December 1, 2019, 4:34 pm
హైదరాబాద్ (గచ్చిబౌలి), డిసెంబర్ 1: పీకలదాకా మద్యం తాగిన ఓ మాజీ ఎమ్మెల్యే తనయుడు పబ్లో హల్చల్ చేశాడు. శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ మాదాపూర్ నోవాటెల్ పబ్లో పటన్చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తనయుడు మద్యం తాగి అమ్మాయిలను చితక బాదినట్లు పోలీసులు చెప్పారు. మాదాపూర్ పోలీసుల కథనం మేరకు.. నోవాటెల్ హోటల్లోని పబ్కు మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఆశిష్ గౌడ్ తన స్నేహితులతో కలసి అర్ధరాత్రి వచ్చాడు. ఆశిష్కు సమీపంలో కొందరు యువతులు డాన్స్లు చేస్తూ కేకలు వేయడంతో దూరంగా వెళ్లి నృత్యం చేసుకోవాలని చెప్పాడు. ఎంత చెప్పినా వినకుండా డాన్స్లు వేయడంతో బౌన్సర్లపై ఆశిష్ ఆగ్రహం వ్యక్తం చేశారని పోలీసులు చెబుతున్నారు. కానీ, బాధిత మహిళలు మాత్రం తమపై దాడి చేసినట్లు చెబుతున్నారు. తమపై దాడి చేసినట్లు సినీ పరిశ్రమకు చెందిన నటి సంజన ఫిర్యాదు చేసినట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు. సంజన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
*నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ (ఫైల్ఫొటో)
↧
December 1, 2019, 4:34 pm
గౌహతి, డిసెంబర్ 1: గౌహతి విశ్వవిద్యాలయం సుమారు 74వేల మంది విద్యార్థుల భవిష్యత్ కెరీర్ను ప్రమాదంలోకి నెట్టిందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తన నివేదికలో పేర్కొంది. గౌహతి యూనివర్శిటి తన డిస్టెన్స్ లర్నింగ్ సెంటర్ ద్వారా ఏడేళ్ల పాటు 21 ఆమోదం పొందని కోర్సులను అందించడం ద్వారా 74వేల మంది విద్యార్థుల నుంచి ప్రవేశ రుసుము కింద రూ. 39 కోట్లు వసూలు చేసిందని కాగ్ తన నివేదికలో వివరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న అస్సాం శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టారు. ఈశాన్య రాష్ట్రాలలో అత్యంత పురాతనమయిన విశ్వవిద్యాలయమయిన గౌహతి యూనివర్శిటి యూజీసీకి పలు తప్పుడు అఫిడవిట్లు సమర్పించిందని కూడా కాగ్ నివేదిక బయటపెట్టింది. ఆమోదం పొందకుండా ఎలాంటి కొత్త కోర్సును తాను ప్రవేశపెట్టబోనని గౌహతి యూనివర్శిటీ యూజీసీకి హామీ ఇచ్చింది. గౌహతి యూనివర్శిటీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ ఓపెన్ లెర్నింగ్ (ఐడీఓఎల్)ను ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటి (ఇగ్నో) 2010 ఆగస్టులో గుర్తింపు ఇచ్చింది. అయితే, 2010-11 విద్యాసంవత్సరం నుంచి మూడేళ్ల పాటు కేవలం ఎనిమిది కోర్సులు నిర్వహించడానికి మాత్రమే గుర్తింపు లభించింది. ఇవి మినహా మరే కోర్సును ప్రవేశపెట్టకూడదని కాగ్ తన నివేదికలో తెలిపింది. తరువాత యూజీసీ ఈ గుర్తింపును 2017-18 వరకు పొడిగించింది.
