
రోజూ రెండు వేల అడుగులు వేశారంటే భవిష్యత్తులో మీ గుండె చాలా ఆరోగ్యంగా, భద్రంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
వయసు పెరిగేకొద్దీ ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువవుతుంటాయి. ఇలాంటివాటిలో ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యలు కొందరిలో మరింత ఎక్కువగా ఉంటాయి. గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే యుక్త వయసులో నుండే రోజుకు రెండువేల అడుగుల దూరం నడిస్తే చాలని పరిశోధకులు చెబుతున్నారు. నడక ఆరోగ్యానికి మంచిదని ఎప్పటినుండో నిపుణులు చెబుతున్నారు. కానీ ఎంత దూరం నడవాలి అనే విషయాన్ని పక్కపెడితే రోజుకు రెండువేల అడుగుల దూరంపాటు నడిస్తే మంచిదని తాజాగా వైద్యులు చెబుతున్నారు. యూకెకు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో యుక్తవయసు నుండి ఇలా రెండు వేల అడుగుల చొప్పున నడవడం మొదలుపెడితే భవిష్యత్తులో మన గుండె చాలా భద్రంగా ఉంటుందని తేలింది. రోజుకు రెండువేల అడుగులు నడవడం అంటే 20 నిముషాలపాటు వ్యాయామం చేయడంతో సమానం.
రోజుకు కనీసం ఈ మాత్రం వ్యాయామం చేయడం వల్ల హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని ఎనిమిది శాతం వరకూ తగ్గించుకోవచ్చట. మీకు ఇంకా ఓపిక వుంటే గనుక రోజుకు కనీసం 40 నిముషాలపాటు నడవడంవల్లమీ గుండెకు సంబంధించిన సమస్యలు 20 శాతం వరకు తగ్గుతాయని యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు.