విశాఖపట్నం, మార్చి 8: గుడివాడ గురునాథరావు కుమారుడు, మాజీ కార్పొరేటర్ గుడివాడ అమర్ ఈనెల 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయనకు అనకాపల్లి లోక్సభ టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉంది. పార్టీలో చేరే రోజునే టిక్కెట్ను ఖరారు చేస్తారని తెలుస్తోంది. గుడివాడ అమర్ తాత గుడివాడ అప్పన్న 1978లో పెందుర్తి నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత అమర్ తండ్రి గుడివాడ గురునాథరావు 1989లో పెందుర్తి నుంచి శాసనసభ్యునిగా గెలుపొందారు. 1991లో మంత్రిగా కూడా పనిచేశారు. 1998లో గురునాథరావు అనకాపల్లి లోక్సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. గురునాథరావు మరణం తరువాత ఆయన భార్య గుడివాడ నాగమణి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2004 ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుంచి నాగమణి పోటీ చేశారు. అప్పట్లో స్థానిక టిడిపి నాయకులు ఆమెకు సహకరించకపోవడం వలన పరాజయం పాలయ్యారు. 2009 ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గాన్ని ఆమె కోరుకున్నారు. చిట్టచివరి నిముషంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారు. అప్పుడు కూడా పార్టీ నాయకులు సహకరించకపోవడంతో ఆమె ఓడిపోయారు. గత కొంతకాలంగా నాగమణికి లేదా ఆమె కుమారుడు అమర్కు గాజువాక ఇన్చార్జ్ పదవి ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. కానీ చంద్రబాబు అందుకు అంగీకరించలేదు. ఇదిలా ఉండగా పార్టీలోకి కొత్తగా వచ్చిన వారే, ఇప్పుడు చక్రం తిప్పుతున్నారని, పార్టీ అధికారంలో లేనప్పుడు జెండాలు మోసిన తమలాంటి వారిని అధిష్ఠానం పట్టించుకోవడం లేదని అమర్ తీవ్రంగా విమర్శించారు. బెదిరించే వారితోనే చంద్రబాబు మాట్లాడుతున్నారని, తమ వేదనను ఆయన వినిపించుకోలేదని అమర్ ఆవేదన వ్యక్తం చేశారు. తమలాంటి వారే పార్టీలో చాలా మంది ఉన్నారని, బయటకు మాట్లాడలేక ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీలో ఇమడలేక, తను, తన తల్లితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నామని అన్నారు. 12న పార్టీలో చేరే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
* 12న వైకాపాలో చేరిక * ఆరోజే అధికారికంగా ప్రకటించే అవకాశం
english title:
amar
Date:
Sunday, March 9, 2014