↧
↧
December 1, 2019, 4:39 pm
గణపురం, డిసెంబర్ 1: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని జర్మన్ శ్రీ సాయి ప్రాణయోగ నిర్వాహకుడు చెల్లేటి సాయిరెడ్డి అన్నారు. ఆదివారం 40 మంది జర్మనీకి చెందిన యోగా బృందం గణపేశ్వరాలయం కోటగుళ్లను సందర్శించారు. గత నెలరోజులుగా శ్రీ సాయి ప్రాణయోగ బృందం జిల్లాలో పర్యటిస్తున్నారు. మొదట ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయం, రేగొండ మండలంలోని పాండవుల గుట్టలను సందర్శించిన జర్మన్లు ఆదివారం చివరి రోజు కోటగుళ్లలో యోగా శిక్షణ నిర్వహించారు. మొదట చొల్లేటి సాయిరెడ్డి బృందం ఆలయాన్ని సందర్శించగా అర్చకుడు నరేష్ వారిని సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదట యోగా బృందం గణపతి పూజ, గాయత్రి మంత్రాన్ని పటించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో రెండు గంటల పాటు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం యోగా బృందం నిర్వాహకులు సాయి చొల్లేటి ఆలయ విశిష్టతలను జర్మన్లకు వివరించారు. ఆలయ నిర్మాణం, రాతికట్టడాలు, శిల్ప సంపద తదితర అంశాలను వారికి జర్మనీ భాషలో అర్ధమయ్యేలా తెలియజేశారు. అనంతరం జర్మన్ బృందం సభ్యులు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, భగవద్గీత అంటే తమకెంతో గౌరవం ఉందన్నారు. కేవలం రాతి కట్టడాలు భారతదేశంలో మాత్రమే కనిపిస్తాయని, అవి కాకతీయులు నిర్మించిన అద్భుత కళాఖండాలన్నారు. ఇక్కడ ప్రతి శిల్పంలోనూ దైవత్వం ఉందన్నారు. ఇక్కడి మహిళల కట్టు, బొట్టు వారి సంస్కృతి, ఇక్కడి ప్రకృతి ఎంతో అద్భుతమన్నారు. శ్రీసాయి ప్రాణ యోగ బృందాలు ప్రతియేడు కోటగుళ్లకు రావడం ఆనవాయితీగా వస్తుందని, గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ యోగా నేర్చుకోవడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ఆలయంలో అద్భుత శక్తులున్నాయని, ఇక్కడ యోగా చేసినంత సేపు కొత్త అనుభూతిని పొందుతున్నామన్నారు.
కాకతీయుల శిల్ప సంపదను భావితరాలకు అందించాలని వారు ఈ సందర్భంగా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు నరేష్తో పాటు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో యోగా బృందాన్ని శాలువలతో ఘనంగా సన్మానించారు. యోగా అనంతరం జర్మనీ బృందం సభ్యులు ఆలయ శిల్ప సంపదను తమ కెమెరాల్లో బంధించారు. సుమారు మూడు గంటల పాటు జర్మన్ దేశస్తులు కోటగుళ్లలో సందడి చేశారు.
*చిత్రం...ఆలయ ప్రాంగణంలో భజనలు చేస్తున్న జర్మన్ దేశస్తుల బృందం
↧
December 1, 2019, 5:10 pm
తిరుపతి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం పంచమీతీర్థం మహోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బంగారు ఆభరణాన్ని శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా సమర్పించారు. ముఖ్యమంత్రి తరపున టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ ఆభరణాన్ని ఆలయ అధికారులకు ఆదివారం అందించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రూ. 7 లక్షల విలువైన 113 గ్రాముల బరువున్న అన్కట్ డైమెండ్ నెక్లెస్ను అమ్మవారికి సమర్పించినట్లు తెలిపారు. తుడా అధ్యక్షులు, ప్రభుత్వ విప్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం గరుడ సేవకు బదులు ధ్వజారోహణం నాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించే విధానానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడైన జగన్మోహన్రెడ్డి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీతీర్థం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి ఏడాది పట్టువస్త్రాలు సమర్పించే సాంప్రదాయాన్ని ప్రారంభించారని అన్నారు.
*చిత్రం...తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన పంచమీతీర్థం కార్యక్రమానికి హాజరైన భక్తజన సందోహం
↧
December 1, 2019, 5:12 pm
