విజయవాడ, మార్చి 10: విజయవాడ మాజీ ఎంపి లగడపాటి వ్యవహార శైలిపై కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తపరుస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే రాజకీయ సన్యాసం ప్రకటించిన లగడపాటి నగరపాలక సంస్థ, పురపాలక సంఘాలకు అభ్యర్థుల ఎంపిక వ్యవహారంలో తలదూర్చుతున్నారని తీవ్ర నిరసన గళం వినిపిస్తున్నారు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ జెండా మోసిన సామాన్య కార్యకర్త కూడా జిల్లాలో ప్రస్తుత ఎన్నికల్లో కౌన్సిలర్, కార్పొరేటర్ సీట్లు ఆశిస్తున్నారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం విషయానికొస్తే వీరంతా గతంలో 1998 పార్లమెంట్ ఎన్నికలప్పటి నుంచి పర్వతనేని ఉపేంద్ర గెలుపు కోసం 2004 వరకు అంటే మూడు ఎన్నికల్లో తీవ్రంగా శ్రమించినవారే. ఈ మూడు ఎన్నికల్లో ఉపేంద్ర ఒక్కసారే ఓటమి పాలయ్యారు. 2004 ఎన్నికల్లో కృష్ణా జిల్లాతో ఏమాత్రం సంబంధం లేని పారిశ్రామికవేత్త, ఉపేంద్ర అల్లుడు లగడపాటి రాజగోపాల్ను ఇక్కడి కార్యకర్తలు చేరదీసి తొలిసారి గెలిపించారు. రెండోసారి 2009 ఎన్నికల్లోనూ మరోమారు ఆయనను లోక్సభకు పంపించారు. 2004లో తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తన విజయం కోసం ఎన్నికల్లో శ్రమించిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు ఎంపి లగడపాటి నామినేటెడ్ పదవులు కూడా ఇప్పించుకోలేకపోయారు. ఈమేరకు వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొని వుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన పరిణామాల్లో లగడపాటి చివరికి రాజకీయ సన్యాసం ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆయన నిర్ణయాలకు మద్దతు ప్రకటించటం గానీ, రాజకీయ సన్యాసం తరువాత ఆయన వెనుక వెళ్లిన కార్యకర్త కానీ ఇక్కడెవరూ లేకుండాపోయారు.
తాగాజా మున్సిపల్, జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలు తెరపైకి వచ్చాయి. ఇప్పటివరకు తమను ఏ ఒక్క నాయకుడూ గుర్తించి ఏ చిన్న పదవీ ఇప్పించలేదని, ఇపుడు తమ డబ్బు ఖర్చుపెట్టుకుని కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో పోటీ చేసి ఓ చిన్న పదవి అయినా పొందాలని కాంగ్రెస్ వాదులంతా భావిస్తున్నారు. అయితే లగడపాటి ఇందులోనూ తలదూర్చి విజయవాడ నగరపాలక సంస్థ, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు మున్సిపాల్టీల్లో ప్రతి కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఇండిపెండెంట్లను ఎన్నికల బరిలోకి దించుతున్నారు. ఇసి ద్వారా గాలిపటం ఎన్నికల గుర్తుగా తీసుకొస్తామని, వీరికి కిరణ్కుమార్ రెడ్డి పార్టీ మద్దతు తెలుపుతుందంటూ ప్రచారం సాగిస్తున్నారు. వీరందరికీ ఎన్నికల ఖర్చు కూడా తామే భరిస్తామంటూ భరోసా ఇస్తున్నారు. కాంగ్రెస్ కోసం శ్రమిస్తూ గత రెండు దశాబ్దాల కాలంగా మామ, అల్లుళ్ల విజయం కోసం పనిచేసిన తమకే ఈ ఎన్నికల్లో పోటీ పెడతారా అని కార్యకర్తలు నిప్పులు చెరుగుతున్నారు. సన్యాసం చేసికనీసం స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉంటే బాగుంటుందని సూచిస్తున్నారు. ఇప్పటికే తమకు నయాపైసా ఇచ్చేవారు కన్పించడం లేదని, తమ పార్టీవారినే చేరదీసి డబ్బు ఆశచూపి పోటీకి నిలపటం ఏమిటని కార్యకర్తలు మండిపపడుతున్నారు.
లగడపాటి తీరుపై కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం
english title:
r
Date:
Tuesday, March 11, 2014