహించిన సామూహిక వివాహ మహోత్సవంలో ఐదోరోజు నిర్వహించిన సామూహిక వివాహాలకు రాష్ట్ర మంత్రి హరీష్రావు, ఎంపీలు పోతుగంటి రాములు, కొత్త ప్రభాకర్రెడ్డి, ప్రభుత్వ విప్లు కూచుకుళ్ల దామోదర్రెడ్డి, గువ్వల బాలరాజు, జడ్పీ చైర్పర్సన్లు పెద్దపల్లి పద్మావతి, స్వర్ణసుధాకర్రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు ఆలె వేంకటేశ్వర్రెడ్డి, అబ్రహం, జైపాల్యాదవ్, కృష్ణమోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, మాజి మంత్రి చిత్తరంజన్దాస్, మాజి ఎంపి మందా జగన్నాథ్తోపాటు జిల్లా సంయుక్త కలెక్టర్ పీ.శ్రీనివాస్రెడ్డితోపాటు తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి సామూహిక వివాహామహోత్సవం ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంజెఆర్ ట్రస్టు డైరక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, మర్రి వెంకట్రెడ్డి, మర్రి జమున తదితరులు నూతన వధూవరులకు కావలసిన వస్తువులను అందించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా ప్రభుత్వం చేపట్టిన కల్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన చెక్కులను జేసీ శ్రీనివాస్రెడ్డి, ఆర్టీవో హనుమానాయక్లతో కలిసి ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి నూతన వధూవరులకు అందచేశారు. సామూహిక వివాహమహోత్సవం ఘనంగా నిర్వహించిన ఎంజెఆర్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తదితరులను మంత్రితో సహా పలువురు అభినందించారు. నూతన వధూవరులతో కలిసి ఎమ్మెల్యే దంపతులు సహపంక్తి భోజనం చేశారు.
అనంతరం మర్రి జమున ఆధ్వర్యంలో నూతన వధూవరులకు వడిబియ్యం, అప్పగింతలతో పాటు రూ.1.50 లక్షల విలువచేసే కానుకలను అందచేశారు. అంతకుముందు తిరుమల నుంచి వచ్చిన కళ్యాణ చక్రవర్తితో పాటు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ్మాస్వామి దేవాస్థానం నుంచి ఆలయ ప్రత్యేకాధికారి గీత ఆధ్వర్యంలో వచ్చిన ఆగమనశాస్త్ర పండితులు శ్రీలక్ష్మీనరసింహ్మాస్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.
*చిత్రాలు.. లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తున్న యాదాద్రి నుంచి వచ్చిన వేదపండితులు
* సామూహిక వివాహామహోత్సవంలో వధూవరులు
మహిళలను గౌరవించడం అలవర్చుకోవాలి
చేర్యాల, డిసెంబర్ 1: మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని, రాష్ట్రంలో ప్రియాంకరెడ్డి ఘటన దురదృష్టకరమని హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం గొల్మకుర్మల ఆత్మీయ సన్మాన కార్యక్రమం సిద్దిపేట జిల్లా చేర్యాలలోని స్థానిక షాదిఖానాలో జరుగగా ఆయన పాల్గొని మాట్లాడారు. గొల్లకుర్మలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని అన్నారు. విద్యపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. గొల్లకుర్మలకు రుణాలు అందించే విషయంలో తనవంతు కృషి చేస్తానని అన్నారు. తనకు హిమాచల్ప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రం విషయంలో బాధ్యత ఉందని దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్లో ప్రియాంకరెడ్డి ఘటన సిగ్గుచేటని సభ్యసమాజం తలదించుకునే విషయమని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రముఖ శైవ క్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. గొల్లకుర్మలను ఎస్టీలో చేర్చాలని అన్నారు. అంతకు ముందు దత్తాత్రేయకు గొల్మకుర్మ, బీజేపీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి సన్మానించారు. నాయకులు తోకల ఉమారాణి, ఆందె బీరయ్య, అందె అశోక్తో పాటు బీజేపీ నాయకులు అంకుగారి శశిధర్రెడ్డి, సంజీవరెడ్డి, మనె్న సత్యవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ బస్సు బోల్తా..