విజయవాడ, డిసెంబర్ 1: రాష్ట్రంలోని వివిధ వర్సిటీల వీసీ పోస్టు కోసం దరఖాస్తు చేసే ప్రొఫెసర్లు ప్రాసెసింగ్ ఫీజుగా వెయ్యి రూపాయలు చెల్లించాల్సిందేనని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. అయితే ఇది వింత నిర్ణయమని ప్రొఫెసర్ల విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ఏడు వర్సిటీలకు వీసీలుగా నియమించేందుకు సెర్చి కమిటీలు ఏర్పాటు చేశారు. వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ, ఎన్టీఆర్ వర్సిటీ ఆఫ్ హెల్త్ సైనె్సస్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఆంధ్రా వర్సిటీ, ద్రవిడియన్ వర్సిటీ, కృష్ణా వర్సిటీ, ఆదికవి నన్నయ వర్సిటీ, నాగార్జున వర్సిటీ, శ్రీ వెంకటేశ్వర వర్సిటీలకు వీసీలను నియమించేందుకు సెర్చి కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈవిషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తన వెబ్సైట్లో కూడా పొందుపరిచింది. అర్హులైన ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అయితే దరఖాస్తు చేసే ఫ్రొఫెసరు ప్రాసెసింగ్ ఫీజు కింద 1000 రూపాయలు చెల్లించాలన్న నిబంధన విధించింది. తొలిసారిగా ఈ నిబంధన విధించడం గమనార్హం. ఈ మొత్తాన్ని చెల్లించకపోతే దరఖాస్తులను పరిశీలించబోమని కూడా స్పష్టం చేసింది. అన్ని వర్సిటీలకు కలిపి ఒక దరఖాస్తు కాకుండా విడివిడిగా దరఖాస్తు చేయాలి. ప్రతి దరఖాస్తుకు ఫీజు కింద 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. బర్త్ సర్ట్ఫికెట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్గా నియామక ఉత్తర్వులు, సర్వీస్, తదితర సర్ట్ఫికెట్లపై ఆయా వర్సిటీల రిజిస్ట్రార్లు సంతకాలు చేయాలన్న షరతు కూడా విధించింది. ఉన్నత విద్యా మండలి తీరుపై కొందరు ప్రొఫెసర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫీజు వసూలు చేయడం తమ విలువను తగ్గించడమేనంటూ వ్యాఖ్యానిస్తున్నారు. వివిధ వర్సిటీల్లో ప్రొఫెసర్లుగా పనిచేసిన తాము పోటీ పరీక్షలకు వెళ్తున్నట్లుగా ఉందని విమర్శిస్తున్నారు. ఈ తరహా ఫీజు వసూలు సరికాదని అంటున్నారు. అయితే ఉన్నత విద్యా మండలి వర్గాలు మాత్రం దీన్ని సమర్థిస్తున్నాయి. అంత సీరియస్గా ప్రయత్నించని వారి సంఖ్యను తగ్గించేందుకు ఈ ఫీజు నిర్ణయించినట్లు చెబుతున్నాయి. ప్రతి వీసీ పోస్టుకు దాదాపు 150 దరఖాస్తులు వస్తున్నాయంటూ వివరిస్తున్నారు.
↧
↧
December 1, 2019, 5:12 pm
విజయవాడ, డిసెంబర్ 1: రాష్ట్రంలో విద్య, ఆరోగ్య రంగాల్లో గణనీయమైన మార్పులను త్వరితగతిన తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన నాడు-నేడు పథకం అమలుకు ప్రోగ్రామ్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఏర్పాటు చేసింది. విద్య, ఆరోగ్య రంగాల్లో వౌలిక వసతుల ఆధునీకరణ, సేవల మెరుగుదల, తదితర అభివృద్ధి చర్యలను నిర్ణీత సమయంలో చేపట్టేందుకు ఈ పథకాన్ని చేపట్టింది. దీనికి భారీగా పెట్టుబడులు వచ్చేలా చేయడం ద్వారా స్పష్టమైన మార్పు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ కొనుగోళ్లు, కాంట్రాక్టులు, నిర్మాణాలు, తదితర అంశాల్లో పారదర్శకత పెంపొందించేందుకు, సమయపాలనకు వీలుగా ఈ పీఎంయూ ఏర్పాటయింది. రిటైర్డ్ ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ ఎఫ్సీఎస్ పీటర్ పీఎంయూకు సారథ్యం వహిస్తారు. ఆయనకు అవసరమైన మానవ వనరులను ఆ రెండు శాఖల నుంచి అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు.
↧
December 1, 2019, 5:13 pm
విజయవాడ, డిసెంబర్ 1: రికార్డు స్థాయిలో 151 సీట్లతో తమను అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజల రుణం తీర్చుకోటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం పరితపిస్తున్నారని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. జగన్ ఆరు మాసాల పాలనపై ఆయన స్పందిస్తూ నిరుద్యోగ యువతకు నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చారని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 52వేల మంది కార్మికులకు భరోసా కల్పించారని, ఏటా ఉద్యోగ నియామకాలు ఉంటాయంటూ నిరుద్యోగుల్లో ధైర్యం నింపారని ప్రస్తుతించారు.
↧
December 1, 2019, 5:14 pm
విజయవాడ, డిసెంబర్ 1: డిసెంబర్ నెల అనగానే ఇక పండుగ రోజులు వచ్చినట్లే ప్రజలు భావిస్తుంటారు. క్రిస్మస్తో వేడుకలు ఆరంభమై కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగతో కొనసాగుతుంటాయి. దీంతో కొనుగోలుదారులతో వాణిజ్య, వ్యాపార సంస్థలు కిటకిటలాడుతుంటాయి. ఇదిలావుంటే ఈసారి డిసెంబర్లో 8 రోజుల పాటు బ్యాంకులన్నీ మూతబడబోతున్నాయి. దీనివల్ల బ్యాంక్ ఖాతాదారులు నగదు వ్యవహారాల్లో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించడం తప్పనిసరి. ఈ నెలలో ఐదు ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు ఎటూ సెలవులే. వీటికి అదనంగా 25న క్రిస్మస్ బ్యాంకులకు సెలవు. అంటే ఈ నెలలో బ్యాంకులు పనిచేసేది కేవలం 23రోజులు మాత్రమే. అయితే నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉన్నవారికి వెసులుబాటు ఉంటుందని ఖాతాదారులు అంటున్నారు.
↧
December 1, 2019, 5:14 pm
రాజమహేంద్రవరం, డిసెంబర్ 1: కొత్త ప్రభుత్వం కొత్త ఇసుక విధానంలో వినియోగదారులకు ఇసుక ధర సరళంగా ఉంటుందని ఆశిస్తే అందుకు భిన్నంగా కొత్త విధానంలో పాత ధరే నయం అన్నట్టుగా తయారైంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పక్కదారి పట్టడం వల్లే ధర పెరిగిపోయిందని తెలుస్తోంది. ధర పెరిగిన దామాషాలో ఆదాయం కూడా ప్రభుత్వానికి దక్కుతుందనుకుంటే ఒకింత సరిపెట్టుకోవచ్చని, కానీ అక్రమ విధానంలో పెరిగిన ఆదాయం కాస్తా పక్కదారి పడుతోందని తెలుస్తోంది. ట్రాన్స్పోర్టు మాయాజాలంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కాస్తా పక్కదారి పడుతోందని తెలుస్తోంది. ఓపెన్ ర్యాంపులుగా ఉన్న కాటవరం, వంగలపూడి రీచ్ల నుంచి భారీస్థాయిలో ఇసుక రవాణా జరుగుతోంది. ఈ రెండు రీచ్ల నుంచి నిత్యం లక్షలాది టన్నుల ఇసుక విశాఖకు రవాణా జరుగుతోంది. ఇసుకను స్టాక్ పాయింట్కు టెండర్లు లేకుండా లేకుండానే జీవోలో నిర్దేశించిన రేట్లకు నామినేషన్ పద్ధతిపై ఈ ర్యాంపుల నుంచి విశాఖకు ట్రాన్స్పోర్టు నడుస్తున్నట్టు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన కొంతమందికి ఈ ట్రాన్స్పోర్టు అప్పగించినట్టు తెలుస్తోంది. రావులపాలెంకు చెందిన వారు సబ్ లీజుకు తీసుకున్నట్టు తెలిసింది. రావులపాలెంకు చెందిన వారు మరో ఆరుగురికి సబ్లీజు ఇచ్చినట్టు తెలియవచ్చింది. ఇలా ఈ ర్యాంపుల నుంచి విశాఖ తరలించే ఇసుక ట్రాన్స్పోర్టు మూడు చేతులు మీదుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఒక టన్ను ఇసుకకు ఒక కిలో మీటర్కు జీవోలో రూ.4.99లు ట్రాన్స్పోర్టు ఛార్జి చొప్పున ఇచ్చారు. ఈమేరకు ఉదాహరణకు విశాఖకు ఈ ర్యాంపుల నుంచి 220 కిలోమీటర్ల దూరానికి 30 టన్నుల లారీ కిరాయి సుమారు రూ.33 వేలు అవుతోంది. ఈ ప్రాంతానికి వచ్చి విశాఖకు రిటన్ వెళ్ళే లారీకి కిరాయి సుమారు రూ.12,500 తీసుకుంటారు. అన్లోడ్ చార్జి రూ.1000 ఉంటుంది. ఈమేరకు రిటన్ లారీకైతే సుమారు రూ.13,500 అవుతుంది. ఈ ఛార్జీకి రవాణా చేస్తామని ముందుకొస్తున్నా వారిని కాదని రూ.33వేలు చెల్లిస్తున్నట్టుగా ఉంది. ఈమేరకు ట్రాన్స్పోర్టు రూపేణా సుమారు రూ.19,500 సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్తుందోనని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
↧
↧
December 1, 2019, 5:15 pm
గుంటూరు, డిసెంబర్ 1: ప్రపంచంలోనే అగ్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ కోట్లాది మంది హిందువుల మనోభావాలకు స్ఫూర్తిగా నిలిచే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను భంగపరిచేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనందసూర్య విమర్శించారు. ఆగమ శాస్త్రం విలువలను మంటగలిపేలా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
తిరుమల బస్ టిక్కెట్లపై అన్యమత ప్రచారం మొదలు టీటీడీ వెబ్సైట్లో ఏసుక్రీస్తు బోధనల పుస్తకాలు అప్లోడ్ చేయడం, టీటీడీలో అన్యమతస్తులు విధులు నిర్వర్తించడం, అమరావతిలో శ్రీహరి ఆలయ నిర్మాణానికి నిధులు తగ్గించటం, పవిత్ర తిరుమల ఆలయంపై మంత్రుల పరుష పదజాలం వంటి సంఘటనలతో శ్రీవారి భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారని ఆయన ఆదివారం ఇక్కడో ప్రకటనలో నిరసన తెలిపారు. తాజాగా టీటీడీ అధికారిక వెబ్సైట్లోని పంచాంగ సమాచారంలో శ్రీ యేసయ్య అనే అక్షరాలు వెంకన్న భక్తులను తీవ్రంగా కలచివేశాయన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం, అన్యమత దైవాన్ని కానీ కలలో కూడా ఊహించుకోలేని భక్తులకు ఇది తీవ్ర మనస్తాపం కలిగిస్తోందన్నారు. పదేపదే తెలుగుదేశం పార్టీపై లేని ఆరోపణలు గుప్పించే మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, వైసీపీ నాయకుడు మల్లాది విష్ణు దీనికి ఏమి సమాధానమిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఓ,మీ వ్యవహార శైలి మార్చుకుని తిరుమలలో అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవాలని ఆనందసూర్య డిమాండ్ చేశారు.