అనంతపురం, డిసెంబర్ 1: బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న లిమో లైనర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అనంతపురం నగరంలోని తపోవనం వద్ద బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఒడిశా రాష్ట్రానికి చెందిన సుచిత్ర(26) అక్కడికక్కడే మృతి చెందగా మరో 9 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వివరాలు.. జాతీయ రహదారి-44పై తపోవనం వద్ద ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి దిగుతున్న సమయంలో డ్రైవర్ బస్సు వేగాన్ని నియంత్రించలేక పోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు మూడవ పట్టణ ఎస్ఐ నాగమధు తెలిపారు. తపోవనం కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఉండటంతో బస్సు నియంత్రణ కాకపోవడంతో ఎడమ వైపు ఉన్న రెయిలింగ్ను ఢీకొట్టి పల్టీలు కొడుతూ కుడివైపునకు తిరిగి పడిపోయింది. ఆ సమయంలో బస్సులో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఈ ఘటనతో భయకంపితులై హాహాకారాలు పెట్టారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
*చిత్రం...అనంతపురంలో జాతీయ రహదారి-44పై బోల్తా పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం
జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 1: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం రూరల్ మండలం పుట్లగట్లగూడెంలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఇంటర్మీడియట్ చదువుతున్న 16 ఏళ్ల బాలుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు బాలుడిపై పోక్సో యాక్ట్ కింద ఆదివారం రాత్రి లక్కవరం ఎస్ఐ పరిమి రమేష్ కేసు నమోదు చేశారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగినట్టు పోలీసులు తెలిపారు. బాలిక తల్లి ఇంటిలో లేని సమయంలో బాలిక ఒంటరిగా ఉండటంతో పక్కింటి బాలుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని, బాలిక తల్లి ఫిర్యాదు మేరకు బాలికపై అత్యాచార యత్నం చేసినట్టు పేర్కొన్నారు. బాలిక జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతుందని, బాలుడు జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడని తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని స్థానిక డీఎస్పీ ఎం స్నేహిత, సీఐ బిఎన్ నాయక్ పరిశీలించారు. బాలికను వైద్య పరీక్షలకై స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించగా, మహిళా వైద్యురాలు లేని కారణంగా ఏలూరు జనరల్ ఆసుపత్రికి పంపినట్టు పోలీసులు తెలిపారు. బాలికకు వైద్య పరీక్షల అనంతరం అత్యాచారం జరిగిందీ లేనిదీ నిర్థారించడం జరుగుతుందని, అప్పటి వరకు అత్యాచార యత్నంగా భావించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కేసులో నిందితుడు అయిన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఒకపక్క ప్రియాంకరెడ్డి సంఘటనతో రాష్ట్రంలో అలజడి రేగుతున్న తరుణంలో మండలంలో ఇటువంటి సంఘటన అటు ప్రజలను, ఇటు పోలీసు వర్గాలను ఉలికిపాటుకు గురి చేసింది. బాలుడిపై లక్కవరం పోలీస్ స్టేషన్లో 376ఎబి, 447ఐపిసి, 5(ఐ) (ఎం) రెడ్విత్ 6 పోక్సో యాక్ట్ 2012 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు లక్కవరం పోలీసులు తెలిపారు. డీఎస్పీ ఎం స్నేహిత కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జగన్ ఆరు నెలల పాలనలో మిశ్రమ ఫలితాలు
విజయవాడ, డిసెంబర్ 1: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 6నెలల పాలన మిశ్రమ ఫలితాలనిచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పేర్కొన్నారు. 6నెలల పాలన కొందరికి మోదం, మరికొందరికి ఖేదంగా గడిచిందన్నారు. నవరత్నాల అమలుకు పూర్తిగా కాకపోయినా కొంత మేరకు కృషి జరిగిందని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం పాటించారని, గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు అంటూ కొత్త ఉద్యోగాలు ఇచ్చారని, అయితే ఇప్పటికే ఉన్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో అభద్రతాభావం నెలకొందని ఆయన తెలిపారు. రాజధాని అమరావతిని శ్మశానంతో పోలుస్తూ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రజల మనస్సులను గాయపరిచాయని రామకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష పార్టీలను ఖాతరు చేయడంలేదని, సమష్టి నిర్ణయాలతో ప్రజారంజక పాలన సాగించడంలో విఫలమయ్యారని విమర్శించారు. 6నెలల పాలన ప్రజలకు మిశ్రమ ఫలితాలనే ఇచ్చింది తప్ప పెద్దగా ఒరిగిందేమీ లేదని రామకృష్ణ వివరించారు.