↧
December 1, 2019, 5:15 pm
కాకినాడ, డిసెంబర్ 1: తూర్పుగోదావరి జిల్లాలో శనివారం రాత్రి వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు అదృశ్యం కావడం కలకలం రేపింది. అర్ధరాత్రి సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు తెల్లవారుజామున వారి ఆచూకీ కనిపెట్టారు. వివరాల్లోకి వెళితే కాకినాడ నగరానికి చెందిన ఒక బాలిక ఇంటర్ ప్రధమ సంవత్సరం చదువుతోంది. శనివారం సాయంత్రం కళాశాల నుండి రావాల్సిన ఆమె రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వచ్చింది. దీంతో మానసిక వత్తిడికి గురైన తల్లి బాలికను తీవ్రస్థాయిలో మందలించింది. ఈ ఘటనతో ఇంటి నుండి బయటకు వచ్చిన బాలిక కొద్దిసేపటికి అదృశ్యమయ్యింది. ఆందోళనకు గురైన తల్లి చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది. లారీ డ్రైవర్ అయిన భర్త ఇంకా ఇంటికి రావడంతో ఏమి చేయాలో పాలుపోని ఆమె హైదరాబాద్లో పెద్దకుమార్తెకు సమాచారం అందించింది. ఆమె ఫోన్లో జిల్లా ఎస్పీ అద్నాన్ నరుూం అస్మీకి ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఎస్పీ కాకినాడ డీఎస్పీ కరణం కుమార్ను అప్రమత్తం చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో కాకినాడ మూడో పట్టణ ఇన్స్పెక్టర్ సిహెచ్ శ్రీరామకోటేశ్వరరావు, రెండో పట్టణ ఇన్స్పెక్టర్ ఈశ్వరుడు పోలీసు బృందాలతో అర్ధరాత్రి గాలింపు మొదలుపెట్టారు. బాలిక స్నేహితుల వివరాలు సేకరించి ఒక్కొక్కరు ఇంటికి వెళ్లి సోదా చేశారు. ఈలోగా సీసీ టీవీ పుటేజీ సైతం సేకరించారు. ఒకొక్కరి నుండి వీలైనంత సమాచారాన్ని సేకరిస్తూ అర్ధరాత్రి దాదాపుగా కాకినాడ నగరాన్ని జల్లెడపట్టారు. చివరకు బాలికతో పదో తరగతి చదువుకుని ప్రస్తుతం డిప్లమో చేస్తున్న బాలుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు మరో స్నేహితుడి ఇంటి తలుపు తట్టారు. ఆ ఇంట్లో సురక్షితంగా నిద్రిస్తున్న బాలికను గుర్తించారు. ఏమి జరిగిందని వాకబు చేస్తే తల్లి మందలించాకా ఇంటి నుండి బయటకు వచ్చిన బాలిక నడుచుకుంటూ తన స్నేహితుడి ఇంటికి వెళ్లి తలుపు తట్టింది. తలుపు తీసిన స్నేహితుడి తండ్రి విషయమేమిటని ఆరా తీశాడు. ఇంటికి తీసుకెళ్లి అప్పగిస్తానని చెప్పాడు. అయితే తల్లికి భయపడిన బాలిక నిరాకరించడంతో ఉదయానే్న తీసుకువెళ్తానని చెప్పి తన ఇంట్లోనే ఇద్దరు కుమార్తెలతో కలసి పడుకోమని సూచించాడు. దాంతో ఆమె అక్కడే నిద్రించింది. హైదరాబాద్లో అర్ధరాత్రి మానవ మృగాల భారీన పడిన ప్రియాంకారెడ్డి విషాద ఘటన నేపధ్యంలో బాలిక అదృశ్యం ఘటన పోలీసులకు వెన్నులో చలి పుట్టించింది. అర్ధరాత్రి చలిని లెక్క చేయకుండా జరిపిన సెర్చ్ ఆపరేషన్ ఫలించి బాలిక సురక్షితంగా లభించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అర్ధరాత్రి వచ్చిన బాలికను సురక్షితంగా ఇంట్లోనే ఉంచిన రిక్షా కార్మికుడైన స్నేహితుడు తండ్రిని డీఎస్పీ కరణం కుమార్, ఇన్స్పెక్టర్ శ్రీరామకోటేశ్వరరావు అభినందించారు. బాలికకు, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.
మరో ఘటనలో మండపేట మండలం పెనికేరు గ్రామానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక శనివారం కళాశాలకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. రాత్రి పది గంటల వరకూ వేచి చూసిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో అన్ని పోలీసు స్టేషన్ల సిబ్బంది అప్రమత్తమయ్యారు. సీసీ టీవీ పుటేజీలు, కాల్ ట్రేసింగ్ ఆధారంగా బాలిక గుంటూరు బస్టాండులో డార్మిటరీలో ఉన్నట్టు గుర్తించారు. ఎస్పీ నరుూం ఆస్మీ గుంటూరు జిల్లా పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు డార్మిటరీలో ఉన్న బాలికను, ఆమె స్నేహితుడిని పట్టుకున్నారు. వారిని కాకినాడ తీసుకురావడానికి ప్రత్యేక పోలీసు బృందం గుంటూరు బయలుదేరి వెళ్లింది. కాగా సకాలంలో స్పందించి ఇరువురు బాలికలను సురక్షితంగా రక్షించిన జిల్లా పోలీసులను ఎస్పీ నరుూం అస్మీ అభినందించారు.
↧
December 1, 2019, 5:16 pm
గుంటూరు (అరండల్పేట), డిసెంబర్ 1: గుంటూరు నగర శివారు అడ్డాగా విదేశాల నుంచి మత్తు పదార్థాలు దిగుమతి చేసుకుని నగరంలోని యువత, కళాశాల విద్యార్థులకు సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నల్లపాడు స్టేషన్ పరిధిలోని అపార్ట్మెంట్లు కేంద్రంగా టాంజానియా, సిరియా, యెమెన్ దేశాల నుంచి డ్రగ్స్ను తెప్పించి ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్న ఇద్దరు విదేశీయులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 600 గ్రాముల మత్తు పదార్థాలు, 2కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఆదివారం ఇక్కడ వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. సౌత్ యెమెన్ దేశానికి చెందిన మహమ్మద్ షాద్ అహ్మద్ తాడేపల్లిలోని యూనివర్శిటీలో బీబీఏ చదువుతున్నాడు. అక్కడే విద్యనభ్యసిస్తున్న సూడాన్కు చెందిన మిన్ని, టాంజానియాకు చెందిన యోనా అనే ఇద్దరు విదేశీయులతో కలిసి వారి దేశాల నుంచి మాదకద్రవ్యాలు తెప్పిస్తూ విక్రయిస్తున్నారు. వీరు ముగ్గురూ గుంటూరు నగరానికి చెందిన షరీఫ్, సూరి, సూర్య, అవినాష్ అనే వ్యక్తులతో కలిసి నల్లపాడులోని ఓ అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకున్నారు. అక్కడి నుంచి ఆన్లైన్ ద్వారా మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నారు. నల్లపాడు పోలీసులు తనిఖీల్లో భాగంగా అపార్ట్మెంట్లను పరిశీలిస్తున్న సమయంలో అనుమానించి విచారించగా, అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు బయటపడింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. మత్తు పదార్థాలను నగరంలోని యువకులు, కళాశాలల విద్యార్థులకు సరఫరా చేస్తున్నట్లు వారు అంగీకరించారు. వారి వద్ద నుంచి విదేశీ డ్రగ్స్తో పాటు 2కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రామకృష్ణ తెలిపారు. వీసా గడువు ముగిసినా వెళ్లకుండా దేశంలో అక్రమంగా నివాసం ఉంటుండటంతో వీసా యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాల్ని నాశనం చేసుకోవద్దని, పిల్లల కదలికలపై తల్లిదండ్రులు కనే్నసి ఉంచాలని ఈసందర్భంగా ఆయన సూచించారు.