నేవీ బ్యాండ్ కచేరీని ఆస్వాదించిన గవర్నర్
విశాఖపట్నం, డిసెంబర్ 1: నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పు నౌకాదళం ప్రధాన కార్యాలయం సాముద్రిక ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం జరిగిన నేవీ బ్యాండు కచేరీని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆస్వాదించారు. దాదాపు గంట పాటు సాగిన బ్యాండ్ కచేరీలో పలు దేశభక్తి గీతాలు, మనోహరమైన మధుర గీతాలు నేవీ వాయిద్యకారులు హృద్యంగా స్వరపరిచారు. అనంతరం దేశ రక్షణలో నౌకాదళ పాత్రపై సౌండ్ అండ్ లైటింగ్ షో ద్వారా నౌకాదళ సిబ్బంది అద్భుతంగా ప్రదర్శించారు. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి జాతీయ భద్రత, సముద్ర రక్షణ తదితర అంశాల్లో రక్షణ రంగ పాత్రను కళ్లకు కట్టినట్టు చూపారు. వౌలిక సదుపాయాలు కల్పించడం, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడం, విపత్తుల సమయంలో మానవతా సహాయం తదితర అంశాలను సౌండ్ అండ్ లైటింగ్ ద్వారా ప్రదర్శించి గవర్నర్ ప్రశంసలు అందుకున్నారు. కార్యక్రమంలో తూర్పునౌకాదళం ప్రధానాధికారి అతుల్ కుమార్ జైన్ సహా పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రముఖులు హాజరయ్యారు.
అలాంటివారిని కాల్చి చంపేయాలి

రాజమహేంద్రవరం, డిసెంబర్ 1: శంషాబాద్ సంఘటన తరహాలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని అక్కడికక్కడే కాల్చి చంపేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీ. హనుమంతరావు అభిప్రాయపడ్డారు. నిర్భయ చట్టాలు, ఫాస్ట్ట్రాక్ కోర్టుల వల్ల ఇలాంటి అఘాయిత్యాలు ఆగవని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ పశువైద్యురాలు ప్రియాంకరెడ్డిపై హత్యాచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలను అమలు చేయాల్సి ఉందన్నారు. ఉపాధి కోల్పోయి, నిరాశ్రయులైన ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రయత్నించిన మాజీ ఎంపీ జివి హర్షకుమార్పై వైఎస్ జగన్ ప్రభుత్వం కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను జైల్లో పెట్టేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందన్నారు. ఈ విధానం మంచిది కాదని హితవు పలికారు. జగన్ రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నించాలే తప్ప అణగదొక్కేందుకు ప్రయత్నించడం తగదన్నారు. హర్షకుమార్పై వేధింపుల వ్యవహారం ముఖ్యమంత్రి జగన్కు తెలిసే జరుగుతోందా లేక అధికారులే తప్పు చేస్తున్నారా అని విహెచ్ అనుమానం వ్యక్తం చేశారు. హర్షకుమార్కు న్యాయం జరిగినపుడే ఆజ్ఞాతం వీడి బయటకు వస్తారని ఆయన తెలిపారు. బ్రాహ్మణ కుటుంబానికి అన్యాయం జరిగితే ఒక్క బ్రాహ్మణ నాయకుడు స్పందించకపోవడం శోచనీయమన్నారు. అమరావతిలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుపై చెప్పులు, రాళ్లతో దాడి చేయడం తగదని స్పష్టం చేశారు. ఎవరు దాడి చేసినా ఆ నింద ప్రభుత్వంలో ఉన్న జగన్, ఆయన పార్టీ నాయకులే భరించాల్సి ఉంటుందన్నారు.
*చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనుమంతరావు
హామీలు అమలుచేయని ప్రభుత్వం

రావులపాలెం, డిసెంబర్ 1: ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గత ఆరు నెలల కాలంలో ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను మోసగించిందని శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. రానున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని పథకాలను ప్రకటిస్తూ సీఎం జగన్ రెండవ వంచనకు సిద్ధపడుతున్నారని ఆయన ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ కెవి సత్యనారాయణరెడ్డి స్వగృహానికి వచ్చిన ఆయన ఆదివారం సాయంత్రం విలేఖర్లతో మాట్లాడారు. గతంలో ఇచ్చిన నవరత్న హామీలను అమలు చేయకుండా వాయిదాలు వేస్తూ కొత్తగా మరిన్ని పథకాలు ప్రకటిస్తున్నారే తప్ప..ఏ ఒక్కటీ అమలుకు నోచుకోవటం లేదన్నారు. గత ఆరు నెలల వైసీపీ పాలనలో 86 నుంచి 90 శాతం హామీలు అమలు చేశామని మంత్రులు ప్రకటనలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. ఏయే కార్యక్రమాలు చేశారో, ఎంతెంత నిధులు ఖర్చుపెట్టారో ప్రభుత్వం శే్వత పత్రం విడుదల చేయాలన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన రోజే నవ రత్నాలు అమలు చేయాలంటే రూ.60వేల కోట్లు కావాలని తాను చెప్పానన్నారు. ఆ లెక్కన చూస్తే ఈ పథకాల అమలుకు వచ్చే అయిదేళ్లల్లో రూ.3 లక్షల కోట్లు ప్రభుత్వం అప్పులుచేయాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే రూ.21వేల కోట్ల లోటు బడ్జెట్టు ఉందని, ఈ పరిస్థితుల్లో ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారో ప్రభుత్వం ప్రజలకు వివరించాలని యనమల డిమాండు చేశారు. ఏ ప్రభుత్వమైనా కొనసాగుతున్న సంక్షేమ పథకాలను నిలిపివేయకూడదన్నారు. గతంలో విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం అమలు చేసిన పథకాలను తర్వాత టీడీపీ కొనసాగించిందని, టీడీపీ పథకాలను వైఎస్సార్ ప్రభుత్వం కొనసాగించిందనే విషయాన్ని ఈ సందర్భంగా యనమల గుర్తుచేశారు. అయితే జగన్ ప్రభుత్వం నిధుల సమీకరణ కోసం తమ ప్రభుత్వం అమలుచేసిన పథకాలన్నింటినీ నిలిపివేస్తోందన్నారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని, అభివృద్ధి, సంక్షేమాలకు విలువలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలను అణచివేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వ పోకడలు సాగవని, ప్రజలే తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని యనమల స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తాను, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇటీవల బస్సులో రాజధాని అమరావతి సందర్శనకు వెళితే పోలీసుల సమక్షంలోనే చెప్పులు, రాళ్లతో దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జడ్ ఫ్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుకు రక్షణ కల్పించటంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. అమరావతి రాజధానిగా ఉంటుందని కేంద్ర మంత్రులు గడ్కరీ, కిషన్రెడ్డి తదితరులు స్పష్టం చేసినా ఈ వైసీపీ ప్రభుత్వం రాజధానిని మార్చేందుకు, కార్యాలయాలు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తమ హయాంలో శాసనసభ, శాసనమండలి, సచివాలయం, హైకోర్టు తదితర కార్యాలయాల నిర్మాణం పూర్తయినా ఈ ప్రభుత్వ వైఖరి అయోమయంగా ఉందన్నారు. ఇకనైనా వైసీపీ ప్రభుత్వం తీరుమార్చుకుని ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం జరగకుండా చూడాలని యనమల సూచించారు. సమావేశంలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు, ఆకుల రామకృష్ణ, ధరణాల రామకృష్ణ, బండారు సంజీవ్, డొక్కా నాధ్బాబు, దాసరి వెంకట ప్రసాద్, పెచ్చెట్టి చిన్నారావు, గుత్తుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న యనమల