ఇద్దరు విదేశీయులతో పాటు గుంటూరు నగరానికి చెందిన నలుగురు యువకులను అరెస్టు చేసిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విలేఖరుల సమావేశంలో అదనపు ఎస్పీలు కమలాకర్, సౌత్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, నల్లపాడు సీఐ వీరాస్వామి, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
↧
December 1, 2019, 5:17 pm
విజయవాడ, డిసెంబర్ 1: సమాజ భాగస్వామ్యంతో ఎయిడ్స్పై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్యవిద్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంస్థ ఆదివారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈసందర్భంగా కాళీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో ఎయిడ్స్ అంటే ఒక ప్రాణాంతక వ్యాధి అని, ఈ వ్యాధి సోకినవారికి చికిత్స లేదనే భయంతో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునేవారన్నారు. ఇప్పుడు వ్యాధి సోకినవారు కూడా ఎక్కువ కాలం జీవించేలా ఎన్నో మందులు వచ్చాయన్నారు. అయితే వ్యాధి నివారణే లక్ష్యంగా సమాజం ముందుకు సాగాలని ఆయన పిలుపిచ్చారు. ఎయిడ్స్ బాధితులకు 104, 108 అంబులెన్స్లు, జిల్లా ఆసుపత్రుల నుండి పీహెచ్సీల వరకు డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. మందులకు లోటు లేకుండా చూస్తూ పౌష్టికాహారం కూడా అందిస్తున్నామన్నారు. 60ఏళ్లు పైబడిన 34వేల మంది ఎయిడ్స్ బాధితులకు ప్రస్తుతం రూ. 2250 పింఛన్ ఇస్తున్నామని, ఇంకా మిగిలి ఉన్న 74వేల మందికి కూడా పింఛన్ సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి వెల్లడించారు. దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యాధిగ్రస్తులు ఆత్మస్థైర్యంతో ఎయిడ్స్ను ఎదుర్కోవాలని, వారు కోలుకునేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిని దక్షిణ భారతదేశంలో 1986లో, హైదరాబాద్లో 1987లో గుర్తించారని, అప్పటి నుంచి నిర్మూలన చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అందిస్తున్నామన్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం మాట్లాడుతూ 16-24 ఏళ్ల మధ్య వయస్కులు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ నివారణ, అవగాహనకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ఐఈసీ కరపత్రాలు, పోస్టర్లు ఆవిష్కరించారు. ఎయిడ్స్పై అవగాహన కల్పించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో ఏపీ శాక్స్ పీడీ డా. అరుణకుమారి, ఏపీడీ వసంతకుమారి, జేడీ రాజేంద్రప్రసాద్, డీడీ రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
↧
↧
December 1, 2019, 11:44 pm
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యోదంతంపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ ఘటనలో నిందితులను బహిరంగంగా ఉరితీయాలని ఎస్పీ ఎంపీ జయాబచ్చన్ అన్నారు. నిర్భయ ఘటనపై ఇంత వరకు న్యాయం జరగలేదని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ చర్చను ప్రారంభిస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్ మాట్లాడుతూ చట్టాలతో ఈ సమస్య పరిష్కారం కాదని, సమాజంలో మూలాలను తొలగించాలని కోరారు. అన్నాడీఎంకే ఎంపీ విజిల సత్యానంద్ మాట్లాడుతూ సభలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దిశను హత్య చేసిన నలుగురు నిందితులకు వెంటనే శిక్షలు పడేలా చూడాలని ఎంపీ సుబ్బిరామి రెడ్డి కోరారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ హైదరాబాద్లోనే కాదు దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదని అన్నారు. చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా ఈ ఘటనపై జంతర్ మంతర్ వద్ద ప్రజా, మహిళ, విద్యార్థి సంఘాలు ధర్నా చేశాయి. జస్టిస్ ఫర్ దిశ అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
↧
December 1, 2019, 11:44 pm
న్యూఢిల్లీ: సీఎంగా మళ్లీ నేనే వస్తానని, అందుకు కొంత సమయం వేచి చూడాల్సిన అవసరం ఉందని మాజీ సీఎం ఫడ్నవీస్ అన్నారు. ఆయన మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తరువాత మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అతి పెద్ద పార్టీగా అవతరించినా.. రాజకీయ అంక గణితంలో ఓడిపోయామని అన్నారు. 40 శాతం మార్కులు సాధించినవారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. నా హయాంలో కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించా.. వాటిని నేనే పూర్తి చేస్తానని అన్నారు. కాగా ఫడ్నవీస్ మళ్లీ వస్తానని చేసిన ప్రకటనపై అధికార పక్ష సభ్యులు ఎద్దేవా చేశారు.
↧
December 1, 2019, 11:45 pm
జైపూర్: రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. క్రీడా పోటీలకు వెళ్లిన ఆరేళ్ల చిన్నారిపై దుండగులు అత్యాచారం చేసి ఆపై బెల్ట్తో గొంతు కోసి చంపేశారు. ఈ దారుణ ఘటన ఖేతడి గ్రామ సమీపంలో జరిగింది. శనివారం పాఠశాలలో క్రీడా పోటీలకు వెళ్లిన చిన్నారి ఎంతకు తిరిగి రాకపోవటంతో తల్లిదండ్రులు గాలించారు. పాఠశాలకు 500 కిలోమీటర్ల దూరంలో చిన్నారి రక్తపు మడుగులో పడివుంది. ఈ ఘటనపై ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు స్థానిక ఎస్పీ ఆదర్శ్ సిద్దూ తెలిపారు.
↧
December 1, 2019, 11:46 pm
న్యూఢిల్లీ: హైదరాబాద్లో జరిగిన దిశ హత్యోదంతంపై లోకసభలో చర్చ జరిగింది. నిందితులను కఠినంగా శిక్షించాల్సిందేనని ముక్తకంఠంతో కోరారు. ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ..్ఫస్ట్ట్రాక్ ఏర్పాటుచేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రజలను చైతన్యపరచటంలో నిర్లక్ష్యం వహిస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయని అన్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ చట్టంలో మార్పులు తీసుకువస్తే తప్ప ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయలేమని అన్నారు. వైకాపా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఈ ఘటనను అందరూ ఖండించాలని, మహిళలు బయటకు వెళితే క్షేమంగా తిరిగివస్తారనే నమ్మకం లేదని అన్నారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ దిశ హత్యాచార ఘటనను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.
↧
↧
December 2, 2019, 12:40 am
చెన్నై: తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఆరు జిల్లాల్లో ఇప్పటికే రెడ్ అలెర్ట్ ప్రకటించారు. కొయంబత్తూర్లో కురుస్తున్న భారీ వర్షాలకు నాలుగు ఇళ్లు కూలి 15మంది మృత్యువాత పడ్డారు. నధూర్ ప్రాంతంలో ఉన్నట్టుండి నాలుగు ఇళ్లు కూలి అందులో నివాసం ఉంటున్న 15 మంది చనిపోయారు. కాగా భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. చెన్నై నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. నగర శివారులో వంద ఇళ్లు నీట మునిగాయి. నాగపట్నం, తుత్తకూడి, కడలూరి జిల్లాల్లో వందకు పైగా ఇళ్లు నీట మునిగాయి. వరదల నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. తిరువల్లూర్, వెల్లూర్, తిరువన్నమలై, తూత్తుకూడి, రామనాథపురం, తిరునెల్వేలి జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురుస్తుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.
↧
December 2, 2019, 12:41 am
న్యూఢిల్లీ: సభలో సభ్యులు సహకరిస్తే, ఏకాభిప్రాయంతో దిశ వంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు తీసుకురావచ్చని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆయన లోకసభలో మాట్లాడుతూ హైదరాబాద్లో జరిగిన దిశ ఘటన అందరి హృదయాలను కలిచివేస్తుందని, దేశాన్ని తలదించుకునేలా చేసిన ఈ కేసులోని నిందితులకు కఠిన శిక్షలు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నిర్భయ ఘటన తరువాత కూడా దేశంలో దురాగతాలు ఆగడం లేదని, సభలో ఏకాభిప్రాయంతో కఠినమైన చట్టాలను తీసుకువస్తామని అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలను రూపొందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు.
↧
December 2, 2019, 12:42 am
గుంటూరు: ప్రభుత్వం అందించే మంచి పాలనను కొందరు జీర్ణించుకోలేక పోతున్నారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన గుంటూరు జీజీహెచ్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా శస్త్ర చికిత్సల లబ్ధిదారులకు రోజుకు రూ.225ల చొప్పున నెలకు రూ.5వేల సాయం అందుతుందని, బ్యాంక్లో జమ చేస్తారని తెలిపారు. రోగి డిశ్చార్జి అయిన తరువాత 48 గంటల్లోనే రోగి ఖాతాకు సాయం జమ చేస్తారని అన్నారు. జనవరి 1 నుంచి అర్హులందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వం అందించే పాలనను కొందరు జీర్ణించుకోలేక పోతున్నారని, తన మతం, కులం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
↧